సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఢిల్లీలోని బుద్ధ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో ‘రయ్... రయ్’ మోత మోగింది. రేస్ ప్రియుల ఫేవరెట్ ‘ఫార్ములావన్ గ్రాండ్ప్రి’ జరిగింది. 2011లో మొదలైన ఈ ఎఫ్1 రేసు మూడేళ్ల పాటు జరిగింది. 2013 రేసు అనంతరం మనకు ఈ ‘ఫార్ములా’ దూరమైంది! కారణాలు ఏవైనా మళ్లీ ప్రతిష్టాత్మక ఫార్ములావన్ ఆతిథ్య భాగ్యం భారత్కు దక్కలేదు. ఇప్పుడు పుష్కరకాలం తర్వాత ‘రయ్ రయ్’ మోత మోగించాలని కేంద్ర క్రీడాశాఖ చొరవ చూపిస్తోంది.
గ్రేటర్ నోయిడాలోని బుద్ధ సర్క్యూట్ను ఇటీవలే క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ సందర్శించారు. అంతేకాదు, సంబంధిత వర్గాలతోనూ చర్చించినట్లు క్రీడాశాఖ అధికారి ఒకరు వెల్లడించారు. బుద్ధ సర్క్యూట్ యజమాని జేపీ గ్రూప్. ఈ కార్పొరేట్ సంస్థ దివాళా తీసింది. ఇప్పుడు సర్క్యూట్ బాధ్యతల్ని ‘యమునా ఎక్స్ప్రెస్వే ఇండ్రస్టియల్ డెవలప్మెంట్ అథారిటీ’ చూస్తోంది.
ఈ అథారిటీ వర్గాలతోనే క్రీడల మంత్రి భేటీ అయినట్లు తెలిసింది. అప్పుల్లో కూరుకుపోయిన జేపీ గ్రూప్ నుంచి బుద్ధ సర్క్యూట్ను అదానీ గ్రూప్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తోంది. ప్రాథమిక దశలో చర్చలు జరిగినట్లు తెలిసింది. ఈ యాజమాన్య బదిలీ ప్రక్రియ పూర్తయితే తిరిగి భారత్లో ‘ఫార్ములావన్’ రేసుకు చేపట్టాల్సిన కార్యాచరణ మొత్తం చకచకా జరిగిపోతుందని భావిస్తున్నారు.
అయితే యాజమాన్య బదిలీ జరగకపోయినా... కనీసం రెండు, మూడేళ్లు ఈ ట్రాక్ బాధ్యతల్ని క్రీడా సమాఖ్యకు అప్పగించాలని మంత్రి మాండవీయ సంబంధిత వర్గాలను కోరినట్లు తెలిసింది. పన్ను, అధికారిక సమస్యల్ని పరిష్కరించి సాధ్యమైనంత తొందరగా ఫార్ములావన్ను తిరిగి భారత్ ట్రాక్లో నిర్వహించే ప్రణాళికతో క్రీడాశాఖ ఉంది. భారత మోటార్స్పోర్ట్స్ సమాఖ్య (ఎఫ్ఎంఎస్సీఐ) మాజీ అధ్యక్షుడు విక్కీ చందోక్ తాజా ప్రభుత్వ చర్యలపై హర్షం వ్యక్తం చేశారు. తిరిగి ఎఫ్1 భారత్కు తిరిగొస్తే అంతకుమించిన ఆనందం మరొటి ఉండదని అన్నారు. ఆయన కృషివల్లే 2011లో ఫార్ములావన్ జరిగింది.


