రూర్కెలా: ఎఫ్ఐహెచ్ ప్రొ హాకీ లీగ్లో భారత జట్టుకు వరుసగా మూడో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన పోరులో బెల్జియం 4–2 గోల్స్ తేడాతో భారత్ను ఓడించింది. బెల్జియం తరఫున హ్యూగో లబుషేర్ (11వ నిమిషం), అలెగ్జాండర్ హెన్డ్రిక్ (14వ ని., 17వ ని.), ఆర్థర్ స్లూవర్ (15వ ని.) గోల్స్ నమోదు చేశారు. భారత ఆటగాళ్లలో ఆదిత్య అర్జున్ (24వ ని.), హర్మన్ప్రీత్ సింగ్ (37వ ని.) గోల్స్ సాధించారు.
తొలి క్వార్టర్లో 3 గోల్స్ సాధించి బెల్జియం సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో క్వార్టర్లో ఇరు జట్లు చెరో గోల్ చేయగా, మూడో క్వార్టర్లో భారత్ ఖాతాలో మరో గోల్ చేరింది. అయితే చివరి క్వార్టర్లో రాణించి ఓటమినుంచి తప్పించుకోవాలని భారత్ చేసిన ప్రయత్నం సఫలం కాలేదు. శనివారం జరిగిన మరో మ్యాచ్లో జర్మనీ 6–1 గోల్స్ తేడాతో పాకిస్తాన్ను చిత్తు చేసింది. నేడు జరిగే పోరులో అర్జెంటీనాతో భారత్ తలపడుతుంది.


