T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌! | T20 World Cup IND Vs SA, Hardik Shot Hits Mohammed Siraj Knee, Leaves Field Amid Big Injury Scare For India | Sakshi
Sakshi News home page

T20 WC IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌!

Feb 21 2026 10:41 AM | Updated on Feb 21 2026 12:17 PM

IND vs SA: Hardik Shot Hits Teammate Knee Leaves Field IND Big Injury Scare

సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్‌ టోర్నీ-2026లో టీమిండియా సత్తా చాటుతోంది. లీగ్‌ దశలో భాగంగా గ్రూప్‌-ఎ నుంచి టాపర్‌గా సూర్యకుమార్‌ సేన సూపర్‌-8కు చేరుకుంది. వరుసగా అమెరికా, నమీబియా, పాకిస్తాన్‌, నెదర్లాండ్స్‌లను ఓడించి అజేయంగా తదుపరి దశలో అడుగుపెట్టింది.

తొలుత దక్షిణాఫ్రికాతో..
ఇక ఇక్కడి నుంచే అసలు సమరం మొదలుకానుంది. గ్రూప్‌-1లో ఉన్న టీమిండియా.. సూపర్‌-8లో తొలుత దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఆదివారం రాత్రి 7 గంటలకు ఇరుజట్ల మధ్య మ్యాచ్‌ మొదలుకానుంది.

ప్రాక్టీస్‌లో తలమునకలు
ఈ నేపథ్యంలో ఇప్పటికే అహ్మదాబాద్‌ చేరుకున్న భారత జట్టు ప్రాక్టీస్‌లో తలమునకలైంది. ఈ క్రమంలో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya) బాదిన షాట్‌ కారణంగా భారత స్టార్‌ పేసర్‌ మొహమ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj) గాయపడినట్లు సమాచారం. హార్దిక్‌ బాదిన బంతి సిరాజ్‌ ఎడమ మోకాలికి బలంగా తగిలినట్లు తెలుస్తోంది.

గాయపడిన పేసర్‌
దీంతో నొప్పితో విలవిల్లాడిన సిరాజ్‌ మధ్యలోనే నెట్‌ సెషన్‌ నుంచి నిష్క్రమించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రెవ్‌స్పోర్ట్స్‌ షేర్‌ చేసిన ఈ ఫొటోలలో సిరాజ్‌ కుంటుతూ మైదానం వీడిన తీరు టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.

గాయాల బెడద
కాగా టీ20 వరల్డ్‌కప్‌ టోర్నీ ఆరంభానికి ముందు నుంచీ టీమిండియాను గాయాల బెడద వేధిస్తున్న సంగతి తెలిసిందే. యువ పేసర్‌, బ్యాట్‌తోనూ అదరగొడుతున్న హర్షిత్‌ రాణా గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చిన సిరాజ్‌.. గ్రూప్‌ దశలో తొలుత అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.

ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా జ్వరం వల్ల తుదిజట్టు నుంచి తప్పుకోగా.. సిరాజ్‌కు ఈ అవకాశం వచ్చింది. అమెరికాతో మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ పేసర్‌ మూడు వికెట్లతో సత్తా చాటాడు. అయితే, తదుపరి మ్యాచ్‌లకు బుమ్రా అందుబాటులోకి రావడంతో సిరాజ్‌ బెంచ్‌కే పరిమితమయ్యాడు.

ఇప్పుడిలా..
మరోవైపు.. ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ సైతం కడుపు నొప్పి కారణంగా నమీబియాతో మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఇక ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ సైతం గాయం నుంచి కోలుకుని ఫిట్‌నెస్‌ సాధించినప్పటికీ.. తుదిజట్టులో ఇంత వరకు ఆడలేదు. 

ఇదిలా ఉంటే.. పటిష్ట సౌతాఫ్రికాతో పోరుకు ముందు సిరాజ్‌ కూడా గాయపడటం గమనార్హం. కాగా సూపర్‌-8లో భారత్‌.. సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లను ఎదుర్కొంటుంది. ఈ దశలో సత్తా చాటితేనే సెమీ ఫైనల్‌ చేరే అవకాశం ఉంటుంది.

చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement