మల్లాంలో సర్వే అడ్డగింత
బుచ్చెయ్యపేట: మండలంలో గల మల్లాం గ్రామంలో భూ సర్వే పనులను గ్రామస్తులు అడ్డుకున్నారు. మండల శివారు పంచాయతీ మల్లాం, ఆర్. భీమవరం, అప్పంపాలెం, ఆర్.శివరాంపురం, ఎంబీ పాలెం గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. గతంలో కూడా సెజ్కు భూములు అప్పగించడానికి అధికారులు చూడగా పై గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో అధికారులు సర్వే పనులు ఆపేశారు. మళ్లీ సెజ్కు పై గ్రామాలకు చెందిన భూములను అప్పగించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం 15 మంది సర్వేయర్లు, వీఆర్వోలు, ఇతర సిబ్బంది మల్లాం గ్రామంలో భూములను సర్వే చేయడానికి వెళ్లగా గ్రామస్తులు సర్వే అధికారులను అడ్డుకున్నారు. మా భూములను ఎందుకు సర్వే చేస్తున్నారు.. మాకు కంపెనీలు వద్దు.. మాకు కూడు పెడుతున్న భూములను మీకు ఇవ్వబోమంటూ నేలపై కూర్చొని ఆందోళనకు దిగారు. గ్రామస్తులు నేలపై కూర్చొని అధికారులను సర్వే చేయకుండా అడ్డుకున్నారు. నిరుపేదలమైన మమ్మల్ని అధికారులు చిన్న చూపు చూస్తున్నారని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా మా భూములను బలవతంగా తీసుకోవాలని చూస్తే ఉద్యమిస్తామని పలు గ్రామాల సర్పంచ్లు, నాయకులు మండి పడ్డారు. అధికారులూ...మాకు అన్యాయం చేయొద్దు అంటూ నినాదాలు చేశారు.
గ్రామస్తులు సర్వే పనులను అడ్డుకున్నట్టు తహసీల్దార్ లక్ష్మికి రెవెన్యూ సిబ్బంది తెలిపారు. గురువారం గ్రామంలో గ్రామసభ పెట్టి రైతుల అమోదం తీసుకుంటామని తహసీల్దార్ లక్ష్మి గ్రామ నాయకులకు ఫోన్ ద్వారా తెలిపారు. దీంతో సర్వే సిబ్బంది వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు బర్ల శివ,అమ్మునాయుడు, నమ్మి నీరజ అప్పలరాజు, రాము పాల్గొన్నారు.


