రత్నమాల ట్రస్ట్ నిధుల దారి మళ్లింపుపై కేసు నమోదు
ఈ నెల 5న ట్రస్ట్ ఆడిటర్తో పాటు రాజేష్ను అరెస్ట్ చేసిన సీబీఐ పోలీసులు
ఇదే కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అధికారి అరెస్ట్
సాక్షి, అనకాపల్లి: నర్సీపట్నంలో రత్నమాల ట్రస్ట్ పేరిట నిధులను దారి మళ్లించిన కేసులో నలంద విద్యాసంస్థల యాజమాని, టీడీపీ కౌన్సిలర్ భర్త నేరెళ్ల వెంకట రాజేష్ను సీబీఐ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. రాజేష్ నర్సీపట్నంలో రత్నమాల ట్రస్ట్ పేరిట నలంద విద్యాసంస్థల్ని నడుపుతున్నారు.
కొన్నేళ్లుగా మద్యం సిండికేట్లో టీడీపీ నాయకుడు రాజేష్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. రాజేష్ భార్య చంద్రిక ప్రస్తుతం టీడీపీ తరఫున మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. రాజేష్ కుటుంబానికి చాలాకాలంగా టీడీపీతో రాజకీయ అనుబంధం ఉంది. రాజేష్ తండ్రి బాబ్జీ టీడీపీ ఎంపీటీసీగా పని చేశారు. మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత టీడీపీ కౌన్సిలర్గా రాజేష్ తల్లి సుగుణ కూడా పనిచేశారు.
ఇన్కం ట్యాక్స్ ఏడీ సహా నలుగురు అరెస్ట్
ఆదాయ పన్నుశాఖలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు సీబీఐ అధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 5న రత్నమాల చార్టెర్డ్ అకౌంటెంట్ గ్రంధి శరత్కుమార్ను, ఆదాయ పన్నుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్కుమార్ను సీబీఐ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో ఏ–1గా విశాఖకు చెందిన ఆదాయ పన్నుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్ (ఇన్వెస్టిగేషన్), ఏ–2గా చార్టర్డ్ అకౌంటెంట్ శరత్కుమార్, ఏ–3గా రత్నమాల ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు నేరెళ్ల వెంకట రాజేష్, ఏ–4గా ఇతర సిబ్బందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసును డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మురళి ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ కె.మధుసూదన్ విచారణ చేస్తున్నారు.
ఈ విచారణలో నర్సీపట్నంలో నలందా స్కూల్ నిర్వహిస్తున్న రత్నమాల ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ నిధుల్లో సుమారు రూ.2 కోట్లు దుర్వినియోగం చేసి ఆ మొత్తాన్ని ఆ సొసైటీ అధ్యక్షుడు నేరళ్ల వెంకట రాజేష్ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్నుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి అమృత్కుమార్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలని, అవి లేకుండా చేయాలంటే తనకు లంచంగా రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

రూ.14 లక్షలు ఇస్తామని వారివురి మధ్య డీల్ కుదిరింది. అందులో భాగంగానే ఈ నెల 2న రత్నమాల ట్రస్టు ఆడిటర్ శరత్కుమార్, ట్రస్ట్ అధ్యక్షుడు నేరెళ్ల వెంకట రాజేష్కు లంచం డబ్బు సిద్ధం చేయాలని చెప్పారు. మరుసటి రోజున రాజేష్ తన స్నేహితుల నుంచి రూ.14 లక్షలు సిద్ధం చేశారు. ఈ నెల 5న గ్రంధి శరత్కుమార్ ఆ డబ్బు తీసుకుని విశాఖలో ఉన్న ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో ఉన్న అధికారికి ఇస్తుండగా సీబీఐ ఏసీబీ డీఎస్పీ ప్రమోద్కుమార్ అరెస్ట్ చేశారు.


