మత్స్యగుండంలో పకడ్బందీగా శివరాత్రి ఉత్సవాలు
● పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు
మాట్లాడుతున్న ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, ఇతర అధికారులు
సాక్షి,పాడేరు: పవిత్ర పుణ్యక్షేత్రం హుకుంపేట మండలంలోని మత్స్యగుండంలో మహా శివరాత్రి ఉత్సవాలను ఈఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించాలని పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈనెల 14నుంచి 16వతేదీ వరకు మత్స్యగుండంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిశాఖల అధికారుల సమన్వయంతో మూడు రోజుల జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు సురక్షిత తాగునీరు,విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మఠం సర్పంచ్ మఠం శాంతకుమారి, పాడేరు డీఎస్పీ అభిషేక్, డీఎల్పీవో కుమార్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.


