breaking news
Anakapalle District Latest News
-
డెడ్లైన్ దాటితే సస్పెన్షన్!
తుమ్మపాల: ఈ నెల 15 నాటికి శతశాతం ఇంటి పన్నుల వసూలు చేయాల్సిందేనంటూ అధికార యంత్రాంగం విధించిన డెడ్లైన్ తో గ్రామ పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఇప్పటికే రకరకాల సర్వేలు, శానిటేషన్ పనుల ఒత్తిడి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ఇంటి పన్నులు, వ్యాపార పన్నులు, నీటి పన్నులు, లైటింగ్ చార్జీలు, ఇతర గ్రామ పన్నుల వసూళ్లను ఈనెల 15వ తేదీ లోపు పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి మరింత ఆందోళనకు గురిచేస్తోంది. వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరికలతో పాటు సస్పెన్షన్ నోటీసులు జారీ చేసేందుకు జిల్లా అధికారులు సిద్ధమవుతున్నారు. గ్రామాల్లో సాధారణంగా ఇంటి పన్నులు చెల్లించే ప్రక్రియ సులభంగా సాగదు. ఆర్థిక ఇబ్బందులు, వ్యవసాయ ఆదాయం తగ్గడం, ఉపాధి సమస్యలు వంటి కారణాలతో అనేక కుటుంబాలు పన్నులు చెల్లించడంలో ఆలస్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విధించిన గడువు కార్యదర్శులకు మానసిక ఒత్తిడిని తీవ్రంగా పెంచుతోంది. నిత్యం ఒత్తిళ్లతో ఆస్పత్రి పాలు పంచాయతీ కార్యదర్శులు ఇప్పటికే అనేక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జనన మరణ నమోదులు, పలు రకాల ధ్రువీకరణలు, పథకాల అమలు, గ్రామ సభలు, ఆన్లైన్ ఎంట్రీలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల ఎంపిక వంటి పనులతో పాటు కొన్ని ఆన్లైన్ సర్వేలు, ప్రతి రోజు తెల్లవారు 6 నుంచి పారిశుధ్య పనులతో మొదలు పెట్టి సాయంత్రం వరకు అనేక పనులు కార్యదర్శుల భుజాలపైనే ఉన్నాయి. మరోపక్క యూనిక్ ఫ్యామిలీ సర్వే టార్గెట్ కూడా కొనసాగుతుంది. వీటన్నింటికి తోడు ఇంటి పన్నుల వసూళ్ల లక్ష్యాలు కూడా 15 నాటికి శతశాతం చేరుకోవాలనే ఒత్తిడి మరింత పెరగడంతో వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. కొన్ని చోట్ల మానసిక ఒత్తిడికి లోనై పలువురు కార్యదర్శులు ఆస్పత్రుల పాలవుతున్నారని సంఘాల నాయకులు చెబుతున్నారు. సగానికి పైగా బకాయిలు... జిల్లాలో ఉన్న 24 మండలాల్లోను 646 గ్రామ పంచాయతీల్లో 3.90 లక్షల గృహాలు, షాపులు, ఇతర పన్నుల వనరుల ద్వారా మొత్తం రూ.44 కోట్ల పన్నులు ఉండగా ఈ నెల 15 నాటికి పూర్తిగా వసూలు చేయడమే లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. అయితే వీటిలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.12 కోట్లు కాగా పాత బకాయిలే రూ.32 కోట్ల వరకు ఉన్నాయి. అన్నింటిని కలిపి ఇప్పటి వరకు పంచాయతీ కార్యదర్శులు 40 శాతం మేర అంటే దాదాపు రూ.20 కోట్ల వరకు వసూళ్లు పూర్తి చేశారు. అయినప్పటికీ బకాయిగా ఉన్న మిగిలిన రూ.25 కోట్ల కూడా ఒక్క పైసా బకాయి లేకుండా 15 నాటికి పూర్తి చేయాలని కార్యదర్శులపై హుకుం జారీ చేశారు. ఆపదలోనూ పరామర్శించని జిల్లా అధికారులు ఒత్తిడి విధానం కాకుండా ప్రోత్సాహక విధానం అవలంభించి వసూళ్లు జరిగేలా ఉన్నతాధికారులు చొరవ చూపాలని పంచాయతీ కార్యదర్శులు చెబుతున్నారు. వ్యక్తిగత, విధి నిర్వహణలో వత్తిడికి లోనై ఆసుపత్రుల పాలైన పంచాయతీల అధికారులను సంబంధిత జిల్లా అధికారులు కనీసం పరామర్శించి ధైర్యం కూడా చెప్పలేకపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. గతంలో మార్చి నాటికి వసూళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు ఇప్పుడు ఫిబ్రవరిలోనే పూర్తిచేయమంటున్నారు. అధికారుల ఒత్తిడితో కొన్ని గ్రామాల్లో కార్యదర్శులు సొంత నిధులు కూడా చెల్లిస్తున్నారు. ఈ నెల 15 వరకు ఇచ్చిన గడువును పెంచి సాంకేతికతపై ప్రజలకు అవగాహన పెంచాలని కోరుతున్నారు. వాస్తవాలకు భిన్నంగా అంచనాలుప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేకంగా వసూళ్ల లక్ష్యాలను నిర్ణయించే ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం వాస్తవ స్థితిగతులకు భిన్నంగా నివేదికలు తయారుచేస్తున్నారు. గత సంవత్సరపు వసూళ్ల శాతం, పెండింగ్ బకాయిలు, కొత్తగా నమోదైన ఇళ్ల సంఖ్య వంటి అంశాల ఆధారంగా ఈ లక్ష్యాలను నిర్ణయిస్తున్నప్పటికీ గడిచిన ఏడాదిలో కొరతగా ఉన్న సౌకర్యాలను మరుసటి ఏడాదిలో అమలు చేసేవిధంగా చర్యలు చేపట్టలేకపోతున్నారు. దీంతో ఇంటి యాజమానులు పన్ను చెల్లింపులకు సౌకర్యాల ఏర్పాటుపై మెలిక పెడుతున్నారు. చెత్త సేకరణ సక్రమంగా లేకపోవడం, వీధిలైట్లు పనిచేయకపోవడం, డ్రైనేజీ సమస్యలు, తాగునీటి సరఫరా లోపాలు...ఇవన్నీ ప్రజలు ప్రస్తావిస్తుండడంతో ఇంటింటికీ వెళ్లి పన్నులు వసూలు చేయడం కార్యదర్శులకు సవాలుగా మారింది. దీంతో ఆశించిన స్థాయిలో వసూళ్లు లేకపోవడంపై జిల్లా అధికారులు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం సమీక్షలు పెట్టి కార్యదర్శులను వివరణలు కోరడం, షోకాజ్ నోటీసులు జారీ చేయడం, వార్షిక గోప్య నివేదికల్లో ప్రతికూల వ్యాఖ్యలు నమోదు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిణామాలతో పంచాయతీ కార్యదర్శులు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. -
నేడే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలు
విశాఖ లీగల్: రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. శుక్రవారం జరగనున్న ఈ ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె. శ్రీనివాస్, కార్యదర్శి లాలం పార్వతీ నాయుడు తెలిపారు. 2020 తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో న్యాయవాదుల్లో ఆసక్తి నెలకొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయవాది పర్యవేక్షణలో జరగనున్న ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖలోని 2,000 మందికి పైగా న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 143 మంది పోటీ చేస్తుండగా, ఒక్క విశాఖ నగరం నుంచే 24 మంది బరిలో నిలవడం విశేషం. మిగిలిన జిల్లాల అభ్యర్థులు కూడా విశాఖ ఓటర్లపైనే ప్రధానంగా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఎన్నికల ద్వారా బార్ కౌన్సిల్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి తదితర కీలక పదవులను ఎన్నుకోనున్నారు. కాగా.. ఈ ఎన్నికల్లో ప్రతి న్యాయవాది కనీసం ఐదు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అయితే ఓటును అంకెల రూపంలో కాకుండా, అక్షర రూపంలో రాయాలి. ఓటు వేయడానికి వచ్చే న్యాయవాదులు బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జారీ చేసిన ఐడీ కార్డు లేదా విశాఖ న్యాయవాద సంఘం ఐడీ కార్డును తప్పనిసరిగా చూపించాలి. అర్హులైన న్యాయవాదులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బార్ కౌన్సిల్ మాజీ ఉపాధ్యక్షులు కె. రామజోగేశ్వరరావు, ఎస్.కృష్ణమోహన్, ఇతర సభ్యులు కోరారు. బరిలో విశాఖ నుంచి 24 మంది న్యాయవాదులు -
సుందరపు భూబాగోతం
సాక్షి, అనకాపల్లి : దళితుల భూములను లాక్కొనేందుకు యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ భారీ స్కెచ్ వేశారు. దాదాపుగా రూ.200 కోట్లు విలువైన 42 ఎకరాల భూమి కబ్జా చేయాలని చూస్తున్నారంటూ రాంబిల్లి మండలంలో పంచదార్ల గ్రామానికి చెందిన దళితులు ఆరోపిస్తున్నారు. ఆ భూములే తమకు జీవనాధారమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1978లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే నెం.2లో 16 దళిత కుటుంబాలకు 42 ఎకరాలు ఇచ్చింది. ఒక్కొక్కరికీ 2 ఎకరాల 78 సెంట్లు చొప్పున ఇచ్చారు. తమ కిచ్చిన భూముల్ని దౌర్జన్యంగా లాక్కొనేందుకు జనసేన ఎమ్మెల్యే స్కెచ్ వేశారంటూ పంచదార్ల గ్రామానికి చెందిన దళిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యే చర్యలకు వ్యతిరేకంగా పంచదార్ల గ్రామ బాధిత దళిత కుటుంబాలు చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారంతో 11వ రోజుకు చేరుకుంది. దళితులు, పేదల భూముల్ని కబ్జా చేసేందుకు వచ్చిన పొక్లెయిన్లను అడ్డుకుంటూ..ఈ నెల 2వ తేదీ నుంచి తమ భూముల్లో వంటా వార్పు కార్యక్రమానికి దిగారు. స్థానిక ఎమ్మార్వో, పోలీసుల అండతో ఎమ్మెల్యే అనుచరుడు దిన్నిబాబు భూముల స్వాధీనానికి ప్రయత్నించగా పొక్లెయిన్ను బాధిత దళితులు అడ్డుకున్నారు. 1–బీ రికార్డులన్నీ తమ వద్దే ఉన్నాయని, ఆ భూములపై హక్కులన్నీ తమవేనని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా వారం రోజుల క్రితం జీడి, మామిడి, అరటి, కొబ్బరి చెట్లను నరికేందుకు వచ్చిన వారిని బాధిత దళితులు అడ్డుకున్నారు. ఇదిలా ఉంటే భూముల్ని ఖాళీ చేసేయాలంటూ రెవెన్యూ, పోలీస్ సిబ్బంది తమపై ఒత్తిడి చేస్తున్నారని, ఆ భూముల్లోకి వెళ్తే జైలుకు పంపుతామని బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 47 ఏళ్ల క్రితమే దళితులకు కేటాయింపు దళితులు, పేదలకు కేటాయించిన భూముల్ని ఇప్పుడు సెజ్ నిర్వాసితులకు ఇంటి స్థలాల కేటాయింపు పేరిట స్థానిక జనసేన ఎమ్మెల్యే లాక్కోవడానికి తన అనుయాయుల్ని రంగంలోకి దింపారు. సెజ్ కోసం ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ఇంటి స్థలాల కేటాయింపు పేరిట విలువైన భూములను లాక్కొనేందుకు భారీ స్కెచ్ వేశారు. తాము స్థలాలు కోల్పోతే తమకు కూడా స్థలాలే కేటాయించాలంటూ కొన్నాళ్లుగా బాధితులు నిరసనకు దిగారు. రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామ పరిధి లోని సర్వే నంబర్–2లో 1 నుంచి 24 వరకు ఉన్న సబ్ డివిజన్లలో దళితులకు చెందిన భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 1978లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దళిత కుటుంబాలకు ఈ భూముల్ని కేటాయించింది. అప్పటి నుంచీ ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్న బక్క జీవులను ఇప్పుడు తన్ని తగిలేస్తున్నారని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. చంపేస్తామని బెదిరిస్తున్నారు.. నాది పంచదార్ల గ్రామం. 2 ఎకరాల 78 సెంట్లు భూమి ఉంది. ప్రభుత్వానికి మేము పన్ను కూడా చెల్లిస్తున్నాం. పట్టాలున్న మా భూమికి భూమి రేట్లు పెరిగాయని స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ ఎంఆర్వోతో మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఐదు పొక్లెయిన్లతో అక్రమంగా మా భూముల్లో మట్టిని తవ్వి చదును చేస్తుంటే అడ్డుకున్నాం. మమ్మల్ని పొక్లెయిన్ డ్రైవర్ తొక్కించేస్తామంటూ భయపెట్టారు. అడ్డుకుంటే మీ పిల్లలపై కేసులు నమోదు చేస్తామంటూ పోలీసులు బెదిరిస్తున్నారు. దళితులమని కూడా చూడకుండా దూషిస్తూ చంపేస్తామని బెదిరిస్తున్నారు. మాపై పోలీసులు కేసులు పెట్టి స్టేషన్కు కూడా తీసుకెళుతున్నారు. – కనకరత్నం, పంచదార్ల గ్రామం, రాంబిల్లి మండలం ఎమ్మెల్యే అండతోనే బెదిరిస్తున్నారు.. మాకు 2.78 సెంట్లు డి–పట్టా భూమి ఉంది. స్థానిక టీడీపీ నాయకుడు బిన్నిబాబు పోలీసులు, ఎంఆర్వోతో కలిసి మా భూములు లాక్కోవడమే కాకుండా మమ్మల్ని క్రేన్తో తొక్కించేస్తామంటూ బెదిరిస్తున్నారు. ఎమ్మెల్యే అండతో దిన్బాబు మమ్మల్ని నాశనం చేస్తున్నాడు. – గూటాల జయలక్ష్మి, పంచదార్ల గ్రామం, న్యాయం జరిగేవరకూ పోరాడతాం.. మా భూమిలో మాకు తెలియకుండా పొక్లెయిన్లతో తవ్వుతున్నారు. అడ్డుకుంటే మహిళనని కూడా చూడకుండా చంపేస్తామని బెదిరించారు. ఎమ్మార్వో కేసులు పెడతామంటూ బెదిరించారు. పోలీసులు కూడా వచ్చారు. మీరు అడ్డుకుంటే మీ పిల్లలపై కేసులు పెడతామంటూ బెదిరించారు. మాకు న్యాయం జరగకుంటే ప్రాణాలు పోయినా తవ్వడానికి ఒప్పుకోము. –గారపాటి చిన్నమ్మలు, పంచదార్ల గ్రామం కేసులకు భయపడేది లేదు.. మా తాతల కాలం నాటి మా స్వాధీనంలో ఉన్న భూముల్ని లాక్కోడానికి ఎమ్మెల్యే సుందరపు, ఆయన అనుచరులు ప్రయత్నిస్తున్నారు. ఆ భూములు ఇవ్వకుంటే కేసుల్లో ఇరికిస్తామని రెవెన్యూ, పోలీస్ అధికారుల ద్వారా బెదిరిస్తున్నారు. దళితుల్ని చిన్నచూపు చూస్తే సహించేది లేదు. మా భూముల్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటాలకై నా సిద్ధంగా ఉన్నాం. మా భూముల్లో వంటావార్పు చేస్తుండగా మా భూముల్లోకి పొక్లెయిన్లతో వచ్చి మమ్మల్ని బెదిరించారు. ఎమ్మార్వో, వీఆర్వో, పోలీసులు వచ్చి మీపై కేసులు పెడుతున్నామంటూ బెదిరించారు. –తెరపల్లి ప్రసన్న, పంచదార్ల ఎమ్మెల్యే కనుసన్నల్లోనే... దళితుడినైన నాకు 47 ఏళ్ల క్రితమే అప్పటి ప్రభుత్వం డి.పట్టాతో 2.78 ఎకరాల భూమి ఇచ్చింది. మా భూమికి వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా ప్రతి ఏటా ఇచ్చారు. ఈ ప్రభుత్వంలో కూడా అన్నదాత సుఖీభవ పడింది. పన్ను చెల్లిస్తున్నాం. స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్కుమార్ కనుసన్నల్లోనే టీడీపీ మండల నేత దిన్నిబాబు బెదిరించి మా భూమి లాక్కొంటున్నారు. ఎమ్మార్వో, ఆర్డీవోకు, కలెక్టర్కు వినతి ఇచ్చాం. న్యాయం జరగలేదు. –గూడబండి రమేష్, పంచాదార్ల గ్రామం బాధితులకు అండగా ఉంటాం 47 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం నిరుపేద దళితులకు భూములను ఇచ్చింది. వాటిని మింగేద్దామని కూటమి ప్రభుత్వం చూస్తుంది. పొజిషన్లో ఉన్నవారికి నోటీసులు లేకుండా దళితుల భూములు దోచుకుంటామంటే మంచి పద్ధతి కాదు. దళితులను మోసం చేసిన ప్రభుత్వాలకు మనుగడ ఉండదు. దళితులకు అండగా వైఎస్సార్సీపీ నిలుస్తుంది. 13న ఉదయం 10 గంటలకు నిరసన తెలియజేస్తున్న దళితులను కలిసి వారికి మద్దతు పలుకుతాను. – కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే, యలమంచిలి వైఎస్సార్సీపీ సమన్వయకర్తపొక్లెయిన్లను అడ్డుకుంటున్న బాధిత దళిత రైతులు దళితుల భూములపై జనసేన ఎమ్మెల్యే సుందరపు కన్ను రూ.200 కోట్లు విలువైన 42 ఎకరాల భూమి కబ్జాకు యత్నం సెజ్ నిర్వాసితులకు ఇంటి స్థలాలంటూ హడావుడి ఎమ్మెల్యేతో పాటు ఆయన అనుచరుడు దిన్నిబాబుపై పేద దళితులు ఆగ్రహం పొక్లెయిన్లను అడ్డుకున్న దళితులను తొక్కించేస్తామంటూ బెదిరింపులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా 11వ రోజుకు చేరుకున్న దళితుల నిరసన కేసులు పెడతామంటూ ఎంఆర్వో, సీఐ బెదిరింపులు -
ఉపాధి హామీ పనుల తనిఖీ
దేవరాపల్లి: ఉపాధి హామీ పథకంలో చేపట్టిన పనులను కేంద్రం నుంచి వచ్చిన అధికారితో కూడిన బృందం పరిశీలించింది. మండలంలోని వాలాబు, చింతలపూడి, తామరబ్బ, చిననందిపల్లి, తారువ, బోయిలకింతాడ, కొత్తపెంట తదితర గ్రామాల్లో బుధవారం అధికార్లు పర్యటించారు. గత ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించిన ఫొటోలను మండలాల వారీగా ఆన్లైన్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు పంపించారు. వీటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని అక్కడ నిబంధనల ప్రకారం పని జరిగిందా లేదా అని క్షేత్ర స్థాయిలో పర్యటించి పరిశీలన చేశారు. జలసంచయ్–భాగీదారీ పథక కేంద్ర నోడల్ అధికారి, కేంద్ర జల కమిషన్ సబ్ డివిజన్ ఇంజినీర్ సుగుణాకరరావు, డ్వామా నుంచి ఇంజినీరింగ్ కన్సల్టెంట్ బాలు తదితర అధికారులు చెరువులు, నీటి గుంతల పనులను పరిశీలించారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. వీరి వెంట ఉపాధి హామీ పథకం ఏపీవో వై. రుక్మిణీదేవి, ఈసీ వెంకటేష్, లక్ష్మణరావు, ఎర్రునాయుడు, సత్యనారాయణ ఉన్నారు. -
కూటమి వైఫల్యాలపై పోరుబాట
● శ్రీశైలంలో భక్తులపై లాఠీచార్జ్ దారుణం ● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సాక్షి, విశాఖపట్నం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల గొంతుకగా యువజన విభాగం నిలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీలో లేని విధంగా వైఎస్సార్ సీపీ యువజన విభాగం అత్యంత బలంగా మారనుందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.70 లక్షల మంది యువజన విభాగం సైనికులు తయారవుతున్నారని తెలిపారు. బుధవారం ఎండాడలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర యువజన విభాగం విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు హాజరయ్యారు. ముందుగా రాజాకు ఉత్తరాంధ్ర యువజన విభాగం జోనల్ అధ్యక్షుడు అంబటి శైలేష్ ఆధ్వర్యంలో భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, ఇతర యువజన విభాగం నాయకులతో కలిసి రాజా.. వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. యువజన విభాగమే గొంతుక కావాలి ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. పార్టీ అనుబంధ విభాగాల్లో యువజన విభాగం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందన్నారు. విద్యార్థి దశ నుంచే వైఎస్సార్ సీపీలో పని చేసిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని, గతంలో యువజన విభాగంలో పని చేసిన వారికి ఎమ్మెల్యేలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించామని గుర్తు చేశారు. పార్టీ బలోపేతానికి ఎవరైతే శ్రమిస్తారో వారికి భవిష్యత్తులో కచ్చితంగా అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు. ‘చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, ఏటా జాబ్ క్యాలెండర్ వంటి హామీలను తుంగలో తొక్కింది. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు.. ఉన్న ఉద్యోగాలకే ఎసరు పెట్టింది. ఎండీయూ వాహన ఆపరేటర్లు, వలంటీర్లు సహా అనేక సంస్థల్లో పనిచేస్తున్న చిరుద్యోగులను రోడ్డున పడేసింది. విభజన చట్టం హామీలను, ప్రత్యేక హోదా అంశాన్ని గాలికి వదిలేసింది. వీటిపై యువత పోరాటం చేయాలి’అని రాజా పిలుపునిచ్చారు. దాడి చేసిన వారికి బెయిల్.. ప్రశ్నించిన అంబటికి జైలా? ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతోనే మాజీ మంత్రి అంబటి రాంబాబుపై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని జక్కంపూడి రాజా ఆరోపించారు. ఇళ్లు ధ్వంసం చేసి పెట్రోల్ బాంబులు విసిరిన వారికి స్టేషన్ బెయిల్ ఇస్తూ, ప్రభుత్వాన్ని నిలదీసిన వారిని అరెస్ట్ చేయడం చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసమే తిరుమల లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు అసత్య ప్రచారాలు చేస్తూ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. జగన్ 2.0లో కార్యకర్తలకే పెద్దపీట జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ.. వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకోవాలని సూచించారు. యువజన విభాగమే పార్టీ భవిష్యత్తుకు బాటగా మారుతుందన్నారు. జగన్ 2.0లో కార్యకర్తల ద్వారానే పాలన సాగుతుందన్నారు. మాజీ ఎమ్మెల్యే అదీప్రాజ్ మాట్లాడుతూ.. గతంలో వైఎస్సార్ హయాంలో యూత్ కాంగ్రెస్లో కష్టపడి పనిచేశానని, అందుకే తనను పిలిచి వైఎస్సార్ సీపీ లో ఎమ్మెల్యేగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అవకాశం కల్పించారని గుర్తుచేసుకున్నారు. రాజకీయంగా ఎదగాలనుకునే వారికి, ప్రజా సేవ చేయాలనుకునే వారికి యువజన విభాగం మంచి అవకాశం కల్పిస్తుందన్నారు. గాజువాక సమన్వయకర్త దేవన్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర అంటే ‘ఉత్తి ఆంధ్ర’కాదు ‘ఉద్యమాంధ్ర’అని చరిత్ర చూస్తే తెలుస్తుందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే.. కుటుంబ బాధ్యతలను కూడా సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో యువజన విభాగం ఉపాధ్యక్షుడు మెంటాడ స్వరూప్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి మహ్మద్ ఇమ్రాన్, విశాఖ, అనకాపల్లి, అల్లూరి, విజయనగరం, మన్యం, శ్రీకాకుళం జిల్లాల యువజన విభాగం అధ్యక్షులు ఉరుకూటి చందు, పుల్లేటి వెంకటేష్, గబ్బిడి శేఖర్, అల్లు అవినాష్, ఎం.పృథ్వీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు దొడ్డి కిరణ్, పాలిశెట్టి సురేష్, యువజన విభాగం కార్యదర్శులు చింతకాయల వరుణ్, మలసాల కుమార్ రాజా, కనకల ఈశ్వరరావు, చందక అప్పలస్వామి, సంయుక్త కార్యదర్శులు జె.నరేష్, ధీరజ్ కుమార్, నియోజకవర్గం, మండల, వార్డు యువజన విభాగం అధ్యక్షులు పాల్గొన్నారు. -
రాజకీయ కక్షతోనే కంటైనర్ తొలగింపు
గొలుగొండ: ఏటిగైరంపేటలో పాల ఉత్పత్తులు విక్రయిస్తున్న కంటైనర్ను కూటమి నేతలు రాజకీయ కక్షతోనే తొలగించారని మండల వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. స్థానిక వైఎస్సార్సీపీ నేత పాము అప్పలనాయుడుపై కక్షతో ఇలా చేయడం సరికాదని వారన్నారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు కొరుప్రోలు పాణీశాంతారామ్, వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి ఆధ్వర్యంలో మండల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పాము అప్పలనాయుడును పరామర్శించి, కంటైనర్ తొలగించిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కంటైనర్ను తొలగించడం దారుణమన్నారు. కోర్టు అనుమతితో ఈ కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్నారని, తొలగింపుపై మళ్లీ కోర్టుకు ఆశ్రయిస్తామని వారు చెప్పారు. అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ సుర్ల బాబ్జి, గాదంపాలెం, కొమిర సర్పంచ్లు నల్లబెల్లి శ్రీనివాసరావు, అల్లురాజుబాబు, ఏఎల్పురం ఎంపీటీసీ సభ్యులు బుల్లిప్రసాద్, సీనియర్ నాయకులు కిలపర్తి పెద్దిరాజు, కొల్లు సత్యనారాయణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐ ఉచ్చులో పచ్చనేత
సాక్షి, అనకాపల్లి : నర్సీపట్నంలో రత్నమాల ట్రస్ట్ పేరిట నిధులను దారి మళ్లించిన కేసులో నలంద విద్యాసంస్థల యాజమాని, టీడీపీ కౌన్సిలర్ భర్త నేరెళ్ల వెంకట రాజేష్ను సీబీఐ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. రాజేష్ నర్సీపట్నంలో రత్నమాల ట్రస్ట్ పేరిట నలంద విద్యాసంస్థల్ని నడుపుతున్నారు. కొన్నేళ్లుగా మద్యం సిండికేట్లో టీడీపీ నాయకుడు రాజేష్ కీలకంగా వ్యవహరిస్తున్నాడు. రాజేష్ భార్య చంద్రిక ప్రస్తుతం టీడీపీ తరఫున మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. రాజేష్ కుటుంబానికి చాలాకాలంగా టీడీపీతో రాజకీయ అనుబంధం ఉంది. రాజేష్ తండ్రి బాబ్జీ టీడీపీ ఎంపీటీసీగా పని చేశారు. మున్సిపాలిటీ ఏర్పడిన తరువాత టీడీపీ కౌన్సిలర్గా రాజేష్ తల్లి సుగుణ కూడా పనిచేశారు. ఇన్కం ట్యాక్స్ ఏడీ సహా నలుగురు అరెస్ట్ ఆదాయ పన్నుశాఖలో అక్రమాలకు పాల్పడుతున్నట్టు సీబీఐ అధికారులకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈ నెల 5న రత్నమాల చార్టెర్డ్ అకౌంటెంట్ గ్రంధి శరత్కుమార్ను, ఆదాయ పన్నుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్కుమార్ను సీబీఐ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ కేసులో ఏ–1గా విశాఖకు చెందిన ఆదాయ పన్నుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ అమృత్ కుమార్ (ఇన్వెస్టిగేషన్), ఏ–2గా చార్టర్డ్ అకౌంటెంట్ శరత్కుమార్, ఏ–3గా రత్నమాల ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు నేరెళ్ల వెంకట రాజేష్, ఏ–4గా ఇతర సిబ్బందిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసును డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మురళి ఆదేశాల మేరకు సీబీఐ ఎస్పీ కె.మధుసూదన్ విచారణ చేస్తున్నారు. ఈ విచారణలో నర్సీపట్నంలో నలందా స్కూల్ నిర్వహిస్తున్న రత్నమాల ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ సొసైటీ నిధుల్లో సుమారు రూ.2 కోట్లు దుర్వినియోగం చేసి ఆ మొత్తాన్ని ఆ సొసైటీ అధ్యక్షుడు నేరళ్ల వెంకట రాజేష్ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఆదాయ పన్నుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అధికారి అమృత్కుమార్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలని, అవి లేకుండా చేయాలంటే తనకు లంచంగా రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.14 లక్షలు ఇస్తామని వారివురి మధ్య డీల్ కుదిరింది. అందులో భాగంగానే ఈ నెల 2న రత్నమాల ట్రస్టు ఆడిటర్ శరత్కుమార్, ట్రస్ట్ అధ్యక్షుడు నేరెళ్ల వెంకట రాజేష్కు లంచం డబ్బు సిద్ధం చేయాలని చెప్పారు. మరుసటి రోజున రాజేష్ తన స్నేహితుల నుంచి రూ.14 లక్షలు సిద్ధం చేశారు. ఈ నెల 5న గ్రంధి శరత్కుమార్ ఆ డబ్బు తీసుకుని విశాఖలో ఉన్న ఆదాయపన్ను శాఖ కార్యాలయంలో ఉన్న అధికారికి ఇస్తుండగా సీబీఐ ఏసీబీ డీఎస్పీ ప్రమోద్కుమార్ అరెస్ట్ చేశారు. రత్నమాల ట్రస్ట్ నిధుల దారి మళ్లింపుపై కేసు నమోదు ఈ నెల 5న ట్రస్ట్ ఆడిటర్తో పాటు రాజేష్ను అరెస్ట్ చేసిన సీబీఐ పోలీసులు ఇదే కేసులో ఇన్కమ్ ట్యాక్స్ అధికారి అరెస్ట్ -
అభివృద్ధి పనులువేగవంతం చేయండి
● వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆదేశాలు తుమ్మపాల : జిల్లాలో మంజూరైన అన్ని అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టరు విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఇంజినీరింగు అధికారులు, విద్యుత్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, క్రీడాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పనులు ప్రస్తుత పరిస్థిని ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు దశల్లో ఉన్న నిర్మాణ పనులన్నింటిని వెంటనే పూర్తిచేయాలని, నిధులు మురిగిపోయినట్లచితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి మండలానికి 5 గ్రామాలను ఒడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, ఆ గ్రామాలలో సోక్ పిట్స్, మేజిక్ డ్రెయిన్స్ వంటి నిర్మాణాలన్నింటిని పూర్తిచేయాలన్నారు. పాఠశాలలో, వసతి గృహాలలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అమలు చేయాలని తెలిపారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వెంటనే పూర్తి చేయాలన్నారు. మార్చి నాటికల్లా జిల్లాలో గల అన్ని వీధికుక్కలకు స్టెరిలైజేషను ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 65 శాతంగా గల అక్షరాస్యత శాతం పెంచుటకు అక్షర ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని, వయోజన విద్య సెంటర్లకు వస్తున్న 91 వేల మందిని వచ్చే నెలలో జరిగే పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులయ్యేటట్లు వారికి చదువు చెప్పాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ. కుటుంబాలకు అందిస్తున్న ఉచిత సోలారు విద్యుత్ పథకాన్ని, అలాగే పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగదారుడు వినియోగించుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. సైబర్ మోసాలు, మనీ న్యూలింగ్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ బ్యాంకింగ్ అధికారులను ఆదేశించారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా టీవీ కమర్షియల్ యాడ్స్ పోస్టర్లను కలెక్టరేట్లో ఆమె ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు జరిగే వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా కేవైసీ, సీకేవైసీ ప్రాముఖ్యతపై ప్రజలకు విస్తృత అవగాహన, ప్రచారం కల్పించాలన్నారు. డీఆర్వో సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు. -
కళ్యాణపులోవలో జాతరకు ఏర్పాట్లు పూర్తి
● సదుపాయాలు పరిశీలించిన ఎస్పీ తుహిన్ సిన్హా ● అధికారులకు సూచనలు రావికమతం : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండలంలో కొత్తకోట పోలీసు స్టేషన్ పరిధిలో గల కళ్యాణపులోవ పోతురాజుబాబు ఆలయ జాతర మహోత్సవాలకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎస్పీ తుహిన్సిన్హా తెలిపారు. ఆయన బుధవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 15 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ జాతరకు సుమారు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయం వద్ద తొక్కిసలాట జరగకుండా, ప్రత్యేక క్యూలైన్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేశారని, దొండపూడి చెక్పోస్టు నుంచి ఆలయం వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుంటామని తెలిపారు. రోడ్డు విస్తరణ కారణంగా ఈ పర్యాయం 70 ఆర్టీసీ బస్సులు నేరుగా ఆలయం వరకు వెళ్లేటట్టు ప్రణాళిక రూపొందించామన్నారు. భక్తులు కళ్యాణలోవ రిజర్వాయర్లో పుణ్యస్నానాలు ఆచరించనున్న దృష్ట్యా స్నానాల కోసం 9 ఘాట్లు సిద్ధం చేశామని, ప్రమాదాల నివారణకు 10 మంది గజ ఈతగాళ్లు, 5 బోట్లు, లైఫ్ జాకెట్లు, తాళ్లతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుదన్నారు. జాతర జరిగే ప్రాంగణమంతా సీసీ కెమెరాలు నిఘాలో ఉంటుదని, వీటిని ప్రత్యేక కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి, ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తామన్నారు. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు సహకారంతో 48 ఎకరాల స్థలాన్ని భక్తుల కోసం సిద్ధం చేశారు. 28 ఉచిత భోజనశాలలు, మహిళల కోసం ప్రత్యేక మొబైల్ టాయిలెట్లు, మహిళలు దుస్తులు మార్చుకోవడం కోసం ప్రత్యేక రూమ్లు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ స్వామివారిని శాంతియుతంగా దర్శనం చేసుకోవాలని, ముఖ్యంగా స్నానఘట్టాలు వద్ద మహిళలు, పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దొంగతనాల నివారణకు గట్టి నిఘా పెట్టామన్నారు. భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో 100, లేదా 112 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా ఆయన దేవదాయ, రెవెన్యూ, ఇతర శాఖ అధికారులతో శివరాత్రి ఏర్పాట్లు గురించి సమీక్షించారు. ఎస్పీ వెంట స్పెషల్బ్రాంచి డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎస్. బాలసూర్యారావు, కొత్తకోట సీఐ జి.కోటీశ్వరావు, స్థానిక ఎస్ఐ ఎం.శ్రీనివాస్తో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు ఆయన వెంట ఉన్నారు. -
బంగారుమెట్టలో కొబ్బరి, సరుగుడు తోటలు దగ్ధం
బుచ్చెయ్యపేట : బంగారుమెట్ట,లోపూడి గ్రామాల మధ్య మిరాశలో జరిగిన అగ్ని ప్రమాదంలో మూడు ఎకరాల్లో కొబ్బరి, సరుగుడు తోటలు కాలిపోయాయి. విశాఖకు చెందిన ఉద్యోగి కొబ్బరితోటలో గుర్తు తెలియని వ్యక్తి కాల్చి పారేసిన సిగరెట్టు కారణంగా ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టు స్థానికులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో బంగారుమెట్టకు చెందిన జక్కా చిన్నారావు, వేచలపు చినతల్లికి చెందిన సరుగుడు తోటతో పాటు విశాఖకు చెందిన ఉద్యోగి కొబ్బరితోట కాలిపోయాయి. సుమారు రూ.రెండు లక్షలు వరకు ఆస్తి నష్టం జరిగినట్టు బాధిత రైతులు వాపోతున్నారు. స్ధానికుల ఫిర్యాదు మేరకు రావికమతం అగ్నిమాపక సిబ్బంది గంగరాజు, శివయ్యనాయుడు, రాజు, అర్జున మంటలను అదుపు చేశారు. -
మత్స్యగుండంలో పకడ్బందీగా శివరాత్రి ఉత్సవాలు
● పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు మాట్లాడుతున్న ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు, ఇతర అధికారులు సాక్షి,పాడేరు: పవిత్ర పుణ్యక్షేత్రం హుకుంపేట మండలంలోని మత్స్యగుండంలో మహా శివరాత్రి ఉత్సవాలను ఈఏడాది కూడా అత్యంత ఘనంగా నిర్వహించాలని పాడేరు ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఈనెల 14నుంచి 16వతేదీ వరకు మత్స్యగుండంలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి స్థానిక సబ్కలెక్టర్ కార్యాలయంలో అఽధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నిశాఖల అధికారుల సమన్వయంతో మూడు రోజుల జాతరను విజయవంతం చేయాలన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుశాఖ పటిష్టమైన బందోబస్తు చేపట్టాలని ఆదేశించారు. భక్తులకు సురక్షిత తాగునీరు,విద్యుత్ సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, పారిశుధ్య కార్యక్రమాలను చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో మఠం సర్పంచ్ మఠం శాంతకుమారి, పాడేరు డీఎస్పీ అభిషేక్, డీఎల్పీవో కుమార్, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. -
మత విద్వేషాలు రగిల్చే రాజకీయాలు మానుకోవాలి
దేవరాపల్లి: ప్రజా సమస్యలను పక్క దారి పట్టించేందుకే చంద్రబాబు ప్రభుత్వం లడ్డూ వివాదాన్ని ముందుకు తెచ్చిందని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. వెంకన్న విమర్శించారు. దేవరాపల్లిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై సుప్రీం కోర్టు తీర్పుకు కట్టుబడి ఉండాలని, ప్రజల మధ్య మత విద్వేషాలు పెంచే రాజకీయాలు మానుకోవాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం భక్తుల మనోభావాలతో చెలగాటమాడొద్దన్నారు. రాష్ట్రంలో ప్రజలు అనేక సమస్యలపై సతమతమవుతుంటే అవేవీ పట్టించుకోకుండా, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు లడ్డూ వివాదాన్ని వాడుకోవడం దారుణమన్నారు. లడ్డూలో జరిగిన కల్తీపై సిట్ నివేదికను అధికారికంగా వెల్లడించకుండానే టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు తమకు తోచిన విధంగా దుష్ప్రచారం చేస్తూ వాస్తవాలను సమాధి చేస్తున్నారని మండిపడ్డారు. లడ్డూ వివాదంపై కూటమి నాయకులు తలో విధంగా మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని చెప్పారు. సుప్రీం కోర్టు ఆదేశంతో కేంద్రం నియమించిన సిట్ టీటీడీకి చెందిన ముగ్గురు అధికారులపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తే కూటమి ప్రభుత్వం బదిలీ చేసి చేతులు దులుపుకోవడం వెనుక అంతర్యమేమిటని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డారని సిట్ నివేదిక చెప్పినా అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ నివేదికను బహిర్గతం చేయకుండానే రాష్ట్ర ప్రభుత్వం మరో విచారణ కమిటీ వేయడం చూస్తే రాజకీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకన్న -
ఎల్కేజీ విద్యార్థులకు మోకాళ్ల శిక్ష!
● డీఈవోకు ఎస్ఎఫ్ఐ నేతల ఫిర్యాదు ● విచారణకు ఆదేశం యలమంచిలి రూరల్ : మండలంలోని ఏటికొప్పాకలో ఓ ప్రైవేటు స్కూల్ ఆవరణలో బుధవారం ఎల్కేజీ విద్యార్థులను ఎండలో మోకాళ్లపై నిలబెట్టి శిక్షించిన ఘటనపై భారత విద్యార్థి ఫెడరేషన్(ఎస్ఎఫ్ఐ) జిల్లా నేతలు జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడుకు ఫిర్యాదు చేశారు. ఈ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా చిన్న పిల్లలకు కఠినమైన శిక్షలు విధిస్తూ, హింసిస్తున్నారని తెలియజేసేలా కొన్ని ఫోటోలను డీఈవోకు పంపించినట్టు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మైలపల్లి బాలాజీ తెలిపారు. విద్యార్థులను నిర్ధాక్షిణ్యంగా శిక్షించడంతో పాటు నిబంధనలు పాటించడం లేదన్నారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా యలమంచిలి ఎంఈవో సూర్యప్రకాష్ను డీఈవో ఆదేశించారు. జిల్లాలో పలు ప్రైవేటు స్కూళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని, యాజమాన్యాలన్నీ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. ఏటికొప్పాకలో చిన్నపిల్లలను శిక్షించిన యాజమాన్యంపై చర్యలు తీసుకోకపోతే ఉద్యమిస్తామని బాలాజీ స్పష్టం చేశారు. ఈ ఘటనపై గురువారం విచారణ జరపనున్నట్టు ఎంఈవో సూర్యప్రకాష్ తెలిపారు. -
మా దారి... అడ్డదారి!
పట్టుకున్నారు..వదిలేశారు? ఈ విషయమై రెండు లారీల డైవర్లను ప్రశ్నించగా పోలీసులు రాత్రి పట్టుకున్నారని, ఉదయం వదిలేశారని తెలిపారు. పెనాల్టీ ఎంత విధించారని అడగ్గా, లారీ ఓనర్ పోలీసులతో మాట్లాడుకున్నారని, డబ్బులు ఏమీ కట్టలేదని చెప్పడం గమనార్హం. జాతీయ రహదారి మీదుగా వెళ్లకుండా అడ్డదారిలో ఎందుకు తీసుకెళ్తున్నారని ఆరా తీయగా...ఓవర్ లోడ్ అని, టోల్ గేట్ మీదుగా వెళ్తే రూ.4వేలు పెనాల్టీ కట్టాలని అందుకు ఇలా దొడ్డిదారిన వెళ్తున్నామని చెప్పడం విశేషం.నక్కపల్లి : కంచే చేను మేస్తే కాపాడేదెవరు అన్నట్లు ఉంది కొన్ని ప్రభుత్వ శాఖల అధికారులు వ్యవహారశైలి. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండికొట్టడంతోపాటు, నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలకు అక్రమ రవాణాకు అండగా నిలుస్తున్నారు. రక్షకులే భక్షకులుగా మారి అడ్డగోలు వ్యాపారాలకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి సామర్ధ్యంతో దొడ్డిదారిన రాకపోకలు సాగించే భారీ వాహనాలను చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు. అధికారుల వ్యవహార శైలి కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి భారీగా గండి పడడంతోపాటు, పట్టుమని పదికాలాల పాటు ఉండాల్సిన రోడ్లు మూన్నాళ్లకే శిథిలమవుతున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పక్కన నివసించేవారు. బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని రాత్రిపూట కంటిమీద కునుకు లేకుండా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. గత కొన్నినెలలుగా సాక్షాత్తూ హోంమంత్రి ఇలాకా లో జరుగుతున్న ఈ బాగోతం అరికట్టేందుకు ఉన్నతాధికారులెవరూ దృష్టి సారించకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిబంధనలు...షరా‘మామూలే’... కాకినాడ జిల్లా రౌతులపూడి నుంచి అనకాపల్లి జిల్లా రాంబిల్లి ఎన్ఈవోబీకి బండరాళ్లు భారీ టిప్పర్లతో రవాణా చేస్తున్నారు. నిబంధన ప్రకారం ఒక్కో టిప్పర్లో 40 టన్నులకు మించి లోడ్ చేయడానికి వీల్లేదు. కానీ ఈ టిప్పర్లలో 70 నుంచి 80 టన్నులు మించి లోడింగ్ చేసి రాకపోకలు సాగిస్తున్నారు. వాహనాల ముందు ఒక వ్యక్తి పైలట్గా వ్యవహరిస్తూ అడ్డగించిన వారికి మామూళ్లు ఇస్తూ నక్కపల్లి నుంచి తుని దాటేవరకు సహకరిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వ శాఖల సిబ్బందితో పాటు, ఒక ఎలక్ట్రానిక్ మీడియాపేరు చెప్పుకుంటున్న ఒక వ్యక్తి కూడా లారీల రాకపోకలకు సహకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వాహనం ముందు పైలట్గా వెళ్లి ఒక్కో లారీకి వెయ్యిరూపాయలు వసూలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. టోల్ఫీజు ఎగ్గొట్టేందుకు... తుని దాటిన తర్వాత వేంపాడు సమీపంలో ఉన్న టోల్ప్లాజా మీదుగా రాకపోకలు సాగిస్తే అక్కడ సామర్ధ్యాన్ని తనిఖీ చేసి 40 టన్నులకు మించితే రూ.4వేలు అదనంగా పెనాల్టీ విధిస్తున్నారు. అలాగే మైనింగ్, పోలీసు అధికారులు కూడా ఈ వాహనాలను తనిఖీ చేసి రూ.7వేల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంది. కానీ టోల్ఫీజు ఎగ్టొట్టేందుకు లారీ యజమానులు వేంపాడు నుంచి అమలాపురం, కాగిత మీదుగా నిర్మాణంలో ఉన్న స్టీల్ప్లాంట్ రోడ్డుకు చేరుకుని అక్కడనుంచి రాంబిల్లి వెళ్తున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో ఇవే లారీలు పరవాడ వద్ద ఉన్న హిందూజా పవర్ప్లాంట్ నుంచి ఫ్లైయాష్ను లోడింగ్ చేసుకుని సామర్లకోటకు రవాణా చేస్తున్నారు. తిరుగు ప్రయాణంలో కూడా వీరు టోల్ఫీజు ఎగ్గొట్టేందుకు కాగిత అమలాపురం, వేంపాడు మీదుగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ వాహనాలు రెండు వైపులా రాకపోకల సందర్భంగా 8 వేల రూపాయలు టోల్గేట్ వద్ద పెనాల్టీ ఎగ్గొట్టేస్తున్నారు. అలాగే ఈ వాహనాలను తనిఖీ చేస్తే ఒక్కో వాహనం నుంచి మరో 15 వేల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుంది. ఇలా ప్రతిరోజు సుమారు 50 నుంచి 80 లారీలు రౌతులపూడి రాంబిల్లి, సామర్లకోట వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. కళ్ల ముందే నిబంధనలకు విరుద్ధంగా రాకపోకలు సాగిస్తున్న వాహనాలపై పోలీసు, మైనింగ్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా మంగళవారం రాత్రి రెండు లారీలను పెట్రోలింగ్ చేసే సిబ్బంది పట్టుకున్నారు. వీటిని నక్కపల్లి తరలించారు. ఉదయం వరకు వీటిని నక్కపల్లి బస్టాండ్లో ఉంచి మధ్యాహ్నం విడిచిపెట్టారు. ఈ వాహనాలు యథావిధిగా టోల్ఫీజు ఎగ్టొట్టేందుకు కాగిత సమీపంలో నిర్మాణంలో ఉన్న స్టీల్ప్లాంట్ రోడ్డుమీదుగా రాకపోకలు సాగించాయి. రోడ్లు శిథిలం.. వేంపాడు, అమలాపురం మీదుగా ఈ భారీ వాహనాలు రాకపోకలు సాగించడం వల్ల ఆయా గ్రామాల్లో రాకపోకల కోసం నిర్మించిన రోడ్లు శిథిలమవుతున్నాయి. దీనికితోడు ఎప్పుడు ఏప్రమాదం ముంచుకొస్తుందో, లారీ అదుపు తప్పి బోల్తాపడితే ఏం జరుగుతుందోనని రోడ్డుపక్కన నివసించే వారు కంటిమీద కునుకు లేకుండా ఉంటున్నారు. ఈ వ్యవహారంపై నక్కపల్లి సీఐ జె.మురళి వద్ద ప్రస్తావించగా నైట్ డ్యూటీ చేసే సిబ్బంది ఈ వాహనాలను పట్టుకున్నట్టు తెలిపారు. రికార్డులు పరిశీలించి సక్రమంగా ఉన్నందున విడుదల చేయడం జరిగిందన్నారు. నిర్మాణంలో ఉన్న స్టీల్ప్లాంట్ రోడ్డులో రాకపోకలు కాగా స్టీల్ప్లాంట్, బల్క్ డ్రగ్పార్క్ కోసం కాగిత నుంచి చందనాడ వరకు రూ.24 కోట్లతో ఆర్అండ్బీ వారు 80 అడుగుల వెడల్పుతో తారు రోడ్డు నిర్మిస్తున్నారు. రైతుల నుంచి 60 ఎకరాలను సేకరించి నిర్మాణపు పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఎర్త్ వర్క్ జరుగుతోంది. గ్రావెల్ వేసి రోడ్డు చదును చేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న ఈ రోడ్డులో నుంచి ఈ భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇలా చేయడం చట్టవిరుద్ధం అయినప్పటికీ రోడ్డుపనులు చేస్తున్న కాంట్రాక్టరు గాని, పర్యవేక్షిస్తున్న ఆర్అండ్బీ అధికారులు గాని పట్టించుకోవడం లేదు. వాహనదారుల నుంచి ప్రతిరోజు మామూళ్లు అందడం వల్లే ఈ వాహనాలను పట్టుకుని కేసులు నమోదు చేయడం లేదని ఆయా గ్రామాల వారు ఆరోపిస్తున్నారు. ఓవర్ లోడ్ లారీలకు అధికారుల అండదండలు అక్రమ మార్గాలకు లైన్క్లియర్ ప్రభుత్వాదాయానికి గండి పట్టుకున్నా కేసుల్లేకుండా వదిలేస్తున్న వైనం టోల్ఫీజు ఎగ్గొట్టేందుకు దొడ్డిదారిన రాకపోకలు నిర్మాణంలో ఉన్న స్టీల్ప్లాంట్ రోడ్డులో ప్రయాణం -
భగవంతుడిని అడ్డుపెట్టుకుని నీచ రాజకీయం
నర్సీపట్నం: చంద్రబాబు ప్రభుత్వం భగవంతుని ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకోవడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ మండిపడ్డారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అసత్యాన్ని పదేపదే చెప్పి ప్రజలను నమ్మించడంలో సీఎం చంద్రబాబు దిట్ట అని అన్నారు. తిరుమల లడ్డూ విషయమై కూటమి నేతలు చేసిన ఆరోపణలన్నీ అసత్యమని సిట్, సీబీఐతో కూడిన దర్యాప్తులో తేటతెల్లమైందన్నారు. వేంకటేశ్వరస్వామి ప్రసాదంలో కల్తీ జరిగిందని చంద్రబాబు విషప్రచారం చేసి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారన్నారు. లడ్డూలో కల్తీ జరగలేదని నిగ్గుతేల్చిన తర్వాత కూడా కెమికల్స్ కలిశాయని మరో తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్న కూటమి నేతలు తిరుమల వేంకటేశ్వరస్వామి ఆగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరించారు. శ్రీశైలంలో దర్శనం కోసం వచ్చిన శివభక్తులపై లాఠీ చార్జీ చేయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లోపించాయని ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేకే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. రాజకీయాల కోసం దేవుళ్లను వాడుకుంటే దేవుడు కచ్చితంగా శిక్షిస్తారన్నారు. నీచ ప్రచారాలు, అబద్ధాలను కట్టిపెట్టి భక్తుల మనోభావాలను టీడీపీ నాయకులు గౌరవించాలన్నారు. -
పంచదార్ల దళిత రైతుల నిరసన ఉధృతం
రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలంలోని పంచదార్లలో దళితులు కొద్ది రోజులుగా చేపడుతున్న నిరసనను మరింత ఉధృతం చేశారు. యాభై ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 17 మంది దళితులకు ఇచ్చిన డీ పట్టా భూముల్ని ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కోసం ఎటువంటి పరిహారం ఇవ్వకుండా తీసుకునేందుకు ప్రయత్నించడాన్ని నిరసిస్తూ దళిత కుటుంబాలు నిరసన తెలుపుతూ దీక్షలకు దిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం దళితులు వంటా వార్పు నిర్వహించారు. అదే సమయంలో సర్వే నంబర్ 3లో పొక్లెయిన్తో మట్టిని పెకిలిస్తూ సర్వే నంబర్ 2లోకి నెట్టివేయడాన్ని చూసిన నిరసనకారులు అభ్యంతరం చెప్పారు. తమ భూములకు పరిహారం లేదా ఆమోదయోగ్యమైన ప్యాకేజీ ఇవ్వాలని తెలిపారు. ఆయా భూముల్లో దళితులు ప్రస్తుతం సాగులో లేరని, ఆ ప్రాంతంలో అక్ర మ మైనింగ్ చేపట్టారంటూ అధికారుల ద్వారా నోటీసులు ఇవ్వడంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. డీ పట్టా భూములిచ్చి ఐదు దశాబ్దాలు కావడంతో లబ్ధిదారుల వారసులు సైతం ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నారని దళిత రైతులు చెబుతున్నారు. స్థానిక టీడీపీ నేత చెప్పినట్టే అధికారులు వ్యవహరించడం సమంజసం కాదని వాపోతున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే 42 ఎకరాల దళితుల డీ పట్టా భూముల వ్యవహారం రోజుకి రోజుకి దుమారాన్ని రేపుతోంది. -
దురుద్దేశంతోనే లడ్డూపై దుష్ప్రచారం
దేవరాపల్లి: సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులు చేపట్టడంలో ఘోరంగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం వాటి నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తీసుకువచ్చిందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు బూడి ముత్యాలనాయుడు విమర్శించారు. దేవరాపల్లి మండలం తారువలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వార్థ రాజకీయాల కోసం శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను తగ్గించేలా వ్యవహరించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యిలో జంతు కొవ్వు కలవ లేదని సిట్ నివేదిక స్పష్టం చేసినప్పటికీ పదే పదే విష ప్రచారం చేయడంపై ఆయన మండిపడ్డారు. మొన్నటి వరకు జంతు కొవ్వు కలిసిందని, ఇప్పుడేమో ఏకంగా బాత్రూమ్లు కడిగే హార్పిక్స్ తయారీకి వినియోగించే కెమికల్స్ కలిపారని దు ష్ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గమన్నా రు. మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై బురదజల్లాలన్న దుర్బుద్ధితోనే నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ అసత్య ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో చెలగాటం ఆడటం సరికాదని హితవు పలికారు. వీరిద్దరితో పాటు కూటమి నేతలంతా శ్రీవారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా దేవుడితో రాజకీయాలు చేయడం మానుకుని పరిపాలనపై దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడి చేసే విష సంస్కృతిని విడనాడాలని హితవు పలికారు. -
స్వచ్ఛ సర్వేక్షణ్లో టాప్–3 లక్ష్యం
డాబాగార్డెన్స్(విశాఖ): నగరంలో మురికివాడల అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. నగర ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, రోడ్ల విస్తరణ, జంక్షన్ల సుందరీకరణ, తాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. బుధవారం తన చాంబర్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన నగర అభివృద్ధి ప్రణాళికలను వివరించారు. పైలట్ ప్రాజెక్టుగా వెలంపేట, ఇందిరానగర్ నగరంలోని మురికివాడల అభివృద్ధిలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద పాతనగరంలోని వెలంపేట, శ్రీకన్య థియేటర్ సమీపంలోని ఇందిరానగర్ను ఎంపిక చేసినట్లు కమిషనర్ తెలిపారు. వెలంపేటలో 59 సెంట్ల స్థలంలో పీపీపీ పద్ధతిలో రూ.23.17 కోట్లతో జీ+11 అంతస్తుల సముదాయాన్ని నిర్మించి, 177 మంది లబ్ధిదారులకు అందజేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో కేంద్రం వాటా రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.లక్ష ఉంటుందని, జీవీఎంసీ తరఫున రూ.8.85 కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ఇందిరానగర్లో జీ+6 పద్ధతిలో 110 మందికి గృహాలు నిర్మిస్తామన్నారు. మహిళా హాస్టళ్ల నిర్మాణం ఉద్యోగినుల కోసం(వర్కింగ్ వుమెన్స్) మధురవాడ జోన్–5లోని బుట్టవానిపాలెం లేవుట్లో రూ.26.12 కోట్లతో చేపట్టనున్న హాస్టల్ పనులకు ఇటీవలే భూమిపూజ చేశామన్నారు. అలాగే గాజువాక, ముడసర్లోవలో హాస్టళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు వెల్లడించారు. ఇవి జీ+4 అంతస్తులతో, 96 గదులు, 248 మంది నివసించే సామర్థ్యంతో ఆధునిక వసతులతో అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఐఎఫ్ఆర్ పనులు, ట్రాఫిక్ నియంత్రణ నగరంలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) దృష్ట్యా రూ.18.5 కోట్లతో 119 అభివృద్ధి పనులు చేపట్టామని, ఇందులో 90 శాతం శాశ్వత పనులేనని స్పష్టం చేశారు. బీచ్రోడ్లోని సెంట్రల్ మీడియన్, పారిశుధ్యం, నగర సుందరీకరణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. భోగాపురం ఎయిర్పోర్టు కనెక్టివిటీ కోసం రూ.14.29 కోట్లతో వేపగుంట–పినగాడి, రూ.11.5 కోట్లతో వేపగుంట–జుత్తాడ రోడ్ల పనులు ప్రారంభించామన్నారు. ఆదాయం, జోన్ల పునర్విభజన జీవీఎంసీ పరిపాలన సౌలభ్యం కోసం జోన్లను 8 నుంచి 10కి పెంచినట్లు తెలిపారు. పన్నుల వసూలులో ఈ ఏడాది రూ.1,200 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని, ఫిబ్రవరి, మార్చిలో దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. నగరంలోని 21 ప్రాంతాల్లో వెండర్స్ జోన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, ప్రస్తుతం 3 ప్రాంతాలను తుది ఎంపిక చేశామన్నారు. వీటిని జీవీఎంసీ, మెప్మా, లబ్ధిదారులతో కలిసి ఏర్పాటు చేస్తామన్నారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఆపరేషన్ 3.0 కింద సెల్లార్ ఆక్రమణలు తొలగిస్తున్నామని, ఆర్కే బీచ్, భీమిలి వై జంక్షన్, పోతినమల్లయ్యపాలెం వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వివరించారు. తొలి మూడు ర్యాంకుల్లో.. గతేడాది స్వచ్ఛ సర్వేక్షణ్లో విశాఖ 9వ ర్యాంకు సాధించిందని, ఈసారి మొదటి మూడు ర్యాంకుల్లో నిలిచేలా కృషి చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. పారిశుధ్యం, వ్యర్థాల సేకరణ, తరలింపు ప్రక్రియలను నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. త్వరలో కేంద్ర బృందం పర్యటించనున్న నేపథ్యంలో అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశామన్నారు. పర్యాటకుల సౌకర్యార్థం ఆర్కే బీచ్ నుంచి రుషికొండ వరకు 6 ప్రాంతాల్లో కొత్తగా సులభ్ కాంప్లెక్స్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. -
సి,డి గ్రేడుల విద్యార్థులపైప్రత్యేక శ్రద్ధ అవసరం
యలమంచిలి రూరల్ : మార్చిలో జరగనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక పునశ్చరణ తరగతులను జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు బుధవారం తనిఖీ చేశారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధి సోమలింగపాలెం, పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రైల్వేస్టేషన్ రోడ్డు ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి ప్రత్యేక తరగతుల నిర్వహణ తీరు,విద్యార్థుల పురోగతిపై ఆరా తీశారు. విద్యార్థులకు రోజువారీగా నిర్వహిస్తున్న పరీక్షలు, వారు సాధించిన మార్కులను పరిశీలించారు. సి,డి గ్రేడుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. సి,డి గ్రేడుల విద్యార్థుల కోసం రూపొందించిన 30 రోజుల ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో జీఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం అమలవుతున్న తీరును తనిఖీ చేశారు. అభ్యసనా సామర్థ్యాల్లో వెనుకబడిన విద్యార్థుల్లో నైపుణ్యం పెంపొందించాలని సూచించారు. ఆయన వెంట యలమంచిలి ఉపవిద్యాశాఖాధికారి పి.అప్పారావు, ఎంఈవో సుసర్ల సూర్య ప్రకాష్, వెంకటేశ్వర్రావు, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్టు
అనకాపల్లి: మండలంలోని శంకరం వద్ద గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు రూరల్ ఎస్ఐ జి. రవికుమార్ మంగళవారం తెలిపారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అరెస్టు అయిన వారిలో ఉగ్గిన శేష మణికంట(29), జగ్గుపల్లి జగదీష్ (28), రాజపూడి ఆదిత్యసాయి వెంకటేష్ (29) ఉన్నారన్నారు. వీరు శంకరం గ్రామ పరిధిలోని ఎఫ్సీ గోదాముల వెనుక కొండ ప్రాంతంలో సోమవారం గంజాయి సేవిస్తుండగా ముందుగా అందిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్టు చెప్పారు. వారిని విచారించగా విజయరామరాజుపేటకు చెందిన యర్రంశెట్టి దుర్గాప్రసాద్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు చెప్పారన్నారు. దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నట్టు చెప్పారు. అరెస్టు అయిన నిందితుల్లో శేష మణికంఠపై గతంలో క్రిమినల్ కేసులున్నాయన్నారు. అతని నుంచి 20 గ్రాములు,మిగిలిన ఇద్దరి నుంచి 15 గ్రాముల చొప్పున గంజాయి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
మెడికల్, ఫార్మా మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి
అనకాపల్లి: రాష్ట్రంలో మెడికల్ అండ్ ఫార్మా మాఫియా ఆగడాలను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, దీనికి నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14న జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆపార్టీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మెడికల్, ఫార్మా మాఫియా వ్యతిరేక పోస్టర్ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగులకు నాసిరకం మందులు పంపిణీ చేయడంతో పాటు వాటిని అధిక ధరలకు అమ్మకాలు చేసి, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని తెలిపారు. మాఫియాకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. అద్దె సర్టిఫికెట్లతో ఫార్మేషన్ లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపుల పై తనిఖీలు నిర్వహించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్, ఉన్నత అఽధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్, ఫార్మా మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వియ్యపురాజు, పరవాడ మండల కన్వీనర్ కె.త్రినాఽథ్, నాయకులు విత్తనాల పోతురాజు, మూతుర్తి సూరిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘డెయిరీ కంటైనర్ తొలగింపు అన్యాయం’
గొలుగొండ: ఏటిగైరంపేటలో విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్న కంటైనర్ను అన్యాయంగా తొలగించడంపై రైతులు ఆవేదన చెందారు. గత ఏడాది అక్టోబర్లో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీసీ) గ్రామంలో పాల సంఘం ఆధ్వర్యంలో కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తుల అమ్మకం కోసం చర్యలు తీసుకుంది. గ్రామానికి చెందిన పాము లోకేష్కు వీటి బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తులు అమ్మకాలు ఇష్టం లేని కొంతమంది అధికార పార్టీని అడ్డం పెట్టుకుని దానిని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు యత్నించారు. విశాఖ డెయిరీ సంఘంలో పాలు పోస్తున్న రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు కంటైనర్ ఏర్పాటు చేసి పాలు, పాల ఉత్పత్తులు అమ్మకాలు ప్రారంభించారు. ఈ పాల ఉత్పత్తులు అమ్మకాలు చేసే కంటైనర్ ఆర్అండ్బీ స్థలంలో ఉందనే కారణంగా మంగళవారం రైతులకు తెలియకుండా దానిని తొలగించారు. ఏటిగైరంపేట పరిధిలో చాలా వరకు ఆర్అండ్బీ స్థలంలోనే షాపులు ఉండగా రైతుల ద్వారా నడిచే ఈ కంటైనర్ తొలగించడం చాలా దారుణంగా ఆవేదన చెందుతున్నారు. వీటిపై మళ్లీ కోర్టుకు ఆశ్రయిస్తామని విశాఖ డెయిరీ సంఘ కార్యదర్శి పాము అప్పలనాయుడు, రైతులు తెలిపారు. -
పక్కా ప్రణాళికతో పరీక్షలకు సన్నద్ధం
కోటవురట్ల: జీవితం మలుపుకు మొదటి అడుగు ఇంటర్లోనే..పదిని పదిలంగా దాటేసినా ఇంటర్లో తప్పటడుగులు పడితే కుప్పకూలిపోవడం ఖాయం..ఇక్కడే కాసింత పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి బీజం పడుతుంది. డాక్టరు కావాలన్నా, ఇంజినీరు అవ్వాలన్నా, సైంటిస్టుగా ఎదగాలన్నా ఇంటర్లో శ్రమించాల్సిందే. లక్ష్యంతో గురువుల తర్ఫీదుతో ముందుకెళితే గురి తప్పకుండా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పట్టుదలకు తల్లిదండ్రుల సహకారం, లెక్చరర్ల ప్రోత్సాహం తోడైతే లక్ష్యాలను ఇట్టే చేరుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ఇందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన ఫలితాల కోసం సంకల్పం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వెనుకబడిన విద్యార్ధులపై దృష్టి సారించి వారి అనుమానాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. వంద రోజుల ప్రణాళిక ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుండగా కళాశాలల్లోనే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యార్థులను ప్రశాంత వాతావరణంలో చదివిస్తున్నారు. ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు లెక్చరర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా ప్రస్తుతం ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రణాళిక ఇలా.. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే పాఠ్యాంశాలపై పూర్తి పట్టు సాధించడంతో పాటు నిరంతర సాధన అవసరమని నిపుణులైన అధ్యాపకులు చెబుతున్నారు. సిలబస్ను ఎప్పటికపుడు అర్థం చేసుకోవడం, చదవాల్సిన అన్ని భావనల జాబితాను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. పురోగతిని తెలసుకునేందుకు ప్రతీ రోజు పరిశీలన, వారానికి లక్ష్యాన్ని నిర్ధేశించుకోవాలంటున్నారు. ప్రశ్నల నమూనాలు, క్లిష్ట సమస్యలను చేధించేందుకు గత పరీక్ష పత్రాలను అధ్యయనం చేయాలి. ఇక చేతిరాతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. దస్తూరీ ఎంత బాగుంటే అంత మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. ఎంతమంది హాజరవుతున్నారంటే.. అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 20, ప్రైవేటు కళాళాలలు 77 ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 3,540 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 2,931 మంది, ప్రైవేటు కళాశాల నుంచి మొదటి సంవత్సరం 8,131 మంది, రెండో సంవత్సరం 7,873 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్ష కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో అనకాపల్లి జిల్లాకు 63 శాతం, ద్వితీయ సంవత్సరం జిల్లాకు 73 శాతం ఉత్తీర్ణత వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలలో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా 20వ స్థానంలో ఉండగా ద్వితీయ సంవత్సరం 25వ స్థానాన్ని పొందింది. ఈ ఏడాది ఈ స్థానాలను దాటుకుని మంచి స్థానాలకోసం అధికారులు, అధ్యాపకులు సంకల్పంతో కృషి చేస్తున్నారు. -
మెడకు చుట్టుకున్న మాంజా దారం
యలమంచిలి రూరల్: ఆటలాడుకుంటున్న రెండో తరగతి విద్యార్థి మెడకు మాంజా దారం చుట్టుకున్న ఘటనలో అదృష్టవశాత్తూ పెను ముప్పు తప్పింది. రెండు రౌండ్లు చుట్టుకున్న తర్వాత ఉక్కిరిబిక్కిరైన విద్యార్థి దారంతో పెనుగులాడడంతో తెగిపోయింది. రక్తస్రావంతో బాధపడుతున్న బాధిత విద్యార్థికి ప్రథమ చికిత్స అందించడం, తల్లిదండ్రులకు సమాచారం తెలియజేయడంలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం చూపడంతో విద్యార్థి తల్లిదండ్రులు,గ్రామస్తులు పాఠశాల ఎదుట ఆందోళన చేశారు. పాఠశాల ప్రిన్సిపాల్, ఇతర బాధ్యులను నిలదీశారు. యలమంచిలి భాష్యం స్కూల్లో సోమవారం సాయంత్రం జరిగిన ఘటనను యాజమాన్యం గోప్యంగా ఉంచింది. బాధిత విద్యార్థి తల్లిదండ్రులు యలమంచిలి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.వివరాలివి.. కోర్టుపేట వీధిలో భాష్యం స్కూల్లో రెండో తరగతి చదువుతున్న 30 మంది విద్యార్థులను ఓ టీచర్ ఆటలాడించడానికి తీసుకెళ్లారు. వ్యాయామ ఉపాధ్యాయుడు లేకుండా,హెచ్ఎంకు సమాచారం ఇవ్వకుండా విద్యార్థులను ఆటలాడించడానికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.ఆటలాడుతుండగా జారుడుబల్లపైకి ఎక్కిన నలుగురు విద్యార్థుల్లో పెదపల్లికి చెందిన బొద్దపు సాయి దీక్షిత్ మెడకు సమీపంలో చెట్టుకు వేలాడుతున్న పదునైన దారం చుట్టుకుంది. దీంతో మెడ భాగంలో రెండు లేయర్లు తెగిపోయాయి.మూడో రౌండు తిరిగే సమయంలో విద్యార్థి దారాన్ని తెంపుకొన్నాడు.శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థికి వెంటనే చికిత్స చేయించకుండా అలాగే వదిలేశారు.విద్యార్థి తండ్రి అశోక్ ఫోన్ నంబరుకు కాల్ చేసిన టీచర్ అసలు విషయాన్ని చెప్పకుండా మీ అబ్బాయికి చిన్న గాయమైంది స్కూలుకు రావాలంటూ తెలపడంతో అనుమానం వచ్చిన తండ్రి హుటాహుటిన స్కూలు వద్దకు చేరుకున్నారు.మెడకు గాయమైనా తన కొడుక్కి చికిత్స చేయించకుండా తాత్సారం చేయడంతో యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అనంతరం గాయపడిన విద్యార్థిని పట్టణంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి,అక్కడ్నుంచి యలమంచిలి సీహెచ్సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు.ఎంఎల్సీ కావడంతో పట్టణ ఎస్ఐ సావిత్రి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి తండ్రి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు.మంగళవారం ఉదయం విద్యార్థిని అనకాపల్లి తీసుకెళ్లి మెరుగైన చికిత్స చేయించారు.ప్రాణాపాయం తప్పిందని వైద్యులు నిర్థారించడంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.మంగళవారం రాత్రి స్కూల్ నిర్వాహకులు,గాయపడిన విద్యార్థి తల్లిదండ్రులు,పెదపల్లి గ్రామపెద్దలతో యలమంచిలి సీఐ ధనుంజయరావు సమక్షంలో చర్చలు జరిగాయి. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటామని స్కూలు నిర్వాహకులు తల్లిదండ్రులను ప్రాధేయపడ్డారు.దీనిపై ఇరువర్గాలు రాజీకి వచ్చినట్టు తెలిసింది.కాగా భాష్యం స్కూలు బిల్డింగుతో పాటు సమీపంలో ఉన్న బహుళ అంతస్థుల భవానాలకు పెద్దపెద్ద తేనెపట్లు ఉన్నాయి.వాటివల్ల మా పిల్లలకు ప్రమాదం ఉంటుందని,వాటిని తొలగించాలని కోరినా స్కూలు నిర్వాహకులు పట్టించుకోవడం లేదని,బస్సులో సీటింగ్ కెపాసిటీకి మించి పెద్ద సంఖ్యలో విద్యార్థులను కుక్కుతున్నారని..ఇలా పలువురు తల్లిదండ్రులు స్కూలు నిర్వాహకులపై ఆరోపణలు చేస్తున్నారు. -
డీసీసీబీలో చోరీకి యత్నించిన వ్యక్తి అరెస్టు
అనంతగిరి మండలం వెలగలపాడు వాసిగా గుర్తింపు దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డీసీసీబీ)లో ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి చోరీకి యత్నించిన కేసులో నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు కె.కోటపాడు ఇన్చార్జి సీఐ పి.అప్పలరాజు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో సీసీఎస్ సీఐ కె.అప్పలనాయుడు, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణతో కలిసి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైవాడ జలాశయం అతిథి గృహం సమీపంలోని బ్యాంకు వెనుక భాగంలో ప్రహరీ దాటి లోపలికి ప్రవేశించాడన్నారు. మేనేజర్ గది కిటికీ ఐరన్ గ్రిల్ను తన వద్ద ఉన్న ఇనుప రాడ్తో తొలగించి బ్యాంకులోకి చొరబడినట్టు చెప్పారు. సీసీ కెమెరాలో తన ముఖం రికార్డు అవుతుందని గమనించి తలపై స్వెటర్ కప్పుకుని లైట్లు ఆఫ్ చేసి చోరీకి యత్నించినట్లు తమ విచారణలో తేలిందన్నారు. క్యాష్ కౌంటర్లలో నగదు దొరకకపోవడంతో లాకర్ను తెరవడానికి యత్నించి విఫలమై అదే మార్గంలో పరారైనట్లు తెలిపారు. బ్యాంక్ మేనేజర్ పూర్ణచంద్రరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అనకాపల్లి డీఎస్పీ ఆదేశాలతో నాలుగు ప్రత్యేక బృందాలతో గాలించినట్టు చెప్పారు. సీసీ ఫుటేజీలో ఫొటో ఆధారంగా నిందితుడు అనంతగిరి మండలం పినకోట పంచాయతీ శివారు వెలగలపాడుకు చెందిన వ్యక్తిగా నిర్ధారించుకున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దేవరాపల్లి శారదానది వంతెన వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తుండగా వచ్చిన యువకుడు పంది ప్రభాస్ను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు. ఈ కేసును కొద్ది రోజుల్లోనే ఛేదించిన సంబంధిత సీఐలు, ఎస్ఐలు, సిబ్బందిని అనకాపల్లి డీఎస్పీ ఎం. శ్రావణి అభినందించారు. మండలంలోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కాగా నిందితుడి ప్రభాస్ను చోడవరం కోర్టుకు తరలించినున్నట్లు పోలీసులు తెలిపారు. -
ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు..
లెక్చరర్లు మాపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రతీరోజూ అదనంగా గంటపాటు చదివిస్తున్నారు. సబ్జెక్టులలో అనుమానాలను తీరుస్తున్నారు. మంచి మార్కులు తెచ్చుకునేందుకు కృషి చేస్తున్నాం. –చరణ్, బైపీసీ ద్వితీయ సంవత్సరం, కోటవురట్ల ప్రోత్సాహం బాగుంది.. అధ్యాపకుల ప్రోత్సాహం బాగుంది. మా కళాశాలలో మంచి వాతావరణం ఉంది. స్టడీ అవర్స్ చెట్ల నీడలో నిర్వహిస్తున్నారు. ప్రశాంత వాతావరణంలో అధ్యాపకుల పర్యవేక్షణలో పట్టుదలగా చదువుతున్నాం. – మేఘన, సీఈసీ ద్వితీయ సంవత్సరం, కోటవురట్ల -
చంద్రబాబు,పవన్ కల్యాణ్ శ్రీవారికి క్షమాపణ చెప్పాలి
యలమంచిలి రూరల్: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో ఎలాంటి కల్తీ జరగలేదని అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ ఫైనల్ చార్జ్ షీట్లో నిగ్గుతేల్చిందని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గసమన్వయకర్త కర ణం ధర్మశ్రీ తెలిపారు. శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారంపై చంద్రబాబు ప్రభుత్వం కుట్రకు పాల్పడిందని తెలుపుతూ ఆయన మంగళవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రాజకీయ లబ్ధికోసం తిరుమల లడ్డూ పవిత్రతను దెబ్బతీసేలా పదేపదే ప్రకటనలు చేయడం దురదృష్టకరమన్నారు.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీవారికి క్షమాపణలు చెప్పాలని ఆయనడిమాండ్ చేశా రు.లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని,చేప నూనె కలి పారని ఆరోపణలు చేసి పాపానికి ఒడిగట్టారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో కిలోనెయ్యి రూ.320కి కొంటే,చంద్రబాబు హయాంలో రూ.290కే కొనుగోలు చేశారని పేర్కొన్నారు.బోలే బాబా సంస్థకు సర్టిఫికెట్ ఇచ్చింది, 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వమేనన్నారు. 2019 మార్చి 6న ఆసంస్థకు 82వేల కిలోల నెయ్యి ని ఆర్డర్ ఇచ్చింది కూడా చంద్రబాబు ప్రభుత్వమే ని తెలిపారు.సీబీఐ సిట్ ఎన్డీడీబీ,ఎన్డీఆర్ఐలు ఇచ్చిన నివేదికలు నిజం కాదట,చంద్రబాబు చెప్పి ందే నిజమట అని మండిపడ్డారు.చేసిన తప్పులకు చెంపలు వేసుకుని చంద్రబాబు,పవన్ కల్యాణ్ శ్రీవారికి క్షమాపణలు చెప్పాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ -
మంచి స్థానం కోసం..
రాష్ట్రంలో మంచి స్థానం కోసం కృషి చేస్తున్నాం. వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వంద రోజుల ప్రణాళికను పటిష్టంగా అమలు చేస్తున్నాం. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు చెందిన మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ప్రస్తుతం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. –ఎం.వినోద్బాబు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పర్యవేక్షిస్తున్నాం.. గత ఏడాది కంటే మంచి ఫలితాలు తెచ్చేందుకు కృషి చేస్తున్నాం. ప్రత్యేక ప్రణాళికతో విద్యార్ధులకు తర్ఫీదునిస్తున్నాం. అధ్యాపకులు వెనుకబడిన విద్యార్ధులను పర్యవేక్షించి ప్రతీ రోజు పురోగతిని పరిశీలిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా విద్యార్ధులకు సహకారం అందించాలి. ఇంటి వద్ద విద్యార్ధులను పర్యవేక్షించి జాగ్రత్తగా చదివేలా చూడాలి. –డాక్టరు ఎ.ఆర్.టి.సుజాత, ప్రిన్సిపాల్,ప్రభుత్వ జూనియర్ కళాశాల, కోటవురట్ల -
కోడి పందాలపై పోలీసుల దాడి
బుచ్చెయ్యపేట: రాజాం గ్రామంలో కోడి పందాలపై పోలీసులు దాడి చేశారు. మంగళవారం గ్రామంలో పండగ సందర్భంగా నూకాలతల్లి గుడి వెనుక జరుగుతున్న కోడి పందాలపై ఎస్ఐ శ్రీనివాసరావు తమ సిబ్బందితో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులను, రెండు కోడి పుంజులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద ఉన్న రూ, 1,300 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. గ్రామదేవతల పండగల సందర్భంగా గ్రామాల్లో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని ఆయా గ్రామాల నాయకులు పోలీసులకు సహకరించాల ని అన్నారు. -
ఫాగింగ్ ముసుగులో ఫుడ్ పాయిజన్?
కొమ్మాది(విశాఖ): స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో 36 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన ప్రస్తుతం పెను వివాదంగా మారింది. పాఠశాల యాజమాన్యం చెబుతున్న కారణాలకు, క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులకు పొంతన లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెల్లువెత్తుతున్న అనుమానాలు పాఠశాలలో ఫాగింగ్ చేయడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని యాజమాన్యం బుకాయిస్తున్నప్పటికీ, వాస్తవానికి ఇది ఫుడ్ పాయిజన్ అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పర్యటనలో వెలుగు చూసిన అంశాలు ఈ అనుమానాలను మరింత బలపరిచాయి. ఫాగింగ్ వల్లే అనారోగ్యం కలిగితే, మరి నీటి నమూనాలను ల్యాబ్కు పంపాల్సిన అవసరం ఏమొచ్చిందని, మురుగు పేరుకుపోయిన డ్రైనేజీలు, అపరిశుభ్రమైన వాటర్ ట్యాంకులు దేనికి సంకేతమని బాధితులు ప్రశ్నిస్తున్నారు. క్షేత్రస్థాయిలో దారుణ పరిస్థితులు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పాఠశాల వంటగదిని పరిశీలించినప్పుడు అక్కడ నిల్వ ఉంచిన మొలకెత్తిన బంగాళదుంపలు, వాడిపోయిన కూరగాయలు కనిపించడం యాజమాన్యం నిర్లక్ష్యాన్ని చాటి చెబుతోంది. వారం రోజుల క్రితం కూరగాయలను వాడడంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. స్నాక్స్గా ప్యాకేజీ ఫుడ్ తీసుకోవడం వల్లే వాంతులు, విరేచనాలు అయ్యాయని ప్రాథమికంగా తెలుస్తోంది. పైగా చికిత్స అందించిన వైద్యులు కూడా ఇది ఫుడ్ పాయిజన్ అని ధ్రువీకరించడం గమనార్హం. యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందనే నెపంతో ఫుడ్ పాయిజన్ను ఫాగింగ్గా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒక విద్యార్థికి మలేరియా సోకడం అక్కడ పారిశుధ్య లోపానికి నిదర్శనం. ఇంత పెద్ద ఘటన జరిగినా యాజమాన్యం పత్రికా సమావేశం నిర్వహించి వివరణ ఇవ్వకపోవడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. చర్యలకు డిమాండ్ పాఠశాల నిర్వహణ లోపం వల్ల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉల్లం నాగరాజు విమర్శించారు. కలెక్టర్ ఈ విషయంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులైన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పీఏసీఎస్ల ద్వారా యూరియా సరఫరాకు చర్యలు
కశింకోట: పీఏసీఎస్ల ద్వారా యూరియాను సరఫరా చేయడానికి మార్క్ఫెడ్ దృష్టికి తీసుకువెళ్లి చర్చించి చర్యలు తీసుకుంటామని డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు అన్నారు. కశింకోట, నరసింగబిల్లి పీఏసీఎస్లను సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి సంఘ సభ్యుల సమస్యలు తెలుసుకున్నారు. రుణాలను ఎకరాకు రూ.5 లక్షల నుంచి అవసరాన్ని బట్టి పెంచుతామని తెలిపారు. డీసీసీబీ బ్యాంకుల్లో డ్వాక్రా రుణాలు రూ.3 లక్షల వరకు 7 శాతం, రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 9.50 శాతం వడ్డీతో ఎటువంటి ప్రాసెసింగ్ చార్జీలు లేకుండా రుణాలు అందిస్తున్నామని తెలిపారు. ఇతర బ్యాంకుల్లో రూ.50 వేల వరకు ప్రాసెసింగ్ చార్జీలు, ఎక్కువ వడ్డీ వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. అందువల్ల రైతులు డీసీసీబీ రుణ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. గతంలో మరణించిన రైతుకు ఇచ్చే బీమా రూ.15,000 ఉండగా, ప్రస్తుతం దాన్ని రూ.50,000 కు పెంచామని తెలిపారు. ప్రమాదవశాత్తూ మరణించిన రైతుకు రూ.2 లక్షల బీమా అందిస్తున్నామని, అలాగే పీఎంఎస్బీవై పథకం కింద ఎల్ఐసీ ద్వారా మరో రూ.2 లక్షల బీమా పరిహారం అందిస్తామని తెలిపారు. -
ఆలయంలో విగ్రహం ఆపహరణకు యత్నం!
