సుజీత్కు స్వర్ణ పతకం
టిరానా (అల్బేనియా): ముహమెత్ మాలో స్మారక వరల్డ్ ర్యాంకింగ్ సిరీస్ రెజ్లింగ్ టోర్నమెంట్లో భారత రెజ్లర్ సుజీత్ కల్కాల్ పసిడి పతకం సాధించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగంలో సుజీత్ విజేతగా నిలిచాడు. ఫైనల్లో సుజీత్ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో అజర్బైజాన్ రెజ్లర్ రషీద్ బాబాజాదెను చిత్తుగా ఓడించాడు. బౌట్ మొదలైన 77 సెకన్లకే సుజీత్ 10–0తో ఆధిక్యంలోకి వెళ్లి బంగారు పతకాన్ని ఖాయం చేసుకున్నాడు.
నిబంధనల ప్రకారం ప్రత్యర్థి పై 10 అంతకన్నా పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే రిఫరీ బౌట్ను నిలిపివేసి ఆ రెజ్లర్ను ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలో విజేతగా ప్రకటిస్తారు. ఫైనల్ చేరే క్రమంలో సుజీత్ మూడు బౌట్లలోనూ ‘టెక్నికల్ సుపీరియారిటీ’ పద్ధతిలోనే గెలుపొందడం విశేషం. సెమీఫైనల్లో సుజీత్ 11–0తో (5 నిమిషాల 17 సెకన్లు) జోసెఫ్ క్రిస్టోఫర్ (అమెరికా)పై, క్వార్టర్ ఫైనల్లో 10–0తో (4 నిమిషాల 6 సెకన్లు) నికా జకాష్విలి (జార్జియా)పై, తొలి రౌండ్లో 16–4తో (3 నిమిషాల 33 సెకన్లు) ఎండ్రియో అవిదిలి (అల్బేనియా)పై విజయం సాధించాడు.
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) ర్యాంకింగ్ సిరీస్ టోర్నీల్లో సుజీత్కిది నాలుగో స్వర్ణం కావడం విశేషం. 2022లో జుహైర్ ఎస్గెయిర్ టోర్నీలో, 2025లో పొల్యాక్ ఇమ్రె–వర్గా యోనస్ స్మారక టోర్నీలో, 2026 జాగ్రెబ్ ఓపెన్ టోర్నీలో సుజీత్ పసిడి పతకాలు గెలిచాడు.


