సౌతాఫ్రికా క్రికెట్ జట్టు హెడ్కోచ్ షుక్రి కన్రాడ్ టీమిండియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. సూర్యకుమార్ సేన ఒత్తిడిలో ఉందని.. ఇదే అదునుగా తాము ఆ జట్టు బలహీనతలను ఉపయోగించుకుంటామని పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత జట్టు విజేతగా అవతరించిన విషయం తెలిసిందే.
అజేయంగా సూపర్-8కు
ఆ తర్వాత కూడా ద్వైపాక్షిక సిరీస్లలో వరుస విజయాలతో సత్తా చాటి.. సొంతగడ్డపై వరల్డ్కప్-2026లో హాట్ ఫేవరెట్గా టీమిండియా బరిలోకి దిగింది. అందుకు తగ్గట్లుగానే గ్రూప్ దశలో అజేయంగా నిలిచి సూపర్-8కు అర్హత సాధించింది. మరోవైపు.. సౌతాఫ్రికా సైతం వరుస విజయాలతో సూపర్-8కు దూసుకువచ్చింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య (IND vs SA) ఆదివారం అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరుగనుంది.
ఒత్తిడిలో టీమిండియా.. పైచేయి మాదే
ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా హెడ్కోచ్ షుక్రి కన్రాడ్ మాట్లాడుతూ.. ‘‘టీమిండియా వంటి జట్టు గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఆ జట్టుపై అంచనాలు భారీగా ఉంటాయి. స్క్రూటినీ కూడా ఎక్కువే. అందుకే వాళ్లు తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోతారు.
సెమీ ఫైనల్.. ఆపై ఫైనల్ చేరాలనే ఒత్తిడి మిగతావారితో పోలిస్తే వారిపై ఒకింత ఎక్కువగానే ఉంటుంది. దానిని మేము సద్వినియోగం చేసుకుంటాము. ఒత్తిడిలో బలహీనపడే ఆ జట్టుపై పైచేయి సాధించి.. వారి బలహీనతలను ప్రపంచానికి చూపిస్తాం’’ అని పేర్కొన్నాడు. అయితే, పటిష్ట టీమిండియాతో తలపడినపుడు తమపై కూడా అదే స్థాయిలో ఒత్తిడి ఉంటుందని పేర్కొన్నాడు.
భారత్దే ఆధిపత్యం
కాగా ఇటీవల సౌతాఫ్రికా భారత్లో పర్యటించింది. టీ20 సిరీస్లో టీమిండియా చేతిలో 3-1తో ఓడిపోయింది. అయితే, వరల్డ్కప్ వంటి టోర్నీలలో ఇలాంటి గత రికార్డుల ప్రభావం ఎక్కువగా ఉండదని కన్రాడ్ పేర్కొనడం గమనార్హం. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో భారత్- సౌతాఫ్రికా ఇప్పటి వరకు ఏడుసార్లు పోటీ పడగా.. టీమిండియా ఐదు, సౌతాఫ్రికా రెండుసార్లు గెలిచాయి.


