విక్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్మాస్టర్లు నిరాశపరిచారు. ఆదివారం ముగిసిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత్ నుంచి నలుగురు గ్రాండ్మాస్టర్లు దొమ్మరాజు గుకేశ్, ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, అరవింద్ చిదంబరం పోటీపడ్డారు. 14 మంది మేటి గ్రాండ్మాస్టర్ల మధ్య 13 రౌండ్లపాటు ఈ టోర్నీ జరిగింది. భారత నంబర్వన్, తెలంగాణ గ్రాండ్మాస్టర్ అర్జున్ 4.5 పాయింట్లతో 13వ స్థానంలో నిలిచాడు.
చివరిదైన 13వ రౌండ్ గేమ్లో అర్జున్ 55 ఎత్తుల్లో నొదిర్బెక్ అబ్దుసత్తరోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. క్లాసికల్ ఫార్మాట్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ గుకేశ్ 6.5 పాయింట్లతో 9వ స్థానంలో, ప్రజ్ఞానంద 5.5 పాయింట్లతో 11వ స్థానంలో, అరవింద్ 4.5 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచారు. 9 పాయింట్లతో నొదిర్బెక్ విజేతగా అవతరించాడు.


