చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచ రికార్డు | T20 WC IND vs ZIM: India Creates History Becomes 1st Team In World To | Sakshi
Sakshi News home page

టీమిండియా ప్రపంచ రికార్డు.. సరికొత్త చరిత్ర

Feb 26 2026 9:44 PM | Updated on Feb 26 2026 9:48 PM

T20 WC IND vs ZIM: India Creates History Becomes 1st Team In World To

టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని విధంగా.. స్ట్రైక్‌రేటు పరంగా అత్యంత అరుదైన ఘనత సాధించింది. జింబాబ్వేతో గురువారం నాటి సూపర్‌-8 మ్యాచ్‌ సందర్భంగా సూర్యకుమార్‌ సేన ఈ ఫీట్‌ నమోదు చేసింది.

మెరుపులు
చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో టాస్‌ ఓడిన టీమిండియా.. జింబాబ్వే ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఓపెనర్‌గా తిరిగి వచ్చిన సంజూ శాంసన్‌ (Sanju Samson) 15 బంతుల్లో 24 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్‌రేటు 160. ఇక మరో ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ ఎట్టకేలకు ఫామ్‌లోకి వచ్చి.. 183కు పైగా స్ట్రైక్‌రేటుతో 55 పరుగులు సాధించాడు.

వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌ 24 బంతుల్లో 38 పరుగులు చేయగా.. స్ట్రైక్‌రేటు 158.33గా నమోదైంది. మరోవైపు.. ధనాధన్‌ దంచికొట్టిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ 13 బంతుల్లో 253కు పైగా స్ట్రైక్‌రేటుతో 33 పరుగులు రాబట్టాడు.

అతడి స్ట్రైక్‌రేటు 275
ఇక ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా 23 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకుని.. 217కు పైగా స్ట్రైక్‌రేటు నమోదు చేయగా.. తిలక్‌ వర్మ 16 బంతుల్లోనే 44 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్‌రేటు 275గా ఉండటం విశేషం. హార్దిక్‌, తిలక్‌ ఆఖరి వరకు అజేయంగా నిలవగా.. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా నాలుగు వికెట్ల నష్టపోయి.. 256 పరుగుల మేర రికార్డు స్కోరు సాధించింది.

టీమిండియా ప్రపంచ రికార్డు
ఈ క్రమంలో టీమిండియా ప్రపంచ రికార్డు సాధించింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో... ఓ జట్టులోని ఆరుగురు లేదంటే అంతకంటే ఎక్కువ మంది బ్యాటర్లు 150కి పైగా స్ట్రైక్‌రేటుతో.. ఇరవైకి పైగా పరుగులు సాధించడం ఇదే తొలిసారి.  ఇదిలా ఉంటే.. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్‌ ఎన్‌గర్వ, బ్లెసింగ్‌ ముజర్‌బానీ, కెప్టెన్‌ సికందర్‌ రజా, టినోటెండా మపోసా తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు.

డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి
కాగా మొదటిసారి 2007లో ప్రవేశపెట్టిన టీ20 ప్రపంచకప్‌ ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియా.. 2024లో రెండోసారి టైటిల్‌ గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ లీగ్‌ దశలో సత్తా చాటింది. అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌ జట్లను ఓడించి అజేయంగా సూపర్‌-8కు చేరుకుంది.

అయితే, సూపర్‌-8 తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన టీమిండియా సెమీ ఫైనల్‌ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారీ విజయం సాధించడంతో పాటు తదుపరి వెస్టిండీస్‌పై భారీ తేడాతో గెలిస్తేనే సూర్యసేనకు సెమీస్‌ ఆశలు సజీవంగా ఉంటాయి.

చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement