టీ20 ప్రపంచకప్కు ముందు స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను పాకిస్తాన్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ మ్యాచ్లో పాక్ 111 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 3-0 తేడాతో ఆసీస్ను వైట్వాష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో 207 పరుగులు (6 వికెట్ల నష్టానికి) చేసిన పాక్.. అనంతరం ఆసీస్ను 16.5 ఓవర్లలో 96 పరుగులకే కుప్పకూల్చి తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.
రాణించిన బాబర్, సైమ్
పాక్ ఇన్నింగ్స్లో సైమ్ అయూబ్ (56), బాబర్ ఆజమ్ (50 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. ఆఖర్లో షాదాబ్ ఖాన్ (19 బంతుల్లో 46; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా పాక్ ఆటగాళ్లలో ఫకర్ జమాన్ 10, కెప్టెన్ సల్మాన్ అఘా 5, ఖ్వాజా నఫే 21, మొహమ్మద్ నవాజ్ 5, ఫహీం అష్రాఫ్ 10 (నాటౌట్) పరుగులు చేశారు. ఆసీస్ బౌలర్లలో డ్వార్షుయిస్ 2, గ్రీన్, కన్నోలీ, షార్ట్, కుహ్నేమన్ తలో వికెట్ తీశారు.
తిప్పేసిన నవాజ్
అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆసీస్ చేతులెత్తేసింది. మొహమ్మద్ నవాజ్ (4-0-18-5) అద్భుత ప్రదర్శనతో ఆసీస్ను చావుదెబ్బ కొట్టాడు. ఆసీస్ ఇన్నింగ్స్లో గ్రీన్ (22), స్టోయినిస్ (23), జోష్ ఫిలిప్ (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మార్ష్ (1), షార్ట్ (2), రెన్షా (1), ఓవెన్ (8), కన్నోలీ (0), కుహ్నేమన్ (5) దారుణంగా విఫలమయ్యారు.
ఆడమ్ జంపా బ్యాటింగ్కు దిగలేదు. పాక్ ఈ సిరీస్లోని తొలి రెండు మ్యాచ్ల్లో కూడా భారీ విజయాలు సాధించింది. ఈ సిరీస్కు ఆసీస్ ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. ప్రపంచకప్ దృష్ట్యా సీనియర్లకు విశ్రాంతినిచ్చింది.


