న్యూఢిల్లీ: వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరిగే ఆసియా కప్ మహిళల ఫుట్బాల్ టోర్నమెంట్లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 26 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో తెలంగాణకు చెందిన సౌమ్య గుగులోత్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది.
గ్రూప్ ‘సి’లో ఉన్న భారత్ మార్చి 4న పెర్త్లో వియత్నాంతో తొలి మ్యాచ్ ఆడుతుంది. ఆ తర్వాత మార్చి 7న జపాన్తో, మార్చి 10న చైనీస్ తైపీతో టీమిండియా పోటీపడుతుంది. ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరుకునే నాలుగు జట్లు 2027 ప్రపంచకప్ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి.
‘స్వర్ణ’ సరిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పోలీసు క్రీడల్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన బానోత్ సరిత మూడు స్వర్ణ పతకాలతో మెరిపించింది. సైబరాబాద్ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న ఈ పోటీల్లో సరిత పవర్లిఫ్టింగ్, బాక్సింగ్, ఆర్మ్ రెజ్లింగ్ క్రీడాంశాల్లో బరిలోకి దిగి విజేతగా నిలిచింది.
పవర్లిఫ్టింగ్లో 63 కేజీల విభాగంలో పోటీపడ్డ సరిత డెడ్లిఫ్ట్లో 105 కేజీలు, బెంచ్ప్రెస్లో 40 కేజీలు, స్క్వాట్లో 55 కేజీలు బరువెత్తి అగ్రస్థానాన్ని సంపాదించింది. ప్రస్తుతం హైదరాబాద్ సీఐడీలో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్న సరిత... గత ఏడాది కరీంనగర్లో జరిగిన రాష్ట్ర పోలీసు క్రీడల్లోనూ రాణించి రెండు స్వర్ణాలు, ఒక రజతం సాధించింది.


