ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకుంది. థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం రెండు సెమీఫైనల్స్ ఉన్నాయి. తొలి సెమీఫైనల్లో శ్రీలంక ‘ఎ’ జట్టుతో భారత్ ‘ఎ’ జట్టు... రెండో సెమీఫైనల్లో పాకిస్తాన్ ‘ఎ’ జట్టుతో బంగ్లాదేశ్ ‘ఎ’ జట్టు తలపడతాయి. భారత కాలమానం ప్రకారం టీమిండియా మ్యాచ్ ఉదయం 8 గంటలకు మొదలవుతుంది. రెండో సెమీఫైనల్ను మధ్యాహ్నం గం. 12:30 నుంచి నిర్వహిస్తారు.
ఈ మ్యాచ్లను సోనీ స్పోర్ట్స్ టెన్1, సోనీ స్పోర్ట్స్ టెన్3, సోనీ స్పోర్ట్స్ టెన్4 చానెల్స్లో, సోనీ లివ్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ టోర్నీలో రాధా యాదవ్ నాయకత్వంలో బరిలోకి దిగిన భారత ‘ఎ’ జట్టు తొలి లీగ్ మ్యాచ్లో యూఏఈ ‘ఎ’ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. ఈ పరాజయం నుంచి వెంటనే తేరుకున్న భారత ‘ఎ’ జట్టు తర్వాతి రెండు లీగ్ మ్యాచ్ల్లో పాకిస్తాన్, నేపాల్ జట్లను ఓడించింది.
భారత్, పాక్, యూఏఈ జట్లు నాలుగు పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచాయి. అయితే మెరుగైన రన్రేట్తో భారత్, పాక్ సెమీఫైనల్ చేరుకున్నాయి. గ్రూప్ ‘బి’లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తొలి రెండు స్థానాల్లో నిలిచి సెమీఫైనల్కు అర్హత సాధించాయి.


