Anakapalle District Latest News
-
గణిత బోధనలో దిబ్బిడి హైస్కూల్ టాప్
గణిత ఉపాధ్యాయులను అభినందిస్తున్న తోటి ఉపాధ్యాయులు బుచ్చెయ్యపేట : జిల్లాలో ఉత్తమ గణిత బోధన పాఠశాలగా దిబ్బిడి జిల్లా పరిషత్ హైస్కూల్ ఎంపికై ంది. ఇటీవల జాతీయ గణిత దినోత్సవం పురస్కరించుకుని అన్ని పాఠశాలల్లో గణిత పోటీలు జరిగాయి. పలు పాఠశాలలో జరిగిన గణిత పోటీలను ఆంధ్రప్రదేశ్ మేథమేటిక్స్ ఫోరమ్ వీడియో రూపంలో స్వీకరించింది. కష్టతరమైన గణితాలను కూడా దిబ్బిడి హైస్కూల్ విద్యార్థులు సులువుగా వ్యక్తీకరించడంతో ఫోరమ్ సభ్యులు దిబ్బిడి హైస్కూల్ను ఉత్తమ పాఠశాలగా ఎంపిక చేసినట్టు గణిత ఉపాధ్యాయుడు ఎ.వి.ఎన్.మూర్తి తెలిపారు. అనకాపల్లి జిల్లాలో దిబ్బిడి హైస్కూల్ మొదటి బహుమతి, రేవు పోలవరం హైస్కూల్ రెండో బహుమతి, జంపపాలెం హైస్కూల్ మూడో బహుమతికి ఎంపికై నట్టు తెలిపారు. దిబ్బిడి హైస్కూల్ ఉత్తమ పాఠశాలగా ఎంపిక కావడం పట్ల గణిత ఉపాధ్యాయులు మూర్తి, డి.శివజ్యోతిలను గురువారం పాఠశాల హెచ్ఎం, తోటి ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. -
డీఎంహెచ్వో ఆకస్మిక తనిఖీ
రావికమతం : మండలంలో కొత్తకోట పీహెచ్సీని డీఎంహెచ్వో హైమవతి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్సీకి వచ్చే రోగుల పట్ల అశ్రద్ధ వహించినా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా చర్యలు తప్పవని హైచ్చరించారు. ఆసుపత్రి ఓపి, ల్యాబ్, ఫార్మసీలో మందులు, పరిశీలించారు. ఈ హెచ్ఆర్, ఏబీహెచ్ఏల గురించి అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. పీహెచ్సీ వైద్యులు డాక్టర్ సురేఖ, డాక్టర్ ఉదయ్కుమార్, ఆరోగ్య విస్తరణాధికారి పాతాళ రామారావు పాల్గొన్నారు. రోలుగుంట : వైద్యం కోసం వస్తున్న రోగులకు అవసరమైన అన్ని రకాల పరీక్షలు చేయాలని సిబ్బందికి డీఎంఅండ్హెచ్వో ఎం.హైమావతి వైద్య సిబ్బందిని ఆదేశించారు. మండలంలో రోలుగుంట, బుచ్చింపేట పీహెచ్సీలను ఆమె గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత రోలుగుంట పీహెచ్సీని సందర్శించారు. నేరుగా రోగుల వార్డును సందర్శించి వారికి అందుతున్న వైద్య సేవలు గురించి నేరుగా అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్, ఫార్మసిస్ట్ సేవలను పరిశీలించి స్టాకు వివరాలు తెలుసుకున్నారు. అవసరం మేర గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని, వసతి గృహాలు, పాఠశాలల్లో శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్య సేవలందించాలని వైద్యాధికారి శ్రావణికి సూచించారు. వేసవిలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిబిరాల్లో అవగాహన కల్పించాలన్నారు. -
మెరుగైన ఫలితాల కోసం మరింత శ్రమించాలి
తుమ్మపాల : విద్యార్థుల భవిష్యత్తు ఉన్నత శిఖరాలకు చేరాలంటే ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాల నేపథ్యంలో గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కళాశాలల ప్రిన్సిపాల్స్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, ఫలితాలు తక్కువగా వచ్చిన సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు. మంచి ఫలితాలు సాధించిన పాఠశాలలను అభినందించారు. తక్కువ ఉత్తీర్ణత నమోదైన కళాశాలల పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ, అందుకు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నమోదైన ఉత్తీర్ణత శాతాన్ని గత ఏడాదితో పోల్చి చూశారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం త్వరలో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షల దృష్ట్యా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు. పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించని విద్యార్థులు ఒత్తిడికి లోనవ్వకుండా, వారికి మానసిక, మనో ధైర్యాన్ని ఇచ్చేందుకు కౌన్సెలింగ్ సెషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పని చేయాలని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు జి.అప్పారావునాయుడు, వినోద్ బాబు, జిల్లా సాంఘిక, గిరిజన, వెనుకబడిన తరగతుల, సంక్షేమ శాఖ అధికారులు, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు. -
డీలిమిటేషన్తో రాష్ట్రానికి నష్టం
కోటవురట్ల : డీలిమిటేషన్ బిల్లు వల్ల రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరుగుతుందని, చంద్రబాబు మౌనం వీడి కేంద్ర ప్రభుత్వంతో పోరాడాలని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్.ఎస్.సత్యనారాయణరాజు డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. డీలిమిటేషన్ బిల్లు కారణంగా జనాభా ప్రాతిపదికన లోక్సభ, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా బీజేపీకి భయపడి చంద్రబాబు నోరు విప్పడం లేదని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాష్ట్రాలు ఆమోదం తెలపడం మంచి పరిణామం అన్నారు. -
● గెడ్డనుంచి వృథాగా పోతున్న నీరు
ఏలేరు కాలువకు భారీ గండి మాకవరపాలెం : ఏలేరు కాలువకు భారీ గండి పడింది. విశాఖ స్టీల్ప్లాంట్, నగర ప్రజల తాగునీటి అవసరాలకు నీటిని సరఫరా చేసే ఏలేరు కాలువకు మండలంలోని రాచపల్లి సమీపంలోని 100 వ కిలోమీటరు సమీపంలో గురువారం సాయంత్రం గండి పడింది. దీంతో గండి ప్రాంతం పక్కనే ఉన్న యూటీ(అండర్ టన్నెల్) వద్ద 20 అడుగులకుపైగా గట్టు కోతకు గురైంది. ఈ నేపథ్యంలో కాలువ నుంచి నీరంతా పక్కనే ఉన్న గెడ్డద్వారా వృధాగా పోతోంది. ఈ గండి కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. కాగా చీకటి పడే సమయంలో గండి పడడంతో పూడ్చివేత పనులు శుక్రవారం మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ గండి కారణంగా సుమారు 150 ఎంజీడీల నీరు వృధా అయ్యే అవకాశం ఉంది. గండిపడిన ప్రాంతాన్ని ఎస్ఐ దామోదర్నాయుడు పరిశీలించారు. ఏలేరు కాలువ సిబ్బందితో మాట్లాడి పూడ్చివేత పనులపై వివరాలు తెలుసుకున్నారు. -
●కనులపండువగా ఘటాల ఊరేగింపు
ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారు కొత్త అమావాస్య జాతర ముగింపు కార్యక్రమంలో భాగంగా గురువారం అమ్మవారి ఆలయం వద్ద 5వేల మంది మహిళలతో అమ్మవారి ఘటాలు ఊరేగింపు కార్యక్రమం జరిగింది. అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్లు ప్రారంభించారు. ఘటాల ఊరేగింపు కార్యక్రమంలో విశాఖ నుంచి హరితేజ లక్ష్మి కోలాట బృందం, నేల వేషాలు తదితర సాంస్కృతిక ప్రదర్శనల నడుమ ఘటాల ఊరేగింపు సాగింది. నూకాంబిక అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన ఘటాలను గవరపాలెం పురవీధులు మీదుగా ఊరేగించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. – అనకాపల్లి -
టీడీఆర్ బాండ్లపై హైకోర్టు తీర్పు హర్షణీయం
మునగపాక : నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు కాకుండా నేరుగా పరిహారం చెల్లించేలా ఇటీవల హైకోర్డు ఇచ్చిన తీర్పు హర్షణీయమని వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బొడ్డేడ ప్రసాద్ కొనియాడారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ పాలనలో పూడిమడక రోడ్డు విస్తరణకు సంబంధించి టెండర్లు పిలిచారన్నారు. రహదారి విస్తరణ ద్వారా ప్రమాదాలు జరగకుండా ఉండడంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని 100 అడుగుల మేర 14 కిలో మీటర్ల వరకు రహదారి విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. రహదారి విస్తరణలో భాగంగా గృహాలు, భూములు కోల్పోతున్న నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం కూటమి ప్రభుత్వం పరిహారం ఇవ్వాల్సి ఉందన్నారు. ఆర్డీవో సమక్షంలో గ్రామసభలు నిర్వహించి రహదారి విస్తరణ బాధితులకు పరిహారాన్ని నేరుగా అకౌంట్లో జమచేస్తామని చెప్పుకొచ్చి సంతకాలు సేకరించారన్నారు. తరువాత ప్రభుత్వం మాటమార్చి పరిహారాన్ని నగదు రూపంలో కాకుండా టీడీఆర్ల ద్వారా ఇస్తామని చెప్పడంతో మెజార్టీ నిర్వాసితులు అంగీకరించలేదన్నారు. గ్రామసభల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం విస్మరించడం సరికాదన్నారు. ముంపులో పొలాలు సాగునీటి కాలువలను మూసివేసి రెయిలింగ్లు నిర్మించడాన్ని రైతులు తప్పుపడుతున్నారన్నారు. ఎటువంటి భూసేకరణ చేపట్టకుండా ప్రస్తుతం ఉన్న సాగునీటి కాలువలను కప్పేయడం ద్వారా వేలాది ఎకరాల పంట పొలాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ మేరకు రైతులు, నిర్వాసితుల సమస్యలపై ఈ నెల 19న మునగపాకలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. సమావేశంలో జెడ్పీటీసీ సభ్యులు పెంటకోట స్వామి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్యియ్యనాయుడు, ఎంపీపీ మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, నాయకులు నరాలశెట్టి సూర్యనారాయణ, దొడ్డి బుజ్జి, బొద్దపు శ్రీరామ్మూర్తి, కాండ్రేగుల జగన్, బొడ్డేడ శ్రీనివాసరావు, బొడ్డేడ బుజ్జి, పిన్నమరాజు రవీంద్రరాజు,నరాలశెట్టి తాతారావు, శ్రీపతి రామకృష్ణ, ఆడారి కాశీబాబు తదితరులు పాల్గొన్నారు. -
19న వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహా సభలు
దేవరాపల్లి : దేవరాపల్లిలో ఈ నెల 19న నిర్వహించే అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో గురువారం జిల్లా మహాసభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అనగానుపాడులో 1937లో పుచ్చలపల్లి సుందరయ్య స్థాపించిన సంఘం నేడు దేశ వ్యాప్తంగా శాఖోపశాఖలుగా వ్యాప్తి చెంది అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘంగా ఏర్పడిందన్నారు. పేదలకు భూమి, తిండి, బట్ట, విద్య, వైద్యం కోసం దేశ వ్యాప్తంగా అనేక పోరాటాలు చేయడం జరిగిందన్నారు. అనకాపల్లి జిల్లాలో బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా, అసైన్డ్ భూములను పేదలకు పంపిణీ చేయాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, లింక్ రోడ్లు, మంచినీటి సౌకర్యం కల్పించాలని, ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని తదితర ప్రజా సమస్యలపై పోరాటాలు సాగించిన చరిత్ర ఉందన్నారు. ప్రతి మూడేళ్లకోసారి జరిగే జిల్లా మహాసభల్లో భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామన్నారు. దేవరాపల్లిలో ఆదివారం జరిగే 14వ జిల్లా మహాసభలకు రాష్ట్ర, జిల్లా సంఘం నాయకులు హాజరవుతారన్నారు. ఈ మహాసభలకు ఉపాధి కూలీలు, గిరిజన కూలీలు, వృత్తిదారులు, రైతులు, కార్మికులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె.గోవిందరావు, కె. భవానీ, గిరిజన సంఘం నాన్ షెడ్యూల్ ఏరియా జిల్లా కార్యదర్శులు ఇరటా నర్సింహమూర్తి, బి.టి.దొర పాల్గొన్నారు. -
టికెట్ల సంఖ్య పెంచినా తప్పని నిరీక్షణ
సింహాచలం: బ్యాంకుల్లో చందనోత్సవం టికెట్ల జారీ సంఖ్యను బుధవారం నుంచి పెంచినా భక్తులకు పూర్తిస్థాయిలో సరిపోలేదు. ముఖ్యంగా రు.1000 టికెట్లు విక్రయాలు ప్రారంభమైన అరగంటలోనే అయిపోయాయి. దీంతో చాలామంది భక్తులు నిరాశతో వెనుదిరిగారు. రూ.300 టికెట్లు మధ్యాహ్నం వరకు జారీ చేశారు. ఈ ఏడాది చందనోత్సవం టికెట్లు జారీ ప్రక్రియలో 70 శాతం ఆన్లైన్, 30 శాతం బ్యాంకుల్లో ఆఫ్లైన్లో ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకు ఆన్లైన్ వెబ్సైట్ సరిగ్గా పనిచేయకపోవడం, 13, 14 తేదీల్లో బ్యాంకుల్లో టికెట్లు సరిపోకపోవడంతో బుధవారం నుంచి బ్యాంకుల్లో టికెట్ల విక్రయాలు 50 శాతానికి పెంచారు. దీంతో సింహాచలంలోని యూనియన్ బ్యాంకు, స్టేట్బ్యాంకు వద్దకు బుధవారం ఉదయం 6 గంటల నుంచే జనాలు క్యూ కట్టారు. ఉదయం 10 గంటల నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభించగా.. స్టేట్బ్యాంకులో అరగంటలోపు, యూనియన్ బ్యాంకులో 45 నిమిషాలలోపు రూ.1000 టికెట్లు అయిపోయాయి. రూ.300 టికెట్లు మాత్రం మధ్యాహ్నం వరకు జారీచేశారు. ఒక్కో బ్యాంకుకి దేవస్థానం రూ.300 టికెట్లు 12వందలు, రూ.1000 టికెట్లు 880 అందజేసింది. బ్యాంకుల్లో ఒక్కో భక్తుడికి ఆధార్ కార్డుపై రెండు రూ.1000 టికెట్లు, నాలుగు రూ.300 టికెట్లు జారీ చేశారు. -
అప్పటి ధరే ఇవ్వమంటున్నాం...
నాకు మునగపాక మండలంలో తిమ్మరాజుపేట 64 గజాలు పోయింది. 2023లో అప్పటి అనకాపల్లి ఆర్డీఓ, మునకపాక ఎమ్మార్వోలు గ్రామ సభలు నిర్వహించి అప్పటి మార్కెట్ ధర ప్రకారం సెంటు రూ.12 లక్షల నుంచి రూ.18 లక్షలు నిర్ణయించారు. గజానికి రూ.9850 చొప్పున సెంటుకు రూ.3 లక్షల ఇవ్వడానికి నిర్ణయించారు. నిర్వాసితులను టీడీఆర్ బాండ్లు తీసుకోవాలంటూ కూటమి ప్రజాప్రతినిధులు, అధికారులు బెదిరిస్తున్నారు. దీనికి ఒప్పుకునేది లేదు. బడా కంపెనీలకు కొమ్ము కాయడానికి రైతు నష్టపోవాలా..? మేం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నిర్వాసితులంతా కలెక్టర్కు వినతిపత్రం అందజేశాం. ఈ ఏడాదిలో ఫిబ్రవరిలో గ్రామ సభ నిర్వహించారు. మూడు గ్రామాల నిర్వాసితులమంతా టీడీఆర్ బాండ్లు వద్దు అని ముక్త కంఠంతో వ్యతిరేకించాం. హైకోర్టు తీర్పును తక్షణమే అమలు చేయాలి. –శొంఠ్యాన బ్రహ్మాజీ, మునగపాక మండలం, తిమ్మరాజు పేట -
ఇంటర్లో బాలికలదే హవా..!
●గతేడాది కంటే స్వల్పంగా పెరిగిన ఉత్తీర్ణత శాతం ●ఇంటర్ ఫస్టియర్లో 12వ స్థానం, సెకండియర్లో 13వ స్థానంతో సరి ●ఫస్టియర్లో 74 శాతం, సెకండియర్లో 79 శాతం ఉత్తీర్ణత ●ప్రభుత్వ కళాశాలల్లో నిరాశాజనకమైన ఫలితాలు సాక్షి, అనకాపల్లి : ఇంటర్ ఫలితాల్లో బాలురు కన్నా బాలికలదే పై చేయి సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాలతో పోల్చితే జిల్లాకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఓవరాల్గా అనకాపల్లి జిల్లా 13వ స్థానంతో సరిపెట్టుకుంది. ప్రథమ సంవత్సరంలో 12వ స్థానం, ద్వితీయ సంవత్సరంలో 13వ స్థానంతో జిల్లా ఫలితాలు నిలిచాయి. బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో ఇంటర్ ఫస్టియర్లో 74 శాతం, సెకండియర్లో 79 శాతంతో జిల్లా ఫలితాలు గతేడాది కంటే కాసింత స్వల్పంగా ఉత్తీర్ణతా శాతం పెరిగింది. మొదటి సంవత్సరంలో 10,315 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 7,602 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. సెకండ్ ఇయర్లో 9926 మంది పరీక్షలకు హాజరు కాగా 7,829 మంది పాసయ్యారు. గతేడాది ఇంటర్ ఫస్టియర్లో 62.62 శాతం, సెకండియర్లో 72.98 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈ ఏడాది స్వల్పంగా ఉత్తీర్ణత శాతం పెరిగింది. అయితే మొత్తంగా ప్రభుత్వ కళాశాలల్లో నిరాశజనకమైన ఫలితాలు వచ్చాయి. సత్తా చాటిన బాలికలు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను పరిశీలిస్తే బాలికలదే పై చేయి కనబరిచారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో 4,303 మంది బాలురు గాను 2812 మంది బాలురు ఉత్తీర్ణత(65.34 శాతం) సాధించారు. బాలికలు 6012 మందికి గానూ 4,790 బాలికలు ఉత్తీర్ణత(79,67 శాతం) సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 10315 బాలురు పరీక్షలు రాయగా 7602 మంది ఉత్తీర్ణత(74 శాతం) సాధించారు. అదేవిధంగా 9926 మంది బాలికలు పరీక్షలకు హాజరుకాగా 7829 మంది ఉత్తీర్ణత(79 శాతం) సాధించారు. సెంకడ్ ఇయర్లోనూ బాలికలదే పైచేయి కశింకోట మండలం తాళ్లపాలెం గురుకుల కళాశాలకు చెందిన తాడి హేమలత, (983), తేగాడ కేజీబీవీ విద్యార్థిని జి.రమ్య (987) మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెకెండ్ ఇయర్లో ఎంపీసీలో రోలుగుంట జీఎల్సీకు చెందిన ఎం.మేధశ్రీ (981/1000), జీఏసీ కోటవురట్లకు చెందిన పి.స్వాతి(980/1000) టాప్లో నిలవగా బైపీసీలో యల మంచిలి జేఎల్సీకు చెందిన గణపర్తి గిరిజ (982/1000), కేడీపేటకు చెందిన జీజేసీ ఎస్.అమృత(980/1000) టాప్లో నిలిచారు. అదేవిధంగా సీఈసీలో జీజేసీ పరవాడకు చెందిన జి.భారతి(952/1000), హెచ్ఈసీలో జీఏసీ కొత్తకోటకు చెందిన సీహెచ్ వైష్ణవి(964/1000) మార్కులతో సత్తా చాటినట్టు డీఐఈఓ వినోద్బాబు తెలిపారు. ఇంటర్ ఒకేషనల్ ఫలితాలు ఇంటర్ ఒకేషనల్లో సెకండ్ ఇయర్లో 2117 విద్యార్థులకుగానూ 1530 మంది ఉత్తీర్ణత(72.27 శాతం), ఫస్ట్ ఇయర్లో 2424 విద్యార్థులకు గానూ 1465 మంది ఉత్తీర్ణత( 60.44 శాతం) సాధించారు. మే 21 నుంచి సప్లిమెంటరీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. జూన్ 7 నుంచి 11 వరకూ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఈ నెల 20 నుంచి 27వ వరకూ రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అఽధికారి(డీఐఈఓ) వినోద్బాబు తెలిపారు. -
పరిశ్రమలు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు పూర్తి సహకారం
తుమ్మపాల : పరిశ్రమల నిర్వహణకు, కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. జిల్లాలోని వివిధ విభాగాల అధికారులతో కలెక్టరేట్లో బుధవారం వెర్వేరుగా జరిగిన డీఐఈపీసీ (డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ అండ్ ప్రమోషన్ కమిటీ), పర్యాటక అభివృద్ధి మండలి సమావేశాల్లో అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లాలో పరిశ్రమలు, పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సహకాలు, అనుమతులు త్వరితగతిన మంజూరుచేసి ప్రోత్సహించాలన్నారు. పారిశ్రామిక అనుమతుల కొరకు సింగిల్ డెస్క్ పాలసీలో వివిధ శాఖల వద్ద పెండింగులో గల దరఖాస్తులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి అర్హత, ఆసక్తి గల వారికి వెంటనే అనుమతులు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, రుణ సదుపాయం పొందేందుకు సహకారం అందించాలని కోరారు. కేటాయించిన భూముల్లో నిర్ణీత సమయంలో సదరు నిర్వాహకులు పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎకో టూరిజం కింద కొండకర్ల ఆవను అభివృద్ధి చేయాలని, జిల్లాలో ప్రాచీన కట్టడాలను, దేవాలయాలను అభివృద్ధి చేసి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని, అందుకు అవసరమైన నిధులకు ప్రతిపాదనలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బొజ్జన్నకొండను మరింత అభివృద్ధి చేసి పర్యాటకులు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని టూరిజం అధికారులను ఆదేశించారు. 23న సీఎం పర్యటనకు ఏర్పాట్లు ఈ నెల 23 న జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న నేపథ్యంలో రాంబిల్లి సెజ్లో నిర్వహించనున్న రెన్యూ ఫోటో వోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ విజయ్కృష్ణన్ ఆదేశించారు. కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సుమారు 10 నుంచి 20 వేల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తూ, అందుకు తగిన విధంగా పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సభావేదిక స్టేజీ ఏర్పాట్లు, వీఐపి, వీవీఐపి గ్యాలరీ, డెకరేషన్ వంటి ఏర్పాట్లు నిర్దేశిత సమయంలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం సమీపంలో 10 ఎకరాల్లో సభా ప్రాంగణ ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలను తరలించేందుకు సుమారు 200 బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లా రెవెన్యూ అధికారి వై. సత్యనారాయణ రావు, ఆర్డీవో అయేషా, సంబంధిత శాఖల అధికారులు, రెన్యూ సోలార్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. -
హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టు..
‘అనకాపల్లి–అచ్యుతాపురం’ రోడ్డు నిర్వాసితుల పట్ల హైకోర్టు తీర్పు హర్షనీయం. ఈ తీర్పు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటింది. న్యాయస్థానం తీర్పు ప్రకారమే త్వరితగతిన రోడ్డు విస్తరణ నిర్వాసితులకు నగదు రూపంలోనే నష్టపరిహారం అందించాలి. 2023 చట్టం ప్రకారం నిర్వాసితుల డిమాండ్లు నెరవేర్చాలని కోరుతున్నాను. గతంలో టీడీఆర్ బాండ్లు తీసుకోవాలంటూ నిర్వాసితులపై చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. భయపెట్టి టీడీఆర్ బాండ్లు ఇచ్చేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. దీన్ని వ్యతిరేకిస్తూ నిర్వాసిత రైతులకు అండగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేశాం. అచ్యుతాపురం నుంచి అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వరకూ పాదయాత్ర చేపట్టాం. నిర్వాసితుల అండగా వైఎస్సార్సీపీ నిలిచింది. నిర్వాసితులను భయపెట్టి బాండ్లు ఇస్తామంటే సహించేది లేదు. చాలా మంది నిర్వాసిత రైతులు 2 సెంట్లు, మూడు సెంట్లు చొప్పున కోల్పోయారు. నాడు గ్రామ సభల్లో ఇచ్చిన హామీ ప్రకారమే నగదు రూపంలో నష్టపరిహారం ఇవ్వమంటున్నారు. – బొడ్డేడ ప్రసాద్, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు -
నో సార్!
టీడీఆర్...రెండు నియోజకవర్గాలు.. 1225 మంది నిర్వాసితులు.. అనకాపల్లి–అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో రెండు నియోజకవర్గాల పరిధిలో అనకాపల్లి, మునగపాక, రాంబిల్లి, అచ్యుతాపురం మండలాల పరిధిలో 125 ఎకరాల రైతుల స్థలం ప్రభుత్వం సేకరించింది. దాదాపుగా నాలుగు మండలాల పరిధిలో 1225 మంది నిర్వాసితులున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దేవుడి మాన్యంలో ఉన్న 12 మంది నిర్వాసితులకు, అర్అం డ్ బీ స్థలంలో పీడబ్ల్యూ స్థలంలో ఉన్న 62 మంది నిర్వాసితులకు బలవంతంగా టీడీఆర్ బాండ్లు ఇచ్చారు. మిగిలిన నిర్వాసితులెవ్వరూ టీడీఆర్ బాండ్లు తీసుకోకుండా వ్యతిరేకించారు. సాక్షి, అనకాపల్లి : చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి అనకాపల్లి– అచ్యుతాపురం రోడ్డు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా టీడీఆర్ బాండ్లు తీసుకోవాలంటూ ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ వస్తుంది. స్థానిక కూటమి ప్రజాప్రతినిధి అయితే నిర్వాసితులను టీడీఆర్ బాండ్లు తీసుకోవాలంటూ భయపెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల నాలుగు నెలల క్రితం తమ డిమాండ్లు నెరవేర్చాలని విశాఖలో గల వీఎంఆర్డీఏ కార్యాలయం వద్ద ‘అనకాపల్లి– అచ్యుతాపురం’ నిర్వాసితులు నిరసన కూడా చేశారు. ఇళ్లు, దుకాణాలు, భూములకు ఒకేసారి నష్టపరిహారం చెల్లించాలని, ఆ నష్టపరిహారం టీడీఆర్ బాండ్ల రూపంలో కాకుండా నగదు రూపంలోనే అందించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. గతంలో నిర్వహించిన గ్రామ సభల్లో టీడీఆర్ బాండ్లు వద్దని నిర్వాసితులంతా ముక్తకంఠంతో వ్యతిరేకించినా నాడు నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లే ఇస్తామని అధికారులు ఇబ్బందులకు గురిచేశారు. అయితే బాండ్లు వద్దే వద్దు..నగదు రూపంలోనే నష్టపరిహారం చెల్లించాలని, తమకు పునరావాసం కల్పించాలని నిర్వాసితులు డిమాండ్ చేశారు. అలాగే ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారులకు పరిహారం ఇవ్వడంతోపాటు ప్రభుత్వమే ఉపాధి కల్పించాలని, 100 అడుగుల తర్వాత నిర్మించుకొనే ఇళ్లకు ఎటువంటి నిబంధనలు పెట్టరాదని డిమాండ్ చేస్తున్నారు. భయపెట్టిన కూటమి ప్రభుత్వం.. అనకాపల్లి– అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో స్థలాలు, భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారంగా నగదు బదులు ట్రాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) బాండ్లు తీసుకోవాలని నిర్వాసితులను కూటమి ప్రభుత్వం భయపెడుతూ వచ్చింది. బాండ్లు వద్దని, నగదు మాత్రమే ఇవ్వాలని నిర్వాసితులు డిమాండ్ చేస్తున్నా...అధికారులు నియంత్రత్వ పోకడతో ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నగదు రూపంలో నష్ట పరిహారం అందిస్తామని రైతుల నుంచి రోడ్డు విస్తరణకు భూములు తీసుకుంది. ఆనాడు గ్రామ సభల్లో నష్టపరిహారంగా నగదు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. ఈ లోగా ప్రభుత్వం మారింది. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రెవెన్యూ అధికారులు గ్రామాల్లో సభలు నిర్వహించి..టీడీఆర్ బాండ్లకు భవిష్యత్తులో లభించే డిమాండ్ గురించి వివరించారు. అప్పుడే నిర్వాసితులు టీడీఆర్ బాండ్లు వ్యతిరేకించారు. మళ్లీ మూడు రోజుల క్రితం అనకాపల్లి– అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో నిర్వాసితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వాలంటూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది నిరసనలు, పాదయాత్ర.. ●‘అనకాపల్లి–అచ్యుతాపురం’ రోడ్డు విస్తరణ నిర్వాసితులకు అండగా వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో 2025లో జనవరి నెలలో నిర్వాసితులతో కలిసి అచ్యుతాపురం నుంచి అనకాపల్లి కలెక్టర్ కార్యాలయం వరకూ పాదయాత్ర చేశారు. ●మునగపాకలో ఫిబ్రవరి 24, 25వ తేదీల్లో వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వాసితులకు 48 గంటల దీక్ష చేశారు. ●అనకాపల్లి, అచ్యుతాపురం, మునగపాక, రాంబిల్లి పలు గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. భూసేకరణ చట్టం కింద భూమి తీసుకున్నప్పుడు చట్ట ప్రకారమే చెల్లించాల్సిన పరిహారాన్ని ఇవ్వకుండా టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని బలవంతం చేయడానికి వీల్లేదంటూ ఇచ్చిన హైకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంప పెట్టులాంటిది. బాండ్లు ఐచ్ఛికమే తప్ప..తప్పనిసరి కాదు..బాధితులు ఆ బాండ్లను తిరస్కరించే అధికారం ఉంది. నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలిచ్చిన విషయం విదితమే. జిల్లాలో ‘అనకాపల్లి–అచ్యుతాపురం’ రోడ్డు నిర్వాసితులకు హైకోర్టు తీర్పు ఊరటగా మారింది. ‘అనకాపల్లి– అచ్యుతాపురం’ రోడ్డు నిర్వాసితులకు ఊరట టీడీఆర్ బాండ్లు తీసుకోవాలని బలవంతం చేయొద్దు బాండ్లు ఐచ్ఛికమే తప్ప..తప్పనిసరి కాదు బాధితులకు ఆ బాండ్లను తిరస్కరించే అధికారం ఉంది టీడీఆర్ బాండ్లపై హైకోర్టు తీర్పుపై సర్వత్రా హర్షం అనకాపల్లి, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాల్లో 1225 మంది నిర్వాసితులు రోడ్డు విస్తరణకు రైతుల నుంచి 125 ఎకరాల స్థల సేకరణ నగదు రూపంలోనే పరిహారం చెల్లించాలని కోరుతున్న నిర్వాసితులు -
రహదారి, శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి
అనకాపల్లి : జిల్లాలో పెండింగ్ కేసులు, రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతిభద్రల పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధికారులు ప్రత్యేక దృష్టి సాధించాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో బుధవారం పోలీస్ క్రైం నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించాలని ఆయన కోరారు. హెల్మెట్ లేకపోవడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, రాంగ్ రూట్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్లపై కఠినంగా వ్యవహరించాలన్నారు. పెండింగ్ చలానాలు చెల్లించని వాహనాలను సీజ్చేసి, రవాణాశాఖ ద్వారా లైసెన్సుల రద్దుకు సిఫార్సు చేయాలన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు ద్వారా ఆన్లైన్ చెల్లింపులపై అవగాహన కల్పించాలన్నారు. జాతీయ రహదారి, ఆర్అండ్బీ, జీవీఎంసీ, రవాణాశాఖల సమన్వయంతో ప్రమాదకర ప్రాంతాల్లో సాండ్ డ్రమ్స్, రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బేకర్లు, రేడియం స్టిక్కర్లు, లైటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. సెజ్ ప్రాంతాల, బ్రాండిక్స్ బస్సు డ్రైవర్లకు రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని సూచించారు. రౌడీషీటర్లకు ప్రతివారం కౌన్సిలింగ్ నిర్వహించి, రూ.1లక్ష వరకు బైండోవర్ చేయాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్డీపీఎస్ కేసుల్లో తరచూ నేరాలకు పాల్పడుతున్న వారిపై పిట్ ఎన్డీపీఎస్ కింద చర్యలు తీసుకోవాలన్నారు. సైబర్ నేరాలు, మహిళలపై జరుగుతున్న నేరాలపట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. దర్యాప్తులో ఫేస్ రికగ్నిషన్ సర్విలియన్స్, సీసీటీఎన్ఎస్, ఈ–సాక్ష, యూప్ 360 వంటి అప్లికేషన్లను విరివిగా వాడి కేసుల పరిష్కారం వేగవంతం చేయాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల పోలీస్ స్టేషన్లలో ఎస్ఓపి పక్కాగా అమలు చేయాలని, తప్పిపోయిన బాలబాలికల గుర్తింపు, చోరీకి గురైన వాహనాల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, డీఎస్పీలు ఎం.శ్రావణి, పి.శ్రీనివాసరావు, బి.మోహనరావు, ఇ.శ్రీనివాసులు, సీఐలు టి.లక్ష్మి, లక్ష్మణమూర్తి, బాల సూర్యారావు, గణేష్, రమేష్, తదితరులు పాల్గొన్నారు. -
తక్షణం పరిహారం చెల్లించాలి
2023 చట్టం ప్రకారం తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి. యుద్ద ప్రాతిపధికన రోడ్డు నిర్మాణం చేపట్టాలి. మొక్కుబడిగా ముక్కలు ముక్కలు గా రోడ్డు పనులు చేస్తున్నారు. దీంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాకుండా సైడ్ కాలువలైన పంట కాలువలు మూసేశారు. 2023 చట్టం ప్రకారం రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపుల 100 అడుగుల వరకూ భూసేకరణ చేసి..150 అడుగుల వరకూ నిర్మాణాలకు వీఎంఆర్డీఏ అనుమతి ఇవ్వనంటూ చెబుతుంది. అలాంటప్పుడు 150 అడుగుల వరకూ భూసేకరణ చేసుకుని నిర్వాసితులకు నగదు నష్టపరిహారం అందజేయాలి. గతంలో వీఎంఆర్డీఏ కమిషనర్ గారిని కలిసి టీడీఆర్ బాండ్లు వద్దు అని కోరాం. – కర్రి అప్పారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, తిమ్మరాజుపేట -
ఆర్డీవో కార్యాలయం వద్ద గిరిజనుల ధర్నా
నర్సీపట్నం : గిరిజనులకు అన్యాయం చేస్తున్న రోలుగుంట తహసీల్దార్ను ఉద్యోగం నుంచి తొలగించాలని సీపీఐఎంఎల్ లిబరేషన్ నాయకులు కె.జనార్దన్ డిమాండ్ చేశారు. సీపీఐఎంఎల్ లబిరేషన్ ఆధ్వర్యంలో గిరిజనులు తహసీల్దార్ వైఖరిని నిరసిస్తూ బుధవారం ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఏవో బి.వి.రమణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో కొండఅడ్డసారు గ్రామంలో ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న ఆదివాసీల భూములను కబ్జా చేయడానికి ఆర్.చంద్రశేఖరరావు ప్రయత్నించారన్నారు. రెవెన్యూ అధికారులు రద్దు చేసిన డిజిటల్ సైన్ను యథావిఽధిగా వన్బీలో నమోదు చేశారన్నారు. 2018లో జాయింట్ కలెక్టర్ స్వయంగా ఆ భూములను పరిశీలించి, అప్పటి ఆర్డీవో కోరాడ సూర్యారావును విచారణ నిమిత్తం ఆదేశించారన్నారు. విచారణ చేసిన ఆర్డీవో రాయవరపు చంద్రశేఖరరావుకు ఆ భూములపై ఎటువంటి హక్కులు లేవని, డిజిటల్ సైన్ రద్దు చేశారన్నారు. నర్సీపట్నం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఆర్.చంద్రశేఖరరావు అపీల్ చేశారు. తప్పుడు డాక్యుమెంట్స్ కేసును కోర్టు డిస్మిస్ చేసిందన్నారు. యలమంచిలి తహసీల్దార్ నుంచి చంద్రశేఖరరావు వారసత్వ ధృవపత్రం తీసుకురావడం జరిగిందన్నారు. తహసీల్దార్ను సంప్రదించగా తన సంతకం ఫోర్జరీ చేసి తయారు చేశారని నర్సీపట్నం ఏఎస్పీకి ఫిర్యాదు చేశారన్నారు. ప్రస్తుతం జాయింట్ కలెక్టర్ వద్ద ఆర్ఓఆర్ అపీల్ నడుస్తుండగా, చంద్రశేఖరరావు పేరున తహసీల్దార్ వన్బీ నమోదు చేశారన్నారు. జిల్లాలో గిరిజన గ్రామాల్లో ఘర్షణలు, గొడవలకు ప్రధాన కారణం రెవెన్యూ అధికారులే అన్నారు. ఒకరి భూముల్ని మరొకరి పేరుతో వెబ్ల్యాండ్లో నమోదు చేయడం వల్ల ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. -
టీడీపీ కుటిల రాజకీయాల వల్లే అమర్నాఽథ్పై కేసులు
బుచ్చెయ్యపేట: టీడీపీ నాయకుల కుటిల రాజకీయాల వల్లే మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్పై కేసులు పెట్టి, జైలు శిక్ష పడేలా చేశారని మండల వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చెయ్యపేటలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జెడ్పీటీసీ దొండా రాంబాబు, వైఎస్సార్సీపీ బుధవారం మండల కేంద్రం అధ్యక్షుడు జోగా కొండబాబు,రాష్ట బీసీ సెల్ సంయుక్త కార్యదర్శి కె. అచ్చింనాయుడు,వైస్ ఎంపీపీలు దొండా లలితా నారాయణమూర్తి,గొంపా చినబాబు,డీసీసీబీ మాజీ డైరెక్టర్ కోవెల జనార్ధనరావులు టీడీపీ నాయకుల తీరుపై మండి పడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వాలని శాంతియుతంగా అమర్నాఽథ్ అమరణ నిరాహార దీక్ష చేశారన్నారు. టీడీపీ నాయకులు మాత్రం అయన ప్రాణాలు తీసుకుంటున్నట్లు పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించి ఆరు నెలలు జైలు శిక్ష పడేలా చేశారన్నారు. రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు పలు అభివృద్ధి కార్యక్రమాలపై పలు సార్లు అమరణ నిరాహారదీక్షలు చేసినా ఎవరికీ జైలు శిక్ష పడిన దాఖలాలు లేవని చెప్పారు. మూడు తరాలుగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాటు పడుతున్న అమర్నాథ్ కుటుంబంపై టీడీపీ నాయకులు కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని చెప్పారు. రైల్వే జోన్ తెచ్చి విశాఖ అభివృద్ధికై కృషి చేస్తున్న అమర్నాఽథ్పై తప్పుడు కేసులు పెట్టించిన టీడీపీ నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని మండి పడ్డారు. రాష్ట ప్రజల కోసం చేస్తున్న పోరాటాల్లో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు అండగా ఉంటారని చెప్పారు. ప్రజల శ్రేయస్సు కోసం పోరాటాలు చేస్తున్న వైఎస్సార్సీపీ నాయకుల గొంతు నొక్కాలని చూస్తున్న టీడీపీ నాయకులకు తగిన గుణపాఠం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు గొలజాన శ్రీను,పెదిరెడ్ల మాణిక్యం,గోపిశెట్టి శ్రీను,కోరుకొండ రమణ,ముచ్చకర్ల అప్పారావు,గోకివాడ రాము,సిగిరెడ్డి సుశీల తదితర్లు పాల్గొన్నారు. రావికమతం: మాజీ మంత్రి గుడివాడ అమర్నాఽథ్పై టీడీపీ నాయకులు కుట్రలు పన్నడం తగదని, ఆయనకు పార్టీ నాయకత్వంతో పాటు మండల నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటారని మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు కంచిపాటి జగ్గారావు,ఎంపీపీ పైల రాజు అన్నారు.బుధవారం పార్టీ అధ్యక్షుడు జగ్గారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముక్కా మహాలక్ష్మి నాయుడు,రాష్ట్ర రైతు విభాగం సంయుక్త కార్యదర్శి గుమ్ముడు సత్యదేవా, జెడ్ప్టీసీ తలారీ ఆదిమూర్తి మాట్లాడుతూ రైల్వేజోన్కోసం పోరాడితే కేసులు పెట్టి, జైలు శిక్ష పడేలా కుట్రపన్నారని చెప్పారు. న్యాయవ్యవస్థపై అపారమైన గౌరవం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గంటా ఈఽశ్వరరావు,ఎంపీటీసీలు పూడి దేవా,కుంచా శంకరరావు,పార్టీ నాయుకులు కంచిపాటి త్రిమూర్తులు,శీలం రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
మూడు లారీలకు రూ.1.94 లక్షల జరిమానా
నక్కపల్లి : టోల్ఫీజు ఎగ్గొట్టేందుకు అడ్డదారిలో పరిమితికి మించి లోడుతో వెళ్తున్న మూడు టిప్పర్లను నక్కపల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ సన్నిబాబు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం పరిమితికి మించిన లోడుతో మూడు లారీలు ఫ్లైయాష్తో ఉపమాక చందనాడ, మీదుగా వేంపాడునుంచి జాతీయరహదారిపై చేరుకుని కాకినాడ వెళ్తుండగా వేంపాడు వద్ద పట్టుకోవడం జరిగిందన్నారు. సాధారణంగా 35 టన్నుల సామర్ధ్యంతో రాకపోకలు సాగించాల్సిన ఈ లారీలు 6 టన్నులలకు పైగా లోడుతో ప్రయాణిస్తున్నాయి. టోల్గేట్ మీదుగా వెళ్తే అక్కడ తనిఖీ చేసి పరిమితికి మించి లోడు వేయడంతో లారీకి సుమారు రూ.8వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెనాల్టీ నుంచి తప్పించుకునేందుకు ఉపమాక, చందనాడ అమలాపురం, వేంపాడు మీదుగా జాతీయరహదారిని చేరుకుని కాకినాడ వెళ్తుంటాయి. ఈ మూడు టిప్పర్లు అడ్డదారిలో వెళ్తుండడాన్ని గుర్తించిన పోలీసులు పట్టుకుని రవాణా శాఖ అధికారులకు అప్పగించడంతో ఒక టిప్పర్కు రూ.56వేలు, రెండో టిప్పర్కు రూ.66వేలు, మూడో టిప్పర్కు రూ.74వేలు పెనాల్టీ విధించారని ఎస్ఐ తెలిపారు. -
ఇద్దరు విద్యార్థులు అదృశ్యం
యలమంచిలి రూరల్ : పట్టణంలోని కోర్టుపేట భాష్యం స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బుధవారం అదృశ్యమయ్యారు. ఈ పాఠశాలలో 6వ తరగతి విద్యార్థులు కొలగాని బాలు, ప్రగడ నితిన్లు మధ్యాహ్నం 12.40 గంటలకు స్కూల్ విడిచి పెట్టిన తర్వాత ఇంటికి వెళ్లలేదు. ఎస్.రాయవరం మండలం వేమగిరికి చెందిన కొలగాని బాలు రోజూ భాష్యం స్కూల్ బస్సులో పాఠశాలకు వచ్చి వెళ్తుంటాడు. మరో విద్యార్థి ప్రగడ నితిన్ యలమంచిలి పట్టణంలోని పాతవీధి వీరభద్రస్వామి ఆలయ ప్రాంతానికి చెందిన వాడు. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులూ స్నేహితులు. వీరు కనిపించకపోవడంతో పాఠశాల నిర్వాహకులు తల్లిదండ్రులకు సమాచారమిచ్చారని పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు. కుటుంబసభ్యులు ఇద్దరు విద్యార్థుల ఆచూకీ కోసం వెతికినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం సాయంత్రం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ చెప్పారు. విద్యార్థులు ఎందుకు అదృశ్యమయ్యారో కారణం తెలియలేదు. అదృశ్యమైన విద్యార్థుల ఆచూకీ తెలిస్తే 9440796103 నంబరుకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. -
మండల అధికారుల గైర్హాజరుపై ఆగ్రహం
బుచ్చెయ్యపేట: మండల సర్వసభ్య సమావేశానికి అధికారులు డుమ్మా కొట్టడంపై ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం బుచ్చెయ్యపేట మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ నాగేశ్వరిదేవి అధ్యక్షతన సర్వ సభ్య సమావేశం జరిగింది. 35 పంచాయతీలకు చెందిన ఎంపీటీసీలు హాజరైనా పలుశాఖలకు చెందిన మండల అధికారులు హాజరుకాలేదు. మూడు నెలలకొకసారి జరిగే మండల సర్వ సభ్య సమావేశానికి ప్రజల సమస్యలు తెలపడానికి జీతం లేకపోయినా మేం హాజరవుతున్నాం, రూ.లక్షల జీతాలు తీసుకుంటున్న అధికారులు ఎందుకు హాజరుకావడం లేదని ఎంపీడీవో శివ నారాయణను జెడ్పీటీసీ దొండా రాంబాబు,వైస్ ఎంపీపీలు దొండా లలితా నారాయణమూర్తి,గొంపా చినబాబు,కోఆప్షన్ సభ్యుడు కె.అచ్చింనాయుడు తదితరులు ప్రశ్నించారు. గైర్హాజరైన అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. తహసీల్దార్, ఎంఈవో, విద్యుత్, సివిల్ సప్లయి, ఆర్అండ్బీ, ఆర్టీసీ, ఐసీడీఎస్, అటవీశాఖ, పంచాయతీరాజ్,హార్టికల్చర్, సెరి కల్చర్,దేవదాయశాఖ,సోషల్ వెల్ఫేర్ తదితర శాఖల అధికారులు హాజరుకాకపోగా కొన్ని శాఖల అధికారులు కిందస్థాయి సిబ్బందిని పంపించారని, వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంపీడీవో సర్ది చెప్పడంతో ప్రజాప్రతినిధులు శాంతించారు. వడ్డాది,బుచ్చెయ్యపేట, తురకలపూడి ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి నిధులు ఖర్చుల వివరాలు స్థానిక నాయకులకు తెలపకపోవడంపై నిలదీశారు. పలు సమస్యలను మండల అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.ఎంపీడీవోను నిలదీసిన ఎంపీటీసీలు -
వేసవి రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం(విశాఖ): వేసవి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా వయా దువ్వాడ, కొత్తవలస మీదుగా పలు సమ్మర్ స్పెషల్, వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ●చర్లపల్లి–సంత్రగచ్చి(07671) సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 17, 20, 24, 27, 30వ తేదీల్లో ఉదయం 10.30 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి అదే రోజు రాత్రి 10.48 గంటలకు దువ్వాడ, మరుసటిరోజు మధ్యాహ్నం 2.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(07672) సంత్రగచ్చిలో ఈ నెల 18, 21, 25, 28, మే 1వ తేదీల్లో సాయంత్రం 4.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు దువ్వాడ, అదేరోజు రాత్రి 10 గంటలకు చర్లపల్లి చేరుకుంటాయి. ●చర్లపల్లి–భువనేశ్వర్ న్యూ(07165) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 20న సాయంత్రం 6.10 గంటలకు చర్లపల్లిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు దువ్వాడ, అదే రోజు సాయంత్రం 5.20 గంటలకు భువనేశ్వర్ న్యూ చేరుకుంటుంది. ●మైసూరు–డిబ్రూగడ్(06253) సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 26న ఉదయం 8 గంటలకు మైసూరులో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.28 గంటలకు కొత్తవలస, బుధవారం తెల్లవారు 1.30 గంటకు డిబ్రూఘడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06254) డిబ్రూఘడ్లో ఈ నెల 16, 30వ తేదీలలో తెల్లవారు 1.30 గంటలకు బయల్దేరి ముసటిరోజు రాత్రి 7.38 గంటలకు కొత్తవలస, శనివారం సాయంత్రం 4.15 గంటలకు మైసూరు చేరుకుంటాయి. ●యశ్వంత్పూర్–న్యూ జల్పయ్గురి(06567) సమ్మర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 17, 24వ తేదీల్లో ఉదయం 7 గంటలకు యశ్వంత్పూర్లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.28 గంటలకు కొత్తవలస, ఆదివారాల్లో ఉదయం 7 గంటలకు న్యూ జల్పయ్గురి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06568) ఈ నెల 20, 27వ తేదీల్లో ఉదయం 8.30 గంటలకు న్యూ జల్పయ్గురిలో బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 10.13 గంటలకు కొత్తవలస, బుధవారం ఉదయం 9.55 గంటలకు బెంగళూరు కంటోన్మెంట్ చేరుకుంటాయి. ●ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి(06073) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్లో ఈ నెల 20, 27వ తేదీల్లో రాత్రి 11.45 గంటలకు బయల్దేరి మరుసటిరోజు మధ్యాహ్నం 2.53 గంటలకు దువ్వాడ, బుధవారాల్లో ఉదయం 7.45 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06074) ఈ నెల 22, 29 తేదీల్లో ఉదయం 10.45 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి మరుసటిరోజు తెల్లవారు 4.03 గంటలకు దువ్వాడ, అదేరోజు రాత్రి 7.30 గంటలకు చైన్నె బీచ్ స్టేషన్కు చేరుకుంటాయి. ●తాంబరం–సంత్రగచ్చి(06075) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ నెల 21, 28వ తేదీలలో తాంబచంలో ఉదయం 10.15 గంటలకు బయల్దేరి అదేరోజు అర్ధరాత్రి 1.58 గంటలకు దువ్వాడ, బుధవారాల్లో సాయంత్రం 6.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటాయి. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06076) ఈ నెల 15, 22, 29 తేదీల్లో రాత్రి 9.30 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి మరుసటిరోజు సాయంత్రం 4 గంటలకు దువ్వాడ, శుక్రవారాల్లో ఉదయం 10.30 గంటలకు తాంబరం చేరుకుంటాయి. ●ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి(06067) స్పెషల్ ఎక్స్ప్రెస్ ఎంజీఆర్ చైన్నె సెంట్రల్లో ఈ నెల 16న ఉదయం 6.55 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 7 గంటలకు దువ్వాడ, శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సంత్రగచ్చి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(06068) ఈ నెల 17వ తేదీ మధ్యాహ్నం 2.50 గంటలకు సంత్రగచ్చిలో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారు 4.38 గంటలకు దువ్వాడ, అదే రోజు రాత్రి 6.30 గంటలకు చైన్నె బీచ్ స్టేషన్కు చేరుకుంటుంది. యశ్వంత్పూర్ స్పెషల్కు దువ్వాడ, కొత్తవలసలో హాల్ట్ తాటిచెట్లపాలెం: యశ్వంత్పూర్–కతిహార్–యశ్వంత్పూర్ వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్కు దువ్వాడ, కొత్తవలస, శ్రీకాకుళం రోడ్, పలాసలలో అదనపు హాల్ట్ను కల్పిస్తున్నట్లు వాల్తేర్ డివిజన్, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ పవన్కుమార్ తెలిపారు. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికుల జాబితాను తగ్గించేందుకు ఎంజీఆర్ చైన్నె సెంట్రల్–సంత్రగచ్చి–ఎంజీఆర్ చైన్నె సెంట్రల్(06077/78) వీక్లీ స్పెషల్ ఎక్స్ప్రెస్కు 1–స్లీపర్ క్లాస్ కోచ్ను అదనంగా జత చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్
ప్రయాణికురాలు రజినికి పట్టణ సీఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పెళ్లి దుస్తులు అందజేస్తున్న ఆటో డ్రైవర్ వనం రాజేష్ అనకాపల్లి: పెళ్లి దుస్తులు, విలువైన వస్తులున్న బ్యాగును బాధితురాలు పోగొట్టుకోగా.. ఆటో డ్రైవర్ నిజాయతీగా బుధవారం అందజేశారు. వివరాలు ఇలా.. పట్టణంలో గవరపాలెంకు చెందిన వి.రజిని తుమ్మపాలెం వనం రాజేష్ ఆటో ఎక్కింది. పెళ్లి దుస్తుల బ్యాగ్, విలువైన సామగ్రిని ఆటోలో మరిచిపోయి అనకాపల్లి నాలుగురోడ్ల జంక్షన్లో దిగిపోయింది. స్థానిక గాంధీనగరంలో గల తుమ్మపాల పాయింట్ తలుపులమ్మ ఆటో స్టాండ్ డ్రైవర్ వనం రాజేష్ వాటిని పట్టణ సీఐ ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో రజినికి అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఆటోలో ప్రజలు ప్రయాణించే సమయంలో తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సంతోష్ పాల్గొన్నారు. -
ఇంటర్లో మెరిసిన పేదింటి కుసుమాలు
యలమంచిలి రూరల్ : వారంతా పేదింటి బిడ్డలు... ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుదలతో అద్భుతంగా రాణించి తాము చదువుకున్న కళాశాలకు..తల్లిదండ్రులకు పేరు తెచ్చారు.చదువుకు పేదరికం అడ్డుకాదంటూ ఇంటర్ ఫలితాల్లో తమ సత్తా చాటారు.యలమంచిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండో సంవత్సరం విద్యార్థినులు జి.గిరిజ బైపీసీలో 982,ఎంపీసీలో ఎం.దివ్య 974 మార్కులు సాధించారు.మొదటి సంవత్సరం విద్యార్థులు ఆర్. వెంకటలక్ష్మి 442(ఎంపీసీ), కె.కృష్ణవేణి 441(ఎంపీసీ) మార్కులతో ప్రతిభ చూపారు. సాధారణ రైతు కుటుంబాల నుంచి ... వారిద్దరూ సాధారణ రైతు కుటుంబాలకు చెందిన విద్యార్థులు. ప్రణాళికాబద్ధంగా చదివారు. క్రమం తప్పని సాధనతో యల్లపు ప్రశాంతి,పిల్లా కావ్య మెరుగైన ఫలితాలు సాధించారు సోమలింగపాలెం గ్రామానికి చెందిన యల్లపు ప్రశాంతి ఇంటర్మీడియెట్ ఫలితాల్లో 978 మార్కులు, రాంబిల్లి మండలం మూలజంప గ్రామానికి చెందిన పిల్లా కావ్య 966 మార్కులు సాధించారు. మంచి మార్కులు సాధించిన ప్రశాంతిని తల్లిదండ్రులు శ్రీనివాసు,లత బుధవారం స్వీటు తినిపించి అభినందించారు.ఉన్నత చదువులు చదివి మంచి ప్రభుత్వోద్యోగాలు సాధించడమే తమ లక్ష్యమని వారిద్దరూ సాక్షికి తెలిపారు.తమ విద్యార్థులు ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించడం పట్ల గీతాంజలి కళాశాల చైర్మన్ పి.సురేష్బాల్ ఆనందం వ్యక్తం చేసి, విద్యార్థినులను అభినందించారు. కశింకోట: మండలంలోని మూడు ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి ఇంటర్మీడియెట్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన బాలికలంతా కూలీల పిల్లలే కావడం విశేషం. తేగాడలోని కస్తూర్బాగాంధీ విద్యాలయంలో చదివిన జి.రమ్య బైపీసీలో 987 మార్కులతో మండలంలో ప్రథమ స్థానంలో నిలిచింది. బుచ్చియ్యపేట మండలం చిన్న మల్లాం గ్రామానికి చెందిన ఆమె తండ్రి అప్పలనాయుడు రోజువారీ కూలీ. తల్లి లక్ష్మి గృహిణి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అయినా డాక్టర్ కావాలని రమ్య ఆకాంక్షిస్తున్నట్లు సాక్షికి తెలిపింది. ద్వితీయ స్థానంతో 983 మార్కులు పొందిన కె.గంగా భవానిది రావికమతం మండలం గొంప గ్రామం. తండ్రి రాము రోజు వారీ కూలీ. తల్లి సత్యవతి. ఆమె కూడా డాక్టర్ కావాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. 974 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచిన జి. సంధ్య కశింకోట మండలంలోని గోకివానిపాలెం గ్రామానికి చెందిన రాజు, చినతల్లి కుమార్తె. తండ్రి రోజు వారీ కూలీ. బీఫార్మసీ చేయాలని లక్ష్యమని తెలిపింది. తాళ్లపాలెం గురుకుల పాఠశాలలో చదువుతూ ఇంటర్లో ద్వితీయ స్థానంలో 983 మార్కులతో నిలిచిన తాడి హేమలతది మాడుగుల మండలం ఎం.కోటపాడు గ్రామం. తండ్రి చిన మహాలక్ష్మి, తల్లి వరలక్ష్మి. వీరు కూలీలు. కొండ్రి నాగలక్ష్మి 969 మార్కులతో తృతీయ స్థానంలో ఉత్తీర్ణత సాధించింది. నాతవరం మండలం శృంగవరం గ్రామానికి చెందిన తండ్రి అప్పారావు, తల్లి పార్వతి కూలీలు. వైద్య రంగంలో స్థిరపడాలని ఆకాంక్షిస్తోంది. డాక్టర్ కావడమే ధ్యేయంకశింకోట: తాను డాక్టర్ను కావాలని ఆశిస్తున్నట్టు ఇంటర్మీడియెట్లో అత్యధికంగా 987 మార్కులు సాధించిన కాకర ప్రవల్లిక తెలిపింది. మండలంలోని తాళ్లపాలెంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో చదివి ఇంటర్మీడియెట్ పరీక్షలో అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడింది. మాడుగుల మండలం కింతలిలో నివసిస్తున్న తన తల్లిదండ్రలు రాజు, ఆనందరావు కూలీ పనులు చేస్తున్నట్టు తెలిపింది. నీట్ రాసి ఎంబీబీఎస్ చదవాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆమె చెప్పింది. లేదంటే నర్సింగ్ అయినా చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. ఆర్ వెంకటలక్ష్మి, 442/470 జి.గిరిజ, 982/1000 ప్రభుత్వ జూనియర్ కళాశాల, యలమంచిలి -
అక్రమంగా చెరువు నీరు తరలింపు
ఎస్.రాయవరం : గుడివాడ శిశారులో చెరువులో నీటిని కూటమి నేతల అండదండలతో స్థానికులు నీటిని బయటకు తోడేస్తున్నారని మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మామిడి చంటి మంగతాయరులు నీటిపారుదలశాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. వేసవి రోజులు ప్రారంభ అయిన సమయంలో చెరువులో నీటిని ఇంజన్లతో తరలించి పశువులకు తాగునీరు లేకుండా చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చేపలు పట్టుకోవడం కోసం అక్రమంగా చేస్తున్న పనులు అడ్డుకుని అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువులో నీటిని తరలిస్తే పశువులకు తాగునీటి సమస్యతో పాటు సమీప ఆయకట్టు రైతులకు, బోర్లు, ఇతర అవసరాలకు నీటి సమస్య తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. -
అసలుకే మోసం!
జాబ్ క్యాలెండర్ జపం..రేషనలైజేషన్ పేరిట రిక్తహస్తం.. నిరుద్యోగుల ఆశలపై ‘కోత’వేటు! విశాఖ సిటీ: వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఆంధ్ర విశ్వవిద్యాలయం నేడు అధ్యాపకుల కొరతతో కునారిల్లుతోంది. ఒకప్పుడు దేశ విదేశాల నుంచి విద్యార్థులను ఆకర్షించి, ప్రపంచ స్థాయి మేధావులను అందించిన ఈ విద్యాక్షేత్రం ఇప్పుడు సరైన బోధనా సిబ్బంది లేక వెలవెలబోతోంది. ప్రభుత్వం ‘జాబ్ క్యాలెండర్’ పేరుతో ఆశలు రేకెత్తించినప్పటికీ.. చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో చర్యలకు పొంతన కనిపించడం లేదు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ‘రేషనలైజేషన్’ పేరిట ప్రభుత్వం కోలుకోలేని దెబ్బ తీసింది. పోస్టుల సంఖ్యను భారీగా తగ్గించి నిరుద్యోగుల ఆశలపై నీరుగార్చింది. మేలో నోటిఫికేషన్ అన్న తాజా హామీ కూడా గతానుభవాల దృష్ట్యా కాలయాపనగానే మిగిలిపోతుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విభాగాల విలీనం.. పోస్టుల కనుమరుగు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రస్తుతం ఉన్న అధ్యాపకుల కొరత విస్తుగొలుపుతోంది. వర్సిటీలో సుమారు 1,200 అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంజనీరింగ్, ఫార్మసీ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కీలక విభాగాల్లో 60 శాతానికి పైగా పోస్టులు ఏళ్లుగా భర్తీకి నోచుకోలేదు. పూర్తిస్థాయి అధ్యాపకులు లేకపోవడంతో పీహెచ్డీ గైడ్ల కొరత ఏర్పడి, వందలాది మంది పరిశోధక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏటా రిటైర్ అవుతున్న వారితో ఖాళీలు పెరుగుతున్నాయే తప్ప, కొత్త నియామకాల ఊసే లేదు. ప్రస్తుత ప్రభుత్వం అన్ని ఖాళీలను భర్తీ చేయాల్సింది పోయి, రేషనలైజేషన్, విభాగాల విలీనం పేరుతో ఉన్న పోస్టులకు కోత పెట్టింది. దీంతో ఖాళీల సంఖ్య 1,200 నుంచి 500కు పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. భారీ ఆశలతో నోటిఫికేషన్ కోసం వేచి చూస్తున్న నిరుద్యోగులకు ఇది కోలుకోలేని దెబ్బ. ర్యాంకింగ్స్లో ‘రివర్స్’ గేర్ ఒకప్పుడు ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్లో టాప్–20లో నిలిచిన ఏయూ, ప్రస్తుతం 41వ స్థానానికి పడిపోయింది. దీనికి ప్రధాన కారణం అధ్యాపకుల కొరత అని వర్సిటీ వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. పరిశోధన పత్రాల సమర్పణ, పేటెంట్లు, విద్యార్థి–ఉపాధ్యాయ నిష్పత్తి వంటి అంశాల్లో ఏయూ వెనుకబడిపోతోంది. ఫ్యాకల్టీ నాణ్యత మెరుగుపడకుండా అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడటం అసాధ్యమని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. నాణ్యత లేని బోధన.. నష్టపోతున్న విద్యార్థులు అధ్యాపకుల కొరత వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. సెమినార్లు, ప్రాజెక్టులు పర్యవేక్షించే వారు లేక ఉన్నత విద్య నామమాత్రంగా సాగుతోంది. గ్లోబల్ కాంపిటీషన్ గురించి మాట్లాడే అధికారులు, వర్సిటీల్లో కనీస సిబ్బందిని ఎందుకు నియమించడం లేదని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికై నా కాలయాపన మాని, యుద్ధ ప్రాతిపదికన అన్ని ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ● ఏయూలో 1,200 అధ్యాపక పోస్టుల ఖాళీ ● రేషనలైజేషన్, విభాగాల విలీనంతో పోస్టులకు కోత ● సుమారు 500 పోస్టుల భర్తీకి మాత్రమే ఛాన్స్ ● మరోసారి నోటిఫికేషన్ సాకుతో కాలయాపన ● అయోమయంలో కాంట్రాక్టు అధ్యాపకులు ● వెలవెలబోతున్న విద్యా ప్రమాణాలు 15 ఏళ్ల ఎదురుచూపునకు మోక్షం ఎప్పుడు? వర్సిటీని నమ్ముకుని దశాబ్ద కాలంగా పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దాదాపు 100 మంది కాంట్రాక్టు అధ్యాపకులు గత 10 నుంచి 15 ఏళ్లుగా అరకొర జీతాలతోనే సేవలు అందిస్తున్నారు. తమను క్రమబద్ధీకరిస్తారని ప్రతి ఎన్నికల్లోనూ ఆశపడటం, ఆ తర్వాత నిరాశ చెందడం వారికి అలవాటుగా మారింది. సర్వీస్ వెయిటేజీ, రోస్టర్ పాయింట్ల వివాదాలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. కోర్టు కేసుల వంకతో వీరి సమస్యను గాలికి వదిలేయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొత్త నియామకాల పేరుతో తమను రోడ్డున పడేస్తారేమోనన్న భయం వారిని వెంటాడుతోంది. మూడు నెలల్లో సాధ్యమేనా? చంద్రబాబు ప్రభుత్వం రోజుకో మాట చెబుతూ ఉన్నత విద్యను గాలిలో దీపంలా మార్చేసింది. ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపై ప్రభుత్వం పూటకో మాట చెబుతూ కాలయాపన చేస్తోంది. మార్చి బడ్జెట్ సమావేశాల్లో మూడు నెలల్లో భర్తీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, ఉగాది క్యాలెండర్లో 1,500 పోస్టులని చెప్పి, ఇప్పుడు మే నెలలో నోటిఫికేషన్ అంటూ కొత్త పల్లవి అందుకుంది. ‘మేలో నోటిఫికేషన్ వస్తే.. కేవలం మూడు నెలల్లో స్క్రీనింగ్ టెస్టులు, ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు పూర్తి చేయడం సాధ్యమేనా?’ అని నిరుద్యోగ జేఏసీ నేతలు నిలదీస్తున్నారు. రోస్టర్ పాయింట్ల పేరుతో మరోసారి ఈ అకడమిక్ ఇయర్ గడిపేసే ఎత్తుగడ కనిపిస్తోందని అభ్యర్థులు మండిపడుతున్నారు. -
గ్యాస్ కోసం తప్పని అవస్థలు
● భుజాన మోస్తూ.. బండిపై తీసుకెళ్తూ.. మారని వాహనదారుల తీరు ● ప్రాణమా.. ఫోనా? ● సుర్రుమంటున్న సూరీడు ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమంటున్నాడు. అత్యవసర పనుల మీద గడప దాటి బయటకు వస్తే చాలు.. సురీడు సుర్రుమనిపిస్తూ మంట పుట్టిస్తున్నాడు. ఎండ తీవ్రతకు, ఉక్కపోతకు నగర ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఈ మండుటెండల బారి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు మహిళలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎండ దెబ్బ, వడగాల్పుల నుంచి రక్షణ పొందేందుకు మహిళలు ముఖానికి పూర్తిగా చున్నీలు, స్కార్ఫ్లు కప్పుకుని బయటకు వస్తున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్తున్నా, రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నా ఎండ తగలకుండా జాగ్రత్త పడుతున్న దృశ్యాలు ఎటు చూసినా కనిపిస్తున్నాయి. -
ఉపాధికి లంగరు
మహారాణిపేట: సముద్ర మత్స్య సంపద వృద్ధి, పునరుత్పత్తి లక్ష్యంగా తూర్పు సముద్ర తీరంలో ఏటా అమలు చేసే ‘వేట నిషేధం’ మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. బుధవారం నుంచి జూన్ 14 వరకు మొత్తం 61 రోజుల పాటు ఈ నిషేధ కాలం అమలులో ఉంటుంది. దీనివల్ల విశాఖ జిల్లా వ్యాప్తంగా ఉన్న సుమారు 749 మరపడవలు, 1310 మోటారు బోట్లు ఇప్పటికే తీరానికి చేరుకుని లంగరు వేశాయి. ట్రాలర్లు, మోటార్ బోట్లు, వాహన నౌకలు వంటి వాణిజ్య వేట నౌకలకు నిషేధం వర్తిస్తుండగా, మోటారు లేని సంప్రదాయ తెప్పలు, నాటు పడవలకు కొంత మినహాయింపు ఇచ్చారు. ఇవి తీరానికి 8 కిలోమీటర్ల లోపే వేట కొనసాగించవచ్చు. మత్స్యకారులకు రెండు నెలల విరామం పది నెలల పాటు నిరంతరంగా వేటలో నిమగ్నమయ్యే మత్స్యకారులకు ఈ 61 రోజుల నిషేధ కాలం విశ్రాంతిని కలిగిస్తుంది. మళ్లీ జూన్ 15 నుంచి వేట కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. విశాఖ జిల్లాలో 65 కిలోమీటర్ల తీరరేఖ, 32 మత్స్యకార గ్రామాలు, 15 ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు ఉన్నాయి. జిల్లాలో 749 మరబోట్లు, 1310 మోటారు బోట్లు, 488 సంప్రదాయ తెప్పలు ఉన్నాయి. ఇప్పటికే దాదాపు అన్ని బోట్లు ఒడ్డుకు చేరుకున్నాయని మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి.లక్ష్మణరావు తెలిపారు. మత్స్య సంపద పరిరక్షణ కోసం ఈ నిషేధాన్ని మత్స్యకారులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. సీజన్ కన్నా ముందే బోట్లు నిలిపివేత ఈ ఏడాది అనేక సమస్యల కారణంగా మత్స్యకారులు సీజన్కన్నా ముందుగానే వేటను నిలిపివేశారు. ఆయిల్ సబ్సిడీ సక్రమంగా అందకపోవడం, ఖర్చులు పెరగడం, చేపలకు గిట్టుబాటు ధర లేకపోవడం వంటి కారణాల వల్ల వేటలో నష్టాలు ఎదురయ్యాయి. దీంతో చాలా మంది బోటు యజమానులు ముందుగానే హార్బర్లో బోట్లు నిలిపివేశారు. అయితే చిన్న సంప్రదాయ పడవలతో రోజువారీ వేట మాత్రం కొనసాగుతోంది. మరమ్మతులకు సమయం వేట నిషేధ కాలంలో బోటు యజమానులు తమ నౌకలకు మరమ్మతులు చేపడతారు. ఇంజిన్, గేర్బాక్స్, వలలు, ఇతర పరికరాలను సరిచేసి తదుపరి సీజన్కు సిద్ధం చేసుకుంటారు. వేలాది మంది మత్స్యకార కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి కోసం ఇతర పనుల బాట పడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు నిషేధ కాలంలో చేపల వేట కొనసాగిస్తే పట్టుబడిన చేపలను స్వాధీనం చేసుకోవడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మత్స్యశాఖ, కోస్టల్ గార్డ్, కోస్టల్ సెక్యూరిటీ, పోలీస్, నేవీ, రెవెన్యూ విభాగాల సంయుక్త గస్తీ కొనసాగనుంది. మత్స్య సంపద పరిరక్షణ కోసం విధించిన నిషేధాన్ని మత్స్యకారులు తప్పనిసరిగా పాటించాలి. –పి.లక్ష్మణరావు, జాయింట్ డైరెక్టర్, మత్స్యశాఖ, విశాఖపట్నం -
ముఖాధారిత హాజరుతో ఇబ్బందులు
మాకవరపాలెం : ముఖ ఆధారిత హాజరుతో ఇబ్బందులు పడుతున్నామని ఉపాధిహామీ శ్రామికులు డ్వామా పీడీ నిర్మలాదేవి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని కొండలఅగ్రహారం ఎర్రచెరువులో జరుగుతున్న పూడిక తొలగింపు పనులను ఆమె మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రామికుల హాజరు వివరాలను తనిఖీ చేశారు. అనంతరం శ్రామికులకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకోగా శ్రామికులు తమ ఆవేదనను తెలియజేశారు. ఉపాధి సిబ్బంది తెలిపినట్టుగా ఉదయం 5 గంటలకే పనిప్రదేశానికి హాజరవుతున్నామన్నారు. కానీ ముఖ ఆధారిత హాజరు నమోదులో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తుందన్నారు. కొందరి హాజరు నమోదు కాకపోవడంతో వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. దీనిపై పీడీ మాట్లాడుతూ త్వరలో ఈ సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఉదయం 5 గంటలకు పనులు ప్రారంభించి, 10 గంటలకు ముగించాలని సూచించారు. పని ప్రదేశంలో నీడకు టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి, నర్సీపట్నం ఏపీడీలు యరకయ్య, చిన్నారావు, ఏపీవో కాశీ పాల్గొన్నారు. -
నో టికెట్
సింహాచలం : ఈ ఏడాది చందనోత్సవం టికెట్ల జారీనే పెద్ద ప్రహసనంగా మారింది. టికెట్ల కోసం భక్తులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 70 శాతం ఆన్లైన్, 30 శాతం ఆఫ్లైన్ విధానం అమల్లో పూర్తిగా విఫలమైందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 12 నుంచి 17వ తేదీ వరకు రూ.300, రూ.1000 టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని ప్రకటించినప్పటికీ, మూడు రోజులుగా సాఫ్ట్వేర్ సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వెబ్సైట్ ఓపెన్ కాకపోవడం, చెల్లింపులు పూర్తయినా టికెట్లు రాకపోవడం వంటి లోపాలు భక్తులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అధికారులు మాత్రం సర్వర్ సమస్య.. సరిచేస్తున్నాం.. అనే పాత పాట పాడుతున్నారు. బ్యాంకుల వద్ద రణరంగం ఆన్లైన్ వ్యవస్థ పనిచేయకపోవడంతో భక్తులంతా ఆఫ్లైన్ కేంద్రాలైన బ్యాంకులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కో బ్యాంక్కు మంగళవారం కూడా రూ.300 టికెట్లు 700, రూ.1000 టికెట్లు 390 ఇచ్చారు. సింహాచలంలోని యూనియన్ బ్యాంకు, స్టేట్ బ్యాంకుల వద్ద ఉదయం 6 గంటల నుంచే భక్తులు భారీగా క్యూల్లో నిలబడ్డారు. ఎండలో గంటల తరబడి వేచి చూసినప్పటికీ, ఉదయం 10 గంటలకు ప్రారంభమైన టికెట్ల విక్రయాలు గంటలోపే ముగియడంతో వందలాది మంది నిరాశతో వెనుదిరిగారు. ఒక్కో బ్యాంకుకు పరిమిత సంఖ్యలోనే టికెట్లు కేటాయించడంతో పరిస్థితి మరింత విషమించింది. టికెట్లు దొరకకపోవడంతో భక్తులు బ్యాంకుల వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ సంఖ్యలో టిక్కెట్లు ఇవ్వడంపై దేవస్థానం అధికారులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రద్దీ పెరగడంతో పరిస్థితి అదుపు తప్పే పరిస్థితి నెలకొనగా, పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో వందలాది మంది భక్తులు బ్యాంకుల వద్ద తిట్లదండకాలు మొదలెట్టారు. గోపాలపట్నం పోలీసులు, దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది కలిసి భక్తులను నియంత్రించే ప్రయత్నం చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా టెంట్లు ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. ప్రత్యామ్నాయం ఏది? ఈ పరిణామం మొత్తం నిర్వహణలో ఉన్న లోపాలను స్పష్టంగా బయటపెట్టింది. భారీ స్థాయిలో భక్తులు వచ్చే చందనోత్సవం వంటి కార్యక్రమాలకు ముందస్తు ప్రణాళికలో లోపాలు ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేయడంలో విఫలం కావడం, ఆఫ్లైన్ టికెట్ల పరిమితి తక్కువగా ఉంచడం వంటి కారణాలు ఈ పరిస్థితికి దారితీశాయని భావిస్తున్నారు. మొత్తం మీద భక్తులకు సౌకర్యం కల్పించాల్సిన టికెట్ విధానం, వారికే ఇబ్బందులు కలిగించేలా మారింది. ఆన్లైన్ వ్యవస్థ ఫెయిల్ అయినప్పుడు, తక్షణమే ఆఫ్లైన్ కోటాను పెంచి భక్తులకు ఊరటనివ్వడంలో యంత్రాంగం విఫలమైంది. ఇప్పటికై నా అధికారులు పరిస్థితిని సమీక్షించి, ఆన్లైన్ వ్యవస్థను సరిచేసి, టికెట్ల జారీని పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని భక్తులు కోరుతున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
అంబేద్కర్ ఆశయసాధనకు పాటుపడాలి
నాతవరం : అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అసెంబ్లీ స్పీకరు సిహెచ్.అయ్యన్నపాత్రుడు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. నాతవరం గ్రామంలో మంగళవారం అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో... అనకాపల్లి: నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆశయ సాధనకు నేటి యువత కృషి చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్, మాజీ ఎంపీ బీవీ సత్యవతి పిలుపునిచ్చారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రింగ్రోడ్డులోని పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రసాద్, భరత్కుమార్, సత్యవతి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు గ్రామీణ స్థాయి నుంచి పండగ వాతావరణంలో నిర్వహించడం అభినందనీయమన్నారు. 76 సంవత్సరాల భారత స్వాతంత్య్రంలో అన్ని వర్గాల ప్రజలు రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో ఆచరించడం జరుగుతుందన్నారు. ఎస్పీ కార్యాలయంలో.. ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు మేరకు స్థానిక ఎస్పీ కార్యాలయంలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఏఎస్పీ ఎల్.మోహనరావు నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఒక వర్గానికి చెందిన మహానీయుడు కాదని, అన్నివర్గాలకు రాజ్యాంగాన్ని రచించారన్నారు. కుల, మత లింగ విభేదాలు లేని సమానత్వ సమాజం కోసం ఆయన రూపొందిన రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యున్నతమైనదన్నారు. మహిళలకు విద్యా హక్కులు, వెనుకడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారన్నారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ టి.లక్ష్మి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసికోల్లాసం
అల్లిపురం: నిత్యం పనిభారంతో ఉండే ఉద్యోగులకు క్రీడలు శారీరక దారుఢ్యాన్ని పెంచడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిషోర్ పేర్కొన్నారు. గెలుపోటములకంటే కలిసి టీమ్గా పాల్గొనడం ముఖ్యమని, ఇది అధికారుల మధ్య స్నేహబంధాన్ని బలపరుస్తుందని అన్నారు. విశాఖపట్నం సిటీ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో సూర్యాబాగ్లోని ఆర్మడ్ రిజర్వ్ మైదానంలో నిర్వహించిన వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఈస్ట్ గోదావరి జిల్లాలో పనిచేసినప్పుడు జరిగిన క్రీడా పోటీల అనుభవాలు విధి నిర్వహణలో ఎంతో ఉపయుక్తమయ్యాయని తెలిపారు. ఈ స్ఫూర్తితో రెవెన్యూ శాఖలో కూడా త్వరలో క్రీడా పోటీలను నిర్వహించాలని యోచిస్తున్నామని వెల్లడించారు. విశాఖలో ఈ తరహా కార్యక్రమాలు ఒక మంచి సంప్రదాయంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ స్పోర్ట్స్ మీట్లో వెస్ట్, సౌత్, నార్త్, హార్బర్, ఈస్ట్, ద్వారకా సబ్డివిజన్లు, ట్రాఫిక్ డివిజన్తో పాటు స్పెషల్ వింగ్ టీమ్లు కలిపి మొత్తం పది జట్లు పాల్గొన్నాయి. ప్రారంభంలో జట్లు మార్చ్పాస్ట్ నిర్వహించి కలెక్టర్కు గౌరవ వందనం అందించాయి. 100 మీటర్ల పరుగులు (మెన్, ఆఫీసర్స్), టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలను కలెక్టర్ ప్రారంభించి వీక్షించారు. పోలీస్ సిబ్బంది చూపిన ఉత్సాహం ప్రశంసనీయమని పేర్కొంటూ, పాల్గొన్న ప్రతి ఒక్కరినీ విజేతలుగానే భావిస్తున్నానన్నారు. మొత్తం 20 విభాగాల్లో నిర్వహించిన 140కు పైగా పోటీల్లో సుమారు 250 మంది విజేతలు, రన్నర్స్గా నిలిచారు. అనంతరం విజేతలకు పతకాలు అందజేసి అభినందించారు. స్పోర్ట్స్ మీట్ జెండాను కలెక్టర్కు అందజేయగా, ఆయన దానిని పోలీస్ కమిషనర్కు భద్రపరచడానికి అప్పగించారు. ఈ కార్యక్రమంలో సీపీ శంఖబ్రత బాగ్చి, డీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఆర్ఐలు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
బ్యాంకుల్లో 50 శాతం చందనోత్సవం టిక్కెట్లు
టికెట్ల జారీ ప్రక్రియను పరిశీలిస్తున్న ఈవో వెంకటరావు సింహాచలం : చందనోత్సవం టికెట్ల విక్రయాలను బుధవారం నుంచి బ్యాంకుల్లో 50 శాతానికి పెంచుతున్నట్టు దేవస్థానం ఈవో వెంకటరావు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రస్తుతం ఆన్లైన్లో 70 శాతం, ఆఫ్లైన్లో బ్యాంకుల ద్వారా 30 శాతం టికెట్లు జారీచేస్తున్నామని, ఇకపై బ్యాంకుల్లో 50 శాతం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం నుంచి ఆఫ్లైన్లో రూ.300 టికెట్లు 2,400, రూ.1,000 టికెట్లు 1,760, 16న రూ.300 టికెట్లు 2400, రూ.1000 టికెట్లు 1590, 17న రూ.300 టికెట్లు 2400, రూ.1000 టికెట్లు 1590 జారీ చేస్తామన్నారు. ఆన్లైన్లో నగదు కట్ అయ్యి టికెట్ రాకపోతే తిరిగి నగదు చెల్లించే బాధ్యత తానే తీసుకుంటానని స్పష్టం చేశారు. సాఫ్ట్వేర్లో లోడు ఎక్కువ అవడంతో సాంకేతిక సమస్య వచ్చిందన్నారు. -
మా దారి అడ్డదారి...
బుచ్చెయ్యపేట : మండలంలో గల చింతపాక గ్రామంలో టీడీపీ నాయకులు బరి తెగించారు. అధికారం ఉందన్న సాకుతో గతంలో ప్రభుత్వ నిధులతో వేసిన పంచాయతీ రోడ్లను మూసివేస్తున్నారు. పలువురు గ్రామస్తులకు రహదారి సౌకర్యం లేకుండా చేస్తున్నారు. 20 ఏళ్ల కిందట 14 అడుగుల వెడల్పుతో వేసిన రెండు సిమెంట్ రోడ్లపై రాకపోకలు సాగకుండా మూసివేశారు. తెలకలవారి వీధికి వేసిన సిమెంట్ రోడ్డుపై నుంచి ఎవరూ వెళ్లకుండా రోడ్డుకు అడ్డంగా మట్టి వేసి మూసేశారు. గ్రామానికి చెందిన బంటుపల్లి నానాజీ ఇంటి వద్ద నుంచి కోట్ని లోవరాజు ఇంటి వరకు ఉన్న సిమెంట్ రోడ్డు, గొలగాని శేషు ఇంటి వద్ద నుంచి మంచినీటి బోరు వరకు ఉన్న మరో రోడ్డును మూసివేశారు. రహదారి సౌకర్యం లేకుండా చేశారని మాజీ ఉప సర్పంచ్ గద్దె అర్జున గ్రామస్తులు బంటుపల్లి నానాజీ, సకురు రమణ, పెదమ్మలు, సలాది జగ్గారావు, కండేపల్లి అప్పారావు, ఎల్లేటి మాధవి ఆరోపిస్తున్నారు. ఒక టీడీపీ నాయకుడి ఇంటి కోసం ఉన్న పాత రోడ్లను మూసేసి పంచాయతీ స్థలాలు ఆక్రమించి మరో చోట నుంచి సిమెంట్ రోడ్డు వేసి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అందరికి ఉపయోగపడే 14 అడుగుల రోడ్డు మూసివేసి టీడీపీ నాయకుడికి అనుకూలంగా 8 అడుగుల రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు. 14 అడుగుల పెద్ద రోడ్డు మూసి వేయడంతో ట్రాక్టర్లు, వ్యాన్లు ఇతర వాహనాలు తిరగకుండా చేస్తున్నారన్నారు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఇసుక, పిక్క, రాయి, ఇటుకలు ఎలా తెచ్చుకోవాలని, ఇరుకు రోడ్డు వల్ల ట్రాఫిక్ జామ్ అయి ప్రమాదాలు సంభవిస్తాయని గ్రామస్తులు మండిపడుతున్నారు. దీనిపై పంచాయతీ, మండల అధికారులకు ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకుల ఒత్తిళ్లకు లొంగి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. -
రౌడీయిజం చేస్తే తాట తీయండి..
గొలుగొండ/నాతవరం : గ్రామాల్లో గంజాయి అక్రమ రవాణా, రౌడీయిజం చేసే వ్యక్తులను వెంటనే గుర్తించి తాటతీయాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. గొలుగొండ మండలంలో కృష్ణదేవిపేట, గొలుగొండ గ్రామాల్లో నూతనంగా నిర్మాణం చేసిన రెండు పోలీస్ స్టేషన్లు, నాతవరంలో పోలీస్స్టేషన్ నూతన భవనాలను రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, విశాఖ రేంజ్ ఐజీ గోపీనాథ్ జెట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ప్రారంభోత్సవం చేశారు. హోం మంత్రి అనిత మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, రౌడీయిజం అరికట్టే విధంగా ప్రజలను భాగస్వాములు చేసి అనేక కార్యక్రమాలు పోలీస్శాఖ చేపడుతోందన్నారు. నాతవరం ఎస్సీ కాలనీలో నిర్మించిన సోలార్ ప్లాంటును స్పీకర్, ఎస్పీలతో కలిసి హోంమంత్రి అనిత ప్రారంభించారు. అంబేడ్కర్ జయంతి రోజున ఎస్సీ కాలనీలో రాయితీపై ఏర్పాటు చేసిన విద్యుత్ సోలార్ ప్లాంటును, నాతవరం, గొలుగొండ మండలాల్లో రూ.7.50 కోట్లతో నిర్మించిన 3 పోలీసుస్టేషన్లకు నూతన భవనాలను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. -
ఘనంగా అగ్నిమాపక సేవా దినోత్సవం
అగ్నిమాపక సేవా దినోత్సవంలో పాల్గొన్న సింహాద్రి ప్రాజెక్టు హెడ్ అయస్కాంత జెనా, అధికారులు పరవాడ: సింహాద్రి ఎన్టీపీసీలో అగ్నిమాపక సేవా దినోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. సంస్థ ప్రాజెక్టు హెడ్ అయస్కాంత జెనా, సీఐఎస్ఎఫ్ యూనిట్ కమాండర్ రాజ్కుమార్, ఫైర్ వింగ్ డిప్యూటీ కమాండెంట్ రామ్లఖన్ సింగ్, ఏసీ ఫైర్ రాజ్ చౌదరి అమరవీరుల స్థూపంపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అగ్ని ప్రమాద భద్రతపై బ్యానర్లు, బుక్లెట్స్, కరపత్రాలను దీపాంజలినగర్, గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. -
పరారీలో ఉన్న గంజాయి నిందితుడి అరెస్టు
కశింకోట : దాదాపు ఏడేళ్లుగా గంజాయి కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని సుదూర ప్రాంతానికి వెళ్లి వెతికి మరీ పట్టుకొని కశింకోట పోలీసులు అరెస్టు చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాన్ బెయిల్బుల్ వారెంట్ను కోర్టు ఆదేశాల మేరకు అమలు చేయడంలో భాగంగా గంజాయి కేసులో కోర్టుకు హాజరు కాకుండా పరారీలో ఉన్న లారీ డైవర్ను ఎట్టకేలకు పట్టుకొని అరెస్టు చేసినట్టు ఎస్ఐ లక్ష్మణరావు మంగళవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా దల్బెలున్ గ్రామానికి చెందిన డెబాసిస్ ఘెరాయ్ (26) కశింకోట వద్ద ట్రాలీపై మరమ్మతుకు తరలిస్తున్న కారుగా భ్రమింపజేసి దానిలో 2019లో గంజాయి తరలిస్తున్న కేసులో నిందితుడన్నారు. అప్పటి నుంచి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడన్నారు. ఈ నేపథ్యంలో కోర్టు అతనిపై నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ చేసిందన్నారు. ఈ మేరకు కోర్టు జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయడంలో భాగంగా నిందితుడిని గ్రామానికి తమ సిబ్బందితో పాటు వెళ్లి పట్టుకొని అరెస్టు చేసి అక్కడి కోర్టులో హాజరు పరిచామన్నారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్ పొందిన తర్వాత అనకాపల్లి కోర్టులో నిందితుడిని హాజరు పరిచామన్నారు. -
మహిళ నిజాయితీ
పెందుర్తి: ఓ ఆర్మీ అధికారి భార్య నిజాయితీని చాటుకున్నారు. రోడ్డుపై పడి ఉన్న దాదాపు రూ.2.5లక్షల విలువైన బంగారు ఆభరణాన్ని పోలీసులకు అప్పగించారు. వివరాలివి.. వేపగుంట అప్పలనర్శయ్యకాలనీలో నివాసం ఉంటున్న సిరిగుడి వరలక్ష్మి ఆదివారం సాయంత్రం తన బ్యాగ్లో బంగారు నక్లెస్ పెట్టుకుని కుమార్తెతో కలిసి గోపాలపట్నంలోని స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేందుకు ఆటో ఎక్కి నాయుడుతోటలో దిగింది. నడుచుకుంటూ ఇంటికి వెళ్లింది. అయితే ఇంటికి వెళ్లి బ్యాగ్ చూడగా అందులో ఆభరణం లేదు. వెంటనే బాధితురాలు వరలక్ష్మి పెందుర్తి క్రైం పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో ఉన్నాధికారుల ఆదేశాల మేరకు ఎస్ఐ డి.సూరిబాబు ఆధ్వర్యంలో మూడు బృందాలు గాలింపు చేపట్టాయి. నాకు బంగారం దొరికింది రెండు రోజులుగా ఆభరణం కోసం సాంకేతిక పరిజ్ఞానంతో గాలింపు చేపట్టిన పోలీసులకు ఆచూకీ దొరకలేదు. అయితే మంగళవారం ఉదయం పద్మనాభనగర్కు చెందిన ఆర్మీ అధికారి కట్టా శ్రీనివాసరావు భార్య శ్రావణి తాను వాకింగ్ చేస్తున్న సమయంలో నాయుడుతోట వద్ద ఆభరణం దొరికిందని పోలీస్ స్టేషన్కు వచ్చి నక్లెస్ను అప్పగించారు. దీంతో పోలీసులు బాధితురాలు వరలక్ష్మిని పిలిపించి ఆభరణం సరిపోల్చారు. ఆమెకు ఎస్ఐ సూరిబాబు ఆభరణాన్ని అప్పగించారు. నిజాయితీ ప్రదర్శించిన కట్టా శ్రావణిని పోలీసులు ప్రత్యేకంగా అభినందించారు. రోడ్డుపై దొరికిన బంగారు ఆభరణం పోలీసులకు అప్పగింత -
సింహగిరిపై ఆర్జిత సేవల పునరుద్ధరణ
జీలకర్రబెల్లం ఘట్టం నిర్వహిస్తున్న అర్చకులు సింహాచలం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో మంగళవారం నుంచి ఆర్జిత సేవలు పునరుద్ధరించారు. స్వామివారి వార్షిక కల్యాణ మహోత్సవాల సందర్భంగా గత నెల 28 నుంచి ఈ నెల 13 వరకు ఆర్జిత సేవలన్నీ నిలిపివేసిన విషయం తెలిసిందే. తిరిగి మంగళవారం నుంచి యథావిధిగా ఆర్జిత సేవలను పునరుద్ధరించారు. దీనిలో భాగంగా ఉదయం స్వామివారికి సహస్రనామార్చన ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. 1001 నామాలతో అర్చన జరిపి, విశేష హారతులు అందించారు. విశేషంగా నిత్యకల్యాణం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి ఉదయం 9.30 నుంచి నిత్యకల్యాణం విశేషంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణమండపంలో వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఉభయ దాతలకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. శాస్త్రోక్తంగా గరుడసేవ శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి మంగళవారం గరుడసేవ శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని గరుడ వాహనంపై వేంజేపచేశారు. అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించారు. భక్తులను గరుడ వాహనం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. -
అంబేడ్కర్ అడుగుజాడల్లో నడుద్దాం
డాబాగార్డెన్స్: జీవీఎంసీ 27వ వార్డు పరిధి శంకరమఠం వెనుక ఉన్న ఇందిరా సంజీవ్ భీమ్నగర్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. వైఎస్సార్ సీపీ వార్డు అధ్యక్షుడు నీలాపు సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ఎంపీ గొల్ల బాబూరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ దక్షిణ సమన్వయకర్త వాసుపల్లి గణేష్కుమార్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ.. సేవలోనే భగవంతుడి ఆశీస్సులు ఉంటాయని, అదే అంబేడ్కర్ ఆలోచన విధానమని గుర్తు చేశారు. పేదలు, దళితులు విద్యావంతులైనప్పుడే వారికి సమాజంలో సరైన న్యాయం, గౌరవం లభిస్తాయన్నారు. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని నీలాపు సర్వేశ్వరరెడ్డి చిన్నారులకు పుస్తకాలు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లవరపు జాన్వెస్లీ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్గాంధీ, రవిరాజు, పద్మనాభం అమ్మాజీ, రెయ్యి డేవిడ్రాజు, గనగల రామరాజు, ఈతలపాక విజయ్, బోని శివరామకృష్ణ, దేవరకొండ మార్కండేయలు, సనపల రవీంద్రభరత్, కోన శంకర్, చోడిపిల్లి శివ, ఆకుల శ్యామ్, గోవింద్, పైలా అప్పలరాజు, మోహన్, కె.అప్పన్న, లాజర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. భీమ్నగర్లో అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరణ -
స్పీకర్కు తొత్తుగా నర్సీపట్నం సీఐ
నర్సీపట్నం: స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు నర్సీపట్నం రూరల్ సీఐ ఎల్.రేవతమ్మ తొత్తుగా వ్యవహరిస్తున్నారని, వైఎస్సార్సీపీ నాయకులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసు కట్టారని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాఽశంకర్ గణేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ ఆదేశాలతో తమ పార్టీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు టీడీపీ నాయకులపై చర్యలు తీసుకోవాలంటూ మాజీ ఎమ్మెల్యేతో కలిసి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు మంగళవారం నర్సీపట్నం రూరల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత భూమిలో చెట్లు నరుక్కుంటే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం దారుణమన్నారు. అదే స్పీకర్ అయ్యన్నపాత్రుడు నడిరోడ్డుపై డప్పు కళాకారుడైన దళితుడిని చెంప చెల్లుమనిపిస్తే, ఇదే పోలీసులు పేక్షకపాత్ర వహించారని ఆగ్రహించారు. తమ పార్టీ నాయకుడు సన్యాసిపాత్రుడు తన సొంత భూమిలో తోట నరికిస్తుంటే పోలీసులు అడ్డగించడమే కాకుండా అక్రమ కేసు పెట్టారన్నారు. సన్యాసిపాత్రుడు కుటుంబ సభ్యులు ఈరెల్లి రాజుబాబుకు భూమిని లీజుకు ఇస్తూ అగ్రిమెంట్ చేశారన్నారు. లీజు అగ్రిమెంట్ 2024 నాటికి ముగిసిందన్నారు. అగ్రిమెంట్ అయిపోయి రెండేళ్లు అవుతుంటే ఈరెల్లి రాజుబాబుకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. స్పీకర్ వాటాకు సంబంధించిన తోటను మట్టుకోకుండా సన్యాసిపాత్రుడు, మరో ఇద్దరు అన్నదమ్ముల వాటాలోని తోటను నరుకుతుంటే సీఐ అక్రమ కేసులు పెట్టడం దారుణమన్నారు. ఈ ఘటనలో తమ పార్టీ నాయకుడు లాలం స్వామిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తున్నారన్నారు. రాజుబాబు మరో వ్యక్తి దాసుకు లీజుకు ఇవ్వటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దాసు సర్వేకర్ల వ్యాపారం చేయటం ఎప్పుడైనా చూశారా? అని టీడీపీ నాయకులను ప్రశ్నించారు. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి రోజున రూరల్ సీఐ తప్పుడు కేసు బనాయించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. స్పీకర్ పట్ల సీఐ రేవతమ్మ స్వామిభక్తి ప్రదర్శిస్తూ, తమ పార్టీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం సమంజసం కాదన్నారు. ఇదే సాంప్రదాయాన్ని భవిష్యత్తులో ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న ట్రాక్టర్లను తక్షణమే విడిచి పెట్టాలన్నారు. తమ నాయకుడి భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే సీఐ చర్యలకు వ్యతిరేకంగా నియోజకవర్గ స్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి మాకిరెడ్డి బుల్లిదొర, పార్టీ టౌన్ అధ్యక్షుడు ఏకా శివ, చింతకాయల వరుణ్, దాడి బుజ్జి, సుర్ల నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ గందరగోళం.. బ్యాంకుల్లో నిరాశ
సింహాచలం: సింహాద్రి అప్పన్న చందనోత్సవం వేళ సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్న ప్రభుత్వ, అధికార యంత్రాంగం మాటలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మిగిలాయి. ఉత్సవానికి వారం రోజుల ముందే భక్తులకు టికెట్ల కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది 70 శాతం టికెట్లను ఆన్లైన్లో, 30 శాతం ఆఫ్లైన్ (బ్యాంకుల) ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నిర్ణయం భక్తులకు వరానికి బదులు శాపంగా మారింది. మొరాయించిన వెబ్సైట్.. కట్ అవుతున్న నగదు రూ.300, రూ.1000 దర్శన టికెట్లు ఈనెల 12వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. తీరా చూస్తే తొలిరోజే వెబ్సైట్ పూర్తిగా మొరాయించింది. గంటల తరబడి కంప్యూటర్లు, మొబైల్స్ ముందు వేచి చూసిన భక్తులకు నిరాశే ఎదురైంది. సోమవారం వెబ్సైట్ కొంతవరకు అందుబాటులోకి వచ్చినా, సాంకేతిక లోపాలు వీడలేదు. నగదు కట్ అవుతున్నా టికెట్లు రావడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకుల వద్ద క్యూలు.. గంటలోనే ఖాళీ నగరంలోని నాలుగు బ్యాంకు బ్రాంచీల (సింహాచలం, అక్కయ్యపాలెం యూనియన్ బ్యాంకులు; సింహాచలం, బిర్లా జంక్షన్ స్టేట్ బ్యాంకులు) ద్వారా సోమవారం నుంచి ఆఫ్లైన్ విక్రయాలు ప్రారంభమయ్యాయి. టికెట్ల కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. అయితే, విక్రయాలు మొదలైన గంట వ్యవధిలోనే టికెట్లు అయిపోయాయని సిబ్బంది బోర్డులు తిరగేయడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకొర టికెట్లే కారణమా? దేవస్థానం ఈవో జె. వెంకటరావు తెలిపిన వివరాల ప్రకారం.. తొలిరోజు సింహాచలంలోని యూనియన్ బ్యాంకుకు 1090 (700 – రూ.300 టికెట్లు, 390 – రూ.1000 టికెట్లు), స్టేట్ బ్యాంకుకు 1090 టికెట్లు మాత్రమే కేటాయించారు. వీటిలోనే కొన్నిటిని ఇతర బ్రాంచీలకు పంపారు. గతంలో నగరం అంతటా దాదాపు 20 బ్యాంకుల ద్వారా టికెట్లు విక్రయించేవారు. కానీ ఈసారి బ్యాంకుల సంఖ్యను తగ్గించి, ఆన్లైన్కు ప్రాధాన్యత ఇవ్వడం భక్తుల పాలిట ఇబ్బందిగా మారింది. అటు ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు, ఇటు బ్యాంకుల్లో అరకొర టికెట్లతో సామాన్య భక్తులు అప్పన్న దర్శనం కోసం అల్లాడిపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి టికెట్ల సంఖ్యను పెంచాలని, సాంకేతిక లోపాలను సరిదిద్దాలని భక్తులు కోరుతున్నారు. చందనోత్సవం ‘టికెట్’ కష్టాలు -
డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి 45 వినతులు
ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి విశాఖ సిటీ: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నిర్వహించిన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ’ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి 45 వినతులు అందాయి. విశాఖలోని సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో వినియోగదారులు వివిధ సమస్యలను ప్రస్తావించారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరాకు సంబంధించి లో–వోల్టేజ్, విద్యుత్ లైన్ల మార్పు, విద్యుత్ బిల్లులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడి, రూఫ్ టాప్ సోలార్కు సంబంధించిన సమస్యలు, విద్యుత్ కనెక్షన్ల మంజూరు వంటి సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వినతులను సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత విభాగాలకు ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912కు కాల్, లేదా వాట్సాప్ నంబరు 9493681912 ద్వారా కూడా తమ విద్యుత్ సమస్యలను తెలియజేసి పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్లు టీవీ సూర్యప్రకాష్, సీజీఎం వి.విజయలలిత, జీఎం వీవీఎస్ఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లో ఏడీఆర్ఎం ఆకస్మిక తనిఖీ
విశాఖ సిటీ: విశాఖ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు అందుతున్న సదుపాయాలు, స్టేషన్ ప్రాంగణంతో పాటు రైళ్లలో పరిశుభ్రతను పర్యవేక్షించేందుకు వాల్తేరు డివిజన్ ఏడీఆర్ఎం (ఆపరేషన్స్) కె.రామారావు సోమవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్టేషన్లోని వివిధ విభాగాలు, ప్లాట్ఫారమ్లు, ఇక్కడి నుంచి బయలుదేరే ఎక్స్ప్రెస్ రైళ్లలో ఆయన సందర్శించారు. ప్రధానంగా మంచినీటి వసతి, ఫుడ్ కోర్టులు, క్యాటరింగ్ స్టాల్స్, బుకింగ్, రిజర్వేషన్ కార్యాలయాలను పరిశీలించారు. వెయిటింగ్ గదుల్లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాల పట్ల ఆరా తీశారు. స్టేషన్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఆర్పీఎఫ్, టికెట్ తనిఖీ సిబ్బంది తీసుకుంటున్న రద్దీ నియంత్రణ చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రైళ్లలో ప్రయాణించే వారికి అందించే లినెన్ (బెడ్ షీట్లు, దుప్పట్లు) నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా క్లీనింగ్ సిబ్బంది, లినెన్ సరఫరాదారులతో ఆయన మాట్లాడారు. ప్రయాణికులు ఫిర్యాదు చేసినప్పుడు తక్షణమే స్పందించాలని, అందరితో మర్యాదగా, వినమ్రంగా మాట్లాడాలని సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ప్రయాణికుల సంతృప్తే రైల్వే శాఖ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. తనిఖీల అనంతరం విశాఖ స్టేషన్లోనే ఆన్బోర్డ్ హౌస్ కీపింగ్ సిబ్బంది, సూపర్వైజర్లు, హెల్త్ ఇన్స్పెక్టర్లతో ఏడీఆర్ఎం ప్రత్యేక కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించకూడదని, స్టేషన్, రైళ్ల పరిశుభ్రత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని ఆదేశించారు. -
గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలి
అజేయపురంలో బైక్ ర్యాలీ చేస్తున్న గిరిజనులు రావికమతం: గిరిజన సమస్యలపై నర్సీపట్నం కేంద్రంగా ప్రత్యేక గిరిజన దర్బార్ ఏర్పాటు చేయాలని కోరుతూ మండలంలో గిరిజనులు ఆజేయపురం నుంచి జెడ్.జోగుంపేట, నేరేడుబంద మీదుగా కళ్యాణపులోవ వరకు సామాజిక చైతన్య బైక్ ర్యాలీ నిర్వహించారు. అజేయపురంలో గిరిజన సంఘాలు, కె.వి.పి.ఎస్ సంఘాల ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కె.గోవిందరావు మాట్లాడుతూ మండలంలో గల గిరిజన గ్రామాలను నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని, ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఆర్టికల్ 9 షెడ్యూల్లో చేర్చాలని, నాన్ షెడ్యూల్ గిరిజన మండలాలను ఏజెన్సీ ఏరియాలో కలపాలని అన్నారు. భారత రాజ్యాంగంలో గిరిజనుల రక్షణకు అనేక చట్టాలు రూపొందించారన్నారు. వీటిని నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలకు పాలకులు వర్తింపజేయడం లేదని విమర్శించారు. జెడ్.జోగుంపేటలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయాలని, నర్సీపట్నం నుంచి జెడ్.జోగుంపేట వరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు పాంగి చంద్రరావు, పాంగి పవన్ కుమార్, వంతల చిరంజీవి, గేమిల రాజు, గిరిజనులు పాల్గొన్నారు. -
వేటకు విరామం
నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేటకు బ్రేక్ జూన్ 14 వరకు 61 రోజుల పాటు క్రాప్ హాలిడే జిల్లాలో 6 మండలాల్లో 31 మత్స్యకార గ్రామాలు వేటపై ఆధారపడి జీవిస్తున్న 12,644 మంది మత్స్యకారులు పరోక్షంగా 50 వేల కుటుంబాలు గతేడాది సకాలంలో మత్స్యకార భరోసా అందక ఇబ్బందులువేట విరామం ప్రకటించడంతో ఒడ్డున లంగరు వేసిన బోట్లు సాక్షి, అనకాపల్లి: సముద్ర జలాలపై సాగించే చేపల వేటకు విరామం లభించింది. గంగపుత్రులు రెండు నెలల పాటు తమ వలలకు విశ్రాంతి ప్రకటించనున్నారు. మత్స్యసంపద పెరిగే కాలం కావడంతో 61 రోజుల పాటు సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో చేపల వేట సాగించే మత్స్యకారులు నిషేధ కాలంలో ఇంటి పట్టునే ఉండనున్నారు. ప్రతి ఏటా మే 14 – జూన్15 సమయంలో సముద్రంలో చేపల సంతానోత్పత్తికి ఎటువంటి విఘాతం కలిగించరాదనే వేటనిషేధం ప్రకటిస్తారు. ఈ విరామ సమయంలో వలలను అల్లుకోవడం, బోట్లకు మరమ్మతులు చేసుకోవడం వంటి పనులు మత్స్యకారుల చేసుకుంటారు. జిల్లాలో ఉన్న 73 కిలోమీటర్ల తీరంలో 14వ తేదీ అర్ధరాత్రి నుంచి వేట నిషేధం అమలులోకి రాన్నుది. దీంతో రెండు నెలల పాటు ఎక్కడ బోట్లు అక్కడే ఉండిపోతాయి. ఈనెల 15వ తేదీ నుంచి రెండు నెలల పాటు 61 రోజుల పాటు వేటను ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి విదితమే. మళ్లీ జూన్ 15వ తేదీ నుంచి చేపల వేట మొదలవుతుంది. దీంతో వీరికి ప్రభుత్వం మత్స్య భరోసా కింద ఆర్థిక సహాయం ఈ ఏడాదైనా అర్హులైన వారందరికీ ఇవ్వాలని మత్స్యకారులు కోరుతున్నారు. జిల్లా పరిధిలో 73 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరంలో ఆరు మండలాల పరిధిలోని 31 మత్స్యగ్రామాల్లో 12,644 మత్స్య కుటుంబాలకు మత్స్యవేటే జీవనాధారం. ఈ ఏడాదైనా భృతి కల్పించేనా..! ఎన్నికలకు ముందు అబద్ధపు హామీలతో మత్స్యకారుల ఓట్లను తమవైపు మలుచుకుని గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణమే ఏడాది పాటు వేట నిషేధం భృతి ఎగ్గొట్టారు. పోనీ రెండో ఏడాదిలోనైనా ఇస్తారని ఆశిస్తే..అర్హులైన మత్స్యకారులకు ఇవ్వకుండా అనర్హులకు వేట నిషేధకాల భృతి కల్పించి అవకతవకలకు పాల్పడ్డారు. అర్హతలేనటువంటి కూటమి పార్టీల అనుకూల మత్స్యకారులకు నిషేధ భృతి కల్పించారు. దీంతో వేట మీదే ఆధారపడి జీవించే మత్స్యకారులకు అన్యాయం జరిగింది. 2022–23 ఏడాదిలో లబ్ధిపొందిన మత్స్యకారుల్లో అర్హత ఉన్న సుమారు 2 వేల మందికి మత్స్యకార భరోసా అందలేదు. ఒక్కోబోటులో అర్హతలేనటువంటి కూటమి పార్టీల అనుకూల మత్స్యకారలుకు భరోసా కల్పించారు. వేట మీదే ఆధారపడి జీవించే గిరిపుత్రులకు వేట నిషేధ భృతి కల్పించకుండా అన్యాయం చేశారు. దీనిపై జిల్లా మత్స్యకార అధికారికి, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్కు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యంగానే మారింది. ఈ ఏడాదైనా ప్రభుత్వం నుంచి అందే భరోసా అర్హులైన మత్సకారులకు అందించాలని మత్స్యకార సంఘాల నాయకులు కోరుతున్నారు. వేట భృతి కోసం 12,644 మత్స్య కుటుంబాలు అనకాపల్లి జిల్లా పరిధిలో 73 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. తీరంలో ఉన్న ఆరు మండలాల పరిధిలోని 31 మత్స్యగ్రామాలు ఉన్నాయి. 12,644 మత్స్య కుటుంబాలు కేవలం చేపల వేట, విక్రయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మత్స్యకారులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో గత ప్రభుత్వం ఆంధ్రా ఫిష్ వంటి కార్యక్రమాలను అమల్లోకి తీసుకొచ్చింది. వేట నిషేధ సమయంలో మత్స్యకారుల భృతి కోసం 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం పెంచింది. 2014 టీడీపీ ప్రభుత్వంలో అరకొరగా ఉండే మత్స్యకార భరోసాను రూ.10 వేలకు పెంచడంతో అప్పట్లో మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. అయితే 2024 ఎన్నికలు మత్స్యకారులకు ఎన్నికల నిబంధనలు శరాఘాతంగా మారాయి.నిషేధ భృతి...తీరిదీ.. 2022–23– ఏడాదిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో 11,500 మంది మత్స్యకారులకు నిషేధ భృతి అందించారు. 2023–24లో చంద్రబాబు ప్రభుత్వం మత్స్యకార భరోసా ఇవ్వలేదు. 2024–25 లో జిల్లాలో నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, పరవాడ మండలాల్లో 11,544 మందికి గానూ రూ.23.28 కోట్లు భృతి అందించారు. వీరు కాకుండా అర్హత ఉన్న మత్స్యకారులు సుమారుగా 1500 మందికి వేట నిషేధ భృతి రాలేదు. వీరిలో అచ్యుతాపురం మండలంలో 400 మంది మత్స్యకారులు, రాంబిల్లి, పరవాడ మండల పరిధిలో 200 మంది, ఎస్.రాయవరం, నక్కపల్లి, పాయకరావుపేట మండలాల పరిధిలో 400 మందికి పైగా మత్స్యకారులకు నిషేధ భృతి అందించలేదు. అదేవిధంగా విద్యుత్ బిల్లులు ఎక్కువగా వచ్చాయని, ఫోర్ వీలర్స్ ఉన్నాయని, భూమి లేకపోయినా ఉన్నట్టు సూచిస్తూ టెక్నికల్ సమస్యలతో సుమారుగా 500 మంది మత్స్యకారులకు నిషేధ భృతి అందించలేదు.17 నుంచి ఎన్యూమరేషన్..జిల్లాలో తీరప్రాంతం : 73 కి.మీ. మత్స్యకార గ్రామాలు : 6 మండలాల్లో 31 గ్రామాలు మత్స్యవేటపై ఆధారపడిన వారు మొత్తం : 12644 మోటారైజ్డ్ బోట్లపై వేట సాగించేవారు : 11643 నాన్ మోటారైజ్డ్ బోట్లపై వేట చేసేవారు : 1001మత్స్యకారుల వెతలు వినపడవా..? చంద్రబాబు ప్రభుత్వానికి మత్స్యకారుల ఓట్లే కావాలి..వారి సమస్యలు, వెతలు వినపడవు. వేట నిషేధం మొదటి ఏడాది ఎగ్గొట్టింది. రెండో ఏడాదిలో జిల్లాలో సుమారుగా 1500 వేల మంది అందలేదు. డీజిల్ సబ్సిడీ పూర్తి స్థాయిలో రాలేదు. పాయకరావుపేటలో పెట్రోల్ బంక్ సబ్సిడీ ఇవ్వలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏనాడూ మా మత్స్యకార భరోసా ఆగలేదు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ భరోసా అందింది. అదేవిధంగా అర్హత ఉన్న వారందరికీ ఈ ఏడాదైనా భరోసా ఇవ్వాలని కోరుతున్నాను. – చోడిపల్లి శ్రీనివాసరావు, మాజీ మత్స్యకార కార్పొరేషన్ డైరెక్టర్ ఈ ఏడాదైనా అర్హులైనవారికి భృతి ఇవ్వాలి.. విరామానికి ముందే వేట నిషేధ భృతి ప్రకటిస్తే బావుండేది. రిజిస్ట్రేషన్ అయిన ప్రతి బోట్కి నిషేధ భృతి ఇవ్వాలి. గతేడాది వేటకు వెళ్లని మత్స్యకారులకు నిషేధ భృతి ఇచ్చారు. స్థానిక సచివాలయ ఉద్యోగులు, కూటమి నాయకులు భాగస్వామ్యంతోనే అవకతవకలకు పాల్పడ్డారు. అర్హులైన వారికి ఇవ్వలేదు. ఈ ఏడాది అలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రభుత్వం అర్హులైన మత్స్యకారులకు భృతి అందించాలి. – వాసుపల్లి శ్రీనువాసరావు, మత్స్యకార నాయకుడు, పూడిమడకనక్కపల్లి: ఈ ఏడాది వేట నిషేధ పరిహారం కోసం ఏప్రిల్ 17 నుంచి సర్వే చేపట్టనున్నారు. పరిహారం కోసం ప్రభుత్వం సవాలక్ష నిబంధనలు విధించింది. ఏప్రిల్ 14 నాటికి లైసెన్స్ రెన్యూవల్ అయి ఉండాలి. సర్వే సమయంలో బోటు యజమానితో పాటు, కలాసీలంతా హాజరు కావాలి. వేట చేసే బోటుకు జరిమానా విధించి ఉండకూడదు. కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ భరోసా వర్తిస్తుంది. 18 నుంచి 60 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి. లబ్ధిదారులు సామాజిక భద్రతా పింఛను తీసుకుంటే ఈ పథకం వర్తించదు. నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు. మోటరైజ్డ్ బోటులో 6 మంది, సంప్రదాయ పడవలో ముగ్గురు మాత్రమే వేటసాగిస్తూ ఉండాలి. ఏప్రిల్ 17న సర్వే బృందాలు మత్స్యకార గ్రామాల్లో పడవలను తనిఖీ చేస్తాయి. 19 నుంచి 22 వరకు సేకరించిన డేటాను ఆన్లైన్ చేస్తారు. 23న సచివాయాల్లో అర్హత పొందిన లబ్ధిదారుల జాబితా ప్రదర్శిస్తారు. 23నుంచి 25 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 27న కలెక్టర్ ఆమోదానికి పంపిస్తారు. 30 నుంచి డీబీటీ విధానంలో ఆర్థిక సాయం పంపిణీ చేయడం జరుగుతుంది. -
సృష్టి క్షేత్రాన్ని బలిఘట్టంలో నిర్మించండి..
● మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ● బలిఘట్టం శివాలయంలో ప్రత్యేక పూజలునర్సీపట్నం: రైతుల మేలు కోరినవారైతే..సృష్టి క్షేత్రాన్ని నర్సీపట్నం పెద్ద చెరువులో కాకుండా బలిఘట్టం శ్రీబ్రహ్మలింగేశ్వరస్వామి వేంచేసి ఉన్న పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ కూటమి నేతలకు సూచించారు. పార్టీ నాయకులతో కలిసి బలిఘట్టం బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రగా బయలుదేరి ఉత్తరవాహిని నదిలో పుజాపత్రిని కలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సృష్టిక్షేత్రం పేరుతో 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని పెద్దచెరువులో ఏర్పాటు చేయడం వల్ల ఆయకట్టు రైతులకు నష్టం జరుగుతుందన్నారు. రైతుల అభిప్రాయాన్ని గౌరవించి శివపార్వతుల విగ్రహాన్ని బలిఘట్టం పుణ్యక్షేత్రంలో ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం అధ్యాతికంగానే కాకుండా పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్రంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయం ఒకటి అన్నారు. ఇక్కడ శివలింగాన్ని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు ప్రతిష్టించారని పురాణాలు చెబుతున్నాయన్నారు. సాధారణంగా నదులు తూర్పునకు ప్రవహిస్తాయి. ఇక్కడ వరహానది పశ్చిమ దిశగా ప్రవహించడం వల్ల దక్షిణకాశీగా పిలువబడుతుందన్నారు. స్వామి వారి ఆలయంతో పాటు లక్ష్మీదేవి, శనేశ్వర ఆలయాలు, సత్యనారాయణస్వామి ఆలయం, పాకలపాడు గురుదేవుల ఆశ్రమం ఉందన్నారు. అందువల్ల రైతులకు నష్టం వాటిల్లకుండా బలిఘట్టం పుణ్యక్షేత్రంలో 108 అడుగుల శివపార్వతుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూటమి నేతలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పెట్ల అప్పలనాయుడు, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్చైర్మన్లు తమరాన అప్పలనాయుడు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, టౌన్ పార్టీ అధ్యక్షులు ఏకా శివ, నాలుగు మండలాల మండల పార్టీ అధ్యక్షులు శానపతి వెంకటరత్నం, పాణిశాంతరాం, చిటికెల రమణ, నాగేశ్వరరావు, ఎంపీపీలు గజ్జలపు మణికుమారి, రుత్త సర్వం, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు సుర్ల నాయుడు,నాతవరం మండలం యూత్ ప్రెసిడెంట్ బండారు నాయుడు, నియోజకవర్గ బూత్ కన్వీనర్ల అధ్యక్షులు సుర్ల చంద్రశేఖర్, కై న్సిలర్లు సిరసపల్లి నాని, జగదీశ్వరి,మాకిరెడ్డి బుల్లిదొర, పట్టణ మహిళా అధ్యక్షురాలు కణితి అన్నపూర్ణ,పట్టణ యూత్ అధ్యక్షులు అల్లంపల్లి ఈశ్వరరావు, మాజీ స్టేట్ డైరెక్టర్లు కర్రి శ్రీనువాసరావు, షేక్ ఉన్నీషా బేగం, ఏఎంసీ మాజీ డైరెక్టర్ లోకవరపుశారద, పార్టీ నాయకులు బొడ్డు గోవిందరావు, పెట్ల భద్రాచలం పాల్గొన్నారు. -
పిలిచి అవమానిస్తారా..!
నర్సీపట్నం: పొలిటికల్ సమావేశానికి రాజకీయ పార్టీల నాయకులను ఆహ్వానించి..అధికారులు రాకుండా తమ సమయాన్ని వృఽథా చేయడమే కాకుండా అవమానించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు మీసాల సుబ్బన్న, జనసేన నాయకులు అద్దెపల్లి గణేష్, రాజా, ఆమ్ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్, బీజేపీ నాయకులు బోళెం శివ, బీజేపీ స్టేట్ కౌన్సిల్ సభ్యులు చిందాడ నూకేశ్వరరావు, ఆ పార్టీ పల్లా రమణ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సోమవారం నిర్వహించాల్సిన సమావేశానికి తమను ఆహ్వానించారన్నారు. ఆర్డీవో రాకపోయినా ఆ స్థాయి అధికారి కానీ నాలుగు మండలాల తహసీల్దార్లు సైతం హాజరు కాలేదన్నారు. సుమారు రెండు గంటలకు పైగా కార్యాలయం వద్ద వేచి ఉన్నప్పటికీ ఎవరూ రాలేదన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆర్డీవో వి.వి.రమణ దృష్టికి తీసుకువెళ్లగా అనివార్య కారణాల వల్ల సమావేశం పెట్టలేకపోయామని, మరో రోజు ఏర్పాటు చేస్తామని ఆర్డీవో తెలిపారు. -
‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు ప్రారంభం
బీచ్రోడ్: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించే ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలును విశాఖపట్నం నుంచి తొలిసారిగా ప్రారంభిస్తున్నట్లు ఐఆర్సీటీసీ జనరల్ మేనేజర్ డి.ఎస్.జి.పి కిశోర్ తెలిపారు. సోమవారం రామనగర్లోని హోటల్ ఎలైట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ‘అరుణాచలం–కాంచీపురం–మహాబలిపురం దివ్య దక్షిణ యాత్ర’ పేరిట రూపొందించిన ఈ ప్యాకేజీ కింద ప్రత్యేక రైలు ఈ నెల 27న విశాఖ నుంచి బయలుదేరి మే 4 వరకు ప్రయాణిస్తుంది. మొత్తం 8 రాత్రులు, 9 రోజులపాటు సాగే ఈ యాత్రలో ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు, వారసత్వ ప్రదేశాలు సందర్శించేలా ప్రణాళిక రూపొందించారు. యాత్రికులకు రవాణా, వసతి, భోజన సదుపాయాలతో పాటు టూర్ ఎస్కార్ట్ సేవలు అందిస్తామని తెలిపారు. మరిన్ని వివరాల కోసం ఐఆర్సీటీసీ వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు. -
దళితుల అభ్యున్నతికి వైఎస్సార్సీపీ కృషి
ఆత్మీయ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాదరావు సబ్బవరం: వైఎస్సార్ సీపీ హయాంలో ఎస్సీ వర్గాల సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేసినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాదరావు అన్నారు. మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విభాగం జిల్లా అధ్యక్షుడు పాలిశెట్టి సురేష్రాజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బొడ్డేడ మాట్లాడుతూ గత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో సామాజిక న్యాయం, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్య, ఉపాధి, గృహ, ఆరోగ్య రంగాల్లో ఎస్సీ వర్గాలకు విశేష ప్రాధాన్యత కల్పించామన్నారు. నియోజకవర్గ, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తిచేయాలని, ప్రతి కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వంలో దళితులకు జరుగుతున్న అన్యాయం, దాడులను పార్టీ ఎస్సీ విభాగం ఆధ్వర్యంలో ధైర్యంగా ఎదుర్కోవాలని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే, పెందుర్తి నియోజకవర్గ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్, పార్టీ రాష్ట్ర ఎస్సీ విభాగం ప్రధాన కార్యదర్శి ఐడి బాబు, అనకాపల్లి జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకుడు అల్లంపల్లి రాజుబాబు, ఉత్తరాంధ్ర రీజనల్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు జానకిరామ్, విశాఖ జిల్లా ఎస్సీ విభాగం పరిశీలకులు పూర్ణచంద్ర, వేచలపు ప్రకాష్, ఈర్లి సుధీర్ కుమార్ జ్ఞాన్ దీప్ పాల్గొన్నారు. -
అంబేడ్కర్ జయంతి చేస్తామన్నందుకు చితకబాదారు
మేడిచర్లకు చెందిన దళిత యువకుడి ఆరోపణ కె.కోటపాడు: మండలంలోని మేడిచర్ల గ్రామంలో దళిత వర్గానికి చెందిన తనపై సోమవారం గ్రామానికి చెందిన వారు దాడికి పాల్పడ్డారని బాధితుడు యల్లపు ప్రసాద్ తెలిపారు. దాడిలో గాయపడి కె.కోటపాడు ఆసుపత్రిలో వైద్యం పొందేందుకు వచ్చినట్టు ఆయన విలేకరులకు తెలిపారు. కొంత కాలంగా ప్రతి ఏడాది నిర్వహించే అంబేడ్కర్ జయంతిని ఈ ఏడాది కూడా జరిపేందుకు దళితుల కాలనీకి చెందిన వారు చర్చించుకోవడం జరిగిందని, ఇది విన్న గ్రామానికి చెందిన కొందరు నాయకులు సోమవారం తన ఇంటికి వచ్చి తనను బయటకు పిలిచి ఏంటిరా నువ్వు అంబేద్కర్ జయంతిని చేసేదని అసభ్య పదజాలంతో తిట్టారని ఆరోపించారు. తన తల్లిదండ్రులతో పాటు భార్య ఉండగానే తనపై గ్రామానికి చెందిన పూడి నారాయణమూర్తి, పూడి శేషగిరిరావు, రొంగలి కుమార్, గండేపల్లి నవీన్, పూడి అప్పలనాయుడు, బొడ్డు శ్రీనివాసరావు, పూడి రాంజీ దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. తన చేతులు వెనక్కి పట్టుకొని తనను చితకబాదారని వాపోయారు. తనపై జరిగిన దాడిపై ఎ.కోడూరు పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. -
వేస్ట్ ఆయిల్తో చక్కగా వంట!
ఇది చూడటానికి కాస్త వైరెటీగా ఉంది కదూ... పనికిరాని ఇంజిన్ ఆయిల్తో పనిచేసే గ్యాస్ స్టౌ ఇది. జోనల్ కార్యాలయంలో పారిశుధ్య విభాగంలో ట్రాక్టర్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్న కుందూరి ప్రకాష్ (శ్రీరామ్నగర్ వాసి) దీనిని రూపొందించారు. సోమవారం ఇలా ప్రదర్శించి చూపారు. ఇలా స్టౌను ఏర్పాటు చేసి దానికి ఒక చిన్నపాటి ట్యాంకర్ అనుసంధానం చేసి, అందులో వేస్ట్ ఇంజిన్ ఆయిల్ వేసి, విద్యుత్ ద్వారా గాలిని పంపించి స్టౌ వెలిగించారు. దీంతో చక్కగా వంట చేసుకోవచ్చంటున్నారు. భలే ఐడియా కదూ. – అనకాపల్లి -
ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే ఉపేక్షించేది లేదు
అచ్యుతాపురం రూరల్: ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అచ్యుతాపురం తహసీల్దార్ డి. శ్రీను హెచ్చరించారు. సోమవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన ‘చెరువు స్థలంపై కబ్జాదారుల కన్ను’ అనే శీర్షికపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆయన స్పందించారు. అచ్యుతాపురం ఇందిరమ్మ కాలనీకి ఆనుకున్న చెరువు గర్భంలో అక్రమ నిర్మాణం చేపడుతున్న స్థలాన్ని పరిశీలించారు. ఇక్కడ చెరువు స్థలంలో భారీ భవంతి నిర్మాణానికి తీసిన గోతులను పొక్లెయిన్తో కప్పేసి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయించారు. అనంతరం వీఆర్వో, ఆర్ఐ, సర్వేయర్లను ఉద్దేశించి మాట్లాడుతూ మరోసారి ప్రభుత్వ భూముల్లో ఎవరైనా కబ్జాలకు పాల్పడితే షోకాజ్ నోటీసులు ఇస్తామన్నారు. గతంలో ఇక్కడ స్థలంలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తొలగించి భవంతి నిర్మాణానికి పూనుకుంటున్న వారిపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపారు. చెరువు గర్భం ఆక్రమణపై స్థానిక యువకులు ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకురావడం అభినందనీయమన్నారు.చెరువు స్థలం దగ్గర హెచ్చరిక బోర్డు ఏర్పాటు -
బొగ్గు ఫ్యాక్టరీ తొలగించాలని నిరసన
అనకాపల్లి: ప్రజల ఆరోగ్యంతో చంద్రబాబు ప్రభుత్వం చలగాటం అడుతుందని, కాలుష్యాన్ని వెదజల్లే బొగ్గు కంపెనీలను తక్షణమే తొలగించాలని, ఇప్పటికే గ్రామంలో సుమారుగా నలుగురు బొగ్గు కాలుష్యం కారణంగా మృత్యవాత పడ్డారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ అన్నారు. పిసినికాడ రెవెన్యూ పరిధిలో బీఆర్టీ కాలనీలో అనహిత రిసోర్సెస్ ప్రైవేట్ లిమిటెడ్(బొగ్గు కంపెనీ–1,2)ని తక్షణమే తొలగించాలని, బీఆర్టీ కాలనీ, సంపతిపురం, వెటజంగాలపాలెం గ్రామాల ప్రజలు సోమవారం కంపెనీ వద్ద ధర్నా చేస్తున్న సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలుష్యాన్ని వెదజల్లే బొగ్గు కంపెనీల ద్వారా కిడ్నీ, లీవర్ సమస్యతో గడిచిన మూడు, నాలుగు నెలల్లో కొంతమంది మృత్యవాత పడ్డారన్నారు. ఫ్యాక్టరీని తక్షణమే నిలుపుదల చేయాలని ప్రజల పక్షాన పోరాటాలు చేస్తామన్నారు. పోలీస్, ఇతర శాఖల అధికారులు ఐదు రోజుల్లో కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఈనెల 18వ తేదీ వరకూ నిరసన కార్యక్రమాన్ని నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు. లేని పక్షంలో ప్రజలు పక్షాన నిత్యం ధర్నాలో పాల్గొనడం జరుగుతుందన్నారు. ప్రజల ప్రాణాలను హరించే కంపెనీలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్యాయమని, తక్షణమే నిలుపుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి మలసాల కుమార్రాజా, మండలపార్టీ అధ్యక్షుడు పెదిశెట్టి గోవింద్, ఎంపీటీసీలు మెల్లేటి హేమ, బుద్ద నాగేష్, స్థానిక ప్రజలు ఎల్లపు వెంకట్రావు, పెదిశెట్టి రమేష్, మల్ల శ్రీనివాసరావు, భాస్కర్రావు, నీలకంఠ సంతోష్ లక్ష్మి, ఎం.పాపారావు, కాండ్రేగుల పరమేష్, మూడు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. -
అవే అర్జీలు.. పరిష్కారం శూన్యం
తుమ్మపాల: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం పేరుకే పరిమితమైందంటూ ఆవేదన వ్యక్తమవుతోంది. గ్రామ, మండల స్థాయిలో సమస్యలు పరిష్కారంగాక అనేక వ్యయప్రయాసలకోర్చి జిల్లా అధికారుల వద్దకు వస్తే సమస్య తెలుసుకుని తక్షణమే పరిష్కరించకుండా సంబంధిత శాఖ సిబ్బందికిచ్చి చేతులు దులుపుకుంటున్నారంటూ అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదే పదే తమ సమస్యలను కలెక్టరేట్లో అధికారుల ముందుంచగా, ఫిర్యాదులను నమోదు చేసి, వాటి స్థితిగతులపై కనీసం పునః పరిశీలన చేయడం లేదని వాపోతున్నారు. పదే పదే భూసమస్యలపై.. భూ సమస్యలతో పాటు మరికొన్ని సమస్యలు నెలల తరబడి ఎటువంటి పురోగతి లేకపోవడంతో కలెక్టరే దిక్కంటూ కొందరు పదేపదే కలెక్టరేట్లో ఫిర్యాదులు చేస్తూనే ఉంటున్నారు. మళ్లీ మళ్లీ కలెక్టరేట్ చుట్టూ తిరుగుతూ పరిష్కారం కోసం వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించి క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీల ద్వారా అప్రమత్తం చేయాలని, తద్వారా అర్జీదారుల సమస్యలు పరిష్కారం అవుతాయని చెబుతున్నారు. ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారం : జేసీ ప్రజలు తమ సమస్యలపై చేసిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో అర్జీదారునితో విచారించి పరిష్కారం చేయాలని జాయింట్ కలెక్టరేట్ శౌర్యమాన్ పటేల్ ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరం –1, 2లలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్ ), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయనతోపాటు జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, ఎన్ఏవోబీ, బీజేఆర్ఎస్ ప్రత్యేక ఉప కలెక్టర్లు మనోరమ, రామమణి, జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. ఈ వారం పీజీఆర్ఎస్కు 108, రెవెన్యూ క్లినిక్కు 173 మొత్తం 281 అర్జీలు వచ్చాయి. కక్షసాధింపుతో భూసేకరణ జాబితాలో పేరు తొలగింపు రికార్డుల్లో 2 ఎకరాల భూమికి బదులు 60 సెంట్లు మాత్రమే భూసేకరణ జాబితాలో ఉందని, మిగిలిన భూమి ఆన్లైన్లో కనిపించడం లేదని పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసినందుకు రెవెన్యూ అధికారులు తన పేరును పూర్తిగా తొలగించారంటూ మాకవరపాలెం మండలం రాచపల్లికి చెందిన బొంతు రమణ మళ్లీ ఫిర్యాదు చేశాడు. సర్వే నంబరు 737లో 2 ఎకరాల భూమిని 15 సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాను. ఇటీవల ప్రభుత్వం వివిధ కంపెనీల స్థాపన కోసం చేపట్టిన భూసేకరణ ప్రక్రియలో భాగంగా లబ్ధిదారుల జాబితాను తయారు చేసి తహసీల్దార్ కార్యాలయంలో ప్రచురించారు. ఆ జాబితాలో మొదటి దఫా నా పేరున ఉన్నప్పటికీ రెండవ జాబితాలో తొలగించారని ఆవేదన వ్యక్తం చేశాడు. భూములు లేని కొంతమంది వ్యక్తులు అక్రమంగా హక్కులు చూపుతూ జాబితా సిద్ధం చేశారన్నారు. భూ సేకరణ జాబితాలో తికమకలపై మరికొందరు పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేశారు. చెరువు గర్భం ఆక్రమించినా పట్టించుకోని అధికారులు మూడు గ్రామాలకు చెందిన చెరువు గర్భాన్ని ఆక్రమించి మట్టితో కప్పేస్తున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మల్లవరం కాలువ చైర్మన్ ఎస్.వి.కె.దొర పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాడు. మాకవరపాలెం మండలం మల్లవరం, గిడుతూరు, వజ్జరగడ గ్రామాలకు చెందిన చెరువు ఆక్రమణపై నర్సీపట్నం ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేపినా పట్టించుకోవడం లేదని వాపోయాడు. 750 ఎకరాలకు సాగు నీరందించే చెరువును కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా ఆక్రమించి కొంత భాగాన్ని మట్టితో కప్పేస్తున్నా పట్టింకునే వారే లేకుండా పోయారని, కలెక్టరమ్మ స్పందించి చెరువును కాపాడాలని కోరారు. తూతూమంత్రంగా మారిన కలెక్టరేట్ పీజీఆర్ఎస్ అర్జీలు స్వీకరించి చేతులు దులుపుకుంటున్న అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న అర్జీదారులు -
బంగారం
బూడిదేవేస్ట్ మేనేజ్మెంట్లో ఎన్టీపీసీ సింహాద్రి సరికొత్త రికార్డు వరుసగా తొమ్మిదో ఏడాది కూడా శత శాతం వినియోగం నిర్మాణ రంగానికి బూడిద ప్రధాన ముడిసరుకు పర్యావరణ పరిరక్షణలో దేశానికి మార్గదర్శకంవ్యర్థం ‘అర్థవంతం’విశాఖ సిటీ: ఒకప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్ల నుంచి వెలువడే బూడిద అంటే కేవలం వ్యర్థం, పర్యావరణానికి ముప్పు అనే అభిప్రాయం ఉండేది. కానీ సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్ ఆ భావనను పూర్తిగా మార్చేసింది. కేవలం విద్యుత్ ఉత్పత్తిలోనే కాకుండా, వ్యర్థాల నిర్వహణలోనూ సరికొత్త రికార్డులను నెలకొల్పింది. రెండు తెలుగు రాష్ట్రాలకు విద్యుత్ కాంతులు పంచుతున్న ఈ ప్లాంట్, పర్యావరణ పరిరక్షణలో దేశంలోని ఇతర ప్లాంట్లకు ఆదర్శంగా నిలుస్తోంది. బొగ్గును మండించి విద్యుత్ను ఉత్పత్తి చేసే క్రమంలో వెలువడే ‘ఫ్లై యాష్’ (బూడిద)ను వ్యర్థంగా పారేయకుండా, నిర్మాణ రంగానికి కీలక వనరుగా మలుస్తోంది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా 100 శాతం వినియోగాన్ని సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి నేటి వరకు ఒక్క గ్రాము బూడిదను కూడా వృథా కానివ్వకుండా, ప్రకృతిలో కలవకుండా జాగ్రత్త పడుతోంది. విద్యుత్ ఉత్పత్తిలో అజేయ శక్తి సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కేవలం పర్యావరణానికే పరిమితం కాకుండా, దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ గ్రిడ్కు వెన్నెముకలా నిలుస్తోంది. 2000 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్, నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో మార్చి నెలాఖరు నాటికి దాదాపు 11,136 మిలియన్ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసింది. అటు ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు సింహాద్రి విద్యుత్ ఎంతో కీలకంగా మారింది. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూనే వ్యర్థాల నిర్వహణలో మేటిగా నిలుస్తోంది. కొండంత బూడిద.. కోటి ప్రయోజనాలు విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియలో ఏడాదికి సగటున 2.8 మిలియన్ టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోంది. ఇంత భారీ పరిమాణాన్ని నిర్వహించడం ఏ ప్లాంట్కై నా సవాలే. గతంలో ఈ బూడిద వల్ల కాలుష్యం పెరిగి సమీప గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, సింహాద్రి యాజమాన్యం దీన్ని ఒక అవకాశంగా మార్చుకుంది. ఉత్పత్తి అయ్యే ప్రతి టన్ను బూడిదను వివిధ పరిశ్రమలకు సరఫరా చేస్తోంది. గత ఏడాది ఏకంగా 102 శాతం వినియోగాన్ని సాధించింది. అంటే, ప్రస్తుత ఉత్పత్తితో పాటు పాత నిల్వలను కూడా వినియోగంలోకి తెచ్చింది. కాలుష్యానికి అడ్డుకట్ట.. నిర్మాణానికి ఊతం బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి అయ్యే క్రమంలో భారీగా ఫ్లై యాష్ వెలువడుతుంది. దీనిని సరిగ్గా నిర్వహించకపోతే గాలిలో కలిసి ఊపిరితిత్తుల వ్యాధులకు కారణమవ్వడమే కాకుండా, భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తుంది. అయితే సింహాద్రి ప్లాంట్ ఈ సమస్యను ఒక అవకాశంగా మలిచింది. ఇక్కడ ఉత్పత్తి అయ్యే బూడిదను ఏమాత్రం వృథా కాకుండా సిమెంట్ పరిశ్రమలకు ముడిసరుకుగా సరఫరా అవుతోంది. పోర్ట్ల్యాండ్ పోజోలానా సిమెంట్ (పీపీసీ) తయారీలో ఈ ఫ్లై యాష్ అత్యంత కీలకం. విశాఖపట్నం, సమీప జిల్లాల్లోని సిమెంట్ కర్మాగారాలు ఫ్లై యాష్పైనే బూడిదపైనే ఆధారపడుతున్నాయి. దీనివల్ల సిమెంట్ నాణ్యత పెరగడమే కాకుండా, తయారీ వ్యయం కూడా తగ్గుతోంది. హరిత శక్తి వైపు అడుగులు శిలాజ ఇంధనాలతో విద్యుత్ ఉత్పత్తి చేస్తూనే, మరోవైపు పునరుత్పాదక ఇంధన వనరుల (గ్రీన్ ఎనర్జీ) వైపు సింహాద్రి అడుగులు వేస్తోంది. భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ (నీటిపై తేలియాడే సౌర విద్యుత్ కేంద్రం) ప్రాజెక్టుల్లో ఒకటైన 25 మెగావాట్ల ప్లాంట్ ద్వారా సుమారు 39.362 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్తును ఉత్పత్తి చేసింది. దీనివల్ల బొగ్గు వినియోగం తగ్గడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలు కూడా తగ్గుతున్నాయి. రిజర్వాయర్ నీటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేయడం వల్ల నీటి ఆవిరీభవనాన్ని కూడా తగ్గించగలుగుతున్నారు. ఇటువంటి వినూత్న ఆలోచనలే సింహాద్రిని ఇతర ప్లాంట్ల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి.ఒకప్పుడు పర్యావరణానికి ముప్పుగా భావించిన ఫ్లై యాష్ను.. సింహాద్రి ఎన్టీపీసీ ప్లాంట్ ఇప్పుడు ఆర్థిక, నిర్మాణ రంగాలకు బలమైన వనరుగా మార్చింది. విద్యుత్ ఉత్పత్తితో పాటు వ్యర్థాల నిర్వహణలోనూ సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తూ, దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. హైవేల నిర్మాణంలో కీలక పాత్ర రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల నిర్మాణంలో కూడా సింహాద్రి బూడిద వినియోగం పెరుగుతోంది. ముఖ్యంగా జాతీయ రహదారులు, ఫ్లైఓవర్ల నిర్మాణంలో మట్టికి ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపయోగిస్తున్నారు. రోడ్ల పునాదిలో బూడిదను వాడటం వల్ల అవి మరింత దృఢంగా మారుతున్నాయి. దీంతో మట్టి కోసం కొండలను తవ్వాల్సిన అవసరం తగ్గి, పర్యావరణ పరిరక్షణకు దోహదం అవుతోంది. అనకాపల్లి–ఆనందపురం హైవే వంటి కీలక ప్రాజెక్టుల్లో ఈ బూడిదను విస్తృతంగా వినియోగించారు. అలాగే ఇటుక తయారీ యూనిట్లకు తక్కువ ధరకే లేదా ఉచితంగా బూడిద అందించడం ద్వారా వేలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. లోతట్టు ప్రాంతాలను పూడ్చడానికి, గనుల పునరుద్ధరణ పనులకు కూడా ఈ బూడిదను వినియోగిస్తున్నారు. -
జాతీయ రహదారి పనులు గడువులోగా పూర్తి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్ నిశాంతి సాక్షి, పాడేరు: జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ,అభివృద్ధి పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ టి.నిశాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో ప్రాజెక్ట్ ఏపీడీ, కాంట్రాక్టర్లు, ఇంజినీరింగ్ ఆథారిటీ,సైట్ ఇంజినీర్లు, టీమ్ లీడర్లతో సోమవారం కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ రహదారి పనులు అత్యంత నాణ్యతగా ఉండాలని,ఎక్కడా నిబంధనలు ఉల్లంఘన జరగకూడదని చెప్పారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని,పనులు సమయంలో ప్రయాణికులు,స్థానిక ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.ఈ సమావేశంలో జేసీ తిరుమణి శ్రీపూజ,ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, ఇన్చార్జి ఆర్డీవో లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్ జిల్లాలో జలధార,జలహారతి పనులకు సంబంధించి 100రోజుల ప్రత్యేక యాక్షన్ప్లాన్ అమలుచేస్తున్నామని కలెక్టర్ టి.నిశాంతి తెలిపారు.సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఉపాధి హామీ పథకం నిధుల అనుసంధానంతో సాగునీటి వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు.చెరువులు, చెక్డ్యామ్ల మరమ్మతులతో పాటు కొత్తసాగునీటి చెరువుల నిర్మాణాలకు సాధ్యతను పరిశీలించాలన్నారు.ఈ సమావేశంలో జేసీ,ఐటీడీఏ పీవోలతో పాటు ఇన్చార్జి డీఆర్వో నీలకంఠరావు, జలవనరులశాఖ ఈఈ రాజేశ్వరరావు,ఇన్చార్జి డీఎఫ్వో ఉమామహేశ్వరి,జిల్లా వ్యవసాయ,ఉద్యానవనశాఖ అధికారులు నందు,బాలకర్ణ తదితరులు పాల్గొన్నారు. -
నలుగురు పేకాటరాయుళ్ల అరెస్టు
మునగపాక: మునగపాక శివారు పేకాడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్టు మునగపాక పోలీసులు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మునగపాక శివారు ప్రాంతంలో పేకాడుతున్నట్టు అందిన సమాచారం మేరకు సోమవారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో పేకాడుతున్న నలుగురు వ్యక్తులతో పాటు వారి నుంచి రూ.35,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి వారిని అరెస్టు చేశారు.రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి అనకాపల్లి: జీవీఎంసీ విలీనగ్రామమైన కొప్పాక రైల్వే బ్రిడ్జి వద్ద విజయవాడ–విశాఖ రైల్వే ట్రాక్పై సుమారుగా 45 నుంచి 55 సంవత్సరాల గల గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించినట్టు దువ్వాడ రైల్వే జీఆర్సీ ఎస్ఐ కె.టి.ఆర్.లక్ష్మి సోమవారం చెప్పారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించడం జరిగిందన్నారు. ఆ వ్యక్తి గుర్తుతెలియని రైలు నుంచి జారి పడిపోయి మృతిచెందినట్టు భావిస్తున్నామన్నారు. మృతుడి శరీరంపై స్కైబ్లూ కలర్ ఫుల్షర్ట్, నేవీ బ్లూ కలర్ ఫ్యాంట్ ఉన్నాయన్నారు. వివరాల కోసం సెల్ నంబర్.7382058996ను సంప్రదించాలన్నారు. -
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: యలమంచిలి రైల్వేస్టేషన్ సమీపంలో డౌన్లైన్లో గుర్తు తెలియని రైలు ఢీకొని ఆదివారం ఓ వ్యక్తి మృతి చెందినట్టు తుని ప్రభుత్వ రైల్వే పీఎస్ ఎస్ఐ జి.శ్రీనివాసరావు తెలిపారు.ఇక్కడ రైల్వే ట్రాక్ పక్కన నుజ్జునుజ్జైన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం గుర్తించిన స్థానిక రైల్వే సిబ్బంది తుని రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు.ఈ మేరకు అక్కడకు చేరుకున్న రైల్వే పోలీసులు పురుషుని మృతదేహంగా నిర్థారించారు. పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.మృతుని వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని, చామనఛాయ రంగులో ఉన్న మృతుడు నలుపు రంగు జీన్ ప్యాంటు,పసుపు రంగు హాఫ్ హ్యాండ్స్ చొక్కా,గోధుమ రంగు చెప్పులు ధరించి ఉన్నాడని, ఎరుపు రంగు మొలతాడుకు రెండు తాళం చెవులున్నాయని రైల్వే ఎస్ఐ తెలిపారు.మృతుని చిరునామా,ఇతర వివరాలు ప్రమాద స్థలంలో లభించలేదని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.మృతదేహాన్ని తుని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచారు. వివరాలు తెలిసిన వారు తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఫోన్ నెంబర్ 9247585731కు సంప్రదించవచ్చు. -
ఫైనాన్స్ వ్యాపారి అనుమానాస్పద మృతి
యలమంచిలి రూరల్: పట్టణంలోని అల్లూరి సీతారామరాజు కాలనీకి చెందిన ఫైనాన్స్ వ్యాపారి రాయి దుర్గా నాగ వెంకట సతీష్(42) ఆదివారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానిక మామిడి అపార్ట్మెంట్లో 303వ నంబరు ఫ్లాట్లో ఓ మహిళ వద్దకు తరచుగా వచ్చి వెళ్తున్న సతీష్ మృతిపై అనుమానం ఉన్నట్టు అతని భార్య రాయి భార్గవి పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టు పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపారు.దర్యాప్తులో భాగంగా యలమంచిలి సీఐ ధనుంజయరావు,పట్టణ ఎస్ఐ సావిత్రి,సిబ్బంది సతీష్ మృతి చెందిన ఫ్లాట్కు వెళ్లి పరిశీలించారు.క్లూస్ టీం బృందం సభ్యులు ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు.సతీష్ ఇటీవల పచ్చకామెర్ల బారిన పడి చికిత్స తీసుకున్నట్టు,బాగా మద్యం సేవించే అలవాటు ఉన్నట్టు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.ఆదివారం రాత్రి అస్వస్థతకు గురైనట్టు తెలుసుకున్న సతీష్ భార్య, కుటుంబసభ్యులు మామిడి అపార్టుమెంటుకు వెళ్లేసరికి హాలులో అపస్మారక స్థితిలో సతీష్ పడి ఉన్నట్టు గుర్తించారు. సతీష్ అనారోగ్యంతో మృతి చెందాడా లేక మరణానికి ఇతర కారణాలున్నాయా అన్నది తేలవలసి ఉంది. శవపంచనామా,పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్టు పోలీసులు తెలిపారు. -
హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం విఫలం
నాతవరం: ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలులో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అన్నారు. మండల కేంద్రం నాతవరంలో ఆదివారం జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన వారు, అనంతరం స్థానిక వైఎస్సార్సీపీ నాయకులతో సమావేశమై ఈ ప్రాంతంలో ప్రధాన సమస్యలతో పాటు చంద్రబాబు ప్రభుత్వం పాలనపై చర్చించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నాయకులకు ఎవరూ భయపడవద్దని మన వెంట మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే చంద్రబాబు ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని, మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబునాయుడు ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా అవినితికి కుట్ర చేసిందన్న విషయాన్ని మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలకు తెలియజేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు.సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి పనులను విస్మరించి, వైఎస్సార్సీపీ నాయకులను ఇబ్బంది పెట్టే పనిలో కూటమి నేతల ఉన్నారన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. చంద్ర బాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అన్యాయాలపై ప్రశ్నిస్తుంటే పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తున్నారని చెప్పారు. తప్పడు కేసులకు ఎవరూ భయపడవద్దన్నారు. మన ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు పొందిన లబ్ధిదారులు చంద్రబాబు ప్రభుత్వం తీరుపై బహిరంగంగా విమర్శిస్తున్నారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైఎస్సార్సీపీ తరఫున పోటీచేసే అభ్యర్థులను గెలిపించుకునేందుకు అంకిత భావంతో పని చేయాలన్నారు. ఈకార్యక్రమంలో బుచ్చెయ్యపేట, నాతవరం మండలా ల జెడ్పీటీసీ సభ్యులు దొండా రాంబాబు, కాపారపు అప్పలనర్స, వైఎస్సార్సీపీ జిల్లా కమిటీ సభ్యుడు కరక అప్పలరాజు, బీసీ సెల్ జిల్లా నాయకుడు ఇట్టంశెట్టి శ్రీను, మండలాధ్యక్షుడు లగుడు నాగేశ్వరరావు, యూత్ మండల అధ్యక్షుడు బండారు నా యుడు, పార్టీ మేధావులు సంఘం మండల శాఖ అధ్యక్షుడు పైలపోతురాజు, మహిళానాయకురాలు పోలుపర్తి రాధ, నాతవరం మాజీ సర్పంచ్ గొలగాని రాణి, హైస్కూల్ విద్యా కమిటీ మాజీ చైర్మన్ రెడ్డి వరహలబాబు, మిడతాన రాంప్రసాద్, చెక్కా జోగిరాజు, రంభా రాంబాబు, అపిరెడ్డి మహేష్, శెట్టి లచ్చబాబు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, మాజీ మంత్రి అమర్నాథ్ -
పారేలా..!
కన్నీళ్లేదారుణంగా జలాశయాలు కదలని పూడికతీత, కాలువల మరమ్మతుల పనులు● జంగిల్ క్లియరెన్స్ చేపట్టక అధ్వానంగా సాగునీటి కాలువలు ● దెబ్బతిన్న గేట్లు.. ధ్వంసమైన వాటర్ ఫ్లో రోప్లు ● లీకులతో వేలాది క్యూసెక్కుల నీరు వృథా ● అధ్వానంగా సాగునీటి కాలువలు ● ప్రాజెక్టులపై చంద్రబాబు సర్కారు తీవ్ర నిర్లక్ష్యం అనకాపల్లి జిల్లాలో ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టు(తాండవ), మూడు మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులు(రైవాడ, పెద్దేరు, కోనాం), 2,880 చిన్న నీటి పారుదల ప్రాజెక్టులు (చెరువులు,గ్రోయిన్లు, చెక్ డ్యాములు) ఉన్నాయి. వీటి పరిధిలో 3,05,993 ఎకరాల ఆయకట్టు ఉంది. తాండవ పరిధిలో 32,689 ఎకరాలు, మధ్య తరహా నీటి ప్రాజెక్టులు రైవాడ, పెద్దేరు, కోనాం పరిధిలో 42,725 ఎకరాలు, 2,880 చిన్న తరహా నీటిపారుదల ప్రాజెక్టుల కింద 2,30,579 ఎకరాల ఆయకట్టు ఉంది. సాక్షి, అనకాపల్లి: రానున్న ఖరీఫ్ సీజన్లోనైనా తమ భూముల్లో పంటలు బాగా పండాలన్న రైతుల ఆశలకు ప్రభుత్వ నిర్లక్ష్యం గండికొడుతోంది. జిల్లాలో జలాశయాల పరిస్థితి దారుణంగా ఉంది. దీంతో ఈ ఏడాది కూడా సాగు నీటి కష్టాలు తప్పేలా లేకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. జిల్లాలో ఉన్న ఒక మేజర్, మూడు మధ్యతరహా, 2,880 చిన్న నీటి పారుదల ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో దాదాపు 3,05,993 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. రిజర్వాయర్ల ఆధునికీకరణ, మరమ్మతులతో పాటు సాగు నీటి కాలువల్లో పూడికతీత పనుల్లో ఎక్కడా కదలిక లేదు. రానున్న ఖరీఫ్ సీజన్లోనైనా రిజర్వాయర్ల పరిధిలో ఉన్న ఆయకట్టు శివారు భూముల వరకు సాగు నీరు అందాలంటే..ఈ వేసవిలోనే రిజర్వాయర్ గేట్లకు, దెబ్బతిన్న చెక్డ్యామ్లకు మరమ్మతులు, సాగునీటి కాలువల్లో పూడిక తీత, జంగిల్ క్లియరెన్స్ పనులను పూర్తిచేయా లి. వేసవి ముగిసి వర్షా కాలం వచ్చిందంటే పనులు చేసే అవకాశం ఉండదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రెండు ఖరీఫ్ సీజన్లు ముగిశాయి. అయినా ప్రభుత్వం జలాశయాలపై కన్నెత్తికూడా చూడకపోవడంతో జిల్లాలో రిజర్వాయర్ల ఆధునికీకరణ, సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు జరగక గేట్లు, చెక్డ్యామ్లు దెబ్బతిని నిత్యం వందలాది క్యూసెక్కుల నీరు వృథాగా బయటకు పోతోంది. సాగు నీటి కాలువలు పిచ్చిమొక్కలతో నిండిపోయా యి. పూడికతీత పనులు చేపట్టకపోవడంతో నీరు విడుదల సమయంలో ఇబ్బందులు ఎదురవు తున్నాయి. శివారు భూములకు సాగునీరు సక్రమంగా అందడం లేదు. గత వైఎస్సార్సీపీ ప్రభు త్వం ఈ ప్రాజెక్టుల ఆధునికీకరణ, మరమ్మతులకు నిధులను మంజూరు చేసింది. కొన్నింటి పను లు కూడా ప్రారంభమయ్యాయి. మరికొన్నింటికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో కొన్నింటిని రద్దు చేయడమే కాకుండా..మరికొన్నింటిలో టెండర్లను కూడా మార్చివేసింది. నాతవరం మండలంలో తాండవ సాగునీ కాలువలో పూడిక తీతపనులు, ఆధునికీకరణ పనులను చేపట్టలేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టి 23 నెలలు పూర్తి కావస్తున్నా.. ప్రాజెక్టుల విషయంలో మొద్దు నిద్ర వీడలేదు. ఇప్పటికీ జలాశయాల పరిధిలో కాలువల్లో పూడికతీత, మరమ్మతు పనులకు నిధులు కేటాయించలేదు. గత ప్రభుత్వంలో మంజూరైన పనులను కొనసాగించకుండా ఈ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. గత ఏడాది వర్షాకాలంతో పాటు, నవంబరు, డిసెంబరు నెలల్లో కురిసిన వర్షాలకు ఈ జలశయాల్లో నీరు ఎక్కువగా చేరింది. అయితే, లీకుల కారణంగా చాలా వరకూ వృథాగా పోయింది. రానున్న ఖరీఫ్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు ప్రభుత్వం ఈ జలాశయాలపై దృష్టి పెట్టాలని రైతులు వేడుకుంటున్నారు. 3,05,993 ఎకరాల ఆయకట్టు -
చందనోత్సవానికి సింహగిరి సిద్ధం
సింహాచలం: సింహాచల పుణ్యక్షేత్రంలో అత్యంత ముఖ్యమైన చందనోత్సవ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. గత ఏడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని భక్తులకు తక్కువ నడకతో సులభతర దర్శనం కల్పించేలా ప్రణాళికలు రూపొందించారు. ఈసారి సామాన్య భక్తులు గతంలో వలె 6 కిలోమీటర్లు కాకుండా, కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే నడిచేలా మార్గాలను క్రమబద్ధీకరించారు. అదేవిధంగా రూ. 300, రూ. 1000, రూ. 1500 టిక్కెట్ల భక్తులకు కూడా నడక దూరాన్ని తగ్గించినట్టు ఈవో జల్లేపల్లి వెంకటరావు పేర్కొన్నారు. ఆదివారం సింహాచలం పరిపాలనా భవనంలో మీడియా సమావేశం నిర్వహించారు. టికెట్లు ..దర్శన వేళలు: దర్శనం టికెట్లను 70 శాతం ఆన్లైన్ ద్వారా, 30 శాతం ఎంపిక చేసిన యూనియన్ బ్యాంక్, ఎస్బీఐ శాఖల ద్వారా విక్రయిస్తున్నారు. భక్తులు దళారులను నమ్మి మోసపోవద్దని, కేవలం అధికారిక మార్గాల్లోనే టిక్కెట్లు పొందాలని ఈవో వెంకటరావు సూచించారు. టికెట్లపై కేటాయించిన టైమ్ స్లాట్ ప్రకారం వస్తేనే దర్శనానికి అనుమతి ఉంటుంది. 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు వంశపారపర్య ధర్మకర్త తొలి దర్శనం తర్వాత, ప్రభుత్వం, టీటీడీ తరపున పట్టువస్త్రాల సమర్పిస్తారని ఈవో తెలిపారు.అనంతరం ఉదయం 4 గంటల నుంచి వీవీఐపీలకు, ఆ తర్వాత సామాన్య భక్తులకు దర్శనాలు కల్పిస్తారు. రవాణా– పార్కింగ్ సదుపాయాలు భక్తుల తరలింపు కోసం 70 ఆర్టీసీ బస్సులను కేటాయించారు. ఈసారి కొండపైకి ప్రైవేటు ఏసీ బస్సులను అనుమతించడం లేదు. అందరూ ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాల్సి ఉంటుంది. కొండ దిగువన 5 పికప్ పాయింట్లు, 32 పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశారు. గోశాల నుంచి శ్రీనివాస కల్యాణ మండపం వరకు ఉచిత షటిల్ బస్సులు నడపనున్నారు. 19వ తేదీ సాయంత్రం 6 గంటల నుండే కొండపైకి ప్రైవేటు వాహనాల రాకపోకలను నిలిపివేస్తామని ఈవో వెంకటరావు తెలిపారు. భక్తుల సౌకర్యాలు– భద్రత ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 4 లక్షల వాటర్ బాటిళ్లు, లక్ష బిస్కెట్ ప్యాకెట్లు, పంపిణీ చేయనున్నారు. చిన్న పిల్లల కోసం గోరువెచ్చని పాలను అందుబాటులో ఉంచుతున్నారు. పారిశుధ్యం కోసం జీవీఎంసీ సహకారంతో భారీగా మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. భద్రత పరంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు పోలీస్ నిఘా పటిష్టంగా ఉంటుంది. భక్తులకు మార్గనిర్దేశం చేసేందుకు క్యూఆర్ కోడ్తో కూడిన రూట్ మ్యాప్ను ప్రవేశపెట్టారు. ప్రసాదం..ఇతర సేవలు దర్శనం ముగించుకున్న భక్తుల కోసం లక్షన్నర చిన్న లడ్డూలను ఉచితంగా పంపిణీ చేయనున్నారు. కొండ దిగువన అదనంగా మరో లక్ష లడ్డూలను విక్రయానికి ఉంచుతామని ఈవో వెంకటరావు పేర్కొన్నారు. పిఠాపురానికి చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా భక్తులందరికీ అన్నప్రసాద వితరణ జరుగుతుంది. భక్తులు సాధ్యమైనంత వరకు మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావద్దని, ప్రతి పార్కింగ్ వద్ద చెప్పులు భద్రపరుచుకునే ఉచిత సౌకర్యం ఉంటుందని ఈవో స్పష్టం చేశారు. 70 శాతం టికెట్లు ఆన్లైన్లోనే.. -
చెరువు స్థలంపై కబ్జాదారుల కన్ను
అచ్యుతాపురం రూరల్: మండల కేంద్రం అచ్యుతాపురంలోని ఇందిరమ్మ కాలనీకి ఆనుకుని ఉన్న చెరువు స్థలంపై కొందరు కబ్జాదారుల కన్నుపడింది. ఆక్రమించి ఇంటిని నిర్మించేందుకు ఆదివారం పొక్లెయిన్తో గోతులు తీస్తుండగా స్థానిక యువకులు అడ్డుకున్నారు. గతంలో ఇదే స్థలంలో తుప్పలు తొలగించినప్పుడు రెవెన్యూ అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఆదివారం సెలవు రోజు కావడంతో తమకు అడ్డే ఉండదని భావించిన ఆక్రమణదారులు భవనం నిర్మాణానికి 12 సెంట్ల స్థలంలో గోతులు తీశారు. గమనించిన స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఈ స్థలంలో ఉన్న హెచ్చరిక బోర్డును తొలగించి ఎందుకు గోతులు తీస్తున్నారని ప్రశ్నించారు. దీంతో పొక్లెయిన్ ఆపరేటర్ పనులు నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. చెరువును కాపాడాల్సిన అధికారులు పట్టించు కోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారని, గతంలో ఈ ప్రాంతాన్ని చదును చేసిన వారిపై చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదికాదని తెలిపారు. అధికారులు స్పందించి చెరువు ఆక్రమణకు గురికాకుండా చూడాలని కోరారు. అచ్యుతాపురం పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందడంతో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో అక్రమార్కులు గెడ్డలు, చెరువులు అన్న తారతమ్యం లేకుండా కనబడిన స్థలాలన్నింటినీ కబ్జా చేస్తున్నారు. స్థానిక కూటమి నాయకుల అండదండలతోనే చెరువు భూమి కబ్జాకు గురవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. -
విద్యార్థిని మృతిపై విచారణకు త్రిసభ్య కమిటీ
అచ్యుతాపురం రూరల్: అచ్యుతాపురం కేజీబీవీలో విద్యార్థిని నవ్య (12) శనివారం మృతిచెందిన ఘటనపై విచారణకు త్రిసభ్య కమిటీని నియమించారు. పాఠశాలను ఆదివారం కేజీబీవీ స్టేట్ సెక్రటరీ దేవానంద్ రెడ్డి, ఆర్జేడీ విజయ్ భాస్కర్, డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు సందర్శించి, పరిసరాలను పరిశీలించారు. విద్యార్థిని మృతిపై సిబ్బంది, విద్యార్థుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనపై విచారణకు కేజీబీవీ జీసీడీవో, జిల్లా ఇన్చార్జ్ జెన్నిమ, యలమంచిలి డిప్యూటీ డీఈవో అప్పారావు, సీనియర్ ఎంఈవో బి.రజినీదేవితో కూడిన కమిటీని నియమించారు. ఈ సందర్భంగా డీఈవో అప్పారావు నాయుడు కేజీబీవీ సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎటువంటి విష కీటకాలు పాఠశాల ఆవరణలోకి ప్రవేశించకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే వైద్య సేవలు అందేలాచూడాలని ఆదేశించారు. పాఠశాలలో పరిస్థితి చక్కబడే వరకూ విద్యార్థినులు ఇళ్లకు వెళ్లేందుకు సెలవులు ప్రకటించారు. రూ.10 లక్షల పరిహారం మృతి చెందిన విద్యార్థిని మైలపల్లి నవ్య కుటుంబానికి కలెక్టర్ విజయ్ కృష్ణన్ ఆదేశాల మేరకు ఆదివారం రూ.10లక్షలు చెక్కును అచ్యుతాపురం తహసీల్దార్ శ్రీను, సీఐ చంద్రశేఖర్ రావు అందజేసినట్లు ఎంఈవో కృష్ణ దేవరాయల్ స్థానిక విలేకరులకు తెలిపారు. పాఠశాల సిబ్బంది సస్పెన్షన్ ఈ ఘటనకు సంబంధించి కేజీబీవీ ప్రిన్సిపాల్ ఉమాదేవి, ఎన్ఎస్ టీచర్ సునీత, ఎస్.రూప(వృత్తివిద్య), వాచ్మెన్ సీహెచ్ చిలకమ్మ, ఏఎన్ఎం జి.ఈశ్వరిని శనివారం రాత్రి డీఈవో అప్పారావు నాయుడు సస్పెండ్ చేశారు. నవ్య అంత్యక్రియలు పూర్తి విశాఖ కేజీహెచ్లో పోస్టుమార్టం పూర్తిచేసిన అనంతరం ఆదివారం స్వగ్రామమైన పూడిమడక శివారు కడపాలెంలో అశ్రునయనాల మధ్య నవ్య అంత్యక్రియలు నిర్వహించారు. తోటి విద్యార్థులు, స్నేహితులు, పాఠశాల సిబ్బంది నివాళులర్పించారు. కేజీబీవీని సందర్శించిన కేజీబీవీ స్టేట్ సెక్రటరీ, ఆర్జేడీ, డీఈవో -
కళ్ల ముందే భార్య దుర్మరణం
నక్కపల్లి: జాతీయ రహదారిపై నక్కపల్లి సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వివాహిత దుర్మరణం చెందింది. ఆమె భర్త, పిల్లలకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హెటిరో కంపెనీలో పని చేస్తున్న సీతా సురేష్ తన భార్యా పిల్లలను తీసుకుని మోటారు సైకిల్పై అడ్డురోడ్డు నుంచి నక్కపల్లి ఆస్పత్రికి వస్తుండగా, సారిపల్లె పాలెం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో సురేష్ భార్య షారోన్ రేఖ (38) అక్కడికక్కడే మృతి చెందింది. సురేష్తోపాటు అతని ఇద్దరు పిల్లలు సవ్యశ్రీ, రోషన్లకు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు నక్కపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. తల్లి విగతజీవిగా పడి ఉండటాన్ని చూసి పిల్లలు బిక్కమొహం వేసి ఏమైందో తెలియక అమాయకంగా చూడటం స్థానికులను కంటతడి పెట్టించింది. కళ్లముందే కట్టుకున్న భార్య మృత్యువాత పడటాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు పిల్లలు అమ్మ ఏది నాన్న అంటే ఏం సమాధానం చెప్పాలంటూ సురేష్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. పొట్టకూటి కోసం విజయనగరం నుంచి ఇక్కడికి వచ్చి హెటిరోలో పనిచేస్తూ బతుకుతున్న సురేష్ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం ఛిన్నాభిన్నం చేసింది. మృతదేహం ముందు భర్త అభం శుభం తెలియని ఇద్దరు బిడ్డలు రోదిస్తున్న తీరు స్థానికులను కంట తడి పెట్టించింది. నాన్న అమ్మకి ఏమైంది అంటూ వారు తండ్రిని అడుగుతుంటే సమాధానం చెప్పలేక సురేష్ పిల్లలని పట్టుకుని బోరున విలపించాడు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు చెప్పారు. -
నూకాంబిక ఆలయానికి పోటెత్తిన భక్తులు
అనకాపల్లి: ఉత్తరాంధ్ర ఇలవేల్పు స్థానిక గవరపాలెం కొత్త అమావాస్య నెల జాతరలో భాగంగా నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు.ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కుటుంబ సమేతంగా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కొంతమంది భక్తులు అమ్మవారి ఆలయ సమీపంలో వంటలు చేసి, నైవెద్యంగా సమర్పించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆలయంలో క్యూలైన్లు భక్తులతో కిటకిటలాడాయి. పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు భక్తులకు ఉచితంగా ప్రసాదం, తాగునీరు, మజ్జిగ, చిన్నారులకు పాలు పంపిణీ చేశారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ చర్యలు తీసుకున్నారు. పట్టణ, ట్రాఫిక్ సీఐలు ప్రేమ్కుమార్, ఎం.వెంకటనారాయణలు ప్రత్యేక పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. -
కేజీబీవీ విద్యార్థిని మృతి
అనారోగ్యంతో అచ్యుతాపురం రూరల్: మండలకేంద్రం అచ్యుతాపురంలో గల కేజీబీవీలో ఏడో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని శనివారం మృతి చెందింది. తమ కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుంటే పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు సకాలంలో చికిత్స అందించకపోవడం వల్ల మరణించిందని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపిస్తూ పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. మృతురాలి కుటుంబసభ్యులు, అధికారులు తెలిపిన వివరాల మేరకు.. అచ్యుతాపురం మండలం పూడిమడక శివారు కడపాలెం గ్రామంలోని దోనోడుదిబ్బ వీధికి చెందిన మత్స్యకారులైన మైలపల్లి రాజు, ఎల్లమ్మ దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె సంతానం. కుమారుడు అచ్యుతాపురంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో ఐదో తరగతి చదువుతుండగా, కుమార్తె మైలపల్లి నవ్య (12) అచ్యుతాపురం కేజీబీవీలో ఏడో తరగతి చదువుతోంది. శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో నవ్య తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి, తనకు మెడభాగంలో చాలా నొప్పిగా ఉందని తెలిపింది. అయితే తగ్గిపోతుంది, కంగారు పడకండి అని ఆమే తల్లిదండ్రులకు ధైర్యం చెప్పింది. అనంతరం గంటలోపే ఉదయం 5.15 గంటలకు పాఠశాల సిబ్బంది ఫోన్ చేసి, మీ అమ్మాయి ఆరోగ్యం బాగోలేదు, మా దగ్గర వాహనం లేనందున మీరే వచ్చి, ఆస్పత్రికి తీసుకెళ్లండని తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. దీంతో గ్రామం నుంచి వచ్చిన తల్లిదండ్రులు నవ్యను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు విశాఖ కేజీహెచ్కు తరలించారు. కేజీహెచ్కు తరలించినప్పటికే బాలిక మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కటిక నేలపై నిద్ర... సక్రమంగా అందని పోషకాహారం అసౌకర్యాలు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా పాఠశాలలో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు పలువురు ఆరోపించారు. డార్మెటరీలో మంచాలు ఉన్నప్పటికీ విద్యార్థినులు కిందనే పడుకోవలసి వస్తోందని, అక్కడే కూరగాయలు, ఇతర సామగ్రి ఉండడంతో పాటు తరచూ విష కీటకాలు సంచరిస్తుండడంతో వారు తీవ్ర భయాందోళనల మధ్య చదువులు సాగించవలసి వస్తోందని తెలిసింది. పరిశుభ్రత, సరైన వసతి లేకపోవడంతో పాటు పోషకాహారాన్ని సక్రమంగా అందించడం లేదని గతంలో ఆరోపిస్తూ పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాల నుంచి తీసుకెళ్లిపోయారని సమాచారం. ఎవరైనా తల్లిదండ్రులు పాఠశాల నిర్వహణ సరిగా లేదని ప్రశ్నిస్తే వారిపై కేసులు పెడతామని సిబ్బంది, అధికారులు బెదిరిస్తున్నట్టు తెలిసింది గతంలో అనుమానాస్పదంగా విద్యార్థిని మృతి గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ పాఠశాలకు చెందిన ఓ విద్యార్థిని అనుమానాస్పదంగా ఉరి వేసుకుని మృతి చెందిన సంఘటన జరిగిందని స్థానికులు గుర్తు చేసుకున్నారు. భారీ ఎత్తున ఆందోళన తమ కుమార్తె మృతికి కేజీబీవీ సిబ్బందే కారణమని ఆరోపిస్తూ మృతురాలి కుటుంబసభ్యులు, బంధువులు పాఠశాల వద్ద శనివారం భారీ ఎత్తున ఆందోళన చేశారు. తమ కుమార్తెకు వైద్య సేవలందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించారని, గ్రామం నుంచి తామే వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్లవలసి వచ్చిందని వారు తెలిపారు. శుక్రవారం తన ఆరోగ్యం బాగోలేదని తమ కుమార్తె చెప్పిందన్నారు. ఆస్పత్రికి తీసుకెళతామని పంపాలని కోరితే పరీక్షలు జరుగుతున్నాయని, పంపడం కుదరదని సిబ్బంది చెప్పడంతో తండ్రి రాజు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోవలసి వచ్చిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారమే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే తమ కుమార్తె బతికేదని వారు రోదిస్తూ చెప్పారు. నవ్య మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవ్య మృతిపై అనుమానాలున్నాయని, ఎందువల్ల మృతి చెందిందో తెలియడం లేదని, ఉన్నతాధికారులు విచారణ జరపాలని, మృతురాలి కుటుంబానికి చెందిన మైలపల్లి జగదీశ్ తదితరులు డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పరవాడ డీఎస్పీ బి.మోహన్రావు, సీఐ చంద్రశేఖరరావు, ఎస్ఐ సుధాకరరావు పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థిని తల్లిదండ్రులకు సర్ది చెప్పారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతిరాలి తల్లి ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
గుడిలో బడి
కోనవానిపాలెం రామాలయంలో తరగతులు నిర్వహిస్తున్న దృశ్యంనక్కపల్లి/ఎస్రాయవరం : గత ప్రభుత్వం నాడు నేడు పథకం కింద మంజూరు చేసిన భవనాలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిచేయకపోవడంతో విద్యార్థులు పరాయి పంచన పాఠాలు నేర్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సరైన వసతి లేక రామాలయంలో మొక్కుబడిగా తరగతులు నిర్వహిన్నా రు. ఒకే వరండాలో మూడు తరగతుల పిల్లలను కూర్చోబెట్టి బోధన చేస్తున్నారు. జాతీయరహదారికి సమీపంలో ఎస్.రాయవరం మండలం కోనవానిపాలెంలో గల పాఠశాల దుస్థితి ఇది. 1నుంచి 5 తరగతుల వరకు 27 మంది విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. ఒక్కో గదితో రెండు చిన్నభవనాలు ఉన్నాయి. ఈభవనాలు శిథిలావస్థకు చేరడంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు నేడు ఫేజ్2 కింద రూ.40 లక్షలు మంజూరయ్యాయి. నాటి ఎమ్మెల్యే గొల్ల బాబూరావు 2022లో నూతన భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్లాబ్ వరకు భవనాన్ని నిర్మించారు. ఎన్నికల కోడ్ రావడంతో భవనాలను అసంపూర్తిగా వదిలేశారు.తర్వాత వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో ఈ భవనాలను పూర్తిచేయలేదు. దీంతో 1,2,5 తరగతులకు చెందిన 16 మంది విద్యార్థులను రామాలయంలోను 4వ తరగతికి చెందిన 11 మందిని మరో భవనంలోను కూర్చోబెట్టి బోధిస్తున్నారు.ఈ భవనం కూడా శిథిలావస్థకు చేరుకుంది. శ్లాబ్పెచ్చులు రాలిపోతుండడంతో విద్యార్థులు భయాందోళనలు చెందుతున్నారు. చెట్ల కింద బెంచీలు...ఆరు బయట వంటలు గత ప్రభుత్వంలో భవనాల కోసం సరఫరా చేసిన సిమెంట్, ఐరన్ పక్కనే ఉన్న షెడ్లలో నిర్లక్ష్యంగా వదిలేశారు. ఐరన్ తుప్పుపట్టడం సిమెంట్ రాయిలా మారిపోయింది. విద్యార్థుల కోసం సరఫరా చేసిన బెంచీలను చెట్ల కింద నిర్లక్ష్యంగా వదిలేశారు. వంట షెడ్డు లేకపోవడంతో విద్యార్థుల కోసం ఆరుబయట మధ్యాహ్న భోజనం తయారు చేస్తున్నారు. పాఠశాల భవనాలను పూర్తిచేయడానికి రూ.12 లక్షలు అవసరమవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేయకపోవడం వల్లే తమ పిల్లలు రామాలయంలో చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిదంటూ తల్లితండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత నివాసానికి కూత వేటు దూరంలోనే ఈ పాఠశాల ఉండటం గమనార్హం. గ్రామంలో ఎవరైనా చనిపోతే సెలవే గ్రామంలో ఎవరైనా చనిపోతే రామాలయంలో నిర్వహించే తరగతులకు సెలవు ప్రకటించాల్సిందే. దహన సంస్కారాల అనంతరం గ్రామస్థులు వచ్చి రామాలయంలో కొద్దిసేపు కూర్చొవడం ఆనవాయితీ. ఈ సమయంలో విద్యార్థులను బయటకు పంపడం లేదా ఇంటికి పంపేయడం చేస్తున్నారు. తమ పాఠశాల నూతన భవనాలను పూర్తి చేసి తమకు వసతి సదుపాయం కల్పించడంతోపాటు, నాణ్యమైన బోధన అందించాలంటూ చిన్నారులు కోరుతున్నారు గత్యంతరం లేకే .. ఉన్న రెండు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకటి పూర్తిగా పాడవడంతో గత్యంతరం లేక రామాలయంలో తరగతులు నిర్వహిస్తున్నాం. నిధుల కొరత కారణంగా భవనాలు అసంపూర్తిగా నిలిచిపోయాయి. త్వరగా పూర్తిచేస్తే ఈ ఇబ్బందులు తొలగిపోతాయి. ఉన్నతాధికారులకు నివేదిక పంపించడం జరిగింది. – మయూరి, హెచ్ఎం, కోనవానిపాలెం పాఠశాల శిథిలావస్థకు చేరిన భవనాలు... పెచ్చులూడుతున్న శ్లాబు.. రెండు ఇరుకు గదులు...ఇదీ ఎస్.రాయవరం మండలం కోనివాని పాలెం పాఠశాల దుస్థితి. వీటిలో బితుకుబితుకుమంటూ ఆ పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలారోజులు కాలం వెళ్లదీశారు. గత్యంతరం లేక.. శిథిలమైన భవనంలో తరగతులు నిర్వహించలేక సమీపంలోని గుడినే బడిగా చేసుకున్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు, మరుగుదొడ్లు కూడా లేవు. వంటశాల లేక మధ్యాహ్న భోజనాన్ని ఆరుబయట తయారు చేయాల్సి వస్తోంది. అసంపూర్తిగా ఉన్న పాఠశాల భవనం గురించి చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. -
అయ్యన్నా... ఇది తగునా !
సాక్షి, అనకాపల్లి: సొంత తమ్ముడు సన్యాసిపాత్రుడిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడి వేధింపులు రోజురోజుకు మితిమీరుతుండడంతో రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది.కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లవుతున్నా అయ్యన్న తీరు మారకపోవడంతో పలువురు ఆయన తీరును ఆక్షేపిస్తున్నారు. తాజాగా తన సొంత తోటలో సన్యాసిపాత్రుడు చెట్లు నరికిస్తుంటే పోలీసులతో అడ్డు కోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. చంద్రబాబు అధికారం చేపట్టిన నాటి నుంచి సన్యాసిపాత్రుడు వ్యాపారాలను అడ్డుకోవడం, ఆయనపై అక్రమ కేసులు బనాయించడం.. ఇలా ఒకటి కాదు.. ఏదో ఒక విషయంలో ఇబ్బందులు పెడుతూనే ఉన్నారు. అందులో భాగంగా శనివారం తన సొంత భూమిలో పనులు చేసుకుంటుంటే అన్యాయంగా పోలీసులు అడ్డుకున్నారంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. సన్యాసిపాత్రుడు సొంత భూమిలో తోట నరికే పనులు చేసుకుంటుంటే రూరల్ సీఐ రేవతమ్మ పంపించారంటూ ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు వచ్చి.. స్పీకర్ అయ్యన్నపాత్రుడు తోటలో మీరు ఎలా నరుకుతారు అంటూ అడిగారు. రికార్డులు ఉన్నాయా...? అంటూ హైడ్రామాకు తెరతీశారు. ట్రాక్టర్లను స్టేషన్లకు తరలించారు. ఎందుకు అడ్డుకుంటున్నారంటూ సన్యాసిపాత్రుడు ప్రశ్నించినా సీఐ రేవతమ్మ, డీఎస్పీ శ్రీనివాసరావు నుంచి సమాధానమే లేదు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పోలీసుల హైడ్రామా నడిచింది. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ నేతలు పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ విభాగం, మాజీ కౌన్సిలర్ మాకిరెడ్డి బుల్లిదొర, వైఎస్సార్సీపీ నాయకులు వచ్చి పోలీసులు ప్రశ్నించగా..సమాధానం చెప్పకపోగా సీఐ రేవతమ్మ, ఎస్ఐ రాజారావు నెమ్మదిగా జారుకున్నారు. ట్రాక్టర్లు పోలీసుస్టేషన్ వద్దనే ఉన్నాయి. ఫిర్యాదు ఎవరు చేశారు.? అని ప్రశ్నించగా ఎటువంటి సమాధానం లేదంటూ న్యాయవాది వెల్లడించారు. మా భూమిలో తోట నరుకుతుంటే ఎందుకు అడ్డగిస్తున్నారు పోలీసులు స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు మండిపడ్డారు. గబ్బాడ పంచాయతీలో తమకు వారసత్వంగా సంక్రమించిన భూమిలో తోట నరికే పనులు చేపట్టామన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో సహా నలుగురు అన్నదమ్ములకు ఒక్కొక్కరికీ 1.40 ఎకరాల భూమి దాఖలు పడిందన్నారు. అందుకు సంబంధించి 2023లో రీ సర్వే జరిగి, పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చినట్టు చెప్పారు. వాటి ఆధారంగానే అయ్యన్నపాత్రుడు వాటాకు వెళ్లిన భూమిని వదిలేసి, మిగతా ముగ్గురం కలిసి తోట నరికే పనులు చేపట్టామన్నారు. ఈ సమయంలో రూరల్ సీఐ రేవతమ్మ పంపించారంటూ కానిస్టేబుళ్లు వచ్చి ఆ భూమిలో ఉన్న ట్రాక్టర్లను స్టేషన్కు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా భూమిలో తోట నరుకుతుంటే ఎందుకు అడ్డుకు న్నారని సీఐని అడిగితే సమాధానం లేదన్నారు. ఇదే విషయాన్ని డీఎస్పీ శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు ఎవరు చేశారని అడిగినా పోలీసులు స్పందించటం లేదన్నారు. సుమారు ఐదు గంటలకు పైగా తాను, తన కుమారుడు వరుణ్ స్టేషన్ దగ్గరే ఉన్నప్పటికీ కనీసం సమాధానం చెప్పేవారు స్టేషన్లో లేకపోవడం దారుణమన్నారు. అనంతరం మీడియాను తీసుకుని తన భూమిలోకి వెళ్లి సరిహద్దులను స్పష్టంగా చూపించారు. వైఎస్సార్సీపీలో ఉన్నామనే అక్కస్సుతోనే స్పీకర్ ఆదేశాలతో పోలీసులను అడ్డం పెట్టుకుని తమను స్పీకర్ వేదిస్తున్నారని ఆవేదన చెందారు. -
సమష్టి కృషితో విజయవంతం చేద్దాం
మహారాణిపేట(విశాఖ): శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిర్వహించాలని రాష్ట్ర మంత్రులు అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత కలిసి ఈ నెల 20న జరగనున్న చందనోత్సవ ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఉత్సవాల నిర్వహణకు జిల్లా కలెక్టర్ను స్పెషల్ ఆఫీసర్గా, దేవదాయ శాఖ కమిషనర్ను ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్గా నియమించినట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. వీఐపీలు దర్శనానికి ఉదయం 5 గంటల వరకు సమయం కేటాయించగా, అనంతరం సామాన్య భక్తులకు ఉచిత దర్శనం, చెల్లింపు దర్శనాలు సజావుగా జరిగేలా చూడాలని సూచించారు. అంతరాలయ దర్శనం విషయంలో నిబంధనలు కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇన్చార్జి మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ దర్శనానికి దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉందని, వారందరికీ సజావుగా దర్శనాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ఘాట్ రోడ్లు, క్యూలైన్ల వద్ద గందరగోళం లేకుండా పోలీసులు ప్రత్యేక వ్యూహంతో వ్యవహరించాలన్నారు. సమావేశంలో దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్ లాల్, కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, దేవస్థానం ఈవో వెంకటరావు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. చందనోత్సవం ఏర్పాట్ల పరిశీలన సింహాచలం: సింహగిరిపై చందనోత్సవం ఏర్పాట్లను రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి శనివారం పరిశీలించారు. ఆలయ నీలాద్రిగుమ్మం వద్ద ఏర్పాటుచేసిన ర్యాంపులపై నిలబడి భక్తులకు స్వామివారి మూలవిరాట్ సరిగ్గా కనిపిస్తున్నారా...లేదా.. అని పరిశీలించారు. నీలాద్రిగుమ్మం వద్ద నుంచే భక్తులందరికీ లఘు దర్శనం ఇస్తుండటంతో భక్తులు ఏయే లైన్లలో వెళ్తారో ఆరా తీశారు. ఈ సందర్భంగా స్వామిని మంత్రులు దర్శించుకున్నారు. ఎమ్మెల్యేలు విష్ణుకుమార్రాజు, అదితి గజపతిరాజు, దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్లాల్, కమిషనర్ రామచంద్రమోహన్, కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తదితరులు ఉన్నారు. పంచగ్రామాల భూసమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుని ఆ వివరాలను హైకోర్టు ముందు ఉంచామని, మంత్రి ఆనం తెలిపారు. చందనోత్సవ ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష -
నూకాంబిక ఆలయ హుండీ ఆదాయం రూ.80.17 లక్షలు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ హుండీ ఆదాయాన్ని శనివారం లెక్కించారు. గత నెల 11 నుంచి ఈనెల 10వ తేదీ వరకు రూ.80,17,580 ఆదాయం రాగా, బంగారం 9 గ్రాముల 100 మిల్లీ గ్రాములు, వెండి 710 గ్రాములు లభించినట్టు దేవదాయశాఖ ఉప కమిషనర్ ఎన్.సుజాత చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి నూతన ఆలయానికి భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతోందన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ కె.ఎల్.సుధారాణి, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్, చైర్మన్ పీలా నాగశ్రీను, దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ వంసతరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. -
ఏయూ ఆచార్యులకు ఆహ్వానం
ఢిల్లీలో అంబేడ్కర్ జయంతి వేడుకలు మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆచార్యులకు ఢిల్లీ నుంచి ఆహ్వానం అందింది. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 14న దేశ రాజధాని ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించనున్న డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు వీరికి అవకాశం లభించింది. ఈ సందర్భంగా ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ శనివారం తన కార్యాలయంలో వర్సిటీ తరపున ఎంపికై న ఆచార్య పేటేటి ప్రేమానందం, ఆచార్య వి.సిద్ధయ్య, ఆచార్య కె.రమేష్ బాబు, ఆచార్య ఆర్.మధుసూదన్, డాక్టర్ పి.వెంకట్రావులను అభినందించారు. వీరు ఏయూ ప్రతినిధులుగా ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. -
సెజ్ నిర్వాసిత పునరావాస కాలనీల్లో కార్డెన్ సెర్చ్
సీజ్ చేసిన వాహనాలతో పోలీసు సిబ్బంది అచ్యుతాపురం రూరల్ : ప్రత్యేక ఆర్థిక మండలి పునరావాస కాలనీలో పరవాడ డీఎస్పీ బి.మోహన్రావు ఆధ్వర్యంలో శనివారం పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. బృందాలుగా విడిపోయి ఇళ్లను సోదా చేసి, వాహనాలను తనిఖీ చేశారు. విద్యా సంస్థలకు సమీపంలోని షాపుల్లో విక్రయిస్తున్న గుట్కాలు, ఖైనీలను స్వాధీనం చేసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు. రికార్డులు లేని 16 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. కార్డెన్ సెర్చ్లో అచ్యుతాపురం సీఐ చంద్రశేఖరరావు, యలమంచిలి సీఐ ధనుంజయ రావు, ఎస్ఐలు సుధాకరరా వు, వెంకటరావు, రామకృష్ణ, మహాలక్ష్మి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
నిందితులకు శిక్ష పడటంలో పీపీలదే కీలక పాత్ర
బీచ్రోడ్డు: వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణా వంటి సామాజిక అన్యాయాలను సమూలంగా నిర్మూలించడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పాత్ర అత్యంత కీలకమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శనివారం నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ల సామర్థ్య పెంపుదల వర్క్షాప్లో ఆమె మాట్లాడారు. పోలీసు శాఖ చార్జిషీటు దాఖలు చేసిన దశ నుంచే ప్రాసిక్యూటర్లు చురుకై న పాత్ర పోషిస్తేనే నిందితులకు కఠిన శిక్షలు పడతాయని పేర్కొన్నారు. నేరం జరిగిన వెంటనే గోల్డెన్ అవర్లో ఫోరెన్సిక్ సాక్ష్యాధారాలను సేకరించడం ద్వారా కన్విక్షన్ రేటు పెరుగుతుందని వివరించారు. ఆపరేషన్ ట్రేస్లో భాగంగా 900 మంది పిల్లలను, వివిధ దేశాల్లో చిక్కుకున్న మరో 180 మందిని రక్షించామని తెలిపారు. ఇదే దృఢసంకల్పంతో పోలీసులు, ప్రాసిక్యూటర్లు సమన్వయంతో పని చేయాలని సూచించారు. దర్యాప్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతికత వినియోగాన్ని పెంచాలని, దీనిపై పోలీసు శాఖలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. వెట్టి చాకిరీ నుంచి విముక్తి పొందిన బాధితులకు కేంద్ర ప్రభుత్వం రూ.30,000 ఆర్థిక సహాయం అందించడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి మాట్లాడుతూ.. కేసు నమోదు నుంచి విచారణ ముగిసే వరకు బాధితుల హక్కులను కాపాడటంలో పోలీసులు, ప్రాసిక్యూషన్, న్యాయవ్యవస్థ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. నేరస్తులకు కఠిన శిక్షలు పడేలా చూడటంతో పాటు, బాధితుల పునరావాసంపై మానవీయ దృక్పథంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వివిధ కేసుల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పబ్లిక్ ప్రాసిక్యూటర్లను మంత్రి అనిత సత్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రాసిక్యూషన్ డైరెక్టర్ రామకోటేశ్వరరావు, ఐజేఎం స్టేట్ ప్రోగ్రాం డైరెక్టర్ క్లెమెంట్ డేవిడ్, వివిధ జిల్లాల పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. వర్క్షాప్లో మంత్రి వంగలపూడి అనిత -
పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్టు
వ్యానులో రవాణా అవుతున్న ఎద్దులు కోటవురట్ల: పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాలివి.. చౌడువాడ సమీపంలో పోలీసులు శనివారం వాహనాలు తనిఖీ చేశారు. ఆ సమయంలో వ్యానులో పశువులను రవాణా చేస్తుండగా పట్టుకున్నారు. వీటిని పాడేరు నుంచి తుని మార్కెట్కు తరలిస్తున్నట్టు గుర్తించారు. రవాణాకు సంబంధించి ఎటువంటి అనుమతులు లేవని, నిబంధనలకు వ్యతిరేకంగా చిన్న వ్యానులో 11 పశువులను తరలిస్తుండడంతో స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలు
గాయపడిన యువకుడు నాగులపల్లి వెంకట మణికుమార్ రావికమతం: మండల కేంద్రం రావికమతంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చోడవరం గ్రామం చందక వీధికి చెందిన నాగులపల్లి వెంకట మణికుమార్ (19) కొమిర గ్రామంలో జరిగిన వివాహానికి హాజరై తిరిగి స్వగ్రామం చోడవరానికి స్కూటీపై వెళుతుండగా గుమ్మాలపాడు దాటిన తరువాత పెట్రోల్ బంక్ సమీపంలో వాహనం అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో మణికుమార్ గాయపడ్డాడు. గమనించిన స్థానికులు స్థానిక పీహెచ్సీకి తరలించారు. -
దాడిలో ఇద్దరికి గాయాలు
రావికమతం: భార్య బంధువులపై భర్త కుటుంబ సభ్యులు దాడి చేయడంతో ఇద్దరు గాయపడ్డారు.దీనిపై కొత్తకోట పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.రావికమతం మండలం దొండపూడి ఎస్సీ కాలనీలో దండా బికేష్, అతని భార్య తరుచూ గొడవలు పడుతుండటంతో బికేష్ అత్త సురారపు ఈశ్వరమ్మ గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేసింది. దీంతో వారు ఇద్దరికీ సర్దిచెప్పారు. అయితేభార్యకు మద్దతుగా వచ్చిన బంధువులు దండా దేవుడు,దేముడుమ్మపై బికేష్ అతని కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి దాడి చేసి గాయపరిచారని, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కొత్తకోట ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. -
దైవ దర్శనానికి వెళ్తూ అనంతలోకాలకు...
