T20 WC: మారవా?.. సంజూ శాంసన్‌ విఫలం | T20 WC IND vs ZIM: Sanju Samson Fails Again Fans Slams Him | Sakshi
Sakshi News home page

T20 WC: మారవా?.. సంజూ శాంసన్‌ విఫలం

Feb 26 2026 7:39 PM | Updated on Feb 26 2026 7:55 PM

T20 WC IND vs ZIM: Sanju Samson Fails Again Fans Slams Him

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీ లీగ్‌ దశలో ఒకే ఒక్క మ్యాచ్‌ ఆడాడు సంజూ శాంసన్‌. నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్‌ శర్మ దూరం కావడంతో.. ఓపెనర్‌గా అతడి స్థానంలో వచ్చాడు. పసికూనతో మ్యాచ్‌లో ఎనిమిది బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.

అయితే, ఆ తర్వాత మళ్లీ సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఓపెనింగ్‌ జోడీలో ఇషాన్‌ కిషన్‌ (Ishan Kishan) మెరుగ్గా ఆడగా.. అభిషేక్‌ శర్మ లీగ్‌ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో డకౌట్‌ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం అతడిని కొనసాగించింది. సంజూను బెంచ్‌కు పరిమితం చేసింది.

మరో అవకాశం
అయితే, తాజాగా జింబాబ్వేతో సూపర్‌-8 మ్యాచ్‌ సందర్భంగా మరోసారి సంజూ శాంసన్‌కు మేనేజ్‌మెంట్‌ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్‌-రైట్‌ కాంబినేషన్‌ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లెఫ్టాండర్‌ అభిషేక్‌ శర్మతో కలిసి ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ గురువారం భారత జట్టు ఇన్నింగ్స్‌ ఆరంభించాడు.  

ఘనంగానే ఆరంభించాడు.. కానీ
ఇన్నింగ్స్‌ రెండో బంతికే సిక్స్‌ బాది ఘనంగా ఆరంభించాడు సంజూ. రెండో ఓవర్లోనూ ఓ సిక్సర్‌ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్‌.. ఆ మరుసటి ఓవర్లో బౌండరీ రాబట్టాడు. ఇలా మంచి ఫామ్‌లోకి వచ్చిన సంజూ.. నాలుగో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.

బ్లెసింగ్‌ ముజర్‌బానీ సంధించిన షార్ట్‌ బాల్‌ను సంజూ గాల్లోకి లేపగా.. డీప్‌ మిడ్‌ వికెట్‌ నుంచి పరిగెత్తుకు వచ్చి ర్యాన్‌ బర్ల్‌ క్యాచ్‌ అందుకున్నాడు. ఫలితంగా సంజూ శాంసన్‌ పెవిలిన్‌ చేరగా.. భారత్‌ తొలి వికెట్‌ కోల్పోయింది. 

మారవా సంజూ!
జింబాబ్వేతో మ్యాచ్‌లో మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఒక ఫోర్‌, రెండు సిక్సర్లు బాది 24 పరుగులు చేయగలిగాడు. దీంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిమానులు ఉసూరుమంటున్నారు.

ఇక తుదిజట్టులో సంజూను చూడటం కష్టమేనని వాపోతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్‌ టోర్నీ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సంజూ వరుసగా విఫలమయ్యాడు. దీంతో ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్‌ భర్తీ చేశాడు. 

ఇక జింబాబ్వేతో మ్యాచ్‌తో సంజూ తిరిగి రాగా.. ఇషాన్‌ వన్‌డౌన్‌లో దిగాడు. పవర్‌ ప్లేలో టీమిండియా స్కోరు: 80-1(6). ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి ఇషాన్‌ 15, అభిషేక్‌ శర్మ 33 పరుగులతో క్రీజులో నిలిచారు. చెన్నై వేదికగా టాస్‌ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌కు దిగింది.

చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement