breaking news
Anakapalle District Latest News
-
ఆటోప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
ఎస్.రాయవరం: అడ్డురోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఆటోకి తగిలి గాయపడిన వ్యక్తి మృతి చెందినట్టు ఏఎస్ఐ వెంకటేశ్వరావు బుధవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి కోనవానిపాలెం గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కోన రాజు(38) మంగళవారం అడ్డురోడ్డు సమీపంలో ముందు వెళుతున్న వాహనాన్ని తప్పించబోయి సడన్బ్రేక్ వేయడంతో తన ఆటోకి ముందు భాగం తలకు తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు డ్రైవర్ రాజుని నక్కపల్లి ప్రభుత్వాసుపత్రికి ఆపై కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బుధవారం కాకినాడలో చికిత్స పొందుతూ మృతి చెందినట్టు చెప్పారు. వివరాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్ఐ చెప్పారు. -
ఏటీఎం మోసగాడు అరెస్ట్
అనకాపల్లి టౌన్: ఏటీఎంలో సహాయం చేస్తానంటూ వృద్ధుడిని నమ్మించి ఏటీఎం కార్డు, పిన్ విరాలు సేకరించి రూ.10 వేలు కాజేసిన అంతర్ జిల్లా నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. పట్టణ క్రైం ఎస్ఐ అల్లు వెంకటేశ్వరావు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 4న మెయిన్రోడ్ మాణిక్య లాడ్జి కింద ఉన్న ఎస్బీఐ ఏటీఎంలో 76 ఏళ్ల ఆకెళ్ల సూర్యనారాయణమూర్తి లావాదేవీ నిర్వహిస్తుండగా నిందితుడు ప్రత్తి రాజేష్ సహాయం చేస్తానని నమ్మించి, ఆయన ఏటీఎం, పిన్ వివరాలను తెలుసుకొని బాధితుడికి తెలియకుండా ఖాతా నుంచి రూ.10 వేలు విత్డ్రా చేసి పరారయ్యాడు. ఈ మేరకు బాఽధితుడు ఫిర్యాదు చేయడంతో సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితుడిని గుర్తించి, గూడ్స్ రోడ్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ఈ నిందితుడిపై ఉమ్మడి విశాఖ, కాకినాడ జిల్లాలలో 12 దొంగతనం, చీటింగ్ కేసులు ఉన్నాయని ఎస్ఐ తెలిపారు. -
దివ్యాంగులకు నిరామయ ఆరోగ్య బీమా
సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కె.శ్రీరాములు అనకాపల్లి టౌన్/నర్సీపట్నం: జిల్లాలోని అర్హులైన దివ్యాంగులందరికీ నిరామయ ఆరోగ్య బీమా పథకం ద్వారా మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు సమగ్రశిక్ష అడిషనల్ ప్రొజెక్ట్ కో–ఆర్డినేటర్ కె. శ్రీరాములు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లాలోని 24 మండలాల్లోని అర్హులైన దివ్యాంగుల వివరాలను నిరామయ పోర్టల్లో నమోదు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా మానసిక వైకల్యం, ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, మల్టిపుల్ డిజేబిలిటీ వంటి వైకల్యాలు కలిగిన వారు ప్రయోజనం పొందేందుకు అర్హులని తెలిపారు. ఇందుకోసం జిల్లా జోనల్ అధికారిగా సమగ్ర శిక్ష సహిత విద్య సమన్వయ అధికారి బి.రామకృష్ణ నాయుడును నియమించామన్నారు. ఈ నిరామయ హెల్త్ ఇన్సూరెన్స్ పథకంలో నమోదు చేసుకున్న అర్హులైన దివ్యాంగులకు ఏడాదికి రూ.లక్ష వరకు వైద్య బీమా సదుపాయం అందుబాటులో ఉంటుందని, వైకల్యానికి సంబంధించిన ఇప్పటికే ఉన్న సమస్యలు చేసే కరెక్టివ్ సర్జరీలకు గరిష్టంగా రూ.55 వేల వరకు, ఓపిడి చికిత్సలకు రూ.19 వేల వరకు, వైకల్యం ప్రభావాన్ని తగ్గించేందుకు కొనసాగుతున్న థెరపీలకు రూ.20 వేల వరకు, ఆయుష్ చికిత్సలకు రూ.4 వేలు, రవాణా ఖర్చులకు రూ.2 వేల వరకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన వివరించారు. అర్హులైన సదరం సర్టిఫికెట్తో పాటు సంబంధిత దివ్యాంగుల గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, విద్యార్థి బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు జెరాక్స్లతో వివిధ మండలాల్లో ఉన్న భవిత కేంద్రాల ప్రత్యేక ఉపా ధ్యాయులను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి దివ్యాంగుడు స్వదినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు 9885288151 నంబర్లో సంపదించాలని సూచించారు. -
ఓపీలకు బ్రేక్.. రోగులకు నిరీక్షణ
మహారాణిపేట: జూనియర్ వైద్యుల సమ్మెతో కేజీహెచ్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. సమ్మెలో భాగంగా బుధవారం రెండో రోజు కూడా జూనియర్ వైద్యులు ఓపీలను బహిష్కరించి, నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. దీంతో కేజీహెచ్లోని 26 ఓపీల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. దూర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చిన రోగులు గంటల తరబడి ఓపీల వద్ద వేచి ఉండాల్సి వచ్చింది. పీజీ వైద్యులు, జూనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో పలు శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. వార్డుల్లో రోగులకు వైద్య సేవలు అందించడంలోనూ ఇబ్బందులు తలెత్తాయి. బుధ వారం కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ప్రారంభమైన జూనియర్ వైద్యుల నిరసన ప్రదర్శన ఆంధ్ర మెడికల్ కాలేజీ, క్యాజువాలిటీ మీదుగా తిరిగి సూపరింటెండెంట్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. మహిళా జూనియర్ వైద్యులు కూడా దీక్షకు సంఘీభావం తెలిపారు. విశాఖలోని కేజీహెచ్, ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, రాణి చంద్రమణి దేవి ఆస్పత్రి, ఈఎన్టీ ఆస్పత్రి, టీబీ ఆస్పత్రుల్లోనూ సమ్మె ప్రభావం కనిపించింది. ఓపీ సేవలతోపాటు శస్త్రచికిత్సలకు కూడా అంతరాయం ఏర్పడింది. కేజీహెచ్లో రోజూ సుమారు వెయ్యి మంది పీజీ వైద్యులు, 500 మంది జూనియర్ వైద్యులు ఓపీ సేవలు అందిస్తుంటారు. వీరు సమ్మెలో ఉండటంతో బుధవారం రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆంధ్ర మెడికల్ కాలేజీ అధ్యక్షుడు దినకర్ సాయి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కె.రవీందర్, విశాఖ యూనియన్ నాయకుడు డాక్టర్ శిరాజ్ తదితరులు నిరసనలో పాల్గొన్నారు. -
అసోం వరద బాధితులకు ఆపన్నహస్తం
తుమ్మపాల: విపత్తు సమయంలో బాధిత ప్రజలకు సహాయం చేయడంలో జిల్లా యాంత్రాంగం ఎల్లప్పుడూ ముందుంటుందని, అసోం రాష్ట్రంలో వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆపన్నహస్తం అందించాలనే ఉద్దేశంతో నిధులు సేకరించి పంపించననున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ఈ మేరకు బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఇతరుల సహకారంతో రూ.26,74,296 నిధులను సేకరించినట్టు తెలిపారు. అసోం వరద బాధితులను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. అసోం వరద సహాయ నిధి కోసం జిల్లా నుంచి రూ.10 లక్షల నిధులు సేకరించాలని ప్రారంభ లక్ష్యంగా నిర్ణయించామని, అయితే వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ఇతరుల సమష్టి కృషి, ఉదారత నిర్దేశించిన లక్ష్యానికి రూ.రెండున్నర రెట్లకు పైగా నిధులను సేకరించగలిగామన్నారు. సేకరించిన మొత్తాన్ని పారదర్శకంగా, నేరుగా అసోం వరద బాధితులకు సహాయపడే విధంగా సంబంధిత అధికారులకు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. అసోంలోని సంబంధిత డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కు నేరుగా బదిలీ చేసేందుకు చెక్కును అందజేస్తున్నట్టు తెలిపారు. అసోం వరద సహాయ నిధికి సంబంధించిన చెక్కు అందజేసే కార్యక్రమంలో కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ శౌర్య మాన్ పటేల్, జిల్లా రెవెన్యూ అధికారి వై.సత్యనారాయణరావు, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీఓ) రామారావు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
జాడలేని మేఘం ● ఖరీఫ్కు కష్ట కాలం
వరి నారు మడులను మోటారుతో తడుపుతున్న రైతులురావికమతం: మండలంలో దొండపూడి, కొత్తకోట, కిత్తంపేట, మత్సవానిపాలెం, మేడివాడ, టి.అర్జాపురం తదితర గ్రామాల్లో నారు మడులను కాపాడుకోవడానికి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రైతుకు అదనపు భారం అవుతున్నా బోరుబావులున్నా చోట్ల మోటర్లతో నారుమళ్లకు నీటి తడులు అందిస్తున్నారు. బోర్లు, చెరువులు లేని చోట్ల రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు. కొంతమంది డీజిల్ ఇంజిన్లు పైపులతో దూరం నుంచి నీటిని పొలాలకు మళ్లిస్తున్నారు. కల్యాణపులోవలో అడుగంటిన నీళ్లు కల్యాణపులోవ జలాశయంలో నీటి నిల్వలు తగ్గిపోవడంతో ఈ ఏడాది వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది. కల్యాణపులోవ జలాశయం ఆయకట్టు కింద దొండపూడి, గంపవానిపాలేం, జెడ్.కొత్తపట్నం, జెడ్.బెన్నవరం, కొత్తకోట, మర్రివలస, చీమలపాడు, మత్సవానిపాలెం తదితర 14 గ్రామాల్లో రైతులు 6వేల ఎకరాల్లో వరి సాగుచేస్తూ జీవనం సాగిస్తున్నారు. జలాశయం గరిష్ట నీటి మట్టం 460 అడుగులుకాగా బుధవారం నాటికి 449.5 అడుగులు ఉంది. గతేడాది ఇదే సమయానికి 456 అడుగులు పైబడి నీరు నిల్వ ఉండేది. ప్రస్తుతం జలాశయంలో ఉన్న నీరు 30 రోజుల వరకు సరిపోతుందని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. వరి పంటకు 120 రోజుల వరకు నీరు అవసరం ఉంటుంది, కానీ నీరు వదిలిన 30 రోజుల లోపు వర్షాలు పడకపోతే రైతులు పరిస్థితి ఏంటి రైతులు వాపోతున్నారు. -
గిరిజనాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
కొమ్మాది: గిరిజన విద్య, సంస్కృతి, ఉత్పత్తుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ ఆర్.బాలసుబ్రహ్మణ్యం సూచించారు. రుషికొండలోని గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా మిషన్ (టీసీఆర్టీఎం) కార్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సంస్థ చేపడుతున్న అభివృద్ధి, పరిశోధనా కార్యక్రమాలపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యకలాపాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గిరిజన భాషల ప్రైమర్లు, చిత్రకోశాలను ఆశ్రమ పాఠశాలల లైబ్రరీల్లో అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఉపాధ్యాయులకు గిరిజన సంస్కృతిపై శిక్షణ ఇవ్వాలని తెలిపారు. ఏఎస్ఆర్ జిల్లాలో గిరిజన ఉత్పత్తుల బ్రాండింగ్, విలువ పెంపు కోసం ఐఐఎం విశాఖపట్నంతో కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సమిధా సింగ్, టీసీఆర్టీఎం డైరెక్టర్ రాణి మందా తదితరులు పాల్గొన్నారు. -
గ్రావెల్ మాఫియా నుంచి కొండల్ని కాపాడండి
నక్కపల్లి: మండలంలో గ్రావల్ మాఫియానుంచి కొండలను కాపాడాలని వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్ విజయ్కృష్ణన్ను కోరారు. బుధవారం నక్కపల్లి మండల పర్యటనకు వచ్చిన కలెక్టర్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కలిసి వినతి పత్రాన్ని అందజేసారు. ఈ సందర్బంగా రామకృష్ణ మాట్లాడుతూ వేంపాడులో పాలకొండను కొల్లగొట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు నక్కపల్లితో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న అనధికార లేఅవుట్లకు ఈ గ్రావల్ తవ్వి తరలించేందుకు సిద్దపడుతున్నారన్నారు. పాలకొండను మరో పంచదార్ల కొండలా చేయొద్దని కోరారు. ఉద్దండపురం, బోదిగల్లంలో ఉన్న కొండలను కూడా కొల్లగొడుతున్నారన్నారు. నిత్యం వేలాది క్యూబిక్ మీటర్ల గ్రావల్ను ట్రిప్పర్లలో తరలించుకుపోతున్నారని, కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నారని ఆరోపించారు. తునికి చెందిన ఒక టీడీపీ నాయకుడికి వేంపాడు పాలకొండలో గ్రావల్ తవ్వి లేఅవుట్లోకి తరలించేందుకు ఒప్పందం కుదిరిందని వివరించారు. ఇప్పటికే కమీషన్ల పేరుతో లక్షలాది రూపాయలు చేతులు మారాయన్నారు. పాలకొండలో గ్రావల్ తవ్వకాలకు అనుమతిస్తే వైఎస్సార్సీసీ ఉమ్మడి విశాఖ జిల్లా నేతలంతా కలిసి ఉద్యమ బాటపట్టాల్సి వస్తుందన్నారు. ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో ఉన్న కొండల్లో గ్రావల్ను కూడా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు తవ్వి తరలిస్తున్నారన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. ఈ కార్యక్రమంలో మండలపార్టీఽ అధ్యక్షుడు గొర్ల గోవిందరావు, తళ్ల భార్గవ్ పాల్గొన్నారు. సాగునీటి వనరులు స్టీల్ప్లాంట్కు కేటాయించొద్దు మండలంలో కాగితలో చెరువులు, గెడ్డలు, వాగులను స్టీల్ప్లాంట్కు కేటాయించొద్దని గ్రామానికి చెదందిన పలువురు రైతులు కలెక్టర్ను కోరారు. వైఎస్సార్సిపి నేత వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో రైతులు బుధవారం కలెక్టర్ విజయ్కృష్ణను కలిసారు. గ్రామంలో సుమారు 17 ఎకరాల వీస్తీర్ణంలో ఉన్న ఊర చెరువు, గొల్ల చెరువు, గెడ్డలను స్టీల్ప్లాంట్కు కేటాయించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఈ చెరువుల కింద సుమారు 150 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ప్రధాన సాగునీటి వనరులను స్టీల్ప్లాంట్కు కేటాయిస్తే ఆయకట్టు భూములపై ఆధారపడ్డ వందలాది మంది రైతులు జీవనోపాధి కోల్పోతారన్నారు. భూములు సాగునీరు అందక బీడు వారతాయన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. కలెక్టర్ను కలిసిన వారిలో రైతులు దేవవరపు శివ,పోతంశెట్టి బాబ్జి, గుమ్మిళ్ల గోవిందరావు,పోతంశెట్టి వీరబాబు, దేవవరపు గోవిందరావు,పోతంశెట్టి గణేష్, సకుర్తి సత్తిబాబు,గంగేశ్వరరావు ఉన్నారు.కలెక్టర్కు వైఎస్సార్సీపీ నేతల వినతి -
తప్పుడు కూతల కూటమి
సాక్షి, అనకాపల్లి: కూటమి నేతలు ఎన్నికల సమయంలో యువత, నిరుద్యోగులకు ఏటా 20 లక్షల ఉద్యోగాల కల్పన, నెలకు నిరుద్యోగ భృతి రూ. 3 వేల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏటా జాబ్ క్యాలండర్ ఏర్పాటు చేస్తామని, సచివాలయ ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగిస్తామంటూ హామీలు ఇచ్చారు.. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా ఏ ఒక్క హామీ కూడా పూర్తి కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్న్ను రద్దు చేసి దానికి అదనంగా కొన్ని ఉద్యోగాలు యాడ్ చేసి మెగా డీఎస్సీ పేరిట రిక్రూట్మెంట్ జరిగింది. అందులో కూడా స్పోర్ట్స్ కోటా కొత్త జీవోలంటూ భారీ అవకతవకలకు పాల్పడ్డారు. కనీస విద్యార్హత గానీ, డీఎస్సీ, టెట్ పరీక్షలు రాయకుండానే అక్రమమార్గంలో ఉద్యోగాలను అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ డీఎస్సీ అక్రమాలపై రెండు నెలలుగా రాష్ట్రంలో ఉన్న యువత, విద్యార్థులు, నిరుద్యోగులు వరుస ఉద్యమాలు చేస్తున్నా ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తోంది. విద్యాశాఖ మంత్రి లోకేష్ను భర్తరఫ్ చేయాలని, డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలంటూ శాంతియుతంగా ఇటీవల చేసిన నిరసన కార్యక్రమాన్ని పోలీసులతో అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం వరుసగా చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వంపై దుర్భాషలకు దిగారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో జగన్ హయాంలో సున్నా ప్రభుత్వ ఉద్యోగాలు..కూటమి హయాంలో 16 వేల ఉద్యోగాలు..అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ హోర్డింగ్లను ఏర్పాటు చేయడంపై కూటమి నేతల దిగజారుడుతనానికి పరాకాష్టగా ప్రజలు, యువత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో జిల్లాలో 30,654 ఉద్యోగాలు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్లలో అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ, రెగ్యులర్, అవుట్సోర్సింగ్ పద్ధతిలో 30,654 మందికి ఉద్యోగాలు కల్పించింది. అదేవిధంగా ప్రైవేట్ పరిశ్రమల్లో, రేషన్ పంపిణీ వాహనాల పేరిట, పశుసంవర్ధక శాఖ అంబులెన్స్లు, 104, 108 అంబులెన్న్స్ల్లో 3,000 మందికి కాంట్రాక్ట్ ఉద్యోగాలు కల్పించింది. అదే కూటమి ప్రభుత్వంలో జిల్లాలో 25 వేలకు పైగా ఉద్యోగాలను తీసేయడమే కాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో పోలీస్ ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చిన దానినే అమలు చేశారు. చందబాబు ప్రభుత్వంలో తీసిన ఏకై క డీఎస్సీ రిక్రూట్మెంట్కు వస్తే అందులో భారీ అవకతవకలకు పాల్పడ్డారు. జగన్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాలు... జిల్లా వ్యాప్తంగా 10,000 గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగాలు వైద్య, ఆరోగ్య శాఖలో 2,000 అవుట్సోర్సింగ్, రెగ్యులర్ ఉద్యోగాలు ఎండోమెంట్, ఏపీపీఎస్సీ, ఇతర శాఖల్లో 500 ఉద్యోగాలు ఆప్కాస్లో 4,000 ఉద్యోగాలు జిల్లాలో 12,000 వలంటీర్ ఉద్యోగాలు ఏపీఎస్ఆర్టీసీలో 1,800 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం ప్రైవేట్, ఫార్మా పరిశ్రమల్లో 2 వేల మందికి ఉపాధి 1998 డీఎస్సీ క్వాలిఫైడ్(ఎంటీఎస్) రిక్రూట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,534 మంది టీచర్లను నియమిస్తే..వీటిలో ఉ మ్మడి జిల్లాలో 354 మందికి ఉద్యోగాలు ఎస్ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడు దల. కోర్టు కేసు కారణంగా నిలిపివేత సుమారుగా 7 వేల ఉద్యోగాలతో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల. ఎన్నికలు, కోర్టు కేసుల కారణంగా నిలిపివేత. తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలి...మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డిని అవమానిస్తూ హోర్డింగ్స్ పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బుధవారం డీఎస్పీ పి.శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హాయంలో రాష్ట్రంలో వ్యాప్తంగా పాలన చేపట్టిన తొలి నాలుగు నెలల్లోనూ లక్షా 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలు, ఐదేళ్లలో నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అవి ఆధారాలతో పాటు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయంటూ వాటిని వక్రీకరిస్తూ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో సున్నా ఉద్యోగాలంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రెండు రోజుల్లో హోర్డింగ్స్ తొలగించకపోతే శాంతియుత ఆందోళన చేపడతామని గణేష్ అన్నారు. ఆయనతో పాటు వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు, పార్టీ నేతలు ఏకా శివ, శానపతి వెంకటరత్నం, చిటికెల రమణ, పాణిశాంతరామ్, నాగేశ్వరరావు, మాజీ ఎంపీపీ రుత్తల సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు సుర్ల నాయుడు, జిల్లా ప్రచార కమిటీ నాయకులు పిళ్లా శ్రీను, హరిబాబు, రాజుబాబు, రఘు కూటమి తప్పుడు ప్రచారాలను ఖండించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలకు తూట్లు పొడిచి అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడమే కాకుండా తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వంపై బురద చల్లుతున్న కూటమి నేతలపై ప్రజలు, యువత, విద్యార్థులు మండిపడుతున్నారు. తాజాగా వాస్తవాలను వక్రీకరిస్తూ మున్సిపాలిటీలో తప్పుడు వ్యాఖ్యలతో హోర్డింగ్లు ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. -
ఏదీ ఎత్తిపోతల?
నాతవరం: తాండవ రిజర్వాయరు ఏలేరు కాలువ అనుసంధానాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భయంతో పోలవరం కాలువ నుంచి తాండవకు ఎత్తిపోతల పథకం తెస్తానంటూ అయ్యన్న పాత్రుడు హామీచ్చారు. దానికి సంబంధించి ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంతో అయ్యన్న హామీ రైతులను మభ్యపెట్టే విధంగా ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి. దివంగత నేత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి తాండవ కాలువలు రూ. 65కోట్లతో సిమెంట్ లైనింగ్ పనలు చేసి రైతులకు దన్నుగా నిలిచారు. ఆయన తనయుడు వై.ఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలను తలపించేలా చేసేందుకు ఏలేరు కాలువ తాండవ ప్రాజెక్టు అనుసంధానం చేసేందుకు రూ. 470 కోట్లు 5లక్షలు మంజూరు చేసి ఆయనే స్వయంగా 2022లో డిసెంబరులో నర్సీపట్నంలో అనుసంధానం పనులకు శంకుస్థాపన చేశారు. అనుసంధానానికి నిధులు మంజూరు చేయడంతో రూ.10 కోట్ల మేర పనులకు ఖర్చు చేశారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాజక్టు నుంచి అదనపు నీటిని ఏలేరు కాలువ ద్వారా తరలించేందుకు అదనపు భూమి సేకరించారు. మండలంలో అనుసంధానం పనులకు సంబంధించి ఏలేరు తాండవ కాలువలను రాష్ట్ర ఇరిగేషన్శాఖ ఈఎన్సీ నార్త్కోస్ట్ సీఈతో పాటు ఇతర ఇంజినీరింగ్ అధికారులు స్వయంగా పరిశీలన చేశారు. అనుసంధానం పనులకు టీడీపీకి చెందిన మాజీ ఎంపీ కె.ఎం.కె కంపెనీ సంస్థ కాంట్రాక్టరు దక్కించుకున్నారు. ఈ పనులు సకాలంలో పూర్తి చేస్తే రెండు జిల్లాల్లో వైఎస్సార్సీపీకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో పనుల్లో జాప్యం చేయడంతో సార్వత్రిక ఎన్నికలు వచ్చేసాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే తాండవ ఏలేరు అసునంధానం పనులు 25 శాతం కూడా పూర్తి చేయలేదంటూ రద్దు చేసింది. ఈ పనులు రద్దు పై రెండు జిల్లాల్లో రైతుల నుంచి ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అన్న భయంతో స్పీకరు అయ్యన్నపాత్రుడు పోలవరం కాలువ నుంచి తాండవకు నీరు తెస్తానంటూ 2024 అక్టోబరులో మండల పర్యటనకు వచ్చినపుడు సభలో హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకం నా జీవిత ఆశయమని..గొప్పగా చేప్పేశారు. పోలవరం కాలువ నీటిని తుని మండలం రేఖవానిపాలెం గ్రామం నుంచి తాండవకు తీసుకురావాలని దీనికి రూ.2400 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. నేటికీ పోలవరం తాండవ ఎత్తిపోతల పధకం ప్రతిపాదనలే ఇరిగేషన్ శాఖలో లేకపోవడం గమనార్హం. క్యాబినెట్లో ప్రస్తావన ఏదీ... రాష్ట్ర క్యాబినెట్లో రాష్ట్రంలో పలు ప్రాజెక్టులపై చర్చించి కొన్ని ప్రాంతాలకు కొత్తవి మంజూరు చేశారు. పోలవరం తాండవ ఎత్తిపోతల పథకంపై కనీసం చర్చకు రాకపోవడం విశేషం. ఖరీఫ్ సాగుకు మంగళవారం తాండవ రిజర్వాయరు నుంచి ఆయకట్టుకు గేట్లు ఎత్తి నీరు విడుదల చేశారు. ఏలేరు తాండవ అనుసంధానం పనులు రద్దు చేయకుండా కొనసాగిేస్తే పనులు పూర్తి అయ్యేవని రెండు జిల్లాల పరిధిలో వేలాది ఎకరాలు సస్యశ్యామలం అయ్యేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా పూడిక తీత పనులు ఆయకట్టుకు నీరు ప్రవహించే కాలువలో పూర్తి స్థాయిలో పూడిక తీత పనులు చేయలేదు. గత నెలలో మన్యపురట్ల తాండవ నీటి సంఘం అధ్యక్షుడు అప్పన దివాణం నిమ్మకట్టు ఆనకట్ట ప్రధాన కాలువలో ఉన్న పూడికను స్వయంగా అధికారులను తీసుకెళ్లి చూపించారు. పూడిక తీశాకే నీరు విడుదల చేస్తే నీరు ప్రవహిస్తుందని తెలిపారు. అయితే ఆ కాలువలో పూడిక నేటికీ తీయలేదు. తాండవ ప్రధానగేట్లకు రూ.లక్షలు వ్యయంతో మరమ్మతులు చేసినా లీకేజీ అరికట్టలేదు. 2024లో పోలవరం–తాండవ ఎత్తిపోతల పథకం తెస్తానంటూ సభలో హామీ ఇస్తున్న స్పీకర్ అయ్యన్న (ఫైల్) హామీ నెరవేర్చాలి.. స్పీకరు అయ్యన్నపాత్రుడు పోలవరం తాండవ ఎత్తిపోతల పథకం కోసం బహిరంగ సభలో ఇచ్చిన హామీని నెరవేర్చాలి. మా ప్రభుత్వం హయంలో మంజూరు చేసిన ఏలేరు తాండవ అనుసంధానం పనులు రాజకీయ కక్షతో రద్దు చేశారు. అనుసంధానం పనులు సకాలంలో పూర్తి అయి ఉంటే రెండు జిల్లాల్లో వేలాది ఎకరాల ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు ప్రవహించేది. రైతులు పడే సాగునీటి కష్టాలు తీరేవి. కూటమి ప్రభుత్వం చేస్తున్న గిమ్మిక్కులు ప్రజలు గమిస్తున్నారు. –పెట్ల ఉమా శంకర్ గణేష్, మాజీ ఎమ్మెల్యే ప్రతిపాదన లేదు పోలవరం తాండవ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇంతవరకు ఎలాంటి ప్రతిపాదనలు లేదు. దీనిపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రస్తుతం తాండవ ప్రాజెక్టు పరిధిలో కాలువలో పూడికతీత మరమ్మతు పనులు చేస్తున్నాం. గతంతో పోలిస్తే ఈఏడాది బాగా చేశాం. –ఆనురాధ, డీఈ తాండవ ప్రాజెక్టు -
మా రైలు ఎప్పుడొచ్చేనో!
గూడ్స్కు గ్రీన్ సిగ్నల్.. ప్రయాణికులకు రెడ్ సిగ్నల్సాక్షి, విశాఖపట్నం: ‘ప్రయాణికులకు ముఖ్య గమనిక.. ప్లాట్ఫారమ్పైకి రావాల్సిన రైలు నిర్ణీత సమయం కంటే కొన్ని గంటలు ఆలస్యంగా నడుస్తోంది. గమనించగలరు..’ రైల్వే స్టేషన్లలో అప్పుడప్పుడూ వినిపించే ఈ ప్రకటనలు ఇప్పుడు విశాఖపట్నం డివిజన్లో సర్వసాధారణమయ్యాయి. ఒకప్పుడు సమయపాలనలో ‘సూపర్ఫాస్ట్’గా దూసుకెళ్లిన డివిజన్.. ఇప్పుడు ‘ప్యాసింజర్’ రైలు కంటే నెమ్మదించింది. తాజాగా రైల్వే బోర్డు విడుదల చేసిన దేశవ్యాప్త రైళ్ల సమయపాలన ర్యాంకింగ్స్లో టాప్–70 డివిజన్లలో విశాఖ 62వ స్థానానికి పడిపోయింది. కేవలం 63.21 శాతం పంక్చువాలిటీ నమోదైంది. ప్రతిరోజూ రైళ్ల రాకపోకలను పర్యవేక్షించే నేషనల్ ట్రైన్ ఎంక్వయిరీ సిస్టమ్ (ఎన్టీఈఎస్) ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ను రూపొందించారు. సాధారణంగా 80–85 శాతానికి పైగా పంక్చువాలిటీతో ఉండే విశాఖ.. ఇంత తక్కువ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. అంటే ప్రతి పది రైళ్లలో దాదాపు నాలుగు నిర్ణీత సమయానికి చేరడం లేదన్నమాట. కళ్లు చెదిరే ఆదాయం ఆర్జించే డివిజన్.. ప్రయాణికులను సకాలంలో గమ్యానికి చేర్చడంలో ఎందుకు విఫలమవుతోంది? గూడ్స్ రైళ్లకు ఉన్న ప్రాధాన్యం ప్రయాణికుల రైళ్లకు దక్కడం లేదా? టెర్మినల్ స్టేషన్ కావడం కూడా ఇందుకు కారణమా? పొరుగు డివిజన్ల స్పీడ్.. మనకెందుకు లేదు? రాష్ట్రంలోని ఇతర డివిజన్ల పనితీరుతో పోలిస్తే విశాఖ పరిస్థితి మరింత స్పష్టమవుతుంది. గుంతకల్లు 99.33 శాతంతో దేశంలోనే రెండో స్థానంలో ఉండగా.. గుంటూరు 94.03 శాతంతో 17, విజయవాడ 88.30 శాతంతో 26వ స్థానంలో ఉన్నాయి. విశాఖ మాత్రం 63.21 శాతంతో 62వ స్థానంలో నిలిచింది. ట్రాక్ల ఆధునీకరణ, బైపాస్ లైన్లు, ఆటోమేటిక్ సిగ్నలింగ్ వంటి మౌలిక వసతుల అభివృద్ధిలో ఇతర డివిజన్లు ముందుకు సాగుతుండగా.. విశాఖలో కీలక పనులు నత్తనడకన సాగుతుండటం వ్యత్యాసానికి ఓ కారణంగా కనిపిస్తోంది. టెర్మినల్ స్టేషన్తో తిప్పలు విశాఖపట్నం రైల్వే స్టేషన్ టెర్మినల్ కావడంతో ఇక్కడికి వచ్చే ప్రతి రైలుకు ఇంజిన్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ లోకో రివర్సల్కు 20–30 నిమిషాల సమయం పడుతుంది. దీనికితోడు ప్లాట్ఫారమ్ల కొరత ఉంది. ఒక రైలు లోపలికి రావాలంటే మరోటి దువ్వాడ, సింహాచలం, గోపాలపట్నం ఔటర్ల వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో ఒక్క రైలు ఆలస్యం ప్రభావం మిగిలిన సర్వీసులపైనా పడుతోంది. గూడ్స్కే పెద్దపీట? దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో సరకు రవాణా కీలక ఆదాయ వనరు. విశాఖపట్నం, గంగవరం పోర్టుల నుంచి నిత్యం భారీ సంఖ్యలో గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. పోర్టు సరకు రవాణాకు మార్గం కల్పించే క్రమంలో కొన్ని సందర్భాల్లో ప్రయాణికుల రైళ్లను లూప్ లైన్లలో నిలిపివేయాల్సి వస్తోందనే అభిప్రాయాలున్నాయి. ప్రీమియం రైళ్లకు ‘గ్రీన్ సిగ్నల్’ ఇక వందేభారత్ వంటి ప్రీమియం రైళ్లను నిర్ణీత సమయానికి నడిపించేందుకు ప్రాధాన్యం ఇస్తుండటంతో.. రెగ్యులర్ ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లపై ప్రభావం పడుతోందనే విమర్శలున్నాయి. వేగవంతమైన రైళ్లకు మార్గం కల్పించేందుకు ఇతర సర్వీసులను నిలిపివేయాల్సి వస్తుండటంతో ఆలస్యాల పరంపర కొనసాగుతోంది. అభివృద్ధి పనుల్లో జాప్యం రైళ్ల రద్దీకి తగ్గట్టుగా స్టేషన్ సామర్థ్యాన్ని పెంచే పనుల్లో జాప్యం కూడా సమస్యను తీవ్రం చేస్తోంది. విశాఖపట్నం స్టేషన్ రీడెవలప్మెంట్, ప్లాట్ఫారమ్ల విస్తరణ, మర్రిపాలెం, గోపాలపట్నం, సింహాచలం స్టేషన్ల ఆధునికీకరణ పనులు వేగంగా పూర్తికాకపోవడంపై విమర్శలు ఉన్నాయి. ఫలితంగా రోజుకు 5–6 రైళ్లను రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. అప్పుడే పట్టాలెక్కేనా? విశాఖ డివిజన్ పనితీరు మెరుగుపడాలంటే స్టేషన్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు థర్డ్, ఫోర్త్ లైన్ పనులను వేగవంతం చేయాలి. దువ్వాడ బైపాస్ లైన్లను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలి. లోకో రివర్సల్తో పడుతున్న సమయభారాన్ని తగ్గించే మార్గాలను అన్వేషించాలి. ట్రాక్లపై రద్దీని సమర్థంగా నిర్వహించగలిగితేనే.. ఒకప్పుడు సమయపాలనలో ముందున్న విశాఖ డివిజన్ మళ్లీ తన పూర్వ వైభవాన్ని అందుకోగలదు. -
పాముకాటుకు గురైన మహిళ మృతి
చీడికాడ: పాముకాటుకు గురైన వివాహిత విశాఖ కేజిహెచ్లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందినట్లు మండలంలోని వరాహపురం తాజామాజీ సర్పంచ్ గొల్లవిల్లి చిన్నమ్మలు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఆమె అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన బాలిబోయిన ఘాఠీలు(29)ఈ నెల 8వ తేదీ రాత్రి ఇంటి బయట ఉన్న సమయంలో విష సర్పం కాటు వేసింది. ఈ విషయాన్ని ఇంట్లో నిద్రిస్తున్న భర్త అర్జునకు ఘాఠీలు చెప్పడంతో హుటాహుటినా చోడవరం సీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు అక్కడ నుంచి విశాఖ కేజిహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బుధవారం ఉదయం ఘాఠీలు ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందిదన్నారు. ఘాఠీలకు పార్ధు(12),షణ్ముకం(9),దీక్షిత(6) వయస్సు గల ముగ్గురు పిల్లలున్నారు. భర్త అర్జున ఫిర్యాదు మేరకు చీడికాడ ఎస్ఐ లక్ష్మీనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. కూలి పనులు చేస్తూ భర్తకు చేదోడు వాదోడుగా నిలిచిన ఘాఠీలు మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
తాండవ నీరు పొదుపుగా వాడండి
నాతవరం: తాండవ రిజర్వాయరు నీటిని రైతులంతా పొదుపుగా వాడుకోవాలని స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఖరీఫ్ సాగుకు తాండవ రిజర్వాయర్ నీటిని మంగళవారం గేట్లు ఎత్తి కాలువల ద్వారా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండవ ప్రాజెక్టుతో పాటు పంట కాలువలు అభివృద్ధికి రెండేళ్ల కాలంలో రూ.12 కోట్లు మంజూరు చేశానన్నారు. మిగిలి ఉన్న పనులను వివిధ దశల్లో అభివృద్ధి చేస్తానన్నారు. నాతవరం, గొలుగొండ మండలాలను అనుసంధానం చేసే తాండవ ఘాట్ రోడ్డుకు రక్షణ గోడల నిర్మాణంతో పాటు రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ లైటింగ్ ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ఇరిగేషన్ ఈఈ బాలసూర్యం మాట్లాడుతూ తాండవ ప్రాజెక్టులో నీటి మట్టం 375.2 అడుగులు నీరు ఉందన్నారు. నీటిని రెండు కాలువలు ద్వారా రోజుకు 500 క్యూసెక్కులు చొప్పున విడుదల చేస్తే 70 రోజులు ఆయకట్టు భూములకు ప్రవహిస్తుందన్నారు. శివారు ఆయకట్టుకు సైతం నీరు సరఫరా చేసేందుకు నీరు ఎక్కడా వృథా కాకుండా పొదుపుగా వాడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, వైస్ చైర్మన్ మేడపురెడ్ది జోగుబాబు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, రాష్ట్ర కార్పొరేషన్ డైర్టెక్టర్లు రాజాన వీర సూర్య చంద్ర, కొండ్రు మరిడియ్య, లాలం కాశీనాయుడు, ఆర్డీవో వి.వి.రమణ, తహసీల్దార్ చందనరేఖ, ప్రాజెక్టు డీఈ ఆనురాధ, జేఈ శ్యామ్కుమార్, ఇన్చార్జి ఎంపీడీవో మూర్తిబాబు, ఆర్అండ్బీ డీఈ విద్యాసాగర్ జేఈ నాయుడుబాబు, నీటి సంఘాల అధ్యక్షులు రైతులు పాల్గొన్నారు. -
వేతనాల్లేవు...రామ్జీ
యాక్టివ్గా ఉన్న జాబ్ కార్డులు 2,35,085 జిల్లాలో మొత్తం జాబ్ కార్డుల సంఖ్య 2,72,319ఉపాధి పొందినవేతనదారులు 2,35,575 2026–27 ఆర్థిక సంవత్సరంలోఉపాధి పనులు రూ.256.81 కోట్లు ఉపాధి పనులు చేస్తున్న కూలీలు(ఫైల్) సాక్షి, అనకాపల్లి: వీబీజీ–రామ్జీ ఉపాధి హామీ కూలీల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. రెండు నెలలుగా వేతనాలు ఇవ్వాలన్న నిబంధనను కూటమి సర్కార్ గాలికి వదిలి వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఆసరాగా నిలిచే ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించింది. ఒక వైపు కరవు విలయతాండం చేస్తోంది. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి వ్యవసాయ పనులు లేవు. ఎల్నినో కారణంగా వర్షాలు పడకపోవడంతో వరినాట్లు వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇంటి అవసరాలు తీరతాయనే ఆశతో ఉపాధి హామీ పథకం పనులకు వెడితే అక్కడ వేతనాలు ఇవ్వని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాదిలో జూన్ 8వ తేదీ నుంచి నేటి వరకూ రెండు నెలలు వేతనాలు బకాయి పడింది. గతేడాదిలోనూ ఇదే సమస్య.. వేతన బకాయిల కోసం కూలీలు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తే గతేడాదికి సంబంధించిన వేతన బకాయిలనూ జాప్యం చేసుకుంటూ ఆలస్యంగా ఐదు వారాల బకాయిలు విడుదల చేసింది. ఇప్పుడు జూన్ నెల 8వ నుంచి నేటి వరకూ ఉపాధి డబ్బులు ఎప్పుడు పడతాయా..!అంటూ కూలీలు ఎదురుచూస్తున్నారు. బయట పనులు లేకపోవడంతో వీటిపైనే ఆధారపడే కుటుంబాలు గ్రామాల్లో ఎక్కువగా ఉన్నాయి. వారికి ఉపాధి హామీ పథకం కింద పనులు చేపట్టినా రోజంతా మట్టిలో స్వేదం చిందిస్తే రూ.250–300లకు మించి రావడంలేదు. ఉపాధి పనులకెళ్లినా వేతనాలు వెంటనే అందని పరిస్థితి ఉండడంతో ఇల్లు గడిచేదెలా అంటూ కూలీలు ఆవేదన పడుతున్నారు. జిల్లాలో 24 మండల పరిధిలో ఉపాధి వేతనాలు సుమారుగా రూ.173 కోట్లు బకాయి చెల్లించాల్సి ఉంది. విడుదలైన నిధులు రూ.83.81 కోట్లు పేరు మారినా..రాత మారలేదు... కేసులు పెట్టకముందే కూలి చెల్లించండి... జిల్లాలో రెండు నెలలుగా ఉపాధి హామీ బకాయిలను చెల్లించలేదు. సకాలంలో బకాయిలు చెల్లింపులు చేయని సంబంధించిన శాఖపై కూలీలు కేసులు పెట్టుకునే అవకాశం చట్టంలో ఉంది. అ పరిస్థితి రాక ముందే తక్షణమే బకాయిలు చెల్లించాలి. ఉపాధి హామీ శాఖకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంత్రిగా ఉండి కూలీలు కష్టాన్ని అర్థం చేసుకోకపోవడం విచారకరం. ఉపాధి హామీకి రూ.లక్ష కోట్లు ఉన్న బడ్జెట్ను పీఎం మోదీ ప్రభుత్వం దశలవారీగా రూ. 62 వేల కోట్లకు తగ్గించారు. కొన్ని చోట్ల గట్టి నేల ఉంటుంది. అలాంటి చోట్ల వేతనదారులకు డబ్బులు పెంచాలి. –డి.వెంకన్న, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శిసాంకేతిక కారణాల వల్లే జాప్యం వేతనాలు పెండింగ్ విషయమై పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. దేశ వ్యాప్తంగా ఈ సమస్య ఉంది. ఉపాధి వేతనాలు పెండింగ్లో ఉన్న మాట వాస్తవమే. టెక్నికల్ సమస్యల నేపథ్యంలో ఆలస్యమైంది. ఆలస్యమైనా అందరికీ వేతనాలు పడతాయి. ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు. – సీహెచ్ నిర్మల దేవి, డ్వామా పీడీ, అనకాపల్లి జిల్లా. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్వరూపం మారిపోవడంతో కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్–గ్రామీణ్ పథకం ప్రవేశ పెట్టింది. ఇటీవల ఈ పథకం అమలులోకి వచ్చింది. గతంలో ఏడాదికి 100 రోజులు పనిదినాలు ఇచ్చేవారు. కానీ కొత్త పధకం కింద 125 పనిదినాలకు పెంచారు. ప్రస్తుతం రోజువారీగా రూ.311 రూపాయలు వేతనం అందిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో 24 మండలాల్లో 645 పంచాయతీల్లో 2,72,319 మందికి జాబ్ కార్డులు ఇచ్చారు. జూన్ 8వ తేదీ నుంచి వీరికి వేతనాలు ఇవ్వడం లేదు. జిల్లాలో మొత్తం రూ.173 కోట్లు రూపాయల మేర బకాయిలు ఉన్నాయి. కూలీలు ఉపాధి హామీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. -
ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగరాలి
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం తుమ్మసాల: స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఈ నెల 13 నుంచి ‘హర్ ఘర్ తిరంగా‘ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరం నుంచి జిల్లా అధికారులు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 13 నుండి 15 తేదీ వరకు ప్రతి ఇల్లు, దుకాణం, ప్రభుత్వ భవనంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలన్నారు. ఐసీడీఎస్ (అంగన్వాడీ కేంద్రాలు), డీఎంహెచ్ఓ (పీహెచ్సీలు, విలేజ్ హెల్త్ క్లినిక్లు), డీసీహెచ్ఎస్ ఆసుపత్రులు, రవాణా శాఖ పరిధిలోని అన్ని కేంద్రాల్లో, గ్రామ వార్డు సచివాలయాల్లో జాతీయ జెండాను తప్పనిసరిగా ప్రదర్శించాలని ఆదేశించారు. అధికారులందరూ తమ సోషల్ మీడియా ఖాతాలలో వీడియోలను పోస్ట్ చేయాలని తెలిపారు. ఈ నెల 10 నుండి 15 వరకు ఈ ప్రత్యేక ప్రచారాన్ని నిర్వహించాలన్నారు. దేశప్రజలందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ‘మరి మీరు దేశం కోసం ఏం చేస్తున్నారు’ అని ప్రశ్నిస్తూ మరొకరికి ఛాలెంజ్ విసరాలని తెలిపారు. అధికారులందరూ వీడియో రూపకల్పన పూర్తి చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన అనంతరం, ఆ లింకులను వాట్సాప్ గ్రూపుల్లో అప్లోడ్ చేయాలని, సమాచార శాఖ అధికారి దీనిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. విద్యాశాఖ ద్వారా పాఠశాల విద్యార్థులతో కూడా ఇదే శైలిలో వీడియోలను రికార్డు చేయించాలన్నారు. ప్రతి మండలం నుంచి అత్యుత్తమంగా నిలిచే 20 వీడియోలను ఎంపిక చేసి జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారికి పంపించాలన్నారు. ఈ నెల 13న ప్రత్యేకంగా ‘హర్ ఘర్ తిరంగా సైకిల్ ర్యాలీ’ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అధికారులు తమ సిబ్బందితో పాటు స్థానిక పాఠశాలలు, పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులను భాగస్వాములను చేయాలని, ఈ ర్యాలీలో దాదాపు 3 వేల నుండి 5వేల మంది పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే రోజు పురపాలక, మండల స్థాయిలలో భారీ సైకిల్ ర్యాలీలు నిర్వహించాలన్నారు. జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ 1 కిలోమీటరు పరిధిలో ఈ ర్యాలీ నిర్వహించాలని సూచించారు. ఈ నెల 14న ప్రతి ప్రభుత్వ కార్యాలయం కాంపౌండ్ లోపల, సమీపంలోని పాఠశాల ప్రాంగణాల్లో ప్రతి అధికారి కనీసం 10 స్వదేశీ రకాల మొక్కలను నాటాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ భవనాలను ఈ నెల 14 సాయంత్రం నుంచి 16వ తేదీ సాయంత్రం వరకు (3 రోజుల పాటు) విద్యుత్ కాంతులతో అలంకరించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున అధికారులందరూ జాతీయ జెండాతో సెల్ఫీ తీసుకొని తమ సామాజిక మాధ్యమాల ప్రొఫైల్ చిత్రాలుగా మార్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, జిల్లా రెవిన్యూ అధికారి వై. సత్యనారాయణరావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి ఎస్.వి. రమణ, కలెక్టరేట్ పరిపాలన అధికారి విజయ్కుమార్ పాల్గొన్నారు. -
మలేరియా మందుల కొరత
మహారాణిపేట (విశాఖ): గ్రామాల్లో పారిశుధ్య పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, దోమలు స్వైర విహారం చేస్తున్నాయని, గ్రామీణ, మన్యం ప్రాంతాల్లో మలేరియా వ్యాధి వచ్చిన వారికి ఆస్పత్రుల్లో మందులు కొరత అధికంగా ఉందని, దీని నివారణకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చైర్పర్సన్ జె.సుభద్ర అధ్యక్షతన పలు స్థాయి సంఘాల సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా గ్రామాల్లో చెత్త చెదారాలు పేరుకుపోవడం వల్ల, వర్షాలు కురవడం వల్ల దోమలు విజృంభిస్తున్నాయని జెడ్పీటీసీ సభ్యులు గిరిబాబు, సత్యం, రమణమ్మ,ఉమాదేవి అన్నారు. గ్రామీణ, మన్య ప్రాంతాల్లో పెరుగుతున్న మలేరియా కేసుల పట్ల సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉండాలని సూచించారు. మలేరియా నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, స్థానిక ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా చూసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం పలు అంశాలపై సభ్యులు లేవనెత్తిన సమస్యలకు అధికారులు చర్యలు చేపట్టాలని చైర్పర్సన్ ఆదేశించారు. ఉపాధి పనుల్లో సదుపాయాలు కల్పించాలి ఉపాధి కూలీలకు పని ప్రదేశాలలో తప్పనిసరిగా నీడ (షెడ్లు), తాగునీటి సౌకర్యం కల్పించాలని జెడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్ర ఆదేశించారు. అనకాపల్లి జిల్లా పరిధిలోని ప్లాంటేషన్లలో చనిపోయిన 10 రకాల మొక్కల స్థానంలో వెంటనే కొత్త మొక్కలు నాటాలని సూచించారు.దేవరాపల్లి, కోటవురట్ల తదితర మండలాల్లో కాలువల పూడికతీత, రైవాడ ఆయకట్టు నీటి సరఫరా, జలధార పథకం పనుల పురోగతిని వేగవంతం చేయాలని అధికారులను సభ్యులు ఉమాదేవి, సత్యం కోరారు. జగనన్న ఇళ్లకు సదుపాయాలేవీ.. జగనన్న లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు వెంటనే విద్యుత్ సరఫరా, తాగునీటి కనెక్షన్లు కల్పించాలని జెడ్పీటీసీ సభ్యుడు గిరిబాబు కోరారు. నిలిచిపోయిన హౌసింగ్ బిల్లులను విడుదల చేయాలన్నారు. డీఆర్డీఏ ఆధ్వర్యంలో కూరగాయల సాగు, స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి సబ్సిడీలు, బ్యాంక్ లింకేజీ రుణాలను త్వరితగతిన మంజూరు చేయాలని సభ్యులు కోరారు. ఉమ్మడి జిల్లాల్లో హౌసింగ్ బిల్లు పెండింగ్లో ఉండడం పట్ల సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామీణాభివృద్ధిలో ప్రజాప్రతినిధులదే కీలకపాత్ర : చైర్పర్సన్ గ్రామీణాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతం, ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ జె.సుభద్ర అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, ప్రత్యేక అధికారులకు నిర్వహించిన శిక్షణ సదస్సులో ఆమె మాట్లాడారు. వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ) చట్టం–2025పై అవగాహన పెంచుకుని, క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేయాలని సూచించారు. -
● నిత్య‘కృషీ’వలుడు
తన పొలంలో కూలీలతో కలిసి వరినాట్లు వేస్తున్న విద్యాశాఖ ఏడీ అప్పారావునాయుడునర్సీపట్నం: అనకాపల్లి జిల్లా డీఈవోగా పని చేసిన గిడ్డి అప్పారావునాయుడు పాడేరులో తన సొంత పొలంలో కూలీలతో కలిసి వరి నాట్లు వేస్తున్న దృశ్యమిది. ప్రస్తుతం తన వాట్సాప్ స్టేటస్లో చక్కర్లు కొడుతుంది. జిల్లా విద్యాశాఖ అధికారిగా అప్పారావునాయుడు నిబద్ధత..నిజాయితీతో పని చేసి అందరి మన్ననలు పొందారు. ప్రస్తుతం జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ) మీడ్డే మీల్ విభాగం అధికారిగా ఉన్నారు. అప్పారావునాయుడు తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూనే, తనకు వ్యవసాయంపై ఉన్న మక్కువతో కూలీలతో కలిసి వరి నాట్లు వేసి రైతు బిడ్డ అనిపించుకున్నారు. -
గోబందను వదులుకోం...
నక్కపల్లి: గ్రామస్తులు పశువుల మేతకు, మత్స్యకారులు చేపల వేటకోసం ఉపయోగించుకుంటున్న గోబందను స్టీల్ప్లాంట్కు కేటాయించేందుకు అంగీకరించే ప్రసక్తి లేదని డీఎల్పురం గ్రామస్తులు స్పష్టం చేశారు. మంగళవారం ఈ గోబందను స్వాఽధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులను గ్రామస్తులు ఆడ్డుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. డీఎల్పురం సర్వే నంబరు 81లో సుమారు 190 ఎకరాల ప్రభుత్వ భూమి (గోబంద) ఉంది. ఈ భూమిలో చాలా ఏళ్ల నుంచి గ్రామస్తులు పాడి రైతులు పశువుల మేత కోసం, దళితులు గుల్లబట్టీల ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. ఈ భూమిని స్టీల్ప్లాంట్కు ధారాదత్తం చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సర్వే అధికారులతో కలసి గతంలో పలు సందర్భాల్లో సర్వే చేసేందుకు సిద్ధపడగా గ్రామస్తులు అభ్యంతరం తెలిపారు. ఈనెల 10వ తేదీన నిర్వహించిన గ్రామసభలో గ్రామస్తులు ఈ గోబందను పశువుల మేతకు, గుల్లబట్టీలకు ఉపయోగించుకుంటున్నామని దీన్ని స్టీల్ప్లాంట్కు ఇవ్వడానికి కుదరదని తేల్చి చెప్పారు. అయినప్పటికీ మంగళవారం మరోసారి రెవెన్యూ, సర్వేశాఖ అధికారులు మందీ మార్బలంతో వెళ్లి భూమిని సర్వే చేసి స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేశారు. గ్రామస్తుల ఆమోదం లేకుండా ఈ గోబందను స్వాధీనం చేసుకోడానికి వీల్లేదని మాజీ ఎంపీటీసీ గింజాల వెంకటరమణ, మాజీ సర్పంచ్లు కిల్లాడ రామకృష్ణ, మత్స్యకార నాయకులు ఓసిపల్లి చిట్టిబాబు, మేరుగు గోవిందు స్పష్టం చేశారు. డీఫారం, జిరాయితీ భూములతోపాటు గ్రామస్తులు తమ అవసరాల కోసం కేటాయించుకున్న భూములను కూడా స్వాధీనం చేసుకుంటామంటే ఒప్పుకునేది లేదన్నారు. మరోసారి గ్రామస్తులంతా సభ ఏర్పాటు చేసుకుని ఒక నిర్ణయానికి వస్తామని అప్పటివరకు ఈ భూముల జోలికి రావొద్దని వారు అధికారులకు స్పష్టం చేశారు. కార్యక్రమంలో గ్రామస్తులు కనకారావు, రాంబాబు, శ్రీను, రమణ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స
తుమ్మపాల: రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర సమయంలో సత్వర వైద్యం అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి – రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్’ (పీఎం రాహత్) పథకాన్ని అమలు చేస్తుందని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో (మొదటి గంట) బాధితులకు ప్రాణాపాయం కలగకుండా, వేగవంతమైన నగదు రహిత ఉచిత వైద్య సేవలను అందించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని, బాధితులకు ఆర్థిక భారం లేకుండా, నాణ్యమైన చికిత్సను అందజేయడానికి ఈ పథకం రూపొందించబడిందన్నారు. ప్రతి రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించబడుతుందన్నారు. ప్రమాదం జరిగిన తేదీ నుంచి గరిష్టంగా 7 రోజుల వరకు ఈ చికిత్స వర్తిస్తుందని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులకు 48 గంటల వరకు, ఇతర కేసుల్లో 24 గంటల వరకు ఆసుపత్రులు తప్పనిసరిగా స్థిరీకరణ చికిత్స అందించాలన్నారు. పోలీస్ రిపోర్టింగ్, హాస్పిటల్ క్లెయిమ్స్ ప్లాట్ఫారమ్ల ద్వారా ఈ పథకం పూర్తి డిజిటల్ విధానంలో పనిచేస్తుందని, ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్యానెల్డ్ ఆసుపత్రులలో అమలు చేయబడుతుందని, దీనికి సంబంధించి ఆసుపత్రులకు చెల్లింపులు’ మోటారు వాహన ప్రమాద నిధి ద్వారా జరుగుతుందన్నారు. జిల్లాలో–5 ప్రైవేట్, 8 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం 13 ఆసుపత్రుల్లో ఈ పథకం అమలులో ఉంటుందన్నారు. -
గజ రాజసం
పొద్దున లేస్తే పావు టన్ను ఆహారం.. 150 లీటర్ల మంచి నీళ్లు! ఒక్కో గజరాజు ఏటా తిని, తాగేందుకే ఏకంగా రూ.4.30 లక్షల ఖర్చవుతుందంటే ఆశ్చర్యం కలగక మానదు. అయినా సరే.. ఆ లెక్కలను పక్కనపెట్టి ప్రేమానురాగాలతో వాటి పొట్ట నింపుతున్నారు విశాఖ జూ అధికారులు, దాతలు. ఒకప్పుడు అడవుల్లో రాజసంగా తిరిగిన ఏనుగుల అడుగుల చప్పుడు.. కాలంతో పాటు క్రమంగా తగ్గుతోంది. ఆక్రమణల నడుమ గజరాజుల మనుగడే ప్రశ్నార్థకమవుతున్న వేళ, విశాఖ ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ నాలుగు ఏనుగులకు సురక్షిత అభయారణ్యంగా మారింది. నేడు ‘ప్రపంచ ఏనుగుల సంరక్షణ దినోత్సవం’ వేళ విశాఖ ‘గజ’నేస్తాల ముచ్చట ఇదీ.. ఆరిలోవ: అరణ్యాల్లో ఏనుగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. వాటి సంరక్షణ కూడా సవాలుగా మారింది. దేశంలో పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో ఉన్న గజరాజులు.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాటి సంఖ్య 250 లోపే ఉండటం గమనార్హం. ఇవి ఎక్కువగా పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, చిత్తూ రు జిల్లాల అడవులలో సంచరిస్తున్నాయి. ఒక్కోసారి ఆహారం కోసం ఇవి గుంపులుగా పంట పొలాల్లోకి చొరబడి భయపెడుతున్నాయి. కానీ విశాఖవాసులకు మాత్రం ఈ గజరాజులు నేస్తాలుగా మారిపోయాయి. ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో నాలుగు ఏనుగులు సందర్శకులను అలరిస్తున్నాయి. విశాఖ జూలో ప్రత్యేక సంరక్షణ విశాఖ జూ పార్కులో లక్ష్మి, సరస్వతి అనే రెండు ఆడ ఏనుగులు, కృష్ణ, రాజు అనే రెండు మగ ఏనుగులు ఉన్నాయి. వీటిని పర్యవేక్షించేందుకు ఇద్దరు మావటీలు, ఇద్దరు యానిమల్ కీపర్లు అందుబాటులో ఉన్నారు. మావటీలు మాట్లాడే భాషను ఏనుగులు గుర్తుపట్టి, వారు చెప్పినట్లు వింటాయి. వీటి కోసం జూలో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేక ‘మోట్’ ఉంది. అందులో రాత్రి వేళల్లో నిద్రించడానికి ‘నైట్ క్రాళ్లు’ నిర్మించారు. ఆరేళ్ల క్రితం వీటి స్నానం కోసం ప్రత్యేకంగా ఒక కొలనును కూడా అందుబాటులోకి తెచ్చారు. ఏదైనా అనారోగ్యం వస్తే జూ వెటర్నరీ వైద్యులు మావటీల సమక్షంలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. నలుగురిలో ప్రత్యేకంగా ‘కృష్ణ’ ● జూలో ఉన్న ఏనుగులలో 48 ఏళ్ల వయసు గల ‘కృష్ణ’ సుమారు 39 ఏళ్లుగా ఇక్కడే పెరుగుతోంది. అయితే ఇది ఒక్కోసారి మతిస్థిమితం కోల్పోయి మావటీల మాట కూడా వినదు. అందుబాటులో ఉన్న రాళ్లను తొండంతో తీసి విసురుతుంటుంది. అందుకే దీనిని సందర్శకులకు దూరంగా నైట్ క్రాల్కే పరిమితం చేసి సంరక్షిస్తున్నారు. ● 26 ఏళ్ల ‘రాజు’ అనే మగ ఏనుగును 2015 మే నెలలో పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, మక్కువ అడవుల నుంచి పట్టుకుని జూకి తరలించారు. ● 61 ఏళ్ల సరస్వతి, దాని పిల్ల 25 ఏళ్ల లక్ష్మిలను చిత్తూరులోని కుప్పం ఏనుగుల క్యాంప్ నుంచి తీసుకొచ్చారు. ఇవి సందర్శకులను విశేషంగా అలరిస్తున్నాయి. రోజుకి 265 కిలోల ‘ఆహార’ విందు! జూలో ఒక్కో ఏనుగుకు రోజుకి సుమారు 265 కిలోల వివిధ రకాల ఆహార పదార్థాలను ఇస్తారు. అలాగే రోజుకు కనీసం 150 లీటర్ల నీరు తాగుతాయి. ఒక్కో ఏనుగు రోజువారీ మెనూ.. అరటి దవ్వ 125 కిలోలు పచ్చి గడ్డి 75 కిలోలు చెరకు 40 కిలోలు పుచ్చకాయ 10 కిలోలు రాగి తోప 6 కిలోలు క్యాటిల్ ఫీడ్ 4 కిలోలు అరటి పండ్లు 6 కిలోలు ఆకుకూరలు 4 కిలోలు కొబ్బరికాయలు 2 బెల్లం పావు కిలో (తవుడు, ఇతర పదార్థాలతో కలిపి) ఉదయం నుంచి సాయంత్రం వరకు విడతల వారీగా ఈ ఆహారాన్ని అందిస్తారు. జూలో అన్ని జంతువుల కంటే ఏనుగుల పోషణకే అత్యధికంగా ఖర్చవుతుంది. ఒక్కో ఏనుగు ఆహారం, పోషణ నిమిత్తం ఏడాదికి రూ.4.30 లక్షలు ఖర్చవుతోంది. ఇది పెద్ద మొత్తం కావడంతో దాతలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఏనుగులను బాధ్యతగా సంరక్షిస్తున్నాం విశాఖ జూ పార్కులో ప్రతి ఏటా ఆగస్టు 12న ఏనుగుల సంరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చిత్రలేఖనం వంటి పోటీలు నిర్వహించాం. ఇక్కడున్న నాలుగు ఏనుగులకు పూర్తిస్థాయి రక్షణ, వైద్య సేవలు అందిస్తున్నాం. వాటి ఆహారానికి ఎక్కువ ఖర్చవుతున్న నేపథ్యంలో దాతలు ముందుకు రావడం అభినందనీయం. మరికొందరు కూడా ఈ సంరక్షణలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. – డాక్టర్ జి.మంగమ్మ, జూ క్యూరేటర్, విశాఖపట్నం -
రోడ్డెక్కిన జూడాలు
మహారాణిపేట: స్టైపెండ్ పెంపు సహా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ జూనియర్ వైద్యులు (జూడాలు) మంగళవారం నుంచి నిరవధిక సమ్మెకు దిగడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కేజీహెచ్లో ఓపీ సేవలు గణనీయంగా ప్రభావితమయ్యాయి. పీజీ వైద్యులు, హౌస్ సర్జన్లు విధులకు దూరంగా ఉండటంతో వైద్యుల కోసం రోగులు గంటల తరబడి ఎదురు చూడాల్సి వచ్చింది. పలు విభాగాల్లో శస్త్రచికిత్సలు సైతం వాయిదా పడ్డాయి. కేజీహెచ్తోపాటు ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి, ప్రాంతీయ కంటి ఆస్పత్రి, ప్రభుత్వ మానసిక ఆస్పత్రి, రాణి చంద్రమ్మణి దేవి ఆస్పత్రి, ఈఎన్టీ, టీబీ ఆస్పత్రుల్లోనూ జూడోల సమ్మె ప్రభావం కనిపించింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ సేవలను బహిష్కరిస్తున్నామని, అత్యవసర వైద్య సేవలకు మాత్రమే హాజరవుతామని జూనియర్ వైద్యుల సంఘం నాయకుడు డాక్టర్ శిరాజ్ తెలిపారు. -
14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్య
మాకవరపాలెం: మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో విద్యా హక్కు చట్టంపై మంగళవారం స్థానిక కేజీబీవీలో విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా బాలల సంరక్షణ అధికారి ఎం.రమేష్ మాట్లాడుతూ విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో పేద పిల్లలకు 25 శాతం సీట్లు ఇవ్వాలని, 6 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత విద్య, మౌలిక సదుపాయాలు కల్పించే అంశాలపై వివరించారు. రక్షణ అధికారి మనోహర్ మాట్లాడుతూ పిల్లల హక్కులకు భంగం కలిగితే 1098, 181 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు. ఉపాధ్యాయులు, చైల్డ్ లైన్ కేస్ వర్కర్ శారదాదేవి, రూప పాల్గొన్నారు. -
రూ.30 లక్షల విలువైన గంజాయి పట్టివేత
నలుగురు అరెస్టు, ఒకరు పరార్కశింకోట: కశింకోటలో పోలీసులు సుమారు రూ.30 లక్షలు విలువైన అక్రమంగా తరలిస్తున్న 60 కిలోల గంజాయిని పట్టుకొని నలుగుర్ని అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. సీఐ అల్లు స్వామినాయుడుతో కలిపి అనకాపల్లి ఇన్ఛార్జి డీఎస్పీ జీఆర్ఆర్ మోహన్ స్థానిక పోలీస్స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఇందుకు సంబంధించిన వివరాలు వివరించారు. అనకాపల్లి నుంచి యలమంచిలి వైపు ఆటోలో ఇద్దరు బైక్ల ఎస్కార్ట్తో వెళుతుండగా అనుమానించి కశింకోట వద్ద తనిఖీ చేయగా గంజాయి పట్టుబడింది. గోనె సంచుల్లో 30 ప్యాకెట్ల గంజాయిని నింపి ఆటో వెనుక ఉంచి తరలిస్తుండగా పట్టుకున్నారు. దీంతోపాటు గంజాయి తరలిస్తున్న కాకినాడకు చెందినగాడి సత్యంరాజు (28), రాజమండ్రికి చెందిన చైతన్య (34), ఒడిశాలోని కోరాపుట్కు చెందిన గుంత హిమాన్సు శేఖర్(27), కారా కేసరి(32) పోలీసులను చూసి పరార్ అవుతుండగా పట్టుకొని అరెస్టు చేశారు. మరో నిందితుడు మర్రి ఘాషి అలియాస్ రవి కోసం తీవ్రంగా గాలిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా ఆటోతో పాటు రెండు బైకులు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలించామన్నారు. గంజాయి పట్టుకోవడంలో ఎస్ఐ లక్ష్మణరావు, చాకచక్యం ప్రదర్శించిన ఏఎస్ఐ శ్యామ్ సుందర్, హోంగార్డు డి.ఎస్ బాబుల పీసీలకు జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా అభినందిస్తూ ప్రత్యేక నగదు బహుమతి, ప్రశంసా పత్రాన్ని అందించారు. కేసులో ఎస్ఐ సతీష్, పోలీసు సిబ్బంది సహకారం అందించారు. -
లైంగిక దాడి కేసులో బాలిక తల్లి, సచివాలయ ఉద్యోగి అరెస్టు
అనకాపల్లి టౌన్: పట్టణ ప్రాంతానికి చెందిన ఓ బాలికపై లైంగిక దాడి కేసులో బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అరెస్ట్ చేసి, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ జి. ప్రేమ్కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆయన అందించిన వివరాలివి. పట్టణంలోని ఓ బాలిక ఆత్మహత్యాయత్నం చేసుకొని ఒక ప్రైవేట్ హాస్పటల్లో చికిత్స పొందుతున్నట్టు అందిన సమాచారం మేరకు విచారణ జరపగా లైంగిక దాడి విషయం వెలుగు చూసిందన్నారు. కుటుంబ కలహాల కారణంగా భర్తతో విడిపోయిన ఒక మహిళకు శారదానగర్కు చెందిన ఓ సచివాలయ ఉద్యోగితో పరిచయం ఏర్పడిందన్నారు. సదరు ఉద్యోగి కూడా తన భార్యకు దూరంగా ఉంటూ బాలిక తల్లితో సహజీవనం చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలో డబ్బు ఆశతో బాలిక తల్లి బాలికను కూడా సచివాలయ ఉద్యోగితో బలవంతంగా లైంగిక దాడి జరిపించినట్టు దర్యాప్తు తేలిందన్నారు. ఈ మేరకు బాలిక తల్లితో పాటు సచివాలయ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని నాయస్థానం ఎదుట హాజరు పరచగా రిమాండ్ విధించినట్టు తెలిపారు. ప్రస్తుతం బాధిత బాలికను వన్స్టాప్ సెంటర్కు తరలించినట్టు సీఐ తెలిపారు. -
బంగారు ఆభరణాల చోరీ
పాయకరావుపేట: పట్టణంలో గల రాజుగారిబీడులో ఆదివారం రాత్రి 88 గ్రాముల బంగారం చోరీకి గురైనట్టు సీఐ ఎం.వినోద్బాబు తెలిపారు. రాజుగారిబీడుకు చెందిన రామోహన్రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ వెళ్లి తిరిగి 10 వ తేదీన సోమవారం ఇంటికి వచ్చారు. ఇంటి మెయిన్గేటు, ఇంటి లోపల తలుపులు తెరిచి ఉండి, బెడ్రూమ్లో వున్న బీరువా తాళాలు పగులగొట్టి 88 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు ఇంటి వరండాలో ఉన్న యాక్టివా మోటారు బైక్ను కూడా దుండగులు ఎత్తుకుపోయారని తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
పలు కేసుల్లో మాజీ ఎమ్మెల్యే గణేష్కు ఊరట
నర్సీపట్నం: పలు కేసుల్లో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, పార్టీ నాయకులకు ఊరట లభించింది. విశాఖ ఎయిర్పోర్టులో మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై జరిగిన కోడి కత్తితో హత్యాయత్నం ఘటనపై ఆందోళన చేయడంపై 2018లో మాజీ ఎమ్మెల్యే గణేష్, మరికొంత మందిపై నర్సీపట్నం టౌన్ పోలీసు అక్రమ కేసు పెట్టారు. అదే సంవత్సరంలో ఓటరు లిస్ట్లో ఓటర్లను తొలగించడంపై ఆర్డీవోకు ఫిర్యాదు చేస్తే అక్రమ కేసు బనాయించారు. తన వాదనలు విన్న కోర్టు ఈ రెండు కేసులను కొట్టేస్తూ తీర్పు ఇవ్వడం జరిగిందని లాయర్ మాకిరెడ్డి బుల్లిదొర తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో పాటు పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏకా శివ, మున్సిపల్ మాజీ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పట్టణ యూత్ అధ్యక్షుడు అల్లంపల్లి ఈశ్వరరావు, సీనియర్ నాయకులు ఏకా రాజుబాబుకు ఊరట లభించింది. -
రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలకు ఎంపిక
నర్సీపట్నం: నర్సీపట్నం ప్రభుత్వ ఉన్నత పాఠ శాల విద్యార్థిని సింధు జిల్లా స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్ 800 మీటర్స్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి, ద్వితీయస్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. ఆ విద్యార్థినిని పాఠశాల హెచ్ఎం, ఎంఈవో సిహెచ్.తలుపులు, పీడీ, ఇన్ఛార్జి హెచ్ఎం నూకరాజు, ఉపాధ్యాయు లు బద్రీనారాయణ, లక్షణరావు, ధర్మరాజు అభినందించారు. నర్సీపట్నం: రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు పెదబొడ్డేపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. వీరందరినీ ప్రిన్సిపాల్ వి.వి.రాజేంద్ర ప్రసాద్ అభినందించారు. జిల్లాస్థాయి అమరావతి చాంఫియన్షిప్ పోటీల్లో కబడ్డీ కె.ఆశోక్, ఎ.లోకేష్, వాలీబాల్ పి.ప్రసాద్, వెయిట్ లిప్టింగ్ ఎ.రోహిత్, లాంగ్జంప్ టి.జశ్వంత్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అద్భుతంగా రాణించిన విద్యార్థులు, తర్ఫీదు ఇచ్చిన పీడీ వినోద్ను ప్రిన్సిపాల్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలకు 9 మంది ఎంపిక మాకవరపాలెం: అమరావతి ఛాంపియన్ షిప్ పోటీ ల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఎంపీడీవో చాయిసుధ, ఎంఈవోలు మూర్తి, ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీవో మేరీజోన్స్ అభినందించారు. ఇటీవల అనకాపల్లిలో జరిగిన అమరావతి ఛాంపియన్ షిప్ లో కబ డ్డీ, వాలీబాల్, ఖోఖో, చెస్, రన్నింగ్ పోటీల్లో మాక వరపాలెం, బూరుగుపాలెం ఉన్నత పాఠశాలల నుంచి తొమ్మిది మంది విద్యార్థులు జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఎంఈవో మూర్తి మంగళవారం తెలిపారు. వీరిని ఆయనతోపాటు ఎంపీడీవో, డిప్యూటీ ఎంపీడీవో అభినందించారు. మాకవరపాలెం: రాష్ట్రస్థాయి ఆటల పోటీలకు 32 మంది అవంతి కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ మోహనరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 8 నుంచి 10 వరకు అనకాపల్లిలో నిర్వహించిన జిల్లాస్థాయి అమరావతి ఛాంపియన్ షిప్ పోటీల్లో తమ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారన్నారు. అయితే బాక్సింగ ఖోఖో, యోగా, బాడ్మింటన్, కబడ్డీ, వాటీబాల్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు తమ ప్రతిభను చూపి 32 మంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. తిరుపతిలో జరగనున్న పోటీల్లో పాల్గొంటారని, అక్కడ కూడా ఉత్తమ ప్రతిభను కనబరచాలని ఆకాంక్షించారు. -
ఆరోగ్యకరమైన జీవనానికి మొక్కలు నాటాలి
అనకాపల్లి: జన్మించిన ప్రతి జీవి ఆరోగ్యంగా ఉండాలని, పర్యావరణ పరిరక్షణ, మొక్కలను నాటి వాటి పర్యవేక్షణ చేయాలని ఎస్పీ తుహిన్ సిన్హా అన్నారు. తమ కార్యాలయంలో మంగళవారం హరిత ఆంధ్రప్రదేశ్లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. మానవ మనుగడకు, ఆరోగ్యకరమైన జీవితానికి మొక్కలు అత్యంత అవశ్యకమని అన్నారు. చెట్ల ద్వారా స్వచ్ఛమైన ఆక్సిజన్ అభించమే కాకుండా పర్యావరణ సమతుల్యత కాపాడుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో కనీసం ఒక మొక్కనైనా నాటి పూర్తి బాధ్యత స్వీకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు, డీఎస్పీ కె.రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
మాచ్ఖండ్లో విద్యుత్ పునరుద్ధరణకు చర్యలు
చీఫ్ ఇంజినీర్ కేవీ రాజారావు సీలేరు: ఆంధ్ర–ఒడిశా ఉమ్మడి నిర్వహణలోని మాచ్ఖండ్ జలవిద్యుత్ కేంద్రంలో సెప్టెంబర్ నాటికి అన్ని యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి జరిగేలా చర్యలు చేపడుతున్నామని ఏపీ జెన్కో సీలేరు విద్యుత్ కాంప్లెక్స్ చీఫ్ ఇంజినీర్ కె.వి.రాజారావు తెలిపారు. మాచ్ఖండ్ విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మంగళవారం సీలేరు వచ్చిన ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. అగ్నిప్రమాదానికి గురైన మాచ్ఖండ్ కేంద్రంలో యూనిట్ల పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ నెల 8న రెండు యూనిట్లను అందుబాటులోకి తీసుకువచ్చి విద్యుదుత్పత్తి ప్రారంభించామని చెప్పారు. మూడో యూనిట్ మరమ్మతులు ఈ నెలాఖరుకు పూర్తిచేసి సెప్టెంబర్ మొదటి వారంలో, ఐదో యూనిట్ను రెండో వారంలో, నాలుగో యూనిట్ను సెప్టెంబర్ చివరి వారంలో అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. అనంతరం ఆరో యూనిట్ పునరుద్ధరణపై కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ప్రస్తుతం గ్రిడ్ డిమాండ్కు అనుగుణంగా అందుబాటులో ఉన్న నీటి వనరులతో రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి చేస్తున్నామని చెప్పారు. సీలేరు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టుకు సంబంధించి రెండు దశల్లో అనుమతులు వచ్చాయని, మిగిలిన అనుమతులు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామని సీఈ తెలిపారు. ప్రాజెక్టు నిర్వాసితులకు జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చే వరకు మెగా ఇంజినీరింగ్ కంపెనీలో, అనంతరం జలవిద్యుత్ కేంద్రంలో ఒప్పంద కార్మికులుగా ఉపాధి కల్పిస్తామన్నారు. నిర్వాసితుల ఉపాధి బాధ్యతను ప్రభుత్వం, ఏపీ జెన్కో తీసుకుంటాయని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆదేశాల మేరకు సీలేరు జలవిద్యుత్ కేంద్రం పరిసరాలను గ్రీన్బెల్ట్గా అభివృద్ధి చేసేందుకు 10 ఎకరాల్లో మొక్కలు నాటుతున్నామని తెలిపారు. పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు నిర్మాణంలో తొలగించే చెట్ల కొమ్మలతో మొక్కలకు రక్షణ ఏర్పాటు చేసి, వాటికి జియో ట్యాగింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు. సీఈ వెంట ఎస్సీ జాకీర్ హుస్సేన్, ఈఈ అప్పలనాయుడు, ఏడీ జైపాల్, ఏఈఈ సురేష్ ఉన్నారు. -
కొత్త సాఫ్ట్వేర్తో అదనపు భారం
విద్యుత్ వినియోగదారుల ఆందోళననర్సీపట్నం: విద్యుత్ మీటర్ల రీడింగ్ నమోదుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జియో ఫెన్సింగ్ విధానం వినియోగదారులకు గుదిబండగా మారింది. సకాలంలో మీటర్ల రీడింగ్ నమోదు ప్రక్రియ పూర్తికాకపోవడంతో స్లాబ్ రేట్ పెరిగి వినియోగదారులపై అదనపు ఆర్థిక భారం పడుతుంది. దీంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈపీడీసీఎల్ అధికారులు సరైన సాంకేతిక అవగాహన, పర్యవేక్షణ లేకుండా రీడింగ్ నమోదు చేసే మిషన్లలో జియో ఫెన్సింగ్(జీపీఆర్ఎస్) సాఫ్ట్వేర్ను అప్లోడ్ చేశారు. రీడింగ్ సిబ్బంది స్వయంగా విద్యుత్ మీటర్ వద్దకు వెళ్తేనే తప్ప రీడింగ్ రాదు. మీటర్ల రీడింగ్ నమోదులో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా జియోఫెన్సింగ్ సాఫ్ట్వేర్ను తీసుకొచ్చారు. ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాలకు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడంతో సాఫ్ట్వేర్ సక్రమంగా పని చేయటం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతి నెలా 12వ తేదీలోపు మీటర్ రీడింగులు నమోదు ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. కొత్త సాఫ్ట్వేర్ సక్రమంగా పని చేయకపోవటం వల్ల 50 శాతం కూడా పూర్తికాని పరిస్థితి నెలకొంది. సిబ్బంది మీటర్ వద్దకు వెళ్లినప్పటికీ రీడింగ్ నమోదు కాకపోవడంతో సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు. సకాలంలో మీటర్ల రీడింగ్ నమోదు ప్రక్రియ పూర్తి కాకపోవడంతో స్లాబ్ రేట్ పెరిగి అదనపు ఆర్థిక భారం పడుతుండడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై ఎలక్ట్రికల్ ఏఈఈ త్రినాథరావును వివరణ కోరగా, కొత్త సాఫ్ట్వేర్ వల్ల మొదటిలో సాంకేతికపరమైన ఇబ్బందులు ఉంటాయి. సకాలంలో రీడింగ్ నమోదు కానందున వినియోగదారులపై భారం పడకుండా వెసులుబాటు కల్పిస్తున్నామన్నారు. -
‘పాత పెన్షన్’ కోసం 1న చలో విజయవాడ
అనకాపల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ వచ్చేనెల 1న నిర్వహించనున్న ‘చలో విజయవాడ’కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ సీపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు కోరుకొండ సతీష్ పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం స్థానిక ఏపీఎన్జీవోస్ కార్యాలయంలో వాల్పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాత పెన్షన్ విధానం అమలు అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వై.శ్రీనివాస్, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయ్, ఫ్యాప్టో జిల్లా చైర్మన్ బోయిన చిన్నారావు, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు జి.కృష్ణ, ఏపీపీటీఏ జిల్లా అధ్యక్షుడు చల్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ రమేష్ గనుల దోపిడీపై ఢిల్లీలో తేల్చుకుంటాం
● మాజీ మంత్రి గుడివాడ అమర్నాఽథ్జిల్లాలో మైనింగ్ చోడవరం : జిల్లాలో మైనింగ్ మాఫియా నడిపిస్తూ గనులను దోచేస్తున్న అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సంగతి ఢిల్లీలో తేలుస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఉభయగోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ గుడివాడ అమర్నాఽథ్ అన్నారు. చోడవరంలో వైఎస్సార్సీపీ సోమవారం నిర్వహించిన ర్యాలీలో అమర్నాఽథ్ మాట్లాడుతూ దోచుకోవడానికి సీఎం రమేష్ అనకాపల్లి వచ్చారని ఆరోపించారు. పచ్చని పొలాలను ఆనుకొని ఉన్న పచ్చని కొండలను పిండి చేసి మైనింగ్ మాఫియా నడిపిస్తూ గనులను దోచుకొని అక్రమ సంపాదన ఆర్జిస్తున్నారని ధ్వజమెత్తారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన పంచదార్ల కొండతో పాటు జిల్లాలో గ్రానైట్, నల్లరాయి, మెటల్, మట్టి వంటి గనులను అక్రమంగా దోచుకుంటున్నారన్నారు. ఆయన దోపిడీ నుంచి ఈ ప్రాంతాలన్నీ పరిరక్షించేందుకు వైఎస్సార్సీపీ పోరాటం చేస్తోందన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఎంపికై న విద్యార్థులతో ఉపాధ్యాయులు మాకవరపాలెం : జిల్లాస్థాయి ఆటల పోటీల్లో స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. మూడు రోజులుగా అనకాపల్లిలో జిల్లాస్థాయిలో అమరావతి ఛాంపియన్ షిప్ పోటీలు జరుగుతున్నాయి. స్థానిక ఉన్నత పాఠశాల విద్యార్థులు వివిధ పోటీల్లో పాల్గొన్నారు. అండర్–17 కబడ్డీ పోటీల్లో కె.సింధుజ, కె.ఇందు, వి.పూజిత, అండర్–17 వాలీబాల్ పోటీల్లో ఎస్.తులసీరాజ్, అండర్–17 చెస్ పోటీల్లో వి.చరణ్ జిల్లాస్థాయిలో ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల హెచ్ఎం వి.శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. వీరిని పీఈటీలు, ఇతర ఉపాధ్యాయులు అభినందించారు. -
విద్యుత్ మోటార్ల చోరీ కేసులో ఏడుగురు అరెస్టు
ఎస్.రాయవరం : మండలంలో పలు గ్రామాల్లో విద్యుత్ మోటార్ల చోరీ కేసులో ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్టు నర్సీపట్నం డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. అడ్డురోడ్డు సర్కిల్ కార్యాలయంలో సోమవారం డీఎస్పీ స్థానిక విలేకర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్.రాయవరం మండలంలో పలు గ్రామాల్లో వ్యవసాయ మోటర్లు, వాటి వైర్లు చోరీ గురి కావడంతో రైతుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసుల్లో ఎస్.రాయవరం గ్రామానికి చెందిన ఏడుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్కు పంపామన్నారు. ఈ సమావేశంలో సీఐ రామకృష్ణ, ఎస్ఐ రమేష్ ఉన్నారు. -
జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టాలి
దేవరాపల్లి : జిల్లాలో కరువు సహాయక చర్యలు చేపట్టి రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు డిమాండ్ చేశారు. సీఐటీయూ, ఏపీ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో దేవరాపల్లిలో సోమవారం ‘జైల్ భరో’ కార్యక్రమం జరిగింది. రైవాడ అతిథి గృహం నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు ర్యాలీగా చేరుకొని అక్కడ మానవహారంగా ఏర్పడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు. నాయనబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర, ఈర్లె నాయుడుబాబు, రొంగలి ముత్యాలనాయుడు, గాడి ప్రసాద్ మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం రూ. 31 వేలు ఇవ్వాలని, ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉచిత పంటల బీమా అమలు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కోరారు. -
దేశ నిర్మాణంలో భాగస్వాములు కండి
సాక్షి, అనకాపల్లి : భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 10 నుంచి 15వ తేదీ వరకూ నిర్వహిస్తున్న ‘పార్టనర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ అండ్ హ్యాస్ అనే నేను’ కార్యక్రమంలో జిల్లా ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములు కావాలని కలెక్టర్ విజయకృష్ణన్ పిలుపునిచ్చారు. 30 సెకన్ల పాటు ‘అనే నేను’ వీడియోను దేశ ప్రగతికి మీ లక్ష్యాన్ని పేర్కొంటూ రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని కోరారు. దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడి బాధ్యతను చాటేలా, తమ వంతుగా చేయగలిగే ఒక మంచి పనిని సంకల్పంగా స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటా జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కోరారు. ఆగస్టు 14న నిర్వహించే రాష్ట్రవ్యాప్త మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు. పాఠశాలల్లో ‘అనే నేను’ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలను, దేశ నిర్మాణంలో తాము చేయాలనుకుంటున్న కృషిని వెల్లడించేలా ప్రోత్సహించాలని తెలిపారు. వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసే సమయంలో PartnersInNationBuilding, # MyIndia MyVision, # IndependenceDay2026, # AneNenu హ్యాష్ ట్యాగ్లను ఉపయోగించి @APOfficialNews ట్యాగ్ చేయాలని తెలిపారు. -
గర్జించిన యువత
నిర్బంధాలను అధిగమించి మెగా డీఎస్సీ అక్రమాలపై కదంతొక్కిన యువత, విద్యార్థులు చోడవరం : చోడవరంలో భారీ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి అమర్నాథ్, యువజన, విద్యార్థి విభాగాల నాయకులునర్సీపట్నం : నిరసన ర్యాలీని అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించిన మాజీ ఎమ్మెల్యే గణేష్, పార్టీ నాయకులు, యువతయలమంచిలి రూరల్ : యలమంచిలిలో ర్యాలీ చేస్తున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త ధర్మశ్రీ, పార్టీ నాయకులు, యువజన, విద్యార్థి నాయకులు పాయరావుపేట : పాయకరావుపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న వైఎస్సార్సీపీ సమన్వయకర్త కంబాల జోగులు, పార్టీ నాయకులు, యువజన నాయకులుసాక్షి, అనకాపల్లి: : మెగా డీఎస్సీ అక్రమాలపై జిల్లా వ్యాప్తంగా యువత, విద్యార్థులు కదంతొక్కారు. వైఎస్సార్ సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తలపెట్టిన నిరసన ర్యాలీలకు విశేష స్పందన లభించింది. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నప్పటికీ అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. పలు చోట్ల ముందస్తు నోటీసులు జారీ చేస్తూ, అరెస్టులు చేస్తామని బెదిరింపులకు దిగారు. అయితే, పోలీసుల అక్రమ నిర్బంధాలను, ఆంక్షలను తెంచుకుంటూ వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, కార్యకర్తలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, పాదయాత్రలకు అనుమతి లేదంటూ ర్యాలీలు ప్రారంభానికి 10 నిమిషాలు, అర్ధగంట ముందే పోలీసులు నోటీసులు ఇచ్చారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతాయనే నెపంతో నిరసనలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ కేంద్రాల్లో వందలాది మంది పోలీసులను మోహరించి బారికేడ్లు, రోప్లతో అడ్డుకున్నారు. అయినా సరే, యువత అవేమీ లెక్కచేయకుండా బారికేడ్లను తొలగించుకుని ముందుకు దూసుకెళ్లారు. దీంతో పలు ప్రాంతాల్లో పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య తీవ్ర తోపులాట జరిగి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బైక్ ర్యాలీలకు అనుమతి నిరాకరించడంతో నాయకులు, విద్యార్థులు పాదయాత్రలుగా మారి నిరసన తెలిపారు. ఉద్రిక్తల నడుమ ర్యాలీ... అనకాపల్లి నియోజకవర్గంలో సమన్వయకర్త మలసాల భరత్కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ నేతృత్వంలో నియోజకవర్గంలో యువత, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. పోలీసుల అక్రమ నిర్బంధాలను అధిగమించి నిరసన ర్యాలీను విజయవంతంగా ముగించారు. ర్యాలీ ప్రారంభమయ్యే పది నిమిషాల ముందు పోలీసులు అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేశారు. అయినా యువత, విద్యార్థులు తగ్గేదేలేదంటూ సోమవారం ఉదయం 10.30 గంటలకు సుంకరమెట్ట జంక్షన్ నుంచి బాలకృష్ణ బస్ట్ స్టాప్ వరకూ 1 కి.మీ మేర బైక్ ర్యాలీ చేశారు. ర్యాలీలో భారీగా యువత, విద్యార్థులు పాల్గొనడంతో పథకం ప్రకారం బాలకృష్ణ బస్ స్టాప్ వద్ద రోపుతో బైక్ ర్యాలీను అడ్డుకున్నారు. అనుమతి లేకుండా ర్యాలీ చేస్తే అరెస్ట్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్ప డ్డారు. దీంతో జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, సమన్వయకర్త మలసాల భరత్కుమార్ నేతృత్వంలో బైక్ ర్యాలీ కాకుండా పాదయాత్రగా ర్యాలీ చేసేందుకు సిద్ధమయ్యారు. అయినా పోలీసులు ఆగలేదు. అనకాపల్లి ఇన్చార్జి డీఎస్పీ మోహన్రావు నేతృత్వంలో భారీగా పోలీసులు మోహరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, యువత, విద్యా ర్థులను అడ్డుకున్నారు. దీంతో యువతకు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. యువత ర్యాలీ ని పోలీసు నిర్బంధాలు ఆపలేకపోయాయి. అక్కడ నుంచి పాదయాత్రగా మరో రెండు కి.మీ మేర ర్యాలీ సాగించి విజయవంతంగా ముగించారు. నియోజకవర్గ పరిశీలకుడు సతీష్వర్మ, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, మందపాటి జానకీరామ్, గొర్లిసూరిబాబు పాల్గొన్నారు. బారికేడ్లు, రోప్లు దాటి.. పాయకరావుపేట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీలకు యువత, విద్యార్థులు బ్రహ్మరథం పట్టారు. శాంతియుత ర్యాలీను పోలీసులు అడ్డుకునే ప్రయత్నంచేశారు. పోలీసుల ఉద్రిక్తత నడుమ డీఎస్సీ అక్రమాలపై యువత, విద్యార్థులు తలపెట్టిన నిరసన ర్యాలీ సాగింది. ఉదయం 11 గంటలకు పాయకరావుపేట టౌన్లో పంచాయితీ కార్యాలయం వద్ద నుంచి పాదయాత్రగా ర్యాలీ ప్రారంభమైంది. పార్టీ కార్యాలయం నుంచి ఒక కి.మీ మేర పాదయాత్ర చేశారు. ర్యాలీని పోలీసులు రోపుతో అడ్డుకున్నారు. అయినా ఆగకుండా పోలీసుల రోపును తోసుకుంటూ అర కిలోమీటర్ వరకూ ర్యాలీ చేశారు. అక్కడ పూర్తి స్థాయిలో పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే నినాదాలు చేసి ర్యాలీ ముగించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, వీసం రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు పాల్గొన్నారు. అడుగడుగునా అడ్డంకులు యలమంచిలి నియోజకవర్గంలో మాజీ ప్రభుత్వ విఫ్, సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన ర్యాలీకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. పోలీసులు ఆంక్షల నడుమ శాంతియుతంగా నిరసన ర్యాలీ విజయవంతం చేశారు. ఉదయం 10 గంటలకు ర్యాలీ నిర్వ హించాలని భావించారు. ఇంతలో పోలీసులు వచ్చి ర్యాలీకు అనుమతి లేదంటూ నోటీసులు జారీ చేశారు. అయినా ర్యాలీ ఆపేది లేదంటూ ఉదయం 10.30 గంటలకు పాదయాత్రగా ర్యాలీ చేశారు. ముగ్గురు ఎస్ఐ, ఇద్దరు సీఐలతో పోలీస్ సిబ్బంది అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎక్కడా ఆగలేదు. పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకూ కిలోమీటరన్నర పాటు పాదయాత్రగా ర్యాలీ చేశారు. ఎస్ఈసీ సభ్యుడు బోదెపు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. గంటన్నర పాటు గృహ నిర్బంధంఅడ్డుకున్నా..రెట్టింపు ఉత్సాహంతో ముందడుగు చోడవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి, సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో పోలీసుల ఆంక్షల నడుమ పాదయాత్ర ర్యాలీ విజయవంతంగా సాగింది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను ర్యాలీ చేస్తే అరెస్ట్ చేస్తామంటూ పోలీసులు బెదిరించే ప్రయత్నాలకు పాల్పడ్డారు. ఉదయం 10 గంటలకు ప్రభుత్వ హైస్కూల్ జంక్షన్ నుంచి పాదయాత్రగా ర్యాలీ ప్రారంభమయ్యే అర్థ గంట పోలీసులు అనుమతి లేదంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు నోటీసు జారీ చేశారు. అయినా ఎక్కడా ర్యాలీ అపేది లేదంటూ యువత, విద్యార్థులు చెప్పడంతో పోలీసులు అడ్డుకునేందుకు తీవ్ర యత్నం చేశారు. భారీగా యువత, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రావడంతో పోలీసులు అడ్డుతప్పుకున్నారు. ప్రభుత్వ హైస్కూల్ జంక్షన్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకూ 2 కి.మీ మేర పాదయాత్రగా రెట్టింపు ఉత్సాహంతో యువత, విద్యార్థులు, వైఎస్సార్ సీపీ నాయకులు శాంతియుత ర్యాలీ చేశారు. నియోజకవర్గ పరిశీలకులు గండి రవికుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు వెంకటేష్,ముఖ్యనాయకుడు దొండా రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.. ర్యాలీకి ముందు నోటీసులు పోలీసు నిర్బంధాలను అఽధిగమించి వైఎస్సార్సీపీ యువ గర్జన పోలీస్ రోప్లు, బారికేడ్లు తొలగించుకొని దూసుకెళ్లిన యువత బైక్ ర్యాలీలకు అనుమతించకపోవడంతో పాదయాత్రగా ర్యాలీలు నియోజకవర్గం కేంద్రంలో వందలాది పోలీసులతో అడ్డగింత, తోపులాట భారీగా తరలి వచ్చిన యువత, విద్యార్థులు, వైఎస్సార్సీపీ నాయకులు గంటన్నర పాటు గృహ నిర్బంధంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ డీఎస్సీ అక్రమాలపై లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణ కోరుతూ హోరెత్తిన నినాదాలునర్సీపట్నం నియోజకవర్గంలో సమన్వయకర్త పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన ర్యాలీను అడ్డుకున్నారు. ఆయనను గంట పాటు గృహ నిర్బంధంలో ఉంచారు. నిరసన చేయడానికి అనుమతి లేదంటూ ర్యాలీకు గంట ముందే నోటీసులు జారీ చేశారు. గణేష్ ఇంటికి సమీపంలోని మెయిన్ రోడ్డుపై పోలీసులు అధిక సంఖ్యలో మోహరించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులను గణేష్ నివాసానికి వెళ్లకుండా నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయకర్త ఇంటికి రావడంతో అక్కడ నుంచి పోలీసులను నిర్భందాలను అధిగమించి శాంతియుతంగా పాదయాత్ర ర్యాలీ చేశారు. పోలీసులు భారీ రోప్లు వేసి అడ్డుకున్నారు. దీంతో మెయిన్ రోడ్డుపై గణేష్తో పాటు యువత, విద్యార్థులు, వైఎస్సార్సీపీ నాయకులు బైటాయించారు. శాంతియుతంగా నిరసన చేస్తుంటే అడ్డుకోవటం మంచి పద్ధతి కాదని గణేష్ పోలీసుతో వాదనకు దిగారు. దీంతో సీఐ గపూర్, గణేష్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ గణేష్ రోడ్డుపై బైఠాయించారు. జెండాలు, ప్లేకార్డులతో పార్టీ శ్రేణులు చేతపట్టి మంత్రి లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు తదితరులు పాల్గొన్నారు. -
సాగునీటి వనరులూ మిట్టల్ స్టీల్కే...!
నక్కపల్లి : కూటమి ప్రభుత్వం ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం అన్నదాతలకు అన్యాయం తలపెడుతోంది. తరతరాలుగా సాగు అవసరాల కోసం ఉపయోగిస్తున్న వనరులను స్టీల్ప్లాంట్ ప్రయోజనాల కోసం కేటాయించేందుకు నిర్ణయించింది. మండలంలో కాగిత రెవెన్యూ పరిధిలో 17 ఎకరాల చెరువులు, గెడ్డలు గ్రామకంఠం భూములను ఏపీఐఐసీ ద్వారా స్టీల్ప్లాంట్కు బదలాయించేందుకు తెరలేపింది. దీనికి సంబంధించిన అభ్యంతరాలు ఉంటే తెలియజేసుకోవాలని గ్రామ పంచాయతీలో నోటీసుల ద్వారా తెలియజేసింది. వివరాల్లోకి వెళ్తే... మండలంలో ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్ కోసం 2250 ఎకరాల భూములు కేటాయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కాగిత గ్రామస్తులు తమ రెవెన్యూ పరిధిలో సుమారు 30 ఎకరాలను 80 అడుగుల రోడ్డుకోసం త్యాగం చేశారు. ఇపుడు రైతులు సాగు చేసుకుంటున్న భూములకు జీవనాధారమైన చెరువులు, గెడ్డలు, ఇతర సాగునీటి వనరులను సైతం స్టీల్ప్లాంట్కు కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే జరిగితే ఈ నీటి వనరులపై ఆధారపడి సాగు చేసుకుంటున్న భూములన్నీ బీడు భూములుగా మారే ప్రమాదం ఉందంటూ అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇదే ప్రతిపాదన వస్తే హోంమంత్రిని ఆశ్రయిస్తే అటువంటి సమస్యలు రాకుండా చూస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు రెవెన్యూ అధికారులు కాగిత పరిధిలో ఉన్న చెరువులను స్టీల్ప్లాంట్కు ధారాదత్తం చేసే ప్రక్రియ చేపట్టంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ భూములు బీడు వారాల్సిందేనా... ఈ చెరువులు, గెడ్డల కింద సుమారు 200 ఎకరాల వరకు ఆయకట్టు భూములున్నాయని, వరి, అపరాలు, కూరగాయలు ఉద్యానవన పంటలు సాగు చేస్తుంటామని రైతులు చెబుతున్నారు. తక్షణమే ప్రభుత్వం సాగునీటి వనరుల బదలాయింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కాని పక్షంలో బోర్లు, వ్యవసాయ బావులు తదితర ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలని కోరుతున్నారు. -
అధికారులు సమన్వయంతో పనిచేయాలి
కశింకోట: అధికారులు సమన్వయంతో బాధ్యతగా పని చేసి గ్రామ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలని పంచాయతీరాజ్ అదనపు డైరెక్టర్ టి చైతన్య కల్యాణ జయ భరత్రాజ్ ఆదేశించారు. మండలలోని స్వర్ణ గ్రామ పంచాయతీగా ఎంపికై న జి.భీమవరం గ్రామాన్ని సోమవారం సందర్శించారు. అక్కడ ప్రజలకు అందుతున్న సౌకర్యాలు, సేవల తీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే లక్ష్యంగా పాలనా పరమైన చర్యలు చేపట్టి కొనసాగించాలన్నారు. గ్రామంలో పారిశుధ్యం, తాగునీరు, ఇతర సేవలను మెరుగుపర్చడం, అధికారుల క్షేత్ర స్థాయి పరిశీలన, సమీక్షలు, ప్రభుత్వ పథకాల అమలుపై పారదర్శకత ఉండాలన్నారు. స్వర్ణ గ్రామ పంచాయితీ సిబ్బంది చేస్తున్న సేవలను అభినందించారు. గ్రామాన్ని జాతీయ పురస్కారం పొందడం కోసం పలు సూచనలు చేశారు. ఎంపీడీవో చంద్రశేఖరరావు, డిప్యూటీ ఎంపీడీవో వెంకటలక్ష్మి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
పీజీఆర్ఎస్పై తగ్గుతున్న నమ్మకం
తుమ్మపాల : సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలనే ఆశతో కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలకు వృద్ధులు, దివ్యాంగులు, మహిళలు, వివిధ వర్గాల ప్రజలు వ్యయప్రయాసల కోర్చి వచ్చారు. జిల్లా అత్యున్నత అధికారి కలెక్టర్ను కలిసి తమ సమస్యను వివరించినప్పటికీ, అర్జీ పరిష్కారం మాత్రం కింది స్థాయి అధికారుల పరిధిలోకి వెళ్లడంతో అక్కడే సమస్యలు ఎదురవుతున్నాయని పలువురు అర్జీదారులు చెబుతున్నారు. పీజీఆర్ఎస్లో అర్జీ సమర్పించినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని వాపోతున్నారు. దీంతో పీజీఆర్ఎస్పై ప్రజల్లో క్రమంగా నమ్మకం సన్నగిల్లుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కలెక్టరేట్కు వచ్చే అర్జీదారుల కోసం ఇటీవల కొన్ని వారాలుగా భోజన సౌకర్యం ఏర్పాటు చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అర్జీదారులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు, ఎండ నుంచి రక్షణ కల్పించే టెంట్లు, తాగునీటి వంటి సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడంతో ఎండలో గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెబుతున్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 306 అర్జీలు ననమోదు కాగా వాటిలో 170 అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే ఉన్నాయి. పీజీఆర్ఎస్, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, జిల్లా ఎకై ్సజ్ అధికారి వి.సుధీర్, పలు శాఖల అధికారులు గోపాల్ రాజా, ఆశా దేవి పాల్గొన్నారు. నూరుశాతం వైకల్యం..పింఛను అందించరూ.. వైద్య అధికారుల నమోదు చేసిన వివరాల్లో జరిగిన తప్పిదం కారణంగా 100 శాతం దివ్యాంగుడైన తన కుమారుడికి ప్రభుత్వం అందించాల్సిన పూర్తి పింఛన్ అందడం లేదని అనకాపల్లి మండలం గొలగాం పంచాయతీ కొత్తతలారివానిపాలెం గ్రామానికి చెందిన గంతకోరు సత్యవతి ఆవేదన వ్యక్తం చేసింది. పుట్టుకతో దివ్యాంగుడైన తన కుమారుడి జశ్వంత్ సదరం సర్టిఫికెట్లో దివ్యాంగత్వాన్ని తప్పుగా నమోదు చేయడంతో నెలకు రూ.6 వేల పింఛన్ మాత్రమే వస్తోందని, దీనిని సరిచేసి ప్రభుత్వం అమలు చేస్తున్న రూ.15 వేల పింఛన్ అందించాలని కోరింది. ఏఎంఆర్ అక్రమ వసూళ్లపై ఫిర్యాదు ఏఎంఆర్ సంస్ధ చెక్పోస్టులను తొలగించి ప్రతినిధులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ట్రాక్టర్ ఓనర్స్,డ్రైవర్స్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. సీనరేజ్ పేరుతో ప్రతి గ్రామంలో చెక్పోస్టులు పెట్టి మైనింగ్ లారీల నుంచి సరుకు టన్నుల లెక్కన లెక్కింపు చేసి వసూళ్లు చేసిన సోమ్మును ప్రభుత్వానికి చెల్లింపులు చేయకుండా అక్రమ బిల్లులతో ఏఎంఆర్ సంస్ధ దోచుకుంటుందని ఆరోపించారు. అడ్డగోలుగా వసూళ్లకు పాల్పడుతున్న ఆ సంస్థ ప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. భూ నిర్వాసితుల హామీలు నెరవేర్చండి.. పూడిమడక వద్ద ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ భూ నిర్వాసిత రైతులకు ఉద్యోగ, ఉపాధి, ఆర్అండ్ఆర్ కార్డులు మంజూరు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈమేరకు స్పష్టమైన రాత పూర్వక హమీ ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు నిర్మాణ పనులను చేపట్టాలని పీజీఆర్ఎస్లో వినతి అందించారు. పాస్టర్ల నిరసన క్రైస్తవులను కూడా షెడ్యూల్డ్ కులాలుగా గుర్తిస్తూ 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులను అమలుచేసి వేధింపులు, దాడులు, అఘాయిత్యాల నుంచి క్రైస్తవ మైనారిటీ సమాజాన్ని రక్షించాలంటూ పాస్టర్లు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి డీఆర్వోకు వినతిపత్రం అందించారు. షెడ్యూల్డ్ కులాల మూలానికి చెందిన క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల హోదా నుంచి మినహాయించడం అన్యాయం అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు, వైస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జోసెఫ్, క్రిస్టియన్ సంఘ పెద్దలు ఫాదర్స్ జోసఫ్ ప్రభాకర్, రవీంద్ర, రత్నాకర్, ప్రసాధ్, బాలరాజు పాల్గొన్నారు. -
ఎస్పీ కార్యాలయంలో 55 అర్జీలు
ఎస్పీ కార్యాలయంలో అర్జీలు స్వీకరిస్తున్న అదనపు ఎస్పీ మోహన్రావు అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్కు సోమవారం 55 ఆర్జీలు వచ్చాయి. అదనపు ఎస్పీ ఎల్.మోహన్రావు ఆర్జీదారుల ఆర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చట్టపరిధిలో సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. భూ తగాదాలు, ఆస్తి సంబంధిత సమస్యలు, కుటుంబ సమస్యలు, మోసపూరిత హామీలు, ఆర్థిక నేరాలు, ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన వాటిపై ఆర్జీలు వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎస్.ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
కశింకోట ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్ సిబ్బంది రిలేదీక్షలు
కశింకోట : కశింకోటలోని ఆర్ఈసీఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపక సిబ్బంది తమకు జీతాలు క్రమం తప్పకుండా ఇవ్వాలని, బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రిలే నిరాహార దీక్ష చేపట్టి నిర్వహించారు. ముందుగా కళాశాల ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి వెలిగించి నివాళులర్పించారు. అనంతరం కళాశాల అధ్యాపక సిబ్బంది నిరాహార దీక్షలు చేపట్టారు. కుదించిన జీతాలను పునరుద్ధరించాలని, వేతన సవరణ ప్రకారం జీతాలు ఇవ్వాలని, రాజీనామా చేసిన ఉద్యోగుల స్థానంలో కొత్త వారిని నియమించి ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. దీక్షలు కొనసాగిస్తుండగా మధ్యాహ్నం కళాశాల ప్రిన్సిపాల్ బి.ఉమాశంకర్, అసోసియేట్ ప్రిన్సిపాల్ శివ, అధ్యాపక సిబ్బంది యూనియన్ ప్రతినిధులతో ఏపీఈపీడీసీఎల్ అధికారులు పిలిచి ఆర్ఈసీఎస్ ప్రధాన కార్యాలయంలో చర్చలు జరిపారు. ఏపీఈపీడీసీఎల్ ప్రాజెక్టు డైరెక్టర్ వనజ, సీఈవో రామకృష్ణ, చీఫ్ జనరల్ మేనేజర్ సాల్మాన్రాజు, విజిలెన్స్ ఎస్పీ కింజరపు శ్రీనివాసరావు, ఎపీఈపీడీసీఎల్ అనకాపల్లి సూపరింటిండెంటింగ్ ఇంజనీర్, ఆర్ఈసీఎస్ ఎండీ కూడా అయిన జి.ప్రసాద్ తదితరులు పాల్గొని చర్చించిన అనంతరం ఈ నెల 20లోగా సమస్యలను పరిష్కరించడానికి హామీ ఇచ్చారు. అలాగే రెండు మూడు రోజుల్లో ఏపీఈపీడీసీఎల్ సీఎండీని కలిసే ఏర్పాట్లు కూడా చేస్తామని, దీక్షలు విరమించాలని కోరారు. దీంతో దీక్షలను తాత్కాలికంగా వరమిస్తున్నట్టు కళాశాల ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు తెలిపారు. యూనియన్ అధ్యక్షుడు హేమంత్, కార్యదర్శి నగేష్, అధ్యాపక సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
డెఫ్ టీ20 క్రికెట్ చాంపియన్షిప్ విజేత అనకాపల్లి
విజేతలకు మెడల్స్, ప్రశంసా పత్రాలు అందిస్తున్న జేసీ శౌర్యమాన్ పటేల్ తుమ్మపాల: దివ్యాంగులమని వెనుకంజ వేయకుండా అద్భుత ప్రతిభ కనబరిచిన జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ జట్టు ఫైనల్ పోటీలో విజయం సాధించి చాంపియనషిప్ ట్రోఫీని కై వసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని జేసీ శౌర్యమాన్ పటేల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో క్రీడాకారులకు ఆయన మెడల్స్, ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 1, 2 తేదీల్లో విశాఖలోని నిర్వహించిన 4వ జోనల్–1 డెఫ్ టీ–20 క్రికెట్ చాంపియషిప్–2026 పోటీల్లో అనకాపల్లి జిల్లా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ది డెఫ్ జట్టు విజేతగా నిలిచింది. ఈ పోటీల్లో విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల జట్లు పాల్గొన్నాయి. జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చిన డెఫ్ క్రికెట్ జట్టు సభ్యులను అధికారులు అభినందించారు. -
న్యాయవ్యవస్థలో అడ్వకేట్ గుమాస్తాల పాత్ర కీలకం
అల్లిపురం: న్యాయవ్యవస్థలో అడ్వకేట్ క్లర్కుల పాత్ర ఎంతో కీలకమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఇటీవల మరణించిన సీనియర్ అడ్వకేట్ క్లర్క్ కృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కృష్ణ సుదీర్ఘంగా 53 సంవత్సరాల పాటు గుమస్తాగా అందించిన సేవలను కొనియాడారు. అలాగే న్యాయవాదులు, అడ్వకేట్ క్లార్కుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఎం.కె. శ్రీనివాసరావు, ఎస్. నాగేశ్ కుమార్ మాట్లాడుతూ.. అడ్వకేట్ క్లర్కుల సంక్షేమానికి తమవంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. క్లర్కుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో క్లార్కుల సంక్షేమం, హక్కులు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమంలో విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నమ్మి సన్యాసిరావు, సీనియర్ న్యాయవాదులు బెవర సత్యనారాయణ, కే. సురేష్ కుమార్, గుమస్తాల సంఘం అధ్యక్షుడు పిల్ల బంగారు నాయుడు, కార్యదర్శి నల్ల భాస్కర రావు, ఏపీ అడ్వకేట్స్ క్లర్క్స్ వెల్ఫేర్ ఫండ్ సభ్యులు జి. శివకృష్ణ, గొర్లి కృష్ణతో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, అడ్వకేట్ క్లర్కులు పాల్గొని నివాళులర్పించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు -
ఘనంగా మోదమాంబ అమ్మవారి జాతర
మాడుగుల రూరల్: కె.జె.పురం మోదమాంబ అమ్మవారి జాతర ఆదివారం ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హజరై అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఘాటాలతో వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలునాయుడు, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సదుపాయాలు కల్పించారు. సాయంత్రం నుంచి నేల వేషాలు, శక్తి వేషాలు, తీనుమార్, తప్పెటగుళ్లు, జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాత్రికి గ్రామంలో పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద దాతల సహకారంతో పులిహోర, మజ్జిగ, ప్రూటు సలాడు, స్వీటు భక్తులకు అందజేశారు. అరుణా కేటరింగ్ వారి ఆర్థిక సహకారంతో భక్తులకు, చిరు వ్యాపారులకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉత్సాహంగా ఎడ్ల పరుగు పోటీలు జిల్లా స్థాయి ఎడ్ల పరుగు పోటీలు ఆలయం వద్ద ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేశారు. పోటీలను మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు జెండా ఊపి ప్రారంభించారు. పోటీలను తిలకించడానికి చుట్టు పక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. జాతరలో ఆకర్షణీయంగా ఆడారి కుటుంబీకులు అయిన ఆడారి కామునాయుడు కుటుంబ సభ్యులు ప్లాస్టిక్తో తయారు చేసిన ఏలిఏనుగు మీద ఎక్కి గ్రామంలో తిరిగారు. -
వీకెండ్ సందడి
డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన చాపరాయి, అరకు ఫైనరీలో ఆదివారం సందడి నెలకొంది. శనివారం బంద్ కారణంగా పర్యాటక ప్రదేశాలు వెలవెలబోయాయి. ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చాపరాయిలో పర్యాటకులు ప్రకృతి అందాలను ఆస్వాదించడంతో పాటు గిరిజన సంప్రదాయ వస్త్రాలను ధరించి థింసా నృత్యం చేస్తూ సందడి చేశారు. అరకు ఫైనరీ వద్ద పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటస్థలంలో చిన్నారులు ఆటలాడుతూ సందడి చేశారు. పర్యాటక ప్రదేశాల్లో గిరిజనులు విక్రయించే బ్యాంబూ చికెన్, బ్యాంబూ బిర్యానీకి ప్రత్యేక ఆదరణ లభించింది. -
13 నుంచి కనకమహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాస పూజలు
డాబాగార్డెన్స్: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, విశాఖ వాసుల ఆరాధ్యదైవం శ్రీ కనకమహాలక్ష్మి దేవస్థానంలో ఈ నెల 13వ తేదీ నుంచి వచ్చే నెల 11 వరకు శ్రావణమాసాన్ని పురస్కరించుకుని ‘శ్రావణలక్ష్మి ప్రత్యేక కుంకుమ పూజలు’ ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి సుజాత తెలిపారు. నిత్య పూజలు.. సమయాలు నెల రోజుల పాటు రోజూ ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ఈ పూజలు జరుగుతాయి. అలాగే విశేష దినాలైన గురు, శుక్రవారాల్లో రెండు విడతలుగా ఉదయం 8 నుంచి 9 వరకు, 9.30 నుంచి 10.30 వరకు ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. పూజలో భాగంగా సంకల్పం, లక్ష్మీ సహస్రనామార్చన, లక్ష్మీ హోమం, అమ్మవారి దర్శనం మరియు వేదాశీర్వచనం చేపడతారు. భక్తులకు అవసరమైన పూజా సామగ్రిని దేవస్థానమే సమకూర్చనుంది. టికెట్ రుసుము ఈ సామూహిక కుంకుమ పూజలో పాల్గొనదలచే భక్తులు (దంపతులు) రూ.516 టికెట్ రుసుము చెల్లించాలి. పూజ అనంతరం భక్తులకు శేషవస్త్రంగా కండువా, జాకెట్ ముక్క, పావు కేజీ పులిహోర, పావు కేజీ చక్కెర పొంగలి, రాగి శ్రీచక్రయంత్రాన్ని మహాప్రసాదంగా అందజేస్తారు. ముఖ్యమైన పర్వదినాలు శ్రావణమాసంలో వచ్చే మూడో శుక్రవారం (ఆగస్టు 21) వరలక్ష్మీ వ్రతాన్ని, అలాగే ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజలను వైభవంగా నిర్వహించనున్నారు. మాసంలో వచ్చే ఐదు శుక్రవారాల్లో (ఆగస్టు 14, 21, 28, సెప్టెంబర్ 4, 11) విశేష కార్యక్రమాలు ఉంటాయి. 13న పూజల ప్రారంభం ఈ నెల 13న ఉదయం 8.20 గంటలకు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పూజలను అధికారికంగా ప్రారంభించనున్నారు. భక్తులందరూ విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందాలని ఈవో కోరారు. పరోక్ష/ఆన్లైన్ సేవల వివరాలు: ఆలయానికి నేరుగా రాలేని స్థానికేతర భక్తుల గోత్రనామాలతో పూజ నిర్వహించి, లక్ష్మీ యంత్రం, కుంకుమ, ప్రసాదాన్ని పోస్టల్ ద్వారా వారి ఇంటి చిరునామాకు పంపుతారు. బ్యాంక్ ఖాతా వివరాలు: 060810011006691 (ఐఎఫ్ఎస్సీ : యూబీఐఎన్ 0806081), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టౌన్ కొత్తరోడ్డు బ్రాంచ్. ఫోన్ నంబర్లు: 0891–2568645, 2566515, 2731250 వెబ్సైట్: www.aptemples.org ఆన్లైన్ పూజల సమాచారం కోసం ‘మనమిత్ర’ వాట్సాప్లో కూడా సంప్రదించాలని ఈవో సుజాత పేర్కొన్నారు. -
సమస్యలపై ఏకరువు
నాతవరం: గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో పలువురు ఏకరువు పెట్టారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి మాట్లాడుతూ సరుగుడు, అసనగిరి పంచాయతీల పరిధిలో 16 శివారు గ్రామాలున్నాయని, సెల్ టవర్లు లేక సెల్ సిగ్నల్స్ రావడం లేదని, దీంతో సంక్షేమ పథకాల లబ్ధి పొందేందుకు ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 589 మందికి హక్కు పత్రాలు ఇచ్చారని, మిగిలిన వారికి మంజూరు చేయాలని కోరారు. పాడేరు ఐటీడీఏ పరిధిలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఇక్కడ గిరిజనులకు అందడం లేదని చెప్పారు. గిరిజన ఉద్యోగుల సంఘం నర్సీపట్నం డివిజన్ అధ్యక్షుడు జనార్ధన్ మాట్లాడుతూ నర్సీపట్నంలో కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాలో 1/70 యాక్టు పరిధిలో ఉన్న మండలాల్లో రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయని ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణం తెలిపారు. రావికమతం మండలం కల్యాణపులోవ రిజర్వాయర్ ప్రాంతాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
స్వల్పంగా పెరుగుతున్న ‘కోనాం’ నీటిమట్టం
చీడికాడ: చెదురుమదురుగా కురుస్తున్న వర్షాల కారణంగా కోనాం జలాశయం నీటిమట్టం నెమ్మదిగా పెరుగుతూ ప్రస్తుతం 93.05 మీట ర్లకు చేరుకుంది. 35 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 101.25 మీటర్లు. ఈ జలాశయం కింద ఐదు మండలాల్లో 14,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ఎగువ కాలువ పరిధిలో 4,500 ఎకరా లు, దిగువ కాలువ పరిధిలో 10 వేలఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఎగువ కాలువలో నీరు పారే అవకాశం లేదు. మరో 3 మీటర్ల నీటిమట్టం పెరిగితే తప్ప కాలువలకు నీటిని విడుదల చేసే అవకాశం లేదు. ఆయ కట్టు రైతులు వరినారు వేసి నీటి కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఇదే నెలలో నీటిమట్టం 93.90 మీటర్ల వద్ద ఉన్నా, తర్వాత వర్షాలు కురవడంతో ప్రమాదస్థాయికి చేరుకుంది. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ తుమ్మపాల: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమాలను సో మవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంతో పాటు అన్ని మండల, డివిజన్ స్థాయి కార్యాలయాల్లో నిర్వహించను న్నట్టు కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదివారం ఓప్రకటనలో తెలిపారు. అర్జీదారులు నేరుగా కార్యాలయాలకు చేరు కుని తమ సమస్యలను అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు. కార్యాలయాలకు రాలేని వారు ఆన్లైన్లో Meekosam. ap.gov.in వెబ్సైట్ ద్వారా అర్జీలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లలో సమర్పించిన అర్జీల సమాచారం కోసం టోల్ఫ్రీ నంబర్. 1100కు కాల్చేసి తెలుసుకోవాలని సూచించారు. -
టైరు పేలి డివైడర్ను ఢీకొన్న కారు
ముగ్గురికి గాయాలు ఎస్.రాయవరం: మండలంలోని గోకులపాడు సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. అడ్డురోడ్డు వైపు నుంచి విశాఖపట్నం వెళ్తుతున్న కారు టైరు పేలడంతో డివైడర్ను ఢీకొంది. కారులో సేఫ్టీ బెలూన్లు ఓపెన్ కావడం, ఆ సమయంలో వెనుక నుంచి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు కారులో చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీశారు. ప్రథమ చికిత్స అనంతరం మరో వాహనంలో వారు వెళ్లిపోయారు. ఈ ప్రమాదంపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. -
ఆత్మగౌరవానికి ప్రతీక ముద్రగడ
● పద్మనాభం సంతాప సభలో బొత్స,కన్నబాబు, అమర్నాథ్ ● పాల్గొన్న కాపు జేఏసీ రాష్ట్ర నాయకుడు తోట రాజీవ్, ఉత్తరాంధ్ర కాపు నేతలు సాక్షి, విశాఖపట్నం: ‘దివంగత మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కాపు జాతి సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేశారని, ఆయన ఆశయం, ఆలోచన, స్ఫూర్తితో కాపులంతా ఒక్కటై అదే బాటలో పోరాటం సాగించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు పిలుపునిచ్చారు. ఆదివారం విశాఖలో సిరిపురం జంక్షన్లోని వీఎంఆర్డీఏ ఎరేనాలో ‘విశాఖ కాపునాడు’ ఆధ్వర్యంలో కాపు నేత ముద్రగడ పద్మనాభం సంతాప సభ ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాపునాడు నాయకుడు తోట రాజీవ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల నుంచి పార్టీలకతీతంగా కాపు నాయకులు, శ్రేణులు భారీగా హాజరయ్యారు. కాపు జాతికి ముద్రగడ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. సభ ప్రారంభానికి ముందు ముద్రగడ చిత్రపటానికి బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తోట రాజీవ్, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి, మాజీ ఎంపీ హర్షకుమార్, కాపునాడు జేఏసీ నాయకులు సాయిసుధాకర్ నాయుడు, చందు జనార్థన్, ఆకుల రామకృష్ణ, ఏసుదాస్, ఆరేటి ప్రకాష్, తోట రామకృష్ణ, అడ్వకేట్ బాలకృష్ణ తదితరులు పూలమాలలు వేసి అంజలి ఘటించారు. బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇది కేవలం ముద్రగడ సంతాప సభ మాత్రమే కాదని, కాపు జాతికి ఒక సందేశ సభ అని అన్నారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు నాటి ప్రభుత్వం జీవో నెం.30 ఇచ్చినప్పటికీ, అది ఆచరణలో పూర్తిస్థాయి ఫలితాలను ఇవ్వలేదన్నారు. రాజకీయ సిద్ధాంతాల పరంగా వేర్వేరు పార్టీల్లో పనిచేస్తున్నప్పటికీ, ఏ ఒక్కరూ తమ సొంత జాతికి నష్టం చేకూర్చేలా వ్యవహరించకూడదని కోరారు. ‘‘నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా తమ పార్టీ నాయకులు సొంత సామాజిక వర్గ కార్యక్రమాలకు వెళ్లకూడదని ఆంక్షలు విధించలేదు. కానీ చంద్రబాబు మాత్రం తన పార్టీలోని కాపు నాయకులు ముద్రగడ సంతాప సభకు వెళ్లకూడదని ఆదేశించడం ఆయన శైలికి, రాజకీయ పరిపక్వతకు తగదు’’ అని విమర్శించారు. మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎందరో నాయకులను చూశామని, కానీ కాపు జాతి కోసం ముద్రగడ వేసిన ముద్ర చెరగనిదని కొనియాడారు. చాలామంది రాజకీయ నాయకులు తమ సామాజిక వర్గాల ఉద్యమాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారని, కానీ ముద్రగడ మాత్రం జాతి ప్రయోజనాల కోసం పదవులను, రాజకీయాలను సైతం త్యాగం చేశారని స్పష్టం చేశారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంతో తమ కుటుంబానికి తరతరాల అనుబంధం ఉందని తెలిపారు. ముద్రగడ తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కోల్పోలేదన్నారు. కాపు రాష్ట్ర జేఏసీ నాయకుడు తోట రాజీవ్ మాట్లాడుతూ ముద్రగడ తనకు చిరకాల మిత్రుడని, ఆయన మన మధ్య లేరనే వార్త కాపు జాతి అభ్యున్నతకే అడ్డుపడినట్లేనన్నారు. కాపు జాతి కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహోన్నత నాయకుడు ముద్రగడ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు మాట్లాడుతూ.. తాను ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉన్నప్పటి నుంచే ముద్రగడతో పరిచయం ఉందని, తనను రాజకీయాల్లోకి రావాలని ప్రోత్సహించింది ఆయనేనని తెలిపారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతూ ముద్రగడకు వందలాది ఎకరాల ఆస్తి ఉన్నప్పటికీ, రాజకీయాల్లో ఆర్థికంగా ఎదగలేదని, పైగా సొంత ఆస్తులనే ప్రజల కోసం ఖర్చు చేశారని కొనియాడారు. కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ వీసం రామకృష్ణ, కాపు నేతలు జియ్యాని శ్రీధర్, బాణాల శ్రీనివాసరావు, కొండా రాజీవ్గాంధీ, పీలా ఉమారాణి, గూటూరు నరసింహమూర్తి, పీవీ సురేష్, కోరాడ రాజుబాబు, కోడిగుడ్ల ఫూర్ణిమ శ్రీధర్, మారుతి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఫ్లైయాష్ రవాణా
ప్రాణసంకటంగా..టోల్ఫీజును తప్పించుకునేందుకు రోడ్లపైనే అన్లోడింగ్ టోల్ప్లాజావద్ద రోడ్డుపై పడిన ఫ్లైయాష్ను తొలగిస్తున్న టోల్ ఎన్హెచ్ఏఐ కార్మికులునక్కపల్లి: పరవాడ ఎన్టీపీసీ నుంచి బూడిద (ఫ్లై యాష్) అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. పరిమితికి మించి లారీల్లో లోడ్ చేసి కాకినాడ తరలిస్తున్నారు. ఎన్టీపీసీ, రవాణాశాఖ అధికారులు పట్టించుకోకపోవడమే ఈ పరిస్థితికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు నిర్లిప్తంగా వ్యవహరించడానికి కారణమేంటి ? తదితర అనుమానాలు వ్యక్తమవుతున్నా ఉన్నతాధికారులు తగిన విధంగా స్పందించకపోవడంతో జాతీయరహదారిపై ప్రయాణించేవారు, సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పెనాల్టీల నుంచి తప్పించుకునేందు.. రాజమండ్రి నుంచి గత కొద్దినెలలుగా బండరాళ్లను రాంబిల్లి ప్రాంతాలకు భారీ లారీల్లో తరలిస్తున్నారు. 40 టన్నులకు మించకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ ఒక్కో లారీలో 80 టన్నుల వరకు లోడు వేసి టోల్ఫీజునుంచి తప్పించుకునేందుకు వేంపాడు, చందనాడ, ఉపమాక మీదుగా జాతీయరహదారిపై రాకపోకలు సాగిస్తున్నారు. తిరుగు ప్రయాణంలో ఇవే లారీల్లో పరవాడ వద్ద ఉన్న ఎన్టీపీసీ నుంచి వెలువడే ఫ్లైయాష్ను కాకినాడ పోర్టుకు తరలిస్తున్నారు. నిత్యం సుమారు 40 నుంచి 50 ట్రిప్పర్లలో ఈ బూడిదను 70 నుంచి 80 టన్నుల వరకు లోడింగ్ చేసి తీసుకెళ్తున్నారు. టోల్ప్లాజా వద్ద తనిఖీలు చేసి, ఓవర్ లోడ్ కారణంగా రూ.5 వేల వరకు పెనాల్టీ వేస్తున్నారు. ఆ సొమ్ము చెల్లిస్తే తప్ప టోల్గేట్లో నుంచి అనుమతించడం లేదు. దీంతో డ్రైవర్లు లారీలను కొద్దిదూరం వెనక్కి తీసుకెళ్లి సగం ఫ్లైయాష్ను రోడ్డుపక్కన, జాతీయరహదారి మధ్యలో ఇష్టానుసారం అన్లోడ్ చేస్తున్నారు. కొన్ని లారీల డ్రైవర్లు టోల్ఫీజు నుంచి తప్పించుకునేందుకు మారుమూల గ్రామాలనుంచి రాకపోకలు సాగిస్తున్నారు. భయం భయంగా... జాతీయరహదారిపై రాకపోకలు సాగించే ద్విచక్రవాహన చోదకులు, ఆటోలు, బస్సుల్లో ప్రయాణించేవారి కళ్లల్లో ఈ బూడిద పడి నేత్ర సంబంధిత సమస్యలు వస్తున్నాయి. రోడ్డుపక్కన, మధ్యలో అన్లోడ్ చేసిన బూడిద విపరీతంగా వీచే గాలుల వల్ల ఆ ప్రాంతమంతా వ్యాపిస్తుండడంతో రోడ్డు కనిపించడం లేదు. దీంతో వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.రోడ్డుపై వెళ్లాలంటే భయ పడుతున్నారు. కనీసం బండిపై ఫ్యామిలీని తీసుకు వెళ్లాలంటే ఆలోచించే పరిస్థితి ఏర్పడుతోంది. భారంగా మారిన తొలగింపుటోల్ప్లాజాకు సమీపంలో ఈ ఫ్లైయాష్ను అన్లోడ్ చేయడం వల్ల గాలులు వీచే సమయంలో బూడిద వచ్చి ప్లాజా వద్ద పేరుకుపోతోంది. దీంతో అక్కడి సిబ్బంది నిత్యం దానిని తొలగించవలసి వస్తోంది. రోడ్డుపై పడిన ప్లైయాష్ శుభ్రం చేసేందుకు కొంతమంది స్వీపర్లను ప్రత్యేకంగా వినియోగించాల్సి వస్తోంది. ఈ పని తలకు మించిన భారంగా మారుతోందని టోల్ప్లాజా సిబ్బంది చెబుతున్నారు. ప్రమాదకరంగా రాకపోకలు కళ్లలో పడి నరకయాతన పడుతున్న ప్రయాణికులు పరిమితికి మించి ఎన్టీపీసీ నుంచి బూడిద తరలింపుకూటమి నేతల అండదండలతో యథేచ్ఛగా రవాణాఅధికారులు పట్టించుకోవడం లేదు జాతీయరహదారిపై ఎక్కడికక్కడ ఫ్లైయాష్ను ట్రిప్పరు డ్రైవర్లు అన్లోడ్ చేస్తున్నారు. కాగిత సమీపంలో కూడా వేయడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ద్విచక్రవాహనాలపై వెళ్లేవారి కళ్లలో ఈ బూడిద పడుతుండడంతో నరకయాతన పడుతున్నారు. కంటిచూపు పోయే ప్రమాదం ఉందన్న భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఏడాదినుంచి ఈ దందా సాగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు. టోల్ఫీజు తప్పించుకునేందుకు ఈలారీలు గ్రామాల్లోనుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. –పోతంశెట్టి బాబ్జి, కాగిత పరవాడ ఎన్టీపీసీ ఫ్లై యాష్ (బూడిద) తరలింపు ప్రయాణికుల పాలిట ప్రాణసంకటంగా మారింది. గాలికి ఆ రేణువులు వాహన చోదకుల కళ్లలో పడుతుండంతో వారి బాధ వర్ణనాతీతంగా ఉంటోంది. కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతున్నారు. తరలించే సమయంలో తనిఖీలు నిర్వహించి అధిక పెనాల్టీలు విధిస్తుండడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు రోడ్లపై ఎక్కడిపడితే అక్కడ బూడిదను డంప్ చేస్తుండడంతో రహదారుల్లో పరిస్థితి దారు ణంగా ఉంది. కొంతమంది డ్రైవర్లు అధిక లోడుతో ఉన్న లారీలను ఉపమాక, చందనాడ, అమలాపురం, వేంపాడు మీదుగా జాతీయరహదారిపై చేరుకుని టోల్ప్లాజాను తప్పించుకుని వెళ్లిపోతున్నారు. అనుమతి లేని రహదారుల్లో మితిమీరిన బరువుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇలా గ్రామాల మధ్యలో నుంచి వెళ్లే సమయంలో బూడిద ఆ రోడ్లపై పడి గాలికి ఇళ్లలోకి చేరుతోంది. దీంతో ఆయా గ్రామాల వారు ఇబ్బందులకు గురతున్నారు. 80 టన్నుల బరువుతో లారీలు రాకపోకలు సాగించడం వల్ల గ్రామీణ రోడ్లు శిథిలమై... ఎక్కడికక్కడ గోతులు పడుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి ఫ్లైయాష్ రవాణా చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఫ్లైయాష్ రవాణాకు ఉమ్మడి విశాఖ జిల్లా, కాకినాడ జిల్లాకు చెందిన కొంతమంది కూటమిపెద్దల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. -
ఇదేం దోపిడీ ఆచార్యా..!
విశాఖవిద్య: అవకాశం ఇవ్వాలే కానీ మొత్తం పిండేస్తాం అన్నట్లుగా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో కొందరు ఆచార్యులు అడ్డగోలుగా వర్సిటీ సొమ్ము దోచేస్తున్నట్లు తెలుస్తోంది. బోధన పేరుతో రీసెర్చ్ స్కాలర్స్ను అడ్డంగా వాడుకుంటున్న వ్యవహారం ప్రస్తుతం వర్సిటీలో తీవ్ర కలకలం రేపుతోంది. ఏయూ నిధులను అడ్డదారిలో మళ్లించేందుకు లక్షల విలువైన దొంగ బిల్లులను వైస్ చాన్సలర్ టేబుల్ వద్దకు చేర్చినట్లు ప్రచారం సాగుతోంది. పలు విభాగాల్లో పీహెచ్డీ స్కాలర్లను టెంపరరీ టీచింగ్ అరేంజ్మెంట్స్ కింద పనిచేస్తున్నట్లు చూపించి ఈ దోపిడీకి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అడ్డగోలు దోపిడీ ఇలా... సాధారణంగా ఏయూలో పీహెచ్డీ పూర్తిచేసిన వారికి టీటీఏలుగా అవకాశం కల్పించి విద్యార్థులకు బోధన చేయిస్తారు. వీరికి సెమిస్టర్ చొప్పున ఏయూ రూ.లక్షల్లో ఫీజు చెల్లిస్తుంది. అయితే పీహెచ్డీ స్కాలర్స్తో ఉచితంగా టీచింగ్ సేవలు వినియోగించుకోవాలని యూజీసీ నిబంధన ఉంది. దానికి అనుగుణంగా వైస్ చాన్సలర్లు ప్రొసీడింగ్స్ ఇస్తుంటారు. ఈ నిబంధనను ఆసరాగా చేసుకుని కొందరు విభాగాధిపతులు స్కాలర్లతో ఉచితంగా పాఠాలు చెప్పిస్తూ, వారిని టీటీఏలుగా చూపుతూ దొంగ బిల్లులు పెట్టి వర్సిటీ సొమ్ము దోచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి పీహెచ్డీ పూర్తి చేసి ఉద్యోగం లేని వారికి టీటీఏలుగా అవకాశం కల్పిస్తే నిరుద్యోగులకు మేలు జరుగుతుంది. కానీ కొందరు విభాగాధిపతులు వర్సిటీ యాజమాన్య మెతక వైఖరిని అవకాశంగా తీసుకుని, స్కాలర్లనే టీటీఏలుగా చూపిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నట్లు తెలుస్తోంది. వైస్ చాన్సలర్ కళ్లుగప్పి ఈ దొంగ బిల్లుల వ్యవహారమంతా వైస్ చాన్సలర్ కళ్లుగప్పి నడుస్తున్నట్లు ఏయూ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వీసీ పర్యవేక్షణ లోపాన్ని అదునుగా చేసుకుని కొందరు ఆచార్యులు ఈ కక్కుర్తికి పాల్పడుతున్నట్లు సమాచారం. పీహెచ్డీ స్కాలర్లకు జరుగుతున్న అన్యాయంపై వైస్ చాన్సలర్కు ఫిర్యాదు వెళ్లడంతో, ఆయన విభాగాధిపతులతో సమావేశం నిర్వహించి ఆరా తీశారు. డిపార్ట్మెంట్ రీసెర్చ్ కమిటీ దృష్టికి ఈ విషయాలను తీసుకువచ్చారా లేదా అని ప్రశ్నించారు. అయితే అప్పటికప్పుడు వీసీని నమ్మించి, డీఆర్సీ రికార్డుల్లో తప్పుడు నమోదులు చేసేందుకు కూడా కొందరు దారులు వెతుక్కుంటున్నట్లు సమాచారం. ఇలా పరిపాలన రంగాన్ని మోసం చేస్తూ లక్షలాది రూపాయల దొంగ బిల్లులను పంపగా, అవన్నీ ప్రస్తుతం వీసీ సంతకం కోసం ఎదురుచూస్తున్నాయి. సమగ్ర విచారణ జరపాలి: ఉద్యోగ సంఘాలు పవిత్రమైన ఆచార్య వృత్తిలో ఉండి కాసులకు కక్కుర్తి పడుతూ, స్కాలర్లను వాడుకుంటూ దొంగ బిల్లులతో వర్సిటీ ఆదాయానికి గండికొడుతున్న విభాగాధిపతులపై తక్షణమే విచారణ జరపాలని ఉద్యోగ సంఘాలు, మేధావులు డిమాండ్ చేస్తున్నారు. పీహెచ్డీలు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఉన్న వారికి అవకాశం దక్కకుండా చేస్తున్న ఇటువంటి పరిస్థితుల నుంచి వర్సిటీని కాపాడాలని కోరుతున్నారు. వర్సిటీ పాలనపై వీసీ పూర్తిస్థాయి దృష్టి సారించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. -
విత్తన బంతులతో అడవుల పునరుజ్జీవనం
సీలేరు: ఒకప్పుడు ఉమ్మడి విశాఖ జిల్లా ఏజెన్సీ అడవులు ప్రకృతికి పెట్టింది పేరుగా ఉండేవి. విస్తారమైన అడవులు, ఎత్తైన కొండలు, వృక్ష, జంతు సంపదకు ఈ ప్రాంతం నిలయంగా ఉండేది. కాలక్రమేణా పోడు వ్యవసాయం, కొండలను చదును చేయడం, చెట్ల నరికివేత, ఇళ్ల నిర్మాణం, రోడ్ల విస్తరణ వంటి కారణాలతో అటవీ విస్తీర్ణం తగ్గిపోతోంది. ● అడవుల నరికివేతతో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని.. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సకాలంలో వర్షాలు కురవకపోవడం, ఉష్ణోగ్రతలు పెరగడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు అటవీశాఖ అడవుల పునరుజ్జీవనానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. విత్తన బంతులతో పచ్చదనం జిల్లాలోని ఏజెన్సీలో అటవీ విస్తరణను పెంచేందుకు ఈ ఏడాది విత్తన బంతుల కార్యక్రమాన్ని చేపట్టారు. పాడేరు, చింతపల్లి అటవీ డివిజన్ల పరిధిలోని 14 రేంజ్లలో విత్తన బంతులను తయారు చేసి అడవుల్లో నాటే కార్యక్రమం చేపట్టారు. ● సాంప్రదాయ పద్ధతిలో గోతులు తీసి మొక్కలు నాటడంతో పాటు.. మారుమూల, కొండ ప్రాంతాలకు సులభంగా చేరుకునేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల డ్రోన్ల ద్వారా విత్తన బంతులను అడవుల్లో వెదజల్లారు. ప్రతి హెక్టారులో నిర్ణీత సంఖ్యలో విత్తన బంతులు నాటేలా చర్యలు చేపట్టారు. గ్రామ సభలతో అవగాహన ● డ్రోన్ల ద్వారా విత్తన బంతులు వెదజల్లడంతో పాటు.. అటవీశాఖ సిబ్బంది గ్రామాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నారు. అడవుల నరికివేత, వేసవిలో అడవులకు నిప్పు పెట్టడం వల్ల కలిగే నష్టాలపై గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు, గిరిజనులకు విత్తన బంతులను అందజేసి వారి భూముల్లో వాటిని నాటించే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. ● చింత, రావి, నేరేడు, తురకవేప, మామిడి, నల్లమద్ది తదితర మొక్కలకు సంబంధించిన విత్తనాలను విత్తన బంతుల రూపంలో తయారు చేసి నాటుతున్నారు. అటవీ అభివృద్ధికి కృషి ఏజెన్సీలో అడవులు అంతరించిపోతున్న తరుణంలో.. అటవీశాఖ చేపట్టిన విత్తన బంతుల కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులు, గిరిజనులు సద్వినియోగం చేసుకుని మొక్కలు నాటి అటవీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. మరిన్ని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేపడతాం. గిరిజనులు ఎవరూ చెట్లు నరకవద్దని, అడవులను కాపాడుకోవాలని కోరుతున్నాం. అడవులను కాపాడితేనే మానవాళికి ఎదురయ్యే ముప్పును తగ్గించగలుగుతాం. – వైవీ నర్సింగరావు, డీఎఫ్వో, చింతపల్లి -
ఘనంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ
ముంచంగిపుట్టు: ఆంధ్ర–ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఒనకఢిల్లీలో ఆదివారం బీఎస్ఎఫ్ 103వ బెటాలియన్ ఆధ్వర్యంలో ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించారు. బీఎస్ఎఫ్ కమాండెంట్ నీరజ్ చౌదరి ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో బీఎస్ఎఫ్ జవాన్లు, విద్యార్థులు, స్థానికులు క్యాంప్ నుంచి పురవీధుల మీదుగా ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ మార్మోగింది. ఈ సందర్భంగా కమాండెంట్ నీరజ్ చౌదరి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవించాలని, దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. -
రాయితీ రుణాలకు ఎదురుచూపులు
కె.కోటపాడు: బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరుపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇంటర్వ్యూలు నిర్వహించి 16 నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్కరికి కూడా రుణం మంజూరు చేయలేదు. దీంతో నిరుద్యోగులు నిరాశనిస్పృహలకు గురవుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024–25కు సంబంధించి బీసీ కార్పొరేషన్ రుణాల మంజూరుకు 2025 మార్చిలో ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. మాడుగుల నియోజకవర్గం నుంచి 2,275 మంది దరఖాస్తు చేశారు. కె.కోటపాడు మండలం నుంచి 645 మంది, దేవరాపల్లి మండలం నుంచి 520 మంది, చీడికాడ మండలం నుంచి 200 మంది, మాడుగుల మండలం నుంచి 910 మంది దరఖాస్తు చేసుకున్నారు. కె.కోటపాడు మండలంలో దరఖాస్తుదారులకు మండల పరిషత్ అధికారులు బ్యాంకర్లతో కలిసి 2025 ఏప్రిల్ 4న ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూలు జరిగి సుమారు 16 నెలలు గడిచినా ఏ ఒక్కరికీ రుణం మంజూరు చేసిన దాఖలాలు లేవు.రుణాలు మంజూరవుతాయని, తద్వారా ఉపాధి పొందవచ్చని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 26 నెలలు గడుస్తున్నా ఒక్క ఏడాది కూడా రుణాలు మంజూరు కాలేదని యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రుణాలు ఇవ్వాలి బీసీ కార్పొరేషన్ రుణం కోసం దరఖాస్తు చేశా ను. ఇంటర్వ్యూకి కూడా హాజరయ్యాను. సబ్సిడీతో రుణం మంజూరు చేస్తే ఆటో కొనుగోలు చేయాలని అనుకున్నాను. ఇంటర్వ్యూలు పూర్త యి నెలలు గడుస్తున్నా ఏ ప్రకటనా రాలేదు. – ఎల్.నర్సింగరావు, చౌడవాడ,కె.కోటపాడు మండలం -
మా భూములు మాకిచ్చేయండి!
అగనంపూడి: ఉపాధి కల్పిస్తామనే హామీతో రీఫ్రాక్టరీస్ సంస్థ కోసం సేకరించిన భూములను తిరిగి రైతులకు అప్పగించాలని లేదా తగిన నష్టపరిహారం చెల్లించాలని ఏపీ రీఫ్రాక్టరీస్ భూ నిర్వాసితుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. సంస్థకు చెందిన స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ హబ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అగనంపూడి జాతీయ రహదారి జంక్షన్లో నిరసన చేపట్టారు. అనంతరం నిర్వాసితులు జాతీయ రహదారి కూడలి నుంచి బొర్రమాంబ వనం మీదుగా రీఫ్రాక్టరీస్ సంస్థ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు గవర నరసింగరావు, పెదిరెడ్ల హరనాథ్ మాట్లాడుతూ.. రీఫ్రాక్టరీస్ సంస్థ ఉత్పత్తి ప్రారంభించకముందే మూతపడిందన్నారు. సంస్థ భూములను బ్యాంకులో తాకట్టు పెట్టి రుణాలు తీసుకున్న యాజమాన్యం అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఇప్పుడు ఐటీ హబ్ పేరుతో మరోసారి నిర్వాసితులకు అన్యాయం చేయొద్దని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు లక్కరాజు గోవిందరాజులు, కొలపర్తి శ్రీనివాసరావు, పెదిరెడ్ల నీలకంఠం, చిత్తా అబ్బాయి, న్యాయవాది ప్రభాకరరావు, మంచాల కన్నారావు పాల్గొన్నారు. -
పాముకాటుకు రెండు పాడి ఆవులు మృతి
రావికమతం: మండలంలో మరుపాక శివారు దాసరయ్యపాలెంలో ఆదివారం పాముకాటుకు గురై రెండు పాడి ఆవులు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. దాసరయ్యపాలెం గ్రామానికి చెందిన వేపాడ సత్తిబాబు రెండు పాడి ఆవులు ద్వారా వచ్చే ఆదాయంతో జీవనం సాగిస్తున్నారు. సత్తిబాబు ఆదివారం కూలీ పనికి వేరే ప్రాంతానికి వెళ్లగా భార్య కొండమ్మ ఆవులను మేతకు తోలుకెళ్లింది. మధ్యాహ్నం ఆవులను పశువుల పాక వద్దకు తోలుకొచ్చి దాణా పెట్టి ఇంటికి వెళ్లింది. సాయంత్రం కొండమ్మ పశువుల పాక వద్దకు రాగా అప్పటికే రెండు ఆవులు మృతి చెందడంతో కొండమ్మ ఏడుస్తూ కేకలు వేసింది. పాకకు సమీపంలో ఉన్న రైతులు పాక దగ్గరకు వచ్చి చూడగా పాము కరవడం వల్లనే ఆవులు చనిపోయి ఉండవచ్చు ఆని రైతులు తెలిపారు. ఆవుల మృతి చెందిన సమాచారం గ్రామ సచివాలయం పశువైధ్యాధికారి సత్యనారాయణకు తెలియపర్చగా ఆయన వచ్చి ఆవులను పరీశీలంచగా పాము కాటుకు మృతి చెందాయని నిర్ధారించారు. జీవనాధారమైన రెండు ఆవులు రూ.1లక్ష 40 వేలు విలువ చేస్తాయని, అప్పులు చేసి ఆవులు కొని జీవనం సాగిస్తున్నామని రైతు సత్తిబాబు, భార్య కొండమ్మ కన్నీరు మున్నీరుగా విలపించారు. -
గిరిజన సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
నాతవరం: గిరిజనుల సంక్షేమం, అభివృద్ధిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో జిల్లా స్థాయిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదివారం జిల్లా గిరిజన సంక్షేమాధికారి జి.మంగవేణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనుల హక్కులను కాపాడేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే జిల్లాలో అనేక గిరిజనుల సమస్యలు పరిష్కరించామని, మిగతా వాటిని దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. పూర్వ ఆచారాలు పక్కన పెట్టి తమ పిల్లల చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పట్టుదలతో సాధించాను.. పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఐఏఎస్ సాధించానని చెప్పారు. తమ స్వగ్రామం, తల్లిదండ్రుల పరిస్థితి, యూపీఎస్సీ పరీక్షలు రాసిన తీరు తదితర వివరాలను తెలిపారు. చదువుకోవడానికి పేదరికం అడ్డుకాదని, నేడు అనేక సదుపాయాలను ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని చెప్పారు. బాల్య వివాహాల జోలికి వెళ్లకుండా పిల్లలను బాగా చదివించాలని సూచించారు. నన్ను నా తల్లిదండ్రులు ప్రోత్సహించకపోతే నేను కలెక్టర్ను కాకపోయేదానిని అని అన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జి.మంగవేణి మాట్లాడుతూ జిల్లాలో నాబార్డు నిధులు రూ.9.66 కోట్లతో గిరిజన గ్రామాలకు రోడ్లు నిర్మించినట్టు చెప్పారు. 6,716 మంది గిరిజనుల ఇళ్ల వద్ద కుళాయిలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జిల్లాలో ఉన్న 22 గిరిజన పాఠశాలల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయన్నారు. ఘన స్వాగతం అంతకుముందు కలెక్టర్, ఇతర అధికారులకు గిరిజన సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం పలికారు. గ్రామ పొలిమేరలో తిలకం దిద్ది, హారతి ఇచ్చి పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఆశ్రమ పాఠశాలకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా గిరిజనులతో కలిసి కలెక్టర్ థింసా నృత్యం చేశారు. బాణం సంధించి, గిరిజన సంప్రదాయ సంగీత పరికరాలను వాయించి అందరినీ ఆకట్టుకున్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించి విద్యార్థులతో ముచ్చటించారు. ఇంటర్మీడియెట్, పదవ తరగతి పరీక్షల్లో జిల్లాస్థాయిలో అధిక మార్కులు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులనూ, గిరిజన పెద్దలను ఘనంగా సత్కరించారు. ముందుగా మొక్కలు నాటి జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి, తాండవ ప్రాజెక్టు కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ, రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్లు రాజాన వీర సూర్యచంద్ర, వెలకాడ వెంకట కృష్ణారావు, కోండ్రు మరిడియ్య, జిల్లా మలేరియా అధికారి వరహాలదొర, తహసీల్దార్ చందనరేఖ, ఇన్చార్జి ఎంపీడీవో పోలుపర్తి పార్థసారథి, డిప్యూటీ తహసీల్దార్ టి.వి.ఎల్. రాజు, వైఎస్సార్సీపీ నాయకుడు బండి గంగరాజు, మార్కెట్ కమిటీ డైరెక్టరు పట్టెం రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. -
బీసీటీ భూముల్లో పనుల అడ్డగింత
యలమంచిలి రూరల్: రాంబిల్లి మండలం హరిపురంలో భాగవతుల చారిటబుల్ ట్రస్టు(బీసీటీ) సంస్థకు ప్రభుత్వం లీజుకు ఇచ్చిన భూములను చదును చేసే పనులను శనివారం స్థానికులు, బీసీటీ ఉద్యోగులు, మహిళలు అడ్డుకున్నారు. బీసీటీ కార్యకలాపాల కోసం 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూమిని లీజుకు ఇచ్చింది. 2014లో లీజు గడువు ముగిసింది. ఈ భూముల్లో కొంత విస్తీర్ణంలో ప్రత్యేక వాణిజ్య మండలిలో భూ నిర్వాసితులకు పునరావాసం కల్పించే నిమిత్తం కేటాయించడానికి సర్వే చేశారు. ఇటీవల కలెక్టరు ఆ భూమిని చదును చేయించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆ భూముల్లో శనివారం పొక్లెయిన్తో స్థానిక రెవెన్యూ అధికారులు చదును చేయించే పనులు ప్రారంభించారు. ఆ పనులను బీసీటీ ఉద్యోగులు, కొందరు మహిళలు అడ్డుకున్నారు. రెవెన్యూ అధికారులు, రాంబిల్లి సీఐ అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. 50 ఏళ్లు గ్రామీణాభివృద్ధికి కృషి చేసిన బీసీటీ భూములను స్వాధీనపర్చుకోవడం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతో మంది ఉపాధి కోల్పోతారని బీసీటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. -
డీఎస్సీ పోరు.. నిరసన హోరు
జిల్లాలో మూడో రోజు కొనసాగిన రిలే నిరాహార దీక్షలు ● డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాటం ● విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకు ఉద్యమం ఆగదు ● స్పష్టం చేసిన డీఎస్సీ అభ్యర్థులు, వైఎస్సార్సీపీ నాయకులు ● అనకాపల్లి, చోడవరం, మాడుగులలో సంఘీభావం తెలిపిన జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ ● చోడవరం, అనకాపల్లి, నర్సీపట్నంలో సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి అమర్నాథ్ ● మాడుగులలో పాల్గొన్న మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు సాక్షి, అనకాపల్లి: డీఎస్సీ అక్రమాలపై జెన్జీ పోరు శనివారం మరింత ఉధృతంగా సాగింది. వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షలు మూడో రోజూ విజయవంతంగా జరిగాయి. డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని యువతీయువకులు, విద్యార్థులు, వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు. అనకాపల్లి, మాడుగుల, చోడవరం, నర్సీపట్నంలలో జరిగిన రిలే నిరాహార దీక్షల్లో జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొని సంఘీభావం తెలిపారు. అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నంలలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, మాడుగులలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు పాల్గొన్నారు. పెందుర్తి, యలమంచిలి, మాడుగులలో పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి సంఘీభావం తెలియజేశారు. -
రేపు దేవరాపల్లిలోజైలు భరో
దేవరాపల్లి: ప్రజల సమస్యలు పరిష్కరించా లని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సోమవారం దేవరాపల్లిలో జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు రైతు సంఘం జిల్లా కోశాధికారి గండి నాయనబాబు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బి.టి. దొర తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను శనివారం వారు ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, జైలు భరో చేపట్టాలని ప్రజా సంఘాలు నిర్ణయం తీసుకున్నాయని చెప్పారు. మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి దేవరాపల్లిలో జైలు భరో నిర్వహిస్తామని, కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు, గిరిజనులు, దళితులు, వృత్తిదారులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్స్, వీవోఏ, సమగ్ర శిక్ష తదితర స్కీమ్ వర్కర్లకు కనీస వేతనం రూ. 31 వేలు ఇవ్వాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, కరువు సహాయక చర్యలు చేపట్టాలని, ఉచిత పంటల బీమా అమలు చేయాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాలను చేపడుతున్నట్టు చెప్పారు. -
ఆధార్ బ్లాక్ ఉపాధికి లాక్!
సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాలుగా విశాఖ ఉక్కు పరిశ్రమనే నమ్ముకుని.. తమ రక్తాన్ని చెమటగా మార్చి ప్లాంట్ అభివృద్ధిలో భాగస్వాములైన కాంట్రాక్ట్ కార్మికులపై యాజమాన్యం ఉక్కుపాదం మోపుతోంది. ‘కాస్ట్ కటింగ్’ పేరుతో ఏకంగా 4 వేల మందిని అర్ధంతరంగా తొలగించి రోడ్డున పడేయడమే కాకుండా.. వారు తిరిగి ప్లాంట్ గడప తొక్కకుండా కట్టడి చేసేందుకు తీవ్ర చర్యలకు పాల్పడుతోంది. ఉపాధి కోల్పోయిన కార్మికులు ఇతర కాంట్రాక్టు ఏజెన్సీల్లోనైనా పని చేసుకుని కుటుంబాలను పోషించుకునే అవకాశం లేకుండా.. ప్లాంట్ గేట్పాస్ వ్యవస్థలో వారి ఆధార్ నంబర్లు, బయోమెట్రిక్ వివరాలను బ్లాక్లిస్ట్లో పెట్టినట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో ప్లాంట్లోని ఇతర ఏజెన్సీల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించినా వారి ఆధార్ వివరాలు ‘బ్లాక్డ్’గా చూపుతున్నాయని చెబుతున్నాయి. ఒకవైపు స్థానిక కార్మికులను తొలగించిన యాజమాన్యం.. మరోవైపు ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి కొత్త కాంట్రాక్ట్ కార్మికులను తీసుకురావడం వివాదానికి మరింత ఆజ్యం పోస్తోంది. మరోవైపు, ఉక్కు పరిశ్రమను ఉద్ధరిస్తున్నామంటూ ప్రకటనలు గుప్పిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. ఈ దారుణాలపై స్పందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆధార్ కార్డూ ‘బ్లాక్’లో పెట్టేశారు ఒక పౌరుడి ఆధార్ కార్డును రద్దు చేసే లేదా బ్లాక్ చేసే అధికారం చట్టబద్ధంగా కేవలం ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’కి మాత్రమే ఉంది. కానీ, స్టీల్ప్లాంట్ యాజమాన్యం రాజ్యాంగాన్ని, కార్మిక చట్టాలను తుంగలో తొక్కి.. తమ సొంత డేటాబేస్ (గేట్పాస్ సిస్టమ్)లో 4 వేల మంది ఆధార్ నంబర్లను బ్లాక్లిస్ట్లో పెట్టింది. ప్లాంట్లో ఉన్న దాదాపు 600 ఏజెన్సీల్లో వీరు ఎక్కడ పనికి వెళ్లినా.. ఆధార్ ఎంటర్ చేయగానే ‘బ్లాక్డ్’ అని వస్తోంది. ఉపాధి పోయినా ఇతర కాంట్రాక్టర్ల దగ్గరైనా పని చేసుకుని బతుకుదాం అనుకున్న కార్మికుల ఆశలపై యాజమాన్యం ఈ విధంగా నీళ్లు చల్లింది. ఇది ముమ్మాటికీ కార్మికుల జీవించే హక్కును హరించడమేనని న్యాయ నిపుణులు సైతం స్పష్టం చేస్తున్నారు. పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం ఉక్కు పరిశ్రమను కాపాడుతున్నామని చంద్రబా బు, పవన్తో సహా టీడీపీ, జనసేన నేతలు మీడి యా ముందు గొప్పలు చెబుతూ ఉద్యోగుల్ని, కార్మికుల్ని మభ్యపెడుతున్నారే తప్ప.. అక్కడ జరుగుతు న్న నిరంకుశ విధానాలపై మాత్రం స్పందించడం లేదు. 4 వేల కుటుంబాలు రోడ్డున పడి ఆకలి కేకలు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదు. కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు గగ్గోలు పెడుతూ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల దృష్టికి ఈ దారుణాన్ని తీసుకెళ్లినా కనీస స్పందన కరువైంది. ఉపాధికి భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే.. యాజమాన్యం చేస్తున్న చట్టవిరుద్ధమైన పనులకు వత్తాసు పలుకుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రానికి గ్రీవెన్స్లో ఫిర్యాదు స్టీల్ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల ఆధార్ కార్డులను బ్లాక్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విశాఖ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పాడి త్రినాథరావు కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీపీజ్రామ్స్కు ఈ నెల 5న ఫిర్యాదు చేశారు. స్టీల్ప్లాంట్ యాజమాన్యం 2024లో వేలాది కాంట్రాక్ట్ కార్మికుల ఆధార్ కార్డులను బ్లాక్ చేసిందన్నారు. అందులో ప్లాంట్ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితులు కూడా ఉన్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు.. ప్రభుత్వం జారీ చేసిన పత్రాలను స్వాధీనం చేసుకోవడం, బ్లాక్ చేయడం, స్వాధీనం చేసుకోవడం చట్టవిరుద్ధమన్నారు. ఇది ఆధార్ చట్టం–2016ను ఉల్లంఘించడమేనన్నారు. కార్మికుడిని భవిష్యత్తు ఉపాధి నుంచి ఏకపక్షంగా నిషేధించడం ఆర్టికల్ 21 కింద ఉన్న ప్రాథమిక రాజ్యాంగ రక్షణలను ఉల్లంఘించడమేనన్నారు. దీనిపై జోక్యం చేసుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రాలకు గేట్లు తీసి.. కాస్ట్ కటింగ్ పేరుతో ఒకవైపు పాత కార్మికులను తొలగించిన యాజమాన్యం.. అదే స్థానంలో తమకు అనుకూలంగా ఉండే ఇతర రాష్ట్రాల కార్మికులను దిగుమతి చేసుకుంది. ఇప్పటికే ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యి మందికిపైగా కొత్త కాంట్రాక్ట్ కార్మికులను రప్పించి ప్లాంట్లో ఉపాధి కల్పించింది. స్థానికులైతే తమ హక్కుల కోసం ప్రశ్నిస్తారని, అదే ఇతర రాష్ట్రాల వారైతే తక్కువ వేతనాలకే, ఎలాంటి సంఘాలు లేకుండా పని చేస్తారన్నదే యాజమాన్యం వ్యూహంగా స్పష్టమవుతోంది. -
పెందుర్తి
సబ్బవరంలో పెందుర్తి మాజీ ఎమ్మెల్యే, పార్టీ సమన్వయకర్త అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో మూడో రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా జరిగింది. సబ్బవరం మండలంలోని యువత, విద్యార్థులు, నిరుద్యోగులు, వైఎస్సార్సీపీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు. దీక్షలో పాల్గొన్న వారికి పార్లమెంట్ పరిశీలకులు శోభాహైమావతి, నియోజకవర్గ పరిశీలకులు చిక్కాల రామారావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గండి రవికుమార్, యువజన విభాగం నాయకుడు పాలిశెట్టి సురేష్రాజు తదితరులు పాల్గొన్నారు. -
11న తాండవ నీరు విడుదల
● ప్రాజెక్టు డీఈఈ అనురాధ నాతవరం: తాండవ రిజర్వాయర్ నుంచి ఖరీఫ్ సాగుకు ఈనెల 11వ తేదీ మధ్యాహ్నం 12.09 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్టు ప్రాజెక్టు డీఈఈ అనురాధ తెలిపారు. ఆమె శనివారం విలేకరులతో మాట్లాడుతూ రెండు జిల్లాల పరిధిలో 52 వేల ఎకరాలకు తాండవ జలాశయం నుంచి సాగునీరు అందజేయనున్నట్టు చెప్పారు. ప్రస్తుతం జలాశయంలో నీటి మట్టం 375.2 అడుగులు ఉందని, రెండు ప్రధాన కాలువల ద్వారా రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తే 70 రోజుల వరకూ సాగుకు సరిపోతుందని తెలిపారు. తాండవ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తే వర్షాలు కురుస్తాయన్న నమ్మకం ఈప్రాంత రైతుల్లో ఉందన్నారు. దానిని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు కమిటీ చైర్మన్, సభ్యులు, ప్రజాప్రతినిధులు, ఆయకట్టుదారుల అభీష్టం మేరకు నీటిని విడుదల చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. రేపు చలో విద్యుత్ సౌధ అనకాపల్లి: విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చేపట్టిన దశల వారీ పోరాటంలో భాగంగా సోమవారం చలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు ప్రేమ చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూనియన్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయన్నారు. విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులను విద్యుత్ శాఖలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అంబాని, అదాని వంటి కార్పొరేట్ సంస్థలకు విద్యుత్శాఖను కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయన్నారు.కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వలె కాంట్రాక్టు ఉద్యోగులకు నెలకు రూ.48 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వేపాడ సత్యనారాయణ, ఎస్.సత్యారావు, అనకాపల్లి, నర్సీపట్నం డివిజన్ నాయకులు పాల్గొన్నారు. -
మితిమీరిన బరువు.. ప్రమాదకర రాకపోకలు
అచ్యుతాపురం రూరల్: అనుమతి లేని రహదారుల్లో మితిమీరిన బరువుతో భారీ వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అచ్యుతాపురం కూడలి నుంచి పూడిమడక వెళ్లే దారిలో శుక్రవారం అర్ధరాత్రి గోతిలో ఇరుక్కుపోయి భారీ బొగ్గు లారీ ఒక్కసారిగా ఓ వైపునకు ఒరిగిపోయింది. ఆ సమయంలో రహదారిపై ప్రజల రాకపోకలు తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. నిబంధనలను పట్టించుకోకుండా భారీ వాహనాలు ఇరుకై న రహదారులపై తిరుగుతుండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పారిశ్రామిక ప్రాంతం కావడంతో ఈ మార్గంలో నిత్యం భారీ వాహనాల రాకపోకలు సాగుతున్నాయి. అయితే కొన్ని వాహనాలు పరిమితికి మించి మెటీరియల్ లోడ్ చేసుకుని ఇరుకై న రహదారులపై ప్రయాణిస్తుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. భారీ వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో ఎదురుగా వాహనాలు వస్తే తప్పుకునేందుకు తగినంత స్థలం లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలు, నివాస ప్రాంతాలు, ప్రజల రద్దీ ఉండే ప్రాంతాల మీదుగా భారీ వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదం జరిగితే ప్రాణనష్టం జరిగే అవకాశముంది. ప్రజల రాకపోకలు అధికంగా ఉండే మార్గాల్లో భారీ వాహనాల రాకపోకలపై అధికారులు నియంత్రణ విధించాలని స్థానికులు కోరుతున్నారు. అనుమతులు, వాహన సామర్థ్యం, లోడ్ పరిమితులను తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదం జరిగే వరకూ అధికారులు వేసి చూడకుండా భారీ వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల్లో మళ్లించి ప్రజలకు భద్రత కల్పించాలని కోరుతున్నారు. ఇరుక్కుపోయిన భారీ బొగ్గు లారీ.. తప్పిన పెను ప్రమాదం -
20,21 తేదీల్లో ఆటో కార్మికుల రాష్ట్ర మహాసభలు
అనకాపల్లి: ఆటో కార్మికుల యూనియన్ నాలుగో రాష్ట్ర మహాసభలను విశాఖలో ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించనున్నట్టు ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్టు వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు వై.ఎన్.భద్రం తెలిపారు. స్థానిక రైల్వే స్టేషన్ రహదారి నాయుళ్లవీధిలో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను శనివారం ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. పోలీసు, రవాణాశాఖ అధికారులు ఈ–చలానా పేరుతో ఆటోకార్మికులను దోచుకుంటున్నారు. ఇ– ఆటోలను ప్రవేశపెట్టి ఆర్టీసీ ద్వారా నడపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం దుర్మార్గమన్నారు. ఇదే విధంగా మన రాష్ట్రంలో జరిగితే లక్షలాదిమంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవడం తప్పదని చెప్పారు. ఆటో కార్మికలకు వ్యతిరేకంగా జారీచేసిన జీవో నంబర్ 21, 31 లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ అనకాపల్లి అధ్యక్షుడు శ్రీరామదాసు అబ్బులు, సీపీఐ పట్టణ కార్యదర్శి తాకాసి వెంకటేశ్వరరావు, ఎం.కుమారస్వామి, ఒమ్మిశ్రీను, శంకర్, వెంకట అప్పారావు, మెల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
బోరు కబ్జా
కోటవురట్ల: అధికారం మనది..మనమేం చేసినా అడ్డేవాడెవరు.. ఇదీ ప్రస్తుతం పలు చోట్ల టీడీపీ నేతల అడ్డగోలు దందా..పాములవాకలో ఓ టీడీపీ కార్యకర్త ప్రభుత్వ చేతిబోరును కబ్జాచేసి తన సొంత బోరుగా వాడేసుకుంటున్నాడు. ఎంపీటీసీ నిధులతో రైతుల మకాముల వద్ద వేసిన చేతిబోరు హెడ్ను ఊడదీసి మోటారును ఏర్పాటు చేసుకుని దర్జాగా వినియోగిస్తున్నాడు. ఇదేంటని ప్రశ్నించిన రైతులకు మీ దిక్కున్న చోట చెప్పుకోండని సమాధానం చెబుతున్నాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారులు తక్షణమే స్పందించకపోతే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని పలువురు రైతులు హెచ్చరిస్తున్నారు. మిగతా రైతులు ఇబ్బంది పడుతున్నా అఽధికారులు చర్యలు తీసుకోకపోవడం దారుణమని విమర్శిస్తున్నారు. -
పుట్టినరోజు వేడుకలకు వెళ్తూ ..
● పురుషోత్తపురం వద్ద బైక్ను ఢీకొట్టిన ట్రాలీ ● ప్లంబర్ దుర్మారణం● మరో యువకుడికి గాయాలు యలమంచిలి రూరల్: పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనడానికి వెళ్తున్న యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ట్రాలీ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు దుర్మరణం పాలవగా, మరో యువకుడు గాయపడ్డాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. యలమంచిలి మండలం పురుషోత్తపురం వద్ద శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి యలమంచిలి రూరల్ ఎస్ఐ ఎం.ఉపేంద్ర అందించిన వివరాలివి..విశాఖ జిల్లా భీమునిపట్నానికి చెందిన రవ్వ సంతోష్(26),రవ్వ దుర్గారావు(31),చింతల సాయి(27)లు ఉపాధి నిమిత్తం విజయవాడలో ఉంటూ ప్లంబర్లుగా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం విజయవాడ నుంచి రెండు ద్విచక్ర వాహనాలపై భీమునిపట్నం బయలుదేరారు. మార్గమధ్యంలో అన్నవరంలో ప్లంబింగ్ పని పూర్తి చేసుకుని భీమిలి వెళ్తుండగా యలమంచిలి మండలం పురుషోత్తపురం చేరుకునేసరికి చింతల సాయి నడుతున్న స్కూటీని వెనుక వస్తున్న ట్రాలీ ఢీకొట్టింది. స్కూటీ వెనుక కూర్చున్న రవ్వ సంతోష్, నడుతున్న చింతల సాయి గాయపడ్డారు. వీరిద్దర్నీ హైవే అంబులెన్సులో అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. తలకు బలమైన గాయం తగలడంతో రవ్వ సంతోష్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. చింతల సాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాద స్థలంలో గాయపడిన స్నేహితులిద్దర్నీ చూసిన మరో యువకుడు రవ్వ దుర్గారావు తీవ్రంగా రోదించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. -
మాడుగుల
మాడుగుల పాత బస్టాండ్ వద్ద మాజీ డిప్యూటీ సీఎం, మాడుగుల నియోజకవర్గం సమన్వయకర్త బూడి ముత్యాలనాయుడు ఆధ్వర్యంలో మూడో రోజు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల్లోని నిరుద్యోగులు, డీఎస్సీ అభ్యర్థులు, వైఎస్సార్సీపీ యువజన విభాగం నాయకులు పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, నియోజకవర్గ పరిశీలకులు పైలా శ్రీనివాసరావు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, జెడ్పీటీసీ కర్రి సత్యం, మండల అధ్యక్షులు రెడ్డి జగన్మోహన్, బూరె బాబురావు, వేమవరపు రామధర్మజ తదితరులు పాల్గొన్నారు. -
అధ్యక్షా.. హామీలు ఏమయ్యాయి?
నాతవరం: వారు అడవితల్లి బిడ్డలు... ఎంత కష్టమైనా చెదరని ఆత్మవిశ్వాసం వారి సొంతం. అయితే, తరాలు మారుతున్నా వారి తలరాతలు మాత్రం మారడం లేదు. హామీలు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అమలు కావడం లేదు. కూటమి ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో నిత్యం అవస్థలకు గురవుతున్నారు. జిల్లాలో నాతవరం మండలంలోనే అధికంగా గిరిజనులు నివసిస్తున్నారు. వీరంతా పలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ముఖ్యంగా ఆర్వోఎఫ్ఆర్ పత్రాలు, ఐటీడీఏ పథకాలు, వైద్యసేవలు, సరైన రోడ్లు, విద్య వంటి ఏ సౌకర్యాలకూ నోచుకోక తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఆదివారం అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవాన్ని సరుగుడు పంచాయతీ రామన్నపాలెంలో జిల్లాస్థాయిలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి స్పీకర్, కలెక్టర్, ఇతర అధికారులు హాజరుకానున్నారు. స్పీకర్ గతంలో తమకు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ఇప్పటికై నా వాటిని నెరవేర్చాలని మండలంలోని 19 గ్రామాల గిరిజనులు కోరుతున్నారు. సరుగుడు, సుందరకోట పంచాయతీల్లో అసనగిరి, తొరడ, కొత్త దద్దుగుల, మాసంపల్లి, రామన్నపాలెం, అచ్చంపేట, యరకంపేట, రాజవరం, సిరిపురం, ముంతమామిడి, లోద్దు, కొత్త లంకలు, బమ్మిడిక లోద్దు, దద్దుగుల తదితర గ్రామాల ఆదివాసీలు పలు సమస్యలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు హామీలిచ్చి ఏడాది దాటినా... కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత సుందరకోటలో జరిగిన గ్రామసభలో పాల్గొనేందుకు స్పీకరు అయ్యన్నపాత్రుడు వచ్చారు. ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తితో పాటు గిరిజనులంతా కలిసి ఆయన దృష్టికి పలు సమస్యలు తీసుకెళ్లారు. మండలంలోని సరుగుడు, సుందరకోట తదితర పంచాయతీల్లో 10 వేల ఎకరాలకు పైగా గ్యాప్ ఏరియా భూమి ఉంది. ఈ భూముల్లో తుప్పలు, రాళ్లను తొలగించి గిరిజనులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వాటికి హక్కుపత్రాలు పంపిణీ చేయాలని, సెల్ టవర్లు నిర్మించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని స్పీకర్ను కోరారు. అడిగిందే తడువుగా సమస్యల పరిష్కారానికి అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. అయితే ఏడాదిదాటినా వాటి గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో... వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అర్హత ఉన్న 589 మంది గిరిజనులకు అప్పటి ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అటవీ హక్కుపత్రాలు పంపిణీ చేశారు. మరో 300 మందికి హక్కు పత్రాలు ఇవ్వడానికి అధికారులు సిద్ధం చేశారు. అప్పటికే సార్వత్రిక ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో వాటిని అందజేయలేకపోయారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి వాటిని పంపిణీ చేయాలని గిరిజనులు కోరుతున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. స్పీకర్ హామీ ఇచ్చినా ఇంతవరకూ అతీగతీ లేకుండా పోయింది. సమస్యను పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా ప్రయోజనం లేకపోయింది. దీంతో మా సమస్యలు ఇంకెవరికి చెప్పుకోవాలి? అంటూ గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరుగుడులో అసంపూర్తిగా నిలిచిపోయిన సచివాలయం, హెల్త్ క్లినిక్, రైతు సేవా కేంద్రాల భవనాల నిర్మాణాలను పూర్తి చేయాలని, పాడేరు ఐటీడీఏ ద్వారా అమలవుతున్న పథకాలను తమకు అందజేయాలని వారు కోరుతున్నారు. ఆదివాసీ దినోత్సవ కార్యక్రమానికి హాజరవుతున్న స్పీకర్, కలెక్టర్ ఇప్పటికై నా తమ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గిరిజనుల సమస్యలు పట్టించుకునే తీరికే లేని పాలకులు నెరవేరని స్పీకర్ వాగ్దానాలు ఆర్వోఎఫ్ఆర్ పత్రాలు మంజూరు కాక అవస్థలు ఐటీడీఏ పథకాలకూ నోచుకోని ఆదివాసీలు -
చోరీ కేసులో నిందితుల అరెస్టు
దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లి శివారు బండారు వీధిలో ఈ నెల 4న ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇద్దరు యువకులు, ఒక బాలుడిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి బంగారు, వెండి ఆభరణాలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దేవరాపల్లిలోని బంగారమ్మపాలెం వెళ్లే రహదారిలో ఉన్న చొక్కాకుల దేముడమ్మ ఇంటిలో ఈ నెల 4న చోరీ జరిగింది. వీరి ఇల్లు శివారున ఉండటంతో పాటు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంటిలో ఎవరూ ఉండరని గుర్తించిన అదే గ్రామానికి చెందిన నిందితులు వేమల తరుణ్, బండారు దేముడునాయుడుతో పాటు మరో బాలుడు నెల రోజుల నుంచి చోరీకి పక్కా ప్లాన్ వేశారు. ఇంటి వెనుక బాత్రూమ్ గోడపై నుంచి మేడపైకి ఎక్కి మెట్ల ద్వారా ఇంటిలోకి ప్రవేశించారు. ఇనుప రాడ్డుతో బెడ్ రూమ్లోని బీరువాను పగలగొట్టి రెండు పుస్తెలతో కూడిన బంగారు మంగళసూత్రం తదితర మూడు తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, రూ.6 వేల నగదు అపహరించారు. చోరీ చేసిన బంగారం, వెండి వస్తువులను కాలేజీ వెనుక భాగంలోని ఆయిల్పామ్ తోటలో పాతి పెట్టారు. నగదును ముగ్గురూ సమానంగా పంచుకున్నారు. ఈ ముగ్గురిని కాశీపురం సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. తమ విచారణలో నేరం అంగీకరించడంతో వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కె.కోటపాడు సీఐ కె.కృష్ణ నేతృత్వంలో పోలీసులు 36 గంటల వ్యవధిలోనే చోరీ కేసును ఛేదించారు. బంగారం, వెండి, నగదు స్వాధీనం -
నాన్ షెడ్యూల్ గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలి
రావికమతం: నాన్ షెడ్యూల్లో గిరిజన గ్రామాలను 5వ షెడ్యూల్లో చేర్చాలని గిరిజన యువకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం కల్యాణపులోవ నుంచి జెడ్.బెన్నవరం వరకు గిరిజనులు బైక్లపై ప్రచారం చేశారు . ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.గోవిందరావు,గలబర్తి రాజు,గెమ్మిల రాజు,పి.బెన్నన్నయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీరు కల్యాణపులోవ జలాశయంలో జల దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కల్యాణపులోవ జలశయాన్ని భూ కబ్జదారుల నుంచి రక్షించాలని కోరారు. -
జైలు భరోను విజయవంతం చేయాలి
నర్సీపట్నం: ఈ నెల 10న నిర్వహించే జైలు భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాపిరెడ్డి నారాయణమూర్తి కోరారు. స్థానిక సీఐటీయూ కార్యాలయంలో జైలు భరో కరపత్రాలను పార్టీ నాయకులతో కలిసి ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన తదితర స్కీమ్ వర్కర్లకు కనీసం వేతనం రూ.31 వేలు చెల్లించాలని, అన్ని పంటలకు పెట్టుబడికి అదనంగా 50 శాతం కలిపి కనీస మద్దతు ధర చెల్లించాలని, కౌలురైతులకు గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పనులు 200 రోజులు కల్పించడంతో పాటు రోజుకు రూ.700 కూలి చెల్లించాలని. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని కోరారు. దళితులకు ప్రత్యేక శ్మశాన వాటికలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి అడిగర్ల రాజు, అంకంరెడ్డి చిన్నంనాయుడు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ.చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
డ్రోన్లతో లక్ష విత్తన బంతులు
రావికమతం: అడవుల విస్తీర్ణాన్ని పెంచి, పచ్చదనాన్ని పరిరక్షించడమే లక్ష్యంగా అటవీ శా ఖ ఆధ్వర్యంలో లక్ష విత్తన బంతులు వెదజల్లే కార్యక్రమాన్ని చేపట్టినట్టు చోడవరం అటవీశాఖ అధికారి సింహాచలం తెలిపారు. డ్రోన్ల ద్వారా చీమలపాడు పంచాయతీ పరిధిలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం విత్తన బంతులను వెదజల్లారు. ఈ సందర్భంగా సింహాచలం మాట్లాడుతూ 15 వృక్ష జాతులకు చెందిన విత్తనాలను సేకరించి వన సేవకులు, సిబ్బంది సహకారంతో విత్తన బంతులు వెదజల్లుతున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో మేడివాడ సెక్షన్ ఫారెస్టు సిబ్బంది పాల్గొన్నారు. -
పెట్టుబడుల బడాయి... ఖజానాకు మళ్లీ చిల్లు
సాక్షి, విశాఖపట్నం: ‘చీమలు పెట్టిన పుట్టలు పామున కిరవైన యట్లు’ అనే సుమతీ శతకంలోని పద్యం ఇప్పుడు చంద్రబాబు బడాయి శతకంలో మాత్రం మరోలా మారిపోయింది. ‘జిల్లా యంత్రాంగం ఖజానాలో పెట్టిన నిధులు.. చంద్రబాబు ప్రచారయావ కిరవైన యట్లు’ అని చదువుకోవాల్సిందే. జిల్లాలోని వివిధ విభాగాలు.. విశాఖ అభివృద్ధికి దాచుకున్న నిధుల్ని.. భారీ ప్రచార సదస్సుల పేరుతో నిధుల్ని నీళ్లలా ఖర్చు చేయించేస్తున్నారు. అంతర్జాతీయ సంస్థలు వచ్చి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాయంటూ ప్రపంచమంతా ప్రచారం చేసి.. చివరికి అంతా తూచ్.. వేల కోట్లే వచ్చాయని చెప్పిన చంద్రబాబు సర్కారు.. మరోసారి సీఐఐ పెట్టుబడుల ప్రహసన ప్రచార సదస్సుని నిర్వహించేందుకు సిద్ధమవుతుంటే.. జిల్లా అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే రూపాయి రూపాయి కూడబెట్టుకుంటున్న ఖజానా మళ్లీ ఖాళీ అయ్యే రోజులు వస్తున్నాయా అంటూ ఆందోళన చెందుతున్నారు. గతేడాది విశాఖలో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు జిల్లా యంత్రాంగానికి, జీవీఎంసీ, వీఎంఆర్డీఏని ఆర్థికంగా కోలుకోలేని దెబ్బతీసింది. వీవీఐపీల రాక, ప్రొటోకాల్, అతిథుల మర్యాదల కోసమే రెవెన్యూ విభాగం ఏకంగా రూ.7 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు నగర సుందరీకరణ, తాత్కాలిక ఏర్పాట్లు, హడావుడి కోసం జీవీఎంసీ రూ.60 కోట్లు, వీఎంఆర్డీఏ రూ.10 కోట్లు వెచ్చించాయి. విశాఖ అభివృద్ధికి ఉపయోగించాల్సిన సొంత నిధులను మళ్లించి మరీ ఈ రూ.77 కోట్లు ఖర్చు పెడితే.. ప్రభుత్వం నుంచి నేటికీ ఒక్క పైసా కూడా రీయింబర్స్ కాలేదు. పాత బకాయిలు ఇవ్వాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సర్కారు కనికరించకపోవడంతో స్థానిక సంస్థలు ఆర్థికంగా కుదేలయ్యాయి. పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైన బడాయి పెట్టుబడుల పేరుతో చంద్రబాబు ఆడే డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. సదస్సుల వేదికగా కాగితాలపై అంకెలు చూపించి.. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో ఏకంగా రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చేశాయంటూ ప్రభుత్వం విపరీతంగా డబ్బా కొట్టుకుంది. తీరా చూస్తే, పార్లమెంటు సాక్షిగా ఆ బండారం బట్టబయలైంది. రూ.లక్షల కోట్లు అని ప్రచారం చేసుకుంటే.. క్షేత్రస్థాయిలో వాస్తవంగా వచ్చింది కేవలం రూ.6,962 కోట్లు మాత్రమేనని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే కుండబద్దలు కొట్టింది. ఇంత ఘోరంగా వాస్తవాలు వెలుగుచూసినా సరే, ఏమాత్రం వెనక్కి తగ్గకుండా అవే అబద్ధాలకు కొత్త రంగులు అద్దుతూ ‘స్వర్ణాంధ్ర–2047’ పేరుతో మరోసారి బోగస్ సదస్సుకు సిద్ధమవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల గుండెల్లో గుబులు గత బకాయిలే రాక అల్లాడుతున్న అధికారుల నెత్తిన ప్రభుత్వం మరోసారి సదస్సుల పిడుగు వేసింది. ఈ ఏడాది నవంబర్ 12, 13 తేదీల్లో విశాఖలో 31వ సీఐఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించేందుకు సిద్ధమైంది. దీనికి సన్నాహకంగా అక్టోబర్ 7న ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్లో ప్రాంతీయ సదస్సు నిర్వహించాలని ఆదేశించింది. ప్రొటోకాల్, భద్రత, నగర సుందరీకరణ, సాంస్కృతిక, మీడియా తదితర కమిటీలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర పరిశ్రమల శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా ఉత్తర్వులతో జిల్లా రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులకు చెమటలు పడుతున్నాయి. జీవోలో పేర్కొన్న సిటీ బ్యూటిఫికేషన్, వీవీఐపీల బస, రవాణా, ఏర్పాట్ల బాధ్యత మళ్లీ విశాఖ యంత్రాంగంపైనే పడనుంది. ‘గతంలో పెట్టిన ఖర్చులకే దిక్కులేదు.. ఇప్పుడు మళ్లీ నిధులు ఎక్కడి నుంచి తేవాలి? ఇప్పుడిప్పుడే రూపాయి రూపాయి కూడబెడుతున్న ఖజానాను మళ్లీ చంద్రబాబు ప్రచార యావకోసం తుడిచిపెట్టేయాలా?’ అంటూ అధికారులు పెదవి విరుస్తున్నారు. పెట్టుబడుల ముసుగులో జరుగుతున్న ఈ ఆర్భాటపు సదస్సులతో జీవీఎంసీ, వీఎంఆర్డీఏల మనుగడకే ముప్పు వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
బీఎన్ రోడ్డుకో దండం..!
● పెద్దపెద్ద గోతులతో దర్శనం ● ప్రమాదకరంగా ప్రయాణాలు ● బెంబేలెత్తిపోతున్న వాహనదారులు ● పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం చోడవరం: రోడ్డును బాగుచేయండి మహాప్రభో అంటూ ప్రజలంతా వేడుకుంటున్నా... చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. జిల్లాలో అన్న ప్రధాన నగరాలతోపాటు మూడు జిల్లాలను అనుసంధానం చేస్తున్న భీమిలి–నర్సీపట్నం రోడ్డు దుస్థితి అత్యంత ప్రమాదకరంగా మారింది. ఈ రోడ్డు చోడవరం నియోజకర్గంలో ప్రధాన మెయిన్రోడ్డుగా ఉండటంతో 53 కిలోమీటర్ల మేర పూర్తిగా దెబ్బతింది. పెద్ద పెద్ద గోతులతో రోడ్డంతా చాలా ప్రమాదకరంగా మారింది. దీనిపై ఇప్పటికే రోడ్డు పొడవునా అనేక సార్లు ప్రజలు వివిధ రూపాల్లో ఆందోళనలు కూడా చేశారు. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. న్యాయవాదులు రోడ్డెక్కినా... ఈ రోడ్డును బాగుచేయకపోవడంతో చివరికి న్యాయవాదులు, ఆర్క్ సంస్థ ప్రతినిధులు కలిసి న్యాయ పోరాటం చేస్తున్నారు. అయినా ప్రభుత్వానికి, సదరు రోడ్డు టెండరు తీసుకున్న సీఎస్ఆర్ కనస్ట్రక్షన్కు చీమకుట్టినట్టు కూడా లేదు. ఆర్అండ్బి అధికారులైతే ప్రజలకు, కోర్టుకి ఏవో కుంటి షాకులు చెబుతూ ఎందుకూ పనికిరాని శాఖగా ఉందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సబ్బవరం నుంచి వయా చోడవరం, వడ్డాది, కొత్తకోట, రోలుగుంట మీదుగా మెయిన్రోడ్డు(బీఎన్రోడ్డు) పెద్దపెద్ద గోతులు పడి ప్రమాదాలకు నిలయంగా మారింది. 20 యేళ్లుగా ఈ రోడ్డును పూర్తి స్థాయిలో వేయకుండా వదిలేశారు. దీనితో ఇప్పుడు పూర్తిగా దెబ్బతిని చాలా పెద్దపెద్ద గోతులతో వాహనానలు రాకపోకలు సాగించడానికి వీలులేకుండా చాలా ప్రమాదకరంగా అధ్వానంగా తయారైంది. అదేవిధంగా అనకాపల్లి నుంచి వెంకన్నపాలెం ఆర్అండ్బీ రోడ్డు కూడా చాలా మేర పూర్తి దెబ్బతిని గోతులతో నిండిపోయింది. ప్రభుత్వం ఈ రెండు రోడ్లుకు మరమ్మతులు చేపట్టకపోవడంతో నిత్యం ఈ గోతుల్లో పడి అనేక వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ప్రధాన వంతెనలు కూలడంతో నిలిచిన రాకపోకలు ఇప్పటికే వడ్డాది, విజయరామరాజుపేట వద్ద ఈ రోడ్డుపై రెండు ప్రధాన వంతెనలు కూలిపోవడం, వాటికి వేసిన అప్రోచ్ రోడ్లు సైతం గోతులు పడి ప్రమాదకరంగా మారాయి. ఇంతకాలంగా రోడ్డు బాగోలేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం, అధికారులు మాత్రం ఏమీ పట్టించుకోలేదు. ప్రజలంతా తమ ప్రయాణాలను సైతం మానుకొని ఇళ్లలో కూర్చొవలసని పరిస్థితి ఏర్పండింది. మరీ అత్యవసర ప్రయాణాలు, ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తే తప్పనసరి పరిస్థితుల్లో ఈరోడ్లలో ప్రయాణం చేస్తున్నారు. అంబులెన్స్లో ఆస్పత్రికి వెళ్లే రోగులు మధ్యలోనే ఇబ్బందులు, ప్రాణాలు కోల్పోయే అత్యంత దయనీయ స్థితిలో ఈ రోడ్లు ఉన్నాయి. పాడేరు ఏజెన్సీకి, మాడుగుల, చోడవరం, నర్సీపట్నం, విశాఖపట్నం, అనకాపల్లి వంటి పట్టణాలకు ఇదే ప్రధాన రహదారి. రోజూ వందలాది వాహనాలు రాకపోలకు సాగిస్తుంటాయి. ఇంతటి రద్దీ రోడ్డు పెద్దపెద్ద గోతులతో పూర్తిగా శిథిలమైపోయి ఉంటే ప్రభుత్వం ఏమీ పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్త ంచేస్తున్నారు. ఈ రోడ్డు బాగోలేదంటూ అనేక సార్లు మీడియా, పత్రికల్లో వచ్చినా ప్రభుత్వం, అధికారులు స్పందించకపోవడం చాలా బాధాకరమని వాపోతున్నారు. ప్రస్తుతం వర్షాకాలం రావడంతో వర్షాలకు ఈ రోడ్డుపై ఉన్న పెద్ద పెద్ద గోతుల్లో వర్షం నీరుచేరి చెరువులను తలపిస్తున్నాయి. ఏ గోతులో పడి ఏ వాహనం ప్రమాదానికి గురవుతుందోనని భయం భయంగా ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రోడ్డు పనులు వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు. -
అర్హులకు న్యాయం చేయాలి
నేను బీఎస్సీ డీఎడ్ చదువుకున్నాను. ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ భృతి అందిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమలు కాలేదు. గతంలో డీఎస్సీలో అందరికీ ఒకే పేపర్ ఉండేది. కూటమి ప్రభుత్వం ఆన్లైన్ విధానం తీసుకువచ్చి అనేక విభాగాలుగా పరీక్షలు నిర్వహించి గందరగోళానికి గురిచేసింది. నార్మలైజేషన్ తీసుకొచ్చి దాన్ని శాసీ్త్రయ పద్ధతిలో చేయకపోవడం వల్ల ప్రతిభ ఉన్న విద్యార్థులకు న్యాయం జరగలేదు. ఇప్పటికై నా అర్హులైన డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలి. – కసిరెడ్డి రామకృష్ణ, మంచాల గ్రామం, చీడికాడ మండలం -
న్యాయం చేసే వరకూ పోరాటం
డీఎస్సీలో అక్రమాల వల్ల అర్హులకు న్యాయం జరగలేదు. నిరుద్యోగులకు భృతి ఇస్తామన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన 26 నెలలకుగాను నిరుద్యోగ భృతి ఒకేసారి ఒక్కొక్కరీకి రూ. 78 వేలు అందజేసి ఆదుకోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రి మాదిరిగా నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. లేదంటే మాలాంటి నిరుద్యోగ యువత ఆ గ్రహజ్వాలలకు గురికావాల్సి వస్తుంది. మాకు న్యాయం జరిగే వరకు పోరాటం సాగిస్తాం. – బొడ్డు సన్యాసిరావు, నిరుద్యోగ యువకుడు, చీడికాడ గ్రామం/మండలం -
జెన్ జిందాబాద్
డీఎస్సీ పోరుకు..చోడవరంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంఘీభావం సాక్షి, అనకాపల్లి: డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలపై వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. అక్రమార్కులకు శిక్ష పడేవరకూ, న్యాయం జరిగే వరకూ ఉద్యమం ఆగదని దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం విజయవంతంగా సాగాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందించాలని ఈ సందర్భంగా పలువురు డిమాండ్ చేశారు. ఈ దీక్షల్లో పెద్ద ఎత్తున యువకులు, నిరుద్యోగులు పాల్గొన్నారు. యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో జరిగిన రిలే నిరాహార దీక్షలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాడుగులలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, చోడవరంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొని సంఘీభావం తెలిపారు. నర్సీపట్నం, చోడవరం నియోజకవర్గాల్లో పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి పాల్గొని సంఘీభావం తెలిపారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రెండో రోజూ కొనసాగిన దీక్షలు పెందుర్తి అనకాపల్లి నర్సీపట్నం నియోజకవర్గంలోని గొలుగొండ లో నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా జరిగింది. ఈ దీక్షకు పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి సంఘీభావం తెలిపారు. జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, ఎంపీపీ గజ్జలపు మణికుమారి, వైఎస్ ఎంపీపీలు సుర్ల బాజ్జి, జక్కు నాగమణి పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో నెహ్రూచౌక్ వద్ద నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్ష విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, ఎంపీపీ గొర్లి సూరిబాబు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సీపట్నం -
ఆకుమడుల్లో పాయ తెగులు
నర్సీపట్నం: ఆకుమడుల్లో అక్కడక్కడ పాయ తెగులు వ్యాపించిందని నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని కొండెంపూడి ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ రాజుకుమార్ రైతులకు సూచించారు. కేవీకే కొండెంపూడి వ్యవసాయ కళాశాల విద్యార్థులు, డిస్ట్రిక్ట్ రిసోర్స్ సెంటర్ సంయుక్తంగా రైతన్న మీకోసం కార్యక్రమాన్ని నర్సీపట్నం మండలం, ధర్మసాగరంలో శుక్రవారం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో ఆకుమడులను పరిశీలించారు. పాయ తెగులు వ్యాపించినందున ప్రొపికోనాజోల్ పిచికారీ చేయాలన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల వరి నాట్లు వేసే పరిస్థితి కనబడటం లేనందున ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలైన జొన్నలు, సజ్జలు, రాగులు తదితర పంటలను వేసుకోవాలన్నారు. డీఆర్సీ ఏవో పి.విజేత మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల పంటలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. రైతులు విధిగా క్రాప్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలన్నారు. ఒక వేళ వరి వేసే పరిస్థితి ఉంటే తేలిక రకాలు వెదజల్లే పద్ధతిలో వేసుకోవాలన్నారు. ఉద్యానశాస్త్రవేత్త డాక్టర్ సత్తిబాబు మాట్లాడుతూ ఉద్యాన వన పంటలకు తగు మోతాదులో నీరు అందించడం అనివార్యమన్నారు. ఉద్యాన పంటలకు డ్రిప్ పద్ధతిలో నీటిని అందించడం, మొక్కలు వేరు భాగంలో మల్చింగ్ చేయడం మంచిదన్నారు. ఈకార్యక్రమంలో ఏవో విజయలక్ష్మి, జెడ్పీటీసీ సుకల రమణమ్మ, వ్యవసాయ యాంత్రీకరణ శాస్త్రవేత్త ఎస్.కె.బాబు, రైతు సేవాకేంద్రం అధికారి కె.భవాని, రైతు సేవా కేంద్రం అధికారి ఎల్.ఉష, రైతులు పాల్గొన్నారు. -
9 నుంచి గ్రామీణ యువజన మందిరం వార్షికోత్సవాలు
మునగపాక: రాష్ట్రంలోనే పేరుగాంచిన మునగపాక గ్రామీణ యువజన మందిరం 62వ వార్షికోత్సవాల ను ఈనెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు మందిర అధ్యక్షుడు ఆడారి శ్రీకాంత్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల తో పాటు క్రీడా పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 9వ తేదీ నుంచి జిల్లా స్థాయి ఆహ్వాన కబడ్డీ పోటీలు, 11వ తేదీ నుంచి ఉత్తరాంధ్ర ఆహ్వాన వాలీబాల్ పోటీలు జరుగుతాయన్నారు. 14వ తేదీ రాత్రి 7గంటలకు నందీశ్వర కళా తులసీ ప్రాంగణంలో అమ్మ చెక్కిన బొమ్మ, చీకటి బాట నాటక ప్రదర్శనలు, 15వ తేదీన కూచిపూడి నృత్యం, భరతనాట్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మందిర ఉపాధ్యక్షులు డాక్టర్ మళ్ల జోగారావు, మళ్ల రామ జగన్నాథం, కోశాధికారి ఆడారి లక్ష్మణరావు, కల్చరల్ కన్వీనర్ ఆడారి రమణబాబు, కార్యదర్శి ఆడారి సూరిబాబు, సహాయ కార్యదర్శి దాడి అరుణ్కుమార్, డైరెక్టెర్లు బుద్ద నాగు, పెంటకోట జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. -
నిర్ణీత గడువులోగా అర్జీలకు పరిష్కారం
● జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ కె.కోటపాడు: అర్జీదారుల సమస్యలను పరిశీలించి ని ర్ణీత గడువులోగా పరిష్కరించనున్నట్టు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్ తెలిపారు. శుక్రవారం కె.కోటపాడులో ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు సందర్శనలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాడుగుల నియోజకవర్గంలో మాడుగుల, కె.కోటపాడు, చీడికాడ, దేవరాపల్లి మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి 411 వినతులను జేసీ, డీఆర్వో, ఆర్డీవో స్వీకరించారు. వీటిలో రెవెన్యూ సమస్యలపై 227, మిగిలిన వివిధ శాఖల్లో సమస్యల పరిష్కారానికి 184 అర్జీలు వచ్చాయి. కె.కోటపాడు మండలం చౌడువాడ మీదుగా శారదానదీ గర్భంతోపాటు పరీవాహన ప్రాంతంలో ఇసుక అక్రమ తవ్వకాలను చేపడుతున్నారని వైస్ ఎంపీపీ రొంగలి సూర్యనారాయణ, ఆకుల సాయిప్రసాద్ జేసీకి ఫిర్యాదు చేశారు. నదీ పరీవాహక ప్రాంతంను గతంలో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు బ్లాక్ జోన్గా ప్రకటించారని తెలిపారు. ఈ నది ప్రాంతంలోనే చౌడువాడ గ్రామానికి నీరందించే మంచినీటి పథకాలతోపాటు నాలుగు కాలువలకు నీరు వెళ్లే కట్టడాలు ఉన్నాయన్నారు. ఇసుక అక్రమ రవాణాపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ● పాచిలవానిపాలెంలో ప్రమాదకర విద్యుత్ స్తంభాలను మార్చడంతోపాటు ఇతరత్రా విద్యుత్ సమస్యలను ఎలక్ట్రికల్ అధికారులు సరిచేయాలని వైస్ ఎంపీపీ సూర్యనారాయణ కోరారు. ● లంకవానిపాలెంలో ఎండోమెంట్ సమస్యను పరిష్కరించాలని మాజీ సర్పంచ్ వేచలపు దొరబాబు వినతిపత్రం అందించారు. ఇక్కడ నివాసితులకు గ్రామకంఠంగా అప్పటి తహసీల్దార్ సర్టిఫికెట్ అందించారన్నారు. రీసర్వేలో గ్రామకంఠంను ఎండోమెంట్గా నమోదు చేసినట్లు వాపోయారు. ● చౌడువాడ గ్రామ పంచాయతీ క్లాప్మిత్రలకు వేతనాలను స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి మంజూరు చేయాలని మాజీ సర్పంచ్ దాడి ఎరుకునాయుడు వినతిపత్రం అందించారు. గ్రామ యువకులకు క్రీడా స్థలాన్ని కేటాయించాలని కోరారు. ● చోడవరం నుంచి చౌడువాడ మీదుగా విశాఖకు ఆర్టీసీ బస్సు నడపాలని గ్రామానికి చెందిన తనకల అప్పలనాయుడు(పట్టాలు) వినతిపత్రం అందించా రు. మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, డీఆర్వో సత్యనారాయణ, ఆర్డీవో అయేషా, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీవో సాంబశివరావు, చీడికాడ, మాడుగుల, దేవరాపల్లి మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలే మేలు
పాయకరావుపేట : ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున ప్రత్యామ్నాయ పంట లను సాగుచేయడం మేలని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పట్టణంలోని వీవర్స్ సొసైటీ భవనంలో శుక్రవారం రైతన్నా మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ నినో ప్రభావం–రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, పండించవలసిన పంటలపై ముద్రించిన పోస్టర్ను కలెక్టర్తో కలిసి మంత్రి ఆవిష్కరించి, మాట్లాడారు. నాట్లు వేసిన కలెక్టర్ కలెక్టర్ విజయ్ కృష్ణన్ అరట్లకోట గ్రామంలో పర్యటించి, వరినాట్లను పరిశీలించారు. పొలంలో దిగి నాట్లు వేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ డీపీ ఎం.లచ్చన్న మాట్లాడుతూ తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో రైతులు వేయవలసిన పంటలు, తీసుకోవలసిన జాగ్రత్తల పై సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ అప్పలస్వామి, డాక్టర్ భవానీ, డాక్టర్ రవి కుమార్ తదితరులు రైతులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్ డీఏ పీడీ సత్యదేవి, జేడీఏ ఆశాదేవి, ఏవో లు ఉమాప్రసాద్, ఆదినారాయణ, ఏఈవో లు, ఆర్ఎస్కే సిబ్బంది పాల్గొన్నారు. -
వచ్చేనెల 12న జాతీయ లోక్ అదాలత్
విశాఖ–లీగల్: వచ్చేనెల 12వ తేదీన నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) చైర్మన్ చిన్నంశెట్టి రాజు పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కోర్టులో లోక్ అదాలత్పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న రాజీ కాగల కేసులను గుర్తించి, కక్షిదారులు, న్యాయవాదులతో చర్చలు జరపాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని 39 మంది న్యాయమూర్తులతో ఆయన వర్చువల్గా మాట్లాడారు. అలాగే 30 రోజుల మధ్యవర్తిత్వ ప్రచారం గురించి ప్రస్తావించారు. కార్యక్రమంలో డీఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు, పలువురు న్యాయమూర్తులు పాల్గొన్నారు. -
సింహగిరిపై వరుణ జపాలు
సింహాచలం: రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ సింహగిరి క్షేత్రపాలకుడు శ్రీ త్రిపురాంతకస్వామి ఆలయంలో గురువారం నుంచి మూడు రోజులపాటు వరుణ జపాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రాశనం, త్రిశూలార్చన, రుష్యశృంగ ఆవాహన, దీక్షాధారణ, వేద పారాయణాలు, రుత్విగ్వరణం, వరుణ జపాలు నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి మృత్సంగ్రహణం, వేద పారాయణాలు, అంకురార్పణ, అగ్నిప్రతిష్ట, ధ్వజారోహణం, చూర్ణికా పఠనం, ఆలయ బలిహరణ తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు కార్యక్రమంలో పాల్గొని వేద పండితులకు దీక్షా వస్త్రాలు అందజేశారు. దేవస్థానం వేద పండితుడు కాళ్లకూరి సుబ్రహ్మణ్యశర్మ పర్యవేక్షణలో ఆలయ అర్చకుడు రమణమూర్తి, వేద విద్యార్థులు కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ఏఈవో తిరుమలేశ్వరరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
అధినేతతో ఆత్మీయ కలయిక
నర్సీపట్నం : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రు డు, డీసీసీబీ మాజీ చైర్పర్సన్ అనిత సన్యాసిపాత్రుడు కుటుంబసభ్యులతో తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. కుమారులు పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు వరుణ్, ఉదయ్ కిరణ్ మర్యాద పూర్వకంగా కలిశారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీల్లో చోటు సాక్షి,అనకాపల్లి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీలో రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీలలో వివిధ హోదాలలో నియమించారు. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శిగా ఉద్ధండం త్రినాధ్రావు(యలమంచిలి), జిల్లా సోషల్మీడియా వింగ్ వైస్ ప్రెసిడెంట్గా మాసరపు శివ(యలమంచిలి), జిల్లా సోషల్ మీడియా వింగ్ కార్యదర్శిగా కాండ్రేగులు రాజు(యలమంచిలి), జిల్లా సోషల్ మీడియా వింగ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా కాండ్రగుల ప్రకాష్రావు, దేవరకొండ ఈశ్వర్ కుమార్(యలమంచిలి)ను నియమించారు. 9న జూలో చిత్రలేఖన పోటీలుఆరిలోవ: ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా ఈ నెల 9న జూ పార్కులో విద్యార్థులకు ఏనుగుల అంశంపై చిత్రలేఖన పోటీలు నిర్వహించనున్నట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జూ బయోస్కోప్లో ఈ పోటీలు జరుగుతాయని పేర్కొన్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కేటగిరి–1, ఆరు నుంచి పదో తరగతి వరకు కేటగిరి–2, ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు కేటగిరి–3గా విభజించనున్నట్లు వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు 7893632900 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
మాడుగుల నియోజకవర్గం..
డీఎస్సీ అక్రమాలపై మాడుగుల నియోజకవర్గంలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో మాడుగుల పాత బస్టాండ్లో నిరుద్యోగ యువకులు, విద్యార్థులతో రిలే నిరాహార దీక్ష జరిగింది. ఈ దీక్షా శిబిరంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్ –1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, మాడుగుల ఎంపీపీ తాళ్లపురెడ్డి వెంకట రాజారామ్ ,పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, నాలుగు మండలాల వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, ముఖ్యనాయకులు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
గ్రామాల్లో బురదనీరు సరఫరా
గొలుగొండ: కొత్తజోగుంపేటతోపాటు పలు గ్రామాల్లో గురువారం బురదనీరు సరఫరా కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొత్తజోగుంపేట, శ్రీరాంపురం, గొలుగొండ ప్రాంతాల్లో కుళాయిల ద్వారా బురదతో తాగునీరు సరఫరా అయింది. పైపులు లీకేజు వల్ల ఇలా వచ్చినట్టు ఆయా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. రెండు రోజులు నుంచి ఇదే పరిస్థితి ఉందని పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. బురదనీరు తాగడానికి ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
యలమంచిలి నియోజకవర్గం
యలమంచిలి నియోజకవర్గం అచ్యుతాపురంలో మాజీ ప్రభుత్వ విప్, సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో అచ్యుతాపురం పోలీస్ స్టేషన్ ఎదురుగా రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు నియోజకవర్గం పరిశీలకులు కోలా గురువులు, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బోదెపు గోవింద్, వైఎస్సార్సీపీ మండల పార్టీ అధ్యక్షుడు దేశంశెట్టి శంకర్రావు, ఎంపీపీ కోన సంధ్యలచ్చన్నాయుడు, కోజెడ్పీటీసీ నర్మాల కుమార్ , ఉమ్మిడి జగన్, యువజన విభాగం నాయకులు సియ్యాద్రి బుజ్జి, కారుకుండి శ్రీను, మాసవరపు శివ, మేరుగు రాజేష్, గంగిరెడ్డి రోహిత్ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. -
ప్రయాగ్రాజ్ నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లు
చోడవరం నియోజకవర్గంచోడవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి, చోడవరం సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు చోడవరం తహసీల్ధార్ కార్యాలయం వద్ద మెయిన్రోడ్డుపై రిలే నిరాహార దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గూనూరు రామచంద్రనాయుడు, జిల్లా యూత్ కార్యదర్శి బొండా చిన్న, రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి మరిశా శ్రావణ్కుమార్, నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు గుత్తేటి శ్రీను, మండల, పట్టణ యూత్ అధ్యక్షులు పాల్గొన్నారు -
రైలు, రోడ్డు, పోర్టు అనుసంధానమే కీలకం
మహారాణిపేట: ఓడరేవులు, లాజిస్టిక్స్ ఒకే నాణేనికి రెండు వైపులని, సముద్ర మార్గాలు, పారిశ్రామిక కేంద్రాలు, అంతర్గత మార్కెట్ల మధ్య సరుకు రవాణాను సమర్థవంతంగా అనుసంధానించడంలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని భారత రైల్వే బోర్డు ట్రాఫిక్ అదనపు సభ్యులు దేవేంద్ర కుమార్ అన్నారు. సీఐఐ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ లాజిస్టిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం నోవోటెల్లో నిర్వహించిన సీఐఐ కాన్ఫరెన్స్ ఆన్ పోర్ట్స్ అండ్ లాజిస్టిక్స్–2వ ఎడిషన్లో ఆయన మాట్లాడారు. సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచేందుకు రైల్వే శాఖ అనేక సంస్కరణలు చేపట్టిందని, వాటి వల్ల ఓడరేవులు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. విశాఖలో దక్షిణ తీర రైల్వే జోన్ ఏర్పాటు వల్ల నిర్ణయాల ప్రక్రియ వేగవంతమై, స్థానిక లాజిస్టిక్స్ సమస్యల పరిష్కారానికి దోహదపడుతుందని పేర్కొన్నారు. భవిష్యత్లో కంటైనరైజేషన్, మల్టీమోడల్ లాజిస్టిక్స్, ఓడరేవులు–రైల్వేలు–రోడ్ల సమన్వయమే సరుకు రవాణా అభివృద్ధికి కీలకమని చెప్పారు. సీఐఐ విశాఖ జోన్ చైర్మన్ జి.కృష్ణమోహన్, సీఐఐ ఏపీ వైస్ చైర్మన్ డాక్టర్ జి.సాంబశివరావు, ఏపీ మారిటైమ్ బోర్డు రైల్వే–లాజిస్టిక్స్ సలహాదారు ఆర్.ధనంజయులు, విశాఖ పోర్ట్ డిప్యూటీ చైర్పర్సన్ రోష్ని అపరంజి తదితరులు ప్రసంగించారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఒక ప్రధాన, ఐదు చిన్న ఓడరేవులు కలిసి ఏటా సుమారు 30 కోట్ల టన్నుల సరుకు నిర్వహణ సామర్థ్యం కలిగి ఉన్నాయని ధనంజయులు తెలిపారు. కార్యక్రమంలో సీఐఐ విశాఖపట్నం జోన్ వైస్ చైర్మన్ నిలేష్ అగర్వాల్, భద్రతా కార్యకలాపాల సలహాదారు శ్రీనివాస్ నందూరి, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎ. నరసింహమూర్తి, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.యశ్వంత్కుమార్రెడ్డి, సీజీఎస్టీ అదనపు కమిషనర్ బలరామ్, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో కెప్టెన్ ఎస్. దివాకర్, స్పెషల్ ఎకనామిక్ జోన్ జాయింట్ డెవలప్మెంట్ కమిషనర్ రాజశేఖర్, జీఎంఆర్ గ్రూప్ రీజినల్ కార్గో బిజినెస్ సీఈఓ ప్రసాద్, విజయనగరం నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ డైరెక్టర్ రోహిత్ కుమార్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సీఐఐ సదస్సులో రైల్వే బోర్డు ట్రాఫిక్ అదనపు సభ్యులు దేవేంద్ర కుమార్ -
రాజకీయ కక్షతో పింఛన్లు ఆపేశారు..
నాతవరం: ఏళ్ల తరబడి తీసుకుంటున్న పేదల పింఛన్లు రాకుండా కూటమి నేతలు నిలుపుదల చేసారని వైఎస్సార్సీపీ సీనియర్ నాయుకులు అంకంరెడ్డి రాజు, పైల మణేంద్ర, గాడి పోతురాజు ఆరోపించారు. పింఛన్లు నిలిపేసిన లబ్ధిదారులు గురువారం అధికారులకు ఫిర్యాదు చేసి ఎంపీడీవో కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కూటమి నేతలు చేసిన కక్ష పూరిత రాజకీయంపై స్ధానిక వైఎస్సార్సీపీ నేతలు లబ్ధిదారులతో కలిసి నాతవరంలో రిలే నిరహార దీక్ష శిబిరానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. మండలంలో చినగొలుగొండపేట గ్రామానికి చెందిన కాళ్ల రాంబాబు, కరక సత్యనారాయణ, గాడి సత్యనారాయణ, కుందేటి కొండబాబు, కుందేటి అర్జునరావు, పైల నూకరాజు, అంకంరెడ్డి వెంకటరమణ, చిందం దేవుళ్లు, అంకంరెడ్డి నూకరాజు, బొడ్డు రాంబాబు, కుందేటి అప్పలస్వామి, బందం రాంబాబు సుమారుగా ఎనిమిదేళ్లుగా గ్రామంలో ప్రభుత్వం అందిస్తునసంక్షేమ పింఛన్లు పొందుతున్నారు. వీరంతా వైఎస్సార్సీపీ సానుభూతి పరులు కావడంతో గ్రామానికి చెందిన కూటమి నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అధికారులకు ఫిర్యాదు చేసి ఈ నెల నుంచి పింఛన్లు రాకుండా అడ్డుకున్నారన్నారు. వీరంతా పేదలు కావడంతో గ్రామంలో ఎనిమిదేళ్లుగా వివిధ రకాల పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వీరికి పింఛన్లు పొందడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. కానీ వైఎస్సార్సీపీ సానుభూతిపరులుగా ఉన్నారన్న అక్కసుతో పింఛన్లు నిలిపివేయించారని ఆరోపించారు. ఉన్నత స్ధాయి అధికారులు స్పందించి క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
గళమెత్తిన జెన్జీ
దగా డీఎస్సీపై... ● పెద్ద ఎత్తున పాల్గొన్న నిరుద్యోగ యువకులు, విద్యార్థులు ● డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకూ పోరాటం ● విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేసే వరకూ ఉద్యమం ● రిలే నిరాహార దీక్షలకు సంఘీభావం తెలిపిన జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, మాజీ డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలుసాక్షి, అనకాపల్లి: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ పోరుబాట నిర్వహించింది. వైఎస్సార్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో ఏపీ జెన్జెడ్ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని అనకాపల్లి, చోడవరం, మాడుగుల, నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు జరిగాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3వేలు నిరుద్యోగ భృతి అందించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. జిల్లాలో నర్సీపట్నం, పాయకరావుపేట, అనకాపల్లి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ పాల్గొని సంఘీభావం తెలిపారు. మాడుగులలో మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, చోడవరంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొని సంఘీభావం తెలియజేశారు. -
గింజర్తిలో వంటా వార్పు..!
కొయ్యూరు: గింజర్తిలోనే 3, 4, 5 తరగతులను కొనసాగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు చేపట్టిన రిలే దీక్షలు నాలుగో రోజుకు చేరుకున్నాయి. గురువారం దీక్షా శిబిరం వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు. ఆదర్శ పాఠశాలల పేరుతో గింజర్తిలో కొనసాగుతున్న 3, 4, 5 తరగతులను తొలుత చింతలపూడికి, అనంతరం లొద్దిపాకలకు తరలించడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు తెలిపారు. సమస్య పరిష్కారం కోసం గత ఏడాది నుంచి కలెక్టర్కు వినతులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో రిలే దీక్షలకు దిగారు. రెండు రోజుల క్రితం ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ ఎంఈవో ద్వారా గింజర్తి గ్రామస్తులతో ఫోన్లో మాట్లాడారు. 3, 4, 5 తరగతులను గింజర్తిలో కొనసాగించేలా విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వస్తాయని, కమిషనర్తో మాట్లాడినట్లు తెలిపారు. దీక్షలు విరమించాలని కోరారు. అయితే ప్రభుత్వం నుంచి అధికారిక ఆదేశాలు వచ్చే వరకు దీక్షలు విరమించేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. గింజర్తి గ్రామస్తులు, విద్యార్థులు చేస్తున్న దీక్షలకు గురువారం బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఇలావుండగా 3,4,5 తరగతులు కొనసాగించేలా కలెక్టర్ నిశాంతి ఉత్తర్వులు ఇచ్చారని ఎంఈవో సింహాచలం తెలిపారు. తరగతుల కోసం తల్లిదండ్రుల పోరుబాట -
గ్రంథాలయ పనివేళల మార్పునకు ప్రతిపాదనలు
చైర్మన్ సతీష్ కుమార్ రోలుగుంట: ప్రస్తుతం అమలులో ఉన్న గ్రంథాలయ పని వేళల్లో మార్పులు చేయాలని ప్రతిపాదనలు పంపినట్టు ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ చైర్మన్ వి.సతీష్ కుమార్ తెలిపారు. పాఠకులకు అను కూలంగా ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకూ గ్రంథాలయాలు పని చేయడానికి అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. ఉమ్మడి విశాఖలో 67 గ్రంథాలయాలకు 142 మంది సిబ్బంది అవసరం కాగా 42 మంది మాత్రమే ఉన్నారని, ఈ ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరామన్నారు. అనకాపల్లి జిల్లా రూ.35 కోట్లు, అల్లూరి జిల్లా రూ.80 కోట్లు, జీవీఎంసి రూ.250 కోట్లు సెస్ బకాయిలు విడుదల చేయాలని ఆయా జిల్లాల డీపీవోలకు వినతిపత్రం పంపామన్నారు. -
క్లాసుల్లేని క్యాంపస్!
విశాఖ విద్య: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బోధనా సంక్షోభం తీవ్రరూపం దాల్చుతోంది. వర్సిటీ యాజమాన్య నిర్లిప్తత, నిర్లక్ష్య వైఖరి కారణంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. స్వయంప్రతిపత్తి కలిగిన ప్రతిష్టాత్మక సంస్థపై విజిలెన్స్ విచారణ మకిలి అంటించి, ఉన్నత విద్యా వ్యవస్థనే భ్రష్టు పట్టిస్తున్నారని మేధావులు, విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీ యాక్ట్ 91 ప్రకారం గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుని చర్యలు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ.. వర్సిటీ ప్రతిష్ట కోర్టు మెట్లెక్కినా వెనక్కి తగ్గకుండా యాజమాన్యం దూకుడుగా వ్యవహరించడంపై గవర్నర్ కార్యాలయ వర్గాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ఏయూలో చర్చ జరుగుతోంది. నాక్ కోసం వాడుకుని.. నడిరోడ్డున పడేశారు! గతంలో ఏయూలో అధ్యాపకుల కొరత వేధిస్తున్న సమయంలో, నాక్ ప్రమాణాలను కాపాడుకోవడంతో పాటు విద్యార్థులకు బోధనా లోపం రాకుండా ఉండేందుకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) ఆమోదంతో 2022, 2023లలో అడ్హాక్ అధ్యాపకులను నియమించారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగానే నోటిఫికేషన్లు, ఇంటర్వ్యూల ద్వారా పారదర్శకంగా వీరందరినీ ఎంపిక చేశారు. ఇంజినీరింగ్, లా, జియాలజీ, పర్యావరణ శాస్త్రం, స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ వంటి సెల్ఫ్ సపోర్ట్ కోర్సులకు వీరే ప్రధాన బోధకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు లేకున్నా, సాధారణ సిబ్బంది జీతాలతో సంబంధం లేకుండా.. వీరు నిర్వహించే కోర్సుల ద్వారా వచ్చే ఆదాయంతోనే వీరికి వేతనాలు చెల్లిస్తున్నారు. రెగ్యులర్ ప్రొఫెసర్ల లాగా వీరికి ఎలాంటి రీసెర్చ్ ఫండ్స్ కానీ, కాన్ఫరెన్స్ అలవెన్సులు కానీ ఉండవు. అయినా విద్యార్థుల భవిష్యత్తు కోసం మూడేళ్లకు పైగా నిబద్ధతతో పనిచేసిన 25 మందికి పైగా అధ్యాపకులను ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా విశ్వవిద్యాలయం ఉన్నపళంగా పక్కనబెట్టడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఒకరికి రెన్యువల్.. మరొకరిపై కక్షసాధింపా? ఇటీవల కాంట్రాక్ట్ అధ్యాపకులకు సేవల రెన్యువల్ ఇచ్చిన వర్సిటీ యాజమాన్యం, సుమారు 40 మంది వరకు ఉన్న అడ్హాక్, అడ్జంక్ట్ అధ్యాపకులకు మాత్రం రెన్యువల్ నిలిపివేసింది. ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో బాధిత అధ్యాపకులు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు జూన్ 29న అడ్హాక్ అధ్యాపకులకు, జులై 31న అడ్జంక్ట్ అధ్యాపకులకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘మనీష్ గుప్తా వర్సెస్ అదర్స్’ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పును ప్రస్తావిస్తూ ‘ఒక కాంట్రాక్టు లేదా అడ్హాక్ ఉద్యోగి స్థానంలో మరో కాంట్రాక్టు, అడ్హాక్ ఉద్యోగిని భర్తీ చేయకూడదు. ఆ ఖాళీలను శాశ్వత పోస్టుల ద్వారా మాత్రమే నింపాలి’ అని స్పష్టం చేస్తూ, వీరిని తక్షణమే విధుల్లో కొనసాగించాలని ఆదేశించింది. అయినప్పటికీ, వర్సిటీ యాజమాన్యంలో చలనం రాకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదేశాలను అమలు చేయకపోతే వర్సిటీ ఉన్నతాధికారులను నేరుగా కోర్టుకు పిలిపిస్తామని తీవ్రస్థాయిలో హెచ్చరించింది. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలా? అధికారుల పంతాలు, పట్టింపుల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. గడిచిన నెల రోజులుగా సంబంధిత విభాగాల్లో బోధన పూర్తిగా స్తంభించిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి ఏయూ క్యాంపస్కు వస్తున్న సుమారు 2 వేల మందికి పైగా విద్యార్థులు తరగతులు లేక ఖాళీగా కాలం వెళ్లదీస్తున్నారు. ఒకవైపు సిలబస్ పూర్తికాక, మరోవైపు పరీక్షలు ఎప్పుడు జరుగుతాయో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. లాభసాటిగా నడుస్తున్న స్వయం ఆర్థిక కోర్సులను నిర్వీర్యం చేస్తూ, విద్యార్థుల భవిష్యత్తును పణంగా పెడుతున్న ఏయూ అధికారుల తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
పాయకరావుపేట నియోజకవర్గం
పాయకరావుపేట నియోజకవర్గంలో నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. పట్టణంలో గల వైఎస్సార్ విగ్ర హం వద్ద ఏర్పాటు చేసిన దీక్షను తొలుత వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి దీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ దీక్షకు జిల్లా పార్టీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, వైఎస్సార్సీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిక్కాల రామారావు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు సంఘీభావం తెలియజేశారు. దీక్షలో పాల్గొన్న యువజన, యూత్ విభాగం సభ్యులకు సమన్వయకర్త కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్సీ డి.వి.సూర్యనారాయణరాజు దీక్షలో కూర్చున్న వారికి పూలదండలు వేసి దీక్షలు ప్రారంభించారు. -
అనకాపల్లి నియోజకవర్గం..
అనకాపల్లి నియోజకవర్గంలో కశింకోటలో జాతీయ రహదారి పక్కన నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి దీక్షలకు సంఘీభావం తెలియజేశారు. ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలతో నివాళులర్పించి దీక్షలను ప్రారంభించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ నిమ్మరసం తాగించి తొలిరోజు దీక్షలను విరమింపచేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు సతీష్వర్మ, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షుడు పెంటకోట శ్రీనివాసరావు, పార్టీ మండలాధ్యక్షుడు మలసాల కిషోర్, సీనియర్ నాయకుడు మళ్ల బుల్లిబాబు పాల్గొన్నారు. -
అధికారులకు అల్లుడు గిల్లుడు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ సొంత ఊరుకే చెందడంతో పాటు వరుసకు అల్లుడయ్యే విజయ్కుమార్ నాయుడు వ్యవహారాలు రోజుకు ఒకటి బయటపడుతున్నాయి. ప్రసిద్ధ శైవ క్షేత్రమైన పంచదార్ల కొండపై అక్రమ మైనింగ్ చేయడంతో పాటు అధికారులకు ఫలానా పనులు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసేవాడని తెలుస్తోంది. అంతేకాకుండా ఫలానా పని చేయాల్సిందేనంటే బెదిరించిన సందర్భాలూ ఉన్నాయని ఉద్యోగులు వాపోతున్నారు. ప్రధానంగా భూమి వ్యవహారాలతో పాటు మైనింగ్ విషయాల్లో అటు రెవెన్యూ, ఇటు మైనింగ్, రవాణా, పోలీసుశాఖలోని అధికారులకు ఫోన్లు చేసి జోక్యం చేసుకునేవారని తెలుస్తోంది. ఫలానా పని చేయాల్సిందేనంటూ అనకాపల్లి పార్లమెంటు పరిధిలోని అన్ని వ్యవహారాల్లో...అధికారులందరికీ ఫోన్లు చేసి ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎన్నికల ముందు నుంచీ సీఎం రమేష్కు అన్నీ తానై వ్యవహరించడంతో పాటు గెలిచిన తర్వాత పోస్టింగుల్లో కూడా ఆయన జోక్యం ఉండేదని తెలుస్తోంది. ఇక పార్లమెంటు పరిధిలోని కొన్ని కాంట్రాక్టుల విషయంలోనూ అల్లుడి పెత్తనం జోరుగా సాగేదని సమాచారం. ఈ నేపథ్యంలోనే అడ్డంగా అక్రమ మైనింగ్ చేస్తూ దొరికినప్పటికీ కేసు నమోదులో అటు మైనింగ్, ఇటు రాంబిల్లి పోలీసుల వ్యవహారం చూస్తే ఆయన పెత్తనం ఏ స్థాయిలో సాగిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా పెద్దలను వదిలి.... కేవలం కిందిస్థాయి అధికారులపైనే ప్రతాపం చూపడమూ ఇప్పుడు ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. కొన్ని రోజుల కిందటే పోస్టింగులోకి వచ్చి అక్రమ మైనింగ్ వ్యవహారంలో అసలు పాత్ర లేని తహసీల్దారుపై సస్పెన్షన్ వేటు వేయడాన్ని వీరు తప్పుపడుతున్నారు. అల్లుడి గిల్లుడికి తాము బలైపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు పెట్టేందుకూ వెనుకంజ..! విజయ్కుమార్ నాయుడు అక్రమ మైనింగ్ చేస్తూ అడ్డంగా దొరికినప్పటికీ అధికారులు స్వామి భక్తిని ప్రదర్శిస్తుండడం విమర్శల పాలవుతోంది. ప్రధానంగా రాంబిల్లి సీఐ తన స్వామిభక్తిని మరింతగా చాటుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమ మైనింగ్పై పెట్టిన కేసుల వివరాలను కూడా మీడియాకు వెల్లడించేందుకు ఇష్టపడడం లేదు. అంతేకాకుండా కేసు ఎవరి మీద పెట్టామనే పూర్తి వివరాలను కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేయకపోవడం గమనార్హం. నమోదు చేసిన కేసుల్లో కూడా పెద్దగా పస లేకుండా చేశారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఇప్పటికే పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ విషయంలో జోక్యం చేసుకుంటే కేసులు పెడతానంటూ స్థానికులపై సీఐ బెదిరింపులకు దిగారనే విమర్శలు బలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అక్రమ మైనింగ్ జరిగిందని నివేదిక రావడంతో పాటు ఎంత మేర కొల్లగొట్టారనే విషయం తెలిసినప్పటికీ కేసు నమోదులో ఇంతగా దాచి ఉంచడంతో పాటు తప్పుదోవ పట్టించేలా వివరాల నమోదు చూస్తుంటే.. అంతా సీఎం రమేష్ చూసుకుంటారు..తనకూ ఏమీ కాదనే ధైర్యమే ఇలా చేయిస్తుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పెద్దలను వదిలి...! వాస్తవానికి మైనింగ్ లీజు ఇచ్చే సమయంలోనే ఏ ప్రాంతం వరకు లీజు ఇచ్చారనే విషయాన్ని గనులశాఖ అధికారులు కలర్ కోడింగ్ ఇవ్వడం చేయాలి. లేనిపక్షంలో ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతం వరకూ మైనింగ్ తవ్వకాలు జరపాలనే విషయాన్ని సూచిస్తూ పిల్లర్లు వేయాల్సి ఉంటుంది. అయితే, పంచదార్ల కొండలకు మైనింగ్ ఇచ్చే విషయంలో మైనింగ్ అధికారులు కనీసం చర్యలు తీసుకోలేదు. సాధారణంగా ఎంత లోతు తవ్వారు? ఎన్ని మెట్రిక్ టన్నులు తవ్వారనే వివరాలను తహశీల్లార్లకు అవగాహన ఉండదు. అయితే, అన్ని శాఖలు కలిసి సర్వే చేపట్టే సమయంలో మాత్రం తహశీల్దారు ఎంత మేర తవ్వకాలు జరిపారనేది పరిశీలించే అవకాశం ఉంటుంది. కేవలం నిరంభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ వరకే తహశీల్లార్ల పాత్ర ఉంటుందని రెవెన్యూ అధికారులు పేర్కొంటున్నారు. అయితే, పంచదార్ల విషయంలో పెద్దలను రక్షించేందుకుగానూ కొత్తగా వచ్చిన తహశీల్దారును బాధ్యుని చేస్తూ....ఏకంగా సస్పెండ్ చేయడం ఇప్పుడు రెవెన్యూ ఉద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పెద్దలంతా దోపిడీ చేసి....తమను బలిపశువును చేయడం ఏమిటంటూ మండిపడుతున్నారు. ఎంపీ సీఎం రమేష్ బంధువు విజయకుమార్ నాయుడు లీలలు నియోజకవర్గంలో పనుల కోసం అధికారులకు హుకుం పంచదార్ల అక్రమ మైనింగ్లో అడ్డంగా దొరికిన వైనం అయినా కేసు నమోదులో పోలీసుల దాగుడు మూతలు అక్రమ మైనింగ్ వ్యవహారంలో పెద్దలపై ప్రేమ కిందిస్థాయి అధికారులే బలిపశువులు -
ఏసీబీ వలలో మైన్స్ సర్వేయర్
అనకాపల్లి టౌన్: ఒకసారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు..అయినా అతని బుద్ధి మారలేదు. అక్రమ మార్గంలో వచ్చిన డబ్బుకు ఆశపడి మరోసారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా బుక్కయ్యాడు. దీనికి సంబంధించి ఏసీబీ అడిషనల్ ఎస్పీ హర్షిత, డీఎస్పీ రమణమూర్తి అందించిన వివరాలిలా ఉన్నాయి. అనకాపల్లి మైన్స్ అండ్ జియాలజీ ఆఫీస్లో సర్వేయర్గా పనిచేస్తున్న దాదాల మురళీకృష్ణ అంబేడ్కర్కు ఊడేరు గ్రామంలో సర్వే నెంబర్ 211లో రెండు హెక్టార్లకు మైనింగ్ చేసుకోవడానికి మండలంలోని తుమ్మపాల గ్రామానికి చెందిన ఎస్.సునీల్కుమార్ కొంత కాలం క్రితం దరఖాస్తు చేసుకున్నాడు. ప్రభుత్వానికి కట్టాల్సిన రుసుము కూడా దరఖాస్తుదారు చెల్లించాడు. అయితే లీజు అప్లికేషన్ ప్రాసెస్ చేయాలంటే రూ.15 లక్షలు ఇవ్వాలని సర్వేయర్ డిమాండ్ చేశాడు. దీనిపై ఈ నెల 4న బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల ప్రకారం రూ.5 లక్షలు ఇస్తానని చెప్పి గురువారం ఉదయం 11 గంటల సమయంలో మైన్స్ కార్యాలయం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బాధితుడు సర్వేయర్ను కలిశాడు. అతడి వద్ద నుంచి సర్వేయర్ రూ.5 లక్షల నగదు తీసుకుంటుండగా అక్కడ మాటు వేసి ఉన్న ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిని విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. 2008లో సర్వేయర్గా నియామకం అయిన దాదాల మురళీకృష్ణ అంబేద్కర్ టెక్కలి, విశాఖపట్నం, ఏలూరు, పాడేరు, అనకాపల్లి ప్రాంతాలలో పనిచేశాడు. 2018లో విశాఖలో ఒక వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుడగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. గత ఏడాది జులై నాలుగో తారీఖు నుంచి అనకాపల్లి మైన్స్ కార్యాలయంలో సర్వేయర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అవినీతిపై ఫిర్యాదు చేయండి. ప్రభుత్వ శాఖల్లో అధికారులెవరైనా లంచం అడిగితే 1064 టోల్ ఫ్రీ నంబర్కు గానీ, 9440440057 నంబర్కు ఫిర్యాదు చేయవచ్చని డీఎస్పీ రమణమూర్తి సూచించారు. -
డిఫెన్స్ మద్యం పట్టివేత
నర్సీపట్నం: నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధి జోగినాధునిపాలెం సమీపంలో గురువారం రూ.3లక్షల విలువైన డిఫెన్స్ మద్యాన్ని తరలిస్తున్న కారు సీజ్ చేశామని జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.ఈశ్వరరావు వెల్లడించారు. మద్యం కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. ముందస్తు సమాచారం మేరకు సీఐ సునీల్ కుమార్, ఎస్ఐ కిరణ్కుమార్, సిబ్బంది అప్రమత్తమై మద్యం తరలిస్తున్న కారు పట్టుకున్నారని తెలిపారు. మాకవరపాలెం మండలం, వజ్రగాడ గ్రామానికి చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి డిఫెన్స్ మద్యాన్ని కారులోతరలిస్తుండగా ఎకై ్సజ్ పోలీసులను గమనించి కారు దిగి పరారయ్యాడు. కారుడ్రైవర్ జెర్రిపోతుల గోవిందరావును అదుపులోకి తీసుకున్నారు. కారులో ఎనిమిది రకాల బ్రాండ్లకు సంబంధించిన 44 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అప్పలనాయుడు కోసం గాలిస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. సారా తయారీపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. మున్సిపాలిటీ పరిధి పెదబొడ్డేపల్లిలో ఎనిమిది మందిని బైండోవర్ చేసి ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధించామన్నారు. -
జనావాసాల్లోకి అడవి గొర్రె
దేవరాపల్లి: దేవరాపల్లిలో గురువారం సాయంత్రం జనావాసాల్లోకి అడవి గొర్రె ప్రవేశించింది. స్థానికుల సమాచారంతో అటవీశాఖ అధికారులు దానిని పట్టుకొని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు. అటవీ ప్రాంతంలో సంచరించే అడవి గొర్రె జనావాసాల్లోకి రావడంతో వీధి కుక్కలు తరుముతుండగా స్థానిక వైఎన్ కాంప్లెక్స్లో ప్రజలు చూసి దానిని రక్షించి వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే జీనబాడు ఫారెస్ట్ రేంజ్ అధికారి ఆర్.రాజుబాబు నేతృత్వంలో జీనబాడు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పి. శివకుమార్, బీట్ ఆఫీసర్ పి. సాయి ప్రణీత్తోపాటు బేస్ క్యాంప్ ప్రొటెక్షన్ వాచర్లు జె. సత్యనారాయణ, పి.దుర్గారావు దేవరాపల్లి చేరుకొని అటవీ గొర్రెను స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దానిని విడిచి పెట్టారు. -
నేను కూడా అవయవదానం చేస్తా...
నర్సీపట్నం: నా అవయవాలను దానం చేసి..ఎనిమిది మందికి పునర్జన్మనిస్తానని నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు వెల్లడించారు. జాతీయ అవయవదాన పక్షోత్సవాల్లో భాగంగా అఖిల భారత శరీర అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవయవ దానంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అవయవ దానం చేయాలనుకుంటున్నానని భార్య, కుమార్తెకు చెప్పడంతో అభ్యంతరం చెప్పలేదన్నారు. ప్రతి ఒక్కరూ అవయవదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. అవయ దానం చేయడం ద్వారా ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చే అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు, యువత డ్రగ్స్ లాంటి మత్తుకు బానిసలు కాకుండా మంచి మార్గంలో నడవాలని కోరారు. రక్తదానం, నేత్రదానం, అవయవ దానం లాంటి సేవా కార్యక్రమాల పట్ల ఆకర్షితులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.రాజు, అవయవ దానం ట్రస్ట్ ప్రతినిధులు శివాజీ, బేరా బాబ్జి, బాబీ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. -
పరారీలో ఉన్న గంజాయి నిందితుడి అరెస్టు
ముంచంగిపుట్టు: గంజాయి అక్రమ రవాణా కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేసినట్లు జి.మాడుగుల సీఐ ఎస్. లక్ష్మణరావు తెలిపారు. వివరాల ప్రకారం.. ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ కుజభంగి జంక్షన్ వద్ద ఎస్పీ నాని ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గత నెల ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ బ్లాక్ నుంచి 1,373.72 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసిన కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న ఒడిశా రాష్ట్రం పొట్టంగి బ్లాక్ మలిసాహి గ్రామానికి చెందిన మాధబును గురువారం అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి, కేసు నమోదు చేసి రిమాండ్కు పంపించారు. ఈ సందర్భంగా సీఐ ఎస్. లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఎస్పీ అమిత్ బర్థర్ ఆదేశాలతో గంజాయి అక్రమ రవాణా, సాగుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. గంజాయి కేసుల్లో పరారీలో ఉన్న నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని చెప్పారు. గంజాయి రవాణా, సాగులో పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏఎస్ఐ లక్ష్మణరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ మోసం కేసులో కీలక నిందితుడి అరెస్ట్
కామారెడ్డి క్రైం: అధిక లాభాల ఆశ చూపించి ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ కంపెనీలో పెట్టుబడుల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాలోని కీలక నిందితుడిని తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆ జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో ఎస్పీ రాజేశ్చంద్ర తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉపాధి కోసం దుబాయికి వెళ్లొచ్చిన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని రమణ తండాకు చెందిన భుక్యా నవీన్ అక్కడ తాను పనిచేసిన ఓ ఆన్లైన్ గేమింగ్ కంపెనీతో కుమ్మక్కయ్యాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన తమ్ముడు ప్రవీణ్తో కలిసి రామారెడ్డి ప్రాంత ప్రజలతోపాటు దేశవ్యాప్తంగా అనేకమంది అమాయకులను టార్గెట్ చేశారు. వాట్సాప్ గ్రూప్లను ఏర్పాటు చేసి అధిక లాభాల ఆశ చూపిస్తూ లింకులను పంపి 7,636 మందితో రూ.కోట్లల్లో ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టించారు. రామారెడ్డికి చెందిన ఓ వ్యక్తి మోసపోయినట్టు గ్రహించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు గతనెల 31న నవీన్తో పాటు ప్రవీణ్లను రిమాండ్కు తరలించారు. ఇదే కేసులో పరారీలో ఉన్న మరో ప్రధాన నిందితుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ముత్యాల నాయుడు అలియాస్ రొంగలి ముత్యాలు నాయుడుగా గుర్తించారు. అతడిని డీఎస్పీ మధుసూదన్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు బుధవారం అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ వెబ్సైట్ల ద్వారా ప్రజలకు వాట్సాప్లో లింకులు పంపించి, పెట్టుబడి పెడితే రెట్టింపు లాభాలు వస్తాయని నమ్మించి డబ్బులు వసూలు చేసినట్లు నిందితుడు అంగీకరించాడన్నారు. ఈ ముఠా బాధితుల పేర్లపై యూజర్ ఐడీలు సృష్టించి బ్యాంకు ఖాతాలు, క్యూఆర్ కోడ్ల ద్వారా నగదు స్వీకరించి మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ఐఫోన్ ద్వారా సాట్స్పోర్ట్స్, ఫ్యూచర్9.కామ్ వెబ్సైట్లకు సంబంధించిన డిజిటల్ ఆధారాలు లభించాయని వెల్లడించారు. ఈ ముఠాలోని మిగిలిన నిందితులు, వారి బ్యాంకు ఖాతాలు, ఆర్థిక లావాదేవీలు, డిజిటల్ పరికరాలపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే వారిని సైతం అరెస్ట్ చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. -
దేవరాపల్లిలో పట్టపగలే భారీ చోరీ
దేవరాపల్లి: దేవరాపల్లిలో పట్టపగలే దొంగతనం జరిగింది. దేవరాపల్లి నుంచి బంగారమ్మ వెళ్లే రోడ్డుకు సమీపంలోని చొక్కాకుల ఎరుకునాయుడు ఇంటిలో మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదుతో సమాచారం అందుకున్న కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ బుధవారం దొంగతనం జరిగిన ఇంటిని పరిశీలించారు. బాధితుల కథనం మేరకు చోరీ ఘటన వివరాలిలా ఉన్నాయి. దేవరాపల్లి చెందిన చొక్కాకుల ఎరుకునాయుడు దంపతులు కూలి పనికి, పిల్లలకు స్కూల్కి వెళ్లిపోవడంతో అదే అదునుగా భావించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడ్డారు. బీరువాను పగలకొట్టి అందులో భద్రపరిచిన సుమారు 4 తులాల బంగారు అభరణాలు, సుమారు 20 తులాల వెండి పట్టీలు, సుమారు రూ.30 వేలు నగదును అపహరించుకుపోయారు. బాధితుడి చిన్న కుమార్తె యామిని సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి వచ్చి తలుపు తీసి లోపలికి వెళ్లింది. ఇంట్లో బీరువా తలుపులు తీసి ఉండడాన్ని గమనించి కూలి పనికి వెళ్లిన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. వెంటనే వాళ్లు ఇంటికి వచ్చి చూడగా బీరువాలో దాచుకున్న బంగారు, వెండి అభరణాలు లేక పోవడంతో బోరున విలపించారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాధితుడు ఎరుకునాయుడు, భార్య దేముళ్లమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగతనం జరిగిన ఇంటిని బుధవారం కె.కోటపాడు సీఐ కె.కృష్ణ, స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ పరిశీలించి బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలను సేకరించారు. అనుమానితులను విచారిస్తున్నారు. చోరీ జరిగిన ఇంటితో పాటు పరిసర ప్రాంతంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్తో ఆధారాలను సేకరించారు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
కాలువ వివాదానికి తెర
వంతెన ప్రతిపాదనకు అధికారుల హామీకశింకోట: మండలంలోని నూతలగుంటపాలెం శివారు త్రిపురవానిపాలెం గ్రామం వద్ద పోలవరం కాలువలో మట్టి రహదారి తొలగింపు వ్యవహారంపై నెలకొన్న వివాదానికి బుధవారం తెరపడింది. కాలువపై వంతెన నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో స్థానిక రైతులు, గ్రామస్తులు కొద్ది రోజులుగా చేపట్టిన ఆందోళనను విరమించారు. ఈ సందర్భంగా వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు నమ్మి గణేష్, నమ్మి నరసింగరావు, ఇతర స్థానిక నాయకులు పోలవరం ఈఈకి వినతిపత్రం అందజేశారు. ఆందోళన విరమించడంతో కాలువపై తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రహదారిని పొక్లెయిన్ సహాయంతో అధికారులు తొలగించారు. -
అమృత తుల్యం.. బిడ్డకు వరం
తల్లిపాలే పిల్లలకు శ్రీరామ రక్ష పుట్టిన మొదటి గంట నుంచి ఆరు నెలలు ఇవ్వాలి దీర్ఘకాల వ్యాధులకు దూరం తల్లికీ ప్రయోజనమే.. పిల్లలకు పాలివ్వడం వల్ల పిల్లలతో పాటు తల్లికీ ప్రయోజనముంది. పాలివ్వడం వల్ల గర్భాశయం పూర్వ స్థితికి చేరుకుంటుంది. అలాగే ప్రసవానంతర రక్తస్రావం తగ్గుతుంది. అదనపు కేలరీలు ఖర్చు అవడం వల్ల గర్భధారణ సమయంలో పెరిగిన బరువు సహజంగా తగ్గుతుంది. రొమ్ము, అండాశయ క్యాన్సర్, డయాబెటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. తల్లిపాలలో విడుదలయ్యే హార్మోన్ల వల్ల తల్లిలో ఒత్తిడి తగ్గి, బిడ్డతో భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. అనకాపల్లి టౌన్: శిశువు జన్మించిన వెంటనే అందించే తల్లిపాలు జీవితాంతం శిశువుకు శ్రీరామ రక్షగా ఉంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వారి సూచనల ప్రకారం పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం అత్యంత అవసరం. తొలి ఆరు నెలల వరకు నీరు కూడా ఇవ్వకుండా తల్లి పాలే అందించాలి. తల్లిపాలలో ఉండే పోషకాలు శిశువులో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు మెదడు ఎదుగుదలతో పాటు శారీర వక ఎదుగుదలకు కూడా తోడ్పడుతుంది. తల్లిపాలలో యాంటీబాడీస్ ఉంటాయి. ఇవి దగ్గు, డయేరియా, న్యుమోనియా వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. ఈ తల్లిపాలు త్వరగా అరిగిపోయి జీర్ణమవుతాయి. త్వరగా అరిగిపోవడం వలన కడుపునొప్పి, మలబద్దకం, జీర్ణ సమస్యలు ఉత్పన్నమవ్వవు. అలాగే భవిష్యత్లో ఆస్తమా, మధుమేహం, స్థూలకాయం వంటి సమస్యలు తగ్గిపోతాయి. అమూల్య ఆహారం తల్లిపాలు శిశువుకు ప్రకృతి ప్రసాదించిన అమ్యూలమైన ఆహారం. వైద్యుల సూచనలు పాటిస్తూ తొలి ఆరు నెలలు తల్లిపాలే ఇవ్వాలి. ఈ దశలో నీరు, తేనె, ఇతర ఆహారాలు అవసరం ఉండదు. తల్లిపాలలో ఉండే పోషకాలు శిశువుకు శిశువును అనేక అంటువ్యాధుల నుంచి కాపాడతాయి. తల్లి పాలు ఇవ్వడం వల్ల తల్లి కూడా త్వరగా కోలుకుంటుంది. –డాక్టర్ బి. సౌజన్య, గైనకాలజిస్ట్, ఎన్టీఆర్ ఆసుపత్రి, అనకాపల్లి -
పచ్చని పల్లెల్లో ధ్వంసరచన
దేవరాపల్లి: మండలంలో గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలాఫలకాల విధ్వంసకాండ కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటికే రెండు గ్రామాల్లో అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఎం.అలమండలో గాడి వారి కల్లాలకు వెళ్లే రహదారిలో ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి డిప్యూటీ సిఎం బూడి ముత్యాలనాయుడు ప్రత్యేక చొరవతో దాడి వారి కల్లాలకు సీసీ రోడ్డు నిర్మించి దశాబ్దాల రహదారి సమస్యను పరిష్కరించారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఓ మూలన ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఽఉద్దేశ్య పూర్వకంగా ధ్వంసం చేయడం వివాదాస్పదమైంది. వైఎస్సార్సీపీ హయాంలో కోట్లాది రూపాయలతో చేపట్టిన సంక్షేమాభివృద్ధిని చూసి ఓర్వలేక అసూయతో ఉద్దేశ్య పూర్వకంగా ఽప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారని గ్రామస్తులు, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ శిలాఫలకం ధ్వంసంపై స్థానిక తాజా మాజీ సర్పంచ్ దాడి జగన్నాథరావు(జగన్) మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా గతంలో ఇదేవిధంగా దేవరాపల్లి సంతతోట వద్ద దేవరాపల్లి–చిననందిపల్లి తారు రోడ్డు నుంచి చేనులపాలేనికి రూ.1.21 కోట్లతో నిర్మించిన తారు రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఽగత ఏడాది మార్చిలో దుండగులు ధ్వంసం చేశారు. పెదనందిపల్లి కాలనీలో సైతం శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఆయా ఘటనలపై అప్పట్లోనే వైఎస్సార్సీపీ నాయకులు పోలీసులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. కాగా మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా శిలా ఫలకాల ధ్వంసం చేసే విష సంస్కృతిని తీసుకురావడం పట్ల మండల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే అభివృద్ధి చేసి గ్రామాలలో తమ పేర్లతో నూతనంగా శిలాఫలకాలు ఏర్పాటు చేసుకోవాలి తప్ప గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేసే చర్యలు తగదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. -
బస్ కాంప్లెక్స్ స్థలం పంచాయతీకి కేటాయించాలి
ఎస్.రాయవరం: మండల కేంద్రంలో నిరుపయోగంగా ఉన్న బస్కాంప్లెక్స్ స్థలాన్ని పంచాయతీకి కేటాయించాలని గ్రామానికి చెందిన సోమిరెడ్డి రాజు హైకోర్టులో కేసు వేసినట్టు చెప్పారు. నూకాంబిక అమ్మవారి ఆలయానికి ఆనుకుని ఉన్న 25 సెంట్లు స్థలాన్ని అప్పటి రాజకీయ నాయకులు స్వప్రయోజనాల కోసం పంచాయతీ నుంచి 25 ఏళ్ల క్రితం స్థలం కేటాయించారు. ఆ తరువాత ఆర్టీసీ యాజమాన్యం బస్కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి నేటి వరకు బస్కాంప్లెక్స్, స్థలం ప్రయాణికులకు ఉపయోగపడలేదని పేర్కొన్నారు. ఆర్టీసీ ప్రయోజనాలకు అవసరం లేనందున తిరిగి ఈ స్థలం పంచాయతీ కేటాయించాలని పలుమార్లు అనకాపల్లి డిపో అధికారులకు ఫిర్యాదు ఇచ్చారన్నారు. ఈ స్థలాన్ని తిరిగి గ్రామానికి కేటాయించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కోర్టు వారిని కోరుతున్నట్టు సోమిరెడ్డి రాజు చెప్పారు. రేపు మెగా జాబ్ మేళామహారాణిపేట(విశాఖ): జిల్లా ఉపాధి కార్యాలయం (టెక్నికల్–క్లరికల్), నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీ మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విశాఖ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గొబ్బిళ్ల విద్యాధరి తెలిపారు. కంచరపాలెంలోని గర్ల్స్ ఐటీఐ క్యాంపస్లోని జిల్లా ఉపాధి కార్యాల య ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. టీసీఐ, ఇన్నో వ్ సోర్స్, నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్, అపోలో ఫార్మసీ, ఫ్లిప్కార్ట్, డీమార్ట్, ఫాక్స్కాన్, గ్లోరీ వెండర్, శుభగృహ, వరుణ్ మోటార్స్, డెక్కన్ ఫైన్ కెమికల్స్, అపిటోరియా తదితర సంస్థలు ఇందు లో పాల్గొంటాయి. అసిస్టెంట్ సూపర్వైజర్, సేల్స్మేనేజర్, క్యాషియర్,లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటి వ్, ఫార్మసిస్ట్, టెలికాలర్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, ఐఫోన్ అసెంబ్లింగ్ ఆపరేటర్, జూనియర్ కెమిస్ట్, ప్రొడక్షన్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. -
గెడ్డ ఆక్రమణలకు అడ్డేది?
నాతవరం: మండలంలోని పెదగొలుగొండ గ్రామం మధ్యలో ఉన్న వెర్రిగెడ్డ కబ్జాదారులకు అడ్డాగా మారింది. కూటమి నాయకుల అండదండలతో నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో ఆక్రమణలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వర్షం కురిసినప్పుడు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీరంతా ఈ గెడ్డ ద్వారా బట్రాజు నీల చెరువులోకి చేరుతుంది. ఈ గెడ్డ గ్రామం మధ్యలో అర్అండ్బీ రోడ్డును ఆనుకుని ఉండడంతో కొందరు యథేచ్ఛగా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. కొంతమంది భారీ భవనాలు నిర్మిస్తుండగా, మరికొంతమంది రేకులు షెడ్డు వేసుకుని, తర్వాత సిమెంట్ పిల్లర్లతో భవనాలు నిర్మిస్తున్నారు. గ్రామం మధ్యలో ఉన్న ఈ స్థలానికి విపరీతమైన గిరాకీ ఉంది. గెడ్డను యథేచ్ఛగా కప్పేస్తుండడంతో చెరువులోకి ప్రవహించవలసిన నీరు నిలిచిపోతోంది. దీంతో ఆయకట్టు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. గెడ్డను పూర్తిగా ఆక్రమిస్తే నీరంతా ఇళ్లలోకి వచ్చేస్తుందని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణ ఆరికట్టాలని కోరుతున్నారు. ఆక్రమణదారుల మధ్య ఘర్షణ గెడ్డ స్థలంలో నిర్మాణాలు చేపడుతున్న సమయంలో ఆక్రమణదారుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా బుధవారం ఇద్దరి మధ్య స్థలం విషయంలో తీవ్ర వివాదం జరిగింది. దీంతో ఆర్అండ్బీ రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమీపంలో సచివాలయంలో ఉన్న పంచాయతీ, రెవెన్యూ అధికారులు చూసినా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరించడంపై గ్రామస్తులు అసహనం వ్యక్తం చేశారు. -
పశువుల్లో బొబ్బలవ్యాధికి టీకాలు
మునగపాక: రైతులు సీజన్లో పశువులకు అంటు వ్యాధులు సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని పశు వంవర్దక శాఖ జిల్లా అధికారి డాక్టర్ కేఎల్ఎన్ స్వామి కోరారు. మండలంలోని ఒంపోలు గ్రామంలో జరుగుతున్న లంపీ స్కిన్ డిసీజ్(పశువుల బొబ్బల వ్యాధి) టీకాల కార్యక్రమాన్ని బుదవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువులకు తీవ్రమైన జ్వరం , శరీరమంతా బొబ్బలు, మచ్చలు ఏర్పడడం, పొల దిగుబడులు గణనీయంగా తగ్గినట్టయితే వ్యాధి లక్షణాలుగా గుర్తుంచుకోవాలన్నారు. ఒక పశువు నుంచి వేరే పశువుకు వేగంగా సంక్రమించే వ్యాధి కావడంతో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే ఆవుజాతి పశువులన్నింటికీ టీకాలు వేసుకోవాలని సూచించారు. ప్రతి రైతు తప్పనిసరిగా ఆవుజాతి పశువులకు ఎల్ఎస్డీ టీకాలు వేయించాలన్నారు. పశు సంవర్దక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సీహెచ్.గణేష్,పశు సంవర్దక శాఖ అసిస్టెంట్ జ్యోత్స ్నతో పాటు పలువురు రైతులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
వానొస్తే నరకయాతనే
నర్సీపట్నం: వానొస్తే పట్టణం జలమయమవుతోంది. పల్లపు ప్రాంతాల్లో అడుగు పెట్టేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడుతోంది. రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలు నీట మునగడంతో మరమ్మతులకు గురువుతున్నాయి. దీంతో నర్సీపట్నం వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఏటా ఈ సమస్య ఉత్పన్నమవుతున్నా పరిష్కార మార్గంపై అధికార యంత్రాంగం దృష్టిసారించకపోవడంతో ముంపు తప్పడం లేదు. డ్రైనేజీలు అధ్వానంగా ఉండడంతో మురుగునీరు వెళ్లే మార్గం లేక రోడ్లపై ప్రవహిస్తోంది. డ్రైనేజీలు రహదారి కంటే ఎత్తుగా ఉన్నాయి. కొన్నిచోట్ల మురుగు కాలువకు, రహదారికి పొంతన లేకుండా ఉంది. డ్రైనేజీలు దాటి రహదారిపైకి వచ్చి దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల డ్రైనేజీల ఆనవాళ్లే కనిపించడం లేదంటే అతిశయోక్తి కాదు. దీంతో చిన్నపాటి వాన కురిసినా పట్టణం జలదిగ్బంధంలో చిక్కుకుంటోంది. సుమారు 65 వేల జనాభా ఉన్న మున్సిపాలిటీలో ప్రస్తుతం ఇది 45 కిలో మీటర్లు మాత్రమే డ్రైనేజీలు ఉన్నాయి. ఇంకా 137 కిలో మీటర్ల మేర డ్రైనేజీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. డ్రైనేజీల నిర్మాణానికి రూ.77 కోట్లు అవసరమవుతుందని ఇంజినీరింగ్ అధికారులు పదేళ్ల క్రితం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. చిన్నపాటి వర్షానికే.. కె.కోటపాడు : చిన్నపాటి వర్షానికే మండలంలోని వారాడ ప్రధాన వీధిలో వర్షం వర్షపునీరు నిలిచిపోతుండడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మెయిన్రోడ్డు నుంచి రామాలయానికి వెళ్లే మార్గం లోతట్టుగా ఉండడంతో వర్షపు నీరు రోజుల తరబడి నిలిచిపోతోంది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అధికారులు స్పందించి నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
స్టీల్ప్లాంట్ టౌన్షిప్కు భూములిచ్చేది లేదు
నక్కపల్లి: ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్కు గునిపూడి లక్ష్మీదేవి కొండపై భూములు ఇచ్చే ప్రసక్తి లేదని ఈ భూములు సాగు చేసుకుంటున్న సాగుదారులు స్పష్టం చేశారు. టౌన్షిప్కు భూములు కేటాయించడాన్ని నిరసిస్తూ సాగుదారులు చేస్తున్న నిరసన వంటావార్పు కార్యక్రమం ఆరోరోజు కొనసాగింది. బుధవారం ఈ దీక్షలో పాల్గొన్న సీపీఎం నాయకులు ఎం.అప్పలరాజు తదితరులు మాట్లాడుతూ గ్రామంలో పేదలకు ఈ భూములు తప్ప వేరే దారిలేదన్నారు. తరతరాలుగా ఈ భూములను సాగు చేసుకుంటూ జీవిస్తున్నారన్నారు. సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని ఏళ్ల తరబడి కోరుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. స్టీల్ప్లాంట్ కోసం ఈ భూములు కేటాయించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. పట్టాలు ఇస్తే ప్రభుత్వం తరపున నష్టపరిహారం పొందే అవకాశం ఉందని లబ్ధిదారులు పట్టాలు ఇవ్వాలని కోరితే ప్రభుత్వం నిబంధనలు ఒప్పుకోవంటూ తిరస్కరించిందన్నారు. ఇవే భూములు టౌన్షిప్ కోసం ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఎట్టిపరిస్దితుల్లో ఈ భూములను స్టీల్ప్లాంట్ టౌన్షిప్కొరకు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. భూముల్లో ట్రెంచ్ ఏర్పాటు చేసి స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పోలీసుల సాయంతో ఏదైనా చేయొచ్చనే మొండి వైఖరితో ప్రభుత్వం ఉందన్నారు. సాగుదారులు ప్రాణాలకు తెగించి ఈ భూములను కాపాడుకుంటారని హెచ్చరించారు. ఈ ఆందోళనలో రైతు సంఘనాయకులు ఎం.రాజేష్, డి.కృష్ణ, బి.బాబ్జి, ముసలయ్య, బి.నాయుడు, చంటిబాబు పాల్గొన్నారు. -
నూకాంబిక సన్నిధిలో ప్రముఖులు
అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి, సినీనటుడు సోనూసూద్లు బుధవారం రాత్రి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నూతన ఆలయంలో అమ్మవారిని దర్శంచుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. అనంతరం ఆలయ చైర్మన్ పీలా నాగశ్రీను, ఈవో యాళ్ల శ్రీధర్లు రాంప్రసాద్రెడ్డి, సోనూసూద్లను శాలువాలతో సత్కరించి, అమ్మవారి చిత్రపటాలు, ప్రసాదం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజారవాణాశాఖ జిల్లా అధికారిణి వి.ప్రవీణ, ఆలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నసినీ నటుడు సోనూసూద్ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్రెడ్డి -
కరాటే పోటీల్లో అనకాపల్లి చిన్నారుల సత్తా
తుమ్మపాల: ఈ నెల 1, 2 తేదీల్లో విజయవాడలో నిర్వహించిన 23వ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరాటే చాంపియన్ షిప్–2026లో అనకాపల్లి పట్టణానికి చెందిన చిన్నారులు రాష్ట్ర స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి పలు పతకాలను కైవసం చేసుకున్నారు. పట్టణంలోని రింగ్ రోడ్డులో ఉన్న తీక్షిత షోటోకాన్ కరాటే అకాడమీలో శిక్షణ పొందిన విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొని మొత్తం 13 పతకాలు సాధించి అకాడమీతో పాటు జిల్లాకు గుర్తింపు తీసుకురావడంపై కోచ్ టి.ఈశ్వరరావు, తల్లిదండ్రులు బుధవారం అభినందించారు. కె.ప్రణీత్ శ్రీనివాస్ కుమిటే విభాగంలో స్వర్ణ పతకం, ఎన్.సంతోష్, కతా, కుమిటే విభాగాల్లో రెండు స్వర్ణ పతకాలు, బి.అవినాష్ కతా విభాగంలో స్వర్ణ పతకం, కె.గీతాలక్ష్మి కతా విభాగంలో స్వర్ణం, కుమిటేలో కాంస్యం, కె.జశ్వంత్ కతా విభాగంలో స్వర్ణం, కుమిటేలో కాంస్య పతకం సాధించారు. అలాగే వి.ఏక్షిత్ కుమిటే విభాగంలో రజత పతకం గెలుచుకోగా, ఎం.ప్రణీత్, ఎస్.కార్తిక్ కుమిటే విభాగంలో కాంస్య పతకాలు సాధించారు. ఎస్కే.నజీర్, కె.యశ్వంత్, బి.దివాకర్, ఆర్.లాలా, జి.హర్షిత్ హనీష్ కతా విభాగంలో కాంస్య పతకాలు సాధించి ప్రతిభ చాటారు. విద్యార్థుల విజయంపై కోచ్ ఈశ్వర్ హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర స్థాయిలో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులు భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న తల్లిదండ్రులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
అంగన్వాడీ కేంద్రాల పనితీరు అధ్వానం
నక్కపల్లి: మండలంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరు చాలా అధ్వానంగా ఉందని, రికార్డుల నిర్వహణ సరిగా లేదని, అధికారుల పర్యవేక్షణ కొరవడిందని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మీరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మండలంలోని అంగన్వాడీ కేంద్రాలు, గురుకులాలు, కేజీబీవీలు, పౌర సరఫరాల గోదాములను తనిఖీ చేశారు. చినదొడ్డిగల్లులో మూడు అంగన్వాడీ కేంద్రాలను పరిశీలించారు. ఆయా కేంద్రాల్లో ఉన్న సరుకులు, లబ్ధిదారులకు పంపిణీ చేసిన సరుకులకు, స్టాక్ రిజిస్టర్లకు మధ్య చాలా వ్యత్యాసం ఉన్న విషయాన్ని గుర్తించారు. టిహెచ్ఆర్ (టేక్ హోమ్రేషన్) పంపిణీ రిజిస్టర్లను పూర్తిగా నమోదు చేయకపోవడంపై మండిపడ్డారు. చినదొడ్డిగొల్లు 1 కేంద్రంలో ఈ స్టాక్ , భౌతిక నిల్వల మధ్య భారీ వ్యత్యాసం గుర్తించారు. ఈ స్టాక్లో 1052 కోడిగుడ్లు నమోదై ఉండగా భౌతికంగా 258 కోడిగుడ్లు మాత్రమే ఉండడం, 532 కోడిగుడ్లకు సంబంధించి వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. చినదొడ్డిగల్లు–2 కేంద్రంలో హాజరు రిజిస్టరులో 9 మంది పిల్లలు మాత్రమే నమోదు చేసి ఉండగా, ఆన్లైన్లో 10 మంది పిల్లలు నమోదు చేసి పది మంది హాజరైనట్టు నమోదు చేయడాన్ని గుర్తించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించకుండా సూపర్వైజర్ తనిఖీ రిజిస్టర్లో సంతకం చేయడాన్ని కమిషన్ సభ్యుడు తప్పుపట్టారు. సూపర్వైజర్ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. చినదొడ్డిగల్లు–3 కేంద్రంలో ఆగస్టుకు సంబంధించి టేక్ హోమ్ రేషన్ పంపిణీ చేయకుండానే పంపిణీ చేసినట్టు రిజిస్టర్లో నమోదు చేయడంతో పాటు, లబ్ధిదారుల సంతకాలు తీసుకోవడాన్ని గుర్తించారు. సీడీపీవో కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తున్నట్టుగా విజిటింగ్ రిజిస్టర్లు అందుబాటులో లేకపోవడాన్ని కూడా గుర్తించారు. కొన్ని కేంద్రాల్లో పిల్లలకు ఉదయం 11 గంటలు దాటినా పాలు, గుడ్లు సరఫరా చేయకపోవడం లేదని, ఇలాంటి నిర్లక్ష్యం చిన్నారుల పోషకాహార హక్కులకు భంగం కలిగించడంతో పాటు వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. అనంతరం జెడ్పీ ఉన్నత పాఠశాల ఎంపీపీ పాఠశాల, బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల, నక్కపల్లిలో కేజీబీబీ పాఠశాల, ఎంఎల్ఎస్ పాయింట్లను పరిశీలించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు. ఆహార నిల్వలు, నాణ్యత రికార్డుల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు. రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యం, పోషకాహార పంపిణీలో లోపాలు, పర్యవేక్షణ వైఫల్యాలపై సంబంధిత అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, సీడీపీవోలకు షోకాజ్ నోటీసులు జారీ చేసి బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను ఆదేశిస్తున్నట్టు లక్ష్మిరెడ్డి చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ ఆహార భద్రతా చట్టం 2013 లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నాణ్యమైన ఆహారం, గుడ్లు, పాలు సకాలంలో పంపిణీ చేయడంతో పాటు అన్ని రికార్డులను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని లక్ష్మిరెడ్డి హెచ్చరించారు. ఈ తనిఖీల్లో డీఎస్డీవో కె.వి.ఎల్.ఎన్.మూర్తి, సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ రమణ, డీటీ గణపతిరావు, తూనికలు, కొలతల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ఇక మూడు జెడ్పీలు
మహారాణిపేట: సుదీర్ఘ చరిత్ర కలిగిన విశాఖపట్నం జిల్లా పరిషత్ త్వరలోనే మూడు ముక్కలు కానుంది. గతంలో చేపట్టిన ఉమ్మడి జిల్లాల పునర్విభజన ఆధారంగా విశాఖ జెడ్పీని మూడు కొత్త జిల్లా పరిషత్తులుగా విభజిస్తున్నారు. దీనికి సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు (ప్రెసిడెన్షియల్ ఆర్డర్) అమల్లోకి రావడంతో.. సెప్టెంబర్ 25 తర్వాత విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్, మండల పరిషత్ల స్థాయిల్లో అధికారుల సంఖ్యను ఖరారు చేయడంతో పాటు, సీనియారిటీ ప్రాతిపదికన పంచాయతీరాజ్ శాఖలో బదిలీలకు రంగం సిద్ధం చేశారు. సుదీర్ఘ చరిత్రకు ముగింపు విశాఖ జిల్లా పరిషత్కు విశిష్టమైన చరిత్ర ఉంది. 1959లో సమితులు, తాలూకాలు, జిల్లా బ్లాక్ బోర్డుల ఆధారంగా జిల్లా పరిషత్ వ్యవస్థ ఆవిర్భవించింది. అనంతరం 1983లో మండల ప్రజా పరిషత్తులు, జిల్లా ప్రజా పరిషత్తుల వ్యవస్థకు రూపుదిద్దుకోగా, 1986 నాటికి పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చింది. 2021 సెప్టెంబర్ 25న జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో జె.సుభద్ర చైర్పర్సన్గా ఎన్నికయ్యారు. ఆమె నేతృత్వంలోని పాలకవర్గం పదవీకాలం ఈ ఏడాది సెప్టెంబర్ 24తో ముగియనుంది. దీంతో ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్కు తెరపడనుండగా.. మూడు కొత్త జిల్లా పరిషత్తులు అధికారికంగా ఏర్పాటుకానున్నాయి. జిల్లాల విభజనతో కొత్త జెడ్పీలు 2022లో అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాను విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలుగా విభజించారు. రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చారు. అయితే అప్పట్లో జిల్లా పరిషత్తుల విభజన జరగలేదు. ఇప్పుడు ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం ముగియడంతో జెడ్పీల విభజన ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో కొత్త జిల్లా పరిషత్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, అధికారులు, కార్యాలయాల విభజనకు ప్రభుత్వం నిష్పత్తులను ఖరారు చేసింది. ఉద్యోగుల కేటాయింపుపై కసరత్తు ఉమ్మడి విశాఖ జిల్లా పరిషత్లో ప్రస్తుతం 63 మంది అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారు. కొత్తగా ఏర్పడే ప్రతి జిల్లా పరిషత్లో 65 మంది చొప్పున అధికారులు, సిబ్బంది ఉండేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అలాగే ప్రతి మండల పరిషత్ కార్యాలయంలో 13 మంది సిబ్బంది ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. దీని కోసం ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్, మండల పరిషత్తులు, పాఠశాలలు, వసతి గృహాలు తదితర పంచాయతీరాజ్ సంస్థల్లో కలిపి మొత్తం 876 మంది అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. జిల్లాలో మొత్తం 39 మండల పరిషత్తులు ఉన్నాయి. ప్రతి మండలంలో ఒక ఎంపీడీవో, ఇద్దరు డిప్యూటీ ఎంపీడీవోలు, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది, డ్రైవర్లు, నైట్ వాచ్మెన్లు తదితర ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. సీనియారిటీ జాబితాల తయారీ జిల్లా పరిషత్, మండల పరిషత్తులు, ఇతర పంచాయతీరాజ్ సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగుల సీనియారిటీ జాబితాల తయారీ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్కు అనుగుణంగా ఉద్యోగి విధుల్లో చేరిన తేదీ, అర్హతలు, కేడర్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సీనియారిటీ జాబితాలను రూపొందిస్తున్నారు. ఈ జాబితాల ఆధారంగానే కొత్త జిల్లా పరిషత్తులకు ఉద్యోగుల కేటాయింపులు, బదిలీలు చేపట్టనున్నారు. రానున్న 15 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. -
ఉక్కు గుండె!
కోట్లున్నా.. కరగని నిల్వ నిధులు ఏమవుతున్నాయి? జీతాలు ఇవ్వకపోగా, చట్టబద్ధంగా చెల్లించాల్సిన బకాయిలను సైతం పెండింగ్లో పెట్టి రిటైర్డ్ ఉద్యోగులను, బాధిత కుటుంబాలను నడిరోడ్డున పడేసింది. బకాయిల చిట్టా సాక్షి, విశాఖపట్నం/ఉక్కునగరం: ఉక్కును కరిగించే కొలిమి మండుతోంది.. కానీ యాజమాన్యం మనసు మాత్రం కరగడం లేదు. వేల కోట్ల ఆదాయం కళ్లముందే ఉన్నా.. రాత్రింబవళ్లు చెమటోడ్చి సంస్థను నిలబెడుతున్న ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వాలనే బాధ్యత మాత్రం కనిపించడం లేదు. సంస్థ ఖాతాల్లో కోట్లాది రూపాయలు నిల్వ ఉన్నా.. ఉద్యోగుల వేతనాలు, పదవీ విరమణ పొందిన వారి హక్కులు, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఉద్యోగుల కుటుంబాలకు ఇవ్వాల్సిన వితంతు పెన్షన్లను సైతం నిలిపివేయడం ఉక్కు యాజమాన్యం అమానవీయ వైఖరికి అద్దం పడుతోంది. విశాఖ స్టీల్ప్లాంట్ను ప్రైవేటీకరణ వైపు నడిపిస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యల మధ్య.. యాజమాన్యం తీసుకుంటున్న నిర్ణయాలు ఉద్యోగుల్లో మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకవైపు వేలాది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించి ఉత్పత్తి భారాన్ని కొద్దిమందిపై మోపింది. మరోవైపు ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గడంతో నెలవారీ వేతన వ్యయం గణనీయంగా తగ్గినా.. ఆ ప్రయోజనాన్ని ఉద్యోగులకు అందించకుండా జీతాల చెల్లింపులనే ఆలస్యం చేస్తోంది. ఇదే సమయంలో ‘స్టీల్ప్లాంట్ను మేమే కాపాడాం’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్న అధికార పార్టీ నేతలు.. ప్లాంట్లో ఉద్యోగులు ఎదుర్కొంటున్న దుస్థితిపై మాత్రం నోరు మెదపడం లేదు. వేల కోట్ల ఆదాయం వస్తున్న సంస్థలో జీతాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి? చట్టబద్ధమైన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పేవారే కరువయ్యారు. వేల కోట్ల ఆదాయం స్టీల్ప్లాంట్ 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.27,032 కోట్ల అమ్మకాల ద్వారా ఆదాయం ఆర్జించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూలై వరకు మరో రూ.9,331 కోట్లు సమకూరాయి. అంటే కేవలం 16 నెలల్లోనే రూ.36,363 కోట్ల ఆదాయం నమోదైంది. అంతేకాదు అత్యవసర పరిస్థితుల కోసం రూ.903 కోట్లను ప్రత్యేక నిధిగా పక్కన పెట్టింది. బ్యాంకు ఖాతాల్లో మరో రూ.195 కోట్ల నగదు నిల్వ ఉన్నట్లు సమాచారం. డబ్బు లేదనే వాదనకు ఈ గణాంకాలే సమాధానం చెబుతున్నాయి. వేతన భారం తగ్గినా..! గత ఏడాది ఫిబ్రవరిలో ప్లాంట్లో 12,249 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా.. వారి నెలవారీ వేతన వ్యయం రూ.195 కోట్లు. వీఆర్ఎస్లు, పదవీ విరమణలు, రాజీనామాల కారణంగా ఈ ఏడాది జూలై నాటికి ఉద్యోగుల సంఖ్య 8,498కు పడిపోయింది. దాంతో నెలవారీ జీతాల భారం రూ.140 కోట్లకు తగ్గింది. అంటే ప్రతి నెలా యాజమాన్యానికి రూ.55 కోట్ల మేర ఆదా అవుతోంది. వేతనభారం తగ్గిన తర్వాత కూడా ఉద్యోగులకు పూర్తి స్థాయిలో జీతాలు చెల్లించకపోవడం ఉద్యోగులను తీవ్ర అసంతృప్తికి గురిచేస్తోంది. డబ్బు లేక కాదు.. డబ్బు ఉండి కూడా జీతాలు నిలిపివేస్తున్నారనే అభిప్రాయం ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. గత 16 నెలల్లో రూ.36,363 కోట్ల ఆదాయం అత్యవసర నిధిగా రూ.903 కోట్లు నిల్వ బ్యాంకు ఖాతాల్లో రూ.195 కోట్ల నగదు నెలవారీ వేతన భారంరూ.55 కోట్లు తగ్గినా.. జీతాల చెల్లింపుల్లో జాప్యం ఉద్యోగులు జీతాలు, వీఆర్ఎస్, వితంతువుల పెన్షన్లు కలిపి రూ.590 కోట్లకు పైగా బకాయిలుబకాయి రకం పెండింగ్ E§øÅ-VýS$ÌS ò³…yìl…VŠæ i™éË$ -₹383.71 Mør$Ï ç³§ýlÒ ÑÆý‡Ð]l$׿ "ÎÐŒæ Ô>ÌSÈ'- ₹117.00 Mør$Ï ÒB-ÆŠ‡-G-‹Ü&2 ºM>-Ƈ$$-Ë$- -₹58.78 Mør$Ï ÒB-ÆŠ‡-G-‹Ü&3 ºM>-Ƈ$$-Ë$ -₹14.46 Mør$Ï Ñ™èl…-™èl$-Ð]l#ÌS ò³¯]lÛ¯]l$Ï ₹16.75 Mør$Ï మొత్తం రూ.590 కోట్లు 16 నెలల్లో రూ.36 వేల కోట్లకు పైగా ఆదాయం.. రూ.903 కోట్ల అత్యవసర నిధి.. రూ.195 కోట్ల నగదు నిల్వలు.. నెలకు రూ.55 కోట్ల వేతనభారం తగ్గింపు.. అయినా ఉద్యోగుల జీతాలు, వీఆర్ఎస్ బకాయిలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు, వితంతువుల పెన్షన్లు ఎందుకు నిలిచిపోయాయి? ఈ నిధులు ఎక్కడ వినియోగిస్తున్నారు? ఉద్యోగుల చట్టబద్ధమైన హక్కులను ఎంతకాలం వాయిదా వేస్తారు? వేలాది కుటుంబాలను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టే ఈ నిర్ణయాలకు బాధ్యత ఎవరు వహిస్తారు? స్టీల్ప్లాంట్ను తామే కాపాడామని చెప్పుకుంటున్న అధికార పక్ష ప్రజాప్రతినిధులు ఇప్పుడు అయినా స్పందిస్తారా? ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ముందుకు వస్తారా? లేక ప్రకటనలకే పరిమితమవుతారా? అన్నది ఉక్కు కుటుంబాలు ఎదురు చూస్తున్న ప్రశ్న. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు తయారైంది విశాఖ ఉక్కు యాజమాన్యం తీరు. గత 16 నెలల్లో రూ.36,363 కోట్ల ఆదాయం ఆర్జించినా.. ఉక్కు కార్మికులకు మాత్రం ’జీతాల గండం’ తప్పడం లేదు. ఖజానాలో కోట్లాది రూపాయలు నిల్వ ఉన్నా.. ఉద్యోగుల జీతాలు, వీఆర్ఎస్ బకాయిలు, వితంతువుల పెన్షన్లు కలిపి రూ.590 కోట్లకు పైగా చెల్లింపులు పెండింగ్లోనే ఉన్నాయి. యాజమాన్యపు నిర్దయపై శ్రామికలోకం భగ్గుమంటోంది. -
నిధులు ఇలా కరుసైపోయి..
నర్సీపట్నం: గోతులు పూడ్చారు..పట్టుమని ఏడాదిన్నర తిరగకుండానే పూడ్చిన గుంతలు యథావిధంగా దర్శనమిస్తున్నాయి. చిన్న గొయ్యి కూడా ఉండడానికి వీల్లేదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ప్యాచ్ వర్కులు చేయించారు. జిల్లాలో పరిశీలిస్తే చేసిన పనులే చేస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. గుంతలను మట్టితో కప్పేస్తున్నారు. పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో ఫలితంగా ఎక్కడ చూసినా గుంతలే కనపడుతున్నాయి. జనం ప్రమాదాల బారిన పడుతున్నారు. రూ.కోట్లు ఖర్చు..ఫలితమిస్తే ఒట్టు జిల్లాలో రోడ్లు భవనాల శాఖ అధికారులు 14 సెక్షన్ల్లో గుంతలు పూడ్చే పనులు చేపట్టారు. నర్సీపట్నం, పాయకరావుపేట, కె.కోటపాడు, కె.డి.పేట, సబ్బవరం, పెదబొడ్డేపల్లి, పరవాడ, అచ్యుతాపురం, నక్కపల్లి, వి.మాడుగుల, దార్లపూడి, చోడవరం, అనకాపల్లి, యలమంచిలి సెక్షన్ల్లో రూ.8.80 కోట్లతో 119 వర్కులకుగాను 521.32 కిలోమీటర్లు పొడవునా గుంతలు పూడ్చారు. ఒక్క నర్సీపట్నం నియోజకవర్గంలో గుంతలను పూడ్చేందుకు రూ.2 కోట్లు వెచ్చించారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అవే గుంతలు దర్శనమిస్తున్నాయి. మట్టితో నింపేసి...ౖపైపెన తారు పూసి... నిబంధనల ప్రకారం గుంతల్లో మట్టి తొలగించి చుట్టూ కొంతభాగం తీసి నాణ్యమైన కంకర వేసి తారు వేసి రోలింగ్ చేయాల్సి ఉంది. కానీ మట్టితో నింపేసి ౖపైపెన తారు పూసి మమ అనిపించేస్తున్నారన్న విమర్శఽలున్నాయి. ఫైర్స్టేషన్ సమీపంలో నర్సీపట్నం నుంచి తుని వెళ్లే రహదారిపై గుంతలు ఏర్పడి కంకర తేలడంతో తారు పనులు చేశారు. కొన్ని నెలలకే తిరిగి యథాస్థితికి చేరుకుంది. నాణ్యత లోపాలు ఎత్తిచూపింది. ఈ గుంతల్లో వారం రోజుల క్రితం మెటల్ వేసి వదిలేశారు. దీంతో వర్షాలకు మరీ అధ్వానంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఫలితంగా జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బలిఘట్టం వై.జంక్షన్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గుంతలు మరింత అధ్వానంగా మారి ప్రమాదాలను తలపిస్తున్నాయి. -
నాణ్యతలో తేడావస్తే సహించేది లేదు..
మాడుగుల: ప్రభుత్వ నిర్దేశించిన ప్రకారం గర్భిణులు, పిల్లలకు పంపిణీ చేసే ఆహారంలో తేడా వస్తే సహించేది లేదని, రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు లక్ష్మీ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మాడుగులలో సివిల్ సప్లయ్ గొడౌన్ లో సరుకులు పరిశీలించి తూకంలో తేడాలు చూశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం తాటిపర్తి గిరిజన ఆశ్రమోన్నత బాలికల వసతి గృహంతో పాటు కస్తూర్బా గాంధీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం పరిశీలించారు. స్టాక్ వేసిన కూరగాయలు, పప్పులు, తదితర వస్తువులు పరిశీలించారు. భోజనం నాణ్యత బాగుండడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.వి.ఎల్.ఎం.మూర్తి, జిల్లా పౌరసరఫరాల అధికారి టి. వెంకటరమణ, పుడ్ సేఫ్టీ అధికారి బి.రవికుమార్ పాల్గొన్నారు. -
వాగులు ధ్వంసం చేసి రోడ్డు నిర్మించడం తగదు
తుమ్మపాల: క్వారీ లారీలు రాకపోకలు సాగించేందుకు గెడ్డలు, వాగులను ధ్వంసం చేసి, ప్రత్యేక నిధులతో రోడ్డు నిర్మించడం తగదని, వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ అనకాపల్లి మండలం చింతనిప్పుల అగ్రహారం ఎస్సీ కాలనీ వాసులు మంగళవారం రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమకు కనీసం సమాచారం ఇవ్వలేదని, ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయకుండా కాలనీకి ఆనుకుని లారీల రాకపోకల కోసం ప్రత్యేక రోడ్డు వేయడం దారుణమన్నారు. గ్రామానికి శివారున ఉన్న తమ కాలనీ ప్రజల బాగోగుల గురించి స్థానిక ఎమ్మెల్యే, అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ లారీలు మితిమీరిన వేగంతో రాకపోకలు సాగిస్తాయని, ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్పందించి సమస్య పరిష్కరించేవరకూ రోడ్డు పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోని భూలోకేశ్వరరావు, పాతపాటి బాబులు, బోని రాంబాబు, బచ్చలి శేఖర్, బచ్చలి గంగరాజు, మహిళలు, స్థానిక రైతులు పాల్గొన్నారు. దళితులు, రైతుల నిరసన -
ఎలక్ట్రికల్ కారు దగ్ధం
చోడవరం: మండలంలో శీమునాపల్లి గ్రామ సమీపంలో కోటపాడు రోడ్డులో మంగళవారం ఓ ఎలక్ట్రికల్ కారు దగ్ధమైంది. అంబేరుపురానికి చెందిన భక్తాంజనేయస్వీట్స్ యజమాని సత్యనారాయణ కుమారుడు కొండెంపూడి పూర్ణ సందీప్ తన స్నేహితుడు సతీష్తో కలిసి తన ఎలక్ట్రికల్ కారులో కె.కోటపాడు వెళుతుండగా శీమునాపల్లి సమీపంలోకి వచ్చేసరికి కారు వెనుక భాగం నుంచి పొగలు వచ్చాయి. దీంతో కారును రోడ్డు పక్కన నిలివేశారు. ఆ వెంటనే మంటలు వ్యాపించి, కారు దగ్ధమైంది. చోడవరం అగ్నిప్రమాక కేంద్రం సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు బాధితులను సహకారం అందజేశారు. -
గునిపూడిలో ఉద్రిక్తత
నక్కపల్లి: మండలంలో గునిపూడిలో సర్వే నంబరు24/10లో ఉన్న లక్ష్మీదేవి కొండభూమిలో సాగుదార్లను తొలగించి ట్రెంచ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధపడిన రెవెన్యూ అధికారులను సాగుదారులు అడ్డుకున్నారు. లక్ష్మిదేవికొండలో ఉన్న ప్రభుత్వ భూమిలో గ్రామానికి చెందిన సుమారు150 మంది సాగు చేసుకుంటున్నారు. ఈ లక్ష్మిదేవి కొండను కూటమి ప్రభుత్వం ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్ టౌన్షిప్కు కేటాయించేందుకు ప్రయత్నిస్తోంది. సాగుదార్లకు నష్టపరిహారం చెల్లించకుండా కొండ భూమిని స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ సాగుదారులు నాలుగు రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. భూముల వద్ద వంటావార్పు నిర్వహిస్తూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ ఆందోళన కొనసాగుతుండగా రెవెన్యూ అధికారులు కొండ చుట్టూ ట్రెంచ్ ఏర్పాటు చేసేందుకు సిద్ధపడ్డారు. దీన్ని సాగుదారులంతా వ్యతిరేకించారు. కొండ భూముల వద్ద నిరాహర దీక్షలు చేపట్టారు. వీరికి సీపీఎం నాయకులు ఎం.అప్పలరాజు సంఘీభావం ప్రకటించారు. ట్రెంచ్ ఏర్పాటు చేసేందుకు వచ్చిన తహసీల్దార్ చిన్నికృష్ణ, సీఐ మురళితో వాగ్వాదానికి దిగా రు. సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు ఇవ్వడానికి నిబంధనలు వర్తించవని చెబుతున్న అధికారులు, ఇదే భూములు టౌన్షిప్కు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. డీఫారం, జిరాయితీ రైతులకు చెల్లించిన విధంగానే సాగుదార్లకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో భూములు స్వాధీనానికి అంగీకరించే ప్రసక్తి లేదన్నారు. తహసీల్దార్, సీఐలు వెనుదిరిగారు. నాయకులు రాజేష్, సాగుదార్లు డి.కృష్ణ, అప్పారావు, గోవిందు పాల్గొన్నారు. -
● రామన్నపాలెంలో దుండగుల దుశ్చర్య ● పోలీసులకు ఫిర్యాదు చేసిన నాతవరం ఎంపీపీ లక్ష్మణమూర్తి
నాతవరం: దివంగత నేత వై.ఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేయడంతో నాతవరం ఎంపీపీ సాగిన లక్ష్మణమూర్తి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. మండలంలో సరుగుడు పంచాయతీ శివారు రామన్నపాలెం గ్రామంలో గిరిజనులు వైఎస్సార్పై ఉన్న అభిమానంతో సొంత ఖర్చుతో 2013లో విగ్రహం ఏర్పాటు చేసుకున్నారు. ఆనాటి నుంచి ఏటా వైఎస్సార్ జయంతి, వర్థంతి వేడుకలు గిరిజనులు జరుపుకొంటున్నారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహంతో పాటు దిమ్మను ధ్వంసం చేశారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు ఎంపీపీ లక్ష్మణమూర్తి రామన్నపాలెంలో దుండగులు ధ్వంసం చేసిన వైఎస్సార్ విగ్రహాన్ని మంగళవారం స్వయంగా పరిశీలించారు. జరిగిన విషయాన్ని మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనల మేరకు స్థానిక వైఎస్సార్సీపీ నేతలతో కలిసి ఎంపీపీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూటమి నేతల కనుసన్నల్లోనే విగ్రహ ధ్వంసం జరిగి ఉండొచ్చని ఎంపీపీ లక్ష్మణమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. స్పీకర్ అయన్నపాత్రుడు ప్రాతినిద్యం వహించే నియోజకవర్గంలో తమ ప్రియతమ దివంగత నేత వైఎస్సార్ విగ్రహం ధ్వంసం జరగడం బాధాకరమని ఎంపీపీ లక్ష్మణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు చేపట్టాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. దుండగులు ధ్వంసం చేసిన విగ్రహం చేతివేళ్లు -
అక్కడ వద్దంటే.. ఇక్కడ వాలారు
సాక్షి, అనకాపల్లి: రాంబిల్లి మండలంలో కూటమి నేతలు పవిత్రమైన పంచదార్ల కొండను అక్రమంగా తవ్వేయడాన్ని వైఎస్సార్సీపీ అడ్డుకోవడంతో ఇప్పుడు రాంబిల్లిలోని రాముల వారి కొండను తొలిచేయడం మొదలెట్టారు. దేవుడు కొలువై ఉన్న కొండను అక్రమంగా తవ్వేస్తున్న వైనాన్ని చిత్రీకరించేందుకు మంగళవారం కొండపైకి వెళ్లిన ‘సాక్షి’ టీవీ బృందంపై కూటమి నాయకులు, వారి గూండాలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. తాము తల్చుకుంటే ఏ కేసయినా పెడతామని, కారు యాక్సిడెంట్ కేసు కూడా పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఇటీవల రాంబిల్లి మండలంలో పవిత్ర పంచదార్ల కొండను చంద్రబాబు కూటమి నేతలు అక్రమ మైనింగ్ చేస్తూ ఇష్టారీతిని తవ్వేస్తుండటంతో వైఎస్సార్సీపీ అడ్డుకొంది. పంచదార్ల కొండను నోమైనింగ్ జోన్గా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఆందోళనలు చేయడంతో ప్రభుత్వం మైనింగ్ నిలిపివేసింది. దీంతో కూటమి నేతలు రాంబిల్లిలోనే ఉన్న రాములవారి కొండపై పడ్డారు. అక్కడ దేవుడు ఉన్నాడన్న విషయాన్ని, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (సీఆర్జెడ్) నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారీతిన తవ్వకాలు మొదలెట్టారు. ఈ విషయం తెలుసుకుని ‘సాక్షి’ టీవీ బృందం అక్కడకు వెళ్లి అక్రమ తవ్వకాలను చిత్రీకరిస్తుండగా కూటమి నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మైనింగ్ ప్రాంతంలోకి వెళ్లకుండా కూటమి నాయకులు మైలపల్లి నాగరాజు, చింతకాయల కాశిరావు, ఎరిపల్లి గోవిందకృష్ణ, మైలపల్లి పైడిరాజుతో పాటు మరో ఆరుగురు ‘సాక్షి’ బృందంపై దౌర్జన్యానికి దిగారు. మీరు వీడియోలు తీస్తే అక్రమ కేసులు పెడతామని, కారు యాక్సిడెంట్ కేసులు కూడా పెడతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ప్రభుత్వం మాది.. ఎటువంటి కేసయినా పెడతాం అంటూ బెదిరించినట్లు సాక్షి మీడియా బృందం తెలిపింది. సాక్షి టీవీ బృందంపై దౌర్జన్యం సమర్ధనీయం కాదు వైఎస్సార్సీపీ నేతలు గుడివాడ అమర్నాథ్, కె.కె.రాజు సాక్షి టీవీ బృందంపై దౌర్జన్యానికి పాల్పడడం అత్యంత దురదృష్టకరమని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. అక్రమ మైనింగ్ జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించడానికి వీల్లేదంటూ సాక్షి బృందాన్ని అడ్డుకోవడమే కాకుండా, వీడియో తీస్తే అక్రమ కేసులు పెడతామని బెదిరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని, ఏమాత్రం సమర్థనీయం కాదని అన్నారు. ప్రజాస్వామ్యంలో వార్తలను సేకరించి ప్రజలకు చేరవేసే హక్కు, స్వేచ్ఛ మీడియాకు ఉన్నాయని, మీడియాపై దాడులు, బెదిరింపులు, అడ్డంకులు సృష్టించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే సాక్షి బృందాన్ని అడ్డుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అక్రమ మైనింగ్పై సమగ్ర విచారణ జరిపి నిజాలను ప్రజల ముందుంచాలని వారు డిమాండ్ చేశారు. -
భోజనం కోసం విద్యార్థుల పాట్లు
డుంబ్రిగుడ: మండలంలోని దిగువ కొల్లాపుట్టు గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న గొల్లూరివలస గ్రామ విద్యార్థులు మధ్యాహ్న భోజనం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని గొల్లూరివలస నుంచి విద్యార్థులు పాఠశాలకు మధ్యాహ్న భోజనంతోపాటు పుస్తకాల బ్యాగులు, వాటర్ బాటిళ్లు, క్యారేజీలను మోసుకుంటూ కాలినడకన వెళ్లాల్సి వస్తోంది. గత రెండు రోజులుగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం అందకపోవడంతో విద్యార్థులు ఇళ్ల వద్ద భోజనం సిద్ధం చేసుకుని క్యారేజీల్లో తీసుకువెళ్తున్నారు. దీంతో పుస్తకాల బ్యాగులతోపాటు భోజనం, వాటర్ బాటిళ్లు మోసుకుంటూ సుమారు రెండు కిలోమీటర్లు నడిచి పాఠశాలకు చేరుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చుట్టుపక్కల గ్రామాల్లోని పాఠశాలలకు సెంటర్ పాయింట్గా ఉండటంతో ఈ పాఠశాలలో ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. అయితే గత రెండు రోజులుగా భోజనం అందకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పునరుద్ధరించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థులు ప్రతిరోజూ పుస్తకాల బ్యాగులు, క్యారేజీలు, వాటర్ బాటిళ్లు మోసుకుంటూ దూరం నడవాల్సిన పరిస్థితికి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
క్రీడల్లో విద్యార్థుల సత్తా
పెదబయలు: స్థానిక ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల విద్యార్థులు అరకులోయలో ఇటీవల నిర్వహించిన అమరావతి ఛాంపియన్షిప్ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీల్లో సత్తాచాటారని పీడీ పి.సురేష్కుమార్ తెలిపారు. కళాశాల నుంచి వివిధ క్రీడా విభాగాల్లో 24 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా.. 23 మంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ప్రిన్సిపాల్ పి.కేశవరావు తెలిపారు. విద్యార్థుల ప్రతిభపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. త్వరలో పాడేరులో నిర్వహించనున్న జిల్లా స్థాయి పోటీలకు ఇంతమంది విద్యార్థులు ఎంపిక కావడం పట్ల పాండు కరాటే అకాడమీ చీఫ్ ఇన్స్ట్రక్టర్, ఎగ్జామినర్ బాకూరు పాండురాజు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థులకు క్రమశిక్షణతో శిక్షణ అందిస్తూ వారి క్రీడా ప్రతిభను వెలికితీసిన పీడీ సురేష్కుమార్ను అభినందించారు. జిల్లా స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. -
భోగాపురంలో అస్మిత అండర్–15 జిల్లా బాలికల రగ్బీ పోటీలు
అచ్యుతాపురం రూరల్: రగ్బీ ఇండియా, ఆంధ్ర ప్రదేశ్ రగ్బీ అసోసియేషన్ సహకారంతో అనకాపల్లి జిల్లా రగ్బీ అసోషియేషన్ ఆధ్వర్యంలో అస్మిత అండర్–15 బాలికల జిల్లా అంతర్ పాఠశాల రగ్బీ పోటీలు ఈ నెల 10న భోగాపురం క్రీడా ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు రగ్బీ ఇండియా కోచ్ వెంకట్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2011 నుంచి 2014 మధ్య జన్మించిన విద్యార్థినులు ఈ పోటీల్లో పాల్గొనడానికి అర్హులని పేర్కొన్నారు. పాల్గొనే ప్రతి క్రీడాకారిణి తప్పనిసరిగా ఎన్ఎస్ఆర్ ఐడీ నమోదు చేసుకుని ఖేలో ఇండియా పోర్టల్లో రిజిష్ట్రేషన్ పూర్తి చేయాలని సూచించారు. -
‘మండలి’ జీవితం ఆదర్శనీయం
తుమ్మపాల: మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు జీవితం ఆదర్శనీయమని, తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు ఆయన చేసిన సేవలు అనన్యసామాన్యమైనవని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. మండలి వెంకట కృష్ణారావు జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో పీజీఆర్ సమావేశం మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 1977 లో దివిసీమ ఉప్పెన సమయంలో బాధితులకు ఆయన అందించిన పునరావాస సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. ప్రజా ప్రతినిధిగా, మంత్రిగా గ్రామీణాభివృద్ధికి, పేదల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాల నిగ్గుతేల్చాలి