ఎస్.రాయవరం: పెనుగొల్లు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, ఆమె భర్త, కుమార్తె గాయాలతో బయటపడ్డారు. ఎస్.రాయవరం పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గాజువాకకు చెందిన పి.సుజాత(37) భర్త గణేష్, కుమార్తెతో కలిసి బైక్పై ఉపమాక వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం బయలుదేరారు. పెనుగొల్లు జంక్షన్ వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. సుజాత లారీ టైరు కింద పడడంతో అక్కడిక్కడే మృతిచెందింది. గణేష్, కుమార్తె స్వల్పగాయాలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసు వార్షిక క్రీడోత్సవాలకు శ్రీకారం
అల్లిపురం: సిటీ పోలీసు విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ శనివారం ఆర్మడ్ రిజర్వ్ మైదానంలో ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి హాజరై శాంతి కపోతాలను గాలిలోకి ఎగురవేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసు సిబ్బంది శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండడం ఎంతో అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల అవగాహన కలిగి ఫిట్నెస్ను జీవన విధానంలో భాగం చేసుకోవాలని సూచించారు. ఈ వార్షిక స్పోర్ట్స్ మీట్ ఈ నెల 14వ తేదీ వరకు జరుగుతుంది. ఈ పోటీల్లో వెస్ట్, సౌత్, నార్త్, హార్బర్, ఈస్ట్, ద్వారకా సబ్–డివిజన్లు, ట్రాఫిక్ డివిజన్, స్పెషల్ వింగ్ టీమ్ (స్పెషల్ బ్రాంచ్, సైబర్ క్రైమ్, టాస్క్ ఫోర్స్, కంట్రోల్ రూమ్, వుమెన్ పోలీస్ స్టేషన్, సీసీఆర్బీ), క్రైమ్ సబ్–డివిజన్, సిటీ ఆర్ముడ్ రిజర్వ్ తదితర మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. కార్యక్రమం ప్రారంభంలో కమిషనర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి పురుషుల 800 మీటర్ల పరుగు పోటీకి శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో డీసీపీ–1 (లా అండ్ ఆర్డర్), డీసీపీ–2 (లా అండ్ ఆర్డర్), డీసీపీ (క్రైమ్స్), ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు, ఆర్ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాజకీయ కక్షతోనే అమర్పై కేసులు
నక్కపల్లి : విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ మంజూరు చేయాలని ఆమరణ నిరాహార దీక్ష చేసిన మాజీ మంత్రి గుడివాడ అమర్పై గత తెలుగుదేశం ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కేసులు బనాయించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆరోపించారు. శ శనివారం ఆయన చందనాడలో విలేకర్లతో మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ తీసుకు రావాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని అమర్ ఉత్తరాంధ్ర ప్రజల తరపున పోరాటం చేసారన్నారు. వెనుకబడిన ఉత్తరాంద్రకు న్యాయం చేయాలని ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఆందోళన చేసిన అమర్పై అప్పటి తెలుగు దేశం ప్రభుత్వం కక్షసాదింపుచర్యలకు పాల్పడిందన్నారు. శాంతియుతంగా ఆందోళన చేసిన అమర్పై అక్రమ కేసులు బనాయించి దీక్షను భగ్నం చేయించిందన్నారు. ఉత్తరాంధ్రపై టీడీపీ ప్రభుత్వానికి చిన్నచూపు ఉందన్నారు. రైల్వేజోన్ వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశ్యంతో ఆందోళన చేసారన్నారు. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైల్వే జోన్ సాధించకపోగా జోన్ సాధన కోసం పోరాటం చేసిన నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైలు శిక్షపడేలా చేసిందన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం చేసే పోరాటాలను రాజకీయ కోణంలో చూసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడిందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు వివపడకుండా నొక్కేయాలన్న కుట్రలు జరుగుతున్నాయన్నారు. తమను వ్యతిరేకించిన వారిని కేసులు పెట్టి వేధించడం చంద్రబాబు ప్రభుత్వానికి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నారన్నారు. ఈ విధానం మార్చుకోవాలన్నారు. కోర్టులంటే ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి గౌరవం ఉందన్నారు. తీర్పును శిరసావహిస్తామని న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, వైస్ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పొడగట్ల పాపారావు, నియోజకవర్గ ప్రచార విభాగం అధ్యక్షుడు కొప్పిశెట్టి హరిబాబు, చీడిక రిజర్వాయర్ నీటి సంఘం ఉపాధ్యక్షుడు కరణం ఈశ్వరరావు, పార్టీ కార్యదర్శి సాదిరెడ్డి శ్రీను, మాజీ సర్పంచ్ తళ్ల భార్గవ్, నాయకులు పోతంశెట్టి బాబ్జి, మైలపల్లి సూరిబాబు ఉన్నారు. -
నక్కపల్లి ఎంపీడీవోపై బదిలీ వేటు
నక్కపల్లి: అటెండర్లతో కారు తుడిపించడం, కార్యాలయ సిబ్బంది,ప్రజాప్రతినిధుల పట్ల నిర్లక్ష్యధోరణితో వ్యవహరించడం పాలనావ్యవహారాల్లో బంధువుల జోక్యం మితిమీరడం తదితర కారణాల వల్ల నక్కపల్లి ఎంపీడీవో బి.చైతన్యపై బదిలీవేటు పడింది.ఈమె వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు రావడంతో బదిలీచేయించాలని టీడీపీలో ఒకవర్గం, నిలుపుదల చేయించాలని మరో వర్గం తీవ్రప్రయత్నాలు చేశాయి. చివరకు మంత్రివద్ద పలుకుబడి గల ఒక కీలక నేత తన పంతం నెగ్గించుకుని ఈమైపె బదిలీ వేటు వేయించారన్న ప్రచారం జరుగుతోంది. ఎంపీడీవో వ్యవహార శైలిపై మండలపరిషత్లో గాడితప్పుతున్న పాలన అనే శీర్షికన జనవరి13వ తేదీన‘సాక్షి’లో కథనం వెలువడింది. దీనిపై స్పందించిన అధికారులు ఎంపీడీవోకు షోకాజ్నోటీసు కూడా ఇచ్చారు. చైతన్య నాలుగునెలల క్రితమే ఇక్కడ ఎంపీడీవోగా విధుల్లో చేరారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె ఒంటెద్దుపోకడలకు పాల్పడుతున్నారు. కార్యాలయంలో పనిచేసే సహచర ఉద్యోగులను చులకనగా చూడటం,నాల్గోతరగతి సిబ్బందితో వెట్టిచాకిరీ చేయించడం వంటి విమర్శలు ఎదుర్కొన్నారు. కార్యాలయానికి వచ్చే ప్రజాప్రతినిధుల పట్ల అమర్యాదగా వ్యవహరించడం వంటి ఆరోపణలను ఎదుర్కొన్నారు. దళిత వర్గానికి చెందిన అటెండర్తో కారు తుడిపించిన ఘటన వివాదానికి దారితీసింది. అటెండర్ ఎంపీడీవో కారు తుడుస్తున్న వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిపై వేంపాడు ఎంపీటీసీ సభ్యుడు కుంచా మధు... హోంమంత్రి అనితకు, జెడ్పీ సీఈవోకు ఫిర్యాదు చేశారు. అటెండర్లతో కారు తుడిపించడం అనేది జాబ్చార్ట్లో ఉందని ఎంపీడీవో సమర్థించుకున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసి ఎంపీడీవోకు షోకాజ్నోటీసు ఇచ్చారు. బోరు మెకానిక్ల జీతాలు సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేశారు. ఎంపీడీవో సమీప బంధువు కార్యాలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం, పంచాయతీల తనిఖీల సందర్భంలో ఇతను కూడా పాల్గొనడం వంటి ఆరోపణలను అధికారపార్టీ నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. గురువారం ఈమెను జిల్లాపరిషత్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.తన బదిలీని నిలుపుదల చేయించుకునేందుకు ఎంపీడీవో చైతన్య టీడీపీలో ఒకవర్గం ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేశారు.అయితే నియోజకవర్గ పార్టీలో కీలక పాత్రపోషిస్తున్న ఒక నేత ఈమెను ఎట్టిపరిస్థితుల్లో ఇక్కడనుంచి పంపించేయాలన్న పట్టుదలతో పావులు కదిపి బదిలిచేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీడీవో బదిలీ ద్వారా సదరు నేత మంత్రి వద్ద తన పలుకు బడిని మరోసారి నిరూపించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఈమె స్థానంలో డిప్యూటీ ఎంపీడీవో చలపతిరావును ఇన్చార్జ్గా నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టారు. పాయకరావుపేట ఎంపీడీవోను కూడా... పాయకరావుపేట ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన విజయలక్ష్మిని సైతం అధికారులు బదిలీచేశారు. ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే ఆమెను అరకులోయకు బదిలీచేస్తూ జిల్లా అధికారులు ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశమైంది.ఈ మె పనితీరు పట్ల కలెక్టర్ తీవ్ర అసంతృప్తితో ఉండడమే కారణంగా తెలుస్తోంది. నక్కపల్లి తహసీల్దార్దీ అదే పరిస్థితి.. నక్కపల్లి తహసీల్దార్గా నెలరోజుల క్రితం నియమితులైన శ్రీనును అధికారులు బదిలీ చేశారు. ఇతని స్థానంలో సబ్బవరం తహసీల్దార్ గా పనిచేస్తున్న చిన్నికృష్ణను నియమించారు. నెలరోజుల వ్యవధిలో తహసీల్దార్ను బదిలీ చేయడం పై సర్వత్రా చర్చనీయాంశమైంది. -
పెరిగిన నూకాంబిక ఆలయ ఆదాయం
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారి ఆలయ ఆదాయం 25శాతం పెరిగినట్టు దేవదాయశాఖ రాష్ట్ర కమిషనర్ కె.రామచంద్రమోహన్ తెలిపారు. రామచంద్ర మోహన్ దంపతులు కుటుంబ సమేతంగా శుక్రవారం అమ్మవారిని దర్శి ంచుకుని ప్రత్యేక పూజలు చేసి, పట్టు వస్త్రాలు సమసర్పించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ నూతన ఆలయంలో భక్తుల తాకిడిపెరుగుతోందని, వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఆదాయం తక్కువగా ఉన్న 165 దేవాలయాలను రూ.180 కోట్ల సీజీఎస్ నిధులతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో దేవదాయశాఖ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు ఆయన చెప్పారు. అంతకు ముందు రామచంద్రమోన్ దంపతులను ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ దుశ్శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ జిల్లా కమిషనర్ శోభారాణి, ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఆలయ సహాయ కమిషనర్ యాళ్ల శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అడ్డదారికి పోలీసుల అడ్డుకట్ట
● మూడు లారీలపై కేసులు నమోదుపోలీసులు పట్టుకున్న లారీలు నక్కపల్లి: పరిమితికి మించి లోడుతో జాతీయరహదారిపై రాకపోకలు సాగిస్తూ టోల్ఫీజు ఎగ్గొట్టేందుకు అడ్డదారిలో ప్రయాణిస్తున్న మూడు లారీలకు నక్కపల్లి పోలీసులు అడ్డుకట్ట వేశారు. టోల్ఫీజు ఎగ్గొట్టేందుకు ఉపమాక, వేంపాడు, అమలాపురం, చందనాడ, కాగిత మీదుగా జాతీయరహదారి చేరుకుని అక్కడనుంచి తునివైపు వెళుతున్న వాహనాలను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. టోల్ఫీజు ఎగ్గొట్టడం కోసం ఈ వాహనాలు అడ్డదారిలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు.ఈవాహనాల్లో చిప్స్,ఫ్లైయాష్ తదితర లోడు ఉందని ఈ మూడు లారీలను పట్టుకుని కేసులు నమోదు చేశామని అపరాధరుసుం విధించేందుకు రవాణాశాఖ అధికారులకు సిఫారసరు చేశామని ఎస్ఐ సన్నిబాబు తెలిపారు. -
వడదెబ్బపై అప్రమత్తం
మహారాణిపేట: జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతుండడంతో వడదెబ్బ బారిన పడే అవకాశం ఉన్న దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. కేజీహెచ్తో పాటు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సిద్ధం చేసినట్లు అధికారులు వెల్లడించారు. కేజీహెచ్లో ప్రత్యేకంగా 6 పడకల వార్డు సిద్ధం చేశారు. నోడల్ ఆఫీసర్ డాక్టర్ విజయకుమార్ పర్యవేక్షణలో మందులు, ఫ్లూయిడ్స్ అందుబాటులో ఉంచారు. పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో రెండు ప్రత్యేక పడకలు, సరిపడా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచినట్లు డీఎంహెచ్వో డాక్టర్ పి.జగదీశ్వరరావు తెలిపారు. అత్యవసర చికిత్స కోసం 108 అంబులెన్స్లలో ఐస్ ప్యాక్లను సిద్ధం చేశారు. వడదెబ్బ లక్షణాలు గుర్తించండి ఇలా.. శరీర ఉష్ణోగ్రత అకస్మాత్తుగా పెరగడం, చెమట పట్టకపోవడం, వణుకు, మగత నిద్ర, కలవరింతలు లేదా ఫిట్స్ రావడం వడదెబ్బ ప్రధాన లక్షణాలు. ఇలాంటి పరిస్థితిలో రోగిని వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి, తడిగుడ్డతో శరీరాన్ని తుడవాలి. -
మారిటైం బోర్డు అవుట్
విశాఖపై కక్షసాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : మాటల్లో అమృతం.. చేతల్లో వంచన అంటే ఇదే.. విశాఖను రాష్ట్రానికి ’ఆర్థిక రాజధాని’గా తీర్చిదిద్దుతామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు ప్రభుత్వం, ఆచరణలో మాత్రం ఒక్కొక్క ఇటుకను ఊడబీకుతోంది. అభివృద్ధి అంటే కొత్త సంస్థలను తీసుకురావడం అని ప్రజలు భావిస్తే.. ఉన్న కార్యాలయాలను విజయవాడ వైపు తరలించడమే తమ మార్క్ పాలన అని కూటమి సర్కార్ నిరూపిస్తోంది. సీబీఐ కోర్టు, సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ భవనం, ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం.. ఇలా వరుసగా నగరాన్ని ఖాళీ చేయిస్తూ, ఇప్పుడు ‘ఏపీ మారిటైం బోర్డు’ను కూడా మంగళగిరికి మార్చింది. విశాఖ కేంద్రంగా బోర్డు పనిచేయాల్సిందిగా చట్టంలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఆ చట్టంలో ఎలాంటి సవరణలు చేయకుండా కార్యాలయాన్ని తరలించడం నగరవాసులను విస్మయానికి గురిచేస్తోంది. చట్టం చుట్టమైందా? సాధారణంగా ఏదైనా ప్రభుత్వ సంస్థ ప్రధాన కార్యాలయం మార్చాలంటే చట్ట సవరణ అవసరం. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2019 నవంబర్లో ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా మారిటైం బోర్డు కేంద్రం విశాఖలోనే ఉంటుందని చట్టంలో స్పష్టంగా పేర్కొంది. దీని ప్రకారం విశాఖలోని హెచ్బీ కాలనీలో కార్యాలయం ఏర్పాటైంది. ఉత్తరాంధ్రలో కీలకమైన మూలపేట పోర్టు పనులను కూడా ఇక్కడి నుంచే పర్యవేక్షించారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం కనీసం చట్ట సవరణ కూడా చేయకుండా, నిబంధనలను బేఖాతరు చేస్తూ రాత్రికి రాత్రే బోర్డును మంగళగిరికి తరలించేసింది. చట్టం విశాఖ అని చెబుతున్నా.. పాలన మాత్రం మంగళగిరి నుంచే సాగిస్తామనడం పాలకుల ద్వంద్వ వైఖరికి నిదర్శనం. వరుసగా తరలిపోతున్న కార్యాలయాలు విశాఖ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ భవనాన్ని విజయవాడకు తరలించారు. విశాఖకు రావాల్సిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని ఒత్తిడి తెచ్చి మరీ విజయవాడకు మళ్లించారు. చివరికి సీబీఐ కోర్టును కూడా తరలించి విశాఖ ప్రాభవాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం వైజాగ్ పోర్టు, గంగవరం పోర్టు వంటి దిగ్గజ సంస్థల పక్కనే ఉండాల్సిన మారిటైం బోర్డును కూడా తీసుకెళ్లిపోవడంతో విశాఖకు ’ఆర్థిక రాజధాని’ ట్యాగ్ కేవలం బోర్డులకే పరిమితమైందని విమర్శలు వస్తున్నాయి. అభివృద్ధి శూన్యం.. భూములే లక్ష్యం విశాఖ నగరంపై చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్నది అభివృద్ధి కాంక్ష కాదు, భూములపై ఆశ మాత్రమేనని నగరవాసులు మండిపడుతున్నారు. విలువైన భూములను గీతం వంటి సంస్థలకు, ప్రభుత్వ అనుచరులకు కారుచౌకగా కట్టబెడుతున్నారు. విశాఖ స్టీల్ప్లాంట్ను కాపాడటం చేతకాని ప్రభుత్వం, దానిని క్రమంగా ప్రైవేటుపరం చేస్తూ విశాఖ కీర్తిని మసకబారుస్తోంది. గత రెండేళ్లుగా నగర మౌలిక సదుపాయాల కోసం నయాపైసా కేటాయించలేదు. చివరకు రోడ్ల నిర్వహణను కూడా పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించి ప్రజలపై భారం వేయాలని చూస్తోంది. పోర్టుల నగరానికి దెబ్బ? విశాఖపట్నం పోర్టు, గంగవరం పోర్టు వంటి కీలక నౌకాశ్రయాలు ఉన్న ఈ ప్రాంతం నుంచి మారిటైం బోర్డు కార్యాలయం పనిచేస్తే సమన్వయం సులభమవుతుందని నిపుణులు భావిస్తున్నారు. అదనంగా శ్రీకాకుళంలో అభివృద్ధి చెందుతున్న పోర్టు ప్రాజెక్టుల పర్యవేక్షణకూ విశాఖ అనువైన కేంద్రంగా ఉంది. అయితే ఈ అంశాలను పక్కనబెట్టి కార్యాలయాన్ని తరలించడం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మరింత అనుమానాలు రేకెత్తిస్తోంది. దోచిపెట్టడమే లక్ష్యంగా.. ఒకవైపు ప్రచార ఆర్భాటాలతో విశాఖను ’గ్లోబల్ సిటీ’ అని ఊదరగొడుతూనే, మరోవైపు నగర ప్రాభవాన్ని తగ్గించేలా సాగుతున్న ఈ ’తరలింపుల పర్వం’ చూస్తుంటే.. విశాఖకు మేలు చేయడం కాదు, నగరాన్ని కేవలం ప్రైవేటు శక్తులకు దోచిపెట్టడమే లక్ష్యంగా కనిపిస్తోంది. పాలకుల అసలు రంగు మారిటైం బోర్డు తరలింపుతో మరోసారి బయటపడింది. ఆర్థిక రాజధాని హోదా దేవుడెరుగు.. ఉన్న ఆఫీసులను ఉంచితే చాలనే పరిస్థితికి విశాఖను దిగజార్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. విశాఖ నుంచి మంగళగిరికి మారిటైం బోర్డు తరలింపు చట్టాన్ని తుంగలో తొక్కిన చంద్రబాబు ప్రభుత్వం విశాఖ నుంచి ఒక్కొక్కటిగా చెక్కేస్తున్న కీలక కార్యాలయాలు జీఎస్టీ, సీబీఐ, ఆర్బీఐ.. ఇప్పుడు మారిటైం బోర్డు వంతు అభివృద్ధి గాలికొదిలేసి.. భూముల పంపిణీపైనే సర్కార్ కన్నే.. -
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు
●జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మునగపాక పీహెచ్సీలో రికార్డులు తనిఖీ చేస్తున్న డీఎంహెచ్వో హైమావతి మునగపాక: సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎం.హైమావతి సూచించారు. స్థానిక పీహెచ్సీని శుక్రవారం ఆమె సందర్శించారు. రికార్డులు పరిశీలించి, రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. 14 సంవత్సరాల బాలికలకు అందజేస్తున్న హెచ్పీవీ వ్యాక్సిన్ ఎంతమేర వేశారో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వడ దెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఉమ్మలాడలోని సంచార చికిత్స కార్యక్రమాన్ని పరిశీలించారు.18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ క్యాన్సన్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా గణాంకాధికారి ఎ.రామచంద్రరావు, వైద్యాధికారులు విమలగిరి, చైతన్య రామ్,సీహెచ్వో దేవకాంత తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ సమస్య పరిష్కారం
కొయ్యూరు: రాజేంద్రపాలెం పంచాయతీ సోలాబులో శుక్రవారం డీఆర్ సబ్ డిపోను ఏర్పాటు చేయడంతో జోగంపేట, సోలాబు గ్రామస్తుల రేషన్ కష్టాలు తీరాయి. గత కొన్ని నెలలుగా రేషన్ కోసం సోలాబు, జోగంపేట గిరిజనులు సుమారు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజేంద్రపాలెం వెళ్లాల్సి వస్తోంది. ఈ సమస్యపై గతంలో కొయ్యూరు పర్యటనకు వచ్చిన ఆర్డీవోకు స్థానిక గిరిజనులు విన్నవించారు. మరోవైపు, గిరిజనులు పడుతున్న ఇబ్బందులను వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు నర్సి కృష్ణ తహసీల్దారుతో పాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నాయకులు మరియు ప్రజల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అధికారులు సోలాబులో డీఆర్ సబ్ డిపోను ఏర్పాటు చేశారు.దీనిపై వైఎస్సార్సీపీ నాయకుడు నర్సి కృష్ణ మాట్లాడుతూ.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లగానే స్పందించి డిపోను ఏర్పాటు చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. గిరిజనుల కష్టాలను తీర్చిన అధికారులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. -
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు
బుచ్చెయ్యపేట/రావికమతం/రోలుగుంట: శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ తుహిన్ సిన్హా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం ఆయన బుచ్చెయ్యపేట, రోలుగుంట పోలీస్స్టేషన్లతో పా టు, రావికమతం మండలంలోని కొత్తకోట సర్కిల్ కార్యాలయంలోగల పోలీసు స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి,క్రైం రేటు వివరాలు అడిగి తెలుసుకున్నారు. దొంగతనాలు జరగకుండా రాత్రీపగలు పెట్రోలింగ్,గస్తీ నిర్వహించాలని, రోడ్డు భద్రత,సైబర్ క్రైమ్పై ప్రజలకు అవగా హన సూచించారు. కొత్తకోట పోలీస్స్టేషన్లో వివిధ కేసుల్లో పట్టుబడిన గంజాయి, వాహనాలను పరిశీలించారు.పటిష్ట నిఘాతో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. రౌడీ షీటర్లకు ప్రతివారం కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. మహిళా సంరక్షణ కార్యద ర్శులు ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమాల్లో డీఎస్పీ ఎం.శ్రావణి,సీఐ కోటేశ్వరరావు, బుచ్చెయ్యపేట ఎస్ఐ శ్రీనివాసరావు, కొత్తకోట ఎస్ఐ ఎస్ఐ శ్రీనివాస్, బుచ్చెయ్యపేట అదనపు ఎస్ఐ భాస్కరరావు, రోలుగుంట ఎస్ఐ రామకృష్ణారావు పాల్గొన్నారు. -
13 నుంచి తొలివిడత చందనం అరగదీత
చందనం చెక్కలను ముక్కలుగా కోస్తున్న ఉద్యోగి సాంబ సింహాచలం : ఈనెల 13న ఏకాదశిని పురస్కరించుకుని సింహగిరిపై శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో తొలివిడత చందనం అరగదీతని వైభవంగా ప్రారంభించేందకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు శుక్రవారం ఆలయ స్థానాచార్యులు టి.పి.రాజగోపాల్, ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణలో ఉద్యోగి సాంబ చందనం చెక్కలను అరగదీతకు అణువుగా ముక్కలు కోశారు. అలాగే చందనం అరగదీతకు కావాల్సిన సానలను సిద్ధం చేశారు. కాగా ఏడాదిలో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ పౌర్ణమి, జ్యేష్ట పౌర్ణమి, ఆషాడ పౌర్ణమి రోజుల్లో మూడేసి మణుగుల చొప్పున(125 కిలోలు చొప్పున) పచ్చిచందనాన్ని స్వామికి సమర్పిస్తారు. మొత్తం నాలుగు విడతల్లో సుమారు 500 కిలోల పచ్చిచందనాన్ని సమర్పిస్తారు. ఈనెల 20న చందనోత్సవాన్ని పురస్కరించుకుని తొలివిడతగా స్వామికి సమర్పించేందుకు కావాల్సిన మూడు మణుగుల పచ్చిచందనాన్ని సమకూర్చేందుకు ఈనెల 13 నుంచి అరగదీతను చేపట్టనున్నారు. -
హౌసింగ్ బకాయిలు విడుదల చేయాలని ఆందోళన
ముంచంగిపుట్టు: మండలంలోని బంగారుమెట్ట పంచాయతీ, మెట్టబాధిపుట్టు గ్రామంలో శుక్రవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో లబ్ధిదారులు ఆందోళన చేపట్టారు. పెండింగ్లో ఉన్న హౌసింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, బిల్లుల మంజూరు కోసం డబ్బులు వసూలు చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.పీఎం జన్మన్ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లకు బిల్లులు రాకపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. మెట్టబాధిపుట్టులో ఇళ్ల నిర్మాణం లింటల్, స్లాబ్ స్థాయికి చేరుకున్నా, గత ఐదు నెలలుగా నిధులు విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు అప్లోడ్ చేయడానికి హౌసింగ్ అధికారులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులు అనేకసార్లు హౌసింగ్ కార్యాలయం చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజన సంఘం మండల కార్యదర్శి కె.నర్సయ్య ఆరోపించారు. సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకుడు చంద్రయ్యతో పాటు పెద్ద సంఖ్యలో హౌసింగ్ లబ్ధిదారులు పాల్గొన్నారు. -
24న ఏపీ గురుకుల ప్రవేశ పరీక్ష
నర్సీపట్నం: ఏపీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ప్రవేశానికి ఈనెల 24న ప్రవే శ పరీక్ష నిర్వహించనున్నట్టు జిల్లా కోఆర్డినేటర్, నర్సీపట్నం ఏపీ రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్ తెలిపారు. 5,6,7,8 తరగతుల్లో ప్రవేశానికి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, ఇంటర్, డిగ్రీలో ప్రవేశానికి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహణకు జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో తొమ్మిది కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు.నిర్ణీత సమయానికి విద్యార్థులు కేంద్రాల వద్దకు చేరుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలో నర్సీపట్నం(బాలుర), అచ్యుతాపురం(బాలికలు)లలో రెసిడెన్షియల్ పాఠశాలలున్నట్టు తెలిపారు. -
సాగని వేట.. కన్నీటి ఊట
మత్స్యశాఖ అధికారులు... వేటదారుల కడుపుకొట్టారు. వారి బతుకులతో చెలగాటమాడారు... సంక్షేమానికి కృషి చేయవలసిన వారే సంక్షోభం సృష్టించారు. దీంతో పలు కుటుంబాలు అర్ధాకలితో అలమటించవలసి వస్తోంది.. రైవాడ జలాశయంలో 5 లక్షల చేపపిల్లలకు గాను కేవలం వేల సంఖ్యలో వేశారు.. వాటిలో సగం వేయకముందే చనిపోయాయి.. దీంతో చేప చిక్కక.. బక్కచిక్కిన బతుకులు మరింత దైన్యంగా మారాయి. ● దయనీయంగా ‘రైవాడ జలాశయం’ వేటదారుల పరిస్థితి ● చేప పిల్లలు విడుదలలో మత్స్యశాఖ అధికారుల మాయాజాలం ● సక్రమంగా విడుదల చేయకపోవడంతో కానరాని మత్స్య సంపద ● రోజంతా వేట సాగించినా కిలో చేపలు చిక్కడం గగనం ● 250 మంది వేటదారుల కుటుంబాల జీవనోపాధికి గండి దేవరాపల్లి: మత్స్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైవాడ జలాశయంలో చేపల వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్న వేటదారులు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. చేప పిల్లలు విడుదలలో మత్స్యశాఖ అధికారులు ప్రదర్శించిన మాయాజలం స్థానిక వేటదారుల పాలిట శాపంగా మారింది. గత ఏడాది జలాశయంలో చేప పిల్లలు సక్రమంగా విడుదల చేయకపోవడంతో మత్స్య సంపద తగ్గిపోయింది. బోటుపై రోజంతా కష్టపడి వేట సాగించినా కిలో చేపలు దొరకడం గగనంగా మారింది. దీంతో సుమారు 250 మంది వేటదారులు ఇటు వేట సాగక, అటు పూట గడవక నానా అవస్థలు పడుతున్నారు. మండుటెండలో ఎంతో కష్టపడి రోజంతా వేట సాగించిన కనీసం రూ.200 విలువ చేసే చేపలు లభించడం లేదు. గత ఏడాది వరకూ జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చేపలు లభించేవి. ఈ ఏడాది చేపలు లభించకపోవడంతో పలు కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తున్నాయి. ప్రతీ ఏటా మత్స్యశాఖ అధికారులు వివిధ స్కీంలు కింద రెండు విడతలుగా జలాశయంలో సుమారు 10 లక్షల వరకు చేప పిల్లలు విడుదల చేసే వారు. గత ఏడాది చేప పిల్లలు విడుదలలో అధికార్లు ప్రకటించిన లెక్కకు, తెచ్చిన పిల్లలకు భారీ వ్యత్యాసం ఉండటాన్ని గమనించిన వేటదార్లు ఆందోళనకు దిగడంతో మోసం బయటపడింది. చేప పిల్లల విషయంలో వేటదారుల నిరసన గత ఏడాది నవంబర్ 24న జలాశయంలో ఐదు లక్షల చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన అధికారులు కేవలం 50 వేలు మాత్రమే వేసి వేటదారులను బురిడీ కొట్టించారు. అధికారుల మోసాన్ని నిరసిస్తూ అదే రోజు రైవాడ సచివాలయం ఎదుట వేటదారులు ఆందోళనకు దిగారు. దీంతో 50 వేల పిల్లలనే వేసినట్లు మత్స్యశాఖ అధికార్లు అంగీకరించి, మిగిలిన 4.50 లక్షల చేప పిల్లలను 15 రోజుల్లో వేస్తామని లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చారు. ఎట్టకేలకు రెండు నెలల తర్వాత ఈ ఏడాది జనవరి 9న 1.50 లక్షల పిల్లలను మాత్రమే తీసుకురావడంతో మళ్లీ వేటదారులు ఆందోళనకు దిగారు. ఇచ్చిన హామీని పట్టించుకోకుండా అరకొరగా తీసుకువచ్చి మోసగించేందుకు ప్రయ త్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఉదయం 10 గంటలకు వస్తాయని చెప్పి సాయంత్రం 4 గంటలకు తీసుకురావడంతోనే చేప పిల్లలు చనిపోయాయి. చనిపోయిన చేప పిల్లలను జలాశయంలో వేయవద్దని వేటదార్లు చెప్పినా పట్టించుకోకుండా వేయడంతో నీటిపై తేలిపోయాయి. ఈ వివాదంపై జిల్లా మత్స్యశాఖ అధికారి వి.విజయ స్పందించి చనిపోయిన చేప పిల్లలతో సంబంధ లేకుండా నాలుగు లక్షల చేప పిల్లలను వేస్తామని హామీ ఇచ్చారు. సుమారు మూడు నెలలు దాటిపోతున్నా పట్టించుకోక పోవడంపై వేటదార్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేపల వేటపై ఆధారపడిన తామంతా ఎలా బతకాలని వారు గోడు వెల్లబోసుకుంటున్నారు. కాగా గతంలో ఈ సీజన్లో విరివిగా చేపలు దొరికేవి. ఈ ఏడాది ఆ పరిస్థితి లేదు. రోజంతా కష్టపడినా కనీసం రూ.200 సంపాదన కూడా లభించకపోవడంతో అవస్థలు పడుతున్నామని చెప్పారు.రైవాడ జలాశయంలో చేప పిల్లలు రుచికరంగా ఉండటంతో గిరాకీ ఎక్కువగా ఉంటుంది. విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల నుంచి చేపల ప్రియులు వచ్చి పోటీ పడి మరీ కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ ఏడాది పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. రైవాడ జలాశయంలో చేపల వేట సాగిస్తున్న వేటదార్లుమోసగించడం దారుణం రైవాడ జలాశయంపై గత 20 ఏళ్లుగా చేపల వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నాం. చేప పిల్లలను వేలల్లో తెచ్చి, తమకు లక్షల్లో తెచ్చినట్లు చెప్పి మోసగించాలని ప్రయత్నించడం దారుణం. గతంలో ఎప్పుడూ తమను ఇలా మోసగించలేదు. ఈ మోసాన్ని గుర్తించి రెండు మార్లు ఆందోళనకు దిగడంతో అధికారులు హామీ ఇచ్చి పట్టించుకోక పోవడం అన్యాయం. వేట సాగితే గాని, పూట గడవని తమ జీవితాలతో చెలగాటం ఆడటం మంచిది కాదు. ఇప్పటికై నా అధికార్లు స్పందించి గతంలో చెప్పిన మాట ప్రకారం చేప పిల్లలు విడుదల చేయాలి. – చల్లా రమణ, వేటదారుడు, రైవాడవేటదారులను ఆదుకోవాలి జలాశయంలో చేప పిల్లలను విడుదల చేయకపోవడంతో మత్స్య సంపద తగ్గిపోయింది. రోజంతా కష్టపడి వేట చేసినా వలకు చేపలు చిక్కడం లేదు. మండుటెండలో వేటసాగిస్తే శ్రమే మిగిలుతోంది. గతంలో రెండు మార్లు చేప పిల్లలు తక్కువగా తేవడంతో గుర్తించి ఆందోళన చేశాం. అధికారులు దిగి వచ్చి ముందుగా ప్రకటించిన విధంగా చేప పిల్లలను వేస్తామని, ఈ ఏడాది జనవరి 9న ప్రకటించారు. మూడు నెలలు దాటి పోతున్నా అతీగతీ లేదు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలి. –కొమర నాగేంద్రకుమార్, వేటదారుడు, రైవాడస్కీం ముగిసింది చేప పిల్లలు సరఫరా చేసే స్కీం ముగిసిపోయింది. ప్రస్తుతం చేప పిల్లలు అందుబాటులో లేవు. మళ్లీ జూలైలో చేప పిల్లల పెంపక కేంద్రం నుంచి సరఫరా చేస్తాం. ఈ ఏడాది రైవాడ జలాశయానికి తొలి ప్రాధాన్యత కల్పిస్తాం. ఆ తర్వాత మిగిలిన జలాశయాలకు కేటాయిస్తాం. – జి.విజయ, జిల్లా మత్స్యశాఖ అధికారి, అనకాపల్లి -
●ప్రకృతి పరవశం.. మే ఫ్లవర్ వికాసం
వేసవి భానుడు సెగలు పుట్టిస్తున్నా, అల్లూరి జిల్లా మన్యం మాత్రం చల్లని మంచు దుప్పటిని కప్పుకుంటోంది. ఒకవైపు ఉదయం 8 గంటల వరకు దట్టంగా కురుస్తున్న పొగమంచు ఆహ్లాదాన్ని పంచుతుంటే, మరోవైపు ముందస్తుగానే వికసించిన మే ఫ్లవర్లు ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తున్నాయి. మంచు ముసుగులో ఎర్రని పూల సోయగాలు మన్యం అందానికి మరింత వన్నె తెస్తున్నాయి. – సాక్షి, పాడేరు పాడేరు–మినుములూరు రోడ్డులో దట్టంగా కురుస్తున్న పొగమంచు వికసించిన మే ప్లవర్లు -
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
నాతవరం: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్.సూర్యలక్ష్మి అన్నారు. మండల కేంద్రం నాతవరంలో శుక్రవారం పోషణ్ పక్వాడ 8వ విడత కార్యక్రమంలో భాగంగా మండల స్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఆమె పోస్టరు ఆవిష్కరించారు. ముందుగా స్థానిక ఐసీడీఎస్ అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన చిరు ధాన్యాలతో తక్కువ పెట్టుబడితో అధిక పోషకాలు ఉండే వంటకాల స్టాల్ను ఆమె పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సూర్యలక్ష్మి మాట్లాడుతూ నిబంధనలు ఉల్లంఘించి బాల్య వివాహాలు చేస్తే రెండేళ్ల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల జరిమానా విధిస్తామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు విటమిన్లు ఉండే ఆహారం అందించాలన్నారు. పిల్లలను స్నేహ పూర్వక వాతావరణంలో పెంచుతూ మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచాలన్నారు. ఆటలతో కూడిన విద్యను అందిస్తే ఆశించిన విజయాలు సాధించవచ్చన్నారు. ఫాస్ట్ఫుడ్స్ తగ్గించి ఆకుకూరలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మహిళలు అత్యవర సమయంలో భయపడకుండా 100, 181, 1098 నంబర్లుకు ఫోన్ చేయాలన్నారు. పోషణ్ పక్వాడ కార్యక్రమాన్ని ఈ నెల 9 నుంచి 23 వరకు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీడీవో అధికారి రమేష్, తహసీల్దార్ చందన రేఖ, ఎంపీడీవో సత్యశ్రీనివాస్, నర్సీపట్నం, గొలుగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులు రమణి, శ్రీగౌరీ, సూపర్వైజర్లు విజయకుమారి, నాగజ్యోతి, వెలుగు ఏపీఎం కనకరాజు, ఎంఎల్హెచ్్ పి.మౌనిక, హౌసింగ్ జేఈ జోగారావు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలి
అరకులోయ టౌన్: నియోజకవర్గ పరిధిలో డిజిటలైజేషన్ వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, అతి త్వరగా పూర్తి చేయాలని అరకులోయ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో అరకులోయ నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు, సభ్యులతో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో కొనసాగుతున్న డిజిటలైజేషన్ ప్రక్రియను, వెరిఫికేషన్ను తగు జాగ్రత్తలు పాటిస్తూ సక్రమంగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.మండల, గ్రామ, వార్డు స్థాయిలో ఎంపిక చేసిన వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తల ఫొటోలు, ఇతర పూర్తి వివరాలను సోషల్ మీడియా ప్రతినిధులకు వెంటనే అందించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతి కార్యకర్తకు ఐడీ కార్డులు జారీ చేస్తారని, అలాగే వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తారని వెల్లడించారు. పంచాయతీ స్థాయి వివరాల సేకరణలో ఏవైనా సందేహాలు ఉంటే 9381558327, 9347094001 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు రేగం చాణక్య, ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా ఇంచార్జ్ కొర్రా రామ్, అరకులోయ, డుంబ్రిగుడ యువజన విభాగం అధ్యక్షులు బోయి కిరణ్ కుమార్, కమ్మిడి విజయదశమి పాల్గొన్నారు. వీరితో పాటు సోషల్ మీడియా ప్రతినిధులు పాంగి నర్సింగరావు, సెంబి సుందర్రావు, జన్ని అర్జున్, వంతాల నాగేశ్వరరావు, పాంగి అజయ్ తదితరులు హాజరయ్యారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
ప్రమాదానికి గురైన బలోరా, ద్విచక్ర వాహనాలు, క్షతగాత్రులు చింతపల్లి: గూడెం కొత్తవీధి మండలం రింతాడ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గిరిజనుడు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. చింతపల్లి మండలం అన్నవరం పంచాయతీ కూర్మన్నపాకలు గ్రామానికి చెందిన కొర్రా కోటిబాబు, పాంగి అప్పారావు వ్యక్తిగత పనులపై గూడెంకొత్తవీధి బైక్పై బయలుదేరారు. మార్గంమధ్యలో రింతాడ, ముల్లుమెట్ట గ్రామాల మధ్య ఎదురుగా వస్తున్న అంబులెన్సును తప్పించబోయి ఆగిఉన్న బొలారో వాహనాన్ని బలంగా ఢీకొట్టారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్లో చింతపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరికి వైద్యాధికారి చందన వైద్యసేవలు అందించారు. చికిత్స పొందుతూ పాంగి అప్పారావు (28) మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన కోటిబాబును మెరుగైన వైద్యం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
విశాఖ ‘పెట్రో’ వేగం
సాక్షి, విశాఖపట్నం : పారిశ్రామిక నగరం విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ వరకు ఇంధన రవాణాలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికే ‘పెట్రో కారిడార్’ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తాజాగా జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్తో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు అమలుకు మార్గం సుగమమైంది. హెచ్పీసీఎల్ విశాఖ రిఫైనరీ నుంచి ఉత్పత్తి అయ్యే పెట్రోలియం ఉత్పత్తులను పొరుగు రాష్ట్రాలకు వేగంగా చేరవేయడమే ఈ ‘కామన్ కారిడార్’ లక్ష్యం. ఈ ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్తో పాటు ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి రాష్ట్రాలకు ఇంధన సరఫరా మరింత సమర్థవంతంగా మారనుంది. పాత మార్గమే.. కొత్త రూటు! కొత్తగా భూసేకరణ సమస్యలు తలెత్తకుండా కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 1998లో విశాఖ నుంచి విజయవాడ వరకు ఇంధన రవాణా కోసం ఏర్పాటు చేసిన పాత పైప్లైన్ మార్గాన్నే ఈ కొత్త ప్రాజెక్టుకు కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది. దీనివల్ల అటు పర్యావరణ అనుమతులు, ఇటు ప్రాజెక్టు వ్యయం భారీగా తగ్గనున్నాయి. 2022లో హెచ్పీసీఎల్ రిఫైనరీ ఆధునీకరణే కీలకం.! 2022లో విశాఖలోని హెచ్పీసీఎల్ రిఫైనరీని భారీ ఎత్తున ఆధునీకరించడంతో ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. ఈ అదనపు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను ఛత్తీస్గఢ్, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాలకు సురక్షితంగా, వేగంగా చేరవేయడమే ఈ రూ. 2,212 కోట్ల ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. విశాఖను దక్షిణ భారతదేశపు అతిపెద్ద ఇంధన సరఫరా కేంద్రంగా మార్చనుంది. సుమారు 540 కిమీ పొడవైన పైప్లైన్ ద్వారా ఏడాదికి 3 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులే లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. 2027 సెప్టెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. రోడ్డు, రైలు మార్గాల ద్వారా ఇంధన రవాణా చేయడం వ్యయంతో పాటు.. ప్రమాదకరమైన అంశంగా మారనుంది. అందుకే ఈ భూగర్భ పైప్లైన్ రవాణా వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతగా ఎంచుకుంది. స్కాడా ద్వారా పర్యవేక్షణ భద్రత విషయంలో రాజీ లేకుండా ఈ పైప్లైన్ వ్యవస్థను అత్యున్నత సాంకేతికతతో నిర్మిస్తున్నారు. విశాఖ–రాయ్పూర్ ఎకనామిక్ కారిడార్ని అనుసంధానిస్తూ సాగే ఈ మార్గంలో అత్యాధునిక మానిటరింగ్ సిస్టమ్ ‘స్కాడా’ని ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా రిఫైనరీ నుంచి పైప్లైన్ ఒత్తిడిని, ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించవచ్చు. ఏదైనా లీకేజీ లేదా సాంకేతిక సమస్య తలెత్తితే సెన్సార్ల ద్వారా తక్షణమే గుర్తించి సరఫరాను నిలిపివేసేలా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పెందుర్తిలో కీలక అడుగు తాజా గెజిట్ ప్రకారం పెందుర్తి మండల పరిధిలో 7.175 కి.మీ మేర పైప్లైన్ విస్తరణకు భూములను గుర్తించారు. నరవ గ్రామం: 76 సర్వే భాగాలు. జెర్రిపోతులపాలెం: 17 సర్వే భాగాలు. ఈ ప్రాంతాల్లో పైప్లైన్ నిర్మాణం కోసం వినియోగ హక్కులను ప్రభుత్వం ఖరారు చేసింది. -
ఏఎంఆర్ సంస్థ అక్రమ సీనరేజ్ వసూళ్లపై ఫిర్యాదు
దేవరాపల్లి: మండలంలో ఏఎంఆర్ సంస్థ పేరిట అక్రమంగా సీనరేజ్ వసూళ్లు చేస్తున్నారని గురువారం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బిల్లల మెట్ట క్వారీ నుంచి ఇళ్ల నిర్మాణానికి రాయిని తరలిస్తున్న ట్రాక్టర్ యజమానుల నుంచి అధిక సీనరేజ్ వసూలు చేయడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు సంస్థ పేరిట వసూళ్లు చేస్తున్న వ్యక్తుల వద్ద కనీసం గుర్తింపు కార్డు లేకపోగా, రసీదులు చూపించకపోవడంతో ట్రాక్టర్ యజమానులు ఫిర్యాదు చేశారు. సీనరేజ్ పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వీరికి సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు డి. వెంకన్న మద్దతు పలికారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతున్న ఏఎంఆర్ సంస్థ దోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు. గ్రామాల్లో ఎవరైనా ఇళ్లు నిర్మించుకుంటే గతంలో ట్రాక్టర్ మట్టికి రూ. 200 తీసుకునే వారని, ఏఎంఆర్ సంస్థ అక్రమంగా ట్రాక్టర్ మట్టికి రూ. 800 నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తుందని ఆగ్రహించారు. గ్రామాల్లో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టి ట్రాక్టర్లను వెంబడించి ఇష్టానుషారంగా వసూళ్లు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదన్నారు. తక్షణమే పోలీసులు స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటే ట్రాక్టర్ల యజమానులు, భవన నిర్మాణ కార్మికులతో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఫిర్యాదు చేసిన వారిలో గొర్లె దేముళ్లు, నమ్మి దేముళ్లు, సిహెచ్. అప్పారావు తదితరులు ఉన్నారు. -
చేదుకాలం
చక్కెర కర్మాగారాలకు పూర్వ వైభవం తీసుకొస్తామన్న చంద్రబాబు ప్రభుత్వ హామీ నీటి బుడగే అయ్యింది. మూతపడిన చక్కెర కర్మాగారాలను తెరిపించే ప్రయత్నం చేయకపోగా నడుస్తున్న గోవాడ షుగర్ ఫ్యాక్టరీని కూడా మూసివేయించే స్థాయికి తీసుకొచ్చింది. ఎన్నికల ముందు బూటకపు హామీతో రైతులను చంద్రబాబు సర్కారు మరోసారి బురిడికొట్టించింది. షుగర్ ఫ్యాక్టరీలు మళ్లీ తెరుచుకుంటాయన్న ఆశ నానాటికీ సన్నగిల్లుతోంది. చక్కెర పరిశ్రమకు కోటవురట్ల : ఉమ్మడి విశాఖ జిల్లాల్లో చెరకు సాగు ఓ పండుగలా జరిగేది. వేలాది ఎకరాలలో ఎటుచూసినా చెరకు తోటలే కనిపించేవి. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి రైతుల సంక్షేమం కాంక్షించి ఏటా గిట్టుబాటు ధరను కల్పించేవారు. ఫ్యాక్టరీ మనుగడకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ వచ్చేవారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఫ్యాక్టరీలను పట్టించుకోవడం మానేసింది. ఫలితంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో చెరకు సాగు కనిపించకుండా పోయింది. ఓ వెలుగు వెలిగిన షుగర్ ఫ్యాక్టరీలు దీనావస్థలో పాలకుల అసమర్ధతను ప్రశ్నిస్తున్నట్టు నిశ్శబ్ధంగా చూస్తున్నాయి. ఉమ్మడి విశాఖ జిల్లాలో దార్లపూడిలో ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీ, అనకాపల్లి తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ, చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ, పాయకరావుపేట తాండవ షుగర్ ఫ్యాక్టరీలతో చెరకు సాగు భారీగా జరిగేది. కొన్నేళ్లుగా ఈ షుగర్ ఫ్యాక్టరీలు ఒక్కొక్కటిగా మూతపడుతూ వస్తున్నాయి. చివరిగా చోడవరం గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతపడే దశకు చేరుకుంది. కూటమి హామీతో చెరకు రైతులు ఎన్నో ఆశలు పెట్టుకోగా అవన్నీ నీరుగారుతున్నాయి. పూర్వ వైభవం వచ్చే పరిస్థితి కానరాక చెరకు సాగును పూర్తిగా మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా ఏటికొప్పాక షుగర్ ఫ్యాక్టరీకి గొప్ప చరిత్ర ఉంది. రైతుల జీవన ప్రమాణాలను మార్చేసిన ఘనత ఈ ఫ్యాక్టరీది. ఆర్థికంగా వెనుకబాటు తనంతో ఉన్న ఈ ప్రాంత రైతుల జీవితాలలో వెలుగు నింపిన ఖ్యాతి దీనిది. చెరకు సాగుకు పెట్టింది పేరుగా.... ఒకప్పటి విశాఖ జిల్లాలో రైతులకు వేల ఎకరాలు ఉన్నా అంతగా రాబడి లేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న రోజులవి. 1932 వరకు సంప్రదాయ పంటలతో కాలం నెట్టుకొస్తున్న పరిస్థితులు. వరి, అరటి వంటి పంటలతో గిట్టుబాటు కాక రైతులు ఆర్థికంగా ఇబ్బంది పడేవారు. ఎస్.రాయవరం మండలం దార్లపూడి శివారున 1933లో స్థాపించబడిన ఈ కర్మాగారం యావత్తు భారతదేశంలోనే సహకార రంగంలో మొట్ట మొదటి చక్కెర కర్మాగారంగా చెబుతారు. ఈ ఫ్యాక్టరీ రాకతోనే ఏటా చెరకు సాగు పెరుగుతూ రైతులకు కొండంత అండగా నిలిచింది. చెరకు సాగుకు పెట్టింది పేరుగా ఈ ప్రాంతం వాసికెక్కింది. 1932లో మద్రాసు సహకార సంఘ చట్టం కింద ది ఏటికొప్పాక కో–ఆపరేటివ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్ ఏర్పడింది. 1933 ఏప్రిల్ 22న రిజిస్టరు కావడంతో పాటు అదే రోజున పని ప్రారంభించారు. రైతుల ‘సహకారం’ తోడై... ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇదే ప్రప్రథమ సంఘం. అప్పటి మద్రాసు లెజిస్లేటివ్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు రావుబహద్దూర్ సి.వి.ఎస్.నరసింహరాజు అధ్యక్షతన రాజాసాగి సత్యనారాయణరాజు ఉపాధ్యక్షుడుగా 20 మంది సభ్యులతో, రూ.8,975 షేరు ధనంతో ఫ్యాక్టరీని ప్రారంభించారు. ప్రారంభ దశలో రోజుకు 75 టన్నులు చెరకు గానుగ ఆడేవారు. ఆ తర్వాత రైతులు చెరకు పంటపై ఆసక్తి పెంచుకుని భారీగా సాగు చేయడం ప్రారంభించారు. పంటకు గిట్టుబాటు ధర రావడంతో, మైలేజ్లు, డివిడెండ్లు చెల్లింపులతో సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1952–53లో సాగు పెరగడంతో 600 టన్నుల సామర్ధ్యం కలిగిన యంత్రాలను అమర్చారు. అప్పటికి 1415 మంది సభ్యులతో, రూ.6,74,195 షేరు ధనం కలిగి ఉంది. క్రమేపీ సాంకేతికతను జోడించి నాణ్యత కలిగిన పంచదారను ఉత్పత్తి చేసే స్థాయికి వచ్చారు. మార్కెట్లో మంచి గుర్తింపు రావడంతో అనతికాలంలోనే ఫ్యాక్టరీ అభివృద్ధి బాటలో పయనించింది. ఇక వెనక్కి చూసుకోకుండా అంచెలంచెలుగా గానుగాట స్థాయి పెరుగుతూ వచ్చి 2018 నాటికి రోజుకు 2 వేల టన్నుల చెరకును ఆడే స్థాయికి చేరింది. ఫ్యాక్టరీ పరిధిలో 8 మండలాలకు చెందిన 122 గ్రామాల్లోని రైతాంగం చెరకు ఫ్యాక్టరీకి సరఫరా చేసేవారు. ఫ్యాక్టరీ మూతపడే నాటికి 5630 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఫ్యాక్టరీ ప్రారంభం నుంచి తంగేడు రాజవంశీకులతో పర్యవేక్షణలోనే నడిచింది. ఫ్యాక్టరీ అధ్యక్షులుగా 1965–68 వరకు రాజాసాగి సూర్యనారాయణరాజు, 1968–70 వరకు రాజాసాగి సీతారామరాజు, 1970–81 వరకు రాజాసాగి కృష్ణమూర్తిరాజు, 1981–84 వరకు రాజాసాగి రామభద్రరాజు అధ్యక్షులుగా కొనసాగుతూ వచ్చారు. చంద్రబాబు చెరకు రైతులను ముంచేశారు.. చంద్రబాబు చెరకు రైతుల ఆశలను పూర్తిగా చంపేశారు. ఎన్నికల ముందు బూటకపు హామీతో తుంపాల, ఏటికొప్పాక, తాండవ ఫ్యాక్టరీలను ఆధునికీకరించి అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. తీరా రెండేళ్లు దాటుతున్నా ఆ ఊసేలేదు. ఉమ్మడి విశాఖ జిల్లా చెరకు సాగుకు కేంద్రబిందువుగా ఉండేది. కూటమి ధోరణితో చెరకు పంట కనుమరుగైంది. చంద్రబాబు మళ్లీ రైతులను మోసం చేయడంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలను వెదుక్కుంటున్నారు. గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతపడేలా చేశారు. ఎక్కడి నుంచో వచ్చి దొంగ హామీలు ఇచ్చిన ఎంపీ సీఎం రమేష్ జాడే కనిపించలేదు. చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికై నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. – ఆర్.ఎస్.సత్యనారాయణరాజు, వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, తంగేడు టీడీపీ పాలనలోనే దీనస్థితి... టీడీపీ ప్రభుత్వ పాలనలో చెరకు రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. 2019 నాటికి ఫ్యాక్టరీ పూర్తిగా మూతపడింది. ఆనాటి నుంచి ఈ ఫ్యాక్టరీని తెరచి చెరకు రైతులను ఆదుకోవాలనే డిమాండ్ కొనసాగుతోంది. గత ఎన్నికల ముందు కూటమి ఈ ఫ్యాక్టరీని తెరిపించడమే కాకుండా గోవాడ షుగర్ ఫ్యాక్టరీని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చింది. చంద్రబాబు సర్కారు వచ్చి రెండేళ్లు దాటుతున్నా ఫ్యాక్టరీ ఊసేలేదు. దాంతో చెరకు రైతులు పూర్తిగా ఆశ చంపుకొని ప్రత్యామ్నాయ పంటగా సరుగుడు పంటను సాగు చేస్తున్నారు. ఘన చరిత్ర కలిగిన షుగర్ ఫ్యాక్టరీలు ప్రస్తుతం శిథిలావస్ధకు చేరి దీనంగా చూస్తున్నాయి. -
పదేళ్ల క్రితం పరారైన గంజాయి నిందితుడు అరెస్ట్
పట్టుబడ్డ నిందితుడుతో పోలీసులు నర్సీపట్నం: పదేళ్ల క్రితం పరారైన గంజాయి నిందితుడిని అరెస్ట్ చేశామని రూరల్ ఎస్ఐ పి.రాజారావు తెలిపారు. 2016లో రూరల్ పోలీసు స్టేషన్లో నమోదైన గంజాయి కేసులో అల్లూరి జిల్లా, జి.కె.వీధి మండలం, జెర్రిలా గ్రామానికి చెందిన సయ్యద్ సినీబ్రహ్మషా ఆలియాస్ జెర్రిల శ్రీను(40) ఎ–2 నిందితుడిగా ఉన్నాడు. పదేళ్లుగా పరారీలో ఉన్నాడు. తమ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి నిందితుడిని అదుపులోకి తీసుకుని మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో హాజరు పరచగా కోర్టు రిమాండ్ విధించిందని ఎస్ఐ తెలిపారు. -
ఆన్లైన్లో చందనోత్సవం టికెట్లు
సింహాచలం: సింహగిరిపై ఈ నెల 20న జరగనున్న చందనోత్సవాన్ని పురస్కరించుకుని.. టికెట్ల విక్రయాలను ఈ నెల 17వ తేదీలోపే ముగించేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. సింహగిరిపై జరుగుతున్న చందనోత్సవ ఏర్పాట్లను గురువారం కలెక్టర్ పరిశీలించగలరు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చందనోత్సవం టికెట్లను ఈ నెల 11 లేదా 12వ తేదీ నుంచి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. టికెట్ల విక్రయాలను 17వ తేదీ నాటికే పూర్తి చేసి, మిగిలిన రెండు రోజులు కేవలం ఏర్పాట్లపైనే దృష్టి సారించేలా ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. గతేడాది ఏర్పాట్లతో పోలిస్తే.. ఈసారి భక్తుల సౌకర్యార్థం శాశ్వత షెడ్లను అధికంగా అందుబాటులోకి తీసుకువచ్చామని, తాత్కాలిక కట్టడాలను తగ్గించామని కలెక్టర్ వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్సవానికి సుమారు 1.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నామని.. అందుకు తగ్గట్టుగా తాగునీరు, మరుగుదొడ్లు, క్యూల్లో రద్దీ నియంత్రణ వంటి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైన చోట్ల ప్రత్యేక ర్యాంపులు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ.. మరో మూడు రోజుల్లో అన్ని ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. యంత్రాంగం ఎన్ని ఏర్పాట్లు చేసినా, భక్తుల సహకారం అవసరమన్నారు. పర్యటనలో భాగంగా కలెక్టర్ ఉచిత దర్శనం, రూ.300, రూ.1000, రూ.1500 దర్శన క్యూలను పరిశీలించారు. అన్నప్రసాద భవనం నుంచి పాదాలమ్మ, బంగారమ్మ ఆలయాల వద్దకు వెళ్లేందుకు ప్రతిపాదించిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను ప్రస్తుతానికి నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. చందనోత్సవంపై ఈ నెల 11న కలెక్టరేట్లో మంత్రులతో సమీక్ష సమావేశం ఉంటుందన్నారు. దేవస్థానం ఈవో జె.వెంకటరావు, ఈఈలు రమణ, రాంబాబు, రామకృష్ణ, డీఈలు హరి, తాతాజీ, ఏఈలు రవిరాజు, తిరుపతిరావు, పీఆర్వో అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వివిధ విభాగాలకు వైఎస్సార్సీపీ నియామకాలు
నక్కపల్లి : వైఎస్సార్సీపీ నక్కపల్లి మండల శాఖ అధ్యక్షుడిగా సీతంపాలెం గ్రామానికి చెందిన ఎంపీటీసీ, సీనియర్ నాయకుడు గొర్ల గోవిందరావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు నక్కపల్లి మండల నూతన కమిటీతో పాటు, పలువురిని రాష్ట్ర, జిల్లా బీసీ విభాగంలో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్వులు వచ్చాయి. మండల శాఖ అధ్యక్షుడిగా గొర్ల గోవిందు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడిగా దేవవరం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గొర్ల నర్సింహమూర్తి, రాష్ట్ర బూత్ కమిటీ విభాగం కార్యదర్శిగా బుచ్చిరాజుపేటకు చెందిన గొర్ల బాబూరావు, పబ్లిసిటీ వింగ్ రాష్ట్ర కార్యదర్శిగా మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుడు లోడగల చంద్రరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ జాయింట్ కార్యదర్శిగా బొడ్డపాటి అనిల్కుమార్, వలంటీర్ల విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా సుర్ల వరలక్ష్మి నియమితుల య్యారు. ఇక నక్కపల్లి పార్టీ మండల ఉపాధ్యక్షులుగా సాదిరెడ్డి శ్రీనివాస్, జుల్లూరి లక్ష్మిపతిరాజు, ప్రధాన కార్యదర్సులుగా అల్లురమణ, కొల్నాటి దుర్గాప్రసాద్, ఎరిపల్లి నాగేశు, దమ్ము అప్పారావు, కార్యదర్శులుగా గంటా తిరుపతిరావు, గొర్ల రమణ, అనపర్తి పాండు, కొవిరి కొండబాబు, పక్కుర్తి రమణ, కార్యవర్గ సభ్యులుగా కొర్రా శ్రీనివాసరావు, వీరారెడ్డి రమేష్, వీదికన్నారావు, యలమంచిలి అప్పలరాజు, యజ్జల అప్పలరాజు, మేరుగ చిన గంగరాజు, కోడ లక్ష్మణ్, కండెల్ల బాబ్జి, అల్లుబోయిన గోవిందు, మహ్మద్ హుస్సేన్, కోశెట్టి గోవిందు, కర్రి రాముడు, రావి ఈశ్వరరావు, కురందాసు నానాజీ, కురందాసు గోవిందు, దుంగల కృష్ణారావు, చుక్కల హరి, కోమర్తి చిట్టిబాబు, సఖిరెడ్డి వెంకటరమణ నియమితులయ్యారు. -
పంచదార్ల దళిత రైతుల వినూత్న నిరసన
నోట్లో ఆకులు పెట్టుకుని నిరసన తెలుపుతున్న దృశ్యం రాంబిల్లి(అచ్యుతాపురం): న్యాయం కోసం పోరాడుతున్న రాంబిల్లి మండలంలోని పంచదార్ల దళిత రైతులు ప్రారంభించిన దీక్ష గురువారం నాటికి 65వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా బాధిత రైతులతో పాటు సీపీఎం నాయకులు వినూత్నంగా నిరసన తెలిపారు. నోట్లో ఆకులు పెట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. వేరొక గ్రామ నిర్వాసితుల కోసం తమ భూముల్ని ఎటువంటి పరిహారం ఇవ్వకుండా తీసుకోవాలని ఉత్తర్వులు ఇవ్వడం అన్యాయమంటూ బాధిత రైతులు వాపోయారు. తుఫాన్ పరిహారం, రైతు భరోసా పొందిన భూముల్ని బలవంతంగా లాక్కోవాలని ప్రభుత్వం మొండిగా వ్యవహరించడం దారుణంగా సీపీఎం నాయకులు దేవుడు నాయుడు, సోమునాయుడు అభివర్ణించారు. కార్యక్రమంలో గూటాల నాగఅప్పారావు, గుడబండి అప్పారావు, నాగప్పారావు, అబద్ధం, కనకరత్నం, లక్ష్మి, చిరంజీవి, రవి, అర్జున్రావు, నూకాలు తదితరులు పాల్గొన్నారు. -
ఏబీఎన్ రాధాకృష్ణను అరెస్టు చేయాలి
సాక్షి నెట్వర్క్ : జర్నలిస్టు ముసుగులో మహిళలను కించపరుస్తూ ఏబీఎన్ చానల్లో రోత వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను అరెస్టు చేయాలని వైఎస్సార్సీపీ శ్రేణులు జిల్లావ్యాప్తంగా పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు అందించారు. యలమంచిలి రూరల్ : మహిళలను కించపరిచిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్సార్సీపీ యలమంచిలి సమన్వయకర్త కరణం ధర్మశ్రీ డిమాండ్ చేశారు. గురువారం ఆయన స్థానిక పార్టీ నాయకులతో కలిసి యలమంచిలి సీఐ ధనుంజయరావుకు రాధాకృష్ణపై రాతపూర్వక ఫిర్యాదు చేశారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయ డం భావప్రకటన స్వేచ్ఛ కిందకు ఎలా వస్తుందంటూ ప్రశ్నించారు. చోడవరం: జర్నలిజం ముసుగులో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ టీడీపీకి ఏజెంట్గా పనిచేస్తున్నారని చోడవరం సమన్వయకర్త అమర్నాఽథ్ ధ్వజమెత్తారు. పార్టీ శ్రేణులతో కలసి ఎస్ఐ కార్తికేయకు రాధాకృష్ణపై ఫిర్యాదు అందించారు. నర్సీపట్నం : మహిళలపై ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేకపోతే మహిళల ఆగ్రహానికి గురికాక తప్పదని మాజీ ఎమ్మెల్యే గణేష్ హెచ్చరి ంచారు. పార్టీ నాయకులతో ఆయన నర్సీపట్నం టౌన్ పోలీసుస్టేషన్లో ఎస్ఐ రమేష్కు రాధాకృష్ణపై ఫిర్యాదు చేశారు. నక్కపల్లి : పత్రికా విలువలను మంటగలుపుతూ కేవలం చంద్రబాబు, లోకేష్ల మెప్పుకోసం ఏబీఎన్ రాధాకృష్ణ వైఎస్సార్సీపీ నేతలు, మహిళలపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, పార్టీ రాష్ట్రకార్యదర్సి వీసం రామకృష్ణ మండిపడ్డారు. రాధాకృష్ణపై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని నక్కపల్లి పోలీస్స్టేషన్లో సీఐ జె.మురళికి ఫిర్యాదు చేశారు. కె.కోటపాడు : మహిళల ఆత్మాభిమానం దెబ్బతీయడంతో పాటు వారిని కించపర్చేలా ఏబీఎన్ రాధాకృష్ణ వాఖ్యలు ఉన్నాయని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణపై కె.కోటపాడులో రాష్ట్ర వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కశింకోట : మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, ఆ పార్టీ అనకాపల్లి సమన్వయకర్త మలసాల భరత్కుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పార్టీ శ్రేణులతోపాటు కలిసి కశింకోట ఎస్ఐ మనోజ్కుమార్కు ఫిర్యాదును అందించారు. -
వానొస్తే బురద.. ఎండ కాస్తే ధూళి
బుచ్చెయ్యపేట: ఎండ కాస్తే దుమ్ము, ధూళి లేచిపోయి కళ్ల మంటలతో ప్రయాణం.. వానొస్తే గోతుల్లో చేరిన వర్షం నీరు, బురదతో ఇబ్బందులు. ఇది భీమునిపట్నం, నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో ప్రయాణికులు పడుతున్న నిత్య కష్టాలు.. బీఎన్ రోడ్డులో మరలా బురద కష్టాలు ప్రయాణికులకు ఎదురయ్యాయి. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి జిల్లాల వాహనదారులకు కీలకమైన ప్రధాన రహదారి అభివృద్ధిపై పాలకులు, అధికారులు చిన్న చూపు చూస్తున్నారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన బీఎన్ రోడ్డు నిర్మాణ పనులు గుత్తేదారుడు నత్తనడకన చేస్తున్నాడు. ఇప్పటి వరకు గోతులుగా ఉన్న బీఎన్ రోడ్డు ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీరు చేరి బురదమయంగా మారింది. ఎండ కాస్తే రాయి బుగ్గి లేచిపోయి వాహనదారులతోపాటు రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాసితుల వారు అవస్థలు పడుతున్నారు. ఎండలో రాకపోకలు సాగించేటప్పుడు వాహనదారుల దుమ్ము పడి కళ్ల మంటలతో తీవ్ర నరకం అనుభవిస్తున్నారు. గత వైఎస్సార్సీపీ హయాంలోనే అభివృద్ధికి చర్యలు గత వైఎస్సార్సీపీ హయాంలోనే బీఎన్ రోడ్డు అభివృద్ధికి చర్యలు చేపట్టారు. అప్పటి ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ద్వారా బీఎన్ రోడ్డు విస్తరణకు రూ. 87 కోట్లు మంజూరు చేయించారు. ఐదేళ్లుగా రోడ్డు నిర్మాణం చేపట్టిన గుత్తేదారుడు నత్తనడకన పనులు సాగిస్తున్నాడు. గోతులు వల్ల పలు ప్రమాదాలు జరిగి వాహనాలు రోడ్డు గోతుల్లో కూరుకుపోయి జేసీబీలతో లాగిన బీఎన్ రోడ్డు పనులపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వీడటం లేదు. కూటమి నేతల హామీ ఏమైంది? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీఎన్ రోడ్డును బాగు చేయలేకపోయారు, రవాణా సౌకర్యం కల్పించలేకపోయారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా బీఎన్ రోడ్డును బాగు చేస్తామన్న కూటమి నేతల హామీ రెండేళ్లయినా నెరవేరలేదు. బీఎన్ రోడ్డు దుస్థితిని చూసి చోడవరం న్యాయవాదులు రోడ్డు మరమ్మతులు చేయకపోవడంపై కోర్టులో కేసు కూడా వేశారు. కోర్టు కేసుతో అధికారులు, గుత్తేదారులు నాలుగు నెలల క్రితం ప్రారంభించిన నత్తనడకన సాగిస్తున్నారు. రోలుగుంట మండలం నుంచి రావికమతం, బుచ్చెయ్యపేట, చోడవరం మండలం వెంకన్నపాలెం వరకు పెద్ద పెద్ద గోతులు పడి రవాణాకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కానరాని కొత్త వంతెనలు విజయరామరాజుపేటలో తాచేరు, వడ్డాదిలో పెద్దేరు వంతెనలు కూలిపోగా, వీటి స్థానంలో కొత్తవి నిర్మాణ పనులు జరగలేదు. వడ్డాది, విజయరామరాజుపేటలో తాత్కలికంగా వేసిన డైవర్షన్ రోడ్లు వర్షాలు ఎక్కువైతే మరలా కొట్టుకుపోయేలా ఉన్నాయి. బీఎన్ రోడ్డులో అసంపూర్తి పనులు వల్ల వర్షాలు ఎక్కువైతే గోతుల్లో నీరు చేరి బురదలో వాహనాలు కూరుకుపోయి జేసీబీలతో లాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికై నా పాలకులు, ఆర్అండ్బీ అధికారులు బీఎన్ రోడ్డు పనులుపై దృష్టి సారించి రవాణా కష్టాలు తీర్చాలని మూడు జిల్లాల ప్రజలు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ 2.0లో యువతకు ప్రాధాన్యం
ఎస్.రాయవరం: వైఎస్సార్సీపీ 2.0 లో యువతకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లా పర్యటనకు వచ్చిన సిద్ధార్థరెడ్డిని పాయకరావుపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు పోచిన నరేష్ గురువారం గాజువాకలో మర్యాద పూర్వకంగా కలిశారు. రానున్న రోజుల్లో యువతకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కార్యక్రమాలు రూపొందిస్తారన్నారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే జగన్మోహన్రెడ్డి పాదయాత్ర విజయవంతానికి యువత నడుం బిగించాలని సూచించారన్నారు. -
కేజీహెచ్ ఎస్టీ సెల్ సిబ్బంది బదిలీల రద్దు
మహారాణిపేట: కేజీహెచ్ ఎస్టీ సెల్లో పనిచేస్తున్న నలుగురు సిబ్బందిని యథావిధిగా కొనసాగించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె. సుభద్ర కోరడంతో వారి బదిలీలు నిలిచిపోయాయి. ఇటీవల ఈ నలుగురు సిబ్బందిని ఆకస్మికంగా బదిలీ చేయగా, దీనివల్ల కేజీహెచ్కు వచ్చే గిరిజనులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎస్. అప్పలరాజు, కార్యదర్శి కటారి శోభన్ కుమార్ గురువారం చైర్పర్సన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఆదివాసీ ప్రాంతాల నుండి వైద్య సేవల కోసం వచ్చే అమాయక ప్రజలకు ఈ సిబ్బంది ఎంతో చేదోడువాదోడుగా ఉంటారని వారు వివరించారు. దీనిపై తక్షణమే స్పందించిన చైర్పర్సన్ సుభద్ర, ఏఎస్ఆర్ కలెక్టర్తో మాట్లాడి పరిస్థితిని వివరించారు. గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందాలంటే ఈ నలుగురు సిబ్బందిని అక్కడే కొనసాగించడం అత్యవసరమని ఆమె కోరారు. చైర్పర్సన్ విజ్ఞప్తి మేరకు ఆ నలుగురు ఉద్యోగులను తిరిగి కేజీహెచ్లోనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం నాయకులు అప్పలరాజు, శోభన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించిన జిల్లా పరిషత్ చైర్పర్సన్కు, ఏఎస్ఆర్ కలెక్టర్కు, ఇతర అధికారులకు గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం తరఫున వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
శతాబ్ది వేళ పస్తుల గోల!
విశాఖ సిటీ : చదువుల తల్లి నిలయం.. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇప్పుడు ’సరస్వతీ పుత్రుల’ కడుపు మండుతోంది. వర్సిటీ శత జయంతి ఉత్సవాల పేరిట పాలకులు ఆర్భాటాలు చేస్తుంటే, అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మాత్రం పస్తులుండాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏయూకు అందాల్సిన గ్రాంట్లు సక్రమంగా అందకపోవడం శాపంగా మారింది. టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులతో పాటు పెన్షనర్ల కడుపు మాడుస్తుండడం ఇప్పుడు వర్సిటీలో వివాదాస్పదమవుతోంది. ఉద్యోగుల జీతాల కోసం ప్రతిసారి ఏయూ అంతర్గత గ్రాంట్ నుంచి నిధులు తోడేస్తుంటే.. విశ్వవిద్యాలయం దివాళా తీసేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జీతాల కోసం ప్రతి నెలా ఎదురుచూపులే! ఆంధ్రా యూనివర్సిటీలో సుమారు 300 మంది టీచింగ్, 1400 మంది నాన్ టీచింగ్, 3400 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరికి జీతభత్యాల కోసం నెలకు దాదాపు రూ.34 కోట్లు అవసరమవుతాయి. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించే గ్రాంట్ ద్వారానే ఈ చెల్లింపులు జరుగుతాయి. అయితే, కూటమి ప్రభుత్వం వచ్చాక పరిస్థితి ‘అంతా ఉన్నా.. అల్లుడి నోట్లో శని‘ అన్న చందంగా తయారైంది. గ్రాంట్ల విడుదలలో జాప్యం కారణంగా ప్రతి నెలా జీతాలు ఆలస్యమవుతున్నాయి. గత నెల మాదిరిగానే ఈ నెలలో కూడా ఇంతవరకు జీతాలు పడకపోవడంతో ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమైంది. వందేళ్ల వైభవాన్ని చాటిచెప్పే ఉత్సవాల హడావుడి మధ్య, వేలాది మంది ఉద్యోగుల ఆకలి కేకలు పాలకులకు వినిపించకపోవడం గమనార్హం. గ్రాంట్ల నిలిపివేత.. ఉద్యోగుల కడుపుకోత ప్రభుత్వం ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఆంధ్రా యూనివర్సిటీకి బ్లాక్ గ్రాంట్ కేటాయిస్తుంది. ఈ నిధులను త్రైమాసిక ప్రాతిపదికన విడుదల చేస్తారు. ఆ నిధులు ప్రధానంగా ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, నిర్వహణ ఖర్చులకు వినియోగిస్తారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ నిధుల విడుదలకు ఎగనామం పెడుతోంది. దీంతో ఉద్యోగులకు కడుపుకోత మిగులుతోంది. ట్రెజరీ నుంచి రావాల్సిన నిధులు సకాలంలో రాకపోవడంతో, వర్సిటీ నిర్వహణ అగమ్యగోచరంగా మారింది. ‘ముందు వెనుక చూసుకోకుండా వేడుకలు చేయడం.. ఉన్న ఊరిని ఉత్సవాల పాలు చేయడం’ అంటే ఇదేనని మేధావులు విమర్శిస్తున్నారు. అంతర్గత నిధులు ఖాళీ.. భవిష్యత్తు అంధకారం ప్రభుత్వ గ్రాంట్లు రాకపోవడంతో వర్సిటీ అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో ’అంతర్గత నిధుల’పై చేయి వేస్తున్నారు. గత ఏడాది కాలంలో సుమారు రూ.70 కోట్ల అంతర్గత నిధులను జీతాల కోసం మళ్లించారు. ఆ నిధులను ప్రభుత్వం తిరిగి రీయంబర్స్ చేయకపోవడంతో ఏయూ ఖజానా ఇప్పుడు వెలవెలబోతోంది. ప్రతి నెలా జీతాలు, పెన్షన్ల కోసమే రూ.34 కోట్ల అవసరం ఉండగా, అంతర్గత నిధులు కూడా క్షీణించడంతో ‘కుండలో నీళ్లు లేవు, చేతిలో గిన్నె ఉంది’ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఈ నెల కూడా ఇప్పటివరకు జీతాలు అందకపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగింది. గ్రాంట్ విషయంలో ఉన్నత విద్యా శాఖ అధికారులు కూడా చేతులెత్తేసినట్లు సమాచారం. ఈసారి కూడా అంతర్గత నిధుల నుంచే జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు వర్సిటీలో చర్చ జరుగుతోంది. ఇలాగే కొనసాగితే వర్సిటీ రోజువారీ నిర్వహణకు కూడా నిధులు ఉండవని, విద్యా ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందని మేధావులు, విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. వందేళ్ల చరిత్ర.. వెయ్యి ఆకలి కేకలు. ఆంధ్ర విశ్వవిద్యాలయం అస్తిత్వం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అక్షరాయుధాలను అందించే సరస్వతీ నిలయంలో, అదే అక్షరాలను దిద్దే గురువులు, సిబ్బంది నేడు పస్తులతో అలమటిస్తున్నారు. ఒకవైపు ’శతాబ్ది ఉత్సవాల’ పేరిట రంగుల హంగులు.. మరోవైపు ఖాళీ జేబులతో ఉద్యోగుల కన్నీటి గాథలు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం, నిధుల కోత వెరసి.. ఏయూ భవితవ్యం ఇప్పుడు అగాధంలో పడింది. దివాళా దిశగా ఏయూ ప్రభుత్వం ప్రతిష్టాత్మక విద్యాసంస్థ అభివృద్ధికి నిధులు ఇవ్వాల్సింది పోయి, ఉన్న నిధులను కూడా ఖాళీ చేయించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రయోజనాల కోసం కేవలం ఉత్సవాలకు ప్రాధాన్యత ఇస్తూ జీతాల చెల్లింపుల్లో విఫలమవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ‘పండగ కోసం అప్పు చేసి పస్తులుండే స్థితి’కి ఏయూ చేరిందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెండింగ్ గ్రాంట్లను విడుదల చేసి, విశ్వవిద్యాలయాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని మేధావులు సూచిస్తున్నారు. లేకుంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి, భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుందనే హెచ్చరిస్తున్నారు. -
టి.అర్జాపురంలో ఘనంగా దుర్గమ్మ పండగ
రావికమతం : మండలంలో టి.అర్జాపురం గ్రామ దేవత శ్రీ దుర్గమ్మ అమ్మవారి పండగను గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ మంత్రి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్సార్సీపీ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, మాజీ రాష్ట్ర స్పోర్ట్స్ అధారటీ (శాప్) చైర్మన్, రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిెడెంట్ బైరెడ్డి సిద్దార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆదీప్రాజ్ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజాన రామునాయుడు, వైస్ ఎంపీపీ భవానీప్రసాద్, రాజాన అప్పలనాయుడు, మత్సా రామునాయుడు, యిల్లపు రాము, ఎల్లపు ఎర్రినాయుడు, మరిశా రమణ, మత్సా అర్జున్, చిరంజీవి, రమణ తదితరులు అమర్నాఽథ్కు, బైరెడ్డి సిద్దార్రెడ్డికి ఘన స్వాగతం పలికారు. ఎంపీపీ పైల రాజు, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు కంచిపాటి జగ్గారావు, సీనియర్ నాయకులు మహాలక్ష్మినాయడు, తలారి అదిమూర్తి, మాజీ జెడ్ప్టీసీ ఆసరి వాస్ గోవింద్, గుమ్ముడు సత్యదేవ, గుమ్మాలపాడు సర్పంచ్ బంటు సన్యాసినాయుడు, ఎంపీటీసీలు రమణబాబు, పూడి దేవా, నాయకులు గట్డ్రెడ్డి తాతబాబు, కొత్తకోట ఉప సర్పంచ్ పందల దేవా, మండల వైఎస్సార్సీపీ యూత్ అధ్యక్షుడు చిరంజీవి, సోషల్ మీడియా ఇన్ఛార్జి వెల్లంకి శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. సాయంత్రం పలు సాంస్కృతిక కార్యక్రమాలు, రాత్రికి పలు వినోద కార్యక్రమాలు నిర్వహించారు. -
రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలి
అరకులోయ టౌన్: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు రేగం చాణక్య డిమాండ్ చేశారు. మహిళల మనోభావాలు దెబ్బతీసేలా, వారిని కించపరిచేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా వ్యతిరేక కథనాలపై నిరసన బుధవారం అరకులోయ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వైఎస్సార్సీపీ నాయకులు భారీ నిరసన చేపట్టారు. రాధాకృష్ణ ప్రసారం చేసిన కథనాలు మహిళలను అవమానించేలా ఉన్నాయని మండిపడుతూ, ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేశారు. తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకుని మహిళా లోకానికి ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవి కొత్త పలుకులు కాదు.. చెత్త పలుకులు! ఈ సందర్భంగా రేగం చాణక్య మాట్లాడుతూ.. రాధాకృష్ణ చెప్పేవి ‘కొత్త పలుకులు’ కావని, అవి ‘చెత్త పలుకులు’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో మహిళలను ఎవరు దూషించినా కఠిన చర్యలు తీసుకుంటామని గొప్పలు చెప్పే మంత్రి నారా లోకేష్, హోం మంత్రి అనిత.. రాధాకృష్ణ వ్యవహారంలో ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం ద్వంద్వ వైఖరిని వీడి, తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉమ్మడి విశాఖ జిల్లా ఎస్టీ సెల్ మాజీ అధ్యక్షుడు కమిడి అశోక్ కుమార్, అరకులోయ, డుంబ్రిగుడ మండల పార్టీ అధ్యక్షులు రామ్మూర్తి, పాంగి పరశురాం, మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు పాంగి నాగేశ్వరరావు, మండల యువజన విభాగం అధ్యక్షుడు బోయి కిరణ్ కుమార్, మండల కార్యదర్శి గుంజిడి ప్రసాద్, సుంకరమెట్ట గ్రామ కమిటీ అధ్యక్షుడు కొర్రా అర్జున్ పాల్గొన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
సింహాచలం: చందనోత్సవం సందర్భంగా భక్తులకు సేవలందించే స్వచ్ఛంద సంస్థలకు సింహాచలం దేవస్థానం ఈవో జె.వెంకటరావు, పోలీసులు, జీవీఎంసీ హెల్త్ విభాగం అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. దేవస్థానం పరిపాలన కార్యాలయంలో బుధవారం స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో జె.వెంకటరావు మాట్లాడుతూ.. క్యూల్లో భక్తులకు ఆహార పదార్థాలు, పానీయాలు పంపిణీ చేసేటప్పుడు క్యూలను స్తంభింపజేయకూడదని స్పష్టం చేశారు. ఆహార పదార్థాలు పంపిణీ చేసే ప్రాంతంలో పారిశుధ్య బాధ్యత సంబంధిత సంస్థదేనని.. ఏమాత్రం చెత్త పేరుకుపోయినా వెంటనే తొలగించాలని ఆదేశించారు. పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సదరు సంస్థలను అక్కడి నుంచి పంపించివేస్తామన్నారు. చందనోత్సవం ప్రసాదాల పేరుతో కొన్ని సంస్థలు బయట చందాలు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈవో హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ అధికారి చక్రవర్తి మాట్లాడుతూ.. భక్తులకు అందించే ఆహారం నాణ్యంగా, వేడిగా ఉండాలని, ఫుడ్ పాయిజన్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వలంటీర్లు తప్పనిసరిగా చేతి గ్లౌజులు ధరించాలన్నారు. జీవీఎంసీ అధికారి రాజారావు కుమార్ మాట్లాడుతూ.. ఆహార పంపిణీలో ప్లాస్టిక్ను పూర్తిగా నిషేధించాలని, కేవలం పర్యావరణహిత వస్తువులనే వినియోగించాలని తెలిపారు. గోపాలపట్నం సీఐ సన్యాసినాయుడు మాట్లాడుతూ.. అనుమతి పొందిన సంస్థల ప్రతినిధులను మాత్రమే జాబితా ప్రకారం స్టాళ్ల వద్దకు అనుమతిస్తామని, వాహన పాసులను కూడా రికార్డులు పరిశీలించిన తర్వాతే జారీ చేస్తామని వెల్లడించారు. సమావేశంలో అడవివరం ఆరోగ్య కేంద్రం డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ రామిరెడ్డి, దేవస్థానం ఎస్డీసీ మధులత, సూపరింటెండెంట్ నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు. -
గిరిజన రైతులకు ఆర్థిక భద్రతే లక్ష్యం
మహారాణిపేట(విశాఖ): గిరిజన రైతులు సేకరించే అటవీ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులకు సరైన ధరలు అందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి అధికారులను ఆదేశించారు. బుధవారం విశాఖలో గిరిజన సహకార సంస్థ(జీసీసీ) కార్యకలాపాలపై ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లోని కొనుగోలు కేంద్రాలు, డి.ఆర్.డిపోలు సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. గిరిజనుల వద్ద సేకరించిన ఉత్పత్తులకు ఆన్లైన్ ద్వారా నగదు జమ చేయాలని, తద్వారా పారదర్శకత పెరుగుతుందని పేర్కొన్నారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందని, కాఫీ కొనుగోళ్లు పెంచి రైతులకు ప్రోత్సాహం అందించాలని కోరారు. గిరిజన రైతులకు ఆర్థిక భద్రత, మార్కెట్ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. అటవీ ఉత్పత్తుల సేకరణ, మార్కెటింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధిపై మంత్రి సమీక్షించారు. గిరిజన కుటుంబాల ఆదాయం పెంచే దిశగా మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా జీసీసీలో పనిచేస్తున్న 33 మంది సేల్స్మెన్కు జూనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ, వారికి నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్, మేనేజింగ్ డైరెక్టర్ శోభిక, పలువురు అధికారులు పాల్గొన్నారు. -
అడ్డుకోవడం అన్యాయం
అనకాపల్లి: మహిళల పట్ల ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యలపై నిరసన తెలిపేందుకు బుధవారం విశాఖ వెళుతున్న వైఎస్సార్సీపీ అనకాపల్లి నాయకులను పట్టణ పోలీసులు అడ్డుకోవడం అన్యాయమని వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు అన్నారు. స్థానిక ఉడ్పేట నుంచి వైఎస్సార్సీపీ నాయకులు విశాఖకు వెళుతున్న సమయంలో పట్టణ పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖపట్నంలో జరిగే నిరసన కార్యక్రమానికి అనుమతి లేదని, వెళితే కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శాంతియుత వాతావరణంలో నిరసన తెలపకుండా పోలీసులతో అణిచివేయాలనుకోవడం మూర్ఖత్వమన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన నీచపు వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని, మహిళలకు క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జె.రమేష్ మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు సభ్యసమాజం సిగ్గుపడేలా ఉన్నాయని, ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 84వ వార్డు ఇన్చార్జి కె.రాఘవ, 82వ వార్డు ఇన్చార్జి అల్లు త్రినాథ్, మాజీ కౌన్సిలర్ నడిశెట్టి మధు, పార్టీ సీనియర్ నాయకులు ఉగ్గిన అప్పారావు, కోన ఉమా, లక్కోజు రాంబాబు, తంగేళ్ల రామకృష్ణ, చింతా రాంజీ, రేబాక స్వామి, సత్తిబాబు, కొంకీ శ్రీరాంమ్మూర్తి,గుండా రమేష్ గుప్తా, కాండ్రేకుల శ్రీనివాసరావు,సతీష్ రెడ్డి, దేశెట్టి బసవేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వివరాల సేకరణలో కచ్చితత్వం ముఖ్యం
అధికారులకు సూచనలిస్తున్న కేంద్ర కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ మహారాణిపేట(విశాఖ): భారత ప్రభుత్వ కేంద్ర గణాంక, కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ సౌరభ్ గార్గ్ బుధవారం నగరంలోని జాతీయ గణాంక కార్యాలయాన్ని సందర్శించారు. త్వరలో ప్రారంభం కానున్న నేషనల్ హౌస్హోల్డ్ ఇన్కమ్ సర్వే ఫీల్డ్ వర్క్ను ఆయన క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అనంతరం సర్వే అమలు విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ.. సర్వే నిర్వహణలో కచ్చితత్వం, సమగ్రత, పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. దేశవ్యాప్తంగా చేపట్టనున్న ఈ సర్వే విజయవంతం కావడానికి ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం ఈ సర్వేలో పాల్గొని, నిక్కచ్చిగా సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి.సతీష్, జాయింట్ డైరెక్టర్ రజత్, అసిస్టెంట్ డైరెక్టర్ పి. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
నేలరాలిన మామిడి రైతు ఆశలు
చోడవరం : మామిడి, జీడిమామిడి పంటలకు దెబ్బమీద దెబ్బ తగిలింది. సీజన్ ప్రారంభం నుంచీ పొగమంచు విపరీతంగా పడడంతో ఈసారి మామిడి పూతే అంతంతమాత్రంగా పూచింది. పిందె దశ నుంచి కాయ దశకు వచ్చి ఇప్పుడు పక్వాని వచ్చిన సమయంలో మంగళ, బుధవారాల్లో ఒక్కసారిగా ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం కురవడంతో పంట చాలా మేర దెబ్బతింది. దీనితో మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చోడవరం నియోజకవర్గంతోపాటు పరిసర ప్రాంతాల్లో సుమారు 20 వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతుంది. ఈ ఏడాది మొదట్లో పూత బాగా వచ్చినప్పటికీ వర్షాలు కురవకపోవడంతో పొగమంచు కమ్ముకుంది. మంచువల్ల చాలామేర పూత రాలిపోయింది. దీనితో ఆలస్యంగా పిందెలు వచ్చాయి. అందుకే ఉగాది పండగకు ఆశించిన మామిడి కాయలు దిగుబడి కాక చాలా గిరాకీగా అమ్మాయి. 50శాతమే ఇప్పుడు తోటల్లో కాయలు ఉన్నాయి. కనీసం ఆ పంటైనా చేతికి వస్తే పెట్టుబడులైనా వస్తాయని రైతులు ఆశించారు. ఇప్పుడు కాయదశ నుంచి పక్వానికి చేరుకున్న సమయంలో ఒక్కసారిగా భారీ ఈదురుగాలులతో కురిసిన వర్షం మామిడి రైతులను నిండా ముంచేసింది. పెద్ద ఎత్తున గాలులు వీయడంతో కాయదశలో ఉన్న మామిడి పంట చాలా మేర నేలరాలిపోయింది. చోడవరం, అనకాపల్లి, మాడుగుల, దేవరాపల్లి, కె.కోటపాడు, బుచ్చెయ్యపేట ప్రాంతాల్లో ఉన్న తోటల్లో మామిడికాయలు నేలరాలిపోయింది. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి తోటలు లీజుకు తీసుకున్న రైతులు, స్వతహాగా తోటలు కాపు కాస్తున్న రైతులు ఈ అకాల వర్షం, గాలులతో తీవ్రంగా నష్టపోయారు. గాలులు గట్టిగా వీయడంతో నేలరాలిన కాయలన్నీ పగిలి పోయాయి. కనీసం అమ్మకానికి కూడా వీలులేకుండా పంటనష్టం జరిగింది. ఈ సీజన్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మామిడి రైతుల ఆశలు నిరాశలయ్యాయి. పెట్టుబడి పోయింది గాలివానకు పెట్టుబడి కూడా పోయింది. నేను తోటకూరపాలెం గ్రామంలో 3 ఎకరాల మామిడి తోట లీజుకి తీసుకున్నాను. ఈ ఏడాది ఏదో కొంత పంట పండింది. ఇప్పుడిప్పుడే కాయదశ నుంచి పక్వానికి చేరింది. కాయ పెరుగుతున్న సమయంలో ఒక్కసారిగా గాలివాన వచ్చింది. గాలి భీకరంగా రావడంతో చెట్లకు ఉన్న కాయంతా నేలరాలిపోయింది. సుమారు రూ.లక్షా 40వేలు పెట్టుబడి పెట్టాను. పంట చాలా వరకు రాలిపోయింది. దీంతో పెట్టుబడి కూడా వచ్చేలా లేదు. ఈ రాలిపోయి దెబ్బతిన్న కాయలు ఎవరూ కొనరు, తెగనమ్ముకోవడం తప్ప చేసేదేం లేదు. బాధిత మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – వెంకటరమణ, మామిడిరైతు, తోటకూరపాలెం -
ముఖ ఆధారిత హాజరులో మనదే మొదటి స్థానం
నాతవరం : ఉపాధి హామీ పథకంలో ముఖఅధారిత హాజరు రాష్ట్రంలోనే మనం మొదట స్థానంలో ఉన్నామని ఉమ్మడి జిల్లా డ్వామా ప్రాజెక్టు అధికారి సిహెచ్.నిర్మలాదేవి అన్నారు. మండలంలో బుధవారం చెర్లోపాలెం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో చేస్తున్న పనులను తనిఖీలు చేశారు. పనిచేసే మస్తరు హాజరు పట్టికను పరిశీలించి వేతనదారులతో మాట్లాడారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందుల గురించి కూలీలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత గ్రామపెద్దలతో సమావేశమై ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి పలు విషయాలను డ్వామా ప్రాజెక్టు అధికారి దృష్టికి మాజీ సర్పంచ్ బాబులునాయుడు తీసుకెళ్లారు. ఈ పథకంలో పనిచేసిన కూలీ డబ్బులు సకాలంలో రావడం లేదని కొందరు ఆమె దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహత్మాగాంధీ ఉపాధి పథకం పేరు ఈనెల వరకు మాత్రమే ఉంటుందన్నారు. వచ్చే నేల మే నుంచి కేంద్ర ప్రభుత్వం ఈపథకం పేరు మార్పు చేస్తుందన్నారు. ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకంలో పని చేసే కూలీలకు హాజరు ముఖ ఆధారితలో రాష్ట్రంలో విశాఖపట్నం జిల్లా మొదట స్థానంలో, అనకాపల్లి జిల్లా రెండో స్థానంలో ఉందన్నారు. ముఖ అధారిత హాజరు కారణంగా ఉపాఽధి హామీ పఽథకంలో ఎలాంటి అవకతవకలు జరిగేందుకు ఆవకాశం లేదన్నారు. వచ్చే నెల నుంచి ఆ పథకంలో అనేక మార్పులు వస్తాయని వాటిపై ఇప్పటికే క్షేత్ర స్థాయిలో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జల ధార జలహారతి కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, డిప్యూటీ ఎంపీడీవో మూర్తిబాబు, పంచాయతీ కార్యదర్శి లోవరాజు, ఉపాధి హామీ పథకం ఏపీడీ చిన్నారావు, ఏపీవో దాసరి కొండాజీ పాల్గొన్నారు. -
మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే..
ఆయనది జర్నలిజం కాదు బ్రోకరిజం విశాఖలో ఆంధ్రజ్యోతి–ఏబీఎన్ కార్యాలయం ఎదుట భారీ నిరసన మహిళలను కించపరిచే రాతలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ పోలీసుల అడ్డంకుల మధ్య కొనసాగిన శాంతియుత ఆందోళన నిరసన ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, సమన్వయకర్త లు కరణం ధర్మశ్రీ, కె.కె.రాజు, వాసుపల్లి గణేష్, పార్టీ శ్రేణులుఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం మహారాణిపేట: జర్నలిజం విలువలను తుంగలో తొక్కి, బ్రోకరిజమే వృత్తిగా మార్చుకున్న ఆంధ్రజ్యోతి అధినేత వేమూరి రాధాకృష్ణ తీరుపై వైఎస్సార్సీపీ శ్రేణులు కన్నెర్ర చేశాయి. ‘కొత్త పలుకులు’ పేరుతో ఆయన రాస్తున్న ‘చెత్త పలుకులు’ మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయంటూ విశాఖలోని ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని పార్టీ నేతలు బుధవారం ముట్టడించాయి. వైఎస్సార్సీపీ విశాఖ, అనకాపల్లి జిల్లాల అధ్యక్షులు కె.కె.రాజు, బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో పోర్టు హాస్పిటల్ జంక్షన్ వద్ద భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. ఆంధ్రజ్యోతి పత్రిక, ఏబీఎన్ కార్యాలయం వైపు దూసుకువెళ్తున్న పార్టీ శ్రేణులను పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నప్పటికీ, నేతలు రహదారిపై బైఠాయించి రాధాకృష్ణ వైఖరిని పార్టీ నేతలు ఎండగట్టారు. రాధాకృష్ణ తన రాతల ద్వారా మహిళలను కించపరిచారని, తక్షణమే మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి పత్రికలు కేవలం చంద్రబాబు అజెండాను అమలు చేసే సాధనాలుగా మారాయని, బాబు నోటి నుంచి వచ్చే మాటలనే వీరు రాతలుగా రాస్తున్నారని ఆరోపించారు. ఆ రాతలు అత్యంతం నీచం : మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వేమూరి రాధాకృష్ణ ఇటీవల రాసిన కథనాలు అత్యంత నీచంగా ఉన్నాయి. మహిళలను అవమానించేలా రాయడం అసహ్యకరం. వారి గౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్న ఈ రాతలపై రాధాకృష్ణ వెంటనే మహిళా లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి. మీడియా వేదికలను ఉపయోగించుకుని సమాజంలో విభేదాలు సృష్టించడం సరికాదు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ల మెప్పు కోసమే రాధాకృష్ణ ఇలాంటి కథనాలు రాస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం జర్నలిజాన్ని దుర్వినియోగం చేయడం ప్రజాస్వామ్యానికి చేటు. మహిళల మనోభావాలను దెబ్బతీసినందుకు ఆంధ్రజ్యోతి పత్రికలోనే క్షమాపణ చెబుతూ స్పష్టమైన వివరణ ప్రచురించాలి. అసత్య ప్రచారాలు ఆయన నైజం : మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ జర్నలిస్టుగా సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాల్సిన వేమూరి రాధాకృష్ణ, తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఈ తప్పుడు ప్రచారాలకు వ్యతిరేకంగా మేము శాంతియుత నిరసనలు కొనసాగిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే ప్రాజెక్టులపై విషప్రచారం చేయడం దారుణం. దేశంలోనే అతిపెద్ద స్కామ్ అమరావతి ప్రాజెక్ట్ అయితే, మరోవైపు మావిగన్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి అతిపెద్ద గ్రోత్ కారిడార్గా నిలుస్తుంది. అమరావతిలో కేవలం రూ. 4 వేలకే అయ్యే పనులకు రూ. 14 వేలు ఖర్చు చేస్తూ ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో రియల్ ఎస్టేట్ ప్రయోజనాలే కనిపిస్తే, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేశారు. రాజకీయ విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలు చేయడం జర్నలిజం విలువలకు విరుద్ధం. అంతా ముక్తకంఠంతో ఖండించాలి: వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ‘వేమూరి రాధాకృష్ణ చేస్తున్న రాతలు పూర్తిగా అసత్యాలతో కూడినవి. ప్రజలను తప్పుదారి పట్టించేలా కథనాలు రాయడం జర్నలిజం విలువలకు తిలోదకాలు ఇవ్వడమే. మీడియా తన బాధ్యతను గుర్తుంచుకుని వ్యవహరించాలి. ఇలాంటి బాధ్యతారాహిత్య రాతలను సమాజం ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కొనసాగితే ప్రజాస్వామ్యయుతంగా బలమైన ప్రతిఘటన ఎదురవుతుంది. అది బూతుల కరపత్రం: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు రాధాకృష్ణ తనకు తోచినట్లు రాతలు రాస్తున్నారు. ఎల్లో మీడియాలో ఆయన ఒక ’ఎల్లో టెర్రరిస్ట్’. ఆంధ్రజ్యోతి అనేది ఒక బూతుల కరపత్రంలా మారింది. కేవలం చిల్లర కోసం రాధాకృష్ణ ఇన్ని వేషాలు వేస్తున్నారు. మహిళా లోకాన్ని కించపరిచిన ఆయనను రాజకీయంగా భూస్థాపితం చేసేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారు. మహిళల గౌరవానికి భంగం : మాజీ ఎంపీ బి.సత్యవతి రాధాకృష్ణ వ్యాఖ్యలు యావత్ మహిళా లోకాన్ని కించపరిచేలా ఉన్నాయి. ఆయన వెంటనే మహిళలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. అదే పత్రికలో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
ఈఎస్ఐసీ జాయింట్ డైరెక్టర్గా రవికుమార్
సీతంపేట (విశాఖ) : కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్ఐసీ) విశాఖపట్న ం ఉప ప్రాంతీయ కార్యాలయం జాయింట్ డైరెక్టర్ గా కె.ఆర్.రవికుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కోయంబత్తూరు ఉప ప్రాంతీయ కార్యాలయం నుంచి ఆయన విశాఖకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విశాఖపట్నం ఉప ప్రాంతీయ కార్యాలయం పరిధిలో 2025 మార్చి 31 నాటికి 18,705 మంది యజమానుల వద్ద మొత్తం 15,03,306 మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఉన్నట్లు వెల్లడించారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు ఈ విశాఖ ఉప ప్రాంతీయ కార్యాలయ పరిధిలోకి వస్తాయని వివరించారు. లబ్ధిదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం
బుచ్చెయ్యపేట: ప్రజాస్వాయ్యాన్ని ఖూనీ చేసేలా చంద్రబాబు ప్రభుత్వ పాలన సాగుతోందని పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఏబీఎన్లో కొత్త పలుకు పేరుతో మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం విశాఖలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న పాడేరు ఎమ్మెల్యేను బుచ్చెయ్యపేటలో పోలీసులు అడ్డగించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యేతో పాటు వైఎస్సార్సీసీ మండల నాయకులు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు ప్రభుత్వానికి,పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరావు మాట్లాడుతూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ సోషల్ మీడియా,వైఎస్సార్ కాంగ్రెస్సీపీ కార్యకర్తలు,నాయకులపై చంద్రబాబు ప్రభుత్వం కేసులు పెడుతోంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తున్న వైఎస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. కూటమి నేతలు అనుచిత వ్యాఖ్యలు,దాడులు చేస్తుంటే పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కూటమి నాయకులకు, పచ్చ మీడియాకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని తెలిపారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు జోగా కొండబాబు,జెడ్పీటీసీ దొండా రాంబాబు,వైస్ ఎంపీపీ గొంపా చినబాబు,మాజీ సర్పంచ్లు పెదిరెడ్ల మాణిక్యం,సుంకరి గాంధీ,గొంపా అప్పారావు,కోవెల ఈశ్వరరావు,జెర్రిపోతుల రామారావు,రాము తదితరులు పాల్గొన్నారు. -
స్మార్ట్కిచెన్ నిర్ణయం విరమించాలి
దేవరాపల్లి: స్మార్ట్ కిచెన్ పేరిట ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించి మిడ్డే మీల్స్ కార్మికుల పొట్ట కొట్టొదని ఏపీ వ్యవసాయ కార్మిక జిల్లా ఉపాధ్యక్షుడు డి. వెంకన్న, సీఐటీయూ మండల కార్యదర్శి బి.టి. దొర కోరారు. మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు బుధవారం చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మద్దతు ప్రకటించారు. బిల్లులు, వేతనాలు సక్రమంగా సకాలంలో ఇవ్వక పోయినా అప్పులు చేసి మరీ భోజనం అందిస్తున్న కార్మికులను తొలగించే ప్రయత్నం చేయడం అత్యంత దారుణమన్నారు. ఏళ్ల తరబడి పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్న నిర్వహకులకు మెనూ చార్జీలు, వేతనాలు పెంచి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, లేకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం స్థానిక ఎంఈవో ఈశ్వరరావుకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోలా మేరీరత్నం, పల్లి రాములమ్మ, సింగంపల్లి మహాలక్ష్మీ, రాయి సన్యాసమ్మ, గాలి గంగమ్మ, దాసరి రాము, పులిగా రమణమ్మ, కంచి మహాలక్ష్మీ తదితర మిడ్డే మీల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. దేవరాపల్లి ఎంఈవో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న మీడ్డే మీల్స్ నిర్వాహకులు ఎంఈవో ఈశ్వరరావుకు వినతి పత్రం అందజేస్తున్న మధ్యాహ్న భోజన పధకం నిర్వాహకులు -
మహిళలను కించపరిస్తే సహించం
పాడేరు: మహిళా లోకాన్ని కించపరుస్తూ, సభ్య సమాజం తలదించుకునేలా ‘కొత్త పలుకులు’ పేరిట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేశారని వైఎస్సార్సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి మండిపడ్డారు. రాధాకృష్ణ తక్షణమే మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలంతా ఏకమై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆమె హెచ్చరించారు. బుధవారం పాడేరులోని తన నివాసంలో పార్టీ మహిళా నాయకులతో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భాగ్యలక్ష్మి మాట్లాడుతూ..రాధాకృష్ణ జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేస్తున్నారని, కేవలం చంద్రబాబు నాయుడి మెప్పు కోసమే వైఎస్సార్సీపీ మహిళా నాయకురాళ్లను ఉద్దేశించి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. 70 ఏళ్లు పైబడిన వ్యక్తి ఈ విధంగా ప్రవర్తించడం సరికాదన్నారు. గతంలో సాక్షి కార్యాలయంపై టీడీపీ నాయకులు దాడి చేసినప్పుడు గుర్తుకు రాని రాజ్యాంగ విలువలు, ఇప్పుడు వైఎస్సార్సీపీ శ్రేణులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే గుర్తుకు వస్తున్నాయా? అని ఆమె ప్రశ్నించారు. తమ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన ‘మావిగన్’ (విశాఖ–విజయవాడ–గుంటూరు కారిడార్) అంశంపై ప్రజల్లో చర్చ జరుగుతోందని, కేవలం రూ. 20 వేల కోట్లతో 110 కిలోమీటర్ల మేర రాజధానిని అభివృద్ధి చేసే అవకాశం ఉన్నప్పటికీ, గత ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లతో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. ఈ చర్చను పక్కదారి పట్టించేందుకే మహిళలపై వ్యక్తిత్వ హననానికి దిగుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. అనంతరం రాధాకృష్ణ వైఖరికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కురుసా పార్వతమ్మ, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు కిల్లో ఊర్వశిరాణి, ఎంపీటీసీ సభ్యురాలు గిడ్డి విజయలక్ష్మి, జిల్లా వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్పర్సన్ ఎం. సరస్వతి, మాజీ పీఏసీఎస్ అధ్యక్షురాలు లకే రామసత్యవతి తదితరులు పాల్గొన్నారు. -
వేసవి తాపానికి కార్యాచరణ
డాబాగార్డెన్స్ (విశాఖ): జీవీఎంసీ అన్ని జోన్ల పరిధిలో 198 చలివేంద్రాలు, 52 గ్రీన్ షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జీవీఎంసీ అదనపు కమిషనర్ పి.నల్లనయ్య తెలిపారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో హీట్ వేవ్స్ యాక్షన్ ప్లాన్పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేయనున్న చలివేంద్రాల్లో తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లను ప్రజలకు అందివ్వనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి జీవీఎంసీ యంత్రాంగాన్ని సంప్రదిస్తే చలివేంద్రం ఏర్పాటుకు సహకరిస్తామని, ఆ కేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు ఉదయం 5.30 నుంచి 10.30 వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టామని, భవన యజమానులు భవన నిర్మాణ కార్మికులకు వారు పనిచేసిన చోట చల్లని తాగునీరు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని జోనల్ కమిషనర్లను ఆదేశించారు. పక్షులు, పశువుల రక్షణ దిశగా నీటి తొట్లను ఏర్పాటు చేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం జలాశయాల్లో జూలై వరకు సరిపడినంత నీరు సమృద్ధిగా ఉందని పర్యవేక్షక ఇంజనీర్ ఏడుకొండలు తెలిపారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్లు, సహాయక వైద్యాధికారులు, నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు, జేఆర్ నగర్ నివాసిత సంక్షేమ సంఘం ప్రతినిధి కేఎస్ఆర్ మూర్తి, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్ డీఎస్ ఆనంద్, గ్రీన్ క్లైమేట్ ఆర్గనైజేషన్ ప్రతినిధి జేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు. -
పేరు లేని ప్రశంస సంతకం లేని గౌరవం
విశాఖ సిటీ: వందేళ్ల ఉత్తరాంధ్ర విద్యా కుసుమ ఘన వైభవం పాలకుల చేతుల్లో అభాసుపాలవుతోంది. శతాబ్ది ఉత్సవాల వేళ దేదీప్యమానంగా వెలిగిపోవాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతోంది. శత జయంతి పండగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన పాలకులు.. తూతూ మంత్రం వ్యవహారంగా మార్చేశారు. శతాబ్ది ఉత్సవాల పేరుతో ఏడాది క్రితం నుంచి సమీక్షలు, సమావేశాల పేరుతో హడావుడి చేసిన అధికారులు.. ఇప్పుడు కార్యక్రమాల నిర్వహణలో ఘోరంగా విఫలమవుతున్నారు. మంగళవారం జరిగిన శతాబ్ది సాహితీ మహోత్సవం ఇందుకు నిదర్శనం. కవులను, కళాకారులను గౌరవించాల్సిన చోట వారికి అవమానం జరగడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. పేర్లు, సంతకాలు లేకుండా ప్రశంసాపత్రాలు శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఏయూలోని శ్రీ రామనేని కోదండ రామయ్య భవనంలో శతాబ్ది సాహితీ మహోత్సవాన్ని నిర్వహించారు. దీనికి అనేక మంది కవులు, అవధానులు తరలివచ్చారు. భాషాభిమానంతో వచ్చిన వారికి ఏయూ అధికారులు ఇచ్చిన బహుమతి చూసి అందరూ అవాక్కయ్యారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి అందజేసిన ప్రశంసా పత్రాలపై కనీసం గ్రహీత పేరు కూడా లేకపోవడం గమనార్హం. ఎవరి పేర్లు లేకుండా ఖాళీగా ‘ఫిల్ ఇన్ ద బ్లాంక్’ అన్నట్లు పత్రాలు అందజేయడంపై అందరూ విస్తుపోయారు. పేర్లు లేకపోగా.. అలాగే ఆ పత్రాలపై కనీసం వైస్ ఛాన్సలర్ సంతకం కానీ, ఇటు తెలుగు విభాగాధిపతి సంతకం కానీ లేకపోవడం మరింత విశేషం. ఖాళీ కాగితాలను చేతిలో పెట్టి పంపించడం పట్ల సాహితీవేత్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ శతాబ్ది ఉత్సవాల కోసం 2025 నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పాలకులు గొప్పలు చెప్పుకున్నారు. తీరా సమయం వచ్చేసరికి కనీసం ఒక సర్టిఫికెట్ కూడా సరిగ్గా సిద్ధం చేయలేని స్థితిలో ఉండడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. అతిథులకు ఇచ్చే గౌరవ పత్రాలపై బాధ్యతాయుతమైన అధికారుల సంతకాలు లేకపోవడం ఏయూ చరిత్రలోనే ఒక మాయని మచ్చగా మిగిలిపోనుంది.దిగజారుతున్న ప్రతిష్ట ఏయూ శతాబ్ది ఉత్సవాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పూర్వ విద్యార్థులు గర్వపడేలా ఉండాలి. కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రతి కార్యక్రమంలోనూ ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. రాజకీయ జోక్యం ఒకవైపు, అధికారుల అలసత్వం మరోవైపు వర్సిటీని పట్టి పీడిస్తున్నాయి. శతాబ్ది ఉత్సవాల నిర్వహణలో ఇంతటి ఘోర తప్పిదాలు జరుగుతున్నా ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఇప్పటికై నా పాలకులు మేల్కొని, మిగిలిన కార్యక్రమాలనైనా గౌరవప్రదంగా నిర్వహించాలని విద్యావేత్తలు కోరుతున్నారు. -
వీసీ కుర్చీలో ఎంపీ దర్జా
ప్రొటోకాల్కు పాతర, ఏయూ ప్రతిష్టకు దెబ్బవిశాఖ సిటీ : ఆంధ్ర విశ్వవిద్యాలయం మరోసారి వివాదాల కేంద్రమైంది. శతాబ్ది ఉత్సవాల నిర్వహణపై సమీక్ష సమావేశం సందర్భంగా గీతం యూనివర్సిటీ అధినేత, విశాఖ ఎంపీ శ్రీభరత్ ప్రవర్తించిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ప్రొటోకాల్ను తుంగలో తొక్కి ఏకంగా వైస్ చాన్సలర్ సీటులో కూర్చోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ నియమించే అత్యున్నత పదవికి ఇవ్వాల్సిన గౌరవాన్ని గాలికొదిలేసి, ఆ సీటులో తిష్టవేసి సమీక్ష నిర్వహించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. వర్సిటీ ప్రతిష్టను మంటగలిపేలా విశాఖ ఎంపీ శ్రీభరత్ వ్యవహరించిన తీరు ఇప్పుడు విద్యావేత్తలను, మేధావులను విస్మయానికి గురిచేస్తోంది. అధికార దర్పంతో ఎంపీ ఏ విశ్వవిద్యాలయానికై నా వైస్ చాన్సలర్ పదవి అత్యున్నతమైనది. ఆ కుర్చీ కేవలం చాన్సలర్ హోదాలో ఉన్న గవర్నర్ లేదా నియమితులైన వీసీకి మాత్రమే పరిమితం. ఇది దశాబ్దాల సంప్రదాయం. కానీ, శతాబ్ది ఉత్సవాల సమీక్ష పేరుతో వర్సిటీలోకి అడుగుపెట్టిన ఎంపీ శ్రీభరత్.. ప్రొటోకాల్ను తుంగలో తొక్కి ఏకంగా వీసీ కుర్చీనే ఆక్రమించేశారు. సాక్షాత్తూ రాష్ట్ర గవర్నర్ నియమించే అత్యున్నత పదవికి ఇచ్చే గౌరవం ఇదేనా? అని విద్యావేత్తలు మండిపడుతున్నారు. వీసీ ప్రొఫెసర్ రాజశేఖర్ పక్కన సాధారణ కుర్చీలో అసహాయంగా కూర్చుని ఉండగా, ఎంపీ ఆసీటులో తిష్టవేసి సమీక్ష నిర్వహించడం వర్సిటీ స్వయంప్రతిపత్తిని అపహాస్యం చేయడమే. గవర్నర్ హితవు గుర్తులేదా? ఏయూ శతాబ్ది ఉత్సవాల ప్రారంభానికి విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్.. ‘విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు తావులేకుండా పారదర్శక పాలన సాగాలి’ అని హితవు పలి కారు. ఆ మాటల పచ్చబొట్టు చెరిగిపోకముందే, ఎంపీ తన రాజకీయ ప్రతాపాన్ని వీసీ గదిలో ప్రదర్శించడం విశేషం. సోషల్ మీడియాలో వైరల్.. విమర్శల వెల్లువ ప్రస్తుతం ఎంపీ శ్రీభరత్ వీసీ కుర్చీలో కూర్చున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి. గత ఎంపీలు ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడలేదని విద్యావేత్తలు గుర్తుచేస్తున్నారు. గత ఎంపీ ఎం.వి.వి.సత్యనారాయణ సీఎండీని కలిసినప్పుడు పక్కన కూర్చుని మాట్లాడిన ఫొటోలను, ఇప్పుడు శ్రీభరత్ అధికార కుర్చీని ఆక్రమించిన ఫొటోలను పోల్చుతూ విమర్శలు గుప్పిస్తున్నారు. అధికారులను తన అడుగులకు మడుగులు వత్తించుకునే స్థాయికి దిగజారడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. అధికార బలం ఉందన్న గర్వంతో వ్యవస్థలను కించపరిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అలవాటుగా మారిన ’కుర్చీ’ లాట శ్రీభరత్కు ఇలాంటి ‘అధికార దర్పం’ కొత్తేమీ కాదు. గతంలో విశాఖ స్టీల్ప్లాంట్ సందర్శన సమయంలోనూ ఆయన ఇలాగే వ్యవహరించారు. దేశ రాష్ట్రపతి ద్వారా నియమితులయ్యే సీఎండీ స్థానానికి ఒక ప్రత్యేకమైన ప్రొటోకాల్ ఉంటుంది. కేంద్ర సంయుక్త కార్యదర్శి హోదాలో ఉండే సీఎండీ సీటులో ఎంపీ కూర్చుని రివ్యూ చేయడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. సీఎండీ అతుల్భట్ను పక్కన కూర్చోబెట్టుకుని ఆర్డర్లు వేయడం చూసి అక్కడి ఉన్నతాధికారులు ముక్కున వేలేసుకున్నారు. శతాబ్ది ఉత్సవాల వేళ సమున్నత గౌరవంతో వెలగాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయం.. ఇప్పుడు రాజకీయ అహంకారానికి వేదికై ంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఒక ప్రైవేట్ వర్సిటీ అధినేత, ప్రజాప్రతినిధి హోదాలో ఉన్న వ్యక్తి.. రాజ్యాంగబద్ధమైన పదవులకు ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని విస్మరించారు. ‘కుర్చీ’ కనిపిస్తే చాలు.. అది ఎవరిదన్న విజ్ఞత మరిచి ‘నేనే బాస్’ అన్నట్లు ప్రవర్తించడం ఇప్పుడు విశాఖలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. -
నిర్లక్ష్యంతో ముప్పు
సాక్షి, అనకాపల్లి : ఎండాకాలంలో భానుడు భగ్గుమంటున్నాడు. ఈ ఏడాది మార్చి నెల ప్రారంభం నుంచే అధికంగా ఉష్టోగ్రతలు నమోదవుతన్నాయి. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది అధికంగానే ఉష్టోగ్రతలు ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు ఇప్పటికే హెచ్చరించారు. అగ్గిలా మండే ఎండలకు తోడు అగ్నిప్రమాదాలు సంభవిస్తే ఆస్తి, ప్రాణనష్టాలు సంభవించే పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా మార్చి నుంచి జూన్ వరకు నాలుగు నెలల వరకూ ప్రజలతో పాటు అగ్ని మాపక సిబ్బంది ఆప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలను ఆప్రమత్తం చేసేందుకు ఏటా ఏప్రిల్ 14 నుంచి 20వ తేదీ వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. జిల్లాలో 8 అగ్ని మాపక కేంద్రాలు ఉన్నప్పటికీ పెద్ద ప్రమాదాలు సంభవించినప్పుడు నిమిషాల వ్యవధిలోనే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయే అవకాశం ఉంటుంది. పారిశ్రామిక ప్రాంతం..ప్రమాదాల నిలయం జిల్లాలో పారిశ్రామిక ప్రాంతమైన పరవాడ, రాంబిల్లి, అచ్యుతాపురం, కశింకోట మండల పరిధిలో ఒక వైపు పరిశ్రమలు, మరో వైపు ప్రజలకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు జిల్లా వ్యాప్తంగా 560 అగ్నిప్రమాదాలు సంభవించాయి. వీటిలో రూ.10 లక్షలకు పైగా నష్టం సంభవించిన ప్రమాదాలు 2 అత్యంత ప్రమాదకరమైనవి కాగా..40 మీడియం ఫైర్ కాల్స్ (రూ.2 లక్షల నుంచి రూ.10ల క్షల లోపు ), 489 చిన్నపాటి అగ్ని ప్రమాదాలు సంభవించాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన 610 అగ్ని ప్రమాదాల్లో రూ.232 కోట్ల వరకు ఆస్తి నష్టం సంభవిం చగా, రూ.289 కోట్ల ఆస్తిని అగ్నిమాపక సిబ్బంది కాపాడగలిగారు. ఈ ప్రమాదాల్లో 32 మంది ప్రాణాలు కోల్పోగా, 19 మందిని అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడగలిగారు. అలాగే ఈ ప్రమాదాల్లో 20 పశువులు చనిపోగా, ఒక దాన్ని సిబ్బంది కాపాడారు. రెస్క్యూ చేస్తుండగా 18 మంది చనిపోగా..ముగ్గురిని కాపాడగలిగారు. అవగాహన కోసమే వారోత్సవాలు అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రభుత్వం ఏటా అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహి స్తోంది. ఈ వారోత్సవాల్లో భాగంగా, విధి నిర్వహణలో మృతి చెందిన సిబ్బందికి నివాళులర్పించడం, బస్టాండ్, మార్కెట్లు, సినిమా థియేటర్లు, మురికివాడల్లో అగ్ని మాపక నియంత్రణ పరికరాల వినియోగం, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన, ఎల్పీజీ స్టోరేజీ, పరిశ్రమల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. అదేవిధంగా ఆసుపత్రిల్లో వైద్యులు, ఇతర సిబ్బందికి అగ్నిప్రమాదం జరిగినప్పుడు ఎలా తమని తాము కాపాడుకోవాలనే అంశంపై అవగాహన కల్పిస్తున్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా అవగాహన కల్పిస్తున్న దృశ్యం(ఫైల్) విస్తృతంగా అవగాహన.. జిల్లాలో సెజ్ ప్రాంతంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో..సేప్టీ ఆడిట్లో భాగంగా ప్రతీ నెలా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తాం. మీ ప్రాంతంలో ఏ ప్రమాదం జరిగిన తక్షణమే ఆయా పరిధిలో ఉన్న ఫైర్స్టేషన్లకు సమచారం ఇవ్వాలని కోరారు. వేసవిలో ప్రతీ ఒక్కరూ అత్యంత జాగ్రత్తంగా ఉండాలని సూచించారు. – వెంకట రమణ, జిల్లా అగ్నిమాపక అధికారి● గ్యాస్ స్టౌను సిలిండర్ కన్నా ఎత్తులో ఉంచి వాడాలి. ● అదనపు సిలిండర్ను వాడుతున్న సిలిండర్కు దూరంగా ఉంచాలి. ● మండే వస్తువులు గ్యాస్ సిలిండర్కు దూరంగా ఉంచాలి. ● చిన్నారులకు అగ్గిపెట్టెలు, లైటర్లు అందుబాటులో ఉంచరాదు. ● వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్ ఆపివేయాలి. ● ఐఎస్ఐ మార్కు ఉన్న ఎల్పీజీ సురక్ష ట్యూబులనే వాడాలి. ● గ్యాస్ లీక్ అవుతున్న అనుమానం వస్తే కిటికీలు, తలుపులు వెంటనే తెరవాలి. ● ఆ సమయంలో ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్ ఆఫ్ చేయకూడదు. ● ఒక ఎలక్ట్రిక్ పాయింట్ వద్ద ఎక్కువ ప్లగ్లు పెట్టరాదు. ● ఇల్లు వదిలి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలి. ● విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే మెయిన్ ఆఫ్ చేసి పొడి ఇసుక లేదా డ్రై కెమికల్ పౌడర్ను నిప్పు మీద చల్లాలి. ● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పి పారేయాలి. ● దుస్తులకు నిప్పు అంటుకుంటే పరుగెత్తరాదు. నేలపై దొర్లాలి లేదా దుప్పటి చుట్టుకోవాలి. ● కాలిన శరీర భాగాల మీద చల్లని నీరు పోయాలి. ● గడ్డివాములను నివాస గృహాలకు దూరంగా వేసుకోవాలి. ● కార్మికులు పనిచేసే స్థలాల్లో కనీసం రెండు ఫైర్ ఎగ్జిట్లు ఏర్పాటు చేయాలి. జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు దూరం... -
పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పతకాల పంట
పతకాలు సాధించిన క్రైం కానిస్టేబుల్ గొర్లె శ్రీనివాసరావును అభినందిస్తున్న డీఎస్పీ శ్రావణి అనకాపల్లి: విశాఖ ఉమ్మడి జిల్లా పోలీస్ యాన్యువల్ క్రీడాపోటీల్లో జిల్లాలో కశింకోట పోలీస్స్టేషన్లో క్రైమ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న గొర్లె శ్రీనివాసరావు 100, 200 మీటర్స్, డిస్కస్ త్రోలో బంగారు పతకాలు 400 మీటర్స్ లో కాంస్య పతకం,, జావిలిన్ , షార్ట్పుట్లో రజత పతకాలు సాధించారు. జిల్లా ఫాస్టెస్ట్ రన్నర్గా పోటీల్లో నిలిచారు. పోటీల్లో గెలుపొందిన గొర్లె శ్రీనివాసరావును స్థానిక కొత్తూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఎం.శ్రావణి మంగళవారం అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రానున్న రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో సీఐ స్వామినాయుడు పాల్గొన్నారు. దేవరాపల్లి: జిల్లా పోలీస్ వార్షిక గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్లో దేవరాపల్లి మండలంలో స్పెష ల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వర్తిస్తున్న రెడ్డి మహేష్కుమార్ సత్తా చాటారు. విశాఖపట్నంలోని కై లా సగిరి సమీపంలోని ఆర్మడ్ రిజర్వ్ పోలీస్ గ్రౌండ్లో మూడు రోజులుగా జరుగుతున్న పోలీస్ వార్షిక స్పోర్ట్స్ మీట్లో బ్యాడ్మింటన్లో సింగిల్, డబుల్స్లో రెండు గోల్డ్ మెడల్స్, కబడ్డీలో బ్రాంచ్ మెడల్ సొంతం చేసుకున్నారు. విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపీనాథ్ శెట్టి, ఎస్పీ తుహీన్ సిన్హా ఇతర పోలీస్ ఉన్నతాధికారుల చేతుల మీదుగా మహేష్కుమార్ పతకాలు, మెమెంటోలు అందుకున్నారు. మహేష్కుమార్ను పలువురు పోలీస్ అధికారులు, సహచర ఉద్యోగులు అభినందించారు. -
వాన వాన.. వడగండ్ల వాన..
బుచ్చెయ్యపేట : బుచ్చెయ్యపేట మండలంలో వర్షం దంచి కొట్టింది. ముత్యాల తలంబ్రాలు పోసినట్టుగా వడగళ్ల వాన కురిసింది. బుచ్చెయ్యపేట, దిబ్బిడి, నేతవానిపాలెం, కందిపూడి, కేపీ ఆగ్రహారం, ఐయితంపూడి, కొమళ్లపూడి తదితర గ్రామాల్లో గుప్పెడంత వడగళ్లు పడడం ఆశ్చర్యం గొలిపింది. ఇంటి ముందు ఉన్న గోళాలు, కుండీల్లో వడగళ్లు పోగులుగా చేరాయి. రోడ్డుపై పెద్దపెద్ద వడగళ్లు పడడంతో పలువురు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. వడగళ్ల వానతో మామిడి కాయలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. -
విధులకు వెళ్తుండగా విషాదం
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణంబైక్ షోరూమ్ ఉద్యోగి మృతి పెందుర్తి: బీఆర్టీఎస్ రహదారిలోని పెందుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలివి. సాలూరుకు చెందిన ఎం.పోలిరాజు (45) చినముషిడివాడలో తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన పెందుర్తిలోని ఒక బైక్ షోరూమ్లో ఆడిట్ విభాగంలో పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు తన ద్విచక్ర వాహనంపై చినముషిడివాడ నుంచి పెందుర్తి బయలుదేరారు. ప్రభుత్వ కళాశాల దాటిన తర్వాత చర్చి సమీపంలోకి వచ్చేసరికి బైక్ అదుపుతప్పి రోడ్డు దాటుతున్న లక్ష్మణ్ అనే వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పోలిరాజు వాహనంపై నుంచి కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలిరాజుకు భార్య కృష్ణవేణి, పిల్లలు ఉన్నారు. పెందుర్తి సీఐ కె.వి. సతీష్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విధి నిర్వహణ కోసం ఉత్సాహంగా ఇంటి నుంచి బయలుదేరిన వారిని మృత్యువు రోడ్డు ప్రమాద రూపంలో కబళించింది. మంగళవారం సబ్బవరం, పెందుర్తి మండలాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఒకరు పంచాయతీ స్వీపర్ కాగా, మరొకరు షోరూమ్ ఉద్యోగి. విధులకు వెళ్తూ మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోవడంతో ఆయా కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది.‘ పంచాయతీ స్వీపర్ దుర్మరణం సబ్బవరం: మండలంలోని గొల్లలపాలెం శివారు అమరపిన్నివానిపాలేనికి చెందిన కొమ్ము దుర్గాలు (65) బోలెరో వాహనం ఢీకొట్టడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. దుర్గాలు గొల్లలపాలెం పంచాయతీలో స్వీపర్గా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు ఆయన కాలినడకన బయలుదేరారు. అదే సమయంలో పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన చిట్టిబోయిన గణేష్ తన ద్విచక్ర వాహనంపై కూర్మన్నపాలెం వెళ్తుండగా.. దుర్గాలు లిఫ్ట్ అడగడంతో అతడిని బైక్పై ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఒక మలుపు వద్ద ఎదురుగా వేగంగా వచ్చిన బోలెరో వాహనం బైక్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ రోడ్డుపై పడిపోగా, దుర్గాలు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ నడుపుతున్న గణేష్కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన బోలెరో వాహనం డ్రైవర్ ఆపకుండా అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆ వాహనం నంబర్ను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ జి.రామచంద్రరావు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లిలోని ఆస్పత్రికి తరలించి, అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. దుర్గాలుకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. పోలిరాజు మృతదేహం, గాయపడ్డ లక్ష్మణ్ -
చట్టాలపై అవగాహనతోనే మహిళలకు రక్షణ
సబ్బవరం: న్యాయ పరిజ్ఞానం మహిళలకు ఆత్మవిశ్వాసాన్ని, శక్తిని ఇస్తుందని.. చట్టాలపై అవగాహన ఉంటే పని ప్రదేశాల్లో ఎదురయ్యే లైంగిక వేధింపులను అడ్డుకోవడం సులభమవుతుందని కేంద్ర సమాచార కమిషన్ కమిషనర్ సుధారాణి రేలంగి అన్నారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నివారణ, నిషేధం, పరిష్కారానికి ఉద్దేశించిన ‘పోష్’చట్టం–2013 అమలుపై మంగళవారం దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో దక్షిణ ప్రాంతీయ న్యాయ సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్యాలయాల్లో అనుచిత వ్యాఖ్యలు, అసభ్య ప్రవర్తన మహిళల గౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోష్ చట్టం.. నివారణ, నిషేధం, పరిష్కారం అనే మూడు ప్రధాన అంశాలపై దృష్టి సారిస్తుందని ఆమె వివరించారు. అంతర్జాతీయ చట్టాల స్ఫూర్తితో రూపొందిన ఈ చట్టాన్ని మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా మరింత విస్తరించాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు వర్సిటీ ఉపకులపతి ఆచార్య సూర్యప్రకాశరావు ప్రారంభోపన్యాసం చేస్తూ.. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు మహిళల స్థానంలో వచ్చిన మార్పులను, పోష్ చట్టం నేపథ్యాన్ని వివరించారు. ఈ కార్యక్రమాన్ని రెండు విభాగాలుగా నిర్వహించారు. మొదటి సెషన్లో పోష్ చట్టంలోని నిబంధనలు, సంస్థాగత వ్యవస్థలపై చర్చించగా.. రెండో సెషన్లో చట్టం అమలులో ఎదురవుతున్న సవాళ్లు, కొత్త సమస్యలపై నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ముగింపు సమావేశంలో రాష్ట్ర న్యాయ విభాగం కార్యదర్శి డాక్టర్ ప్రతిభ రాణి ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. మహిళలు ప్రతిచోటా భద్రత కోసం పోరాడాల్సి రావడం సమాజ దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జాతీయ మహిళా కమిషన్ సభ్యులు, విశాఖ బార్ అసోసియేషన్ న్యాయవాదులు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, డీఎస్ఎన్ఎల్యూ అధ్యాపకులు, పలువురు నిపుణులు పాల్గొన్నారు. కార్యక్రమ సమన్వయకర్తలుగా డాక్టర్ భాగ్యలక్ష్మి, డి.షెర్లీ హెప్సిభా వ్యవహరించారు. కేంద్ర సమాచార కమిషనర్ సుధారాణి రేలంగి -
ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వినూత్నంగా వ్యర్థాల నిర్వహణ
తుమ్మపాల : అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ’నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని, జిల్లాలో 20 కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలలో కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల ప్రిన్సి పాళ్లు, సంబంధిత జిల్లా అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టళ్లలో వ్యర్థాల నిర్వహణను మెరుగుపరచడం, ’జీరో వేస్ట్’ (వ్యర్థాలు లేకుండా చేయడం) లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల కంపోస్ట్ పిట్లు, సోక్ పిట్లు, కిచెన్ గార్డెన్స్ వంటి పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. జూన్ 2026 నుండి జూలై 2027 మధ్యలో ఈ పనులన్నీ పూర్తి చేసి, క్యాంపస్లను ’నెట్ జీరో’గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హార్టికల్చర్ శాఖ, జిల్లా అధికారులు, కేజీబీవీ పాఠశాలల ప్రిన్సిపాళ్లు కీలక పాత్ర పోషించాలన్నారు. కిచెన్ వ్యర్థాల నుంచి ఎరువును తయారు చేసేలా డీకంపోజింగ్ యూనిట్లు, చెత్త సేకరణకు టూ–బిన్ విధానాన్ని అమలు చేయడం, వర్షపు నీటి సంరక్షణ ద్వారా భూగర్భ జలాలను రీఛార్జి చేయడం, మురుగు నీటి నిర్వహణకు సోక్ పిట్స్ ఏర్పాటు చేయడం, విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు, పరిశుభ్రమైన వంటశాలలు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించడం వంటి అంశాలపై సమీక్షించారు. -
వేసవి సెలవుల్లో పారాహుషార్
అనకాపల్లి : ఈ ఏడాది విద్యార్థులకు పరీక్షలు ముగిసాయి, వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో, విద్యార్థులు, చిన్న పిల్లల భద్రతపై తల్లిదండ్రులు ప్రత్యేక నిఘా ఉంచాలని ఎస్పీ తుహిన్ సిన్హా మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెలవుల్లో సరదా కోసం పిల్లలు ప్రమాదకరమైన జలాశయాల వద్దకు వెళ్లకుండా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. పిల్లలు సరదాగా ఈత కొట్టడానికి, స్నానాల కోసం సమీపంలోని చెరువులు, బావులు, కాలువలు, సముద్ర తీరం, నీటి కుంటల వద్దకు వెళ్లే అవకాశం ఉంటుందని, నీటి లోతు తెలియక, ప్రవాహ వేగానికి లోనై ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయే ముప్పు ఉంటుందని, అందువల్ల తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా అటువైపు వెళ్లనివ్వకూడదన్నారు. పిల్లలు ఇంటి వద్ద ఉన్న సమయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో ఉంటున్నారు అనే విషయాలను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని, మధ్యాహ్నం వేళల్లో పిల్లలు బయటకు వెళ్లకుండా ఇళ్లలోనే ఉండేలా జాగ్రత్తలు వహించాలన్నారు. నీటి ప్రమాదాల వల్ల కలిగే నష్టాలను, గతంలో జరిగిన విషాద సంఘటనలను పిల్లలకు వివరించి వారిలో అవగాహన పెంచాలన్నారు. సెలవుల్లో పిల్లలను ఆటపాటలు, కథల పుస్తకాలు చదవడం, వేసవి శిక్షణ శిబిరాల వైపు మళ్లించడం ద్వారా వారి సమయాన్ని సురక్షితంగా ఉపయోగకరంగా గడిపేలా చూడాలన్నారు. సముద్ర తీర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు, స్థానికులు అలల ఉధృతిని గమనించాలని, హెచ్చరిక బోర్డులు ఉన్న చోట నీటిలోకి దిగరాదని సూచించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉంటుందని, ఏదైనా అత్యవసర పరిస్థితి, ప్రమాదం సంభవిస్తే వెంటనే డయిల్ 100/112కు లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలన్నారు. -
విశాఖ చేరుకున్న జయపతాక స్వామీజీ
నేడు 550 మందితో అప్పన్న దర్శనం కొమ్మాది/ఏయూక్యాంపస్: అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం(ఇస్కాన్) ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు, ప్రపంచవ్యాప్తంగా భక్తియోగం, శ్రీకృష్ణ తత్వాన్ని ప్రచారం చేస్తున్న పరమపూజ్య జయపతాక స్వామి మహారాజ్ మంగళవారం నగరానికి చేరుకున్నారు. బుధవారం ఉదయం జయపతాక స్వామీజీ 550 మంది సన్యాసులతో కలిసి శ్రీలక్ష్మీనృసింహ స్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం లోక కల్యాణం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ఇస్కాన్ భక్తులతో కలిసి భారీ ఆధ్యాత్మిక ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీ ఆర్.కె. బీచ్ నుంచి ప్రారంభమై పార్క్ హోటల్ వరకు కొనసాగుతుంది. సాయంత్రం ఎంజీఎం పార్క్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక సంగీత విభావరి, భజన, కీర్తన కార్యక్రమాల్లో స్వామీజీ పాల్గొంటారు. అలాగే ఇస్కాన్లో రెండు రోజుల పాటు శ్రీకృష్ణ లీలలపై ఆయన ఆధ్యాత్మిక ప్రవచనాలు చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో నగరవాసులు, భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని ఇస్కాన్ విశాఖపట్నం అధ్యక్షుడు సాంబాదాస్ ప్రభూజీ కోరారు. -
ఆరోగ్యానికి కలసికట్టుగా...
అనకాపల్లి : కరోన వంటి విపత్తుల తరువాత మానవుని జీవనశైలిలో అనేక మార్పులు సంభవించాయని, రహదారులపై జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల వివిధ రకాలైన వ్యాధులు బారినపడే అవకాశాలు ఉన్నాయని డీఎంహెచ్వో ఎం.హైమావతి అన్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఏడాది ప్రభుత్వం ‘ఆరోగ్యానికి కలిసికట్టుగా–విజ్ఞానానికి అండగా నిలబడదాం’ నేపథ్యం పురస్కరించుకుని స్థానిక ఎన్టీఆర్ ఆస్పత్రి నుంచి క్రీడామైదానం వరకూ మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంగులు కలిసిన ఆహారం, రసాయనాలతో మాగబెట్టిన మామిడి, అరటి, బొప్పాయి వంటి పండ్లుని తినడం వల్ల ఆరోగ్యానికి హానికరం అని, సహాజసిద్ధమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం, రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, డీసీహెచ్ఎస్ శ్రీనివాసరావు, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి చంద్రశేఖర్దేవ్, వైద్యు సిబ్బింది తదితరులు పాల్గొన్నారు. -
హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ను సస్పెండ్ చేయాలి
అనకాపల్లి: దేవరాపల్లి పీహెచ్సీ పరిధిలో గర్సింగి గ్రామ సచివాలయ హెల్త్ సెక్రటరీ రాజ్యలక్ష్మి ఆత్మహత్యా యత్నానికి కారకులైన హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజ్ను వెంటనే అరెస్టు చేసి విధులు నుంచి తొలగించాలని ప్రజా సంఘాల నాయకులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు మాట్లాడారు. డబ్బు మదంతో పుష్పరాజు బెదిరింపులు చేసి తోటి ఉద్యోగులపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహించారు. అక్రమంగా డబ్బులు వసూళ్లకు పాల్పడటంతోపాటు మహిళా ఉద్యోగులపై శారీరకంగా మానసికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని, ఇటువంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో కొనసాగించటానికి వీలులేదన్నారు. ఐద్వా మహిళా సంఘం జిల్లా కార్యదర్శి డి.డి. వరలక్ష్మి, గిరిజన సమాఖ్య అల్లూరి సీతారామరాజు జిల్లా నాయకుడు రాధాకృష్ణ, శ్రామిక మహిళా నాయకురాలు నారాయణమ్మ, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గంటా శ్రీరామ్ మాట్లాడుతూ ఇతర ఆరోగ్య సిబ్బందిని వేధింపులకు గురిచేస్తున్న హెల్త్ సూపర్వైజర్ పుష్పరాజుపై మండల అభివృద్ధి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆయన ఆగడాలు మరింత మితిమీరుతున్నాయని ఆరోపించారు. గిరిజనురాలైన రాజ్యలక్ష్మిని కులదూషణతోపాటు లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆత్మహత్యకు యత్నించి పాడేరు ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోందని వాపోయారు. ఘటనపై విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని ముందస్తుగా అనారోగ్యం పేరుతో హాస్పిటల్లో చేరడం విడ్డూరంగా ఉందన్నారు. చర్యలు తీసుకోని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. -
● నేల కొరిగిన హోర్డింగ్.. ● నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
అనకాపల్లి టౌన్: పట్టణంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ సమయంలో వీచిన ఈదురు గాలుల ధాటికి ఒక్కసారిగా హోర్డింగ్, కటౌట్లు నేలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. గవరపాలెం పార్స్ సెంటర్, విజయరామరాజు పేట అండర్ బ్రిడ్జి, శారదానగర్, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. వర్షం బీభత్సంతో నాలుగురోడ్ల జంక్షన్లో బస్టాప్ ముందర ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్, జీవీఎంసీ కార్యాలయం మేడపైన ఉన్న కటౌట్లు నేలకొరిగాయి. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఈ ప్రదేశంలో నిత్యం బస్లు, ఆటోల కోసం ప్రయాణికులు వేచి ఉంటారు. వర్షం వల్ల జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. ఇక వర్షం కారణంతో రాత్రి 7 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. -
గీతం ఆక్రమిత భూములపై చర్యలు తీసుకోవాలి
మహారాణిపేట: గీతం విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆక్రమించిన అసైన్డ్ ప్రభుత్వ భూములపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ ఇంటెలెక్చువల్ ఫోరం విశాఖ జిల్లా అధ్యక్షుడు దేవరకొండ మార్కండేయులు, వైఎస్సార్ సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పాకా సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్)లో వారు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ.. రుషికొండ ప్రభుత్వ భూముల వినియోగంపై కూడా సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. గీతం విశ్వవిద్యాలయం యాజమాన్యం ఆక్రమించిన 54.79 ఎకరాల ప్రభుత్వ భూములు ఎండాడ, భీమిలి మండలాల పరిధిలోని రుషికొండ ప్రాంతంలో సర్వే నంబర్లు 15, 16, 19, 20లలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ ల్యాండ్స్ యాక్ట్ 1977 ప్రకారం ప్రభుత్వం కేటాయించిన భూములను కొనడం లేదా అమ్మడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. రుషికొండ ప్రాంతంలో పర్యాటక శాఖకు చెందిన భూమిలో గతంలో ప్రభుత్వ అవసరాల కోసం గెస్ట్ హౌస్ నిర్మాణం జరిగితే, అప్పట్లో కూటమి నాయకులు తీవ్ర విమర్శలు చేసి, దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ప్రస్తుతం ఆ భవనాలు కూటమి ప్రభుత్వ హయాంలోనే ఉన్నప్పటికీ, వాటిని ప్రజల అవసరాలకు వినియోగించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పాకా విమర్శించారు. ఆ భవనాలను కొందరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రభుత్వ ఆస్తుల దుర్వినియోగానికి దారితీస్తుందని మార్కండేయులు హెచ్చరించారు. గిన్ని రాధాకృష్ణ, విజయ్ భాస్కర్, సుగుణ కుమార్, హరి పట్నాయక్, రామకృష్ణారెడ్డి, మద్ది లక్ష్మణరావు, వెంకటరమణ, పిల్లా అప్పారావు, పైడిరాజు, బీసీ సెల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అప్పలస్వామి, చుక్కా అప్పారావు, బోరా రామిరెడ్డి, వీర రాఘవులు, రాజా చంద్రశేఖర్, మహమ్మద్ సలీమ్, వన్టౌన్ దాసరి విజయ భాస్కరరెడ్డి, ఎం.డి.జాఫర్ అలీ, జిల్లా ప్రధాన కార్యదర్శి పేరం రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పీజీఆర్ఎస్లో వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు -
దాహం.. దాహం
వేసవి ఆరంభంలోనే నీటి ఎద్దడి మొదలైంది. ఎండల తీవ్రత ఎక్కువగా కావడంతో జిల్లాలో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. బోరుల్లో, నదుల్లో, బావుల్లో, చెరువుల్లో నీటి వనరులు అడుగంటాయి. ఏజెన్సీని అనుకుని ఉన్న మండలాల్లో శివారు గిరిజన గ్రామాల్లో బిందెడు నీటి కోసం 3 నుంచి 4 కిలోమీటర్ల మేర మండుటెండలో నడుచుకుంటూ వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దాహార్తి తీర్చండి సారూ..అంటూ మొరపెట్టుకుంటున్నారు.సాక్షి, అనకాపల్లి : జిల్లాలో నాతవరం, గొలుగొండ, రోలుగుంట, రావికమతం, మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ మండల పరిధిలో ఉన్న శివారు గిరిజన గ్రామాలలో గుక్కెడు నీటి కోసం గిరిజన ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో గిరిజనులంతా సొంతంగా బావి తవ్వుకున్నారు. వేసవి రావడంతో ఆ బావిలో నీళ్లు కూడా అడుగంటాయి. మరికొన్ని గిరిజన గ్రామాల్లో బురద నీరే గత్యంతరం లేని పరిస్థితుల్లో వడకట్టుకుని తాగుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యపై పలుమార్లు సంబంధిత అధికార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని, గిరిజన మహిళలు బిందెలతో నిరసన తెలియజేస్తున్నారు. చోడవరం నియోజకవర్గం...రావికమతం మండలం కొత్తకోట పంచాయతీలో దేవతమ్మవీధితో పాటు మరో రెండు కాలనీల్లో వాటర్ సమస్యతో దళితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జల్జీవన్ మిషన్ ద్వారా రూ.6 కోట్లు మంజూరు చేశారు. 15 రోజుల పాటు నీళ్లు ఇచ్చినా తరువాత నుంచి వాటర్ రావడం లేదు. ఆ గ్రామంలో రెండు రోజులకొకసారి స్నానాలు కూడా చేసే పరిస్థితిలో ప్రజలు లేరు. రోలుగుంట మండలంలో పలు గిరిజన గ్రామాల్లో నీటి సమస్య ప్రారంభమైంది. గొలుగొండ మండలంలో గిరిజన గ్రామాలు అనంతసాగర్, అంటిమానజోరులు, కచిమి, డొంకాడ, రాజుపేట, డోన్పాలెం, వడపర్తి, జమ్మవరం, పొగచొట్లపాలెం, వెంకటాపురం, నల్లంకి, పెసరాడ గ్రామాల్లో నీటి సమస్య నెలకొంది. ●పాయకరావుపేట, నక్కపల్లి, ఎస్.రాయవరం మండలాలకు తాగునీటి ఎద్దడి నివారణ దిశగా వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సుమారుగా రూ.35 కోట్లతో మెగా ప్రాజెక్టు నిర్మించాలని తలపెట్టారు. ఏలేరు కాలువ నుంచి నీటిని పేటకు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. పైపులైను ద్వారా వచ్చిన నీటిని నిల్వచేసి అక్కడ నుంచి మూడు మండలాల పరిధిలో 140 గ్రామాలకు రక్షిత తాగునీటిని అందించే దిశగా పనులు మొదలు పెట్టారు. అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చి మూలన పడేసింది. 2017లో మళ్లీ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పనులు ప్రారంభమైనా మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తిగా మూలన పడకేసింది. ●కె.కోటపాడు మండలంలో ఆనందపురం గ్రామంలో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామంలో జల్జీవన్ మిషన్ నిధులు రూ.30 లక్షలతో 40 వేల లీటర్ల మంచినీటి పఽథకానికి అనుమతులు మంజూరు అయ్యాయి. దీంతో మంచినీటి పఽథకం నిర్మాణంకు పనులు ప్రారంభించిన తరువాత కూటమి పార్టీల నేతలు శ్మశానవాటికలో ట్యాంక్ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు కోర్టును ఆశ్రయించి పనులు జరగకుండా అడ్డుపడ్డారు. దీంతో 3 ఏళ్లుగా మంచినీటి పథకం నిర్మాణం అసంపూర్తిగా నిలిచింది. గ్రామంలో తాత్కాలికంగా నిర్మాణం చేపట్టిన 10 వేల లీటర్ల మినీ రక్షిత మంచినీటి పథకం ద్వారానే అరకొరగా నీటిని అందిస్తున్నారు. ఆనందపురం నుంచి కె.కోటపాడు వెళ్లే మార్గంలో ఉన్న ఇళ్లకు మాత్రం నేటికీ కుళాయిల ఏర్పాటు లేదు. దీంతో సుమారు 60 కుటుంబాల వారు బోరు నీటిపైనే ఆధారపడాల్సి వస్తుంది. వేసవికాలం కావడంతో చేతిబోర్ల వెంట నీరు అంతంత మాత్రంగానే వస్తుందని ఆయా ప్రాంతాల్లో గల మహిళలు చెబుతున్నారు. 40 వేల లీటర్ల మంచినీటి పఽథకాన్ని పూర్తి చేసి పూర్తి స్థాయిలో గ్రామంలో కుళాయిలు ఏర్పాటు చేసి తాగునీటి కష్టాలు తీర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. ●మాడుగుల, దేవరాపల్లి, చీడికాడ మండల పరిధిలో 55 గిరిజన గ్రామాలు ఉన్నాయి. మాడుగుల మండలంలో వాపర్తి, రాజంపేట గ్రామాల్లో 150 మంది గిరిజనులు నివాసం ఉంటారు. చీడికాడ మండలంలోని కోనాం శివారు బందవీధి గిరిజన గ్రామంలో గిరిజనులు తాగునీటి సమస్య ఉంది. దేవరాపల్లి మండలంలో చింతలపూడి పంచాయతీ మదనగరువు గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. ●నాతవరం మండలంలో 31 గ్రామ పంచాయతీలో మొత్తం 457 చేతి బోర్లు 120 తాగునీటి పథకాలు ఉన్నాయి. కొండ మీద ఉన్న గిరిజన గ్రామాల్లో తాగునీటి పథకాలు నిర్మాణాలు పూర్తయినా.. ఇంటింటా కుళాయి కనెక్షన్లు ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది. సుందరకోట గిరిజన పంచాయతీలో కుళాయిలు ప్రారంభించినా కొన్ని గ్రామాల్లో తాగునీటి సమస్య వెంటాడుతూనే ఉంది. ●బుచ్చెయ్యపేట మండలంలో గత ప్రభుత్వ హయాంలో 68 మంచినీటి పనులు, 26 ట్యాంకులు మంజూరు కాగా కూటమి ప్రభుత్వం వచ్చి 10 నెలలైనా సగం పనులు కూడా పూర్తి కాలేదు. గున్నెంపూడిలో మంచినీటి ట్యాంకు, పైపులైన్ పనులు పూర్తి కాకపోవడంతో తాగునీటి కష్టాలు పడుతున్నారు. తక్షణమే తాగునీటి సమస్య పరిష్కరించాలి గిరిజన గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్య నెలకొనడంతో వచ్చే నెలలో పరిస్థితి మరింత దారుణంగా ఉండనుంది. అధికారులు తూతూ మంత్రంగా వచ్చి చూసిపోతున్నారు. రావికమతం మండలంలో మేజర్ పంచాయతీ కొత్తకోటతో పాటు జిల్లా వ్యాప్తంగా గిరిజన గ్రామాల్లో, ఇతర గ్రామాల్లో నీటి సమస్య ఉంది. అధికారులకు మొర పెట్టుకున్నా ఫలితం లేదు. – కె గోవిందరావు, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు జిల్లాలో మోగుతున్న ప్రమాద ఘంటికలు తాగునీటి చెరువుల్లో, బావుల్లో అడుగంటిన నీటి వనరులు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రారంభమైన తాగునీటి కష్టాలు గుక్కెడు మంచి నీరు కోసం జనం నానాపాట్లు గిరిజన గ్రామాల్లో 4 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చుకోవాల్సిన దుస్థితి నిర్వహణ లోపంతో అధ్వానంగా మారిన నీటి పథకాలు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా ఆలోచన చేయని చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలో 16,059 చేతి పంపులు, 2.64 లక్షల కుళాయి కనెక్షన్లు -
పన్నుల వసూళ్ల్లలో విశాఖ టాప్
ఆరిలోవ: వాణిజ్య పన్నుల శాఖ విశాఖపట్నం డివిజన్–1 మార్చి నెలలో అన్ని రకాల పన్నుల వసూళ్లు రాష్ట్రంలోనే అత్యధికంగా జరిగినట్లు ఆ శాఖ సంయుక్త కమిషనర్ పి.బి.వల్లి తెలిపారు. విశాఖ డివిజన్–1 పరిధిలో భీమిలి, చినవాల్తేరు, డాబాగార్డెన్స్, ద్వారకానగర్, కురుపాం మార్కె ట్, సిరిపురం, సూర్యాబాగ్ సర్కిళ్లతో పాటు ఒక ప్రత్యేక సర్కిల్ ఉన్నాయన్నారు. జీఎస్టీ, నెలవారీ రిటర్న్ ఫైలింగ్, ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్ ప్లాన్, పాత బకాయిల వసూళ్లు ద్వారా ఈ ఏడాది మార్చి నెలలో రూ.158.59 కోట్లు ఆదాయం లభించిందన్నారు. ఇది రాష్ట్రంలోనే అత్యధికమని తెలిపారు. గత ఏడాది మార్చి(2025)లో రూ.150.71 కోట్లు లభించిందన్నారు. డివిజన్లో 2024–25 ఆర్థిక సంవత్సరంలో వార్షిక ఆదాయం రూ.1,733.59 కోట్లు కాగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.1,845.39 కోట్లు ఆదాయం సమకూరినట్లు ఆమె తెలిపారు. -
అర్జీల వెల్లువ
తుమ్మపాల: జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వచ్చిన అర్జీదారులతో కలెక్టరేట్ కిక్కిరిసింది. ఈ వారం కుప్పలు తెప్పలుగా అర్జీలు వచ్చి పడ్డాయి. ప్రధానంగా భూ సమస్యలపై అర్జీలు అధికంగా వచ్చాయి. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరం–1, 2లో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో విజయ కృష్ణన్తోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లకు వచ్చే అర్జీదారుల సమస్యలను అధికారులు వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రతి అర్జీ గడువులోపల చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ వారం పీజీఆర్ఎస్– 131, రెవెన్యూ క్లినిక్– 150 అర్జీలు మొత్తం 281 అర్జీలు వచ్చాయన్నారు. కార్యక్రమంలో పీజీఆర్ఎస్, ఎన్ఏవోబీ, ప్రత్యేక ఉప కలెక్టర్లు ఎస్. సుబ్బలక్ష్మి, మనోరమ, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎక్త్సెజ్ అధికారి వి.సుధీర్, సీపీవో జి.రామారావు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. డిగ్రీ చదువులకు సంకటం పరవాడలో డిగ్రీ కళాశాల ఏర్పాటుతోపాటు నక్కపల్లి డిగ్రీ కళాశాలకు భవన నిర్మాణం వెంటనే చేపట్టాలంటూ ఏఐఎస్ఎఫ్ నాయకులు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఏఐఎస్ఎఫ్ ఆద్వర్యంలో ఇక్కడ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జి.ఫణింద్ర కుమార్ మాట్లాడుతూ పరవాడలో అనేక పరిశ్రమలు ఉన్నప్పటికీ, అక్కడి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులో లేకపోవడం అత్యంత విచారకరమన్నారు. పరిశ్రమలకు పెద్ద ఎత్తున స్థలాల కేటాయించి శంకుస్థాపనలు చేస్తున్న ప్రభుత్వాలు విద్యార్థులు చదువుకోవడానికి కళాశాల భవనాలు నిర్మించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ చదవాలంటే అనకాపల్లి, గాజువాక, విశాఖపట్నం వంటి దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రత్యేకంగా విద్యార్థినుల విషయంలో ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పంపడానికి తల్లిదండ్రులు భయపడటం వల్ల, అనేకమంది విద్యార్థినులు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారన్నారు. నక్కపల్లి డిగ్రీ కళాశాల మంజూరై ఐదేళ్లవుతున్నా ఇప్పటివరకు భవన నిర్మాణానికి స్థలం కేటాయించలేదని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఒంటి పూట తరగతులు నిర్వహించడం శోచనీయమన్నారు. ఉపాధి పనులు చేపట్టాలని కలెక్టర్కు వినతి మాకవరపాలెం: మండలంలోని మామిడిపాలెం పంచాయతీలో ఉపాధి పనులు చేపట్టాలని సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో కలెక్టర్కు గ్రామస్తులు వినతిపత్రం అందించారు. గ్రామంలో గత ఏడాదిగా పనులు చేయడం లేదని వాపోయారు. పంచాయతీ పరిధిలోని మామిడిపాలెం, అడిగర్లపాలెం, పోతలూరులో ఉపాధి వేతనదారులు పనులు లేక ఖాళీగా ఉంటున్నామన్నారు. వీఆర్పీని నియమించలేదన్నారు. 120 మందికి ఒక మేట్ ఉండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, అధికారులు స్పందించి మేట్ల సంఖ్యను పెంచడంతోపాటు ఉపాధి పనులు ప్రారంభించాలని కోరినట్టు మాజీ సర్పంచ్ బుడ్డా రమణ తెలిపారు. రోడ్డు నిర్మాణంలో కాలువలను పూడ్చవద్దని నిరసన అనకాపల్లి –అచ్యుతాపురం రోడ్డు విస్తరణలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న సాగునీటి కాలువలను పూడ్చివేసి వందల ఎకరాల భూములను బీడుగా మార్చవద్దని కోరుతూ మునగపాక, తోటాడ, నాగులాపలి, ఓంపోలు, తోటాడ, మునగపాక, తిమ్మరాజుపేట, హరిపాలెం, తదితర గ్రామాల రైతులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ప్రస్తుతం ఉన్న కాలువలను రోడ్డు విస్తరణలో కలిపేస్తున్నప్పటికి సాగునీటి కాలువకు అదనపు భూ సేకరణ చేపట్టకపోవడం సరికాదన్నారు. కాలువలు నిర్మాణం చేపట్టకపోతే పంటల సాగు పూర్తిగా నిలిచిపోతుందని, వ్యవసాయ భూములు కొర్నుగా మిగిలిపోతాయని, రైతులు వ్యవసాయాన్ని వదిలి పరిశ్రమలకు కూలీలుగా పోవాల్సిన పరిస్థితులు దాపురిస్తాయన్నారు. రోడ్డు విస్తరణపై సమగ్ర విచారణ జరిపించి, కొత్త కాలువలు నిర్మించుటకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, ప్రస్తుతం ఉన్న కాలువలు ధ్వంసం చేస్తూ నిర్మాణాలు చేపడుతున్న గుత్తేదారుపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్కు వినతిపత్రం అందించారు. -
మద్యం మత్తులో భార్యపై దాడి
యలమంచిలి రూరల్ : మద్యం మత్తులో భార్యపై భర్త దాడి చేయడంతో భార్య మృతి చెందిన ఘటన యలమంచిలి పట్టణానికి సమీపంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. పట్టణ ఎస్ఐ తెలిపిన వివరాలివి. అల్లూరి జిల్లా జి.మాడుగుల మండలం ఈదులబయలు గ్రామానికి చెందిన వంతల కుమారి (40) ఏడాది క్రితం భర్తతో విభేదాల కారణంగా ఇద్దరు పిల్లలు, భర్తను వదిలేసి దూరంగా ఉంటోంది. అల్లూరి జిల్లా పాడేరు మండలం చీడిమెట్ట గ్రామానికి చెందిన మర్రి కామేష్తో కుమారికి పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ వివాహం చేసుకుని యలమంచిలి సమీపంలో ఎర్రవరం వద్ద 16వ నెంబరు జాతీయ రహదారి పక్కనున్న ఒక తుక్కు దుకాణంలో ఖాళీ మద్యం సీసాలు వేరు చేసే పని చేస్తున్నారు. దుకాణ యజమాని ప్రతి ఆదివారం వీరికి ఖర్చుల కోసం రూ.1000 అదనంగా ఇస్తూంటారు. గత ఆదివారం వీరిద్దరూ యజమాని ఇచ్చిన వెయ్యి రూపాయలతో మద్యం తాగారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భర్త కామేష్ ఆమె ముఖంపై పిడికిలితో బలంగా గుద్దాడు. ఆమె తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. దీనిపై తుక్కు దుకాణం యజమాని కాకి అప్పారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కుమారి మృతదేహాన్ని అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రి మార్చురీలో భద్రపరిచినట్టు తెలిపారు. -
భర్త కళ్లెదుటే.. భార్య దుర్మరణం
పెదగంట్యాడ : భర్త కళ్లెదుటే భార్య దుర్మరణం పాలైన హృదయ విదారకమైన సంఘటన గాజువాక దరి శ్రీనగర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలివి. శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన గురిబిల్లి జోగిరెడ్డి, గురిబిల్లి శాంతమ్మ (43) భార్యాభర్తలు. వీరిద్దరూ సోమవారం వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంపై శ్రీనగర్ వస్తుండగా.. గాజువాక పోలీస్స్టేషన్ సిగ్నిల్ పాయింట్ దాటిన తర్వాత వెనుక నుంచి వస్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొంది. దీంతో శాంతమ్మ వాహనంపై నుంచి కిందపడిపోయింది. లారీ ఆమె తలపై నుంచి వెళ్లిపోవడంతో తల భాగం నుజ్జునుజ్జయింది. తన కళ్లెదుటే భార్య దుర్మరణం చెందడంతో భర్త కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. సంఘటన స్థలానికి హుటాహుటిన చేరుకున్న గాజువాక పోలీసులు లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. గాజువాక పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకట్టుకున్న పారిశ్రామిక సామర్థ్యం ఎక్స్పో
కశింకోట: జిల్లా స్థాయి పారిశ్రామిక సామర్థ్యం ఎక్స్పో ప్రాజెక్టుల పోటీలో అచ్యుతాపురం మండలం హరిపాలెం హైస్కూలు విద్యార్థుల ప్రాజెక్టుకు ప్రథమ బహుమతి లభించింది. కశింకోటలోని డీపీఎన్ జెడ్పీ హైస్కూలులో ప్రాజెక్టుల ప్రదర్శన నిర్వహించారు. దీనిలో ఎస్.రాయవరం మండలం గుడివాడ హైస్కూలుకి విద్యార్థుల ప్రాజెక్టుకు ద్వితీయ బహుమతి లభించింది. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి విద్యార్థులు తయారు చేసిన పది వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించి ఆహూతులను ఆశ్చర్యచకితులను చేశారు. పర్యావరణం పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, నీటి సంరక్షణ, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలపై ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో రూపొందించిన ప్రాజెక్టులు ప్రదర్శించారు. తక్కువ ఖర్చుతో సామాజిక సమస్యల పరిష్కారానికి అనువైన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. ఈ సందర్భంగా జిల్లా సైన్స్ అధికారి దాడి కాళిదాసు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కార నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. భవిష్యత్లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ సందర్భంగా విజేతలకు జ్ఞాపికలు, బహుమతులు అందజేశారు. జిల్లా మేనేజర్ నారాయణరావు, పాఠశాల హెచ్ఎం ఎన్.వి.జె. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
చందనోత్సవానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు
మహారాణిపేట: గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి సమస్యలు తలెత్తకుండా శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో కీలక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, ఉత్సవంలో నిర్వహించే సంప్రదాయ కార్యక్రమాలపై దేవస్థానం ఈవో జె. వెంకటరావు, ఆలయ పండితులు వివరించారు. అనంతరం అన్ని అంశాలను సమగ్రంగా పరిశీలించిన కలెక్టర్ శాఖల వారీగా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. భద్రతా ఏర్పాట్లను పోలీస్ శాఖ పర్యవేక్షించగా, రవాణా సౌకర్యాల విషయంలో ఏపీఎస్ ఆర్టీసీ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూ.1500, రూ.1000 టికెట్లపై పికప్, డ్రాప్ పాయింట్ల వివరాలు స్పష్టంగా ముద్రించాలని పేర్కొన్నారు. వాహనాల కోసం పరిమిత సంఖ్యలో మాత్రమే పాసులు జారీ చేయాలని ఆదేశించారు. భక్తులకు తాగునీరు, పారిశుధ్యం, మరుగుదొడ్లు, వైద్య సేవలు వంటి మౌలిక సదుపాయాలను మెరుగ్గా కల్పించాలని చెప్పారు. అంబులెన్సులు, అగ్నిమాపక వాహనాలు అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేయడంపై గతంలో అమలు చేసిన నిబంధనలను పాటించాలని తెలిపారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఇతర అవసరమైన వసతుల ఏర్పాటు విషయంలో సంబంధిత శాఖలు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. దాతలు నిర్వహించే అన్నదాన కేంద్రాలను ఫుడ్ సేఫ్టీ అధికారులతో తనిఖీ చేసి ఆహార నాణ్యతను నిర్ధారించాలని ఆదేశించారు. అన్ని ఏర్పాట్లు 17వ తేదీ నాటికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో డీఆర్వో ఎం.విశ్వేశ్వరనాయుడు, భీమిలి ఆర్డీవో సంగీత్ మాధుర్, జీవీఎంసీ సిఎం నరేశ్, ఆర్టీసీ ఆర్ఎం అప్పలనాయుడు, ఈపీడీసీఎల్ ఎస్ఈ శ్యాంబాబు, డీఎంహెచ్వో పి.జగదీశ్వరరావు పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు 65 అర్జీలు
అర్జీదారుల సమస్యను వింటున్న అదనపు ఎస్పీ మోహనరావు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్కు 65 అర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ ఎల్.మోహనరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారివారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో ఉన్న సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భూ తగాదాలు–28, కుటుంబ కలహాలు– 5, మోసపూరిత వ్యవహారాలు–2, ఇతర విభాగాలకు చెందినవి – 30 అర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
రూ.3.86 కోట్లు
‘దక్షిణ కోస్తా జోన్’కుసాక్షి, విశాఖపట్నం: గత రెండు బడ్జెట్లతో పోలిస్తే, ఈ సారి ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రైల్వే కేటాయింపులు చేపట్టింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైల్వే బోర్డు తాజాగా కన్సాలిడేటెడ్ బడ్జెట్ వివరాలను విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్తో పాటు, వాల్తేరు డివిజన్ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని కేంద్రం కీలక కేటాయింపులు చేసింది. ప్రధానంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడంతో పాటు, రద్దీగా ఉండే మార్గాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిచ్చింది. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. వాల్తేరు డివిజన్ పరిధిలో పెండింగ్లో ఉన్న పలు ప్రాజెక్టులు ఇక పట్టాలెక్కనున్నాయి. కేటాయింపుల వివరాలు ఇలా.. విజయనగరం–కొత్తవలస మూడో లైన్: వాల్తేరు డివిజన్లో అత్యంత రద్దీగా ఉండే విజయనగరం–కొత్తవలస సెక్షన్లో 34.7 కిలోమీటర్ల మేర మూడో రైల్వే లైన్ నిర్మాణానికి ఈ బడ్జెట్లో రూ.299.83 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం కూడా ఇదే కావడం విశేషం. ఈ లైన్ అందుబాటులోకి వస్తే సరకు రవాణా రైళ్ల వేగం పెరగడమే కాకుండా, ప్రయాణికుల రైళ్ల ఆలస్యానికి చెక్ పడనుంది. విశాఖ స్టేషన్ ఆధునికీకరణ, భద్రత: విశాఖపట్నం రైల్వే స్టేషన్ పరిధిలో భద్రతను మెరుగుపరచడానికి, రైళ్ల వేగాన్ని పెంచడానికి ‘ఆటోమేటిక్ సిగ్నలింగ్’వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం రూ.49.24 కోట్లు కేటాయించారు. దీని వల్ల స్టేషన్ పరిధిలో రైళ్ల రాకపోకల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. ఎలక్ట్రిక్ లోకో షెడ్ విస్తరణ: దక్షిణ కోస్తా రైల్వే జోన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో, విశాఖ నుంచి నడిచే రైళ్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ప్రస్తుతం 200 ఇంజిన్ల సామర్థ్యం ఉన్న విశాఖ ఎలక్ట్రిక్ లోకో షెడ్ను 225కు పెంచనున్నారు. ఈ పనుల కోసం రూ.20.82 కోట్లు కేటాయించారు. దీనివల్ల ఇంజిన్ల నిర్వహణ మరింత సులభతరం కానుంది. జోన్ ప్రధాన కార్యాలయానికి నిధులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి బడ్జెట్లో చేయూత లభించింది. జోనల్ కార్యాలయ భవన నిర్మాణం, ప్రహరీ వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కోసం రూ.3.86 కోట్లు కేటాయించారు. మరికొన్ని.. ●పలాస–విశాఖపట్నం–దువ్వాడ సెక్షన్లో సుమారు 72 కిలోమీటర్ల మేర ట్రాక్ ఆధునికీకరణ పనులకు రూ.87.93 కోట్లు కేటాయించారు. ఇది రైళ్ల ప్రయాణ వేగాన్ని పెంచడానికి దోహదపడుతుంది. ●వాల్తేరు డివిజన్ పరిధిలోని వివిధ స్టేషన్లలో పాత సిగ్నలింగ్ వ్యవస్థ మార్పునకు రూ.31.26 కోట్లు, ఎఫ్అండ్ జీ క్యాబిన్ల ఆధునికీకరణకు రూ.27.41 కోట్లు కేటాయించారు. ●విశాఖ కోచింగ్ డిపోలో రన్నింగ్ రూమ్, క్రూ లాబీ అప్గ్రెడేషన్ కోసం రూ.4.90 కోట్లు కేటాయించారు. ●విశాఖపట్నం న్యూ గూడ్స్ కాంప్లెక్స్ వద్ద సౌకర్యాల మెరుగుదలకు రూ.21.84 కోట్లు కేటాయించారు. ఇది సరకు రవాణా ఆదాయాన్ని పెంచేందుకు దోహదపడనుంది. -
కంటెయినర్లలో పశువుల అక్రమ రవాణా
నక్కపల్లి : కంటైనర్లలో పశువులను కుక్కి అక్రమంగా రవాణా చేస్తున్నట్టు నక్కపల్లి పోలీసులకు సమాచారం అందడంతో వేంపాడు టోల్గేట్ వద్ద కంటైనర్ను పట్టుకున్నారు. విజయనగరం జిల్లా మానాపురం నుంచి విజయవాడ సమీపంలో ఉన్న హనుమాన్ జంక్షన్ వద్దకు కంటైనర్లో రెండు అరలను ఏర్పాటు చేసి 48 ఎద్దులను ఉంచి రవాణా చేస్తున్నట్టు గుర్తించారు. ఈ కంటైనర్ను పట్టుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి కొత్తవలసలో ఉన్న గోశాలకు తరలించినట్టు సీఐ జె.మురళి తెలిపారు. కాగా ఇదేవిధంగా నిత్యం 30 నుంచి 40 కంటైనర్లలో పశువులు కబేళాకు తరలిపోతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప ఈ అక్రమ రవాణా పోలీసుల కంట పడడం లేదు. పోలీసుల కళ్లు కప్పడానికి లారీలు, వ్యాన్లు బదులుగా పశువుల రవాణాకు కంటైనర్లను ఉపయోగిస్తున్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస కేంద్రంగా ఈ పశురవాణా ఏళ్ల తరబడి జరుగుతోంది. కంటైనర్లో 40 నుంచి 50 గోవులను కుక్కి ఊపిరి ఆడకుండా చేసి వందల కిలోమీటర్ల దూరం మేత గాని, తాగడానికి నీళ్లు గాని ఇవ్వకుండా హింసిస్తూ కబేళాకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో మార్గమధ్యంలో కొన్ని పశువులు మృత్యువాత కూడా పడుతున్నాయి. అధికార పార్టీ నేతలు, వారి పీఏల కనుసన్నల్లో... ఈ పశువులను రవాణా చేసే వ్యక్తి అధికార పార్టీకి చెందిన ముఖ్య నాయకులను, వారి వద్ద పనిచేసే పీఏలను, అనుచరులను గుప్పెట్లో పెట్టుకుని నెలవారీ మామూళ్లు చెల్లిస్తూ కంటైనర్లను పట్టుకోకుండా జాగ్రత్త పడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పశు మాఫియాలో రెండు వర్గాల మధ్య విభేదాల కారణంగా ఒక వర్గానికి చెందిన కంటైనర్లను మరో వర్గానికి చెందిన వారు పోలీసులకు ఫిర్యాదు చేసి పట్టించడం జరుగుతోంది. అలాగే ఈ వ్యవహారంలో కీలక శాఖ మంత్రి వద్ద ప్రైవేటు పీఏగా పనిచేస్తున్న వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలు రావడంతో కొద్దిరోజుల పాటు పశురవాణా నిలిచిపోయింది. తాజాగా మళ్లీ పశు రవాణా ప్రారంభమైంది. తప్పుడు సర్టిఫికెట్లతో... ఈ అక్రమ రవాణాలో పశుసంవర్ధక శాఖ ప్రమేయంపైనా విమర్శలు వినిపిస్తున్నాయి. పశువుల మాఫియా వద్ద కూలీలుగా పనిచేసే వారి ఆధార్ కార్డులను ఉపయోగించి వారే రైతులు, వారే కూలీలు, కొనేది వారే, అమ్మేది వారే అన్నట్టు సర్టిఫికెట్లు సంపాదించి పశువులను మేపుకొనేందుకే తరలిస్తున్నట్టు సర్టిఫికెట్లు సంపాదిస్తున్నారు. వాటిని చూపించి అక్రమంగా రవాణా చేస్తూ కబేళాకు తరలిస్తున్నారు. -
రైతులతో ఏపీఐఐసీ చెలగాటం
నక్కపల్లి : ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లుంది. మండలంలో పలువురు రైతుల పరిస్థితి. బల్క్ డ్రగ్పార్క్, స్టీల్ప్లాంట్ కోసం భూసేకరణ రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తోంది. తమ సమస్య పరిష్కరించాలంటూ సోమవారం రైతులు ఇచ్చిన అర్జీలను ఏపీఐఐసీ అధికారులు తీసుకోవడానికి నిరాకరించారంటూ రాజయ్యపేట రైతులు ఆరోపిస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తోందంంటూ ఆరోపిస్తున్నారు. కంపెనీల కోసం గుర్తించిన భూముల క్రయ విక్రయాలపై కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భూములు ఏపీఐఐసీ వారు తీసుకుని నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ వాపోతున్నారు. తమ భూములపై ఉన్న ఆంక్షలు తొలగిస్తే వేరొకరికి విక్రయిస్తామని లేదా ప్రభుత్వానికే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, తమకు నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రాజయ్యపేట సర్వేనెంబరు270,270/1ఈ,270/1డీ,271,272, 243/14,15లలో సుమారు10 ఎకరాల భూమి ఉంది. ఈ భూమిని 2017లో ప్రభుత్వం ఎకరా రూ.18 లక్షల చొప్పున సేకరించడానికి నిర్ణయించింది. ఈ భూములు ప్రభుత్వానికి ఇచ్చేందుకు రైతులు సిద్ధపడ్డారు. అధికారులు మాత్రం భూములు తీసుకోకుండా వాటిపై క్రయ విక్రయాలు జరగకుండా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆంక్షలు విధించారు. మా భూములు సేకరించి నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని, రైతులు మైలపల్లి మహేష్, మైలపల్లి బైరాగి రాజు, బి.అప్పలరాజు, డి. వీర్రాజు, వాసుపల్లి రాము తదితరులు చెబుతున్నారు. నక్కపల్లిలో ఏర్పాటు చేసిన ఏపీఐఐసీ జోనల్ కార్యాలయానికి వెళ్లి అర్జీ పెట్టుకుంటే జోనల్ మేనేజర్ నుంచి అనుమతి వస్తేనే తీసుకుంటామని చెబుతున్నారని రైతులు తెలిపారు. భూములు ఎప్పటిలోగా తీసుకుంటారో లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని, లేదా అవసరం లేని పక్షంలో భూముల క్రయవిక్రయాలపై ఆంక్షలు తొలగిస్తూ జీవో విడుదల చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటున్నారు. ఆంక్షలు తొలగిస్తే మా భూములు వేరొకరికి అమ్ముకుంటామంటూ వారు ప్రాధేయపడుతున్నారు. ఇదే విషయంపై సోమవారం రాజయ్యపేట వచ్చిన ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నర్సింహరావు, డిప్యూటీ జోనల్ మేనేజర్ రాజశేఖర్లకు వినతి పత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా వారు తీసుకోవడానికి నిరాకరించారని రైతులు తెలిపారు. కూటమి ప్రభుత్వం రాజయ్యపేటలో రైతులను ఇబ్బందులకు గురిచేయడం తగదని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదం
విజేతలకు బహుమతులు అందజేస్తున ఐజీ గోపినాథ్ జట్టి, అనకాపల్లి ఎస్పీ తుహిన్ సిన్హా ఆరిలోవ : పోలీసులకు పని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు, వ్యాయామం ఎంతగానో దోహదపడతాయని విశాఖ రేంజ్ ఐజీ గోపినాఽథ్ జట్టి తెలిపారు. అనకాపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విశాలాక్షినగర్ ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో మూడు రోజుల పాటు జరిగిన పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ సంబరాలు సోమవారం ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల్లో ఐజీ పాల్గొని విజేతలను అభినందించారు. అనకాపల్లి, పరవాడ, నర్సీపట్నం, సబ్ డివిజన్లతో పాటు ఆర్మడ్ రిజర్వ్ విభాగానికి చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది ఈ మీట్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హాతో కలిసి బహుమతులు అందజేశారు. అనంతరం ఐజీ గోపినాథ్ మాట్లాడుతూ పోలీసులు పని ఒత్తిడిని అధిగమించి మానసిక ఉల్లాసం పొందేందుకు యోగా, వ్యాయామం, క్రీడలను తమ దైనందని జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అనకాపల్లి ఎస్పీ తుమిన్ సిన్హా మాట్లాడుతూ పోలీసులు మరింత ఉత్సాహంతో పనిచేసి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అదనపు ఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
బార్ అసోసియేషన్ ఎన్నికల సందడి
కోర్టులో ఎన్నికల ప్రచారం చేస్తున్న అభ్యర్థులు విశాఖ లీగల్ : జిల్లా కోర్టులో ఈనెల 10న జరగనున్న న్యాయవాదుల సంఘం (బార్ అసోసియేషన్) ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారి, సంయుక్త కార్యదర్శి పదవులకు పోటీచేస్తున్న అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రధాన పదవులకు పోటీ చేస్తున్న సీనియర్ న్యాయవాదులు తమ మేనిఫెస్టోను ప్రకటిస్తూ ఓటు కోసం అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదులు సాంకేతికతను అందిపుచ్చుకునే విధంగా తమ వంతు చేయూతనిస్తామని, జూనియర్ న్యాయవాదులకు శిక్షణ, చట్టాలు, కోర్టు నియమావళి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రధానంగా అధ్యక్ష పదవికి నమ్మి సన్యాసిరావు, శిష్టల శ్రీనివాసమూర్తి (వాసు), ఎంఎస్ మాధవ్, కార్యదర్శి పదవికి వి.గోవిందరావు, విఎస్ఎ రవీంద్రనాథ్, ఎ.వెంకట సోమేశ్వరరావు, వి.వెంకట సుధాకర్ పోటీలో ఉన్నారు. ఎన్నికల రోజు రాత్రి 11 గంటలకు తుది ఫలితాలను ప్రకటిస్తామని ఎన్నికల అధికారి ఎ.ప్రభాకర్ రెడ్డి తెలిపారు.


