న్యూఢిల్లీ: వివాదాస్పద రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్కు ఢిల్లీ కోర్టు బెయిల్ నిరాకరించింది. హత్యానేరంపై అతను ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మాజీ జాతీయ జూనియర్ చాంపియన్ సాగర్ ధన్కర్ను హత్య చేసిన కేసులో సుశీల్ ప్రధాన నిందితుడు. తన అనుచరులు, సన్నిహితులతో కలిసి ఛత్రశాల్ స్టేడియంలో 2021లో యువ రెజ్లర్ సాగర్ ధన్కర్ను హాకీ స్టిక్స్, బేస్బాల్ బ్యాట్లతో తీవ్రంగా కొట్టి చంపాడు.
అడ్డువచ్చిన సాగర్ స్నేహితులను సైతం సుశీల్ బృందం విచక్షణ రహితంగా కొట్టడంతో కొందరు గాయపడ్డారు. ఈ కేసులో సుశీల్ ఏ1గా తేలడంతో ఢిల్లీ పోలీసులు 2021 మేలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి అతను తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. మోకాలు శస్త్ర చికిత్స కోసమని 2023, జూలైలో సెషన్స్ కోర్టు వారం రోజుల మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది. అనంతరం మళ్లీ ఒలింపియన్ రెజ్లర్ను జైలుకు తరలించారు. తాజాగా మరోసారి బెయిల్కు ప్రయత్నించగా ఢిల్లీ కోర్టు నిర్ద్వందంగా సుశీల్ పిటీషన్ను తిరస్కరించింది.