నక్కపల్లి: ఈ ఏడాది కూటమి ప్రభుత్వం భర్తీ చేసిన డీఎస్సీలో పలు అక్రమాలు చోటు చేసుకున్నాయని దీనిపై సీబీఐతో విచారణ చేయించాలని మంగళవారం నక్కపల్లిలో జరిగిన టౌన్హాల్ సమావేశంలో పలువురు డిమాండ్ చేశారు. స్థానిక సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో పార్టీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ అధ్యక్షతన టౌన్హాల్(రౌండ్ టేబుల్) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నాలుగు మండలాలకు చెందిన విద్యార్థి, యువజన విభాగాల ప్రతినిధులు వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు హాజరయ్యారు. ముఖ్యఅతిథులుగా హాజరైన సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు, మాజీ ఎమ్మెల్సీ డి.వి. సూర్యనారాయణరాజు, పార్టీ కార్యదర్శి వీసం రామకృష్ణ, చిక్కాల రామారావు మాట్లాడుతూ డీఎస్సీలో పలు అక్రమాలు జరిగాయన్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వ పెద్దలు అమ్మేసుకున్నారని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, ఓట్ల కోసం మోసపూరిత వాగ్దానాలు ఇచ్చిందని విమర్శించారు. సూపర్సిక్స్ పథకాలు అటకెక్కించిందన్నారు. విద్యార్థులకు ఫీజురియింబర్స్మెంట్ ఇవ్వలేదని, నిరుద్యోగులకు ప్రతి నెలా రూ.3వేలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఒక్కరికి కూడా భృతి ఇవ్వలేదని, ఇలా అన్నివర్గాలను మోసం చేసారని అన్నారు. రెండేళ్లుగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తారని ఆశపడ్డ వారందరిని మోసం చేసారన్నారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా నిలవాలని పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు నిచ్చారన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యామంత్రి లోకేష్ రాజీనామా చేయాలని ఈ సమావేశంలోపాల్గొన్నవారంతా ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ అభ్యర్థులకు, నిరుద్యోగులకు, విద్యార్థులకు అండగా నిలవాలని అన్నారు. వారి తరపున వైఎస్సార్సీపీ చేసే పోరాటాన్ని విజయవంతం చేయాలన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలపై గత నెల 31న కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, 4వ తేదీన టౌన్ హాల్ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఈనెల6,7,8,9 తేదీల్లో పాయకరావుపేటలో మండలాలవారిగా నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. 10వ తేదీన బాధితులందరితో పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీ జరుగుతుందన్నారు. ప్రతి గ్రామం నుంచి నిరాహరదీక్షలకు, నిరసన కార్యక్రమానికి డీఎస్సీలో అన్యాయం జరిగిన అభ్యర్థులు, ఫీజు రియింబర్స్మెంట్ విడుదల కాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు, నిరుద్యోగులను తీసుకువచ్చి ఆందోళన విజయవంతం చేయాలన్నారు. ప్రతి కార్యకర్త భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు గొర్ల గోవిందు, మధువర్మ, గెడ్డమూరి శ్రీనివాసరావు, పైలా రమేష్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు గొర్ల నర్సింహమూర్తి, యువజన విబాగం నియోజకవర్గ అధ్యక్షుడు పోచిన నరేష్, విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు యలమంచిలి చందు, పార్టీ రాష్ట్రకార్యదర్శి దత్తుడు సీతబాబు, జెడ్పీటీసీలు, గోసల కాసులమ్మ, సిద్దాబత్తుల సత్తిబాబు, లంక సూరిబాబు, వైస్ఎంపీపీ వెలగా ఈశ్వరరావు, జిల్లాఅధికార ప్రతినిధి దగ్గుపల్లి సాయి, వాణిజ్య విభాగం అధ్యక్షుడు వై. సత్తిబాబు, యువజన విభాగం మండల అధ్యక్షుడు బచ్చలరాజు, పీఏసీస్ మాజీ అధ్యక్షుడు రాజేష్ఖన్నా, పొడగట్ల పాపారావు, రాష్ట్ర మహిళా కార్యదర్శి సుందరలత, రోజారాణి, పాల్గొన్నారు. -
‘తారకరామ’ నీరు విడుదల
మాడుగుల: మండలంలోని తాటిపర్తి వద్ద తారకరామ జలాశయం నుంచి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి మంగళవారం సాగునీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల జలాశయాల్లో నీరు తక్కువగా ఉందన్నారు. అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలన్నారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి సాగునీరు విడుదల చేశారు. ప్రతి నీటి బొట్టు రైతులకు అందజేయడానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల అప్పలరాజు, పెద్దేరు నీటి సంఘం చైర్మన్ అద్దేపల్లి జగ్గారవు, పుప్పాల లక్ష్మీనారాయణ, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు. -
కశింకోట పీఏసీఎస్కు పురస్కారం
కశింకోట: కశింకోట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 2025–26 సంవత్సరానికి ‘బెస్ట్ ఫెర్ఫార్మెన్స్’ పురస్కారం లభించింది. విజయవాడలో నిర్వహించిన ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకు 63వ ఫార్మేషన్ డే వేడుకల సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆప్కాబ్ చైర్మన్ గన్నె వీరాంజనేయులు, డీసీసీబీ చైర్ పర్సన్ కోన తాతారావు చేతుల మీదుగా సంఘ చైర్ పర్సన్ సిదిరెడ్డి శ్రీనివాసరావు, సీఈవో ద్వారపురెడ్డి నూకేశ్వరరావు పురస్కారాన్ని అందుకున్నారు. పురస్కారం రావడం జిల్లా సహకార రంగానికి గర్వ కారణంగా నిలిచిందని పలువురు అభినందనలు తెలిపారు. -
నర్సీపట్నంలో భారీ వర్షం
నర్సీపట్నం: పట్టణంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై వాతావరణం చల్లబడింది. అనంతరం వర్షం ప్రారంభమైంది. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో మెయిన్ రోడ్డుపై నీరు భారీగా ప్రవహించింది. అబిద్సెంటర్, ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి, బ్యాంక్ కాలనీకి వెళ్లే మెయిన్ రోడ్డు, శారదానగర్ మంగ్లీలాల్ స్వీట్స్టాల్, సత్యసాయి బాబా వీధి, శారదా నగర్ రెండవ లైన్ మెయిన్ రోడ్డు జలమయమయ్యాయి. మోకాళ్లలోతు నీటిలో ప్రజలు రాకపోకలు సాగించారు. శారదానగర్లో అంధకారం చిన్నపాటి వర్షం పడితే పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది. శారదనగర్లో నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం అలుముకుంది. ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. విద్యుత్ సిబ్బందికి వినియోగదారులు ఫోన్లు చేసినా స్పందించని పరిస్థితి నెలకొంది. -
మన్యం బంద్కు అనుమతి లేదు
పాడేరు డీఎస్పీ రాజా సింహారెడ్డిపాడేరు: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 8న మన్యం బంద్ నిర్వహించనున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, అయితే బంద్కు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేదని పాడేరు డీఎస్పీ రాజా సింహారెడ్డి తెలిపారు. బంద్ పేరుతో ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం పాడేరులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 8న కొన్ని సంఘాలు మన్యం బంద్కు పిలుపునిచ్చినట్లు సమాచారం అందిందన్నారు. ఈ నెల 5 నుంచి 21 వరకు టెట్ పరీక్షలు జరుగుతున్నందున జిల్లాలోని పలువురు అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు రాకపోకలు సాగించాల్సి ఉంటుందని తెలిపారు. పాఠశాలలు కూడా యథావిధిగా కొనసాగుతా యని పేర్కొన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడటం పోలీసుల బాధ్యత అన్నారు. బంద్ పేరుతో రహదారులను దిగ్బంధించడం, ప్రజలు, విద్యార్థుల రాకపోకలకు ఆటంకం కలిగించడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే సంబంధిత వ్యక్తులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం ఉద్యమకారులు లేవనెత్తుతున్న అంశాలపై గత నెలలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించి హైపవర్ కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదించారని తెలిపారు. ఆ కమిటీతో రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చర్యలు కొనసాగుతున్నాయని వివరించారు. జిల్లాలో శాంతియుత వాతావరణాన్ని కాపాడేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రజలంతా పోలీసులకు సహకరించాలని డీఎస్పీ కోరారు. -
హాస్టళ్లలో విద్యార్థుల భద్రతపై నిరంతర పర్యవేక్షణ
తుమ్మపాల: పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, హైస్కూల్ ప్లస్, ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉన్న ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, డేటా ఆధారంగా బడి బయట ఉన్న పిల్లలు, షెడ్యూల్డ్ కమ్యూనిటీ పిల్లల డేటాను పరిశీలించి అడ్మిషన్లు పెంచాలని కలెక్టర్ విజయకృష్ణన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరం నుంచి ఎంఈఓలు, విద్యాశాఖ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, హాస్టళ్లలో మంజూరైన సంఖ్యకు తగ్గట్టుగా విద్యార్థుల అడ్మిషన్లు ఉండాలని, అడ్మిషన్ల విషయంలో ఎలాంటి రాజీ లేదని అన్నారు. ఆరోగ్య తనిఖీలు తప్పనిసరి విద్యార్థులందరికీ మెడికల్ స్క్రీనింగ్ తప్పనిసరిగా జరగాలని సమీప పీహెచ్సీ డాక్టర్లతో మాట్లాడి, వారానికి కనీసం 1 నుంచి 2 రోజులు ఏఎన్ఎంల ద్వారా క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ఆర్వో వాటర్ ప్లాంట్ ఉన్నప్పటికీ నీటిని 100 శాతం బాగా మరిగించి, చల్లార్చిన తర్వాత మాత్రమే పిల్లలకు ఇవ్వాలని, వాటర్ టెస్టింగ్ కిట్ల ద్వారా నీటి నాణ్యతను పరీక్షించి, ఆ డేటాను సిస్టమ్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. వండిన ఆహారాన్ని ముందుగా నిర్వాహకులు, సిబ్బంది రుచి చూడాలని, మెనూలో అందించే కోడిగుడ్డు కచ్చితంగా 50 గ్రాములు ఉండాలని చెప్పారు. వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత నేర్పించాలని, బాలికలకు రుతుక్రమ పరిశుభ్రతపై కౌన్సెలింగ్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రతపై బాధ్యత సిబ్బందిదే.. డిపార్ట్మెంట్ అధికారులు, ముందస్తు అనుమతి ఉన్నవారు తప్ప ఇతర వ్యక్తులెవ్వరూ హాస్టళ్ల లోపలికి రావడానికి వీల్లేదని, విద్యార్థుల భద్రతకు సిబ్బందిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. గంజాయి, సిగరెట్లు, ఖైనీ, గుట్కా ఇతర అడిక్టివ్ పదార్థాలు హాస్టళ్లలోకి రాకుండా అరికట్టాలని, స్కూల్ కాంపౌండ్ వెలుపల దుకాణాల్లో పిల్లలకు ఏం విక్రయిస్తున్నారో గమనించాలని, వారు సహకరించకపోతే స్థానిక పోలీస్స్టేషన్కి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అప్పారావు నాయుడు, డ్వామా పీడీ, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాల్సిందే
మంత్రి లోకేష్ రాజీనామా చేయాలి దేవరాపల్లి: డీఎస్సీలో అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపి నిగ్గు తేల్చాలని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ బూడి ముత్యాలనాయుడు డిమాండ్ చేశారు. మండలంలోని తారువలో నియోజకవర్గ స్థాయి టౌన్ హాల్ సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ముందుగా మహానేత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి విగ్రహానికి వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ తదితర పార్టీ నాయకులతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ముత్యాలనాయుడు మాట్లాడుతూ డీఎస్సీలో జరిగిన భారీ కుంభకోణం వల్ల ఎందరో అర్హులకు అన్యాయం జరిగిందన్నారు. బాధితులంతా వైఎస్సార్సీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడిన్డి కలిసి, వారికి జరిగిన అన్యాయాన్ని వివరించడంతో వారి తరఫున పోరాటానికి పిలుపునిచ్చారన్నారు. మెగా డీఎస్సీలో దగా పడ్డ నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలిచి రాజీలేని పోరాటం సాగిస్తుందన్నారు. డీఎస్సీలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం ఉగ్రరూపం దాల్చి నిరుద్యోగ యువతీయువకుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కూటమి అవినీతి అక్రమాలు, ప్రజా సమస్యలపై గళమెత్తే వైఎస్సార్సీపీ నాయకులను అక్రమ అరెస్టులు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా కూటమి నాయకులకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. 6 నుంచి మాడుగులలో రిలే నిరాహార దీక్షలు నియోజకవర్గ కేంద్రం మాడుగులలో ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు బూడి తెలిపారు. 6న మాడుగుల మండలం, 7న చీడికాడ మండలం, 8న కె.కోటపాడు మండలం, 9న దేవరాపల్లి మండలానికి చెందిన డీఎస్సీ బాధితలతో పాటు నిరుద్యోగ యువతీయువకులు, పార్టీ నాయకులు ఈ దీక్షల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మహిళా విభాగం జోన్–1 వర్కింగ్ ప్రెసిడెంట్ ఈర్లె అనురాధ, దేవరాపల్లి జెడ్పీటీసీ కర్రి సత్యం, కె.కోటపాడు ఎంపీపీ రెడ్డి జగన్మోహన్, దేవరాపల్లి, చీడికాడ వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు బూరె బాబూరావు, గొల్లవిల్లి రాజుబాబు, సీడీసీ చైర్మన్ సుంకరి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీలు పంచాడ సింహాచలంనాయుడు, రొంగలి సూర్యనారాయణ, కొత్తపల్లి శ్రీనివాసరావు, మండల యువజన అధ్యక్షులు కర్రి సూరినాయుడు, గొర్రుపోటు వెంకటరావు, గొల్లవిల్లి స్వామినాయుడు, మాడుగుల పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, కురచా నారాయణమూర్తి, ఆదిరెడ్డి త్రినాథ స్వామి, వరదపురెడ్డి లలితానాయుడు, గూడెపు రాము, ఏటుకూరి రాజేష్, ఆకుల సాయి, రొంగలి వెంకటరావు, నాగిరెడ్డి శఠారినాయుడు, దాసరి సంతోష్కుమార్, రొంగలి నారాయణమ్మ, బండారు దేముడునాయుడు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి: డీఎస్సీ జరిగినలో అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక రింగ్రోడ్డు వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణుల రౌండ్టేబుల్ సమావేశం మంగళవారం పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా భరత్కుమార్ మాట్లాడుతూ డీఎస్సీలో అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడం అన్యాయమన్నారు. 6 నుంచి రిలే నిరాహార దీక్షలు డీఎస్సీలో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరపాలని, నిరుద్యోగ భృతి చెల్లించాలని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించాలన్న డిమాండ్లతో ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించనున్నట్టు భరత్కుమార్ చెప్పారు. 10వ తేదీన పట్టణంలో నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నిర్వహించనున్నట్టు చెప్పారు. సుంకరమెట్ట జంక్షన్ నుంచి రింగ్రోడ్డు, పెరుగబజారు, వేల్పులవీధి జంక్షన్, నెహ్రూచౌక్ మీదుగా రామచంద్ర థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈనెల 6న కశింకోట తహసీల్దార్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టనున్నట్టు చెప్పారు. మాజీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలతో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం తరువాత వాటిని విస్మరించిందని విమర్శించారు. డీఎస్సీలో అనేక అక్రమాలు జరిగాయన్నారు.అనకాపల్లి, పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు పి.సతీష్వర్మ, దంతులూరి దిలీప్కుమార్ మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని, గతంలోను నిరుద్యోగు భృతి నెలకు రూ.వెయ్యి అందజేస్తామని, సార్వత్రిక ఎన్నికలకు మూడు నెలల ముందు అమలు చేశారని చెప్పారు. వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలకు నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. పార్టీ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులపై రాష్ట్రంలో కొంత మంది టీడీపీ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు, వైస్ ఎంపీపీ అయితా రాము, కశింకోట జెడ్పీటీసీ దంతులూరి శ్రీధర్రాజు, నియోజకవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎ.వి.రత్నకుమారి, 80,84వార్డు ఇన్చార్జ్లు కె.ఎం.నాయుడు, కె.రాఘవ, పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్ రాజా, కశింకోట ఎంపీపీ కలగ లక్ష్మీ గున్నయ్యనాయుడు, వైఎస్సార్సీపీ అనకాపల్లి, కశింకోట మండల అధ్యక్షులు పెదిశెట్టి గోవింద్, మలసాల కిషోర్, మండల, పట్టణ అధ్యక్షులు కాండ్రేగులు హైమావతి, పద్మకుమారి, తగరంపూడి నూకరత్నం, వైద్యవిభాగం జిల్లా అధ్యక్షుడు దండా సిద్ధార్థ, జిల్లా నాయకులు మళ్ల బుల్లిబాబు, మర్రిపల్లి శోభ, నీటిపల్లి లక్ష్మీ, కుండల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్ విగ్రహం ధ్వంసం -
ఫణిగిరి కొండ తవ్వకాలపై కేసు నమోదు
సాక్షి, అనకాపల్లి: రాంబిల్లి మండలం పంచదార్ల ప్రాచీన శైవక్షేత్రం ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో ఫణిగిరి కొండ సర్వే నంబరు 1లో నిబంధనలకు విరుద్ధంగా లక్షల క్యూబిక్ మీటర్ల అక్రమ మైనింగ్కు సంబంధించి వైఎస్సార్సీపీ నేతల పోరాటంతో దిగివచ్చిన కూటమి ప్రభుత్వం స్థానిక ప్రజల నుంచి వెల్లువెత్తిన ప్రజాగ్రహాన్ని చల్లార్చడానికి దిగువస్థాయి అధికారులు, ఉద్యోగులపై చర్యలు తీసుకుని, అసలు సూత్రధారుల జోలికి మాత్రం వెళ్లడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫణిగిరి కొండ సర్వే నెంబరు 1లో లీజు నిబంధనలు ఉల్లంఘించి పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్కు పాల్పడినట్టు నిర్థారణ కావడంతో లీజుదారుడిపై మంగళవారం అనకాపల్లి గనులశాఖ ఏడీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంబిల్లి పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో లీజుదారుడి పేరు, ఏఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు? ప్రాథమికంగా గుర్తించిన నేరం వివరాలు మాత్రం వెల్లడించడానికి రాంబిల్లి సీఐ ససేమిరా అంటున్నారు. పలువురు మీడియా ప్రతినిధులు కేసు వివరాలు అడిగితే రాంబిల్లి సీఐ సీహెచ్ నర్శింగరావు దాటవేత ధోరణి ప్రదర్శించారు. అక్రమార్కులకు సీఐ అండదండలపై ఆరోపణలు గతంలో అక్రమ గ్రావెల్ తవ్వకాలను అడ్డుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, స్థానికులపై కేసులు నమోదు చేస్తామని అప్పట్లోనే రాంబిల్లి సీఐ నర్శింగరావు హెచ్చరించి, బెదిరించారన్న ఆరోపణలున్నాయి. విచ్చలవిడిగా నిబంధనలు తుంగలోకి తొక్కి భారీ అక్రమ మైనింగ్ చేసుకోవడానికి కూటమి పార్టీల నాయకులకు రెడ్ కార్పెట్ వేసి మరీ రాంబిల్లి సీఐ అక్రమార్కులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలందించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి ఫణిగిరి కొండ సర్వే నెంబరు 1లో స్థానిక ఎంపీ బినామీ పేరుతో 4.99 హెక్టార్లలో మైనింగ్ కోసం గనుల శాఖ నుంచి ఈ ఏడాది మే 15వ తేదీన లీజు విజయ్కుమార్ నాయుడు దాసమనేని పేరుతో అనుమతి పొందారు. లీజు అనుమతులన్నింటినీ ఉల్లంఘించి మరీ ఇష్టారాజ్యంగా లక్షల క్యూబిక్ మీటర్ల గ్రావెల్ తరలించుకుపోయినా రాంబిల్లి పోలీసులు ఏ రోజూ పట్టించుకున్న దాఖలాలు లేవు. అసలు వ్యక్తులను రక్షించే కుట్ర! అక్రమ మైనింగ్తో ఉమాధర్మలింగేశ్వర స్వామి ఆలయానికి పురాతన కాలం నుంచి వస్తున్న ఐదు పుణ్యధారల్లో ఒకటి ఆగిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఆందోళన చేశారు. అయినా కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో స్థానికుల సెంటిమెంటును గౌరవించిన వైఎస్సార్సీపీ నాయకులు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. శాసనమండలి విపక్ష నేత బొత్ససత్యనారాయణ, నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అక్రమ మైనింగ్ జరిగిన ప్రాంతాన్ని ప్రజలకు తెలిసేలా చేశారు. పెద్ద ఎత్తున మైనింగ్ అక్రమాలు జరగడంతో కూటమి సర్కారు కంటితుడుపు చర్యలకు ఉపక్రమించింది. లీజు దారుడిపై కేసు నమోదు చేశారు. లీజుదారుడు కూటమి ప్రజాప్రతినిధి బినామీ కావడంతో కేసు నమోదు చేసినా అతని పేరు కూడా వెల్లడించకపోవడం వెనుక అక్రమ మైనింగ్ వ్యవహారంలో అసలు వ్యక్తులను రక్షించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. -
ఫణిగిరి కొండపై ఆగని దందా
యలమంచిలి: రాంబిల్లి మండలం పంచదార్లలో ముక్కంటి కొలువైన ఫణిగిరి కొండపై అక్రమ తవ్వకాలు చేపడుతూ అక్రమ క్వారీకి పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ప్రశ్నించారు. సోమవారం ఆయన యలమంచిలిలో స్థానిక విలేకర్లతో మాట్లాడారు. పంచదార్ల ఫణిగిరి కొండపై సర్వే నెంబరు 1తో పాటు, 156/పీ సర్వే నంబరులో భారీ స్థాయిలో అక్రమ క్వారీని నిర్వహించారని ఆరోపించారు. కానీ సర్వే నంబర్ 1కు సంబంధించి మాత్రమే రాంబిల్లి తహసీల్దార్, అనకాపల్లి ఏడీ మైన్స్, స్థానిక వీఆర్వోపై చర్యలు తీసుకుని చేతులు దులిపేసుకున్నారని చెప్పారు. అక్రమ గ్రావెల్ తవ్వకాలకు సంబంధించిన ఫొటోలు, మ్యాపులను ఆయన చూపారు. సర్వే నంబరు 1 మాట అలా ఉంచితే సర్వే నం.156/పీ సంగతి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ అక్రమ క్వారీకి అనుమతులు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే 2025 జూలై 18వ తేదీన అనుమతులు ఇచ్చారన్నారు. హరిపురంలో అక్రమ క్వారీని నిలుపుదల చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించామని చెప్పారు. ఈ మేరకు స్థానికంగా వున్న ఉప్పులూరి నాయుడు, వెంకటాపురం మాజీ సర్పంచ్ తాతబ్బాయి, రాజు తదితరులు హైకోర్టులో పిల్దాఖలు చేసినట్టు చెప్పారు. దీనిపై సర్వే జరపకుండా ప్రభుత్వం కేవలం సర్వే నంబర్ 1కు సంబంధించి మాత్రమే జరిగిన అక్రమ క్వారీ, తవ్వకాలను పరిగణనలోనికి తీసుకుని దిగువ స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసిందన్నారు. 156 సర్వే నంబరులో జరిగిన అక్రమ క్వారీపై ఇంతవరకూ కనీస విచారణ కూడా జరపలేదని, దీని వెనుక వున్న కారణాలు అందరికీ తెలుసునన్నారు. ఈ వ్యవహారంలో రూ.వందల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. ఒకరిద్దరు బడా రాజకీయ నాయకుల అండదండలతో ఈ అక్రమ మైనింగ్ పరమేశ్వరుడు కొలువైన కొండపై జరగడం చాలా బాధాకరమన్నారు. కావాలనే అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి సర్వే నంబరు 156లో జరిగిన అక్రమ క్వారీపై విచారణ జరగకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించి అసలు సూత్రదారులను చట్టం ముందు నిలబెట్టి వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ కూడా అధికారపార్టీ నాయకులు, అక్రమ మైనింగ్ చేసే వారిని కాపాడుతూ చిరు ఉద్యోగులను బలిపశువులను చేయడం మంచిది కాదన్నారు. తక్షణమే పంచదార్లలో ప్రాచీన శైవక్షేత్రం సమీపంలో అక్రమంగా తరలించుకుపోయిన లక్షల క్యూబిక్ మీటర్ల సంగతి తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో రాంబిల్లి జెడ్పీటీసీ ధూళి నాగరాజు,ఎంపీపీ గొట్టుముక్కల శ్రీనుబాబు,వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. -
సాగునీరు
నాతవరం: బిటిష్ హయాంలో నిర్మించిన నిమ్మకట్టు ఆనకట్ట పరిధిలో పంట కాలువలో పూడికతీత పనులపై అధికారుల అవగాహన రాహిత్యం రైతుల పాలిట శాపంగా మారింది. క్షేత్ర స్థాయిలో నీటి సంఘాల అధ్యక్షులు, రైతులు చూపిన పనులకు ప్రాధాన్యం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోనే ఏకైక మేజరు ప్రాజెక్టు తాండవ రిజర్వాయరు నీరుపై ఆధారపడి రెండు జిల్లాల పరిధిలో ప్రతి ఏటా ఖరీఫ్ సీజన్లో 52 వేల ఎకరాలు వరి పంట సాగు చేస్తుంటారు. ప్రాజెక్టులో కాస్త నీటి నిల్వలు ఆశాజనకంగా ఉండడంతో ఆగస్టులో ఖరీఫ్ సాగుకు నీరు విడుదల చేసేందుకు ప్రాజెక్టు కమిటీ అధికారులు నిర్ణయించారు. తాండవ ప్రాజెక్టులో ఉన్న నీటిని ఆయకట్టుకు విడుదల చేస్తే కేవలం 70 రోజులు మాత్రమే ప్రవహిస్తుంది. మిగతా పంట కాలానికి నీటి కోసం వరుణుడిపై ఆధారపడాలి. నీటిని ఆయకట్టుకు విడుదల చేసే ముందు పంట కాలువలో పూడికతీత పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఆలా చేయకుండా నీరు విడుదల చేస్తే శివారు ఆయకట్టుకు నీరు అందని పరిస్థితి ఉంది. తాండవ ప్రాజెక్టు నిర్మాణం చేయక ముందు మండలంలో రాజుపేట అగ్రహారం గ్రామ సమీపంలో తాండవ నదిపై బ్రిటిష్ హయాంలో నిమ్మకట్టు ఆనకట్ట నిర్మించారు. ప్రస్తుతం ఈ ఆనకట్ట ప్రధాన కాలువలు పూడిక, పిచ్చిమొక్కలు పెరిగిపోయి కాలువలు కన్పించని విధంగా దర్శనమిస్తున్నాయి. ఆయా పంట కాలువలు అభివృద్ధి చేయకుండా తాండవ రిజర్వాయర్ నీటిని ఖరీఫ్ సాగుకు విడుదల చేస్తే నీరంతా వృథా అవుతుందని రైతులు చెబుతున్నారు. ఈ నెల 18న తాండవ రిజర్వాయరు దిగువన ఆయకట్టుకు నీటి విడుదల కోసం ఏర్పాటు చేసిన ప్రాజెక్టు కమిటీ రైతుల సమావేశంలో నిమ్మకట్టు ఆనకట్ట పరిధిలో కాలువలు అభివృద్ధి చేయాలని నీటి సంఘం అధ్యక్షుడు అప్పన దివాణం, ఈ ప్రాంత రైతులు అఽడిగారు. ఈ సమస్య చాలా కాలంగా వెంటాడుతుందని ఒక కిలోమీటరు మేర పూడిక పనులు చేపట్టాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇంతవరకూ ఎటువంటి పను లు చేపట్టలేదు. రెండు రోజుల క్రితం ఈ ఆనకట్ట పరిధిలో గల నాతవరం మండలం, కాకినాడ జిల్లా కోటనందూరు మండలాలకు చెందిన నీటి సంఘాల అధ్యక్షులు ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ కరక సత్యనారాయణ రైతులతో కలిసి కాలువలో పూడికను స్వయంగా ఇరిగేషన్ అధికారులకు చూపించారు. పంట కాలువల ద్వారా నాతవరం మండలంలో రాజుపేట అగ్రహారం, మన్యపురట్ల, లింగంపేట, కొత్త రామచంద్రపురం, వి.బి.ఆగ్రహారం, మాసయ్యపేట, బుచ్చెంపేట, వై.బి.అగ్రహారం, ఎం.బి.పట్నం, గన్నవరం, వై.బి.పట్నం, గన్నవరం మెట్ట, కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో అల్లి పూడి, కాకరాపల్లి , లక్ష్మిపురం, భీమవరపుకోట, ఎస్.ఆర్.పేట, అప్పలరాజుపేట, బిళ్లనందూరు, ఇండుగబిల్లి జగన్నాథపురం, కోటనందూరు గ్రామా ల పరిధిలో సుమారుగా 10వేల ఎకరాలకు సాగు నీరు అందాల్సి ఉంది. తాండవ ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేసినా నిమ్మకట్టు అనకట్ట కాలువలు అభివృద్ధి చేయకపోతే ఆయా గ్రామాల్లో పంట పొలాలకు సాగునీరు ప్రవహించదు. తాండవ ప్రాజెక్టు నీరు విడుదల చేసేలోగా పంట కాలువలు బాగు చేయాలని ఆయకట్టుదారులు డిమాండ్ చేస్తున్నారు. బ్రిటిష్ హయాంలో నిర్మించిన నిమ్మకట్టు ఆనకట్ట ఆనకట్టపై ఆధారపడి రెండు జిల్లాల్లో వేలాది ఎకరాల ఆయకట్టు కాలువల్లో పేరుకుపోయిన పూడిక, పెరిగిన తుప్పలు పూడికతీతపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం తాండవ నీరు విడుదల చేసినా వృథా కావడం తథ్యం శివారు భూములకు నీరందడం ప్రశ్నార్థకం -
మాతాశిశు సంక్షేమానికి అంగన్వాడీలు కీలకం
తుమ్మపాల: జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేసినట్టు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. ఎంపికై న అభ్యర్థులకు కలెక్టరేట్లో సోమవారం ఆమె నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నెల 20, 23న నిర్వహించిన ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక ప్రక్రియ పూర్తి చేశామన్నారు. అంగనన్వాడీ కార్యకర్తలు, సహాయకులు మొత్తం 170 మందికి నియామక పత్రాలు అందజేశామన్నారు. గ్రామీణ స్థాయిలో మాతాశిశు సంక్షేమానికి అంగన్వాడీ వ్యవస్థ అత్యంత కీలకమైనదని, ప్రభుత్వం అందించిన ఈ అవకాశాన్ని బాధ్యతాయుతంగా సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. మాతాశిశు సంక్షేమం, గర్భిణి అయినప్పటి నుంచి మాతృమూర్తులకు రక్తహీనత (అనీమియా) రాకుండా చూడడం, ఐదేళ్ల లోపు పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించడం అంగనన్వాడీల ప్రాథమిక బాధ్యత అన్నారు. సెంటర్లకు వచ్చే పిల్లలకు నాణ్యమైన ఆహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్యను అందించాలని తెలిపారు. ప్రభుత్వం అందించే మొబైల్ ఫోన్లలో సంబంధిత యాప్ల ద్వారా రోజువారీ హాజరు, బియ్యం/రేషన్ పంపిణీ, సంపూర్ణ పోషణ అమలు వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుంటూ పిల్లలు, గర్భిణులకు పోలియో, ధనుర్వాతం వంటి వ్యాధి నిరోధక టీకాలు సకాలంలో అందేలా కార్డ్ ఆధారిత రిజిస్ట్రేషన్, మానిటరింగ్ చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్, సీడీపీఓలు, ఇమ్యునైజేషన్ అధికారులు పాల్గొన్నారు. తల్లిపాల వారోత్సవాలపై పోస్టర్ విడుదల పుట్టిన వెంటనే తల్లిపాలను ప్రారంభించడం, తొలి ఆరు నెలల పాటు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వడం ద్వారా బిడ్డకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాధించినట్టేనని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆమె పోస్టర్ ఆవిష్కరణ చేశారు. జిల్లాలోని ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, సంబంధిత అధికారులు తల్లిపాల ప్రాముఖ్యతను ప్రతి తల్లి, కుటుంబానికి చేరవేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ అచ్చుతకుమారి, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డా. చంద్రశేఖర్ దేవ్, శిశు సంక్షేమ శాఖ పీడీ సూర్యలక్ష్మి, ఐసీడీఎస్ సీడీపీఓలు పాల్గొన్నారు. -
వినతుల పరిష్కారంపై అసంతృప్తి
తుమ్మపాల: వివిధ మండలాలు, గ్రామాల నుంచి తమ సమస్యలకు పరిష్కారం కోరుతూ సోమవారం కలెక్టరేట్కు వచ్చిన అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వ్యయప్రయాసలతో కలెక్టరేట్కు చేరుకున్న వీరికి కనీస సౌకర్యాలు లేకపోవడంతో గంటల తరబడి చెట్ల కిందే నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది. గేటు దగ్గర నుంచి ఏర్పాటు చేసిన క్యూలైన్ల కారణంగా సగం రోజంతా వేచి ఉండాల్సి వస్తోందని అర్జీదారులు వాపోతున్నారు. కలెక్టరేట్ ప్రధాన గేటు వద్ద నుంచే వినతుల విభాగానికి ఒక లైన్, అర్జీల ఆన్లైన్ నమోదు కోసం మరో లైన్, అనంతరం పీజీఆర్ఎస్ వేదిక వద్దకు వెళ్లేందుకు మరో రెండు లైన్లలో నిలబడాల్సి వస్తోంది. ఒక్క వినతిని సమర్పించేందుకు మూడు గంటల సమయం పడుతోందని, తీరా జిల్లా అధికారులు వద్దకు వెళ్లేసరికి అర్జీని తీసుకుని సంబంధిత శాఖ అధికారికి అందించి చేతులు దులుపుకుంటున్నారని అర్జీదారులు చెబుతున్నారు. జిల్లా స్థాయి అధికారుల ఎదుట తమ సమస్యలను వివరించినప్పటికీ, అనేక వినతులు పరిష్కారం కాకుండానే ముగుస్తున్నాయని, ఒకే సమస్యపై పలుమార్లు కలెక్టరేట్కు వచ్చినా క్షేత్రస్థాయి విచారణ లేకుండానే అర్జీలను ముగించడం పరిపాటిగా మారిందంటున్నారు. పునరావృత అర్జీలపై జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించి శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలని ప్రభుత్వాన్ని, జిల్లా యంత్రాంగాన్ని కోరుతున్నారు. టూరిజం, దేవాదాయ శాఖ అధికారుల కలెక్టర్ ఆగ్రహం అధికారులు వ్యక్తిగతంగా క్షేత్ర స్థాయిలో పర్యటించి అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ల కార్యక్రమంలో ఆమెతోపాటు జాయింట్ కలెక్టర్ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణరావు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల వినతులపై క్షేత్రస్థాయి పరిశీలన జరపకుండా, అర్జీలను పెండింగ్లో పెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. టూరిజం, దేవాదాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ పురోగతి లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సెర్ప్ అందించిన అర్జీల పరిష్కార వేగాన్ని పెంచి, అన్ని అర్జీలను వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ, ప్రజలను తిప్పించుకునే అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పీజీఆర్ఎస్– 170, రెవెన్యూ క్లినిక్– 145 అర్జీలు మొత్తం – 315 అర్జీలు నమోదయ్యాయి. -
దుకాణాల తొలగింపునకు ఆదేశాలు
రావికమతం: స్థానిక మండల పరిషత్ స్థలంలో రూ.కోట్లు విలువ చేసే స్థలంలో అనధికారకంగా ఏర్పాటు చేసిన దుకాణాలను ఆర్ఐ రమణబాబు సోమవారం పరిశీలించారు. ఇక్కడ 15 మంది అక్రమంగా షాపులు ఏర్పాటు చేయడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లుతుందని రావికమతం గ్రామానికి చెందిన గెంజి వెంకటరమణ గత సోమ వారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆర్ఐ పరిశీలించి మాట్లాడుతూ ఇక్కడ సర్వే నంబరు 103–2లో 15 మంది నిర్మించుకున్న దుకాణాలను తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. తొలగించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. వీఆర్వోలు నాగరాజు, శంకర్, వీఆర్ఏ లోవ పాల్గొన్నారు. -
డీఎస్సీ అక్రమాలపై నేడు టౌన్హాల్ సమావేశం
నక్కపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలు, నిరుద్యోగులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పార్టీ పిలుపు మేరకు మంగళవారం నక్కపల్లి లోటౌన్హాల్(రౌండ్ టేబుల్ )సమావేశం నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కంబాల జోగులు తెలిపారు. సుబ్బరామిరెడ్డి కల్యాణ మండపంలో మద్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్న ఈ సమావేశంలో కూటమిప్రభుత్వం ఈ ఏడాది నిర్వహించిన డీఎస్సీలో చాలా అక్రమాలు జరిగాయన్నారు. అర్హులైన నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. లక్షలాది రూపాయలు చేతులు మారాయన్నారు. అలాగే రెండేళ్ల నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ సక్రమంగా విడుదల చేయడం లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి చెల్లించలేదన్నారు. బీసీలకు యాభైఏళ్లకే పింఛను ఇస్తామని మోసం చేసారని ఆరోపించారు. వీటన్నింటిపై ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించడంతో పాటు, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి అమలు చేయించడానికి పార్టీ అఽధిష్టానం కార్యాచరణ రూపొందించిందన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వడం నియోజకవర్గ మండల స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఆందోళనలో చేపట్టాల్సిన కార్యక్రమాలను గురించి వివరించడం, చర్చించేందుకు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పదవులు పొందిన వారు, మండల పార్టీ అధ్యక్షులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, వివిధ అనుబంధ విభాగాల అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు పార్టీ బాధ్యులంతా పాల్గొనాలని ఆయన కోరారు. -
బస్సుల సంఖ్య పెంచాలని నిరసన
ఏపీఎస్ ఆర్టీసీని కాకుండా ప్రైవేట్ వ్యవస్థలకు విద్యుత్ బస్సులు ఇవ్వొద్దని, సీ్త్రశక్తి స్కీం వల్ల పెరిగిన మహిళ ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలని, ఖాళీలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీపీటీడీ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో (ఆర్టీసీ) ఉద్యోగులు కలెక్టరేట్ వద్ద నిరసన చేశారు. జేఏసీ ఉద్యమంలో 3వ విడత పిలుపులో భాగంగా ఉద్యోగుల సంతకాలతో కూడిన వినతిపత్రం కలెక్టర్కు అందించామని నాయకులు తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు తీసుకురావడం అన్యాయమన్నారు. వీటిపై ఉద్యోగులంతా పోరాటం చేస్తామన్నారు. జిల్లా జేఏసీ నాయకులు, అనకాపల్లి డిపో జేఏసీ నాయకులు, నర్సీపట్నం డిపో జేఏసీ నాయకులు పాల్గొన్నారు. -
తగ్గించిన జీతాలను పునరుద్ధరించాలి
కశింకోట: ఆర్ఈసీఎస్ పరిధిలో కన్సాలిడేటెడ్ పే వర్కర్స్గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల జీతాల నుంచి కోతలు విధించడం అన్యాయమని, తగ్గించిన జీతాలను తక్షణమే పునరుద్ధరణ చేయాలని ది అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సహకార సంస్థ ఒప్పంద ఉద్యోగుల సంఘం, సీఐటీయూ, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో స్థానిక గవరపాలెం ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఈ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా సంఘం అధ్యక్షుడు సిద్దా గోవిందరావు, ప్రధాన కార్యదర్శి దొడ్డి వెంకట నరసింహనాయుడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు వివి.శ్రీనివాసరావు, సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గనిశెట్టి సత్యనారాయణలు మాట్లాడుతూ ఆర్ఈసీఎస్ పరిధిలో 330 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారని, కన్సాలిడేటెడ్ పే వర్కర్స్గా విధులు నిర్వహిస్తున్న కార్మికుల జీతాల నుంచి ఎటువంటి పర్మిషన్ లేకుండా కోతలు విధించడం అన్యాయమన్నారు. సుమారుగా 30 నుంచి 35 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నామని, ఆర్ఈసీఎస్ను, ఏపీ ఈపీడీసీఎల్లో విలీనం చేసిన తరువాత ప్రభుత్వం కన్యాలిడేటెడ్ పే వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఆర్.దొరబాబు, సంఘం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. -
బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ ధర్నా
కె.కోటపాడు: గొండుపాలెంలో ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు రైతుల నుంచి బలవంతపు భూసేకరణ తగదని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న తెలిపారు. సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద గ్రామ రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కు కోసం రైతులకు రెవెన్యూ అధికారులు ఇచ్చిన నోటీసులను వెనక్కి తీసుకోవాలని కోరారు. 2013 భూసేకరణ చట్టాన్ని అనుసరించి ఎటువంటి గ్రామసభలను నిర్వహించకుండా ఎంఎస్ఎంఈ పార్కు కోసం భూసేకరణ చేపట్టడం అన్యాయమన్నారు. రైతుల మనోభావాలను గుర్తించి ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. సీపీఎం నాయకులు గండి నాయినిబాబు, ఈర్లె నాయుడుబాబు, రైతులు గంగన్నపాత్రుడు, నాగమణి, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో మీ అంకితభావం అందరికీ ఆదర్శం
తుమ్మపాల: రెవెన్యూ శాఖలో 36 ఏళ్ల పాటు నిబద్ధతతో పనిచేసి పదవీ విరమణ పొందిన సుబ్బలక్ష్మిని ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించి ఆమెను కలెక్టర్ సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎంతటి ఒత్తిడినైనా ప్రశాంతతతో స్వీకరిస్తూ వృత్తి బాధ్యతలు నిర్వర్తించి ఒక ‘రోల్ మోడల్‘ (ఆదర్శ అధికారి)గా నిలిచారని అభివర్ణించారు. జేసీ శౌర్యమాన్ పటేల్, డీఆర్వో వై.సత్యనారాయణ మాట్లాడుతూ సహోద్యోగులతో స్నేహపూర్వకంగా మెలుగుతూ, ప్రజా సమస్యల పరిష్కారంలో చూపిన అంకితభావం అందరికీ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పదవీ విరమణ పొందిన స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మి మాట్లాడుతూ తన కెరీర్లో ఎందరో సీనియర్ ఐఏఎస్ అధికారులతో పనిచేసే అవకాశం లభించిందని పేర్కొన్నారు. ఉద్యోగులు పాల్గొన్నారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ సుబ్బలక్ష్మికిఘనంగా వీడ్కోలు సత్కారం -
లేఅవుట్లో మట్టి తవ్వకాలపై ఆందోళన
అచ్చుతాపురం మండలం దొప్పెర్లలో ఎల్పీ నంబరు 38/2004, 4/2005 అన్ని అనుమతులతో ఏర్పాటు చేసిన లేఅవుట్లో కొనుగోలు చేసిన ప్లాట్ స్థలాల్లో మట్టి తవ్వకాలతో అక్రమ మైనింగ్ చేపడుతూ తమను భయాందోళనలకు గురిచేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్లాట్ల యాజమానులు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. అక్రమ తవ్వకాల నిలిపివేసి బాధ్యులపై చర్యలు కోరుతూ సాయిప్రియా కన్స్ట్రక్షన్స్ తరపున ఇప్పటికే తహసీల్దార్, పోలీలసుకు ఫిర్యాదులు చేశామన్నారు. అక్రమంగా తమ ప్లాట్లలోకి చొరబడి భారీగా మట్టి తవ్వకాలు జరుపుతూ క్రమంగా రవాణా చేస్తున్న ముఠాపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. కలెక్టర్ చొరవ తీసుకుని న్యాయం చేయాలని కోరారు.