మునగపాక: పాటిపల్లిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఆకతాయిలెవరో అపహరించేందుకు యత్నించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తుల పనిగా స్థానికులు భావిస్తున్నారు. ఎప్పటిలాగానే సోమవారం ఉదయం ఆలయం పైకి వెళ్లిన స్థానికులకు అభయాంజనేయ స్వామి విగ్రహం స్థానచలనం అయినట్టు గుర్తించారు. ఎవరో ఆకతాయిలు విగ్రహాన్ని ఎత్తుకుపోయేందుకు యత్నించినట్టు గుర్తించారు. దీంతో స్థానికులు కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
మృత్యుఘంటికలు
హైవేపైజిల్లాలో 94 కి.మీ జాతీయ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జనవరిలోనే 62 రోడ్డు ప్రమాదాలు.. 34 మంది మృత్యువాత ఉదయం 9 తర్వాత, సాయంత్రం 6 నుంచి 9 లోపు ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్’ 9 హైవే మొబైల్ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే మూడు బ్లాక్ స్పాట్స్ గుర్తింపు హైవే పక్కన ఉన్న దాబాలు, హోటళ్ల వద్ద రోడ్లపై పార్కింగ్ చేస్తే చర్యలు సాక్షి, అనకాపల్లి: జాతీయ రహదారులు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 94 కిలోమీటర్ల మేర హైవేపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మర్రిపాలెం, వేంపాడు, లంకెలపాలెం వద్ద ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగడంతో వాటిని బ్లాక్ స్పాట్స్ గుర్తించి అక్కడ ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్’ను పోలీసులు, రవాణా శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. గతేడాది గణాంకాల ప్రకారం..రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడినవారిలో, ఎక్కువగా 18 నుంచి 60 ఏళ్ల లోపు పురుషులే అధికంగా ఉన్నారు. ఈ ఏడాదిలో ఒక్క జనవరిలోనే మొత్తం 62 ప్రమాదాలు జరగగా వాటిలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది కేవలం హెల్మెట్ ధరించకపోవడం కారణంగానే మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. అందుకే జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 9 హైవే మొబైల్ బృందాల సిబ్బందితో (సుమారు 40 మంది) ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం కూడా చేశారు. పనివేళల్లోనే ప్రమాదాలు అధికం గత ఐదేళ్లుగా రోడ్డు ప్రమాదాలు పరిశీలిస్తే..వీటిలో ఎక్కువగా పనివేళల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు, తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల నడుమ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై పరవాడ పోలీస్స్టేషన్ పరిధిలో లంకెల పాలెం కూడలి, కశింకోట పీఎస్ పరిధిలో తాళ్లపాలెం జంక్షన్, నక్కపల్లి పీఎస్ పరిధిలో ఉద్దండపురం రోడ్డు జంక్షన్, బయ్యవరం జంక్షన్లో, నరిసింగిబిల్లి జంక్షన్, ఎస్.రాయవరం పీఎస్ పరిధిలో పెనుగొల్లు బస్స్టేషన్, కశింకోట జంక్షన్లో, ఆర్ఈసీఎస్ దగ్గర నూకాంబిక ఆలయం జంక్షన్, అనకాపల్లి ట్రాఫిక్ పరిధిలో సుంకరమెట్ట జంక్షన్, ఎస్.రాయవరం గోకుల్పాడు జంక్షన్, అనకాపల్లి రూరల్ పరిధిలో కేఎన్ఆర్ పేట గ్రామం వద్ద, కశింకోట హెరిటేజ్ జంక్షన్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. కఠినంగా నిబంధనల అమలు జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను ముందస్తుగా గుర్తించి జాతీయ రహదారిపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే కూడళ్లను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాం. ఆయా చోట్ల ప్రత్యేక నిఘా ఉంచాం. హైవే మొబైల్ బృందాలతో ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తున్నాం. విజిబుల్ పోలీసింగ్ను, విస్తృత తనిఖీలను పెంచుతున్నాం. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న సమయాన్ని డేంజర్ టైమింగ్స్గా పరిగణించాం. కఠినంగానే ట్రాఫిక్ నిబంధనలు అమలుచేస్తున్నాం. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏ మాత్రం ఉపేక్షించేదిలేదు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చు. – ఎల్.మోహన్రావు, అదనపు ఎస్పీ -
కక్ష సాధింపుతో కాపులపై అక్రమ కేసులు
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు పాయకరావుపేట: కాపులపై కక్ష సాధింపుతో సీఎం చంద్రబాబు అన్యాయంగా కేసులు బనాయించడం తగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకులు కాపు నేతలను విమర్శించడంపై మండలంలోని మాసాహేబుపేటలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని ఈ నెల 7న ఉత్తరాంధ్ర కాపులందరూ పరామర్శించామన్నారు. సీఎం చంద్రబాబు కాపులపై కక్ష సాధిస్తున్నారని ఆ సమయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారన్నారు. దీనిపై స్థానిక టీడీపీ నాయకులు దుర్భాషలాడటం తగదన్నారు. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను విమర్శించే స్థాయి టీడీపీ మండలాధ్యక్షుడు చించలపు పద్దు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబులకు లేదన్నారు. నాడు వంగవీటి రంగాను, నేడు ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబులను కక్ష సాధింపుతోనే ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కాపులను అణగదొక్కడం కోసమే కేసులు బనాయిస్తున్నారన్నారు. స్థానిక టీడీపీ నాయకులు మాట తీరు మార్చుకోకపోతే రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. తిరుపతి లడ్డూలో జంతు కొవ్వు కలిసిందని అనడం అవగాహన రాహిత్యం అన్నారు. లడ్డూలో కల్తీ లేదని సీబీఐ, సిట్ నిర్ధారించాయన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీకి చెందిన కాపు నాయకులు వైఎస్సార్సీపీ నేతలను విమర్శించడం తగదన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలోనే కాపులకు మంత్రి పదవులు, ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారన్నారు. టీడీపీ నాయకులు విమర్శించే ముందు ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సమావేశంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, పట్టణ అధ్యక్షుడు ధనిశెట్టి మహేష్, గోపాలపట్నం, కేశవరం సర్పంచ్లు పన్నీరు బాబ్జి, మేడిశెట్టి రామగోవిందు, ఎంపీటీసీలు కొంతం నరేష్, పల్లేల లక్ష్మణ్, నాయకులు కోనే పుత్రరావు, పాలపర్తి సతీష్, అక్కిరెడ్డి నాగేశ్వరరావు, పెనుమత్య నాగేశ్వరరావు, దేవవరపు నాగభూషణం, పర్వత సత్యనారాయణ పాల్గొన్నారు. -
డయల్ యువర్ ఈపీడీసీఎల్ సీఎండీకి విశేష స్పందన
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈపీడీసీఎల్ ప్రారంభించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి తొలిరోజున విశేష స్పందన లభించిందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 48 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటులో ఇబ్బందులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడిలో జాప్యం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల అంచనాలు, విద్యుత్ లైన్ల మార్పు, బిల్లులు, విద్యుత్ లైన్లు స్తంభాల మార్పిడి, స్తంభాలపై వైర్లు వేలాడుతుండడం, సరఫరాలో అంతరాయాలు, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు 9493681912కు చాట్ చేయడం ద్వారా కూడా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎం వి.విజయలలిత, జీఎం ఎం.ఝాన్సీ పాల్గొన్నారు. -
మలేషియా టూరిజం విస్తరణకు ప్రణాళిక
కొమ్మాది: 2026లో 2.1 మిలియన్ల పర్యాటకులు సందర్శించే లక్ష్యంతో మలేషియా టూరిజాన్ని విస్తరించే ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మలేషియా టూరిజం చైర్మన్ దాతూక్ మనోహరస్ పెరియసామి అన్నారు. సాగర్నగర్లో ఉన్న రాడిసన్ బ్లూ రిసార్టులో సోమవారం మలేషియా అసోసియేషన్ ఆఫ్ టూర్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్ భాగస్వామ్యంతో జరిగిన టూరిజం మలేషియా సేల్స్ మిషన్–2026 సదస్సులో ఆయన పాల్గొన్నారు. వాణిజ్య భాగస్వాములను పటిష్టం చేసి విభిన్న పర్యాటక శాఖలను ప్రోత్సహించడంపై మలేషియా దృష్టి సారించిందన్నారు. దక్షిణ భారతంలో టూరిజం మలేషియా ఉనికిని విస్తరించడం.. తద్వారా మార్కెట్లో మలేషియా భాగస్వామ్యం బలోపేతం చేయడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం అన్నారు. 2024లో 13,65,387 మంది పర్యాటకులు మలేషియాను సందర్శించగా 2025లో 15,65,194 మంది సందర్శించారన్నారు. 2026లో పర్యాటకుల సంఖ్య మరింత ఎక్కువ పెరిగేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. భారత్, మలేషియా దేశాల మధ్య పర్యాటకుల డిమాండ్కు మద్దతుగా దేశంలోని 14 నగరాల నుంచి 47,399 సీట్ల కెపాసిటీతో 238 డైరెక్ట్ వీక్లీ విమానాలతో అనుసంధానం ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో టూరిజం మలేషియా ఇంటర్నేషనల్ ప్రమోషన్స్ విభాగం సీనీయర్ డైరెక్టర్ నువాల్ ఫాథిలా బింటీ, హిషాముద్దీస్ ముస్తాఫా తదితరులు పాల్గొన్నారు. -
చందనోత్సవం విజయవంతానికి సమష్టి కృషి అవసరం
సింహాచలం: సింహగిరిపై ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థానం ఉద్యోగులందరూ సమష్టిగా కృషి చేయాలని ఈవో జె. వెంకటరావు పిలుపునిచ్చారు. సోమవారం దేవస్థానంలోని పలు విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. చందనోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో తాగునీరు, ప్రసాదం పంపిణీలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యం, విద్యుద్దీకరణ, భద్రత, రవాణా సదుపాయాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. సింహగిరిపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఈ నేపథ్యంలో నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లు, చలువ పందిళ్లు, తాత్కాలిక షెడ్ల నిర్మాణంపై చర్చించారు. భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్డీసీ గీతాంజలి, డిప్యూటీ ఈవో రాధ, ఈఈలు రమణ, రాంబాబు, రామకృష్ణ, డీఈ తాతాజీ, ఏఈవోలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి, నరసింహరాజు, పిల్లా శ్రీనివాసరావు, పి. శ్రీనివాస్ పాల్గొన్నారు. -
లడ్డూలో కల్తీ లేదని సీబీఐ నివేదికలో సుస్పష్టం
నక్కపల్లి: తిరుమల లడ్డూ తయారీలో ఉపయోగించిన నెయ్యిలో కల్తీ జరగలేదని సీబీఐ, సిట్ నివేదికలు స్పష్టం చేయడంతో చంద్రబాబు, లోకేష్ పవన్కల్యాణ్ ప్రజలకు సమాధానం చెప్పలేక సోషల్ మీడియా, ఎల్లో మీడియా ద్వారా ఇంకా తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ధ్వజమెత్తారు. సోమవారం ఆయన సీతంపాలెంలో మాట్లాడుతూ గుజరాత్లోని ఎన్డీడీబీ, హర్యానాలో ఎన్డీఆర్ఐ ల్యాబ్లో పరీక్షించి నెయ్యిలో జంతుకొవ్వు, పందికొవ్వు, చేపనూనె కలవలేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం తప్పుడు ప్రచారం మానుకోవడం లేదని ఆరోపించారు. నాలుగు ట్యాంకర్లలో వెజిటబుల్ ఫ్యాట్ ఉందని 2024 జూలై 17న నివేదిక వచ్చిందని అప్పటి ఈవో శ్యామలరావు మీడియా సమావేశంలో వెల్లడిస్తే, అదే ట్యాంకర్లలో నెయ్యి తిరిగి ఏఆర్ డెయిరీకి వెళ్లకుండా వైష్ణవి డైయిరీకి వెళ్లి పేరు మార్చి మళ్లీ తిరుమలకు ఎందుకు చేర్చారో సమాధానం చెప్పాలన్నారు. ఇదే నెయ్యిని తిరుమల లడ్డూ తయారీలో వినియోగించారని సుప్రీం కోర్టులో సీబీఐ చార్జ్షీట్ దాఖలు చేసిందన్నారు. అల్ఫా మిల్క్లో ప్రమాణాలు సరిగ్గా లేవని కేసులు నమోదు చేసిందన్నారు. అదే ఆల్ఫా మిల్క్ కంపెనీకి 10 లక్షల కేజీల నెయ్యి సరఫరా చేయాలని ప్రస్తుత చైర్మన్ బీఆర్నాయడు రూ.245 కోట్లకు కాంట్రాక్ట్ ఇచ్చారన్నారు. తప్పులన్నీ చంద్రబాబు ప్రభుత్వం చేసి వాటిని అప్పటి ఈవో అనిల్కుమార్ సింఘాల్పై తోసేసి రాత్రికి రాత్రే అతనిని బదిలీ చేసిందన్నారు. అతనితోపాటు శ్యామలరావులను ఎందుకు బదిలీ చేశారో సమాధానం చెప్పాలన్నారు. సీబీఐ చార్జ్షీట్ ప్రజలు పూర్తిగా తెలుసుకునేలోపు వారిలో విష ప్రచారం ఎక్కించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. పోస్టర్లు వేయించడం, ఫ్లెక్సీలు కట్టడం, యూట్యూబ్ చానళ్ల ద్వారా గత ప్రభుత్వంపైన అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డిపైన తప్పుడు ప్రచారం చేసి తిరుమల ఆలయాన్ని రాజకీయాలకు వాడుకుంటుందన్నారు. దీని కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెడుతోందని ఆరోపించారు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజల్లోకి రాలేక డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీసి అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై భౌతిక దాడులకు పాల్పడి అరెస్టు చేస్తున్నారన్నారు. సమావేశంలో ఎంపీటీసీ గొర్ల గోవిందు, సర్పంచ్లు వెదుళ్ల వెంకటరమణ, నాగఅప్పలరాజు, నాయకులు పోతంశెట్టి బాబ్జి, మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా త్రినాఽథ్
బుచ్చెయ్యపేట: ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కందిపూడి ఉపాధ్యాయుడు తమరాన త్రినాఽథ్ ఎన్నికయ్యారు. ఆదివారం విజయవాడలో జరిగిన రాష్ట్ర ఏపీటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో త్రినాఽథ్ను ఏకగ్రీవంగా ఉపాధ్యాయులు ఎన్నుకున్నారు. పి. కందిపూడి పాఠశాలలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. గతంలో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పలు పదవులు నిర్వహించారు. ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఏపీటీఎఫ్ సంఘం అభివృద్ధికి కృషి చేస్తానని త్రినాథ్ తెలిపారు. ఆయన ఎన్నిక పట్ల పలువురు ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు. -
ఐఎఫ్ఆర్కు ఏర్పాట్లు వేగవంతం
ఏయూ క్యాంపస్: ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు నగరం ముస్తాబవుతోంది. ఇప్పటికే కొత్త రోడ్లు వేసిన అధికారులు, రంగులు వేయడం ద్వారా పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దే పనులను వేగవంతం చేస్తున్నారు. డివైడర్ మధ్యలో ప్రత్యేక ఇనుప స్తంభాలను ఏర్పాటు చేసి ఐఎఫ్ఆర్కు సంబంధించిన జెండాలను ఎగురవేశారు. బీచ్రోడ్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో గోడలకు సముద్రం, లైట్హౌస్, నౌకలు వంటి థీమ్లతో ఆకట్టుకునే చిత్రలేఖనాలు చేపడుతున్నారు. ఈ పనుల్లో కార్మికులు నిమగ్నమై ఉన్నారు. మరోవైపు సందర్శకులు కూర్చుని వీక్షించేందుకు వీలుగా వేదికల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఫుట్పాత్లపై సందర్శకుల కోసం ప్రత్యేక తెరలను ఏర్పాటు చేస్తున్నారు. ఇనుప తిన్నెలపై కూడా బారికేడ్లు నిర్మించే పనులు కొనసాగుతున్నాయి. సోమవారం రక్షణ రంగానికి చెందిన విమానాలు పలుమార్లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ దర్శనమిచ్చాయి. -
మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డగోలు అనుమతులు
దేవరాపల్లి: దేవరాపల్లిలో అక్రమ మట్టి తవ్వకాలపై ఫిర్యాదు చేస్తే రెవెన్యూ అధికారులు 75 రోజుల తర్వాత ఎండార్స్మెంట్ ఇవ్వడం అత్యంత దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి.వెంకన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవరాపల్లిలో సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. దేవరాపల్లి రెవెన్యూ పరిధిలోని బిల్లలమెట్ట సమీపంలో అక్రమ మట్టి తవ్వకాలపై గత ఏడాది డిసెంబర్ 1న ఫిర్యాదు చేస్తే సుమారు 75 రోజుల తర్వాత దర్యాప్తు జరిపి సోమవారం తనకు ఎండార్స్మెంట్ ఇచ్చారని, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమన్నారు. దేవరాపల్లిలో మూడు సర్వే నెంబర్లలో కేవలం ఏడు రోజులు మాత్రమే మట్టి తవ్వి వ్యవసాయ భూమి చదును చేసేందుకు మాత్రమే వినియోగించాలని సూచిస్తూ గత ఏడాది నవంబర్ 25న తహసీల్దార్ అనుమతులు ఇచ్చామని ఎండర్స్మెంట్లో పేర్కొన్నారని వెంకన్న తెలిపారు. సదరు మట్టి తవ్వకాలు చేపట్టిన వ్యక్తి సుమారు నెల రోజులకు పైబడి నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీ వాహనాలతో రాత్రి పగలు తేడా లేకుండా రెండు కిలోమీటర్ల మేర మట్టి తవ్వకాలు చేపట్టారని, కానీ రెవెన్యూ అధికారులు కాసులకు కక్కుర్తి పడి చూసి చూడనట్టుగా వ్యవహరించి, అక్రమ తవ్వకాలకు పరోక్షంగా సహకరించారని విమర్శించారు. స్థానిక రెవెన్యూ అధికారుల తీరుతో ప్రభుత్వంపై నమ్మకం పోయి, తీవ్ర వ్యతిరేకత పెరుగుతుందన్నారు. మట్టి అక్రమ తవ్వకం, స్థానిక రెవెన్యూ అధికారుల అవినీతిపై జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారులతో సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
భూ సమస్యలే అధికం
కాళ్లరిగేలా తిరిగినా గోడు వినలేదు... తుమ్మపాల: భూ సంబంధిత సమస్యలను రెవెన్యూ క్లినిక్ల ద్వారా సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని, పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1 , 2 లో నిర్వహించిన పీజీఅర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో ఆయనతో పాటు ఎన్ఎఓబీ, బిజయూఆర్ఎస్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు సుబ్బలక్ష్మి, రామమణి, మనోరమలు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో 131, రెవిన్యూ క్లినిక్లో 197 అర్జీలు మొత్తం – 328 అర్జీలు స్వీకరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మెప్మా, ఐసిడీి ఎస్ అధికారులు కె.సరోజిని, సూర్యలక్ష్మి, జిల్లా ఎకై ్సజ్ అధికారి వి.సుధీర్, జిల్లా రవాణా శాఖ అధికారి జి.మనోహర్, జిల్లా సర్వే భూ రికార్డుల సహాయ సంచాలకులు గోపాల్ రాజా పాల్గొన్నారు. పాఠశాల ఆటస్థలంలో నిర్మాణాలపై నిరసన పాఠశాల ఆటస్థలంలో నిర్మించే డ్రైనేజీ వాటర్ ఫిల్టర్ ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలంటూ యలమంచిలి మండలం తెరువుపల్లి గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు ఆటస్థలంతో పాటు గ్రామ అవసరాలకు కూడా వినియోగించుకుంటున్న గ్రౌండ్ను కనుమరుగు చేసేవిధంగా గ్రామస్తుల అంగీకారం లేకుండా యలమంచిలి మున్సిపాలిటీ అవసరాలకు వినియోగించడం దారుణమని, పాఠశాలకు చెందిన ఆటస్థలంలో ఎటువంటి నిర్మాణాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. తక్షణమే నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ నినాదాలు చేసి పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. అనధికార భూసర్వే పనులపై ఆగ్రహం రైతులకు కనీస సమాచారం లేకుండా వ్యవసాయ భూముల్లో అధికారులు చేపట్టే అనధికారిక సర్వేను నిలిపివేసి గ్రామాన్ని కాపాడాలంటూ సబ్బవరం మండలం రాయపుర అగ్రహారం గ్రామస్తులు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. వ్యవసాయమే జీవనాధారంగా జీవించే తమ భూముల్లో మూడు రోజులుగా అధికారులు భూ సర్వే పనులు చేస్తున్నారని, అడిగితే ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో ఏపీఐఐసీకి భూములు కేటాయిస్తున్నట్టు చెబుతున్నారని, దీంతో తామంతా ఆందోళనకు గురయ్యామన్నారు. పరిశ్రమలకు గ్రామంలో రైతుల భూములను సేకరించే విధంగా సర్వే చేయడం అన్యాయమని, గ్రామసభ, గ్రామస్తుల అభిప్రాయ సేకరణ చేయకుండా చేపడుతున్న సర్వేను నిలిపివేయాలని కోరారు. వ్యవసాయం అధారంగా ఉన్న గ్రామస్తుల పొట్ట కొట్టవద్దని, ఏపీఐఐసీకి భూ కేటాయింపులు మరో చోట చేపట్టి మా గ్రామాన్ని విడిచిపెట్టాలంటూ పీజీఆర్ఎస్లో వినతిపత్రం అందించారు. ఆ వీఆర్వోలపై చర్యలు తీసుకోండి... నిబంధనలకు విరుద్ధంగా సొంత మండలంలోనే విధుల్లో కొనసాగుతున్న ఇద్దరు వీఆర్వోలపై విజిలెన్స్ విచారణ చేపట్టి శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ విభాగం చైర్మన్ బొంతు రమణ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. మాకవరపాలెం మండల స్థిరనివాసులైన జి.సాంబశివరావు, ఎస్.సూర్యనారాయణ అనే ఇద్దరు వీఆర్వోలు మాకవరపాలెం, రాచపల్లి గ్రామాల్లోనే వీఆర్వోలుగా విధుల్లో కొనసాగుతున్నారని, ప్రభుత్వం చేపట్టే బదిలీలకు విరుద్ధంగా ఇతర చోట్లకు వెళ్లకుండా కొనసాగడం ప్రాథమిక ఉల్లంఘనగా భావించి చర్యలు తీసుకోవాలని కోరారు. చిల్లంగి పేరిట వేధింపులపై ఫిర్యాదు చెడుపులు చిల్లంగులు చేస్తున్నామంటూ అదేపనిగా దూషించడంతో మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గ్రామంలో తలెత్తుకు తిరగలేకపోతున్నామని, తమకు న్యాయం చేయాలని కోరుతూ మునగపాక మండలం టి.సిరసపల్లి గ్రామానికి చెందిన బి.నరేష్, మరికొంతమంది కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. గ్రామంలో అద్దెకు వచ్చి నివాసముంటూ వికలాంగులుగా ఉన్న చిట్టిబోయిన విజయ, కరుణ, వగైరాలు తమను తీవ్రంగా వేధిస్తున్నారని, అందరిపై పోలీసు కేసులు పెడుతూ భయాందోళనలకు గురిచేస్తున్నారని, వారికి కౌన్సెలింగ్ చేసి తమకు కాపాడాలని కోరారు. రాయపుర అగ్రహారం గ్రామస్తుల నిరసన ఆటస్థలాన్ని కాపాడాలంటూ నిరసన తెలుపుతున్న తెరువుపల్లి గ్రామస్తులుఇన్కంట్యాక్స్ చెల్లిస్తున్నట్టు తప్పుడుగా నమోదైన కారణంగా ఎటువంటి ప్రభుత్వ పథకాలు రావడం లేదని, తెల్లరేషన్ కార్డు ఉన్నప్పటికీ ఫీజు రీయంబర్స్మెంట్, స్కాలర్షిప్ కూడా రాకపోవడంపై కొన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయిందని కలెక్టరేట్లో పీజీఆర్ఎస్లో అర్జీ చేసేందుకు వచ్చిన అక్కాచెల్లెళ్ల అర్జీని నమోదు చేయకుండా కలెక్టరేట్ సిబ్బంది తిరిగి వెనక్కు పంపించేశారు. అనకాపల్లి మండలం మూలపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు ఇల్లా హిమవర్శిని డిగ్రీ, యామిని ఇంటర్మీడియట్ చదువుతున్నారు. కూలీపనులు చేసుకుంటు కుటుంబాన్ని నేట్టుకొచ్చే తల్లిదండ్రులు ఐదేళ్ల క్రితం ప్రైవేటు బ్యాంకుల్లో అప్పు తీసుకున్న క్రమంలో ఇన్కంట్యాక్స్ చెల్లిస్తున్నట్టు తప్పుగా నమోదైంది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలిచిపోవడంతో అప్పును ఆగమేఘాల మీద తీర్చేసినప్పటికీ తప్పుగా నమోదైన ఇన్కంట్యాక్స్ వివరాలు మాత్రం ప్రభుత్వ రికార్డుల నుంచి తొలగిపోలేదు. దీంతో అమ్మ ఒడి దగ్గర నుంచి ఫీజు రీయంబర్స్మెంట్ ఇతరత్రా ఏ ఒక్కపథకంలో వీరికి లబ్ధి చేకూరలేదు. దీనిపై అనేక వినతులు చేస్తున్నా పట్టించుకుని పరిష్కరించే అధికార యాంత్రంగమే లేకపోవడంతో చివరకు కళాశాలకు సెలవు పెట్టి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కలెక్టరేట్కు వచ్చారు. కూలీపనులు చేసుకుంటూ తమను పోషిస్తున్న తల్లిదండ్రులు డిగ్రీ, ఇంటర్మీడియట్ చదువుతున్న తమకు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, కలెక్టర్కు తమ బాధ చెప్పుకుందామని వస్తే మీ అర్జీ తహసీల్దార్ వద్ద పెండింగ్లో ఉందంటూ సిబ్బంది తిరిగి వెనక్కు పంపించేయడంతో నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోయారు. – ఇల్లా హిమవర్శిని, యామిని పీజీఆర్ఎస్కు 131 అర్జీలు ఎస్పీ కార్యాలయానికి 55 అర్జీలు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 55 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు అర్జీదారుల సమస్యలను తెలుసుకున్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని ఏఎస్పీ తెలిపారు. భూ తగాదాలకు సంబంధించి 25, కుటుంబ కలహాలపై 2, మోసపూరిత వ్యవ హారాలపై 4, ఇతరత్రా 24 అర్జీలు వచ్చాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఐ జి.విశ్వనాథం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం
అచ్యుతాపురం రూరల్: బొలేరో వాహనం డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం చిన్నాభిన్నం అయిపోయింది. విధులు ముగించుకుని ఇంటికి వస్తాడు అనుకునేలోపే కుమారుడు అంతుచిక్కని లోకాలకు వెళ్లిపోయాడన్న చేదు నిజం ఒక తల్లి గుండెలను చిదిమేసింది. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో యర్రవరం గ్రామానికి చెందిన అప్పికొండ సాయి (22) బ్రాండిక్స్లో గల టీజే పరిశ్రమలో విధులు ముగించుకుని బైకుపై ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో సుప్రజా డెయిరీ ఎదురుగా అకస్మాత్తుగా రాంగ్ రూట్లో వచ్చిన బొలేరో వాహనంను ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో వెనక కూర్చున్న రావాడ శ్రీను కూడా తీవ్రంగా గాయపడి ఆరిలోవలో గల ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యర్రవరంలో ఒక ఇంట్లో జరుగుతున్న జన్మదిన వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న ఇద్దరు యువకులు ప్రమాదం బారినపడి ఒకరు మృతి చెందగా, మరొకరు ఆసుపత్రి పాలవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతి చెందిన సాయి తండ్రి సంవత్సరం క్రితం అనారోగ్య కారణంగా మృతి చెందాడు. చేతికి అందొచ్చిన కుమారుడు తనకు అండగా ఉంటాడనుకున్న ఆ తల్లి ఆశలు అడియాశలు అయ్యాయి. కొడుకు మృతితో తల్లి గుండెలవిసేలా చేసిన రోదన గ్రామస్తులకు కంటతడి పెట్టించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అదే గ్రామానికి చెందిన రావాడ శ్రీనుకు వివాహమై ఒక కుమార్తె ఉంది. విధుల నుంచి వస్తూ శ్రీను ఆసుపత్రి పాలవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోలన చెందుతున్నారు. ఆసుపత్రి నుంచి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని భగవంతున్ని వేడుకుంటున్నారు. కాగా ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం సుప్రజ డెయిరీ ఎదురుగా ధర్నా నిర్వహించారు. ప్రమాదానికి గల కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళన చేపట్టారు. మృతుని కుటుంబానికి అలాగే ఆసుపత్రిలో ఉన్న యువకుని కుటుంబానికి న్యాయం చేయాలని సీపీఎం, సీఐటీయు, అఖిల పక్ష నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళన కారణంగా రహదారి పూర్తిగా స్తంభించడంతో కొన్ని గంటల వ్యవధి ట్రాఫిక్ నిలిచిపోయింది. అనుకోకుండా బొలేరో వాహనం సుప్రజా డెయిరీలోకి వెళ్లేందుకు ఒక్కసారిగా రహదారికి అడ్డంగా రావడంతో బైక్ పై ఉన్నవారు అదుపుతప్పి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై కేసు నమోదు చేసి పూర్తి విచారణ చేపడతున్నట్టు ఇన్స్పెక్టర్ చంధ్రశేఖర్రావు తెలిపారు. గాయపడిన రావాడ శ్రీనుసంఘటనా స్థలంలో సాయి మృతదేహం -
మార్చి చివరికల్లా కేజీబీవీల్లో భవన నిర్మాణాలు పూర్తి
దేవరాపల్లి: దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో రూ. 2.05 కోట్ల సమగ్ర శిక్ష నిధులతో నిర్మిస్తున్న టైప్–4 కేజీబీవీ భవన నిర్మాణాన్ని మార్చి నెలాఖరుకు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని సమగ్ర శిక్ష డీఈ కె.గణేష్ వెల్లడించారు. మండల కేంద్రం దేవరాపల్లిలో టైప్–4 కేజీబీవీ భవన స్లాబ్ పనులను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ రెండు అంతస్తుల భవన నిర్మాణం పూర్తయితే వంద మంది బాలికలకు సరిపడా తరగతి గదులు, డార్మిటరీ, భోజన శాల, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు సమకూరుతాయన్నారు. జిల్లాలో టైప్–4 కేజీబీవీలు గొలుగొండ మండలం ఏజెన్సీ లక్ష్మీపురం జిల్లా పరిషత్ హైస్కూల్లోను, మరొకటి దేవరాపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్మాణంలో ఉన్నాయన్నారు. జిల్లాలో 12 కేజీబీవీల్లో రూ. 21.52 కోట్ల వ్యయంతో డార్మిటరీలు నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. జిల్లాలో 2025–2026 విద్యా సంవత్సరానికి సమగ్ర శిక్ష ద్వారా రూ. 12 కోట్ల వ్యయంతో పాఠశాల్లో ల్యాబ్లు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల సదుపాయం, భవిత కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన తదితర అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, అలాగే పీఎంశ్రీ పథకం ఫేజ్–7 కింద ఆరు పాఠశాలల్లో రూ. 2.33 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఆయన వెంట సమగ్ర శిక్ష ఏఈ సంతోష్ పాల్గొన్నారు. -
లోపూడిలో గ్రామ సభలను అడ్డుకున్న రైతులు
బుచ్చెయ్యపేట: మండలంలో లోపూడి, పొట్టిదొరపాలెం గ్రామాల్లో జరిగిన గ్రామ సభలను రైతులు అడ్డుకున్నారు. లూలూరు, నిమ్మలోవ రెవెన్యూలో ఉన్న భూములను ఏపీఐఐసీకి కేటాయిస్తు న్నట్టు అధికారులు రైతుల అమోదం కోసం రెండు గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేశారు. లోపూడిలో సోమవారం ఉదయం 10 గంటలకు, పొట్టిదొరపాలెంలో 12 గంటలకు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. రెండు గ్రామాల్లో టెంట్లు వేయడంతో గ్రామ సభలకు రైతులు వచ్చినప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రామ సభలు నిర్వహించాల్సిన అధికారులు రాలేదు. పోలీసులు మాత్రం వచ్చి గ్రామ సభలు వద్ద మోహరించారు. ఒంటి గంట ప్రాంతంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామమూర్తి వచ్చి గ్రామ సభలు పెట్టారు. అయితే పరిశ్రమలకు భూములివ్వబోమని రైతులు తేల్చి చెప్పేశారు. పోలీసులను తీసుకొచ్చి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదని తెలిపారు. అసలు గ్రామ సభలను పోలీస్ బందోబస్తుతో పెట్టాల్సిన అవసరం ఏమిటో తేల్చి చెప్పాలని నిలదీశారు. దీంతో డిప్యూటీ తహసీల్దార్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరిస్తుండగా కొన్ని గ్రామాల్లో సభల్లో గొడవలు జరగడంతో ముందస్తు చర్యగా పోలీసులను ఏర్పాటు చేశాం తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం కాదని మీ రెండు గ్రామాల్లో భూముల రికార్డులను సరి చేయడానికే వచ్చామని, సర్వే నెంబర్లు, పేర్లు, విస్తీర్ణాలు తప్పులు ఇతర భూ సమస్యలు ఉంటే మా రెవెన్యూ సిబ్బందితో సరి చేయించుకోవాలని డీటీ రైతులకు సూచించారు. రైతు సంఘ నాయకులు దొండా శ్రీను, చిట్టిబాబు, త్రినాఽథ్, నాయుడుబాబు, శేషు, మధు, బాబూరావు పాల్గొన్నారు. లోపూడిలో వెలవెలబోయిన గ్రామ సభసమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ తహసీల్దార్ -
విశాఖ పోర్ట్ను సందర్శించిన ఐఏఎస్ శిక్షణార్థులు
విశాఖసిటీ: సివిల్స్ 2025 బ్యాచ్కు ఐఏఎస్ శిక్షణార్థుల బృందం సోమవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీని (వీపీఏ) సందర్శించింది. వింటర్ స్టడీ టూర్లో భాగంగా వచ్చిన వీరికి పోర్టు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం, ఆధునికీకరణ, యాంత్రీకరణ పనుల గురించి అధికారులు సమగ్రంగా వివరించారు. ప్రధానంగా సోలార్ పవర్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ మొదలైన పర్యావరణహిత కార్యక్రమాలతోపాటు కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్, ట్రక్ పార్కింగ్ టెర్మినల్ గురించి అధికారులు వారికి వివరించారు. కార్యక్రమంలో వీపీఏ విభాగాధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏకోపాధ్యాయలో ... బోధన ఏ దయ ?
నర్సీపట్నం: ఏకోపాధ్యాయ పాఠశాలల్లో చదువులు సక్రమంగా సాగడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కరే టీచర్ 1 నుంచి 5వ తరగతి వరకూ బోధించవలసి వస్తోంది. ఐదు తరగతులకు కలిపి దాదాపు 15 వరకూ సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టులన్నీ ఒకే ఉపాధ్యాయుడు చెప్పడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఏదైనా కారణంతో ఉపాధ్యాయుడు రాకపోతే పాఠశాల మూతపడుతోంది. దీనికి తోడు తరచూ ఉపాధ్యాయులకు ఏదో ఒక పేరుతో శిక్షణలు ఇస్తుండడంతో నెలలో కనీసం మూడు,నాలుగు రోజులు వారు వాటికి హాజరుకావలసి వస్తోంది. ఆ సమయంలో కూడా పాఠశాలలు మూతపడుతున్నాయి. దీంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. సీఆర్ఎమ్టీలతో బోధనేతర పనులు ఉపాధ్యాయుడు సెలవు పెట్టినప్పుడు ఏకోపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలు మూతపడకుండా ఉండేందుకు, పేద విద్యార్థులకు నష్టం కలుగకూడదనే దూర దృష్టితో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్లస్టర్ రిజ్వర్డ్ మొబైల్ టీచర్(సీఆర్ఎమ్టీ) వ్యవస్థను తీసుకొచ్చింది. సమగ్ర శిక్షలో బీఈడీ, టెట్ విద్యార్హతతో నియామకమైన సీఆర్ఎమ్టీలను బోధనకు ఉపయోగించేవారు. ఏకోపాధ్యాయుడు తన అవసరాల కోసం సెలవు పెట్టినా, మండల, జిల్లాస్థాయిలో శిక్షణ తరగతులకు హాజరైనప్పుడు మూతపడకుండా సీఆర్ఎమ్టీలతో పాఠశాలలు నిర్వహించేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో వారిని ఎక్కువగా బోధనేతర పనులకు వినియోగిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం సరఫరా, పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను వారికి అప్పగించారు. జిల్లాలో ఉన్న 106 మంది సీఆర్ఎమ్టీలను కేవలం ఎంఈవో కార్యాలయానికి, పాఠశాలకు అనుసంధాన కర్తలుగా పరిమితి చేశారు. దీనికి తోడు సరైన పర్యవేక్షణ లేక ఎక్కడైనా ఏకోపాధ్యాయుడు సెలవు పెడితే ఆ పాఠశాల మూతపడుతోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధన కుంటుపకుండా విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావునాయుడును వివరణ కోరగా పాఠశాలలు మూతపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఎంఈవోలకు ఆదేశాలు ఇచ్చాను. కొన్ని మండలాల్లో స్కూళ్లు మూతపడినట్టు తనదృష్టికి వచ్చింది. ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటానని డీఈవో తెలిపారు. -
తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు మానుకోవాలి
వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ సమన్వయ కర్త ప్రసాద్ మునగపాక: తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ విమర్శించారు. ఆదివారం మునగపాకలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. లడ్డూ తయారీలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదంటూ దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థలైన ఎన్డీఆర్ఐ,ఎన్డీడీబీ ల్యాబ్ల రిపోర్టులు చెబుతున్నా .. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకతను కప్పి పుచ్చుకునేందుకు వైఎస్సార్సీపీపై బురదజల్లుతున్నారన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ పేరుతో చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్లు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అబద్ధాలు మాట్లాడుతున్నారని చెప్పారు. ఇప్పటికై నా అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న చంద్రబాబుకు రానున్న రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపిస్తున్న వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి భయపెట్టాలని చూడడం అవివేకమన్నారు. ఈసమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు పెంటకోట స్వామి సత్యనారాయణ,వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, ఎంపీటీసీ సూరిశెట్టి రాము,సర్పంచ్ భీశెట్టి గంగప్పలనాయుడు, తిమ్మరాజుపేట ఉప సర్పంచ్ కాండ్రేగుల జగన్, పార్టీ నేతలు నరాలశెట్టి సూర్యనారాయణ, కేశవరావు,చిరంజీవి, పెదబ్బాయి తదితరులు పాల్గొన్నారు. -
జేసీ సీటు ఖాళీ...సేవల్లో తీవ్ర జాప్యం
సాక్షి, అనకాపల్లి: జిల్లాలో కీలకమైన జాయింట్ కలెక్టర్(జేసీ) సీటు ఖాళీగా ఉండడంతో పాలనపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రధానమైన రెవెన్యూ సమస్యల పరిష్కారం, భూ వ్యవహారాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రజలకు అందించే సేవల్లో తీవ్ర జాప్యం నెలకుంటోంది. ఇక్కడ జేసీగా పనిచేసిన జాహ్నవి వ్యక్తిగత కారణాలతో పలుమార్లు సెలవు పెట్టడడంతో ఆరు నెలలుగా పాలనాపరమైన పనులు పెండింగ్లో ఉండిపోయాయి. ఇన్చార్జి బాధ్యతలను డీఆర్వో సత్యనారాయణకు అప్పగించినప్పటికీ పూర్తిస్థాయి అధికారాలు లేకపోవడం ఇబ్బందిగా మారింది. పాత జేసీ జాహ్నవి ప్రసూతి సెలవులో వెళ్లడంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న మల్లవరపు సూర్యతేజను గతనెల 12న ప్రభుత్వం ఇక్కడ జేసీగా నియమించింది. 26 రోజులుదాటినా ఆయన బాధ్యతలు స్వీకరించలేదు. ఇక్కడకు వచ్చేందుకు ఆయన సుముఖంగా లేరని తెలిసింది. ఆయన రానప్పటికీ కొత్త అధికారిని నియమించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. జిల్లాలో కీలకమైన జేసీ పోస్టు ఖాళీగా ఉండటంతో ప్రతి సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేసే వారు, వివిధ పనుల కోసం కలెక్టర్ కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా జనవరి నెలలో ‘అనకాపల్లి ఉత్సవ్ ’నిర్వహించడంలో ప్రభుత్వ, ప్రైవేటు ఈవెంట్లతో కలెక్టర్తో సహా అధికార యంత్రాంగం బిజీగా ఉండటంతో రెవెన్యూ సమస్యలు, ఫైళ్లు పెండింగ్లో పడిపోయాయి. దీంతో జేసీని నియమించాలని జిల్లాలో ఉద్యమకర్తలు, ప్రజలు ‘ఎక్స్’ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరారు చతికిలపడిన కీలక విభాగాలు జిల్లా పాలనలో జాయింట్ కలెక్టర్(జేసీ)ది కీలక భూమిక. ప్రధానంగా సివిల్ సప్లయిస్, భూసేకర ణ, గనులు, ఖనిజాలు, వివిధ సంక్షేమ శాఖలు, ప్రాజెక్టులు, పరిశ్రమలకు ఏర్పాటుకు భూ సేకరణ ప్రక్రియ, విపత్తు నిర్వహణ వంటివి జేసీ పరిధిలోనే ఉంటాయి. ప్రధానంగా రెవెన్యూ విభాగంలో పెండింగ్లో ఉన్న కేసులు, అప్పీళ్లను పర్యవేక్షిస్తారు. జేసీ లేకపోవడంతో భూ వివాదాల పరిష్కారం, రెవెన్యూ కోర్టుల నిర్వహణ, భూ రికార్డుల కంప్యూటరీకరణ అటకెక్కాయి. పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరుగుతోంది. కొత్త రేషన్ కార్డుల జారీ, భూముల రీసర్వే, ఏపీఐఐసీ భూసేకరణ, సబ్సిడీ బియ్యం పంపిణీ, రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియలో సమన్వయం లోపించింది. పింఛన్లు, గృహ నిర్మాణ పథకాల పురోగతిపై క్షేత్రస్థాయి పర్యవేక్షణ కరువైంది. పెండింగ్ సమస్యలను పరిష్కరించాలి కొత్తగా నియమితులైన జేసీ బాధ్యతలు స్వీకరించి,పెండింగ్లో ఉన్న ప్రజా సమస్యలు పరిష్కరించాలి. జీవో వచ్చి 26 రోజులైనా ఆయన బాధ్యతలు చేపట్టకపోవడం వెనుక ఉన్న కారణం తెలియడం లేదు. జేసీ సేవలు అందుబాటులో లేకపోవడంతో జిల్లాలో ఆరు నెల లుగా పాలన కుంటుపడింది. తక్షణమే జేసీ నియమించాలని తాను ‘ఎక్స్’ వేదికగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని కోరాను. జిల్లా లో ప్రజలు తీవ్ర ఇబ్బందుల దృష్ట్యా స్థానిక ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకురావాలి. –కాండ్రేగుల వెంకటరమణ, ఆర్టీఐ, వినియోగదారుల రక్షణ చట్టాల ప్రభావితుల ఉద్యమకర్త -
ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం
మహారాణిపేట(విశాఖ): ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఉమ్మడి విశాఖ జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి, విజయనగరం జిల్లా సంఘం అధ్యక్షుడు సీహెచ్ మురళి ప్రకటించారు. ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా ఎస్.సత్తిబాబు(సూపరింటెండెంట్, పీఐయూ డివిజన్), ప్రధాన కార్యదర్శిగా డి.వి.సీతారామరాజు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎల్.పూర్ణయ్య ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఆర్వీ నాగరాజు, డి.వి.ఎస్ గౌరీపతిరావు, పి.శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలుగా పి.రామకృష్ణ, ఎం.వి. హెచ్.ఆర్.స్వామి, వై.రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా సుధారాణి, డి.వి.రమణారాజు, ఎస్.రవికుమార్, బి.వి.ఎస్.ఫణికుమార్, కోశాధికారిగా బి.అర్చన, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులుగా జి.గంగాధర్, ఎస్.త్రినాథ్, సీహెచ్ సింహాచలం, జి.ఎల్.నర్సింహారావులను ఎన్నుకున్నారు. సత్తిబాబు, సీతారామరాజు అధ్యక్ష, కార్యదర్శులుగా ఎన్నికవడం ఇది నాలుగోసారి. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు. ఈ ఎన్నికలకు పరిశీలకులుగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు నారాయణరావు, విజయనగరం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, సహాయ ఎన్నికల అధికారులుగా బి.హెచ్.వి.రమణబాబు, యు.కూర్మారావు వ్యవహరించారు. -
ఉక్కుపై కక్ష..ఈపీడీసీఎల్కు శిక్ష!
స్టీల్ప్లాంట్ బకాయిలతో డిస్కమ్కు దెబ్బసాక్షి, విశాఖపట్నం : ఆంధ్రుల హకై ్కన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా కేంద్రం కొనసాగిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవైపు స్టీల్ ప్లాంట్ను ఆర్థికంగా దెబ్బతీస్తూ, మరోవైపు ఉద్యోగుల తగ్గింపుతో ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నా చంద్రబాబు ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్లాంట్ నిలదొక్కుకునేలా సాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం.. కేంద్ర నిర్ణయాలకు తానా–తందానా అంటూ వ్యవహరించడంతో విశాఖ స్టీల్ ప్లాంట్కు విద్యుత్ సరఫరా చేసే ఏపీఈపీడీసీఎల్పై భారం పడింది. ప్లాంట్ నుంచి వందల కోట్ల రూపాయల బకాయిలు మొండిబకాయిలుగా మారడంతో కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ విడుదల చేసిన 13వ వార్షిక గ్రేడింగ్లో ఎప్పుడూ ‘ఏ’ గ్రేడ్లో ఉండే ఈపీడీసీఎల్ తొలిసారిగా ‘బీ’ గ్రేడ్కు పడిపోయింది. బకాయిల వసూలులో వెనుకబాటే కారణంగా యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడిందని కేంద్రం స్పష్టం చేయగా, ఇందులో ఈపీడీసీఎల్ తప్పేమీ లేకపోయినా శిక్ష మాత్రం అనుభవించాల్సి వచ్చిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెల్లింపులు జరుగుతాయా.. లేదా..? బిల్లు బకాయిల కోసం పలుమార్లు స్టీల్ ప్లాంట్తో, ప్రభుత్వంతో ఈపీడీసీఎల్ చర్చలు జరిపినా ఫలితం మాత్రం శూన్యంగానే మిగిలింది. డిస్కమ్ పనితీరు అద్భుతంగా ఉన్నా.. ప్లాంట్కు కనీసం విద్యుత్ బిల్లులు కట్టే స్తోమత లేకుండా చేసి, ఆ నెపాన్ని డిస్కమ్పై నెట్టి మొత్తానికి విశాఖ ఉక్కు ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పాలన సాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విశాఖ ఉక్కుకు గనుల కేటాయింపు చేయకపోవడం, వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వకపోవడం ద్వారా ప్లాంట్ను ఎండగడుతున్న కేంద్ర తీరుపై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహించడం వెనుక మర్మం ప్రజలకు అర్థమవుతోందనే వ్యాఖ్యలు ఉన్నాయి. బకాయిల వల్ల ఏపీ ఈపీడీసీఎల్కు వార్షిక నష్టం రూ.7,155 కోట్లకు చేరుకున్నా ప్రభుత్వం మొద్దునిద్రపోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే కేంద్రంలోని పెద్దల మెప్పుకోసమే చంద్రబాబు ప్రభుత్వం తాపత్రయపడుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంట్ నుంచి చెల్లింపులు జరుగుతాయా లేదా అన్న మీమాంసలో ఈపీడీసీఎల్ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. సమగ్ర కారణాలు వివరించి గ్రేడ్ మార్పు కోసం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసినట్లు ఈపీడీసీఎల్ అధికార వర్గాలు తెలిపాయి. మొత్తంగా ప్లాంట్పై ప్రభుత్వ వైఖరి ఈపీడీసీఎల్ ప్రతిష్టను దెబ్బతీసిందన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ప్లాంట్ బకాయిలే ప్రధాన కారణం..! విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఈపీడీసీఎల్కు రావాల్సిన విద్యుత్ బిల్లుల బకాయిలు కొండలా పేరుకుపోతున్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాంట్ విషయాన్ని పూర్తిగా విస్మరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటీకరణ కోసం కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వంతపాడుతూ విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే పనిలోనే ప్రభుత్వం నిమగ్నమైందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ బకాయిలపై గతంలో స్టీల్ ప్లాంట్కు ఈపీడీసీఎల్ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు వెనక్కి తీసుకోవాలని, బకాయిలపై దృష్టిసారిస్తామని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఈపీడీసీఎల్ అధికారులు మౌనం వహించారు. ఫలితంగా 2024 అక్టోబర్ నుంచి ఏడాది కాలంలోనే సుమారు రూ.550.40 కోట్ల మేర విద్యుత్ బిల్లులు బకాయిలుగా మారి డిస్కమ్ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీశాయి. సహకారమెక్కడ చంద్రబాబూ..? స్టీల్ ప్లాంట్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బిల్లుల చెల్లింపునకు ఎలాంటి సహకారం అందించకపోవడంతో ఈ భారం ఈపీడీసీఎల్ మెడకు చుట్టుకుంది. డిస్కమ్ పరిధిలో యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం ఏర్పడింది. ఒక యూనిట్ సగటు వ్యయం, సగటు రాబడి మధ్య వ్యత్యాసాన్ని విద్యుత్ శాఖ పరిభాషలో ఏసీఎస్–ఏఆర్ఆర్ గ్యాప్గా పేర్కొంటారు. ఇది 2023–24లో 0.36 శాతంతో అద్భుతంగా ఉండేది. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ బకాయిల కారణంగా ఈ వ్యత్యాసం ప్లస్ నుంచి మైనస్లోకి వెళ్లిపోయింది. 2024–25లో –0.09 శాతానికి పడిపోయింది. ఈ కారణంగా ఈపీడీసీఎల్ గ్రేడ్ మార్కులను భారీగా కోల్పోయింది. ఏపీ ఈపీడీసీఎల్ కేంద్రం విడుదల చేసిన 13వ వార్షిక గ్రేడింగ్ నివేదికలో ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్కు పడిపోయింది. గతంలో 65.12 మార్కులు సాధించిన డిస్కమ్, తాజాగా 50.46 మార్కులకు పరిమితమైంది. స్టీల్ ప్లాంట్ బకాయిలు సకాలంలో చెల్లించి ఉంటే ఈపీడీసీఎల్ 71.34 మార్కులు సాధించి ‘ఏ’ గ్రేడ్లోనే కొనసాగేది. ఏడాది కాలంలో రూ.550 కోట్ల విద్యుత్ బిల్లులు బకాయిల చెల్లింపులో ప్లాంట్కుసహకరించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఫలితంగా యూనిట్ సగటు వ్యయం–రాబడి మధ్య భారీ వ్యత్యాసం డిస్కమ్ పనితీరు సరిగా లేదంటూ తప్పుపట్టిన కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును నిర్వీర్యం చేసే కుట్రలో బలవుతున్న ఈపీడీసీఎల్ పలుమార్లు నివేదించినా పట్టించుకోని ప్రభుత్వం -
భక్తుల సౌకర్యమే తొలి లక్ష్యం
సింహాచలం : వరాహ లక్ష్మీనృసింహస్వామి దర్శనానికి వచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా తృప్తిగా దర్శనం చేసుకునేలా చూడడమే ప్రథమ ప్రాధాన్యత అని సింహాచలం దేవస్థానం నూతన ఈవో జె.వెంకటరావు తెలిపారు. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఆయన తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కప్పస్తంభాన్ని ఆలింగనం చేసి బేడామండపంలో ప్రదక్షిణ చేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాన్ని ఏఈవో తిరుమలేశ్వరరావు అందజేశారు. ఇన్చార్జి ఈవోగా పనిచేసిన ఎన్.సుజాత నుంచి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆలయ పవిత్రత, ఆస్తుల పరిరక్షణను రెండవ ప్రాధాన్యతగా తీసుకుంటానన్నారు. కలెక్టర్, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఆలయ ఆస్తులను కాపాడుతామని తెలిపారు. ఏప్రిల్ 20న జరిగే చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడం అత్యవసర ప్రాధాన్యతగా తీసుకుంటామని, రానున్న 50 రోజులు ఆ ఏర్పాట్లపైనే దృష్టి పెడతానన్నారు. దేవస్థానంలో లోపాలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సింహాచలం దేవస్థానం ఈవోగా వెంకటరావు బాధ్యతల స్వీకరణ -
ఏపీ పీఎస్ హెచ్ఎం ఫోరం జిల్లా అధ్యక్షునిగా కృష్ణమోహన్
అనకాపల్లి: ఏపీ పీఎస్ హెచ్ఎం ఫోరం జిల్లా నూతన కమిటీ అధ్యక్షునిగా వి.కృష్ణమోహన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక గాంధీనగరం సంయుక్త కాలేజీలో ఆదివారం ఈ ఎన్నిక నిర్వహించారు. కమిటీ గౌరవాధ్యక్షునిగా జి.వి.సన్యాసిరావు, ఉపాధ్యక్షులుగా పి.కనకరాజు, ఎం.వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శిగా కె.విజయలక్ష్మి, అదనపు కార్యదర్శిగా ఎం. నాయుడు, కార్యదర్శిగా ఎం.పట్టాభి, కోశాధికారిగా నిర్మలా రాణి, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎం.శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా రాజేశ్వరరావు, సన్యాసిరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వి.కృష్ణమోహన్ మాట్లాడుతూ జిల్లాలో ఏపీపీఎస్హెచ్ఎంలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. -
వరి కుప్పలకు నిప్పు పెట్టిన దుండగులు
కోటవురట్ల: పి.కె.పల్లిలో వరి కుప్పలకు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. గ్రామానికి చెందిన అల్లు శ్రీరామ్మూర్తి, తానారి నూకరాజులకు చెందిన రెండు వరి కుప్పలకు శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మంట పెట్టారు. రైతులు శనివారం ఉదయం పొలానికి వెళ్లేసరికి కుప్పలు దగ్ధమవుతూ కనిపించాయి. సమీప రైతులు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ రెండు కుప్పలను నూరిస్తే సుమారు 75 బస్తాల ధాన్యం అవుతాయని, కక్షపూరితంగానే మంట పెట్టారని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నేడో రేపో కుప్పలు నూర్చి ధాన్యాన్ని ఇంటికి పట్టుకెళ్లేందుకు చూస్తుండగా ఎవరో కావాలనే నిప్పు పెట్టారని వాపోయారు. చేతికి ఫలసాయం రాకుండా కక్ష కట్టారని ఆరోపించారు. బాధిత రైతులు పోలీసు స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్. సత్యనారాయణరాజు రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం రాజకీయ కక్షలతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తకు చెందిన కారు అద్దాలను ధ్వంసం చేశారని గుర్తు చేశారు. ఇటువంటి చర్యలు పగలను పెంచుతాయని, పల్లెల్లో అంతా రాజకీయాలకు అతీతంగా ఐకమత్యంగా మెలగాలన్నారు. పోలీసులు దర్యాప్తు చేసి దుండగులను కఠినంగా శిక్షించాలని కోరారు. -
‘శిఖర్ సే సాగర్ తక్’ స్ఫూర్తిదాయకం
ఏయూక్యాంపస్: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఎస్ఎస్ఓ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత, అవగాహన కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. రెండు రోజుల కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం బీచ్ రోడ్లోని జోడుగుళ్లపాలెం, కై లాసగిరి రోప్వే వద్ద 5, 10 కిలోమీటర్ల స్వచ్ఛత రన్, 3 కిలోమీటర్ల స్వచ్ఛత వాక్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్లో సైకత శిల్పాల తయారీ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్లు పి.నల్లనయ్య, డీవీ రమణమూర్తి, సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, మాజీ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్.పి.సింగ్ తదితరులతో కలిసి ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్లు మాట్లాడుతూ హిమాలయాల నుంచి సముద్రాల వరకు పరిశుభ్రతపై సులభ్ ఇంటర్నేషనల్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాయన్నారు. సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు నాలుగు దశలుగా నిర్వహిస్తామని, విశాఖలో మొదటి దశ విజయవంతంగా ప్రారంభమైందన్నారు. కార్యక్రమం ముగింపులో స్వచ్ఛత రన్, వాక్, సైకత శిల్పాలు, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి. నరేష్కుమార్, జోనల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు. -
మంత్రులపైనా పీడీయాక్టు ఎందుకు పెట్టలేదు
అనకాపల్లి: హోం మంత్రి అనితపైనా 32 కేసులు, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్పైనా 37 కేసులున్నా పీడీ యాక్టు ఎందుకు ప్రయోగించడం లేదని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలరాజుపై 19 కేసులున్నాయని పీడీ యాక్టు ప్రయోగించినా చివరికి ప్రజా పోరాటమే గెలిచిందని విమర్శించారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్.రాయవరం మండలంలో బల్క్డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న మత్స్యకారులకు మద్దతు పలికినందుకు అప్పలరాజును అన్యాయంగా నిర్బంధించి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారన్నారు. గత నెల 30న అడ్వైజరీ కమిటీ బోర్డు మీటింగులో పోలీసులు పెట్టిన తప్పుడు కేసులుపై సమీక్షించి పీడీ చట్టాన్ని రద్దు చేసి శుక్రవారం విడుదల చేశారన్నారు. ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా పీడీ యాక్టు కింద 43 రోజులు జైలులో నిర్బంధించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అప్పలరాజును జైలులో పెట్టినా ఉద్యమాలు ఆగలేదన్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత ప్రజలకు సమాధానం చెప్పుకోలేమని భావించి విడుదల చేశారన్నారు. గతంలో రసాయన కంపెనీలు పెట్టకూడదని చెప్పిన అనిత అధికారంలోకి వచ్చిన తర్వాత మరోవిధంగా మాట్లాడడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
డీసీసీబీలో చోరీకి విఫల యత్నం
సీసీ పుటేజీ దృశ్యాలను పరిశీలిస్తున్న చోడవరం సిఐ పి. అప్పలరాజు తదితర్లుదుండగులు తొలగించిన కిటికీని పరిశీలిస్తున్న ఎస్ఐ వి. సత్యనారాయణ. దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు యువకులు చోరీకి విఫలయత్నం చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్కు ఆనుకుని ఉన్న డీసీసీబీలో బ్యాంకు మేనేజర్ గది వెనుక భాగంలో కిటికీని తొలగించి లోనికి చొరబడి చోరీకి యత్నించారు. వారికి నగదు, బంగారం లభించకపోవడంతో వెనుదిరిగారు. ప్రతీ రోజు మాదిరిగా శనివారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది బ్యాంకు మేనేజర్ గది వెనుక భాగంలో కిటికీ తొలగించి ఉండటాన్ని గుర్తించి తక్షణమే బ్యాంకు మేనేజర్ పూర్ణచంద్రరావు సమాచారం అందించారు. ఆయన తమ ఉన్నతాధికారులతో పాటు స్థానిక ఎస్ఐ వి. సత్యనారాయణకు సమాచారం అందించారు. ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విశాఖ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ బ్యాంకులో లాకర్, కిటికీ తొలగించిన ప్రదేశాల్లో దుండగుల వేలి ముద్రలు ఇతర ఆధారాలను సేకరించింది. బ్యాంక్లోని సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దుండగులు బ్యాంకులోకి చొరబడిన విధానాన్ని చోడవరం సీఐ పి. అప్పలరాజు, ఎస్ఐలు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ తదితర్లు పరిశీలించారు. అనంతరం స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు వెనుక భాగంలోని ఇనుప కిటికీని తొలగించారని చెప్పారు. ఒక వ్యక్తి బ్యాంకులోకి చొరబడగా మరో వ్యక్తి వెనుక వైపు కాపలా ఉన్నట్టు తెలిపారు. లోపల దొంగతనం చేసేందుకు ప్రయత్నించినా ఎక్కడా అవకాశం లేక పోవడంతో వెనుదిరిగాడన్నారు. ఈ చోరీ ఘటనకు సంబంధించి కొందరు అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. బ్యాంకు వెనుక భాగంలో ఉన్న కిటికీ తుప్పు పట్టి ఉందని, వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని, బ్యాంక్లో ఆగిపోయిన అలారం మోగే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకు మేనేజర్ పూర్ణచంద్రరావుకు పోలీసులు సూచించారు. బ్యాంకులో నగదు, బంగారు అభరణాలు భద్రంగా ఉన్నాయని, పోలీసు, బ్యాంకు అధికారులు నిర్ధారించారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దుండగుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే కేసును చేధిస్తామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణతో పాటు ఎ. కోడూరు ఎస్ఐ డి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సీసీ టీవీ ద్వారా సేకరించిన దుండగుల ఫొటోలు -
లారీ ఢీకొని తాపీమేస్త్రి మృతి
కశింకోట: స్థానిక కూడలి వద్ద జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తాపీమేస్త్రి మృతి చెందాడు. ఎస్సై లక్ష్మణరావు అందించిన వివరాలు ప్రకారం.. మండలంలోని తేగాడ గ్రామానికి చెందిన నానుబిల్లి నరసింగరావు(65) మోపెడు వాహనంపై తమ గ్రామం నుంచి వస్తూ కసింకోట కూడలి వద్ద మలుపులో రోడ్డు దాటుతుండగా, అదే మార్గంలో లారీ వచ్చి ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన నరసింగరావును అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
దివ్యాంగ బాలలను ప్రోత్సహించాలి
అనకాపల్లి: దివ్యాంగ బాలలను ప్రోత్సహించి, వారిలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. స్థానిక గుండాల జంక్షన్ ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ బాలబాలికలకు జిల్లాస్థాయి ఆర్ట్, కల్చరల్ పోటీలను శనివారం నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించి, సరైన దిశలో ప్రొత్సహించినట్టయితే వారిలో ప్రతిభను వెలికితీయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణం నాయుడు, మండల విద్యాశాఖాధికారి కోటేశ్వరరావు, వివిధ మండలాల దివ్యాంగ బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
డిగ్రీ అధ్యాపకుడికి ప్రశంస
మాడుగుల: స్థానిక డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకుడు పులపర్తి పైడిరాజు మహాభారతంలోని భీష్మపర్వంపై ఉపన్యాసించి ప్రశంసలందుకున్నారు. నెల్లూరుకు చెందిన ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, మైసూరుకు చెందిన జాతీయ తెలుగు భాషా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడ మారిస్ స్టెల్లా కళాశాలలో ఈ నెల 5, 6వ తేదీల్లో జాతీయ తెలుగు భాషా సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో భారతీయ జ్ఞాన పరంపర, తెలుగు సాహిత్యం అనే అంశంపై ఆయన ఉపన్యాసించారు. ఈ మేరకు ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం, డైరెక్టర్ ప్రశంసాపత్రం అందజేసి ఘనంగా సత్కరించారు. శనివారం స్థానిక డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ శాస్త్రి, అధ్యాపకులు, విద్యార్థులు పైడిరాజును అభినందించారు. -
క్షేత్రస్థాయిలో కొరవడిన నిఘా
యలమంచిలి దిమిలిరోడ్డు కూడలి వద్ద దుకాణం నుంచి తెస్తున్న చికెన్ వ్యర్థాలు చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా,వాటిని చే పలకు మేతగా ఉపయోగించడాన్ని సీరియస్గా పరిగణించిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గత మార్చి నెలాఖరులో రాష్ట్రవ్యాప్తంగా మెరుపుదాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో కోళ్ల వ్యర్థాల వాహనాలపై నిఘా పెట్టాలని డీజీపీ ఆదేశించినా క్షేత్రస్థాయిలో కనీస స్పందన కనిపించడంలేదు. తూతూ మంత్రంగా దాడులు జరుపుతున్నారు. నెలరోజుల క్రితం అనకాపల్లిలో పోలీసులు దాడులు జరిపి చికెన్ తరలిస్తున్న కొన్ని వాహనాలను పట్టుకున్నారు. విలేకరులు ఎవరైనా చికెన్ వ్యర్థాల వాహనాలను ఆపి ఫొటోలు తీయాలన్నా అక్రమార్కులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు.మా వాహనాలను అక్రమంగా ఆపుతున్నారంటూ మీడియా ప్రతినిధులపైనే ఫిర్యాదు చేసి,పోలీసుల సహకారంతో అక్రమ కేసులు సైతం బనాయిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్కు ఘన స్వాగతం
కశింకోటలో వందేమాతరం సైకిల్ ర్యాలీకి స్వాగతం పలుకుతున్న పోలీసులు, యువత కశింకోట: కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) ఆధ్వర్యంలో చేపట్టిన ‘వందేమాతరం కోస్టల్ సైక్లోథాన్ – 2026’సైకిల్ యాత్రకు స్థానిక పోలీసులు శనివారం ఘనంగా స్వాగతం పలికారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఐఎస్ఎఫ్ పోలీసులు సైకిల్ యాత్రను చేపట్టారు. అది ఇక్కడకు చేరడంతో సీఐ అల్లు స్వామి నాయుడు ఆధ్వర్యంలో పోలీసులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. మత్తు రహిత సమా జ నిర్మాణానికి దోహద పడాలన్నారు.ఎస్ఐలు లక్ష్మణరావు, మనోజ్ కుమార్, సిబ్బంది, స్థానిక యువకులు ర్యాలీకి స్వాగతం పిలాకారు. -
సీపీఎస్ రద్దు కోరుతూ వచ్చేనెల 1న నిరసన
అనకాపల్లి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ మార్చి ఒకటో తేదీన విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సీపీఎస్ ఎంపాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఉమామహేశ్వరరావు తెలిపారు. స్థానిక విజయరామరాజుపేట వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో సాగర ఘోష పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అధికారం చేపట్టిన వెంటనే సీపీఎస్ విధానాన్ని రద్దుచేస్తామని మెరుగైన పెన్షన్ అమలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారం చేపట్టి రెండు సంవత్సరాలు అవుతున్న ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు మళ్ల ఉమామహేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.కృష్ణ్ణమోహన్, సభ్యులు గణేష్, ఆనంద్, పల్లా బాబ్జి, రామచంద్రరావు, జి.అర్జున్ పాల్గొన్నారు. -
విద్యార్థులను సన్నద్ధం చేసేందుకే ప్రేరణ తరగతులు
మాట్లాడుతున్న రామనాథం నర్సీపట్నం: పదవ తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడమే ప్రేరణ తరగతుల ము ఖ్య ఉద్దేశమని సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకుడు రామనాథం తెలిపారు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పట్టణంలోని బాలికల వసతిగృహంలో ప్రేరణ తరగతులు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. టెన్త్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. పదవ తరగతి విద్యా ర్థుల భవిష్యత్తుకు తొలిమెట్టని, దానిని అధిగమించి ఉన్నతవిద్యలో రాణించాలన్నారు. ఏమై నా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలన్నారు. సహాయ సాంఘిక సంక్షేమశాఖ అధికారి బాబూరావు పాల్గొన్నారు. -
కాపులను అంతమొందించడమే చంద్రబాబు అంతిమ లక్ష్యం
నక్కపల్లి/ పాయకరావుపేట: కాపులను అంతమొందించడమే చంద్రబాబు అంతిమ లక్ష్యమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. మాజీ మంత్రి కాపునేత అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు గుంటూరు వెళ్తూ పాయకరావుపేట సమీపంలో పి.ఎల్.పురం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా కాపులను అణగదొక్కడం, తనకు ఎదురు తిరిగిన కాపునేతలను అంతమొందించడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో కాపు నాయకుడు వంగవీటి మోహన్రంగా నుంచి ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబులపై జరిగిన దాడులను బట్టి చంద్రబాబు వైఖరి అర్థమవుతోందని చెప్పారు. కాపులు రాజకీయంగా ఎదగడాన్ని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీతోపాటు, టీడీపీ,జనసేనల్లో చేరిన కాపునాయకులను సహితం చంద్రబాబు నాయుడు అండ్కో తీవ్ర ఇబ్బందులు పెడుతోందని తెలిపారు. కక్షసాధింపు చర్యలు, భౌతిక దాడులకు పాల్పడటం, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. నాడు రంగాను ఎలా అడ్డుతొలగించుకున్నారో అలాగే ముద్రగడ పద్మనాభాన్ని కూడా అడ్డుతొలగించుకోవాలని ప్రయత్నం చేశారన్నారు. తాజాగా మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై కూడా ఇదేరకమైన దాడులు చేశారని ఆరోపించారు. అంబటి ఇంటిని తగల బెట్టడంతోపాటు, ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు. కాపులు ఏ పార్టీలో ఉన్నా తనకు ఎప్పటికై నా ప్రమాదమని గ్రహించిన చంద్రబాబు వారిని అంతమొందించే కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని సీబీఐ నిర్ధారిస్తూ సుప్రీంకోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయడాన్ని చంద్రబాబు ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని చెప్పారు. తిరుమల లడ్డూ విషయంలో కూటమినాయకులుచేసింది తప్పుడు ప్రచారమని రుజువైందన్నారు.తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని చెప్పారు. విశాఖలో గీతం విద్యాసంస్థలకు రూ.వేలకోట్ల విలువైన భూములు అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.ఈ రెండు విషయాలనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అంబటి రాంబాబు, జోగిరమేష్ల ఇళ్లపై దాడులకు పాల్పడి, డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారని తెలిపారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ప్రశ్నించే వారిపై కక్ష కడుతున్నారన్నారు.అధికారం శాశ్వతం కాదని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. రాజకీయ దాడులకు గురైన అంబటి కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలిచేందుకే ఉమ్మడి విశాఖజిల్లా నుంచి కాపులంతా గుంటూరు తరలి వెళ్తున్నట్టు తెలిపారు. పార్టీ రాష్ట్రకార్యదర్శి చిక్కాల రామారావు మాట్లాడుతూ అంబటి రాంబాబుపై భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు. ముద్రగడ, అంబటి రాంబాబు ఇలా కాపునాయకులందరినీ చంద్రబాబు టార్గెట్ చేశారన్నారు. రాష్ట్రంలో కాపులు బతికే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. కాపులను రోడ్డుమీదకు రాకుండా చేయడమే చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఈసమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాలజోగులు,చింత లపూడి వెంకటరామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, అధికారప్రతినిధి దగ్డుపల్లిసాయిబాబా, స్థానిక నాయకులు ధనిశెట్టి బాబూరావు, ధనిశెట్టిబాబి, గెడ్డమూరి శ్రీనివాస్,జగతాశ్రీనివాస్,సూరాకాసుల గోవిందు తదితరులు పాల్గొన్నారు. గుంటూరుకు పలువురు నాయకులు నక్కపల్లి,పాయకరావుపేటల నుంచి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావుల ఆధ్వర్యంలో పలు వాహనాల్లో వైఎస్సార్సీపీ నాయకులు గుంటూరు బయలుదేరారు. వెళ్లిన వారిలో వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగ ఈశ్వరరావు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరాకాసుల గోవింద్, పార్టీ అధికార ప్రతినిధి దగ్డుపల్లిసాయిబాబా, పార్టీ మండల అధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాసరావు, పట్టణశాఖ అధ్యక్షుడు దనిశెట్టి బా బీ, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు. -
కంపెనీలకు భూములివ్వం
బుచ్చెయ్యపేట: కంపెనీల ఏర్పాటుకు మా భూములిచ్చేదిలేదంటూ మండలంలోని శివారు పంచాయతీలైన ఆర్.భీమవరం, మల్లాం, ఆర్.శివరాంపురం ప్రజలు ఖరాఖండీగా చెబుతూ, అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. గతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములివ్వబోమని రైతులు తేల్చి చెప్పడంతో అప్పట్లో సర్వే ఆగిపోయింది. మళ్లీ పై గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూముల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీఐఐసీ కోసం భూములు సేకరించేందుకు శనివారం తహసీల్దార్ లక్ష్మి,ఎస్ఐ శ్రీనివాసరావులు పోలీసు బందోబస్తుతో గ్రామ సభలు ఏర్పాటు చేశారు.దీంతో ఆగ్రహించిన ఆయా గ్రామాల ప్రజలు గ్రామ సభలు జరగకుండా అడ్డుకున్నారు. మేం సంతకాలు చేయం,మా భూములివ్వబోమని తేల్చి చెప్పేశారు. అయితే తహసీల్దార్ లక్ష్మి మాత్రం పరిశ్రమల కోసం కాదు మీ భూ సమస్యలు తీర్చడానికి వచ్చాం, అందుకే గ్రామ సభలు పెట్టామని ఆర్.భీమవరం సభలో తెలిపారు. దీంతో అక్కడున్న నాయకులు బల్లిన అమ్మునాయుడు,గొల్లవిల్లి సత్యనారాయణ,సేనాపతి నాయుడు,బల్లిన రమణాజీ,ఈశ్వరరావు,మేడిశెట్టి పడమటయ్య తదితర్లు తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఐఐసీకీ భూములివ్వడానికి గ్రామ సభ పెడుతున్నట్టు తీర్మానం పుస్తకంలో నమోదు చేసి ఉండగా, రైతుల భూ సమస్యలు తీర్చడానికి గ్రామ సభ పెట్టామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. గ్రామస్తులు సభ నుంచి లేచి ఆందోళన చేయడంతో అధికార్లు వెనుదిరిగారు. మల్లాం,ఆర్.శివరాంపురం సర్పంచ్లు బర్ల శివ,నమ్మి నీరజ అప్పలరాజు, గ్రామస్తులు భూములివ్వబోమని ఆందోళన చేశారు. -
కోళ్ల వ్యర్థాలతో కొందరు చేస్తున్న అక్రమ వ్యాపారం ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తోంది.కోళ్ల వ్యర్థాలను వ్యాన్ల ద్వారా తరలించి జిల్లాతో పాటు పక్క జిల్లాల్లో చెరువుల్లో పెంచే చేపలకు మేతగా వేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వ్యర్థాలను తినే ఆ చే
– యలమంచిలి రూరల్: ● యథేచ్ఛగా అక్రమరవాణా ● చేపలకు మేతగా చికెన్ వ్యర్థాలు ● ఆ చేపలు తింటే అనారోగ్యమని హెచ్చరిస్తున్న వైద్యులు చికెన్ వ్యర్థాలతో కాసుల వేటసాధారణంగా చేపలు కిలోకి పైగా బరువు పెరిగేందుకు దాదాపు ఆర్నెళ్ల నుంచి ఎనిమిది నెలల సమయం పడుతుంది. రైతుల నుంచి కిలో బరువున్న చేపలను రూ.80 నుంచి రూ.90కు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.దీంతో చేపల పెంపకంలో నష్టాలే ఎక్కువగా వస్తున్నాయి.అదే మేతగా బ్రాండెడ్ ఫీడ్కు బదులుగా అతి తక్కువ ఖర్చుతో కూడిన కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తే నాలుగు నెలలకే కిలో బరువు పెరుగుతున్నాయి.కిలో కోళ్ల వ్యర్థాలు రూ.18 నుంచి రూ.25కే చేపల చెరువుల నిర్వాహకులకు లభిస్తున్నాయి. దీంతో జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో చేపల చెరువుల నిర్వాహకులు కోడిమాంసం వ్యర్థాలనే కొనుగోలు చేస్తుండడంతో ఈ వ్యాపారం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. జిల్లాలో ఒక్క దేవరాపల్లి మండలంలో 111 అధికారిక చేపల చెరువులున్నాయి. అనధికారికంగా మరో 50 వరకు ఉన్నాయి. చెరువుల్లో పెంచే చేపలకు తవుడు,మత్స్యశాఖ అధికారులు సూచించిన ఫీడ్ మాత్రమే మేతగా వేయాలి. వీటికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోందని చెరువుల పెంపకందారులు కోళ్ల వ్యర్థాలను వినియోగిస్తున్నారు. నెలనెలా భారీగా మామూళ్లు అక్రమ రవాణాపై 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినా,నిత్యం ప్రత్యేక వాహనాలతో వందలాది డ్రమ్ముల కోళ్ల వ్యర్థాలను వ్యాపారులు యథేచ్ఛగా తరలిస్తున్నారు.ఈ వాహనాలను టోల్గేట్లు దాటే సమయంలో, జాతీయ రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు హైవే పెట్రోలింగ్ పోలీసులు, పంచాయతీలు, మున్సిపాలిటీల్లో అధికారులు కట్టడి చేసే అవకాశం ఉంది. అయినా పోలీసులు, మత్స్యశాఖ, రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.ఒక్కో వాహనానికి నెలవారీగా ఆయా శాఖల అధికారులకు భారీగా మామూళ్లను ముట్టజెబుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ రకంగా కోళ్ల వ్యర్థాలను రవాణా చేసే వాహనాల సంఖ్య ఆధారంగా నెలకు లక్షల్లో అధికారులకు అక్రమ ఆదాయం అందుతోందని సమాచారం.అందుకే వీటిని ఆపేందుకు ఎవరూ ఇష్టపడడం లేదన్న ఆరోపణలున్నాయి. రూ.లక్షల్లో ఆదాయం జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సుమారుగా 2వేలకు పైగా కోడి మాంసం విక్రయ కేంద్రాలున్నాయి. నిత్యం 60 టన్నుల కోళ్లు, ఆదివారం ఒక్కరోజే 100 నుంచి 120 టన్నుల కోళ్లను చికెన్ షాపుల నిర్వాహకులు దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతి నెలా సుమారు రెండు వేల టన్నుల వరకు కోళ్లు దిగుమతి అవుతున్నాయి. చికెన్ షాపుల్లో మాంసం విక్రయించగా మిగతా చర్మం,పేగులు,కాళ్లు,ఇతర వ్యర్థాలను షాపుల నిర్వాహకుల దగ్గర్నుంచి కిలో రూ.3 నుంచి రూ.5 వరకు కొందరు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పెద్ద షాపుల నిర్వాహకుల నుంచి వ్యర్థాలను కొనుగోలు చేస్తుండగా,చిన్న దుకాణాల నిర్వాహకులు ఉచితంగానే అందజేస్తున్నారు.ఇలా సేకరించిన చికెన్ వ్యర్థాలను అనకాపల్లి జిల్లాలోని పలు ప్రాంతాల్లోగల చేపల చెరువుల వ్యాపారులతో పాటు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లోని చేపల చెరువుల వ్యాపారులకు కిలో రూ.15 నుంచి రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు.కొందరు చేపల చెరువుల వ్యాపారులే నేరుగా డ్రైవర్లు,సహాయకులను నియమించుకుని చికెన్ వ్యర్థాలను తరలించుకుపోతున్నారు.ఒక కిలో కోడి మాంసం నుంచి సుమారు 250 నుంచి 300 గ్రాముల చికెన్ వ్యర్థాలు వస్తాయి. జిల్లాలో ప్రతి నెలా 2వేల టన్నుల లైవ్ కోళ్లను దిగుమతి చేసుకుంటున్నారు.వీటి ద్వారా 600 టన్నుల వరకు వ్యర్థాలు వస్తున్నాయి. వ్యాపారులు ఒకసారి వాహనంతో 9 డ్రమ్ముల వ్యర్థాలు తీసుకెళ్తున్నారు.ఒక్కో డ్రమ్ములో 150 నుంచి 200 కిలోల వరకు చికెన్ వ్యర్థాలు ఉంటున్నాయి.ఒకసారి వాహనంతో చికెన్ వ్యర్థాలు తీసుకెళ్తే ఆ వ్యాపారికి అన్ని ఖర్చులూ మినహాయించి రూ.18వేల నుంచి రూ.20వేల వరకు ఆదాయం వస్తోంది.ఈ లెక్కన నెలకు రవాణా అవుతున్న 2వేల టన్నుల చికెన్ వ్యర్థాలతో సుమారుగా రూ.60 లక్షల వరకు ఆదాయాన్ని కొందరు జేబుల్లో వేసుకుంటున్నారు. చర్యలు తీసుకుంటాం చికెన్ వ్యర్థాల అక్రమ రవాణాపై నిఘా పెడతాం.వాటిని తరలించే వారిపై చర్యలు తీసుకుంటాం.త్వరలోనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా చేసే వాహనాలను తనిఖీ చేస్తాం.చికెన్ వ్యర్థాల రవాణా,నిర్వహణ విషయంలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలి.దీనికి సంబంధించి ఎవరైనా ఫిర్యాదు గానీ సమాచారం గానీ ఇవ్వవచ్చు. – కె.వరహాలు, తహసీల్దార్, యలమంచిలి ఆరోగ్యానికి చేటు చికెన్ వ్యర్థాలను ఆహారంగా తీసుకున్న చేపలను తింటే ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది.ఈ చేపల ద్వారా ఈకోలి బాక్టీరియా శరీరంలోకి చేరి జీర్ణకోశ వ్యాధులు,డయేరియా,కోళ్లకు ఉండే ఫ్లూ మనుషులకు సంక్రమించడం,టైఫాయిడ్ జ్వరం బారిన పడడం జరుగుతుంది.అలాంటి చేపల విషయంలో జాగ్రత్త వహించాలి.వీలైనంత వరకు వాటిని తినకపోవడమే మంచిది. – డాక్టర్ నిహారిక, వైద్యాధికారి, యలమంచిలి సీహెచ్సీ -
దుమ్మురేపిన రైడర్లు
ఉత్కంఠగా సాగిన నేషనల్ బైక్ రేసింగ్విశాఖ స్పోర్ట్స్: జీవీఎంసీ ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా శనివారం రాత్రి నేషనల్ సూపర్ క్రాస్ చాంపియన్షిప్ ఉత్కంఠగా సాగింది. ఎంఆర్ఎఫ్ మోగ్రిప్–ఎఫ్ఎంఎస్సీఐ ఆధ్వర్యంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల చరిత్రలో తొలిసారిగా జరిగిన ఈ సీజన్ కై ్లమాక్స్ మోటార్ స్పోర్ట్స్ ప్రేమికులను మంత్రముగ్ధులను చేసింది. రాష్ట్ర క్రీడలు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈ పోటీలను జెండా ఊపి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖలో ఇలాంటి జాతీయ స్థాయి సాహస క్రీడలు నిర్వహించడం నగర ప్రతిష్టను పెంచుతుందని, యువతకు ఇదొక మంచి స్ఫూర్తి అని పేర్కొన్నారు. హోరాహోరీగా సాగిన రేస్ ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా వచ్చిన సుమారు 120 మంది రేసర్లు పాల్గొని 9 విభిన్న విభాగాల్లో(క్లాస్ల్లో) పోటీపడ్డారు. సాధారణ మోటోక్రాస్ మాదిరిగా కాకుండా, స్టేడియంలో ప్రత్యేకంగా రూపొందించిన సూపర్క్రాస్ ట్రాక్పై ఈ రేస్ సాగింది. టైట్ టర్న్లు, రిథమ్ సెక్షన్స్, ఎత్తైన టెక్నికల్ జంప్లతో కూడిన ఈ ట్రాక్పై రైడర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఫ్లడ్లైట్ల వెలుతురులో, దుమ్ము రేపుతూ బైకులు గాలిలో ఎగురుతూ చేసిన విన్యాసాలు క్రీడాభిమానులను ఉర్రూతలూగించాయి. గ్రాండ్ ఫినాలే విజేతలు సీజన్ పొడవునా పాయింట్లు సాధించి ఫైనల్స్కు చేరిన రైడర్లు ఇక్కడ తమ సత్తా చాటారు: ఎస్ఎక్స్1 ప్రీమియర్ కేటగిరీలో శ్లోక్, ప్రజ్వల్, ఇక్షన్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. ఎస్ఎక్స్2 విభాగంలో ర్యాన్, జాబీ, సుహైల్లు తమ బైకులతో మెరుపులు మెరిపించారు. ఇండియన్ ఎక్స్పర్ట్స్, జూనియర్ క్లాస్లో ఇమ్రాన్, జినేంద్ర, షిండే. చైతన్య వంటి రైడర్లు అద్భుత ప్రదర్శన ఇచ్చారు. ఎస్ఎక్స్1 ఫారిన్ ఓపెన్ క్లాస్ రేస్లోనూ తీవ్ర పోటీ జరిగింది. నిర్వాహకులు ఈ పోటీలకు ఉచిత ప్రవేశం కల్పించడంతో విశాఖ వాసులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. ఇంజిన్ల మోత, అభిమానుల కేరింతల మధ్య పోటీలు ఉత్సాహంగా సాగాయి. గాల్లో బైకర్ స్టంట్ -
వలస కూలీ ఇంట్లో చోరీ
● తురకపూడిలో ఘటనఇంటిని పరిశీలిస్తున్న ఎస్ఐ శ్రీనివాస్ బుచ్చెయ్యపేట: మండలంలో తురకపూడి గ్రామంలో వలస కూలీ ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. గ్రామానికి చెఽందిన తోకల రాము పొట్టకూటి కోసం చైన్నె వెళ్లి కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తన ఇంటికి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉంది. రాము ఇంటి లోపలికి వెళ్లి చూడగా, బీరువాలో దాచుకున్న 2 తులాల బంగారు తాడు, 30 తులాల వెండి పట్టీలు చోరీ అయినట్లు గుర్తించాడు. దీనిపై బుచ్చెయ్యపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో విచారణ చేపట్టారు. -
చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
రోలుగుంట: చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు డైవర్షన్ పాలిటిక్స్ను ప్రజల్లోకి తెసుకువెళ్లాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీలు వైఎస్సార్సీపీ నాయకులకు సూచించారు. మండలం కేంద్రం రోలుగుంటలో నిర్వహిస్తున్న గౌరీపరమేశ్వర ఉత్సవాల్లో వారు శుక్రవారం పాల్గొని, ఉత్సవమూర్తులను దర్శించుకున్నారు. అనంతరం జెడ్పీటీసీ పోతల లక్ష్మీ రమణమ్మ ఇంటిలో ఆతిథ్యం స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు, బీసీ సెల్ రాష్ట్ర ప్రతినిధి పోతల లక్షీశ్రీనివాసరావు, పార్టీ నాయకులు పోతల రాజశేఖర్, ఎంపీటీసీ వడ్డాది సతీష్, మాజీ సర్పంచ్లు బంటుసూర్య సన్యాసి దేముళ్లు, పరవాడ చిన్ని, స్థానిక మాజీ ఉప సర్పంచ్ తాతబాబు, యువ కార్యకర్తలు మడ్డు శివ, పిల్లి శ్రీను, కాళ్ల నాయుడు మహిళా విభాగం యువ కార్యకర్త దీప్తి తదితరులు పాల్గొన్నారు. -
యాత్రకు వెళ్తుండగా విషాదం
● అతివేగమే ప్రాణం తీసింది ● కారు నడిపిన వ్యక్తి దుర్మరణంనుజ్జయిన కారు ముందు భాగంఆరిలోవ : బీఆర్టీఎస్ రోడ్డులో శుక్రవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. కాకినాడకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన బంధువులు శ్రీకాకుళం జిల్లాలోని రాజులమ్మ యాత్రకు వెళ్తూ మార్గమధ్యలో సింహాచలం అప్పన్నను దర్శించుకున్నారు. అనంతరం రాత్రి 7 గంటల సమయంలో సింహాచలం నుంచి హనుమంతవాక మీదుగా ప్రయాణిస్తుండగా, బీఆర్టీఎస్ మధ్య లైన్లో మితిమీరిన వేగంతో వెళ్తున్న వీరి కారు ఎదురుగా వస్తున్న 68 నంబర్ సిటీ బస్సును బలంగా ఢీకొంది. ప్రమాదంలో కారు నడుపుతున్న బంగారు రాజేష్ (37) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ఉన్న నలుగురు మహిళలు, ఇద్దరు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. బస్సు ముందు భాగం కూడా ధ్వంసమవడంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హెల్త్ సిటీ ఆస్పత్రికి, మృతదేహాన్ని కేజీహెచ్ మార్చురీకి తరలించారు. కేవలం బస్సులు, వీఐపీ వాహనాలకు కేటాయించిన మధ్య లైన్లోకి కారు అతివేగంగా రావడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించి కేసు నమోదు చేశారు. -
రంజీ సమరంలో విశాఖ కుర్రాళ్ల జోరు
భరత్నితీష్శశికాంత్విశాఖ స్పోర్ట్స్ : కల్యాణ్ వేదికగా బెంగాల్తో జరుగుతున్న రంజీ ట్రోఫీ నాకౌట్ పోరులో ఆంధ్ర జట్టు తొలి రోజే తన ఆధిపత్యాన్ని చాటుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగినా, విశాఖ కుర్రాళ్లు పట్టుదలతో రాణించడంతో ఆంధ్ర గౌరవప్రదమైన స్థితికి చేరుకుంది. ముఖ్యంగా జట్టు కెప్టెన్ రికీ భుయ్ తన ఫామ్ను కొనసాగిస్తూ 83 పరుగులతో (8 ఫోర్లు, 2 సిక్సర్లు) జట్టును ముందుండి నడిపించాడు. లీగ్ దశలోనే పదివేల పరుగుల మైలురాయిని అందుకున్న రికీ, ఈ కీలక మ్యాచ్లోనూ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్గా బరిలోకి దిగిన వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీకర్ భరత్ అర్ధ సెంచరీకి చేరువగా వచ్చి 47 పరుగుల వద్ద రెండో వికెట్గా వెనుదిరిగినప్పటికీ, జట్టుకు మంచి పునాది వేశాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డితో కలిసి రికీ భుయ్ ఐదో వికెట్కు ఏకంగా 108 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి బెంగాల్ బౌలర్లకు చుక్కలు చూపించారు. 33 పరుగులు చేసిన నితీష్ కుమార్, ముకేశ్ బౌలింగ్లో అవుట్ కావడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర ఆరు వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. క్రీజులో ప్రస్తుతం శశికాంత్ ఏడు పరుగులతో నిలకడగా ఆడుతున్నాడు. గత రికార్డులను పరిశీలిస్తే బెంగాల్పై ఆంధ్ర జట్టుకే పైచేయి కనిపిస్తోంది. ఇప్పటివరకు తలపడిన ఐదు మ్యాచ్లలో ఆంధ్ర రెండుసార్లు విజయం సాధించగా, మిగిలిన మూడు మ్యాచ్లు డ్రా అయ్యాయి. బెంగాల్పై రికీ భుయ్ వ్యక్తిగత అత్యధిక స్కోరు 175 పరుగులు కాగా, బౌలింగ్లో శశికాంత్ 55 పరుగులకే 5 వికెట్లు తీసి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. బెంగాల్ పేసర్ షమీ బౌలింగ్ను ఎదుర్కొంటూ మిగిలిన రోజుల్లో ఆంధ్ర బ్యాటర్లు భారీ స్కోరు సాధిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. రికీ,నితీష్ సెంచరీ భాగస్వామ్యం -
సైక్లోథాన్ జాతీయ ఉద్యమంగా అవతరణ
● సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శరవణన్ మహారాణిపేట: సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘వందేమాతరం సైక్లోథాన్–2026’ కార్యక్రమం దేశవ్యాప్తంగా జాతీయ భద్రత, తీరప్రాంత రక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించే శక్తివంతమైన ఉద్యమంగా మారిందని సీఐఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ జనరల్ శరవణన్ అన్నారు. ఈ కార్యక్రమం సీఐఎస్ఎఫ్ కుటుంబంలో నూతన ఉత్సాహాన్ని నింపిందని చెప్పారు. ఈ నెల 28న ‘సురక్షిత తట–సమృద్ధ్ భారత్’ నినాదంతో సైక్లోథాన్ రెండో ఎడిషన్ ప్రారంభమైందని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ స్టేడియం నుంచి వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని వివరించారు. చిన్న స్థాయిలో మొదలైన ఈ కార్యక్రమం నేడు ప్రజల భాగస్వామ్యంతో దేశభక్తిని పెంపొందించే జాతీయ ఉద్యమంగా రూపాంతరం చెందిందన్నారు. విశాఖలో ఈ కార్యక్రమం నిర్వహించడం ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుందని చెప్పారు. ఇది కేవలం 6,600 కిలోమీటర్ల సైకిల్ ప్రయాణం మాత్రమే కాకుండా ప్రజలతో నేరుగా మమేకమై భద్రతపై అవగాహన కల్పించే యజ్ఞమని పేర్కొన్నారు. ఇప్పటివరకు సైక్లిస్టులు 2,400 కిలోమీటర్లు పూర్తి చేశారని తెలిపారు. ఈ ప్రయాణంలో సుమారు 6 లక్షల మందిని ప్రత్యక్షంగా కలుసుకుని, డిజిటల్ మాధ్యమాల ద్వారా మిలియన్ల మందితో సంభాషించామని చెప్పారు. ఈ పర్యటనలు భద్రత, సాంస్కృతిక వారసత్వం, జాతీయ అస్తిత్వం పరస్పర సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. భీమిలి నుంచి ఆర్కే బీచ్ వరకు చేరుకున్న సైక్లిస్టులకు సీఐఎస్ఎఫ్ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విశాఖ పోర్ట్ అథారిటీ డిప్యూటీ చైర్మన్ రోషిణి అపరంజి, సీఐఎస్ఎఫ్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ బినితా ఠాకూర్, సీఐఎస్ఎఫ్ డీఐజీలు రాఘవేంద్ర కుమార్, ఎన్.ప్రకాష్ రెడ్డి, ఇన్స్పెక్టర్ జనరల్ శ్రీమతి రేఖా నంబియార్, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వి.పి.ఎ.అరుణ్ ప్రసాద్, సీనియర్ కమాండెంట్ సతీష్ కుమార్ బాజ్పాయ్ పాల్గొన్నారు. దేశ భద్రతకు ప్రజలే ప్రథమ రక్షకులు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్తో భాగస్వామ్యం కావడానికి ప్రపంచం ఎదురు చూస్తోందని, ఇలాంటి సమయంలో మన దేశం ఎంత భద్రంగా ఉందో ప్రపంచానికి తెలియజెప్పాల్సిన అవసరం ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం ఆర్కే బీచ్లో నిర్వహించిన వందేమాతరం తీర సైక్లోథాన్–2026ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఒక సాధారణ సైక్లథాన్ మాత్రమే కాదని, దేశాన్ని మరింత సురక్షిత దిశగా నడిపించే ఉద్యమమని అభివర్ణించారు. దేశ రక్షణలో సామాన్యులను భాగస్వాములను చేసేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించిన సీఐఎస్ఎఫ్ అభినందనీయమని స్పష్టం చేశారు. సుదీర్ఘ సైకిల్ యాత్ర చేసిన సైక్లిస్టులను ప్రత్యేకంగా అభినందిస్తూ మెడల్స్తో సత్కరించారు. -
చక్కని ప్రణాళిక..
కోటవురట్ల: జీవితం మలుపునకు మొదటి అడుగు ఇంటర్లోనే.. పదో తరగతిని పదిలంగా దాటేసినా ఇంటర్మీడియట్లో తప్పటడుగులు పడితే కుప్పకూలిపోవడం ఖాయం.. ఇక్కడే కాసింత పట్టుదలతో ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి బీజం పడుతుంది. డాక్టరు కావాలన్నా, ఇంజనీరు అవ్వాలన్నా, శాస్త్రవేత్తగా ఎదగాలన్నా ఇంటర్లో శ్రమించాల్సిందే.. లక్ష్యంతో గురువుల తర్ఫీదుతో ముందుకెళితే గురితప్పకుండా మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. విద్యార్థుల పట్టుదలకు తల్లిదండ్రుల సహకారం, లెక్చరర్ల ప్రోత్సాహం తోడైతే లక్ష్యాలను ఇట్టే చేరుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా ఇందుకు ప్రత్యేక దృష్టి సారించింది. మెరుగైన ఫలితాల కోసం సంకల్పం వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహించి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వెనుకబడిన విద్యార్థులపై దృష్టి సారించి వారి అనుమానాలను నివృత్తి చేస్తూ పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. వంద రోజుల ప్రణాళిక ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనుండగా, కళాశాలల్లోనే సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు విద్యార్థులను ప్రశాంత వాతావరణంలో చదివిస్తున్నారు. ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు లెక్చరర్లు కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల కాగా, ఈ నెల 23 నుంచి మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనుండగా, ప్రస్తుతం ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతున్నాయి. ప్రణాళిక ఇలా.. ఇంటర్లో మంచి మార్కులు సాధించాలంటే పాఠ్యాంశాలపై పూర్తి పట్టు సాధించడంతోపాటు నిరంతర సాధన అవసరమని నిపుణులైన అధ్యాపకులు చెబుతున్నారు. సిలబస్ను ఎప్పటికపుడు అర్థం చేసుకోవడం, చదవాల్సిన అన్ని భావనల జాబితాను తయారు చేసుకోవాలని సూచిస్తున్నారు. పురోగతిని తెలసుకునేందుకు రోజూ పరిశీలన, వారానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ప్రశ్నల నమూనాలు, క్లిష్ట సమస్యలను ఛేదించేందుకు గత పరీక్షా పత్రాలను అధ్యయనం చేయాలి. ఇక చేతిరాతకు అధిక ప్రాధాన్యమివ్వాలి. దస్తూరీ ఎంత బాగుంటే అంత మంచి మార్కులు పడే అవకాశం ఉంటుంది. చేతిరాతను విద్యార్థులు మెరుగుపరుచుకోవలసిన అవసరం ఉంది. కోటవురట్లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలస్టడీ అవర్స్లో విద్యార్థులను పర్యవేక్షిస్తున్న లెక్చరర్లు ఎంతమంది హాజరవుతున్నారంటే.. అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 20, ప్రైవేటు కళాళాలలు 77 ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు 3,540 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 2,931 మంది, ప్రైవేటు కళాశాల నుంచి మొదటి సంవత్సరం 8,131 మంది, రెండో సంవత్సరం 7,873 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో గతేడాది ఇంటర్ మొదటి సంవత్సరంలో అనకాపల్లి జిల్లాకు 63 శాతం, ద్వితీయ సంవత్సరంలో జిల్లాకు 73 శాతం ఉత్తీర్ణత వచ్చాయి. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో రాష్ట్రంలో అనకాపల్లి జిల్లా 20వ స్థానంలో ఉండగా, ద్వితీయ సంవత్సరం 25వ స్థానాన్ని పొందింది. ఈ ఏడాది ఈ స్థానాలను దాటుకుని మంచి స్థానాల కోసం అధికారులు, అధ్యాపకులు సంకల్పంతో కృషి చేస్తున్నారు. -
మంచి స్థానం కోసం..
రాష్ట్రంలో మంచి స్థానం కోసం కృషి చేస్తున్నాం. వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. వారిని నిశితంగా గమనిస్తూ వెనుకబడిన సబ్జెక్టులలో తర్ఫీదునిస్తున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల నుంచి ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు ప్రస్తుతం ప్రాక్టికల్స్ జరుగుతున్నాయి. పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నాం. – ఎం.వినోద్బాబు, జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ -
ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యం
తుమ్మపాల: ఎయిడ్స్ నిర్మూలనే లక్ష్యంగా సంచార ఐసీటీసీ వాహన సేవలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మొబైల్ ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్ (ఐసీటీసీ) సంచార వాహనాన్ని శుక్రవారం కలెక్టరేట్ ఆవరణలో ఆమె జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ వాహనం ఇంటింటికీ వెళ్లి హెచ్ఐవీ, ఎయిడ్స్పై కౌన్సెలింగ్, నిర్ధారణ పరీక్షలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. సులభమైన హెచ్ఐవీ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పాటు, వ్యాధి వ్యాప్తిని తగ్గించేందుకు ఈ వాహనం సేవలు దోహదపడతాయని తెలిపారు. ఈ కేంద్రంలో ఒక కౌన్సెలర్, ల్యాబ్ టెక్నీషియన్, అటెండర్, డ్రైవర్ విధులు నిర్వహిస్తారన్నారు. ఐసీటీసీ, పీపీటీసీ కౌన్సెలర్లు కూడా సేవలందిస్తారని తెలిపారు. దిశ క్లినికల్ సర్వీసెస్ అధికారి డాక్టర్ సీహెచ్. స్పందన మాట్లాడుతూ వైద్య కేంద్రాలకు దూరంగా ఉండే ప్రాంతాలు, హైరిస్క్ జనాభా ఉన్న, పారిశ్రామిక కేంద్రాల్లో పనిచేసే వలస కూలీలు నివసించే ప్రాంతాలు, హెచ్ఐవీ పాజిటివ్స్ తీవ్రత ఎక్కువగా ఉన్న గ్రామాల్లో సేవలు అందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ హైమావతి, డీటీఏటీవో డాక్టర్ కె.స్వప్న తదితరులు పాల్గొన్నారు. -
వెళ్లిపోండి
ఇష్టం లేకపోతే... సాక్షి, అనకాపల్లి: ‘ఇష్టం లేకపోతే ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోండి. మీ నిర్లక్ష్యం కారణంగా జిల్లా చివరి స్థానంలో ఉంది’ అంటూ సచివాలయాల ఉద్యోగులపై కలెక్టర్ విజయకృష్ణన్ తీవ్ర ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పరుషపదజాలం ఉపయోగించడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత, జిల్లా యంత్రాంగం వైఫల్యం, వ్యవస్థలోని లోపాల వల్ల ప్రజలు తీవ్ర అసంతృత్తితో ఉన్నారని, అందువల్లే ఐవీఆర్ఎస్లో ఎక్కువ మంది రెండో నంబర్ బటన్ నొక్కారని, వాటిని సరిచేయకుండా తమను టార్గెట్ చేయడం సరికాదని, కలెక్టర్ మాట్లాడిన తీరు సరిగా లేదని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నోట్ విడుదల చేశారు. సచివాలయ ఉద్యోగుల నోట్, వైరల్ అయిన వీడియో మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఐవీఆర్ఎస్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పనితీరుపై సమాచారాన్ని సేకరించి జిల్లాలకు గ్రేడింగ్ ఇస్తోంది. ఈ గ్రేడింగ్లో జిల్లాకు 26వ స్థానం చివరి స్థానం వచ్చింది. దీంతో ఈ నెల 5వ తేదీ గురువారం కలెక్టర్ ఉద్యోగులతో నిర్వహించిన జూమ్ సమీక్ష సమావేశంలో సచివాలయ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. వివిధ పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, జిల్లాకు చెడ్డ పేరు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయ ఉద్యోగుల పనితీరు బాలేదు..అందుకే ఐవీఆర్ఎస్ సర్వేలో ఉద్యోగుల పనితీరు గ్రేడింగ్లో 26వ స్థానంలో ఉన్నామంటూ ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐఫోన్ కొనాలి, ఇల్లు కొనాలి, కారు కొనాలన్న దురాశతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. జిల్లాకు చెడ్డపేరు సంపాదించి పెట్టారని ఆగ్రహించారు. సచివాలయ ఉద్యోగులు అందుబాటులో ఉండడం లేదని, వసూళ్లకు పాల్పడుతున్నారని ప్రజలు ఐవీఆర్ఎస్ సర్వేలో తెలియజేశారని, ప్రజలిచ్చిన ఈ సరిఫికెట్ను నెత్తి మీద అంటించుకుని తిరగండని అంటూ కలెక్టర్ ఘాటుగా వ్యాఖ్యానించారని సచివాలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. మనమిత్ర వాట్సప్ సేవల ను ప్రచారం చేయమని ఆదేశిస్తే పంచాయతీ సెక్రటరీలు నిర్లక్ష్యం వహించారని దీంతో అల్లూరి సీతారామరాజు జిల్లా కన్నా వెనుకబడి పోయామని కలెక్టర్ ఆగ్రహించినట్టు సచివాలయ ఉద్యోగులు పేర్కొన్నారు. మనమిత్ర వాట్సాప్ సర్వీసులను గిరిజనులు బాగా ఉపయోగించుకుంటున్నారని, మన జిల్లా పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ రోజుకి 20 మందికి వాట్సాప్ సర్వీసుల గురించి వివరించి, ప్రజలు వాటిని బాగా ఉపయోగించేలా చూడాలని ఆదేశించారు. ఈసారి ర్యాంకింగ్లో డబుల్ డిజిట్ వస్తే సహించేది లేదని హెచ్చరించారని సమాచారం.కలెక్టర్ అలా అనడం బాధాకరం జిల్లాలో గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులను ఉద్దేశించి ఒక బాధ్యతాయుతమైన పరిపాలనా అధికారి పరుషపదజాలంతో మాట్లాడడం చాలా బాధాకరమని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో నిజాయితీగా తమకు సంబంధం లేని సేవలను కూడా అందిస్తున్నామని, పెన్షన్ పంపిణీ వంటి కీలకమైన సేవలను, గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగులు రోజూ నిర్వర్తిస్తున్నామని తెలిపారు. పరిపాలన విధానాల్లో లోపాల బాధ్యతను పూర్తిగా క్షేత్రస్థాయి ఉద్యోగుల మీద వేయడం న్యాయం కాదన్నారు. సిస్టమ్ ఫెయిల్యూర్స్, ట్రైనింగ్ లోపాలు, విధానపరమైన గందరగోళం ఉంటే..అది ఉద్యోగుల వైఫల్యం కంటే పాలనాపరమైన లోపంగానే చూడాలని, ఇంత పెద్ద ఎత్తున తప్పులు జరుగుతున్నాయంటూ దానికి కారణాలపై సమీక్ష చేయాల్సిన బాధ్యత కలెక్టర్పై ఉందన్నారు. ప్రతి సమస్యకీ సచివాలయం ఉద్యోగులే జవాబుదారులుగా చేయడం సరికాదన్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్పై ప్రజలకు అవగాహన లేక..ఏవేవో బటన్లు నొక్కితే..ఆ తప్పుల బాధ్యతను కూడా తమపై వేయడం న్యాయసమ్మతం కాదని, వ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలని, నిజాయితీగా సేవ చేస్తున్న ఉద్యోగులను బలిచేయవద్దని వారు కోరారు. ఈ నేపథ్యంలో గ్రామ/వార్డు సచివాలయం ఉద్యోగుల సమైక్య సంఘం నుంచి నోట్ కూడా విడుదల చేశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
ఆయిల్పామ్ వెలవెల
మండలంలో సాగు చేస్తున్న ఆయిల్పామ్ తోటలుఆయిల్పామ్ గెలలు లారీలపై లోడు చేస్తున్న కూలీలునాతవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయిల్పామ్ గెలల రేటు గణనీయంగా పడిపోయింది. జిల్లాలో 28 వేల ఎకరాల్లో పామాయిల్ తోటలున్నాయి. అధికంగా నాతవరం దేవరాపల్లి, కె.కోటపాడు, కోటవురట్ల, రావికమతం, చోడవరం, రోలుగుంట ఎస్.రాయవరం, కశింకోట, బుచ్చెయ్యపేట, గొలుగొండ, నర్సీపట్నం, పాయకరావుపేట, చీడికాడ, మాడుగుల, మండలాల్లో రైతులు ఆయిల్పామ్ తోటలు సాగు చేస్తున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో టన్ను ధర రూ. 23,500 ఉండేది. ప్రస్తుతం టన్ను ధర కేవలం రూ.19వేలు మాత్రమే ఉంది. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కూలీ రేట్లు, ఎరువుల ధరలు, పెట్టుబడి వ్యయం చాలా ఎక్కువగా పెరిగిపోవడంతో పాటు, ఆయిల్పామ్ గెలల రేటు తగ్గిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. గెలలు కోయడానికి కూలీలు రేట్లు రెట్టింపు చేసేశారు. క్రిమిసంహారక మందులు ఎరువుల రేట్లు సైతం పెరిగాయి. రైతులు పండించిన ఆయిల్పామ్గెలలు సోయా రుచి ప్రైవేటు కంపెనీ యాజమాన్యం మాత్రమే కొనుగోలు చేస్తోంది. నాతవరం మండలంలో చమ్మచింత, నాతవరం, గుమ్మడిగొండ, చిక్కుడుపాలెం, గునుపూడి తదితర ప్రాంతాల్లో ఆయిల్పామ్ గెలలు కొనుగోలు చేసేందుకు తూనిక కేంద్రాలు ఏర్పాటు చేశారు.రైతులు పండించిన గెలలను అక్కడకు తీసుకెళ్లి విక్రయిస్తారు. రైతులు నుంచి కొనుగోలు చేసిన గెలలను లారీలపై ఫ్యాక్టరీకి తరలిస్తారు. ఎకరాకి 8 టన్నుల దిగుబడి ఎనిమిదేళ్ల నుంచి 14ఏళ్ల వయస్సు గల ఆయిల్పామ్ తోట నుంచి ఎకరానికి 8 నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. సంరక్షణ, వాతావరణం బాగుంటే దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉంటుంది. మూడేళ్ల కిందట ఎకరాకి రూ.35 నుంచి రూ.40 వేల వరకు పెట్టుబడి అయ్యేది. ప్రస్తుతం ఎకరానికి పెట్టుబడి రూ.40వేల నుంచి రూ. 50వేల మధ్య పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. ఆయిల్పామ్ తోటలు సాగు చేసే రైతులకు ఉద్యావనశాఖ ద్వారా మొక్కలను రాయితీపై అందిస్తున్నారు. ఆయిల్పామ్ సాగు చేసేందుకు బావి లేదా బోరుతో పాటు విద్యుత్ సదుపాయం ఉండాలి. మొక్కలు నాటిన మూడేళ్ల నుంచి తోట సంరక్షణను బట్టి పంట కాపు దశకు వస్తుంది. అంతవరకు ఈ తోటల్లో అంతర పంటగా కోకో, అరటి, కూరగాయల వంటి ఆరుతడి పంటలు సాగు చేసుకోవచ్చు.ఇతర పంటలు సాగుతో పోల్చుకుంటే పామాయిల్ తోటల ద్వారా గతంలో ఆదాయం ఎక్కువగా రావడంతో వీటిని వేసేందుకు రైతులు ఆసక్తి చూపారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న పరిస్థితులు చూస్తే పెట్టుబడి రేట్లు దారుణంగా పెరిగాయి, రైతులు పండించిన పామాయిల్ గెలలు రేటు తగ్గడంతో రైతులు దిగాలు చెందితున్నారు. ఆయిల్పామ్ గెలల రేటు తగ్గిన విషయంపై ఉద్యానవశాఖ డివిజన్ అధికారి శిరీషను వివరణ కోరగా ఆయిల్పామ్ గెలలు మన ప్రాంతంలో ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. రేటు తగ్గుదలపై కొందరు రైతులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులు తెలియజేశామని చెప్పారు. టన్ను రూ 23,500 కొనుగోలు చేసేవారు మాగ్రామంలో పామాయిల్ కొనుగోలు కేంద్రం ఉంది. గత ప్రభుత్వం హయాంలో రైతుల నుంచి టన్ను రూ.23,500 కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం టన్ను రూ. 19వేలకు మాత్రమే కొంటున్నారు. ఎరువులు క్రిమిసంహారక మందులు, కూలీలు రేట్లు గణనీయంగా పెరిగాయి. ప్రతి ఏటా రేటు పెరగాల్సిందిపోయి తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు – సందీప్ చమ్మచింత గ్రామం జిల్లాలో ఆయిల్పామ్ రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. పంటకు గిట్టుబాటు ధర లేక ఆందోళన చెందుతున్నారు.ఆయిల్పామ్ గెల ధర పతనం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. గిట్టుబాటు ధర కల్పించాలని వారు వేడుకుంటున్నారు. -
అక్రమ నిర్బంధాలపై ప్రజాపోరాటానిదే విజయం
డాబాగార్డెన్స్(విశాఖ): అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్, ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టుల కోసం జరుగుతున్న బలవంతపు భూసేకరణను అడ్డుకున్నారన్న నెపంతో, సీపీఎం నేత అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ చెల్లదని తేలిపోయింది. అడ్వైజరీ కమిటీ సమీక్షలో ప్రభుత్వ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం కావడంతో 45 రోజుల జైలు శిక్ష అనంతరం శుక్రవారం ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎలాంటి నేరం చేయకపోయినా అప్పలరాజును అక్రమంగా నిర్బంధించి చంద్రబాబు ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని చాటుకుందని మండిపడ్డారు. పాత కేసులను సాకుగా చూపి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం దారుణమని, ప్రజల ఆగ్రహానికి తలొగ్గే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేశారు. మరోవైపు పర్యావరణాన్ని ధ్వంసం చేసే పరిశ్రమల కోసం ప్రభుత్వం పాకులాడుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్వీర్యం చేస్తూ, మిట్టల్ వంటి ప్రైవేటు సంస్థల కోసం కూటమి ప్రభుత్వం ఢిల్లీ చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు. తనపై మోపిన అక్రమ కేసుల రికార్డులను ప్రదర్శిస్తూ, న్యాయస్థానాలు కొట్టేసిన కేసులను కూడా పీడీ యాక్ట్లో చేర్చి తనను వేధించారని జైలు నుంచి విడుదలైన అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ బాధితుల పక్షాన తమ పోరాటం ఆగదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఈ సందర్భంగా సీపీఎం నేతలు స్పష్టం చేశారు. -
బంగారు ఆభరణాల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
నర్సీపట్నం: పట్టణంలో వారం రోజుల క్రితం జరిగిన చోరీ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్టు సీఐ గఫుర్ తెలిపారు. గత నెల 31న స్థానిక వెలమ వీధికి చెందిన దేవాడ త్రివేణి చోడవరంలో బంధువుల ఇంటికి వెళ్లేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్లో బస్సు ఎక్కింది. ఆమె వెంట సుమారు ఐదు తులాల బంగారు చైను, రెండు గాజులు, చెవిదిద్దులు బ్యాగ్లో తీసుకువెళ్లింది. ఏదో పనిపై వెళ్లిన ఆమె బస్సులోనే నర్సీపట్నం తిరిగి వచ్చింది. కాంప్లెక్స్ బయట ఆటో ఎక్కి ఇంటికి వెళ్లింది. ఇంటికి వెళ్లి సంచిలో చూసే సరికి బ్యాగ్లో ఆభరణాలు లేవు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. ముగ్గురు సిబ్బందితో ప్రత్యేక పోలీసు టీమ్ ఏర్పాటు చేశారు. సీసీ పుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించారు. శుక్రవారం షేర్ఆటోలో ఇద్దురు నిందితులు తునివైపు వెళ్తుండగా పాతబస్టాండ్ వద్ద పట్టుకున్నట్టు సీఐ తెలిపారు. అనకాపల్లికి చెందిన గాడి సత్యవతి ఆలియాస్ శ్యామల, షేక్ చాన్ బాషాను అరెస్ట్ చేశామన్నారు. వీరి వద్ద నుంచి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు ఇద్దరు నిందితులు గతంలో అనేక దొంగతనాలకు పాల్పడ్డారని, వీరిపై కేసులు ఉన్నాయన్నారు. ఆటోను అద్దెకు తీసుకుని ఈ ఇద్దరూ ప్రయాణికులను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారని సీఐ తెలిపారు. ఆటోను సీజ్ చేశామని తెలిపారు. కేసును ఛేదించిన సిబ్బందిని సీఐ అభినందించారు. -
రాష్ట్రస్థాయి రగ్బీ పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
అచ్యుతాపురం రూరల్ : గుంటూరులో జరిగే మినీ సబ్ జూనియర్ బాల బాలికల రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు జిల్లా జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. భోగాపురం క్రీడా ప్రాంగణంలో శుక్రవారం జరిగిన ఎంపిక పోటీలకు జిల్లాలో పలు పాఠశాలలు, వివిధ స్పోర్ట్స్ క్లబ్ల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఈ పోటీల్లో బాలుర విభాగంలో చౌడువాడ హైస్కూల్, అనకాపల్లి సిద్ధార్థ ఈ టెక్నో స్కూల్, ఎంజే పురం హైస్కూల్ విద్యార్థులు వరుసగా ప్రథమ, దిత్వీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. బాలికల విభాగంలో చౌడువాడ హై స్కూల్, ఎంజేపురం హైస్కూల్, అచ్యుతాపురం కై ట్స్ విద్యా విహార్ విద్యార్థినులు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు కై వసం చేసుకున్నారు. జట్టుకు 12 మంది చొప్పున ఎంపికై న 24 మంది క్రీడాకారులు ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీల్లో పాల్గొంటారని నేషనల్ కోచ్ వెంకట్ తెలిపారు. క్రీడాకారులను జిల్లా రగ్బీ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కూండ్రపు వెంకునాయుడు, అధ్యక్షుడు డాక్టర్ ఎస్.ఎన్.వి. జగదీష్, సెక్రటరీ డాక్టర్ వెంకట్, వర్కింగ్ ప్రెసిడెంట్ రెడ్డి గణేష్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ అడిగర్ల సుధీర్, కోశాధికారి కూండ్రపు రమేష్ తదితరులు అభినందించారు. -
విశాఖ తల్లఢిల్లీ
మించిపోయిన వైజాగ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టుఏయూక్యాంపస్: పర్యాటక కేంద్రంగా వెలుగొందుతున్న విశాఖలో గాలి నాణ్యత రోజురోజుకూ దిగజారుతోంది. తాజా గణాంకాల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో నమోదైన 195 ఏక్యూఐ కంటే ఎక్కువగా విశాఖలో 205 ఏక్యూఐ నమోదు కావడం నగరవాసులను ఉలిక్కిపడేలా చేస్తోంది. ముఖ్యంగా ఫిబ్రవరి 6వ తేదీ మధ్యాహ్నం నాటికి హైదరాబాద్, ఢిల్లీ వంటి మెట్రో నగరాలను సైతం వెనక్కి నెట్టి విశాఖ కాలుష్యంలో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. గత జనవరి నెలలో మెజారిటీ రోజులు గాలి నాణ్యత అనారోగ్యకరమైన స్థాయిలోనే కొనసాగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రమాద ఘంటికలు మోగిస్తున్న గణాంకాలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణ మండలి జరిపిన పరీక్షల్లో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. పోలీస్ బ్యారక్స్ వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ ఏకంగా 305కు చేరుకుని ‘వెరీ పూర్’ విభాగంలోకి వెళ్లగా, మాధవధార వంటి నివాస ప్రాంతాల్లో కూడా కాలుష్యం పరిమితికి లోబడే ఏమీ లేదు. మింది, ఆటోనగర్, మల్కాపురం, సీతమ్మధార వంటి పారిశ్రామిక, రద్దీ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. గాలిలో పీఎం 2.5, పీఎం 10 కణాలు పెరిగిపోవడంతో పాటు కార్బన్ మోనాౖక్సైడ్, సల్ఫర్ డయాకై ్సడ్ వంటి విషవాయువులు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. పారిశ్రామిక వ్యర్థాలు, పెరుగుతున్న వాహన రద్దీ విశాఖలో గాలి విషతుల్యం కావడానికి ప్రధానంగా పోర్ట్ కార్యకలాపాలు, భారీ పరిశ్రమలు కారణమవుతున్నాయి. పోర్ట్ ప్రాంతంలో బొగ్గు, ఇతర లోహాల ఎగుమతి దిగుమతుల సమయంలో వెలువడే ధూళి గాలిని కలుషితం చేస్తోంది. దీనికి తోడు హెచ్పీసీఎల్, స్టీల్ ప్లాంట్, ఫార్మా రంగానికి చెందిన ఉద్గారాలు తోడవుతున్నాయి. నగరంలో నానాటికీ పెరుగుతున్న వాహనాల సంఖ్య, డీజిల్ యంత్రాల వినియోగం మరియు నిర్మాణ రంగం నుంచి వెలువడే దుమ్ము ధూళి వాతావరణాన్ని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. ఇవన్నీ కలిసి నగరాన్ని కాలుష్య కాసారంగా మారుస్తున్నాయి. నగర ప్రజలపై తీవ్ర ప్రభావం ప్రస్తుతం విశాఖలో గాలి నాణ్యత క్షీణత ఏ స్థాయిలో ఉందంటే, నగరంలో నివసించే ప్రతి వ్యక్తి రోజుకు సగటున మూడు సిగరెట్లు కాల్చినప్పుడు ఊపిరితిత్తులకు ఎంత నష్టం జరుగుతుందో, అంత నష్టానికి గురవుతున్నారు. అంటే నెలకు దాదాపు 81 సిగరెట్లు తాగినంత ప్రభావం ఆరోగ్యంపై పడుతోంది. దీనివల్ల ఆస్తమా, సైనస్, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్కులు ధరించడం, అవసరమైతే ఎయిర్ ప్యూరిఫైర్లను వాడటం, రద్దీ సమయాల్లో బయటకు వెళ్లకుండా ఉండటం ప్రాణరక్షణకు అత్యవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
పోలీసు సిబ్బంది సంక్షేమానికి కృషి
● ఎస్పీ తుహిన్ సిన్హాఅనకాపల్లి: పోలీసుశాఖలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. ప్రతి శుక్రవారం పోలీసు సిబ్బంది కోసం నిర్వహించే గ్రీవెన్స్సెల్ను ఈ వారం నుంచి ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నట్టు చెప్పారు. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి పోలీసు సిబ్బంది వారి సమస్యలను తెలియజేయాలంటే అనకాపల్లిలో కార్యాలయానికి రావడం కష్టంగా ఉంటుందని, అందువల్లే ఆన్లైన్ గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు(సెల్ నంబర్. 9346912011) జరుగుతుందన్నారు. పోస్టింగ్లు, సెలవులు, బదిలీలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ ఇబ్బందులు, పనిఒత్తిడి వంటి అంశాలపై 27 మంది సిబ్బంది ఆన్లైన్ ద్వారా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం ఏవో సీహెచ్.తిలక్ బాబు, ఎస్ఐ ప్రసాద్, కార్యాలయం సూపరింటెండెంట్లు గిరి, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. -
మహిళా రైతుకు పాము కాటు
108 వాహనంలో బాధిత మహిళను సీహెచ్సీకి తరలిస్తున్న వైద్య సిబ్బంది దేవరాపల్లి: మండలంలోని వాకపల్లిలో శుక్రవారం ఓ మహిళా రైతు పాము కాటుకు గురైంది. గ్రామానికి చెందిన రాణం సత్యవతి రోజూ మాదిరిగానే వ్యవసాయ పనుల్లో భాగంగా పొలంలోకి వెళ్లింది. అక్కడ చెరకు తోట పనులు చేస్తుండగా పాము కాటేసింది. వెంటనే స్థానికులు వేచలం పీహెచ్సీకి తీసుకెళ్లగా, అక్కడ వైద్యుడు రమేష్బాబు ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం 108 వాహనంలో కె.కోటపాడు కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. -
ముగిసిన ఎన్ఎస్జీ విన్యాసాలు
మహారాణిపేట: తూర్పు నావికదళం, ఎన్ఎస్జీ ఆధ్వర్యంలో ఐదు రోజులుగా జరిగిన ‘వ్యాయాస్’ విన్యాసాలు శుక్రవారం విజయవంతంగా ముగిశాయి. పీఎం పాలెం సమీపంలోని కంబాలకొండ ఫారెస్ట్ వద్ద జరిగిన ముగింపు కార్యక్రమ వివరాలను గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ డాక్టర్ సుమిత్ గరుడ్ వెల్లడించారు. నక్సల్స్ కార్యకలాపాలను ఎదుర్కోవడం, అత్యవసర సమయాల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయం లక్ష్యంగా ఈ శిక్షణ సాగింది. ఇందులో ఏపీ పోలీస్, గ్రేహౌండ్స్, ఆక్టోపస్ దళాలతో పాటు అటవీ, అగ్నిమాపక, వైద్య విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో వేగంగా ఎలా స్పందించాలో ఈ విన్యాసాలు చాటిచెప్పాయని కమాండర్ పేర్కొన్నారు. -
కల్యాణపులోవను సందర్శించిన డీఎస్పీ శ్రావణి
పోతురాజుబాబు ఆలయ పరిసరాలను సందర్శిస్తున్న డీఎస్పీ శ్రావణి రావికమతం: కల్యాణపులోవ పోతురాజుబాబు జాతరకు తరలివచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రక్షణ కల్పించడంతో పాటు భద్రతా పరమైన చర్యలు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అనకాపల్లి డీఎస్పీ శ్రావణి పోలీసులను ఆదేశించారు.ఆమె శుక్రవారం కల్యాణపులోవలో పోతురాజుబాబు అలయం,పెద్దింటమ్మ గుడి, జలాశయం వద్ద పుణ్య స్నానాలు ఆచరించే ప్రదేశాలు, వాహనాల పార్కింగ్ ప్రాంతాలను, జాతర ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. జాతరకు ఏ స్థాయిలో భక్తులు తరలివస్తారో ఆరా తీశారు. గజఈతగాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ శ్రీనివాస్, రిజార్వయర్ నీటి సంఘం కమిటీ చైర్మన్ బంటు రామునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న కాపునేతలు
సాక్షి, అనకాపల్లి : ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా ఆయన ఇంటిపై టీడీపీ గూండాలతో చంద్రబాబు దాడులు చేయించారని కాపునేతలు మండిపడ్డారు. గుంటూరులోని సిద్ధార్థనగర్లో అంబటి ఇంటిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించినా అక్కడే ఉన్న పోలీసులు ప్రేక్షక పాత్రే పోషించారే తప్ప నిలువరించలేదని విమర్శించారు. టీడీపీ రౌడీమూకల దాడిలో ఽకాపు నేత అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంలో ఫర్నిచర్ను ధ్వంసం చేయడమే కాకుండా కారు అద్దాలు పగలుగొట్టి, కారును కాల్చివేశారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ నెల 7న ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన కాపు నేతలు అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. విశాఖ నుంచి వందకు పైగా కార్ల ర్యాలీగా గుంటూరుకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో గురువారం అనకాపల్లి టౌన్లో రింగురోడ్డులో గల పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కాపు నేతలు సమావేశమయ్యారు. అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి కుమార్తెలు మౌనిక, మనోజ్ఞను పరామర్శించి ధైర్యం కల్పించేందుకు పార్టీలకతీతంగా కాపునేతలు సమాయత్తమవుతున్నారు. పథకం ప్రకారమే కాపునేతలపై దాడులు... కాపు నేత అంబటి రాంబాబుపై పథకం ప్రకారమే టీడీపీ గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని కాపునేతలు మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలడంతో గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో పూజలు చేసి వస్తున్న అంబటి గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశారని, దీనిని టార్గెట్ పెట్టుకుని దాడి చేయించారన్నారు. ఫ్లెక్సీని తొలగించాలని కోరితే ఆయనపై అక్కడే దాడికి పాల్పడ్డారని, టీడీపీ మూకలు నడిరోడ్డుపై బహిరంగంగా కర్రలు, రాడ్లతో తిరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని అన్నారు. దీనిపై శాసన మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ, డీజీపీ, అదనపు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు ఫోన్లు చేసినా స్పందించలేదన్నారు. ఈ ఘటనపై ఎస్పీని కలిసేందుకు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వెళితే ఎస్పీ ఇంటి గేటు బయటే నిలబెట్టారంటే ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థ ఉందో అర్ధమవుతుందంటూ మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే నాడు కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించారని, మళ్లీ చంద్రబాబు హయాంలోనే మరో కాపు ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభం, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని, అదే రీతిలో ఇపుడు వంగవీటి రంగా శిష్యుడుగా పేరున్న అంబటి రాంబాబును, ఆయన కుటుంబాన్ని హతమార్చాలని చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నాడని ధ్వజమెత్తారు. కాపు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి అంబటి కుటుంబానికి అండగా నిలబడి ధైర్యం కల్పించాలని తీర్మానించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, బాణాల శ్రీనివాసరావు, కాపు నేతలు వీసం రామకృష్ణ, మలసాల రమణారావు, జాజులు రమేష్, దొండా రాంబాబు, మలసాల కిశోర్, ఏడువాక సత్యారావు, కలగా గున్నయ్యనాయడు, ఎ.వి. రత్నకుమారితో పాటు పలువురు కాపు నాయకులు పాల్గొన్నారు. -
అన్నదమ్ములను చిదిమేసిన కంటైనర్ లారీ
కశింకోట: మృత్యు రూపంలో వచ్చిన కంటైనర్ లారీ అన్నదమ్ములను బలి తీసుకుంది. వీరు ప్రయాణిస్తున్న స్కూటీని ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. మండలంలో తాళ్లపాలెం వద్ద జాతీయ రహదారిపై గురువారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సీఐ అల్లు స్వామి నాయుడు అందించిన వివరాల ప్రకారం... మండలంలోని తాళ్లపాలెంలో ఎస్బీఐ వద్ద యలమంచిలి నుంచి అనకాపల్లి వైపు వస్తున్న కంటైనర్ లారీ ముందు వెళ్తున్న స్కూటీని ఢీ కొట్టి వెళ్లిపోయింది. దీంతో స్కూటీపై వెళ్తున్న రాంబిల్లి మండలం దిమిలి గ్రామానికి చెందిన జనపరెడ్డి వెంకట తాతాజీ(51), సోదరుడు వెంకటేశ్వరరావు(47) కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని 108 వాహనంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. స్వగ్రామం దిమిలి నుంచి అనకాపల్లికి పని మీద వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో వెంకటేశ్వర కూలి కాగా, తాతాజీ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్గా అనకాపల్లిలో పని చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములైన తాతాజీ, వెంకటేశ్వరరావు మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పరారైన కంటైనర్ లారీని అనకాపల్లి వద్ద స్వాధీనం చేసుకున్నట్లు సీఐ చెప్పారు. ఎస్ఐ లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. దిమిలిలో విషాధ చాయలు రాంబిల్లి(అచ్యుతాపురం): రాంబిల్లి మండలం దిమిలిలో గురువారం విషాద ఛాయలు అలుముకున్నాయి. దిమిలి గ్రామానికి చెందిన జనపరెడ్డి వెంకట తాతాజీ, వెంకటేశ్వరరావు కశింకోట మండలం తాళ్లపాలెంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో దిమిలిలోని వారి స్వగృహాల వద్ద మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తాతాజీకి భార్య, ఇద్దరు పిల్లలు, వెంకటేశ్వరరావుకు భార్య, కుమారుడు ఉన్నారు. ప్రమాద వార్త తెలుసుకున్న స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు మృతి చెందడాన్ని వారి సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండు కుటుంబాల్లోని పిల్లలు చిన్న వాళ్లు కావడంతో కుటుంబ పోషణ భారం కానుంది. ప్రభుత్వం స్పందించి వీరికి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
యాప్ల పేరిట పని ఒత్తిడి
మాకు ఇచ్చే జీతం కన్నా ఎక్కువగా పనిచేస్తున్నాం. యాప్ల పేరిట ఉదయం నుంచి రాత్రి వరకూ పని ఒత్తిడి పెరుగుతుంది. మా ఒప్పంద మినిట్స్ బుక్లో హామీలను అమలు చేసే జీవోలు లేవు. మా కష్టానికి తగిన ప్రతిఫలం లేదు. పెరుగుతున్న నిత్యవసర ధరల కారణంగా వచ్చే జీతంతో కుటుంబాలు గడవడం లేదు. జిల్లాలో 60 ఆశా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడం లేదు. దీంతో డబుల్ వర్కు అవుతుంది. అర్థరాత్రి కూడా ఎవరికై నా బాలేదు అంటే అంబులెన్స్లో అవసరం మేరకు వెళ్లాల్సి ఉంటుంది. మాది కాని పనులను మమ్మల్ని చేయమంటారు. స్మార్ట్ మొబైల్స్ పనిచేయడంలేదు. చివరికి పింఛన్లు కూడా మాతోనే ఇప్పిస్తున్నారు. లేబర్ కోడ్పై ఉద్యమిస్తాం. లేబర్ కోడ్ కారణంగా కార్మికుల హక్కులను కాలరాస్తున్నారు. – వజ్రపు సత్యవతి, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆన్లైన్ పనులు అప్పగించవద్దు... స్మార్ట్ మొబైళ్లు సరిగ్గా పనిచేయవు. ఆన్లైన్లో సర్వే మీద సర్వేలు చేయిస్తున్నారు. ఇక ఇదే పని ఒత్తిడి ఉంటే అందరూ అనారోగ్యం బారిన పడాల్సి వస్తుంది. మా పరిధిలో గర్భిణులు, బాలింతల సమాచారంతో పాటు రోగులకు బాగోలేకపోతే వారిని ఆసుపత్రులకు తీసుకెళ్లడం వంటి విధులు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వం అందించే గ్యాస్ పథకం ఆశాలకు వర్తించడం లేదు. ఏఎన్ఎం, జీఎన్ఎం శిక్షణ పొందిన ఆశా కార్యకర్తలకు పర్మనెంట్ ఉద్యోగాలు కల్పించాలి. కమ్యునిటీ హెల్త్ వర్కలను ఆశా వర్కర్లుగా చేయాలి. –రామలక్ష్మి, జిల్లా ఆశా కార్యకర్తల యూనియన్ కోశాధికారి -
100 కిలోల గంజాయి పట్టివేత
అనకాపల్లి : ఒడిశా ఏజెన్సీ ప్రాంతం నుంచి పాడేరు, కె.కోటపాడు మండలం మీదుగా హైదరాబాదుకు కారులో 100 కేజీల గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్టు డీఎస్పీ ఎం.శ్రావణి అన్నారు. మండలంలో కొత్తూరు పంచాయతీ డీఎస్పీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈనెల 4న జిల్లా స్పెషల్ బ్రాంచి ఎస్ఐ, కె.కోటపాడు పోలీసులకు కారులో గంజాయి రవాణా అవుతున్నట్టు సమాచారం ఇవ్వడంతో అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో కె.కోటపాడు మండలం చల్లవారి కల్లాలు ప్రాంతంలో టాటా సఫారి కారును ఆపి తనిఖీ చేయగా 100 కేజీలు గంజాయి ప్యాకెట్లను గుర్తించడం జరిగిందన్నారు. కారులోని కర్ణాటకకు చెందిన డ్రైవర్ అబ్దుల్ హాకీమ్, తెలంగాణకు చెందిన మరో డ్రైవర్ సయ్యద్ సమీర్ ఆలీలను అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఇద్దరు డ్రైవర్లు హైదరాబాద్ నుంచి ఒడిశా ఏజెన్సీ ప్రాంతాలకు ఈనెల 3వ తేదీన వెళ్లి అక్కడ గంజాయిని సేకరించి, దానిని అల్లూరి సీతారామరాజు జిల్లా, అనకాపల్లి జిల్లా కె.కోటపాడు మండలం, నర్సీపట్నం మండలం మీదుగా హైదరబాద్ రవాణా చేస్తూ పట్టుబడ్డారని తెలిపారు. కారుతో పాటు గంజాయిని, వారి వద్ద మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకుని నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగిందన్నారు. సమావేశంలో కె. కోటపాడు ఇన్ఛార్జ్ సీఐ పి.అప్పలరాజు, కె.కోటపాడు ఎస్ఐ ఆర్.ధనంజయ్ పాల్గొన్నారు. -
గురుకుల ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కశింకోట: మండలంలోని తాళ్లపాలెంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాల/జూనియర్ కళాశాలలో 5వ తరగతి, ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ వి. రత్నవల్లి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐదో తరగతిలో ప్రవేశానికి గాను జిల్లాలో ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో 2025–26 విద్యా సంవత్సరంలో నాల్గో తరగతి పూర్తి చేస్తున్న విద్యార్థులు అర్హులన్నారు. వయో పరిమితి ఎస్సీ, ఎస్టీ అయితే 2013 సెప్టెంబర్ 1 నుంచి 2017 ఆగస్టు 31 తేదీల మధ్య, బీసీ, ఓసీలు అయితే 2015 సెప్టెంబర్ ఒకటి నుంచి 2017 ఆగస్టు 31 మధ్య జన్మించి ఉండాలన్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో చేరాలంటే రెగ్యులర్ విధానంలో పదో తరగతి పూర్తి చేసి ఉండాలన్నారు. 5వ తరగతిలో 80 సీట్లు, ఇంటర్ ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 40 సీట్లు వంతున ఉన్నాయన్నారు. దరఖాస్తులను ఈ నెల 19వ తేదీ సాయంత్రం 4.00 గంటల లోపు apbrafcet.apcfrr.inకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే తాళ్లపాలెం గురుకులం సిబ్బందిని సంప్రదించాలన్నారు. జీవో 36 అమలు చేయకపోతే సమ్మె బాట -
గంజాయి తరలిస్తున్న ఏడుగురు అరెస్టు
నర్సీపట్నం : గొలుగొండ మండలం, కృష్ణదేవిపేట సమీపంలో కారులో గంజాయి తరలిస్తున్న ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 50 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు తెలిపారు. మీడియా సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ, కృష్ణదేవిపేట ఎస్ఐ రుషికేశ్వరరావు సిబ్బందితో కలిసి గురువారం పల్లావూరు చెక్పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. కారులో 50 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయి తరలింపులో రాజవొమ్మంగికి చెందిన గంటిమల్ల రాజుకుమార్ ప్రధాన నిందితుడిగా పేర్కొన్నారు. అతనిపై 14 కేసులు ఉన్నాయన్నారు. చిత్రకొండ వద్ద ఈ గంజాయి కొనుగోలు చేసి రాజమండ్రి తీసుకువెళ్తుండగా పల్లావూరు వద్ద పట్టుకోవడం జరిగిందన్నారు. ప్రధాన నిందితుడితో పాటు అభినేష్ మునియప్పన్, మెరిపో కిశోర్, గంటిమల్ల లోవరాజు, మెరిపో లావణ్య, చెన్నాడ ప్రవీణ్కుమార్, మెరిపో విజయ్కుమార్ను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కారు, 3 స్కూటీలు, ఏడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సీఐ, ఎస్ఐలను డీఎస్పీ అభినందించారు. -
వాహనాల విధ్వంసం కేసులో హైదరాబాద్ యువకుడి అరెస్ట్
యలమంచిలి రూరల్ : గతేడాది డిసెంబరు 9వ తేదీ రాత్రి పట్టణానికి సమీపంలో ఉన్న టిడ్కో గృహ సముదాయం ఆవరణలో నిలిపి ఉంచిన ఆటో, ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేసి వీరంగం సృష్టించిన కేసులో నిందితుడ్ని శుక్రవారం అరెస్ట్ చేసినట్టు పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ గండిమైసమ్మ గుడి సమీపంలో ఉన్న బహదూర్పల్లికి చెందిన తొర్రి కార్తీక్ (23) సామాజిక మాధ్యమం ద్వారా పరిచయమైన యలమంచిలికి చెందిన యువతి కోసం గత డిసెంబరు 9వ తేదీన యలమంచిలి వచ్చాడు. యువతి నివాసముంటున్న టిడ్కో కాలనీ వద్దకు వెళ్లిన యువకుడితో యువతి మాట్లాడేందుకు నిరాకరించించి. దీంతో ఉన్మాదిగా మారిన నిందితుడు కాలనీలో నివాస గృహాల వద్ద నిలిపి ఉంచిన వాహనాల అద్దాలు పగులగొట్టి ధ్వంసం చేశాడు. అనంతరం అక్కడ్నుంచి హైదరాబాదుకు పరారయ్యాడు. ఈ ఘటనపై కాలనీ వాసులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పట్లో కేసు నమోదైంది. దర్యాప్తులో భాగంగా నిందితుడు కార్తీక్ను అరెస్ట్ చేయడానికి పట్టణ ఎస్ఐ ఒక ప్రత్యేక బృందాన్ని హైదరాబాదుకు పంపించారు. అక్కడ అదుపులోకి తీసుకున్న యువకుడ్ని శుక్రవారం అరెస్ట్ చేసి యలమంచిలి కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చినట్టు ఎస్ఐ తెలిపారు. ఇలాంటి విధ్వంసాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు. -
క్రమశిక్షణకు నిలయాలు... గురుకులాలు
నర్సీపట్నం : పేద విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాపూలే ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాలు(ఎంజేపీ) ఆశాకిరణాలుగా నిలుస్తున్నాయి. క్రమశిక్షణ, విలువలతో కూడిన విద్యా బోధన అందిస్తున్నాయి. వీటిలో చదివిన ఎంతోమంది విద్యార్థులు ఉన్నతస్థాయిలో స్థిరపడుతున్నారు. ఎంజేపీ బీసీ గురుకుల పాఠశాల, కళాశాలలో సీట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. క్రమశిక్షణకు మారుపేరు గురుకులం. ఇంగ్లిష్ మీడియంలో విద్యా బోధనతో పాటు క్రీడలు, పోటీ పరీక్షలకు తర్ఫీదు ఇస్తుంటారు. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, అధ్యాపకులతో విద్యా బోధన జరుగుతుంది. అనేక సదుపాయాలు గురుకుల విద్యార్థులకు కల్పిస్తున్నారు. ఈ ఏడాది గురుకులంలో సీట్ల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి జిల్లాలో బాల, బాలికల గురుకుల పాఠశాలల్లో విద్యార్థులు చేరేందుకు ప్రభుత్వం అవకాశాలు కల్పించింది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి సీట్ల భర్తీకి గురుకుల విద్యాలయ సంస్థ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ప్రవేశ పరీక్షల్లో రాణించిన వారికి ప్రాధాన్యమిస్తారు. జిల్లాలో తానాం, పాయకరావుపేట, చోడవరం, అన్నవరం(బాలికలు), నర్సీపట్నం, అనకాపల్లి, సింహాచలం, పెదనరం (బాలుర గురుకులాలు ఉన్నాయి. వీటిలో ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా కౌన్సెలింగ్ విధానంలో విద్యార్థులను ఎంపిక చేస్తారు. బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కేటాయింపు జరుగుతుంది. ఇవీ అర్హతలు.. అర్హులైన విద్యార్థులకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఐదో తరగతి ప్రవేశానికి 9 నుంచి 11 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 9 నుంచి 13 ఏళ్లు లోపు ఉండాలి. ప్రభుత్వం లేదా, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో తప్పనిసరిగా 3,4 తరగతులు చదివి ఉండాలి. తానాం 80 సీట్లు, ఎస్.రాయవరం 40, చోడవరం 40, నర్సీపట్నం 40, అనకాపల్లి 40, సింహాచలం 160, పెదనరం 60, అన్నవరం 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తానాం, సింహాచలంలో ఇంటర్మీడియేట్ అందుబాటులో ఉంది. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ, సీఈసీ గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. సీట్లకు డిమాండ్ పెరిగింది.. ఎంజేపీ గురుకులంలో సీట్ల డిమాండ్ పెరిగింది. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తాం. నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ ఉంటుంది. వారి అభ్యున్నతికి ఇక్కడే బాటలు వేస్తాం. క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుండడంతో సీట్లకు డిమాండ్ పెరిగింది. 6,7,8 తరగతుల్లో మిగిలిన సీట్లను ప్రవేశ పరీక్ష ద్వారా భర్తీ చేస్తున్నాం. ప్రభుత్వం కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి – డా..ఎం.విజయ్దేవరాజు, ప్రిన్సిపాల్ ఎంజేపీ గురుకులం, నర్సీపట్నం -
యూఎఫ్ఎస్ వేగవంతం కావాలి
మునగపాకలో ఇంటింటా సర్వే వివరాలను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్ విజయకృష్ణన్ మునగపాక : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యునైటెడ్ ఫ్యామిలీ సర్వే పనులు వేగవంతం కావాలని జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ కోరారు. మునగపాకలో జరుగుతున్న సర్వే పనులను గురువారం ఆమె పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనకాపల్లి జిల్లాలో మునగపాక మండలంలో సర్వే పనులు మందకొడిగా సాగుతున్నందున అధికారులు సమన్వయం చేసుకొని ప్రక్రియ వేగవంతమయ్యేలా చూడాలని ఆదేశించారు. ప్రతి కుటుంబానికి సంబంధించి ఆర్థిక స్థితిగతులతో పాటు ఆధార్, మొబైల్ నంబర్ల వివరాలు సేకరించాలన్నారు. ఆమె వెంట ఎంపీడీవో ఎం.ఉషారాణి, తహసీల్దార్ పి.సత్యనారాయణ, డీఎల్డీవో మంజులావాణి, ఈవోఆర్డీ సోమరాజు పాల్గొన్నారు. -
లూలూరులో సర్వే పనులను అడ్డుకున్న రైతులు
బుచ్చెయ్యపేట : లోపూడి శివారు లూలూరులో సైనిక శిక్షణ కేంద్రానికి అదనపు భూ సేకరణ పనులను స్థానిక రైతులు అడ్డుకున్నారు. రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా భూ సేకరణకు రావడతో సర్వే అధికారులను పలు గ్రామాల రైతులు అడ్డుకున్నారు. తమ భూముల్లో సర్వే చేస్తే ఆందోళనకు దిగుతామని కూడు పెడుతున్న భూములను మాకు దక్కకుండా చేస్తారా అంటూ సర్వే సిబ్బందిపై రైతులు మండి పడ్డారు. గతంలో భూ సేకరణ ద్వారా వందలాది ఎకరాలు తీసుకుని మా పొట్టలు కొట్టారు... మరలా రెండోసారి మా భూములను లాక్కోని మమ్మల్ని రోడ్డున పడేస్తారా..? అంటూ అధికారులపై మండి పడ్డారు. నేలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో సర్వే చేయడానికి వచ్చిన అధికారులు చేసేది లేక వెనుదిరిగారు. లోపూడి శివారు లూలూరులో పదేళ్లు కిందట సైనిక శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. అప్పట్లో లోపూడి, శింగవరం, బంగారుమెట్ట, ఎల్బీ పురం, వడ్డాది, పొట్టిదొరపాలెం తదితర గ్రామాలకు చెందిన వందలాది మంది రైతుల నుంచి సుమారు 1,300 ఎకరాలు సేకరించి సైనిక శిక్షణ కేంద్రం(డీఆర్డీఓ) ఏర్పాటు చేశారు. మరలా సైనిక శిక్షణ కేంద్రం విస్తరణకు రెండోసారి మరో 550 ఎకరాలు వరకు భూ సేకరణ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. అయితే ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా రైతుల భూముల్లో సర్వే పనులు చేపడుతుండడంతో రైతులు మండిపడుతున్నారు. గురువారం సర్వే చేయడానికి వచ్చిన రెవిన్యూ అధికారులను వారంతా అడ్డుకున్నారు. గ్రామ సభ పెట్టకుండా, రైతులకు సమాచారం లేకుండా సర్వే ఎలా చేస్తారని నిలదీశారు. రైతులు అడ్డుకోవడంపై తహసీల్దార్ లక్ష్మి దృష్టికి సర్వే సిబ్బంది తీసుకెళ్లారు. రైతు సంఘ నాయకులతో సమావేశమవుతామని గ్రామ సభ పెడతామని తహసీల్దార్ లక్ష్మి సర్వే సిబ్బందికి సూచించారు. -
2 మద్యం బార్లకు లైసెన్సుల మంజూరు
తుమ్మపాల : జిల్లాలో రెండు నోటిఫైడ్ బార్లకు 10 దరఖాస్తులు అందాయని, లాటరీ నిర్వహించి ఇద్దరు విజేతలను ఎంపిక చేసి, ప్రతి బార్కు ఆర్ 1, ఆర్ 2 రిజర్వ్ అభ్యర్థులను ఖరారు చేసామని జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు అన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన లైసెన్సుల ఎంపిక ప్రక్రియను గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో లాటరీ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రాలో ఎంపికై ెన అభ్యర్థులు రూ.13.75 లక్షల చెల్లించి తాత్కాలిక లైసెన్సును పొందారన్నారు. పూర్తి లైసెన్స్ ఫీజును ఆరు వాయిదాలలో చెల్లించే వెసులుబాటు కల్పించామన్నారు. రెండు, మూడో సంవత్సరాల్లో లైసెన్స్ ఫీజుపై ఏటా 10 శాతం పెంపు ఉంటుందన్నారు. లైసెన్స్దారులు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలు, చట్టాలకు కట్టుబడి, నిర్ణీత ప్రాంగణాల్లోనే వ్యాపారం నిర్వహించాల్సి ఉంటుందన్నారు. విక్రయాలు, నిబంధనల అమలుపై నిశిత పర్యవేక్షణ చేపడతామని, ఉల్లంఘనలు జరిగితే కఠినమైన శాఖా పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వి.సుధీర్, ఎఈఎస్ అధికారులు, ఆశావహులు పాల్గొన్నారు. -
బలవంతపు భూ సేకరణపై రైతుల ఆందోళన
బుచ్చెయ్యపేట: బలవంతపు భూ సేకరణ పనులను అధికారులు నిలిపివేయాలని ఆర్. శివరాంపురం, అప్పంపాలెం గ్రామాల రైతులు ఆందోళనకు దిగారు. గురువారం రెండు గ్రామాల్లో రామాలయాల వద్ద రైతులు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిశ్రమలు ఏర్పాటుకు తమ గ్రామాల్లో భూ సేకరణ చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారని, దీనికి తాము వ్యతిరేకమన్నారు. పరిశ్రమలకు తమ భూములను ఇచ్చేది లేదన్నారు. బలవంతపు భూ సేకరణ ఆపాలని, తమకు అన్నం పెడుతున్న భూములను లాక్కోవొద్దంటూ వేడుకున్నారు. ‘మాకు అన్నం పెట్టే భూములే మాకు ముద్దు, కంపెనీల కోసం చేపట్టే భూ సేకరణ మాకొద్దు, భూ సేకరణ కోసం చేపట్టే సర్వేలు మాకొద్దు’ అంటూ రైతులు నినాదాలు చేశారు. రైతుల భూ సమస్యలపై తప్ప పరిశ్రమల కోసం ఎటువంటి సర్వేలు తమ గ్రామాల్లో చేయొద్దని తహసీల్దార్ లక్ష్మికి రైతులు, రైతు సంఘ ప్రతినిధులు వినతి పత్రం అందించారు. -
నేడు దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు
అనకాపల్లి : దివ్యాంగ బాలబాలికల కోసం జిల్లా స్థాయి ఆర్ట్ అండ్ కల్చరల్ పోటీలను ఈనెల 6న స్థానిక గాంధీనగరం ఎస్.ఆర్.శంకరన్ మీటింగ్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో తమ కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష సహిత విద్య విభాగం ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించడం జరుగుతుందని గురువారం ఆయన చెప్పారు. డ్రాయింగ్, డ్యాన్స్, క్రాఫ్ట్, సింగింగ్, డ్రామా తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి విభాగంలో వయోపరిమితి ఆధారంగా సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామని, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మాజీ వార్డు సభ్యుడు మృతి
మునగపాక : స్థానిక ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న బీలా లక్ష్మణరావు అనకాపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారం మృతి చెందారు. లక్ష్మణరావు గతంలో పంచాయతీ వార్డు సభ్యునిగా పనిచేసి తన వార్డు అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. అనకాపల్లిలో సొంత పని నిమిత్తం వెళ్లి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందారన్న విషయం తెలియడంతో మునగపాక వాసులు ఆవేదనకు గురయ్యారు. అందరితో ఆత్మీయంగా ఉండే లక్ష్మణరావు మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. లక్ష్మణరావు భార్య స్రవంతి ఇటీవల శ్రీకాళహస్తి దేవాలయ ట్రస్ట్బోర్డు సభ్యురాలిగా సేవలందిస్తున్నారు. భర్త మృతి విషయం తెలుసుకున్న ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ దుర్ఘటన విషయం తెలిసి ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్, వైఎస్సార్సీపీ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్మణరావు మృతదేహానికి శుక్రవారం పోస్టుమార్టం నిర్వహించి అదే రోజు అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. లక్ష్మణరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ఆశ..నిరాశ !
‘పని ఒత్తిడి ఎక్కువ..చాలీచాలని జీతాలు..పెరిగిన నిత్యావసర ధరలతో ఇబ్బందులు.. ఒక వైపు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను, డిమాండ్లను అమలు చేయలేదు. మరోవైపు ‘ఆశా’లకు ప్రస్తుతం వర్తించని జీవోలతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది. ఇచ్చే జీతం గోరంత...వారితో చేయించుకునే పని మాత్రం మూరెడు. ఒక వైపు రోజువారీ విధులైన గర్భిణులకు చెకప్లు, వైద్య సంబంధమైన విధులు..మరోవైపు తమకు సంబంధం లేని పింఛన్ల పంపిణీ, స్మార్ట్ మొబైళ్లతో సర్వే వంటి విధులు..ఇలా తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తూ ‘ఆశ’..నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. బాబు పాలనలో ●వేతనాల పెంపుపై మాట తప్పిన ప్రభుత్వం ●పని భారం, వేతనాలు పెంచకపోవడం ●లేబర్ కోడ్తో కార్మికుల హక్కులు కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం ●సర్వేల పేరిట తీవ్ర ఒత్తిడి ●ఆందోళనకు సిద్ధమవుతున్న ఆశాలు, కార్మికులు●జిల్లాలో పనిచేస్తున్న 1,445 మంది ఆశాలుసాక్షి, అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఇచ్చిన హామీలు, పెండింగ్లో ఉన్న హామీలను అమలు చేయకుండా మొండిచేయి చూపించింది. ఆశా వర్కర్స్ యూనియన్కు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి, ప్రసూతి సెలవులు, ఉద్యోగ విరమణ ప్రోత్సాహంతో గత బడ్జెట్లో సరిపెట్టింది. తమకు ఉద్యోగ భద్రత కల్పించి కమ్యునిటీ హెల్త్ వర్కర్స్ని ఆశా వర్కర్స్గా మార్పు చేయాలని, ప్రభుత్వ సెలవులు, క్యాజువల్ లీవ్లు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, రూ.పది లక్షల వరకూ బీమా సౌకర్యం తదితర అంశాలపై ఆశా వర్కర్స్ యూనియన్తో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అమలు చేయాలని ఏపీ ఆశా వర్కర్ల యూనియన్ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శికి గతంలో విజ్ఞప్తి చేసింది. కానీ ఈ ప్రధాన డిమాండ్తో పాటు ఉద్యోగ భద్రత, ఏఎన్ఎం కోర్సు పూర్తి చేసిన వారికి పదోన్నతి కల్పనను ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం బడ్జెట్లో కూడా ఆశ వర్కర్ల గురించి ఆలోచన చేయలేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆశ వర్కర్లకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తమ డిమాండ్లపై గతంలో ఆశ కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించినపుడు ప్రభుత్వం హామీలన్నింటినీ అమలు చేస్తామంటూ చర్చలకు అంగీకారం తెలిపింది. కానీ క్షేత్రస్థాయిలో అమలుకు నోచుకోలేదు. దీనిపైనా మూడు నెలల క్రితం ఆశావర్కర్లు నిరసన తెలిపారు. ఆశ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలని, 2024 ఫిబ్రవరి 9వ తేదీన ఇచ్చిన ఒప్పంద మినిట్స్ కాపీలకు జీవోలు ఇచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ రద్దుతో కార్మికుల హక్కులు కూడా హరించిపోతున్నాయి. లేబర్ కోడ్ రద్దుపై జిల్లాలో 1445 మంది ఆశాలతో ఉద్యమబాట పడుతున్నారు. ఆదుకున్నది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వమే.. వాస్తవానికి వేతనాలు పెంచి ఆశా కార్యకర్తలను ఆదుకున్నది వై.ఎస్.జగన్ ప్రభుత్వం. 2019కి ముందు వరకు చాలీచాలని వేతనాలతో ఆశాలు అగచాట్లు పడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆ సమయంలో తమ వేతనాలు పెంచి ఆదుకోవాలని పాదయాత్రలో వై.ఎస్ జగన్ను ఆశా సిబ్బంది కోరారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2019 ఆగస్టులో ఆశాల వేతనాలను రూ.10 వేలకు పెంచారు. అయితే, పెరిగిన జీవన వ్యయాలు, కుటుంబ అవసరాలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని గత ఏడాది డిసెంబరులో రాష్ట్రవ్యాప్తంగా ఆశా సిబ్బంది ధర్నాకు దిగారు. మరోపక్క చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక స్థానిక నాయకులు వీరిపై దాడులు మొదలుపెట్టారు. గ్రామాల్లో పనిచేస్తున్న ఆశాలను రాజకీయ కారణాలతో తొలగించి, వారి పొట్టగొట్టే పన్నాగానికి తెర తీశారు. -
గ్యాస్ డెలివరీకి అధిక చార్జీలు వసూలు చేస్తే చర్యలు
దేవరాపల్లి: గ్రామాల్లో గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులకు సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీ నుంచి 15 కి.మీ పరిధి వరకు ఉచితంగా సరఫరా చేయాలని, ఎటువంటి డెలివరీ ఛార్జీలు తీసుకోవడానికి వీల్లేదని జిల్లా పౌర సరఫరా అధికారి కె.వి.ఎల్.ఎన్. మూర్తి స్పష్టం చేశారు. దేవరాపల్లి రైవాడ అతిథి గృహ ఆవరణలో గురువారం జరిగిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన 3.0 పథకం ద్వారా తెల్ల రేషన్ కార్డు కలిగిన అర్హులైన లబ్ధిదారులకు సుమారు రూ. 4500 విలువ చేసే గ్యాస్ కనెక్షన్ను అందజేస్తున్నామన్నారు. ఈ గ్యాస్ కనెక్షన్తో స్టౌ, సిలిండర్, రెగ్యులేటర్, ధృవపత్రం తదితర సామగ్రిని అందజేస్తున్నామన్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరాలో నిర్ణీత ధర కంటే మండల కేంద్రంలోనే రశీదుపై ధర కంటే ఎక్కువగా సొమ్ము తీసుకుంటున్నారని డీఎస్వో వద్ద స్థానిక విలేకరులు ప్రస్తావించగా,. దీనిపై డీఎస్వో మూర్తి స్పందిస్తూ గ్రామాల్లో గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే గ్యాస్ ఏజెన్సీ సిబ్బందికి 15 కిలోమీటర్ల పరిధి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఎక్కడైనా అధికంగా వసూలు చేస్తున్నట్టు ఆధారాలతో ఫిర్యాదు చేస్తే విచారణ చేసి నిర్ధారణ అయితే నివేదికను సదరు ఆయిల్ కంపెనీ ప్రతినిధులకు సైతం పంపిస్తామన్నారు. గ్యాస్ సిలిండర్ తీసుకున్న లబ్ధి దారులు తక్షణమే ఆన్లైన్ రశీదు తీసుకుని, రశీదులో ఉన్న సొమ్ము మాత్రమే చెల్లించాలని సూచించారు. ఆయన వెంట సీఎస్డీటీ కె.రవి పాల్గొన్నారు. -
బంగారు నగలు దొంగిలించిన కిలాడీ మహిళల అరెస్ట్
అల్లిపురం: శ్రీకాకుళం వెళ్లే క్రమంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఒక మహిళా ప్రయాణికురాలి నుంచి బంగారు ఆభరణాలు తస్కరించిన ఇద్దరు మహిళా దొంగలను ఫోర్త్ టౌన్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. బుధవారం జరిగిన ఈ అరెస్టుకు సంబంధించిన వివరాలను క్రైం డీసీపీ కె. లతా మాధురి గురువారం మీడియా సమావేశంలో వెల్లడించారు. బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం గ్రామానికి చెందిన వోల్లా జ్యోతి .. తన తల్లితో కలిసి శ్రీకాకుళం వెళ్లేందుకు ఈ నెల 3వ తేదీన రత్నాచల్ ఎక్స్ప్రెస్లో విశాఖ చేరుకున్నారు. రైల్వే స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్కు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆ ప్రయాణ సమయంలోనే గుర్తుతెలియని వ్యక్తులు జ్యోతి బ్యాగులోని బంగారు ఆభరణాలను దొంగిలించారు. మరుసటి రోజు నగలు కనిపించకపోవడంతో విషయాన్ని గమనించిన బాధితురాలు, తన భర్త ద్వారా ‘డయల్ 112’ కు సమాచారం అందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు, ఆటోలో తమతో పాటు ప్రయాణించి సంగం శరత్ థియేటర్ వద్ద దిగిపోయిన ఇద్దరు మహిళలపై అనుమానం వ్యక్తమైంది. నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి పర్యవేక్షణలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా, రైల్వే న్యూ కాలనీ జంక్షన్ వద్ద అనుమానాస్పదంగా కనిపిస్తూ తప్పించుకోబోతున్న ఇద్దరు మహిళలను వెంబడించి పట్టుకున్నారు. నిందితులు విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన మేకల గంగ, అనకాపల్లి జిల్లా కె. కోటపాడుకు చెందిన రావుల ఎల్లారమ్మలుగా గుర్తించారు. వారి నుంచి రూ.6 లక్షల విలువైన 280 గ్రాముల బంగారు ఆభరణాలను (రెండు నెక్లెస్లు, ఆరు గాజులు) స్వాధీనం చేసుకుని, నిందితులను రిమాండ్కు తరలించారు. కేవలం గంటల వ్యవధిలోనే కేసును ఛేదించి సొత్తును రికవరీ చేసిన పోలీసు బృందాన్ని అధికారులు అభినందించారు. -
వివాహిత ఆత్మహత్య
మృతురాలు సంతోషిమునగపాక : మండలంలోని నాగులాపల్లి జగనన్న కాలనీలో వివాహిత గురువారం ఆత్యహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి. నాగులాపల్లి జగనన్న కాలనీలో ఉంటున్న ఆళ్ల ఆదినారాయణతో మాకవరపాలెం మండలం జి.కోడూరు గ్రామానికి చెందిన సంతోషికుమారితో 2012లో వివాహం జరిగింది. వివాహ సమయంలో సంతోషి తల్లితండ్రులు అనుకున్న ప్రకారం కట్నకానుకలు అందించారు. ఇరువురు దంపతులు అచ్యుతాపురంలోని బ్రాండిక్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం ఇద్దరూ అల్పాహారం తీసుకున్నారు. ఆదినారాయణ తన కుమారుడు చదువుకుంటున్న నాగులాపల్లి హైస్కూల్కు బైక్పై తీసుకువెళ్లి కూరగాయలు కొనుక్కొని తిరిగి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వచ్చిన ఆదినారాయణ తలుపులు తీయాలని తన భార్య సంతోషిని పిలుస్తున్నా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి గునపాంతో తలుపులు తీసి చూడగా అప్పటికే ఫ్యాన్కు చీర ఉరివేసుకొని విగతజీవిగా కిందపడి ఉంది. కొన ఊపిరితో ఉన్న సంతోషిని గమనించి ఆటోలో అనకాపల్లి వందపడకల ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి సంతోషి మృతి చెందినట్టు తెలిపారు. మృతురాలు సంతోషికి పాప,బాబు ఉన్నారు. పాప పాటిపల్లి మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుకుంటుంది. అలాగే బాబు నాగులాపల్లిలో అయిదో తరగతి చదువుకుంటున్నారు. కాగా సంతోషి మృతికి అదనపు కట్నంతో పాటు భర్త వేధింపులే కారణమని, ఈ విషయమై తగు న్యాయం చేయాలని కోరుతూ మృతురాలి తండ్రి రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. -
తెలివైన ఆలోచనలతో ఉన్నత శిఖరాలు
మాట్లాడుతున్న నవలా రచయిత యండమూరి గొలుగొండ: విద్యార్థులు తెలివైన ఆలోచనలు చేసినప్పుడే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారని నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ తెలిపారు. మండలంలోని కృష్ణదేవిపేటలో నేను సైతం చారిటబుల్ ట్రస్టు, అనకాపల్లి పోలీసుల సౌజన్యంతో గురువారం విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ భవిష్కత్లో ఎలా ముందుకెళ్లాలో ఆలోచన చేసుకుని, ఆ దిశగా అడుగులు వేయాలని సూచించారు. విద్యార్థుల ఆలోచన ప్రకారమే తల్లిదండ్రులు సహకారం ఉండాలన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో నాతవరం, కృష్ణదేవిపేట ఎస్ఐలు తారకేశ్వర్రావు, రుషికేశ్వర్రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ట్రస్టు వ్యవస్థాపకుడు ప్రసాద్ పాల్గొన్నారు. -
యలమంచిలి వైస్ ఎంపీపీగా అమ్మాజీ ఎన్నిక
యలమంచిలి రూరల్: యలమంచిలి మండల పరిషత్ ఉపాధ్యక్షురాలిగా ఏటికొప్పాక–1 ఎంపీటీసీ నగిరెడ్డి అమ్మాజీ ఎన్నికయ్యారు.బుధవారం ఉదయం 11 గంటలకు స్థానిక మండల పరిషత్ మీటింగ్ హాల్లో ఎంపీటీసీ సభ్యులతో ప్రిసైడింగ్ అధికారి పి.కె.పి.ప్రసాద్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు.మొత్తం ఆరుగురు ఎంపీటీసీ సభ్యులకు గాను నలుగురు సభ్యులు ఎంపీపీ రాజాన శేషు,శిలపరశెట్టి ఉమ,బర్రే శివలక్ష్మి మాత్రమే హాజరయ్యారు.వీరిలో ఎంపీపీ రాజాన శేషు నగిరెడ్డి అమ్మాజీని వైస్ ఎంపీపీగా ప్రతిపాదించగా శిలపరశెట్టి ఉమ మద్దతిచ్చారు.దీంతో నగిరెడ్డి అమ్మాజీ ఏకగ్రీవంగా ఎన్నికై నట్టు పీవో ప్రకటించారు. గెలుపొందినట్టు ఆమెకు ధ్రువీకరణ పత్రం అందజేసి,ప్రమాణం చేయించారు.వైస్ ఎంపీపీగా ఎన్నికై న అమ్మాజీకి ఎంపీపీ రాజాన శేషు,ఎంపీడీవో కొండలరావు,సిబ్బంది,ఎంపీటీసీలు అభినందనలు తెలిపారు.ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం ఉపేంద్ర బందోబస్తు ఏర్పాటు చేశారు. -
సీనరేజీ పేరిట దోపిడీ!
ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనరేజీ వసూలు చేసే ప్రైవేట్ ఏజెన్సీ దోపిడీ మితిమీరిపోయింది. అడ్డూ అదుపూ లేకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.అడిగినంత చెల్లించని వారిపై సిబ్బంది దౌర్జన్యానికి దిగుతున్నారు. సొంత అవసరాల కోసం సొంత పొలంలో మట్టిని తవ్వినా ప్రైవేట్ సంస్థ సిబ్బంది వదలడం లేదు. – నర్సీపట్నం గొలుగొండ మండలం ఏటిగైరంపేట గ్రామానికి చెందిన రైతు పొలం వద్ద పశువుల షెడ్డు నిర్మాణం చేపట్టారు. ఇందుకోసం తన సొంత పొలంలోని మట్టిని ట్రాక్టర్లలో తీసుకువెళ్తున్నాడు.ఆ సమయంలో వచ్చిన కొంతమంది డబ్బులు కట్టకుండా ఎలా తీసుకెళతారని గద్దించి మరీ వసూలు చేశారు. ● నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి జోగునాథునిపాలెంలో ఓ నిరుపేద ఇంటి నిర్మాణం చేపట్టాడు. ట్రాక్టరుతో మట్టి తీసుకువెళ్తున్నాడు. ఇంతలో కొంత మంది వచ్చి ట్రాక్టరును అడ్డగించారు. డబ్బులు కడితేనే కానీ కదలనివ్వబోమని భీష్మించారు. పోనీ కదాఅని సొమ్ము చెల్లిస్తే రసీదు ఇవ్వడం లేదు. డిజిటల్ చెల్లింపులకు ఒప్పుకోవడం లేదు. నగదు మాత్రమే చెల్లించాలంటూ గూండాల్లా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనరేజీ వసూలు బాధ్యత తీసుకున్న ఏఎంఆర్ సంస్థ నిర్వాకమిది. కనీస నిబంధనలు పాటించకుండా ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. జిల్లాలో సీనరేజీ వసూలు బాధ్యత తీసుకున్న ఏఎంఆర్ అనే సంస్థ రెండేళ్లకు రూ.450 కోట్లు చెల్లించే విధంగా చంద్రబాబు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. చెల్లించిన మొత్తంతో పాటు లాభాలు దండుకోవడం కోసం సదరు సంస్థ అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. అడిగినంత చెల్లించాల్సిందే... ట్రాక్టర్ మట్టికి సీనరేజీ రూ.300లోపే చెల్లించాల్సి ఉంది. అయితే సిబ్బంది రూ.410పైగా వసూలు చేస్తున్నారు. 500 చదరపు అడుగులలోపు చేపట్టే ఇంటి నిర్మాణాలకు గ్రావెల్, మట్టి తరలించేందుకు ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అయితే ఆ నిబంధనను సదరు సంస్థ సిబ్బంది మాత్రం పట్టించుకోవడం లేదు. రైతులు తమ సొంత పొలాల్లో మట్టి తవ్వుకున్నా సరే సీనరేజీ చెల్లించే వరకూ వేధిస్తున్నారు. కనీస నిబంధనలు పాటించకుండా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఈ వసూళ్లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పలుచోట్ల ఘర్షణ వాతావరణం నెలకుంటోంది. మాఊళ్లలో మీ పెత్తనం ఏంటని నిలదీస్తున్నారు. అడ్డగోలు వసూళ్లపై నర్సీపట్నంలో ట్రాక్టర్ యజమానులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రైవేట్ సంస్థ సిబ్బంది తీరుపై గొలుగొండ మండలం, చీడి గుమ్మలలో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర ప్రాంతాలకు తరలించి, వ్యాపారం చేసే ట్రాక్ట ర్లు, లారీ యజమానుల నుంచి వసూలు చేస్తే ఫరవాలేదు కానీ..సొంత అవసరాల కోసం తీసు కెళ్తున్న సామాన్యుల నుంచి డబ్బులు గుంజడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ట్రాక్టర్ల యజమానులు గృహస్థుల నుంచి రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు అదనంగా తీసుకుంటున్నారు. ఇసుకతో పాటు గ్రావెల్కు అధిక మొత్తం చెల్లించాల్సి రావడంతో గృహాలు కట్టుకునేందుకు సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు. పట్టించుకోవాల్సిన భూగర్భ గనులశాఖ మిన్నకుంటోంది. ఈ విషయమై మైనింగ్ ఏడీ శివాజీ స్పందిస్తూ అదనంగా వసూళ్లు చేస్తున్నట్టు తన దృష్టికి రాలేదన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సీనరేజీ కంటే అదనంగా చెల్లించవలసిన పనిలేదని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లు దందా సాగిస్తున్న ప్రైవేటు సంస్థ సిబ్బంది అడిగినంత చెల్లించకపోతే దౌర్జన్యం సిబ్బంది తీరుపై జనం ఆగ్రహం -
మల్లాంలో సర్వే అడ్డగింత
బుచ్చెయ్యపేట: మండలంలో గల మల్లాం గ్రామంలో భూ సర్వే పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మండల శివారు పంచాయతీ మల్లాం, ఆర్. భీమవరం, అప్పంపాలెం, ఆర్.శివరాంపురం, ఎంబీ పాలెం గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో కూడా సెజ్కు భూములు అప్పగించడానికి అధికారులు చూడగా పై గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో అధికారులు సర్వే పనులు ఆపేశారు. మళ్లీ సెజ్కు పై గ్రామాలకు చెందిన భూములను అప్పగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం 15 మంది సర్వేయర్లు, వీఆర్వోలు, ఇతర సిబ్బంది మల్లాం గ్రామంలో భూములను సర్వే చేయడానికి వెళ్లగా గ్రామస్తులు సర్వే అధికారులను అడ్డుకున్నారు. మా భూములను ఎందుకు సర్వే చేస్తున్నారు.. మాకు కంపెనీలు వద్దు.. మాకు కూడు పెడుతున్న భూములను మీకు ఇవ్వబోమంటూ నేలపై కూర్చొని ఆందోళనకు దిగారు. గ్రామస్తులు నేలపై కూర్చొని అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్నారు. నిరుపేదలమైన మమ్మల్ని అధికారులు చిన్న చూపు చూస్తున్నారని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా భూములను బలవతంగా తీసుకోవాలని చూస్తే ఉద్యమిస్తామని పలు గ్రామాల సర్పంచ్లు, నాయకులు మండి పడ్డారు. అధికారులూ...మాకు అన్యాయం చేయొద్దు అంటూ నినాదాలు చేశారు. గ్రామస్తులు సర్వే పనులను అడ్డుకున్నట్టు తహసీల్దార్ లక్ష్మికి రెవెన్యూ సిబ్బంది తెలిపారు. గురువారం గ్రామంలో గ్రామసభ పెట్టి రైతుల అమోదం తీసుకుంటామని తహసీల్దార్ లక్ష్మి గ్రామ నాయకులకు ఫోన్ ద్వారా తెలిపారు. దీంతో సర్వే సిబ్బంది వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బర్ల శివ,అమ్మునాయుడు, నమ్మి నీరజ అప్పలరాజు, రాము పాల్గొన్నారు. -
గ్రేటర్ బడ్జెట్ రూ.4,047.12 కోట్లు
డాబాగార్డెన్స్(విశాఖ): మహా విశాఖ నగర పాలక సంస్థ 2026–27 వార్షిక బడ్జెట్కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన బడ్జెట్ సమావేశం జరిగింది. కూటమి సభ్యులు(తెలుగుదేశం, జనసేన, బీజేపీ), వైఎస్సార్ సీపీ, సీపీఎం, సీపీఐ సభ్యులు బడ్జెట్ను ఆమోదించడం గమనార్హం. ముందుగా బడ్జెట్కు సంబంధించి మేయర్ పీలా శ్రీనివాసరావు క్లుప్తంగా వివరించారు. అనంతరం ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి వివిధ విభాగాలకు సంబంధించి ఎంతెంత కేటాయించారో వివరించారు. బడ్జెట్ ఇలా.. ప్రారంభ నిల్వ రూ.365.96 కోట్లు. అన్ని పద్దుల కింద జమలు రూ.3,814.41 కోట్లు కాగా, మొత్తంగా రూ.4,180.37 కోట్లు ఆదాయంగా పేర్కొన్నారు. అన్ని పద్దుల కింద ఖర్చులు రూ.4,047.12 కోట్లుగా, ముగింపు నిల్వగా రూ.133.25 కోట్లుగా నిర్ణయించినట్టు చెప్పారు. 2025–26 సవరించిన బడ్జెట్ రూ.4,070.19 కోట్లుగా చూపారు. 2026–27 ఏడాదికి ఆశించిన జమల్లో రూ.1,101.80 కోట్ల పెరుగుదల ఏర్పడింది. పన్నులు ఇలా.. జీవీఎంసీ వసూలు చేస్తున్న ఇంటిపన్ను, ఖాళీ జాగా పన్ను, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వీసు చార్జీలు, స్టీల్ప్లాంట్, పోర్టు తదితర పారిశ్రామిక సంస్థలు చెల్లించాల్సిన పన్నులు, సర్వీసు చార్జీలు, ప్రకటన చార్జీలు, సెల్టవర్స్ చార్జీలు, జంతువులపై పన్ను తదితర ఈ పద్దు కింద రూ.680 కోట్లుగా చూపారు. పన్నులు కాని ఇతర ఆదాయాలు నీటి సరఫరా చార్జీలు, పట్టణ ప్రణాళికా విభాగం వసూళ్లు. షాపురూముల అద్దెలు, కల్యాణమండపాల అద్దెలు, లీజులు, బల్క్, సెమీబల్క్, ఇతర నీటి సరఫరా చార్జీలు, వ్యాపార సంస్థల లైసెన్స్ ఫీజులు తదితరవి రూ.869.55 కోట్లుగా చూపారు. ప్రభుత్వం నుంచి సంక్రమించే ఆదాయం స్టాంప్ డ్యూటీపై సర్చార్జ్, వృత్తిపన్ను, తలసరి గ్రాంటు, మోటారు వాహనాల పన్ను, ఆస్తిపన్ను రాయితీ నష్టపరిహారాలు, మెజిస్టీరియల్ జరీమానాలు తదితరవి ప్రభుత్వం నుంచి వచ్చే ఆదాయం రూ.200 కోట్లుగా చూపారు. ప్రభుత్వ గ్రాంట్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అర్బన్ ఛాలెంజ్ నిధుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.162.50 కోట్లు, పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం నిధులు రూ.35 కోట్లు, పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.10 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.240 కోట్లు, అమృత్కు రూ.102 కోట్లు, అసియా అభివృద్ధి బ్యాంకు రూ.58 కోట్లు వస్తాయని ఆశించారు. బడ్జెట్ ఆశాజనకంగా లేదు బడ్జెట్లో పబ్లిక్ హెల్త్, హార్టికల్చర్, డ్రెయిన్లు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలకు నిధులు మరింత పెంచి ఉంటే బాగుండేది. బడ్జెట్ ఆశాజనకంగా లేదు. ప్రస్తుత పాలకవర్గం గడువు వచ్చే నెల నుంచి ముగుస్తున్న నేపథ్యంలో జీవీఎంసీ అభివృద్ధికి నగర ఎమ్మెల్యేలు దృష్టి సారించాలి. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాబట్టడానికి ప్రయత్నించాలి. –బాణాల శ్రీనివాసరావు, ఫ్లోర్ లీడర్, వైఎస్సార్ సీపీ, జీవీఎంసీ ఆమోదించిన పాలకవర్గం బ్యాంకులు/ఆర్థిక సంస్థలు/ బాండ్ల ద్వారా రుణాలు జోన్–2 మధురవాడ ప్రాంతంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి, జీవీఎంసీకి అవసరమైన వాటా సొమ్మును 2026–27 ఏడాదికి రూ.457.50 కోట్లు బ్యాంకులు/ఆర్థిక సంస్థలు/బాండ్లు/ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకొని నిధుల సమకూర్చుకునేందుకు బడ్జెట్లో ప్రతిపాదించారు. -
రెవెన్యూ ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించండి
తుమ్మపాల: రెవెన్యూ ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు. రీసర్వేపై వచ్చిన ఫిర్యాదులపై రీవెరిఫికేషను చేసి సరి చేయాలని, తప్పులు లేని పట్టాదారు పాసుపుస్తకాలను ప్రజలకు అందించాలన్నారు. రీసర్వే, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ, నీటితీరువా, సివిల్ సప్లయి తదితర పలు రెవెన్యూ అంశాలపై బుధవారం కలెక్టరేట్ నుంచి ఆమె తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రీసర్వేలో వచ్చిన ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, రీ వెరిఫికేషను తరువాత పేరు, సర్వే నంబరు, విస్తీర్ణం వివరాల్లో తప్పులు లేని పాసుపుస్తకాలను భూయజమానులకు అందించాలన్నారు. క్షేత్ర స్థాయిలో పంపిన నివేదికలోని వివరాలను సరిచూసుకుని సంతృప్తి పొందిన తరువాత మాత్రమే తహసీల్దార్లు రిపోర్టు పంపించాలన్నారు. రీ–వెరిఫికేషన్ తరువాత భూ వివరాలు, పాసుపుస్తకాల్లో తప్పులు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించి, వివరాలను పిర్యాదుదారునికి తెలియజేసి ఎండార్స్మెంట్ కాపీ అందజేయాలని సూచించారు. జిల్లాలో రీసర్వే పనులు షెడ్యూలు ప్రకారం పూర్తిచేయాలని, రీ సర్వే, భూమి వివరాలను భూయజమానులకు తప్పని సరిగా తెలియజేయాలని సూచించారు. ప్రభుత్వ భూముల వివరాలను తప్పని సరిగా రికార్డుల్లో నమోదుచేయాలన్నారు. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ పూర్తిచేయాలన్నారు. రైతులకు అవగాహన కల్పించి శతశాతం నీటి తీరువా వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సివిల్ సప్లయికి సంబంధించి డిజిటల్ కార్డులన్నింటిని పంపిణీ చేయాలని, రేషన్ షాపుల్లో నెలవారీ తనిఖీలు చేయాలని, దీపం పథకం నగదు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సర్వే వేగవంతం కుటుంబ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ ఎంపీడీవోలను ఆదేశించారు. రెండు రోజుల్లో దీనిని పూర్తిచేయాలన్నారు. కుటుంబ సర్వే, అక్షర ఆంధ్ర, ఈపీటీఎస్ అప్లోడ్ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువు లోపలే గృహ సర్వేను శత శాతం పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటివరకు 72 శాతం పూర్తయిందన్నారు. అక్షరాంధ్ర కార్యక్రమం క్రింద జిల్లాలో 89,944 మంది నిరక్షరాస్యులను గుర్తించామని, వారందరినీ వలంటీర్లతో మ్యాప్ చేసి, అక్షరాస్యులుగా దిద్దే కార్యక్రమం వెంటనే చేపట్టాలని సూచించారు. మార్చిలో నిర్వహించే ప్రత్యేక పరీక్షకు సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతి ఉద్యోగి నెలలో కనీసం 3 నుంచి 5 ఉద్యోగి సామర్థ్యం పెంచే కోర్సుల్లో ఐగాట్ కర్మ యోగి పోర్టల్ ద్వారా శిక్షణ పొందాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ, డ్వామా పీడీలు శచీదేవి, పూర్ణిమదేవి, ఎస్జీఎస్డబ్ల్యూ సమన్వయ అధికారి ఎస్.మంజుల వాణి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. కలెక్టర్ విజయ కృష్ణన్ -
కాపు నేతలు
అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్న సాక్షి, విశాఖపట్నం: ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకే కాపు నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా, ఆయన ఇంటిపై టీడీపీ గుండాలతో చంద్రబాబు దాడులు చేయించారని ఉమ్మడి విశాఖకు చెందిన కాపు నేతలు ఆక్షేపించారు. ఈ నెల 7న విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన కాపునేతలు పార్టీలకు అతీతంగా అంబటి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వందకు పైగా కార్ల ర్యాలీతో వెళ్లి, అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి, కుమార్తెలు మౌనిక, మనోజ్ఞలకు ధైర్యం చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ కాపు నేతలు బుధవారం సమావేశమయ్యారు. కాపునేతలపై చంద్రబాబు కక్ష కాపు నేత అంబటి రాంబాబుపై పథకం ప్రకారమే టీడీపీ గూండాలతో చంద్రబాబు దాడి చేయించారని, అంబటిని అంతమొందించేందుకు వందలాదిగా టీడీపీ రౌడీ మూకలతో పోలీసుల సమక్షంలోనే దాడులు చేయించారంటూ కాపునేతలు మండిపడ్డారు. తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని తేలడంతో గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో పూజలు చేసి వస్తున్న అంబటి.. గోరంట్లలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై అభ్యంతరం వ్యక్తం చేశారనే దాడి చేయించారన్నారు. ఫ్లెక్సీని తొలగించాలని కోరితే టీడీపీ మూకలు నడిరోడ్డుపై బహిరంగంగా కర్రలు, రాడ్లతో దాడికి తెగబడినా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆక్షేపించారు. గంటల తరబడి కొనసాగిన రౌడీ మూకల దాడిపై డీజీపీ, అదనపు డీజీపీలకు ఫిర్యాదు చేసేందుకు శాసన మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ఫోన్లు చేసినా స్పందించలేదని ఆరోపించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీని కలిసేందుకు మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వెళితే ఎస్పీ ఇంటి గేటు బయటే నిలబెట్టారంటే ఏ స్థాయిలో పోలీసు వ్యవస్థ ఉందో అర్ధమవుతుందంటూ మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే కాపు నేత వంగవీటి రంగాను హత్య చేయించారని, మళ్లీ చంద్రబాబు హయాంలోనే మరో కాపు ఉద్యమనేత, మాజీ ఎంపీ ముద్రగడ పద్మనాభంను, ఆయన కుటుంబాన్ని వేధింపులకు గురిచేశారని గుర్తుచేశారు. అదే రీతిలో వంగవీటి రంగా శిష్యుడుగా పేరున్న మరో కాపునేత అంబటి రాంబాబును, ఆయన కుటుంబాన్ని హతమార్చాలని చంద్రబాబు కుట్రలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. కాపులను ఏదో విధంగా అడ్డుతొలగించుకోవాలన్నదే చంద్రబాబు తాపత్రయంగా కనిపిస్తోందని కాపునేతలు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కాపు నేతలంతా ఏకతాటిపైకి వచ్చి అంబటి కుటుంబానికి అండగా నిలిచి, ధై ర్యాన్నివ్వాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, చింతలపూడి వెంకట్రామయ్య, కాపు నేతలు బాణాల శ్రీనివాసరావు, వీసం రామకృష్ణ, కోరుకొండ స్వాతి, పీవీ సురేష్, గుడివాడ అనూష, గుండపు నాగేశ్వరరావు, రామజోగి, రాయపూడి అనిల్కుమార్, గుడివాడ లతీష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మునగపాక ఎంపీపీ, వైస్ ఎంపీపీలపై నెగ్గిన అవిశ్వాసం
మునగపాక: స్థానిక ఎంపీపీతో పాటు ఇద్దరు వైస్ ఎంపీపీలపై బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఈ నెల 9వ తేదీన మునగపాక ఎంపీపీ మళ్ల జయలక్ష్మి, వైస్ ఎంపీపీలు బోజాలక్ష్మి,చిందాడ దేవీలపై అవిశ్వాసం ప్రకటిస్తూ 11 మంది ఎంపీటీసీలు నోటీసు అందజేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం సాయంత్రం మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీవో ఆయిషా అవిశ్వాసంపై సమావేశం నిర్వహించారు. మెజార్టీ సభ్యులు 11 మంది ఎంపీపీతోపాటు వైస్ ఎంపీపీలకు వ్యతిరేకంగా, అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. ఆర్డీవో ఆయిషా మాట్లాడుతూ మునగపాక మండల ఎంపీటీసీ సభ్యులిచ్చిన అవిశ్వాస నోటీసుకు సంబంధించి మండల పరిషత్ హాలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాసం నెగ్గిందన్నారు. తదుపరి చర్యలకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిస్తామని ఆమె తెలిపారు. -
అగ్నిప్రమాదంలో రైతు మృతి
మాడుగుల రూరల్: చలిమంట కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో ఓ పశువుల పాక దగ్ధంకాగా, అందులో నిద్రించిన రైతు తీవ్రంగా గాయపడి కేజీహెచ్లో మృతిచెందాడు. రెండు పాడి గేదెలు గాయపడ్డాయి. మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో జంపెన నుంచి గాదిరాయి వెళ్లే రహదారిలో జంపెన గ్రామానికి చెందిన రైతు ధర్మిశెట్టి అచ్చిమినాయుడు(40)కు చెందిన పశువుల పాక ఉంది. ఈ పాకలో రెండు పాడి గేదెలు, ఒక బైక్ ఉన్నాయి. మంగళవారం రాత్రి పశువుల పాకలో అచ్చిమినాయుడు చలిమంట వేసుకున్నాడు. దానిని ఆర్పకుండా పాకలో నిద్రపోయాడు. దీంతో బుధవారం తెల్లవారు జామున నిప్పు అంటుకుని పాక దగ్ధమైంది. నిద్రమత్తులో ఉన్న అచ్చిమినాయుడు లేచి చూసేసరికి పాక అంతా మంటలు వ్యాపించాయి. గేదెలను రక్షించే ప్రయత్నంలో ఉండగా ఒక్క సారిగా కాలుతున్న దూలం అచ్చిమినాయుడు మీద పడి, 70 శాతం శరీరం కాలిపోయింది. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందదుతూ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఒక గేదె స్వల్పంగా, మరో గేదె 50 శాతం కాలినగాయాలకు గురయ్యాయి. పాకలో ఉన్న బైక్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం తెలుసుకున్న మాడుగుల అగ్నిమాపక కేంద్రం అధికారి వి.రాజేశ్వరావు తన సిబ్బందితో వెళ్లి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల ఆస్తినష్టం జరిగినట్టు అగ్నిమాపక అధికారి తెలిపారు. పెద్ద దిక్కును కోల్పోయాం అగ్నిప్రమాదం కారణంగా పెద్దను కోల్పోయామని, మృతుడు అచ్చిమినాయుడు భార్య దుర్గ, కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతుడికి ఒక కుమారై, కుమారుడు ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
మొదటి దశలో గుర్తిస్తే క్యాన్సర్ నివారణ సాధ్యం
అనకాపల్లి: క్యాన్సర్ వ్యాధిని మొదటి దశలోనే గుర్తిస్తే నివారణ సాధ్యమని డీఎంహెచ్వో ఎం.హైమావతి అన్నారు. ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముందస్తు పరీక్ష ద్వారా క్యాన్సర్ను కనుగొనవచ్చన్నారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అనంతరం క్యాన్సరతో పారాడదాం.. విజయం సాధిద్దాం.. అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్సీడీ అధికారి ఎసత్తెర్ రాణి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి
మాడుగుల: రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్ సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహా సంఘ సభ్యుడు బూడి ముత్యాలు నాయుడు ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరాచకాలు, దుర్మార్గాలకు అంతులేకుండా పోయిందని చెప్పారు. ప్రభుత్వ తీరును ప్రశ్నించి నేతల ఇళ్లపై గూండాలతో దాడులు చేయించడం ఇందుకు నిదర్శమన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తూ మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్రెడ్డి లపై దుష్పచారం చేస్తున్న, పోస్టర్లను ప్రదర్శించిన, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులతో కలసి స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని రెండు ల్యాబ్లు తేల్చిచెప్పడంతో చంద్రబాబును ప్రజలు చీదరించుకుంటున్నారని చెప్పారు. దీంతో తట్టుకోలేక డైవర్షన్ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రశ్నించేవారిని అంతం చేయాలన్నదే టీడీపీ నాయకుల కుట్ర అని, దీనిలో భాగంగానే నాలుగు రోజుల్లో అంబటి రాంబాబు, భూమనకరుణాకర్ రెడ్డి తదితర నలుగురు వైఎస్సార్సీపీ కీలక నాయకులపై దాడులు చేశారని తెలిపారు. దర్యాప్తు సంస్థ స్వచ్ఛమైన నివేదిక ఇచ్చినా లడ్డూలో కల్తీ జరిగిందంటూ ప్రకటనలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేమవరపు రామధర్మజ, ఏఎంసీ మాజీ చైర్మన్ శేనాపతి కొండలరావు, వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు ఎడ్ల హేమంత్ కుమార్, సర్పంచ్ ఎడ్ల కళావతి, ఉపసర్పంచ్ జవ్వాది వరహాలు, ఎం.కోడూరు సర్పంచ్ గొళ్ళవిల్లి సంజీవరావు, ఎం.కోడూరు ఎంపీటీసీ ముమ్మిన రమణబాబు వైఎస్సార్సీపీ సీపీ నాయకులు కోట్యాడ భాస్కరరావు, పొలిమేర చిన్నారావు, సయ్యపురెడ్డి సత్తిబాబు, బసవా రామపరమేష్, రెడ్డి అరుణకుమార్, రాఖి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పలు చోరీ కేసుల్లో వ్యక్తికి జైలు శిక్ష
అనకాపల్లి: పలు దొంగతనాల కేసుల్లో నేరం రుజువు కావడంతో ఓ వ్యక్తికి న్యాయమూర్తి ఏడాదిన్నర పాటు జైలు శిక్ష విధించినట్లు పట్టణ సీఐ జి.ప్రేమ్కుమార్ చెప్పారు. విశాఖ జిల్లా గాజువాక మండలం అగనంపూడి గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ తాటిపూడి శంకర్కు పలు చోరీలకు పాల్పడడంతో మొదటి ఏజేసీజే న్యాయమూర్తి ఎ.రమేష్ శంకర్కు ఏడాదిన్నర జైలు శిక్షవిధిస్తూ బుధవారం తీర్పు చెప్పినట్టు పట్టణ సీఐ తెలిపారు. అనకాపల్లి పట్టణ పరిధిలో 2019 సంవత్సరంలో లక్ష్మీదేవీపేట, పాత్రుడు కాలనీ, సాయినగర్, కొత్తూరు, గవరపాలెం, నూకాంబిక ఆలయవీధిలో చోరీలకు పాల్పడిన తాటిపూడి శంకర్పై అప్పటి సీఐ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చగా వాదోపవాదాలు అనంతరం నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్టు సీఐ చెప్పారు. ఈ కేసుల్లో ప్రాసిక్యూషన్ తరఫున సీనియర్ అసిస్టెంట్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మృణాళిని వాదనలు వినిపించినట్టు చెప్పారు. -
మరింత మెరుగ్గా పోలీసుల నైపుణ్యాలు
ఆరిలోవ(విశాఖ తూర్పు): పోలీసులు వారి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని అనకాపల్లి జిల్లా అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ సూచించారు. విశాఖ నగరంలోని కై లాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ కార్యాలయంలో పోలీసులకు వార్షిక మొబిలైజేషన్ రీఫ్రెష్ ట్రైనింగ్ కార్యక్రమం బుధవారం ప్రారంభించారు. సిబ్బంది తమ వృత్తి నైపుణ్యాలను మెరుగుపరచుకునే ఈ శిక్షణ 15 రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ సిబ్బందికి క్రమశిక్షణపై ప్రత్యేక శిక్షణ అవసరమన్నారు. పోలీసులకు విధుల్లో ఒత్తిడి సహజమన్నారు. ఇలాంటి రీఫ్రెష్ శిక్షణ వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి దోహదపడుతుందన్నారు. పోలీస్ సిబ్బంది విధి నిర్వహణతోపాటు వారి కుటుంబ సంక్షేమం, పిల్లల చదువుల విషయంపై కూడా శ్రద్ధ చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్ ఆర్ఐలు బి.రామకృష్ణారావు, మన్మధరావు, రమణమూర్తి, సంజీవిరావు, ఆర్ఎస్ఐ ఆదినారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
ఘనంగా శ్రీ గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు ప్రారంభం
రోలుగుంట: నాలుగురోజుల పాటు నిర్వహించే గౌరీపరమేశ్వరుల ఉత్సవాలు మండల కేంద్రంలో బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువజామున ఆచార సంప్రదాయం ప్రకారం బుడబుక్కల వేషం నిర్వహించారు. తరువాత సాయంత్రం వరకూ యువకులు ఉత్సాహంగా బాలనాగమ్మ, తిక్కలోడు వంటి పలు వేషాలు ప్రదర్శించారు. సాయంత్రం 4:30 గంటల తరువాత ముందుగా వెదురు కలపతో నిర్మించిన 90 అడుగుల బండి ప్రభను భక్తులు భుజాలపై ఉత్సవస్థలానికి మోసుకుని వచ్చి శుభ ఘడియలో ప్రతిష్టించారు. గ్రామ వీధులను రంగురంగుల విద్యుత్ బల్బులతో అలంకరించారు. రాత్రి శూలాలు ఉత్సవాన్ని నిర్వహించారు. తరువాత ఉత్సవ స్థలానికి తీసుకువచ్చి ఉత్సవమూర్తులను భక్తుల దర్శనార్థం రథంపై ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ చైర్మన్ పోతల లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ గురువారం చిన్న తీర్థం, శుక్రవారం పెద తీర్థం జరుగుతుందన్నారు. గ్రామ వీధుల్లో స్టేజి ప్రోగాంలు ఏర్పాటు చేశామని తెలిపారు. శనివారం నిమజ్జనోత్సవం జరుగుతుందన్నారు. జిల్లాలోనే ఎక్కడా లేని విధంగా వెదురుతో నిర్మించిన 90 అడుగుల బండిప్రభ ప్రతిష్ట ప్రత్యేకాకర్షణగా ఉంటుందన్నారు. ఏ విధమైన ఆల్లర్లకు తావు లేకుండా గ్రామ యవత వలంటీర్లుగా తమ సహకారం అందించాలని కోరారు. అలాగే ఉత్సవం విజయవంతానికి పోలీసులు పూర్తిస్థాయిలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. -
● కార్యదర్శికి ప్రశంసలు
కార్యదర్శి రాజశేఖర్కు ప్రశంసాపత్రాన్ని అందజేస్తున్న కమిషనర్ కృష్ణతేజ నక్కపల్లి : ఇంటిపన్ను వసూళ్లలో నక్కపల్లి మండలం జిల్లాలోనే మొదటి స్థానాన్ని దక్కించుకోవడం అభినందనీయమని పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ అన్నారు. మండలంలో నక్కపల్లి, బుచ్చిరాజుపేట, చినదొడ్డిగల్లు, ఎన్.నర్సాపురం, చందనాడ గ్రామాల్లో మొత్తం రూ.85 లక్షల ఇంటి పన్నులకు ఆయా గ్రామాల క్లస్టర్ కార్యదర్శి రాజశేఖర్ రూ.70 లక్షలు వసూలు చేసి పంచాయతీలకు జమ చేసి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. ఈ సందర్భంగా అనకాపల్లిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కార్యదర్శి రాజశేఖర్కు కమిషనర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందజేశారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన పంచాయతీల్లో కూడా ఇంటి పన్నులు శతశాతం వసూలు చేయాలని కమిషనర్ కృష్ణతేజ సూచించినట్టు కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. -
నేరాల కట్టడికి సీసీ కెమెరాల నిఘా పెంచండి
నక్కపల్లి : పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నక్కపల్లి మండలంలో నేరాల అదుపు చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. మంగళవారం ఆయన నక్కపల్లి పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. స్టేషన్లో నమోదవుతున్న క్రైమ్ వివరాలను తెలుసుకున్నారు. పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి సిబ్బంది పనితీరు, పరిసరాల వాతావరణాన్ని చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ రహదారి వెంబడి క్రైమ్ప్రోన్ ఉన్న ప్రాంతాలో సీసీ కెమెరాల సంఖ్య పెంచాలన్నారు. కేసుల దర్యాప్తు వేగవంతం చేసి కోర్టుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయాలని సూచించారు. జాతీయ రహదారిపై వాహనాలను అనవసరంగా నిలిపివేయకుండా చర్యలు తీసుకోవాలని, విజిబుల్ పోలీసింగ్ ద్వారా రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, నాటు సారా తయారీ అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలన్నారు. కార్యక్రమంలో సీఐ మురళి, ఎస్ఐలు సన్నిబాబు, సాహిబా అంజుమ్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
శతశాతం ఇంటి పన్నులు వసూలు చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ తుమ్మపాల : ప్రతి ఇంటి నుంచి వారానికి కనీసం రెండుసార్లు చెత్త సేకరణ చేపట్టి పల్లెలను పరిశుభ్రంగా ఉంచేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఈ నెల 15 నాటికి గ్రామాల్లో శతశాతం ఇంటిపన్నులు వసూలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ అన్నారు. పట్టణంలో న్యూకాలనీలో గల ఫంక్షన్ హాలులో మంగళవారం ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, సచివాలయాల కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని గ్రామాల్లో వర్మీ కంపోస్టులు పూర్తిస్థాయిలో నిర్వహించాలన్నారు. ఇంటిపన్నుల వసూలు లక్ష్యంగా పెట్టుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అంతకుముందు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డిప్యూటీ ఎంపీడీవోలు డి.రాము, ఎం.సోమరాజు, జి.కోటేశ్వరరావు, జె.దుర్గా ప్రసాద్, పంచాయతీ కార్యదర్శులు ఎ.శైలజారత్నం, కె.యరయ్యమ్మ, వై.శ్రీనివాస్లకు సేవా పత్రాలు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామ పంచాయతీ అధికారి ఈ. సందీప్, జిల్లా అభివృద్ధి అధికారి, డివిజనల్ పంచాయతీ అధికారి ఎస్.మంజులవాణి, డిప్యూటీ ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఫస్ట్ అండ్ లాస్ట్ బడ్జెట్!
మేయర్ కాలానికి మోగిన ముగింపు గంట నేడు 2026–27 జీవీఎంసీ బడ్జెట్ సమావేశం మరో నెలన్నరలో పాలకవర్గానికి తెర డాబాగార్డెన్స్(విశాఖ) : జీవీఎంసీ రాజకీయ ముఖచిత్రం ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరుగుతోంది. నగర పాలకవర్గం కాలపరిమితి ముగియడానికి మరో నెలన్నర రోజులే గడువు ఉండటంతో అటు రాజకీయ వర్గాల్లో, ఇటు నగర ప్రజల్లో భవిష్యత్తు పరిణామాలపై ఉత్కంఠ నెలకొంది. వచ్చే నెల 18వ తేదీతో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం అధికారికంగా ముగిసిపోనుంది. ఈ నేపథ్యంలో మేయర్ పీలా శ్రీనివాసరావు బుధవారం ప్రవేశపెట్టనున్న 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్, ఆయన పదవీ కాలంలో మొదటిది, చివరిది కావడం గమనార్హం. నిబంధనల ప్రకారం మార్చి 7వ తేదీ తర్వాత ఎటువంటి కౌన్సిల్ సమావేశాలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో, ఉన్న కొద్దిపాటి సమయంలోనే వీలైనన్ని స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించి పెండింగ్ పనులను చక్కబెట్టే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. మళ్లీ చంద్రకాలమేనా? నగర చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, మళ్లీ పాత రోజులే పునరావృతమవుతాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2012 ఫిబ్రవరి 27 నుంచి సుమారు ఎనిమిదేళ్ల పాటు జీవీఎంసీకి ఎన్నికలు నిర్వహించలేదు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, అధికారుల పాలనే సుదీర్ఘకాలం కొనసాగింది. అయితే 2019లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రేటర్ విశాఖకు ఎన్నికలు నిర్వహించగా, వైఎస్సార్ సీపీ ఘనవిజయం సాధించి పాలనా పగ్గాలు చేపట్టింది. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో, గతంలో లాగే మళ్లీ అధికారుల పాలన మొదలవుతుందా? అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే.. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే ఇప్పట్లో ఎన్నికలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. పాలకవర్గ పదవీకాలం ముగియగానే సహజంగానే అధికారుల పాలన అమల్లోకి రానుంది. ఇదే తరుణంలో భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక కీలక ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచారు. తన నియోజకవర్గ పరిధిలోని 64 పంచాయతీలను జీవీఎంసీలో విలీనం చేయాలని కోరుతూ ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. విశాఖ నగరం నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు సాఫీగా రాకపోకలు సాగడానికి, భీమిలి పరిధిలో ప్రతిపాదించిన ఏడు కీలక మాస్టర్ ప్లాన్ రహదారుల నిర్మాణానికి ఈ విలీనం ఎంతో అవసరమని ఆయన వాదిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ విలీన ప్రక్రియను చేపడితే, అది పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండదు కాబట్టి, మరోసారి సుదీర్ఘకాలం పాటు నగర పాలన అధికారుల చేతుల్లోనే ఉండే అవకాశం ఉంది. విద్యారంగంపై నిర్లక్ష్యం గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యకు మంచి ప్రాధాన్యతనిచ్చారు. బాల్యం పథకం కింద 3 నుంచి 7 ఏళ్లలోపు బాలలకు చిన్నబడి కార్యక్రమం కింద అంగన్వాడీ కేంద్రాలతో మున్సిపల్ పాఠశాలలను అనుసంధానం చేసి పౌష్టికాహారం, విద్య, క్రీడా సదుపాయాలు కల్పించేందుకు రూ.15 కోట్లు కేటాయిస్తే..ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో విద్యకు కేవలం రూ.2.25 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇలా అన్ని రంగాలను ఈ బడ్జెట్ విస్మరిస్తూ నిధులు కేటాయించింది. గత బడ్జెట్ అలా.. నేటి బడ్జెట్ ఇలా.. నగర ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించే బడ్జెట్ గణాంకాల్లో కూడా భారీ వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ప్రారంభ నిల్వ రూ.482.26 కోట్లుగా ఉండగా, ప్రస్తుత 2026–27 బడ్జెట్లో అది రూ.365.96 కోట్లకు పడిపోయింది. అంటే ప్రారంభ నిల్వలోనే సుమారు రూ.116.3 కోట్ల మేర కోత పడింది. గతేడాది అన్ని పద్దుల కింద మొత్తం ఆదాయం రూ.4,761.87 కోట్లుగా చూపగా, ఈ ఏడాది అది రూ.4,180.37 కోట్లకు పరిమితమైంది. అంటే ఆదాయం పరంగా చూస్తే ఈ ఏడాది ఏకంగా రూ.370 కోట్లు తగ్గినట్లు స్పష్టమవుతోంది. ముగింపు నిల్వలో సైతం రూ.27 కోట్ల మేర తేడా ఉండటం గమనార్హం. -
నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలి
దేవరాపల్లి: కార్మికులకు నష్టం కల్గించేలా కేంద్రం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి. శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు, దేవరాపల్లి పీహెచ్సీ ముందు ఆశా కార్యకర్తలు మంగళవారం నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కా ర్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్స్ను తీసుకువచ్చి అమలుకు పూనుకుందన్నారు. ఇది ముమ్మాటికి కార్మికులను కట్టు బానిసలుగా చేయడమేనన్నారు. కార్మికులకు వీటితో ఎటువంటి ప్రయోజనం లేదన్నారు. లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని, కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న నిర్వహించనున్న దేశ వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఆశా కార్యకర్తలు పీహెచ్సీ వైద్యాధికారికి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి. వెంకన్న, మండల నాయుకుడు బిటి. దొర, ఇందిర, జ్యోతి, వరలక్ష్మీ తదితర్లు పాల్గొన్నారు. కశింకోట: కేంద్ర బడ్జెట్లో ఐసీడీఎస్కు నిధుల కేటాయింపు, జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మంగళవారం నిరసన తెలిపారు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అంగన్వాడీ ప్రాజెక్టు యూనియన్ అధ్యక్షురాలు కృష్ణవేణి, ప్రధాన కార్యదర్శి కాసులమ్మ మాట్లాడుతూ 2026–27 సంవత్సర కేంద్ర బడ్జెట్లో దేశంలో ఉన్న 26 లక్షల మంది అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులతోపాటు దాదాపు కోటి మంది వర్కర్ల దుర్భర పరిస్థితి, హక్కులపై ప్రస్తావించకపోవడం శోచనీయమన్నారు. స్కీం వర్కర్లకు సామాజిక భద్రత, పింఛన్ లేదని, అంగన్వాడీ కార్యకర్తలు,సహాయకులకు గాట్యూటీ మంజూరు చేస్తూ 2022లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కూడా ప్రభుత్వం ఇంకా అమలు చేయలేదన్నారు.అనంతరం ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు తనూజ, విజయ, రామలక్ష్మి, గంగ, సీఐటీయూ అనకాపల్లి మండల కన్వీనర్ కాళ్ల తేలయ్యబాబు తదితరులు పాల్గొన్నారు. -
‘విద్యార్థిని హత్యచేసిన వారిని అరెస్టు చేయాలి’
అనకాపల్లి: బుచ్చెయ్యపేట మండలం బంగారు మెట్ట గ్రామానికి చెందిన, విజయవాడ దగ్గర పోరంకి చైతన్య కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న పవన్ కుమార్ను హత్యచేసిన సీనియర్ విద్యార్థులను అరెస్టు చేయాలని, ఈ సంఘటను ఆత్మహత్యగా చిత్రీకరించడం దారుణమని జిల్లా యాదవ సక్షేమ సంఘం అధ్యక్షుడు భరణికాన బాబూరావు అన్నారు. విద్యార్థి మృతికి నిరసనగా పట్టణంలోని రింగ్రోడ్డు వద్ద గల చైతన్య కళాశాల వద్ద మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని, సాక్ష్యాధారాలను మాయంచేయడానికి ప్రయత్నించిన కళాశాల యాజమాన్యంపైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మృతుడు కుటుంబానికి కశాశాల యాజమాన్యం నష్టపరింగా రూ.కోటి అందజేయాలన్నారు. సీపీఐ మండల కన్వీనర్ గంటా శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యార్థులతో పాటు అన్నివర్గాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు లాభం చేకూర్చే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సబ్బి శ్రీనివాసరావు, చోడవరం నియోజకవర్గం అధ్యక్షుడు మొల్లి ప్రసాద్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బంధం వెంకటరమణ, యాదవ సంఘం నాయుకులు కోనా గురయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.బాలాజీ, కార్యదర్శి పి.విజయ్, సహాయకార్యదర్శి కృపానం, ప్రజా సంఘాల నాయకులు భర్నికాన నరసింహమూర్తి, పంచదార్ల సూరిబాబు, మొల్లి ప్రసాద్, మొల్లి సన్నిబాబు, గోకివాడ కోటేశ్వరరావు, వియ్యపు సింహాచలం, పల్లా సతీష్, కారుకొండ కన్నా, మొల్లి నాగు, వియ్యపు రాజు తదితరులు పాల్గొన్నారు. -
373 గ్రామాల్లో రీ సర్వేపూర్తి
నక్కపల్లి : జిల్లాలో ఇప్పటివరకు 373 గ్రామాల్లో రీ సర్వేపూర్తయిందని కలెక్టర్ విజయ్కృష్ణన్ తెలిపారు. మంగళవారం ఆమె కాగితలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పట్దాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సర్వే పూర్తయిన గ్రామాల్లో 2,01,841 మందికి పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు అన్ని మండలాల్లో సంబంధిత గ్రామాల్లో సచివాలయం వద్ద షెడ్యూలు ప్రకారం రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. రీ సర్వేలో రికార్డుల తప్పులను సరిచేసి శుద్ధమైన రికార్డులతో రైతులకు వారి భూములపై వివాదం లేని పూర్తి హక్కులు భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల కొరకు రైతులు ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. రెవెన్యూ సేవలన్నింటిని గ్రామ స్థాయిలోనే అందించడం జరుగుతుందన్నారు. అంతకు ముందు తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో వి.వి.రమణ, ఇతర శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. పునరావాస కాలనీలో నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలు పురోగతిపై సమీక్షించారు. నిర్వాసితులకు ప్యాకేజీ పరిహారం చెల్లింపులు పూర్తయినందున నివాసప్రాంతాలు ఖాళీ చేసి పునరావాస కాలనీకి వెళ్లి ఇళ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి తహసీల్దార్ మహేష్, డిప్యూటీ తహసీల్దార్ నారాయణరావు, సర్పంచ్ రాజేష్ రైతులు పాల్గొన్నారు. -
12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయండి
అనకాపల్లి : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈనెల 12న దేశవ్యాప్తంగా జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెలో ఉద్యోగ, కార్మిక సంఘాలు పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు వై.ఎన్ భద్రం కోరారు. మామిడిపాలెం గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ ప్రభుత్వంలో దశల వారీగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ వ్యక్తులకు ధారాత్తం చేయడం జరుగుతుందని, కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని అన్నారు. కార్మికుల పోరాటాలతో సాధించుకున్న చట్టాలను నాలుగు లేబర్ కోడ్లు కుదించడం అన్యాయమన్నారు. ఇప్పటికే విశాఖ స్టీల్ప్లాంట్ను దశల వారీగా కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేయడం, బీఎస్ఎన్ఎల్ సంస్థను నిర్వీర్యం చేయడం జరిగిందని అన్నారు. దేశవ్యాప్తంగా ఈనెల 12న జరిగే జాతీయ సమ్మెల్లో అన్నివర్గాల ప్రజలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల బీమాను చెల్లించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు మహాలక్ష్మి నాయుడు, నాయకులు అరిగా అప్పలకొండ, ఎం.కాశీఅప్పారావు, పీలా వెంకట్రావు, ఏఐటీయుసీ నాయకులు చెల్లూరి నాగరాజు, మత్తుర్తి సూరిబాబు పాల్గొన్నారు. -
తాబేళ్లను రక్షించిన ఇండియన్ నేవీ
తాబేళ్లను రక్షిస్తున్న నేవీ సిబ్బంది విశాఖ సిటీ : సముద్ర సరిహద్దులను కాపాడటమే కాకుండా, సముద్ర గర్భంలోని మూగజీవాలను సంరక్షించడంలోనూ భారత నావికాదళం తమ దాతృత్వాన్ని చాటుకుంది. విశాఖ తీరంలో గస్తీ నిర్వహిస్తున్న ‘ఐఎన్ఎస్ తార్ముగ్లి’ యుద్ధ నౌక సిబ్బంది.. మృత్యువుతో పోరాడుతున్న రెండు అరుదైన తాబేళ్లను ప్రాణాలతో రక్షించారు. కోస్టల్ సెక్యూరిటీ పెట్రోలింగ్లో భాగంగా ఐఎన్ఎస్ తార్ముగ్లి సిబ్బంది సముద్రంపై గస్తీ నిర్వహిస్తుండగా నీటిపై తేలుతున్న పాత చేపల వలలో ఏదో కదలిక ఉండడాన్ని గమనించారు. నిశితంగా పరిశీలించగా, అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జాబితాలో ఉన్న రెండు ‘ఒలివ్ రిడ్లే’ తాబేళ్లు ఆ వలలో చిక్కుకున్నట్లు గుర్తించారు. వెంటనే యుద్ధనౌకలోని నేవీ డైవర్లు సముద్రంలోకి దూకి ఆ వలను కోసి తాబేళ్లను విడిపించారు. గాయాలపాలైన ఆ తాబేళ్లకు ప్రాథమిక చికిత్స అందేలా చూసి, వాటిని సురక్షితంగా తిరిగి సముద్రంలోకి వదిలిపెట్టారు. -
కాసులిచ్చుకో!
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మీ ఊళ్లో బరి గీసుకోండి. ఊరికి మూడు కోళ్లు, రూ. 12 వేలు ఇవ్వండి! ఇదీ అనకాపల్లి జిల్లాలోని ఓ ఎస్ఐ సంక్రాంత్రి వసూళ్ల లెక్క! భారీగా ‘బరి’లు గీసుకోండి. మందు, డ్యాన్సులు మీ ఇష్టం. స్థానిక ప్రజా ప్రతినిధులూ పాల్గొంటున్నారు కాబట్టి ఇబ్బందేమీ లేదు. గుండాట, లాటరీ బల్ల.. ఏ ఆటైనా మీ ఇష్టం. మా వాటా మాకిస్తే చాలు. ఇదీ అనకాపల్లి జిల్లాలోని మరో రెండు నియోజకవర్గాల కథ! మీ ఊళ్లో ఉత్సవం ఉందా? కోడి పందాలు నిర్వహించుకోండి. మేమేమీ పట్టించుకోం!! ఇది మరో నియోజకవర్గంలో పరిస్థితి.. ఇలా అన్ని చోట్లా ఇష్టారాజ్యంగా కోడి పందాలు నిర్వహించుకుంటుంటే అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులు చేష్టలుడిగి చూస్తుండిపోయారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదే నేపథ్యంలో తాజాగా చీడికాడలో కోడి పందాల నిర్వహణలో బరిలో నిలిచిన కోళ్లకు తగిలించిన కత్తి తగిలి ఏకంగా వడిసిలి అప్పలనాయుడు అనే వ్యక్తి చనిపోయారు. ఈ విషయం ఫిబ్రవరి 1వ తేదీన జరిగినప్పటికీ బయటకు పొక్కకుండా జాగ్రత్తపడ్డారనే ఆరోపణలున్నాయి. అయితే, ఈ విషయం కాస్తా పోలీసు ఉన్నతాధికారులకు తెలియడంతో సీఐపై బదిలీ వేటు పడినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంతో పాటు జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో భారీగా చేతులు తడిపిన పోలీసుల వివరాలను కూడా ఉన్నతాధికారులు సేకరించే పనిలో ఉన్నట్టు సమాచారం. గోదావరి జిల్లాలకు దీటుగా...! గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్రాంత్రి సందర్భంగా అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖ జిల్లాలోనూ అధికార పార్టీ నేతల అండదండలతో భారీగా ‘బరి’లు రంగంలోకి వచ్చాయి. గతంలో సంక్రాంత్రి పందెం కోళ్ల బరిలను చూసేందుకు పక్కనే ఉన్న గోదావరి జిల్లాలకు వెళ్లేవారు. అయితే, ఈ దఫా మాత్రం అదే స్థాయిలో స్థానికంగానే నిర్వహించారు. యలమంచిలి, పాయకరావుపేట నియోజకవర్గాల్లో ఓ రేంజ్లో పందాలు నిర్వహించారు. అలాగే పెందుర్తి, భీమిలి నియోజకవర్గాల్లో కూడా ఓ మోస్తరుగా పందెం బరిలు ఏర్పా టు చేసుకున్నారు. కోడి పందాలతో పాటు డ్యాన్సులూ హోరెత్తాయి. భారీగా మద్యం అమ్మకాలతో పాటు గుండాట, లాటరీ బల్ల ఆటలకూ స్టాళ్ల కేటాయింపులు జరిగాయి. ఒక్కో స్టాలుకు రూ.8 లక్షల చొప్పున వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి ఉత్సవాల ఊపుతో ఇప్పుడు గ్రామాల్లో ఉత్సవాలకు కూడా కోడి పందాల జాడ్యం పాకడం గమనార్హం. కాసుల రుచి మరిగి... సంక్రాంతి సందర్భంగా కోడి పందాల నిర్వహణతో భారీగా ఆదాయానికి అలవాటు పడిన పోలీసు, రెవెన్యూ వర్గాలు గ్రామీణ ఉత్సవాల్లోనూ అందినకాడికి దండుకుంటున్నారు. తాజాగా చీడికాడలో నిర్వహించిన కోడి పందాలతో బరిలో ఉన్న కోళ్లకు కట్టిన కత్తి తెగి కాస్తా ఏకంగా ఒక వ్యక్తి మరణించాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. అదేవిధంగా చోడవరంలో కూడా తాజాగా బయటకు వచ్చిన డ్యాన్సుల వీడియో కూడా హల్చల్ చేసింది. అశ్లీల నృత్యాలు కాదంటూ స్థానిక నేత లు చెబుతున్నప్పటికీ గతంలో ఎన్నడూ ఈ తరహాలో ఉత్సవాలను చూడలేదని స్థానికులు చెబుతున్నారు. చీడికాడలో వ్యక్తి మృతిచెందిన వ్యవహారంలో ఇప్పటి వరకు అధికారికంగా ఫిర్యాదు అందనప్పటికీ కోడి పందాలతోనే చనిపోయాడని మాత్రం గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐపై బదిలీ వేటు పడింది. అంతేకాకుండా ఉత్సవాల పేరుతో పందాల నిర్వహణకు అనుమతించిన పోలీసులు, వారి వసూళ్లపై ఉన్నతాధికారులు వివరాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే అనకాపల్లి జిల్లాతో పాటు విశాఖ నగర శివారులోని పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న సిబ్బందిలో ఎవరిపై బదిలీ వేటు పడనుందనేది చూడాల్సి ఉంది. చీడికాడ కోడిపందాల్లో కోడికత్తి తగిలి మృతి చెందిన అప్పలనాయుడు -
వైభవంగా పరదేశమ్మ అమ్మవారి పండగ
చోడవరం: పరదేశమ్మ అమ్మవారి పండగ మంగళవారం ఘనంగా జరిగింది. 14గ్రామాల ప్రజలు తమ గ్రామదేవతగా పరదేశమ్మను కొలుస్తారు. గోవాడ, దుడ్డుపాలెం, కన్నంపాలెం, రామజోగిపాలెం, బెన్నవోలు, చాకిపల్లి, పీఎస్పేట, గంధవరం, కొత్తపల్లితోపాటు పలు గ్రామాల ప్రజల ఇలవేల్పు అయిన పరదేశమ్మ అమ్మవారి పండగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుంచి ప్రత్యేకపూజలు చేశారు. గోవాడలో సర్పంచ్, వైస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు ఆధ్వర్యంలో ఈ ఉత్సవం కనులపండువగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడాని పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అనంతరం సాయంత్రం తీర్థం జరిగింది. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణ అందర్నీ ఆకట్టుకుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థం రావికమతం: మండలంలోని కొత్తకోటలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తీర్థ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది.ఉదయం నుంచి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు గుర్రపు పందాలు,ముగ్గుల పోటీలు నిర్వహించారు.గుర్రపు పోటీలను గ్రామ సర్పంచ్ కోన లోవరాజు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ గుమ్ముడు సత్యదేవ తదితరులు ప్రారంభించారు.గ్రామ సర్పంచ్ కోన లోవరాజు, డీసీసీబీ మాజీ డైరెక్టర్ గుమ్ముడి సత్యదేవా తదితరులు విజేతలకు బహుమతులు అందజేశారు. -
మాదకద్రవ్యాల నియంత్రణే లక్ష్యం
పోలీస్ శాఖ – డీఎస్ఎన్ఎల్యూ మధ్య చారిత్రాత్మక ఒప్పందంసబ్బవరం: ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖలో నూతనంగా ఎంపికై న 6 వేల మంది కానిస్టేబుల్ శిక్షణార్థులకు మాదకద్రవ్యాల నియంత్రణ చట్టంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంతో రాష్ట్ర పోలీస్ శాఖ మంగళవారం ఒక చారిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జరిగిన ఈ ఒప్పందం ద్వారా, ప్రస్తుతం శిక్షణ పొందుతున్న కానిస్టేబుళ్లకు మాదకద్రవ్యాల కేసుల నమోదు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణపై నిష్ణాతులైన న్యాయ నిపుణులచే శిక్షణ ఇప్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4 పోలీస్ శిక్షణ కళాశాలలు, 5 బెటాలియన్లు మరియు 9 పోలీస్ శిక్షణ కేంద్రాలలో తొమ్మిది నెలల పాటు కొనసాగే ఈ శిక్షణలో భాగంగా, ఈ నెల 22వ తేదీ నుంచి ప్రత్యేక ఆన్లైన్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ఈ తరగతుల ద్వారా ఎన్.డి.పి.ఎస్ చట్టంలోని మెళకువలు, క్షేత్రస్థాయిలో చట్టాన్ని అమలు చేసే విధానాలపై శిక్షణార్థులకు పట్టు సాధించేలా బోధించనున్నారు. ఈ శిక్షణ వల్ల రాష్ట్రంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసు యంత్రాంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని ఉన్నతాధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరం పోలీస్ శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్ డి. రామచంద్రరాజు, డీఎస్ఎన్ఎల్యూ ఉపకులపతి ఆచార్య డి. సూర్యప్రకాశరావు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఐజీపీ (ట్రైనింగ్) సత్య యేసు బాబు తదితర ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్, ఇతర పోలీస్ అధికారులు పాల్గొని మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం ఈ విద్యా–పోలీస్ భాగస్వామ్యం ఎంతో అవసరమని పేర్కొన్నారు. -
12 మంది పేకాటరాయుళ్ల అరెస్టు
పోలీసుల అదుపులో పేకాటరాయుళ్లు నక్కపల్లి : చినదొడ్డిగల్లు శివారులో జరుగుతున్న పేకాటశిబిరంపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాల ప్రకారం సీఐ మురళికి వచ్చిన సమాచారం మేరకు చినదొడ్డిగల్లులో ఎస్ఐ మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారన్నారు. ఈ దాడుల్లో పేకాట రాయుళ్ల నుంచి రూ.73,400 నగదు, 13 సెల్ఫోన్లు,3 బైక్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. 12 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. నిందితులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. -
ఉపాధి చట్టాన్ని పునరుద్ధరించాలి
నిరసన వ్యక్తం చేస్తున్న ఏపి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి వెంకన్న దేవరాపల్లి : కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన విబిజి రామ్జి పథకాన్ని తక్షణమే రద్దు చేసి మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి డి. వెంకన్న డిమాండ్ చేశారు. దేవరాపల్లిలో ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి కూలీలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ కార్మికులంతా పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ చట్టంతో పాటు 39 కార్మిక చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్స్గా మార్చి అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకాన్ని యధావిధిగా అమలు చేసి 200 పనిదినాలు, 600 రోజు కూలి సొమ్మును పెంచాలని డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకుంటే ఈనెల 12న దేశ వ్యాప్త సమ్మెలో అన్ని వర్గాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. -
ఘనంగా ముగిసిన దేవీతల్లి తీర్థం
● హోరా హోరీగా జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీలు ఉమామహేశ్వరీ దేవి దర్శనం కోసం పోట్తెతిన భక్తులు దేవరాపల్లి: స్థానిక గ్రామ ప్రజల ఆరాధ్య దైవం ఉమామహేశ్వరీ దేవి (దేవీతల్లి) తీర్థ, కళ్యాణ మహోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఐదు రోజుల తీర్థ మహోత్సవాలలో భాగంగా ఆఖరి రోజు అమ్మవారిని తెల్లవారుజాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో ఆలయ పరిసరాలు కిక్కిరిశాయి. సాయంత్రం నిర్వహించిన జిల్లా స్థాయి ఎడ్ల బళ్ల పోటీలు హోరా హోరీగా జరిగాయి. స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి విజేతలకు వరుసగా రూ. 20 వేలు, రూ. 18 వేలు, రూ. 16 వేలు, రూ. 14 వేలు, రూ. 12 వేలు, రూ. 10 వేలు, రూ. 8 వేలు, రూ. 6 వేలు, రూ. 4 వేలు, రూ. 2 వేలు చొప్పున నగదు బహుమతులను అందించారు. రాత్రికి పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. -
తీపి మాటలతో పీల్చి పిప్పి..!
ఎన్నికల ముందు ఆదుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు తీరా అధికారంలోకి వచ్చాక చెరకు రైతులను పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో మిగిలిన ఒకే ఒక సహకార చక్కెర కర్మాగారం...ఎంతో ఘన చరిత్ర కలిగి ఆధునికీకరణతో మరెన్నో మెట్లు ఎక్కాల్సిన సంస్థ... చంద్రబాబు ప్రభుత్వం నిరాదరణతో నేడు మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఏకై క గోవాడ సహకార చక్కెర కర్మాగారాన్ని పూర్తిగా మూసివేసే దిశగా చాపకింద నీరులా ఈ ఏడాది క్రషింగ్ చేయలేమని ప్రభుత్వం చేతులెత్తేసింది. గత సీజన్లో సరఫరా చేసిన చెరకుకు బకాయిల చెల్లింపుపైనా స్పష్టత ఇవ్వడం లేదు. గతేడాది సుమారు లక్షా 14 వేల టన్నులు క్రషింగ్ చేశారు. ఆ చెరకు సరఫరా చేసిన రైతులకు ఇప్పటి వరకు చెల్లింపులు చేయలేదు. ఫ్యాక్టరీ కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేదు. రైతులకు, కార్మికులకు కలిసి సుమారు రూ.32 కోట్లు తక్షణం చెల్లించాల్సి ఉంది. ● చెరకు రైతుల పాలిట శాపంగా చంద్రబాబు ప్రభుత్వం ● రాష్ట్రంలో మిగిలిన ఏకై క గోవాడ చక్కెర కర్మాగారం పరిస్థితి అధోగతి ● రెండు జిల్లాల్లో 25 వేల చెరకు రైతులతో చెలగాటం ● సహకార చక్కెర ఫ్యాక్టరీలన్నింటినీ మూసివేసిన ఘనత చంద్రబాబుదే సాక్షి, అనకాపల్లి: గోవాడ చక్కెర కర్మాగారంలో క్రషింగ్ నిలిపివేయడమే కాకుండా ప్రస్తుత సీజన్లో ఫ్యాక్టరీ పరిధిలోని చెరకును విజయనగరం జిల్లా సంకిలిలోని జీఎంఆర్ సుగర్ ఫ్యాక్టరీకి తరలించాలని గత నవంబర్ నెలలో చంద్రబాబు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కానీ గత సీజన్లో సరఫరా చేసిన చెరకు బకాయిలను ఇంకా చెల్లించలేదు. ఇక్కడ నుంచి సంకిలికి చెరకు తరలించడానికి రవాణా చార్జీలపై కూడా స్పష్టత ఇవ్వలేదు. గోవాడ ఫ్యాక్టరీ భవిష్యత్తుపై భరోసా ఇవ్వకపోగా, గత సీజన్లో ఫ్యాక్టరీకి తోలిన చెరకుకు ఇంతవరకు డబ్బులు చెల్లించకపోవడం దారుణమని రైతులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో రూ.89 కోట్ల బకాయిలు చెల్లింపు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సరికే 2013–19 మధ్యకాలంలో గోవాడ సుగర్ ఫ్యాక్టరీ సుమారు రూ.150 కోట్ల వరకు నష్టాల్లో ఉంది. ఆ సమయంలోనే టీడీపీకి చెందిన పాలకవర్గం కోట్లాది రూపాయలు అప్పులు చేసి నష్టాల్లోకి నెట్టింది. తర్వాత 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్యాక్టరీని, రైతులను ఆదుకోవాలన్న ఆశయంతో ఏటా రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు చొప్పున సాయం చేసి ఐదేళ్లలో సుమారు రూ.89 కోట్ల మేర అందించింది. దీంతో ఫ్యాక్టరీ నష్టాల్లోంచి కొంత మేర గట్టెక్కడంతో పాటు రైతులకు చెరకు పేమెంట్లు, కార్మికులకు జీతాలు ఎక్కడా బకాయి లేకుండా ఐదేళ్లు క్రషింగ్ నిరాటంకంగా జరిపించారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మళ్లీ పరిస్థితి అధోగతిపాలైంది. 67 ఏళ్లలో ఏనాడూ క్రషింగ్ ఆగలేదు.. ఫ్యాక్టరీ ఆవిర్భవించాక గత 67 ఏళ్లలో ఏనాడూ క్రషింగ్ చేయకుండా లేదు. ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ ఫ్యాక్టరీని ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఏడాదిన్నర కాలంలో సాయం చేయకపోవడంతో చెరకు రైతులపైన, ఫ్యాక్టరీ మనుగడపైన ప్రస్తుత పాలకులకు ఉన్న శ్రద్ధ ఏమిటో అర్థమవుతోంది. గత సెప్టెంబర్ 30వ తేదీన జరపాల్సిన ఫ్యాక్టరీ మహాజన సభను నిరవధికంగా ఆరునెలల పాటు వాయిదా వేసిన ప్రభుత్వం అక్టోబర్ 24వ తేదీన ఫ్యాక్టరీ పరిధిలో ఉన్న చెరకును విజయనగరం జిల్లా సంకిలిలోని ప్రైవేటు సుగర్ ఫ్యాక్టరీకి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. చెరకు రవాణా ఖర్చులు 50 శాతం రైతులు పెట్టుకుంటే, 50 శాతం సంకిలి ఫ్యాక్టరీ భరిస్తుందని, రైతులు పెట్టుకున్న రవాణా సొమ్ము ప్రభుత్వం తరువాత చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పాత బకాయిలు చెల్లించలేక ఈ ఏడాది క్రషింగ్ చేయకుండా ఫ్యాక్టరీని మూసేయాలని చూస్తున్న ప్రభుత్వం ఆ రవాణా ఖర్చు రైతులకు ఎలా తిరిగిస్తుందనే ప్రశ్నలు తలెత్తాయి. గోవాడ ఫ్యాక్టరీలో ఒకసారి క్రషింగ్ ఆపేస్తే.. పునరుద్ధరణ అసాధ్యమని, ఫ్యాక్టరీని పూర్తిగా మూసేయడానికే ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చెరకు రైతుల బకాయిలు రూ.28 కోట్లు.. గోవాడ సుగర్ ఫ్యాక్టరీలో 2023–24, 2024–25 క్రషింగ్ సీజన్లకు సంబంధించి సభ్య రైతులకు చెరకు బకాయిలు రూ.28 కోట్లు, రవాణా చార్జీలు రూ.కోటి కలిపి సుమారు రూ.29 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక కార్మికులకు ఆరు నెలల వేతన బకాయిలు, పదవీ విరమణ చేసిన సిబ్బందికి చెల్లించాల్సిన వివిధ రకాల ప్రయోజనాలు కలిపి సుమారు రూ.10 కోట్లు ఉంటాయి. ప్రస్తుతం ఫ్యాక్టరీలో వున్న పంచదార, మొలాసిస్ నిల్వల విలువ రూ.6 కోట్లకు మించి ఉండదు. చెరకు రైతులకు, ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిల చెల్లించాలంటే మరో రూ.35 కోట్లు అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో ఆప్కాబ్తో పాటు ఏ బ్యాంకు కూడా సుగర్ ఫ్యాక్టరీకి రుణం ఇచ్చే పరిస్థితి లేదు. ఇక భారమంతా ప్రభుత్వంపైనే ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. చెరకు రైతుల కంట నీరు దేశ వ్యాప్తంగా సుగర్ ఫ్యాక్టరీలు పెరుగుతుంటే ఏపీలో మాత్రం ఉన్న సహకార చక్కెర ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయాయి. నాలుగు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో ఉన్న అన్ని సహకార సుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. గతంలో రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగా చెరకు సాగు చేసేవారు. ప్రస్తుతం 3 లక్షల ఎకరాలు కూడా చెరకు సాగు చేయలేని పరిస్థితులున్నాయి. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే ఒక లక్షా 30 వేల ఎకరాల్లో పండించే చెరకు సాగు ప్రస్తుతం 9 వేల ఎకరాలకే పరిమితమైంది. రాష్ట్రంలో మిగిలిన ఏకైక గోవాడ సుగర్ ఫ్యాక్టరీని కూడా చంద్రబాబు హయాంలోనే క్రషింగ్ నిలిపివేయడం గమనార్హం. ఇంకా, రైతులు, కార్మికుల బకాయిలు ఇవ్వలేదు. రెండు జిల్లాల్లో రైతులు 25 వేల మంది రైతు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రైతుల కంట నీళ్లొస్తున్నాయి. – కర్రి అప్పారావు, చెరకు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు.బాబు పాలనలోనే ఫ్యాక్టరీలకు ఉరి ‘‘ఎన్నికల ముందు ఆదుకుంటామని తీపి మాటలు చెప్పి.. తీరా గద్దె నెక్కాక చక్కెర కర్మాగారాలను పీల్చి పిప్పి చేసి మూసివేయడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. చంద్రబాబు హయాంలో ప్రభుత్వ చక్కెర సహకార ఫ్యాక్టరీలన్నీ నిర్వీర్యం చేశారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు(1995–2004) హయాంలో 6 సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. మూతపడిన అనకాపల్లి(తుమ్మపాల), చిత్తూరు, తెనాలి, కడప(ఎన్వీఆర్ జంపనీ), అదిలాబాద్, రేణుగుంట సహకార చక్కెర కర్మాగారాలకు నాడు మహానేత వైఎస్సార్ అధికారంలోకి వచ్చి రాగానే అన్నింటిని పునరుద్ధరించారు. మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో 10 సుగర్ ఫ్యాక్టరీలు( చిత్తూరు–2, అనకాపల్లి–3, నెల్లూరు–1, పశ్చిమ గోదావరి–2, విజయనగరం–1, కడప–1 సహకార చక్కెర ఫ్యాక్టరీలు) మూతపడ్డాయి. ఆ తరువాత వైఎస్సార్సీపీ హయాంలో కడప, చిత్తూరు తెరవడంతో పాటు ఏటికొప్పాక, తాండవ, గోవాడ, అనకాపల్లి తుమ్మపాల సుగర్ ఫ్యాక్టరీ బకాయిలు రూ.89 కోట్లు విడుదల చేశారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబు హయాంలో మిగిలిన ఏకైక గోవాడ చక్కెర ఫ్యాక్టరీలో క్రషింగ్ నిలిచిపోయింది.చక్కెరకు ‘సహకారం’ లేనట్టే..! -
డీఈఓకు మిడ్డే కార్మికుల సమ్మె నోటీసు
డీఈఓకు సమ్మె నోటీసు అందిస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులుచోడవరం : కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఈనెల 12వ తేదీన చేపట్టనున్న దేశవ్యాప్త సమ్మెలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులంతా పాల్గొంటామని ఏపీ మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు గూనూరు వరలక్ష్మి తెలిపారు. దీనిలో భాగం సమ్మె నోటీసును సోమవారం జిల్లా విద్యాశాఖాధికారికి ఇచ్చామని ఆమె తెలిపారు. ఉద్యోగభద్రత, కనీస వేతనాలు అమలు, ప్రమాద బీమా సౌకర్యంతోపాటు ప్రైవేటీకరణ ఆలోచన విరమించాలని కోరుతూ ఈ సమ్మె చేపడుతున్నామని ఆమె చెప్పారు. పాఠశాలల్లో ఫస్ట్ ఎయిడ్ కిట్లు ఇవ్వాలని, శానిటేషన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు ఎం. శ్రీదేవి, సూర్యలక్ష్మి,జానకి, శివలక్ష్మి పాల్గొన్నారు. -
8న ఉక్కు నిర్వాసితుల భారీ బహిరంగ సభ
సీతంపేట: భూములిచ్చిన తమకు ఉద్యోగాలివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిచేయి చూపుతున్నాయని, దీనికి నిరసనగా ఈ నెల 8న గాజువాక లంక గ్రౌండ్లో మధ్యాహ్నం 2 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఉక్కు నిర్వాసితుల ముఖ్య సలహాదారు వై.మహదేవ్ తెలిపారు. సోమవారం విశాఖ పౌర గ్రంథాలయంలో సభకు సంబంధించిన కరపత్రాలను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మహదేవ్, సంఘం నాయకులు పితాని భాస్కరరావు మాట్లాడుతూ 26 వేల ఎకరాల భూములిచ్చిన రైతులు 35 ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టీల్ప్లాంట్లో మిగిలి ఉన్న 8,500 మంది నిర్వాసితులకు వెంటనే ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు హామీలిచ్చిన కూటమి నాయకులు నేడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఈ సభకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాల గౌడ్, మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు వంటి ప్రముఖులు హాజరవుతారని, నిర్వాసితులు తమ కుటుంబాలతో కలిసి భారీగా పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
సమస్యల పరిష్కారానికి కృషి
అర్జీదారుల సమస్యను వింటున్న ఎస్పీ తుహిన్ సిన్హా అనకాపల్లి: ఎస్పీ కార్యాలయానికి సోమవారం పీజీఆర్ఎస్కు 66 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్ సిన్హా తమ కార్యాలయంలో అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరించి వారి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ తగాదాలు–32, మోసపూరిత వ్యవహరాలు–3, కుటుంబ కలహాలు–2, ఇతర విభాగాలకు చెందినవి–29 అర్జీలు వచ్చినట్లు చెప్పారు. చట్టపరిధిలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు తదితరులు పాల్గొన్నారు. -
స్కూటీ నుంచి జారిపడి యువకుడి దుర్మరణం
యలమంచిలి రూరల్ : స్నేహితుడిని ఇంటి వద్ద దింపడానికి స్కూటీపై వెళ్తుండగా స్పీడ్ బ్రేకర్ వద్ద జరిగిన ప్రమాదంలో వెనుక కూర్చున్న యువకుడు దుర్మరణం పాలైన ఘటన యలమంచిలి మండలం రేగుపాలెం వద్ద ఆదివారం అర్థరాత్రి చోటు చేసుకుంది. ఊహించని రీతిలో జరిగిన ఈ ప్రమాదం మృతుని కుటుంబంలో విషాదం నింపింది. యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర తెలిపిన వివరాల ప్రకారం యలమంచిలి మున్సిపాలిటీ పరిధి పెదపల్లి కాలనీ(శ్రీరాంనగర్)కు చెందిన గగనం సుజయ్కుమార్ (27) పట్టణంలోని ధర్మవరం వీధికి చెందిన అతని స్నేహితుడు బోడపాటి కృప ఆకేష్తో కలిసి ఏపీ40 హెచ్టీ రిజిస్ట్రేషన్ నంబరు గల స్కూటీపై ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల సమయంలో రేగుపాలెం మీదుగా వెళ్తుండగా పాతజాతీయ రహదారి సాయిబాబా ఆలయం ఎదురుగా స్పీడ్ బ్రేకర్ వద్ద స్కూటీ బోల్తా పడింది. ప్రమాదంలో వెనుక కూర్చున్న గగనం సుజయ్కుమార్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావమైంది. గాయపడిన యువకుడిని హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించిన తర్వాత పరిస్థితి విషమంగా ఉండడంతో మరింత మెరుగైన చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సుజయ్కుమార్ సోమవారం మృతి చెందాడు. బోడపాటి కృప స్కూటీని నిర్లక్ష్యంగా, వేగంగా నడపడం స్పీడ్ బ్రేకర్ వద్ద వాహనాన్ని నియంత్రించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
రూ. 4,180 కోట్ల అంచనాతో జీవీఎంసీ వార్షిక బడ్జెట్
రేపు ప్రవేశపెట్టనున్న మేయర్ బడ్జెట్ ప్రొఫైల్డాబాగార్డెన్స్: జీవీఎంసీ 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను మేయర్ పీలా శ్రీనివాసరావు బుధవారం కౌన్సిల్ హాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఐదేళ్ల పాలనలో మొదటి నాలుగేళ్లు వైఎస్సార్ సీపీకి చెందిన గొలగాని హరి వెంకటకుమారి మేయర్ హోదాలో బడ్జెట్ను ఆమోదింపజేయగా, ప్రస్తుత పాలకవర్గంలో మేయర్ పీలా శ్రీనివాసరావుకు ఇది చివరి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశంగా నిలిచింది. బుధవారం నిర్వహించనున్న ఈ బడ్జెట్ సమావేశానికి సంబంధించి గత నెల 12నే జీవీఎంసీ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి ఆధ్వర్యంలో మేయర్, స్థాయీ సంఘం చైర్మన్ సమక్షంలో ప్రాథమిక చర్చలు జరిగాయి. ఆ సమావేశంలో వివిధ విభాగాల వారీగా కేటాయింపులు, జమలు, ఖర్చులపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించి, కొన్ని మార్పులు చేర్పులతో ముసాయిదాకు ఆమోదం తెలిపారు. బడ్జెట్ అంచనాలు ఇలా.. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాలను పరిశీలిస్తే, ప్రారంభపు నిల్వ రూ.365.96 కోట్లుగా ఉండగా, అన్ని పద్దుల కింద వచ్చే జమలు రూ.3814.41 కోట్లుగా లెక్కించారు. వెరసి మొత్తం ఆదాయం రూ.4180.37 కోట్లు కాగా, వివిధ అభివృద్ధి పనులు మరియు నిర్వహణ కోసం రూ.4047.12 కోట్లను ఖర్చుగా ప్రతిపాదించారు. చివరగా రూ.133.25 కోట్లను ముగింపు నిల్వగా నిర్ణయించారు. శాఖల వారీగా చూస్తే సాధారణ పరిపాలన విభాగంలో రూ.1232.60 కోట్ల జమలు, రూ.375.82 కోట్ల ఖర్చులు ఉండగా, అత్యధికంగా ఇంజనీరింగ్ విభాగంలో రూ.1018.18 కోట్ల ఖర్చులను ప్రతిపాదించారు. లైటింగ్ విభాగం కోసం రూ.129.19 కోట్లు, ప్రాజెక్టుల కోసం రూ.67.35 కోట్లు, టౌన్ ప్లానింగ్ కోసం రూ.23.98 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రజారోగ్యం విభాగానికి రూ.455.94 కోట్లు, నీటి సరఫరా విభాగానికి రూ.260.08 కోట్లు కేటాయించగా, విద్య, పార్కుల అభివృద్ధికి కూడా తగిన ప్రాధాన్యతనిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల విషయానికి వస్తే అమృత్ పథకం కింద రూ.388 కోట్లు, ఆర్థిక సంఘం నిధుల నుండి రూ.215 కోట్లు, అర్బన్ చాలెంజింగ్ ఫండ్ ద్వారా రూ.650 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటితో పాటు డిపాజిట్లు, అడ్వాన్సుల కింద రూ.340.82 కోట్ల వ్యయాన్ని బడ్జెట్ అంచనాల్లో పొందుపరిచారు. రూ.1018.18 కోట్లుఇంజినీరింగ్ విభాగం అర్బన్ చాలెంజింగ్ ఫండ్ రూ.650 కోట్లు ప్రజారోగ్యం విభాగానికి రూ.455.94 కోట్లునీటి సరఫరా విభాగానికి రూ.260.08 కోట్లు రూ.129.19 కోట్లులైటింగ్ విభాగం కోసం టౌన్ ప్లానింగ్ కోసం రూ.23.98 కోట్లు ప్రారంభ నిల్వ రూ.365.96 కోట్లు ముగింపు నిల్వ రూ.133.25 కోట్లుఅన్ని పద్దుల కింద ఖర్చులు రూ.4047.12 కోట్లు -
మైన్స్ చెక్పోస్టుల పేరిట అక్రమ వసూళ్లు
దేవరాపల్లి : గ్రామాలలో నిబంధలనకు విరుద్ధంగా మైన్స్ పేరిట ప్రైవేటు సంస్థకు చెందిన వ్యక్తులు చెక్ పోస్టుల ద్వారా అక్రమ సీనరేజ్ వసూలు చేయడంపై స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తికి వాకపల్లి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వాకపల్లిలో సోమవారం జరిగిన నూతన భూమి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక తహసీల్దార్ పి.లక్ష్మీదేవి సమక్షంలో ఎమ్మెల్యే రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామాలలో ఏర్పాటు చేసిన మైన్స్ చెక్ పోస్టుల ద్వారా రైతులు తమ సొంత పంట పొలాలు చదును చేసుకునేందుకు మట్టి తీసుకుంటే, గతంలో ఎన్నడూ లేని విధంగా దౌర్జన్యం చేసి మరీ వసూలు చేస్తున్నారని ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే స్పందిస్తూ డీఆర్సీలో సమస్య లేవనెత్తామన్నారు. చెక్ పోస్టులకు సంబంధించిన నిబంధనలను తహసీల్దార్, గ్రామ పంచాయతీ అధికారులకు సైతం తెలియజేయాలని జిల్లా కలెక్టర్కు కోరామన్నారు. -
వైభవంగా కేశవస్వామి పుష్పాంజలి సేవ
చోడవరం : కేశవస్వామివారి పుష్పాంజలి సేవ కనువిందుగా జరిగింది. వందలాద మంది భక్తులు స్వామివారి ఊంజల సేవలో పాల్గొన్నారు. ఉత్తరాంధ్రలో ప్రాచీన దేవాలయాల్లో ఒకటైన చోడవరం శ్రీ కేశవస్వామివారి 753వ వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రితో ముగిశాయి. జనవరి 27వతేదీ నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమై ఏడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి. సోమవారం రాత్రి స్వామివారి పుష్పాంజలి సేవ కన్నుల పండువగా జరిగింది. శ్రీదేవి,భూదేవి సమేతుడైన కేశస్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని రకరకాల పూలతో సర్వాంగసుందరంగా తయారు చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఊయలలో శ్రీదేవి,భూదేవి, కేశవస్వామి ఉత్సవ మూర్తులను ఉంచి వేదపండితులు సీతారామాచార్యులు, రామకృష్ణచార్యులు ఆధ్వర్యంలో స్వామివారి ఊంజల సేవ చేశారు. పూలు, రకరకాల పండ్లు, స్వీట్లుతో అంతా అలంకరించారు. భక్తులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై శ్రీదేవి,భూదేవి సమేతుడైన కేశవస్వామివార్ల ఉత్సవ మూర్తులను చోడవరం పట్టణ పురవీధుల్లో వైభవంగా తిరువీధోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్ రాజు, ఆలయ కమిటీ ప్రతినిధులు ఉపాధ్యాయుల శ్రీనివాస్, దేవదాయ శాఖ ఈవో సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. -
భూసమస్యల పరిష్కారం
రెవెన్యూ క్లినిక్లతో సాగు రైతులకు పట్టాలివ్వాలని ఆందోళన తుమ్మపాల : భూ సంబంధిత సమస్యలను రెవిన్యూ క్లినిక్ ద్వారా సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని, పీజీఆర్ఎస్కు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1 , 2 లో వెర్వేరుగా నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో ఆయనతో పాటు పీజీఆర్ఎస్ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ రామమణి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీలను సకాలంలో పరిష్కరించాలని, డివిజన్, మండల, గ్రామస్థాయిలలో నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరై ఆయా స్థాయిలోనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ క్లినిక్లో ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్.సుబ్బలక్ష్మి, మనోరమ, అనిత రెవెన్యూ సంబంధిత అర్జీలను స్వీకరించి పరిష్కార మార్గాలపై సంబంధిత మండల అధికారులతో మాట్లాడి సూచనలు చేశారు. పీజీఆర్ఎస్కు 215, రెవిన్యూ క్లినిక్కు 276 మొత్తం 491 అర్జీలు నమోదయ్యాయి. డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ పీడీలు శచిదేవి, కె.సరోజిని, సూర్యలక్ష్మి, జిల్లా ఎక్త్సెజ్ అధికారి వి.సుధీర్, జిల్లా రవాణా శాఖ అధికారి జి.మనోహర్, జిల్లా సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకుడు గోపాల్ రాజా పాల్గొన్నారు. ఎస్సీఎస్టీలకు అదనపు నిధులివ్వాలి : విస్తృత దళిత సంఘాల వినతి ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛను అమలు, జనాభా నిష్ఫత్తి 2026 – 27 ఆధారంగా బడ్జెట్లో సబ్ప్లాన్ ద్వారా రూ.40 వేల కోట్లు కేటాయించాలంటూ విస్తృత దళిత సంఘాల ఐక్య వేదిక జిల్లా సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ నెల 14న ప్రవేశ పెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో సబ్ప్లాన్కు నిధులు కేటాయింపుపై ఎస్సీ ఎస్టీ ప్రతినిధుల అభిప్రాయం తీసుకుని ఎస్సీలకు పింఛను అమలు కోసం అదనంగా రూ.5 వేల కోట్లు కేటాయించాలని, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లు, అంగన్వాడీ, ప్రాథమిక, ఉన్నత విద్యలో మౌలిక సదుపాయాలు కోసం రూ.5 వేల కోట్లు కేటాయించాలని, ఎస్సీ కార్పొరేషన్ రుణాలు ఈ ఆర్థిక సంవత్సరం మార్చిలోపే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా అధికారులకు వినతి అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర సహాయ కన్వీనర్ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు మట్ల అప్పారావు, ఆర్.కోయిష్మా, రేవిడి కృష్ణ పాల్గొన్నారు. ఓవర్లోడ్ ట్రక్కుల కాలుష్యంపై ఫిర్యాదు సింహాద్రి ఎన్టీపీసీ, ఫార్మాసిటీ, ఎస్ఈజెడ్, హిందూజా వంటి పరిశ్రమలకు వెళ్లే ఓవర్ లోడు ట్రక్కులతో వాయుకాలుష్యం తీవ్రంగా పెరిగిపోయి అనేక ప్రమాదాలతో పాటు లంకెలపాలెం పరిసరాల్లో నివసించే ప్రజలు తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని, తక్షణమే అధికారులు చొరవ తీసుకుని చర్యలు చేపట్టాలని ఆయా పరిసరాల ప్రజలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. బొగ్గు, తడి పొడి ఫ్లైయాష్ తరలిస్తున్న ట్రక్కులు టార్పాలిన్లు కప్పకపోవడంతో పొడి బూడిద గాలిలోనికి ఎగిసిపడుతుందని, తడి బూడిద రోడ్డుపై పడి రోడ్డును దుమ్ము ధూళితో కమ్మేస్తుందని, కళ్ల మంటలు, గొంతు, ముక్కు శ్వాస కోశ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపరాఉ. అధికారులు తక్షణమే కాలుష్యకారక ట్రక్కులను నిరోధించాలని కోరుతూ డీఆర్వోకు వినతి అందించారు. జిల్లా కలెక్టర్కు మునగపాక వాసుల వినతులు మునగపాక: స్థానిక బీసీ కాలనీలో నిరుపయోగంగా ఉన్న పూర్వ హాస్టల్ భవనాన్ని డాక్టర్ అంబేడ్కర్ సామాజిక భవనానికి కేటాయించాలని కలెక్టర్కు దళిత సంఘాల నేతలు వినతి అందజేశారు. ఏళ్ల తరబడి విద్యార్థులు లేకపోవడంతో పూర్వ హాస్టల్ భవనం నిరుపయోగంగా ఉందని అంబేడ్కరిజమ్ పునాది అసోసియేషన్ కన్వీనర్ రాజాన బుజ్జిబాబు తెలిపారు. వినతి అందజేసిన వారిలో దళిత నాయకులు ఎంఎ అప్పలరాజు, బోని గణేష్, మైలపల్లి పోతురాజు, రేబాక మదుభాబు, మైలపల్లి అప్పలనరసయ్య, పిట్టా అప్పారావు, చెక్కా అప్పారావు, లంబా అర్జునరావు ఉన్నారు. మునగపాక సంతబయిలలో ఏళ్ల క్రితం నిర్మించిన కల్వర్టు దెబ్బతినడంతో రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కుంటున్నారంటూ సర్పంచ్ దిమ్మల అప్పారావు కలెక్టర్కు వినతి అందజేశారు. గ్రామంలో ఏళ్లక్రితం నిర్మించిన రహదారులు పూర్తిగా దెబ్బతిని శిథిలావస్థకు గురయ్యాయని, ఇందుకు అవసరమయ్యే నిధులు మంజూరు చేయాలని కోరినట్లు సర్పంచ్ తెలిపారు. పరిశ్రమల కాలుష్యం నుంచి విముక్తి కల్పించాలి కశింకోట: మండలంలోని ఏఎస్ పేట గ్రామం వద్ద మూడు ప్రైవేటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్యం నుంచి తమ గ్రామస్తులకు, రైతుల భూములకు రక్షణ కల్పించడానికి, భారీ వాహనాల రాకపోకల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ను గొబ్బూరు గ్రామ రైతు బుద్ధ వెంకటరమణ కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ను కలిసి వేర్వేరుగా వినతి పత్రాలు సమర్పించారు. -
చెరకు బకాయిలు చెల్లించాలని ఆందోళన
రావికమతం: చెరకు బకాయిలు తక్షణమే చెల్లించాలని సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. ఏడాది కిత్రం గోవాడ సుగర్ ఫ్యాక్టరీకి చెరకు తరలించామని, ఇంతవరకూ బకాయిలు చెల్లించలేదని మండలంలో మేడివాడ, గర్నికం గ్రామాల రైతులు వాపోయారు. అప్పులు చేసి చెరకు పండించామని, ఫ్యాక్టరీ యాజమాన్యం చెరకు బకాయిలు చెల్లించలేదని రైతులు శానాపతి శ్రీను, జంపా శేషు, గొర్లి సత్యారావు, అప్పలనాయుడు తదితరులు వాపోయారు. అనంతరం న్యాయం చేయాలని తహసీల్దార్ అంబేడ్కర్కు వినతిపత్రం అందజేశారు. -
రోజ్వుడ్పై గొడ్డలి వేటు
నర్సీపట్నం : అల్లూరి జిల్లా, సీలేరు నుంచి రోజ్వుడ్ ఫర్నిచర్ అక్రమ రవాణా నర్సీపట్నం మీదుగా జరుగుతోంది. అటవీ అధికారుల అండతో స్మగ్లర్లు రోజ్వుడ్ కలపను అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. రోజ్వుడ్ గృహోపకరణాల తయారీకి సీలేరు కేంద్రంగా మారింది. ఖరీదు ఎంతైనా రోజ్వుడ్ ఫర్నిచర్ను కొనేందుకు ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో స్మగ్లర్లకు రోజ్వుడ్ అక్రమ రవాణా కల్పతరవుగా మారింది. రాష్ట్రంలో రోజ్వుడ్ అంతరించిపోయిందని అటవీ అధికారులు చెబుతున్నారు. వివిధ రకాల రోజ్వుడ్ ఫర్నిచర్ సీలేరులో లభిస్తోంది. చింతపల్లి, సీలేరు, జీకే.వీధి అడవుల్లో అంతంత మాత్రంగా ఉన్న రోజ్వుడ్ స్మగ్లర్ల కాసుల కక్కుర్తితో కరిగిపోతోంది. నర్సీపట్నం మీదుగా అక్రమ రవాణా సాగుతుండడంతో నర్సీపట్నం అటవీ అధికారులు దీనిపై దృష్టి సారించారు. ఇటీవల కారులో తరలిస్తున్న రోజ్వుడ్ ఫర్నిచర్ను ఏటిగైరంపేట చెక్పోస్టు వద్ద డీఎఫ్వో శామ్యూల్ ఆదేశాలతో రేంజర్ రాజేష్ పట్టుకుని కేసు నమోదు చేశారు. సీలేరు కేంద్రంగానే... సీలేరు కేంద్రంగా రోజ్వుడ్ పరిశ్రమ నడుస్తోంది. డబుల్కాట్, సింగిల్ కాట్, టీపై, కుర్చీలు వంటి ఫర్నిచర్ ఇక్కడ సిద్ధమవుతోంది. వీటిలో డబుల్కాట్కు మంచి గిరాకీ ఉంది. ఏజెన్సీలో పని చేస్తున్న అధికారులు వారి సొంతానికి, బంధువులకు రోజ్వుడ్ ఫర్నిచర్ను కొనుగోలు చేస్తున్నారు. సీలేరు నుంచి డబుల్కాట్ మంచం తీసుకురావాలంటే సీపీజి రూపంలో ప్రభుత్వానికి రూ.18 వేలు చెల్లించాల్సి ఉంది. స్మగ్లర్లకు, అధికారుల నడుమ లాలూచితో 4 నుంచి 5 మంచాలు తీసుకువెళ్లినా ఒక మంచానికే సీపీజీ రాస్తున్నారు. మామూళ్ల మత్తులో అటవీ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తీసుకువెళ్లేది రోజ్వుడ్ ఫర్నిచర్ అయినప్పటికీ మారుజాతి కలపగా రికార్డులో చూపుతున్నారు. సీలేరులో డబుల్కాట్ మంచం రూ.60 వేలు ఉంటుంది. అదే మంచం ఇతర జిల్లాలకు చేర్చాలంటే రూ.లక్షకు ఫైగా ఖర్చు అవుతుంది. లంబసింగి, డౌనూరు చెక్పోస్టులు ఉన్నప్పటికీ రోజ్వుడ్ సరిహద్దులు దాటుతుంది. ఏజెన్సీ, నర్సీపట్నం అటవీ అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. ఏజెన్సీ నుంచి రోజ్వుడ్ ఫర్నిచర్తో వచ్చే వాహనాలను పట్టుకుని కేసులు పెడుతున్నారు. రవాణా నియంత్రణకు పటిష్ట చర్యలు.. రోజ్వుడ్ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పటిష్ట చర్యలు చేపట్టాం. అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి నర్సీపట్నం మీదుగా ఫర్నిచర్ తీసుకువెళ్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. దీనిని నియంత్రించేందుకు సిబ్బందికి తగిన ఆదేశాలు ఇచ్చాను. పక్కా సమాచారంతో పది రోజుల క్రితం విలువైన రోజ్వుడ్ ఫర్నిచర్ను సిబ్బంది పట్టుకున్నారు. ఏటిగైరంపేట చెక్పోస్ట్ వద్ద నిఘా మరింత పటిష్టం చేశాం. మొబైల్ టీమ్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వాస్తవంగా అయితే మన రాష్ట్రంలో రోజ్వుడ్ అంతరించిపోయింది. సీలేరు సరిహద్దులో ఉన్న ఒడిశా రాష్ట్రం నుండి రోజ్వుడ్ తీసుకువస్తున్నారు. పట్టుబడిన స్మగ్లర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. –ఎం.శామ్యూల్, జిల్లా అటవీశాఖ అధికారి, అనకాపల్లి -
● పట్టుకున్న పోలీసులు ● కేసు నమోదు
వ్యాన్లో కుక్కి పశువుల అక్రమ రవాణా నక్కపల్లి : ఇరుకై న వ్యాన్లో క్రూరంగా పశువులను కుక్కి అక్రమంగా రవాణా చేస్తున్న బొలేరో వాహనాన్ని సోమవారం నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీఐ మురళికి అందిన సమాచారం మేరకు వేంపాడు టోల్ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ చేయడం జరిగిందన్నారు. మానాపురం నుంచి సామర్లకోట వరకు బొలేరో వాహనంలో 18 ఎడ్లు, ఒక ఆవును రెండు అరల్లో బలవంతంగా కుక్కి తీసుకెళ్తున్నట్టు గుర్తించడం జరిగిందన్నారు. ఈ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఈ పశువులను తరలిస్తున్నట్టు గుర్తించామన్నారు. పరిమితికి మించి పశువులను అత్యంత క్రూరంగా ఊపిరి ఆడకుండా అరలు అమర్చ్ని చిన్న బొలేరో వాహనంలో తరలించడం వల్ల ఒక ఆవు మృతి చెంది ఉందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆవులను కుక్కి తరలిస్తున్న సంఘటనపై బొలేరో వాహనంతో పాటు, డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. వాహనంతోపాటు పశువులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. అత్యంత క్రూరంగా పశువులను చిన్నవాహనంలో రెండు అరలు అమర్చి తరలిస్తున్నారని ఎస్ఐ తెలిపారు. -
పీహెచ్సీ స్థలంలో గ్రౌండ్ నిర్మాణంపై హైకోర్టు నోటీసులు
నాతవరం: నిబంధనలు పాటించకుండా కూటమి నేతలకు తలొగ్గి అధికారులు పీహెచ్సీ స్థలంలో వాలీబాల్ గ్రౌండ్ నిర్మాణ పనులు చేయడంపై హైకోర్టు కలెక్టరు, ఇతర శాఖల అధికారులకు నోటీసులు పంపింది. ప్రభుత్వం నాతవరంలో వాలీబాల్ గ్రౌండ్ నిర్మించేందుకు గతేడాది నిధులు మంజూరు చేసింది. ఈనిధులతో అన్ని వర్గాల ప్రజలు అభీష్టం మేరకు నిబంధనలు అనుసరించి పనులు చేయాలి. క్షేత్రస్థాయి అధికారులు నిబంధనలు పాటించకుండా కూటమి నేతలు చెప్పినట్టుగా పీహెచ్సీ స్థలంలో ఏకపక్షంగా జిల్లా క్రీడాధికారి శైలజ, ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ ఎ.వేణుగోపాల్, పంచాయతీరాజ్శాఖ జేఈ వెంకటేశ్మరమ్మ డిసెంబరులో భూమి పూజ చేసి పనులు ప్రారంభించేశారు. గతంలో ఈ ఆస్పత్రి స్థలం ఇచ్చిన దాతలు స్పష్టంగా ఈ స్థలాన్ని ఆస్పత్రి కోసమే వినియోగించాలని నిర్దేశించారు. అయితే కూటమి నేతలు ఒత్తిళ్లతో పీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంపీపీ లక్ష్మణమూర్తి తీర్మానం లేకుండా, పంచాయతీ సర్పంచ్ రాణికి తెలియకుండా, గ్రామసభ ఆమోదం లేకుండా పనులు చేపట్టారు. దీనిపై కలెక్టర్కు, డీఎంహెచ్వోకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో నాతవరం సర్పంచ్ గొలగాని రాణి హైకోర్టును ఆశ్రయించారు. ఏడు శాఖల అధికారులను కూటమి నేతను ప్రతివాదులు చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ పీహెచ్సీ స్థలంలో నిబంధనల ప్రకారమే వాలీబాల్ గ్రౌండ్ నిర్మాణ పనులు చేస్తున్నారా లేదా అనే విషయాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటనే నివేదిక పంపించాలని కలెక్టరుకు నోటీసులో పేర్కొ న్నారు. హైకోర్టు నుంచి కలెక్టరు, డీఎంహెచ్వో, ఆర్డీవో ఎంపీడీవో, తహసీల్దార్, జిల్లా క్రీడాధికారి, పంచాయతీరాజ్ జేఈ, పంచాయతీ కార్యదర్శికి నోటీసులు రావడంతో మండలంలో అలజడి నెల కొంది. ఈ విషయంపై నాతవరం ఎంపీడీవో శ్రీనివాస్ను సంప్రదించగా హైకోర్టు నుంచి నోటీసులు వచ్చాయన్నారు. దీనికి సంబంధించి నివేదిక కలెక్టరు పంపించుతారన్నారు. -
హర్షించతగ్గ యోగాసనాలు
దేవరాపల్లి: రైవాడ బాలిక యోగా పోటీల్లో అద్భుత మే చేస్తోంది. సంగీతానికి అనుసంధానమైన యోగా భంగిమలను వేదికపై అవలీలగా ప్రదర్శిస్తోంది. శరీరాన్ని విల్లులా వంచి అత్యంత కష్టతరమైన యోగాసనాలను సైతం సునాయాసంగా వేస్తూ ఔరా అనిపిస్తోంది. బాలురకు తాను ఎక్కడా తీసిపోనంటూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ ల్లో పతకాలను కొల్లగొడుతోంది. ఇప్పటి వరకు 11 బంగారు, 4 వెండి, 4 కాంస్య పతకాలు సాధించడమే ఆమె ప్రతిభకు గీటు రాయిగా చెప్పవచ్చు. కుటుంబ నేపధ్యం ఇలా.... రైవాడ గ్రామానికి చెందిన దుక్క రామకృష్ణ, దేముళ్లమ్మ దంపతుల రెండో సంతానం హర్షిత ఒకటి నుంచి 4వ తరగతి వరకు రైవాడ ప్రాథమిక పాఠశాలలో చదివింది. 5వ తరగతి నుంచి తానాం రెసిడెన్షియల్ స్కూల్లో చేరింది. ప్రస్తుతం అక్కడ 9వ తరగతి చదువుతోపాటు యోగాలో రాణిస్తోంది. ఐదో తరగతి నుంచి స్థానిక యోగా కోచ్ ఆంజనేయులు తర్ఫీదుతో యోగా సాధన ప్రారంభించింది. ఆర్టిస్టిక్స్ ఫెయిర్, రిథమిక్ ఫెయిర్, ట్రెడిషనల్ విభాగాల్లో తనదైన శైలిలో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. అవలీలగా కష్టతరమైన యోగాసనాలు... యోగాలో కష్టతరమైన కోకిలాసనం, వామదేవ త్రిపురాసనం, ద్విపాద కోకిలాసనం, ఓంకారసానం, విభక్త పాద శివలింగాకారసానం, డింబాసనం, మలయాసనం, పరివృత్త ఉపవిష్ఠ కోణాసన, సరసాసనం, వామనాసనం, వృశ్చికాసనం తదితర ఆసనాలను అవలీలగా ప్రదర్శిస్తూ అబ్బుర పరుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో సైతం ప్రముఖల నుంచి మెడల్స్, మెమోంటోలు, ప్రశంసా పత్రాలు అందుకుంటూ పలువురి మన్ననలు పొందింది. సాధించిన విజయాలు ఇవే... ● నంద్యాలలో 2022లో జరిగిన 47వ రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో 12 ఏళ్ల లోపు వయసు విభాగంలో ప్రథమ స్థానం ● చోడవరంలో 2022 నవంబర్లో జరిగిన 35వ రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో జూనియర్ గర్ల్స్ విభాగంలో ప్రథమ స్థానం ● పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో 2023 నవంబర్లో జరిగిన ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో అండర్–14 యోగా ట్రెడిషనల్ విభాగంలో ప్రథమ స్థానం ● కర్నూల్లో 2024 అక్టోబర్లో జరిగిన 5వ రాష్ట్ర స్థాయి యోగా పోటీల్లో ఆర్టిస్టిక్స్ ఫెయిర్ విభాగంలో సబ్ జూనియర్ గర్ల్స్లో ప్రథమ స్థానం ● అనంతపురం జిల్లాలో 2025 డిసెంబర్లో జరిగిన 6వ సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ చాంపియన్ షిప్లో ద్వితీయ స్థానం ● అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 2022 డిసెంబర్లో జరిగిన ఎస్జీఎఫ్ 66వ అంతర్ జిల్లాల యోగా చాంపియన్ షిప్లో కాంస్య పతకం ● విశాఖపట్నంలో 2022 ఆగస్టులో జరిగిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో 8 నుంచి 10 ఏళ్ల వయసు విభాగంలో ద్వితీయ స్థానం ● జాతీయ స్థాయిలో పశ్చిమబెంగాల్, అస్సాం, హైదరాబాద్లో జరిగిన పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచింది. ‘యోగా’లో రైవాడ విద్యార్థిని అదుర్స్ అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యం తానాం రెసిడెన్షియల్ స్కూల్లోని యోగా గురువు ఆంజనేయులు నిత్యం రెండు గంటలపాటు యోగా శిక్షణిచ్చి, మెలకువలు నేర్పిస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు సిద్ధం చేస్తున్నారు. దీంతోపాటు ఉపాధ్యయులు, తల్లిదండ్రుల ప్రోత్సహంతో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించి పతకా లు సాధించగలిగాను. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా కఠోర సాధన చేస్తున్నాను. – దుక్క హర్షిత, విద్యార్థిని, రైవాడ ఓంకారసానంలో హర్షిత -
కనీస పింఛను పెంపు కోసం ఆందోళన
తుమ్మపాల : సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇపీఎస్95 రిటైర్డ్ పెన్షనర్స్కు కనీస పెన్షన్ రూ.9 వేలు అమలు డిమాండ్ చేస్తూ చేపట్టే ఆందోళనను విజయవంతం చేయాలని ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్న్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సుధాకరరావు పిలుపునిచ్చారు. మండలంలోని తుమ్మపాల గౌరీ వెల్ఫేర్ అసోసియేషన్ భవనంలో ఆర్ఈసీఎస్ రిటైర్డ్ ఉద్యోగి సిహెచ్.రామారావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ పింఛనుతో పాటు భార్యభర్తలకు వైద్యసౌకర్యం కల్పించాలని, సీనియర్ సిటిజన్స్కు రైల్వే రాయితీ పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. గత ఏడాది డిసెంబర్ 9, 10 తేదీలలో జరిగిన ఢిల్లీలో జరిగిన సెమినార్, జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా వివరాలు తెలిపారు. ఈ నెల 9న కలెక్టర్ కార్యాలయం, 10న రీజనల్ ప్రావిడెంటు కార్యాలయం, 11న విశాఖపట్నం జీవీఎంసీ కార్యాలయం గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సంఘం సభ్యత్వం అందరూ చేయించుకోవాలని కోరారు. అంతకుముందు అమరులైన సంఘ సభ్యులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా సహాయ కార్యదర్శి కె.పి.కుమార్, తుమ్మపాల, గోవాడ, ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీల రిటైర్డ్ ఉద్యోగులు, ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
జిల్లా ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా వరుణ్
అనకాపల్లి: జిల్లా ఉద్యాన సహాయకుల సంక్షేమ సంఘం అధ్యక్షుడుగా వరుణ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఎన్టీఆర్ క్రీడామైదానం ఆవరణలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో సంఘం ఉపాధ్యాక్షులుగా పెద్దబాబు, రవితేజ, కోశాధికారులుగా అపర్ణ, చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగ3ఆ కె.సంతోష్, ఆర్గనైజింగ్ కార్యదర్శులుగా కిషోర్, సత్యప్రసాద్, సహాయ కార్యదర్శిలుగా బి.కిషోర్, ఎ.రమణ, శ్రీగౌరీ, స్వప్న, మీడియో సభ్యుడుగా శ్రీనివాస్తో పాటు 15 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు వరుణ్ మాట్లాడుతూ పై కమిటీ ఎన్నిక రెండు సంవత్సరాలు ఉంటుందన్నారు. జిల్లాలో ఉద్యానశాఖల విధులు నిర్వహిస్తున్న వారి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. -
చెరువులో పడి మాజీ ఎంపీటీసీ మృతి
రావికమతం: మండలంలో దొండపూడి మాజీ ఎంపీటీసీ తాళ్ల సత్యారావు (65) ఆదివారం ప్రమాదశాత్తు కాలు జారి పెద్ద చెరువులో పడి మృతి చెందాడు. గతంలో ఎంపీటీసీగా పనిచేసిన ఆయన ప్రస్తుతం కిరాణా వ్యాపారం చేస్తున్నాడు. తెల్లవారుజామున స్థానిక చెక్పోస్టు వద్ద బహిర్భూమికి వెళ్లి ప్రమాదవశాత్తు కాలు జారి పెద్ద చెరువులో పడి మునిగి ఊబిలో చిక్కుకుని మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. సమాచారం మేరకు రావికమతం అగ్నిమాపక సిబ్బంది వచ్చి గాలించి మృతదేహాన్ని వెలికితీశారు. పెద్ద కుమారుడు కళ్యాణం తండ్రికి చేదోడు వాదోడుగా ఉండగా, చిన్న కుమారుడు దుర్గాప్రసాద్ హైదరాబాద్లో ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కొత్తకోట పోలీసులు నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి మృతదేహాన్ని తరిలించారు. మృతుడు భార్య రమణమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. అందరితో కలుపుగోలుగా ఉండే సత్యారావు మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.


