Anakapalle District Latest News
-
నేటి నుంచి శుభకార్యాలకు బ్రేక్
మహారాణిపేట(విశాఖ) : వివాహాలు, గృహప్రవేశాలు, ఉపనయనాలు, నిశ్చితార్థాలుం ఇలా శుభకార్యాలతో కళకళలాడే వేళకు తాత్కాలికంగా విరామం పడింది. గురువారం నుంచి వరుసగా 36 రోజుల పాటు శుభముహూర్తాలు లేకపోవడంతో పెళ్లి బాజాలు మూగబోనున్నాయి. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 18 వరకు వివాహాది శుభకార్యాలకు బ్రేక్ పడింది. వేద పండితుల ప్రకారం ఈ కాలాన్ని ‘మూఢమి’గా పరిగణిస్తారు. అందుకే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, ఉపనయనాలు వంటి ప్రధాన శుభకార్యాలను చాలామంది వాయిదా వేస్తున్నారు. అయితే అన్నప్రాసన, అక్షరాభ్యాసం, నామకరణం, సీమంతం, రిజిస్ట్రేషన్లు వంటి కార్యక్రమాలు మాత్రం నిర్వహించుకోవచ్చని పండితులు చెబుతున్నారు. జూన్ 19 నుంచి మళ్లీ పెళ్లి సందడి జూన్ 19న నిజ జ్యేష్ఠ మాసం ప్రారంభం కావడంతో మళ్లీ శుభముహూర్తాల సందడి మొదలుకానుంది. జూన్ 19, 20, 21, 24, 25, 26, 27, 28 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని వేద పండితులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత జూలై 1 నుంచి 9 వరకు కూడా వివాహాలు, గృహప్రవేశాలకు అనుకూలమైన తేదీలు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్లోనూ పలు శుభముహూర్తాలు లభించనున్నాయి. గత డిసెంబర్, ఈ ఏడాది ఫిబ్రవరిలో భారీగా వివాహాలు జరగడంతో పట్టణాలు, గ్రామాలు పెళ్లి వేడుకలతో కళకళలాడాయి. ఇప్పుడు మరోసారి జూన్ చివరి నుంచి అదే సందడి కనిపించనుంది. పెళ్లి రంగానికి తాత్కాలిక మందగమనం శుభముహూర్తాలు లేకపోవడంతో వివాహాలకు అనుబంధంగా ఉన్న వందలాది వృత్తులు తాత్కాలికంగా మందగించనున్నాయి. కళ్యాణ మండపాలు, కేటరింగ్, టెంట్ హౌస్లు, డెకరేషన్, పూల వ్యాపారులు, బంగారు దుకాణాలు, వస్త్ర వ్యాపారులు, ఫొటోగ్రాఫర్లు, బ్యాండ్ మేళాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, హోటళ్లు, లాడ్జిలు ఇలా అనేక రంగాలపై ప్రభావం పడనుంది. అయితే జూన్ 19 నుంచి మళ్లీ ముహూర్తాల సీజన్ ప్రారంభం కావడంతో ఈ రంగాలన్నీ తిరిగి ఊపందుకోనున్నాయని వ్యాపారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 19 వరకు ఆగాల్సిందే.. అధిక జ్యేష్ఠ మాసం కారణంగా మే 14 నుంచి జూన్ 18 వరకు ప్రధాన శుభకార్యాలకు విరామం ఉంటుంది. జూన్ 19 నుంచి మళ్లీ శుభముహూర్తాలు ప్రారంభమవుతాయి. – అయిలూరి శ్రీనివాస దీక్షితులు -
రెవెన్యూ సేవలు వేగవంతం
నేటి నుంచి శుభకార్యాలకు బ్రేక్ తుమ్మపాల : రెవెన్యూ క్లినిక్లో వచ్చిన అర్జీలపై క్షేత్ర స్థాయిలో విచారణ చేసి సత్వరమే పరిష్కరించాలని, రెవెన్యూ సేవలలో సమయపాలన, పారదర్శకత, బాధ్యతాయుత పరిపాలనను కట్టుదిట్టం చేయాలని జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కలక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం రెవెన్యూ సేవలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంబంధిత అధికారులు ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో మానిటరింగ్ చేసి, రెవెన్యూ సేవలలో ఆలస్యం లేకుండా ప్రజలకు త్వరితగతిన సేవలు అందించాలన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తూ, ఆక్రమణలను నివారించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో వివాదరహిత భూ రికార్డులు, బాధ్యతాయుత రెవెన్యూ పరిపాలన కోసం అధికారులు మరింత చురుకుగా పనిచేయాలన్నారు. ఆన్లైన్ సేవలు, భూ వ్యాపింగ్, రికార్డులు అప్డేషన్, మ్యుటేషన్ దరఖాస్తులు వంటి సమస్యలపై కార్యాచరణ ప్రణాళిక తయారుచేసుకొని పరిష్కరించాలన్నారు. లోపాలు ఉన్న చోట వెంటనే సరిదిద్దాలని, నిర్ణీత సమయంలో నివేదికలు సమర్పించాలన్నారు. పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్లలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే విచారణ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్వో సుబ్బలక్ష్మి, ప్రత్యేక డిప్యుటీ కలెక్టర్లు కె.మనోరమ, అనిత, ఆర్డీఓలు షేక్ అయిషా, వి.వి.రమణ, ఏడీ సర్వే గోపాలరాజా పాల్గొన్నారు. -
విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందాలి
విద్యార్థులకు క్రీడా సామాగ్రి కిట్లను పంపిణీ చేసిన కలెక్టర్ విజయ్ కృష్ణన్ తుమ్మపాల : విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సమ్మర్ క్యాంప్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి కలెక్టరేట్లో బుధవారం క్రీడా సామాగ్రి కిట్లను ఆమె విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ విద్యార్థులు క్రీడలు, వ్యాయామం, సృజనాత్మక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. ఈ నెల 1 నుండి 30 వరకు నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంప్లను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి పి.శైలజ, కోచ్ సిహెచ్ సూరి అప్పారావు, విద్యార్థులు పాల్గొన్నారు. -
తండ్రికి తలకొరివి పెట్టిన తనయ
దేవరాపల్లి: అనారోగ్యంతో మృతి చెందిన తండ్రికి ఓ కుమార్తె తల కొరివి పెట్టి రుణం తీర్చుకుంది. పలువుర్ని కంటతడి పెట్టించిన ఈ ఘటన మండలంలోని పెదనందిపల్లి గ్రామంలో బుధవారం జరిగింది. పెదనందిపల్లి గ్రామానికి చెందిన వేచలపు గోవింద అనారోగ్యంతో మంగళవారం రాత్రి మృతి చెందారు. ఆర్టీసీ కండక్టర్గా పనిచేసి, ఉద్యోగ విరమణ చేసిన గోవిందకు భార్య, నలుగురు కుమార్తెలు ఉన్నారు. వీరిలో ముగ్గురు కుమార్తెలకు వివాహం అయింది. కుమారులు లేకపోవడంతో పెద్ద కుమార్తె అంజలి తల కొరివి పెట్టడానికి ముందుకు వచ్చింది. కుండ పట్టుకుని తండ్రి అంతిమ యాత్రలో పాల్గొని, దహన సంస్కారాలు పూర్తిచేసింది. అంజలి విశాఖపట్నంలోని యూనియన్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తోంది. తండ్రికి కుతూరు తల కొరివి పెట్టిన దృశ్యాని చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనతో పెదనందిపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
అణచివేతకే అక్రమ కేసులు
అనకాపల్లి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెడ్బుక్ రాజ్యాంగంతో వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ, యువజన విభాగం నాయకులను అణచివేయడమే ధ్యేయంగా పాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్ రాజా, జిల్లా అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్ అన్నారు. స్థానిక భీమునిగుమ్మం అంబేడ్కర్ విగ్రహం వద్ద కర్నూలు జిల్లాలో పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు బాలుపై అక్రమ కేసును తొలగించాలని బుధవారం జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, వచ్చే ప్రభుత్వంలో ఇప్పుడు తప్పు చేసిన నాయకులను, అధికారులను వదిలే ప్రసక్తి లేదని ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పడం జరిగిందన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులపై జరుగుతున్న అరాచకాలను పార్టీ డిజిటల్ బుక్లో వారి పేర్లు నమోదు చేసుకోవడం జరుగుతుందని, తప్పక శిక్ష పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు కర్రి రుద్రి, జిల్లాలో వివిధ నియోజకవర్గాల అధ్యక్షులు జాజుల రమేష్, ఆకుల సాయి, పెద్దిశెట్టి శేఖర్, పట్టణ అధ్యక్షుడు వేగి త్రినాథ్, 82వ వార్డు అధ్యక్షుడు అల్లు త్రినాథ్, బుచ్చియ్యపేట మండల అధ్యక్షుడు రవి, పార్టీ సీనియర్ నాయకులు బుద్ద జగన్, కర్రి రమేష్, కొంకి శ్రీరామూర్తి, లక్కోజు రాంబాబు, బొనేల సాయి, సోమిశెట్టి భార్గవ్, దొడ్డి కిరణ్, నెట్టిమి రామచంద్రరావు, శరగడం హేమంత్, దేశెట్టి బసవేశ్వరరావు, నూకేష్, నడిశెట్టి గోవింద, రెడ్డి చిన్నా, దొడ్డి హేమంత్ పాల్గొన్నారు. -
డివైడర్ను ఢీకొన్న కారు... ఒకరు మృతి
పాయకరావుపేట : జాతీయ రహదారి పై విశాఖపట్నం వైపునకు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీ కొట్టడంతో వ్యక్తి మృతి చెందినట్టు ఎస్ఐ ఆలీ తెలిపారు. నామవరం గ్రామం వద్ద మంగళవారం రాత్రి కారు ముందు ప్రయాణిస్తున్న మోటార్ బైక్ హఠత్తుగా బ్రేక్ వేయడం వల్ల అతివేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఇద్దరు వ్యాపారం నిమిత్తం శ్రీకాకుళం వెళ్తున్నారు. కారు డివైడర్ను ఢీ కొట్టడంతో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి రాధా ఆలీసామను తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. కారులో వున్న మరో వ్యక్తి సోమ మహామ్మద్ అనే వ్యక్తి గాయపడడంతో తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. మృతి చెందిన వ్యక్తి గుజరాత్కు చెందిన వ్యక్తి అని, అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్టు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
వ్యవసాయ బోర్లకు విద్యుత్ లైన్లు ఏర్పాటు
నక్కపల్లి: వ్యవసాయ బోర్లకు ఽవిద్యుత్ సరఫరా కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు ట్రాన్స్కో అధికారులు ఎట్టకేలకు విద్యుత్లైన్లు ఏర్పాటు పనులు ప్రారంబించారు. మండలంలో గొడిచర్ల గ్రామానికి చెందిన నలుగురు రైతులు తమ పొలాల్లో వ్యవసాయ బోర్లు ఏర్పాటు చేసుకునేందుకు విద్యుత్ సరఫరా కోసం ట్రాన్స్కోవారికి దరఖాస్తు చేశారు. విద్యుత్లైన్లు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయాలంటే రూ.2.51 లక్షలు డీడీ చెల్లించాలని ట్రాన్సోకో వారు సూచించారు. ఏడాది క్రితం రైతులు ఈ మొత్తాన్ని డీడీ రూపంలో చెల్లించారు. డీడీలు చెల్లించినప్పటికీ విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతోంది. దీంతో రైతులు మరోసారి ట్రాన్స్కో వారిని సంప్రదించారు. ఏడాది పూర్తవుతున్నా కనెక్షన్ ఇవ్వలేదంటూ అఽధికారులను ప్రశ్నించారు. దీంతో మరో రూ.1.35 లక్షలు చెల్లించాలని నోటీసు ఇచ్చారు. ఈ మొత్తాన్ని కూడా రైతులు చెల్లించారు. సుమారు నాలుగు లక్షల రూపాయలు చెల్లించినప్పటికీ కనెక్షన్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుండడంతో ‘కనెక్షన్ పేరిట కలెక్షన్’ అనే శీర్షికన బాధితుల గోడు వినిపిస్తూ సాక్షి దినపత్రికలో వార్త కథనం వెలువడింది. డీడీలు చెల్లించినప్పటికీ విద్యుత్లైన్లు ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతోందంటూ రైతుల ఆవేదనను సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. కలెక్టర్ కార్యాలయం నుంచి స్థానిక ట్రాన్స్కో వారిని వివరణ కోరారు. తక్షణమే రైతులకు విద్యుత్ సరఫరా ఇవ్వాలని ఆదేశాలు రావడంతో ట్రాన్స్కో అధికారులు యుద్ధ ప్రాతిపదికన రైతుల పొలాల్లో ఏర్పాటు చేసిన వదిలేసిన స్తంభాలకు విద్యుత్లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు వంటి పనులు చేపట్టారు. రెండు రోజుల్లో ఈ పనులన్నీ పూర్తి చేసి రైతుల వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా ఇవ్వడం జరుగుతుందని ట్రాన్స్కో అధికారులు తెలిపారు. -
వేసవి శిక్షణ విజ్ఞానదాయకం
మాట్లాడుతున్న ఎంఎస్ఆర్ ఐటీఐ కరస్పాండెంట్ జోగారావు మునగపాక : వేసవి సెలవులను వృఽథా చేయకుండా విజ్ఞానాన్ని అందించే శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని ఎంఎస్ఆర్ ఐటీఐ కరస్పాండెంట్ మళ్ల జోగారావు కోరారు. మునగపాక గ్రామీణ యువజన మందిరం ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు. లక్ష్యం కోసం చదువుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందన్నారు. కర్ర సాము, చెస్, క్యారమ్, గీత శ్లోకాలపై శిక్షణ పెంచుకోవాలన్నారు. విజ్ఞానాన్ని పెంచుకునేందుకు కృషి చేయాలన్నారు. యువజన మందిరం అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మందిర సభ్యులు ఆడారి లక్ష్మణరావు, ఆడారి సూర్య చంద్రరావు, వెలగా ప్రవీణ పాల్గొన్నారు. -
కూటమి నేతల వత్తాసు!
సొసైటీ రుణాలు కొల్లగొట్టిన సీఈవోకు రోలుగుంట : జానకీరాంపురం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో కోట్లాది రూపాయలు రుణాలు దర్వినియోగానికి పాల్పడిన నేరంపై ఉన్నతాధికారులు ఆ సంఘ సీఈవోను విధుల నుంచి తొలగించారు. మళ్లీ అదే వ్యక్తికి కూటమి నాయకుల సిఫారసుతో అదే బ్యాంకులో విధుల్లో చేరే విధంగా తీర్మానం చేయడంపై బాధితులు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు, రైతు సంఘ నాయకులు బుధవారం విలేకరులతో పీఏసీఎస్లో జరిగిన అవకతవకలు, బినామీ రుణ బాధితులు తమకు జరిగిన నష్టంపై మాట్లాడారు. సమారు నాలుగైదేళ్ల క్రితం కోట్లాది రూపాయలను పలు రకాల రుణాలు సభ్యులకు తెలియకుండా మంజూరు చేసి అప్పటి సీఈవో కృష్ణ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడు. సొసైటీలో సభ్యులు కాని వారికి, స్థానికేతరులకు, భూమిలేని వారికి సుమారుగా 200 మంది పేరున రుణాలు మంజూరుకు పాల్పడ్డాడని కిల్లాడ సాంబమూర్తి నాయుడు, గొల్లు కల్పన, నారాయణరావు ఆరోపించారు. దీనిపై పలువురు ఆ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో జిల్లా కల్టెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేసి, సీఈవోకు, అతనికి సహకరించిన గుమస్తాను తొలగిస్తూ సమారు ఎనిమిది మాసాల క్రితం డిస్మిస్ చేయడం జరిగింది. దీినిపై కోపోద్రిక్తుడైన సీఈవో రికార్డులను కాల్చేస్తానని పెట్రోలు తీసుకెళ్లి అధికారులను బెదిరించాడు. దీంతో ఇక్కడ అధికారుల ఫిర్యాదుతో అప్పటి సీఐ గోవిందరావు కేసు నమోదు చేసి విచారణానంతరం రిమాండుకు తరలించగా 70 రోజులు రిమాండు ఖైదీగా ఉన్నాడు. విచారణ తూతూ మంత్రం? అయితే రుణబాధితుల ఫిర్యాదును మాత్రం ఆ శాఖ అధికారులు తూతూ మంత్రంగానే విచారణ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 51 చట్టం ప్రకారం విచారణ చేస్తామంటారు, ఎత్తేస్తారు.. ఇలా బాధితులతో ఆటలాడుకోవడం మినహా న్యాయం జరగలేదని చెబుతున్నారు. సుమారు రూ.నాలుగు కోట్ల నష్టంతో ఉన్న ఈ పీఏసీఎస్ ఇటీవల మడ్డు గణేష్ అనే సీఈవోతో నామమామత్రంగా నడుపుతున్నారు. ఇదిలా ఉండగా జనసేన పార్టీ మండల నాయకుడు దొరబాబుని పర్సన్ ఇన్చార్జిగా, మరో ఇద్దరు డైరెక్టర్లతో నడుస్తుంది. ఈ పర్సన్ ఇన్చార్జితో డిస్మిస్ అర్డరు జారీ చేసి, ఇదే ఇన్చార్జితో మరలా విధుల్లో చేర్పించే తీర్మానం చేయడానికి పాలకవర్గం యత్నాన్ని, కూటమి ప్రభుత్వ తీరును బాధితులు తీవ్రంగా ఖండిస్తున్నారు. విధుల నుంచి డిస్మిస్ అయి 70 రోజులు రిమాండు ఖైదీగా ఉన్న వ్యక్తికి మళ్లీ ఇదే పీఏసీఎస్లో ఉద్యోగమిస్తే, అతన్ని విధుల్లో చేరనివ్వబోమని, అలా జరిగితే వందలాది మందితో కలసి పీఏసీఎస్కు తాళం వేసి ఉద్యమిస్తామని వారు హెచ్చరించారు. కూటమి నాయకులు చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, జనసేన నియోజకవర్గం ఇంచార్జి పి.వి.ఎస్.ఎన్ రాజును కలసి తమ ఉద్యమ నోటీసును అందజేయనున్నట్టు గ్రామ నాయకులు సబ్బవరపు పెద్దినాయుడు తదితరులు స్పష్టం చేశారు. -
‘పాలిటెక్నిక్’ దరఖాస్తుల విక్రయం ప్రారంభం
దరఖాస్తుల విక్రయాన్ని ప్రారంభిస్తున్న ఎండీ ప్రసాద్ కశింకోట: స్థానిక ఆర్ఈసీఎస్లోని రాజీవ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యుత్ వినియోగదారుల కోటా కింద ప్రవేశానికి దరఖాస్తుల విక్రయం బుధవారం ప్రారంభమైంది. దరఖాస్తుల విక్రయాన్ని ఎమ్డి జి.ప్రసాద్ ప్రారంభించారు. ఈ నెల 30 వరకు ప్రతి రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు కళాశాలలో దరఖాస్తులను పొందవచ్చు. ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్, అసోసియేట్ ప్రిన్సిపాల్ కె. శివ, విభాగాధిపతులు గణేష్, రమణ కుమార్, ఆఫీస్ సూపరింటిండెంట్ కె. శివరాం తదితరులు పాల్గొన్నారు. -
ఆగని అక్రమ మట్టి తరలింపు
మంగళవారం రాత్రి తరలించుకువచ్చిన చెరువు మట్టి ఎస్.రాయవరం : ఇటుక బట్టీలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసినా, రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా తమ బట్టీలకు అక్రమ మట్టి రవాణా ఆపబోమని ఇటుక బట్టీల యజమానులు యధావిధిగా మంగళవారం రాత్రి వమ్మవరం గ్రామంలో బట్టీల వద్దకు మట్టిని తరలించారు. యలమంచిలి కృష్ణాపురం చెరువులో అనుమతులు పొందినట్టు జేసీబీలను ఉపయోగించి దర్జాగా వమ్మవరానికి మట్టి తరలించుకు రావడం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. అధికారులు పర్యవేక్షించినా మట్టి తరలింపు ఆపకపోవడం పట్ల ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. అనకాపల్లి జిల్లా పోలీస్, అధికారులు విజిలెన్స్ ఉన్నతాధికారులకు బుధవారం మరో మారు ఫిర్యాదు చేశారు. -
వంతెన సంగతి మరిచారా?
భూమి పూజకు 17 నెలలు..నిర్మాణానికి ఇంకెన్నేళ్లు? నర్సీపట్నం– తుని మధ్య వెదుళ్ల గెడ్డపై కలగానే వంతెన నిర్మాణం తాండవ ఉప్పొంగితే రెండు జిల్లాల రాకపోకలు బంద్ గత ప్రభుత్వంలో నిధులు మంజూరైనా కాంట్రాక్టరు నిర్వాకంతో జరగని పనులు మరల రీశాంక్షన్తో పనులకు భూమి పూజ చేసిన స్పీకర్, కలెక్టరు రోడ్డు విస్తరణ చేసి వంతెన పనులు మరిచిన వైనం ఆర్భాటమేనా..? కూటమి ప్రభుత్వం ఆర్భాటమే తప్ప దానికి తగట్టుగా పనులు చేయడం లేదు. మమ్మల్ని విమర్శించారు. ఇపుడు మీరు చేసిందేంటి? స్పీకరు అయ్యన్న పాత్రుడు, కలెక్టరు విజయకృష్ణన్ స్వయంగా భూమి పూజ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా వంతెన పనులు మొదలు కాలేదు. దీనిని బట్టి చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోంది. – సాగిన లక్ష్మణమూర్తి, ఎంపీపీ నాతవరం మండలం రెండేళ్లయినా అభివృద్ధి ఊసు లేదు.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు కంటే రెడ్బుక్ రాజ్యాంగం అమలుపైనే దృష్టి పెట్టింది. స్పీకరు, కలెక్టరు స్వయంగా భూమి పూజ చేసిన పనులే ఈ విధంగా జరుగుతుంటే..మిగిలిన అభివృద్ధి పనుల మాటేమిటో? –లగుడు నాగేశ్వరరావు, మాజీ సర్పంచ్, వైఎస్సాన్సీపీ మండల శాఖ అధ్యక్షుడు నాతవరం : ఆర్భాటంగా రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు.. కానీ వంతెన నిర్మాణం పనులు మరిచారు. ఈ రోడ్డు పనులకు స్వయంగా అసెంబ్లీ స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు, కలెక్టరు విజయకృష్ణన్ 2024 నవంబరులో భూమి పూజ చేశారు. కానీ ఏడాదిన్నర గడిచినా వంతెన నిర్మాణం ఊసేలేదు. మండలంలో నర్సీపట్నం–తుని మధ్య గన్నవరం మెట్ట వద్ద అర్అండ్ రోడ్డుపై వెదుళ్లుగెడ్డ ప్రతి ఏటా వర్షాలు సమయంలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. గతంలో ఇక్కడ వెదుళ్లుగెడ్డ నీటి ఉధృతికి అనేక మంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో అర్అండ్బీ రోడ్డుపై వెర్రిగెడ్డ నీటి ప్రవాహాన్ని అప్పటి ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ స్వయంగా పరిశీలించారు. రోడ్డుపై వెదుళ్లు గెడ్డనీరు ప్రవాహంతో ఈ చుట్టుపక్కల గ్రామాలు వైబీ అగ్రహారం, గన్నవరం మెట్ట నీటి ముంపునకు గురికావడం, ఈ ప్రాంతీయులు బాధలు ఆయన చూశారు. ఈ సమస్యను అప్పటి సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో గన్నవరం మెట్ట వద్ద వెదుళ్లు గెడ్డపై వంతెన నిర్మాణం, శృంగవరం నుంచి 4 కిలోమీటర్లు కాకినాడ జిల్లా సరిహద్దు వరకు రోడ్డు విస్తరణ కోసం రూ.14 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో అప్పటి ఎమ్మెల్యే గణేష్ శంకుస్థాపన చేశారు. రోడ్డు విస్తరణకు సంబంధించి ఎ.శరభవరం, శృంగవరం మధ్య భూసేకరణ చేశారు. పనులు ప్రారంభించి పూర్తి చేయకుండా బిల్లులు రావంటూ సాకు చెప్పి అప్పటి టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ కాలయాపన చేశారు. ఆ పనులను మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రీశాంక్షన్ చేశామంటూ 2024 నవంబరులో ఈ రోడ్డుకు స్పీకరు అయ్యన్నపాత్రుడు, కలెక్టరు విజయకృష్ణన్ స్వయంగా భూమి పూజ చేశారు. అసంపూర్తిగా ఉన్న శృంగవరం నుంచి జిల్లా సరిహద్దు మధ్య అర్అండ్బీ రోడ్డు విస్తరణ పనులు చేశారు. కానీ ఈ రోడ్డు మధ్యలో గన్నవరం మెట్ట వద్ద వెదుళ్లుగెడ్డపై వంతెన నిర్మాణం పనులు నేటికీ ప్రారంభించలేదు. భూమి పూజ చేసి 17 నెలలు అవుతున్నా వంతెన పనులు ఊసెత్తలేదు. స్పీకరు, కలెక్టరు స్వయంగా భూమి పూజ చేయడంతో యుద్ధ ప్రాతిపదికన వంతెన నిర్మాణం చేస్తారు..ఏళ్ల నాటి సమస్య తీరుతుందని ఈ ప్రాంతీయలు ఆశించారు. కానీ వంతెన నిర్మాణం చేయకపోవడంతో ఈ ఏడాది కూడా వర్షాలు, తుఫాన్లు సమయంలో వెదుళ్లుగెడ్డ నీటి కష్టాలు తప్పవంటున్నారు. తాండవ ప్రాజెక్టు నుంచి స్పిల్వే గేట్లు ఎత్తినా, భారీ వర్షాలు కురిసినా వెదుళ్లుగెడ్డ రోడ్డుపై ఉప్పొంగి ప్రవహిస్తుంటుంది. నీటి ఉధృతి తగ్గేంత వరకు రెండు జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోతాయి. రాత్రి వేళల్లో కొత్తగా వచ్చే వాహనదారులకు నీటి ఉధృతి తెలియక దిగేయడంతో పలువురు కొట్టుకుపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తుపానుల సమయంలో అధికారులు వెదుళ్లుగెడ్డ వద్ద కాపలా పెట్టి ప్రమాదాలు జరగకుండా పోలీసులు దగ్గరుండి వాహనాలు పంపిస్తూ జాగ్రత్తలు చేపడుతుంటారు. ఈ విషయంపై ఆర్అండ్బీ జేఈ నాయుడుబాబును సంప్రదించగా వంతెనలు నిర్మాణం చేసేందుకు కాంట్రాక్టరు జాప్యమే కారణమన్నారు. ఈ సమస్య ఉన్నతాధికారులు దృష్టిలో ఉందన్నారు -
● కంచరపాలెం, ఎయిర్పోర్టు స్టేషన్ల పరిధిలో నాలుగు చోరీలు ● ఉదయం 7.30 నుంచి 11.30 మధ్యే చోటు చేసుకున్న వైనం
‘చైన్’చోరీలతో బెంబేలు గోపాలపట్నం: విశాఖనగరంలో ఒకే రోజు గంటల వ్యవధిలో నాలుగు చోట్ల జరిగిన చైన్ స్నాచింగ్లతో ప్రజలు హడలెత్తిపోయారు. కంచరపాలెం, ఎయిర్పోర్టు పోలీస్ స్టేషన్ల పరిధిలో బుధవారం ఉదయం 7.30 నుంచి 11.30 మధ్య నాలుగు చోట్ల చైన్ స్నాచర్లు చెలరేగిపోయారు. మహిళల మెడల్లో ఉన్న చైన్లను తెంచుకుపోయారు. బాధితులు పోలీసులు తెలిపిన వివరాలు.. మొదటి చోరీ.. ఉదయం 7.30 సమయంలో మర్రిపాలెం జ్యోతీనగర్ వద్ద పంచముఖి లక్ష్మి(62) కాయగూరలు కొనుగోలు చేసేందుకు వచ్చింది. 7.45 గంటలకు తిరుగుముఖం పడుతూ ఇంటి సందులో మలుపుతిరుగుతున్న సమయంలో కాపుకాసి ఉన్న దుండగుడు వెనక నుంచి వచ్చి మెడలోని గొలుసు తెంచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన లక్ష్మి గొలుసును గట్టిగా పట్టుకోవడంతో కొంత భాగం తెంచుకుపోయాడు. లాకెట్టు, చైన్లో సగభాగం తన చేతిలో ఉండిపోయింది. సుమారు రెండున్నర తులాల వరకు దుండగుడు లాక్కెళ్లిపోయినట్లు బాధితురాలు వాపోతోంది. రెండో చోరీ : పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద ఉదయం 8.05 గంటల సమయంలో రాజీవ్నగర్కు చెందిన నిడమల రత్నకుమారి విధులకు హాజరయ్యేందుకు బస్టాప్ సమీపంలోని సర్వీస్ రోడ్డులో ఆటో కోసం నిరీక్షిస్తోంది. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలో పుస్తెల తాడు, నల్లపూసల దండ తెంచుకెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే ఆమె అప్రమత్తం కావడంతో చేతిలో పుస్తెలు, నల్లపూసల దండ కొంతభాగం ఉండిపోయింది. మిగిలిన సుమారు రెండున్నర తులాలు తెంచుకుపోయాడు. మూడో చోరీ : ఉదయం 8.15 గంటల సమయంలో కంచరపాలెం జైభారత్నగర్ వద్ద ఎస్ కోట దరి జామి వెళ్లేందుకు వర్రి అరుణ బస్టాప్కు నడుస్తూ వస్తోంది. కాపుకాసిన దుండగుడు రెండు తులాల గొలుసు, రెండు తులాల నల్లపూసల దండ లాక్కుపోయాడు. నాలుగో చోరీ : విమాన్నగర్ వద్ద అదే ప్రాంతానికి చెందిన ఎం.అచ్చయ్యమ్మ(56) ఉదయం 11.30కు నగరంలో జరిగే ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు బస్టాప్ వద్ద నిరీక్షిస్తోంది. అక్కడే ఉన్న ఓ యువకుడు ఆమెను సమీపించాడు. బైక్పై మరో వ్యక్తి అక్కడికి వచ్చాడు. వెంటనే ఆమె మెడలో ఉన్న 5 తులాల నల్లపూసల దండ, చైన్ తెంచుకుని బైక్పై వెళ్లిపోయారు. గమనించిన ఓ వ్యక్తి తన బైక్తో వెంబడించే ప్రయత్నం చేసినా ఆ వ్యక్తిని ఢీకొట్టేందుకు యత్నించి తప్పించుకుపోయారు. కరాసా వద్ద బైక్ చోరీ : ఆ సమయంలోనే కరాసాకు చెందిన ఓ యువకుడి ద్విచ్రవాహనం చోరీకి గురయింది. కరాసా వద్ద నైట్ ఫుడ్ స్టాల్స్ ఉన్న చోట 10.30 సమయంలో పార్కింగ్ చేసిన తన బైక్ను ఎవరో దొంగిలించడంతో బాధితుడు వెంటనే వాట్సాప్ ఫిర్యాదుతోపాటు, స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు కూడా చేశాడు. తన బైక్తోనే ఈ చోరీలకు పాల్పడ్డారేమోనని బాధితుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఉదయం 7.30 నుంచి దొంగతనాలు జరుగుతుండటంతో ఈ వాహనం వాడి ఉండరని పోలీసులు చెప్తున్నారు. చైన్ స్నాచింగ్లపై బాధితుల ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్రమౌళి తెలిపారు. కంచరపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధితులు -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గృహోపకరణాలు దగ్ధం
చోడవరం: పట్టణ శివారు అన్నవరం ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ప్రధాన విద్యుత్ వైర్లపై చెట్లకొమ్మలు పడి షార్ట్ సర్క్యూట్ జరగడంతో పలు ఇళ్లలో గృహోపకరణాలు దగ్ధమై సుమారు రూ.10 లక్షల నష్టం జరిగింది. 40 ఇళ్లలో ఫ్యాన్లు, ఫ్రిజ్లు, ఇతర గృహోపకరణాలు కాలిపోవడంతో పాటు, ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం విద్యుత్ శాఖ ఏఈ రాజుతోపాటు సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఏఈని చుట్టుముట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన విద్యుత్లైన్లపై పలుచోట్ల చెట్ల కొమ్మలు తాకుతున్నాయని, దీనివల్ల సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడుతోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఏకంగా వైర్లపై కొమ్మలు పడి షార్ట్సర్క్యూట్తో తమ ఇళ్లలో ఫ్యాన్లు, ఫ్రిజ్లు, ఇతర గృహోపకరణాలు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మొక్కుబడిగా విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి చూసి పోవడమే తప్ప ఏ పనీ సక్రమంగా చేయడంలేదని ఆరోపించారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు. ఏఈ నిర్లక్ష్యం వల్లే... అన్నవరం సబ్స్టేషన్ పరిధిలో నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమై తరుచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్శాఖ ఏఈ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా గతంలో అనేక ఫిర్యాదులు కూడా వెళ్లాయి. మండల సమావేశాల్లో సైతం ఎంపీటీసీలు, వార్డుమెంబర్లు ఇక్కడ ఏఈపై ధ్వజమెత్తినా మార్పురాకపోవడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చర్యలుతీసుకుని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని చోడవరం పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
వ్యర్థాల తొలగింపునకు సమగ్ర కార్యాచరణ
తుమ్మపాల : ప్రతి గ్రామ పంచాయతీలోను పేరుకుపోయిన వ్యర్థాలను వెంటనే పూర్తిగా తొలగించి పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టరు విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ ఎంపీడీఓలు, పోలీస్, విద్యుత్, వైద్య, విద్య, రవాణా శాఖ అధికారులతో బుధవారం వెర్వేరుగా ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా కూడా వ్యర్థాలు లేకుండా సమగ్ర కార్యాచరణ చేపట్టాలన్నారు. వ్యర్థాల తొలగింపు కోసం అవసరమైన యంత్రాలు, సిబ్బంది, నిధులను సమకూర్చుకొని పనులను పురమాయించి వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి మండలంలో గార్బేజ్ ట్రాన్సిట్ స్టేషన్లు ఏర్పాటు చేసి, చెత్త సేకరణ, రవాణా వంటి వ్యవస్థను మరింత సమర్ధంగా నిర్వహించాలన్నారు. అన్ని వీధి దీపాలు సక్రమంగా వెలిగేలా చూసుకోవాలని, ఎక్కడైనా లోపాలు ఉంటే తక్షణమే మరమ్మతులు చేయాలన్నారు. ప్రతి ఇంటిలో సొంత మరుగుదొడ్లు ఉండేలా, వాటిని వినియోగించుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ పంచాయతీల్లో ఇంటి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని, వసూళ్ల లక్ష్యాలను చేరుకుని జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని సూచించారు. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు ఈ నెల 21 నుంచి జూన్ 04 వరకు జిల్లాలో జరగనున్న ఇంటర్మీడియట్ అడ్వానన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సమర్ధంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల కేంద్రంలోకి హాల్ టికెట్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్ప మొబైల్ ఫోన్లు, కాలిక్యులేటర్లు, ఐప్యాడ్, బ్లూటూత్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతింపబోమన్నారు. టాయిలెట్లు, వైద్య విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు పరిశీలన చేసుకోవాలన్నారు. మెడికల్ క్యాంపును ఏర్పాటు చేసి మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశిస్తూ సంబంధిత అధికారులను పరీక్షలు పారదర్శకంగా, జరిగేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా సజావుగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద తగిన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు, తాగునీరు, విద్యుత్, వైద్య సదుపాయాలు, శానిటేషన్ వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రవాణా సౌకర్యాలు సమకూర్చాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు ఆదేశించారు. అలాగే, ప్రశ్నాపత్రాల రవాణా, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ సుబ్బలక్ష్మి, డీఈవో అప్పారావునాయుడు, డీపీవో సందీప్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
గోల్డ్ హంటర్స్!
● ఉదయం 7.45 గంటలు.. జ్యోతి నగర్.. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లి మొదటి సవాల్ విసిరారు. ● ఉదయం 8.05 గంటలు.. పంజాబ్ హోటల్ జంక్షన్లో మహిళ మెడలోంచి చైన్ తెంచేసి పారిపోయి హడలెత్తించారు. ● ఉదయం 8.15 గంటలు కంచరపాలెం జయభారత్నగర్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళే లక్ష్యంగా చైన్ అపహరించిన దొంగలు రెప్పపాటులో మాయమయ్యారు. ● ఉదయం 11.30 గంటలు... విమాన్నగర్ బస్టాప్ వద్ద బస్ కోసం ఎదురు చూస్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కుని పరారైపోయారు. నగరంలో చైన్ స్నాచింగ్ కేసులు మార్చిలో 7 ఏప్రిల్లో 5 మే 13 వరకూ 4 సాక్షి, విశాఖపట్నం: మహానగరంలో ‘గోల్డ్’వేట మొదలైంది. గన్ పట్టుకున్న వేటగాడు అడవిలో పొంచి ఉన్నట్టు.. బైక్ ఎక్కిన దొంగలు.. జనం మధ్యే ‘స్నాచింగ్’పంజా విసిరారు. నాలుగు గంటల వ్యవధిలో 13 తులాల బంగారాన్ని కొట్టేశారు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న విశాఖ వీధులు ఇప్పుడు ‘గోల్డ్ హంటర్స్’దూకుడుతో ఉలిక్కిపడుతున్నాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలో, నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో హంటర్స్ చేసిన హడావుడి చూస్తుంటే.. పోలీసుల నిఘా వ్యవస్థకు గట్టి సవాల్ విసిరినట్టే కనిపిస్తోంది. టైమ్ ఫిక్స్.. టార్గెట్ గోల్డ్.! బుధవారం ఉదయం నుంచి జరిగిన చైన్స్నాచింగ్ కేసుల్లో దొంగల రూట్ మ్యాప్ చూస్తే ఎవరికై నా ఆందోళన కలగాల్సిందే. వచ్చింది ద్విచక్ర వాహనంపై.. పోయింది సుమారు 13 తులాల పసిడి. బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కు పరుగులు పెట్టారు. అయితే.. నాలుగు చోట్లా చేసింది ఒక్కరేనా.. లేదా అంతర్రాష్ట్ర ముఠా పనా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. ‘నిఘా’నేత్రాలు నిద్రపోతున్నాయా.? నగర రక్షణ కోసం సిటీలో ఏర్పాటు చేసిన ‘మూడో కన్ను(సీసీ కెమెరాలు)’అనేక చోట్ల రెప్పవాల్చిన విషయం చైన్ స్నాచింగ్ ముఠా పసిగట్టినట్లుందనే వదంతులు వినిపిస్తున్నాయి. సేఫ్ సిటీగా ఉన్న విశాఖ నగరం.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గోల్డ్ హంటర్స్ సిటీగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖ సిటీ పోలీస్ అధికారిక గణాంకాల ప్రకారం... నగర వ్యాప్తంగా 13,485 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అధికారిక రికార్డులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ డేటా, ఇటీవల పోలీస్ శాఖ నిర్వహించిన అంతర్గత ఆడిట్ నివేదికల ప్రకారం.. వీటిలో పోలీస్ శాఖవే కాకుండా ‘నేను సైతం’ప్రోగ్రామ్ కింద ప్రజలు, షాపుల యజమానులు పెట్టినవి కూడా ఉన్నాయి. వీటిలో ఎన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్కు సిగ్నల్ పంపుతున్నాయనే లైవ్ స్టేటస్ ద్వారా దాదాపు 40 శాతం అంటే 5,394 సీసీ కెమెరాలు మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయని గుర్తించారు. ఇదే.. దొంగలకు అనువుగా మారిందనే అనుమానాలు బలపడుతున్నాయి. పోలీసుల యాక్షన్ ప్లాన్ షురూ..! వరుస ఘటనలతో అప్రమత్తమైన నగర పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. గతంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే నిందితులు కావడంతో.. బుధవారం జరిగిన చోరీలు కూడా వారి పనేనని ప్రాథమికంగా నిర్ధారించారు. సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు, పనిచేస్తున్న కొన్ని కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల వేటలో నిమగ్నమయ్యారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు పెరిగినప్పటి నుంచి చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా జరుగుతుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. వీలైనంత త్వరగా గోల్డ్ హంటర్స్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. -
అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వెంకన్న
దేవరాపల్లి: అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా దేవరాపల్లికి చెందిన డి.వెంకన్న ఎన్నికయ్యారు. అమలాపురంలో ఈ నెల 11 నుంచి మూడు రోజుల పాటు జరిగిన అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నట్లు వెంకన్న బుధవారం స్థానిక విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వ్యవసాయ కార్మికులు, దళితులు, గిరిజనులు, వృత్తిదార్లు, సన్న,చిన్నకారు రైతులు పాల్గొన్న ఈ మహాసభలో పలు ప్రజా సమస్యలపై పోరాటాలు చేసేందుకు తీర్మానాలు చేశామన్నారు. దళితులపై దాడులు, కుల వివక్షను అరికట్టాలని, దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసినట్టు చెప్పారు. దళితులు, గిరిజనులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని వెంకన్న విమర్శించారు. క్రైస్తవ మతం తీసుకున్న దళితులను ఎస్సీలు కాదని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని వారి సర్టిఫికెట్లను రద్దు చేయించాలని చూస్తుండటాన్ని మహాసభలో తీవ్రంగా ఖండించినట్టు చెప్పారు.ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. -
బీసీ వసతిగృహ విద్యార్థినికి
అవార్డు ప్రదానంబీసీ సంక్షేమశాఖ మంత్రి సబిత నుంచి అవార్డు అందుకుంటున్న బీసీ వసతిగృహ విద్యార్థిని రుత్తల దుర్గ నర్సీపట్నం: ఇటీవల విడుదులైన టెన్త్ ఫలితాల్లో 574 మార్కులు సాధించిన బీసీ బాలికల వసతిగృహం విద్యార్థిని రుత్తల దుర్గ మంగళవారం రాష్ట్రస్థాయి అవార్డు అందుకుంది. టెన్త్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఎంజేపీ గురుకులాలు, బీసీ వసతిగృహాల విద్యార్థులకు అమరావతిలో జరిగిన కార్యక్రమంలో అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి సబిత, బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ ఎ.మల్లికార్జున్రావు, అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ చేతుల మీదగా విద్యార్థిని దుర్గ అవార్డు, ప్రశంసాపత్రాన్ని అందుకుంది. దుర్గను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో వసతిగృహం వార్డెన్ బి.వెంకటలక్ష్మి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
అందుబాటులో జనుము విత్తనాలు
అనకాపల్లి: చెరకు, కూరగాయ పంటలకు అవసరం మేరకు నీటి సదుపాయం కల్పించాలని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఇన్చార్జి ఏడీఆర్ టి.శ్రీలత తెలిపారు. మంగళవారం స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయంలో శాస్త్రవేత్తలతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పలు సూచనలు, సలహాలు అందించారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పంటలను బెట్ట నుంచి కాపాడటానికి పంట వ్యర్థాలతో మల్పింగ్ చేయాలి. ఖరీఫ్కు ముందు పచ్చిరొట్ట పైరు వేసుకోవాలి. వర్షాలు పడగానే విత్తుకోవడానికి వీలుగా విత్తనాలను ముందుగా సేకరించుకోవాలి. పరిశోధన స్థానంలో జనము విత్తనాలు ఎస్యూఐఎన్.037, జేఆర్జే 610 రకాలు కిలో రూ.130 చొప్పున అందుబాటులో ఉన్నాయి. విత్తనాల కోసం రైతులు సంప్రదించాలని సూచించారు. చెరకు మొక్క, కార్శి తోటలలో వరుసల మధ్య అంతర కృషి చేపట్టాలి. చెరకులో కొరడా తెగులు ఆశిస్తే ప్రొపికొనజోల్ 1 మి.లీ లేదా అజోక్సిస్ట్రోబిన్, టెబుకోనజోల్ 1 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. పీక పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే క్లొరాంట్రినిలిప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఖరీఫ్ పంటగా నువ్వులు వేసుకోవడానికి నేలను తయారు చేసుకుని అధిక దిగుబడినిచ్చే వైఎల్ఎం. 66, 146 వంటి రకాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. కూరగాయల్లో బొగ్గు కుళ్లు తెగులు ఆశించవచ్చని, నివారణకు లీటరుకు 3 గ్రాముల చొప్పున కాపర్ ఆక్సీక్లోరైడ్ను మొక్కమొదలు చుట్టూ నేల తడిచేలా పోయాలి. మామిడిలో పండు ఈగ నివారణకు 2 మి.లీ మిథైల్ యూజినాల్, 3 గ్రా, కార్బోప్యూరాన్ 3జి గుళికలను లీటరు నీటిలో కలిపిన ద్రావణాన్ని ప్లాస్టిక్ సీపాలో పోసి తోటలో అక్కడక్కడా చెట్ల కొమ్మలకు వేలాడ దీయాలి. ఖాళీ పొలాల్లో వేసవిలోతు దుక్కులు దున్నుకోవాలని ఆమె చెప్పారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు కె.వి.రమణమూర్తి, వి.గౌరీ, ఆర్.సరిత, వి.చంద్రశేఖర్, ఎ.అలివేణి తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ భవనాల పూర్తికి ప్రతిపాదనలు
రావికమతం : జిల్లాలో 9 ప్రాజెక్ట్ పరిధిలో నిర్మాణ దశలో ఉన్న 208 అంగన్వాడీ భవనాలను పూర్తి చేసేందుకు రూ.11 కోట్లు నిధులు మంజురూ చేయాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందజేసామని ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.సూర్యలక్ష్మి తెలిపారు. మంగళవారం స్దానిక ఐసీడీఎస్ కార్యాలయంలో మంగళవారం కిశోర వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె కిశోర వికాసంపై రూపొందించిన 18 అంశాలపై బాలికులకు అవగాహన కల్పించారు. తదనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ జిల్లా లో 9 ఐసీడీఎస్ ప్రాజెక్ట్లు పరిధిలో 1908 అంగన్వాడీ సెంటర్లు కొనసాగుతున్నాయని, వీటిలో నిర్మాణ దశలో ఉన్న అంగన్వాడీ భవనాలకు నిధులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపించామన్నారు. అలాగే 24 ఖాళీగా ఉన్న సూపర్ వైజర్ పోస్టులు భర్తీ చేయాలని కోరామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ఆయాలు, కార్యకర్తలకు సంబంధించి 236 మందిని నియమించడానికి నోటిఫికేషన్ విడుదల చేశామని ఆమె తెలిపారు. మే ఒక్కటి నుంచి జూన్ 9 వరకు వేసవి సెలవులలో కిశోర బాలికలకు కిశోర వికాసం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నామని, దీని ద్వారా కిశోర బాలికలకు వ్యక్తిగత పరిశుభ్రత, బాల్య వివాహాల వల్ల జరిగే అనర్థాలు, పోషకాహార ఆవశ్యకత గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీని కోసం ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలో 15 నుంచి 20 మందిని గ్రూపులుగా విభజించి మంగళవారం, శుక్రవారం సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సీడీపీవో మంగతాయారు, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎం. రమేష్ పాల్గొన్నారు. -
ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సు ప్రవేశ పరీక్షలు ప్రారంభం
పరీక్ష కేంద్రం నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు మాకవరపాలెం : ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సు ప్రవేశ పరీక్షలకు 273 మంది విద్యార్థులు హాజరయ్యారు. తామరం అవంతి ఇంజినీరింగ్ కళాశాలలో మంగళవారం నుంచి ఈ ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇంజినీరింగ్లో ప్రవేశాలకు ఈ నెల 18 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు ఈ నెల 20 వరకు పరీక్షలు జరుగుతాయని కళాశాల ప్రిన్సిపాల్ మోహన్రావు తెలిపారు. నిత్యం రెండు విడతల్లో జరిగే పరీక్షలకు గంటన్నర ముందుగా కేంద్రానికి హాజరుకావాలన్నారు. మొదటి రోజు 273 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. -
బస్సు మెకానిజంపై డ్రైవర్లకు అవగాహన
ఆర్టీసీ డ్రైవింగ్స్కూల్ల్లో డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్న మెకానికల్ ఇంజినీర్ అశ్విని అనకాపల్లి : నిరుద్యోగ యువతీ, యువతులకు ఉద్యోగ ఆవకాశాల్లో భాగంగా ప్రజారవాణాశాఖ(ఆర్టీసీ) ఆధ్వర్యంలో 13 వ డ్రైవింగ్ స్కూల్ బ్యాచ్కు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని ప్రజారవాణాశాఖ అనకాపల్లి డిపో గ్యారేజ్ మెకానికల్ ఇంజినీర్ అశ్విని అన్నారు. మంగళవారం డ్రైవర్లకు బస్సు మెకానిక్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డ్రైవర్లకు బస్సు మెకానిజంపై శిక్షణ, అవగహన కల్పించడం వల్ల వారిలో నైపుణ్యాన్ని వెలికితీయవచ్చన్నారు. కొన్ని సందర్భాల్లో బస్సులు మార్గమధ్యంలో ఆగిపోయినపుడు ఈ శిక్షణ వారికి ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో డ్రైవింగ్ స్కూల్ అసిస్టెంట్ బాపు నాయుడు, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్ జి.వి.రమణ పాల్గొన్నారు. -
సుమారు రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత
అనకాపల్లి : ఏజెన్సీ ప్రాంతం నుంచి అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట, జాతీయ రహదారి మీదుగా కారులో తరలిస్తున్న 194 కేజీల గంజాయితో పాటు(వీటి విలువ సుమారుగా రూ.97లక్షలు) కారు, ముగ్గురు వ్యక్తులు, మూడు సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాదీనం చేసుకున్నట్లు ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. తమ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గంజాయి రవాణాపై జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ, గంజాయి స్మగ్లర్లు ప్రత్యేక మార్గాల్లో రవాణా చేయడం జరుగుతుందని, గత ఏడాది కంటే ఈ ఏడాది గంజాయి(డ్రైయి) రవాణా తగ్గినప్పటికీ హషీష్ అయిల్ పెరిగిందన్నారు. ఈనెల 11న జిల్లాలో బుచ్చియ్యపేట పోలీస్స్టేషన్ పరిధిలో ఈగిల్ టీమ్, స్పెషల్ బ్రాంచ్ పర్యవేక్షణలో అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారం మేరకు బుచ్చియ్యపేట పోలీసులు బంగారుమెట్ట–అనకాపల్లి రోడ్డులోని గొన్నవానిపాలెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టామన్నారు. గంజాయితో వెళుతున్న కారుకు రూట్ మ్యాప్ ద్వారా వెళుతున్న సమయంలో బైక్ను నడుపుతున్న వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించగా, వెనుక కారులో 194 కిలోల గంజాయితో పాటు ఇద్దరు వ్యక్తులు పటుబడ్డారని తెలిపారు. చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గుమ్మాల పేరునాయుడు (గతంలో 6 కేసులు), అల్లూరి జిల్లా పెదబయలు మండలం, గజ్జేడు గ్రామానికి చెందిన మండిపల్లి సత్తిబాబు(గంజాయి సాగుదారు), చీడికాడ మండలం బైలపూడి గ్రామానికి చెందిన గొల్లవిల్లి గణేష్(కారు డ్రైవర్)ను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందుతుల కోసం గాలిస్తున్నామన్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి, డ్రగ్స్ పట్ల జీరో టాలరెన్స్ పాలసీని అనుసరిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఎక్కడైనా గంజాయి వినియోగిస్తున్నా, విక్రయిస్తున్నా తక్షణమే 112 లేదా 1972 టోల్ ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. రెండేళ్లలో జిల్లాలో గంజాయి రవాణా గణనీయంగా తగ్గిందని, ఈ ఏడాది ఇప్పటి వరకూ 46 కేసులు నమోదు చేసి, మొత్తం 1,177 కేజీల గంజాయిని సీజ్ చేయడం జరిగిందన్నారు. 7.14 లీటర్ల హషీష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రాసిక్యూషన్ విభాగంతో సమన్వయం ద్వారా ఈ ఏడాది 13 కేసుల్లో 24 మందికి శిక్షలు పడేలా చేశామని, ఇందులో 16 మందికి 10 నుండి 15 ఏళ్ల జైలు శిక్ష పడిందన్నారు. ఎన్డీపీఎస్ కేసుల్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా నేటి వరకూ రూ.1.25 కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశామని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, కొత్తకోట ఎస్ఐ ఎం.శ్రీనివాస్, బుచ్చయ్యపేట ఎస్ఐ ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. బుచ్చెయ్యపేట ఎస్ఐకు ఎస్పీ అభినందన బుచ్చెయ్యపేట: స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావును ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం అభినందించారు. బుచ్చెయ్యపేట రోడ్డులో సుమారు రూ.కోటి విలువ గల సుమారు 194 కిలోల గంజాయి, స్మగ్లర్లను చౌకచక్యంగా పట్టుకోవడంతో ఎస్ఐని సత్కరించారు.ఎస్ఐతో పాటు బుచ్చెయ్యపేట పోలీస్స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. -
ఎమ్మెల్సీ రవిబాబు దంపతులకు సత్కారం
సాక్షి,పాడేరు: పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్సీ డాక్టర్ కుంభా రవిబాబు దంపతులను, వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షురాలు,మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి,డాక్టర్ నర్సింగరావు దంపతులు ఘనంగా సన్మానించారు.అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్,అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్,అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎమ్మెల్యేలు శోభా హైమావతి, కరణం ధర్మశ్రీ, వెంకట్రామయ్య, మాజీ జీసీసీ చైర్పర్సన్ డాక్టర్ శోభా స్వాతిరాణి, వడ్డాది జెడ్పీటీసీ దొండా రాంబాబు, చింతపల్లి ఎంపీపీ అనుషాదేవి తదితర నేతలకు భాగ్యలక్ష్మి స్వాగతం పలికారు. -
ఇటుక బట్టీలపై విజిలెన్స్ దాడులు
ఎస్.రాయవరం : మండలంలో ఇటుక బట్టీలపై విజులెన్స్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. వమ్మవరం గ్రామాల్లో నిర్వహిస్తున్న ఇటుక బట్టీల యజమానులు అక్రమంగా చెరువు మట్టిని తరలించి ఇటుక తయారికి వినియోగిస్తున్నారని మంగళవారం సాక్షి దినపత్రికలో ‘హోంమంత్రి ఇలాకాలో మట్టి మాఫియా’ అనే శీర్షికన వార్త వెలువడింది. ఈ మేరకు విజిలెన్స్ అధికారులు స్పందించి వమ్మవరం ఇటుక బట్టీలపై దాడులు నిర్వహించారు. మట్టి నిల్వలను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. మట్టి ఎన్ని క్యుబిక్మీటర్లు ఒక్కో బట్టీవద్ద ఉన్నదీ, ఆ యజమాని ఎక్కడ నుంచి మట్టి తరలించారనే వివరాలు నమోదు చేసుకుని కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఈ తనిఖీలల్లో మైన్ ఇన్స్పెక్టర్ సత్యమూర్తి, నర్సీపట్నం ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, సీఎస్డీటీ సూరి స్థానిక వీఆర్ఏలు పాల్గొన్నారు. -
మహిళా భద్రతకు పాటుపడాలి
నర్సీపట్నం : మహిళా భద్రతపై మహిళా పోలీసు సిబ్బంది దృష్టిసారించాలని, మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాల నియంత్రణకు మహిళా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని అనకాపల్లి మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ, నర్సీపట్నం ఇన్ఛార్జీ డీఎప్పీ ఈ.శ్రీనివాసులు సూచించారు. స్థానిక ప్రవేటు కళ్యాణమండపంలో డివిజన్లోని మహిళా పోలీసులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్య వివాహాలను ఆరికట్టేందుకు కృషి చేయాలని, మహిళల రక్షణపై పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రచార రూపంలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన శక్తి యాప్ అవశ్యకతను మహిళలు, బాలికలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నర్సీపట్నం టౌన్, రూరల్ సీఐలు గపూర్, రేవతమ్మ, పాయకరావుపేట సీఐ శంకర్రావు, డివిజన్ పరిధిలో మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
వందో రోజు కొనసాగిన దళిత రైతుల దీక్షలు
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్ల దళిత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు మంగళవారం వందవ రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా విదసం రాష్ట్ర కన్వీనర్ బూసి వెంకటరావు మాట్లాడుతూ ఎటువంటి పరిహారం ఇవ్వకుండా దళిత రైతులకు చెందిన డీ పట్టా భూములను లాక్కొనేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం దారుణమన్నారు.దళితులు దీక్షలు చేపట్టి వంద రోజులైనా కూటమి నేతలు పట్టనట్టు వ్యవహరించడం శోచనీయమన్నారు.నిరుపేదలైన దళితుల భూముల్ని లాక్కొంటున్న ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు వేలాది ఎకరాలకు దోచిపెడుతోందని విమర్శించారు.పంచదార్ల రైతులకోసం అవసరమైతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేపడతామని తెలిపారు.అనంతరం దీక్ష శిబిరం వద్ద పలువురు దళిత సంఘాలు,విదసం నేతలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐడీ బాబు,జి.దేముడు నాయుడు,చందక రామకృష్ణ,ధోనీ కాసియా,రేబాక రాము,ఎం.డి. రాజు,సూర్య,శివ,ఆర్ కృష్ణ,నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
కాఫీ తాగుతూ.. కార్గో చూస్తూ..
దేశంలోనే ఎంతో ప్రత్యేకం దేశంలో అనేక సముద్రతీర ప్రాంతాల్లో ప్రొమెనేడ్లను అభివృద్ధి చేశారు. పుదుచ్చేరిలో రాక్ బీచ్ ప్రాంతంలో కిలోమీటరుకుపైగా ఉన్న బీచ్ రాక్ ప్రొమెనేడ్ ప్రసిద్ధి చెందింది. ఇక్కడ పర్యాటకులు హాయిగా సేద తీరేందుకు ఏర్పాట్లు చేశారు. కేఫ్ల్లో కాఫీ తాగుతూ సముద్ర అందాలను తిలకించే వీలుంది. ఇక ముంబైలో 3 కిలోమీటర్ల పొడవైన ‘క్వీన్స్ నెక్లెస్ ఆర్క్’ముంబై డ్రైవ్ పేరుతో ప్రసిద్ధి చెందింది. ముంబై కోస్టల్ రోడ్ ప్రొమెనేడ్ ఏకంగా 7.5 కిలోమీటర్ల పొడవుతో షియోన్ పార్క్ నుంచి షిరోన్ పార్క్ వరకూ అభివృద్ధి చేశారు. ఇక కోల్కతా వద్ద నది తీరం వెంబడి విహార ప్రదేశాన్ని అభివృద్ది చేయగా.. కొచ్చి వద్ద బ్యాక్ వాటర్ వద్ద ఉన్న నడక మార్గం ఎంతో ప్రసిద్ధి చెందింది. అయితే.. విశాఖ ప్రొమెనేడ్ మాత్రం వీటన్నింటికీ భిన్నం. సముద్ర అందాలను ఆస్వాదించడంతో పాటు, నౌకాశ్రయంలో జరిగే లైవ్ వ్యాపార కార్యకలాపాలను ప్రత్యక్షంగా చూసే అవకాశం కేవలం విశాఖ పబ్లిక్ ప్రొమెనేడ్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: సముద్ర తీరంలో చల్లని గాలిని ఆస్వాదిస్తూ, వేడి వేడి కాఫీ తాగుతూ.. భారీ నౌకల్లో కార్గో హ్యాండ్లింగ్ ఎలా జరుగుతుందో చూడాలని ఉందా? సముద్రపు అలల సవ్వడి వింటూ... విదేశాల నుంచి వచ్చే క్రూయిజ్ పర్యాటకులకు చిరునవ్వుతో హాయ్ చెప్పాలని భావిస్తున్నారా? భారీ నౌకల్లోకి సరుకుల ఎగుమతులు, దిగుమతులు ఎలా చేస్తారో ఎలాంటి అనుమతులు లేకుండానే దగ్గరి నుంచి చూడాలని ఉందా?.. విశాఖ నగర వాసులకు ఈ కోరికలన్నీ త్వరలోనే తీరనున్నాయి. నగర పౌరుల కోసం విశాఖ పోర్టు అథారిటీ(వీపీఏ) సరికొత్త పర్యాటక కానుకను సిద్ధం చేసింది. విశాఖ వాసులకు పర్యాటక కానుక ఏకంగా రూ.16 కోట్లతో 600 మీటర్ల పొడవైన అందమైన ‘పబ్లిక్ పోర్ట్ ప్రొమెనేడ్’ను పోర్టు అధికారులు నిర్మించారు. తీర ప్రాంత పర్యాటక మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, ప్రజలకు ఆకర్షణీయమైన విహార ప్రదేశాలను అందించే లక్ష్యంతో మంగళవారం విశాఖ పోర్టు ఇన్చార్జి చైర్మన్ డాక్టర్ ఎం.అంగముత్తు ఈ ప్రొమెనేడ్ను ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పచ్చటి ల్యాండ్స్కేపింగ్తో దీనిని అత్యంత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఎటువంటి ప్రవేశ రుసుం లేకుండానే సముద్రతీరంలో వాకింగ్ చేసుకునే వెసులుబాటు, చిన్నారులు ఆడుకునేందుకు ప్రత్యేక ఆటస్థలం, అలాగే సువిశాలమైన పార్కింగ్ సదుపాయం ఇక్కడ కల్పించారు. ఈ నెలాఖరు నుంచి ఈ ప్రదేశం నగర ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుందని చైర్మన్ అంగముత్తు తెలిపారు. క్రూయిజ్ టెర్మినల్కు సమీపంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం పక్కన ఉన్న దారి గుండా ఈ ప్రొమెనేడ్ను చేరుకోవచ్చు. లైవ్ మారిటైం వీక్షణ సాధారణంగా ఏ పోర్టులో జరిగే కార్యకలాపాలనైనా సామాన్యులు దగ్గరి నుంచి చూసే అవకాశం ఉండదు. కానీ, విశాఖలో మాత్రం పోర్టులో జరిగే సముద్ర వ్యాపార కార్యక్రమాలను ప్రజలు లైవ్గా వీక్షించేలా ఈ ప్రొమెనేడ్ను డిజైన్ చేయడం విశేషం. భారీ నౌకల నుంచి సరుకుల రవాణా, అంతర్జాతీయ క్రూయిజ్ల రాకపోకలను ప్రజలు సురక్షితంగా చూసి ఆనందించేందుకు వీలుగా ఇక్కడ ప్రత్యేకమైన డెక్స్ను ఏర్పాటు చేశారు. -
‘మన రిజిస్ట్రేషన్–మన బాధ్యత’తో రిజిస్ట్రేషన్ సేవలు చేరువ
సబ్బవరం: రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడానికి మన రిజిస్ట్రేషన్–మన బాధ్యత కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ జి.బాలకృష్ణ అన్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా రిజిస్ట్రార్ కె.మన్మధరావు, సబ్ రిజిస్ట్రార్ జిలానీబేగంతో కలిసి ప్రజల నుంచి పలు సమస్యలపై వినతులు స్వీకరించారు. నిషేధిత భూములు, ఇనాం భూములు, సర్వర్ సమస్యలు, అధిక మార్కెట్ విలువల నిర్ణయంపై ప్రజలు అర్జీలు దాఖలు చేశారు. రిజిస్ట్రేషన్ సేవల వికేంద్రీకరణ, సందేహాల నివృత్తి, సలహాలు, సూచనల స్వీకరణ, సమస్యల పరిష్కారంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా నర్సింగరావు మాట్లాడుతూ ఆరిపాక ప్రాంతంలోని మారుమూల భూములకు అధిక మార్కెట్ విలువలు నిర్ణయించారని, వాటిని తగ్గించాలని కోరారు. పైడివాడ అగ్రహారం మాజీ సర్పంచ్ దాసరి వెంకటరమణ మాట్లాడుతూ గ్రామంలోని లే అవుట్ భూములను తిరిగి రైతులు ఆక్రమించడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయన్నారు. దీనిపై స్పందించిన అధికారులు ఆర్డీవో కోర్డులో కేసులు దాఖలు చేయాలని సూచిస్తూ అవసరమైన మార్గదర్శకాలు అందిస్తామని భరోసానిచ్చారు. రిజిస్ట్రేషన్ రైటర్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ శేఖరమంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ వారంలో రెండు మూడు రోజులు సర్వర్లు పనిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. దీనిపై జిల్లా రిజిస్ట్రార్ స్పందిస్తూ ఇతర శాఖల సర్వర్ సమస్యలు, ఆధార్ సీడింగ్ లోపాల వల్ల ఈ సమస్య వస్తోందని, సంబంధిత శాఖల దృష్టికి తీసుకు వెళ్తామన్నారు. అనకాపల్లి జిల్లాలో ప్రతి మంగళవారం, శుక్రవారం షెడ్యూల్ ప్రకారం అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘మన రిజిస్ట్రేషన్–మన బాధ్యత’కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. -
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
ఆర్ఏఆర్ఎస్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న కార్మికులు అనకాపల్లి: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యాక్షుడు గంటా శ్రీరామ్ డిమాండ్ చేశారు. స్థానిక ఆర్ఏఆర్ఎస్ కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్ఏఆర్ఎస్ కార్మికులు మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకూ కార్మికులకు అండగా ఉండి పోరాటం సాగిస్తామని చెప్పారు. మోడీ ప్రభుత్వ నిరంకుశ పాలన వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, లేబర్ కోడ్స్ పూర్తిగా రద్దయ్యే వరకు ప్రతి కార్మికుడు ప్రత్యక్షంగా ఉద్యమాల్లో పాల్గొనాలన్నారు. అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రంలో డైలీ వెజ్ కార్మికులకు వేతనాలు వెంటనే చెల్లించాలని, లేకపోత ఆందోళనకు సిద్ధమవుతామని చెప్పారు. ఈకార్యక్రమంలో సీఐటీయూ మండల కన్వీనర్ కాళ్ళ తేలయ్యబాబు, నాయకులు వారాది సత్యనారాయణ, లక్ష్మి, ప్రసన్న, అనురాధ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
అక్కరకు రాని అగ్రిల్యాబ్లు
రైతన్నకు దూరమైన భూసార పరీక్షలు ఏటా ఖరీఫ్ సీజన్కు ముందే మట్టి నమూనాలు సేకరణ ఈ ఏడాది ప్రశ్నార్థకంగా మారిన మట్టి పరీక్షలు చంద్రబాబు ప్రభుత్వంలో అగ్రి ల్యాబ్లు నిర్వీర్యం అందని నిధులు..సిబ్బంది కొరతతో అవస్థలుసాక్షి, అనకాపల్లి : జిల్లాలోని అగ్రిల్యాబ్లు రైతులకు అక్కరకు రాకుండా నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. కొన్ని ల్యాబ్ల్లో ఇతర జిల్లాల నుంచి తెచ్చిన నమూనాలను పరీక్షిస్తున్నారు. గత ప్రభుత్వంలో ఖరీఫ్ సీజన్కు నెలకు ముందే భూసార పరీక్షలను చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 2024 ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా 32,584 మట్టి పరీక్షలు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనకాపల్లి జిల్లాలో గతే ఏడాది 25,052 పరీక్షలు చేసి రైతులకు ఫలితాల వివరాలు అందించారు. ఈ ఏడాది అనకాపల్లి జిల్లాలో ఇంకా లక్ష్యమే నిర్దేశించుకోలేదు.అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం, చోడవరం, అల్లూరి జిల్లా అరకులో మాత్రమే అగ్రిల్యాబ్లు వినియోగంలో ఉన్నాయి. అది కూడా బయట జిల్లాల మట్టి నమూనాలను పరీక్షిస్తున్నారు. నిర్లక్ష్యం నీడలో భూసార పరీక్షలు సాధారణంగా మార్చి నుంచే మట్టి నమూనాల సేకరణ ప్రక్రియ ప్రారంభం కావాలి. ఏప్రిల్ నెలాఖరుకల్లా పరీక్షలు పూర్తి చేసి, మే మొదటి వారంలో ఫలితాలను రైతులకు అందించాలి. తద్వారా తమ భూమికి ఏ రకమైన ఎరువులు అవసరం, ఏ పంటలు వేస్తే దిగుబడి వస్తుందో రైతులకు ఒక అవగాహన ఉంటుంది. కానీ అనకాపల్లి జిల్లాలో మే రెండో వారం గడుస్తున్నా ఇప్పటివరకు లక్ష్యాలను కూడా నిర్దేశించకపోవడం గమనార్హం. ఖరీఫ్ సాగుపై ప్రభావం భూమిలో సారం తగ్గడం, రసాయనిక ఎరువుల అధిక వినియోగం వల్ల నేల స్వభావం మారుతోంది. ఈ తరుణంలో సమగ్ర భూసార పరీక్షలు నిర్వహించకపోతే పంట దిగుబడి తగ్గడమే కాకుండా, చీడపీడల తాకిడి పెరిగే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత ప్రభుత్వంలో మేలైన సేవలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గానికి ఒక ల్యాబ్ చొప్పున ఏర్పాటు చేశారు. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంలో అగ్రిల్యాబ్ ప్రారంభించారు. యలమంచిలి, మాడుగులలో నియోజకవర్గ స్థాయి నూతన భవనాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ల్యాబ్ సుమారు రూ. 65 లక్షల ఖర్చుతో అత్యాధునిక అగ్రి ల్యాబ్లను నిర్మించారు. ఇక్కడ కేవలం మట్టి పరీక్షలే కాకుండా, విత్తనాల నాణ్యత, పురుగుమందుల పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంది. నేడు సిబ్బంది కొరత, నిధుల నిలిపివేత చంద్రబాబు ప్రభుత్వంలో ప్రస్తుతం జిల్లాలోని నర్సీపట్నం, చోడవరం ల్యాబ్లు పూర్తిస్థాయిలో వినియోగంలో లేవు. సిబ్బంది కొరత, నిధుల నిలిపివేత కారణంగా ఈ భవనాలు కేవలం అలంకారప్రాయంగా దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఇతర జిల్లాల నుంచి తెచ్చిన నమూనాలను పరీక్షిస్తున్నారే తప్ప, స్థానిక రైతులకు సేవలు అందడం లేదు. ఖరీఫ్ సమయం దగ్గరపడుతుండడంతో రైతులు ఏ ఎరువులు వాడాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, వెంటనే నిధులు విడుదల చేసి అగ్రి ల్యాబ్లను పునరుద్ధరించాలని, యుద్ధ ప్రాతిపదికన భూసార పరీక్షలు నిర్వహించి ఫలితాలు అందించాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి కౌంట్ డౌన్ మొదలైంది. సరిగ్గా మరో నెలన్నర రోజుల్లో రైతులు పొలం పనుల్లో నిమగ్నం కావాల్సి ఉంది. అయితే, పంట సాగులో అత్యంత కీలకమైన భూసార పరీక్షల విషయంలో జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ముందస్తుగానే మట్టి నమూనాల సేకరణ పూర్తి చేసి ఫలితాలు అందించే వారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలనలో అగ్రి ల్యాబ్లు నిర్వీర్యమై, పరీక్షలు అటకెక్కాయి. ఖరీఫ్ దగ్గర పడుతున్నా వ్యవసాయ శాఖలో పూర్తి సన్నద్ధత కనిపించడం లేదు. గత ప్రభుత్వంలో జిల్లాలో 3 అగ్రిల్యాబ్ల సేవలు రైతు పొలాల్లో సేకరించిన మట్టి నమూనాలకు 12 రకాల పరీక్షలు 2024 ఏడాదిలో జిల్లా వ్యాప్తంగా 32,584 మట్టి పరీక్షలు గతేడాదిలో 25,052 నమూనాలు మాత్రమే సేకరణ -
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత లక్ష్యం
మాట్లాడుతున్న కలెక్టర్ విజయ కృష్ణన్ తుమ్మపాల: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల్లో శత శాతం ఫలితాలు సాధించడం లక్ష్యమని కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదో తరగతి పరీక్ష ఫలితాలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించి, ప్రతి మండలంలో ఉత్తీర్ణత, ఫెయిల్ శాతాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫలితాల్లో వెనుకబడిన మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాలనివిద్యశాఖ అధికారులను ఆదేశించారు. ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావునాయుడు, ఎంఈవోలు పాల్గొన్నారు.రేపు ఎస్సీ కమిషన్ సభ్యుడు జిల్లా పర్యటన తుమ్మపాల : రాష్ట్ర షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యుడు రావాడ సీతారామ్ ఈ నెల 14న జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారిత అధికారి బి.రామానందం ఒక ప్రకటనలో మంగళవారం తెలిపారు. అదే రోజు పట్టణంలో గుండాల జంక్షన్ వద్ద శంకరన్ మీటింగ్ హాలులో ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఫిర్యాదులు స్వీకరించనున్నారని, అనంతరం దేవరాపల్లి మండలం, మాడుగుల మండలాల్లో పలు సర్వే నంబర్ల గల భూములను స్థల పరిశీలన చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఎస్సీ కులస్తులకు సంబంధించి తమ సమస్యలను వినతుల రూపంలో అందించవచ్చని పేర్కొన్నారు. -
కన్నీట్ సుడులు
నీట్ రద్దుతో విద్యార్థుల కన్నీటి పర్యంతం ప్రభుత్వ నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం రెండేళ్ల శ్రమ బుగ్గిపాలేనని ఆవేదన రెండేళ్ల కష్టం.. ఎన్నో ఆశలు.. ఒక వైద్య సీటు కోసం జీవితాన్నే పుస్తకాలకే అంకితం చేసిన లక్షలాది విద్యార్థుల కలలను నీట్ రద్దు నిర్ణయం ఒక్కసారిగా ఛిద్రం చేసింది. ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తుండగా.. మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి విద్యార్థులను తీవ్ర మానసిక ఆందోళనలోకి నెట్టేసింది.సాక్షి, విశాఖపట్నం/మద్దిలపాలెం : వైద్యుడై సమాజానికి సేవ చేయాలని, తెల్లకోటు వేసుకుని స్టెతస్కోప్తో రోగి నాడి పట్టుకోవాలని.. లక్షలాది మంది విద్యార్థులు రెండేళ్లుగా కంటిమీద కునుకు లేకుండా శ్రమించారు. మే 3వ తేదీన పరీక్ష రాసి బయటకు వచ్చేటప్పుడు, వారి కళ్లలో ఒక రకమైన సంతృప్తి.. ’అమ్మా, నాన్నా.. నేను డాక్టర్ అవుతాను’ అన్న ధీమా. కానీ, ఆ సంతోషం చిటికెలో ఆవిరైపోయింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నీట్ యూజీ 2026 రద్దు నిర్ణయం, లక్షలాది మంది విద్యార్థుల గుండెల్లో గునపమై దిగినట్టయింది. ప్రతిభావంతులు బలి రాజస్థాన్లో వెలుగు చూసిన ’పేపర్ లీక్’ ఉదంతం దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ పునాదులను కదిలించింది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు కేంద్రం ఈ కేసును సీబీఐకి అప్పగించడం, పరీక్షను రద్దు చేయడం సరైన నిర్ణయమే కావచ్చు. కానీ, అక్రమాలకు పాల్పడిన కొందరు స్వార్థపరుల వల్ల, రాత్రింబవళ్లు కష్టపడి చదివిన లక్షలాది మంది సాధారణ విద్యార్థులు ఇప్పుడు అనిశ్చితిలో పడిపోయారు. ఆగిపోయిన కల.. ఆవిరైన శ్రమ చిన్న చిన్న గదుల్లో బందీలై, పుస్తకాలే ప్రపంచంగా బతికిన విద్యార్థుల ఆవేదన వర్ణనాతీతం. ‘రెండేళ్ల శ్రమ.. వేల గంటల సాధన.. అంతా ఒక్క నిర్ణయంతో బూడిదలో పోసిన పన్నీరైంది. మళ్లీ అదే ఏకాగ్రతతో పుస్తకాలు పట్టగలమా? ఆ ఉత్సాహం మళ్లీ వస్తుందా?’ అని విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తల్లిదండ్రుల పరిస్థితి మరింత దయనీయం. తమ పిల్లల చదువు కోసం రెక్కల కష్టం ధారబోసి, కోచింగ్ సెంటర్లకు రూ.లక్షలు కుమ్మరించిన వారు, ఇప్పుడు తమ బిడ్డల నిరాశను చూసి తట్టుకోలేకపోతున్నారు. కొంతమంది విద్యార్థులు కన్నీళ్లు పెట్టుకుంటుండగాం తల్లిదండ్రులు వారిని ఓదార్చలేని పరిస్థితి నెలకొంది. మా తప్పేంటి? నిజాయితీగా చదివి, కష్టపడి పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థులు ఇప్పుడు మళ్లీ అదే ఒత్తిడిని భరించాల్సి వస్తోంది. ఒకరి అక్రమంం లక్షల మందికి శిక్షగా మారిందనే భావన విద్యార్థుల్లో కనిపిస్తోంది. ‘మళ్లీ చదవాలి.. మళ్లీ ఒత్తిడి భరించాలి.. మళ్లీ పరీక్ష హాల్లో కూర్చోవాలి’.. అనే ఆలోచన వారిని మానసికంగా అలసటకు గురిచేస్తోంది. ఎన్టీఏ భరోసా సరిపోతుందా? రీ–ఎగ్జామ్ కోసం కొత్తగా దరఖాస్తు చేయక్కర్లేదని, ఫీజు కట్టనవసరం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చెబుతోంది. కానీ, విద్యార్థులకు కావాల్సింది ఆర్థిక వెసులుబాటు కాదు, మానసిక స్థైర్యం. ఒకసారి రాసిన పరీక్షను, అది కూడా లీకేజీ మరకల మధ్య మళ్లీ రాయాల్సి రావడం అంటే, ప్రతిభావంతులైన విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయడమే. వ్యవస్థ మారేది ఎప్పుడు? ఒక పేపర్ లీక్.. ఒక రద్దు.. వేలాది మంది విద్యార్థుల కన్నీళ్లు. ప్రతి ఏటా ఏదో ఒక రూపంలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న అక్రమార్కులకు కఠిన శిక్ష పడాల్సిందే. ఈ రద్దు నిర్ణయం వ్యవస్థను ప్రక్షాళన చేస్తుందేమో కానీ, విద్యార్థుల మనసులకు తగిలిన గాయాన్ని మాత్రం అంత సులభంగా మాన్పలేదు. కొత్త షెడ్యూల్ రావచ్చు.. కొత్త హాల్ టికెట్లు జారీ అవ్వొచ్చు.. కానీ, పోగొట్టుకున్న సమయాన్ని, మానసిక ప్రశాంతతను మళ్లీ తెచ్చి ఇచ్చేది ఎవరు? నీట్ పరీక్ష రద్దు చేయడం దారుణం.. నీట్ పరీక్ష రద్దు చేయడం దారుణం. ఉత్తరాది రాష్ట్రాల్లో నీట్ పరీక్ష పేపర్ లీకేజీ పరిపాటిగా మారింది. నీట్ నిర్వహణలో లోపాన్ని గుర్తించకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టడం ఎన్డీఏ ప్రభుత్వానికి తగదు. మా పాపతో పాటు ఎంతో మంది విద్యార్థులు కష్టపడి ఏడాది పాటు ప్రిపేరు అయ్యారు. తీరా పరీక్ష రాసిన తరువాత పరీక్ష రద్దు చేయడం సరికాదు. ఈ విధమైన చర్య విద్యార్ధుల భవిష్యత్తును దెబ్బతీస్తుంది. ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరుతున్నాను. – వి.వి.ఎన్.హరికృష్ణ, విద్యార్థిని తండ్రి, నర్సీపట్నం -
తాటి చెట్టుపై నుంచి పడి యువకుడి మృతి
పాయకరావుపేట : పట్టణానికి చెందిన యువకుడు తాటి చెట్టు పై నుంచి పడి మృతి చెందినట్టు ఏఎస్ఐ గోవిందు తెలిపారు. పట్టణంలో రాజుగారిబీడుకు చెందిన పంజాబీ పవన్ కుమార్ (21) తాటిముంజులు తీయడం కోసం స్థానికంగా గల తాటిచెట్టు ఎక్కి 40 అడుగులు ఎత్తు నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితుల సహాయంతో తుని ఏరియా ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఏఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. -
యువకుడి అనుమానాస్పద మృతి
నర్సీపట్నం : నర్సీపట్నం మండలం, గబ్బాడ గ్రామ సమీపం నెల్లిమెట్ట వద్ద యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు రూరల్ ఎస్ఐ రాజారావు తెలిపారు. రోలుగుంట మండలం, బుచ్చింపేట గ్రామానికి చెందిన లాలం సాయి కుమార్ (30) ఈ నెల 10వ తేదీ సాయంత్రం అదే గ్రామానికి చెందిన సతీష్, రాజేష్, నానాజీలతో కలిసి గబ్బాడ గ్రామం, నెల్లిమెట్ట వద్ద మద్యం సేవించినట్టు ఎస్ఐ తెలిపారు. అనంతరం మృతుడు సాయికుమార్, రాజేష్ బైక్పై నర్సీపట్నం వైపు రావడం జరిగిందన్నారు. బైక్పై వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి సాయికుమార్ మృతి చెందినట్టు ఎస్ఐ తెలిపారు. మృతుడి భార్య లాలం రాజ్యలక్ష్మి సాయికుమార్ మృతిపై అనుమానం వ్యక్తి చేయడంతో ఆ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలి
అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలంటు రైతుల నిరసన భూసేకరణకు వ్యతిరేకంగా రైతుల నిరసన తుమ్మపాల: పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం ద్వారా ప్రజల నుండి స్వీకరించిన ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోను రీఓపెన్ కాకూడదని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో ఆమెతో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్, మండల, గ్రామ, వార్డు స్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి వారితో నేరుగా మాట్లాడాలన్నారు. పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించి దరఖాస్తుదారునికి తెలియజేయాలన్నారు. ఈ సందర్భంగా పీజీఆర్ఎస్కు 123, రెవెన్యూ క్లినిక్కు 145 మొత్తం 268 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లను తక్షణం నిలిపేయాలి.. ఏళ్ల తరబడి సాగులో ఉన్న రైతుల భూములకు అనధికారక లేఅవుట్ చూపించి తప్పుడు పద్ధతిలో చేస్తున్న రిజిస్ట్రేషన్లను తక్షణమే నిలిపివేసి రైతులకు రక్షణ కల్పించాలంటు పరవాడ మండలం దేశపాత్రునిపాలెం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి వినతిపత్రం అందించారు. గ్రామంలో సర్వే నంబర్ల 274, 276, 279, 290, 291, 298, 347లో మొత్తం 60 ఎకరాల రైతుల భూమిలో కొంత భూమిని కొనుగోలు చేసిన ఓ ప్రైవేటు రియల్టర్ మిగిలిన రైతుల భూములను కూడా కలిపి అనధికారక లేఅవుట్ వేసినట్లు తెలిపారు. అనధికారక జీపీఏ పత్రాలతో ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేస్తూ రైతుల భూముల్లోకి వచ్చి ముప్పుతిప్పలు పెడుతున్నారని, రౌడీమూకలతో భూముల్లోకి వచ్చి వివాదాలు సృష్టిస్తున్నట్లు తెలిపారు. తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నా పోలీసులు సివిల్ వివాదం అంటూ చేతులు దులుపుకోవడం, అధికారులు జీపీఏలతో కొనసాగిస్తున్న రిజిస్ట్రేషన్లను నిలిపివేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు గ్రామాల్లో విచారణ చేపట్టి తమ భూములకు సంబంధించి సృష్టిస్తున్న తప్పుడు పత్రాలను రద్దు చేసి న్యాయం చేయాలని కోరారు. సాగు భూములను కాపాడాలి.. ఎస్ఈజెడ్ నిర్మాణం కోసం కె.కోటపాడు మండలం పలు గ్రామాల్లో చేపడుతున్న బలవంతపు భూసేకరణ నిలిపేసి సాగు భూములను కాపాడాలంటు ఏపీ రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా నాయకులు రైతులతో కలిసి కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. జిల్లాలో అత్యధిక రిజర్వాయర్లు కలిగి ప్రతి ఎకరం నీటి సౌకర్యంతో నిత్యం పంటలు పండే చోట ఎస్ఈజెడ్ అంటు భూములను సేకరించి కంపెనీలతో కలుషితం చేయడం మానుకోవాలన్నారు. అచ్యుతాపురం, పరవాడ, నక్కపల్లి ప్రాంతాల్లో ఇప్పటికే వేల ఎకరాల భూముల సేకరణ జరిగిందని, జిల్లాలో మిగిలిన భూములను వ్యవసాయ ఆధారిత ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఎస్పీ కార్యాలయానికి 65 ఆర్జీలు అనకాపల్లి : ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 65 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట పరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య వేధింపులు, ఇతర విభాగాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయన్నారు. వాస్తవాల ఆధారంగా సమస్యలు పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్, సీఐ సేనం రమేష్ పాల్గొన్నారు. -
‘రహదారి లేదని చెప్పడం అన్యాయం’
మాట్లాడుతున్న బుద్ద మురళీ తాతారావు అనకాపల్లి: స్థానిక మెయిన్రోడ్డు రఘరాం లే అవుట్ను ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 1535/3లో 7.603 సెంట్ల జీరాయితీ భూమిలో గేటు నిర్మిస్తున్న సమయంలో లే అవుట్ ప్రతినిధి కాండ్రేగుల వెంకట పరమేశ్వరరావు ఈనెల 9వ తేదీన తమ భూమిలో గేటు నిర్మించుకోవడం తప్పు అని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని స్థల యజమాని బుద్ద మురళీ తాతారావు అన్నారు. స్థానికంగా ఉన్న తమ భూమిలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లే అవుట్కు ఆనుకుని ఉన్న తమ స్థలానికి ఇటు రహదారి లేదని చెప్పడం అన్యాయమన్నారు. లే అవుట్ సైడ్ గేటు ఏర్పాటు చేసుకోవాలంటే రూ. 50 లక్షలు చెల్లించాలని పరమేశ్వరరావు చెప్పడం తగదని మురళీ తాతారావు అన్నారు. ఇదే విషయంపై సోమవారం పట్టణ పోలీస్స్టేషన్లో కాండ్రేగుల వెంకట పరమేశ్వరరావుపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాతారావు కుటుంబ సభ్యులు విల్లూరి గణేష్, దాడి నాని, ఆడారి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
నక్కపల్లి : రైతుకు చెందిన భూమిని మ్యూటేషన్ చేసేందుకు రూ.1.50 లక్షలు తీసుకుంటూ నక్కపల్లి మండలం పెదతీనార్ల వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం కశింకోట మండలం వెదురుపర్తి గ్రామానికి చెందిన ముక్కా శ్రీను అనే రైతు నక్కపల్లి మండలం పెదతీనార్లలో రెండు వేర్వేరు సర్వే నంబర్లలో 5.57 ఎకరాల భూమిని 2023లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అప్పటి నుంచి ఈ భూమిలో కొబ్బరి పంట వేసి సాగు చేసుకుంటున్నాడు. మ్యూటేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఒక సర్వే నంబరుకు సంబంధించి 2.14 ఎకరాలకు భూమికి మ్యూటేషన్ జరిగింది. 3.43 ఎకరాల భూమి మ్యూటేషన్ జరగలేదు..రికార్డుల్లో కొనుగోలు చేసిన వ్యక్తి, అమ్మిన వ్యక్తి పేరు లేదు. వేరొక అసామి పేరున నమోదై ఉంది. బాధితుడు కొనుగోలు చేసిన భూమిలో 2.14 ఎకరాల భూమిని ప్రభుత్వం బల్క్ డ్రగ్ పార్క్ కోసం సేకరించింది. ఈ భూమి మాత్రమే బాధితుడి పేరున రికార్డుల్లో మ్యూటేషన్ అయి నమోదై ఉండడంతో దానికి మాత్రమే నష్టపరిహారం చెల్లించారు. మిగిలిన భూమికి నష్టపరిహారం ఇవ్వలేదు. దీంతో మిగిలిన భూమిని మ్యూటేషన్ చేయాలని రెవెన్యూ అదికారుల చుట్టూ తిరుగుతున్నాడు. అధికారులు మాత్రం సమస్య పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారు. దీంతో బాధితుడు శ్రీను వీఆర్వో కొప్పిశెట్టి చిట్టిబాబును సంప్రదించగా, మ్యుటేషన్కు రూ. 2 లక్షలు మామూళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అడ్వాన్సుగా రూ.1.50 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం బాధితుడు ఈనెల 7వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అడ్వాన్సు రూ.1.50 లక్షలు సోమవారం విశాఖపట్నం ఎయిర్పోర్టు సమీపంలో వీఆర్వోకు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నాయకత్వంలో సిబ్బంది వలవేసి పట్టుకున్నారు. అక్కడ నుంచి నిందితుడిని నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయానికి తీసుకొచ్చి కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. వీఆర్వో సొంత గ్రామం నక్కపల్లి మండలం ఉపమాకలో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. పట్టుబడ్డ వీఆర్వోపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని, మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఏడాదిలో ఇది రెండో కేసు... నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం ఏడాదిలో ఇది రెండోసారి. ఏడాది కిత్రం వ్యవసాయ బోరుకు ఎన్వోసి ఇచ్చేందుకు రైతు నుంచి రూ.12 వేలు డిమాండ్ చేసి కార్యాలయంలోనే లంచం తీసుకుంటూ ఆర్ఐ కన్నబాబు ఏసీబీకి పట్టుబడడం గమనార్హం. మండలంలో భారీ స్థాయిలో పరిశ్రమలు ఏర్పాటు కానున్న నేపథ్యంలో భూముల ధరలు కూడా అమాంతం పెరిగాయి కొనుగోలు చేసిన భూములను తమ పేరున మార్చుకునేందుకు రైతులు తహసీల్దార్ కార్యాలయాలకు వస్తున్నారు. దీన్ని ఆసరాగా తీసుకుని వీఆర్వోలు, కొంతమంది సిబ్బంది రైతుల నుంచి భారీ స్థాయిలో లంచాలు గుంజుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. -
రైతులంటే ఇంత చులకనా...?
చోడవరం : గోవాడ చెరకు రైతులు ఉద్యమానికి మరోసారి సిద్ధమౌతున్నారు. రైతు సంఘాల నాయకులు, పలు రైతు ఉద్యమకారులు కలిసి చోడవరంలో బుధవారం సమావేశమయ్యారు. భారతీయ జనతాపార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రైతు ఉద్యమకారుడు ఎ.ఆర్.జి శర్మ ఇంటి వద్ద రైతు సంఘాల నాయకులంతా హాజరయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వారంతా తప్పుబడ్డారు. రైతులంటే ప్రభుత్వానికి చాలా చులకనగా ఉందని, మరోసారి ఉద్యమానికి చెరకు రైతులు, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ కార్మికులంతా సిద్ధం కావాలంటూ ఈ సమావేశం నిర్ణయించింది. అవసరమైతే రైతుల తరపున న్యాయపోరాటానికై నా వెళదామని ఏ.ఆర్.జి శర్మ ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులకు తెలిపారు. పార్టీలు, రాజకీయాలు ముఖ్యం కాదని, 24 వేల మంది చెరకు రైతులు, కార్మికుల జీవన్మరణ సమస్యగా మారిన గోవాడ ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికే మొదటి దశ ఉద్యమం చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ మేరకు ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపడం జరిగిందని, వారి హామీ మేరకు ఏమీ జరగకపోవడంతో మరోసారి ఉద్యమానికి అంతా సిద్ధమవ్వాలని నిర్ణయించారు. చెరకు రైతుల బకాయిలు, కార్మికుల జీత బకాయిలు రూ. 30 కోట్లు వరకూ ఫ్యాక్టరీ చెల్లించాల్సి ఉందని, అవి ఇప్పటి వరకూ చెల్లించలేదని, అంతేకాకుండా వచ్చే సీజన్ గానుగాట ఆడిందీ లేనిదీ ఏమీ చెప్పకపోవడంతో రైతులు చెరకు పంట వేయాలా వద్దా అనే మీమాంశలో ఉన్నారని, అదీ ప్రభుత్వం తేల్చలేదని సమావేశంలో రైతు సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఇప్పటికైనా వీటిపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయకపోతే త్వరలోనే రెండో దశ ఉద్యమం చేయడానికి అంతా సిద్ధంగా ఉండాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో రైతు సంఘం జిల్లా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, జనసేన నియోజకవర్గ నాయకుడు జెర్రిపోతుల నానాజీ, రైతు సంఘాల ప్రతినిధులు మహాలక్ష్మినాయుడు, దాడి అమర్, పెదబాబు పాల్గొన్నారు. -
పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఆవుల శేఖర్ నర్సీపట్నం: పేదలకు ఇళ్ల స్థలాలు, సాగు భూములు దక్కే వరకు పోరాటాలు ఆగవని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకుడు ఆవుల శేఖర్ పేర్కొన్నారు. అనకాపల్లిలో జిల్లా అధ్యక్షుడు అర్జున్ అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో శేఖర్ మాట్లాడారు. ఏళ్ల తరబడి గ్రామీణ పేదలకు సాగు భూములు, ఇళ్ల స్థలాలు పంపిణీ చేయమని డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదని, ప్రభుత్వ భూములన్నీ రాజకీయ పలుకుబడి కలిగిన వారి చేతుల్లో ఉన్నాయన్నారు. కార్పొరేట్ సంస్థలకు కారు చౌకగా రాష్ట్ర ప్రభుత్వం భూములు కట్టబెడుతుందన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను అమలు చేస్తే పేదలకు ఇళ్ల స్థలాలు, సాగుభూములు అందుతాయన్నారు. పేదల సంక్షేమ పథకాలు కత్తిరించాలనే గ్రామాల్లో సర్వే చేస్తున్నారన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వెలుగుల అర్జున్రావు, బాలేపల్లి వెంకటరమణ, జిల్లా ఆఫీస్ బేరర్లు కొండలరావు, అప్పలనాయుడు, లవరాజు, బంగారయ్య, అప్పారావు, నాగేశ్వరరావు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రముఖ వైద్యుడు శ్రీరామ్మూర్తి మృతికి సంతాపం
బుచ్చెయ్యపేట: వడ్డాదిలో పేదల వైద్యుడిగా పేరొందిన ప్రముఖ వైద్యుడు బెన్నాబత్తుల శ్రీరామ్మూర్తి (68) (పెంటబాబు డాక్టర్ ) గుండె పోటుతో మృతి చెందారు. రెండు రోజుల కిందట హైదరాబాద్లో ఉన్న తన కుమారుడి దగ్గరకు వెళ్లిన ఆయన అస్వస్థతకు గురయ్యారు. ఆదివారం విశాఖలోని ఓ పైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఐదు దశాబ్దాలుగా బుచ్చెయ్యపేట, చినఅప్పనపాలెం, బంగారుమెట్ట, దిబ్బిడి, ఎల్బీ పురం, భీమవరం, వడ్డాది, వీరవల్లి, పోతనపూడి, కుముదాంపేట, లోపూడి, శింగవరం తదితర గ్రామాల ప్రజలకు తక్కువ ఖర్చుతోనే వైద్య సేవలు అందించేవారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు మెరుగైన వైద్య సేవలతో పాటు నిరుపేదలకు ఫీజు తీసుకోకుండా వైద్య సేవలు అందించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో సరైన వైద్య సేవలు లేని సమయంలో, కరోనా కాలంలో కూడా పలువురికి వైద్య సేవలు అందించి పేదల పెన్నిధిగా పేరొందారు. శ్రీరామూర్తి అకాల మరణంతో పలు గ్రామాల ప్రజలు, పలువురు వైద్యులు, నాయకులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అతని పెద్ద కుమారుడు గతంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా భార్య, కుమారుడు ఉన్నారు. -
‘పల్లె పండగ’ దండగేనా!
రోలుగుంట : పల్లె పండగ పథకం పేరిట మండలంలో గల అర్ల పంచాయతీ శివారు గ్రామాలకు కోట్ల రూపాయలు వెచ్చించి పనులు చేపట్టినట్టు నేతలు చెబుతున్నా అవి గుంతలకే పరిమితం కావడంతో బాధిత గ్రామాల గిరిజనులు సోమవారం బురదమయంగా మారిన రోడ్డుపై నడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు. వివరాలివి. మండలంలో అర్ల పంచాయతీ శివారు పెదగరువు, పాతలోసింగి తదితర గ్రామాల్లో కోందు ఆదివాసీ గిరిజనులు సమారు 560 మంది ఉన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా బి.టి.రోడ్డు నిర్మాణానికి 2024లో 2 కోట్ల 50 లక్షలు మంజూరు అయ్యాయి. పల్లె పండగ–2025 లో భాగంగా గతేడాది జనవరిలో రహదారి పనులకు ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.రాజు శంకుస్థాపన చేశారు. ఎర్త్ వర్క్ క్రషర్ పిక్కతో రోడ్డు పనులు చేసి అర్ధంతరంగా వదిలేశారు. తరువాత భారీ వర్షాలకు పిక్కంతా కొట్టుకుపోయి బురదమయంగా మారి గుంతలుగా మారాయి. ఈ నేపథ్యంలో బాధిత గ్రామాల గిరిజనులు సొంత నిధులు సేకరించి రూ.6 లక్షలతో రోడ్డు ఏర్పాటు చేసుకున్నారు. అది భారీ వర్షాలకు కొట్టుకుపోతోంది. ఇలాఉండగా లోసింగిలో 40 మందికి హౌసింగు స్కీం అందింది. దీంతో ఈ రోడ్డులో మెటీరియల్ తీసుకెళ్లే ప్రయత్నంలో రోడ్డు మధ్యలో వాహనాలు బురదలో కూరుకుపోతున్నాయి. దీంతో హౌసింగు స్కీం నిలిచిపొయే పరిస్థితి నెలకొనడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ డబ్బులు కాంట్రాక్టర్లకు, అధికారులకు తప్ప అరకొర పనులతో తమకు ఒరిగిందేమీ లేదని ప్రభుత్వతీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ. కోట్లు నిధులు మంజూరు చేసినా అవి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నాయి కానీ పనులు శూన్యమని ఆరోపిస్తున్నారు. రోడ్డు పనులు నిమిత్తం రూ.లక్షలకు, లక్షలు ఖర్చు చేసినట్టు రికార్డుల్లో చూపించడం మినహా రోడ్డు పనులు మాత్రం పూర్తి చేయడం లేదని, దీంతో గుంతలు పడిన రోడ్డు బురదమయం కావడంతో గిరిజనులు నిరసనకు దిగారు. సోమవారం ఆ బురద రోడ్డులోనే పాదయాత్ర చేపట్టి డబ్బు ఖర్చు చేసిన రోడ్డు నిర్మాణం ఎక్కడ..? ఇదేనా పల్లె పండగ పథకం తీరు? అంటూ నినాదాలు చేశారు. ఈ రహదారి సమస్య మెరుగుపరచి తమకు డోలిమోత సమస్య తప్పించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామస్థులు అప్పారావు, కె.వెంకట్రావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదవశాత్తూ ఆర్మీ ఉద్యోగి మృతి
వార్షిక ప్రణాళిక అమలుతో మహిళా సంఘాల అభివృద్ధి సబ్బవరం: వార్షిక ఆర్థిక ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేసి, గ్రామీణ మహిళా సంఘాల అభివృద్ధికి కృషి చేయాలని డీపీఎం ఐబీ పి.వెంకటరమణ సూచించారు. సబ్బవరం మండల సమాఖ్య కార్యాలయంలో ఏఏపీ–1 సెక్షన్ పరిధిలో రెండు రోజుల పాటు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మంగళవారం ఆయన మాట్లాడారు. సబ్బవరం మండల సమాఖ్యతో పాటు అచ్యుతాపురం, రాంబిల్లి, పరవాడ, గొలుగొండ, చోడవరం, యలమంచిలి మండలాలకు చెందిన ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లకు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. వీవో స్థాయిలో వార్షిక కార్యాచరణ ప్రణాళిక తయారీ, కార్యవర్గ సభ్యులకు, ఎస్హెచ్జీ సభ్యులకు అవగాహన కల్పించడం, బడ్జెట్ ప్రక్రియపై శిక్షణ అందించినట్లు ఆయన తెలిపారు. వీఎంవోఎస్ఏ అంఽశాలపై టీవోటీ కె.శ్రీనివాసరావు వివరించారు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, సామాజిక భద్రత, ఆస్తుల సృష్టి, ప్రవర్తనలో మార్పు, సుస్థిర జీవనోపాధి వంటి అంఽశాలపై సభ్యులతో చర్చించి గ్రామ, మండల స్థాయి ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఏడు మండలాలకు చెందిన అధికారులు, సిబ్బందితో పాటు సబ్బవరం మండలంలోని 58 గ్రామ సంఘాల లీడర్లు పాల్గొన్నారు. -
జిరాయితీ చెరువులో ఉపాధి పనులు
నాతవరం : వైఎస్సార్సీపీ కార్యకర్తకు చెందిన జిరాయితీ భూమిలో ఉపాధి హామీ పథకం నిధులతో అభివృద్ధి చేసి ప్రభుత్వ భూమిగా మార్చేందుకు కూటమి నేతలు కుట్ర చేయడంతో బాధితుడు కలెక్టరుకు ఫిర్యాదు చేయడమే కాక న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. న్యాయస్థానం స్టే ఇవ్వడంతో గత ఏడాది పనులు ఆపేశారు. ఇప్పుడు మళ్లీ కూటమి నేతల ఒత్తిళ్లతో ఉపాధి హామీ పథకం అఽధికారులు యథావిధిగా చెరువులో పనులు చేస్తున్నారు. మండలంలో జిల్లేడుపూడి పంచాయతీలో సర్వే నెంబరు 240లో 4 ఎకరాల 80సెంట్లు జిరాయితీ భూమి ఇదే గ్రామానికి చెందిన సబ్బి సత్తిబాబు పేరిట రెవెన్యూ రికార్డులో ఉంది. పూర్వం ఈ గ్రామంలో సబ్బి కుటుంబీకులు సంబంధించి సుమారుగా 25 ఎకరాలకు పైగా వ్యవసాయ భూములు ఉండేవి. అప్పట్లో ఉమ్మడిగా సాగునీటి కోసం ఈ భూమిలో కొంత విస్తీర్ణంలో జిరాయితీ చెరువు ఏర్పాటు చేసుకున్నారు. ఆ చెరువు నీరు అధారంగా వ్యవసాయ పంటలు సాగు చేసేవారు. తర్వాత తాండవ రిజర్వాయరు నిర్మాణం, అలాగే వ్యవసాయ బోర్లు ఏర్పాటుతో జిరాయతీ చెరువులో నీరు అవసరం లేకుండా పోయింది. తరువాత కాలంలో వారు భూములు పంచుకోగా, జిరాయితీ చెరువు భూమి సబ్బి సత్తిబాబు తండ్రి జోగులు వాటాకు వచ్చింది. కాగా సత్తిబాబు వైఎస్సార్సీపీ కార్యకర్త కావడంతో రాజకీయంగా స్థానిక కూటమి నేతలు ఇబ్బంది పెట్టడానికి కుట్ర చేశారు. చెరువులో ఉపాధి పనులు చేయించి ప్రభుత్వ చెరువుగా మార్చేందుకు ప్రయత్నాలు సాగించారు. గత ఏడాది ఆ జిరాయితీ చెరువులో ఉపాధి పనులు చేస్తుండగా సబ్బి సత్తిబాబు అడ్డుకున్నారు. అంతేకాకుండా న్యాయస్ధానాన్ని ఆశ్రయించడంతో పనులు చేయరాదంటూ సత్తిబాబుకు అనుకూలంగా కోర్టు స్టే ఇచ్చింది. గత ఏడాది సత్తిబాబు కలెక్టరు, ఉపాధి పథకం జిల్లా అధికారులకు సైతం ఫిర్యాదు చేయడంతో ఆ చెరువులో అనుమతి లేకుండా ఉపాధి నిధులతో పనులు చేయడం జరగదని 4–05–2025 తేదీన అప్పటి డ్వామా ప్రాజెక్టు అధికారి పూర్ణిమాదేవి లిఖిత పూర్వకంగా లేఖ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ ఏడాది మళ్లీ చెరువులో ఉపాధి పనులు చేయడంతో సత్తిబాబు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఏపీవో దాసరి కొండాజీని వివరణ కోరగా ఈ సమస్య ఇటీవల తన దృష్టికి రావడంతో జిరాయతీ చెరువులో పనులు నిలుపుదల చేశామన్నారు. తనకు తెలియకుండా స్థానిక వీఆర్పీ పని చేయించారేమో తెలుసుకుంటానన్నారు. రైతు అమోదం లేకుండా జిరాయతీ చెరువు భూముల్లో పనులు చేయడం జరగదన్నారు. నాపై కక్ష సాధింపుగానే.. మా తాత తండ్రులు దగ్గర్నుంచి వారసత్వంగా వచ్చిన జిరాయతీ భూమి పూర్వం మా కుటుంబీకులు వ్యవసాయ సాగు చేసేందుకు సొంతంగా చెరువు చేసుకున్నారు. మా కుటుంబ సభ్యులు భూములు పంపకాలు చేసేటప్పుడు ఈ చెరువు భూమి మా నాన్న వాటాకి వచ్చింది. మా నాన్న కాలం చేయడంతో జిరాయితీ చెరువును ప్రభుత్వ చెరువుగా మార్చేందుకు కూటమి నేతలు కుట్ర చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నాకు అనుకూలంగా కోర్టు స్టే ఇవ్వడంతో గత ఏడాది పనులు అపేశారు. ఇప్పుడు మళ్లీ పనులు చేస్తున్నారు. నా వద్ద కోర్టు స్టే అర్డర్ ఉండగా రాజకీయంగా నన్ను ఇబ్బంది పెట్టడానికి కుట్ర చేస్తున్నారు. –సబ్బి సత్తిబాబు, జిల్లేడుపూడి గ్రామం -
కళ్లెదుటే సహజ సంపద దోపిడీకి గురవుతున్నా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే చట్టం పక్కదారి పడుతుంటే...ఇక రాష్ట్రంలో మిగతా చోట్ల పరిస్థితి ఏమిటో చెప్పనక్కర్లేదు. అధికారపా
సాక్షి, అనకాపల్లి : రాష్ట్ర హోం మంత్రి ఇలాకాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా చెరువులను తవ్వేస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతోంది. ఎస్.రాయవరం మండలంలో వమ్మవరం నరసింహాసాగర్ చెరువు, యలమంచిలి మండలంలో కృష్ణాపురంలో గల దుబ్బల చెరువు ఇప్పుడు అక్రమార్కుల పాలిట కామధేనువుగా మారింది. రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా.. ముఖ్యంగా ప్రభుత్వ సెలవు దినాల్లో అధికారుల పర్యవేక్షణ ఉండదని భావించి.. పొక్లెయిన్లతో చెరువు గర్భాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. వందల ట్రిప్ల మట్టిని ట్రాక్టర్లతో తరలిస్తూ కాసులు కురిపించుకుంటున్నారు. ఈ అక్రమ తవ్వకాలు ఎస్.రాయవరం మండలంలో ఓ టీడీపీకి చెందిన కాంట్రాక్టర్ ఆధ్వర్యంలోనే జరుగుతోంది. సదరు నేత ఆధ్వర్యంలోనే సమీప ప్రాంతాల్లో భారీగా మట్టి స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఇటుక బట్టి యాజమానులకు, కృష్ణాపురం, పులపర్తి గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాలను పూడ్చడానికి, రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఈ మట్టిని భారీ ధరలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ అండదండలు ఉండడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. దీనిపై స్థానిక రైతులు పోలీసు, రెవెన్యూ, నీటిపారుదల శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని గ్రామస్తులు వాపోతున్నారు. డయల్ 100కు ఫోన్ చేసినా పట్టించు కోలేదని వాపోయారు. రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్లలో మట్టిని తరలిస్తుంటే అధికారులకు ఏమి తెలియనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ రైతులు మండిపడుతున్నారు. నిల్వ ఉండని నీరు.. ఆందోళనలో రైతన్నలు నియమ నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో అస్త వ్యస్తంగా లోతైన గుంతలు తవ్వేస్తుండడంతో రానున్న రోజుల్లో సాగునీరు నిల్వ ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుల గర్భం దెబ్బతినడం వల్ల భూగర్భ జలమట్టం పడిపోయి, వ్యవసాయం సంక్షోభంలో పడుతుందని ఆవేదన చెందుతున్నారు. అక్రమ తవ్వకాలపై ఇప్పటికే పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినా, వారు స్పందించకపోవడం వెనుక పెద్ద ఎత్తున మామూళ్లు అందాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో కూటమినేతలు అక్రమ తవ్వకాలకు పాల్పడడం, హైకోర్టు అదేశాలను ధిక్కరించి నర్సీపట్నంలో పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం ఏర్పాటు చేయడం వంటి పనులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎస్పీకి ఫిర్యాదు.. యలమంచిలి మండలం కృష్ణాపురంలో నీటిపారుదల శాఖ చెరువు దుబ్బల చెరువులో అక్రమ మట్టితవ్వకాలకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవాలని సామాజికవేత్త సోమిరెడ్డి వెంకట అప్పల సత్య సన్యాసి నూకరాజు సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. కృష్ణాపురం గ్రామంలో గల నీటిపారుదల శాఖ ఆధీనంలో ఉన్న దుబ్బల చెరువులో నుంచి వమ్మవరం గ్రామానికి చెందిన నీటి పారుదల శాఖ కాంట్రాక్టర్ పల్లెల దివాణం అనుచరుడు, బయ్యవరం మాజీ సర్పంచ్ గెంజి శ్రీనివాసరావు పొక్లెయిన్, 8 ట్రాక్టర్లు, 10 టిప్పర్లతో అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో అక్రమ మట్టి తవ్వకాలకు పాల్పడి కృష్ణాపురం వద్ద ఒక చోట డంప్ చేయిస్తున్నారని, అక్కడ నుంచి టిప్పర్లతో నమ్మవరం 5 ఇటుక బట్టీలకు, లక్కవరం ఇటుక బట్టీకి తరలిస్తున్నారని తెలిపారు. దీనిపై యలమంచిలి రూరల్ ఎస్ఐకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని పేర్కొన్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహిన్సిన్హాను కోరారు. తూతూ మంత్రంగానే విచారణ.. ఎస్.రాయవరం మండలంలో వమ్మవరం నరసింహాసాగర్ చెరువులో అక్రమంగా మట్టి తవ్వి ఇటుక బట్టీలకు తరలించుకుపోతున్నారని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో ఆయకట్టు ఉన్న చెరువుల్లో అక్రమంగా తవ్వకాలు చేపట్టడం వల్ల చెరువు గర్భం అస్తవ్యస్తమై సాగునీరు ప్రవహించే అవకాశం లేదన్నారు. గ్రామంలో ఉన్న అయిదారు బట్టీలకు ఇదే క్రమంలో మట్టిని తరలించుకుపోతున్నారని చెప్పారు. ఈ మేరకు అక్రమ తవ్వకాలపై ఇన్చార్జి డిప్యూటీ తహసీల్దార్ నీరజ విచారణ చేయించారు. ఇటుక పరిశ్రమలకు అక్రమంగా తవ్విన మట్టి వెళుతున్నట్టు గుర్తించారు. దీనిపై రాయవరపు శ్రీనివాసరావు, ఓరుగంటి సత్తిబాబు, దోసపాత్రుని సత్యనారాయణ, తోట నాగబాబు, తోట శ్రీనివాసరావుపై కేసులు నమోదు చేయమని మైన్స్ అధికారులకు ఆమె ఫిర్యాదు ఇచ్చినట్టు తెలిసింది. వారిపై ప్రస్తుతం ఎమ్మార్వో సమీపంలో బైండోవర్ చేశారు. అధికారుల మౌనం.. గ్రామస్తుల ఆగ్రహం కళ్ల ముందే అక్రమంగా మట్టి తవ్వకాలు, రవాణా జరుగుతున్నా రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై గ్రామస్థులు, చెరువు ఆధారంగా వ్యవసాయం చేసే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సొంత నియోజకవర్గంలోనే చట్టం పక్కదారి పడుతుంటే సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే కృష్ణాపురంలో గల దుబ్బల చెరువు వద్ద జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. హోం మంత్రి ఇలాకాలో మట్టి మాఫియా పొక్లెయిన్లతో చెరువులు ధ్వంసం, మట్టి దోపిడీ ట్రాక్టర్లు, లారీల్లో యథేచ్ఛగా రవాణా ఇటుక బట్టీలకు, రియల్ వెంచర్లకు సరఫరా కూటమి నేత ఆధ్వర్యంలో స్టాక్ పాయింట్స్ పట్టించుకోని అధికారులు -
వేసవి సెలవుల్లో పనులు అప్పగించడం అన్యాయం
అనకాపల్లి: సెలవుల్లో వాట్సాప్ ఆదేశాల ద్వారా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టడం సరికాదని, లిఖితపూర్వక ఉత్తర్వులు లేకుండా, కేవలం వాట్సాప్ సందేశాల ద్వారా విద్యా సంబంధిత పనులను అప్పగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు అన్నారు. స్థానిక డీఈవో కార్యాలయంలో సోమవారం డీఈవో గిడ్డి అప్పారావు నాయుడుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారని, కేంద్ర కార్యాలయం నుంచి ఎటువంటి స్పష్టమైన ఆదేశాలు లేనప్పటికీ, జిల్లాలో మాత్రం మే 12 నాటికి ఫౌండేషన్ ప్లాన్, మండల ప్లాన్, స్కూల్ లెవల్ ప్లాన్న్లను సిద్ధం చేయాలని ఒత్తిడి చేయడం సరి కాదన్నారు. తక్షణమే ఈ ఒత్తిడి ఆపాలని, ఉపాధ్యాయుల సెలవు హక్కు గౌరవించాలని, వాట్సాప్ ద్వారా కాకుండా అధికారిక ప్రొసీడింగ్స్ ద్వారా మాత్రమే విధులు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్యాప్టో జిల్లా కార్యదర్శి యేశపోగు సుధాకర్రావు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు ఎస్.దుర్గాప్రసాద్, గొంది చిన్నబ్బాయ్, కె. పరదేశి, కార్యవర్గ సభ్యుడు వై.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
దేవాలయ భూములకు నష్టపరిహారం ఇప్పించండి
అచ్యుతాపురం రూరల్ : దుప్పితూరులో పద్మశాలీల ఆరాధ్య దైవమైన శ్రీ భద్రావతీ సమేత భావనాఋషి ఆలయ భూములకు నష్టపరిహారం ఇప్పించాలని ఆలయ కమిటీ సభ్యులు అనకాపల్లి కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 22 సంవత్సరాలుగా తమ సొంత నిధులతో స్వామికి నిత్య దీప ధూప నైవేద్యాలు, ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. ఆలయ భూములకు పరిహారంతో పాటు భూమికి భూమి ఇవ్వాలని వినతిపత్రం ద్వారా కలెక్టర్ను కోరారు. నష్టపరిహారం చెల్లించకుండా ఆలయ భూములను ఆక్రమిస్తున్న ఏపీఐఐసీ, బ్రాండిక్స్ సంస్థలు నిర్మిస్తున్న ప్రహారీ నిర్మాణాన్ని నిలిపివేయాలన్నారు. వినతిపత్రం ఇచ్చిన వారిలో ఆలయ కమిటీ చైర్మన్ మాడెం సూరి అప్పారావు, ఉపాధ్యక్షుడు శేశెట్టి రాంబాబు, సెక్రటరీ మాడెం అప్పారావు, కమిటీ సభ్యులు అంజూరి అప్పలరాజు, శేశెట్టి నర్సింగరావు, శేశెట్టి నానాజీ, వానపల్లి ముకుందేశ్వరరావు, వానపల్లి సన్యాసిరావు, అముదూరి అర్జునరావు తదితరులు ఉన్నారు. -
సోలార్ పేరుతో మోసం చేస్తున్న సర్కార్
సీపీఐ జిల్లా కార్యదర్శి దొరబాబుఅనకాపల్లి: సోలార్ స్కీమ్ల పేరుతో ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఉచిత విద్యుత్’పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న సోలార్ స్కీమ్ల గురించి గొప్పగా ప్రచారం చేస్తున్నప్పటికీ, వాస్తవానికి ఈ పథకాల వల్ల ఆ పనులు చేస్తున్న ప్రైవేట్ కంపెనీలు, కాంట్రాక్టర్ల ద్వారా కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరుతాయని చెప్పారు. ప్రభుత్వ రంగ విద్యుత్ వ్యవస్థను బలహీనపరుస్తూ, భవిష్యత్లో ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపే పరిస్థితి తీసుకొస్తున్నారని ఆయన చెప్పారు. గ్రామీణ, పేద ప్రజలకు ఉచిత విద్యుత్ పేరుతో ఆశలు చూపుతున్న ప్రభుత్వం ప్రస్తుత సబ్సిడీలను తగ్గించే అవకాశం ఉందన్నారు. సోలార్ ప్యానెల్స్ నిర్వహణ, మరమ్మతులు, పనితీరు వంటి అంశాల్లో వచ్చే సమస్యల గురించి ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదన్నారు. టెండర్ల కేటాయింపు, అమలు ప్రక్రియలో పారదర్శకత లేకపోవడం వల్ల అవినీతి పెరిగే ప్రమాదం ఉందన్నారు. ప్రజల డబ్బుతో కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే విధానాలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనకాపల్లి పట్టణంలో సుమారు 10 రోజుల క్రితం శ్రీరామ్నగర్లో ఏర్పాటు చేసిన సోలార్ సిస్టమ్ విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పాడైపోయిందన్నారు. ఈ విషయంపై విద్యుత్శాఖ అధికారులకు గృహయజమాని ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. -
పంట పొలాలు ముంపునకు గురైతే బాధ్యులెవరు..?
మునగపాక: భూసేకరణ చేపట్టకుండా మునగపాక దరి సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు చేపట్టడం సరికాదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీ విమర్శించారు. పూడిమడక రోడ్డు విస్తరణలో భాగంగా ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు చేపట్టడాన్ని ఆయన తప్పుపట్టారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్తో కలిసి సాగునీటి కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ మునగపాక, తోటాడ రెవెన్యూ పరిధిలో వేలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించే కాలువలను మూసేసి రెయిలింగ్ పనులు చేపట్టడం సరికాదన్నారు. ముందుగా రైతుల నుంచి భూసేకరణ చేపట్టి కాలువల నిర్మాణాలు చేపడితే బాగుండేదన్నారు. అలా కాకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువల్లో రెయిలింగ్లు ఏర్పాటు చేయడం ద్వారా పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుంటే విపత్తు సమయంలో రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. రహదారి విస్తరణను ఈ ప్రాంత ప్రజలతో పాటు రైతులు కూడా సమ్మతిస్తున్నారని అయితే రైతులకు నష్టం వాటిల్లేలా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరికాదన్నారు. బాధితులకు ఇచ్చే పరిహారం నేరుగా అకౌంట్లో వేసేలా చూడాలన్నారు. బాధితులకు అండగా వైఎస్సార్సీపీ నిలబడుతుందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షులు లోచల సుజాత,వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు,మాజీ ఎంపీపీ దాసరి గౌరీలక్ష్మి అప్పారావు, పాటిపల్లి ఎంపీటీసీ ఇల్లా శిరీషా నాగేశ్వరరావు పాల్గొన్నారు. భూసేకరణ చేపట్టకుండా సాగునీటి కాలువల్లో రెయిలింగ్ పనులు సరికాదు బాధితులకు పరిహారం నేరుగా అందించాలి టీడీఆర్లు వద్దంటున్నా ప్రభుత్వంలో కానరాని స్పందన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త ధర్మశ్రీ -
నిర్లక్ష్యం.. నీరుగారిన లక్ష్యం
రిజర్మాయర్ ప్రాంతం : చినరాచపల్లి పేరు : ఊటగెడ్డ నిర్మాణం : 2008 సంవత్సరం రిజర్వాయర్ విస్తీర్ణం : 70 ఎకరాలు ఆయకట్టు : 200 ఎకరాలు సాగునీరు అందాల్సిన గ్రామాలు : వెంకయ్యపాలెం, చినరాచపల్లి, రామన్నపాలెం, రాచపల్లి, జి.కోడూరు. ప్రస్తుత పరిస్థితి : ● ఈ రిజర్వాయర్కు ముందుగా ఒక కాలువ మాత్రమే నిర్మించడంతో పూర్తి స్థాయిలో పంట భూములకు నీరు అందేదికాదు ● రైతుల అభ్యర్థన మేరకు రూ.9లక్షలతో రెండో కాలువకు లైనింగ్ పనులు చేశారు. ● కాలువ గేటును నిర్మాణ సమయంలో సక్రమంగా అమర్చకపోవడం వల్ల రిజర్వాయర్లో ఉన్న నీరు వృథాగా పోతోంది. ● ఈ రిజర్వాయర్కు చెందిన సుమారు 20 ఎకరాలను ఆక్రమించి పంటలు సాగు చేస్తున్నారు. -
పడకేసిన వైద్యం
కేజీహెచ్ మందుల కౌంటర్ల వద్ద రోగుల పడిగాపులుఖాళీల భర్తీలో ప్రభుత్వం విఫలం ఆస్పత్రుల్లో బదిలీల వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఉన్న వైద్యులలో కొందరు ఆస్పత్రికి వచ్చి కేవలం ముఖ గుర్తింపు హాజరు వేసి, ఆపై తమ వ్యక్తిగత పనులకు లేదా ప్రైవేటు ప్రాక్టీసులకు వెళ్లిపోతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో నర్సులు, ఫార్మసిస్టులే ‘డాక్టర్ల’ అవతారం ఎత్తుతున్నారు. తమకున్న పరిమిత వైద్య పరిజ్ఞానంతో వారు మందులు రాసి ఇస్తున్నారు. ఇది ఒకరకంగా రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే. అత్యవసర పరిస్థితుల్లో రోగులు చేసేదేమీ లేక, తమ జేబులు ఖాళీ అయినా సరే ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రుల బాట పడుతున్నారు. యూపీహెచ్సీ, పీహెచ్సీల్లో అందుబాటులో లేని వైద్యులు వైద్యుల అవతారం ఎత్తుతున్న నర్సులు, ఫార్మసిస్టులు కాని రాని స్పెషాలిస్ట్ వైద్యులు 66 యూపీహెచ్సీలు, 9 పీహెచ్సిల్లో అరకొర సౌకర్యాలు -
క్రీడాకారులు ఫూల్
స్విమ్మింగ్ పూల్..విశాఖ స్పోర్ట్స్: ప్రైవేట్ కాంట్రాక్టర్ల చేతుల్లోకి ఈ కాంప్లెక్స్ వెళ్లినప్పటి నుంచి క్రీడాకారుల శిక్షణ గాలికొదిలేసి, కేవలం లాభార్జనే ధ్యేయంగా కార్యకలాపాలు సాగుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవీఎంసీ ఆస్తులపై పెత్తనం చెలాయిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో సుమారు 1500 నుంచి 1800 మంది వరకు, వింటర్ సీజన్లో కూడా రోజుకు 300 మందికి పైగా శిక్షణ కోసం ఇక్కడికి వస్తుంటారు. సమ్మర్ సీజన్లో ఒక్కొక్కరు నుంచి రూ.3000 వసూలు చేస్తున్నారు. ఇంతమంది వస్తున్నా అందుకు తగ్గట్టుగా కనీస సదుపాయాలు కల్పించడంలో ప్రైవేట్ నిర్వాహకులు ఘోరంగా విఫలమయ్యారు. తీవ్ర ఇబ్బందులు శిక్షణార్థుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. పూల్లో ఈత నేర్చుకోవడం కంటే, ఒడ్డున నిరీక్షించడానికే ఎక్కువ సమయం వృథా అవుతోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 నుంచి మూడు గంటల పాటు, సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంటల వరకు వివిధ టైమ్ స్లాట్లు కేటాయించి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ, కనీస పర్యవేక్షణ కరువైంది. 16 అడుగుల లోతు గల ప్రధాన పూల్..పక్కనే ఉన్న 3 నుంచి 6 అడుగుల లెర్నింగ్ పూల్లో కలిపి నిత్యం వందలాది మంది కిక్కిరిసిపోతున్నారు. గంట స్లాట్లో ఒక చిన్నారికి కేవలం అరనిమిషం పాటు మాత్రమే నీటిలో స్విమ్మింగ్ చేసే అవకాశం దక్కుతోందని, మిగిలిన 20 నిమిషాల నుంచి అరగంట సమయం కేవలం క్యూలో నిలబడటానికే సరిపోతోందని వాపోతున్నారు. కోచ్ల కొరత వందలాది మంది పిల్లలకు కేవలం ముగ్గురు కోచ్లు, నలుగురు లైఫ్ గార్డులు మాత్రమే అందుబాటులో ఉండటం నిర్వాహకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. శిక్షణ గురించి ప్రశ్నిస్తే ‘కోచ్లు దొరకడం లేదు’ అనే రొటీన్ సమాధానం వస్తోందని, అసలు బాధ్యతాయుతమైన కాంట్రాక్టర్ ఎక్కడ ఉంటాడో కూడా తెలియని పరిస్థితి నెలకొందని క్రీడాకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దలు స్వతంత్రంగా ప్రాక్టీస్ చేద్దామన్నా విపరీతమైన రద్దీ వల్ల నిరాశే ఎదురవుతోంది. ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ కాంప్లెక్స్లోనే ఇదే పరిస్థితి ఇదే తరహా పరిస్థితి ఎంవీపీ కాలనీలోని ఎస్3 స్పోర్ట్స్ కాంప్లెక్స్లోనూ కనిపిస్తోంది. ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం వల్ల క్రీడాకారుల భద్రత, రక్షణ, నాణ్యమైన శిక్షణ అనే అంశాలు మరుగున పడిపోయి, క్రీడా ప్రాంగణాలు కేవలం వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయనేది నగ్న సత్యం. విశాఖ కీర్తి ప్రతిష్టలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఇప్పటికై నా జీవీఎంసీ కమిషనర్ , కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి, ఈ ప్రైవేట్ సంస్థల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని, ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్లో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు న్యాయం చేయాలని నగరవాసులు కోరుతున్నారు. -
అప్పన్నకు వైభవంగా ఆర్జిత సేవలు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఆదివారం ఆర్జిత సేవలు వైభవంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుంచి స్వర్ణపుష్పార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 108 స్వర్ణ సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శతనామావళి పూజ జరిపారు. ఉభయదాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు పాల్గొన్నారు. ● శ్రీ వరావరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయ దాతలకు కల్యాణ అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రంలను అందజేశారు. -
పోయిన పర్సు బాధితుడికి అందజేత
మునగపాక : మునగపాక పీఏస్కు చెందిన హెచ్సీ సాగర్ మానవత్వం చాటుకున్నారు. ఉమ్మలాడకు చెందిన ఆడారి సాయి ఆదివారం సాయంత్రం తన పర్సును పోగొట్టుకున్నాడు. ఈ పర్సులో రూ.15వేల నగదుతో పాటు పలు ఏటీఎం కార్డులు ఉన్నాయి. పర్సు కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో నిస్సహాయకునిగా ఉండిపోయాడు. కాగా కేసు విచారణలో భాగంగా ఆదివారం రాత్రి ఉమ్మలాడ వెళ్లిన హెచ్సీ సాగర్కు పర్సు కనిపించింది. దీంతో పర్సులోని అడ్రసు గుర్తించి బాధితుడు సాయికి ఫోన్ చేశారు. సంబంధిత పర్సును మునగపాక పోలీసు స్టేషన్లో బాధితుడు సాయికి హెచ్సీ సాగర్ అందజేశారు. దీంతో స్టేషన్ ఎస్ఐ ప్రసాదరావుతో పాటు ఇతర సిబ్బంది సాగర్ మానవత్వం పట్ల అభినందనలు తెలిపారు. పోయిన పర్సు దొరకడంతో హెచ్సీ సాగర్కు బాధితుడు సాయి కృతజ్ఞతలు తెలిపాడు. -
క్రీడా శిక్ష ణ కేంద్రాలకు విశేష స్పందన
● ఆరోగ్యం, ఆత్మరక్షణ కల్పించేందుకు యోగా, తైక్వాండోలో శిక్షణ చోడవరం: వేసవి సెలవులు రావడంతో వివిధ క్రీడల్లో ప్రారంభమైన వేసవి శిక్షణ కేంద్రాలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆయా విభాగాల స్పోర్ట్స్ యూనిట్లు ఇప్పటికే అన్ని కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించాయి. ఆత్మరక్షణ, ఆరోగ్య రక్షణలకు కీలకంగా మారిన తైక్వాండో, యోగాలో జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. 30రోజుల పాటు ఈ కేంద్రాలు నిర్వహించనున్నారు. తైక్వాండో అసోషియేషన్, చోడవరం పతంజలి యోగా కేంద్రాల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు ప్రారంభమయ్యాయి. తైక్వాండోలో... ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ చాలా అవసరం. అందులో బాలికల ఆత్మరక్షణ విషయంలో అప్రమత్తత అవసరమని భావించి స్పోర్ట్స్ అథారిటీ ఈ వేసవి శిక్షణ తరగతుల్లో తైక్వాండో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చింది. బాలబాలికలు కలిపి 30రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్వంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్ జిల్లాలో ఐదు కేంద్రాల్లో తైక్వాండో జూడో క్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లం మురళి తెలిపారు. చోడవరం, అనకాపల్లిపట్టణం, అనకాపల్లిలో గాంధీనగరం, పరవాడ, బుచ్చెయ్యపేట(వడ్డాది) ప్రాంతాల్లో వేసవి ఉచిత శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. 5నుంచి 16సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలు ఈ శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 1 నుంచి నెలాఖరు వరకూ నిర్వహించే శిక్షణ తరగతులకు విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో హాజరవుతున్నట్టు మురళి తెలిపారు. యోగాలో .. అందరికీ ఆరోగ్యాన్ని అందించే యోగాలో శిక్షణ ఇచ్చేందుకు చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ప్రారంభించారు. ఇక్కడి ఉషోదయ విద్యాసంస్థల ప్రాంగణంలో ఉన్న యోగా కేంద్రంలో ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని యోగా గురువు పుల్లేటి సతీష్ తెలిపారు. యోగా వల్ల విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం, శరీర సౌష్టవంతోపాటు ఏకాగ్రత లభిస్తుందన్నారు. ఈ కేంద్రాన్ని ఈనెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు. -
రాజు వెర్సెస్ బాబు
● చోడవరం కూటమిలో అసమ్మతి కుంపటి ● ఎమ్మెల్యే లేకుండా అభివృద్ధిపై నాయకుల ప్రెస్మీట్ ● నియోజకవర్గంలో బయటపడుతున్న నేతల కుమ్ములాటబుచ్చెయ్యపేట: చోడవరం నియోజకవర్గంలో కూటమి నేతల కుమ్ములాటలు మరోసారి బయట పడ్డాయి. ఆదివారం మేజర్ పంచాయతీ వడ్డాదిలో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు లేకుండానే జిల్లా టీడీపీ అధ్యక్షుడు,రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ బత్తుల తాతయ్యబాబు, నియోజకవర్గ జనసేన ఇన్చార్జి పి.వి.ఎస్.ఎన్. రాజు, రాష్ట బీజేపీ అధికార ప్రతినిధి ఈర్లె శ్రీరామూర్తిలు తమ అనుచరులతో కలిసి అభివృద్ధి పనులపై ఆదివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అభివృద్ధిపై కాకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేక వర్గంగా చూపించుకునేందుకే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినట్లు పలువురు గుసగుసలాడారు. ఇప్పటికే జిల్లా కేంద్రం అనకాపల్లిలో మాజీ మంత్రి దాడి వీరభద్రరావు,మాజీ ఎమ్మెల్యే పీలా గోవిందరావు మధ్య తీవ్ర వర్గ పోరు సాగుతోంది. అనకాపల్లికి పక్కనే ఉన్న చోడవరం నియోజకవర్గంలోను ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్. రాజు, రాష్ట హౌసింగ్ కార్పొరేషన్ చైర్మెన్ బత్తుల తాతయ్యబాబుల మధ్య కూడా విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇప్పటికే వీరిద్దరి మధ్యన ఉన్న వర్గ పోరు టీడీపీ అధిష్టానం దృష్టికి వెళ్లింది. 20 రోజుల కిందట కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగిన రైతు సమీక్ష సమావేశంలో కూడా ఎమ్మెల్యే రాజు పాల్గొనక పోగా కూటమి నేతలు తాతయ్యబాబు, పి.వి.ఎస్.ఎన్. రాజు,ఈర్లె శ్రీరామూర్తులు సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే రాజు పాల్గొంటున్న కార్యక్రమాలకు కూడా ఈ ముగ్గురు నేతలకు పిలుపు ఉండటం లేదు. కూటమిలో ఉన్న జనసేన,బీజేపీ నాయకులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా టీడీపీకి చెందిన ఎమ్మెల్యే రాజు నియోజక వర్గంలో పలు కార్యక్రమాలు చేయడంపై జనసేన,బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే రాజు తమకు సమాచారం ఇవ్వకపోవడంపై కినుక వహించి జనసేన,బీజేపీ నేతలు ఎమ్మెల్యే రాజును వ్యతిరేకిస్తున్న తాతయ్యబాబు పక్కన చేరారు. ఎమ్మెల్యేను ఒంటరి చేయాలని కూటమి నేతలు పావులు కదుపుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధి పనులు,సంక్షేమం గురించి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే లేకుండా ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే వర్గ నాయకులు ఆగ్రహం చెందుతున్నారు. -
నూకాంబికను దర్శించుకున్న క్రీడల ఉన్నతాధికారి
బంగార్రాజు దంపతులకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేసి ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ న్యూఢిల్లీ డైరెక్టర్ తటపర్తి బంగార్రాజు దంపతులు కుటుంబ సమేతంగా ఆదివారం అమ్మవారిని దర్శించుకున్నారు. న్యూఢిల్లీ నుంచి విశాఖ ఎయిర్పోర్డుకు వచ్చి అక్కడ నుంచి కారులో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అంతకుముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ బంగార్రాజు దంపతులను శాలువాలతో సత్కరించి అమ్మవారి ఫొటోను అందజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ టెన్నికోయిట్ అసోసియేషన్ చైర్మన్ కె.ఎన్.వి. సత్యనారాయణ పాల్గొన్నారు. -
‘మనమిత్ర’ ద్వారా అప్పన్న టికెట్లు సులభతరం
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారిని దర్శించుకునే భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ప్రవేశపెట్టిన ‘మనమిత్ర’ వాట్సాప్ సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని, భక్తులు వీటిని విరివిగా వినియోగించుకోవాలని ఈవో జె.వెంకటరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి వద్ద నుంచే మొబైల్ ద్వారా దర్శనం, ఆర్జిత సేవలు, ప్రసాదం టోకెన్లు, వసతి గదులను బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ విధానం ద్వారా రూ.100, రూ.300 టికెట్లు కొనుగోలు చేసిన భక్తుల కోసం దేవస్థానం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేసింది. దీనివల్ల సాధారణ క్యూతో సంబంధం లేకుండా అత్యంత తక్కువ సమయంలోనే స్వామివారి దర్శనం పూర్తవుతుందని ఆయన వివరించారు. దళారుల బెడద లేకుండా, పారదర్శకమైన సేవలను అందించడమే ఈ ‘మనమిత్ర’ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. భక్తులు తమ మొబైల్లో 9552300009 నంబర్ను సేవ్ చేసుకుని, వాట్సాప్లో మెసేజ్ పంపడం ద్వారా సులభమైన పద్ధతిలో ఈ సేవలను పొందవచ్చునని ఈవో వెల్లడించారు. -
నిర్వహణ లేదు.. నీరు రాదు
మాకవరంపాలెం: పంటలకు సాగు నీరు అందించాల్సిన జలాశయాలు అలంకార ప్రాయంగా దర్శనమిస్తున్నాయి. ఏళ్ల తరబడి వీటి నుంచి సాగునీరు అందకపోవడంతో రైతులకు కష్టాలు తప్పడం లేదు. పూడిక పేరుకుపోయి.. కాలువల లైనింగ్ శిథిలమవడంతో ఏటా ఖరీఫ్ సీజన్లో రెండు వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు కూడా సాగునీరు అందే పరిస్థితి కానరాకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మాకవరపాలెం మండలంలో మూడు జలాశయాల నిర్వహణను పట్టించుకునే వారు లేకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిపాదనలు పంపాం మూడు రిజర్వాయర్ల గేట్లు, కాలువల మరమ్మతులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఒక్కో రిజర్వాయర్కు రూ.20 లక్షల చొప్పున ప్రతిపాదించాం. నిధులు రాగానే పనులు చేస్తాం. సర్వేచేసి రిజర్వాయర్లలో ఆక్రమణలను తొలగిస్తాం. ప్రస్తుతం మామిడిపాలెం రిజర్వాయర్ గర్భంలో పూడికను ఉపాధి పథకంలో తొలగింపునకు చర్యలు తీసుకుంటున్నాం. – ఆర్.రామన్నపాత్రుడు, ఏఈ, ఇరిగేషన్, నర్సీపట్నంపూనిక లేదు.. పూడిక తొలగదు కూలిన మదుములు.. పాడైన షట్టర్లు పెరుగుతున్న పూడిక... కొనసాగుతున్న ఆక్రమణలు కానరాని మరమ్మతులు నిరుపయోగంగా మూడు జలాశయాలు -
ఆర్మీ ఉద్యోగి భౌతికకాయం ఊరేగింపు
పట్టణంలో ఊరేగింపుగా తీసుకువెళుతున్న ఆర్మీ ఉద్యోగి రాపేటి పూర్ణచంద్రరావు భౌతికకాయం అనకాపల్లి టౌన్: వెంకుపాలెం గ్రామానికి చెందిన ఆర్మీ ఉద్యోగి రాపేటి పూర్ణచంద్రరావు(37) ఆర్మీలో విధులు నిర్వహిస్తూ శుక్రవారం డెహ్రాడూన్లో మృతి చెందారు. ఈయన మృతదేహం ఆదివారం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఊరేగింపుగా, పట్టణం గుండా గ్రామానికి చేరుకుంది. గ్రామానికి చేరుకున్న మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు అమర్రహే అంటూ నినాదాలు చేశారు. తన విధుల్లో భాగంగా ట్రక్ నడుపుతుండగా ప్రమాదానికి గురై మరణించినట్టు బంధువులు తెలిపారు. చంద్రశేఖర్కు భార్య గ్రేషి, ఐదేళ్ల కుమారుడు కనిష్క్, రెండేళ్ల కుమార్తె కారుణ్య ఉన్నారు. ఈ అనుకోని సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. -
వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం తథ్యం
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మునగపాక: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావడం తథ్యమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. ఈ నెలాఖరులోగా జిల్లా వ్యాప్తంగా అనుబంధ విభాగాల కమిటీలను పూర్తిస్థాయిలో నియమించాలని సూచించారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా పాలన సాగించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అనుబంధ విభాగాలకు పూర్తిస్థాయిలో కమిటీలు నియమించాలని సూచించారు. ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేయాలన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతీ ఒక్కరూ పాటుపడాలని చెప్పారు.చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. జగన్మోహన్రెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి, చంద్రబాబు ప్రభుత్వ పాలనలో జరుగుతున్న విధ్వంసకర పరిస్థితులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ విజయమే లక్ష్యంగా ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఘనంగా ప్రపంచ మాతృ దినోత్సవం ప్రపంచ మాతృదినోత్సవాన్ని ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాతను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ తదితరులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా పక్షపాతిగా పేరుగాంచారన్నారు. బొడ్డేడకు ఘన సత్కారం... వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ను పలు అనుబంధ విభాగాల జిల్లా అధ్యక్షులు శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రసాద్ నాయకత్వంలో అనకాపల్లి జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. -
లేబర్ కోడ్స్ కాపీలు దహనం
సెజ్లో లేబర్ కోడ్స్ నిబంధన కాపీలను దహనం చేస్తున్న సీఐటీయూ నాయకులు, కార్మికులు అచ్యుతాపురం రూరల్: లేబర్ కోడ్స్ నిబంధన కాపీలను సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక సెజ్ వద్ద కార్మికులు దహనం చేసి, నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి రొంగలి రాము మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ కారణంగా 29 కార్మిక చట్టాలు రద్దు అయిపోతాయన్నారు. 12 గంటల పాటు పని చేయాలని, దీంతో కార్మికులపై పని భారం అధికమవుతుందని చెప్పారు. లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా కార్మికులు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెజ్ కార్మికులు పాల్గొన్నారు. -
వెతలే.. వేతనాలు లేవ్
గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు చంద్రబాబు ప్రభుత్వంలో తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. అరకొర వేతనాలతో పనిచేస్తున్న వారి గోడును కూటమి సర్కార్ పట్టించుకోవడం లేదు. రెండేళ్లుగా ఒక్క పైసా పెంచలేదు సరికదా సకాలంలో వేతనాలు చెల్లించడం లేదు. దీంతో కుటుంబ పోషణ వారికి భారమవుతోంది.ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డెస్క్సాక్షి, అనకాపల్లి: పేద, మధ్య తరగతి ప్రజలకు ఆరోగ్యశ్రీ పథకం సేవలందించడంలో ఆరోగ్యమిత్రల సేవలు కీలకం. వ్యాధుల బారిన పడిన వారు, రోడ్డు ప్రమాదాలకు గురైన వారు ఆస్పత్రులకు వస్తే వారికి సకాలంలో ఉచిత వైద్య సేవలందేలా కృషి చేసి, వారు కోలుకునే వరకూ వెన్నంటే ఉండి సేవలందిస్తున్న ఆరోగ్య మిత్రలు చాలీచాలని వేతనంతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా, వీరి వేతనాల్లో ఒక్క రూపాయి కూడా పెంచకపోగా, కనీసం ఇస్తున్న అరకొర జీతాలను కూడా సకాలంలో విడుదల చేయకుండా వేధిస్తోంది. ఆరోగ్యశ్రీ పథకం అమలుకు ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా 163 మంది ఆరోగ్యమిత్రలు, జిల్లా టీమ్ లీడర్లు, ఇతర సిబ్బంది పనిచేస్తున్నారు. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ భారమవుతోందని ఆరోగ్య మిత్రలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఎప్పుడు అధికారం చేపట్టినా ఆరోగ్య శ్రీ, ఆరోగ్య మిత్రలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు వాపోతున్నారు. ఇప్పటికే ఆరోగ్యశ్రీ వైద్యసేవలను క్రమేపీ నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు సర్కార్..ఆరోగ్య మిత్రలను కూడా ఇబ్బందులకు గురిచేసేందుకు కుట్రలకు తెరలేపుతోంది. రేయింబవళ్లు శ్రమిస్తున్న క్షేత్రస్థాయి సిబ్బందికి అండగా నిలవాల్సిన పాలకులు, వారి గోడును పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బండెడు చాకిరీ చేయించుకుంటున్న ప్రభుత్వం,వేతనాలు పెంచే విషయంలో మాత్రం మొండిచేయి చూపుతోంది. అందని జీతాలు.. ఆర్థిక ఇబ్బందులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య మిత్రలకు రెండు నెలలుగా వేతనాలు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారి, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నెలాఖరు వస్తే చాలు ఇంటి అద్దె, పిల్లల ఫీజులు, నిత్యావసరాల ఖర్చుల కోసం ఎవరిని అడగాలో తెలియక వారు ఆవేదన చెందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. చాకిరీ ఎక్కువ.. జీతం తక్కువ ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు సేవలందించడంలో ఆరోగ్య మిత్రల పాత్ర కీలకం. ఉదయం నుంచి సాయంత్రం వరకు విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నా, వారికి దక్కేది మాత్రం నామమాత్రపు వేతనమే. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వీరికి అండగా నిలవగా, ప్రస్తుత చంద్రబాబు సర్కార్ ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపైనే అదనపు పనిభారం పడుతోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా జీతాలను పెంచాలని ఆరోగ్య మిత్రలు డిమాండ్ చేస్తున్నారు. మూడు జిల్లాల్లో వివరాలు ఇలా.. ● విశాఖ జిల్లాలో పనిచేస్తున్న మొత్తం సిబ్బంది: 110 మంది ● అనకాపల్లి జిల్లాలో మొత్తం సిబ్బంది : 33 మంది ● అల్లూరి జిల్లాలో మొత్తం సిబ్బంది : 20 మందిఅనకాపల్లిలో మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంఎన్టీఆర్ ఆస్పత్రిలో సేవలందిస్తున్న ఆరోగ్య మిత్రలున్యాయస్థానాల్లో పోరాడుతాం రెండేళ్లుగా వేతనాలు పెంచకుండా ప్రభుత్వం మమ్మల్ని వేధిస్తోంది. కనీస వేతనం అమలు చేయాలని ఇప్పటికే న్యాయస్థానాలను ఆశ్రయించాం. ట్రస్ట్ సీఈవోకు కూడా పలుమార్లు ఫిర్యాదు చేశాం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి మా వేతనాలు విడుదల చేయడంతో పాటు సమస్యలు పరిష్కరించకపోవతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – గోవింద్, ఆరోగ్య మిత్రల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోగ్య మిత్రలకు రెండు నెలలుగా అందని జీతాలు రూ.60 లక్షల వేతన బకాయిలు ఉమ్మడి విశాఖ జిల్లాలో 163 మంది ఎదురు చూపులు రెండేళ్లుగా పైసా పెంచని వైనం.. బండెడు చాకిరీకి అరకొర జీతం కనీస వేతనం అమలు చేసి, రెగ్యులరైజ్ చేయాలంటూ డిమాండ్ -
సకాలంలో గ్యాస్ అందక ఇబ్బందులు
● ఉదయం 10.30 నుంచి రాత్రి 8 గంటల వరకు పడిగాపులు ● మాకవరపాలెంలో ఆందోళనకు దిగిన వినియోగదారులు మాకవరపాలెం: సకాలంలో గ్యాస్ సిలిండర్లు అందక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న హెచ్పీ గ్యాస్ వినియోగదారులకు ప్రతి శనివారం, సోమవారం గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తుంటారు. అయితే గత నెల రోజులుగా సకాలంలో సిలిండర్లు అందించడం లేదని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని సుమారు 50 మంది వినియోగదారులు ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటలైనా గ్యాస్ వ్యాన్ రాకపోవడంతో పడిగాపులు కాశారు. తీరా 8 గంటలకు వ్యాన్ వచ్చినా 20 సిలిండర్లు మాత్రమే ఉండడంతో వినియోగదారులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉన్న 50 మందికి సిలిండర్లు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేది లేదని ఆందోళనకు దిగారు. ఇదే విషయమై సివిల్ సప్లయి డీటీ అశోక్కు వినియోగదారులు ఫోన్లో ఫిర్యాదు చేశారు. మహిళలు ఉదయం నుంచి రాత్రి వరకు గ్యాస్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఏ సమయంలో గ్యాస్ పంపిణీ చేస్తారో ముందుగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన చేస్తామన్నారు. దీనిపై స్పందించిన డీటీ మాట్లాడుతూ సిలిండర్ల కోసం ఉన్న 50 మందికీ గ్యాస్ పంపిణీ చేస్తామని తెలిపారు. సోమవారం నుంచి ఏ సమయంలో గ్యాస్ అందజేస్తామనే విషయాన్ని వినియోగదారులకు తెలియజేయడంతో పాటు నిర్ణీత సమయానికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
టీడీపీలో వర్గ పోరు
సాక్షి, అనకాపల్లి: టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. తెలుగుతమ్ముళ్లలో ఆధిపత్య పోరు మరోసారి పతాక స్థాయికి చేరింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అనకాపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. నియోజకవర్గ ఇన్చార్జి పీలా గోవింద సత్యనారాయణపై ఆ పార్టీ సీనియర్ నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో ‘తమ్ముళ్ల’ మధ్య రచ్చ బట్టబయలైంది. గత ఏడాది డిసెంబర్లో అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు వద్ద దాడి వీరభద్రరావు, పీలా గోవింద్ పరస్పరం ఫిర్యాదు చేసుకున్న విషయం తెలిసిందే. చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి ఇద్దరూ కలిసి పని చేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారకపోవడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇది జరిగిన కొన్ని రోజుల్లోనే అదే నియోజకర్గంలో తుమ్మపాలలో ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులంతా సమావేశం ఏర్పాటు చేసుకుని బహిరంగంగానే పీలా గోవింద్పై విమర్శలు సంధించారు. ఇది మరవక ముందే.. గోవింద్పైనే అదే పార్టీకి చెందిన మాజీ మంత్రి దాడి వర్గీయులు, మాజీ ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీష్ వర్గీయులు, సీనియర్ టీడీపీ నేతలు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో ఇరు వర్గాల మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. వాస్తవానికి వీరి మధ్య విభేదాలు ఇప్పటివి కాదు. గడిచిన ఏడాదిన్నర కాలంగా నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేపట్టినా అది రెండు వర్గాల మధ్య ఘర్షణకే దారితీస్తోంది. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలను పీలా గోవింద్ ఏకపక్షంగా తన అనుచరులతోనే నిర్వహిస్తున్నారని, ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న సీనియర్లను విస్మరిస్తున్నారని మాజీ మంత్రి దాడి వర్గం, పార్టీలో సీనియర్లు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ప్రతీ కార్యక్రమంలో కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి, పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం, విడివిడిగా సమావేశాలు నిర్వహించడంతో అసలు పార్టీ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందో తెలియని అయోమయ స్థితి నెలకొంది. పదవుల కోసం, పట్టు కోసం అగ్ర నాయకులు చేస్తున్న ఈ ఆధిపత్య పోరు త్వరలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో తమ కొంప ముంచుతుందేమోనని కార్యకర్తలు భయపడుతున్నారు. తారస్థాయికి విభేదాలు.. గత ఎన్నికల్లో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ టికెట్ దక్కకపోవడంతో భంగపాటుకు గురైన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వడంతో పాటు అనకాపల్లి నియోకవర్గ పార్టీ ఇన్చార్జిగా అధిష్టానం కొనసాగించింది. మరో సీనియర్ నేత దాడి వీరభద్రరావు కూడా ఎన్నికలకు ముందు నియోజకవర్గం టికెట్ ఆశించి టీడీపీలో చేరారు. అయితే అక్కడ పొత్తులో భాగంగా జనసేనకు అవకాశం కల్పించారు. కాగా గెలుపొందిన జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ..మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ బంధువు కావడంతో నియోజకవర్గంలో పీలా గోవింద్కు కాస్త స్పీడ్ పెంచారు. నియోజకవర్గంలో పనులు చేసే విషయంలో అధికారులు కూడా పీలా గోవింద్కే అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నారని టీడీపీలో చర్చించుకుంటున్నారు. దీన్ని జీర్ణించుకోలేని దాడి వర్గం... ఒక వర్గానికే పార్టీలో పదవులు దక్కుతున్నాయంటూ ఆరోపిస్తోంది. అక్కడ నుంచి ప్రారంభమైన వీరి మధ్య విభేదాలు రోజు రోజుకు తారస్థాయికి చేరుకుంటున్నాయి. అధినేత వార్నింగ్ బేఖాతర్.. గత ఏడాది డిసెంబర్ 20న అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు వద్ద పీలా గోవింద్, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పరస్పరం ఫిర్యా దు చేసుకున్నారు. దీంతో ఇద్దరు నేతలతో వేర్వేరుగా చంద్రబాబు మాట్లాడారు. ‘మీ బాగోతాలు అన్ని నా దగ్గర ఉన్నాయి.. అంతా చూస్తూనే ఉన్నా.. నేను జోక్యం చేసుకునే అంతవరకు సాగదీయకండి.. తమాషాలుగా ఉందా’ అని అంటూ హెచ్చరించినట్టు ఆ పార్టీలో సీనియర్ నాయకులు బహిరంగంగానే చర్చించుకున్నారు. ఇద్దరు మాజీ లకు అధినేత వార్నింగ్ ఇవ్వడం..వాటిని వారు బేఖాతరు చేయడం ఆ పార్టీలో చర్చీనీయాంశంగా మారింది. అనకాపల్లి తెలుగు తమ్ముళ్ల మధ్య విభేదాలు మాజీ మంత్రి దాడి వర్సెస్ నియోజకవర్గ ఇన్చార్జి పీలా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ వైఖరిపై జిల్లా అధ్యక్షుడుకి దాడి వర్గీయుల ఫిర్యాదు గతంలో తాళ్లపాలెంలో చంద్రబాబు వద్ద వీరి పంచాయితీ అధినేత చంద్రబాబు వార్నింగ్ బేఖాతర్ -
ఆర్ఏఆర్ఎస్ విద్యార్థుల ప్రతిభ
అనకాపల్లి: ఏపీ ఈసెట్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విభాగంలో స్థానిక ఆర్ఏఆర్ఎస్ పాలిటెక్నిక్ విద్యార్థులు సత్తా చాటారు. రాష్ట్రంలో ఉత్తమ ఫలితాలు సాధించినట్టు పరిశోధన స్థానం ఏడీఆర్ సీహెచ్.ముకుందరావు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి ర్యాంక్ సిరిపురపు సృజన, రెండో ర్యాంక్ జి.రమ్య, నాల్గో ర్యాంక్ జవ్వాది దేవి, ఏడో ర్యాంక్ అల్లురి దుర్గా సిరి, ఎనిమిదో ర్యాంక్ గౌడు సమిత, పదో ర్యాంక్ కె.ఎస్.కిరణ్, 15 ర్యాంక్ బి.గాయత్రి, 17వ ర్యాంక్ ఎ.రామమధు, 23వ ర్యాంక్ ఆర్.భవ్యశ్రీ , 29వ ర్యాంక్ బి.నైమిష, 30వ ర్యాంక్ పి.ధనలక్ష్మి సాధించినట్టు తెలిపారు.ఈసెట్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ విభాగంలో ర్యాంకుల పంట -
గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం
కె.కోటపాడు: మండలంలోని పైడంపేటలో శనివారం ఉదయం జామి ఈశ్వరరావు, జామి హరికృష్ణ ఇళ్లలో వంట చేస్తుండగా గ్యాస్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో గల డోర్కర్టెన్స్కు, ఇంటి దూలాలకు మంటలు వ్యాపించాయి. అదుపు చేసేందుకు స్థానికులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇళ్లలో గల దుస్తులు, నిత్యావసర సరుకులు, బంగారం, నగదు, ధాన్యం కాలిబూడిదయ్యాయని బాధితులు హరికృష్ణ, ఈశ్వరరావు తెలిపారు. స్థానికుల సమచారంమేరకు చోడవరం అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు. డి.గొటివాడలో...మాడుగుల: డి.గొటివాడలో వంట గ్యాస్ లీక్ అవడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు తెలిపిన మేరకు వివరాలు... శుక్రవారం రాత్రి గ్యాస్ స్విచ్ ఆఫ్చేయకుండా గ్రామానికి చెందిన చుక్కల జగ్గారావు నిద్రపోయాడు. శనివారం తెల్లవారుజామున టీ పెట్టడానికి గ్యాస్ వెలిగించాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగి, ఇంటిలో సామగ్రి దగ్ధమైంది. జగ్గారావుకు తీవ్రగాయాలు కావడంతో స్థానికులు విశాఖ కేజీహెచ్కు తరలించారు. -
వ్యవసాయమే ముద్దు.. ఎస్ఈజెడ్ వద్దు
కె.కోటపాడు: ఆర్లి, చింతపాలెం, గురుగుబిల్లి రెవెన్యూలో గల భూములను ఎస్ఈజెడ్కు ఇచ్చేది లేదంటూ ఆర్లిలో రైతులతో కలిసి సీపీఎం నాయకులు నిరసన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు డి.వెంకన్న మాట్లాడుతూ ఎస్ఈజెడ్కు తమ భూములు ఇచ్చేది లేదంటూ ఈ గ్రామాల్లో గల రైతులు ఒక్క పక్క నిరసన తెలుపుతుంటే మరోవైపు ఈ గ్రామాల నుంచి కొంత మంది రైతులను శుక్రవారం ఆర్డీవో వద్దకు ఎమ్మెల్యే తీసుకువెళ్లి భూములకు ఎంత ధర ఇస్తారో చెప్పాలని అడగడం హాస్యాస్పదంగా ఉందని వెంకన్న అన్నారు. గత ఏడాది ఎస్ఈజెడ్కు భూములు తీసుకుంటామని ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ చెప్పినప్పటి నుంచి రైతులు ఆందోళనలు చేస్తూ దరఖాస్తులను అధికారులకు అందిస్తున్నారని అన్నారు. భూములు ఇవ్వని రైతులపై కేసులు పెడతామంటూ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి బెదిరిస్తున్నా... ఇటువంటి బెదిరింపులకు ఆర్లి పంచాయతీలోని రైతులు బయపడరని వెంకన్న స్పష్టం చేశారు. గతంలో ఎస్ఈజెడ్ ఏర్పాటు చేసిన పరవాడ ప్రాంతంలో నిషేధిత కంపెనీల నుంచి వచ్చే వ్యర్థాలు సముద్రంలో కలిసే పరిస్థితి ఉందని, ఈ ప్రాంతంలో వ్యర్థాలు ఎక్కడకు పంపుతారని ఆయన ప్రశ్నించారు. యువతకు ఉపాధి కల్పన పేరుతో నిషేధిత కంపెనీల ఏర్పాటుతో పచ్చటి పొలాలను నాశనం చేసే యత్నాలను విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. భూ కేటాయింపులు జరిగినప్పుడే ఏ కంపెనీలు ఈ ప్రాంతంలో పెడతారో ప్రజలకు చెప్పాలని ఆయన కోరారు. బలవంతపు భూసేకరణతో ప్రజల జీవితాలను నాశనం చేయనున్నారని వెంకన్న అన్నారు. మాడుగుల నియోజకవర్గంలో రిజర్వాయర్లు ఉండడం వల్ల ఈ ప్రాంతంలో పంటలకు పనికి వచ్చే భూములని అన్నారు. ఈ ప్రాంతంలో రైతులు ఎట్టి పరిస్థితిలోనూ భూములు ఇచ్చేందుకు ముందుకు రారని, బలవంతపు భూసేకరణ జరిగితే రైతుల నుంచి ప్రతిఘటన తప్పదని వెంకన్న తెలిపారు. నిరసన కార్యక్రమంలో సీపీఎం నాయకులు గండి నాయినిబాబు, ఈర్లె నాయుడుబాబు, రైతులు ఆర్.ఏ.పాత్రుడు, కక్కల శివ, తాళ్ల నాగేష్, సీముసురు రాము, ఇమంది రాజుతో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.ఆర్లిలో రైతులతో కలిసి సీపీఎం నాయకుల నిరసన -
విశాఖలో సెమీ రింగురోడ్డు
విశాఖ సిటీ: నగరంలో రానున్న 50 ఏళ్ల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని రాంబిల్లి నుంచి భోగాపురం వరకు 102 కిలోమీటర్ల మేర సెమీ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, పట్టణాభివద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. శనివారం వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై ఎమ్మెల్యేలు, అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదిక ఈ నెలాఖరుకల్లా సిద్ధమవుతుందని చెప్పారు. వీఎంఆర్డీఏ పరిధిలోని 6,836 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో రూపొందించిన మాస్టర్ప్లాన్పై సుమారు 3,720 అభ్యంతరాలు వచ్చాయని మంత్రి తెలిపారు. వీటిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో చర్చించి, ఎమ్మెల్యేలు సూచించిన వినతుల్లో దాదాపు 90 శాతం సమస్యలను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానిస్తూ నిర్మిస్తున్న ఏడు రహదారులలో మూడు పూర్తయ్యాయని వివరించారు. దీంతో పాటు భోగాపురం నుంచి విశాఖ నగరం వరకు ఒక ప్రత్యేకమైన బీచ్ కారిడార్ నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విశాఖ నగర ప్రజల భవిష్యత్తు తాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం రూ.14 వేల కోట్లతో భారీ తాగునీటి ప్రాజెక్టును చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలోని 95 శాతం ఇళ్లకు నేరుగా పైపులైన్ల ద్వారా తాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీలు ఎం.శ్రీభరత్, కలిశెట్టి అప్పలనాయుడు, వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్ భరత్ పాల్గొన్నారు. -
జోన్ సరే.. కొలువుల బోర్డు ఏది?
సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల పోరాటం తర్వాత విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవుతుందన్న సంతోషం నిరుద్యోగ యువతలో కనిపించడం లేదు. 2019లో జోన్ ఏర్పాటుపై ప్రకటన వెలువడినప్పటి నుంచి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తూనే ఉంది. దీనిపై మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ఆందోళన చేస్తున్నా.. టీడీపీ, జనసేన నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో కేంద్రం ఇక్కడ బోర్డు ఏర్పాటుపై కాలయాపన చేస్తోంది. జోన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ, అందులో ఆర్ఆర్బీపై స్పష్టత ఇవ్వకపోవడం ఉత్తరాంధ్ర నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దేశవ్యాప్తంగా 19 జోన్లలో 21 ఆర్ఆర్బీలు ఉండగా, విశాఖ విషయంలో మాత్రం సాంకేతిక కారణాల సాకుతో జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంప్రతిపత్తి లేని ‘పేపర్ జోన్’? సాధారణంగా భారతీయ రైల్వేలో ఏ జోన్ ఏర్పడినా, ఆ పరిధిలో ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్ఆర్బీ ఉంటుంది. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలో కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. సికింద్రాబాద్, భువనేశ్వర్లలో ఇప్పటికే బోర్డులు ఉన్నాయని, వాటి ద్వారానే ఇక్కడి నియామకాలు చేపట్టవచ్చనేది అధికారుల వాదనగా కనిపిస్తోంది. అయితే, ఒక భారీ జోన్ను నిర్వహించేటప్పుడు దానికి స్వయంప్రతిపత్తి కలిగిన నియామక మండలి లేకపోతే, అది కేవలం ఒక ‘పేపర్ జోన్’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఆర్ఆర్బీ ఇవ్వరెందుకు? ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 ప్రధాన కార్యనిర్వాహక జోన్లు ఉండగా, ఆర్ఆర్బీలు మాత్రం 21 ఉన్నాయి. కొన్ని పెద్ద జోన్ల పరిధిలో ఒకటి కంటే ఎక్కువ బోర్డులు ఉండగా, మరికొన్ని బోర్డులు రెండు, మూడు జోన్ల అవసరాలను తీరుస్తున్నాయి. గతంలో వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ బోర్డు పరిధిలో ఉండేది. కానీ ఇప్పుడు కొత్త జోన్ కేంద్రంగా విశాఖ అవతరించిన తర్వాత కూడా పాత బోర్డులపైనే ఆధారపడటం ఈ ప్రాంత అభ్యర్థుల ఉపాధి హక్కులను కాలరాయడమే అవుతుందనే వాదన వినిపిస్తోంది. ఉత్తరాంధ్ర యువత ఉపాధికి ముప్పు ఆర్ఆర్బీ విశాఖకు కేటాయించకపోతే నియామక ప్రక్రియ మొత్తం ఒడిశా లేదా తెలంగాణలోని బోర్డుల నియంత్రణలోకి వెళ్తుంది. దీని వల్ల నోటిఫికేషన్లు వెలువడినప్పుడు మన అవసరాల కంటే ఆయా బోర్డుల పరిధిలోని ప్రాంతాలకే ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అభ్యర్థులు తమ సొంత ప్రాంతంలోని రైల్వే లైన్లలో పని చేయాలన్నా.. ఇతర రాష్ట్రాల్లోని ఆర్ఆర్బీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. పరీక్షలు, దరఖాస్తుల పరిశీలన, వైద్య పరీక్షల కోసం అభ్యర్థులు వందల కిలోమీటర్ల దూరంలోని భువనేశ్వర్ లేదా సికింద్రాబాద్ వెళ్లడం భారంగా మారుతుంది. రైల్వే గ్రూప్–డి వంటి పోస్టులకు స్థానిక భాషా పరిజ్ఞానం కీలకం. ఇతర రాష్ట్రాల బోర్డులు నియామకాలు చేపట్టినప్పుడు, తెలుగు అభ్యర్థులకు సమాచారం చేరవేయడంలోనూ, ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని వల్ల తెలుగు విద్యార్థులు సాంకేతికపరంగా వెనుకబడే ప్రమాదం ఉంది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు అనేది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు, అది ఉత్తరాంధ్ర ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది. కేవలం భవనాలు, ప్లాట్ఫాంలు పెంచితే అది అభివృద్ధి అనిపించుకోదు. స్థానిక యువతకు ఉపాధి దొరికినప్పుడే రైల్వే జోన్ కల సాకారమవుతుంది. తక్షణమే కేంద్రం స్పందించి విశాఖకు ఆర్ఆర్బీ మంజూరు చేయాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికతకు ప్రాధాన్యం పెరుగుతుంది విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని ప్రకటించినప్పుడు ఉత్తరాంధ్ర యువతలో ఎన్నో ఆశలు చిగురించాయి. కానీ ఇప్పుడు ఆర్ఆర్బీ ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఉద్యోగ నియా మకాల్లో స్థానికులకు ప్రాధాన్యం దక్కాలంటే విశాఖలోనే సొంత బోర్డు ఏర్పాటు చేయాలి. ఒకవేళ భువనేశ్వర్ బోర్డు ద్వారానే రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగితే, వారు పరీక్ష కేంద్రాలను కూడా అక్కడే కేటాయించే అవకాశం ఉంది. దీని వల్ల ఇక్కడ అభ్యర్థుల కంటే ఇతర ప్రాంతాల వారికే ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది. ఒక స్వతంత్ర జోన్కు స్వయంప్రతిపత్తి కలిగిన నియామక బోర్డు లేకపోతే, అది అధికారాలు లేని కేవలం ఒక నామమాత్రపు కార్యాలయంగానే మిగిలిపోతుంది. – ఎం.మన్మధరావు, ఉద్యోగార్థి జోన్ ఇచ్చి.. బోర్డును విస్మరిస్తే ఎలా? నేను గత మూడేళ్లుగా రైల్వే గ్రూప్–డీ, ఇతర పోటీ పరీక్షల కోసం శ్రమిస్తున్నాను. ఉత్తరాంధ్ర నిరుద్యోగుల కలలు నిజం కావాలంటే విశాఖలో ఆర్ఆర్బీ ఏర్పాటు చేయడం అత్యవసరం. స్థానికంగా బోర్డు అందుబాటులో లేకపోతే, ఉద్యోగ నోటిఫికేషన్లలో దొర్లే తప్పులను గానీ, ఫలితాల జాప్యాన్ని గానీ ప్రశ్నించే హక్కు అభ్యర్థులకు లేకుండా పోతుంది. ఏదైనా చిన్న సమస్య తలెత్తినా, ఫిర్యాదు చేయడానికి పొరుగు రాష్ట్రాల్లోని కార్యాలయాలకు వెళ్లడం మాలాంటి వారికి ఆర్థికంగా, మానసికంగా పెనుభారం. విశాఖను రైల్వే జోన్ కేంద్రంగా ప్రకటించి, ఆర్ఆర్బీని మాత్రం కేటాయించకపోవడం అంటే.. నియామకాల కోసం మమ్మల్ని మళ్లీ ఇతర రాష్ట్రాలపై ఆధారపడేలా చేయడమే. – కె.అప్పారావు, రైల్వే ఉద్యోగ అభ్యర్థి -
అనకాపల్లి జోనల్ కమిషనర్ బదిలీ
వీడ్కోలు పలుకుతున్న జోనల్ ఉద్యోగులు అనకాపల్లి టౌన్: స్థానిక జీవీఎంసీ జోనల్ కమిషనర్ కె.చక్రవర్తి పదోన్నతిపై మాతృసంస్థకు బదిలీ అయ్యారు. కర్నూలు జిల్లా బనగాన పల్లె వ్యవవసాయ శాఖ డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. గత ఏడాది మే నెలలో ఇక్కడి జోనల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన ఆయన ముఖ్యంగా పారిశుధ్యం మెరుగుపరచడంలో సఫలీ కృతులయ్యారని చెప్పొచ్చు. జోనల్ కార్యాలయంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్న డి.లక్ష్మీ తులసి ఇన్చార్జ్ కమిషనర్గా వ్యవహరించనున్నారు. చక్రవర్తికి జోనల్ ఉద్యోగులు శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. -
కొత్త జిల్లాల్లోనూ త్వరలో నర్సుల సంఘ ఎన్నికలు
మహారాణిపేట(విశాఖ): కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కూడా వచ్చే రెండు నెలల్లో ప్రభుత్వ నర్సుల సంఘ కమిటీలకు ఎన్నికలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.రాధమ్మ తెలిపారు. శనివారం కేజీహెచ్ క్లాక్రూమ్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నర్సెస్ అసోసియేషన్ విశాఖపట్నం జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో 13 జిల్లాల్లో మాత్రమే ఎన్నికలు నిర్వహించామని, కొత్త జిల్లాల నుంచి కూడా సంఘాల ఏర్పాటుకు డిమాండ్ వస్తోందని చెప్పారు. అందువల్ల ఆయా జిల్లాల్లో సభ్యత్వ నమోదు చేపట్టి ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేస్తామని వెల్లడించారు. అదే సందర్భంగా విశాఖ జిల్లాలో ఖాళీగా ఉన్న నాలుగు ఉపాధ్యక్ష పదవులను ప్రభుత్వ (జీఏడీ) అనుమతితో కో–ఆప్షన్ ద్వారా భర్తీ చేసినట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షులుగా ఎ.జయలక్ష్మి, ఎస్.జి.గౌరి, జి.హేమలత, పి.కల్పనలను నియమించగా, కార్యవర్గ సభ్యురాలిగా డి.విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఇన్–సర్వీస్ నర్సులు ఎమ్మెస్సీ చదివేందుకు ప్రభుత్వం త్వరలో జీవో విడుదల చేయనుందని, విశాఖ నర్సింగ్ కళాశాలకు 10 సీట్లు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటమ్మ, జిల్లా అధ్యక్షురాలు గంగాభవాని, జిల్లా కార్యదర్శి జీవీఎస్ వరలక్ష్మి, కోశాధికారి వంశీ, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరి, ఈసీ సభ్యులు పద్మజ, వినీల, మెహర్ శాంతి, లిల్లి తదితరులు పాల్గొన్నారు.ప్రభుత్వ నర్సుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్.రాధమ్మ -
నేడు పరిశ్రమలకు విద్యుత్ సరఫరా నిలిపివేత
అనకాపల్లి: జిల్లాలో అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 10న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఆ శాఖ జిల్లా ఆపరేషన్ ఎస్ఈ జి.ప్రసాద్ శనివారం తెలిపారు. 400కేవీ కాలపాక – ఖమ్మం లైన్పై తుప్పు పట్టిన పాత విద్యుత్ టవర్లను మార్చే పనుల నిమిత్తం ఏపీ ట్రాన్స్కో ఈ లైన్ క్లియరెన్స్ను తీసుకుంటుందని, 220కేవీ బ్రాండిక్స్ కల్పక–1, 2 సర్క్యూట్లో ఆదివారం ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరమ్మతులు నిమిత్తం పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా నిలుపుదల చేస్తామన్నారు. 220/132/33కేవీ బ్రాండిక్స్ సబ్ స్టేషన్, 33/11కేవీ బ్రాండిక్స్, 33/11కేవీ ఎస్ఈజె–1, 2 నుంచి విద్యుత్ పొందే పరిశ్రమలన్నింటికీ ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పూర్తిస్థాయిలో విద్యుత్ను నిలుపుదల చేస్తామన్నారు. అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో ఉదయం 4 గంటలకు వ్యవసాయ విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. సాధారణ వినియోగదారులు ట్రాన్స్కో ప్రత్యామ్నాయ వనరుల ద్వారా విద్యుత్ అందిస్తున్నందున ఎటువంటి ఇబ్బందులు ఉండవన్నారు. వినియోగదారులు, పారిశ్రామిక వర్గాలు ఈ మార్పుకు సహకరించాలని కోరారు. -
హైవేపై డివైడర్ను ఢీకొన్న కారు
● 8 మందికి గాయాలు ● నవ వధూవరులు కుటుంబంతో అన్నవరం వెళ్తుండగా ప్రమాదం యలమంచిలి రూరల్: డ్రైవర్ నిద్రమత్తు,నిర్లక్ష్యం కారణంగా శనివారం నవ వధూవరులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.యలమంచిలి మండలం మర్రిబంద వద్ద 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో రహదారి పక్కన నడిచి వెళ్తున్న మహిళ,కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ తల్లి తీవ్రంగా గాయపడగా మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపిన వివరాలు..విశాఖపట్నం అక్కయ్యపాలెంలో శుక్రవారం వివాహం జరిగిన నవ వధూవరులు కుటుంబంతో అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయానికి కారులో బయలుదేరారు.యలమంచిలి దాటిన తర్వాత మర్రిబంద వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొంది. కారు అతివేగంగా ప్రయాణిస్తుండడంతో ముందు చక్రాలు ఊడి రోడ్డుపై పడ్డాయి.డివైడర్ పక్కనున్న సోలార్ పలకలు విరిగిపోయాయి.విరిగిన సోలార్ పలక రోడ్డు పక్కన నడిచి వెళ్తున్న మహిళపై పడడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.కారులో ప్రయాణిస్తున్న ఏడుగురిలో డ్రైవర్ తల్లికి కాలు విరిగింది.మిగిలిన ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు.కారు ముందు భాగం నుజ్జవడం బట్టి ప్రమాద తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే యలమంచిలి రూరల్ ఎస్ఐ ఉపేంద్ర సిబ్బందితో అక్కడకు చేరుకుని పరిశీలించి, వివరాలు సేకరించారు. క్షతగాత్రులను హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన పాదచారి రుత్తల లక్ష్మి భర్త రామారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
డయాలసిస్కు వెళ్తూ మృత్యు ఒడికి
గాజువాక: కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న ఒక వ్యక్తి డయాలసిస్ కోసం వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి.. కూర్మన్నపాలేనికి చెందిన ఇందుకూరి సతీష్ (45) హెచ్పీసీఎల్లో కాంట్రాక్టు కార్మికుడిగా పని చేస్తున్నాడు. కొద్ది కాలంగా కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్నాడు. డయాలసిస్ చేయించుకోవడం కోసం చినగంట్యాడ జంక్షన్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లడం కోసం ద్విచక్ర వాహనంపై బయల్దేరాడు. వందడుగుల రోడ్ సిగ్నల్ జంక్షన్కు వచ్చేసరికి జాతీయ రహదారిపై కుక్కలు అకస్మాత్తుగా అడ్డంగా వచ్చాయి. దీంతో సతీష్ తన ద్విచక్ర వాహనాన్ని స్లో చేశాడు. దీంతో వెనకనే వస్తున్న ఒక ప్రైవేట్ బస్సు అతడిని బలంగా ఢీకొట్టి ఈడ్చుకుపోయింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రాథమిక విచారణ నిర్వహించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్కు తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతుని బావమరిది దండు గోపాల కృష్ణంరాజు ఫిర్యాదు మేరకు సీఐ ఎస్కే హుస్సేన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో జస్వంత్ ప్రతిభ
నాతవరం: రాష్ట్ర స్థాయి బేస్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన అనిమిరెడ్డి జస్వత్ మండలానికే వన్నె తెచ్చాడని నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు అభినందించారు. ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ నాతవరం హైస్కూల్లో చదువుతున్న జస్వంత్ అనకాపల్లి జిల్లా జట్టు తరపున బేస్బాల్ పోటీలలో పాల్గొన్నారన్నారు. ఈ నెల 5,6,7, తేదీల్లో కర్నూల్ జిల్లా వెనుగొండలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో జస్వంత్ ప్రతిభ చూపించడంతో సెమీఫైనల్కు చేరుకోవడం జరిగిందన్నారు. మారుమూల నాతవరం మండలం నుంచి జిల్లా తరఫున క్రీడల్లో రాణించడం అభినందనీయమన్నారు. జిల్లాలో ఈ జట్టు తరుఫున పోటీల్లో నర్సీపట్నం, మాకవరపాలెం మండలాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారని ఎస్ఐ తెలిపారు. -
నీలిబందలో వైద్య శిబిరం
రోలుగుంట: మండలం అర్ల గిరిజన పంచాయతీ శివారు నీలబంద గ్రామంలో బుచ్చింపేట పీహెచ్సీ ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. నీలిబందలో జ్వరాలు శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు అధికారులు స్పందించారు. వైద్యుడు ఎల్.శివప్రసాద్ సిబ్బందితో కలసి గ్రామంలో జ్వరపీడితుల ఇళ్లను సందర్శించారు. రోగులను కలసి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. దీనిలో భాగంగా గ్రామంలో ఏర్పాటు చేసిన శిబిరంలో రోగులకు వైద్య పరీక్షలు చేశారు. రక్తపు నమూనాలు తీశారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోగులకు ఆరోగ్య జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకొని వేడి ఆహారం, మరగకాచిన నీటిని తాగాలన్నారు. -
నీలిబందలో జ్వరాలు
రోలుగుంట : మండలంలోని అర్ల గిరిజన పంచాయతీ కొండ శిఖరాగ్రాన ఉన్న నీలిబంద గ్రామంలో పలువురు జ్వరాలతో మంచాన పడ్డారు. జ్వరంతో సకాలంలో చికిత్స పొందని పరిస్థితిలో ఇదే గ్రామానికి చెందిన డిప్పల సురేష్(2) ఇంటి వద్దే శుక్రవారం మృతి చెందినట్టు పీవీటీజీ సంఘ నాయకుడు గెమ్మిల వాసు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన తెలిపిన వివరాలివి. జి.మాడుగుల మండలం నుంచి నీలిబంద గ్రామానికి వలస వచ్చిన గిరిజనులు ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. జ్వరాల బారిన పడిన వారిలో డిప్పల సూరిబాబు (3), గెమ్మిల నవీన్(2), వంతల అఖిల్ (2), డిప్పల రమేస్(8), కొర్ర ప్రవీణ్(2), కొర్ర రుక్తి(5) ఉన్నారు. ఈ గ్రామం నుంచి మండలంలోని బుచ్చింపేట పీహెచ్సీకి వైద్యానికి రావాలంటే కొండ శిఖరాగ్రం నుంచి మేలైన రవాణా మార్గం, వాహనాలు రాకపోకలు లేని పరిస్థితిలో 13 కిలోమీటర్లు నడచుకుని డోలిమోతతో రావాలి. ఈ గ్రామానికి ఆశా కార్యకర్త కానీ, ఏఎన్ఎం కాని లేరు. ఎవరు అనారోగ్యం బారిన పడినా బుచ్చింపేట పీహెచ్సీకి 13 కిలోమీటర్ల దూరం నడిచి రావాల్సిందే. ఈ సమస్యలపై జిల్లా కలెక్టర్ స్పందించి, తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించి, రవాణా సదుపాయాలు మెరుగుపరచాలని, ఏఎన్ఎంని నియమించాలని కోరారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి జ్వరపీడితులకు తక్షణ వైద్యం అందించాలని ఆయన డిమాండు చేశారు. -
జిప్సం లారీలు అడ్డగింత
మాకవరపాలెం : ప్రమాదాలకు కారణమవుతున్న జిప్సం లారీలను మండలంలోని భీమబోయినపాలెం గ్రామస్తులు అడ్డుకున్నారు. విశాఖ కోరమండల్ నుంచి గత నెల రోజులుగా తాళ్లపాలెం, మాకవరపాలెం, నర్సీపట్నం మీదుగా భారీలోడుతో జిప్సం లారీలు రవాణా అవుతున్నాయి. రాజమండ్రి వెళ్లే ఈ లారీలు టోల్ చార్జీలు చెల్లించకుండా ఉండేందుకు ఇటుగా వెళుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ లారీల నుంచి జిప్సం పౌడర్ రోడ్డుపై జల్లుకుంటూ లారీలు వెళుతున్నాయి. దీంతో వెనుక వచ్చే ద్విచక్రవాహనదారుల కళ్లలో ఈ పౌడర్ పడి ఇబ్బందులు పడుతున్నారు. కళ్లలో పడిన వెంటనే మంట వస్తుందని వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. ఈ జిప్సం కారణంగా భీమబోయినపాలెం గ్రామానికి చెందిన పప్పల అశోక్కుమార్ ద్విచక్ర వాహనంపై వెళుతూ తీవ్రంగా గాయపడినట్టు గ్రామస్తులు తెలిపారు. నిత్యం ఎవరో ఒకరు ఈ కారణంగా ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తాజామాజీ సర్పంచ్ రుత్తల కిశోర్ ఆధ్వర్యంలో గ్రామస్తులు రెండు లారీలను అడ్డుకున్నారు. అనంతరం వాటిని పోలీసులకు అప్పగించారు. అధికారులు స్పందించి ఈ మార్గం గుండా ఈ లారీలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని ద్విచక్ర వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
గిరి ప్రదక్షిణ వైభవంపై పాట రాస్తా
గేయ రచయిత కాసర్ల శ్యామ్సింహాచలం : సింహాచలం పుణ్యక్షేత్రం, గిరిప్రదక్షిణ ఉత్సవ విశిష్టతను చాటిచెప్పేలా త్వరలోనే ఒక అద్భుతమైన పాటను రాస్తానని ప్రముఖ సినీ గేయ రచయిత, జాతీయ అవార్డు గ్రహీత కాసర్ల శ్యామ్ తెలిపారు. శుక్రవారం ఆయన సింహాచల శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయంలోని మహిమాన్విత కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్న ఆయనకు, అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ ‘బలగం’ సినిమాలోని ‘ఊరూ పల్లెటూరు దీనితీరే అమ్మ తీరు’ పాటకు జాతీయ అవార్డు రావడం ఆ స్వామివారి అనుగ్రహంగా భావిస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. ఆలయ ప్రధానార్చకుడు గొడవర్తి శ్రీనివాసాచార్యులు ఆయనకు క్షేత్ర మహత్యాన్ని వివరించి, స్వామివారి వైభవంపై పాటలు రాయాలని కోరగా.. తప్పకుండా గిరిప్రదక్షిణ ఉత్సవంపై పాట రాస్తానని శ్యామ్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దేవస్థానం పీఆర్వో అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ వైద్యం.. మామూళ్ల మాయాజాలం!
అది పేదోడి పాలిట పెన్నిధి కావాల్సిన ప్రభుత్వ ఆస్పత్రి. రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందుతుందన్న ఆశతో వచ్చే నిరుపేదల రక్తాన్ని సిబ్బంది లంచాల రూపంలో జుర్రుకుంటున్నారు. రూపాయి లేనిదే స్ట్రచర్ కదలదు.. వంద నోటు విదిలిస్తేనే వార్డు క్లీన్ అవుతుంది. నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో సిబ్బంది చేస్తున్న ఈ వసూళ్ల దందాపై ఓ మహిళా రోగి ధైర్యంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. నర్సీపట్నం : నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లో లంచాలు ఆరికట్టండి...అంటూ ఆస్పత్రిలో చేరిన మహిళా పేషెంట్ ఆవేదనతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో హాల్చల్ చేస్తుంది. రావికమతం మండలం, టి.అర్జాపురం గ్రామానికి చెందిన తురబల్లి కోట సత్యవతి జ్వరంతో బాధపడుతూ ఈ నెల 5వ తేదీన ఏరియా హాస్పిటల్లో చేరింది. సిబ్బంది చేతివాటంపై ఆమె వీడియో చేసి ఇన్స్ట్రాగామ్లో పోస్టు చేసింది. హాయ్ ఫ్రెండ్స్, నా ఆరోగ్య పరిస్థితి బాగోక ఏరియా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను.. క్లినింగ్ చేసే సిబ్బంది డబ్బుల కోసం పేషెంట్లను చాలా ఇబ్బంది పెడుతున్నారు. అన్న క్యాంటిన్కు వెళ్లి రూ.5 పెట్టి భోజనం తినేందుకు ఇబ్బంది పడుతున్న రోజుల్లో మనిషికి వంద రూపాయలు ఇవ్వమంటే ఎక్కడి నుంచి తెచ్చి ఇస్తాం...అంటూ మహిళా పేషెంట్ ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఉన్న వార్డులో సుమారు 30 బెడ్లు ఉన్నాయి. వీళ్లు మంచానికి వంద చొప్పున వసూలు చేస్తున్నారు. ఆర్థిక స్థోమత లేకనే ఏరియా హాస్పిటల్కు వచ్చాం. యూరిన్ పెడితే రూ.100, సర్జరీ పేషెంట్ వద్ద రూ.100 చొప్పున వసూలు చేస్తున్నారని వీడియోలో పేర్కొంది. కదల్లేని రోగులను స్ట్రచర్పై ఈసీ జీ, ఎక్స్రేకు తీసు కు వెళ్లాలంటే వంద రూపాయలకు తక్కువైతే తీసుకోవడం లేదని ఆవేదన వెలిబుచ్చింది. వంద రూపాయలు ఉంటే పండ్లు లేక భోజనం కొనుక్కుందాం అనుకుంటే సిబ్బంది వసూళ్లతో ఇబ్బంది పడుతున్నాం. డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తే సిబ్బంది తిరగబడుతున్నారని ఏకరువు పెట్టింది. ఈ పేషెంట్ వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ విషయమై ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ సుధాశారదను వివరణ కోరగా పేషెంట్ను డబ్బుల కోసం డిమాండ్ చేసిన శానిటేషన్ వర్కర్ను విధుల నుంచి తొలగించామని, డబ్బులు డిమాండ్ చేయవద్దని శానిటేషన్ సిబ్బందిని హెచ్చరించామని తెలిపారు. -
పతకాల వేటలో సాగర్నగర్ స్టార్లు
క్రీడలు మానసిక ఉల్లాసానికే కాకుండా శారీరక దృఢత్వానికి ఎంతో తోడ్పడతాయి. అయితే నేటి తరం యువత సెల్ ఫోన్లకు బందీలుగా మారుతోంది. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రీల్స్, ఫేస్బుక్, ఇన్స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో గడుపుతూ కాలక్షేపం చేస్తున్నారు. దీని వల్ల అలసత్వం, మతిమరుపు, కంటి సమస్యలు వంటి అనారోగ్యాలు తలెత్తుతున్నాయి. దీనిని గమనించిన పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్నారు. ఇందుకు వేదికగా నిలుస్తోంది సాగర్నగర్ బాస్కెట్బాల్ అకాడమీ(ఎస్ఎన్బీఏ). సాగర్నగర్కు చెందిన విద్యార్థులు ఒకవైపు చదువులో రాణిస్తూనే, మరోవైపు క్రీడల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పలు పోటీల్లో ప్రతిభ కనబరిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. 2018లో ప్రారంభమైన ఈ అకాడమీలో, కోచ్ సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో శిక్షణ పొందిన సుమారు 300 మందిలో, ఇప్పటివరకు 20 మంది జాతీయ స్థాయిలో, 30 మంది రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించడం విశేషం. భవిష్యత్లో మరిన్ని అంతర్జాతీయ పతకాలు సాధించడమే తమ లక్ష్యమని విద్యార్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం సాగర్నగర్ బాస్కెట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో సాగర్నగర్ గ్రౌండ్లో ఇప్పటికే సమ్మర్ క్యాంప్ ప్రారంభమైంది. ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 8.30 వరకు, తిరిగి సాయంత్రం 6 నుంచి 8 వరకు శిక్షణ ఇస్తున్నా రు. కనీసం 10 ఏళ్ల వయసు పైబడిన వారు శిక్షణకు అర్హులు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోచ్ సూచించారు.దేశం తరపున ఆడటమే నా కల ఇటీవల డెహ్రాడూన్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం నాలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ప్రస్తుతం ఉదయం, సాయంత్రం కఠోర సాధన చేస్తున్నాను. ఏదో ఒక రోజు భారత జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి, దేశం గర్వపడేలా చేయడమే నా జీవిత లక్ష్యం. – ఎన్. నవ్య, క్రీడాకారిణి దేశానికి కెప్టెన్గా వ్యవహరించాలి గతేడాది డెహ్రాడూన్ జాతీయ పోటీల్లో ఏపీ జట్టుకు కెప్టెన్గా బాధ్యతలు నిర్వర్తించడం గొప్ప అనుభవం. భవిష్యత్తులో మరింత శ్రమించి, భారత బాస్కెట్ బాల్ జట్టుకు నాయకత్వం వహించాలనేది నా బలమైన ఆశయం. – వి.వి.వాట్సన్ మెరుపు వేగంతో సాగే క్రీడ బాస్కెట్బాల్. ఇటువంటి క్రీడల్లో జాతీయ స్థాయిలో రాణించాలంటే కఠోర సాధన, శ్రమ ఎంతో అవసరం. వాటన్నింటినీ అధిగమించి, జాతీయ స్థాయిలో తమ ముద్ర వేస్తున్నారు సాగర్నగర్ క్రీడాకారులు. ఇటీవల డెహ్రాడూన్ వంటి నగరాల్లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన నవ్య, వాట్సన్ వంటి క్రీడాకారులు ఇక్కడ శిక్షణ పొందిన వారే.. ప్రతి ఏటా సమ్మర్ క్యాంప్ ద్వారా ఉచితంగా శిక్షణ పొందుతూ.. చాంపియన్లుగా మారుతున్నారు. – కొమ్మాది గొప్ప క్రీడాకారుడిగా ఎదగడమే లక్ష్యం బాస్కెట్ బాల్ నాకు క్రమశిక్షణను నేర్పింది. జాతీయ స్థాయిలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, అత్యుత్తమ క్రీడాకారుడిగా పేరు తెచ్చుకోవడమే నా టార్గెట్. అందుకే నిత్యం ప్రాక్టీస్ చేస్తున్నాను. – నీల్, క్రీడాకారుడు -
అపార్ట్టుమెంట్పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
బీచ్రోడ్డు : మద్యానికి బానిసైన ఓ వ్యక్తి అపార్ట్మెంట్పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లాకు చెందిన మీసాల సత్యనారాయణ (39) తీవ్రమైన మద్యపాన వ్యసనంతో బాధపడుతుండేవాడు. దీని నుంచి అతడిని విముక్తి కలిగించేందుకు కుటుంబ సభ్యులు నగరంలోని మానసిక ఆసుపత్రిలోని డి–ఎడిక్షన్ సెంటర్లో చేర్పించారు. శుక్రవారం ఆసుపత్రి సమీపంలోని ఒక అపార్ట్మెంట్పైకి వెళ్లిన సత్యనారాయణ, అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. మృతుడికి 2016లో చంద్రకళతో వివాహం కాగా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మద్యం మత్తులో భార్యను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో మూడేళ్లుగా సత్యనారాయణ తన తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రపంచీకరణతో ఆంగ్లానికి ప్రాముఖ్యం
అనకాపల్లి టౌన్ : నేటి ప్రపంచీకరణలో ఇంగ్లిష్ పాత్ర, ప్రాముఖ్యత రోజు రోజుకూ పెరుగుతుందని సినీ పాటల రచయిత, గాయకుడు పుట్టా పెంచల్ దాస్ పేర్కొన్నారు. స్ధానిక హెడ్ పోస్ట్ఆఫీస్ కార్యాలయ ఆవరణలో స్ధానిక ఇంగ్లిష్ ఫ్యాకల్టీ డాక్టర్ విల్లూరి ఉమామహేశ్వరావు రచించిన ది ఆర్ట్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇన్ రైటింగ్ అనే ఇంగ్లిష్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాస్ మాట్లాడుతూ ప్రస్తుత రోజుల్లో సగటు మనిషి ఇంగ్లిషు మాట్లాడడం, రాయడం తప్పనిసరి అయిపోయిందన్నారు. ఇంగ్లిషులో చక్కగా మాట్లాడే వారు సైతం చక్కగా రాయలేకపోతున్నారన్నారు. ఇంగ్లిషులో మాట్లాడడం కంటే రాయడమే ఒక కళ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మునగపాటి భైరవ శివవేశవనాధ్, వి.నూక సత్య కిషోర్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ వై.బి. పలాసరావు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పి. సుగుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాద బాధితులకు పీఎం–రాహత్ వరం
అనకాపల్లి: రోడ్డు ప్రమాద బాధితుల ప్రాణాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ’పీఎం–రాహత్’ పథకం ఒక గొప్ప వరమని ఎస్పీ తుహిన్ సిన్హా శుక్రవారం ఒక ప్రకటనలో అన్నారు. రహదారి ప్రమాదంలో గోల్డెన్ అవర్గా ప్రాణాలకు సంజీవని ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను (గోల్డెన్ అవర్) అత్యంత కీలకమైన సమయం అన్నారు. ఈ సమయంలో బాధితుడికి సరైన వైద్యం అందితే ప్రాణాలు నిలిచే అవకాశం 90శాతం ఎక్కువగా ఉంటుందని, ప్రమాదం జరిగిన వెంటనే 100 లేదా 112 నంబర్కు సమాచారం అందించి, 108 అంబులెన్స్ ద్వారా బాధితులను తక్షణమే ఆసుపత్రికి తరలించాలన్నారు. పీఎం–రాహత్ పథకం ద్వారా రోడ్డు ప్రమాదానికి గురైన ఎవరైనా సరే (పాదచారులు, వాహనదారులు, లేదా విదేశీయులు) గుర్తింపు పొందిన ఆసుపత్రుల్లో గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స పొందే అవకాశం ఉందన్నారు. ప్రమాదం జరిగిన రోజు నుంచి వరుసగా ఏడు రోజుల పాటు ఎటువంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా వైద్య సేవలు అందుతాయన్నారు. ఈ ప్రయోజనాన్ని పొందాలంటే ప్రమాదం జరిగిన 24 గంటల లోపు బాధితుడిని ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుందన్నారు. రోడ్డు ప్రమాదాల్లో మరణాల రేటును తగ్గించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ పథకం, పేద–ధనిక అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ అత్యవసర సమయంలో ప్రాణరక్షణ కల్పిస్తుందన్నారు. సహాయం చేసే వారికి ’రక్షన కింద ప్రభుత్వం రూ.25,000 బహుమతి అందజేస్తుందన్నారు. రహదారి ప్రమాదాల్లో మానవత్వంతో స్పందించి, ప్రాణాలను నిలబెట్టి సీఎం రాహత్ను పొందాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఉత్పత్తి కేంద్రం ఫినిష్!
ఉత్తరాంధ్రలోనే తాండవలో చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రానికి ఒకప్పుడు ప్రత్యేకత ఉండేది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండేళ్లుగా ఇక్కడ చేప పిల్లలు ఉత్పత్తి జరగలేదు. గతంలో ఏటా కోటి 25 లక్షల చేప పిల్లల ఉత్పత్తి జరిగే చోట నేడు ఇతర జిల్లాల్లో చేప పిల్లలు కొనుగోలు చేసి తరలించే దుస్థితికి తీసుకువచ్చింది. నాతవరం : తాండవ రిజర్వాయరు దిగువ ప్రాంతంలో 1984లో చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. ప్రతి ఏటా జూన్ – ఆగస్టు మధ్య కాలంలో ఇక్కడ కృత్రిమ ఉత్పత్తి ద్వారా కోటి 25 లక్షలు చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. పెద్ద చేపలకు హార్మోన్లు అభివృద్ధికి ఇంజక్షన్లు చేసి కృత్రిమ ఉత్పత్తి ద్వారా వివిధ రకాలు చేప పిల్లలను ఉత్పత్తి చేసేవారు. ఆ పిల్లలను మత్స్య సహకార సంఘాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేసేవారు. ఇంకా మిగిలిన పిల్లలను జిల్లాలో ఉన్న తాండవ, రైవాడ, కల్యాణపులోవ, కోనాం, వరాహ, మేహాద్రిగెడ్డ, రావణాపల్లి రిజర్వాయర్లలో విడుదలకు తరలించేవారు. చెరువుల్లో పెంచుకునేందుకు ప్రైవేటు వ్యక్తులకు కూడా విక్రయాలు చేసేవారు. అయితే రెండేళ్లుగా తాండవ చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రంలో మచ్చుకై నా పిల్లలు ఉత్పత్తి చేయలేదు. కేంద్రంలో సిబ్బంది జాడే కన్పించడం లేదు. ఇటీవల కాలంలో ఎప్పుడు చూసినా తాండవ చేప పిల్లలు ఉత్పత్తి కేంద్రం మూసి ఉంటుంది. చేప పిల్లలు ఉత్పత్తి చేసేందుకు నిర్మించిన నీటి కుండీలు నీటితో నిండుగా కన్పిస్తున్నాయి. నీటి కోసం కేంద్రంలో ఏర్పాటు చేసిన బోరుని ఉపయోగించక మరమ్మతుకు గురై పిచ్చి మొక్కల నడుమ కన్పించకుండా ఉంది. కేంద్రం గేట్లు ఊడి పోయి భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది. కిటికీలు, తలుపులు చెదలుపట్టి విషకీటకాలకు నిలయంగా మారింది. గతంలో ఇక్కడ పని చేసే సిబ్బంది పదవీ విరమణ చేయగా, మరికొందరు బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఈ కేంద్రం నర్సీపట్నం మత్స్యశాఖ అభివృద్ధి అఽధికారి ఆధ్వర్యంలో నడుస్తోంది. సామగ్రి లేదు, సిబ్బంది లేరు... ఈ విషయంపై నర్సీపట్నం మత్స్యకార అభివృద్ధి అఽధికారి నాగమణిని వివరణ కోరగా చేప పిల్లలు ఉత్పత్తి చేసేందుకు సామగ్రి లేదన్నారు. గతంలో పని చేసే సిబ్బంది ప్రస్తుతం లేరని, సచివాలయ సిబ్బందితో మూడేళ్లుగా పని చేయిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది రెండుసార్లు ఇతర జిల్లాలో 9 లక్షల 80 వేల చేప పిల్లలు కొనుగోలు చేసి తీసుకొచ్చి తాండవ ప్రాజెక్టులో విడుదల చేశామన్నారు. తాండవలో చేప పిల్లలు పెంచే నీటి కుండీలురెండేళ్లుగా చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం మూత గతంలో ఏటా కోటి 25 లక్షలకు పైగా పిల్లలు ఉత్పత్తి ఉమ్మడి జిల్లాలో మత్స్యకార సంఘాలకు సరఫరా కూటమి ప్రభుత్వం వచ్చాక మూలకు చేరిన వైనం నిర్వహణ లేక కేంద్రం భవనాలు, నీటి కుండీలు శిథిలం -
అపార్ట్మెంట్పై నుంచి జారిపడి వాచ్మన్ మృతి
పెందుర్తి: చినముషిడివాడలోని ఓ అపార్ట్మెంట్పై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి వాచ్మెన్ దుర్మరణం పాలయ్యాడు. అనకాపల్లి జిల్లా దేవరాపల్లికి చెందిన వి.సన్నిబాబు(51) కుటుంబంతో కలిసి ఉపాధి నిమిత్తం చినముషిడివాడ వలస వచ్చారు. ఇక్కడి ఎల్ఎం నివాస్ అపార్ట్మెంట్లో వాచ్మెన్గా పనికి కుదిరాడు. శుక్రవారం నాలుగో అంతస్తులో పని నిమిత్తం వెళ్లిన సన్నిబాబు ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రగాయాలతో అక్కడిక్కడే మరణించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. అయితే యజమానులు పనులు చెప్పడంతో పైకి వెళ్లిన సన్నిబాబు ప్రమాదానికి గురయ్యాడని.. కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కాసేపు ఆందోళన చేశారు. స్థానికులు వారికి సర్ది చెప్పడంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. సీఐ కె.వి.సతీష్కుమార్ ఆద్వర్యంలో కేసు దర్యాప్తు జరుగుతుంది. -
అసైన్డ్ భూములపై అధికార పార్టీ నేతల కన్ను
దేవరాపల్లి: మాడుగుల నియోజకవర్గంలోని అసైన్డ్ భూములపై స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి సహా అధికార పార్టీ నేతల కన్ను పడిందని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. నియోజకవర్గంలోని అసైన్డ్ పట్టాదారులంతా అప్రమత్తంగా ఉండి తమ భూములను రక్షించుకోవాలని సూచించారు. నియోజకవర్గంలో పరిశ్రమల పేరిట పేద గిరిజనులు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ నేతల కుట్రలను రైతులు, గిరిజనులు, వృత్తిదారులు, దళితులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. దేవరాపల్లి మండలం కొండకొడాబు, సమ్మెద, కొత్తూరు, చింతలపూడి, కోరాడ గ్రామాలలో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ పేరిట 820 ఎకరాలను, చీడికాడ మండలం జి. కొత్తపల్లి, అడవిల అగ్రహారం, చినగోగాడ, బైలపూడి గ్రామాల్లో సోలార్ ప్లాంట్ పేరిట 262 ఎకరాలను, కె.కోటపాడు మండలం ఆర్లి, గుల్లేపల్లి, చింతపాలెం, గరుగుబిల్లి గ్రామాల్లో ఎస్ఈజెడ్ పేరిట 10,250 ఎకరాలను, మాడుగుల మండలం తాటిపర్తి పంచాయతీలో వీఎంఆర్డీఏ పేరిట 110 ఎకరాల అసైన్డ్ భూములను రైతుల నుంచి బలవంతంగా లాక్కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్లి పంచాయతీలో నాలుగు రోజులు క్రితం కూటమి నాయకులు మీటింగ్ పెడితే భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని రైతులు స్పష్టం చేశారన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న కొందర్నీ తాజాగా ఆర్డీవో దగ్గరికి పంపించి భూములు ఇస్తున్నట్లుగా చెప్పించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. వ్యవసాయంపై అధారపడిన మాడుగుల నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ముందుగా సుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, ఆ తర్వాత వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమలు కోసం కృషి చేయాలని పాలకులకు హితవు పలికారు. పరిశ్రమల పేరుతో పేద రైతుల అసైన్డ్ భూములను కాజేయాలని చూస్తే ఊరుకునేది లేదని, రైతులకు అండగా నిలిచి సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. -
మెట్రో సీసీకి భారీ విజయం
విశాఖ స్పోర్ట్స్ : సూపర్ నాకవుట్ వన్డే మ్యాచ్ల్లో మెట్రో సీసీ, గెలాక్సీ సీసీ జట్లు పరుగుల వరద పారించి భారీ విజయాలను అందుకున్నాయి. రైల్వే స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెట్రో సీసీ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 526 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ హ్రితిక్ కేవలం 45 బంతుల్లోనే 13 సిక్సర్లు, 8 ఫోర్లతో 119 పరుగులు చేయగా, మిడిలార్డర్లో పరమ్వీర్ 147 పరుగులతో అజేయంగా నిలిచాడు. వీరికి తోడుగా కెప్టెన్ యువన్ (85), వినోద్ (87), శ్రావణ్ (52) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం ఛేదనకు దిగిన వైజాగ్ బ్లూస్ జట్టు 18.1 ఓవర్లలో కేవలం 91 పరుగులకే కుప్పకూలింది. మెట్రో బౌలర్ అచ్యుత్ 5 వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరవడంతో మెట్రో సీసీ 435 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. మరోవైపు వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన హిందూ ట్రోఫీ మ్యాచ్లో గెలాక్సీ సీసీ జట్టు సిటీ పోలీస్పై 360 పరుగుల తేడాతో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన గెలాక్సీ సీసీ 478 పరుగులకు ఆలౌటైంది. హిమకర్ (61), భస్వంత్ (76), ధీరజ్ (59) రాణించడంతో జట్టు భారీ స్కోరును అందుకోగలిగింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సిటీ పోలీస్ జట్టు గెలాక్సీ బౌలర్ల ధాటికి తట్టుకోలేక 25.5 ఓవర్లలో 118 పరుగులకే చాపచుట్టేసింది. యశ్వంత్, వాసు, ధీరజ్లు తలో రెండు వికెట్లు తీసి పోలీస్ జట్టును కోలుకోలేని దెబ్బతీశారు. జగదీష్ (21) మినహా మిగిలిన బ్యాటర్లెవరూ రాణించలేకపోవడంతో పోలీస్ జట్టుకు భారీ పరాజయం తప్పలేదు. ఘోరంగా ఓడిన సిటీపోలీస్ జట్టు -
మృతదేహానికీ వివక్షేనా?
ప్రశ్నార్థకమైన మానవత్వం ఒక ఎంపీటీసీ హోదాలో ఉన్న వ్యక్తికే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే, ఇక సామాన్య గిరిజనుల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉదయిస్తోంది. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే రోగుల పట్ల కేజీహెచ్ సిబ్బంది వైఖరి మారాలని, మరణంలోనైనా వారికి గౌరవం దక్కాలని స్థానికులు కోరుతున్నారు. చివరికి సుభద్ర, భాగ్యలక్ష్మి బాధితులను పరామర్శించి, వాహనం ఏర్పాటు చేసి పంపించడంతో ఆ విషాద ప్రయాణం ముందుకు సాగింది. మహారాణిపేట : ‘పేదవాడికి ప్రాణం ఉన్నప్పుడు వైద్యం దొరకదు.. ప్రాణం పోయాక గౌరవం దక్క దు’. ఉత్తరాంధ్రకు తలమానికం అని చెప్పుకునే కేజీహెచ్లో గిరిజనుల పట్ల అమానుషత్వం మరోసారి బట్టబయలైంది. ఒక ఎంపీటీసీ హోదాలో ఉన్న గిరిజన నాయకుడి మృతదేహాన్ని తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాన్ని నిరాకరించి, వ్యవస్థ ఎంతటి మొద్దునిద్రలో ఉందో చాటిచెప్పారు. ప్రజాప్రతినిధులు రోడ్డెక్కితే తప్ప కదలని ఈ మొండి యంత్రాంగంపై ఇప్పుడు సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆఖరి ప్రయాణానికి అడ్డంకులు జి.కె.వీధి మండలం దామన్నపల్లి ఎంపీటీసీ కొర్ర బీమరాజు (45) అనారోగ్యంతో పోరాడుతూ శుక్రవారం ఉదయం కేజీహెచ్లో తుదిశ్వాస విడిచారు. కొండ కోనల నుంచి మెరుగైన వైద్యం అందుతుందని ఆశతో వచ్చిన ఆ కుటుంబానికి, మరణం తర్వాత కోలుకోలేని చేదు అనుభవం ఎదురైంది. కనీసం మృతదేహాన్ని తరలించడానికి ‘మహాప్రస్థానం’ వాహనాన్ని గానీ, అంబులెన్స్ను గానీ కేటాయించమని వేడుకున్నా.. ఆసుపత్రి అధికారులు కనికరించలేదు. దిక్కుతోచని స్థితిలో అమాయక గిరిజనులు ‘వాహనాలు అందుబాటులో లేవు’ అంటూ సిబ్బంది చెప్పిన మాటలు బాధితుల గుండెల్లో బాణంలా గుచ్చుకున్నాయి. ఆసుపత్రిలోని ఎస్టీ సెల్కు సమాచారం అందించినా, అక్కడ కూడా స్పందన కరువైంది. తమ వారిని కోల్పోయిన బాధ ఒకవైపు, పార్థివ దేహాన్ని ఇంటికి ఎలా తీసుకెళ్లాలో తెలియని అయోమయం మరోవైపు.. ఆ గిరిజనుల వేదన వర్ణనాతీతం. వ్యవస్థల మధ్య సామాన్యుడు, ముఖ్యంగా గిరిజనుడు ఎంతటి అగౌరవానికి గురవుతున్నాడో ఈ దృశ్యాలు కళ్లకు కట్టాయి. నేతల జోక్యంతో కదిలిన యంత్రాంగం ఈ విషయం తెలుసుకున్న జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్ల భాగ్యలక్ష్మి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైర్పర్సన్, నేరుగా సూపరింటెండెంట్తో మాట్లాడారు. ప్రజాప్రతినిధులు రంగంలోకి దిగడంతో నిమిషాల వ్యవధిలోనే ‘లేవన్న’ వాహనాలు ప్రత్యక్షమయ్యాయి. కేజీహెచ్లో మృగ్యమైన మానవత్వం -
కార్టూన్లు వేద్దాం రండి..!
నాతవరం: ఈ వేసవిలో కార్టూన్లు వేద్దాం రండి అంటున్నారు ప్రముఖ కార్టూనిస్టు, రచయిత, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత అంబటి చంటిబాబు మాస్టారు. ఈ పోటీ ప్రపంచంలో మానసిక ఒత్తిడిని జయించి, విజ్ఞానం, వినోదం, మానసిక వికాసం కోసం కార్టూన్లు దోహదపడతాయని ఆయన చెబుతున్నారు. నాతవరం మండలం చమ్మచింత ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న చంటిబాబు మాస్టారు విద్యార్థులకు వేలిముద్రలతో చిత్రాలు, కార్టూన్ల ద్వారా పలు సామాజిక విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈ వేసవి సెలవుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటు ఆసక్తి ఉన్న వారందరికీ కార్టూన్లు, వేలిముద్రల ద్వారా పలు చిత్రాలు వేయడంపై చమ్మచింతలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు ఎటువంటి ఫీజు తీసుకోవడం లేదు. పిల్లల కోసం వేలిముద్రలు చిత్రాల పుస్తకం, మనోహరం, కార్టూన్ల పుస్తకం, కార్టూన్ల శతకం రాశానని, అవి ఎంతో గుర్తింపునిచ్చాయని చంటిబాబు తెలిపారు. కార్టూన్లు గీయడం వల్ల పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను బయటకు తీయవచ్చునన్నారు. -
కూటమి నేతల అరాచకాలను ఎదుర్కొంటాం
నర్సీపట్నం: కూటమి నేతల అరాచకాలను న్యాయస్థానాల ద్వారా ఎదుర్కొంటామని, మరీ శ్రుతిమించితే రోడ్డెక్కి ప్రతిఘటిస్తామని మాజీ మంత్రి గుడి వాడ అమర్నాథ్ హెచ్చరించారు. నర్సీపట్నం పెద్దచెరువు ఘటనలో వైఎస్సార్సీపీ నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, ఉపాధ్యక్షుడు సుర్లనాయుడులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న ఆయన గురువారం నర్సీపట్నంలో బాధిత కుటుంబాలను కలిసి భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ కోర్టు స్టే ఇచ్చినప్పటికీ చెరువులో అక్రమంగా నిర్మాణాలు జరుగుతుండడంతో పరిశీలించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే గణేష్పై స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరులు దాడికి యత్నించి, కారును ధ్వంసం చేశారన్నారు.సెక్యూరిటీగార్డుతో మాజీ ఎమ్మెల్యే గణేష్, పీఏ, పార్టీ నాయకులు శివ, నాయుడుపై అక్రమ కేసు పెట్టించారని చెప్పారు. సంఘటన జరిగిన పది రోజుల తరువాత ఎఫ్ఐఆర్లో సెక్షన్లు మార్చి అరెస్టు చేయించడం దారుణమన్నారు. పనులు నిలిపివేయాలని కోర్టు స్టే ఇచ్చినా, కూటమి నేతలు వ్యవస్థలను మ్యానేజ్ చేసి పనులు చేపట్టడం చట్టవిరుద్ధమని చెప్పారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, హోంమంత్రి అనిత ఫొటో సూట్లో ఉండడం ప్రజలు చేసుకున్న దురదృష్టమని తెలిపారు. అక్రమ అరెస్టులకు భయపడేదిలేని, నాయకులకు పార్టీ అధిష్టానం అండగా నిలుస్తుందని చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డా రు. అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలిపారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే గణేష్ సతీమణి కళావతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్ కోనేటి రామకృష్ణ, పార్టీ లీగల్సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర తదితరులు పాల్గొన్నారు. నాయకుల కుటుంబాలకు పరామర్శనర్సీపట్నంలో బుధవారం పోలీసులు అరెస్టు చేసిన వైఎస్సార్సీపీ నాయకుల కుటుంబ సభ్యులను మాజీ మంత్రి గుడివాడ అమర్నాఽథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ గురువారం పరామర్శించి, భరోసా ఇచ్చారు. శివపురంలోని ఏకా శివ, బలిఘట్టంలో సుర్ల నాయుడు ఇళ్లకు వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అక్రమ అరెస్టులకు భయపడవద్దని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వీరి వెంట పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, అప్పలనాయుడు, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పెట్ల అప్పలనాయుడు, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, రాష్ట్ర యూత్ వింగ్ నాయకుడు సీహెచ్.వరుణ్ తదితరులున్నారు. -
25, 26 తేదీల్లో ఎస్బీఐ ఉద్యోగుల సమ్మె
బీచ్రోడ్డు: ఎస్బీఐ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 25, 26 తేదీల్లో అఖిల భారత భారతీయ స్టేట్ బ్యాంక్ కార్మిక సంఘం అధ్వర్యంలో దేశ వ్యాప్త సమ్మె నిర్వహించనున్నట్లు సంఘం కార్య నిర్వాహక సభ్యురాలు ఎ.సుష్మ తెలిపారు. ఈ మేరకు సమ్మె వివరాలను నగరంలోని సంఘం కార్యాలయంలో గురువారం వెల్లడించారు. తాము ఎదుర్కొంటున్న 16 సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు విన్నవించుకున్నా పరిష్కారం లభించలేదన్నారు. 29 ఏళ్లుగా మెసెంజర్లు, అర్మ్డ్ గార్డుల నియామకం చేపట్టలేదని, వాటిని తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. శాశ్వత ఉద్యోగాల భర్తీ, ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్స్ తదితర అంశాలను వెంటనే పరిష్కరించాలన్నారు. సమావేశంలో సంఘం విశాఖ ప్రాంత ఉపాధ్యక్షుడు పి.సతీష్, సహాయ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
స్ఫూర్తి కేంద్రాలుగా అల్లూరి నడియాడిన ప్రాంతాలు
నర్సీపట్నం: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడియాడిన ప్రాంతాలను జాతీయ స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పి.వి.ఎన్.మాధవ్ తెలిపారు. అల్లూరి వర్ధంతి సందర్భంగా నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లి మదుం వద్ద ఉన్న అల్లూరి విగ్రహానికి గురువారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ జిల్లా పాండ్రంగి, పశ్చిమగోదావరి జిల్లా మోగల్లు, అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని మంప, రాజేంద్రపాలెం, అనకాపల్లి జిల్లాలోని కృష్ణదేవిపేట ప్రాంతాలను అల్లూరి స్ఫూర్తి కేంద్రాలుగా మార్చబోతున్నామన్నారు. త్వరలో లంబసింగిలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ప్రారంభమవుతుందన్నారు. జూన్ 4న పాండ్రంగిలో భారతమాత పార్కును ప్రారంభించనున్నామన్నారు. ఓబీసీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె.వి.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ, టౌన్ అధ్యక్షుడు బోళెం అప్పన్న దొరబాబు, నర్సీపట్నం రూరల్ అధ్యక్షుడు నిద్దర శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బోళెం శివ పాల్గొన్నారు. గొలుగొండ: కృష్ణదేవిపేట గ్రామంలో ఉన్న అల్లూరి సమాధి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఘన నివాళులర్పించారు. అల్లూరి, గంటందొర, మల్లుదొర సమాధులకు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గాదె శ్రీనివాసరావు, సునీల్రెడ్డి, సురేంద్రమోహన్, సత్యనారాయణ, సూర్యనారాయణ పాల్గొన్నారు. -
ఆందోళన బాట
సమస్యలు పరిష్కరించకపోతే మహారాణిపేట: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పెండింగ్ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ ఎన్జీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే, భవిష్యత్తు కార్యచరణను ప్రకటించడానికి త్వరలోనే సమావేశం అవుతామని హెచ్చరించారు. గురువారం నగరంలోని ఎన్జీవో హోమ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంఘ నేతలతో కలిసి మాట్లాడారు. కొత్త పీఆర్సీ కోసం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారని, ప్రభుత్వం వెంటనే పీఆర్సీ చైర్మన్ను నియమించి, ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. పెరిగిన ధరలు, జీవన వ్యయానికి అనుగుణంగా ఉద్యోగులకు తక్షణమే మధ్యంతర భృతి ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న డీఏలు, సరెండర్ లీవ్ బకాయిలను ఒక క్రమపద్ధతిలో వెంటనే విడుదల చేయాలని, యాక్ట్ 30 ప్రకారం అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరారు. సెలవు రోజుల్లో ఒత్తిడి చేయడం తగదు ప్రభుత్వ లక్ష్యాల సాధన కోసం ఉద్యోగులు అహర్నిశలు శ్రమిస్తున్నారని, అయితే సెలవు రోజుల్లో కూడా వారిని పని చేయమని ఒత్తిడి తీసుకురావడం సరికాదని విద్యాసాగర్ పేర్కొన్నారు. విశ్రాంతి ఉంటేనే ఉద్యోగులు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయగలరని వివరించారు. అలాగే, ఐవీఆర్ఎస్ కాల్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం సమంజసం కాదని, దానిని కేవలం ఒక మోడల్గా మాత్రమే తీసుకోవాలని సూచించారు. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల ద్వారా పూర్తిస్థాయి ప్రయోజనం అందడం లేదని, దీనిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ను మంజూరు చేయాలన్నారు. ఏపీ ఎన్జీజీవో ప్రధాన కార్యదర్శి డీవీ రమణ మాట్లాడుతూ.. పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని, అదే స్ఫూర్తితో రెగ్యులర్ ఉద్యోగుల సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఏపీ ఎన్జీజీవో విశాఖ అధ్యక్షుడు కె.ఈశ్వరరావు, కార్యదర్శి ఎం. రవికుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, పి. అప్పలరాజు, వై. నారాయణరావు, జి. చంద్రరావు, అనిత, రత్నకుమారి, పి. కృష్ణమూర్తి, టి.గోపాలకృష్ణ, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించండి: డీఈవో
రామారాయుడుపాలెంలో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్న డీఈవో అప్పారావునాయుడు యలమంచిలి రూరల్: తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జిల్లా విద్యా శాఖాధికారి(డీఈవో) గిడ్డి అప్పారావు నాయుడు కోరారు. గురువారం యలమంచిలి మున్సిపాలిటీ పరిధి రామారాయుడుపాలెంలో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.స్థానిక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వేగి రాజుబాబు తన కుమార్తెను డీఈవో సమక్షంలో తాను పనిచేస్తున్న రామారాయుడుపాలెం ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు.గ్రామానికి చెందిన అంగన్వాడీ ఉపాధ్యాయురాలు కూడా తన బిడ్డకు ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశం తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలన్నీ ప్రైవేటు,కార్పొరేటు స్కూళ్లకు ధీటుగా అన్ని సౌకర్యాలతో కళకళలాడుతున్నాయని,ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత విద్యను తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని తెలిపారు.ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులు దాటితే మోడల్ ప్రైమరీ స్కూల్గా తీర్చిదిద్దితామని డీఈవో చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంఈవోలు సుసర్ల సూర్యప్రకాష్,అరుణ్కుమార్,సాయిబాబా,వెంకటేశ్వర్రావు, రాజుబాబు, ప్రసాదరావు పాల్గొన్నారు. -
ద.కో. ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్గా రాజ్కుమార్
తాటిచెట్లపాలెం(విశాఖ): దక్షిణ కోస్తా రైల్వే జోన్కు తొలి ప్రిన్సిపల్ చీఫ్ ఇంజనీర్గా ఐఆర్ఎస్ఈ 1989 బ్యాచ్కు చెందిన బి.ఎస్.కె.రాజ్కుమార్ నియమితులయ్యారు. ఆయన త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాజ్కుమార్ భువనేశ్వర్లోని ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అడిషనల్ జనరల్ మేనేజర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాజ్కుమార్ ఏయూ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో గోల్డ్ మెడల్ సాధించారు. ముంబయిలోని ఐఐఎం నుంచి మేనేజ్మెంట్ స్టడీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. రైల్వేలో దాదాపు 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన.. తన సర్వీసులో ట్రాక్లు, బ్రిడ్జిలు, భారీ భవనాల నిర్మాణానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులను పర్యవేక్షించారు. దక్షిణ మధ్య రైల్వే, నార్త్ ఈస్ట్రన్ రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో ఆయన పని చేశారు. కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిపుల్ లైన్ ప్రాజెక్టుల ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కమిషనింగ్లో రాజ్కుమార్కు అపారమైన అనుభవం ఉంది. గతంలో ఆయన ఈస్ట్ కోస్ట్ రైల్వేలోనే చీఫ్ బ్రిడ్జి ఇంజనీర్గా, ప్రిన్సిపల్ చీఫ్ ఇంజినీర్గా కూడా సేవలందించారు. -
10 నుంచి హనుమజ్జయంతి పూజలు
సింహాచలం: సింహగిరి మెట్లమార్గంలో కొలువై ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఈ నెల 10 నుంచి 12 వరకు హనుమజ్జయంతి పూజలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు తెలిపారు. 10వ తేదీ ఉదయం 9 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సహస్రనామార్చన, సుందరకాండ పారాయణం నిర్వహిస్తారు. 11న ఉదయం 6 గంటల నుంచి స్వామికి అభిషేకం, 8 గంటల నుంచి సహస్రనామార్చన, సుందరకాండ పారాయణం ఉంటాయి. 12న హనుమజ్జయంతిని పురస్కరించుకుని ఉదయం 6 గంటల నుంచి పంచామృతాభిషేకాలు, 7 గంటలకు విశేష అలంకరణ చేస్తారు. 7.30 గంటల నుంచి లక్ష తమలపాకుల పూజ, 9 గంటల నుంచి పట్టాభిషేక పారాయణం, 9.30 గంటల నుంచి హవనం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ విశేష పూజల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు, ప్రసాదాలను స్వీకరించాలని ఈవో కోరారు. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఆకలి కేకలు
ఎన్జీవో హోమ్ వద్ద సాక్షితో మాట్లాడుతున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది మహారాణిపేట: ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిర్ణీత సమయంలోనే జీతాలు ఇస్తామని హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. ఇపుడు వారిని నెలల తరబడి పస్తులు పెడుతోంది. ఏకంగా 13 నెలల పాటు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం నగరంలోని ఎన్జీవో హోమ్కు వచ్చిన ఆంధప్రదేశ్ నాన్ గజిటెడ్, గజిటెడ్ ఆఫీసర్స్(ఏపీఎన్జీజీవోస్) రారష్ట్ర అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ను బాధిత ఔట్సోర్సింగ్ సిబ్బంది కలిసి, తమకు జీతాలు ఇప్పించాలని మొరపెట్టుకున్నారు. దీంతో ఈ విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. గతంలో రెండు సార్లు ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో జీతాల కోసం ఔట్ సోర్సింగ్ సిబ్బంది వినతులు ఇచ్చారు. ఎలాంటి స్పందన రాకపోవడంతో సిబ్బంది కుటుంబ పోషణకు నానా కష్టాలు పడుతున్నారు. కావాలనే ఫైల్ తొక్కిపెట్టారు? కింగ్ జార్జ్ ఆస్పత్రి(కేజీహెచ్), ఆంధ్రా మెడికల్ కాలేజీ(ఏఎంసీ)లో 36 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్నారు. వీరికి గత ఏడాది ఏప్రిల్ నుంచి జీతాలు చెల్లించట్లేదు. దీంతో తమ కుటుంబాల జీవనం సాగించేదెలా? అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అన్ని అనుమతులూ పొందిన ఈ ఫైల్ను ఎంప్లాయిమెంట్ అధికారికి పంపకుండా కేజీహెచ్లోనే తొక్కిపెట్టారని ఆరోపిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది నియామకం కోసం ఇన్చార్జి మంత్రి, కలెక్టర్ నుంచి అనుమతి వచ్చినా ఫైల్ కదలకుండా తొక్కిపెట్టడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
డీసీఐఎల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభం
విశాఖ సిటీ: పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యుత్ ఖర్చులను తగ్గించుకునే దిశగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీసీఐఎల్) కీలక అడుగు వేసింది. పీఎం సూర్య ఘర్ యోజన పథకం కింద 150 కిలోవాట్ల సామర్థ్యంతో కూడిన సౌర విద్యుత్ ప్లాంట్ను సీతమ్మధారలోని సంస్థ ప్రధాన కార్యాలయ భవనంపై ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ను డీసీఐఎల్ ఎండీ, సీఈవో కెప్టెన్ ఎస్.దివాకర్ గురువారం ప్రారంభించారు. కేంద్ర ఓడరేవుల శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ భాగస్వామ్యంతో లెడ్యూర్ లైటింగ్స్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసింది. గత మార్చి 29న డీసీఐఎల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ ప్లాంట్ పనులను వర్చువల్గా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎండీ కెప్టెన్ ఎస్.దివాకర్ మాట్లాడుతూ.. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం దిశగా డీసీఐఎల్ తన ప్రయాణాన్ని వేగవంతం చేసిందన్నారు. ఈ ప్లాంట్ ద్వారా రోజుకు సుమారు 750 యూనిట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుందని, అంటే నెలకు 22,500 యూనిట్లు, ఏడాదికి సుమారు 2.7 లక్షల యూనిట్ల విద్యుత్ లభిస్తుందని వెల్లడించారు. దీని వల్ల సంస్థకు నెలకు రూ. 2.5 లక్షలు, ఏడాదికి సుమారు రూ. 30 లక్షల మేర విద్యుత్ ఖర్చులు ఆదా అవుతాయని వివరించారు. ఈ ప్లాంట్ వల్ల ఏడాదికి సుమారు 220 నుంచి 240 టన్నుల కార్బన్ డయాకై ్సడ్ ఉద్గారాలు తగ్గుతాయని, ఇది 10 వేల మొక్కలు నాటడంతో లేదా 50 ప్యాసింజర్ వాహనాలను రహదారిపై నుంచి తొలగించడంతో సమానమని ఆయన పేర్కొన్నారు. -
చెలగాటం
చెరకు రైతులతో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్పై ఎటూ తేల్చని ప్రభుత్వం నాట్లకు అదును దాటుతున్నా అంతులేని నిర్లక్ష్యం సాగుపై అనిశ్చితిలో అన్నదాతలు వచ్చే సీజన్లో కూడా క్రషింగ్ను నిలిపివేసేందుకు కుట్ర ? బకాయిలు చెల్లింపుపై నోరుమెదపని ఎమ్మెల్యేలు మరో సారి ఉద్యమానికి సిద్ధమవుతున్న రైతులు,కార్మికులు గోవాడ సుగర్ ఫ్యాక్టరీచోడవరం: గోవాడ సుగర్ ఫ్యాక్టరీ రైతుల, కార్మికుల బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇచ్చిన హామీ నీటిమూటగానే మిగిలిపోయింది. దీంతో రైతులు, కార్మికుల పరిస్థితి దయనీయంగా ఉంది. మరో వైపు ఫ్యాక్టరీని మూసివేసినట్టు చెప్పకుండా.. వచ్చే క్రషింగ్ సీజన్కు అవసరమైన చెరకు సాగుపై ఎటువంటి నిర్ణయం ప్రకటించకుండా ప్రభుత్వం రైతులతో దోబూచులాడుతోంది. ఇటీవల కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో కూడా ఫ్యాక్టరీకి కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. చెరకు రైతుల పేమెంట్లు, కార్మికుల జీత బకాయిలకు సుమారు రూ. 29కోట్లు అవసరం కాగా ఈ బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయలేదు. దీంతో ఫ్యాక్టరీని మూసివేసేదిశగానే ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తున్నప్పటికీ అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అదును దాటుతున్నా అంతులేని నిర్లక్ష్యం ఒక పక్క చెరకు సాగుకు విత్తనం నాటే అదును దాటుతోంది. ఈ నెలాఖరులోగా చెరకు విత్తనం నాటకపోతే ఈ ఏడాది క్రషింగ్కు చెరకు ఎక్కడా ఉండదు. అలాంటి పరిస్థితిలో ఇప్పటి వరకూ ప్రభుత్వం గోవాడ సుగర్ ఫ్యాక్టరీని నడిపించే విధంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడం రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చెరకు పంట వేయాలా వద్దా అనేది ప్రశ్నా ర్థకంగా మారింది. ఇటీవల చోడవరం ఎమ్మె ల్యే కె.ఎస్.ఎస్.ఎస్.రాజు చెరకు పంటకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న వేయాలంటూ ప్రకటనలు చేశా రు. అయితే ఆ మొక్కజొన్న ఎవరు కొంటారు, ఎక్కడ మార్కెటింగ్ చేయాలో ఆయన చెప్పలేదు. గోవాడ ఫ్యాక్టరీ పరిధిలో ఏటా 30వేల ఎకరాల్లో చెరకు సాగు జరుగుతుంది. ఇన్ని వేల ఎకరాల్లో ఇప్పుడు ఏ పంట వేయాలో రైతులకు అర్థంకాన్ని పరిస్థితి. 2026–27 క్రషింగ్పై ప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తేనే కాని చెరకు పంట సాగుపై రైతుల్లో నెలకొన్న ఆందోళన తొలిగేపరిస్థితి లేదు. స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడంతో చెరకు రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల మాటలు.. నీటి మూటలు చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు కెఎస్ఎన్ఎస్ రాజు, బండారు సత్యనారాయణమూర్తి ఇచ్చిన హామీలు కూడా నీటి మూటలుగా మిగిలాయి. ఫ్యాక్టరీ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం...నిధులు తెస్తున్నాం...ఇచ్చేస్తాం అంటూ అంటూ ఊదరగొట్టిన అధికార పార్టీకి చెందిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు ఇప్పుడా ఊసే ఎత్తడం లేదు. 2023–24 సీజన్కు సంబంధించి చెరకు రైతులకు రూ.24కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. కార్మికులకు జీతభత్యాలు కింద మరో రూ. 7కోట్లు బకాయిలు చెల్లించాలి. ఫ్యాక్టరీ పూర్తిగా నష్టాల్లో ఉండటంతో ప్రభుత్వమే గ్రాంటు రూపంలో ఆదుకోవాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచీ ఫ్యాక్టరీకి ఒక్క పైసా కూడా సాయం చేయలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా రూ. 10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకూ సాయం చేసి ఐదేళ్లలో సుమారు రూ. 89కోట్లు సాయం అందించింది. దీంతో ఫ్యాక్టరీ ఆర్థికంగా నష్టాల్లో ఉన్నా రైతులకు పేమెంట్స్, కా ర్మికులకు జీతాలు ఎక్కడా బకాయి లేకుండా ఐదేళ్లు క్రషింగ్ సజావుగా సాగింది. చంద్రబాబు అధికారం చేపట్టిన తరువాత గత సీజన్లో ఫ్యాక్టరీలో క్రషింగే చేయకుండా ఇక్కడి చెరకును సంకిల ప్రైవేటు ఫ్యాక్టరీకి తరలించారు. మరోసారి ఉద్యమానికి సిద్ధమతున్న రైతులు, కార్మికులు ఇటు ప్రభుత్వం, అటు ఎమ్మెల్యేలు తమను మోసం చేశారంటూ మరోసారి ఆందోళనకు రైతులు, కార్మికులు సిద్ధమతున్నారు. ఇప్పటికే అఖిలపక్షనాయకులంతా దీనిపై చర్చలు చేస్తూ ఈ దఫా ఆందోళన ఏవిధంగా చేయాలనే అంశంపై యోచన చేస్తున్నారు. ఫ్యాక్టరీని నమ్ముకుని చెరకు పండించిన 24వేల మంది రైతులు, కార్మికులు ఏమైపోతారు, వారి మనుగడ ఏంటి అనే ఆలోచన కూడా ప్రభుత్వం చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న చెరకు రైతులతో చంద్రబాబు ప్రభుత్వం చెలగాట మాడుతోంది. రైతులు, కార్మికులకు చెల్లించవలసిన బకాయిల విషయంలో నిమ్మకునీరెత్తినట్టు ఉంటున్న సర్కారు...మరో వైపు వచ్చే క్రషింగ్ సీజన్కు అవసరమైన చెరకు సాగుపై ఎటువంటి నిర్ణయం ప్రకటించకుండా దోబూచులాడుతుండడంతో రైతులు అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నారు. చెరకు పంట వేయాలో... లేదో తెలియక ఆందోళన చెందుతున్నారు. వచ్చే సీజన్లో కూడా గోవాడలో క్రషింగ్ జరపకుండా ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి రైతులు, కార్మికుల బకాయిలు చెల్లించలేకపోయిన చోడవరం, మాడుగుల ఎమ్మెల్యేలు రాజీనామా చేసి రైతులతో ఉద్యమానికి సిద్ధం కావాలి. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి రైతులు, కార్మికుల బకాయిలు చెల్లిస్తామని చెప్పిన ఎమ్మెల్యేలు, కనీసం బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేయించలేకపోయారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని ఎమ్మెల్యేలిద్దరూ వెంటనే రాజీనామా చేయాలి. త్వరలో రైతులు,కార్మికులంతా కలిసి ఉద్యమానికి దిగుతాం. –రెడ్డిపల్లి అప్పలరాజు, రైతు సంఘం జిల్లా నాయకులు,చోడవరం.ప్రభుత్వం డ్రామాలాడుతోంది ఈనెలాఖరులతో చెరకు విత్తనం నాటేందుకు అదును ముగుస్తుంది. ఈ ఏడాదైనా ఫ్యాక్టరీ క్రషింగ్ చేస్తారా లేదా అనేది ఇప్పటి వరకు ప్రకటించలేదు. చెరకు పంట వేయకపోతే చెరకు లేదు..అందుకే ఈ ఏడాది కూడా క్రషింగ్ చేయలేమని చెప్పి పూర్తిగా ఫ్యాక్టరీని మూసివేసేందుకే ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. రైతులు,కార్మికుల బకాయిలు చెల్లించకపోతే వారు ఎలా బతుకుతారు. బకాయిలు చెల్లించడంతోపాటు వచ్చే సీజన్లో నైనా ఫ్యాక్టరీని తెరిచేలా చర్యలు తీసుకునేవరకూ ఉద్యమం ఆగదు. –కోన మోహన్రావు, ఏపీ రైతు కూలీ సంఘం, జిల్లా అధ్యక్షుడు. మరోసారి ఉద్యమం పదిరోజుల్లో కార్మికుల బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చిన ఇద్దరు ఎమ్మెల్యేలు తర్వాత పట్టించుకోవడం మానేశారు. చెరకు బకాయిలు రెండేళ్లుగా చెల్లించలేదు. క్రషింగ్ చేస్తారో.. ఫ్యాక్టరీని మూసివేస్తారో చెప్పలేదు. గందరగోళంలో ఉంచారు. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో మరో సారి ఉద్యమానికి దిగుతాం. –శరగడం రామునాయుడు, గుర్తింపు కార్మిక సంఘం, ప్రధానకార్యదర్శి, గోవాడ సుగర్ ఫ్యాక్టరీ. -
అల్లూరి పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తి
అల్లూరి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న అదనపు ఎస్పీ మోహన్రావు అనకాపల్లి: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయులపై చేసిన పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిందని అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా స్థానిక ఎస్పీ కార్యాలయంలో గురువారం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల హక్కుల కోసం, వారిపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలను ఏకంచేసిన తీరు అద్వితీయమన్నారు. 1924 మే 7న ఆయన భౌతికంగా దూరమైనా, భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ జి.ఆర్.ఆర్. మోహన్, సీఐలు టి.లక్ష్మి, ఎస్.రమేష్, పిల్లా రమేష్, బి.రామకృష్ణారావు, ఎస్ఐలు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి వ్యక్తి కాదు..సమూహ శక్తి తుమ్మపాల:మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదని, సమూహ శక్తి అని ఇన్చార్జి డీఆర్వో సుబ్బలక్ష్మి అన్నారు. అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏయూలో నిలిచిన కొలువుల భర్తీ -
ఎన్డీడీ బోర్డు బృందం సందర్శన
కశింకోటలోని డెయిరీ ఫాం పరిశీలిస్తున్న ఎన్డీడీ బోర్డు ప్రతినిధుల బృందం కశింకోట: స్థానిక సంఘ మిత్ర పోడర్ గ్రోయర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కో–ఆపరేటివ్ సొసైటీని జాతీయ డెయిరీ అభివృద్ధి బోర్డు బృందం బుధవారం సాయంత్రం సందర్శించింది. ఈ సందర్భంగా ఇక్కడి పశుగ్రాస క్షేత్రాలు, డెయిరీ ఫారం, బయో గ్యాస్ ప్లాంట్ యూనిట్ను పరిశీలించింది. బృందంలో బోర్డు ప్రతినిధులు లతా, సదాశివం, అనూష హాజరయ్యారు. పాడి రైతుల అభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని, ఇందుకు తమ బోర్డు నుంచి సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. రైతులంతా సంఘంగా సంఘటితమై అభివృద్ధి చెందడానికి కృషి చేయాలన్నారు. సొసైటీ చైర్మన్ శిలపరశెట్టి చిట్టమ్మ, ఉపాధ్యక్షుడు ఎ. అప్పలనాయుడు, బోర్డు డైరెక్టర్లు బొడ్డేడ బాలాజీ, కాండ్రేగుల నాగేశ్వరరావు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయ పరికరాల కోసం దరఖాస్తుల స్వీకరణ
అనకాపల్లి: జిల్లాలో 2026–27 ఏడాదికి గాను రైతులకు వ్యవసాయ పరికరాలను అందించేందుకు ఈనెల 19వ తేదీ వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పలేట్ తెలిపారు. స్థానిక కలెక్టర్ కార్యాలయంలో బుధవారం జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, ఇతర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు జిల్లాలో ఈ–పంట నమోదు ఆధారంగా యంత్రాల మంజూరుకు రూ.266.44 లక్షలు కేటాయించినట్టు చెప్పారు. ఆన్లైన్లో నమోదుచేసుకున్న రైతులను ఈనెల 23 నుంచి 25వ తేదీ వరరూ డివిజన్ల వారీగా లాటరీ పద్ధతిలో ఎంపిక చేయనున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారిణి, ఆశాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కనకమహాలక్ష్మి హుండీ ఆదాయం లెక్కింపు
హుండీల ఆదాయం లెక్కిస్తున్న సిబ్బంది డాబాగార్డెన్స్(విశాఖ): కనకమహాలక్ష్మి దేవస్థాన హుండీల ఆదాయం లెక్కింపు బుధవా రం నిర్వహించారు. మార్చి 26 నుంచి ఈ నెల 6 వరకు హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని లెక్కించా రు. రూ.28,25,338 నగదు, 43.100 గ్రాముల బంగారం, 320 గ్రాముల వెండితో పాటు యూఎస్ఏ డాలర్లు 8, ఖతార్ కరెన్సీ రియాల్స్ 5 వచ్చాయి. హుండీ ఆదాయం లెక్కింపులో ఆల య కార్యనిర్వహణాధికారి శోభారాణి, జిల్లా దేవ దాయ ధర్మదాయ శాఖ అధికారి టి.అన్నపూర్ణ, దేవదాయ శాఖ తనిఖీదారు ఎం.శ్రీధర్ తదిత రులు పాల్గొన్నారు. డిప్లమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం అనకాపల్లి: సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, విజయ వాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిప్లమా కోర్సు లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ సీహెచ్.శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి విద్యార్హతతో 3 సంవత్సరాల వ్యవధిగల డిప్లమా ఇన్ ప్లాస్టిక్స్ టెన్నాలజీ, డిప్లమా ఇన్ ప్లాస్టిక్స్ మాల్ టెక్నాలజీ శిక్షణకు ఈనెల 28 వరకూ ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. వివరాలకు 7893586494 అనే సెల్ నంబర్లో సంప్రదించాలని పేర్కొన్నారు. -
అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా..!
సాక్షి, అనకాపల్లి: స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేస్తున్న అక్రమాలను ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డారు. నర్సీపట్నం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ లక్ష్యంగా సాగుతున్న ఈ రాజకీయ వేధింపులు బుధవారం పరాకాష్టకు చేరుకున్నాయి. వైఎస్ఆర్సీపీ నర్సీపట్నం పట్టణ అధ్యక్షుడు ఏక శివ, ఉపాధ్యక్షుడు సుర్ల నాయుడును అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా, వారిపై అక్రమ కేసులు బనాయించడంపై వైఎస్సార్సీపీ శ్రేణులు నిప్పులు చెరుగుతున్నాయి. స్పీకర్ హోదాలో ఉండి కూడా అయ్యన్నపాత్రుడు కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని కార్యకర్తలు మండిపడుతున్నారు. మఫ్టీలో వచ్చి.. గణేష్ను అరెస్టు చేస్తారన్న వార్తలతో మంగళవారం రాత్రి నుంచే నాలుగు మండలాల కార్యకర్తలు ఆయన నివాసానికి భారీగా చేరుకున్నారు. అయితే, వ్యూహాత్మకంగా కార్డెన్ సెర్చ్ పేరుతో కార్యకర్తలను అక్కడి నుంచి పంపించి వేసిన పోలీసులు.. బుధవారం మధ్యాహ్నం మఫ్టీలో వచ్చారు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో లేని సమయం చూసి ఆయన పీఏ ఏకా శివ, సన్నిహితుడు సుర్ల నాయుడులను బలవంతంగా తీసుకెళ్లారు. ఈ అక్రమ నిర్బంధాలపై స్థానికంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ధైర్యంగా నిలిచిన కళావతి అక్రమ అరెస్టులతో భయాందోళనలు సృష్టించాలని చూసినా, మాజీ ఎమ్మెల్యే సతీమణి కళావతి ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అరెస్టు చేసిన ఇద్దరు నేతలకు భరోసా కల్పించేందుకు ఆమె కోర్టు ప్రాంగణానికి వెళ్లారు. పార్టీ నేతలకు న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించడంతో కోర్టు నుంచి బయటకు వచ్చిన వారిని ఆమె ధైర్యం చెప్పారు. -
అస్వస్థతకు గురై ఉపాధి వేతనదారుడు మృతి
రావికమతం: అస్వస్థతకు గురై ఓ ఉపాధి వేతనదారుడు మృతిచెందాడు. మండలంలో మేడివాడకు చెందిన కుంచాల శ్రీనివాస్ (40)బుధవారం గ్రామంలో ఉపాధి పనికి వెళ్లాడు. 10 గంటల సమయంలో అస్వస్థతకు గురవడంతో ఇంటికి వెళ్లిపోయాడు. కొంతసేపటికి అపస్మారక స్థితికి చేరుకోవడంతో రావికమతం పీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషయంగా ఉండడంతో కేజీహెచ్కు తీసుకెళ్లాలని అక్కడి వైద్య సిబ్బంది సూచించారు. అయితే కుటుంబ సభ్యులు రావికమతంలో గల ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా మృతి చెందినట్టు అక్కడి వైద్యులు తెలిపారు. శ్రీనివాస్ ఉపాధి పనులు చేయడంతో పాటు ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి భార్య మల్లేశ్వరి, కుమారుడు,కుమార్తె ఉన్నారు. -
వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు దారుణం
నర్సీపట్నం: స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరులే దాడి చేసి తమ నాయకులపై కేసులు పెట్టడం దారుణమని వైఎస్సార్సీపీ నాయకుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్పీకర్ సొంత నియోజకవర్గంలో అక్రమ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లకాలం ఒకేలా ఉండదని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. చర్యకు ప్రతి చర్య ఉంటుందన్న విషయం టీడీపీ నాయకులు గుర్తించుకోవాలని సూచించారు. -
శకం!
ముగిసినచారిత్రక నేపథ్యం● జూన్ 1 నుంచి వాల్తేరు పేరు అధికారికంగా తొలగింపు ● 1,106 కి.మీ. మేర విస్తరించిన వాల్తేరు డివిజన్ ● 696 కి.మీ. రాయగడ డివిజన్లో విలీనం ● 463 కి.మీ.తో కొత్తగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటు ● ఖుర్దాలోని 53 కి.మీ. విలీనం● ఉద్యోగుల సర్దుబాటుపై చర్యలు పూర్తి ● 1893–1902 వరకు తూర్పు కోస్తా రాష్ట్ర రైల్వే జోన్ పరిధి ● 1902–1925 వరకు మద్రాస్ రైల్వే, దక్షిణ మరాఠా రైల్వే పరిధి ● 1925–1952 వరకు బెంగాల్ –నాగ్పూర్ రైల్వే పరిధి ● 1952–1955 వరకు మొదటిసారి రైల్వే పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు తూర్పు రైల్వే పరిధిలోకి వచ్చింది ● 1955–1966 వరకు ఆగ్నేయ రైల్వే పరిధి ● 1966–1977 వరకు దక్షిణ మధ్య రైల్వే పరిధి ● 1977–2003 వరకు మళ్లీ ఆగ్నేయ రైల్వే పరిధి ● 2003 ఏప్రిల్ 1–2026 మే 31 వరకు తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధి ● 2026 జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో విశాఖపట్నం డివిజన్గా కొనసాగనుంది.ఇ కసాక్షి, విశాఖపట్నం: వాల్తేరు డివిజన్ ఇక చరిత్రలో మిగిలిపోనుంది. జోన్ ఏర్పాటుతో డివిజన్ విచ్ఛిన్నం అనివార్యంగా మరింది. జూన్ 1 నుంచి విశాఖపట్నం కేంద్రంగా దక్షిణకోస్తా రైల్వే జోన్ కార్య కలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. వాల్తేరుని రెండు భాగాలుగా విభజించేశారు. ఖుర్దాలోని పలాస, ఇచ్చాపురం సెక్షన్లతో 53 కి.మీ. ఇందులో కలిపారు. దీంతో 696 కి.మీ. మేజర్ భాగాల్ని రాయగడ డివిజన్గానూ.. మిగిలిన 463 కి.మీ. ప్రాంతాన్ని విశాఖపట్నం డివిజన్గా ఏర్పాటు చేస్తున్నారు. చరిత్రలో చిరస్థాయి.. మద్రాసు నుంచి కలకత్తాను కలిపే తూర్పు తీర రైల్వే నిర్మాణంలో భాగంగా 1893లో వాల్తేరుకు రైలు మార్గం ఏర్పడింది. 1896లో బెంగాల్ నాగ్పూర్ రైల్వే ఆధీనంలోకి వెళ్లిన ఈ ప్రాంతం.. కాలక్రమేణా వ్యూహాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో విశాఖపట్నం పోర్టు అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. సరకు రవాణాకు వాల్తేరు ఒక ప్రధాన కేంద్రంగా మారింది. భారతీయ రైల్వే వ్యవస్థలో వాల్తేరు డివిజన్ ఒక బంగారు బాతులాంటిది. ముఖ్యంగా ఇనుప ఖనిజం, బొగ్గు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల రవాణాలో ఎన్నో రికార్డులు సృష్టించింది. ఛత్తీస్గఢ్లోని బైలడిల్లా గనుల నుంచి విశాఖ పోర్టుకి ఇనుప ఖనిజాన్ని చేరవేసే కొత్తవలస–కిరండూల్(కేకే లైన్) మార్గం ఈ డివిజన్ పరిధిలోనే ఉండేది. 56 సొరంగాలు, 87 భారీ వంతెనలు, 1,236 చిన్న వంతెనలతో ఈ మార్గం ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా గుర్తింపు పొందింది. కొత్త జోన్ రాకతో రెండుగా.. కేవలం సరకు రవాణాకే పరిమితం కాకుండా, పర్యాటక రంగంలోనూ వాల్తేరు డివిజన్ ప్రత్యేక ముద్ర వేసింది. బొర్రా గుహలు, అరకు లోయ వంటి ప్రకృతి సిద్ధమైన ప్రాంతాల మీదుగా సాగే రైలు ప్రయాణం పర్యాటకులకు మరుపురాని అనుభూతిని అందిస్తుంది. అద్దాల పెట్టెలు కలిగిన విస్టాడోమ్ రైలును ప్రవేశపెట్టి పర్యాటకాన్ని ప్రోత్సహించడంలో ఈ డివిజన్ ముందు వరుసలో నిలిచింది. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియలో భాగంగా, వాల్తేరు డివిజన్ను రెండుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక భాగం రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్, మరో భాగం కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్గా రూపాంతరం చెందుతోంది. ఈ కారణంగా వాల్తేరు అనే చారిత్రక పేరు ఇకపై రైల్వే పటంలో కనిపించే అవకాశం లేదు. దశాబ్దాల ప్రాంతీయ గుర్తింపుగా, ఉత్తరాంధ్ర ప్రజల సెంటిమెంట్గా ఉన్న వాల్తేరు కనుమరుగు కానుంది. ఆదాయం కోల్పోయినట్లే..! ప్రస్తుతం తూర్పు కోస్తా రైల్వే జోన్కు ఆదాయాన్ని తెచ్చిపెట్టే అతిపెద్ద డివిజన్ వాల్తేరు. ఏటా మూడున్నర కోట్ల మందికి పైగా ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఏటా రూ.11,598 కోట్లు ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ఇప్పుడీ ఆదాయంలో సింహభాగం రాయగడ డివిజన్కే అందనుంది. దేశంలోనే 260 డీజిల్ ఇంజన్లు ఉన్న అతిపెద్ద లోకోషెడ్, 160 ఇంజన్లుండే భారీ ఎలక్ట్రికల్ లోకోషెడ్, విశాలమైన మార్షలింగ్ యార్డు కూడా ఇక్కడే ఉన్నాయి. తూర్పు కోస్తాలోనే ఎక్కువ పాసింజర్, సరకు రవాణా వ్యాగన్ ట్రాఫిక్ కలిగిన డివిజన్ వాల్తేరు. దాదాపు శతాబ్ధంన్నర చరిత్ర ఉన్న వాల్తేరు డివిజన్లో సుమారు 19 వేల మంది ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి విభజన ప్రక్రియ కూడా దాదాపు ఓ కొలిక్కి వచ్చింది. జూన్ 1 నుంచి ప్రస్తుతం వాల్తేరు రైల్వే డివిజనల్ కార్యాలయం.. విశాఖపట్నం డివిజన్గా మారనుంది. వాల్తేరు డివిజన్ వివరాల్లో కొన్ని 133 ఏళ్ల చరిత్ర కలిగిన వాల్తేరు డివిజన్ శకం ఇక ముగిసినట్లే. ఇప్పటి వరకూ చరిత్రలో పలు జోన్ల పరిధిలో ఉన్న వాల్తేరు.. ఇకపై విశాఖపట్నంగా దక్షిణ కోస్తా జోన్ పరిధిలో ఉండనుంది. రైలు చక్రాల సవ్వడితో ఉత్తరాంద్ర జీవనాడిలా విరాజిల్లిన వాల్తేరు ప్రస్థానం ఓ ముగిసిన అధ్యాయం. బ్రిటీష్ కాలం నాటి పునాదుల నుంచి దేశంలోనే అత్యధిక ఆదాయం ఆర్జించే డివిజన్లలో ఒకటిగా ఎదిగిన వాల్తేరు ప్రస్థానం ఇక చరిత్ర పుటలకే పరిమితం. వాల్తేరు వార్షిక ఆదాయం రూ.11,598.07 కోట్లు సరకు రవాణా 85.1 మిలియన్ టన్నులు ప్రయాణికుల సంఖ్య 3.34 కోట్లు ప్రధాన ఆదాయ వనరు ఇనుప ఖనిజం, బొగ్గు, ఉక్కు వాల్తేరు డివిజన్ మొత్తం విస్తీర్ణం 1,106 కి.మీ. వాల్తేరు విభజన విశాఖపట్నం, రాయగడ డివిజన్లు విశాఖపట్నం డివిజన్ విస్తీర్ణం 463 కి.మీ. రాయగడ డివిజన్ విస్తీర్ణం 696 కి.మీ. -
పారదర్శంగా డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు
దేవరాపల్లిలో వెలుగు సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తున్న డీపీఎం పి.వెంకటరమణ దేవరాపల్లి: ‘మన డబ్బులు–మన లెక్కలు’ యాప్తో మరింత పారదర్శకంగా డ్వాక్రా సంఘాల కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ప్రాజెక్టు (సంస్థల నిర్మాణ) మేనేజర్ (డీపీఎం–ఐబీ) పి. వెంకటరమణ తెలిపారు. దేవరాపల్లి వెలుగు కార్యాలయంలో స్థానిక ఏపీఎం ఎస్.ప్రభాకర్, ఇతర సిబ్బందితో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మన డబ్బులు–మనలెక్కలు యాప్ను రావికమతం, బుచ్చెయ్యపేట, అచ్యుతాపురం, మాడుగుల, సబ్బవరం, మునగపాక మండలాల్లోని పది గ్రామైక్య సంఘాల్లో ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. ఇక్కడ విజయవంతం కావడంతో త్వరలోనే జిల్లా వ్యాప్తంగా ఈ యాప్ను అమలు చేస్తామన్నారు. డ్వాక్రా మహిళల ఆర్థికాభివృద్ధికి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2వేల కోట్లతో డ్వాక్రా వార్షిక రుణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. 1521.50 కోట్లు, సీ్త్రనిధి ద్వారా రూ. 466 కోట్లు రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉన్నతి పథకం ద్వారా రూ. 12.50 కోట్ల వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తామన్నారు. ప్రతీ వీవోఏకి స్మార్ట్ ఫోన్లు అందించామని ఆయన చెప్పారు. జిల్లా ఏపీఎం (ఐబీ) బి. కళ్యాణి తదితర్లు పాల్గొన్నారు. -
కారు ఢీకొని యాచకురాలు దుర్మరణం
యలమంచిలి రూరల్: మండలంలో పులపర్తి దాటిన తర్వాత నయారా పెట్రోల్ బంక్ సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని మహిళ మృతి చెందినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు. రహదారిపై నడిచి వెళ్తుండగా యలమంచిలి నుంచి తుని వైపు వెళ్తున్న కారు ఆమెను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి వయస్సు 40 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉంటుంది. యాచకురాలుగా భావిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియలేదని,ఎవరికై నా తెలిస్తే 9440796104 నంబరుకు ఫోన్ చేయాలని ఎస్ఐ కోరారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. -
తక్షణం బకాయిలు చెల్లించాలి
12 వారాల డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. అయితే నాలుగు రోజుల క్రితం మూడు వారాలకు సంబంధించిన సొమ్మును ప్రభుత్వం మంజూరు చేసింది. అవి ఇంకా వేతనదారుల ఖాతాల్లో పడలేదు. అది కూడా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో చేసిన పనికి సంబంధించి మూడు వారాల డబ్బులే విడుదల చేశారు. ఏప్రిల్ నెల నుంచి అయితే పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. కూలీలను వేధింపులకు గురిచేయడం సరికాదు. సకాలంలో బకాయిలు చెల్లించాలి. లేదంటే ఉద్యమించక తప్పదు. మండుటెండలో పనిచేస్తున్న కూలీలకు కనీసం టెంట్ సౌకర్యం కూడా కల్పించలేని స్థితిలో ఈ ప్రభుత్వ ఉంది. గతంలో తట్టా, గునపాపం, పార, తాగునీరు, ట్రావిలింగ్, సమ్మర్ అలవెన్సులు ఇచ్చే వారు. వాటిని పూర్తిగా కట్ చేసి, రూ. 7 పెంచినట్లు ప్రకటించడం అన్యాయం. ఉపాధి హామీ శాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రిగా ఉండి కూలీలు కష్టాన్ని అర్థం చేసుకోకపోవడం విచారకరం. –డి.వెంకన్న, ఏపీ వ్యవసాయి కార్మిక సంఘం కార్యదర్శిఉపాధి పనులు చేస్తున్న కూలీలు(ఫైల్) -
ఆకలి కేకలు
ఉపాధి కూలీల ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. మండుటెండలో రోజంతా చెమటోడ్చి కష్టపడి పనిచేసినా సక్రమంగా వేతనాలు అందడం లేదు. నగదు చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో ఉపాధి వేతనదారులకు రూ.4.56 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. వ్యవసాయ పనులు ముగియడంతో వేరే దారిలేక ఉపాధి పనులకు వెళ్లాల్సివస్తోంది. కాగా, మూడు వారాల డబ్బులు మంజూరయ్యాయని డ్వామా అధికారులు చెబుతున్నారు. అయితే తమ బ్యాంక్ ఖాతాల్లో ఇంకా జమ కాలేదని వేతనదారులంటున్నారు. ఉపాధి కూలీల సాక్షి, అనకాపల్లి : ఉపాధి హామీ పథకం పనులు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో విస్తృతంగా జరుగుతున్నాయి. వ్యవసాయ పనులు లేకపోవడంతో కూలీలంతా ఉపాధి పనుల బాట పట్టారు. పనులకు వెళ్తున్న కూలీలకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నా రు. డబ్బులు ఎప్పుడు ఇస్తారా..? అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు వేతనాలు రాలేదు. జిల్లాలో 24 మండల పరిధిలో ఉపాధి వేతనదారులకు సుమారు రూ.4.56 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. కాగా ఆరు నెలలకు గానూ 3 వారాల వేతనాలను విడుదల చేసినట్లు డ్వామా అధికారులు వెల్లడిచారు. కానీ వేతదారులు తమ బ్యాంక్ ఖాతాల్లో ఇంకా జమ కాలేదంటూ చెబుతున్నారు. జిల్లాను నాలుగు క్లస్టర్లుగా విభజించారు. ఒక్కో క్లస్టర్ పరిధిలో ఆరు మండలాలున్నాయి. నాలుగు క్లస్టర్లలోని 24 మండలాల పరిధిలో ఉపాధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎస్.రాయవరం, అనకాపల్లి, కోటవురట్ల, నర్సీప ట్నం, రావికమతం, రోలుగుంట, బుచ్చెయ్యపేట, చీడికాడ, గొలుగొండ, సబ్బవరం, యలమంచిలి, రాంబిల్లి, పాయకరావుపేట, కె.కోటపాడు, దేవరాపల్లి, నాతవరం, మునగపాక, మాడుగుల, కశింకోట, చోడవరం, అచ్యుతాపురం, నక్కపల్లి, పరవాడ, మాకవరపాలెం మండలాల్లో సుమారు లక్ష మంది వరకు కూలీలకు వేతన బకాయిలు చెల్లించాల్సి ఉంది. రోజుకు లక్ష మంది కూలీల హాజరు.. జిల్లాలో 2,81,075 జాబ్ కార్డులు జారీ చేశారు. అందులో యాక్టివ్ జాబ్ కార్డులు 2,02,924 వరకు ఉన్నాయి. రోజుకు సగటున లక్ష మంది పనులకు హాజరవుతున్నట్లు డ్వామా రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఉపాధి పనులకు హాజరయ్యేవారికి రోజుకు రూ.250 నుంచి రూ.300 కూలి లభిస్తోంది. ఆరు నెలలుగా వీరికి వేతనాలు విడుదల కాకపోవడంతో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మండాలలు : 24 జాబ్ కార్డులు : 2,81,075 యాక్టివ్ జాబ్కార్డులు : 2,02,924 రోజూ పనికి హాజరవుతున్న కూలీలు : 1 లక్ష మంది -
లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి
గాజువాక/రావికమతం: శ్రీనగర్ జంక్షన్ జాతీయ రహదారిపై ఓ లారీ డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావికమతం మండలం గడ్డిప గ్రామానికి చెందిన గల్లా రవి(48) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. బయ్యవరంలోని ఒక సిమెంట్ ఫ్యాక్టరీనుంచి సిమెంట్ లోడుతో లారీలో శ్రీనగర్కు చేరుకున్నాడు. మంగళవారం రాత్రి లారీని శ్రీనగర్లో ఆపి విశ్రాంతి తీసుకున్నాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచి కొద్దిసేపు అటు, ఇటు తిరిగి మళ్లీ పడుకున్నాడు. ఎంతసేపటికీ నిద్ర లేవకపోవడంతో ఇతర లారీల సిబ్బంది లేపారు. అయినప్పటికీ లేవకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించిన పోలీసులు రవి మృతి చెందినట్టు నిర్థారించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆయనకు భార్య రాజేశ్వరి, ఇద్దరు కుమారులు వంశీ,హర్ష,కుమార్తె వనిత ఉన్నారు. భార్య రాజేశ్వరికి కొన్నాళ్ల కిందట ఓ ఆపరేషన్ జరిగింది. ఆది వికటించించడంతో ఆమె ఆరోగ్యం దెబ్బతింది.ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చిక్సిత పొందుతోంది. రవి మరణ వార్త విన్న గుడ్డిప గ్రామస్తులు సంఘటన స్థలం చేరుకుని మృతదేహాన్ని తరలించారు. మృతుడి తల్లి,భార్య,పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.దీంతో గుడ్డిప గ్రామంలో విషాధ ఛాయులు అలుముకున్నాయి. కుమారుడు వంశీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఈదురు గాలులు.. భారీ వర్షం
మాడుగుల రూరల్/దేవరాపల్లి: జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి బలమైన గాలులతో కూడిన వర్షం దంచికొట్టింది. మాడుగుల నియోజకవర్గ పరిధిలో ఖండివరం– కోనాం రహదారిలో వైఎస్సార్సీసీ నాయకుడు, సీడీసీ చైర్మన్ సుంకర శ్రీనివాసరావుకు చెందిన అరటి తోటలో 50 అరటి చెట్లు గెలలతో నేలకొరిగాయి. సుమారు ఎకరున్నర పొలంలో వేసిన అరటితోటలో చెట్లు నేలకొరగడంతో భారీ నష్టం వాటిల్లిందని శ్రీనివాసరావు తెలిపారు. మాడుగుల మండలంలో శంకరం, తాటిపర్తి, తదితర ప్రాంతాల్లో ఈదురు గాలులకు పలు చెట్లు నేలకొరిగాయి. దేవరాపల్లి మండలంలో సుమారు గంట సేపు ఏకధాటిగా వర్షం కురవడంతో ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహన చోదకులు, ప్రజలు రాక పోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈదురు గాలు లు, భారీ వర్షం కారణంగా సాయంత్రం ఏడు గంట ల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చోడవరం: ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో చోడవరం, బుచ్చెయ్యపేట,రావికమతం, రోలుగుంట మండలాల్లో మామిడి, జీడిమామిడి పంటలకు నష్టం వాటిల్లింది. తోటల్లో 20శాతం పంట నేలరాలిపోయింది.నేలరాలిన మామిడి కాయలన్నీ పగిలి, అమ్మకానికి కూడా వీలులేకుండా పోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. -
రీ సర్వేలో వసూల్ రాజాలు
మహారాణిపేట: జిల్లాలో జరుగుతున్న భూముల రీ సర్వేలో అవినీతి కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది. కొంత మంది సర్వేయర్లు వసూల్ రాజాలుగా మారుతున్నారు. తమ కార్యాలయంలో అన్నీ తామై చేసేస్తామని రైతులను నమ్మబలుకుతూ రాయ‘బేరాలు’నడుపుతున్నారు. ఇక్కడకు వచ్చే అధికారులు తమ గుప్పిట్లోనే ఉంటారని, వారందరికీ వాటాలు ఇచ్చి.. మీకు అనుకూలంగా పనులు చేస్తామని నమ్మించి, రైతుల్ని నిలువునా ముంచేస్తున్నారు. 64 గ్రామాల్లో రీ సర్వే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక జిల్లాలోని పెందుర్తి, గాజువాక, ఆనందపురం, పద్మనాభం, భీమిలి, విశాఖ రూరల్ మండలాల పరిధి 64 గ్రామాల్లో రీ సర్వే చేపట్టారు. రెండో విడత రీ సర్వే ఇంకా ఓ కొల్కికి రాలేదు. మూడో విడత రీ సర్వే వివాదాలతో ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. చిన్న, సన్నకారు రైతుల భూములు ఏళ్ల తరబడి తమ సాగులో ఉన్నా.. సరైన రికార్డులు లేవన్న సాకుతో పెండింగ్లో పెట్టారు. జిరాయితీ భూముల సర్వేకు కూడా సర్వే బృందం వెనుకడుగు వేస్తోంది. తమ ఆధీనంలో ఉన్న పొలాలకు సంబంధించి ఆన్లైన్లో రైతుల పేర్లు లేకపోవడం, క్రయ విక్రయాలు జరిగినా రికార్డులు అప్డేట్ చేయకపోవడం సమస్యలకు కారణమవుతోంది. ఈ సమస్యల పరిష్కారానికి కొందరు అధికారులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని రైతులు వాపోతున్నారు. ఆధునిక టెక్నాలజీ.. అయినా తప్పులే! డ్రోన్లు, జీపీఎస్ యంత్రాలతో సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ, జిరాయితీ, ఇనాం తదితర భూముల రీ సర్వే చేస్తున్నారు. మండల తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్వో తదితరులకు మండల, డివిజనల్ సర్వేయర్లు, చైన్మన్లు, ఇతర సిబ్బంది సహకారం అందిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియలో ముడుపుల వ్యవహారంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిన్న చిన్న సాంకేతిక సమస్యలను సాకుగా చూపి సర్వేలు నిలుపుదల చేస్తున్నారని సమాచారం. వీటి పరిష్కారం పేరిట సర్వేయర్లు అన్నీ తామై చక్రం తిప్పుతున్నారు. మండలానికి ఇద్దరు ముగ్గురు సర్వేయర్లు కేవలం వసూళ్లకే పరిమితమైనట్లు తెలుస్తోంది. ముడుపులు చెల్లించుకుంటేనే రీ సర్వే పూర్తి చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. లేకుంటే ఒకరి సాగులో ఉన్న భూమిని రికార్డుల్లో మరొకరి పేరిట చేర్చుతున్నారని చెప్తున్నారు. మరోవైపు రీ సర్వేలో దళారులు ప్రవేశించి అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు. ‘సాంకేతిక’చిక్కులు.. తప్పని అవస్థలు రెవెన్యూ రికార్డుల్లో ఒకలా, సాగులో ఇంకోలా ఉంటే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ భూమి, ట్యాంక్ అని ఉంటే రైతుల తిప్పలు వర్ణనాతీతం. అన్నదమ్ముల తగాదాలు, కుటుంబ వివాదాలు, గ్రామ కంఠం, ఇనాం భూముల్లో రీ సర్వే పూర్తవ్వాలంటే చేతులు తడపాల్సిందేనని రైతులు వాపోతున్నారు. కొంత మంది అధికారులు ఇలాంటి జాబితాను వీఆర్వోలకు అందించి, వారిని రైతుల వద్దకు పంపి బేరసారాలకు దిగుతున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి రైతుల సాగులో ఉన్నా.. రికార్డుల్లేని భూములకు ముడుపులివ్వకుండా పాస్ పుస్తకాలు ఇచ్చేది లేదని తెగేసి చెప్తున్నారు. జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. -
తప్పుడు కేసులు పెట్టిన వారు శిక్షార్హులు
నర్సీపట్నం: తప్పుడు కేసులు పెట్టిన వారు భవిష్యత్తులో శిక్ష అనుభవించక తప్పదని వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లి దొర పేర్కొన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ నర్సీపట్నం పెద్ద చెరువులో అక్రమ నిర్మాణాల వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతుందని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చిందన్నారు. స్టే ఇచ్చినప్పటికీ పనులు చేస్తుండడంతో వాటిని ప్రజలు దృష్టికి తీసుకువెళ్లేందుకు చెరువు వద్దకు గణేష్ వెళ్తే స్పీకర్ అయ్యన్నపాత్రుడు అనుచరులు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులు దాడి చేశారన్నారు. పెద్ద చెరువు ప్రజల ఆస్తి అక్కడ అనధికారికంగా వాచ్మెన్ను పెట్టడం దారుణమన్నారు. వాచ్మెన్తో తప్పుతు ఫిర్యాదు చేయటం మరింత దుర్మార్గమన్నారు. వారిపై మాజీ ఎమ్మెల్యే కేసు పెట్టిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. స్పీకర్ ఆదేశాలతో పోలీసులు ఏకపక్షంగా మాజీ ఎమ్మెల్యే గణేష్, అనుచరులు పీఏ బాబు, పట్టణ అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఏకా శివ, సుర్లనాయుడులపై కేసు పెట్టారన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని లీగల్ సెల్ ప్రతినిధి బుల్లిదొర పేర్కొన్నారు. భవిష్యత్తులో వీరంతా తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. -
‘తుమ్మపాలలో క్వారీకి అనుమతులు ఇవ్వొద్దు’
అనకాపల్లి: మండలంలోని తుమ్మపాలలో క్వారీ (మెస్సర్స్ ఆర్ఎంసీ రెడిమిక్స్ ఇండియా) కోసం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని కూటమి నేతలు వ్యతిరేకించారు. క్వారీకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వవద్దని పది మంది వ్యతిరేకించగా, ఐదుగురు మాత్రం అంగీకారం తెలిపారు. క్వారీ వల్ల గ్రామంలో ప్రజలు వివిధ రకాల వ్యాధులు బారిన పడుతున్నామన్నారు. తుమ్మపాల సర్వే నంబర్ 04లో 4.90 హెక్టారులో రోడ్డు మెటల్, బిల్డింగ్ స్టోన్ తవ్వకాలకు 74,901 క్యూబిక్ మీటర్ల నుంచి 2,66,410 క్యూబిక్ మీటర్లకు గ్రావెల్ 14,021 క్యూబిక్ మీటర్లను సంవత్సరానికి తవ్వకాలు చేపట్టారన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ఆర్డీవో షేక్ అయిషాకు క్వారీకి అనుమతులు ఇవ్వద్దని వినతిపత్రం అందజేశారు. -
జూన్ 1 నుంచి కార్యకలాపాలు
రైల్వే చట్టం–1989 ప్రకారం తూర్పు కోస్తా, దక్షిణ మధ్య రైల్వే జోన్లను పునర్వ్యవస్థీకరించి దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేశారు. మంగళవారం విడుదలైన గెజిట్ ప్రకా రం జూన్ 1 నుంచి ఈ జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. జోన్ పరిధిలో మొత్తం నాలుగు డివిజన్లు ఉంటాయి. గతంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఉన్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లను ఈ జోన్లో చేర్చారు. అదేవిధంగా వాల్తేరు డివిజన్ను విభజించి.. దానిలో కొంత భాగంతో కొత్తగా విశాఖపట్నం డివిజన్ను ఏర్పాటు చేశారు. మరోవైపు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు కొనసాగనున్నాయి. -
కలెక్షన్!
కనెక్షన్ పేరిట ●రైతులతో ట్రాన్స్కో అధికారుల చెలగాటం ●వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా కోసం ముప్పతిప్పలు ●డీడీలు చెల్లించినా కనెక్షన్ కోసం కాళ్లరిగేలా తిరగాల్సిందే ●స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల కోసం చేయి తడపాల్సిందే ! ●సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు ●అన్నదాతల ఆవేదన రైతుల పొలాల్లో స్తంభాలు వేసి, లైన్లు ఏర్పాటు చేయకుండా వదిలేసిన దృశ్యం నక్కపల్లి : అసలే వేసవి కాలం, వర్షాలు పడడం లేదు. వేసిన పంటలను కాపాడుకోవాలంటే నీరు అవసరం. సొంత ఖర్చులతో బోర్లు ఏర్పాటు చేసుకోవాలంటే విద్యుత్ సరఫరా ఉండాలి. పొలాల్లో విద్యుత్ కనెక్షన్ కోసం ప్రభుత్వానికి (ట్రాన్స్కో) వారికి లక్షలాది రూపాయలు చెల్లించాలి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక కనెక్షన్ల కోసం డబ్బులు చెల్లించినప్పటికీ విద్యుత్లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయకుండా ట్రాన్స్కో అధికారులు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బులు చెల్లించి సంవత్సరాలు గడుస్తున్నా విద్యుత్ సరఫరా కోసం నెలల తరబడి ట్రాన్స్కో కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన దుస్దితి ఏర్పడుతోందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం నానా పాట్లు పాయకరావుపేట నియోజకవర్గం పూర్తిగా వర్షాధార ప్రాంతం, ఇక్కడ పెద్దగా నీటి వనరులు లేవు. తాండవ, వరాహ నదులున్నప్పటికీ వర్షాలు పడిన సమయంలోనే సాగునీరు అందుతుంది. మిగిలిన సీజన్లో రైతుల వ్యవసాయ బోర్లపైనే ఆధాడి పంటలు సాగు చేసుకోవడం జరుగుతంది. మెరక ప్రాంతాల్లో రైతులు జీడి, మామిడి, బొప్పాయి, అరటి తదితర ఉద్యాన వన పంటలతోపాటు కూరగాయల పెంపకాన్ని చేపడుతూ వాటిద్వారా వచ్చిన ఆదాయంతో కుటుంబాలను పోషించుకుంటారు. ఈ పంటలకు నీటి సదుపాయం నిమిత్తం సొంతంగా వ్యవసాయ బోర్లు నిర్మిస్తారు. విద్యుత్ సరఫరా ట్రాన్స్కో వారు ఏర్పాటు చేయాలి. దీనికోసం ప్రత్యేకంగా స్తంభాలు, లైన్లు, ట్రాన్సఫార్మర్లు అవసరమైతే రైతుల నుంచే చార్జీలు వసూలు చేస్తారు. ఇలా మండలంలో గొడిచర్లలో నలుగురు రైతులు తమకున్న సుమారు 8 ఎకరాల్లో మామిడి జీడి పంటల కోసం బోరు నిర్మించేందుకు సిద్ధపడ్డారు. దీనికోసం విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని ట్రాన్స్కో వారికి ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేశారు. కొత్త స్తంభాలు వేసి లైన్లు ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వానికి రూ.2.51 లక్షలు చెల్లించాలని డిమాండ్ నోటీసు ఇచ్చారు. దీంతో రైతులు గత ఏడాది మే 13వ తేదీన రూ.2.51 లక్షలు డీడీ తీసి ట్రాన్స్కో అధికారులకు సమర్పించారు. దీంతో ట్రాన్స్కో అధికారులు స్తంభాలు మాత్రమే ఏర్పాటు చేసి వదిలేశారు. వేసిన స్తంభాలకు విద్యుత్ తీగలు ఏర్పాటు చేసి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తే బోరు నిర్మించుకుంటామంటూ 8 నెలల నుంచి రైతులు ట్రాన్స్కో అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డీడీలు చెల్లించి ఏడాది పూర్తవుతోందని విద్యుత్ సరఫరా ఎప్పుడిస్తారంటూ నిలదీసిన రైతులపై ట్రాన్స్కో అధికారులు కక్ష సాధింపులకు తెగబడ్డారు. లైన్లకు, స్తంభాలకు, వాటికి సపోర్టు స్తంభాలకు రూ.2.51 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని గతంలో నోటీసు ఇచ్చిన ట్రాన్స్కో అధికారులు రైతులను ఆర్దికంగా ఇబ్బందులకు గురిచేయాలనే ఉద్దేశంతో వేసిన స్తంభాలకు సపోర్టుగా స్తంభాలు వేయాలని దాని కోసం అదనంగా మరో రూ.1.35 లక్షలు చెల్లిస్తే తప్ప మీ భూములకు విద్యుత్ సరఫరా ఇవ్వబోమని డిమాండ్ నోటీసు ఇచ్చారు. నీరు లేక పంటలు ఎండిపోతుండడంతో గత్యంతరం లేక రైతులు ట్రాన్స్కో వారికి రూ.1.35 లక్షలకు డీడీ తీసి ఇచ్చారు. ఇది జరిగి 2 నెలలు గడుస్తున్నా ట్రాన్స్ కో అధికారుల్లో మాత్రం చలనం లేదు. ప్రభుత్వానికి డీడీలు తీస్తే సరిపోతుందా, మీ పంటలను నీటితో తడపాలంటే మా చేతులు తడపాల్సిందేనంటూ పరోక్షంగా తెలియజేసే విధంగా వేసిన స్తంభాలకు తీగలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. నీరు లేక ఎండుతున్న తోటలు సుమారు రూ.4 లక్షలు చెల్లించిన రైతులు మాత్రం ట్రాన్స్కో అధికారుల చుట్టూ ప్రతిరోజు కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ప్రస్తుతం మామిడి, జీడి పంటల సీజన్ మొదలైంది. తోటలకు నీటి అవసరం ఎంతో ఉంది. ఇప్పటికే లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి దుక్కులు, పురుగు మందులు పిచికారీ చేశామని, కౌలుకు తీసుకున్న రైతులకు అడ్వాన్సులు చెల్లించామని వర్షాలు పడక మామిడి కాయలకు తెగుళ్లు వచ్చి రాలిపోవడం, కుళ్లిపోవడం వంటి నష్టాలను చవి చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆవేదన మాత్రం ట్రాన్స్కో వారికి పట్టడం లేదు. డబ్బు కట్టినా కనెక్షన్ ఇవ్వలేదు నాతో పాటు నలుగురు రైతులు కలసి వ్యవసాయ బోరుకు విద్యుత్ సరఫరా కోసం దరఖాస్తు చేశాం. స్తంభాలు వేసి కొత్తలైను ఏర్పాటు కోసం రూ.2.51 లక్షలు డీడీ కట్టాలంటే ఏడాది క్రితం చెల్లించాం. తర్వాత స్తంభాలు వేసి లైను ఇవ్వకుండా వదిలేశారు. ఏడాది నుంచి అధికారుల చుట్టూ తిరుగుతుంటే పట్టించుకోలేదు. గట్టిగా నిలదీస్తే కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. మరో రూ.1.35 లక్షలు చెల్లిస్తే తప్ప లైను ఏర్పాటు చేయడం కుదరదని నోటీసు ఇచ్చారు. ఈ మొత్తాన్ని గత నెల 30వ తేదీన డీడీ తీసి ఇచ్చాం. ఇప్పటి వరకు లైన్లు ఏర్పాటు చేయలేదు. నీరు లేక జీడి, మామిడి, కొబ్బరి తోటలు ఎండిపోతున్నాయి. రూ.నాలుగు లక్షలు ప్రభుత్వానికి చెల్లించినప్పటికీ కనెక్షన్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. తోటల మీద లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టేశాం. ఏం చేయాలో తోచడం లేదు. –ఇందన రాము, రైతు గొడిచర్ల రైతుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాట మాడుతోంది.ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు విద్యుత్ సరఫరా ఇవ్వకుండా ట్రాన్స్కో ద్వారా ముప్పు తిప్పలు పెడుతోంది. రూ.లక్షలు చెల్లించినా సరే విద్యుత్ సరఫరా ఇవ్వకుండా ట్రాన్స్కో రైతులతో ఆటలాడుతోంది. డబ్బులు చెల్లించాం... కనెక్షన్ ఇవ్వాలని నిలదీస్తే కక్ష సాధింపులకు పాల్పడుతోంది. అదనంగా డబ్బు చెల్లించాలంటూ మరోసారి నోటీసులు ఇస్తూ ఆర్థకంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. చేయి తడపకపోతే విద్యుత్ కట్...! జిల్లాలో 15900 వ్యవసాయ బోరు కనెక్షలు ఉన్నాయి. నియోజకవర్గంలో దాదాపు 12వేలకు పైగా వ్యవసాయ బోరు కనెక్షన్లు ఉన్నట్లు సమాచారం. కొత్తగా పాయకరావుపేట, నక్కపల్లి మండలాల్లో సుమారు 350 మందికిపైగా రైతులు ఇలా వ్యవసాయ బోర్లకు విద్యుత్ సరఫరా కోసం డీడీలు చెల్లించి ట్రాన్స్కో అధికారుల చుట్టూ తిరుగుతున్నట్లు తెలిసింది. మామూళ్లు ఇస్తే తప్ప కనెక్షన్లు గాని, మీటర్లు, ట్రాన్స్ఫార్మర్లు గాని ఏర్పాటు చేయడం లేదని రైతులు, వినియోగదార్ల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వేలాది రూపాయలు మామూళ్లు ఇస్తే పనులు మాత్రం చక చకా జరిగిపోతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి డీడీలు చెల్లించి సిబ్బందికి వేలాది రూపాయలు ఇచ్చుకోవడం మా వల్ల కావడం లేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేక ట్రాన్స్కోలో అవినీతి రాజ్యమేలుతోందని వినియోగదారుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మామూళ్లు ఇవ్వకపోతే ఏదో రకంగా రైతులను, వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఏదో ఒక సాకుతో విద్యుత్ సరఫరా నిలిపివేయడం వంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. -
అక్రమ అరెస్టులతో పోరాటాలు ఆపలేరు
అచ్యుతాపురం రూరల్ : మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంగళవారం మండలంలో దుప్పితూరు గ్రామాన్ని వైఎస్ఆర్సీపీ జిల్లా ముఖ్య నాయకులు సందర్శించి గ్రామస్తులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాఽథ్, యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, పాయకరావుపేట నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు, అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు శోభా హైమావతి, నర్సీపట్నం నియోజకవర్గ పరిశీలకులు భీశెట్టి సత్యవతి, మాజీ ఎంపీపీ ఎస్ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్, అనకాపల్లి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత, నాలుగు మండలాల వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. నిర్వాసితులకు అండగా వైఎస్సార్సీపీ : మాజీ మంత్రి అమర్నాథ్ గ్రామస్తుల సమస్యలు పరిష్కరించి పరిశ్రమలు నెలకొల్పాలని మాజీ మంత్రి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ అన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా నిర్వాసితులకు అందాల్సిన ప్యాకేజీ ఇవ్వకుండా అక్రమంగా ప్రహరీ నిర్మాణ పనులు చేపట్టడం, ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి, మహిళలను సైతం ఈడ్డుకుంటూ బలవంతంగా వ్యాన్లలో తరలించడం అత్యంత దుర్మార్గపు చర్య అన్నారు. ఇటువంటి సంస్కృతి మునుపెన్నడూ చూడలేదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దుప్పితూరు గ్రామస్తుల సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడతామన్నారు. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా..: ధర్మశ్రీ ఇంటికో ఉద్యోగం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ, పునరావాసం కల్పించాలని అడిగినందుకు మహిళలు, వృద్ధులు అని కూడా చూడకుండా అత్యంత కిరాతకంగా అరెస్ట్లు చేయడం అత్యంత దుర్మార్గమని యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ అన్నారు. భూ నిర్వాసితులపై ఆటవికంగా వ్యవహరించడమంటే ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అనే దుస్థితి నెలకొందన్నారు. భూములిచ్చిన రైతుల గోడు పట్టదా...: బొడ్డేడ ప్రసాద్ కార్పొరేట్ కంపెనీలకు తొత్తులుగా మారి బలవంతంగా భూ సేకరణలు చేసి రైతులకు అన్యాయం చేయాలని కోవడం అప్రజాస్వామికమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ అన్నారు. 22 సంవత్సరాలుగా దుప్పితూరు గ్రామస్తులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. నిర్వాసితుల సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకూ ప్రహరీ నిర్మాణ పనులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై అనుచితంగా ప్రవర్తించడం కిరాతకం : మాజీ ఎంపీ సత్యవతి అక్రమ కేసులతో గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసి పోరాటాలను ఆపాలనే దురాలోచన అత్యంత దుర్మార్గమని మహిళలపై అనుచితంగా వ్యవహరించడం అత్యంత కిరాతకమని అనకాపల్లి మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి అన్నారు. దుప్పితూరు సమస్య పరిష్కారం అయ్యేంత వరకూ వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని వక్తలు హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ చలో దుప్పితూరు కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దేశంశెట్టి పైడియ్యనాయుడు, ఉప సర్పంచ్ దేశంశెట్టి ఈశ్వర్రావు, మాజీ పీఏసీఎస్ చైర్మన్ శెట్టి నాగేశ్వర్రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు ప్రగడ తాతబాబు, భావనారుషి ఆలయ కమిటీ అధ్యక్షుడు మాడెం సూరి అప్పారావు పాల్గొన్నారు. గ్రామస్తుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి అమర్నాథ్, వైఎస్సార్సీపీ నాయకులు -
కేకే లైన్ కట్
జోన్ గిఫ్ట్దక్షిణ కోస్తా రైల్వే జోన్కు గెజిట్ విడుదల 3,413 కి.మీ పరిధిలో విశాఖ కేంద్రంగా కొత్త జోన్ కేకే లైన్పై కేంద్రం నిర్ణయంతో అసంతృప్తి సాక్షి, విశాఖపట్నం: రైల్వే జోన్ కోసం విశాఖ వాసులు దశాబ్దాలుగా ఎదురుచూసిన కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రకటన వెలువడిన ఏడేళ్ల తర్వాత దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 1 నుంచి వీఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా ఈ జోన్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అయితే.. ఈ గెజిట్ తీపి కబురు కంటే చేదు నిజాలనే ఎక్కువగా మోసుకొచ్చింది. కీలకమైన ఆదాయ వనరుల పంపిణీ, విభజన అంశాల్లో కేంద్రం తీవ్ర నిరాశకు గురిచేసింది. ‘కామధేనువు’ లాంటి కేకే లైన్ మొత్తాన్ని ఒడిశాలోని రాయగడ డివిజన్కు కట్టబెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్థికంగా దెబ్బకొట్టిన విభజన వాల్తేరు డివిజన్ విభజన తీరు ఏపీకి తీరని అన్యాయం చేసేలా ఉంది. ఇనుప ఖనిజం రవాణా ద్వారా భారీ ఆదాయం తెచ్చే కిరండూల్ మార్గాన్ని రాయగడకు కేటాయించడం ద్వారా కొత్త జోన్ ఆర్థిక వెన్నెముకను కేంద్రం విరిచేసింది. విశాఖకు కేవలం ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండి, నిర్వహణ ఖర్చులు భారమయ్యే మార్గాలను మాత్రమే ఇచ్చారు. అంటే, రాబడి వచ్చే మార్గాలన్నీ పక్క రాష్ట్రానికి.. ఖర్చులు పెరిగే మార్గాలు మాత్రం విశాఖకు అన్నట్టుగా ఈ విభజన సాగింది. -
మా గ్రామంలో మద్యం దుకాణం వద్దు
● అర్జునగిరి గ్రామస్తుల నిరసనమద్యం దుకాణం వద్దంటూ గ్రామసభ తీర్మానం చేస్తున్న దృశ్యం చీడికాడ : మా గ్రామంలో అర్ధంతరంగా మద్యం దుకాణం ఏర్పాటు వద్దంటూ మండలంలోని అర్జునగిరికి చెందిన గ్రామ పెద్దలు, మహిళలు మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బోడాల రమాదేవి, ఎంపీటీసీ పెంటకోట అమ్మతల్లినాయుడు మాడుగుల వ్యవసాయ కమిటీ డైరెక్టర్ జాజిమొగ్గల ప్రసాద్ మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గ్రామంలో మద్యం దుకాణం ఏర్పాటుకు అధికారులు సిండికేటు నాయకులు కుట్ర పన్నుతున్నారన్నారు. గ్రామంలో నివాసితుల మధ్య ఈ దుకాణం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. సిండికేటు నాయకులు వారిలో వారికి ఉన్న విభేదాలతో గ్రామంలో అల్లర్లు సృష్టించేందుకు ఈ దుకాణం ఏర్పాటుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ మద్యం దుకాణం ఇప్పటికే కోనాం గ్రామ శివారు గుడివాడలో పెట్టి, అక్కడ నుంచి ప్రస్తుతం చీడికాడలో నిర్వహిస్తున్నారని, ఆ దుకాణాన్నే అర్జునగిరికి మార్చాలని చూస్తున్నారని అన్నారు. దీనిపై మాడుగుల ఎకై ్సజ్ సీఐ ఉపేంద్రతో పాటు, జిల్లా సూపరింటెండెంట్కు ఫిర్యాదు చేసినట్టు గ్రామస్తులు తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, వైఎస్సార్సీపీ నేతలు జె.ప్రసాద్, పి.నూకునాయుడు, కె.గణపతి, కె.శ్రీనివాసరావు, టి.అప్పలనాయుడు, జె.సత్యనారాయణ, చొక్కాకుల దాలినాయుడు, చీకటి శివ, పెంటకోట సూరిబాబు, ఎంపీటీసీ పి.అమ్మతల్లినాయుడు పాల్గొన్నారు. -
బాబు మాటను బేఖాతరు చేసిన కేంద్రం
వాల్తేరు డివిజన్లో కీలక ఆదాయాన్ని తెచ్చిపెట్టే కేకే లైన్ను విశాఖలోనే ఉంచాలంటూ జోన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ ఎంపీలు పోరాటం చేస్తూనే ఉన్నారు. దీనిపై చంద్రబాబు ప్రభుత్వం కనీసం స్పందించలేదు. ఇటీవల డేటా సెంటర్ శంకుస్థాపనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్తో చంద్రబాబు చర్చించారు. అరకుతో కూడిన కేకే లైన్ విశాఖ జోన్లో కలపాలని కోరారు. అప్పుడే చంద్రబాబు అభ్యర్థనను రైల్వే మంత్రి తోసి పుచ్చినట్లు సమాచారం. ఇప్పుడు వాల్తేరు డివిజన్ విభజన తీరు చూస్తుంటే కేంద్రం వద్ద చంద్రబాబు పరపతి ఏపాటిదో అర్థమవుతోంది. కేకే లైన్ను ఒడిశాకే కట్టబెడుతూ గెజిట్ విడుదల చేయడం బాబు అసమర్థతకు నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముడసర్లోవలో కొనసాగుతున్న జోన్ ప్రధాన కార్యాలయం పనులు -
రెగ్యులర్గా విశాఖ–బెంగళూరు స్పెషల్
తాటిచెట్లపాలెం: ఈస్ట్ కోస్ట్ రైల్వే, వాల్తేర్ డివిజన్ పరిఽధిలో ప్రస్తుతం నడుస్తున్న విశాఖపట్నం–ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం స్పెషల్ రైళ్లు ఆయా తేదీల నుంచి రెగ్యులర్గా నడువనున్నట్లు వాల్తేర్ డివవిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్మేనేజర్ కే పవన్కుమార్ తెలిపారు. విశాఖపట్నం–ఎస్ఎంవి బెంగళూరు(08581) వీక్లీ స్పెషల్ రైలు ఈ నెల 10వ తేదీ నుంచి రెగ్యులర్ రైలుగా (18509) నెంబరుతో నడవనుంది. తిరుగు ప్రయాణంలో ఎస్ఎంవీ బెంగళూరు–విశాఖపట్నం(08582)స్పెషల్ రైలు ఈ నెల 11వ తేదీ నుంచి వీక్లీ రెగ్యులర్ రైలుగా (18510) నడుస్తుంది. -
రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు ఎంపిక
రాష్ట్ర స్థాయి బీచ్ కబడ్డీ పోటీలకు ఎంపిక చేసిన జిల్లా జట్టు క్రీడాకారులతో అసోసియేషన్ సభ్యులు అనకాపల్లి : ఈనెల 7 నుంచి 9వ తేదీ వరకూ రాష్ట్రస్థాయి బీచ్ కబడ్డీ పోటీలు నెల్లూరు జిల్లాలో రాష్ట్రస్థాయి 13వ అంతర్ జిల్లాల సీనియర్ పోటీలు జరుగుతాయని కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి దాడి శ్యాంప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయుడు జై.బాబులు అన్నారు. తుమ్మపాల గ్రామంలో రాష్ట్ర స్థాయి పోటీలకు వెళ్లే జిల్లా క్రీడాకారుల బాలబాలికల జట్టు ఎంపిక మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి 20 మంది బాలురు, 20 మంది బాలికలు పోటీల్లో పాల్గొనడం జరిగిందని, ఆరుగురు బాలురు, ఆరుగురు మహిళలను ఎంపిక చేయడం జరిగిందన్నారు. క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీల్లో మంచి ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
పాలిసెట్ ఫలితాల్లో 90.64 శాతం ఉత్తీర్ణత
తుమ్మపాల: పాలిసెట్–2026 ఫలితాల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. 90.64 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ ఐ.వి. ఎస్.ఎస్.శ్రీనివాసరావు తెలిపారు.బాలురు 4,468 (88.48 శాతం), బాలికలు 3,673 (93.41 శాతం) మొత్తం 8,141 మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొ న్నారు. జిల్లాకు చెందిన మొసూరి హర్షవర్ధన్ ఆదిత్య 85వ ర్యాంక్, కాపుశెట్టి గుణ దీపిక వెంకట సాయిశ్రీ 158వ ర్యాంక్, గాది యశ్వంతి 163వ ర్యాంక్ సాఽధించారు. కె.కోటపాడు: పాలిసెట్–2026 ఫలితాల్లో కె.కోటపాడు మండలానికి చెందిన ఇద్దరు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారు. కింతాడ పంచాయతీకి చెందిన కిలపర్తి సృజన్ 120 మార్కులకు గాను 119 మార్కులు సాధించి 36వ ర్యాంక్ సాధించాడు. యరకన్నపాలెం విద్యార్థిని గాడి యశ్వంతి 120 మార్కులకు 117 మార్కులను సాధించి 116వ ర్యాంక్ పొందింది. దేవరాపల్లి: దేవరాపల్లికి చెందిన విద్యార్థిని వెత్సా షణ్ముఖి 39వ ర్యాంక్ సాధించింది. 120 మార్కులకు గాను 119 మార్కులు పొందింది. కాగా ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో షణ్ముఖి 588 మార్కులు సాధించింది. ఈమె తండ్రి వెత్సా జోగిరాజు (రాజేష్) రేషన్ డీలర్గా పని చేస్తుండగా, తల్లి పరమేశ్వరీ మినరల్ వాటర్ ప్లాంట్ నిర్వహిస్తున్నారు.మంచి ర్యాంక్ సాధించిన షణ్ముఖిని గ్రామానికి చెందిన పలువురు అభినందించారు. ఈ సందర్భంగా షణ్ముఖి మాట్లాడుతూ సివిల్స్లో మంచి ఫలితాలు సాధించి ఉన్నత స్థాయి ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని తెలిపింది. దేవరాపల్లిలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పాలిసెట్ కోచింగ్ సెంటర్లో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంక్లు సాధించారు. తమటపు గోపిచంద్ 1,533వ ర్యాంక్, లక్కరాజు అనుష్క 4,174వ ర్యాంక్, కాటా భరత్కుమార్ 4,562వ ర్యాంక్, టి.ఉష 5,292వ ర్యాంక్, పరవాడ చందన 6,438వ ర్యాంక్, జి. హేమలత 7,708వ ర్యాంక్ను సాధించారు. వీరికి ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు కె.వి.రమణ, జిల్లా ఉపాధ్యక్షుడు కొరుప్రోలు శ్రీను, గంగవంశం సంతోష్, ఉపాధ్యాయులు పెద్దాడ వెంకటరమణ, వేచలపు అప్పలనాయుడు తదితర్లు అభినందించారు. -
సీఎంకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు...
మాడుగుల రూరల్ : గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి 2024–25 క్రషింగ్ సీజన్కు సంబంధించి చెరకు సరఫరా చేసిన చెరకు బకాయిలు ఇప్పించాలని కోరుతూ మూడుసార్లు జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినా, సీఎంకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగలేదని కె.జె.పురం గ్రామానికి చెందిన విశ్వనాధ సుబ్బారావు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశారు. 31192 జనరల్ నెంబరుతో సుగర్ ప్యాక్టరీకి ప్రతి ఏటా గతంలో చెరకును సరఫరా చేసేవాడినని, గడిచిన 2024–25 క్రషింగ్ సీజన్కు సంబంధించి, 162 టన్నులు 968 కిలోల చెరకును సుగర్ ఫ్యాక్టరీకి సరఫరా చేసినట్టు తెలిపారు. దీంట్లో కేవలం 7 టన్నులు 3 కిలోల చెరకుకు సుమారు రూ.22,000 ఇవ్వగా, మిగిలిన 155 టన్నులు 965 కిలోలు చెరకుకు గాను సుమారు రూ.4,92,342 బకాయిలు రావాల్సి ఉందన్నారు. బకాయిలు కోసం పలు పర్యాయాలు గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి వెళ్లి కోరినా పేమెంట్ ఇవ్వలేదన్నారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, హృదయ సంబంధిత సమస్యల వల్ల విశాఖలో ప్రెవేటు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నామని, బకాయిల కోసం ఈ ఏడాది జనవరి 5, మార్చి 30న, ఏప్రిల్ 6వ తేదీన అనకాపల్లి జిల్లా కలెక్టర్కు పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశానన్నారు. అయినా అధికారుల నుంచి స్పందన లేదని, తనకు రావాల్సిన బకాయిలు రాక, ఆరోగ్యం బాగా లేక, ఇబ్బందులు పడుతున్నామన్నారు. గత నెల 13వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రికి రాత పూర్వకంగా బకాయిలు ఇప్పించాలని ఫిర్యాదు చేసినట్టు సుబ్బారావు పేర్కొన్నారు. కాగా ఈ సమస్యపై తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర సుగర్స్ కమిషనర్ ఈ నెల 4న ఫ్యాక్టరీ మనేజింగ్ డైరెక్టర్కు లేఖ పంపడం జరిగిందని, అయినా సమస్య పరిష్కారం కాలేదన్నారు. అలాగే 2023–24, 2024–25 క్రషింగ్ సీజన్లో చెరకు రవాణా చార్జీలు కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి
యలమంచిలి రూరల్: మండలంలోని పులపర్తి సమీపంలో 16వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ మృతి చెందాడు. విశాఖపట్నం పోర్టు నుంచి బొగ్గు లోడుతో హైదరాబాద్ వెళ్తున్న లారీని యలమంచిలి దాటిన తర్వాత పులపర్తి కూడలి సమీపంలో నిర్మాణంలో ఉన్న నయారా పెట్రోల్ బంక్ వద్ద ఆపి టైర్లలో గాలిని డ్రైవర్ పులగల సుబ్రహ్మణ్యం(32) తనిఖీ చేసుకుంటుండగా అనకాపల్లి నుంచి తునివైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుబ్రహ్మణ్యం తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతిచెందినట్టు యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపారు.మృతుడు పాయకరావుపేట మండలం వి. కొత్తూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.మృతుని బావ గారా సంజీవరాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
ఏయూ శతాబ్డి ఉత్సవాల క్రీడలు విజయవంతం
మాట్లాడుతున్న వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ మద్దిలపాలెం: ఏయూ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీలు విజయవంతంగా ముగిశాయని వీసీ ఆచార్య జీపీ రాజశేఖర్ తెలిపారు. వర్సిటీ సిబ్బంది సమన్వయంతో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఉత్సవాలకు కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, సిబ్బంది మధ్య ఐక్యత, స్నేహభావాన్ని పెంపొందించడంలో కీలకపాత్ర పోషించాయన్నారు. సెనేట్ సమావేశ మందిరంలో స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించిన రన్–అప్ టీమ్ సభ్యులతో మంగళవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల నిర్వహణలో రన్–అప్ టీమ్ చూపిన కృషి, కట్టుదిట్టమైన ప్రణాళిక, సమన్వయం అభినందనీయమన్నారు. శతాబ్ది ఉత్సవాలు కేవలం వేడుకలు మాత్రమే కాకుండా విశ్వవిద్యాలయ సాంస్కృతిక, క్రీడా, శాసీ్త్రయ వారసత్వాన్ని ప్రతిబింబించే వేదికగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రన్ అప్ టీమ్ సభ్యులకు జ్ఞాపికలు అందించి అభినందించారు. సమావేశంలో విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, ఆచార్యులు విజయమోహన్, హరనాథ్, వర్సిటీ అధికారులు మంజుల, సాంబమూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. -
నేతలు హెల్మెట్ ధరించకపోతే రెట్టింపు జరిమానా
నక్కపల్లి: రోడ్డు ప్రమాదాల నుంచి ప్రాణాలను కాపాడేందుకు బైక్లు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. హెల్మెట్ ధారణపై అవగాహన కల్పించేందుకు మంగళవారం అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి వరకు జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సురక్షిత రోడ్లు, సురక్షిత జీవితం అనే నినాదంతో సాగిన ఈ ర్యాలీ ద్వారా బైక్ వినియోగదారులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. రూ.రెండు లక్షలు పెట్టి బైక్ కొనేవారు ఐదొందలు పెట్టి హెల్మెట్ కొని ధరించడానికి వెనుకాడుతున్నారన్నారు. మీరు మీ కుటుంబం రోడ్డున పడకుండా సురక్షితంగా ఉండేందుకు హెల్మెట్ ధరించాలన్నారు. రాజరకీయ నాయకులు హెల్మెట్ ధరించకుండా వాహనం నడిపితే రెట్టింపు జరిమానా విధించాలని పోలీసులను ఆదేశించారు. ఈ విషయంలో ఎవరికి మినహాయింపు ఉండదన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురు ప్రాణాలు కోల్పోయారన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారానే వీటిని అరికట్టగలమన్నారు. ఈ ర్యాలీలో హెల్మెట్ ధరించి మంత్రి స్వయంగా బైక్ నడిపారు. ఈ ర్యాలీలో యువతీ యువకులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ మోహన్రావు, సీఐలు మురళి, రామకృష్ణ, శంకర్రావు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో క్వారీ లారీ దగ్ధం
కోటవురట్ల : బ్యాటరీ షార్ట్ సర్క్యూట్తో క్వారీ లారీ దగ్ధమైంది. రాజుపేట శివారు పరదేశమ్మతల్లి ఆల యం సమీపంలో కోటవురట్ల వైపు వెళుతున్న క్వారీ లారీ ఇంజిను నుంచి మంగళవారం రాత్రి మంటలు రావడంతో లారీ డ్రైవర్, క్లీనర్ అప్రమత్తమయ్యారు. వెంటనే లారీని ఆపి కిందికి దూకేయడంతో ప్రాణాపాయం తప్పింది. బ్యాటరీ వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో మంటలు చెలరేగినట్టు లారీ సిబ్బంది తెలిపారు. స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. లారీ ఇంజిను భాగంగా దాదాపు 70 శాతం దగ్ధమైనట్టు స్థానికులు తెలిపారు. ప్రాణాపాయం తప్పడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
శ్వాసకు ‘బ్రేక్’.. వెంటిలేటర్ల షాక్
మహారాణిపేట: కేజీహెచ్.. ఉత్తరాంధ్ర ప్రజలకే కాక, పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్గఢ్ పేదలకు కూడా ఒక నమ్మకమైన వైద్య కేంద్రం. ప్రస్తుతం ఈ ఆస్పత్రిలో అత్యవసర ప్రాణవాయువును అందించే వెంటిలేటర్ల వ్యవస్థ కుప్పకూలడం రోగుల పాలిట శాపంగా మారింది. రోగి ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు, ఊపిరితిత్తులు సహకరించని సమయంలో శ్వాస అందించేందుకు వెంటిలేటర్ ఎంతో కీలకం. ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులకు, అగ్నిప్రమాద క్షతగాత్రులకు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి ఇది జీవనాధారం. ఇటువంటి కీలకమైన పరికరాలు మెజారిటీ సంఖ్యలో మూలపడటం ఆందోళన కలిగిస్తోంది. పరిమితమైన వనరులు కేజీహెచ్లో అధికారికంగా 1,187 పడకలు ఉన్నప్పటికీ, ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య అంతకు రెట్టింపుగా ఉంటోంది. ప్రతిరోజూ సుమారు 2500 మందికి పైగా ఇక్కడ వైద్య సేవలు పొందుతున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఓపీ విభాగం కిటకిటలాడుతుంటుంది. నిత్యం వందలాది మంది ఇన్పేషెంట్లుగా చేరుతుంటారు. సుమారు 26 విభాగాలు కలిగిన ఈ ఆస్పత్రిలో రోగుల సంఖ్యకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు పెరగకపోగా, ఉన్న సౌకర్యాలు కూడా కంటికి కనిపించకుండా పోతున్నాయి. 92 మాత్రమే పని చేస్తున్నాయి ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో, అత్యవసర వార్డుల్లో మొత్తం 415 వెంటిలేటర్లు ఉండగా, ప్రస్తుతం అందులో కేవలం 92 మాత్రమే పనిచేస్తుండటం గమనార్హం. మిగిలిన 323 వెంటిలేటర్లు చిన్నపాటి మరమ్మత్తులకు గురయ్యాయి. కోవిడ్ సమయంలో కేంద్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో వెంటిలేటర్లను మంజూరు చేసింది. ఆ సమయంలో ఇవి అద్భుతంగా పనిచేసినప్పటికీ, ఆ తర్వాత సరైన నిర్వహణ లేకపోవడంతో పనికిరాకుండా పోయాయి. మరమ్మత్తులు చేయించడంలో అధికారుల అలసత్వం, కొత్త వాటి కొనుగోలులో జాప్యం వెరసి పేద రోగుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తక్షణ చర్యలు అవసరం ఆస్పత్రిలో క్యాజువాలిటీ, ఐసీయూ, ఐఆర్సీ, ఈఎండీ, సీసీయూ వంటి కీలక విభాగాల్లో వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. అధికారులు స్పందించి యుద్ధ ప్రాతిపదికన ఈ యంత్రాలకు మరమ్మత్తులు చేయించాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ వహించి, నిధుల విడుదల, నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాలని బాధితులు, ప్రజలు కోరుతున్నారు. పేదలకు తప్పని ఆర్థిక భారం కేజీహెచ్ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ సౌకర్యం ఉచితంగా లభిస్తుంది. అదే ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే రోజుకు రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు అవుతుంది. అంత భారీ మొత్తంలో బిల్లులు చెల్లించలేక, రోగి కోలుకోక నిస్సహాయ స్థితిలో ఉన్న సామాన్యులు మళ్లీ కేజీహెచ్కే పరుగులు తీస్తున్నారు. కానీ ఇక్కడకు వచ్చాక వెంటిలేటర్లు అందుబాటులో లేవని తెలిసినప్పుడు వారి ఆవేదన వర్ణనాతీతం. -
ఏలేరు కాలువలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య
కోటవురట్ల: ఆర్ధిక ఇబ్బందులు తాళలేక ఓ వ్యక్తి ఏలేరు కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్ఐ విజయ్కుమార్ తెలిపిన వివరాలివి..నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి జోగినాధునిపాలేనికి చెందిన మాజీ కౌన్సిలర్ వర్రి శ్రీనివాసరావు(48) యండపల్లి వద్ద ఏలేరు కాలువలోకి సోమవారం సాయంత్రం దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏలేరు కాలువ వద్ద శ్రీనివాసరావు చెప్పులు, కారు ఉండడంతో అతని భార్య నర్సీపట్నం పోలీసు స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేసింది. అక్కడ మిస్సింగ్ కేసు నమోదు చేయగా మంగళవారం ఉదయం యండపల్లి ఏలేరు కాలువలో అతని మృతదేహం తేలింది. అప్పులు పెరిగిపోవడంతో తట్టుకోలేక ఏలేరు కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని బంధువులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
గోబంద ఆక్రమణకు ప్రయత్నాలు
నక్కపల్లి: మండలంలో డి.ఎల్.పురంలో సర్వే నంబరు 81లోని సుమారు 91 ఎకరాల్లో ఉన్న గోబందను ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని గ్రామ తాజామాజీ సర్పంచ్ కిల్లాడ రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు ఆరోపించారు. మంగళవారం వారు గోబంద ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏన్నో ఏళ్ల నుంచి గ్రామానికి చెందిన వారు పశువులను మేపుకోవడంతో పాటు వాటికి నీరు పెట్టేందుకు దీనిని వినియోగిస్తున్నార ని చెప్పారు. ఈ బందలో డి.ఎల్.పురం మత్స్యకా రులు చేపలవేట చేసుకుని కుటుంబాలను పోషించుకుంటున్నారన్నారు. పర్యావరణాన్ని కాపాడడంలో ఇటువంటి గోబందలు, చిత్తడి నేలలు ఎంతో కీలకమని చెప్పారు. ఆర్సిలర్మిట్టల్ నిప్పన్ స్టీల్ప్లాంట్వారు ఈ గోబందను ఆక్రమించి ఇక్కడ ఉన్న నీటిని ప్లాంట్ అవసరాలకోసం వినియోగించుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే స్టీల్ప్లాంట్కు అవసరమైన నీటిని ఏలేరు, పోలవరం కాలువలనుంచి వాడుకునేందుకు రాష్ట్రప్రభుత్వం అనుమతించిందన్నారు. గోబందలో నీటిని ఎలా వినియోగించుకుంటారని ప్రశ్నించారు.ఇక్కడకు దేశ, విదేశపక్షులు వచ్చి జీవిస్తుంటాయన్నారు. గోబందపై సర్వాధికారాలు డి.ఎల్.పురం గ్రామస్తులకు చెందేవిధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఆక్రమణకు గురికాకుండా, ఇక్కడ ఉన్న నీటి నిల్వలను ఫ్యాక్టరీలకు ఉపయోగించకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.ఈకార్యక్రమంలో సీపీఎం నాయకులు కోటేశ్వరరావు, కృష్ణంరాజు, సత్యనారాయణ, అప్పలనాయుడు, గోవిందు, అజయ్,నానాజీ తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని రైలు ఢీకొని మహిళ మృతి
అనకాపల్లి : మండలంలో శంకరం రైల్వే బ్రిడ్జి సమీపంలో సుమారు 60 సంవత్సరాలు మహిళలను విజయవాడ–విశాఖ రైల్వే ట్రాక్లపై సోమవారం రాత్రి గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు దువ్వాడ జీఆర్పీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి మంగళవారం తెలిపారు. స్థానికలు, రైల్వే గ్యాంగ్ మ్యాన్ ఇచ్చిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించగా మృతురాలు గ్రీన్ కలర్ చీర ధరించి ఉన్నట్టు ఎస్ఐ తెలిపారు. మృతురాలు వద్ద ఉన్న బ్యాగ్ ఆధారంగా ఆమె యాచకురాలుగా గుర్తించడం జరిగిందన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని విశాఖ కేజీహెచ్కు తరలించడం జరిగిందని ఎస్ఐ చెప్పారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్.7382058996ను సంప్రదించాలన్నారు. -
వైభవంగా మోదకొండమ్మ ఘటాలు ఊరేగింపు
మాడుగుల : మాడుగుల మోదకొండమ్మ ఘటాలు ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా సాగింది. డప్పులు వాయిద్యాలతో మహిళా కోలాటాలు నడుమ అమ్మవారి ఊరేగింపు కన్నుల పండువగా జరిగింది. ముందుగా అమ్మవారి ప్రతి రూపమైన ఘటాలను ఆలయ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, కమిటీ సభ్యుడు దేవరాపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు శిరస్సున పెట్టుకుని సతకం పట్టు వద్దకు అడుగులు వేశారు. అనంతరం వేలాది మంది భక్తులు అమ్మవారి ఘటాలు శిరస్సున పెట్టుకుని సంబరంలో పాల్గొన్నారు. ఆలయం నుంచి సతకం పట్టు వద్దకు భారీ మందుగుండు సామగ్రి, కోలాటాలు, నడుమ సతకం పట్టు వద్దకు సంబరంగా చేరుని అక్కడే కొలువు దీరారు. జూన్ 2వ తేదీ వరకు అమ్మవారు అక్కడే దర్శన మిస్తారు. తిరిగి పండగ రోజు మరలా ఆలయానికి చేరుకోవడంతో అమ్మవారి నెల రోజుల పండగ పూర్తి అవుతుంది. అమ్మవారు గ్రామంలో కోట ప్రాంగణంలో ఉన్న సతకం పట్టు వద్దకు చేరగానే అంతవరకు మండుటెండలో ఉన్న వాతావరణం ఇక్కసారిగా వాతావరణం చల్లబడి వర్షం కురిసింది. దీంతో మాడుగుల ప్రజలు అమ్మవారి మహిమగా భావించి ఆనందం వ్యక్తం చేశారు. -
ఏపీడీపీఎంఎస్పై శిక్షణ
శిక్షణ కార్యక్రమంలో అతిథులు, ఆహ్వానితులు బీచ్రోడ్డు: భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏపీడీపీఎంఎస్(అప్డేటెడ్ వెర్షన్)పై శిక్షణ కార్యక్రమాన్ని వీఎంఆర్డీఏలో మంగళవారం నిర్వహించారు. ఆర్డీడీటీపీ చామంతి మార్గదర్శకత్వంలో సాఫ్ట్టెక్ బృందం ఆధ్వర్యంలో శిక్షణ జరిగింది. అప్డేటెడ్ వెర్షన్లోని కొత్త ఫీచర్లు, డ్రాఫ్టింగ్ టూల్స్, బిల్డింగ్ అప్లికేషన్స్, లేఅవుట్ అప్లికేషన్స్ ఆన్లైన్ ప్రాసెస్పై సమగ్ర అవగాహన కల్పించారు. అప్లికేషన్ సమర్పణ నుంచి ఆమోదం వరకు ఉండే దశలను ప్రాక్టికల్గా వివరిస్తూ పాల్గొన్నవారికి శిక్షణ ఇచ్చారు. -
రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ప్రతిభ
ఇటీవల జగ్గయ్యపేటలో 13వ రాష్ట్ర స్ధాయి సబ్ జూనియర్, జూనియర్ పవర్ లిప్టింగ్ పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులు అనకాపల్లి టౌన్ : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఇటీవల నిర్వహించిన 13వ రాష్ట్రస్ధాయి సబ్ జూనియర్, జూనియర్ మాస్టర్స్ సీ్త్ర, పురుషుల పవర్ లిప్టింగ్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో ప్రతిష్టాత్మకమైన స్ట్రాంగ్ మెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ను సి.హెచ్. బాలసాయి చరణ్(అనకాపల్లి)83 కిలోల విభాగంలో కై సవం చేసుకున్నారు. అనకాపల్లికి చెందిన శ్రవణ్ కుమార్ 74 కిలోల విభాగంలో రజత పతకం, 83 కిలోల విభాగంలో ఎం. ధనుష్, మహిళల 84 కిలోల విభాగంలో కె. ప్రవల్లిక రజత పతకాలు సాధించారు. ఈ విజయంపై పలు క్రీడా సంఘాలు, జిల్లా పవర్ లిప్టింగ్ అసోసియేషన్ ప్రతినిధులు గుడ్రపు నీట, బద్రీనాధ్ హర్షం వ్యక్తం చేశారు. -
కలెక్టరేట్లో ’ఆయుష్’ ఉచిత వైద్య శిబిరం.
కలెక్టరేట్లో ఆయుష్’ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్న డాక్టర్ శిరీష తుమ్మపాల: వ్యాధి నిరోధక శక్తిని పెంచే మందుల పంపిణీతో పాటు బీపీ చెక్అప్, మోకాళ్ళ నొప్పులు, ఆయాసం, దగ్గు, నీరసం, ఎసిడిటీ, మధుమేహం, యూరిన్ ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులకు చికిత్స చేసి ఉచితంగా మందులు పంపిణీ చేసామని పరవాడ ఆయుర్వేదిక్ మెడికల్ అధికారి డాక్టర్ టి.శిరీష అన్నారు. కలెక్టరేట్లో ’ఆయుష్’ ఉచిత వైద్య శిబిరాన్ని సోమవారం నిర్వహించి పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ అర్జీదారులకు మందులు పంపిణీ చేశారు. పీజీఆర్ఎస్ నిర్వహించే సమయంలో ప్రతి సోమవారం ప్రజలకు అందుబాటులో ఆయుర్వేదం, హోమియోపతి సేవలు అందించడం జరుగుతుందన్నారు. వైద్య శిబిరంలో హరిపాలెం కాంపౌండర్ పి.మేరీ స్వర్ణలత, రేగుపాలెం ఎస్ఎన్ఓ, ఏ. శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
చలో దుప్పితూరు విజయవంతం చేయండి
అచ్యుతాపురం రూరల్ : బ్రాండిక్స్ పరిశ్రమ కాలుష్యం కోరల నుండి దుప్పితూరు గ్రామాన్ని కాపాడుకుందామని మంగళవారం చలో దుప్పితూరు విజయవంతం చేయాలని వైఎస్ఆర్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఆదేశాల మేరకు ధర్మశ్రీ నాయకత్వంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ అనకాపల్లి ఎంపీ సత్యవతి, వరుదు కళ్యాణి దుప్పితూరు గ్రామ సమస్యలపై పోరాడేందుకు పాల్గొంటున్న సందర్భంగా యలమంచిలి నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చి చలో దుప్పితూరు కార్యక్రమం విజయవంతం చేయాలని సోమవారం కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించిన వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షునిపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయమన్నారు. దుప్పితూరు గ్రామ రైతుల భూములతో బ్రాండిక్స్ పరిశ్రమ ఏర్పర్చి దశాబ్దాల కాలం గడుస్తున్నా, గ్రామస్తులకు పరిహారం, ప్యాకేజి ఇవ్వకుండా ప్రహరీ నిర్మాణాలు చేపట్టడం దుర్మార్గమన్నారు. దుప్పితూరులో గ్రామస్తులకు దశాబ్దాల కాలంగా జరుగుతున్న అనేక సమస్యలు, అన్యాయాలపై పోరాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి రావాలని ధర్మశ్రీ పిలుపునిచ్చారు. -
మండుటెండలో కలెక్టరేట్కు..
తుమ్మపాల: మండుటెండలోనూ కలెక్టరేట్కు అర్జీదారులు పోటెత్తారు. దూరాభారం నుంచి ఇక్కడకు వచ్చిన వారికి కనీసం నిలువ నీడ గానీ గుక్కెడు తాగునీరు గానీ సేద తీరేందుకు బెంచీలు గానీ వంటి సౌకర్యాలు లేకపోవడంతో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. గంటల కొద్దీ ఎండలోనే వేచి ఉండాల్సి వచ్చింది. శంకరం హైవే నుంచి కలెక్టరేట్కు ఎండలో నడుచుకుంటూ వచ్చిన వృద్ధులు, మహిళలు అలసటతో చెమటలు కక్కుకున్నారు. అర్జీలు సమర్పించడానికి అవసరమైన జిరాక్స్ కేంద్రాలు కూడా కలెక్టరేట్ పరిసరాల్లో లేకపోవడంతో తిప్పలు పడ్డారు. దీంతో పలువురు నిరాశతో తమ పనులు పూర్తి చేయకుండానే వెనుదిరిగారు. దివ్యాంగుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. సమస్యలు చెప్పుకునేందుకు ప్రత్యేకంగా ఖర్చు చేసి ఆటోల్లో వచ్చినా పీజీఆర్ఎస్ వేదిక వద్దకు అనుమతి ఇవ్వకపోవడంతో వారు కలెక్టరేట్ బయటే గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. అధికారుల నిర్లక్ష్య ధోరణిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2 లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో కలెక్టర్ విజయ కృష్ణన్తోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో సుబ్బలక్ష్మి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని, ఎట్టి పరిస్థితుల్లోను రీఓపెన్ కాకూడదని వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్–152, రెవెన్యూ క్లినిక్–129 మొత్తం 281 వినతులు నమోదయ్యాయి. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు సూర్యలక్ష్మి, కె.శచీదేవి, వి.సుధీర్, జి.రామారావు, గోపాల్ రాజా, ఆశాదేవి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వారం వచ్చిన అర్జీల్లో మచ్చుకు కొన్ని... ●రాంకీ ఫార్మా కంపెనీ వ్యర్థాలను తాడి గ్రామానికి సమీప భూమిలో పాతిపెట్టడానికి చేసిన ల్యాండ్ ఫిల్ ప్రతిపాదనపై జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి రక్షించాలంటూ గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఫార్మా కంపెనీ కాలుష్యంలో కొట్టుమిట్టాడుతున్న గ్రామాన్ని తరలించే ప్రక్రియ పూర్తికాకుండానే సర్వే నంబరు 116లో 91.44 ఎకరాలు ల్యాండ్ ఫిల్ కోసం కేటాయించడం అన్యాయమన్నారు. ●చోడవరం సున్ని జామియా మసీద్ ప్రెసిడెంట్ చేస్తున్న అవకతవకలపై విచారణ చేపట్టి, వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో నూతన కమిటీని ఏర్పాటు చేయాలంటూ బీజేపీ జనతా వారధి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు తమ రాజీనామా పత్రాలతో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. 13 ఏళ్లుగా ప్రెసిడెంట్గా కొనసాగుతూ ఖబ్రస్తాన్ అభివృద్ధి పేరుతో చందాలు వసూలు చేసి చెరువు మట్టి వేసి రూ.2.70 లక్షలు దుర్వినియోగం చేశారని, మసీద్ నూతన షాపులను తక్కువ అద్దెకు ఇవ్వడం, కొబ్బరి కాయల ఆదాయం వంటి అంశాలపై విచారణ చేపట్టి మసీద్ను కాపాడాలని కోరారు. ●ఫోర్జరీ పత్రాలతో ఆశ్రమ పాఠశాల భూములను ఆక్రమించి అక్రమ కేసులు బనాయించి ప్రాణహాని తలపెడుతున్న గణపతి, అతని అనుచరులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఇంటిగ్రేటెడ్ వికలాంగుల ఆశ్రమ పాఠశాల వ్యవస్థాపకుడు (దివ్యాంగుడు) సత్య తిరుపతిరావు పట్నాయక్, దివ్యాంగులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. ●భూ సమస్య పరిష్కారం కోసం పసిబిడ్డతో కలెక్టరేట్కు వచ్చాను. పసుపుకుంకుమ కింద మా అమ్మ నాకిచ్చిన భూమిని గెంజినాయుడు, శ్రీను ట్రాక్టర్తో వచ్చి దుక్కిదున్నారు. అడిగినందుకు తీవ్రంగా భయపించారు. గ్రామంలో సర్వే నంబరు 150/8లో నా భూమి నాకు లేకుండా చేస్తున్నారంటూ చీడికాడ మండలం అప్పలరాజుపురం గ్రామానికి చెందిన శ్రీలెక్కల ఈశ్వరమ్మ రెవెన్యూ క్లినిక్లో ఫిర్యాదు చేసింది. -
వైద్యం నిల్
ఓపీ ఫుల్...సాక్షి, అనకాపల్లి : జిల్లాలో ప్రభుత్వ వైద్యం కునారిల్లుతోంది. నిరుపేద రోగికి అండగా నిలవాల్సిన సర్కార్ ఆసుపత్రులు సమస్యల నిలయాలుగా మారాయి. జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ఆసుపత్రి నుంచి మారుమూల సీహెచ్సీల వరకు ఎక్కడ చూసినా ‘ఓపీ ఫుల్.. వైద్యం నిల్’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. రోగుల సంఖ్యకు తగ్గట్టుగా సౌకర్యాలు లేకపోవడం, కీలక విభాగాల్లో వైద్యుల కొరత వేధిస్తుండడంతో రోగులకు సరైన చికిత్సలు అందడం లేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 1 డిస్ట్రిక్ట్, 2 ఏరియా, 8 సీహెచ్సీ ఆసుపత్రుల్లో ’సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలనలో పలు సమస్యలు వెలుగుచూశాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య రంగంపై పర్యవేక్షణ కరువైందని..మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆసుపత్రిలో రోగుల అగచాట్లు.. అనకాపల్లి జిల్లా కేంద్రమైన ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నా..ఇక్కడ వైద్యం అందడం లేదు. సగటున 400 వరకూ రోగులు ఓపీ నమోదవుతుంది. వైద్యపరికరాలు, మందులు, వీల్ చైర్లు, ఇతర మౌలిక వసతుల లోపం కారణంగా వైద్యులున్నా తగిన వైద్యసేవలందించలేకపోతున్న పరిస్థితి ఎన్న్టీఆర్ ఆసుపత్రిలో కనిపిస్తోంది. రోజువారీ గంట వరకూ ఓపీలకు క్లోజ్డ్ టైం. ఎవరైనా అత్యవసర వైద్యం కోసం ఆసుపత్రికి మధ్యాహ్నం 2 తర్వాత వస్తే.. విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తీసుకెళతారు. ఇక ఉదయమే వచ్చి క్యూలో నిలుచుండి ఓపీలో చూపించుకుని వైద్యుడి సలహా మేరకు వార్డులో చేరితే కాసింత ఎమర్జెన్సీ అయినా తక్షణమే కేజీహెచ్కి వెళ్లిపోవాలని రిఫర్ రాసేస్తున్నారు. ఎక్కువగా గైనిక్ రోగులనే చిన్నపాటి ఎమర్జెన్సీ ఉన్నా కేజీహెచ్కి రిఫర్ రాసేస్తున్నారు. ‘సాక్షి’ పరిశీలనలో వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెలుగు చూసిన వాస్తవాలు...ఇలా... ●అనకాపల్లి జిల్లాలో ఏకై క జిల్లా ఆసుపత్రి ఎన్టీఆర్ ఆసుపత్రి. ఇక్కడకు అనకాపల్లి, చోడవరం, మాడుగుల, పాయకరావుపేట, నర్సీపట్నం నియోజకవర్గాల నుంచి రోగులు వస్తుంటారు. ●ఎన్టీఆర్ జిల్లా ఆసుపత్రిలో 250 నుంచి 300 బెడ్స్ సదుపాయం ఉంది. 250 బెడ్స్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులు ఉన్నారు. ●ఆసుపత్రిలో 42 మంది వైద్యులుండాలి. కానీ 32 మాత్రమే అందుబాటులో ఉన్నారు. మిగతా పోస్టులు ఖాళీ ఉన్నాయి. వీరిలో 17 మంది సివిల్ సర్జన్ స్పెషలిస్టులు, డిప్యూటీ సివిల్ సర్జన్ స్పెషలిస్టులు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, 15 మంది పీజీ వైద్యులు ఉన్నారు. ●జనరల్ మెడిసిన్్ విభాగంలో ముగ్గురికి గానూ ఇద్దరు మాత్రమే ఉన్నారు. గైనిక్ విభాగంలో ముగ్గురు ●పీడియాట్రిక్ వైద్యులు ఒక్కరూ కూడా లేరు. ఎంసీయూ వార్డులో చిన్న పిల్లల వైద్యులు ఇద్దరు ఉండాలి. ప్రస్తుతం రెండు ఖాళీగా ఉన్నాయి. ●అనస్తీషియా వైద్యులు ఇద్దరు ఉండాల్సి ఉంది. వీరిలో ఒకరు మాత్రమే పనిచేస్తున్నారు ●కంటి వైద్య నిపుణులు ఇద్దరు ఉండాలి. కానీ ఒక్కరే ఉన్నారు. ●సైకియాట్రిస్ట్ వైద్యులు లేరు ●స్టాఫ్ నర్సులు, పారామెడికల్ స్టాఫ్ 510 మంది (ప్రభుత్వ, అవుట్సోర్సింగ్) ఉండాలి. వీరు రెండు షిప్ట్లలో విధులు నిర్వహిస్తారు. కానీ ప్రస్తుతం 215 మంది మాత్రమే పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్, రెగ్యులర్ స్టాఫ్ నర్సులు 56 మంది పనిచేస్తున్నారు. నక్కపల్లిలో ‘కంటి‘ తుడుపు చర్యలు.. నక్కపల్లి ఏరియా ఆసుపత్రి (50 పడకలు)లో గతంలో కంటే ఓపీ రోగుల సంఖ్య తగ్గింది. నెలకు సగటున 11 వేలకు పైగా ఓపీ ఉండేది. ఇప్పుడు 6 వేలకు తగ్గింది. ఇన్ పేషెంట్లు గతంలో 1000 మంది వరకూ ఉండేవారు..అది కాస్త 300కు తగ్గింది. ఈ ఆసుపత్రిలో రెండేళ్లుగా వైద్య నిపుణులు పీడియాట్రిషన్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్, గైనిక్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కంటి వైద్యులు ఉన్నా సేవలు అంతంతమాత్రమే. సిబ్బంది లేక సరైన వైద్యం అందక ఇక్కడకు వచ్చే రోగుల సంఖ్య తగ్గుతోంది. ●చోడవరం, మాడుగుల, కోటవురట్ల, యలమంచిలి సీహెచ్సీల్లో వైద్యుల కొరత లేకున్నా..మందుల కొరత ఉంది. ఇన్ పేషెంట్లకు టాయిలెట్ సమస్యలున్నాయి. జిల్లాలో దయనీయంగా సర్కారు వైద్యం జిల్లా ఆసుపత్రిలోనూ రోగుల అగచాట్లు మౌలిక వసతుల లేమితో అవస్థలు ఎక్స్రే, స్కానింగ్ కోసం గంటల పాటు క్యూలైన్లో రోగులు వైద్యులున్నా వేధిస్తున్న మందుల కొరత అవసరం లేకున్నా రోగులకు విశాఖ కేజీహెచ్కు రిఫర్ ఎన్టీఆర్ ఆసుపత్రిలో అక్రమాల దందా జిల్లాలో ఉన్న 1 డిస్ట్రిక్ట్, 2 ఏరియా, 8 సీహెచ్సీ ఆసుపత్రుల్లో ‘సాక్షి‘ క్షేత్ర పరిశీలన -
నకిలీ వైద్యులపై చర్య తీసుకోండి...
తుమ్మపాల : అనకాపల్లిలో అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తూ అమాయక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న లలిత ఫైల్స్ ఆసుపత్రిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని మాడుగుల మండలం కోడూరు గ్రామానికి చెందిన దళిత మహిళ చోడే పార్వతి ఎస్పీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనారోగ్యంతో ఉన్న కుమార్తెను వైద్య పరీక్షల కోసం తీసుకొస్తే అర్జెంట్గా పైల్స్ ఆపరేషన్ చేయాలంటుంటూ ఆసుపత్రిలో చేర్చుకుని మొదట చేసిన ఆపరేషన్ వికటించి తీవ్ర రక్తస్రావం కావడంతో రెండవసారి కూడా ఆపరేషన్ చేసినా ఫలితం లేకపోవడంతో బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించింది. ఆపరేషన్ల తర్వాత నుంచి కుమార్తె ఆరోగ్యం మరింత విషమించి నాలుగు నెలలుగా మంచాన పడి ఉందని, 25 ఏళ్ల కుమార్తె జీవితం నకిలీ వైద్యుల కారణంగా అస్తవ్యస్తమైందని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై మూడు నెలలుగా పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని, ఎస్పీ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేశానని, అధికారులు విచారనణ చేపట్టి న్యాయం చేయాలని ఆమె కోరింది. -
కిశోరి వికాసం.. చైతన్యమే లక్ష్యం
తుమ్మపాల : కిశోరుల భద్రత, ఆరోగ్యం, సాధికారతే లక్ష్యంగా ‘కిశోరి వికాసం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్ఓ సుబ్బలక్ష్మితో కలిసి కిశోరి వికాసం గోడ పత్రిక ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కిశోరి బాల బాలికల సమగ్ర అభివృద్ధి, ఆరోగ్యం, విద్య భద్రతపై అవగాహన కల్పించేందుకు కిశోరి వికాసం కార్యక్రమం ఈ నెల 5 నుంచి 11 వరకు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. బాలికలు, బాలురలో విద్య, పోషణ, వ్యక్తిగత శుభ్రతపై అవగాహన పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 112, మహిళా హెల్ప్లైన్ 181, చైల్డ్ హెల్ప్లైన్ 1098 సేవలను వినియోగించుకోవాలని సూచించారు. టెన్త్ టాపర్లకు అభినందన తుమ్మపాల : పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను కలెక్టర్ విజయకృష్ణన్, జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ దుశ్శాలువాలతో సత్కరించి అభినందించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల నుంచే ఉత్తమ ఫలితాలు సాధించడం గర్వకారణమని, విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావంతో మంచి ఫలితాలు సాధించారని అభినందించారు. ప్రభుత్వం అందిస్తున్న విద్యా సదుపాయాలు సద్వినియోగం చేసుకుని మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్ధులకు సూచించారు. కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. కిశోరి వికాసం గోడ పత్రిక ఆవిష్కరిస్తున్న కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ శౌర్యమాన్ పటేల్ ప్రభుత్వ పాఠశాల టాపర్లతో కలెక్టర్ విజయకృష్ణన్ -
సోషల్ మీడియాలో
అభ్యంతరకర పోస్టులపై ఫిర్యాదుపట్టణ ఎస్ఐ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేస్తున్న వైస్సార్సీపీ సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు కాండ్రేగుల శ్రీరామ్ అనకాపల్లి టౌన్ : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై ట్విటర్ ఖాతాలో అసభ్యకరమైన పోస్ట్లు పెట్టిన స్వాతీ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జిల్లా వైఎస్సార్సీపీ నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షుడు కాండ్రేగుల శ్రీరామ్ అన్నారు. స్ధానిక పోలీస్ స్టేషన్లో సోమవారం రాత్రి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రిపై ఉద్దేశపూర్వకంగా అత్యంత అవమానకరంగా ఉండే విధంగా పోస్ట్లు తయారు చేసి, ప్రజలను తప్పుదారి పట్టించేలా పోస్టులు పెడుతున్న ఆమైపె తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయడం, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం వంటివి చట్టపరంగా శిక్షార్హమైన నేరాలన్నారు. తక్షణమే ఇటువంటి తప్పుడు పోస్ట్ను వెనువెంటనే తొలగించేలా చర్యలు తీసుకొని స్వాతీ రెడ్డిపై చట్టపరంగా తగు చర్యలు తీసుకోవాలని శ్రీరామ్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పాల్గొన్నారు. -
బాధితులకు వారంలోపు న్యాయం
అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటున్న అదనపు ఎస్పీ మోహనరావు తుమ్మపాల : ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు సత్వర న్యాయం అందిస్తామని జిల్లా అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన ’ప్రజా ఫిర్యాదుల వేదిక’ కార్యక్రమంలో ఆయన బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి భూ తగాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు, చీటింగ్, ఆర్థిక మోసాలు. ఇతర గృహ సంబంధిత ఫిర్యాదులపై గరిష్టంగా 7 రోజుల్లోపు ప్రాథమిక విచారణ పూర్తి చేసి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. మొత్తం 53 ఫిర్యాదులను నమోదు చేయడం జరిందన్నారు. ఎస్బీ డీఎస్పీ మోహన్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
దేవుని భూములపై కబ్జా నీడ
తగరపువలస: దాతలు భక్తితో దేవుడికి సమర్పించిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులు భీమిలి నియోజకవర్గంలో కబ్జాదారుల పాలవుతున్నాయి. ఆస్తులను సంరక్షించాల్సిన దేవదాయ శాఖ అధికారుల అలసత్వం, క్షేత్రస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వెరసి భూములు చేతులు మారుతున్నా అడిగే వారే కరువయ్యారు. వరుసగా అన్యాక్రాంతమవుతున్న భూములు ఇటీవల ఆనందపురం మండలం శిర్లపాలెంలో పాండ్రంగి వేణుగోపాల స్వామి దేవస్థానానికి చెందిన 22.70 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏకంగా రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినా అధికారులు పట్టించుకోలేదు. ‘సాక్షి’ కథనాలతో ఉన్నతాధికారులు స్పందించి సర్వేకు ఆదేశించే వరకు స్థానిక సిబ్బంది మౌనం వహించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలాగే దాకమర్రి నీలయమ్మ సత్రానికి చెందిన 23 ఎకరాల పల్లం భూముల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 1966 నుంచి ఈ భూములపై ఒక్క పైసా శిస్తు కూడా వసూలు చేయలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పట్టించుకోని ఈవోలు సంగివలస ముగ్గురు అమ్మవార్ల ఆలయానికి వస్తున్న ఈవోలు చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూముల రక్షణ బాధ్యతను దిగువ స్థాయి సిబ్బందికి వదిలేయడంతో వారు ఆడింది ఆటగా సాగుతోంది. ఆలయ పరిసరాల్లో నిత్యం కొత్త దుకాణాలు వెలుస్తున్నా నియంత్రణ లేదు. చిల్లపేటతో పాటు భీమిలి టౌన్ సర్వే నంబర్ 18లో ఉన్న లంగర్ఖానా భూములు కూడా రోజురోజుకు ఆక్రమణలకు గురవుతున్నాయి. భక్తుల ఆందోళన దాతలు సదుద్దేశంతో ఇచ్చిన సత్రం భూములు, లంగర్ఖానా ఆస్తులు హారతిలా కరిగిపోతుంటే దేవాదాయ శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, సమగ్ర సర్వే నిర్వహించి కబ్జాకు గురైన దేవుని భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. -
బతికుండగానే చంపేశారు..!
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల వేళ పింఛన్లు పెంచుతామని ఆకాశానికి నిచ్చెనలు వేసిన చంద్రబాబు, అధికారం దక్కగానే పెన్షన్ల కోత విధిస్తూ అవ్వాతాతల నోటికాడ బువ్వను లాగేసుకుంటున్నారు. విశాఖ జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అర్హులైన లబ్ధిదారులను ఏరివేయాలనే కుట్రతో, ఏకంగా బతికున్నవారిని రికార్డుల్లో చనిపోయినట్లు చూపిస్తూ పేదల కడుపు కొడుతున్నారు. పింఛన్ల తొలగింపు జాబితాల్లో తమ ప్రమేయం లేదని, ఈ పాపంలో తమను భాగస్వాములను చేయవద్దని ఇటీవల కొంతమంది సచివాలయ సిబ్బంది జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. –మహారాణిపేటవిశాఖ జిల్లాలో సుమారు 90 మంది లబ్ధిదారుల పింఛన్లను అత్యంత అన్యాయంగా తొలగించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. బాధితులు కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ను కలిసి ‘మేము బతికే ఉన్నాం’ అని మొరపెట్టుకోవడంతో ప్రభుత్వ భాగోతం వెలుగులోకి వచ్చింది. బతికున్నవారిని మరణించినట్టుగా..వలస వెళ్లినట్లుగా చిత్రించి జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఖజానాపై భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకే ఈ ప్రక్రియ సాగుతుండగా, రేపు ఏదైనా విచారణ జరిగితే కింది స్థాయి సిబ్బందిని బలిపశువులను చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రాజకీయ కక్షసాధింపులే లక్ష్యం 2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల పేరుతో సాగిన పింఛన్ల వేటు, ఇప్పుడు మళ్లీ అదే తరహాలో పునరావృతమవుతోంది. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తమకు అనుకూలంగా లేని వారిని గుర్తించి ఏరివేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.జిల్లాలో గత మార్చి నెలలో 1,65,891 గా ఉన్న పింఛన్ల సంఖ్య, మే నెల నాటికి 1,57,914కు పడిపోయింది. అంటే కేవలం రెండు నెలల వ్యవధిలోనే సుమారు 1700 మందికి పైగా లబ్ధిదారులు పింఛన్లకు దూరమయ్యారు. ఆందోళనలో వృద్ధులు ప్రభుత్వం చేపట్టిన ఈ పునఃపరిశీలన ప్రక్రియ అభాగ్యుల పాలిట శాపంగా మారింది. శారీరక ఇబ్బందులతో మంచానికే పరిమితమైన వృద్ధులను సైతం ధృవీకరణ పత్రాల పేరుతో వేధిస్తుండటంతో వృద్ధులు, వితంతువులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. తమ పింఛన్ ఎందుకు ఆగిపోయిందో అడిగితే సమాధానం చెప్పే నాథుడే కరువయ్యారు. అధికారుల చుట్టూ తిరగలేక, అటు ఆర్థిక ఆసరా లేక అనేక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. బాధితుల ఫిర్యాదులతో జీవీఎంసీ కమిషనర్ విచారణకు ఆదేశించినప్పటికీ, సిబ్బందిపై చర్యలు తీసుకుని ప్రభుత్వం తన తప్పును కప్పిపుచ్చుకోవాలని చూస్తోందని క్షేత్రస్థాయిలో చర్చ జరుగుతోంది. -
పెన్షన్దారుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
వెంకటేశ్వర్లు, ప్రభుదాస్లను శాలువాలతో సత్కరించి, మెమెంటో ఆందజేసిన సంఘం జిల్లా కమిటీ సభ్యులు అనకాపల్లి: ప్రభుత్వ పింఛన్దారులకు నెల మొదటి తేదీన పింఛను జమఅవుతుందని, 30 నెలల డీఆర్ బకాయిలు సంక్రాంతి పండగ రోజున చెల్లించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర ప్రభుత్వ పింఛన్దారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక నర్సింగరావుపేట ఏపీటీఎఫ్ భవనంలో ఆధివారం సంఘం జిల్లా అధ్యక్షుడు వడ్డాది జగన్నాథరావు ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర జేఏసీతో కలిసి సమస్యలు సాధనకు కృషి చేస్తున్నామని, అనకాపల్లి జిల్లాలో నూతన భవన నిర్మాణానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యలను దశలు వారిగా ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామన్నారు. అనంతరం జిల్లా సభ్యులు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను శాలువాలతో సత్కరించి, మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రభుదాస్, జిల్లా కార్యదర్శి బి.ఎల్.ఎన్.శర్మ, గౌరవాధ్యక్షుడు సీహెచ్.సోమేశ్వరరావు, సీనియర్ పెన్షనర్ జి.ఎస్.ఆర్.శేషగిరిరావు, విశ్రాంత డిప్యూటీ డీఈవో కె.వి.గౌరీపతి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.


