T20 WC: ఘోర పరాభవం.. స్పందించిన ఆసీస్‌ కెప్టెన్‌ | Bitterly: Mitchell Marsh Breaks Silence on AUS Early T20 WC 2026 Exit | Sakshi
Sakshi News home page

T20 WC: నిరాశ.. ఇదొక చేదు అనుభవం: ఆసీస్‌ కెప్టెన్‌

Feb 21 2026 12:10 PM | Updated on Feb 21 2026 1:41 PM

Bitterly: Mitchell Marsh Breaks Silence on AUS Early T20 WC 2026 Exit

మాజీ చాంపియన్‌ ఆస్ట్రేలియాకు టీ20 ప్రపంచకప్‌-2026 టోర్నీలో చేదు అనుభవం ఎదురైంది. గ్రూప్‌ దశలోనే ‘పటిష్ట’ ఆసీస్‌ ఇంటిబాట పట్టింది. తొలుత ఐర్లాండ్‌పై గెలిచినా.. అదే జోరు కొనసాగించలేకపోయిన కంగారూలు.. జింబాబ్వే, శ్రీలంక చేతిలో ఓడిపోయారు. ఫలితంగా సూపర్‌-8 చేరకుండానే నిష్క్రమించిన ఆసీస్‌.. లీగ్‌ దశలో చివరగా పసికూన ఒమన్‌ను ఓడించి విజయంతో ముగించింది.

ఇదొక చేదు అనుభవం
ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ స్పందించాడు. ఈసారి తాము స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయామని.. భారమైన హృదయాలతో ఇంటిబాట పడుతున్నట్లు వెల్లడించాడు. ‘‘సూపర్‌-8 చేరే అవకాశాన్ని చేజేతులా నాశనం చేసుకున్నాం. మా డ్రెసింగ్‌రూంలో నిరాశపూరిత వాతావరణం నెలకొంది. ఇదొక చేదు అనుభవం.

దురదృష్టవశాత్తూ మేము గత రెండు మ్యాచ్‌లలో ఓడిపోయాము. అత్యుత్తమ క్రికెట్‌ ఆడలేకపోయాము. అదే సమయంలో ప్రత్యర్థులు.. ముఖ్యంగా జింబాబ్వే అద్భుతంగా ఆడింది. ఆ జట్టు చేతిలో ఓడిపోగానే మాపై ఒత్తిడి పెరిగిపోయింది. ఈ విషయంలో వాళ్లకు క్రెడిట్‌ ఇవ్వాల్సిందే.

గుణపాఠం నేర్చుకుంటాము
ఇక్కడి పిచ్‌ పరిస్థితులను ఎంతమాత్రం నిందించలేము. అన్నింటికీ మేము సన్నద్ధమయ్యే ఇక్కడికి వచ్చాము. మిగతా జట్ల మాదిరే రెండేళ్లుగా మా జట్టు నిర్మాణం జరుగుతోంది. కానీ కీలక సమయంలో మేము వెనకపడ్డాము. ఈ చేదు అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకుంటాము.

క్రికెట్‌ ఆస్ట్రేలియా యాజమాన్యం ఓటమికి గల కారణాలపై విశ్లేషణ చేస్తుంది. విఫలమైనపుడు నిరాశ సహజం. అయితే, స్వదేశానికి వెళ్లిన తర్వాత అంతా కూర్చుని లోపాల గురించి చర్చించుకుంటాము. నిజాయితిగా మా తప్పులను విశ్లేషించుకుంటాము.  

చాలా బాధగా ఉంది
ఏదేమైనా చాలా బాధగా ఉంది. నిరాశా, నిస్పృహలు కమ్ముకున్నాయి. అయితే, సానుకూల దృక్పథంతో మేము ముందడుగు వేసి తిరిగి పుంజుకుంటాము’’ అని మిచెల్‌ మార్ష్‌ ఉద్వేగపూరిత వ్యాఖ్యలు చేశాడు.

కాగా పల్లెకెలె వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో  ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో ఒమన్‌పై జయభేరి మోగించింది. ఆడమ్‌ జంపా (4/21), మ్యాక్స్‌వెల్‌ (2/13), బార్ట్‌లెట్‌ (2/27), స్టొయినిస్‌ (2/16), ఎలిస్‌ (1/14) ఇలా... బౌలింగ్‌ దళమంతా కలిసి ఒమన్‌ బ్యాటర్లను దెబ్బకొట్టింది.

మిచెల్‌ మార్ష్‌ ధనాధన్‌
ముందుగా ఒమన్‌ జట్టు 16.2 ఓవర్లలోనే 104 పరుగులకే కుప్పకూలింది. వసీమ్‌ అలీ (32; 4 ఫోర్లు) రాణించాడు. అనంతరం సులువైన లక్ష్యాన్ని ఆ్రస్టేలియా 9.4 ఓవర్లలో వికెట్‌ మాత్రమే కోల్పోయి 108 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ (33 బంతుల్లో 64 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు), హెడ్‌ (19 బంతుల్లో 32; 6 ఫోర్లు) చెలరేగి తొలి వికెట్‌కు 8.1 ఓవర్లలో 93 పరుగులు జోడించారు. 

చదవండి: T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement