breaking news
Anakapalle District News
-
మర్యాదపూర్వక కలయిక
మునగపాక/అనకాపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్, వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ సభ్యురాలు, మాజీ ఎంపీ బి.వి.సత్యవతి, విష్ణుమూర్తి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జగన్మోహన్రెడ్డిని వేర్వేరుగా కలిశారు. అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని వారికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. -
స్టీల్ప్లాంట్ టౌన్షిప్కు భూములివ్వం
నక్కపల్లి: మండలంలో ఏర్పాటు చేయనున్న ఆర్సిలర్మిట్టల్ నిప్పల్ స్టీల్ప్లాంట్ టౌన్షిప్ కోసం అదనంగా భూములు ఇచ్చే ప్రసక్తి లేదని రైతులు స్పష్టం చేశారు. నెల్లిపూడి, వేంపాడు, డీఎల్ పురం గ్రామాలకు చెందిన పలువురు రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా చేశారు. ఈ ధర్నాకు వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు తదితరులు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా నాయకులు, రైతులు మాట్లాడుతూ ఇప్పటికే మిట్టల్స్టీల్ప్లాంట్ కోసం ప్రభుత్వం 2020 ఎకరాలు భూములు కేటాయించిందన్నారు. వేంపాడు వద్ద టౌన్షిప్ ఏర్పాటు చేసేందుకు 400 ఎకరాలు, స్టీల్ప్లాంట్ కోసం అదనంగా మరో 2800 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం జీవో నంబరు76 జారీ చేసిందన్నారు. నెల్లిపూడి, వేంపాడు, డీఎల్పురం తదితర గ్రామాల పరిధిలో భూములు సేకరించేందుకు సన్నాహాలు చేస్తోందని చెప్పారు. ఎట్టిపరిస్థితుల్లో భూములు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. పంటలు పండే వేలాది ఎకరాలను బలవంతంగా తీసుకుని కార్పొరేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే భూములు ఇచ్చిన రైతులకు పూర్తి న్యాయంజరగలేదన్నారు. నష్టపరిహారంతోపాటు, ఆర్ అండ్ ఆర్ప్యాకేజీ చెల్లించేందుకు ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా అదనంగా మరో 2,800 ఎకరాలు సేకరించడం అన్యాయమన్నారు. వ్యవసాయాన్ని పూర్తిగా నామరూపాల్లేకుండా చేయడమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని ఆరోపించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకుని, భూసేకరణ ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం వారు తహసీల్దార్ నర్సింహమూర్తికి వినతి పత్రం అందజేశారు.ఈఆందోళనలో వైఎస్సార్సీపీ మండలశాఖ అధ్యక్షుడు శీరం నర్సింహమూర్తి, రైతు నాయకులు అయినంపూడి మణిరాజు, లొడగల చంద్రరావు, మోహన్రావు, గింజాల వెంకటరమణ, సురేష్ రాజు, గొర్ల బాబూరావు, అవతారం రాజు తదితరులు పాల్గొన్నారు. -
విశాఖ చేరుకున్న మహిళా క్రికెటర్లు
గోపాలపట్నం(విశాఖ): భారత్, శ్రీలంక మహిళా క్రికెట్ జట్లు బుధవారం విశాఖపట్నం చేరుకున్నాయి. ఈ నెల 21, 23 తేదీల్లో ఇక్కడ జరగనున్న టీ–20 మ్యాచ్ల్లో పాల్గొనేందుకు ఇరుజట్ల క్రీడాకారిణులు నగరానికి విచ్చేశారు. వీరికి విశాఖ విమానాశ్రయంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. ఈ మ్యాచ్లు పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్నాయి. విమానాశ్రయం నుంచి ఆటగాళ్లు రోడ్డు మార్గంలో తమకు కేటాయించిన హోటళ్లకు చేరుకున్నారు. -
లిక్విడ్ గంజాయితో వ్యక్తి అరెస్ట్
నర్సీపట్నం: లిక్విడ్ గంజాయిని తరలిస్తున్న కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రేవతమ్మ ఆదేశాల మేరకు బుధవారం నెల్లిమెట్ట వద్ద పోలీసులు వాహనాలు తనిఖీలు చేశారు. చింతపల్లి వైపు నుంచి వస్తున్న ప్రైవేటు వాహనాన్ని తనిఖీ చేయగా లిక్విడ్ గంజాయి బయటపడింది. గంజాయిని కేరళకు తరలిస్తున్న సహాయల్(28)ను అరెస్టు చేసినట్టు ఎస్ఐ రాజారావు తెలిపారు. సహాయల్ గంజాయి సేవించడంతో పాటు అక్కడ తాగే వారికి అమ్ముతున్నట్టు విచారణలో తేలిందని తెలిపారు. అతని వద్ద నుంచి కేజీ లిక్విడ్ గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్ఐ చెప్పారు. -
జగనన్న జన్మదినం రోజున మెగా రక్తదాన శిబిరం
మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ నర్సీపట్నం: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 21న నర్సీపట్నంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్టు మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలిపారు. స్థానిక పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరానికి సంబంధించిన వాల్పోస్టర్లను పార్టీ నాయకులతో కలిసి బుధవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా 15 ఏళ్లుగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, విద్యార్థులు హాజరై రక్తదానం చేయాలని ఆయన కోరారు. మండలాల పరిధిలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్టేట్ కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, మున్సిపల్ వైస్చైర్మన్లు కోనేటి రామకృష్ణ, తమరాన అప్పలనాయుడు, పార్టీ టౌన్ అధ్యక్షులు ఏకా శివ, ఎంపీపీలు సుర్ల రాజేశ్వరి, మణికుమారి, సర్వేశ్వరరావు, పార్టీ మండల అధ్యక్షులు శానపతి వెంకటరత్నం, రమణ, నాగేశ్వరరావు, ఫాణిశాంతరామ్, జెడ్పీటీసీ సుర్ల గిరిబాబు, పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లోచల సుజాత తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలో ధాన్యం కొనుగోలుకు 65 కేంద్రాలు
నాతవరం: జిల్లాలో ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు 65 కేంద్రాలు ఏర్పాటు చేశామని సివిల్ సప్లయి జిల్లా మేనేజరు జయంతి అన్నారు. ఆమె బుధవారం నాతవరంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది జిల్లాలో రైతులు ఖరీఫ్ సీజన్లో పండించిన ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని, 5లక్షలు గోనె సంచులు సిద్ధంగా ఉన్నాయన్నారు. రైతులు కల్లాల వద్ద కొనుగోలు కేంద్రాలు వద్ద ధాన్యం తరలించేందుకు జిల్లా వ్యాప్తంగా 400 ట్రాక్టర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం తరలించేందుకు 25 రైస్ మిల్లులకు అనుమతులు ఇచ్చామన్నారు. వాటిలో నాతవరం మండలంలోనే మూడు రైస్ మిల్లులు ఉన్నాయన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఇంతవరకు 4,500 టన్నులు కొనుగోలు చేశామన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోగా డబ్బులు రైతులు బ్యాంకు అకౌంట్లులో జమ చేస్తామన్నారు. -
జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్కు 6 నమూనాలు
యలమంచిలి రూరల్ : స్థానిక కొత్తపేట జెడ్పీ హైస్కూల్లో బుధవారం నిర్వహించిన మండలస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో ఆరు నమూనాలను జిల్లా స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్టు ఎంఈవో సూర్యప్రకాష్ తెలిపారు. 11 ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు 41 నమూనాలను ప్రదర్శించారు. వారిలో కొక్కిరాపల్లి సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల విద్యార్థినులు పి.లిఖిత, ఎం.గౌతమి ప్రదర్శించిన ఆరోగ్యం, పరిశుభ్రత, యలమంచిలి తులసీనగర్ జెడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని జి.మేఘవర్షిణి ప్రదర్శించిన గణిత పార్కు, సోమలింగపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థి బి.గణేష్ ప్రదర్శించిన అభివృద్ధి చెందిన సాంకేతికతలు థీమ్, యలమంచిలి పట్టణం రైల్వేస్టేషన్ రోడ్డు పాఠశాల విద్యార్థులు బి.రాజ్కిరణ్, సీహెచ్.మహేంద్ర రూపొందించిన మురుగునీటి సక్రమ నిర్వహణ నమూనా,పెదపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎ.అపర్ణ హరితశక్తి నమూనా,ఇదే పాఠశాల విద్యార్థి ని పి.దీప్తి ప్రదర్శించిన నీటి సంరక్షణ,నిర్వహణ నమూనాలను న్యాయనిర్ణేతలు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్కు ఎంపిక చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను,వారికి గైడ్ టీచర్లుగా వ్యవహరించిన ఉపాధ్యాయులను ఎంఈవో సూర్యప్రకాష్, ప్రధానోపాధ్యాయుడు వై.వి.రమణ అభినందించారు.అంతకుముందు ఉదయం సైన్స్ ఫెయిర్ను ఎంపీపీ రాజాన శేషు ప్రారంభించారు. పోటీలను సీఆర్పీలు కిషోర్కుమార్,రత్నం పర్యవేక్షించారు. -
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం : సంక్రాంతి పండగ వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆయా మార్గాల్లో వయా దువ్వాడ మీదుగా పలు స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె.పవన్కుమార్ తెలిపారు. ● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07288) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 9, 11వ తేదీల్లో రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07289) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 10, 12వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07290) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 10, 12, 16, 18వ తేదీల్లో రాత్రి 7గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07291) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 11, 13, 17, 19వ తేదీల్లో మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● సికింద్రాబాద్–శ్రీకాకుళం రోడ్(07292) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 17వ తేదీన రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07293) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 18న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదే రోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ● వికారాబాద్–శ్రీకాకుళం రోడ్(07294) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 13న సాయంత్రం 5.15 గంటలకు వికారాబాద్లో బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.03 గంటలకు దువ్వాడకు, మధ్యాహ్నం 12.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం రోడ్–సికింద్రాబాద్(07295) స్పెషల్ ఎక్స్ప్రెస్ జనవరి 14న మధ్యాహ్నం 3.30 గంటలకు శ్రీకాకుళం రోడ్లో బయల్దేరి అదేరోజు రాత్రి 6.03 గంటలకు దువ్వాడకు, మరుసటిరోజు ఉదయం 8.10గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
నెలరోజులైనా...
కమిటీ ఏర్పడి నెలరోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు మత్స్యకారులకు సీఎం అపాయింట్మెంట్ ఇప్పించలేదు. కమిటీ ఏర్పాటు, సీఎంతో చర్చలపేరుతో ఉద్యమాన్ని నీరుగార్చారన్న ప్రచారం జరుగుతోంది. సీఎం వద్ద తీసుకెళ్తానన్న హోంమంత్రి ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదని కొంత మంది మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాల్లో భాగంగానే కమిటీలు, చర్చలంటూ మభ్యపెట్టారని ఆరోపిస్తున్నారు. డిసెంబరు నెలాఖరులోగా ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఉద్యమ బాటపడతామని, తాడోపేడో తేల్చుకుంటామని గంగపుత్రులు చెబుతున్నారు. -
కేసులు పెట్టినా ఆగే ప్రసక్తే లేదు
చంద్రబాబునాయుడు దగ్గరకు తీసుకెళ్తాం అంటేనే దీక్ష విరమణకు ఒప్పుకున్నాం. నెలరోజులు అవుతోంది. ఎవరూ ఏమీ మాట్లాడ లేదు. పోరాటం ఆపేస్తాం అనుకుంటున్నారేమో, కేసులు పెట్టినా, అరెస్టుచేసిన ఆగే సమస్యలేదు. ఇక్కడ బల్క్డ్రగ్పార్క్కట్టడానికి కుదరదంతే. చంద్రబాబుకు ఇదే విషయం చెప్తాం. మాప్రాణాలు తీసే కంపెనీలు మాకొ ద్దు. భూములు తీసుకునేటప్పుడు ఇలాంటి కంపెనీలు పెడతామని చెప్పలేదు. నక్కపల్లిలో మీటింగ్లో కూడా ఇదే చెప్పేం. పట్టించుకోకుండా పనులు చేస్తున్నారు కాబట్టే ఆందోళన చేస్తున్నాం. ఈ నెలాఖరు లోగా చంద్రబాబు దగ్గరకు తీసుకెళ్లాలి. లేకపోతే మా ఊరోళ్లమంతా మీటింగ్పెట్టుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం. –రాజేశ్వరి,మహిళ, రాజయ్యపేట -
విలవిల!
వంచెన వలలో ● హోం మంత్రి హామీ నమ్మి దీక్ష విరమించిన మత్స్యకారులు ● మళ్లీ ఉద్యమానికిసై అంటున్న గంగపుత్రులు వంచన వలలో చర్చల పేరుతో ఉద్యమానికి కళ్లెం నెలారోజులైనా దొరకని సీఎం అపాయింట్మెంట్ నక్కపల్లి: నక్కపల్లి మండలం రాజయ్యపేట సమీపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బల్క్డ్రగ్పార్క్ను వ్యతిరేకిస్తూ మత్స్యకారులు చేస్తున్న ఉద్యమంపై ప్రభుత్వం చర్చలపేరుతో నీళ్లు జల్లింది. సీఎం వద్దకు తీసుకెళ్లి మీకు న్యాయం చేస్తామంటూ హోం మంత్రి హామీ ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేస్తున్నారంటూ మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. రాజయ్యపేట, బోయపాడు, అమలాపురం, చందనాడ, బుచ్చిరాజుపేట తదితర గ్రామాల పరిధిలో 1800 ఎకరాల్లో ప్రభుత్వం బల్క్ డ్రగ్పార్క్ ఏర్పాటు చేయబోతోంది. ఇప్పటికే ఏర్పాటైన రసాయన పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యంతో సుమారు 30 మంది క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ పార్క్ ఏర్పాటు చేస్తే వందల సంఖ్యలో రసాయన పరిశ్రమలు ఏర్పాటవుతాయని, ఈప్రాంతమంతా కాలుష్యకాసారంగా మారి , తమ మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ రాజయ్యపేట మత్స్యకారులు నిరాహారదీక్ష చేపట్టారు. పోలీసులు ఆటంకాలు సృష్టించినా.. శాంతియుతంగా గ్రామంలో నిరాహారదీక్ష చేస్తే ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేసింది. టెంట్లు, మైక్సెట్లు ఏర్పాటు చేయకుండా ఆంక్షలు విధించింది. అయినప్పటికీ మత్స్యకారులు మండుటెండలో ఇసుక తిన్నెలపై నిరాహారదీక్ష ప్రారంభించారు. ప్రభుత్వం పట్టించుకోకుండా పనులు యథావిధిగా చేపట్టడంతో ఆగ్రహించిన గంగపుత్రులు...పార్క్ పనులు అడ్డుకుని రోడ్డుపై రాకపోకలు నిలిపి వేశారు. హోంమంత్రి వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడంతో మంత్రి గ్రామంలోకి వచ్చి జరిపిన చర్చలు విఫలమయ్యాయి. గ్రామస్తులంతా మంత్రి కాన్వాయ్ను అడ్డగించి ఘోరావ్ చేశారు. తదుపరి నిరాహారదీక్షను నూకతాత ఆలయం వద్దకు మార్చి కొనసాగించారు. అయినప్పటికీ ప్రభుత్వంలో చలనం రాలేదు. వందలాది మంది పోలీసులు గ్రామంలో మోహరించి, రాజయ్యపేట వెళ్లే దారులన్నింటి వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. మత్స్యకారులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చేవారిని గృహనిర్బంధం చేయడం వంటి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఆగ్రహించి గంగపుత్రులు జాతీ యరహదారిని ముట్టడించి ఐదు గంటల పాటు రాకపోకలు స్తంభింపజేశారు. ప్రభుత్వం దిగివచ్చి కలెక్టర్ను చర్చలకు పంపిస్తామని హామీ ఇచ్చి జాతీయరహదారి ముట్టడి కార్యక్రమం నుంచి ఆందోళన కారులను పంపించి వేసింది. తర్వాత 10 రోజులకు కలెక్టర్ విజయ్కృష్ణన్ గ్రామంలోకి వచ్చి మత్స్యకారులతో చర్చలు జరిపారు. మత్స్యకారులంతా ముక్తకంఠంతో బల్క్డ్రగ్పార్క్ను రద్దు చేయాల్సిందేనని పట్టుబట్టారు. ఈవ్యవహారం తన పరిధిలో లేదని మీ డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చేతులేత్తేశారు. మత్స్యకారులు యథావిధిగా ఆందోళన కొనసాగించారు. మత్స్యకారులకు అండగా వైఎస్ జగన్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డిని మత్స్యకారులంతా కలసి బల్క్డ్రగ్పార్క్కు వ్యతిరేకంగా చేస్తున్న ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై జగన్ మాట్లాడుతూ మత్స్యకారులకు అండగా ఉంటామని ప్రకటించారు. జగన్ ఆదేశాల మేరుకు శాసన మండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో సుమారు 50 మంది సీనియర్ నేతలు మత్స్యకారులకు మద్దతుగా రాజయ్యపేట వచ్చి సంఘీభావం ప్రకటించారు. చర్చలపై ప్రకటన చేయాలి 61 మందితో కమిటీ మంత్రి కాన్వాయ్ని అడ్డుకోవడం, జాతీయ రహదారిని ముట్టడించడం వంటి ఆందోళనలకు సంబంధించి పోలీసులు మత్స్యకారులపై పలుసెక్షన్లతో కూడిన కేసులు నమోదు చేశా రు. గ్రామాన్ని అష్టదిగ్బంధనం చేశారు. మత్స్యకారులు వెనుకడుగు వేయలేదు. ఈలోగా కొంత మంది మత్స్యకారులు ప్రజాదర్బార్లో హోంమంత్రిని కలిసి రాజయ్యపేట బల్క్డ్రగ్ సమస్యపరిష్కరించాలని కోరారు. కమిటీగా ఏర్పడి వస్తే తాను ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లి పరిష్కరిస్తానని, మీకు న్యాయం జరగకపోతే మీ ఆందోళన మీరు కొనసాగించుకోవచ్చని ఆమె ప్రకటించారు.ఉద్యమానికి మద్దతు ఇస్తున్న వైఎస్సార్సీసీ నేతలు వీసం రామకృష్ణ తదితరులు సహితం సీఎంతో చర్చలు జరపడం మంచిదే, నాయ్యం జరగకపోతే ఆందోళన కొనసాగిద్దాం అని సూచించడంతో అప్పటికే రెండునెలలుగా వేటమానుకుని ఉపాధి లేకుండా పస్తులతో నిరాహార దీక్ష చేస్తున్న మత్స్యకారులంతా మంత్రి ప్రకటనపై గౌరవంతో 61 మందితో కమిటీగా ఏర్పాటై ఈ జాబితాను ఆర్డీవో ద్వారా హోంమంత్రికి, కలెక్ట్కు అందజేశారు. చంద్రబాబునాయుడు వద్దకు తీసుకెళ్తామంటేనే దీక్షను తాత్కాలికంగా విరమించాం. కమిటీ వేసి నెలరోజులు అవుతోంది. ఎవరూ ఏం మాట్లాడటంలేదు. గ్రామంలో మత్స్యకారులు ఒప్పు కోవడం లేదు. మళ్లీ ధర్నా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదేవిషయాన్ని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లాం. విశాఖలో చంద్రబాబునాయుడిని కలిసే ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఎంతవరకు నిలబెట్టుకుంటారో చూస్తాం. అధికారులు కూడా ఎటువంటి ప్రకటన చేయకపోవడం తగదు. ప్రభుత్వంతో చర్చల విషయంపై ఏదో ఒక ప్రకటన చేయాలి. –గోసల కాసులమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు,మత్య్సకార నాయకురాలు, రాజయ్యపేట -
మాడుగులలో సైకో వీరంగం
మాడుగుల: మాడుగుల పట్టణంలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. బుధవారం సాయంత్రం ముగ్గురిపై దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి సైకోను పట్టుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై గ్రామస్తులతో పాటు ఎస్ఐ నారాయణరావు అందించిన వివరాలు... స్థానిక రాజవీధికి చెందిన నారాయణమ్మ.. సున్నం పనికి వెళ్తుండగా వెనక నుంచి దాడి చేయడంతో కుడిచేయి విరిగిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించారు. కొండబాబు అనే వ్యక్తిని కర్రతో తలపై కోట్టడంతో తీవ్రంగా గాయపడి, స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అడ్డుకోడానికి వెళ్లిన గ్రామానికి చెందిన కోడా వెంకటేశ్వరులుపై సైకో దాడిచేయడంతో కాలుపై గాయమైంది. ఈ వ్యక్తిని విశాఖ మానసిక చికిత్సాలయానికి తరలిస్తామని ఎస్ఐ తెలిపారు. -
హమ్మయ్యా.. సక్సేనా గండం గడిచింది
సాక్షి, విశాఖపట్నం: గత రెండు నెలలుగా విశాఖ స్టీల్ప్లాంట్ ఉద్యోగుల్లో నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇన్చార్జి సీఎండీ ఎ.కె.సక్సేనా పదవీకాలం ముగియడంతో, ఆయన స్థానంలో సెయిల్ డైరెక్టర్ను నియమిస్తూ కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం స్టీల్ప్లాంట్ ఉద్యోగులు, సిబ్బంది తలపై పాలుపోసినంత పని చేసింది. సక్సేనా పాలన.. ఆవేదన గత ఏడాది సెప్టెంబర్లో స్టీల్ప్లాంట్ ఉత్పత్తి సంక్షోభంలో ఉన్న సమయంలో.. అప్పటి సీఎండీ అతుల్ భట్ను సెలవుపై పంపి.. మోయిల్ ఎండీగా ఉన్న ఎ.కె.సక్సేనాకు స్టీల్ప్లాంట్ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే, సక్సేనా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన పాలన ఉద్యోగులకు ఒక పీడకలలా మారిందన్న విమర్శలు బలంగా ఉన్నాయి. ఆయన తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు ఉద్యోగులను, కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. దేశంలో మరే పరిశ్రమలోనూ లేని విధంగా, కేవలం ఉత్పత్తి ఆధారంగానే జీతాలు చెల్లిస్తామంటూ సక్సేనా జారీ చేసిన చట్టవిరుద్ధమైన ఉత్తర్వులు కార్మిక లోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘనత ఆయనకే దక్కుతుందని కార్మిక సంఘాలు తీవ్రంగా ఆరోపిస్తున్నాయి. ఉద్యోగులకు అందాల్సిన హెచ్ఆర్ఏను పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు క్వార్టర్ల విద్యుత్ చార్జీలను యూనిట్కు రూ.1.50 నుంచి ఏకంగా రూ. 8కి పెంచేసి, వేతన సవరణ లేక ఇబ్బంది పడుతున్న ఉద్యోగుల నడ్డి విరిచారు. జీతాలను నెలలో ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి కల్పించారు. ఇచ్చే అరకొర జీతాన్ని కూడా 50శాతం, 60శాతం, 75శాతం అంటూ విడతల వారీగా చెల్లిస్తూ ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేశారు. మరోవైపు ప్రభుత్వ విధానామా? లేక నిర్దేశమా? ఏదైనా పొదుపు, సంస్కరణల సాకుతో సుమారు 5 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారు. వీఆర్ఎస్ పేరుతో 1500 మందిని ఇంటికి పంపారు. భయంగుప్పిట్లో అధికారులు చిన్నపాటి మానవ, సాంకేతిక తప్పిదాలకు కూడా ఉన్నతాధికారులను సస్పెండ్ చేయడం, బదిలీ చేయడం వంటి చర్యలతో ప్లాంట్లో భయానక వాతావరణం సృష్టించారు. ఇవన్నీ నిత్యకృత్యంగా మారడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోననే భయాందోళనలు అధికారుల్లో నెలకొన్నాయి. ఈ ఒత్తిడి తట్టుకోలేక పలువురు ఉన్నతాధికారులు రాజీనామాలు చేశారు. మరోవైపు, కార్మిక సంఘాల హక్కులను హరిస్తూ, ఆందోళనలు, ధర్నాలపై ఆంక్షలు విధించి ఉక్కుపాదం మోపారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలా ఆయన స్టీల్ప్లాంట్లో నియంతగా వ్యవహరించారనే విమర్శలు వినిపించాయి. స్టీల్ప్లాంట్లో సక్సేనా పాలనలో బాధపడని ఉద్యోగి లేరంటే అతిశయోక్తి కాదు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎప్పుడు వెళ్లిపోతారా అని ఉద్యోగులు ఎదురుచూపులు చూడటం మొదలు పెట్టారు. సక్సేనాకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ మద్దతు ఉందన్న ప్రచారంతో, ఆయనకే మళ్లీ ఎక్స్టెన్షన్ లభిస్తుందేమోనని రెండు నెలలుగా ఆందోళన చెందారు. ఈ పరిస్థితుల్లో సెయిల్ డైరెక్టర్ను కొత్త ఇన్చార్జి సీఎండీగా నియమించడంతో ఉద్యోగుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాలన గాడిలో పడుతుందని, తమ కష్టాలు తీరుతాయని కార్మికులు ఆశిస్తున్నారు. -
రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు ఎంపిక
అచ్యుతాపురం రూరల్/కశింకోట: రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు అచ్యుతాపురం, కశింకోట మండలాలకు చెందిన పలువురు విద్యార్థులు ఎంపికయ్యారు. అచ్యుతాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఈ పోటీలకు ఎంపికై నట్టు ఫిజికల్ డైరెక్టర్ దాడి శ్యాంప్రసాద్ బుధవారం తెలిపారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకూ ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి జూనియర్ ఖోఖో పోటీల్లో వీరు పాల్గొంటారన్నారు. బాలుర విభాగంలో బొట్టా సాయి, పొలంరాశెట్టి తన్వేంద్ర, చొప్ప కిరణ్, వాసుపల్లి కిరణ్, జి.ఎల్.ఎన్. స్వామి, బాలికల విభాగంలో కొత్తపల్లి సంధ్య పాల్గోనున్నారు. ఎంపికై న విద్యార్థులను హెచ్ఎం పద్మావతి, చైర్మెన్ శెట్టి తాతారావు, వ్యాయామ ఉపాధ్యాయిని డి.పవిత్ర, సూర్యకళ తదితరులు అభినందించారు. ● కశింకోట సెయింట్ జాన్స్ స్కూలుకి చెందిన ముగ్గురు విద్యార్థులు ఈ పోటీలకు ఎంపికయ్యారు. జూనియర్ బాలుర విభాగంలో కె. సామ్యూల్ దయానంద్, బాలికల విభాగంలో టి. జైశ్రీ ఎంపికయ్యారని కరస్పాండెంట్ బత్తుల అనూరాధ, ప్రిన్సిపాల్ రూపనంది తెలిపారు. ● మండలంలోని ఏఎస్ పేట హై స్కూల్ కి చెందిన అంబటి లాస్య రాష్ట్రస్థాయి ఖో–ఖో పోటీలకు ఎంపికై ంది. ప్రధానోపాధ్యాయుడు లంక శ్రీనివాసరావు,వ్యాయామ ఉపాధ్యాయుడు జయ బాబు తదితరులు ఆమెను అభినందించారు. -
యుద్ధప్రాతిపదికన జీవీఎంసీ పనులు పూర్తి చేయాలి
అనకాపల్లి: స్వర్ణాంధ్ర–స్వచ్ఛంద్ర మూడో శనివారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించేదుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనకాపల్లి పర్యటన ఉందని, పర్యటనను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరుగుతుందని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ అన్నారు. బుధవారం అనకాపల్లి జోన్ పరిధిలో ఎన్టీఆర్ బెల్లం మార్కెట్, వై జంక్షన్, ఎన్టీఆర్ ఆస్పత్రిని పరిశీలించారు. జిల్లాలో ముఖ్యమంత్రి స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసే అవకాశాలు ఉన్నందున జీవీఎంసీ తరపున చేపడుతున్న పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.వై జంక్షన్ వద్ద హెలిప్యాడ్ ప్రాంతాన్ని పరిశీలించి అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగిందన్నారు. డ్రైనేజీలో పూడికలు, భవన నిర్మాణ వ్యర్థాలు రహదారులపై లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం ఎన్టీఆర్ ఆస్పత్రిలో వివిధ విభాగాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్, డీఎస్పీ ఎం.శ్రావణి, ఆర్డీవో షేక్అయిషా, సీఐలు ప్రేమ్ కుమార్, వెంకటనారాయణ, ఆశోక్కుమార్, డీసీ హెచ్ఎస్ శ్రీనివాసరావు, ఎన్టీఆర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ కృష్ణారావు, జోనల్ కమిషనర్ చక్రవర్తి పాల్గొన్నారు. కశింకోట: మండలంలోని తాళ్లపాలెంకు ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు రానున్నట్టు సమాచారం. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పంచాయతీ వద్ద ఉన్న సంపద కేంద్రాన్ని పరిశీలించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే పర్యటన అధికారికంగా ఖరారు కావలసి ఉంది. కమిషనర్ కేతన్గార్గ్ -
పీఎం సూర్యఘర్తో తగ్గనున్న విద్యుత్ భారం
రావికమతం: ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గిస్తుందని ఏపీఈపీడీసీఎల్ జిల్లా ఎస్ఈ జి.ప్రసాద్ తెలిపారు. రావికమతం,టి.అర్జాపురం, కొత్తకోటల్లో బుధ వారం సీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సదస్సుల్లో ఆయ న మాట్లాడుతూ ప్రస్తుతం విద్యుత్ వినియోగం పెరుగుతున్న తరుణంలో ఈ పథకం వినియోగదారులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పా రు. జిల్లాలో ఇప్పటి వరకు 3,500 మందికి ఈ పథకం అమలు చేసినట్టు తెలిపారు. రావికమ తం మండలానికి సంబంధించి ఇప్పటి వరకు 60 మంది ఈ పథకాన్ని వినియోగించుకుంటున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆర్డీఎస్ఎస్ పథకంతో వ్యవసాయరంగానికి 9 గంటల ఉచిత విద్యుత్ అమలుచేస్తున్నామని ఆయన తెలిపారు. సూర్యఘర్ పథకంపై అవగాహన సదస్సులునిర్వహిస్తున్నట్టు చెప్పారు. డీఈ సురేష్కుమార్, ఏఈ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
సిరులతల్లి సన్నిధిలో నేడు సహస్రఘటాభిషేకం
హోం మంత్రి అనిత,అధికారులు ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో దీక్షను తాత్కాలికంగా విరమించాం. 61 మందితో కమిటీ ఏర్పాటు చేసి జాబితా ఆర్డీవోకు అందజేసి నెలరోజులవుతున్నా పట్టించుకోలేదు. ఈనెల 21వ తేదీ వరకు వేచి చూస్తాం. అప్పటిలోగా సీఎం వద్దకు తీసుకెళ్లకపోతే మళ్లీ ఉద్యమం మొదలుపెడతాం. ఇదే విషయాన్ని తహసీల్దార్కు, పోలీసులకు తెలియజేశాం. ఈ నెల 21వతేదీన రాతపూర్వకంగా తెలియజేసి దీక్ష మళ్లీ ప్రారంబింభిస్తాం –ఎరిపల్లి నాగేశు, మత్స్యకారనాయకుడు, రాజయ్యపేట21వ తేదీ వరకూ వేచి చూస్తాం -
పనిచేయని నాయకులకు అభివృద్ధి నిధులివ్వం
స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడునాతవరం: గ్రామాల్లో పని చేయని నాయకులకు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయనని స్పీకరు చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. మండల కేంద్రంలో బుధవారం అంగన్వాడీ కార్యకర్తలకు 5జీ సెల్ఫోన్లు అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు, నాతవరం నుంచి తాండవ రిజర్వాయరుకు వెళ్లే రోడ్డుకు రూ.3.50 కోట్లు మంజూరు చేశానన్నారు. ఈ నిధులతో టెండర్ల ప్రక్రియ పూర్తయిందని వచ్చే నెలలో పనులు ప్రారంభిస్తామన్నారు. నియోజకవర్గంలో లింకు రోడ్ల అభివృద్ధికి రూ.24 కోట్లు మంజూరు చేసానన్నారు. మండలంలో పలు గ్రామాల్లో వీధుల్లో సిమెంట్ రోడ్లకు రూ.5.50 కోట్లు మంజూరు చేశానన్నారు. గత ఏడాది మండలంలో అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు మంజూరు చేస్తే వాటిలో 14 గ్రామాల్లో మా నాయకులు రూ.కోటి 60 లక్షలకు పైగా నిధులతో ఇంత వరకు పనులు చేయలేదన్నారు. ఆయా గ్రామాల్లో నాయకులకు అభివృద్ధి పనులకు ఈఏడాది నిధులు ఇచ్చేదిలేదన్నారు. -
అప్పన్న భూముల పందేరం
సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి.. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం. ఆ స్వామి పేరిట ఉన్న వేల ఎకరాల భూములు దశాబ్దాలుగా వివాదాల సుడిగుండంలో ఉన్నాయి. పేదవాడి సొంతింటి కలకు, ఆలయ ఆస్తుల రక్షణకు మధ్య పోరాటం సాగుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న పంచగ్రామాల భూ సమస్యను పరిష్కారిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు విలువైన స్వామి భూములను కార్పొరేట్ సంస్థలకు, ఇతర అవసరాలకు ‘పందేరం’ చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ముడసర్లోవ పార్కుకు సమీపంలో.. సెంట్రల్ జైలు పక్కన సర్వే నంబర్ 275లో ఉన్న సుమారు 150 ఎకరాల దేవస్థానం భూమిలను గూగుల్ సంస్థకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గజం దేవస్థానం భూమి కూడా పరాయిపాలు చేయకూడదన్న నిబంధనలను అతిక్రమించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడంపై విశ్వహిందూ పరిషత్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ‘రాష్ట్ర అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదు, కానీ దేవుడి భూములను ధారాదత్తం చేయడం చట్టవిరుద్ధం’ అని వీహెచ్పీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పంచగ్రామాల కథ.. అంతులేని వ్యధ భీమిలి నియోజకవర్గం పరిధిలోని అడవివరం, పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని వేపగుంట, పురుషోత్తపురం, చీమలాపల్లి, విశాఖ పశ్చిమ నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామాలను కలిపి పంచగ్రామాలుగా పిలుస్తారు. దశాబ్దాలుగా ఈ గ్రామాల్లో భూ సమస్య కొనసాగుతోంది. 1901 నాటి గిల్మెన్ రికార్డుల ప్రకారం సింహాచలం దేవస్థానానికి పై గ్రామాల్లో మొత్తం 9,069 ఎకరాల భూమి ఉంది. ఇందులో అడవివరం పరిధిలోనే అత్యధిక భూములు ఉన్నాయి(గతంలో హైకోర్టు 275 సర్వే నంబర్లోని గ్రీన్బెల్ట్గా ప్రకటించిన 5 వేల ఎకరాలతో కలిపి). మిగిలిన సుమారు 1,800 ఎకరాల జిరాయితీ భూములే వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. 1996 వరకు ఈ భూములపై ఎటువంటి వివాదం లేదు. తర్వాత ఈ భూములపై రెవెన్యూ విభాగానికి, సింహాచలం దేవస్థానానికి మధ్య యాజమాన్య వివాదం తలెత్తింది. ఈ నేపథ్యంలో 1996లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో.. పెందుర్తి, చినగదిలి ఎంఆర్వోలు ఈ భూములపై సర్వహక్కులను సింహాచలం దేవస్థానానికి అప్పగిస్తూ రైత్వారీ పట్టాలు జారీ చేశారు. అప్పటివరకు ఆయా స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నవారు, వ్యవసాయం చేసుకుంటున్న రైతులు, ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు ఆ భూములను తమ సొంత ఆస్తిగానే భావించారు. అయితే, దేవస్థానం పేరుతో పట్టా రావడంతో, అక్కడి నివాసితులను దేవస్థానం యంత్రాంగం ఆక్రమణదారులుగా పేర్కొనడం ప్రారంభించింది. దీంతో సమస్య జటిలమైంది. ప్రస్తుత అంచనాల ప్రకారం సుమారు 12 వేల మందికి పైగా ఈ భూముల్లో నివసిస్తున్నారు. మొత్తం 419 ఎకరాల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు గుర్తించారు. ఏళ్లు గడుస్తున్నా ఈ పంచగ్రామాల భూ సమస్య కొలిక్కి రావడం లేదు. ప్రస్తుతం ఈ వివాదంపై జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వివిధ న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. జీవోను తక్షణం రద్దు చేయాలి మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు. కానీ అభివృద్ధి పేరుతో ఆలయ భూములను పందేరం చేయడం సరికాదు. గూగుల్ సంస్థకు కేటాయించిన జీవోను వెంటనే రద్దు చేయాలి. లేని పక్షంలో హైందవ సమాజం తరపున పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. – ఆచార్య కందర్ప విశ్వనాథ్, అధ్యక్షుడు, వీహెచ్పీ విశాఖ మహానగఇచ్చిన భూమి వెనక్కి.? దాదాపు 30 ఏళ్ల కిందట సెంట్రల్ జైలు నిర్మాణం కోసం అడవివరంలో 106 ఎకరాల దేవస్థానం భూమిని ప్రభుత్వం తీసుకుంది. దానికి బదులుగా మధురవాడ పరిధిలోని సర్వే నంబర్ 420, 424లో అంతే స్థలాన్ని దేవస్థానానికి కేటాయించింది. అయితే, తాజాగా ఆ ప్రత్యామ్నాయ భూమిని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవాలయ ఆస్తులను కాపాడండి హిందూ దేవదాయ ధర్మదాయ చట్టం ప్రకారం దేవాలయ భూములను ఇతర అవసరాలకు వాడటం నిషిద్ధం. ఆలయ ఆస్తులు కేవలం ఆలయ అభివృద్ధికే వాడాలని వివిధ రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలతో పాటు దేశ సర్వోన్నత న్యాయస్థానం పలుమార్లు స్పష్టం చేసింది. ఒకవేళ ప్రజా ప్రయోజనాల కోసం భూమిని సేకరిస్తే, దానికి సమానమైన విలువ గల భూమిని ఇస్తామని, దేవాలయ ఆస్తులకు నష్టం కలగకుండా చూస్తామని ప్రభుత్వం కోర్టులకు హామీ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఆ తీర్పులను ప్రభుత్వం తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా అప్పన్న భూములను కట్టబెడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆలయ భూములను/ఆస్తులను ప్రభుత్వంతో సహా ఇతరులెవ్వరూ, అన్యాక్రాతం చేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని గతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హైందవ శంఖారావంలో కూడా తీర్మానం చేశారు. దశాబ్దాలుగా నలుగుతున్న పంచగ్రామాల భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి.. స్వామి ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. -
గర్భిణులకు సకాలంలోవైద్య సేవలు అందించాలి
జిల్లా పరిషత్ సీ్త్రశిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ అనురాధ కె.కోటపాడు: కె.కోటపాడు సీహెచ్సీలో గర్భిణులతో పాటు రోగులకు సకాలంలో మెరుగైన వైద్యం అందేలా వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ సీ్త్రశిశు సంక్షేమశాఖ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఈర్లె అనురాధ తెలిపారు. ఆమె బుధవారం ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలోనే గర్భిణులకు ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. కె.కోటపాడు, దేవరాపల్లి, వేపాడ, చీడికాడ మండలాల నుంచి పెద్ద సంఖ్యలో కె.కోటపాడు సీహెచ్సీకి వైద్యం కోసం వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందించి అందరి మన్ననలు సిబ్బందిని కోరారు. -
కార్పొరేట్ కంపెనీలకు పాలకులు దాసోహం
● దోపిడీ విధానాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలి ● రైతు కూలీ సంఘం నిరసన ర్యాలీ అనకాపల్లి : కార్పొరేట్ కంపెనీలకు పాలకులు దాసోహమయ్యారని రైతు కూలీ సంఘం ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు సింహాద్రి ఝాన్సీ ఆరోపించారు. స్థానిక విజయరామరాజుపేట రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి న్యూకాలనీ వరకూ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం న్యూకాలనీ రోటరీ హాల్లో సంఘం జిల్లా కార్యదర్శి కోన మోహన్రావు ఆధ్వర్యంలో జిల్లా స్థాయి విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు, కార్మికులను, పీడిత ప్రజలను దోపిడీ చేసే విధానాలను వేగవంతం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. దానిలో భాగంగానే పచ్చని పంట పొలాలను కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నాయన్నారు. జిల్లాలో దశాబ్దల కాలం పాటు రైతులకు, కార్మికులకు ఉపాధి ని చూపించిన వ్యవసాయాధారిత సుగర్ ఫ్యాక్టరీలను మూసేశారని, గూగుల్ డేటా సెంటర్, బల్క్ డ్రగ్ పార్కులు, ఫార్మా సిటీలు, హైడ్రో పవర్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల పేరుతో ప్రజల భూములను లాక్కుంటున్నారని దుయ్యబట్టారు. ప్రజలంతా ఐక్యంగా పోరాడినప్పుడే పాలకుల దోపిడీ విధానాలను అరికట్టవచ్చని పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతూ ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు చట్టసభల్లో రైతులకు, కార్మికులకు సామాన్య ప్రజలకు వ్యతి రేకమైన చట్టాలకు మద్దతు తెలుపుతున్నారని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ చట్టానికి పని దినాలను తగ్గిస్తున్నారని, రైతు వ్యతిరేకమైన వ్యవసాయ చట్టాలను తీసుకొస్తున్నారని, కార్మిక హక్కులను దెబ్బతీసే నాలు గు లేబర్ కోడ్లు తీసుకొచ్చారని, ఈ విధానాలపై సంఘటితంగా పోరాడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పిళ్లా హర శ్రీనివాసరావు, కార్మిక నగారా పత్రిక ఎడిటర్ ఆడారి అప్పారావు, ఏఐఎఫ్ టీయూ(న్యూ) జిల్లా నాయకుడు అప్పలనాయుడు, నవ యువ సమాఖ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్. భాస్కరరావు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పైలి రమేష్, రైతులు పాల్గొన్నారు. -
వాహనదారులసహనానికి ‘పరీక్ష’
సాక్షి, అనకాపల్లి : మూడు జిల్లాల నుంచి వచ్చే సరకు రవాణా వాహనదారులు సామర్థ్య పరీక్షలు (ఫిట్నెస్ సర్టిఫికెట్)కు కోసం బారులు తీరుతున్నారు. మూడు జిల్లాలకు అనకాపల్లి జిల్లాలో సబ్బవరం మండలం దేవీపురంలో ఉన్న ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)లోనే సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాలు అంతటికీ ఒకే ఒక్క కేంద్రం ఉండడంతో వాహనాల ఫిట్నెస్ పరీక్షలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. సబ్బవరం మండలం దేవీపురం వద్ద వున్న ఈ కేంద్రానికి సమీపంలో నిత్యం పదుల సంఖ్యలో వాహనాలు బారులుతీరి కనిపిస్తున్నాయి. ఫిట్నెస్ సర్టిఫికెట్ (ఎఫ్సీ) కోసం యజమానులు/ డ్రైవర్లు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తున్నది. ఆటోలు, లారీలు, బస్సులు, వ్యాన్లు వంటి వాహనాలను కొనుగోలు చేసిన ఎనిమిది సంవత్సరాల లోపు అయితే రెండేళ్లకు ఒకసారి, ఎనిమిదేళ్లు దాటితే ఏటా ఒకసారి ఫిట్నెస్ టెస్టింగ్ చేయించుకోవాలి. సరకు రవాణా వాహనాలతో పాటు ప్రయాణికులను తీసుకెళ్లే వివిధ రకాల వాహనాలు, విద్యా సంస్థలకు చెందిన బస్సులు, వ్యాన్లకు నిర్ణీత కాలంలో సామర్థ్య పరీక్షలు (ఫిట్నెస్ సర్టిఫికెట్) తప్పనిసరిగా నిర్వహించాలి. సర్వర్ మొరాయింపుతో నిరీక్షణ ఏడాదిన్నర క్రితం వరకు వాహనాల ఎఫ్సీ (ఫిట్నెస్ సర్టిఫికెట్)లు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ జారీ చేసేవారు. దీనివల్ల వాహనదారులకు ఎంతో సౌలభ్యంగా ఉండేది. అయితే కేంద్ర ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం గత ఏడాది ఏప్రిల్ నుంచి ఫిట్నెస్ టెస్టింగ్ను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించింది. జిల్లాకు ఒకటి చొప్పున ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)లను ఏర్పాటు చేశారు. అనకాపల్లి– ఆనందపురం జాతీయ రహదారిపై సబ్బవరం శివారు దేవీ పురం టోల్ ప్లాజాకు సమీపంలో ఏటీఎస్ ఉంది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఏటీఎస్లను ఏర్పాటు చేయకపోవడంతో ఈ రెండు జిల్లాల వాహనాలకు కూడా సబ్బవరం మండలంలోని ఏటీఎస్లో ఎఫ్సీ జారీ చేస్తున్నారు. వాహనాల ఫిట్నెస్ టెస్టింగ్ కోసం ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. దీంతో ఉమ్మడి విశాఖపట్నంతోపాటు సరకు లోడింగ్/అన్లోడింగ్ నిమిత్తం విశాఖ నగరానికి వచ్చే ఇతర జిల్లాల వాహనాలు కూడా ఎఫ్సీల కోసం సబ్బవరం ఏటీఎస్లో స్లాట్లు బుక్ చేసుకుంటున్నారు. దీంతో ఫిట్నెస్ పరీక్షలకు వాహనదారులు ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో వాహనాలను జాతీయ రహదారి సర్వీసు రోడ్డులో నిలుపుదల చేస్తుండడంతో ఈ మార్గంలో రాకపోకలకు ఇబ్బంది కలుగుతున్నది. కొన్నిసార్లు రెండు, మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. పరీక్ష పూర్తయ్యే వరకు యజమానులు/ డ్రైవర్లు రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మరోవైపు ఏటీఎస్లో సిబ్బంది కొరత, రవాణా శాఖ సర్వర్ తరచూ మొరాయిస్తుండడం వంటి కారణాలతో ఎఫ్సీల జారీ ఆలస్యం అవుతున్నది. ఆరు నెలలైనా..ఆచరణ లేదు.. సబ్బవరం మండలంలోని ఏటీఎస్పై ఒత్తిడి పెరగడంతో సర్సీపట్నంలో మరో ఏటీఎస్ను ఏర్పాటు చేయాలని రవాణా శాఖ అధికారులు ప్రతిపాదన చేశారు. ఆరు నెలల కిందట జిల్లా ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్యక్షతన కలెక్టరేట్లో జరిగిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు ఈ సమస్యపై మాట్లాడారు. ఏటీఎస్ సబ్బవరం మండలంలో ఉండడం వల్ల సర్సీపట్నం పరిసర ప్రాంతాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన వాహన యజమానులు ఇబ్బందులు పడుతున్నారని, అందువల్ల నర్సీపట్నంలో ఏటీఎస్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి రవీంద్ర స్పందిస్తూ ఆ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామనని చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్ను ఆదేశించారు. ఇది జరిగి ఆరు నెలలు దాటినా మరో ఏటీఎస్ మంజూరు కాలేదు. మళ్లీ ఈ నెల 15వ తేదీన సోమవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో కూడా ఈ సమస్యపై ప్రజాప్రతినిధులు మాట్లాడారు. ఆరు నెలల కిందట జరిగిన డీఆర్సీ సమావేశంలో నిర్ణయించిందే ఆచరణలోకి రాలేదు. మరి నిన్న జరిగిన డీఆర్సీ సమావేశంలో నిర్ణయం మరి ఎప్పుడు ఆచరణలోకి వస్తుందో వేచిచూడాల్సిందే. అప్పటి వరకూ వాహన యజమానులకు ఇబ్బందులు తప్పవు.దేవీపురంలోని ఆటోమేటెడ్ వెహికల్ ఫిట్నెస్ టెస్టింగ్ స్టేషన్ఫిట్నెస్ పరీక్ష కోసం వచ్చిన వాహనం వాహనాల ఫిట్నెస్ పరీక్ష కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన దుస్థితి అనకాపల్లి–సబ్బవరం హైవే సర్వీసు రోడ్డుపై బారులు తీరుతున్న వాహనాలు ఫిట్నెస్ పరీక్షతో పాటు ఎఫ్సీ జారీలో తీవ్ర జాప్యం వాహనాల యజమానులు, డ్రైవర్ల పడిగాపులు నర్సీపట్నంలో మరో ఏటీఎస్ ఏర్పాటుకు ప్రతిపాదనలు డీఆర్సీలో ఆమోదించినా కార్యరూపం దాల్చని వైనం -
బయోగ్యాస్తో సుస్థిర భవిష్యత్తు సాధ్యం
పాయకరావుపేట : స్పేసెస్ డిగ్రీ కళాశాలలో బయోగ్యాస్పై అవగాహన సదస్సులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ గంగాగ్నిరావు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు బయోగ్యాస్ తయారీ విధానాలను వివరించారు. వ్యర్థాల నుండి బయోగ్యాస్ తయారు చేయడం పునరుత్పాదక శక్తి విధానాలలో ఉత్తమమైన మార్గం అని అన్నారు. తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని కలిగించకుండా డెయిరీ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు, ఫార్మా కంపెనీల వ్యర్థాఉ ముడి పదార్థాలుగా ఉపయోగించి బయెగ్యాస్తో పాటు సేంద్రియ ఎరువును, విద్యుత్తును, వాహనాలకు ఇంధనం పొందవచ్చునని దీని ద్వారా వ్యర్థాలను సంపదగా మలచ్చుకోవచ్చునని తెలిపారు. బయోగ్యాస్ యువతకు ఉపాధి కల్పించడానికి దోహదపడుతుందని దేశ అభివృద్ధికి, సుస్ధిర భవిష్యత్తుకు సహాయపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల అధినేత నరసింహారావు, చైర్మన్ డాక్టర్ కంటిపూడి నరేంద్రబాబు, ప్రిన్సిపాల్ డా. ఎ.రామకృష్ణారెడ్డి, శాస్త్రవేత్త, డైరెక్టర్, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ నగేష్ కుమార్, విద్యార్ధులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
300 లీటర్లసారా పులుపు ధ్వంసం
నాతవరం : నిబంధనలు ఉల్లఘించి నాటుసారా తయారీ చేసినా విక్రయించినా కేసులు నమోదు చేస్తామని నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు అన్నారు. మండలంలో గుమ్మడిగొండ గ్రామ సమీపంలో గల తాండవ నది ఓడ్డున గుట్టుగా నాటు సారా తయారు చేస్తున్న బట్టీలపై మంగళవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ సారా తయారు చేసేందుకు సిద్ధంగా ఉంచిన 300 లీటర్ల పులుపు ధ్వంసం చేశారు. సారా తయారు చేసేందుకు ఉపయోగించే సామాగ్రిని కొన్నింటిని ధ్వంసం చేసి మిగిలినవి పోలీసు స్టేషన్కు తరలించారు. అయితే సారా తయారు చేసే నిర్వాహకులు పరారయ్యారు. సారాను అరికట్టడానికి ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసామని ఎస్ఐ తెలిపారు. -
‘పది’ పరీక్షలకువందరోజుల ప్రణాళిక
అనకాపల్లి టౌన్ : రానున్న పదో తరగతి పరీక్ష ఫలితాలలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. స్ధానిక ఉడ్పేట పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పదో తరగతి పరీక్షల 100 రోజులు ప్రణాళిక పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఈ బుక్లో ఉన్న సిల్బస్ను బోధించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పదో తరగతి పరీక్షల పరిశీలకుడు శ్రీధర్ రెడ్డి, ఎంఈవో ఎస్.కోటేశ్వరావు, సీసీ వెంకటేశ్వరావు పాల్గొన్నారు. -
అమరజవాన్లకు నివాళులు
అనకాపల్లి : ఇండో–పాక్ యుద్ధంలో 1971 లో అమరులు జవాన్లకి ప్రతి ఏడాది డిసెంబర్ 16న నివాళులు అర్పించడం జరుగుతుందని అనకాపల్లి సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అగ్గాల హనుమంతరావు అన్నారు. స్థానిక మొయిన్రోడ్డు అసోసియేషన్ కార్యాయంలో అమర జవాన్ల చిత్రపటానికి మంగళవారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1971 యుద్ధంలో పాకిస్తాన్న్పై భారత సాయుధ దళాలు సాధించిన చారిత్రాత్మక విజయాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 16, 1971న, పాకిస్థాన్ దళాల అధిపతి జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేయించారని 93,000 కంటే ఎక్కువ పాకిస్తాన్ సైనికులు భారత సైన్యం, బంగ్లాదేశ్ ముక్తి బాహిని సంయుక్త దళాలకు లొంగిపోయారని తెలిపారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇది అతిపెద్ద సైనిక లొంగుబాటుగా మిగిలిపోయిందన్నారు. ఈ యుద్ధం తరువాత 13 రోజుల వివాదం తూర్పు పాకిస్తాన్ విముక్తి, బంగ్లాదేశ్ను స్వతంత్ర సార్వభౌమ రాజ్యంగా సృష్టించడంలో ముగిసిందన్నారు. ఈ యుద్ధం 13 రోజులు కొనసాగిందని, దాదాపు 3,900 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యు లు గొన్న ఆదిరాజు, రావాడ సత్యనారాయణ, గుణ నాగభూషణం, వంటాకు పైడితల్లి, జాజుల గోవిందరావు, మద్దాల నూకరాజు, వేగి శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
‘మాదిగలకు అన్యాయం జరిగితే సహించం’
కశింకోట : జిల్లాలో ఎక్కడైనా మాదిగ కులస్తులకు అన్యాయం జరిగితే సహించేది లేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మహాజన సోషలిస్టు పార్టీ జాతీయ నాయకుడు ముమ్మిడివరపు చిన సుబ్బారావు మాదిగ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలోని బయ్యవరంలో జిల్లా మాదిగల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యలక మల్లిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మట్లాడుతూ మాదిగలను విస్మరించిన ఏ పార్టీలు చరిత్రలో నిలవలేదన్నారు. మాదిగలు మూడు దశాబ్దాల పోరాట ఫలితంగా ఏబీసీ వర్గీకరణతో రిజర్వేషన్ సాధించుకోవడంతో ఫలితాలు దక్కాయన్నారు. ఎ మ్మార్పీఎస్ ఎంఎస్పీ జిల్లా ఇన్చార్జి పోసపల్లి వెంకటరావు, ఉత్తర కోస్తా జిల్లాల ఇన్ఛార్జి తోత్తరమూడి శ్రీనివాస్, ఎంఈఎఫ్ జాతీయ ఉపాధ్యక్షులు మల్లిపూడి సత్యనారాయణ, ఇండిగపల్లి దేముడుబాబు, జిల్లా ఎంఎస్పీ అధ్యక్షుడు ఎలుసూరి ఘాటీలు, జిల్లా అధికార ప్రతినిధి కొల్లి చిన్న అప్పారావు, కోశాధికారి చెవ్వే టి అప్పారావు, ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకినాడ కనకేశ్వరరావు, ఎమ్మెస్పీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టమూరి మంగరాజు పాల్గొన్నారు. 21 కేజీల గంజాయి స్వాధీనం గొలుగొండ: కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చెరకు కాటా వద్ద రెండు బైక్లపై నలుగురు వ్యక్తులు 21 గంజాయి తరలిస్తుండగా ఎస్ఐ రుషికేశ్వరరావు ఆధ్వర్యంలో సిబ్బంది అదుపులోకి తీసుకుని, కోర్టుకు తరలించారు. రెండు బైక్లపై ఏజెన్నీ నుంచి అల్లూరి జిల్లాకు చెందిన వంతల సత్తిబాబు, పాంగి సత్తిబాబుతో పాటు తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు తసెల్వరి, సెల్వర్లు గంజాయి తరలిస్తున్నారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ గంజాయి పట్టుబడిందని, నిందితులను అదుపులోకి తీసుకుని, గంజాయితో పాటు రెండు బైకులు, మూడు సెల్ఫోన్లు, రూ.4520 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.మారేడుమిల్లి–చింతూరు ఘాట్రోడ్డులో మంచు వానసూర్యోదయం వేళ.. మారేడుమిల్లి–చింతూరు ఘాట్రోడ్డు ప్రాంతం ప్రకృతి రమణీయతకు అద్దం పడుతోంది. అడుగడుగునా దట్టమైన వృక్షాలు, భూమిని తాకేటట్టుగా వేలాడుతున్న పచ్చని తీగలు. వనమూలికల సువాసనతో స్వచ్ఛమైన గాలి ఔషధంగా మారిపోయింది. వినసొంపైన పక్షుల కిలకిలారావాలు.. చెట్లపైనుంచి జారే మంచు బిందువుల ’చిటపట’ శబ్దాలు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి. వ్యూపాయింట్ వద్ద మంచు అందాలు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి. భానుడి స్వర్ణమయ కిరణాలు ఆకులపై పడి మరింత ప్రకాశవంతంగా మారాయి. మన్యం ప్రాంతమంతా స్వచ్ఛమైన ఆకుపచ్చ, గోధుమ, పసిడి రంగుల మేళవింపుతో సరికొత్త అందాన్ని సంతరించుకుంది. – రంపచోడవరం -
జిల్లాలో 3988 టన్నుల ధాన్యం సేకరణ
తుమ్మపాల : ఖరీఫ్ 2025–26 సీజన్కు జిల్లాలో ఈ నెల 16 నాటికి అత్యఽధికంగా 3,988.320 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం జరిగిందని, జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 1,428 మంది రైతుల నుంచి రూ.9.46 కోట్ల విలువ గల ధాన్యం సేకరించినప్పటకి రూ.6.92 కోట్లను 1,179 మంది రైతులకు చెల్లించడం జరిగిందన్నారు. ధాన్యం సేకరించిన 24 గంటల లోపే 74 శాతం చెల్లించడం జరిగిందని, మిగిలిన రూ.2.54 కోట్ల తదుపరి బ్యాంకు బ్యాచి ప్రాసెస్ జమచేయడం జరుగుతుందన్నారు. రైతులకు మద్దతు ధర అందించాలనే లక్ష్యంతో గోనె సంచులు, రవాణా వాహనాలు, టార్పాలిన్లు అందించడం జరిగిందన్నారు. రైతులు ధాన్యం విక్రయించడంలో ఎటువంటి ఇబ్బందులున్నా జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెం.8008901584ను సంప్రదించాలన్నారు. జిల్లాలో 65 ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. దళారులను ఆశ్రయించి మద్దతు ధర కన్నా తక్కువ ధరకు ధాన్యం విక్రయించి నష్టపోవద్దని తెలిపారు. -
రెవెన్యూ డివిజన్పై డీఆర్సీలో తీర్మానం ప్రశంసనీయం
మునగపాక: యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోనే కొనసాగేలా ప్రభుత్వ పెద్దలు తీర్మానం చేయడం సంతోషకరమని వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ అన్నారు. అనకాపల్లిలో మంగళవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం త్వరితగతిన అమలు జరిగేలా ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 27న కొత్తగా నక్కపల్లి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ అందుబాటులోకి వచ్చేలా జీవో విడుదల చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే నక్కపల్లి డివిజన్లో యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కలుపుతూ తీసుకున్న నిర్ణయం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడతారన్నారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ సమన్వయకర్త కరణం ధర్మశ్రీతో పాటు నియోజకవర్గంలోని పార్టీ నేతలంతా రైతులు, ప్రజల సహకారంతో పలు రూపాల్లో నిరసన తెలిపామన్నారు. కలెక్టర్ విజయకృష్ణన్కు కూడా వినతిపత్రం అందజేసినా సానుకూల నిర్ణయం రాకపోవడంతో మునగపాకలో రిలే నిరాహార దీక్షలు చేపట్టామన్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి ఈ నెల 15న అనకాపల్లిలో నిర్వహించిన డీఆర్సీ సమావేశంలో అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గం ఉండేలా చూడాలని కోరుతూ ఇన్చార్జి మంత్రి రవీంద్ర దృష్టికి తీసుకువచ్చారన్నారు. ఇందుకు స్పందించిన ప్రభుత్వ పెద్దలు కూడా ఇదే నిర్ణయాన్ని స్వాగతించారన్నారు. అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గం ఉండేలా ఏకగ్రీవ తీర్మానం చేయడం హర్షణీయమన్నారు. 1491 జీవోను సవరించి యథావిధిగా అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి ఉండేలా మరో జీవో వచ్చేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, సర్పంచ్లు దిమ్మల అప్పారావు, బొడ్డేడ శ్రీనివాసరావు, సుందరపు తాతాజీ, భీశెట్టి గంగప్పలనాయుడు, కర్రి పెదబ్బాయి, ఎంపీటీసీలు మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, మద్దాల వీరునాయుడు, బొడ్డేడ బుజ్జి, మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, పార్టీ నాయకులు నరాలశెట్టి సూర్యనారాయణ, శీరా రమణమ్మ, కాండ్రేగుల జగన్, రామజోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. సభలో ప్రజల వాణి వినిపించిన ఎమ్మెల్సీ కల్యాణికి కృతజ్ఞతలు అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గాన్ని కొనసాగించాలి వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ -
జిల్లా వినియోగదారులసంఘం అధ్యక్షుడిగా రాంబాబు
అనకాపల్లి: జిల్లా వినియోగదారుల సంఘం అధ్యక్షుడిగా రొంగలి రాంబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ రహదారి విక్రమ్ ఆస్పత్రి ఆవరణలో మంగళవారం జరిగిన ఎన్నికల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా రాపేటి శివసత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా బి.త్రినాథరావు, సహాయ కార్యదర్శిగా పసుపులేటి భవనేశ్వరరావుతో పాటు మరో 11 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారిగా మరుపిల్లి ఎల్లారావు వ్యవహరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రొంగలి రాంబాబు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందన్నారు. -
‘సమాధులకు గుర్తులు పెట్టుకోండి’
కశింకోట: కశింకోటలోని జామియా మసీదుకు చెందిన శ్మశానవాటికను ఎత్తు చేయాలని సంకల్పించామని, సమాధులు కనిపించకుండా పో యే అవకాశం ఉన్నందున మృతుల కు టుంబ సభ్యులు, బంధువులు వచ్చి గుర్తులు పెట్టుకోవాలని మసీదు కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో కోరారు. ఏ మాత్రం వర్షం పడినా పల్లంగా ఉన్న శ్మశానవాటిక ప్రాంతంలో నీరు చేరి బురదగా మారుతున్న కారణంగా మృతుల అంత్యక్రియలకు, పక్కన మసీదులో ప్రార్థనలకు ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు. శ్మశానవాటిక ప్రాంతాన్ని మట్టితో పూడ్చి ఎత్తు చేయాలని భావిస్తున్నామన్నారు. శ్మశానంలో శాశ్వత సిమెంట్ సమాధులు నిర్మించడం సంప్రదాయానికి విరుద్ధమన్నారు. -
ఈ కమీషన్తో బతకలేం..
● వడ్డాది రేషన్ డీలర్ రాజీనామా బుచ్చెయ్యపేట : మండలంలోని మేజర్ పంచాయతీ వడ్డాది రేషన్ డిపో నంబర్ 10 డీలర్ దొండా వెంకట రామ అన్నయ్యదొర రాజీనామా చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన బుచ్చెయ్యపేటలో తహసీల్దార్ లక్ష్మికి రాజీనామా పత్రాన్ని ఆయన అందించారు. 32 ఏళ్లకు పైగా రేషన్ డీలర్గా చేసిన తాను ఇప్పుడున్న పరిస్థితిలో రేషన్ డీలర్గా కొనసాగలేనని రాజీనామా పత్రంలో అన్నయ్యదొర పేర్కొన్నారు. ప్రభుత్వం తమకు రావాల్సిన నెలవారీ కమీషన్ కూడా ఇవ్వలేకపోతుందని, నెలంతా కష్టపడిన అరకొర కమీషన్తో జీవించలేక పోతున్నామని వాపోయారు. ప్రభుత్వం గత మూడు నెలలుగా కమీషన్ కూడా అందించకపోగా, ఇంటింటికి తిరిగి రేషన్ బియ్యం అందించమని అధికారుల వేధింపులకు విసుగు చెంది తన డీలర్ షిప్నకు రాజీనామా చేసినట్లు తెలిసింది. -
ప్రైవేటీకరణపై ఎస్ఎఫ్ఐ ధర్నా
నర్సీపట్నం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆలోచనను చంద్రబాబు ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విజయ్, ఉపాధ్యక్షుడు గౌతమ్ డిమాండ్ చేశారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మంగళవారం ర్యాలీ నిర్వహించి, ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మంచి ఆలోచనతో మెడికల్ కాలేజీలను నిర్మిస్తే, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూడడం దారుణమన్నారు. పీపీపీ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. రూ.6,400 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు. స్కాలర్షిప్లు చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు మంజూరు చేయాలన్నారు. మెస్ఛార్జీలు రూ.3 వేలుకు పెంచాలన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మూర్తి, శ్రీను, వరుణ్, అవినాష్, చరణ్, ఆకాష్, చిన్నబ్బాయి తదితరులు పాల్గొన్నారు. -
కస్టమ్స్ కత్తెర!
ఎగుమతులకుసాక్షి, విశాఖపట్నం: నగరంలోని ప్రధాన ఫర్నిచర్ షోరూమ్లలో విక్రయించే ఫర్నిచర్ అధిక భాగం చైనా నుంచి దిగుమతి అవుతుంటుంది. ఇక్కడ కంటైనర్ టెర్మినల్, పోర్టులు ఉన్నప్పటికీ వ్యాపారులు చైనా నుంచి సరుకును నేరుగా విశాఖకు రప్పించడం లేదు. కోల్కతా లేదా చైన్నె పోర్టులకు తీసుకొచ్చి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విశాఖకు తీసుకురావాల్సిన పరిస్థితి దాపురించింది. ఎందుకంటే.. పదేళ్ల కిందట ఓ వ్యాపారి చైనా నుంచి నేరుగా ఇక్కడికి ఫర్నిచర్ తీసుకురాగా.. దాని ధ్రువీకరించి క్లియరెన్స్ ఇచ్చేందుకు కస్టమ్స్ వారికి ఏడాది సమయం పట్టింది. ఆ అనుభవంతో అప్పటి నుంచి ఏ వ్యాపారీ ఫర్నిచర్ను నేరుగా విశాఖకు తీసుకురాకూడదని నిర్ణయించుకున్నారు. కేవలం ఫర్నిచర్ మాత్రమే కాదు.. అనేక ఉత్పత్తుల విషయంలో విశాఖ కస్టమ్స్ నుంచే ప్రధాన అవరోధాలు ఎదురవుతున్నాయని తెలుస్తోంది. అన్నీ ఉన్నా.. అవే లేవు : ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్నట్లుగా ఉంది విశాఖపట్నం కార్గో ఎగుమతి, దిగుమతుల పరిస్థితి. సామర్థ్యానికి తగ్గట్లుగా సరుకు నిర్వహణలో సరైన సౌకర్యాలు లేకపోవడంతో, ఏళ్ల తరబడి ఇక్కడ వృద్ధి స్తంభించిపోయింది. విశాఖ పరిధిలో తయారవుతున్న ఉత్పత్తులు కూడా హైదరాబాద్ మీదుగా ముంబయి వెళ్తున్నాయి. సర్టిఫైడ్ ఏజెన్సీల కొరత ఓవైపు వేధిస్తుండగా, ఎగుమతులకు ‘కస్టమ్స్’ తీరు ప్రధాన అవరోధంగా మారింది. వచ్చే కార్గో నాణ్యతను పరీక్షించి, ధ్రువీకరించేందుకు అవసరమైన నిపుణుల బృందాలు విశాఖ కస్టమ్స్ వ్యవస్థలో లేకపోవడం వల్లే ఈ అంతరాయాలు ఏర్పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 200 ఉత్పత్తులకే పరిమితం! : విశాఖ కస్టమ్స్ హౌస్లో నాణ్యత పరిశీలన నిపుణులు లేరనే వాదన బలంగా ఉంది. సరుకు రవాణా అభివృద్ధికి ఇదే ప్రధాన ఆటంకమని వాణిజ్య ప్రతినిధులు చెబుతున్నారు. ముంబయిలో 2000కి పైగా, చైన్నెలో 1500 వరకు కార్గో ఉత్పత్తులను కస్టమ్స్ అధికారులు పర్యవేక్షిస్తుంటారు. వచ్చే ప్రతి సరుకు ఏ గ్రేడ్లో ఉంది? ఎంత నాణ్యమైనది? దానికి ఎంత పన్ను వేయాలి? అనే విషయాలను అక్కడి నిపుణులు క్షణాల్లో చెప్పగలరు. తక్కువ వ్యవధిలోనే ధ్రువీకరించి క్లియరెన్స్ ఇస్తారు. కానీ, విశాఖలో ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకు పసుపు కొమ్ముల ఎగుమతి కోసం వ్యాపారులు విశాఖకు వస్తే, వాటి నాణ్యత పరిశీలనకే రోజుల సమయం తీసుకుంటున్నారు. ఫలితంగా సరుకు ఇక్కడే పాడైపోతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే చాలావరకు ఉత్పత్తులను చైన్నె లేదా ముంబయికి తరలిస్తున్నారు. ఇక విశాఖలో తయారయ్యే మందుల నాణ్యతను ధ్రువీకరించి, క్లియరెన్స్ ఇచ్చే నిపుణులు ఇక్కడ లేరు. వీటి కోసం ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నా, అవి విశాఖలో అందుబాటులో లేకపోవడంతో సరుకును హైదరాబాద్కు తరలించి, అక్కడ సర్టిఫికెట్లు తీసుకొని ముంబయి ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి చేయాల్సి వస్తోంది. ఈ కారణంగా విశాఖలో కార్గో హ్యాండ్లింగ్ కేవలం 200 ఉత్పత్తులకే పరిమితమైపోయింది. ముంబయితో పోలిస్తే 20 శాతం, చైన్నెతో పోలిస్తే 25 శాతం ఉత్పత్తులు మాత్రమే విశాఖ నుంచి ఎగుమతి, దిగుమతులవుతున్నాయి.కొత్త ఉత్పత్తులకు అవకాశం లేదా? కస్టమ్స్ మదింపు కోసం ప్రత్యేక శిక్షణ ఉంటుంది. వైజాగ్ కస్టమ్స్ హౌస్కు వచ్చే అప్రైజర్లు కేవలం ఈ ప్రాంతంలో రవాణా అయ్యే పరిమిత సరుకులపైనే పట్టు సాధిస్తున్నారు. కొత్తగా ఏదైనా సరుకు వస్తే, దాని నాణ్యతను పరిశీలించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొత్త ఉత్పత్తులకు తగ్గట్టుగా కస్టమ్స్ హౌస్ తమ బృందాలను సిద్ధం చేయలేకపోతోంది. ఏవో కొర్రీలు వేసి వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. తాము సిద్ధంగా ఉన్నామని స్టేక్హోల్డర్స్ చెబుతున్నా, కస్టమ్స్ నుంచి స్పందన లేకపోవడంతో పరిమిత కార్గోను మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతున్నారు. కొన్ని ఉత్పత్తులను ఉత్తరాది నుంచి విశాఖ తీసుకొచ్చి, నేరుగా సింగపూర్, ఈశాన్య ఆఫ్రికా దేశాలకు పంపించేందుకు వ్యాపారులు ఆసక్తి చూపుతున్నా.. ఇక్కడ సరైన పరిశీలన బృందాలు లేక వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా.. కార్గో ఎగుమతులు ముందుకు కదలక.. కొత్త ఉత్పత్తుల హ్యాండ్లింగ్కు అవకాశం లేకుండా పోతోందని వాపోతున్నారు. కస్టమ్స్ విభాగంలో మార్పులు వస్తేనే విశాఖలో ఎగుమతులు ఊపందుకుంటాయని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. నిపుణుల బృందం లేక ఎగుమతిదారుల ఇక్కట్లు నాణ్యత ధ్రువీకరణకు పరికరాలు, నైపుణ్యం కొరత సౌకర్యాల లేమితో సరుకు రవాణాకు అంతరాయం -
టీడీపీ నాయకుల కుమ్ములాట
రావికమతం : మండలంలో తట్టబంద గ్రామ పంచాయతీ వద్ద ప్రత్యేక పంచాయతీ ప్రజాభిప్రాయ సేకరణ కోసం అధికారులు మంగళవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామ సభ రసాభాసగా మారింది. టీడీపీకి చెందిన ప్రస్తుత సర్పంచి గోకాడ రమణ విభజనకు అనుకూలంగా ఉండగా, అదే పార్టీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు శేఘబాబు,మాజీ ఉప సర్పంచ్ సింబోతు నాయుడు వ్యతిరేకిస్తున్నారు. దీంతో పంచాయతీ విభజనపై అనుకూలం, వ్యతిరేకిస్తున్న వారంతా రెండు వర్గాలుగా విడిపోయి గొడవకు దిగారు. పంచాయతీని విడదీయడానికి వీల్లేదని కొందరు, వీడదీయాల్సిందేనని మరికొందరు అధికారుల ముందే బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తంగా మారింది. అరుపులు కేకలతో తోపులాట జరిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పంచాయితీల విభజనపై వచ్చిన అర్జీలను పరిశీలించి ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. తట్టబంద పంచాయతీలో ఎల్.ఎన్.పురం, బూరుగుపాలెం, కసిరెడ్డిపాలెం, సాయినగర్, పోర్లుపాలెం బలిజిపాలెం గ్రామాలు ఉన్నాయి. 3 వేల జనాభా, 2100 మంది ఓటర్లు ఉన్నారు. ఎల్.ఎన్.పురం,బూరుగుపాలెం, కసిరెడ్డిపాలెం, పోర్లుపాలెం గ్రామాలను తట్టబంద పంచాయతీ నుంచి విడదీసి ఎల్.ఎన్.పురం కేంద్రంగా కొత్త పంచాయతీ ఏర్పాటు చేయాలని సర్పంచ్ గోకాడ రమణ అతడి వర్గీయులు మండల పరిషత్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణకు పంచాయతీ కార్యదర్శి విజయ మంగళవారం గ్రామ పంచాయతీ వద్ద ప్రత్యేక గ్రామ సభ నిర్వహించారు. పంచాయితీ విభజనను ఎంపీటీసీ సభ్యులు శేషుబాబు, మాజీ ఉప సర్పంచ్ సింబోతు నాయుడు వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. సర్పంచ్ రమణ ఎవరికీ చెప్పకుండా తీర్మాణం చేసి పంచాయతీని వీడదీయాలని చూస్తున్నారని ఆరోపించారు. తట్టబందను పంచాయతీగా అన్ని ఊర్లు కలిపి ఉండేలా 280 మంది సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని పంచాయతీ కార్యదర్శికి అందజేశారు. ఎల్.ఎన్.పురం కేంద్రంగా కొత్త పంచాయతీని ఏర్పాటు చేయాలని పంచాయతీ తీర్మానం ఆమోదించాలని సర్పంచ్ వర్గీయులు పట్టుబట్టారు. దీంతో గొడవ ముదిరి ఇరువర్గాలు కుర్చీలు విసురుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. గ్రామసభ రసాభాసగా మారడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. గ్రామ సభను వాయిదా చేసినట్లు పంచాయితీ కార్యదర్శి విజయ విలేకరులకు తెలిపారు.పంచాయతీ విభజనపై గ్రామసభ రసాభాస -
పోస్టల్ బ్రాంచిలో రూ.7 లక్షల గోల్మాల్!
● ఖాతాదారుల సొమ్ము సొంతానికి వాడుకున్న పోస్టుమాస్టర్ ● లబోదిబోమంటున్న బాధితులు ● సస్పెన్షన్తో సరిపెట్టిన అధికారులు నర్సీపట్నం : ఖాతాదారులు డబ్బులు చెల్లించారు..తమ దగ్గర ఉన్న పాస్ బుక్ల్లో జమైంది, కానీ అధికారిక ఖాతాలో జమ కాలేదు..అధికారులు గోల్మాల్ సొమ్ముకు సంబంధం లేదంటున్నారు...మరి తమ సొమ్ముకు సమాధానం చెప్పేది ఎవరని ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. తన ఖాతా నుంచి రూ.15 వేలు డ్రా చేస్తే రూ.5 వేలు ఇచ్చి, మిగిలిన రూ.10 వేలు ఇవ్వలేదని మన్యపురట్ల గ్రామానికి చెందిన నర్సే లక్ష్మి తెలిపింది. రూ.10 వేలు డ్రా చేస్తే రూ.2500 ఇవ్వలేదని అదే గ్రామానికి చెందిన నర్సే నాగేశ్వరరావు తెలిపారు. రూ.10 వేలు విత్డ్రా చేస్తే రూ.7 వేలు ఇచ్చి, మిగిలిన రూ.3 వేలు ఇవ్వలేదని తోట శివ అనే ఖాతాదారు తెలిపారు. ఇలా పోస్టుమాస్టర్ చేతిలో మోసపోయి వెలుగులోకి రానివారు ఇంకా ఎంతో మంది ఉన్నారు. నాతవరం మండలం, మన్యపురట్ల పోస్టల్ బ్రాంచిలో రూ.7 లక్షల వరకు నిధులు గోల్మాల్ జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఖాతాదారులు చెల్లించిన నగదును పోస్టల్ అకౌంట్లో జమ చేయలేదు. ఈ విషయం అధికారుల విచారణలో రుజువు కావడంతో పోస్టుమాస్టర్ రావాడ సోమరాజును అక్టోబర్ 16న సస్పెండ్ చేశారు. బాధితులు రూ.7 లక్షలు అంటున్నారు.. కానీ అధికారులు సస్పెండ్ చేసిన నాటికి రూ.2 లక్షలు జమ కాలేదని చెబుతున్నారు. దీనికి సంబంధించి రూ.50 వేలు రికవరీ చేసి అధికారులు చేతులు దులుపుకొన్నారు. బ్రాంచి పరిధిలో లింగంపేట, రాజుపేట అగ్రహారం, మన్యపురట్ల, గుర్రంపేట గ్రామాలు ఉన్నాయి. ఆర్డీ, ఎస్హెచ్ఏ, సేవింగ్ అకౌంట్స్, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఖాతాలకు సంబంధించి సుమారు 300 మంది ఖాతాదారులు ఉన్నారు. ఖాతాదారుల నుంచి కట్టిన నగదు ఏ రోజుకు ఆరోజు మెయిన్ బ్రాంచిలో జమ చేయాల్సి ఉంది. రోజుకు రూ.15 వేలకు మించి నగదు పోస్టుమాస్టర్ దగ్గర ఉండకూడదు. కానీ ఆయన రూ.లక్షలకు లక్షలు తన దగ్గర ఉంచుకుని సొంత అవసరాలకు వాడుకునేవారు. సస్పెన్షన్కు ముందు పోస్టల్ ఇన్స్పెక్టర్ తనిఖీల్లో నగదు సొంత అవసరాలకు వాడుకున్నట్టు రెండు పర్యాయాలు గుర్తించారు. అప్పట్లో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించారు. అనకాపల్లి పోస్టల్ సూపరింటెండెంట్ తనిఖీలో నగదు వాడుకున్నట్టు మూడోసారి రుజువు కావడంతో సస్పెండ్ చేశారు. ఖాతాదారులను పిలిచి అధికారులు విచారించలేదు. పాస్బుక్, ఒరిజనల్ ఖాతాలో నగదుకు తేడా ఉండడంతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై అనకాపల్లి డివిజన్ పోస్టల్ సూపరిండెంటెంట్ శ్రీనివాసరావును వివరణ కోరగా తమ ప్రాథమిక విచారణలో రూ.2 లక్షల వరకు వాడుకున్నట్లు గుర్తించామని తెలిపారు. ఖాతాదారులకు నష్టం జరగకుండా చూస్తామని, అన్ని కోణాల్లో ఇన్స్పెక్టర్ రమేష్ విచారణ చేస్తున్నారని తెలిపారు. విచారణ నివేదిక వచ్చిన తరువాత ఖాతాదారులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
అమర జవాన్లకు ఘన నివాళి
ఏయూక్యాంపస్: 1971 యుద్ధంలో పాకిస్థాన్పై భారత్ సాధించిన అద్భుత విజయానికి గుర్తుగా మంగళవారం నగరంలో ‘విజయ్ దివస్’వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బీచ్రోడ్డులోని విక్టరీ ఎట్ సీ వద్ద అమర జవాన్లకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమానికి హాజరైన డైరెక్టర్ జనరల్ నేవల్ ప్రాజెక్ట్స్, వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్.. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ యుద్ధ స్మారక చిహ్నం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరుల స్ఫూర్తిని కొనియాడారు. ఏటా డిసెంబర్ 16న విజయ్ దివస్ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. -
నెలగంట మోగింది
నక్కపల్లి : ధనుర్మాసోత్సవాలు ప్రముఖపుణ్యక్షేత్రం ఉపమాక వేంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. 1.24 గంటలకు ధనుర్లగ్నం ప్రవేశం ప్రారంభ సూచకంగా కొండపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన స్వామివారి మూలవిరాట్కి దేవస్థానం ప్రధానార్చకుడు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు, అర్చక స్వాములు కృష్ణమాచార్యులు, శేషాచార్యులు తిరుమంజనం, ప్రత్యేక అభిషేకాలు, విశేష ప్రసాద నివేదనలు, నిత్యార్చనలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులకు నూతన వస్త్రాలంకరణ చేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. మధ్యాహ్నం ధనుర్లగ్నలో గరుడాద్రిపై మూలవిరాట్కు ఎదురుగా ఉన్న మండపంలో ఘంటానాదం(నెలగంట) చేయడంతో ధనుర్మాసోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. స్వామివారి వద్ద తిరుప్పళి్ౖలయెళ్లిచ్చై, తిరుప్పావై సేవాకాలము నిర్వహించిన తర్వాత నీరాజన మంత్రపుష్పం తర్వాత గోదాదేవి అమ్మవారి వ్రతదీక్షలో భాగంగా తిరుప్పావైలోని మార్గలిత్తింగల్ మదినిరైయింద నమ్మాళాల్ మొదటి పాశురంతో ప్రత్యేక నీరాజనాలు స్వామివారికి సమర్పించారు. అనంతరం తీర్ధగోష్టి ప్రసాద వినియోగం జరిగింది. కొండదిగువన గల క్షేత్రపాలకుడు వేణుగోపాలస్వామి సన్నిధిలోను ఉపాలయాల్లోను ప్రత్యేక ప్రసాద నివేదనలు చేసి స్వామివారి ఉత్సవమూర్తులకు, గోదాదేవి అమ్మవారి సన్నిధిలో మొదటి పాశురం విన్నపంతో నీరాజనాలు సమర్పించారు. గరుడ వాహనంపై శ్రీదేవీ భూదేవీ సమేత వేంకటేశ్వరస్వామి వారిని, పెద్ద పల్లకిలో గోదాదేవి అమ్మవారు మాడవీధుల్లో భక్తులకు తొలిదర్శన మిచ్చారు. ఘనంగా ప్రారంభమైన ధనుర్మాసోత్సవాలు ఉపమాక గరుడాద్రిపై ఘంటానాదం మోగించిన అర్చకులు గోదాదేవికి తిరుప్పావై మొదటి పాశురం విన్నపం గరుడవాహనంపై స్వామి దర్శనం -
మహిళా సంఘాలఅభివృద్ధిపై విజన్ ప్రణాళిక
సబ్బవరం: మహిళలు సామాజికంగా, ఆర్థికంగా ఎదురవుతున్న అడ్డంకులను అధిరోహించి వారి జీవనోపాధిని మెరుగుపరుచుకోవాలని డీఆర్డీఏ పీడీ శచీదేవి తెలిపారు. స్థానిక మండల మహిళా సమాఖ్య కేంద్రంలో మహిళా సంఘాల సభ్యుల అభివృద్ధికి ఐదేళ్ల విజన్ ప్రణాళిక రూపకల్పనలో భాగంగా నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆమె మంగళవారం ప్రారంభించి, మాట్లాడారు. రాబోయే ఐదేళ్లలో గ్రామ సంఘాలు మండల సమాఖ్యలలో చేపట్టబోయే జీవనోపాధి కార్యక్రమాలను వివరించారు. వ్యవసాయం, పాడి పశువుల పెంపకం, ఆరోగ్యం, పరిశుభ్రత, ఉన్నత విద్యా శిక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా ప్రాజెక్టు మేనేజర్ పి.వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో సబ్బవరం మండల సమాఖ్య కార్యవర్గ సభ్యులతో పాటు చోడవరం, అచ్యుతాపురం, పరవాడ, గొలుగొండ, యలమంచిలి, రాంబిల్లి మండలాల ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. -
కలెక్టర్ కారుకు ప్రమాదం
కలెక్టర్ కారును ఢీకొన్న ప్రమాదంలో నుజ్జు నుజ్జు అయిన మరో కారు అనకాపల్లి టౌన్: జిల్లా కలెక్టర్ కారును మరో కారు ఢీ కొంది. డీజిల్ పోయించుకునేందుకు సోమవారం ఉదయం కలెక్టర్ కారును సబ్బవరం వైపుగా తుమ్మపాల ఏలేరు కాలువ టర్నింగ్ పాయింట్కు తీసుకువెళుతుండగా, సబ్బవరం వైపు వెళుతున్న మరో కారు బలంగా ఢీకొంది. ఈ సమయంలో కారులో కలెక్టర్ లేరు. రెండో కారు ముందు భాగం కొంత నుజునుజ్జయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని రూరల్ ఎస్ఐ రవికుమార్ తెలిపారు. -
నేటి నుంచి ధనుర్మాసోత్సవాలు
నక్కపల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రం గరుడాద్రిపై కల్కి అవతారంలో స్వయం వ్యక్తమై వెలసిన ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం నుంచి ధనుర్మాసోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఉదయం గరుడాద్రిపై వెలసిన మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకం అనంతరం ధనుర్లగ్న ప్రవేశాన్ని అనుసరించి మధ్యాహ్నం 12.57 గంటలకు విశేష ప్రసాద నివేదనలు అనంతరం ఘంటానాదం (నెలగంట) మోగిస్తారు. జనవరి 14వ తేదీ వరకు 30 రోజులపాటు శ్రీదేవీ, భూదేవీ సమేత కల్కి వేంకటేశ్వరస్వామివారికి, గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రతి రోజు రెండు వాహనాల్లో ఒకే సమయంలో గ్రామ తిరువీధి సేవలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరుగుతాయి. స్వామివారి ఆలయంలో గోదాదేవి వ్రత దీక్షలో భాగంగా 30 రోజులపాటు తిరుప్పావై సేవాకాలం నిర్వహిస్తామని ఆలయ ప్రధానార్చకులు గొట్టుముక్కల వరప్రసాదాచార్యులు తెలిపారు. 30న ముక్కోటి ఏకాదశి ఈ ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా ఈనెల 30వ తేదీ మంగళవారం ముక్కోటి ఏకాదశిని (వైకుంఠ ఏకాదశి) పురస్కరించుకుని స్వామివారి ఉత్సవమూర్తులకు రంగనాథుని అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తారు. భోగీ రోజున గోదారంగనాథుల కల్యాణం ఘనంగా నిర్వహిస్తారు. కనుమ పండుగ రోజున స్వామివారి ఉత్సవ మూర్తులను రాజాధిరాజ వాహనంలో ఉంచి సాయంత్రం గరుడాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ నిర్వహిస్తారు. -
30న అప్పన్న ఉత్తరద్వార దర్శనం
సింహాచలం: ఈనెల 30న ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఉత్తరద్వార దర్శనానికి అన్నిశాఖల సమన్వయంతో ఏర్పా ట్లు చేస్తున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఏర్పాట్లపై సోమవారం పలు శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. 30న తెల్లవారుజామున ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయ, ఆరోజు 5.30 నుంచి 11 గంటల వరకు ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠ ద్వార ద్వార దర్శనం భక్తులకు కల్పిస్తామన్నారు. 40 వేల మందికి పైగా భక్తులు ఉత్తర ద్వార దర్శనానికి వస్తారని అంచనా వేసినట్టు తెలిపారు. అన్ని దర్శన క్యూల్లో మంచినీరు అందిస్తామన్నారు. 20 వేల మంది భక్తులకు అన్నప్రసాద భవనంలో పొంగలి, పులుసు ప్రసాదం అందిస్తామన్నారు. భక్తులు ఉత్తర ద్వార దర్శనాన్ని వీక్షించేందుకు సింహగిరిపై రిసెప్షన్ కేంద్రం, కల్యాణం గ్రౌండ్ల్లో భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటుచేస్తామన్నారు. ఈనెల 29 రాత్రి 7 గంటల తర్వాత సింహగిరిపై బస్సులు అనుమతించమని, 30న తెల్లవారుజామున 4 గంటల నుంచి బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహిస్తారని తెలిపారు. దేవస్థానం ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు, డిప్యూటీ ఈవో రాధ, ఈఈ రమణ, ఏసీపీ పృథ్వీతేజ్, గోపాలపట్నం సీఐ ఎల్.ఎస్.నాయుడు, ఆర్టీసీ, మెడికల్ అండ్ హెల్త్, ఎకై ్సజ్, ఫైర్ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
‘మా ఊరి వెంకన్న’ చిత్ర నిర్మాత, దర్శకులకు అవార్డు ప్రదానం
చిత్ర నిర్మాత కోటేశ్వర శర్మను సత్కరిస్తున్న దృశ్యం మునగపాక: విజయవాడలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో భాగంగా మునగపాకకు చెందిన నిర్మాత వెలవలపల్లి కోటేశ్వర శర్మ నిర్మించిన మా ఊరి వెంకన్న చిత్రానికి అవార్డు అందజేశారు. యజ్ఞ శ్రీ బ్యానర్పై డాక్టర్ కోరుకొండ గోపీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలై విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగు ఫిలిం ఫెస్టివల్లో భాగంగా ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా ఎంపిక చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని ఈనెల 14వ తేదీన ఆహుతుల చేతుల మీదుగా నిర్మాత కోటేశ్వరశర్మ, దర్శకుడు గోపీకృష్ణలు అవార్డుతోపాటు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. -
నక్కపల్లి డివిజన్ నుంచి 3 మండలాల మినహాయింపునకు తీర్మానం
కొత్తగా ఏర్పాటు చేస్తున్న నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో కలుపుతున్న కొన్ని మండలాల విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్న విషయాన్ని ఎమ్మెల్సీ వరుదు కల్యాణి సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. మునగపాక మండలాన్ని అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించాలని, నక్కపల్లిలో కలపవద్దని వైఎస్సార్సీపీ నేతలు తనకు ఇచ్చిన వినతి పత్రాన్ని ఆమె ఇన్చార్జి మంత్రి కొల్లు రవీంద్రకు అందజేశారు. ఈ సమస్య గురించి మరికొందరు ప్రజా ప్రతినిధులు ప్రస్తావించడంతో నక్కపల్లి డివిజన్ నుంచి మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి మండలాలను మినహాయించి.. అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించాలని డీఆర్సీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. ఎమ్మెల్సీ కల్యాణి మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏకై క సహకార చక్కెర కర్మాగారమైన గోవాడ సుగర్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు, కార్మికుల బకాయిలను తక్షణమే విడుదల చేసి.. గోవాడ సుగర్ ఫ్యాక్టరీ క్రషింగ్ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వసతి గృహలలో విద్యార్థినుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. గొలుగొండ మండలంలో కేజీబీవీ స్కూల్లో గర్భం దాల్చిన మైనర్ బాలిక విషయంలో టీచర్లు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయన్నారు. బుచ్చెయ్యపేట మండలం వడ్డాదిలో పెద్దేరు బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ఎన్టీఆర్ ఆసుపత్రిలో మందుల కొరత వేధిస్తోందని చెప్పారు. కలెక్టర్ విజయ కృష్ణన్ స్పందించి గొలుగొండ కేజీబీవీ పాఠశాలల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన టీచర్లను సస్పెండ్ చేశామని, ఎన్టీఆర్ ఆసుపత్రిలో మందుల కొరత లేదని.. ఆసుపత్రి కోసం ఇటీవల నిధులు కూడా కేటాయించామని చెప్పారు. -
వచ్చే నెల 21న పల్స్ పోలియో
తుమ్మపాల: జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా జనవరి 21 ఆదివారం రోజున జిల్లావ్యాప్తంగా ‘పోలియో ఆదివారం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో కలిసి బ్యానర్ ఆవిష్కరించారు. ఎలాంటి అపోహలకు లోను కాకుండా తల్లిదండ్రులు తమ ఐదేళ్ల లోపు పిల్లలను పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాల ని కోరారు. అనంతరం జాతీయ విద్యుత్ వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక సుంకరమెట్ట జంక్షన్ వద్ద కలెక్టర్ విజయ కృష్ణన్ విద్యుత్ శాఖ ఎస్ఈ గొప్పు ప్రసాద్తో కలిసి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. విద్యు త్ పొదుపు పౌరులు బాధ్యతగా తీసుకోవాలన్నారు. -
జాతీయ సాఫ్ట్బాల్ పోటీలకు మాకవరపాలెం విద్యార్థి
ఎంపికై న విద్యార్థి తేజరామ్తో వ్యాయామ ఉపాధ్యాయులు రవి, చంద్రదేవి నర్సీపట్నం: మాకవరపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్ విద్యార్థి వి.తేజరామ్ జాతీయస్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యాడని హెచ్ఎం నారాయణరావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా వీరవాసంలో మూడు రోజులపాటు జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో అండర్ 17 విభాగంలో విద్యార్థి వి.తేజరామ్ మంచి ప్రతిభను కనబరిచాడు. ఉమ్మడి విశాఖ జిల్లా నుండి విద్యార్థి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. విద్యార్థి తేజరామ్ను, వ్యాయామ ఉపాధ్యాయులు రవి, చంద్రదేవిలను హెచ్ఎం, ఉపాధ్యాయులు అభినందించారు. -
త్యాగధనుడు అమరజీవి పొట్టి శ్రీరాములు
తుమ్మపాల: అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజల కోసం ప్రాణాలను త్యాగం చేసిన మహానుభావుడని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. పొట్టి శ్రీరాములు 73వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఆయన చేసిన నిరాహార దీక్ష, త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన స్ఫూర్తితో సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి, దేశ అభివృద్ధికి తోడ్పడాలన్నారు. రేపు మెగా జాబ్ ఫెయిర్ నైపుణ్యాభివృద్ధి–శిక్షణ శాఖ ఆధ్వర్యంలో అనకాపల్లిలో ఈనెల 17న మెగా జాబ్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ఆమె పోస్టర్ను విడుదల చేశారు. నిరుద్యోగ యువతకు ఇది మంచి ఉపాధి అవకాశమని, 50కి పైగా ప్రముఖ కంపెనీలు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. గవరపాలెంలోని ఆదినారాయణ మహిళా కళాశాల (పార్క్ సెంటర్ వద్ద) ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు ఆమె సెల్ఫోన్లు పంపిణీ చేశారు. డిజిటల్ కార్యక్రమాల అమలులో భాగంగా సేవలను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు అంగన్వాడీ టీచర్లకు సెల్ ఫోన్లను అందిస్తున్నామన్నారు. -
నాగజ్యోతి, సాహితీలకు సత్కారం
ఆంగ్ల ఉపాధ్యాయిని నాగజ్యోతి, ఆమె కుమార్తె సాహితీలకుసన్మానం రోలుగుంట: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయిని పీవీఎం నాగజ్యోతి, జల యోగాసానాల్లో 32 ప్రపంచ రికార్డులను సాధించిన ఆమె కుమార్తె సాహితీలను ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి ఘనంగా సన్మానించారు. విశాఖలో జరిగిన కార్యక్రమంలో ఆయన తల్లీ, కుమార్తెలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పవర్ లిఫ్టింగ్లో జాతీయ, అంతర్జాతీయ బహుమతులు సాధించిన ఇంగ్లిష్ టీచర్ నాగజ్యోతి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని అవార్డు పొందడం ఎంతో గర్వకారణమని చెప్పారు. అలాగే ఆమె కుమార్తె తల్లికి తగ్గ తనయలా జలయోగాసనాల్లో ప్రపంచ రికార్డులను సాధించడమే కాక తొమ్మిదో తరగతిలోనే అమెరికాలో ‘నాసాను’ సందర్శించడం గొప్ప విషయమన్నారు. భవిష్యత్లో వీరు మరింత పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. -
రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలకు చీడికాడ విద్యార్థులు
విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ మధు చీడికాడ: రాష్ట్ర స్థాయి అబాకస్ పోటీలకు చీడికాడకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికై నట్లు అక్షరశ్రీ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ బి.మధు తెలిపారు. ఈనెల 14న విశ్వం ఎడ్యుటెక్ వారి ఆధ్వర్యంలో అనకాపల్లిలో జరిగిన జిల్లాస్థాయి అబాకస్ పోటీలలో 40 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొనగా తమ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు యర్రా హానిస్ సార్ట్ జూనియర్ లెవెల్–1, యర్రా గ్రీష్మ జూనియర్ లెవెల్–1, గెంజి భరత్ స్టార్ జూనియర్ లెవెల్–3 రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. వీరు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని మధు తెలిపారు. -
త్వరలోనే సొంత భవనంలోకి ఎన్ఐవో
సాక్షి, విశాఖపట్నం: దశాబ్ద కాలం సుదీర్ఘ పోరాటం తర్వాత నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐవో) ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నంలో సొంత భవనంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమైంది. తూర్పు తీరంలో సముద్ర పరిశోధనలకు ఊతమిచ్చే ఏకై క అధ్యయన సంస్థ అయిన ఎన్ఐవో కార్యాలయం 1976 నుంచి పెదవాల్తేరు బస్ డిపో సమీపంలోని అద్దె భవనంలో కొనసాగుతోంది. సుమారు రూ. 30 కోట్ల వ్యయంతో బీచ్కు ఆనుకొని రుషికొండ బే పార్క్ సమీపంలో 3.25 ఎకరాల్లో నూతన భవనం నిర్మాణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. ఈ భవనాన్ని జనవరి నెలలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తూర్పు తీరం.. బంగాళాఖాతంలో సముద్ర పరిశోధన కార్యకలాపాలను ఇక్కడి నుంచే నిర్వహిస్తున్న ఎన్ఐవో... తీరప్రాంత వాతావరణం, సముద్ర అడుగుభాగంలోని ఖనిజ వనరులు, సెడిమెంట్లు, సీబెడ్ మ్యాపింగ్, అలలు, ప్రవాహాలు, మాన్సూన్, వాతావరణ మార్పులపై పరిశోధనలు చేస్తుంది. అంతేకాక, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల సముద్ర, తీరప్రాంత సమస్యల పరిష్కారానికి కూడా ఇది కృషి చేస్తుంది. జనవరిలో ప్రారంభోత్సవానికి సన్నాహాలు.! అవరోధాలు తొలగిన తర్వాత ఎన్ఐవో సొంత భవన నిర్మాణ పనులు ప్రారంభమై జోరుగా సాగుతున్నాయి. పనులన్నీ దాదాపు పూర్తయ్యాయి. ఇంటీరియర్ పనులు, అనుసంధాన రహదారి పనులు జరుగుతున్నాయి. ఎన్ఐవో భవన సముదాయానికి కేంద్ర ప్రభుత్వం రూ.30 కోట్లు మంజూరుచేస్తూ.. నిర్మాణ పర్యవేక్షణ పనులు సీపీడబ్ల్యూడీకి అప్పగించింది. కోల్కతాకు చెందిన కాంట్రాక్టర్ పనుల టెండర్ దక్కించుకున్నారు. రూ.30 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని మూడు బ్లాకుల్లో నిర్మిస్తున్నారు. పరిపాలన భవనమంతా ఒక బ్లాక్లు, రీసెర్చ్ కోసం మరో బ్లాక్, ఇతర అవసరాలకు మూడో బ్లాక్ని వినియోగించనున్నారు. ఎదురుగా ఉన్న సముద్రం నుంచి నేరుగా లేబొరేటరీకి అవసరమైనంత నీరు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సైంటిస్ట్ ఇన్చార్జ్ డా.వీవీఎస్ఎస్ శర్మ తెలిపారు. సంబంధిత కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ దొరికిన వెంటనే ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. ఈ భవనం అందుబాటులోకి వచ్చిన తర్వాత.. సముద్ర పరిశోధనల్లో మరింత పురోగతి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సముద్ర నీటిమట్టం పెరుగుదల, కాలుష్యం హెచ్చుతగ్గులు, అంతర్భాగంలో జరిగే మార్పులు అన్నీ ఇక్కడ అధ్యయనం చేస్తామని డా.శర్మ తెలిపారు. రుషికొండలో నిర్మితమవుతున్న ఎన్ఐవో శాశ్వతభవనం2015లో శంకుస్థాపన జరిగినా.. సొంత భవనం కోసం ఎన్ఐవో సుదీర్ఘ కృషి చేసింది. 2015లో శంకుస్థాపన జరిగినా.. భవనం కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్జెడ్) పరిధిలో ఉండటం వల్ల అనుమతులు పొందడానికి అవస్థలు ఎదురయ్యాయి. స్థానిక ఇబ్బందులను కూడా ప్రభుత్వాల సహకారంతో పరిష్కరించుకున్న తర్వాత ఇప్పుడు కొత్త భవనం సముద్ర పరిశోధనలకు మరింత ఉపయుక్తంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. -
యలమంచిలిని ‘అనకాపల్లి’లోనే కొనసాగించాలి
మునగపాక: అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గం కొనసాగించేలా చూడాలని కోరుతూ ఎమ్మెల్సీ వరుదు కల్యాణికి సోమవారం పార్టీ నేతలతో కలిసి వైఎస్సార్సీపీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ వినతి అందజేశారు. సుదూర ప్రాంతమైన నక్కపల్లి డివిజన్లో యలమంచిలి నియోజకవర్గంలోని నాలుగు మండలాలను కలపడం వలన ఇబ్బందులు తప్పవని ప్రసాద్ వివరించారు. పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, ఎంపీటీసీలు మొల్లేటి నారాయణరావు, మద్దాల వీరునాయుడు, ఇల్లా నాగేశ్వరరావు, బొడ్డేడ బుజ్జి, గణపర్తి సర్పంచ్ చదరం నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
తరగని సమస్యలు.. దొరకని పరిష్కారాలు
20 ఏళ్లుగా తిరుగుతున్నా.. ఎప్పటి నుంచో సాగులో ఉన్న భూమి మరొకరికి డీపట్టా ఇచ్చి సృష్టించిన భూ సమస్య పరిష్కరించకుండా కోటవురట్ల తహసీల్దార్ కార్యాలయం వారు 20 ఏళ్లుగా తిప్పించుకుంటున్నారు. బోడపాలెం సర్వే నెం.439–2లో 70 సెంట్ల భూమిని నా భర్త గొర్లె అప్పన్న, వారి పూర్వీకుల కాలం నుంచి సాగు చేసుకుంటున్నాము. నా భర్త మరణానంతరం సాగు భూమికి డీపట్టా ఉందంటూ పంచదార్ల చినరాజులమ్మ మనుషులు నా భూమిలోకి చొరబడి దౌర్జన్యం చేస్తున్నారు. ఫిర్యాదు చేయడంతో విచారణ చేసి 70 సెంట్ల బంజరు భూమి మా సాగులో ఉందని చెప్పిన అధికారులే ఇప్పుడు ఆ భూమి సబ్డివిజన్ మారిపోయిందని మాట మారుస్తున్నారు. 70 ఏళ్ల వయస్సులోనూ ముప్పుతిప్పలు పెడుతున్నారు. –గొర్లె కాంతం, గొల్లల సన్యాసిరాజుపాలెం, కోటవురట్ల మండలం ఆక్రమణదారులతో రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కు నా అత్తమామల ద్వారా సంక్రమించిన భూమిని ఇతరులు ఆక్రమించి నాపై దాడి చేస్తున్నారు. ఆన్లైన్ చేయడానికి దరఖాస్తు చేస్తే తహసీల్దార్, సర్వేయర్, డీటీ, వీఆర్వో ఆక్రమణదారులతో కుమ్మకై ్క నాకు అన్యాయం చేస్తున్నారు. మూడేళ్లుగా కాళ్లరిగేలా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. గత వారం వస్తే అర్జీ పెండింగ్లో ఉందంటూ చాలాసేపు నమోదు కూడా చేయలేదు. మొత్తానికి నమోదు చేసుకున్నాక కలెక్టరమ్మ వద్ద మొర పెట్టుకుంటే కింది అధికారులకు అప్పగించారు. నా కొడుకు మరణించడంతో నేనే తిరగాల్సి వస్తోంది. నాకు దిక్కెవరు? –బుదిరెడ్ల ముత్యాలమ్మ, వాకపల్లి, దేవరాపల్లి మండలం తుమ్మపాల: వినతులు పేరుకు పోతున్నాయి.. సమస్యలు ఎక్కడివక్కడే ఉన్నాయి.. పరిష్కారాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు.. ఇదీ కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) పరిస్థితి. ఈ వారం మొత్తం 325 అర్జీలు అందాయి. కలెక్టర్ విజయ కృష్ణన్తోపాటు డీఆర్వో సత్యనారాయణ వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంబంధిత అధికారులు క్షేత్రస్ధాయి పరిస్థితిని తెలుసుకొని తగిన పరిష్కారం చూపాలన్నారు. అర్జీదారుల సంఖ్య పెరగకుండా త్వరితగతిన సమస్యలు పరిష్కరించాలన్నారు. దివ్యాంగ పింఛన్ నిలిపేశారు దివ్యాంగురాలైన నాకు వికలాంగ పింఛన్ నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. నా సోదరుడికి ఉద్యోగం ఉందంటూ నా పింఛన్ నిలిపేశారు. నాకు వివాహమై నాలుగేళ్లంది. నా భర్తతో కలిసి వేరుగా రేషన్ కార్డు ఉన్నప్పటికీ నా తల్లిదండ్రుల రేషన్ కార్డు ఆధారంగా పింఛన్ నిలిపివేయడంతో నాకు జీవనాధారం పోయింది. –మర్లి రాజేశ్వరి, తీడ, కశింకోట మండలం కలెక్టరమ్మ న్యాయం చేయాలి జగనన్న హౌసింగ్ పథకంలో నాకు కోడూరులో ఇంటి స్థలం ఇచ్చారు. ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు కానీ కొత్త ప్రభుత్వం పట్టించుకోలేదు. పింఛన్ రూ.4 వేలు ఇంటి అద్దెకే ఖర్చయిపోతున్నాయి. ప్రభుత్వం ఇంటిని పూర్తి చేసి ఇస్తేనే నా కష్టాలు తీరుతాయి. ఒంటరిగా జీవిస్తున్న నన్ను అధికారులు రకరకాల పత్రాలు కావాలంటూ తిప్పిస్తున్నారు. కలెక్టరమ్మ నాకు న్యాయం చేయాలి. – షాకే బేగం, గవరపాలెం, అనకాపల్లి మండలం సీఆర్ఎంటీల మొర ఆలకించండి స్కూల్ కాంప్లెక్స్లను ఏ, బీ క్లస్టర్లుగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలను ప్రభుత్వం విరమించుకోవడంతోపాటు సీఆర్ఎంటీల అర్హతల ఆధారంగా వేతనాలు పెంచాలని, ఎంటీఎస్ అమలు, డీఎస్సీలో వెయిటేజీ వంటి సమస్యల పరిష్కరించాలని ఏపీ సీఆర్ఎం టీచర్స్ యునైటెడ్ ఫోరం ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. సమగ్ర శిక్షలో 14 ఏళ్లుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత లేకుండా చేస్తున్నారని ఆవేదన చెందారు. సీఆర్ఎంటీలను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలంటూ పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు అందించారు. -
అమరజీవి ఆశయ సాధనకు కృషి
అనకాపల్లి: ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయసాధనకు యువత కృషి చేయాలని అదనపు ఎస్పీ ఎం.దేవప్రసాద్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టి, తన ప్రాణాలను త్యాగం చేసి చరిత్రలో అమరజీవిగా నిలిచిపోయారన్నారు. కార్యాలయం పరిపాలనాధికారి సి.హెచ్.తిలక్ బాబు, సీఐలు లక్ష్మణమూర్తి, టి.లక్ష్మి, ఎస్ఐ సురేష్బాబు సిబ్బంది పాల్గొన్నారు. -
సందడిగా పీఆర్టీయూ వన సమారాధన
మాట్లాడుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు కశింకోట: ఉపాధ్యాయినులకు చైల్డ్ కేర్ లీవ్ లీవ్ ఉపయోగించుకునే ఉత్తర్వులు త్వరలో రానున్నట్లు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ డాక్టర్ గాదె శ్రీనివాసులు నాయుడు తెలిపారు. మండలంలోని బయ్యవరం శారదా వనంలో పీఆర్టీయూ ఉమ్మడి విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వన సమారాధన ఆదివారం సందడిగా జరిగింది. ఉమ్మడి విశాఖ జిల్లా యూనియన్ కన్వీనర్ డి. గోపీనాథ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గాదె మాట్లాడుతూ టెట్ విషయంలో ఉపాధ్యాయులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్తో మాట్లాడినట్లు తెలిపారు. 2004కు ముందు నియమితులైన ఉపాధ్యాయులందరికీ ఓపీఎస్ అమలుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలో రానున్నాయన్నారు.విశాఖ జిల్లా అధ్యక్షుడు మడ్డు శ్రీను, కార్యదర్శి నాగేశ్వరరావు, అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్.పెద్ది నాయుడు, అల్లూరి జిల్లా అధ్యక్షుడు యు.వి.గిరి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. -
ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాటం
మునగపాక: యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించేలా ప్రభుత్వం దిగి వచ్చే వరకూ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని వైఎస్సార్సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్కుమార్ పిలుపునిచ్చారు. యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ వారం రోజులుగా మునగపాకలో రైతులతో కలిసి వైఎస్సార్సీపీ శ్రేణులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు ఆదివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా మునగపాక మెయిన్రోడ్డులో పార్టీ శ్రేణులతో కలిసి మానవహారం నిర్వహించారు. సోమవారం నుంచి రోజుకో పంచాయతీలో రైతులతో కలిసి కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టేందుకు నిర్ణయించారు. అనంతరం మహానేత రాజన్న విగ్రహం వద్ద వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్, భరత్కుమార్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో భరత్కుమార్ మాట్లాడుతూ అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నక్కపల్లి డివిజన్లో యలమంచిలి నియోజవర్గాన్ని కలపకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సుదూర ప్రాంతమైన నక్కపల్లికి వెళ్లాలంటే ఈ ప్రాంత ప్రజలకు కష్టతరమవుతుందని చెప్పారు. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా స్థానిక ప్రజా ప్రతినిధులు పునరాలోచించి గతంలో వలే యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లిలో కొనసాగించేలా చూడాలన్నారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ వారం రోజులుగా రైతులు,ప్రజలతో కలిసి నిరసన తెలుపుతున్నా ఇంతవరకు ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గం ఉండేలా చూడాలని డిమాండ్ చేశారు. ప్రజలకు పరిపాలన చేరువ చేయాల్సిన ప్రజా ప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 1491ను సవరించేవరకు రాజీలేని పోరాటం తప్పదన్నారు. ఏడవ రోజున నాగులాపల్లి, రాజుపేట,కాకరాపల్లి,అరబుపాలెం గ్రామాలకు చెందిన పార్టీ నేతలు, రైతులు,ప్రజలు దీక్షలో కూర్చొన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మండల సర్పంచ్ల సంఘం అధ్యక్ష,కార్యదర్శులు కాండ్రేగుల నూకరాజు, సుందరపు తాతాజీ,సర్పంచ్లు బొడ్డేడ శ్రీనివాసరావు,కర్రి పెదబ్బాయి,దిమ్మల అప్పారావు,ఆడారి త్రిమూర్తులు.ఎంపీటీసీలు సూరిశెట్టి రాము,బొడ్డేడ బుజ్జి, మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు,శరగడం అప్పలనరసమ్మ,మళ్ల కాశీ సురేష్, పార్టీ నేతలు దాసరి అప్పారావు, షేక్ ఇస్మాయిల్, పిల్లి అప్పారావు,ఆడారి కాశీబాబు,గుంట్ల అప్పారావు, పెంటకోట అప్పలనాయుడు,పిట్టా మంగారెడ్డి, రాపేటి పరమేష్, దొడ్డి వరహా, మళ్ల సుధాకర్, దొడ్డి బుజ్జి, కాండ్రేగుల జగన్, లంబా అప్పారావు, నరాలశెట్టి సూర్యనారాయణ, మళ్ల ఉమామహేశ్వరరావు, మందా రాము, ధనశ్రీను తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి నేతల సంఘీభావం మునగపాకలో నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు ఆదివారం అనకాపల్లి నియోజకవర్గం నేతలు సంఘీభావం తెలిపారు. ఎంపీపీ గొర్లి సూరిబాబు, జెడ్పీటీసీ శ్రీధర్,మార్కెట్కమిటీ మాజీ చైర్మన్ మలసాల కిషోర్,యువజన విభాగం నాయకుడు జాజుల రమే ష్, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మళ్ల బుల్లిబాబు, కె.ఎం. నాయుడు,మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పద్మ తదితరులు ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. వైఎస్సార్సీపీ అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త భరత్కుమార్ ముగిసిన రిలే నిరాహార దీక్షలు ఆఖరి రోజు మునగపాకలో మానవహారం నేటి నుంచి రోజుకో గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన -
హస్త కళల్లో విజయాలు సాధించాలి
స్పీకర్ అయ్యన్న గొలుగొండ: కార్పెంటర్లు అన్ని రంగాల్లో రాణించి ప్రాచీన హస్త కళలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కోరారు. హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కృష్ణదేవిపేట గ్రామంలో శిక్షణ తీసుకున్న సుమారు 50 మంది హస్తకారులకు ఆదివారం రూ.5 లక్షల విలువైన పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్వీకర్ మాట్లాడుతూ ఏటికొప్పాక బొమ్మలు ఎంతో గుర్తింపు పొందాయని, అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్న వారు వస్తువులు తయారు చేసి గుర్తింపు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో హస్తకళల అభివృద్ధి సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ ఆపర్ణలక్ష్మి, విశాఖ లేపాక్షి మేనేజర్ కార్తీక్, విజయవాడ లేపాక్షి మేనేజర్ కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న పాల వ్యాన్
బుచ్చెయ్యపేట: మండల కేంద్రంలో పాల వ్యాన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఆదివారం తెల్లవారు జామున రాజాం నుంచి బుచ్చెయ్యపేట వైపు వస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న స్తంభాన్ని బలంగా ఢీకొంది. దీంతో స్తంభం విరిగిపోగా, ట్రాన్స్ఫార్మర్ కింద పడి వైర్లు తెగి పడ్డాయి. పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో పాటు లారీ వేగానికి చెట్లు విరిగి పడ్డాయి. నిత్యం జనాల రద్దీతో ఉండే ఈ రోడ్డులో తెల్లవారు జామున ప్రమాదం జరగగా, జన సంచారం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. లారీ డ్రైవర్ క్యాబిన్లో చిక్కుకుని కాలు విరిగిపోగా స్థానికులు కిందకి దించి సపర్యలు చేశారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండడంతో అంబులెన్స్లో అనకాపల్లి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కశింకోట– బంగారుమెట్ట(కేబీ) ఆర్అండ్బీ రోడ్డును ఆనుకుని విద్యుత్ స్తంభాలు వేయడంతో తరుచూ పలు ప్రమాదాలు జరుగుతున్న విద్యుత్ శాఖ, ఆర్అండ్బీ, పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. -
యువకుల మృతితో విషాద ఛాయలు
మునగపాక: అచ్యుతాపురంలో మండలంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఇద్దరు యువకులు మృతి చెందడంతో మునగపాక మండలంలోని గణపర్తి, చెర్లోపాలెం గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. చేదోడు వాదోడుగా ఉంటారనుకున్న తరుణంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడాన్ని ఆయా కుటుంబాలు జీర్ణించుకోలేక పోతున్నాయి. తమకు దిక్కెవరంటూ రోదిస్తున్న కుటుంబ సభ్యులను ఆపడం ఎవరి తరం కాలేదు. గణపర్తి గ్రామానికి చెందిన భోగాది మహేష్, లక్ష్మి దంపతులకు ఒక్కగా నొక్క కుమారుడు ధనువిజయ్(19). మహేష్ స్థానికంగా వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కుమారుడు ధను విజయ్ లైటింగ్ పనులకు సహాయకునిగా వెళ్తుంటాడు. ఎప్పటిలాగానే శనివారం రాత్రి ఇంటికి వస్తుండగా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం సమీపంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొని మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న కొడుకు అర్ధంతరంగా చనిపోవడాన్ని వారు తట్టుకోలేక పోతున్నారు. అలాగే చెర్లోపాలెం గ్రామానికి చెందిన దూళి దుర్గ(20) విద్యుత్ లైటింగ్ పనులు చేసుకుంటూ తల్లి నాగమణికి చేయూతగా నిలుస్తున్నాడు. తండ్రి గతంలో మృతి చెందడంతో కుటుంబానికి అండగా ఉంటూ జీవనం సాగిస్తున్న దుర్గ కూడా శనివారం రాత్రి తన స్నేహితుడు ధను విజయ్తో కలిసి బైక్పై వస్తుండగా జగన్నాథపురం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో చెర్లోపాలెంలో విషాదం నెలకొంది. దుర్గ తల్లి నాగమణి కూలిపని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇప్పుడు తనకు దిక్కెవరంటూ ఆమె కన్నీటి పర్వం చెందుతున్నారు. -
రేపు మాదిగల ఆత్మీయ కలయిక
పిక్నిక్ పోస్టర్ను ఆవిష్కరిస్తున్న యలక మల్లిబాబు అనకాపల్లి: జిల్లా మాదిగ జాతి ఐక్యతను చాటి చెప్పేందుకు కశింకోట మండలం బయ్యవరంలోని ప్రమీల గార్డెన్లో ఈనెల 16న ఉదయం 10 గంటలకు మాదిగల ఆత్మీయ కలయిక(వనసమారాధన) నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు యలక మల్లిబాబు తెలిపారు. ఆదివారం స్థానిక మెయిన్రోడ్డులోని ఎమ్మార్పీస్ కార్యాలయంలో ఆత్మీయ కలయిక పోస్టర్ను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఇప్పటికై నా మాదిగలను గుర్తించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ జిల్లా నాయకులు కట్టమూరు మంగరాజు, కొల్లి చిన్న అప్పారావు, వెలుసూరి గాటీలు, చెవ్వేటి అప్పారావు, కాకినాడ కనకేశ్వరరావు, చెవ్వేటి నాగరాజు, ముప్పిడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
సంరంభానికి సిద్ధం
యుద్ధ నౌకల సాక్షి, విశాఖపట్నం : మహాసముద్రాల మధ్య స్నేహపూర్వక బంధాల్ని బలోపేతం చేసేందుకు, అంతర్జాతీయ సమన్వయం, సహకారంతో నావికాదళ పరాక్రమాన్ని చాటిచెప్పేందుకు విశాఖపట్నం సిద్ధమవుతోంది. తూర్పు నౌకాదళ కేంద్రంగా అభివృద్ధి చెందిన విశాఖ తీరం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అతిపెద్ద యుద్ధ నౌకల సంరంభానికి ఆతిథ్యం ఇవ్వనుంది. 2026 ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు పది రోజుల పాటు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్)తో పాటు మినీ ఐఎఫ్ఆర్గా పిలిచే మిలాన్–2026, ఇండియన్ ఓషన్ నావల్ సింపోజియం (ఐఓఎన్ఎస్)లను ఏకకాలంలో ఇక్కడ నిర్వహించనున్నారు. ఈ మహోత్సవం కోసం తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు ముగిశాయి. ఆరు నెలల క్రితం నుంచి ఐదుసార్లకు పైగా సమీక్షలు నిర్వహించగా.. తాజాగా శనివారం తుది ప్రణాళిక సమావేశం జరిగింది. ఈఎన్సీ హెడ్క్వార్టర్స్ ఆపరేషన్స్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ మనోజ్ ఝా ఆధ్వర్యంలో జరిగిన ఈ తుది సమావేశానికి 60 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు ప్రత్యక్షంగా, వర్చువల్గా హాజరయ్యారు. స్నేహభావం, సమన్వయంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. 145 దేశాలకు ఆహ్వానం.. 2001లో భారత్లో తొలిసారి ముంబైలో ఐఎఫ్ఆర్ నిర్వహించిన సమయంలో 25 దేశాలు హాజరయ్యాయి. 2016లో విశాఖలో నిర్వహించినప్పుడు 51 దేశాలు హాజరయ్యాయి. 2025లో ఇండోనేషియాలోని బాలి సముద్ర తీరంలో ఐఎఫ్ఆర్లో 30 దేశాలు పాల్గొన్నాయి. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో ఐఎఫ్ఆర్, మిలాన్–2026 కోసం ఇప్పటివరకూ 137 దేశాలకు ఆహ్వానం పంపించింది. ఇప్పటి వరకూ 61 దేశాలు నమోదు చేసుకున్నాయి. 61 దేశాలకు సంబంధించి 23 యుద్ధ నౌకలు రాబోతున్నా యి. మిగిలిన దేశాలు త్వరలోనే సమ్మతిని వెల్లడించే అవకాశం ఉంది. ఈ విన్యాసాల్లో భారత నావికా దళానికి చెందిన సర్ఫేస్ యుద్దనౌకలు, జలాంతర్గాములతోపాటు నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొంటున్నాయి. ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లుస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి మొదలైన తరగతులకు చెందిన యుద్ధ నౌకలతో పాటు జలాంతర్గాములు, యుద్ధనౌకలకు అన్నివిధాల సహకారాన్ని అందించే ఫ్లీట్ ట్యాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్, గ్రీన్టగ్స్ సత్తా చాటనున్నాయి. అలాగే కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి ఇతర సముద్ర సంస్థలకు చెందిన నౌకలు ఈ ఫ్లీట్ రివ్యూలో భాగస్వామ్యం కానున్నాయి. అత్యాధునిక సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములు ఈ విన్యాసాల్లో భారత నావికాదళానికి చెందిన అత్యాధునిక సర్ఫేస్ యుద్ధనౌకలు, జలాంతర్గాములు, నావల్ ఏవియేషన్ విమానాలు పాల్గొననున్నాయి. ఇందులో ఢిల్లీ క్లాస్, రాజ్పుత్ క్లాస్, కమోర్తా క్లాస్, విశాఖ క్లాస్, శివాలిక్ క్లాస్, బ్రహ్మపుత్ర క్లాస్, నీలగిరి వంటి వివిధ తరగతులకు చెందిన యుద్ధ నౌకలు, జలాంతర్గాములతో పాటు సహాయకారి నౌకలైన ఫ్లీట్ ట్యాంకర్లు, టార్పెడో రికవరీ వెసల్స్ వంటివి తమ సత్తా చాటనున్నాయి. వీటితో పాటు కోస్ట్ గార్డ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) వంటి సముద్ర సంస్థలకు చెందిన నౌకలు కూడా ఈ సమీక్షలో భాగస్వామ్యం కానున్నాయి. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ సహకారంతో 2022లో ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూతో పాటు మిలాన్ను, 2024 ఫిబ్రవరిలో మరోసారి మిలాన్ విన్యాసాలను విశాఖ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పుడు ఐఎఫ్ఆర్కు ఆతిథ్యం ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ యుద్ధనౌకల ప్రదర్శనల కేంద్రంగా విశాఖ తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. ఎప్పుడు... ఎలా.. ఎవరెవరు.? ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్–2026, ఐఓఎన్ఎస్ కాంక్లేవ్ ఆఫ్ చీఫ్స్(సీవోసీ) కార్యక్రమాలు ఫిబ్రవరి 15 నుంచి 25 వరకూ విశాఖ వేదికగా వరుసగా నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 15 నుంచి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ(ఐఎఫ్ఆర్) ప్రారంభం కానుంది. డాక్టేరియన్, జాయింట్ ఆపరేషన్లపై ఐఎఫ్ఆర్లో మిత్రదేశాలతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 15 నుంచి వివిధ దేశాల నుంచి యుద్ధ నౌకలు, నౌకాదళ ప్రతినిధులు విశాఖకు రానున్నారు. 18న ప్రధాన కార్యక్రమం జరుగుతుంది. ఫ్లీట్ని భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సమీక్షించనున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ విన్యాసాలు, సదస్సు కార్యక్రమాల్లో 19వ తేదీ కీలకమైనది. ఫిబ్రవరి 19న సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పరేడ్ని బీచ్రోడ్డులో నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారు. అదేవిధంగా మిలాన్–2026 కూడా 19న ప్రారంభం కానుంది. దీంతో పాటు రక్షణ దళం, నౌకాదళంలో సాంకేతిక పరిజ్ఞానం పెంపొందించే అంశాలపై చర్చించేందుకు ఇండియన్ ఓషన్ నేషనల్కాంక్లేవ్(ఐఓఎన్ఎస్) సదస్సుని మహాసాగర్ పేరుతో అంతర్జాతీయ సదస్సు ప్రారంభం కానుంది. ఈ సదస్సుకు 25 సభ్యదేశాల చీఫ్లతో పాటు వివిధ దేశాలకు సంబంధించిన అతిథులు రాబోతున్నారు. ఐఎఫ్ఆర్, మిలాన్లో 19 నుంచి 20 వరకూ హార్బర్ ఫేజ్ విన్యాసాలు జరుగుతాయి. 21 నుంచి 25 వరకూ సీ ఫేజ్ విన్యాసాలు నిర్వహిస్తారు. ముగిసిన నౌకాదళ సన్నాహక సమావేశాలు విశాఖలో ఐ.ఎఫ్.ఆర్, మిలాన్, ఐఓఎన్ఎస్ నిర్వహణ ఫిబ్రవరి 15 నుంచి 25 వరకు విశాఖ తీరంలో యుద్ధ వాతావరణం ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ముగిసిన మూడు దఫాల సమీక్షలు సమీక్షలకు హాజరైన 60 దేశాలకు చెందిన నౌకాదళ ప్రతినిధులు -
‘దయ’ ఉంటేనే నష్టపరిహారం
● నిర్వాసితుల గుర్తింపులో ఏపీఐఐసీ అధికారి అక్రమాలు ● లంచాలు ఇస్తేనే అంచనాల తయారీ ● నిర్వాసితుల జాబితాలో స్థానికేతరులునక్కపల్లి: అతని దయ ఉంటేనే నిర్వాసితులు నష్టపరిహారానికి నోచుకుంటారు. లేకపోతే జాబితాలో చోటు దక్కదు. లంచాలు ఆశ చూపిస్తేనే అంచనాలు తయారు చేస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బల్క్ డ్రగ్పార్క్, ఆర్సిలర్మిట్టల్స్టీల్ప్లాంట్ కోసం నివాస ప్రాంతాలు త్యాగం చేసిన నిర్వాసితుల ఇళ్లకు నష్టపరిహారం చెల్లించే విషయంలో ఏపీఐఐసీ అఽధికారి దయ అనేక అక్రమాలకు పాల్పడుతున్నాడన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నాయకులు సిఫారసు చేసినవారికి, లంచాలు ఆశచూపిన వారికి అధికంగాను మిగిలిన వారికి తక్కువగా నష్టాన్ని అంచనా వేస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం సేకరిస్తున్న భూముల్లో తొలగించేందుకు గుర్తించిన ఇళ్లకు నష్టపరిహారం అంచనావేయడంతో ఏపీఐఐసీలో పనిచేస్తున్న దయ అనే ఉద్యోగి లంచాల ఆశ కారణంగా బాధితులకు తీరని అన్యాయం జరుగుతోందంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనర్హులైన వారు, స్థానికేతరులు నిర్వాసితుల జాబితాలో చోటు దక్కించుకుంటున్నారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకివెళ్తే చందనాడ పంచాయతీ తమ్మయ్యపేటలో సర్వేనంబరు 90 /9,90/10లలో సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో 70 ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. ఈ 12 ఎకరాలను ప్రభుత్వం స్టీల్ప్టాంట్కోసం సేకరిస్తోంది. ఈ నిర్మాణాలకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. ఇళ్లతోపాటు, రైతులకు చెందిన పశువుల షెడ్లు కూడా ఉన్నాయి. ఇళ్లకు చదరపు అడుగుకు రూ.750 చొప్పున నష్టపరిహారం చెల్లించడానికి నిర్ణయించారు.ఈ మేరకు నిర్మాణాలకు సంబంధించిన ఎన్యూమరేషన్, ఎస్టిమేషన్లు తయారు చేసే ప్రక్రియ జరుగుతోంది. ఏసీఐఐసీ, ఆర్అండ్బీఅధికారులు నిర్మాణాలకు విస్తీర్ణాన్ని బట్టి నష్టపరిహారం అంచనాలు తయారు చేస్తున్నారు. ఇక్కడే అధికారులు అక్రమాలకు పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆర్సీసీ శ్లాబ్ ఇళ్లకు తక్కువగా, షెడ్లు, పెంకుటిళ్లకు అధికంగాను అంచనాలు తయారు చేసి నష్టపరిహారం కోసం సిఫారసు చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్యూమరేషన్ చేస్తున్న అధికారుల్లో దయ అనే ఏపీఐఐసీ అధికారి చేతివాటం ప్రదర్శిస్తున్నారని, సదరు అధికారి కూటమినాయకులు సూచించిన వారికి, కమీషన్లు ఆశచూపించిన వారికి అధికంగా నష్టపరిహారం సిఫారసు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఈ సర్వే నంబర్లలో సుమారు 70 మంది మాత్రమే ఇళ్లు నిర్మించుకుని ఎప్పటినుంచో కాపురాలు చేస్తుంటే కొంతమంది టీడీపీ నాయకులు ఏపీఐఐసీ అధికారులతో కుమ్మకై ్క స్థానికేతరులు సుమారు 50 మందిని అదనంగా నిర్వాసితుల జాబితాల్లో చేర్చి వారికి కూడ ఇక్కడ ఇళ్లు ఉన్నట్లు నష్టపరిహారం కోసం ఎన్యూమరేషన్ చేయించి జాబితాలు సిద్ధం చేశారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. ఈ జాబితాలో ఉన్నవారెవరూ తమ గ్రామాలకు చెందిన వారు కాదనివారు చెబుతున్నారు. ఆరు సెంట్ల విస్తీర్ణంలో రెండు ఆర్సీసీ శ్లాబ్ ఇళ్లుకలిగిన దారబాబు అనే నిర్వాసితుడికి కేవలం రూ.6లక్షల నష్టపరిహారం సిఫారసు చేశారని, కేవలం రెండు సెంట్ల స్థలంలో కనకమ్మకు చెందిన రేకుల షెడ్డుకు రూ.5లక్షల నష్టపరిహారానికి సిఫారసు చేశారని బాదితులు చెబుతున్నారు..అలాగే నాగ చిన అమ్మాయి, గోవిందమ్మలకు చెందిన ఒకే ఇంటికి సంబంధించి ఇద్దరు నివసిస్తుంటే ఒకరికి అదనంగాను మరొకరికి తక్కువగా నష్టపరిహారం చెల్లించేందుకు సిఫారసు చేశారన్నారు. కె. వీరబాబు అనే వ్యక్తి ఇంటికి గతంలో రూ.2లక్షలకు అంచనాలు వేసి సిఫారసు చేయగా, తాజాగా నిర్వహించిన ఎన్యూమరేషన్లో రూ.5.30లక్షలకు సిఫార్సులు చేశారన్నారు. టీడీపీ నాయకులతో అధికారులు కుమ్మకై ్క కమీషన్లకు మాట్లాడుకుని తుని, యలమంచిలి, వెదుళ్లపాలెం, నక్కపల్లి, అడ్డురోడ్డు తదితర ప్రాంతాలకు చెందిన బినామీలను నిర్వాసితుల జాబితాల్లో చేర్చారన్న ప్రచారం జరుగుతోంది. ఇలా అధికారులు చేర్చిన 50 మందికి చందనాడ, తమ్మయ్యపేట, తుమ్మలపేట గ్రామాల్లో ఎక్కడా ఇళ్లు గాని, ఇంటిపన్ను రశీదులు గాని, కరెంటు బిల్లులు కాని లేవు. కేవలం నష్టపరిహారాన్ని కూటమినాయకులు, ఏపీఐఐసీ అధికారులు ఫిఫ్టీఫిఫ్టీ పంచుకోవడం కోసమే బినామీ పేర్లను జాబితాలో చేర్చినట్లు తెలుస్తోంది. నక్కపల్లి తహసీల్దార్ ఆర్.నరసింహమూర్తి వివరణ కోరగా అంచనాల తయారీలో అవకతవకలు జరుగుతున్న విషయం తన దృష్టికి వచ్చిందని చెప్పారు. దీనిపై డివిజనల్ ఇంజినీర్ స్థాయి అధికారితో రీ సర్వే జరిపిస్తామని తెలిపారు.కేవలం ఐదు లక్షలకు సిఫారసు చేసిన ఆర్సీసీ శ్లాబ్ ఇల్లు ఐదులక్షల నష్టపరిహారానికి సిఫారసు చేసిన రేకుల షెడ్లుఅంచనాలో వివక్ష నా కుమార్తె, మరో కుటుంబం కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు. రెండు పోర్షన్ల ఈ ఇంటికి నష్టపరిహారం అంచనాలో వివక్ష చూపించారు. నా కుమార్తెకు రూ.1.30లక్షలు మరో ఆసామీకి రూ.2.14లక్షలకు సిఫారసు చేశారు. ఇదెక్కడి అన్యాయం. ఒకే విస్తీర్ణంలో ఉన్న రెండు పోర్షన్లకు వేర్వేరుగా నష్టాన్ని ఎలా అంచనా వేస్తారు. – చిన అబ్బాయి, తమ్మయ్యపేటపరిహారంలో పక్షపాతం ఇళ్లకు నష్టపరిహారం చెల్లించడంలో ఏపీఐఐసీ అధికారులు పక్షపాతం చూపిస్తున్నారు. కూటమినాయకులు సిఫారసుల ప్రకారమే నష్టాన్ని అంచనా వేస్తున్నారు. గ్రామంలో లేని వారిపేరున ఇక్కడ ఇళ్లు ఉన్నట్లు నమోదు చేసి జాబితాలు సిద్ధం చేస్తున్నారు. నష్టపరిహారం, ఆర్అండ్ ఆర్ప్యాకేజీ చెల్లించకుండా ఇళ్లు ఖాళీ చేయాలంటున్నారు. ఇది జరగని పని, నిర్వాసితుల జాబితాలపైపూర్తిగా విచారణ జరపాలి. – కొప్పిరెడ్డి రోహిణి రాణి, చందనాడజాబితాలపై విచారణ చేయాలి స్థానికేతరులైన 50 మంది పేర్లు చందనాడలో నివాసం ఉంటున్నట్లు జాబితాల్లో చేర్చారు. వారికి కూడా నష్టపరిహారం చెల్లించేందుకు సిఫారసు చేస్తున్నారు. వీరెవరికి మా గ్రామపరిధిలో ఇళ్లు లేవు. వీరంతా ఇతర ప్రాంతాలకు చెందినవారు. ఈజాబితాలపై సమగ్రంగా విచారణ జరపాలి. దయ అనే అధికారి ఈ అక్రమాలకు పాల్పడుతున్నాడు. చాలా సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు. – తళ్ల భార్గవ్, వైఎస్సార్సీపీనేత, చందనాడ -
జీవీఎంసీకి ప్రతిష్టాత్మక పీఆర్ఎస్ జాతీయ అవార్డులు
అవార్డులు అందుకుంటున్న జీవీఎంసీ అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, పీఆర్వో నాగేశ్వరరావు డాబాగార్డెన్స్: పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో నిర్వహించిన 47వ అఖిల భారత పబ్లిక్ రిలేషన్స్ కాన్ఫరెన్స్–2025లో జీవీఎంసీ మూడు ప్రతిష్టాత్మక జాతీయ అవార్డులను సాధించింది. ఈ విషయాన్ని జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ‘ఎంపవరింగ్ గ్రోత్, ప్రిజర్వింగ్ రూట్స్, పీఆర్ విజన్ ఫర్ 2047’ అనే థీమ్తో జరిగిన ఈ సదస్సులో జీవీఎంసీ అమలు చేసిన ప్రజా సంక్షేమం, మహిళా సాధికారత, ఆర్థిక బలోపేతం, సామాజికాభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలకు జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు లభించింది. ఉత్తరాంఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, శాసనసభ స్పీకర్ రీతూ ఖండూరీ భూషణ్ చేతుల మీదుగా జీవీఎంసీ తరఫున అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, పౌర సంబంధాల అధికారి ఎన్. నాగేశ్వరరావు అవార్డులు అందుకున్నారు. -
కాపులంతా ఐక్యంగా ఉండాలి
తూర్పుకాపుల వన సమారాధనలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, తూర్పుకాపు సంఘం కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని చోడవరం: కాపులంతా ఐక్యంగా ఉండి, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ తెలిపారు. తూర్పుకాపు సంఘం, కె.ఆర్. గ్రూపు, కాపు సంక్షేమ సంఘం సంయుక్తంగా మండలంలోని గౌరీపట్నం సూర్యచంద్ర దేవాలయం సమీపంలో ఆదివారం వనసమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘాలకు చెందిన నాయకులు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ కాపు కులస్తులు సమష్టిగా ఉండి వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని అభివృద్ధి సాధించాలన్నారు. వెనుకబడి ఉన్నవారికి సహాయ సహకారాలు అందించాలని, వైఎస్సార్సీపీ హయాంలో ఉత్తరాంధ్ర తూర్పుకాపులకు సముచిత స్థానం దక్కిందని తెలిపారు. రాష్ట్ర తూర్పు కాపు సంఘం కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని మాట్లాడుతూ తూర్పు కాపు సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు కొన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, వారికి సహాయ సహకారాలు అందించి వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఏడువాక సత్యారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొండా రాంబాబు, ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, కాపు సంఘాలు ప్రతినిధులు, సమారాధన నిర్వహణ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ -
ప్రజాగ్రహం.. ప్రస్ఫుటం
చంద్రబాబు సర్కార్ తీరుపై ప్రజాగ్రహం ప్రస్ఫుటమైంది.. నిరంకుశపాలనపై నిరసన కలం ఝుళిపించింది.. ప్రైవేటీ కరణ వద్దని రణం సాగించింది.. వీధి, వాడా, పల్లె, పట్టణం అన్న తేడా లేకుండా.. పండితులు,పామరులు, విద్యార్థులు, మహిళలు, పురుషులు, మేధావులు అన్న బేధం లేకుండా కలాన్ని కరవాలంగా చేసి ఆగ్రహాన్ని చేవ్రాలుతో వ్యక్తం చేశారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఈ ప్రజాఉద్యమంలో భాగస్వాములై తమ నిరస స్పష్టంగా తెలియజేశారు.సాక్షి, అనకాపల్లి: పేదలకు ఉచితంగా వైద్య విద్య, ఉన్నత వైద్యాన్ని అందించాలన్న సంకల్పంతో గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కార్ ప్రైవేటుపరం చేయడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రభుత్వమే దళారీగా మారిపోయి వైద్యసేవలు, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం..విలువైన సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతుండటంపై అన్నివర్గాల ప్రజలు కన్నెర్ర చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ ప్రజా ఉద్యమం సూపర్ సక్సెస్ అయింది. సామాన్య ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. జిల్లాలో సంతకాల సేకరణ కార్యక్రమం ఎక్కడ నిర్వహించినా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చంద్రబాబు ప్రైవేటీకరణ నిర్ణయానికి చెంపపెట్టు లా సంతకాల రూపంలో తమ అభిప్రాయాలను తెలియజేశారు. జిల్లాలో సుమారు 3.86 లక్షల మంది చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ సంతకాల ఉద్యమానికి మద్దతు పలికారు. టీడీపీ నేతలకు చెంపపెట్టు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. వాటిలో గత ప్రభుత్వ హయాంలోనే ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి అయ్యాయి. వీటిలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం, పాడేరులో కొత్త మెడికల్ కాలేజీల్లో క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి. మిగిలిన పదింటిలో పార్వతీపురం జిల్లాలో సూపర్స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణ పనులూ తుదిదశకు చేరుకున్నాయి. అనకాపల్లి జిల్లా భీమబోయిన పాలెంలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు 60 శాతంకు పైగా పూర్తయ్యాయి. మిగిలినవి కూడా సగానికి పైగా పూర్తయ్యాయి. అయితే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటకు అప్పగించాలని నిర్ణయించిన తర్వాత... అసలు మెడికల్ కాలేజీల నిర్మాణమే జరగలేదంటూ టీడీపీ నేతలు అవాస్తవాలతో ప్రచారం మొదలుపెట్టారు. స్వయంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక అడుగు ముందుకు వేసి... అసలు మెడికల్ కాలేజీల నిర్మాణానికి జీవో ఎక్కడ ఉంది అంటూ ప్రశ్నించారు. జీవో ఉంటే తనకు చూపించాలంటూ సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 10వ తేదీన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలోని భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల భవనాల వద్ద జీవో కాపీని చూపించారు. దీంతో అటువైపు నుంచి అయ్యన్నపాత్రుడు చప్పుడు చేయకుండా మిన్నకుండిపోయారు. కోటి సంతకాల సేకరణ ఉద్యమంతో టీడీపీ నేతలకు చెంపపెట్టులాంటిది. జిల్లాలో సంతకాలు ఇలా.. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున సంతకాలను సేకరించారు. వీటిలో నర్సీపట్నం నియోజకవర్గంలో 61 వేలు, అనకాపల్లి నియోజకవర్గంలో 60 వేలు, చోడవరంలో 50వేలు, మాడుగులలో 50 వేలు, పాయకరావుపేటలో 52 వేలు, యలమంచిలిలో 50 వేలు, పెందుర్తిలో 55 వేల మంది సంతకాలు చేశారు.ఎ.కొత్తపల్లి గ్రామంలో సంతకాల సేకరణ చేయిస్తున్న మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు (ఫైల్)సంతకాల సేకరణ పత్రాలను స్వీకరిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్ పాయకరావుపేట, యలమంచిలి సమన్వయకర్తలు జోగులు, ధర్మశ్రీ (ఫైల్)కోటి సంతకాల ఉద్యమ ర్యాలీలో పాల్గొనాలి దాదాపుగా రెండు నెలల పాటు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొని తమ సంతకాల ద్వారా ఉద్యమానికి మద్దతు పలికిన సామాన్యప్రజలకు, మేధావులకు, యువత, విద్యార్థులకు, వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ నెల 15వ తేదీన ఈ ఉద్యమంలో సేకరించిన సంతకాలను అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయం నుంచి తాడేపల్లిలో గల కేంద్ర పార్టీ కార్యాలయానికి తరలించనున్నాం. ఈ సందర్భంగా నిర్వహించే ర్యాలీలో సామాన్య ప్రజలు, యువత, విద్యార్థులు , వైఎస్సార్సీపీ పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలి. – గుడివాడ అమర్నాథ్, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడుఉద్యమం సాగిందిలా...వైద్యకళాశాలల ప్రైవేటీకరణపై నిరసిస్తూ... వైఎస్సార్సీపీ చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ ప్రజా ఉద్యమంలో ప్రజలు ఎక్కడికక్కడ తమ సంతకాలతో ప్రభుత్వ నిర్ణయంపై ప్రజాగ్రహం చూపించారు. అక్టోబరు 10వ తేదీన ఈ ఉద్యమం ప్రారంభమైంది. రెండు నెలలపాటు ‘రచ్చబండ కార్యక్రమం’ ద్వారా సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. అదేవిధంగా నవంబరు 12న రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు. ఈ ర్యాలీల్లో వేలాది మంది ప్రజలు భాగస్వామ్యమై మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడాన్ని నిరసించారు. నియోజకవర్గాల పార్టీ కార్యాలయాల నుంచి సేకరించిన సంతకాలను ర్యాలీగా డిసెంబర్ 10న జిల్లా కేంద్రాలకు తరలించారు. భారీ ర్యాలీ సంతకాల పత్రాలతో ఈ నెల 15న అనకాపల్లి టౌన్ రింగ్ రోడ్డులో ఉన్న వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి బెల్లంమార్కెట్, పెరుగుబజార్ మీదుగా ఎన్టీఆర్ క్రీడా మైదానం వరకూ ర్యాలీ నిర్వహించనున్నారు. అక్కడ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ జెండా ఊపి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి ఈ సంతకాల పత్రాలను తరలిస్తారు. అనంతరం 17వ తేదీన వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు గవర్నర్కు అందజేయనున్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పెల్లుబికిన నిరసన చంద్రబాబు సర్కారు తీరుపై కోట్లామంది కన్నెర్ర కోటి సంతకాల ప్రజా ఉద్యమం.. సూపర్ సక్సెస్ చేవ్రాలుకు వెల్లువలా తరలివచ్చిన సామాన్య ప్రజానీకం జిల్లాలో 3.86 లక్షల మంది నుంచి సంతకాలు సేకరణ నేడు పార్టీ జిల్లా కార్యాలయం నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలింపు -
విశేష స్పందన
‘సాక్షి’ స్పెల్ బీ సెమీ ఫైనల్స్కుసీతంపేట: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ‘స్పెల్ బీ 2025–26’ సెమీఫైనల్ పోటీలకు విశేష స్పందన లభించింది. సీతమ్మధార నార్త్ ఎక్స్టెన్షన్లోని శ్రీవిశ్వ స్కూల్లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నాలుగు కేటగిరీల్లో ఈ పోటీలు జరిగాయి. రీజనల్ లెవెల్లో జరిగిన ఈ పోటీల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి పలు పాఠశాలలకు చెందిన 120 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు నాలుగు కేటగిరీల్లో పోటీలు నిర్వహించారు. 40 నిమిషాల వ్యవధితో, 40 మార్కులకు ఈ పరీక్ష జరిగింది. ఇందులో గెలుపొందిన విజేతలు హైదరాబాద్లో జరగనున్న ఫైనల్ పోటీల్లో పాల్గొంటారు. ఈ పోటీలకు ‘డ్యూక్స్ వేఫీ’ప్రధాన స్పాన్సర్గా, ‘ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్(రాజమండ్రి)’అసోసియేట్ స్పాన్సర్గా వ్యవహరించారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా ‘సాక్షి’ స్పెల్ బీ పోటీలు దోహదపడుతుండటంతో.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు స్వయంగా పిల్లలను పరీక్ష కేంద్రాలకు తీసుకువచ్చారు. దీంతో శ్రీవిశ్వ స్కూల్ ఆవరణ సందడిగా మారింది. ఈ పోటీలను ‘సాక్షి’ విశాఖ బ్రాంచి మేనేజర్ వి.వి.ఎస్.చంద్రరావు పర్యవేక్షించగా, శ్రీ విశ్వ విద్యాసంస్థల చైర్మన్ కె.ధర్మరాజు, డైరెక్టర్ పి.సూర్యనారాయణ పాల్గొన్నారు.భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయి ‘సాక్షి’స్పెల్ బీ పోటీలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా ఒకసారి హాజరయ్యాను. స్పెల్ బీ వల్ల ఉచ్చారణ, భాషాజ్ఞానం పెరుగుతాయి. కొత్త పదాలు తెలుస్తాయి. ప్రతి విద్యార్థి ఇందులో పాల్గొనడం వల్ల, ముఖ్యంగా తెలుగు మాధ్యమం విద్యార్థులు తమ ఇంగ్లిష్ స్పెల్లింగ్ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవచ్చు. – పి.జీవన్ కుషాల్, వేపగుంట క్రమం తప్పకుండా పోటీలు విద్యార్థుల్లో ఆంగ్ల భాషా నైపుణ్యాలు పెంపొందించేలా ‘సాక్షి’మీడియా ఏటా స్పెల్బీ, మ్యాథ్స్బీ పోటీలు నిర్వహిస్తోంది. ఈసారి సెమీఫైనల్ పోటీలకు మా పాఠశాల వేదిక కావడం సంతోషంగా ఉంది. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇటువంటి పోటీల వల్ల ఇంగ్లిష్, మ్యాథ్స్లో వారు మరింత పట్టు సాధించగలరు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలి. – ఎ.ఆర్.కె.శివాజీ, డైరెక్టర్, శ్రీవిశ్వ స్కూల్ ఇంగ్లిష్పై పట్టు సాధించవచ్చు ‘సాక్షి’పేపర్లో ప్రకటన చూసి, మా స్కూల్ టీచర్లు చెప్పడంతో పలాస నుంచి స్పెల్ బీ సెమీఫైనల్ పోటీలకు హాజరయ్యాను. ఇంగ్లిష్ పదాల ఉచ్చారణ, కొత్త పదాలు నేర్చుకున్నాను. ఇంగ్లిష్ వకాబులరీ, ఫోనిక్స్, సౌండ్స్పై అవగాహన పెంచుకుని భాషపై పట్టు సాధించడానికి ‘సాక్షి’నిర్వహించిన ఈ పోటీలు ఎంతగానో సహాయపడతాయి. – దాసరి తేజేశ్వరరావు, 8వ తరగతి, పలాస ఫైనల్స్కు వెళ్తానన్న నమ్మకం ఉంది నేను శ్రీకాకుళంలో 8వ తరగతి చదువుతున్నాను. ఇప్పటి వరకు నిర్వహించిన రౌండ్లలో గెలుపొంది, ఇప్పుడు సెమీ ఫైనల్ పోటీకి చేరుకోవడం ఆనందంగా ఉంది. ఇంగ్లిష్ నైపుణ్యాలు మెరుగుపర్చుకోవడానికి స్పెల్ బీ ఎంతో ఉపయోగపడుతుంది. – రౌతు చైతన్య, 8వ తరగతి, శ్రీకాకుళం -
కిక్కిరిసిన బొజ్జన్నకొండ
బొజ్జన్నకొండకు పోటెత్తిన విద్యార్థులు, సందర్శకులు తుమ్మపాల: జిల్లా కేంద్రం అనకాపల్లి పట్టణానికి సమీపంలో శంకరం గ్రామంలో ఉన్న ప్రసిద్ధ బొజ్జన్నకొండ ఆదివారం సందర్శకులతో కిక్కిరిసిపోయింది. గుహలు, బౌద్ధ స్థూపం, చైత్యాలు, పురాతన కట్టడాలను తిలకించిన పలువురు మంత్రముగ్ధులయ్యారు. జిల్లాలో పలు పాఠశాలల విద్యార్థులు ఇక్కడికి వనసమారాధనకు తరలి వచ్చారు. బొజ్జన్నకొండతో పాటు లింగాల కొండను సందర్శించి , సాయంత్రం వరకు ఆట పాటలతో సందడి చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులకు మౌలిక సౌకర్యాలు లేక పలు ఇబ్బందులు పడ్డారు. నిబంధనల పేరుతో కొండ పరిసరాల్లో సందర్శకులు, విద్యార్థుల వనసమారాధనకు సిబ్బంది అడ్డంకులు సృష్టిస్తున్నారని పలువురు వాపోయారు. -
నూకాంబికకు పూజలు
నూకాంబిక అమ్మవారిని దర్శించుకుంటున్న భక్తులు అనకాపల్లి: స్థానిక గవరపాలెం నూకాంబిక అమ్మవారిని ఆదివారం పలు ప్రాంతాల భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మార్గశిర మాసం కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉద్యోగులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అంతకుముందు రాష్ట్ర తూర్పుకాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పాలవలస యశస్విని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
జిల్లా జీజేఏఎల్ అధ్యక్షునిగా సుందరావు
జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల అసోసియేషన్ నూతన కార్యవర్గం అనకాపల్లి: జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల అసోసియేషన్(జీజేఏఎల్) అధ్యక్షుడిగా కె.సుందరావు(మాకవరపాలెం) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక మెయిన్రోడ్డు జీవీఎంసీ పెద్ద హైస్కూల్ ఆవరణలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా ఆర్.గంగరాజు(కేడీ పేట), కార్యదర్శిగా కె.పి.కుమార్(పాయకరావుపేట), సహాయ కార్యదర్శి బి.ఉషారాణి(నక్కపల్లి), కోశాధికారిగా ఎం.శ్రీనివాసరావు(నర్సీపట్నం), లైబ్రెరీ కార్యదర్శిగా పి.వి.కల్యాణి(పరవాడ), రాష్ట్ర కౌన్సిలర్గా వై.స్వామి(నర్సీపట్నం) ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా విశాఖ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.పి.నాయుడు, రాష్ట్ర సహాయ కార్యదర్శి పి.ఎం.కె.ఎం.నాయుడు వ్యవహరించారు. ప్రభుత్వ అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కె.సుందరావు తెలిపారు. -
పూర్వ విద్యార్థుల సహకారం..వర్సిటీకి వరం
తాళపత్రాల జ్ఞానాన్ని వినియోగంలోకి తేవాలి ● ‘వేవ్స్ 2025’లో రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ప్రసంగిస్తున్న సుధామూర్తికార్యక్రమానికి హాజరైన పూర్వవిద్యార్థులుమద్దిలపాలెం: ఏయూ పూర్వ విద్యార్థుల సంఘం వార్షిక సమ్మేళనం ‘వేవ్స్ 2025’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఇన్ఫోసిస్ ఫౌండేషన్, మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సుధామూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా ఆమె ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం కార్యాలయాన్ని సందర్శించి, సంఘం వ్యవస్థాపక చైర్మన్ జి.ఎం.రావుతో కలిసి కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏయూ అభివృద్ధికి పూర్వవిద్యార్థులు సహకరించాల్సిన విధానంపై ఆమె పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఏయూలో ఉన్న తాళపత్రాల జ్ఞానాన్ని నిపుణులతో అధ్యయనం చేయించి, వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. బలమైన పూర్వవిద్యార్థుల బంధాన్ని ఏర్పరచడం, బోధనను పటిష్టం చేయడం, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం వంటి అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఆమె ఏయూ పరిపాలనా భవనం నుంచి బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. అక్కడ రతన్ టాటా ఆవిష్కరించిన ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం పైలాన్ను సందర్శించారు. ప్రధాన వేదికపై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, వ్యవస్థాపక ఉపకులపతి కట్టమంచి రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వీసీ రాజశేఖర్, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఏయూ పూర్వవిద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ కుమార్రాజా, జనరల్ సెక్రటరీ ఆకుల చంద్రశేఖర్, ఇతర ఈసీ సభ్యులు, పూర్వ చైర్మన్ పాల్గొన్నారు. -
యలమంచిలిని అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించాలి
మునగపాక : ప్రజలకు స్థానికంగా పాలన అందించాల్సిన కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడడం సరికాదని వైఎస్సార్సీపీ యలమంచిలి నియోజకవర్గ సమన్వయ కర్త కరణం ధర్మశ్రీ హితవు పలికారు. యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి డివిజన్లో కాకుండా నక్కపల్లి కేంద్రంగా ఏర్పాటు కానున్న డివిజన్లో కలపడాన్ని నిరసిస్తూ మునగపాకలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి ఆరవ రోజుకు చేరుకున్నాయి. మునగపాక, చూచుకొండ, మెలిపాక గ్రామాలకు చెందిన నాయకులు, ప్రజలు దీక్షలో కూర్చొన్నారు. వారికి సంఘీభావంగా సమన్వయ కర్తలు కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ మద్దతు పలికారు. ముందుగా మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పలువురు నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ ఎప్పటి నుంచో అనకాపల్లి రెవెన్యూ డివిజన్లో యలమంచిలి నియోజకవర్గం కొనసాగేదని అయితే కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 1491 ద్వారా నక్కపల్లి కేంద్రంగా ఏర్పాటు కానున్న డివిజన్లో కలపడం సరికాదన్నారు. ఈ ప్రాంత రైతులు, ప్రజలు తమ పనుల కోసం నక్కపల్లి వెళ్లాలంటే ఎంతో వ్యయ ప్రయాసలకు గురి కావాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం పునరాలోచించి అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలి నియోజకవర్గం కొనసాగేలా చూడాలన్నారు. దీనికోసం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో ప్రజలు, రైతులతో కలిసి పోరాటం ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ పెంటకోట స్వామి సత్యనారాయణ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు, మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయుల ఆటల పోటీలు ప్రారంభం
క్రీడా పోటీలను ప్రారంభిస్తున్న స్పీకర్ నర్సీపట్నం: ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి ఆటల పోటీలను స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల్లో ఉన్న క్రీడానైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఈ పోటీలు దోహదపడతాయన్నారు. వెనకబడిన విద్యార్ధులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములను చేయాలన్నారు. ప్రతి పాఠశాలలో యోగాలో విద్యార్థులకు తర్పీదు ఇవ్వాలన్నారు. నియోజకవర్గంలోని 38 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో క్రీడా మైదానాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధుల నుంచి ఒక్కొక్క స్కూల్కు రూ.5 లక్షలు ఇస్తానన్నారు. అనంతరం బ్యాటింగ్ చేసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.గోపీనాథ్. ఎంఈవో సిహెచ్.తలుపులు, 12 మండలాలకు చెందిన ఎంఈవోలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కనులపండువగా..కనకమహాలక్ష్మి రథయాత్ర
డాబాగార్డెన్స్ (విశాఖ): కనకమహాలక్ష్మి అమ్మవారి రథయాత్ర శనివారం వైభవంగా సాగింది. అమ్మవారి మాలధారణ చేసిన భక్తులు పూర్ణ కలశాలతో యాత్రలో పాల్గొన్నారు. మార్గశిర మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన యాత్రను సాయంత్రం 4 గంటలకు జగదాంబ జంక్షన్ మహారాణిపేటలో ఉన్న అమ్మవారి దత్తత దేవాలయం అంబికాబాగ్ సీతారామచంద్రస్వామి ఆలయం నుంచి ప్రారంభించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఆలయ ఈవో కె. శోభారాణి, పలువురు ప్రముఖులు ఈ యాత్రకు శ్రీకారం చుట్టారు. జగదాంబ జంక్షన్, టర్నర్చౌల్ట్రీ, పూర్ణామార్కెట్, ఏవీఎన్ కాలేజీ డౌన్, టౌన్ కొత్తరోడ్డు, రీడింగ్రూమ్ మీదుగా అమ్మవారి దేవస్థానం వరకు యాత్ర సాగింది. రథయాత్రలో విజయనగరం మహారాజ కళాశాల కళాకారుల పులివేషాలు, చెక్కభజన, కోలాటం, తప్పిటగుళ్లు, నవదుర్గలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఆలయ అధికారులు, వేదపండితులు, అర్చకులు, మాలధారణ చేసిన మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కనకమహాలక్ష్మికి విశేష పూజలు.. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు కనకమహాలక్ష్మి అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. అమ్మవారికి విశేషంగా పూజలు చేశారు. ఉదయం 7 నుంచి 8 గంటల వరకు అమ్మవారికి క్షీరాభిషేకం, పసుపు కుంకుమ నీళ్లతో అభిషేకం జరిపారు. పలువురు ఉభయదాతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సహస్ర తులసీదళార్చన పూజలో పలువురు ఉభయ దాతలు పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం 3 వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. -
యువతిని మోసగించిన యువకుడి అరెస్టు
పాయకరావుపేట : యువతిని ప్రేమించి, పెండ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్టు సీఐ జి.అప్పన్న తెలిపారు. మండలంలో రాజయ్యపేటకు చెందిన అమ్మాయిని, తొండంగి మండలం వేమవరం గ్రామానికి చెందిన ఒక యువకుడు ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేయడంతో అమ్మాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు స్ధానిక వైజంక్షన్ వద్ద సదరు యువకుడిని అదుపులోనికి తీసుకుని, కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు. నిందితుడిని శనివారం యలమంచిలి కోర్టుకి తరలించగా కోర్డు అతనికి 14 రోజులు రిమాండ్ ఇచ్చిందన్నారు. అతని వద్ద నున్న మోటారు బైక్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
ఖైదీలు డబుల్.. సిబ్బందికి ట్రబుల్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని సిబ్బంది కొరత వేధిస్తోంది. జైలు సామర్థ్యానికి దాదాపు రెట్టింపు ఖైదీలు ఉన్నప్పటికీ, సిబ్బంది కొరత కారణంగా అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న అరకొర సిబ్బందితోనే నెట్టుకురావాల్సి వస్తోంది. కొన్నేళ్లుగా భర్తీ జరగకపోవడంతో ప్రస్తుతం ఇక్కడ 27 మంది వార్డర్లు, హెడ్ వార్డర్ల కొరత ఉంది. 2000లో కొత్త జైలు ప్రారంభించినప్పుడు 162 మందిని(వార్డర్ల నుంచి సూపరింటెండెంట్ వరకు) నియమించారు. బదిలీలు, ఉద్యోగ విరమణల కారణంగా ప్రస్తుతం 135 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారు. నిజానికి ఇక్కడ జైలు సామర్థ్యం 914 మంది కాగా.. శుక్రవారం నాటికి 1,704 మంది ఖైదీలు ఉన్నారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన ముద్దాయిలతో ఎనిమిదేళ్లుగా జైలు కిక్కిరిసిపోతోంది. అయినప్పటికీ ఉన్నతాధికారులు ఈ జైలుపై దృష్టి పెట్టడం లేదు. ఖైదీల రద్దీకి అనుగుణంగా సిబ్బందిని పెంచాల్సిన అవసరాన్ని అధికారులు గుర్తించడం లేదు. పెరుగుతున్న ఖైదీల సంఖ్యను బట్టి, ఇక్కడ కనీసం 200 మందికి పైగా సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉంంది. దీనిపై జైలు సూపరింటెండెంట్ ఎం.మహేష్ బాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం 27 మంది వార్డర్లు, హెడ్ వార్డర్ల కొరత ఉందని తెలిపారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రత్యేకంగా జైలు రిక్రూట్మెంట్లో సిబ్బందిని భర్తీ చేసే ఆలోచనలో ఉన్నతాధికారులు ఉన్నట్లు సూపరింటెండెంట్ వివరించారు. -
పోర్టును గాలికొదిలేశారు..!
సాక్షి, విశాఖపట్నం : మేజర్ పోర్టులతో పోటీపడుతూ.. సరకు రవాణాలో దూకుడుగా వెళ్తున్న విశాఖపట్నం పోర్టు అథారిటీ(వీపీఏ)కి కేంద్ర ప్రభుత్వం బ్రేకులు వేసేసింది. ఒకేసారి ఉన్నతాధికారులను బదిలీ చేసి.. వారి స్థానంలో కొత్తవారిని నియమించకుండా.. పోర్టు కార్యకలాపాలను గాలికొదిలేసింది. ఇదే అదనుగా ఓ మహిళా అధికారి పోర్టులో పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇన్చార్జ్ చైర్మన్ కూడా పట్టించుకోకపోవడంతో ఆయా విభాగాధికారులు ఎవరికివారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ముందుకు కదలని ఫైళ్లు విశాఖ పోర్టు అనాథగా మారిపోయింది. అధికారులంతా బదిలీ అవ్వడంతో కార్యకలాపాలు, ఇతర వ్యవహారాలు అస్తవ్యస్తమైపోయాయి. పోర్టు చైర్మన్ డా.అంగముత్తుని ముంబై పోర్టు చైర్మన్గా బదిలీ చేయడంతో పాటు వీపీఏ ఇన్చార్జ్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించారు. అయినా.. చైర్మన్ మాత్రం ముంబైకే పరిమితమయ్యారు. నెలలో ఒకట్రెండు సార్లు మాత్రమే పోర్టుకు వస్తూ.. తూతూ మంత్రంగా సమీక్షలు నిర్వహించి వదిలేస్తున్నారు. దీంతో పాలన గాడితప్పింది. ఇక డిప్యూటీ చైర్మన్గా దుర్గేష్ కుమార్ దూబే పదవీ కాలం ఇంకో రెండు నెలలు ఉన్నా.. ఇటీవలే బదిలీ చేస్తూ ఉత్తర్వులు వచ్చాయి. పోర్టు చరిత్రకు భిన్నంగా డిప్యూటీ చైర్మన్ పదవీకాలం ఉన్నప్పటికీ బదిలీ చేసేశారు. రిలీవ్ అయ్యేందుకు ఈ నెల 19వ తేదీ వరకూ సమయం ఉన్నా బదిలీ విషయంలో జరిగిన అన్యాయంతో పోర్టు వ్యవహారాల్ని పట్టించుకోవడం మానేశారు. అదేవిధంగా ఏళ్ల తరబడి సెక్రటరీగా వ్యవహరించిన వేణుగోపాల్ని పారాదీప్ పోర్టుకు డిప్యూటీ చైర్మన్గా బదిలీ చేశారు. పరిపాలన వ్యవహారాల ఫైళ్లు ముందుకు కదిపే ఉన్నతాధికారులు లేకపోవడంతో పోర్టులో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారిపోయింది. అంతా ఆమె కనుసన్నల్లోనే..! ట్రాఫిక్ విభాగంలో ఉన్నతాధికారి అనారోగ్యం కారణంగా అంతంత మాత్రంగానే విధుల నిర్వహణలో భాగస్వామ్యమవుతున్నారు. దీంతో ఈ విభాగంలో కార్యకలాపాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. కేవలం షిప్స్ బెర్తింగ్, లోడింగ్, అన్లోడింగ్ వ్యవహారాలు కిందిస్థాయి సిబ్బంది ద్వారా మేనేజ్ చేస్తున్నారు. ఇలా పోర్టులో ప్రతి విభాగాన్ని నడిపించే నాయకత్వం లేకపోవడంతో వ్యవహారాలు సరిగా జరడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉన్నతాధికారులెవ్వరూ లేకపోవడంతో ఓ మహిళా అధికారి.. అంతా తానై పోర్టులో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమైపె గతంలో సీబీఐ దాడులు జరిగాయి. తర్వాత విధుల్లో చేరిన సదరు మహిళా అధికారి ఇప్పుడు పోర్టులో గుత్తాధిపత్యం చెలాయిస్తున్నారంటూ విమర్శలొస్తున్నాయి. పోర్టులో అన్ని విభాగాల్లోనూ ఆమె తలదూర్చి.. ఉద్యోగుల్ని ఇబ్బంది పెడుతున్నారంటూ పోర్టు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. వీలైనంత త్వరగా విభాగాధిపతులను నియమించి పోర్టును తిరిగి గాడిలో పెట్టాలంటూ ఉద్యోగులు కోరుతున్నారు. -
ఏయూ తెలుగు విభాగం అరుదైన ఘనత
బీచ్రోడ్డు (విశాఖ): ఏయూ తెలుగు విభాగం అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ–2025లో ఈ విభాగానికి చెందిన 52 మంది విద్యార్థులు ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించారు. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ఏయూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో వీరిని తెలుగు విభాగం శాఖాధిపతి ఆచార్య జెర్రా అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ముఖ్య అతిథి ఏయూ ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎ.నరసింహారావు మాట్లాడుతూ వందేళ్ల పండగ జరుపుకుంటున్న ఆంధ్రా యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులంతా ధన్యజీవులన్నారు. ఉపాధ్యాయ కొలువులు పొందిన వారిని అభినందిచారు. ఆచార్య జెర్రా అప్పారావు మాట్లాడుతూ తన హయాంలో ఒకే డీఎస్సీలో 52 మంది విద్యార్థులు టీచర్ ఉద్యోగాలు సాధించడం మధుర ఘట్టంగా నిలిస్తుందన్నారు. ఏయూ పరిశోధక విద్యార్థి, జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు సమన్వయకర్తగా వ్యవహరించిన గౌరవ ఆచార్యుడు పర్వతనేని సుబ్బారావు, బహు గ్రంథకర్త, లోక్ నాయక్ ఫౌండేషన్ అవార్డు గ్రహీత, గౌరవాచార్యుడు వెలమల సిమ్మన్న పాల్గొన్నారు. -
నాడు ముంపు
నేడు హ్యాపీసాక్షి, విశాఖపట్నం : ‘హుద్హుద్ వంటి తుపాన్ల పరంగా చూస్తే విశాఖపట్నం సునిశిత ప్రాంతం. ఇక్కడ రాజధాని అంటే రిస్క్తో కూడుకున్న వ్యవహారం.’ ‘సముద్ర మట్టాలు పెరుగుతుండటం వల్ల తీర ప్రాంత నగరమైన విశాఖపట్నం ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది. ఉత్తర కోస్తా తీరం నుంచి 100 కి.మీ దూరంలో సముద్రంలో చీలిక ఉంది. సునామీ వస్తే క్షణాల్లో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది’ కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన సమయంలో చంద్రబాబు అండ్ కో కలిసి పచ్చపత్రికల సాయంతో విశాఖపట్నంపై చిమ్మిన విషం ఇది. కానీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత.. విశాఖపట్నం మోస్ట్ హ్యాపియెస్ట్ సిటీ. అత్యంత సురక్షిత నగరం. ప్రపంచమంతా మెచ్చే నగరం అంటూ చంద్రబాబు వైజాగ్ భజన చేస్తున్నారు. రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి చంద్రబాబు రెండు నాల్కల ధోరణే అవలంబిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకమాట.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో మాట చెప్పడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. సీఎం కుర్చీలో కూర్చున్న ప్రతిసారీ వైజాగ్ ఆర్థిక రాజధాని అంటూ ఊదరగొట్టే ఆయన.. ఆ దిశగా అభివృద్ధి చెందేందుకు అవకాశం వచ్చినప్పుడు మాత్రం పూర్తిగా మాటమార్చేశారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార వికేంద్రీకరణ జరిగితే రాష్ట్రమంతా సమాంతరంగా అభివృద్ధి చెందుతుందని భావించి.. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా.. అమరావతిని శాసన రాజధానిగా.. కర్నూలును న్యాయరాజధానిగా ప్రకటించారు. అప్పుడే చంద్రబాబు తన వైఖరిని బయటపెట్టుకున్నారు. రాజధానిగా విశాఖకు ఎలాంటి అవకాశాలు లేవనీ.. తుపాన్లు, సముద్ర ముంపుతో భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవంటూ తన అనుయాయ పత్రికలు, ప్రసారమాధ్యమాల ద్వారా.. పార్టీ నాయకుల ద్వారా ప్రచార హోరు సాగించారు. విశాఖ అభివృద్ధి కాకుండా విశ్వప్రయత్నాలు చేశారు. అప్పటి నుంచే విశాఖ వైపు అడుగులు అధికారంలో రాగానే బాబు గారికి ‘విశాఖ’ రంగు మారెనూ.. నాడు కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించిన వైఎస్ జగన్ ఆ సమయంలో విశాఖపై విషం చిమ్మిన టీడీపీ, జనసేన నేతలు సముద్రం ముందుకొచ్చి మునిగిపోతుందంటూ విష ప్రచారం భూకంపాల తీవ్రతా ఉందంటూ పచ్చరాతలు అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ చుట్టూ ప్రదక్షిణలు నగరం అత్యంత సురక్షితమంటూ హడావుడి చేస్తున్న చంద్రబాబు బ్యాచ్ -
లోక్ అదాలత్తో సత్వర న్యాయం
విశాఖ లీగల్ : రాజీమార్గమే రాజమార్గమని విశాఖ జిల్లా ప్రధాన న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు అన్నారు. శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ మెగా లోక్ అదాలత్ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ కక్షిదారులకు సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా లభిస్తుందన్నారు. శాశ్వతమైన పరిష్కారం, ఫలాలను అందించే రాజీమార్గాన్ని కక్షిదారులు ఎంచుకోవాలన్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన మెగా లోక్దాలత్కు విశేష స్పందన లభించిందన్నారు. మూడు జిల్లాల పరిధిలో 43 ప్రత్యేక బెంచీలను ఏర్పాటు చేశామని, న్యాయస్థానంలో రాజీకి అనుగుణంగా 25 వేల పైచిలుకు కేసులను గుర్తించామన్నారు. న్యాయవాదులు, కక్షిదారులు, సిబ్బంది, అధికారులు, బ్యాంకులు, బీమా కంపెనీలు అందించిన సేవలకు న్యాయమూర్తి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా న్యాయ సేవా ప్రాధికార సంస్థ కార్యదర్శి ఆర్.సన్యాసినాయుడు మాట్లాడుతూ లోక్ అదాలత్తో తొలిసారిగా రెండు కేసుల్లో రూ.2 కోట్లు అందించినట్లు వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్, ద న్యూ ఇండియా ఎస్యురెన్స్ కంపెనీల ద్వారా రూ.1.9 కోట్లు బాధితులకు అందజేశారు. ఏడో అదనపు జిల్లా కోర్టులో రూ.40 లక్షలు, 12వ అదనపు జిల్లా కోర్టులో రూ.1.5 కోట్లు పరిహారంగా అందజేశారు. తొలిసారిగా భారీ మొత్తంలో పరిహారాన్ని వినియోగదారులకు అందించి న్యాయస్థానాలకు సహకరించిన బీమా కంపెనీలకు కార్యదర్శి సన్యాసినాయుడు అభినందించారు. కేసుల వివరాలు 160 మోటారు ప్రమాద కేసులను పరిష్కరించి నష్టపరిహారం కింద రూ.12,55,19,761 అందజేశారు. సివిల్ 430 కేసులు, క్రిమినల్ 13,722 కేసులు, సీ్త్ర లిటిగేషన్ 157 కేసులు రాజీ చేయడంలో ఉమ్మడి విశాఖ జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. కోర్టులో ఉన్న సివిల్ మార్టిగేజ్ సూట్ కేసులో రూ.50 లక్షలు కేసు రాజీ కుదరింది. పీఎల్సీలో రూ.70 లక్షలు విచారణకు ముందే (కరూర్ వైశ్య బ్యాంకు) రాజీ ప్రయత్నాల ద్వారా సెటిల్మెంటు పూర్తయింది. అయిదు కేసులకు సంబంధించిన భార్యభర్తలు తిరిగి కలిసి జీవించడానికి అంగీకారం కుదిరింది. అంతిమ తీర్పు అనకాపల్లి టౌన్: లోక్ అదాలత్ తీర్పు అంతిమ తీర్పని, సులువుగా తగవులు పరిష్కరించుకోవాలని పదో అదనపు జిల్లా న్యాయమూర్తి వి నరేష్ అన్నారు. స్ధానిక కోర్టు సముదాయంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో ఏడు బెంచ్లు నిర్వహించారు. మొత్త్తం 2053 కేసులు పరిష్కారమయ్యాయి. న్యాయమూర్తులు పి.నాగేశ్వరావు, జి.రామకృష్ణ, జి.ధర్మారావు, ఎ.రమేష్, బి.వి.విజయలక్ష్మి, నికితా సెంగర్ తదితరులు పాల్గొన్నారు. -
చోడవరం మండలం వెంకన్నపాలెం ఎంపీపీ స్కూల్లో జిప్లు పనిచేయని చిరిగిన బ్యాగ్లతో విద్యార్థులు
60 శాతానికి పైగా చిరిగిపోయాయి.. జిల్లాలో మొత్తం 1446 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1099 ప్రైమరీ, 62 ఎంపీయూపీ, 285 హైస్కూల్స్ ఉన్నాయి. జిల్లాలో 2,07,370 మంది విద్యార్థులు చదువుతున్నారు. వారిలో 96,807 మందికి ఈ విద్యా సంవత్సరంలో బ్యాగులు ఇవ్వాలని ఇండెంట్ పెట్టి విద్యా శాఖ అధికారులు సరకు రప్పించారు. కానీ విద్యార్థులు అవస్థలు పడుతుండటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు చిరిగిన, కుట్లు పోయిన వాటిని రిటర్న్ పంపించాలని, వాటి స్థానంలో కొత్తవి ఇస్తామని చెప్పారు. కానీ ఆచరణలో జరగలేదు. దీంతో చాలా మంది హెచ్ఎంలు యాప్లో బ్యాగ్లను రిటర్న్ చేసేందుకు వివరాలు నమోదు చేశారు. అయితే ఇందులో బ్యాగ్ మొత్తం పనికిరాకుండా ఉంటేనే వెనక్కి తీసుకుని కొత్తది ఇస్తామని విద్యాశాఖ అధికారులు మెలిక పెట్టారు. దీంతో దిక్కుతోచని స్థితిలో షాపుల్లో డబ్బులు వెచ్చించి కొనుక్కున్న బ్యాగులనే విద్యార్థులు వాడుతున్నారు. ఆరు నెలల్లోనే 60 శాతానికి పైగా బ్యాగులు చిరిగిపోయాయి. -
ఏం బ్యాగులేదు!
●సర్కారు వారి బ్యాగులు.. చిరుగులు ●మూణ్ణాళ్ల ముచ్చటగా విద్యార్థి మిత్ర కిట్లు అచ్యుతాపురం మండలంలో జెడ్పీ హైస్కూల్లో చిరిగిన బ్యాగ్లతో విద్యార్థులుమాడుగుల మండలం వీరన్నారాయణం గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్లో 9వ తరగతి విద్యార్థులు చిరిగిన బ్యాగ్లతోనే పుస్తకాలు తీసుకెళుతున్న దృశ్యం సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు చంద్రబాబు ప్రభుత్వం అందించిన ‘సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర’ కిట్లు మూణ్ణాళ్ల ముచ్చటగా మారాయి. ఈ కిట్లలో నాణ్యత లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. జిల్లాలో విద్యార్థులకు అందించిన స్కూల్ బ్యాగులు నాసిరకంగా ఉండటంతో కొద్ది రోజులకే చిరిగిపోయాయి. జిప్పులు పనిచేయడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన బ్యాగ్లు ఇస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు సర్కార్ నిర్ల క్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి, స్కూలు బ్యాగులతోపాటు కిట్లో ఇచ్చే అన్ని వస్తువుల నాణ్యత ఎలా ఉందో స్వయంగా పరిశీలించేవారు. కానీ అంత శ్రద్ధ లేకపోవడంతో నాసి రకమైన బ్యాగులు ఇచ్చి కాంట్రాక్టర్లు, అధికారులు చేతులు దులుపుకున్నారు. విద్యా సంవత్సరం మధ్యలోనే బ్యాగులు చిరిగిపోతున్నాయి. బ్యాగుల్లో పుస్తకాలు పెట్టుకోవాలంటే ఎక్కడ జారి పడిపోతాయోనని భయపడాల్సి వస్తోందని, వాటిని మోయాల్సివస్తోందని విద్యార్థులు వాపోతున్నారు. కిట్లో భాగంగా ఇచ్చిన బూట్లు అందరికీ సరిపడకపోవడంతో వాటిని ఇంటి వద్దనే విడిచి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన బూట్లనే బడికి వేసుకు వెళుతున్నారు. ఎంఈవో కార్యాలయం నుంచి డీఈవోకు.. జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేసిన బ్యాగుల్లో నెల వ్యవధిలోనే 10 శాతం బ్యాగ్లు పాడయ్యాయని ఎంఈవో కార్యాలయం నుంచి డీఈవోకు రిటర్న్ పంపించారు. అలాంటివి పాయకరావుపేట మండలంలో 300, నక్కపల్లి మండలంలో 101, ఎస్.రాయవరంలో 58, అనకాపల్లి 120, మాడుగుల 122, కె.కోటపాడు 62, దేవరాపల్లి 62, చోడవరం 120, బుచ్చెయ్యపేట 80, రావికమతం 100, రోలుగుంట 90, యలమంచిలి 120, రాంబిల్లి 50, అచ్యుతాపురం 110, నర్సీపట్నం 120, గొలుగొండ 50, నాతవరం 40, సబ్బవరం 110, పరవాడ 66, మాకవరపాలెం 80, కశింకోట మండలంలో 125 బ్యాగులు ఉన్నాయని యాప్లో నమోదు చేసి వెనక్కు పంపించారు. నాణ్యత లేని బ్యాగ్లతో విద్యార్థులకు ఇక్కట్లు మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో విద్యార్థులకు ఇచ్చిన కిట్లో బ్యాగులు పూర్తిగా నాసిరకంగా ఉన్నాయి. విద్యా సంవత్సరం మధ్యలోనే బ్యాగులు చిరిగిపోతున్నాయి. కొంతమంది పేద విద్యార్థులు అవే బ్యాగుల్ని కుట్టుకుంటూ బడికి వెళ్తున్నారు. తోటి విద్యార్థుల హేళనకు గురవుతున్నారు. – పైల రమేష్, వెంకటాపురం, కోటవురట్ల మండలం -
బీమా సొమ్ము కోసం మామ హతం
కశింకోట: బీమా సొమ్ము కోసం సొంత మామనే హతమార్చాడు.. ఎల్ఐసీ ఏజెంటుతో కలిసి ఆరు నెలలుగా పథకం వేశాడు.. హత్య చేసి, రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టుగా మాయ చేయబోయాడు. పోలీసుల దర్యాప్తులో అనుమానాలు రేకెత్తడం, ఇది ప్రమాద మరణం కాదని పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించడంతో దొరికిపోయాడు. కశింకోట మండలం కొత్తపల్లి గ్రామం వద్ద జరిగిన ఈ దారుణానికి సంబంధించిన వివరాలను స్థానిక పోలీసు స్టేషన్లో సీఐ అల్లు స్వామినాయుడుతో కలిసి అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి శనివారం విలేకరులకు వివరించారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన కుర్రు నారాయణమూర్తి (54) బయ్యవరంలోని సిమెంట్ పరిశ్రమలో కాంట్రాక్టు కార్మికునిగా పనిచేస్తున్నారు. విధులు నిర్వహించుకొని ఈనెల 8న రాత్రి తమ గ్రామానికి బైక్పై వెళుతుండగా అదే గ్రామానికి చెందిన సొంత అల్లుడు, మేనల్లుడు సుంకరి అన్నవరం, అతని కుమారుడు సుంకరి జ్యోతి ప్రసాద్, సహాయకునిగా పనిచేసే అగ్రహారపు తాతాజీ ఆపి పక్కన పొలంలోకి తీసుకెళ్లి నారాయణమూర్తితో మద్యం తాగించారు. మత్తులోకి వెళ్లాక ఇంటి పనిలో వినియోగించే గజం బద్దతో తలపై కొట్టి గాయపరిచారు. వారి దెబ్బలతో తీవ్రంగా గాయపడిన నారాయణమూర్తి ప్రాణాలు కోల్పోయారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని చెప్పి విశాఖ కేజీహెచ్కు తరలించారు. మార్గమధ్యంలో మృతి చెందినట్టు చెప్పారు. ఈ నెల 9న కేజీహెచ్ నుంచి పోలీసులకు ఎంఎల్సీ సమాచారం అందింది. బీమా పరిహారం కోసమే.... హత్యకు ప్రధాన ప్రేరకుడైన అల్లుడు అన్నవరం అప్పుల్లో కూరుకుపోయాడు. వీటి నుంచి బయటపడటానికి మామను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి ఆయన పేరిట ఉన్న రూ.కోటి 8 లక్షల విలువైన ఏడు రకాల పాలసీల ద్వారా వచ్చే పరిహార సొమ్మును కాజేయాలని ఆశించాడు. ఎల్ఐసీ ఏజెంటు నానాజీ సహాయంతో ఆరు నెలల క్రితం హత్యకు వ్యూహ రచన చేసి ఇంత ఘాతుకానికి పాల్పడ్డాడు. చివరికి సాక్ష్యాలతో సహా దొరికిపోవడంతో ప్రధాన నిందితుడు అన్నవరం, అతని కుమారుడు జ్యోతి ప్రసాద్, సహాయకుడు తాతాజీ, ప్రోత్సాహకుడు ఎల్ఐసీ ఏజెంటు నానాజీలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. హత్య కేసును ఛేదించి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సీఐతోపాటు ఎస్ఐలు, కానిస్టేబుళ్లను డీఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు. రోడ్డు ప్రమాదమని ఫిర్యాదు గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోవడంతో నారాయణమూర్తి మృతి చెందినట్లు నమ్మించి అన్నవరం అత్త సూర్యలక్ష్మితో పోలీసులకు ఫిర్యాదు చేయించాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ అల్లు స్వామినాయుడు, ఎస్ఐ లక్ష్మణరావు, మనోజ్కుమార్లకు రోడ్డు ప్రమాదం జరిగిన దాఖలాలు కానరాలేదు. అతని బైక్ నిక్షేపంలా ఉంది. దీంతో పోలీసులు అనుమానించారు. విచారణకు వెళ్లినప్పుడు అల్లుడు అన్నవరం సహకరించకపోవడంతో.. అతని కుమారుడు జ్యోతి ప్రసాద్ను తీసుకు వచ్చి స్టేషన్లో విచారించగా అతను తడబడడంతో వారి సందేహాలు మరింత బలపడ్డాయి. ఇంతలో ఇది ప్రమాదం కాదని, కొట్టిన గాయాలు ఉన్నాయని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. అల్లుని సెల్ఫోన్ కాల్ డేటా పరిశీలించగా అచ్యుతాపురం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంటు భీముని నానాజీకి సుమారు వందసార్లు ఫోన్ చేసినట్టు వెల్లడైంది. పోలీసులు తమదైన శైలిలో విచారించగా అన్నవరం నేరం అంగీకరించాడు. -
కదం తొక్కిన అంగన్వాడీలు
తుమ్మపాల: తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీలు కదం తొక్కారు. వేతనాల పెంపుతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపట్టారు. గతంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, తదితర నాయకులు ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచలేదని, సమస్యలు పరిష్కరించలేదంటూ నినదించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు మాట్లాడుతూ అనుమతులు లేని ప్రైవేటు ప్రీస్కూళ్లను ప్రోత్సహిస్తున్నారని, అంగన్వాడీలను నిర్వీర్యం చేస్తూ యాప్ల పని భారం పెంచుతూ కార్యకర్తలపై భారం మోపుతున్నారని ధ్వజమెత్తారు. కష్టపడుతున్న కార్మికులకు వేతనాలు ఇవ్వడానికి చేతులు రాని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలను ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో లేబర్ కోడ్స్ తీసుకొచ్చి పెట్టుబడిదారులకు ఊడిగం చేయడానికి బీజేపీ, టీడీపీ కూటమి ప్రభుత్వం పన్నాగం పన్నిందన్నారు. లేబర్ కోడ్స్, కార్మిక వ్యతిరేక విధానాలు, అంగన్వాడీలకు వేతనాలు పెంపుపై ఈ నెల 31న జరుగుతున్న సీఐటీయూ మహాసభల్లో చర్చించనున్నామని, ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్త సమ్మె కూడా సన్నద్ధం అవుతున్నామని తెలిపారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.నాగశేషు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం అంగన్వాడీలకు నష్టం కలిగించే చర్యలు చేపడుతున్నారని ఆరోపించారు. అంగన్వాడీ సెంటర్ల పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తింపజేసి, యూనిఫాం, ప్రతి రోజు సాయంత్రం పిల్లలకు స్నాక్స్ ఇవ్వాలన్నారు. వేసవి సెలవుల్లో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఒకేసారి సెలవులు ఇవ్వాలని, సూపర్వైజర్లకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వో సత్యనారాయణరావుకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి.దుర్గారాణి, సీఐటీయూ రాష్ట్ర నాయకుడు ఎం.జగ్గునాయుడు, జిల్లా అధ్యక్షుడు వి.వి.శ్రీనివాసరావు, అంగన్వాడీ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షురాలు జి.కుమారి. కోశాధికారి రమణమ్మ, కార్యవర్గ సభ్యులు వరలక్ష్మి, రామలక్ష్మి, సత్యవేణి, మంగ, సామ్రాజ్యం, మహాలక్ష్మి, తనుజ, కృష్ణవేణి పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న లారీ: వ్యక్తి దుర్మరణం
యలమంచిలి రూరల్: మండలంలోని 16వ నెంబరు జాతీయ రహదారిపై రేగుపాలెం హైవే కూడలి వద్ద శుక్రవారం లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం పొందాడు. నక్కపల్లి మండలం నెల్లిపూడికి చెందిన మడుగుల నాగు (36) యలమంచిలి నుంచి నెల్లిపూడికి పల్సర్ బైక్పై వెళ్తుండగా రేగుపాలెం హైవే కూడలి వద్ద యలమంచిలి నుంచి తుని వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనం నడుపుతున్న నాగు లారీ వెనుక చక్రాల కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతనిపై నుంచి లారీ చక్రాలు వెళ్లడంతో తల, పొట్ట, శరీర భాగాలు నుజ్జయ్యాయి. మృతుడి అత్తవారు యలమంచిలి పట్టణం ధర్మవరంలో ఉండడంతో తరచుగా అక్కడికి వచ్చిపోతుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం అత్తవారింటికి వచ్చి తిరిగి నెల్లిపూడి వెళ్తుండగా లారీ రూపంలో మృత్యువు కబళించింది. దీంతో భార్య, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతుడి భార్య దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు యలమంచిలి రూరల్ ఎస్సై ఎం.ఉపేంద్ర తెలిపారు. -
18 నుంచి జాతీయ వినియోగదారుల వారోత్సవాలు
తుమ్మపాల: జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 18 నుంచి 24 వరకు వారోత్సవాలు నిర్వహించనున్నట్టు జిల్లా రెవెన్యూ అధికారి(డీఆర్వో) వై.సత్యనారాయణరావు తెలిపారు. ఈ మేరకు ముందస్తు ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో శుక్రవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025 సంవత్సరానికి ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం’అనే థీమ్తో వేడుకలను రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌర సరఫరాల శాఖ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ‘డిజిటల్ న్యాయపాలన ద్వారా సమర్థ సత్వర పరిష్కారం’అంశంపై విద్యార్థులకు తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర స్థాయిలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.10 వేలు, రూ.7,500, రూ.5 వేలు నగదు, ప్రశంసా పత్రాలను అందజేస్తామన్నారు. జిల్లా స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.5వేలు, రూ.3 వేలు, రూ. 2 వేలు నగదు, ప్రశంసా పత్రాలను అందజేస్తామని చెప్పారు. -
స్క్రబ్ టైఫస్పై ఆందోళన వద్దు
చికిత్స తీసుకోండి ● డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వీరజ్యోతి నర్సీపట్నం: స్క్రబ్ టైఫస్పై ప్రజలు ఆందోళన చెందవద్దని, వెంటనే చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందని డిప్యూటీ డీఎంహెచ్వో డాక్టర్ వీరజ్యోతి తెలిపారు. స్క్రబ్ టైఫస్ ప్రధానంగా నల్లిని పోలిన చిన్న కీటకం కుడితే శరీరంలో బ్యాక్టీరియా పెరిగి స్క్రబ్ టైఫస్గా మారుతుందన్నారు. కీటకం కుట్టిన చోట కురుపు మాదిరిగా శరీరం కమిలి పోతుందన్నారు. కొన్ని రోజులకు నల్లని మచ్చతోపాటు దద్దుర్లు ఏర్పడతాయన్నారు. వైరస్ శరీరంలో పెరిగిన రెండురోజులు గడిచిన తర్వాత విపరీతమైన జ్వరం వస్తుందన్నారు. తలనొప్పి, అలసట, వాంతులు ఉంటాయన్నారు. టైఫాయిడ్, మలేరియా మాదిరిగా జ్వరం కనిపిస్తుందన్నారు. సకాలంలో జ్వర లక్షణాలను బట్టి వ్యాధిని గుర్తిస్తే ఐదు రోజుల్లో చికిత్స తీసుకుంటే తగ్గిపోతుందన్నారు.రక్తపరీక్ష చేయటం ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చునని, డాక్టర్ పర్యవేక్షణలో 5 నుండి 7 రోజులు మందులు వాడితే నయమవుతుందన్నారు. వ్యవసాయ భూముల పక్కన నివసించే వారిపై ఎక్కువగా ప్రభావం చూపుతుందన్నారు. ప్రతి పీహెచ్సీలో రక్త నమూనాలు సేకరిస్తున్నారన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 2 కేసులు నమోదయ్యాయన్నారు. డివిజన్ పరిధిలో ఎలాంటి కేసు నమోదు కాలేదన్నారు. చంటి పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. చల్లనివి తినిపించకూడదన్నారు. జలుబు, దగ్గు, జ్వరం వచ్చే లక్షణాలుంటే పిల్లలకు దాహం వేసినప్పుడు గోరు వెచ్చని నీటిని మాత్రమే తాగించాలన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లకుండా సమీపంలోని పీహెచ్సీలు కానీ ఏరియా ఆస్పత్రిలో చూపించుకుంటే ఆర్ధిక భారం ఉండదన్నారు. -
పశు దాణాలో రాజకీయం
లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం.. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం.. శ్రీరంగ ధామేశ్వరీం.. అంటూ ఎవరైతే మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని భక్తిపూర్వకంగా పూజిస్తారో వారింట ఆ తల్లి సిరుల పంట కురిపిస్తుందని భక్తుల నమ్మకం. అందుచేతనే పట్టణంలోని ధర్మవరంలో ఉన్న కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మాసం మూడో శుక్రవారాన్ని పురస్కరించుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు లక్ష పుష్పార్చన కార్యక్రమం ఘనంగా జరిగింది. యలమంచిలి, ధర్మవరం పరిసర ప్రాంతాల నుంచి దాదాపు 2000 మంది మహిళా భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. వారంతా కలిసి సామూహికంగా లక్ష పుష్పార్చన, కుంకుమ పూజలు చేశారు. ప్రధాన అర్చకుడు వెలవెలపల్లి కోటేశ్వరశర్మ (కోటి పంతులు) భక్తులతో శాస్త్రోక్తంగా పూజా క్రతువు చేయించారు. భారీగా తరలివచ్చిన భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఉచిత అన్నప్రసాద వితరణ చేశారు. – యలమంచిలి రూరల్నర్సీపట్నం: పాడి పశువులకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న సమీకృత దాణా కూటమి నాయకుల రాజకీయ ఒత్తిడితో పక్కదారి పడుతోంది. వారి ఆశీస్సులు ఉన్న రైతులకు మాత్రమే పశు దాణా అందుతోంది. వారు తీసుకోగా ఏమైనా ఉంటే మిగతా వారికి ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. పశుసంవర్ధక సిబ్బంది సైతం కూటమి నాయకులు సూచించిన రైతులకే పశు దాణా ఇస్తున్నారు. రాజకీయ ప్రమేయంతో దాణా పంపిణీ చేయడంతో నర్సీపట్నం మండలం అమలాపురంలో రైతులు వెటర్నరీ అసిస్టెంట్ను నిలదీశారు. ఇదే విధంగా మిగిలిన పంచాయతీల్లో కూటమి నేతల కనుసన్నల్లోనే దాణా సరఫరా జరుగుతోంది. సమీకృత దాణాతో పశువుల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. ఈ దాణా పెట్టడం వల్ల పాడి పశువుల పెంపకం లాభదాయకంగా ఉంది. సబ్సిడీపై సరఫరా చేస్తున్న సమీకృత దాణాపై రైతులు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. రైతుల డిమాండ్కు తగ్గట్టుగా పశు దాణా సరఫరా కావటం లేదు. దీంతో సమీకృత దాణాకు డిమాండ్ పెరిగింది. 8 నెలల్లో నాలుగోసారి.. పశు దాణా ప్రతి నెల సరఫరా చేస్తామని ప్రభుత్వం తొలుత ప్రకటించింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో గడచిన 8 నెలల్లో కేవలం నాలుగుసార్లు మాత్రమే అరకొరగా సరఫరా చేశారు. ఇటీవల విడుదల చేసిన నాలుగో విడతలో జిల్లాలో 5550 బస్తాలు పంపిణీ చేశారు. ఎస్సీలకు 994 బస్తాలు, ఎస్టీలు 320 బస్తాలు, ఇతరులకు 4236 బస్తాలను సరఫరా చేసినట్లు అధికారులు చెబుతున్నారు. నాలుగో విడతలో నర్సీపట్నం వ్యవసాయ డివిజన్లోని నర్సీపట్నం, గొలుగొండ మండలాలకు 25 మెట్రిక్ టన్నుల దాణా సరఫరా చేశారు. ప్రతి పంచాయతీకి 25 బస్తాల నుంచి 30 బస్తాల దాణా వస్తోంది. 50 కిలోల సమీకృత దాణాను ప్రభుత్వం 50 శాతం రాయితీపై సరఫరా చేస్తోంది. రూ.1,110 ధర బస్తాను సబ్సిడీపై రూ.555లకు రైతులకు అందిస్తున్నారు. దాణాతో పశుపోషణ బాగుండడంతో రైతులంతా దాణాపై ఆసక్తి చూపుతున్నారు. గ్రామస్థాయి కూటమి నాయకులు దాణా పంపిణీలో చక్రం తిప్పుతున్నారు. వారి అనుకూలంగా ఉండే రైతులకు దాణా ఇప్పించుకుంటున్నారు. రాజకీయ పలుకుబడి లేని రైతులకు మొండిచేయి చూపిస్తున్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా దాణా పంపిణీ జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పాడి రైతులు కోరుతున్నారు. రాజకీయ జోక్యం ఉండదు దాణా పంపిణీలో రాజకీయ జోక్యం ఉండదు. మూడు పశువులు కలిగిన రైతులకు మాత్రమే దాణా ఇస్తున్నాం. పూర్తి స్థాయిలో దాణా సరఫరా కాలేదు. దాణా పంపిణీలో రాజకీయ ప్రమేయం లేకుండా చర్యలు తీసుకుంటాం. –డబ్ల్యు.రాంబాబు, పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్, నర్సీపట్నం -
సీట్ల మధ్య ఇరుక్కుపోయా
వీధిలోని స్నేహితుల కోరిక మేరకు ఆంధ్రా ప్రాంతం చూసేందుకు వచ్చి బస్సు ప్రమాదానికి గురయ్యాం. ప్రమాద సమయంలో బస్సులో సీట్ల మధ్య ఇరుక్కుపోయాం. చీకటిలో ఏమీ కానరాక అయోమయానికి గురయ్యాం. వెలుగు వచ్చాక ఎవరో మమ్మల్ని బయటకు తీశారు. – షేక్ అష్రఫ్, చిత్తూరు ముగ్గురిని కోల్పోయా బస్సు ప్రమాదంలో నా కూతురు సునంద, అల్లు డు శివశంకర్రెడ్డి, భర్త మేనకోడలు శ్రీకళను కోల్పోయా. నా చేతికి కూడా తీవ్రగాయమైంది. టీచర్గా చేసిన నేను రిటైర్డ్ అయ్యాను. తీర్థయాత్రల కోసం వచ్చి కుటుంబంలో ముగ్గురిని కోల్పోవాల్సి వచ్చింది. – వరిగపల్లి కుమారి, చిత్తూరు దేవుడి దయతో బయటపడ్డాం చిత్తూరులోని బంధువులు తీర్థయాత్రలకు వెళుతు న్నాం మీరు కూడా రమ్మ ని చెబితే బెంగళూరు నుంచి 12 మంది వచ్చాం. బస్సు ప్రమాదంలో మా బృందంలోని కృష్ణకుమారిని కోల్పోయాం. దేవుడి దయతో మిగతావాళ్లం సురక్షితంగా బయటపడ్డాం. – పాపరి జవహరి, బెంగళూరు ఇలా జరుగుతుందనిఅనుకోలేదు గత 25 ఏళ్లుగా వజ్రమణి టూర్స్ అండ్ ట్రావెల్స్ పేరుతో తీర్థయాత్రలకు ఆర్గనైజర్గా పనిచేస్తున్నా. గతంతో ఎన్నడూ ఇలా జరగలేదు. బస్సు కూడా కండీషన్లోనే ఉంది. అందరూ నిద్రలో ఉన్న సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. – వజ్రమణి, టూర్ ఆర్గనైజర్, చిత్తూరు -
అరణ్యంలో ఆర్తనాదాలు
● అయ్యో రామచంద్రా..దైవ దర్శనం కోసం భద్రాద్రికి బయలుదేరిన ఆ యాత్రికులకు ఘాట్రోడ్డులో పొంచి ఉన్న మృత్యువు రూపంలో విధి ఎదురొచ్చింది. మరో రెండు గంటల్లో రాముడి సన్నిధికి చేరుకోవాల్సిన తరుణంలో..శుక్రవారం తెల్లవారుజామున చింతూరు–మారేడుమిల్లి ఘాట్రోడ్డులోని రాజుగారిమెట్ట వద్ద వారి ప్రయాణం విషాదంగా ముగిసింది. కారు చీకట్లు, దట్టమైన మంచు తెరలు, ప్రమాదకరమైన మలుపులతో నిండిన ఆ మార్గంలో యాత్రీకుల బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా, 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లోయలో పడిపోయి గాయపడిన ప్రయాణికులు దారి తెలియక, బస్సులో చిక్కుకున్న వారు బయటకు రాలేక నరకయాతన పడ్డారు. క్షతగాత్రుల ఆర్తనాదాలు చూసి అడవితల్లి సైతం కన్నీరుగార్చింది. దైవ దర్శనం కోసం బయలుదేరిన కుటుంబాలకు ఈ ఘోరం తీరని శోకాన్ని మిగిల్చింది. ఘాట్రోడ్డులో ఎగువ ప్రాంతం నుంచి దిగువరోడ్డులోకి బోల్తాకొట్టిన ట్రావెల్ బస్సులోని మృతదేహాలను అంబులెన్సులోకి ఎక్కిస్తున్న 108 సిబ్బందిచింతూరు/మోతుగూడెం: మారేడుమిల్లి, చింతూరు ఘాట్రోడ్లో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డుప్రమాదం హృదయ విదారకంగా మారింది. గాఢనిద్రలో ఉన్న సమయంలో జరిగిన ఘటనతో బస్సులో ఉన్న వారంతా ఒక్కసారిగా హాహాకారాలు చేశారు. బస్సు నుంచి బయట పడేందుకు వారు తీవ్ర ప్రయత్నాలు చేసినా చీకటి కారణంగా ఏ వైపున ద్వారాలు ఉన్నాయో తెలియక, బయటకు రాలేక నానా నరకయాతన పడినట్లు క్షతగాత్రులు తెలిపారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ● సంఘటన స్థలంలో మృత్యువాత పడిన వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. క్షతగాత్రులు గాయాలతో ఆస్పత్రిలో విలవిల్లాడారు. తీవ్రచలి కారణంగా గాయాలైన వారు నొప్పులకు తాళలేక బోరున విలపించారు. ● అరకు నుంచి భద్రాచలం బయలుదేరిన యాత్రీకుల బస్సు మరో రెండు గంటల్లో గమ్యానికి చేరుకునేలోపు ప్రమాదానికి గురైంది. ఘటనా స్థలం నుంచి 20 కిలోమీటర్ల దూరంలో చింతూరు మండలం తులసిపాక, 35 కిలోమీటర్ల దూరంలో చింతూరు ఉంది. ఘటనా స్థలంనుంచి వంద కిలోమీటర్ల దూరంలో భద్రాచలం ఉంది. మరో రెండు గంటలు సజావుగా ప్రయాణం సాగిఉంటే ఉదయం ఆరు గంటలకు వారు భద్రాచలం చేరుకుని సీతారాములను దర్శించుకునే వారు. మృతదేహాలు తీసేందుకు ఇబ్బందులు బస్సులో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు పోలీసులు, 108 సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. బస్సు యూ పిన్ టర్నింగ్ వద్ద పైరహదారి, కింద రహదారి నడుమ కొండపై వెల్లకిలా ఇరుక్కుపోయింది. దీంతో మృతదేహాలు సీట్ల నడుమ ఇరుక్కు పోవడంతో వాటిని చాలాసేపు శ్రమించి బయటకు తీశారు. బస్సు మట్టిదిబ్బను ఢీకొని ఎగిరి పడడంతో బస్సులోని యాత్రీకుల సామాన్లన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి. సమాచార వ్యవస్థలేక ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎలాంటి నెట్వర్క్ లేకపోవడంతో తమకు జరిగిన ప్రమాద వివరాలను కుటుంబ సభ్యులకు తెలిపేందుకు యాత్రీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొందరి ఫోన్లు బస్సులోనే ఉండిపోవడం, మరికొందరి ఫోన్లు కింద పడిపోయాయి. దీంతో ఎవరి వద్దనైనా ఫోను ఉంటే ఇవ్వండి, నా భర్త చనిపోయారు, నా కూతురు, అల్లుడు చనిపోయిన సమాచారం కుటుంబ సభ్యులకు తెలపాలంటూ సాయం కోసం వచ్చిన వారిని అభ్యర్థించడం అందరినీ కలచివేసింది. ఈ ప్రాంతంలో సిగ్నల్స్ రావని చింతూరు వెళ్లాక సమాచారం తెలపవచ్చంటూ పోలీసులు వారిని సముదాయించారు. అధికారులు అప్రమత్తం: సంఘటన విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు అప్రమత్తమై సహాయక చర్యలను ముమ్మరం చేసేలా ఆదేశించారు. ముందుగా చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, ఓఎస్డీ పంకజ్కుమార్ మీనా, ఏఎస్పీ బొడ్డు హేమంత్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీవో శ్రీనివాస్దొర మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించారు. సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐలు రమేష్, సాధిక్, సంతోష్ మృతదేహాలతో పాటు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ఆసుపత్రిలో డిప్యూటీ డీఎంఅండ్హెచ్వో డాక్టర్ పుల్లయ్య, సూపరింటెండెంట్ డాక్టర్ కోటిరెడ్డితో పాట వైద్యులు హుటాహుటిన క్షతగాత్రులకు వైద్యసేవలు అందించారు. ఆసుపత్రి సిబ్బంది క్షతగాత్రులకు పాలు, భోజనాలు సమకూర్చారు. అరకు నుంచి బయలుదేరి.. : సింహాచలంలో దర్శనం ముగించుకుని మధ్యాహ్నానికి అరకు చేరుకున్న యాత్రికులు అక్కడ అరకు అందాలను ఆస్వాదించారు. సాయంత్రం ఐదు గంటలకు అరకులో బయలుదేరిన బస్సును ప్రసాద్ డ్రైవింగ్ చేస్తున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో నర్శీపట్నం దాటాక టిఫిన్ చేసేందుకు బస్సు నిలిపారు. టిఫిన్ వండుకుని అందరూ తిన్న అనంతరం తిరిగి పది గంటల ప్రాంతంలో బయలుదేరారు. హైవే మీదుగా ఒంటిగంట సమయంలో జగ్గంపేట చేరుకున్న అనంతరం డ్రైవర్ ప్రసాద్ తాను రెస్ట్ తీసుకుంటానని చెప్పి మరో డ్రైవర్ మధుకు డ్రైవింగ్ బాధ్యతలు అప్పగించాడు. మధు జగ్గంపేట నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్న క్రమంలో నాలుగు గంటల సమయంలో ఘాట్రోడ్లో బస్సు ప్రమాదానికి గురైంది. ● పొగమంచు, అతివేగమే ప్రమాదానికి కారణమని క్షతగాత్రులు చెబుతున్నారు. పొగమంచు వల్ల రోడ్డు కనిపించకపోయినా వేగంగా మలుపు తిప్పిన సమయంలో తులసిపాక వద్ద.. మరో మలుపును డ్రైవర్ గుర్తించలేకపోయాడని వారు తెలిపారు. ప్రయాణికులు నిద్ర నుంచి తేరుకునేలోపే బస్సు లోయలో పడిపోయింది. ● చింతూరు–మారేడుమిల్లి ఘాట్రోడ్డులో తదుపరి ఆదేశాల వరకు ప్రతిరోజు రాత్రి10 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు అన్ని రకాల వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్ తెలిపారు. ఘాట్ రోడ్లలో భారీ వాహనాలపై నిషేధం రాత్రి ప్రయాణంపై ఆంక్షలు ఎస్పీ అమిత్ బర్దర్ సాక్షి,పాడేరు: జిల్లా వ్యాప్తంగా పొగమంచు దట్టంగా కురుస్తుండడం, ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని అన్ని ఘాట్ రోడ్లలో భారీ వాహనాల రాత్రి ప్రయాణాలను నిషేధిస్తున్నామని ఎస్పీ అమిత్బర్దర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి 10గంటల నుంచి తెల్లవారుజాము 5గంటల వరకు అన్ని రకాల భారీ వాహనాలను అనుమతించమని ఆయన స్పష్టం చేశారు. ప్రయాణికుల భద్రత లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పొగమంచు తీవ్రత తగ్గే వరకు ఘాట్ రోడ్లలో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం అమలులో ఉంటుందన్నారు. పోలీసుశాఖ హెచ్చరికలను ఉల్లంఘిస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. గిరిజన ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత అధికంగా ఉండడంతో పాటు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితులపై వాహన చోదకులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చిన్న వాహనాల చోదకులు కూడా తమ వాహనాలను జాగ్రత్తగా నడపాలని సూచించారు. మరిన్ని వివరాలకు ప్రయాణికులు,వాహన చోదకులంతా సమీప పోలీసుస్టేషన్లను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. మారేడుమిల్లి ఘాట్రోడ్డులో ఘోర ప్రమాదం తులసిపాక వద్ద అదుపుతప్పి ట్రావెల్ బస్సు లోయలోకి బోల్తా తొమ్మిదిమంది మృతి,22 మందికి తీవ్ర గాయాలు మరో రెండు గంటల్లో భద్రాచలంచేరుకుంటామనగా ఘటన పొగమంచు వల్ల కనిపించని రోడ్డు మలుపులో బస్సు వేగాన్నిఅదుపుచేయలేకపోయిన డ్రైవర్ -
సోలార్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి
సాక్షి, విశాఖపట్నం : ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ కార్యక్రమం ప్రారంభానికి, వర్చువల్ విధానంలో సీఎం చంద్రబాబు చేపట్టబోయే శంకుస్థాపన కార్యక్రమాలకు ఈ నెలాఖరులోగా ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 11 జిల్లాలు సిద్ధం కావాలని చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. సాగర్నగర్లోని సీఓఈఈటీ భవనంలో పీఎం కుసుమ్, పీఎం సూర్యఘర్ పథకం, ఫీడర్ లెవెల్ సోలరైజేషన్, ఎస్సీ, ఎస్టీ రూఫ్ టాప్ సోలార్, పీఎం ఈ డ్రైవ్ పథకాలతో పాటు ఎంఎన్ఆర్ఈ, ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్టులపై ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి, నెడ్ క్యాప్ ఎండీ ఎం.కమలాకరబాబు, కలెక్టర్లు, ఈపీడీసీఎల్ అధికారులతో కలిసి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈపీడీసీఎల్ చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిని సీఎండీ పృథ్వీతేజ్ వివరించారు. నెలకు 10 మెగావాట్ల చొప్పున జరుగుతున్న ఇన్స్టాలేషన్లను రోజుకు ఒక మెగావాట్ సామర్థ్యానికి పెంచేలా పీఎం సూర్యఘర్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. చీఫ్ సెక్రటరీ విజయానంద్ మాట్లాడుతూ ఈపీడీసీఎల్ పరిధిలో 2 లక్షల ఎస్సీ, ఎస్టీ గృహ విద్యుత్ వినియోగదారుల నుంచి వచ్చే ఏడాది మార్చిలోగా సమ్మతి తీసుకొని వారి ఇళ్లపై రెండు కిలోవాట్ల చొప్పున మొత్తం 400 మెగావాట్ల సామర్థ్యంతో రూఫ్ టాప్ సోలార్ పనులను పూర్తి చేయాలన్నారు. పీఎం కుసుమ్ పథకం కింద ఫీడర్ సోలరైజేషన్లో సంస్థ పరిధిలోని 8 జిల్లాల్లో 220 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు భూసేకరణను వేగవంతం చేయాలని ఆదేశించారు. పీఎం ఈ డ్రైవ్ పథకంలో భాగంగా వెహికల్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు పనులను త్వరితగతిన చేపట్టాలని సూచించారు. సమావేశంలో అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్లు విజయ కె.ఎస్.రామసుందర రెడ్డి, స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎన్.ప్రభాకర రెడ్డి, ఈపీడీసీఎల్ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎంలు ఎల్.దైవప్రసాద్, వి.విజయలలిత, బి.అశోక్ కుమార్, పి.శ్రీనివాస్, ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు. రేపటి నుంచి ఇంధన పరిరక్షణ వారోత్సవాలు ఇంధన పరిరక్షణ వారోత్సవాల పోస్టర్ను చీఫ్ సెక్రటరీ కె.విజయానంద్ ఆవిష్కరించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 14 నుంచి 20 వరకు ఇంధన పరిరక్షణ వారోత్సవాలను నిర్వహించి ప్రజల్లో ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించాలని సూచించారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలను నిర్వహించాలన్నారు. -
రసాయనిక పరిశ్రమల్లో భద్రత ముఖ్యం
డాబాగార్డెన్స్: రసాయన, పెట్రో కెమికల్ పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(విజయవాడ), డిపార్ట్మెంట్ ఆఫ్ కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ సంయుక్త ఆధ్వర్యంలో నగరంలోని ఓ హోటల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐఐపీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ శాలివాహన్, జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ జె.శివశంకర్రెడ్డి, సిపెట్ డైరెక్టర్ సి.హెచ్.శేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పారిశ్రామిక భద్రతా చర్యలు, నిబంధనలపై ప్రసంగించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ ప్రమాదాలకు ఆస్కారమున్న విభాగంలోని 60 రసాయన పరిశ్రమల నుంచి 108 మంది భద్రతాధికారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ప్రమాద అంచనా, నిర్వహణ, అత్యవసర ప్రణాళిక, ప్రతిస్పందన వ్యూహాలు, భద్రతా పద్ధతుల్లో అధునాతన సాంకేతికత వంటి అంశాలపై మొత్తం 11 సెషన్లు నిర్వహించనున్నారు. సిపెట్, ఐఐటీ, ఐఐపీఈ, ఎన్డీఆర్ఎఫ్(10వ బెటాలియన్)కు చెందిన నిపుణులు ఈ అంశాలపై సమగ్ర శిక్షణ అందించనున్నట్లు డైరెక్టర్ సి.హెచ్.శేఖర్ తెలిపారు. -
విహారంలో విషాదం
హుకుంపేట: విహార యాత్రకు వచ్చిన ఇంజనీరింగ్ విద్యార్థుల బృందంలో ఒకరు మృతితో విషాదం నెలకొంది. వీరు ప్రయాణిస్తున్న కారు వంతెన గోడలను బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖపట్నంలోని గీతం విశ్వవిద్యాలయానికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రముఖ పర్యాటక ప్రాంతం వంజంగి హిల్స్ను గురువారం వేకువజామున సందర్శించారు. తిరుగు ప్రయాణంలో భాగంగా అరకు బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు మండలంలోని జాతీయరహదారిలో రాళ్లగెడ్డ వద్ద వంతెనను ఢీకొట్టింది. డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్న ఇంజనీరింగ్ విద్యార్థి గుడివాడ రుద్రసాయి(19)కి తీవ్ర గాయాలు కావడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మరో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు నారికంట్ల శ్రీయన్ నిహర్(19), శ్రీవాత్సవ(19)కు కూడా తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో పాడేరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యసేవలు అనంతరం హుటాహుటిన విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వీరి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. మృతుడు రుద్రసాయి విజయనగరం జిల్లా గరివిడి మండలం వెదుళ్లవలస గ్రామానికి చెందినవారు. అతని మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రి శవ పరీక్షల గదిలో భద్రపరిచారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న అతని తండ్రి రామ్మూర్తినాయుడు, కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. గుండెలవిసేలా రోదిస్తున్నారు. పొగమంచు అధికంగా ఉండడంతో రోడ్డు కనిపించక ఈ ప్రమాదం జరిగినట్టుగా ఎస్ఐ సూర్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
ఆలయ భూమి ఆక్రమణపై పోలీసులకు ఫిర్యాదు
చీడికాడ: మంచాలలో మోదకొండమ్మ ఆలయం స్థల ఆక్రమణపై గ్రామానికి చెందిన పాటూరి రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రమణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని సర్వే నెంబర్ 117–3లో 32 సెంట్లు స్థలం ఆలయానికి చెందిందన్నారు. ఆలయానికి దక్షిణ దిశగా 10 అడుగుల స్థలం గుడి ప్రదక్షిణకు ఉందన్నారు. గ్రామానికి చెందిన పట్నాల తమన్నాచారి కబ్జా చేసి ఆక్రమించుకుని సిమెంట్ దిమ్మలతో ఫెన్సింగ్ వేసాడన్నారు. ఆలయం ముందున్న రెండు భారీ టేకు చెట్లు ఎటువంటి అనుమతి లేకుండా నరికివేసి తరలించారన్నారు. ఈ ఆక్రమణపై ఎవరైనా తమన్నాచారిని ప్రశ్నిస్తే దుర్భాషలాడడంతో పాటు షెంపీ సీఎం రమేష్ పీఏ తన బంధువని తనను ఎవరూ ఏం చేయలేరని బెదిరిస్తున్నాడని అన్నారు. ఈ ఆక్రమణపై చీడికాడ పోలీసులకు పిర్యాదు చేయగా, ఎస్ఐ బి.సతీష్ సంఘటన స్థలాన్ని పరిశీలించినట్టు చెప్పారు. గుడి స్థలంలో గల ఆక్రమణలను తొలగించాలని, చెట్టు నరికినందుకు కేసు నమోదు చేయాలని ఆయన కోరారు. దీనిపై ఎస్ఐ బి.సతీష్ను వివరణ కోరగా సంఘటన స్థలానికి వెళ్లి ఫిర్యాదులో పేర్కొన్న వ్యక్తి వ్యక్తి వద్ద ఉన్న 12 సెంట్ల స్థలానికి సంబంధించి డాక్యుమెంట్లు పరిశీలించానన్నారు. ఈ సమస్యను పరిశీలించాలని రివెన్యూ అధికారులకు నివేదించడంతో పాటు ఇతర లింకు డాక్యుమెంట్లు ఉంటే తీసుకురావాలని ఆక్రమణదారు తమన్నాచారికి సూచించారు. -
డ్రంకన్ డ్రైవ్ కేసులో జరిమానా
డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారు నక్కపల్లి: ఇటీవల పోలీసులు నిర్వహించిన డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన వారికి యలమంచిలి కోర్టు జరిమానా విధించిందని ఎస్ఐ సన్నిబాబు గురువారం తెలిపారు. ఇటీవల జాతీయ రహదారిపై నిర్వహించిన దాడుల్లో మద్యం సేవించి వాహనం నడిపిన వారుతోపాటు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 12 మందిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. కోర్టు వారు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. ఒకరికి వారం రోజులు జైలు శిక్ష విధించారన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ప్రమాదంలో తునాతునకలైన మోటారు సైకిల్, దెబ్బతిన్న కారు (ఇన్సెట్) ప్రమాదంలో మృతి చెందిన నూకరాజుజగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ముందు వెళ్తున్న మోటారు సైకిల్ను వెనుక వస్తున్న కారు బలంగా ఢీకొని ఇద్దరు మృతి చెందగా, మరో వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యాయి. ఎస్సై రఘునాథరావు అందించిన వివరాల ప్రకారం ఏలేశ్వరం గ్రామానికి చెందిన దొండపాటి శ్రీను, అతని తాత బొల్లం నూకరాజు (64) ఎక్స్ఎల్ వాహనంపై జగ్గంపేట వస్తున్నారు. నర్సీపట్నం గ్రామానికి చెందిన వేమూరి మురళీకృష్ణ, తన కోడలు బొల్లిన శ్రీదేవి (35)ని తీసుకుని తన కోడలు పుట్టిల్లు రాజానగరం మండలం నందరాడ గ్రామానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కారు జగ్గంపేట మండలం రామవరం వద్ద బొప్పిడి సిరామిక్స్ సమీపంలో ఎక్స్ఎల్ను బలంగా ఢీకొంది. దీనితో నూకరాజు అక్కడికి అక్కడే మృతి చెందాడు. మోటారు సైకిల్ తుక్కుతుక్కు కాగా కారు కూడా ముందుబాగం బాగా దెబ్బతింది. కారులో ప్రయాణిస్తున్న బొల్లిన శ్రీదేవి, మురళీకృష్ణలకు కూడా తీవ్రగాయాలయ్యాయి. వారిని రాజమహేంద్రవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. రాజమండ్రి ఆసుపత్రిలో బొల్లిన శ్రీదేవి మృతి చెందినట్లు ఎస్సై రఘునాథరావు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆర్టిస్టిక్లో ఆంధ్రా అదుర్స్
విశాఖ స్పోర్ట్స్: జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో ఆంధ్రప్రదేశ్ స్కేటర్లు సత్తా చాటారు. స్వర్ణాలే లక్ష్యంగా దూసుకెళ్లి ఆర్టిస్టిక్ చాంపియన్షిప్ హోదాను నిలబెట్టుకున్నారు. గురువారంతో ముగిసిన ఆర్టిస్టిక్ విభాగం పోటీల్లో చిన్నారుల నుంచి సీనియర్ల వరకు ఏపీ క్రీడాకారులు స్వర్ణ పతకాలను కై వసం చేసుకున్నారు. ఈ పోటీల్లో తెలంగాణ, గుజరాత్, కర్నాటక, తమిళనాడు స్కేటర్లు కూడా నువ్వా–నేనా అన్నట్లు తలపడ్డారు. విభాగాల వారీగా విజేతలు వీరే.. ఫ్రీ స్కేటింగ్: 12–15 ఏళ్ల బాలికల విభాగంలో బి.సాయి సాహితి, బాలురలో ఎస్.శంకర్, 8–10 ఏళ్ల బాలురలో జీవన్ ఆదిత్య, 10–12 ఏళ్ల బాలికల్లో సుదీక్ష సాయి, బాలురలో చేతన్ ఆశిష్, 15–18 ఏళ్ల బాలికల్లో గ్రీష్మ, బాలురలో దినేష్, 18 ఏళ్లు పైబడిన (18+) బాలుర విభాగంలో వైష్ణవ్ (వీరంతా ఏపీ) విజేతలుగా నిలిచారు. ఇక 6–8 ఏళ్ల బాలికల్లో పి.రుత్విక, డి.ఆర్జిత్ (తెలంగాణ), 8–10 ఏళ్ల బాలికల్లో జులినా(కేరళ) ప్రథమ స్థానంలో నిలిచారు. కపుల్ స్కేటింగ్: 6–8 ఏళ్ల విభాగంలో విజయ్–మహీరా జోడి, 8–10 ఏళ్లలో పశ్యంత్–హర్షిణి జోడి (ఏపీ) విజేతలుగా నిలిచారు. 10–12 ఏళ్లలో బెన్నీ–అద్విక, 12–15 ఏళ్లలో వెంకటరామ్–అన్విత, 15–18 ఏళ్లలో మురళీ–తనిష్క, 18+ విభాగంలో తేజేస్–జయేష్ జోడి (తెలంగాణ) విజయం సాధించారు. పెయిర్ స్కేటింగ్: 8–10 ఏళ్ల విభాగంలో భీష్మ–వేదాంశి, 12–15 ఏళ్లలో వినీత్–సుష్రీత జోడి (ఏపీ) విజేతలుగా నిలవగా.. 6–8 ఏళ్లలో ఓర్జిత్–రుత్విక, 10–12 ఏళ్లలో సాత్విక్–అద్విక జోడి(తెలంగాణ) పతకాలు సాధించారు. ఇన్లైన్: 8–10 ఏళ్ల బాలికల్లో ఎం.రుత్విక, 10–12 బాలురలో తేజ్సాకేత్, 12–15 బాలికల్లో జెస్సికా శ్రీ, బాలురలో విరీత్, 15–18 బాలికల్లో క్షేత్ర(వీరంతా ఏపీ) విజేతలుగా నిలిచారు. 8–10 ఏళ్ల బాలురలో లక్ష్మణ్ జీవాంస్ (తెలంగాణ) ప్రథమ స్థానం దక్కించుకున్నాడు. సోలో డాన్స్: ఎ.విజయ్, హరి కమల్ (ఏపీ) విజేతలుగా నిలిచారు. తెలంగాణ నుంచి జెస్సికా బెన్, సాకేత్, అద్విక, జాస్ బెన్నీ, వెంకట్రామ్, మురళీ పతకాలు సాధించగా.. మహారాష్ట్ర నుంచి ఎస్.గాంధీ, హర్షల్ మమ్మానియా, రీగా అగర్వాల్, కాంతి శ్రీ ఆయా విభాగాల్లో విజేతలుగా నిలిచారు. ఫిగర్ స్కేటింగ్: 6–8 ఏళ్ల విభాగం బాలికల్లో మిషికా(గుజరాత్), బాలురలో డి.ఓర్జిత్(తెలంగాణ), 8–10 ఏళ్ల బాలికల్లో ఆర్నా హేమల్(గుజరాత్), బాలురలో కె.సాకేత్(తెలంగాణ), 10–12 ఏళ్ల బాలురలో చేతన్ ఆశిష్, బాలికల్లో రష్మిత(ఏపీ), 12–15 ఏళ్ల బాలురలో రుషిల్ బెండీ, బాలికల్లో వైణవి, 15–18 ఏళ్ల బాలికల్లో పి.ఆశ్రిత, బాలురలో ఎన్.శౌర్య, 18 ఏళ్లు పైబడిన బాలికల విభాగంలో భవ్యశ్రీ, బాలురలో హరికమల్(ఏపీ) విజేతలుగా నిలిచారు. క్వార్టెట్, గ్రూప్ ఈవెంట్: క్వార్టెట్ విభాగం 6–8 ఏళ్లలో కె–పాప్ గ్రూప్, 8–10 ఏళ్లలో ది జంగిల్ బుక్ గ్రూప్, 10–12 ఏళ్లలో వారియర్స్ గ్రూప్, 12–15 ఏళ్లలో ది పైరేట్స్ ఆఫ్ కరేబియన్ గ్రూప్, 18 ఏళ్లు పైబడిన వారిలో బ్లాక్ పాంథర్స్ గ్రూప్ విజేతలుగా నిలిచాయి. ప్రెసిషన్ విభాగం 15 ఏళ్ల లోపు విభాగంలో మైస్టిక్ గ్రూప్, 15 ఏళ్లు పైబడిన వారిలో (15+) యానిమల్ గ్రూప్ విజేతలుగా నిలవగా, షో–గ్రూప్ 15 ఏళ్ల లోపు విభాగంలో ది రోబోస్, 15 ఏళ్లు పైబడిన వారిలో మైకేల్ జాక్సన్ గ్రూప్ విజేతలుగా నిలిచాయి. -
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం
అనకాపల్లి: చంద్రబాబు ప్రభుత్వం ఫీజు రీయంబర్సుమెంటు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని వైఎస్సార్సీపీ జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డపల్లి హేమంత్ కుమార్ తెలిపారు. స్థానిక నెహ్రూచౌక్లో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు. ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫీజు రీయంబర్స్మెంట్ తక్షణమే చెల్లించాలని కోరుతూ ఈ నెల 8న అమరావతిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య శాంతియుతంగా విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తే, అక్కడ పోలీసులతో ప్రభుత్వం అరెస్టు చేసి, కోర్టులో హాజరుపర్చడం అన్యాయమన్నారు. తక్షణమే విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. మంత్రి నారా లోకేష్ డైరెక్షన్లో పోలీస్లు రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో అనకాపల్లి నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షుడు రాయి రాజా, నాయకులు కృష్ణచైతన్య, కిట్టు, డేనీ, శ్రీకాంత్, మడక కార్తీక్, కళ్యాణ్, కాండ్రేగుల శ్యాం, డొంక సత్య, మళ్ల వంశీ, కోలా గణేష్, శివకుమార్, శివ ప్రసాద్, ప్రభాకర్, సతీష్, మణికంఠ, మురళీ, హేమంత్, రవివర్మ, మహేష్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. -
క్షేత్రస్థాయిలో నేర్చుకోవడం ముఖ్యం
కశింకోట: వ్యవసాయ కళాశాల విద్యార్థులు పుస్తకాల్లో చదివి నేర్చుకున్న దానికంటే క్షేత్రస్థాయిలో నేర్చుకోవడం ముఖ్యమని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ సిహెచ్. ముకుందరావు తెలిపారు. ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, నైరా వ్యవసాయ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో మండలంలోని పల్లపు సోమవరం గ్రామంలో గురువారం రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన నిర్వహించారు. దీన్ని ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు క్షేత్రస్థాయిలో రైతుల ద్వారా వ్యవసాయ పంటల సాగు సంబంధిత అంశాలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకోవాలన్నారు. ఇవి విద్యాభివృద్ధికి, భవిష్యత్లోను ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ప్రస్తుతం సాగవుతున్న పంటల గురించి, లాభసాటి వ్యవసాయ పద్ధతుల గురించి వివరించారు. శాస్త్రవేత్తలు డాక్టర్ దాడి ఉమామహేశ్వరరావు, డాక్టర్ రాజేంద్రప్రసాద్, డాక్టర్ కె.వి. రమణమూర్తి, డాక్టర్ ఎం. రవిబాబు సాగులో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతుల రైతులకు గురించి వివరించారు. పంటలపై వచ్చే చీడపీడల నివారణకు తీసుకోవలసిన చర్యలు వివరించారు. గ్రామాన్ని దత్తత తీసుకున్న కార్యక్రమాన్ని ప్రారంభించి రైతులకు విత్తనాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంది. వ్యవసాయ అధికారి ఎం. స్వప్న తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
చెదలు
● నవ్వి పోదురు గాక.. మాకేంటి సిగ్గుఏయూ దూర విద్యకుచేతి రాతతో డిగ్రీ థర్డ్ సెమిస్టర్ హిందీ క్వశ్చన్ పేపర్ తయారీ స్టడీ సెంటర్లకు పేపర్ను మెయిల్ చేస్తుండడంపై విస్మయం వాటిని ప్రింట్లు తీసి విద్యార్థులకు పంపిణీ చేస్తున్న నిర్వాహకులు విశాఖ సిటీ: ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యకు చెదలు పట్టింది. ఈ విభాగం అధికారుల తీరు విమర్శలకు దారి తీస్తోంది. వీరి నిర్లక్ష్యంతో వందేళ్ల వర్సిటీ పరువు మంటగలుస్తోంది. దూర విద్య పరీక్షల నిర్వహణ నానాటికీ తీసికట్టుగా మారుతోంది. ఏటా వేలాది మందికి నిర్వహించే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ పరీక్షలకు ప్రింటెడ్ ప్రశ్నా పత్రాలు ఇవ్వకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. నవ్విపోదురు గాక.. మాకేంటి సిగ్గు అన్నట్లు ప్రైవేటు స్కూళ్లు కూడా ఇవ్వని విధంగా చేతి రాతతో ప్రశ్నా పత్రాన్ని తయారు చేసి దాన్ని స్కాన్ చేసి స్టడీ సెంటర్లకు పంపిస్తుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మెయిల్కు వచ్చిన క్వశ్చన్ పేపర్ను స్టడీ సెంటర్ల నిర్వాహకులు ప్రింట్లు తీసుకుని విద్యార్థులకు పంపిణీ చేస్తుండడం గమనార్హం. చేతి రాతతో హిందీ ప్రశ్నా పత్రం ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్య డిగ్రీ థర్డ్ సెమిస్టర్ పరీక్షల ప్రశ్నా పత్రాలను చూసిన విద్యార్థులు షాక్కు గురయ్యారు. హిందీ ప్రశ్నా పత్రాన్ని చూసిన వారంతా ఇది ఒరిజినల్ పేపరా? కాదా? అన్న సందేహ స్థితిలో ఉండిపోయారు. చిన్న చిన్న వీధి బడుల్లో కూడా లేని విధంగా చేతి రాతతో ఉన్న క్వశ్చన్ పేపర్ ఇవ్వడంపై స్టడీ సెంటర్ల నిర్వాహకులే కాకుండా విద్యార్థులు సైతం కంగుతిన్నారు. శతాబ్ది ఉత్సవాలు చేసుకుంటున్న ప్రతిష్టాత్మక ఏయూ పరీక్షల నిర్వహణ మరీ ఇంత అధ్వానంగా ఉంటుందా? అని నవ్వుకుంటున్నారు. సాధారణంగా ఇతర యూనివర్సిటీలు ప్రింటెడ్ ప్రశ్నా పత్రాలను పరీక్షలకు ముందు రోజే స్టడీ సెంటర్లకు, కాలేజీలకు పంపిస్తుంటాయి. కానీ ఏయూ దూరవిద్య అధికారులు మాత్రం చేతితో క్వశ్చన్ పేపర్ రాసి దాన్ని స్కాన్ చేసి స్టడీ సెంటర్లు, కాలేజీలకు మెయిల్లో పంపిస్తుండడం విశేషం. ఆ పేపర్ను నిర్వాహకులు జెరాక్సులు తీసి పరీక్షలకు వచ్చే విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు. ఏయూ పరువు తీసిన అధికారులు ఏయూ డిస్టెన్స్ అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు గుర్తింపు లేని స్టడీ సెంటర్లలో పరీక్షల నిర్వహణపై ఆరోపణలు వినిపిస్తుండగా.. మరోవైపు పరీక్షల నిర్వహణను గాలికి వదిలేస్తున్నారు. ఏయూ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ఈ రోజుల్లో గుర్తింపు లేని పాఠశాలల్లో కూడా చేతి రాత ప్రశ్నా పత్రాలు ఇవ్వడం లేదు. కానీ ఏయూ డిస్టెన్స్ అధికారులు మాత్రం ఇందుకు విరుద్ధంగా సరికొత్త సంప్రదాయానికి తెరలేపారు. ఏయూకు ఏటా రూ.50 నుంచి రూ.60 కోట్లు ఆదాయం డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి వస్తోంది. అయినప్పటికీ.. పరీక్షా ప్రశ్నా పత్రాలను టైప్ చేసి సెంటర్లకు పంపించకుండా చేతి రాతతో రాసి మెయిల్ చేస్తుండడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. -
అల్లిపురంలో రాపిడ్ రెస్పాండ్ టీమ్
దేవరాపల్లి: దేవరాపల్లి శివారు అల్లిపురంలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మృతి చెందిన వ్యక్తి నివాస ప్రాంతాన్ని కేజీహెచ్ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యులతో కూడిన రాపిడ్ రెస్పాండ్ టీమ్ గురువారం పరిశీలించింది. రామారావు, విజయ్, యోగితతో కూడిన వైద్య నిపుణుల బృందం మృతి చెందిన వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై మృతుడి కుటుంబ సభ్యులను ఆరా తీశారు. గత కొన్నేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడని, అప్పటి నుంచి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయిస్తున్నామని మృతుడి కుటుంబ సభ్యులు కేజీహెచ్ వైద్య బృందానికి తెలిపారు. దీర్ఘకాలిక వ్యాధితోనే మరణించాడని, దీనిపై తమకు ఎటువంటి అనుమానం లేదని స్పష్టం చేశారు. దేవరాపల్లి పీహెచ్సీ వైద్యాధికారి ఇ.పూజ్యమేఘన నుంచి సైతం వైద్య నిపుణుల బృందం మృతికి సంబంధించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అల్లిపురంలో నివాసం ఉంటున్న 15 కుటుంబాలను వైద్య బృందం కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని ఆరా తీసి, ఫీవర్ సర్వే చేశారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి అనంత ఉమాదేవి పారిశుధ్య పనులను చేయించారు. కేజీహెచ్ వైద్య నిపుణుల బృందం వెంట స్థానిక పీహెచ్సీ సీహెచ్వో ఎం.ఆనంద్, హెల్త్ సూపర్వైజర్ కె.పుష్పరాజ్, ఏఎన్ఎం మేరీ, ఎంఎల్హెచ్పీలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
16న సింహగిరిపై నెలగంట
సింహాచలం: సింహగిరిపై ఈనెల 16న నెలగంట ఉత్సవాన్ని విశేషంగా నిర్వహించనున్నట్టు దేవస్థానం ఇన్చార్జి ఈవో ఎన్.సుజాత తెలిపారు. ఆరోజు నుంచి నెలరోజులపాటు ధనుర్మాసం పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి జనవరి 19వరకు సుప్రభాత సేవ, ఉదయం ఆరాధన టికెట్లు, ఈనెల 30 నుంచి జనవరి 19 వరకు సహస్రనామార్చన టికెట్లు రద్దు చేసినట్టు తెలిపారు. 16న ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం ధనుర్మాస ఉత్సవాలు ఈనెల 16న ప్రారంభమవుతాయని, ఆరోజు మధ్యాహ్నం 1.01 గంటకు సింహగిరిపై రాజగోపురంలో నెలగంట మోగిస్తారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి, గోదాదేవికి విశేష పూజలు, తిరువీధి నిర్వహిస్తారు. తొలి పాశుర విన్నప పారాయణాన్ని నిర్వహిస్తారు. నెలగంట సందర్భంగా ఆరోజు ఉదయం 11.30 నుంచి మద్యాహ్నం 2.30 గంటల వరకు స్వామివారి దర్శనాలు లభించవు. 20 నుంచి పగల్పత్తు ఉత్సవాలు ఈనెల 20 నుంచి 29 తేదీ వరకు పగల్పత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ ఉదయం తిరువీధి ఉత్సవం(అయ్యవారి సేవ) నిర్వహిస్తారు. ఆ రోజుల్లో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశారు. 30 నుంచి రాపత్తు ఉత్సవాలు ఈనెల 30 నుంచి జనవరి 9వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతీ రోజూ సాయంత్రం 5 గంటలకు స్వామికి ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో తిరువీధి నిర్వహిస్తారు. ఆయా రోజుల్లో రాత్రి 7 గంటల తర్వాత దర్శనాలు లభించవు. జనవరి 11న కూడారై ఉత్సవం జనవరి 11న ఆలయంలో కూడారై ఉత్సవం నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 10.30 గంటల వరకు దర్శనాలు లభించవు. 14న గోదా రంగనాథుల కల్యాణోత్సవం జనవరి 14న భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని సాయంత్రం 5 నుంచి 6.30 గంటల వరకు గోదా రంగనాథుల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. ఆరోజు నిత్యకల్యాణం ఉదయం లేకపోవడంతో సాయంత్రం ఉభయదాతలకు అవకాశం కల్పిస్తారు. -
ప్రభుత్వ భూదాహాన్ని అడ్డుకుంటాం..
నక్కపల్లి: తరతరాలుగా పేద రైతు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్న పచ్చని కొబ్బరి, మామిడి, జీడి తోటలను మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం సేకరించడం తగదని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు అన్నారు. ప్రభుత్వ భూదాహాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. మండలంలో ఏర్పాటు చేయనున్న ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్లాంట్ కోసం ప్రభుత్వం సేకరించ తలపెట్టిన రెండో విడత భూములను గురువారం స్థానిక రైతులతో కలసి అఖిల పక్ష నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వీసం మాట్లాడుతూ నెల్లిపూడిలో టౌన్షిప్ ఏర్పాటుకు 400 ఎకరాలు కేటాయించాలని కంపెనీ యాజమాన్యం ప్రభుత్వానికి దరఖాస్తు చేయడంతో ఏపీఐఐసీ అధికారులు భూసేకరణకు చర్యలు చేపట్టారన్నారు. నెల్లిపూడిలో సర్వే చేసి భూములు గుర్తించారన్నారు. ఈ భూముల్లో ఏటా ఫలసాయం అందిస్తున్న మామిడి, జీడి, కొబ్బరి తోటలు ఉన్నాయన్నారు. ఏటా లక్షలాది రూపాయల ఆదాయం వస్తుండడంతో రైతులు ఈ భూములపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఇప్పటికే మండలంలో డీఎల్పురం, వేంపాడు, చందనాడ, రాజయ్యపేట, అమలాపురం గ్రామాల పరిధిలో 2,020 ఎకరాలు కేటాయించారన్నారు. టౌన్షిప్ కోసం మరో 400 ఎకరాలు కేటాయించేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించడం దారుణమన్నారు. జీవనాధారమైన భూములు ఇచ్చేందుకు రైతులు సిద్ధంగా లేరన్నారు. తమకు అండగా నిలవాలని భూ యజమానులంతా తమను కోరడంతో ఈ భూముల పరిశీలనకు వచ్చామన్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్ట పరిహారం రైతులకు ఏ మూలకు చాలదన్నారు. ఇప్పటికే ఏపీఐఐసీకి భూములు, నివాస ప్రాంతాలు త్యాగం చేసిన రైతులంతా రోడ్డున పడ్డారన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నష్ట పరిహారం, ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించలేదన్నారు. ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామంటే ఒప్పుకునేది లేదని హెచ్చరించారు. రైతులను ఒప్పించి భూసేకరణ చేయాలన్నారు. లేదంటే ఎటువంటి పోరాటానికై నా వైఎస్సార్సీపీ, సీపీఎం నాయకులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ వింగ్ జిల్లా అధ్యక్షుడు సూరాకాసుల గోవిందు, సీపీఎం మండల కన్వీనర్ ఎం.రాజేష్, రైతులు శ్రీనురాజు, సుబ్బరాజు, కురందాసు నాని, రమేష్రాజు జోగిరాజు, అప్పలరాజు, పేర్రాజు, బి.తాతారావు, సాగర్, కన్నంరాజు, కె.రమణ, తదితరులు పాల్గొన్నారు. -
సింహాచలం వరకు డబుల్ డెక్కర్ బస్సు
సింహాచలంలో డబుల్ డెక్కర్ బస్సుసింహాచలం: నగరంలో బీచ్రోడ్డుకే పరిమితమైన డబుల్ డక్కర్ ఎలక్ట్రిక్ బస్సు.. ఇక నుంచి పవిత్ర పుణ్యక్షేత్రం సింహాచలంలో కూడా కనువిందు చేయనుంది. ఆ బస్సు సర్వీసును సింహాచలం వరకు పొడిగించారు. గురువారం బస్సు సింహాచలం చేరుకుంది. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకునేందుకు నగరంలో నుంచి సింహాచలం వచ్చే భక్తులకు, పర్యాటకులకు ఈ బస్సు కొత్త అనుభూతిని కలిగించనుంది. రోజుకి మూడు ట్రిప్పులు సింహాచలం వరకు బస్సు తిరుగుతుందని పర్యాటక సిబ్బంది తెలిపారు. కాగా టైమింగ్స్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అలాగే సింహగిరి ఘాట్రోడ్డులో బస్సు వెళ్లేందుకు అనుకూలంగా లేకపోవడంతో కేవలం కొండదిగువ వరకు మాత్రమే వెళ్తుంది. -
సింహగిరిపై శ్రీనృసింహ దీక్షల వైభవం
సింహాచలం : సింహగిరిపై 32 రోజుల శ్రీ నృసింహ దీక్షలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి దేవస్థానం అర్చకులు శాస్త్రోక్తంగా మాలధారణ చేశారు. ఆలయ రాజగోపురం పక్కన మాడవీధిలో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటుచేసి శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ప్రతిమను ఉంచారు. దేవస్థానం ఏఈవో తిరుమలేశ్వరరావు, సూపరింటెండెంట్ మూర్తి, అర్చకులు ఆలయంలో నుంచి తులసి మాలలను ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామిచెంతన ఉంచి విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు. స్వామివారి అష్టోత్తర శతనామావళిని దీక్షాధారులందరిచేత పఠింపజేశారు. అనంతరం మాలధారణ చేశారు. తులసి మాల, ప్రతిమ ఉచితంగా అందజేయడంతోపాటు స్వామివారి అంతరాలయ దర్శనాన్ని కల్పించారు. దీక్ష తీసుకున్నవారిలో సింహాచలం ప్రాంతానికి చెందిన శ్రీ చందన పెరుమాళ్ పీఠం, సింహాద్రిమఠం, శ్రీనృసింహ పెరుమాళ్ పీఠంకి చెందిన భక్తులు ఉన్నారు. దేవస్థానం ప్రధానార్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈనెల 3 నుంచి 41 రోజుల శ్రీ నృసింహ దీక్షలు ప్రారంభమైన విషయం తెలిసిందే. జనవరి 12వ తేదీన రెండు దీక్షల విరమణ కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు. 32 రోజుల దీక్షలు ప్రారంభం -
దారులన్నీ అమ్మ సన్నిధికే..
డాబాగార్డెన్స్ (విశాఖ): బురుజుపేటలో కొలువైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మార్గశిర మాసం మూడో గురువారం కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాకుండా, రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. బుధవారం అర్ధరాత్రి నుంచే క్యూల్లో బారులు తీరారు. భక్తి ప్రపత్తులతో జరిగిన పూజల నడుమ.. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల హడావుడి, ఆలయ నిర్వహణలో పోలీసుల పెత్తనం సామాన్య భక్తులను, ఆలయ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేయడం గమనార్హం. విశేషంగా పూజలు మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అర్చకులు అమ్మవారికి పంచామృతాభిషేకాలు, సహస్రనామార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.05 గంటల నుంచి 1.30 గంటల వరకు స్వర్ణాభరణాలతో అ లంకరించిన అమ్మవారు భక్తులకు దేదీప్యమానంగా దర్శనమిచ్చారు. అంతకుముందు గణపతి పూ జ, పుణ్యాహవచనం, రుత్విక్ వరణ, వేద పారాయ ణాలు, శ్రీచక్రార్చన, లక్ష్మీ హోమం జరిపారు. భక్తు లు సమర్పించిన పసుపు కుంకుమ నీళ్లతో జలాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం వెండి కవచాలు తొడిగి, దర్శనాలు కల్పించారు. ఎమ్మెల్యే హవా.. ఓవైపు భక్తులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండగా, మరోవైపు స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ హవా ఆలయంలో స్పష్టంగా కనిపించింది. గురువారం జరిగిన తొలిపూజలో పాల్గొన్న ఎమ్మెల్యే, తన వెంట సుమారు 200 మంది అనుచరులను తీసుకురావడంతో ఉత్సవాల్లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు, ఉత్సవ కమిటీ సభ్యుల అనుచరులతో ఆలయ ప్రాంగణం నిండిపోయింది. ఎటు చూసినా ఎమ్మెల్యే మనుషులే కనిపించడంతో.. సామాన్య భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. అపురూపం.. కనకమహాలక్ష్మి దర్శనం కశింకోట: ఇక్కడి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. మార్గశిర మాసం మూడో గురువారాన్ని పురస్కరించుకొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. అమ్మవారి దర్శనానికి బారులు తీరారు. భక్తి పారవశ్యంతో తన్మయులయ్యారు. చీరలు, రవికెలు, అరటి గెలల రూపంలో అమ్మ వారికి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి వేద మంత్రాల నడుమ క్షీరాభిషేకం నిర్వహించారు. అనంతరం అందంగా ఆభరణాలు, నూతన వస్త్రాలు, పూల మాలలతో అందంగా అలంకరించి కుంకుమార్చనలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వి.చిదంబరం, వి.కృష్ణల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు బందోబస్తు నిర్వహించారు. -
టెట్ నుంచి మినహాయించాలి
అనకాపల్లి : ఇన్ సర్వీస్ టీచర్లకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీఈటీ) నుంచి మినహాయింపు ఇవ్వాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) జిల్లా అధ్యక్షురాలు వత్సవాయి శ్రీలక్ష్మి అన్నారు. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ధర్నా చేపట్టి, ఆర్డీవో షేక్ అయిషాకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఈటీ అనేది 2010 లో ప్రభుత్వం ప్రవేశశపెట్టిందని, 2010 తర్వాత ప్రకటించిన అన్ని డీఎస్సీల్లో టెట్ పరీక్షలు కూడా కలిపి నిర్వహించారని, 2010కు ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్ రాసుకునే అవకాశం లేదని అన్నారు. సుప్రీంకోర్టు ఉపాధ్యాయులందరూ టెట్ పరీక్ష పాస్ అవ్వాలని, లేని పక్షంలో ఉద్యోగాలు వదులుకోవాలని వ్యాఖ్యానించిన ఫలితంగా దేశవ్యాప్తంగా లక్షల మంది ఉపాధ్యాయుల భవిషత్ ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని, 2010కి ముందు నియమితులైన ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా ప్రభుత్వం పార్లమెంటుకు లెటర్ రాసి పార్లమెంట్లో చట్ట సవరణ చేసే దిశగా చర్యలు చేపట్టాలని అన్నారు. టెట్ నుంచి మినహాయింపు ఇచ్చేవరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు ఎ.ప్రకాష్, నడిగట్ల శేషుకుమార్, సీనియర్ నాయకురాలు ఎస్ఎస్ నాగమణి, మండల నాయకులు చింతాడ వెంకటరమణ, మామిడి బాబురావు, రేబాక రవి, శంకర్, సత్యవేణి, ఝాన్సీ, కిషోర్, శివశ్రీ, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
● ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన యువతి కోసం హైదరాబాద్ నుంచి వచ్చిన యువకుడు ● వివాహానికి నిరాకరించడంతో వాహనాలు ధ్వంసం చేసి పరార్ ● బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు
యలమంచిలి రూరల్ : పట్టణంలోని టిడ్కో కాలనీలో మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన ఒక యువకుడు సైకోలా ప్రవర్తించి వీరంగం సృష్టించాడు. తాను ఇష్టపడిన యువతి కోసం వచ్చిన యువకుడు ఆమె మాట్లాడ్డానికి నిరాకరించడంతో రెచ్చిపోయి ఇష్టారాజ్యంగా ప్రవర్తించాడు. కాలనీలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన కారు, ఆటో ముందుభాగంలో ఉన్న అద్దాలు పగలగొట్టాడు. పలు ద్విచక్ర వాహనాలపై రాళ్లు విసిరి ధ్వంసం చేశాడు. ఈ ఘటనలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. పట్టణ ఎస్ఐ కె.సావిత్రి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ ద్వారా యలమంచిలి టిడ్కో కాలనీలో ఉంటున్న యువతికి హైదరాబాద్కు చెందిన కార్తీక్తో పరిచయం ఏర్పడింది. కొంతకాలం ఫోన్లో ఇద్దరూ మాట్లాడుకున్నారు. తర్వాత యువకుడి ప్రవర్తన నచ్చకపోవడం, వివాహం చేసుకోవాలని బలవంతం చేయడంతో అందుకు యువతి నిరాకరించి మాట్లాడడం మానేసింది. మంగళవారం హైదరాబాదు నుంచి యలమంచిలి టిడ్కో కాలనీకి వచ్చిన యువకుడు యువతితో గొడవపడ్డాడు. అనంతరం వాహనాల విధ్వంసానికి పాల్పడ్డాడు. దీనిపై బాధితులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనతో టిడ్కో కాలనీ వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. -
జీవో 1491ను సవరించాలి
మునగపాక : కొత్తగా ఏర్పాటు చేయబోయే నక్కపల్లి రెవెన్యూ కేంద్రంలో యలమంచిలి నియోజకవర్గాన్ని కలపకుండా చూడాలని కోరుతూ మునగపాకలో రైతుల సహకారంతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుదవారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. గతంలో వలే అనకాపల్లి డివిజన్లోనే యలమంచిలిని కొనసాగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందుగా మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు,పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనా యుడు,మండల సర్పంచ్ల సంఘ అధ్యక్షుడు కాండ్రేగుల నూకరాజు తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంజీవరావు మాట్లాడుతూ ఏళ్ల తరబడి యలమంచిలి నియోజకవర్గం అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోనే కొనసాగుతూ వస్తుందన్నారు. నక్కపల్లి కేంద్రంగా ఏర్పాటు చేసే రెవెన్యూ డివిజన్ కారణంగా ఇబ్బందులు తప్పవన్నారు. సుదూర ప్రాంతమైన నక్కపల్లికి వెళ్లాలంటే వ్యయ ప్రయాసకు గురికావాల్సి వస్తుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 1491ను సవరించి ఈ ప్రాంత ప్రజలకు మేలు జరిగేలా చూడాలన్నారు. అనకాపల్లి కేంద్రంగా కొనసాగుతున్న రెవెన్యూ డివిజన్లోనే యలమంచిలి ఉండేలా చూడాలన్నారు. లేకుంటే రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమం తప్పదన్నారు. సర్పంచ్లు ఇందల నాయుడు, భీశెట్టి గంగప్పలనాయుడు, కారుకొండ రాజు, మాజీ ఎంపీపీ దాసరి అప్పారావు,ఎంపీటీసీ సూరిశెట్టి రాము, పార్టీ నేతలు శీరా రమణమ్మ, ఆడారి కాశీబాబు, కరణం కాంతమ్మ, గుంట్ల అప్పారావు, ఎంఎం నాయుడు, ఆడారి రమణబాబు, మళ్ల రామజగన్నాథం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మూడో రాజు వాడ్రాపల్లి, మల్లవరం, గొల్లలపాలెం, నాగవరం గ్రామాలకు చెందిన కన్నుంనాయుడు, రామజోగినాయుడు, భాస్కరరావు, భూలేక, లక్ష్మణరావు, రవి, శ్రీను, రమణ బాబు, నూకప్పారావు, జోగినాయుడు, రమణ, బర్ల వెంకునాయుడు, శీరా అప్పారావు, చొప్పా గంగరాజు, గోపాలకృష్ణ, బర్ల నూకప్పారావు, ఈశ్వరప్పారావు, కర్రి అప్పారావు, ఇందల రమేష్, సాలాపు శ్రీను, రావి రమణ, బాబూరావు, వెంకట గణేష్,పాలిపిని నాయుడు,అప్పికొండ శ్రీనివాసరావు, సూరిబాబు, సంజీవరావు, పాలిపిని అప్పారావు, పాలిపిని శ్రీను, రమణబాబు, సన్యాసిరావు, రుత్తల రాము,పాలిపిని నాగ వెంకట అప్పారావు దీక్షలో కూర్చొన్నారు. -
అరకులో చలి పంజా
● 4.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు ● డుంబ్రిగుడలో తగ్గుముఖం ● చింతపల్లి ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ అప్పలస్వామి వెల్లడి చింతపల్లి: జిల్లాలో కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. రెండు రోజులుగా మరింత దిగజారుతున్నాయి. మంచు, చలి తీవ్రతకు మన్యం వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం అరకువ్యాలీలో 4.4 డిగ్రీలు, డుంబ్రిగుడలో 4.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారు. పాడేరు డివిజన్ పరిధి జి.మాడుగులలో 4.8, ముంచంగిపుట్టులో 5.0, పాడేరులో 5.2,హ హుకుంపేటలో 9.6, చింతపల్లిలో 6.2, పెదబయలులో 6.7, కొయ్యూరులో 11.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయని ఆయన పేర్కొన్నారు. రంపచోడవరం డివిజన్ వై.రామవరంలో 9.4, మారేడుమిల్లిలో 9.9, రాజవొమ్మంగిలో 11.7 ,అడ్డతీగలలో 13.0, రంపచోడవరంలో 13.6,గంగవరంలో 16.7, చింతూరు డివిజన్ చింతూరులో 13.3, ఎటపాకలో 13.9 డిగ్రీలు నమోదు అయ్యాయని ఆయన తెలిపారు. చలిని ఉపశమనం పొందేందుకు మన్యం వాసులు మంటలు కాగుతూ ఉపశమనం పొందుతున్నారు. సాక్షి,పాడేరు: జిల్లాలో చలితీవ్రత పెరుగుతోంది. సాయంత్రం నాలుగు గంటల నుంచి ప్రజలు చలికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఉదయం 9గంటల వరకు పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉన్ని దుస్తుల వినియోగం పెరిగింది. పర్యాటకులకు ప్రాణసంకటంగా.. ఎటపాక: పాపికొండలు సందర్శకులకు పొగమంచు, చలి ప్రాణసంకటంగా మారింది. వీఆర్ పురం మండలంలోని పోచవరం లాంచీల రేవుకు భద్రాచలం నుంచి వచ్చే వారు ఎటపాక మండలం మీదుగా కూనవరం నుంచి వీఆర్పురం మండలంలోని పోచవరం రేవుకు వాహనాల్లో వెళ్తుంటారు. వీరంతా భద్రాచలంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో బయలుదేరుతారు. ఒక పక్క చలి, మరోపక్క మంచు తెరలు కమ్ముకోవడంతో రేవుకు వెళ్లేవారు సందర్శకులు ఇబ్బందులు పడుతున్నారు. -
ఆర్సెలర్ మిట్టల్ టౌన్షిప్కు భూములు ఇవ్వం
తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు నక్కపల్లి: ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేసే టౌన్షిప్ కోసం భూములు ఇచ్చే ప్రసక్తి లేదని నెల్లిపూడి రైతులు స్పష్టం చేశారు. గ్రామానికి చెందిన పలువురు బుధవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు, రైతులు టి.పేర్రాజు, అప్పలరాజు, జోగిరాజు తదితరులు మాట్లాడుతూ ఇప్పటికే స్టీల్ప్లాంట్ కోసం ప్రభుత్వం 2020 ఎకరాలు కేటాయించిందన్నారు. ఇది చాలదన్నట్లు టౌన్షిప్ ఏర్పాటుకు మరో 400 ఎకరాలు సేకరించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్న రైతులంతా ఉపాధి కోల్పోతారన్నారు. అదనంగా భూములు ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇది చాలా అన్యాయమన్నారు. 2013 భూసేకరణ చట్ట ప్రకారం రైతుల అంగీకారం లేకుండా భూములను బలవంతంగా సేకరించడం తగదన్నారు. ప్రభుత్వ అధికారులు చట్టాన్ని ఉల్లంఘిస్తూ రైతుల భూములు బలవంతంగా లాక్కొనే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. భూసేకరణ ప్రక్రియ నిలుపుదల చేయాలన్నారు. టిడ్కో కాలనీలో అర్ధరాత్రి యువకుడి వీరంగం -
లింగ నిర్ధారిత వీర్యంపై అవగాహన కల్పించండి
సమావేశంలో మాట్లాడుతున్న పశుసంవర్ధకశాఖ ఏడీ దినేష్కుమార్ కె.కోటపాడు : ఆడపెయ్యిల జననంకు లింగ నిర్ధారిత వీర్యం ఆవులు, గేదెలకు వేయించేలా పాడి రైతులకు పశువైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని కె.కోటపాడు పశుసంవర్ధకశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఈ.దినేష్కుమార్ తెలిపారు. కె.కోటపాడులో బుధవారం కె.కోటపాడు, దేవరాపల్లి మండలాల పశువైద్యాధికారులు, పశువైద్య సహాయకులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదికి కె.కోటపాడు మండలంలో 1000 పశువులకు, దేవరాపల్లిలో 810 పశువులకు ఆడపెయ్యిల జననంకు లింగ నిర్ధారిత వీర్యం వేయించే చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కో డోసుకు రైతుల వద్ద నుంచి రూ.150 మాత్రమే తీసుకోవాలని తెలిపారు. అదే విధంగా గోట్ ఫాక్స్ టీకాలను గొర్రెలు, మేకలకు, గొంతు వ్యాధి నివారణ టీకాలను ఈ నెల 25లోగా లక్ష్యం మేరకు పూర్తి చేయాలని దినేష్కుమార్ సూచించారు. కార్యక్రమంలో కొరువాడ, చౌడువాడ, దేవరాపల్లి మండలాల పశువైద్యాధికారులు సిహెచ్.వై.నాయుడు, సింహచలంనాయుడు, మంజూష, ప్రియాంక, గాయత్రి, పశువైద్య సిబ్బంది సమీరా పాల్గొన్నారు. -
500 కిలోల రేషన్ బియ్యం పట్టివేత
రోలుగుంట : కె.నాయుడుపాలెం గ్రామంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారన్న సమాచారంతో తహసీల్దార్ సిహెచ్.నాగమ్మ సిబ్బందితో కలసి బుధవారం దాడి చేశారు. కె.నాయుడుపాలెం వైఎస్సార్ విగ్రహం కూడలిలో రేషన్ బియ్యంతో నింపి ఉన్న పది బస్తాలలో 500 కిలోల బియ్యం తరలించడానికి సిద్దంగా ఉన్నాయి. ఈ దాడి సమయంలో అక్కడ ఎవరూ లేక పోవడం, కొంత సేపు వేచి ఉన్నా ఎవరూ రాకపోవడంతో తహసీల్దార్ బస్తాలలో ఉన్న బియ్యం పరిశీలించి రేషన్ బియ్యంగా గుర్తించి వాటిని పౌర సరఫరా సరకులు గోదాములకు ఆర్ఐ రామ్మూర్తితో చేరవేసి తాను తన కార్యాలయానికి తహసీల్దార్ వెనుదిరిగారు. సాయంత్రం ఇదే మండలం రత్నంపేట గ్రామానికి చెందిన పెనుగొండ జగన్నాథం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి బియ్యం తనవేనని, ఇప్పించాలని కోరాడు. దీనిపై తహసీల్దార్ అతనిని విచారించి సరైన సమాధానం లేకపొవడంతో ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై రామకృష్ణారావు కేసు నమోదు చేశారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
ఎస్.రాయవరం : పెనుగొల్లు సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడు మృతి చెందగా మరో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన మేరకు ఎస్ఐ విభీషణరావు బుధవారం అందించిన వివరాలిలా ఉన్నాయి. లింగరాజుపాలెం గ్రామానికి చెందిన ఏడిద దిలీప్కుమార్ స్నేహితులు నలమాటి జగన్, ఎస్.రాయవరానికి చెందిన జితేంద్ర మగళవారం అర్ధరాత్రి పెనుగొల్లు సమీపంలో భోజనం చేసేందుకు హోటల్కి వెళ్లారు. అర్థరాత్రి కావడం హోటల్ మూసి వేయడంతో పెనుగొల్లు జాతీయ రహదారిపై యూ టర్న్ తీసుకుంటుండగా అనకాపల్లి నుంచి తుని వైపు వెళుతున్న వాహనం ఢీకొట్టడంతో ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 వాహనం సహాయం అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దిలీప్కుమార్(20) మృతి చెందాడు. గాయపడ్డ జగన్, జితేంద్రలను మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్కి తరలించినట్టు చెప్పారు. మృతిచెందిన దిలీప్కుమార్, (ఫైల్) -
రిటైర్డ్ సీఈ ఇంట్లో ఏసీబీ సోదాలు
ఆరిలోవ: ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్లో చీఫ్ ఇంజినీర్గా పనిచేసి పదవీ విరమణ పొందిన సబ్బవరపు శ్రీనివాస్ నివాసంలో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. నగరంలోని విశాలాక్షినగర్లో ఉన్న ఆయన ఇంటితో పాటు నగరంలోని మరో నాలుగు చోట్ల, హైదరాబాద్, ఏలూరు, విజయనగరం ప్రాంతాల్లోని ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. విశాలాక్షినగర్లోని నివాసంలో శ్రీనివాస్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ విజయవాడలో ట్రైబల్ వెల్ఫేర్ కార్పొరేషన్లో చీఫ్ ఇంజినీర్గా పనిచేస్తున్న సమయంలో ఓ కాంట్రాక్టర్ నుంచి బిల్లుల మంజూరు కోసం రూ.25 లక్షలు లంచం తీసుకుంటూ ఈ ఏడాది ఆగస్టు 7న ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఆ కేసులో రిమాండ్లో ఉండగానే ఆయన పదవీ విరమణ పొందారు. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే తాజా సోదాలు నిర్వహించినట్లు ఏసీబీ డీఎస్పీ బి.వి.ఎస్.ఎస్.రమణమూర్తి తెలిపారు. సోదాల్లో విశాలాక్షినగర్లోని ప్లాట్తో పాటు సుమారు రూ.కోటి విలువ చేసే స్థిరాస్తుల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని, వీటిని కోర్టులో సమర్పిస్తామని డీఎస్పీ వివరించారు. శ్రీనివాస్ తన సర్వీస్లో నాలుగు సార్లు ఏసీబీకి చిక్కినట్లు వెల్లడించారు. అవినీతికి పాల్పడిన వారు ఉద్యోగ విరమణ పొందినా చట్టం నుంచి తప్పించుకోలేరని డీఎస్పీ స్పష్టం చేశారు. -
ఒక్కో సంస్థ ఒక్కో ధర.. రైతుకు టోకరా
సాక్షి,పాడేరు: మన్యంలో కాఫీ పండ్ల కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఎంతో కష్టపడి పండించిన రైతులకు మార్కెట్ పరిస్థితులు నిరాశ కలిగిస్తున్నాయి. సంస్థలు కొనుగోలు ధరల్లో వ్యత్యాసం ఉన్నందున తాము నష్టపోవాల్సి వస్తోందని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. జిల్లాలోని 1.50 లక్షల ఎకరాల్లో కాఫీ సాగవుతోంది. ఎకరాకు కనీనం 1000 కిలోల వరకు ఫలసాయం వస్తుంది. ఈ ఏడాది దిగుబడి ఆశాజనకంగా ఉన్నా సంస్థలు నిర్ణయించిన కొనుగోలు ధరలు వారిని నిరాశ పరుస్తున్నాయి. ● పాడేరు ఐటీడీఏ ఆధీనంలోని చింతపల్లి మాక్స్ సంస్థ కాఫీ పండ్లు గ్రేడ్–1ను కిలో రూ.70, గ్రేడ్–2 కిలో రూ.65 ధరకు కొనుగోలు చేస్తోంది. ఐటీడీఏ కాఫీ విభాగ అధికార యంత్రాంగమంతా గ్రామాలకు నేరుగా గిరిజనుల కాఫీ తోటల వద్దకు వెళ్లి ఫలసాయం కొనుగోలు చేస్తోంది. ఈ సంస్థకే కాఫీ పండ్లు విక్రయించాలని అధికారుల నుంచి ఒత్తిడి తేవడం రైతులకు ఇబ్బందిగా మారింది. కాఫీ మార్కెటింగ్ తరువాత లాభాలను బోనస్ రూపంలో పంపిణీ చేస్తామని కాఫీ విభాగం అధికారులు గిరిజనులకు హమీ ఇస్తున్నారు. తక్కువ ధరకు చింతపల్లి మాక్స్ కొనుగోలు చేయడంతో కాఫీ రైతులు ఉసూరుమంటున్నారు. రికార్డు ధరకు నాంది కొనుగోలు అరకులోయ కేంద్రంగా పనిచేస్తున్న నాంధి స్వచ్ఛం సంస్థ కాఫీ పండ్లు కిలో రూ.100 ధరకు కొనుగోలు చేస్తోంది. పూర్తిగా పండిన పండ్లు కిలో రూ.100, నాణ్యత తక్కువగా ఉంటే కిలో రూ.80నుంచి రూ.90కు కొనుగోలు చేస్తోంది. అయితే నాంధి సంస్థ అధిక ధరతో పోటాపోటీగా గ్రామాల్లో తిరుగుతున్నప్పటికీ రైతులు పూర్తిస్థాయిలో అమ్ముకోలేకపోతున్నారు. చింతపల్లి మాక్స్కే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నందున కిలోకు రూ.30 చొప్పున నష్టపోవాల్సి వస్తుందని కాఫీ రైతులు వాపోతున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు కూడా కిలో కాఫీ పండ్లను రూ.70 ధరకు కొనుగోలు చేస్తున్నాయి.కలెక్టర్, ఐటీడీఏ స్పందించాలి లాభాలు, బోనస్ను పక్కనబెట్టి పాడేరు ఐటీడీఏ కిలో కాఫీ పండ్లకు 100 చెల్లించాలి. నాంధి సంస్థ మాదిరిగా కొనుగోలు చేయకుంటే నష్టపోవాల్సి ఉంటుంది. కలెక్టర్, ఐటీడీఏ అఽధికారులు స్పందించి మాక్స్ సంస్థ ధర పెంచేలా చర్యలు తీసుకోవాలి. – రేగం చిట్టన్న, కాఫీ రైతు, వనుగుపల్లి పంచాయతీ కాఫీ కొనుగోళ్లలో ఇష్టానుసారం ప్రభుత్వ రంగ మాక్స్ కిలో రూ.70కు కొనుగోలు ఈ సంస్థకే అమ్మాలని కాఫీ విభాగం అధికారుల ఒత్తిడి ప్రైవేట్ సంస్థ నాంథి రూ.100 చెల్లింపు రైతు ఉత్పత్తిదారుల సంఘాలు రూ.70కు సేకరణ ధరల వ్యత్యాసంతో నష్టపోతున్న కాఫీ రైతులు -
ఆర్టీసీ బస్సు ఢీకొని చుక్కల జింక మృతి
జాతీయరహదారిపై ప్రమాదంలో మృతి చెందిన చుక్కల జింక ఆరిలోవ (విశాఖ): జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చుక్కల జింక మృతి చెందింది. అటవీశాఖ సిబ్బంది తెలిపిన వివరాలివి. కంబాలకొండ అభయారణ్యం నుంచి ఓ చుక్కల జింక జూపార్క్ దాటిన తర్వాత జాతీయ రహదారిపైకి వచ్చింది. అదే సమయంలో నగరం నుంచి మధురవాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆ జింకను ఢీకొట్టింది. దీంతో తీవ్ర రక్తస్రావమై జింక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని, జింక కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం జూ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దహనం చేశారు. కాగా, కంబాలకొండ అభయారణ్యం నుంచి జింకల గుంపులు ఆహారం, నీటి కోసం తరచూ జాతీయ రహదారిపైకి వస్తున్నాయని, వాహనాలు ఢీకొని ప్రాణాలు కోల్పోతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టెన్త్ విద్యార్థులు క్షేమం
● అనకాపల్లిలో దొరికిన పిల్లలు.. తల్లిదండ్రులకు అప్పగింత ఎన్టీఆర్ స్టేడియంలో దొరికిన పదో తరగతి విద్యార్థులు రాంబిల్లి (అచ్యుతాపురం)/అనకాపల్లి టౌన్: రాంబిల్లి మండలం పంచదార్లలోని బీసీటీ విద్యార్థుల అదృశ్యం కేసు సుఖాంతమైంది. భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ ఇంటిగ్రేటెడ్ పాఠశాల నుంచి మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటలకు అదృశ్యమైన ఆరుగురు విద్యార్థులు అనకాపల్లిలో పోలీసులకు చిక్కారు. విద్యార్థులు అదృశ్యం అయ్యారన్న సంగతి తెలుసుకొని యాజమాన్యం మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారి వివరాలను మీడియాకు విడుదల చేశారు. ఈ ఘటనతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురి కాగా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. విద్యార్థులు అనకాపల్లి మున్సిపల్ స్టేడియంలో ఉన్నారని స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ ఉదంతం సుఖాంతమైంది. పోలీసులు విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చి రాంబిల్లి తరలించారు. సీఐ నరసింగరావు విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల యాజమాన్యం సమక్షంలో అప్పగించారు. విద్యార్థులు ఎందుకు వెళ్లిపోయారు.. మంగళవారం రాత్రి ఎక్కడ తల దాచుకున్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. బాగా చదవాలని పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థులకు చెప్పిన నేపథ్యంలో విద్యార్థులు వెళ్లిపోయారని భావిస్తున్నారు. విద్యార్థులను క్షేమంగా వారి తల్లిదండ్రులకు అప్పగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
750 మొబైల్ ఫోన్లు రికవరీ
అనకాపల్లి: జిల్లా పోలీస్ శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ, ప్రజల ఆస్తుల రక్షణే ధ్యేయంగా పని చేస్తోందని, 11వ విడతలో 750 మొబైల్ రికవరీ (విలువ సుమారు రూ.కోటి 50 లక్షలు) చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా చెప్పారు. తమ కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి, మొబైల్ రికవరీ మేళా నిర్వహించి, బాధితులకు అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ ఫోన్ల రికవరీకి 3 నెలల సమయం పట్టిందన్నారు. జిల్లాలో ఐటీ కోర్ టీమ్ చేస్తున్న నిరంతర కృషి వలన రాష్ట్రంలో, దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి చోరీకి గురైన మొబైల్స్ను బాధితులకు అందజేశామన్నారు. 11వ విడతలో 750 మొబైల్ ఫోన్లు (యాపిల్, శాంసంగ్, వివో, రెడ్ మి మొదలైనవి) రికవరీ చేశామని, నేటి వరకూ 4,086 మొబైల్ ఫోన్లను రికవరీ చేిధితులకు అందజేశామని, వీటి విలువ సుమారుగా రూ.6.77 కోట్లు ఉంటుందన్నారు. మన రాష్ట్రంలో తూర్పు గోదావరి, అనంతపురం, సత్యసాయి జిల్లాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, తెలంగాణ ప్రాంతాల నుంచి మొబైల్స్ను తీసుకొని వచ్చామన్నారు. ప్రస్తుత కాలంలో మొబైల్ అనేది కేవలం మాట్లాడటానికి ఉపయోగించే పరికరం మాత్రమే కాదని, మన ’పర్సనల్ ఐడెంటిటీ’గా మారిందన్నారు. మొబైల్ పోయినప్పుడు బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదన్నారు. సీఈఐఆర్ పోర్టల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన www.ceir.gov.inలో లాస్ మొబైల్ ఆప్షన్ ద్వారా ఐఎంఈఐ నంబర్, ఫోన్ మోడల్ వివరాలను నమోదు చేసుకోవచ్చన్నారు. లేని పక్షంలో జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 93469 12007 కు ఫిర్యాదు చేసుకోవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన్రావు, సైబర్ సెల్ సీఐ బి.వెంకట రావు, ఇతర సీఐలు బాలసూర్యా రావు, టి.లక్ష్మి, రమేష్, ఐటీ కోర్ ఎస్ఐ బి.సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
జనసేన ఆఫీస్లో మద్యపానం
సాక్షి, అనకాపల్లి: పదిమందికీ ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు పార్టీ కార్యాలయంలోనే మందుతాగి తూగిన వైనం ఇది. జనసేన కార్యాలయంలో పార్టీ నాయకుడు మద్యం తాగుతున్న వీడియోలు వైరల్ అయ్యాయి. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ కన్వీనర్, రాష్ట్ర వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన సూర్యచంద్ర పార్టీ కార్యాలయంలో మద్యం తాగుతున్న వీడియోలు చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గంలో జనసేన పార్టీ అంతంత మాత్రమే. ఒక వర్గం నాయకులు సూర్యచంద్ర ప్రమేయం లేకుండా ఆగస్టులో నర్సీపట్నంలో జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. దీంతో తన ఉనికికి ఎక్కడ ముప్పు కలుగుతుందోనన్న ఆందోళనతో సూర్యచంద్ర తన సొంత మండలమైన నాతవరంలో సెప్టెంబర్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యాలయంలోనే ఆయన మందు తాగుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. స్థానిక శాసనసభ్యుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడికి దగ్గరగా వ్యవహరించే సూర్యచంద్ర వీడియోలపై జనసేన అధిష్టానం ఎలా స్పందిస్తుందోనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. -
హక్కుల రక్షణ.. అందరి బాధ్యత
ఏయూక్యాంపస్: అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని బుధవారం బీచ్రోడ్డులో ర్యాలీ జరిగింది. జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె.మాధవీలత అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి డీఎల్ఎస్ఏ న్యాయమూర్తి ఆర్.సన్యాసినాయుడు, జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి తనూజరెడ్డి, ఎన్హెచ్ఆర్ఎఫ్ సంస్థ సీటీవో టి.ఎస్.రామచంద్రనాయుడు, విశాఖ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, ఏయూ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె.సీతామాణిక్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతిని కాంక్షిస్తూ అతిథులు పావురాలను ఎగురవేశారు. మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని పిలుపునిస్తూ.. వాటి ప్రాముఖ్యాన్ని చాటిచెప్పేలా ఈ ర్యాలీని చేపట్టారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, న్యాయ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
ఇప్పటికీ ఈ రాష్ట్రంలో, దేశంలో వైద్యం ఖరీదైన సేవ.. వైద్య విద్య సామాన్యులకు అందని ద్రాక్ష.. ఈ దుస్థితిని రూపు మాపి, జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెడితే.. దానికి అనుబంధంగా అధునాతన బోధనాస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తే పేదలకు వైద్యం, వైద్య విద్య రెండ
●చోడవరం టౌన్లో ఉన్న పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అక్కడ నుంచి వందలాది మంది మేధావులు, యువత, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో చోడవరం నుంచి ర్యాలీగా అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయానికి వచ్చారు. ●అడ్డురోడ్డులో గల పాయకరావుపేట నియోజకవర్గం పార్టీ కార్యాలయం నుంచి సమన్వయకర్త కంబాల జోగులు ఆధ్వర్యంలో ర్యాలీగా అనకాపల్లి తరలించారు. ●అనకాపల్లి పట్టణంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకీరామరాజు, రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి మలసాల కుమార్రాజా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ●మాడుగుల నియోజకవర్గంలో దేవరాపల్లి మండలంలో తారువలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపుగా గంటసేపు జరిగింది. మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించి అక్కడ నుంచి 2 కి.మీ దూరం ర్యాలీ చేశారు. ●నర్సీపట్నంలో మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, నియోజకవర్గ పరిశీలకుడు చిక్కాల రామారావు పాల్గొన్నారు. ●యలమంచిలిలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గం సమన్వయకర్త కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో యలమంచిలి టౌన్ పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమై..అక్కడ నుంచి ఎల్ఐసీ కూడలి మీదుగా ర్యాలీ చేసుకుంటూ జాతీయ రహదారి మీదుగా అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ●పెందుర్తి నియోజకవర్గంలో సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ ఆధ్వర్యంలో సంతకాల పత్రాలను అనకాపల్లి జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తీసుకెళ్లారు. -
రైతన్నను బతికించండి
అనకాపల్లి టౌన్: ధ్యానం, పత్తి, మొక్కజొన్న, అరటి తదితర పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ప్రకటించి, ఆయా పంటలను కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు అన్నారు. పట్టణంలోని సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను తక్షణమే ఆదుకోవాలని బుధవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి లేని కౌలు రైతులందరికీ అన్నదాత సుఖీభవ పథకం వర్తింపజేయాలన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు వెంటనే ఇన్పుడ్ సబ్సిడీని చెల్లించాలన్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు, కౌలు రైతు కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలన్నారు. కార్యక్రమంలో భాగంగా నాలుగురోడ్ల జంక్షన్ వద్ద రైతుల మెడకు ఉరి వేయద్దు అన్నట్లుగా నిరసన తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయానికి చేరుకొని ఆర్డీవో షేక్ ఆయిషాకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పరమేశ్వరి, ఫణీంద్రకుమార్, రైతు సంఘం నాయకులు కోరిబిల్లి శంకర్రావు, తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాగ్రహానికి సంకేతం
● మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలతో వెల్లువెత్తిన ప్రజాగళం ● జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో లక్ష్యాన్ని మించి సంతకాల సేకరణ ● సంతకాల ప్రతులు నియోజకవర్గ కేంద్రాల నుంచి ర్యాలీగా జిల్లా కేంద్రానికి తరలింపు సంతకాల పత్రాలతో కూడిన వాహనం వెంట పార్టీ శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళ్తున్న మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, ఈర్లె అనురాధ సాక్షి, అనకాపల్లి: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను తక్షణమే నిలుపుదల చేయాలంటూ చేస్తున్న సంతకాల సేకరణ ఉద్యమం శుక్రవారం హోరెత్తింది. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపుతో జిల్లావ్యాప్తంగా ‘కోటి సంతకాల సేకరణ’ ఉద్యమం ముమ్మరంగా సాగింది. జిల్లాలో సుమారు రెండు నెలల నుంచి సాగుతున్న ఈ మహా ఉద్యమంలో ప్రజలు, మేధావులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు స్వచ్ఛందంగా పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మద్దతు తెలియజేశారు. జిల్లాలో ఉన్న అనకాపల్లి, నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలి, చోడవరం, మాడుగుల, పెందుర్తి నియోజకవర్గాల్లో నిర్ణీత లక్ష్యాన్ని మించి భారీగా సంతకాల సేకరణ జరిగింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ ‘రచ్చబండ కార్యక్రమం’ ద్వారా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల ప్రతులను అనకాపల్లి టౌన్లో రింగురోడ్డు వద్ద గల వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి ర్యాలీగా తీసుకువచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్కు అప్పగించారు. వందలాది మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, యువత, మేధావులు సైతం ర్యాలీలో పాల్గొని మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినదించారు. జిల్లాలో మొత్తం 3 లక్షల 96 వేల సంతకాలు సేకరించారు. అత్యధికంగా నర్సీపట్నం నియోజకవర్గంలో 61 వేలు, అనకాపల్లి నియోజకవర్గంలో 60 వేలు, పాయకరావుపేట నియోజకవర్గంలో 60 వేలు, పెందుర్తిలో 55 వేలు, చోడవరం, మాడుగుల, యలమంచిలి నియోజకవర్గాల్లో 60 వేల చొప్పున సంతకాల సేకరణ జరిగింది. అనకాపల్లి రింగ్రోడ్డు పార్టీ కార్యాలయం నుంచి భీమునిగుమ్మం వరకు ర్యాలీ నిర్వహిస్తున్న పార్టీ రాష్ట్ర కార్యదర్శి దంతులూరి దిలీప్కుమార్, పార్టీ శ్రేణులు నర్సీపట్నంలో సంతకాల ఆమోద పత్రాల బుక్లెట్లను చూపుతున్న వైఎస్సార్సీపీ పార్లమెంటు పరిశీలకురాలు హైమావతి, మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అనకాపల్లిలో వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షడు గుడివాడ అమర్నాథ్ పత్రాలను స్వీకరించారు. అనంతరం మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, జిల్లా సమన్వయకర్తలతో కలిసి ఆయన మీడియా మాట్లాడుతూ.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమానికి అంచనాలకు మించి మద్దతు లభించిందన్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన రచ్చబండ కార్యక్రమాల ద్వారా ‘కోటి సంతకాల సేకరణ’లో ప్రజలు, విద్యార్థులు, మేధావులు స్వచ్ఛందంగా పాల్గొన్నారన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే.. రాష్ట్రమంతా ఏకమై చంద్రబాబు సర్కార్ను బంగాళా ఖాతంలో కలిపే రోజు వస్తుందని హెచ్చరించారు. నియోజకవర్గ సమన్వయకర్తలకు, మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేటర్లకు, వార్డు అధ్యక్షులకు, జిల్లా, నియోజకవర్గాల అనుబంధ సంఘల అధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అమర్నాథ్ ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ జిల్లా పార్లమెంట్ పరిశీలకురాలు శోభ హైమావతి, రాష్ట్ర కార్యదర్శులు సరగడం చిన్నప్పలనాయుడు, పైలా శ్రీనివాసరావు, చిక్కాల రామారావు, దంతులూరి దిలీప్ కుమార్, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పుల్లేటి వెంకటేష్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు బొడ్డుపల్లి హేమంత్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు త్రినాథరావు, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు పాలిసెట్ సురేష్ రాజ్, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు లోచల సుజాత తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి: అమర్నాథ్ -
డౌన్హిల్ స్కేటింగ్లో చిచ్చర పిడుగులు
విశాఖ స్పోర్ట్స్ : జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్లో భాగంగా మంగళవారం తొట్లకొండలో జరిగిన డౌన్హిల్ స్కేటింగ్ పోటీల్లో తమిళనాడు జట్టు సత్తా చాటింది. మెన్లో కిషోర్కృష్ణ విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా హర్షిత్ ద్వితీయ స్థానంతో (వీరిద్దరూ తమిళనాడు) రజతాన్ని అందుకున్నాడు. సాయంత్(కేరళ) తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాన్నందుకున్నాడు. వుమెన్లో వర్షిణి విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకోగా అమిజిధాని(వీరిద్దరూ తమిళనాడు) ద్వితీయ స్థానంలో నిలిచి రజతాన్ని అందుకుంది. ఆర్.వి.రమ్యశ్రీ(ఆంధ్రప్రదేశ్) తృతీయ స్థానంలో నిలిచి కాంస్యాన్ని సొంతం చేసుకుంది. 15–18 ఏళ్ల బాలుర విభాగంలో గురుహర్షన్(తమిళనాడు), వష్ణావ్ లీమిన్(కేరళ), ఆరవ్ శ్రీజిత్(తమిళనాడు) వరుసగా తొలి మూడు స్థానాల్లో నిలవగా.. బాలిక విభాగంలో శృతి(తమిళనాడు), అక్షర(తమిళనాడు), ఎం.ఐశ్వర్య(ఆంధ్రప్రదేశ్) తొలి మూడు స్థానాల్లో నిలిచారు. లాంఛనంగా స్కేటింగ్ పోటీలు ప్రారంభం జాతీయ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ను మంగళవారం వీఎంఆర్డీఏ పార్క్లో లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ హారేందిర ప్రసాద్, జీవీఎంసీ కమిషనర్ కేతన్గార్గ్, వీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్, శాప్ చైర్మన్ రవినాయుడు, ప్రభుత్వ విప్ పివిజిఆర్ నాయుడు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, స్కేటింగ్ సంఘం ప్రతినిధులు పాల్గొ న్నారు. అంతర్జాతీయ స్కేటర్ ఆనంద్కుమార్ను సత్కరించి నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. -
రెండో రోజుకు చేరిన రిలే దీక్షలు
● ‘యలమంచిలి’ని అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించాలని డిమాండ్ ● నక్కపల్లి కేంద్రం సుదూరం కావడంతో జీవో 1491ను సవరించాలని వినతి మునగపాక: యలమంచిలి నియోజకవర్గాన్ని అనకాపల్లి రెవెన్యూ డివిజన్లోనే కొనసాగించాలని కోరుతూ మునగపాకలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన నక్కపల్లి రెవెన్యూ డివిజన్లో యలమంచిలి నియోజకవర్గాన్ని కలపడం సరికాదంటూ చేపట్టిన దీక్షకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, పార్టీ అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్, ఎస్సీ సెల్ విభాగం జిల్లా అధ్యక్షుడు సురేష్ తదితరులు సంఘీబావం తెలిపారు. ముందుగా సంఘ సేవకురాలు మదర్ థెరిస్సా, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ధర్మశ్రీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన జీవో 1491ను సవరించి యలమంచిలి నియోజకవర్గాన్ని యథావిధిగా అనకాపల్లి డివిజన్లోనే కొనసాగించేలా చూడాలన్నారు. సుదూర ప్రాంతమైన నక్కపల్లి డివిజన్కు ఇక్కడ నుంచి వెళ్లాలంటే ప్రజలకు కష్టాలు తప్పవన్నారు. పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి అనకాపల్లి డివిజన్ ద్వారా సేవలు పొందుతున్న ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేలా నక్కపల్లి కేంద్రానికి బదలాయించడం సరికాదన్నారు. స్థానిక శాసనసభ్యుడు స్పందించి రెవెన్యూ డివిజన్కు సంబందించి తన వైఖరిని వెల్లడించాలన్నారు. పార్టీ మండల కన్వీనర్ ఆడారి అచ్చియ్యనాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మళ్ల సంజీవరావు, మాజీ ఎంపీపీ దాసరి అప్పారావు, సర్పంచ్లు కాండ్రేగుల నూకరాజు, దిమ్మల అప్పారావు, భీశెట్టి గంగప్పలనాయుడు, ఆడారి త్రిమూర్తులు, బొడ్డేడ శ్రీనివాసరావు, కర్రి పెదబ్బాయి, ఎంపీటీసీలు మొల్లేటి కృష్ణవేణి నారాయణరావు, సూరిశెట్టి రాము తదితరులు పాల్గొన్నారు. రెండో రోజు మూలపేట, పాటిపల్లి, నారాయుడుపాలెం గ్రామాలకు చెందిన రాంబాబు, అప్పారావు, కుమార్, సత్యనారాయణ, ధనశ్రీను, కాండ్రేగుల నాగేశ్వరరావు, మొల్లేటి పరమేష్, గోవిందరావు, ఆదికుమార్, వెంకట నూకప్పారావు,ఆ డారి శివ,నాగేశ్వరరావు తదితరులు నిరాహార దీక్షలో కూర్చొన్నారు. -
13న ఏయూ పూర్వ విద్యార్థుల సమావేశం
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వవిద్యార్థుల వార్షిక సమావేశం(వేవ్స్–2025) ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు సంఘం చైర్మన్ కె.వి.వి.రావు తెలిపారు. మంగళవారం ఏయూ అలుమ్ని జీఎంఆర్ సెమినార్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. మహిళా సాధికారత థీంతో వేవ్స్–2025 నిర్వహిస్తున్న ట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతి థిగా రాజ్యసభ ఎంపీ, మూర్తి ట్రస్ట్ చైర్పర్సన్ సుధామూర్తి హాజరవుతున్నట్లు వెల్లడించారు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి బీచ్రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్ వేదికగా ఈ కార్యక్రమం జరుగుతుందని, అలుమ్ని వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జీఎంఆర్ కూడా పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్తో కలిసి వేవ్స్ పోస్టర్ను ఆవిష్కరించారు. సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ కె.కుమార్ రాజ, జనరల్ సెక్రటరీ ఆకుల చంద్రశేఖర్, ఈసీ సభ్యులు పాల్గొన్నారు. -
సందడిగా బాలోత్సవం
ఆకట్టుకున్న చిన్నారులుడాబాగార్డెన్స్: సెయింట్ ఆంథోనీ తెలుగు మీడియం ప్రైమరీ స్కూల్ వేదికగా మంగళవారం ‘బాలోత్సవం’అట్టహాసంగా ప్రారంభమైంది. ఉత్సవాల్లో పాల్గొన్న చిన్నారులతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. ముందుగా జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.ప్రేమ్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకే వేదికపై ఇంతమంది పిల్లలను చూడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. రోటరీ ఇంటర్నేషనల్ (3020 డిస్ట్రిక్ట్) గవర్నర్ డాక్టర్ వై.కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ.. రోటరీ సంస్థ సేవాభావంతో పనిచేస్తోందన్నారు. విద్యార్థులను సేవా కార్యక్రమాల వైపు ప్రోత్సహించేందుకు ఇంటరాక్ట్, రోటరాక్ట్ క్లబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆసరా చారిటబుల్ సొసైటీ ప్రతినిధి శ్రీనాథ్ మాట్లాడుతూ.. పిల్లలు తమ చుట్టూ జరిగే విషయాలను నిశితంగా పరిశీలించాలన్నారు. పాఠశాల కరస్పాండెంట్, ఫాదర్ పి.రత్నకుమార్ మాట్లాడుతూ తమ పాఠశాల ఇంత గొప్ప కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. పిల్లలకు ఇలాంటి పోటీలు మేలు చేస్తాయని రోటరీ విశాఖ వ్యాలీ చైర్మన్ ఎం.వి. జానకిరామ్, డాక్టర్ పీకే జోస్ అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో భాగంగా తొలి రోజు నిర్వహించిన అకడమిక్, కల్చరల్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. నరవ ప్రకాశరావు, రోటరీ క్లబ్ విశాఖ అధ్యక్షుడు రఘుపతి, ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షుడు దీపా జేలోకా, బాలోత్సవం ఆహ్వాన సంఘం సభ్యులు పాల్గొన్నారు. -
పచ్చ నేతల కన్ను
పచ్చని పల్లైపెగలగల పారే సెలయేటి సవ్వడులతో చల్లని ఆహ్లాదకరమైన నదీ పరీవాహక ప్రాంత గ్రామం అది. ఒకపక్క పచ్చని పొలాలతో కళకళలాడుతూ.. మరోపక్క సుద్ద కొండ ఒడిలో ఒదిగి ఉన్న అందమైన గ్రామం. పెద్దలంతా వ్యవసాయం చేస్తూ చెరకు, వరి, ఇతర ఆహారధాన్యాలు పండిస్తూ ప్రజలకు తిండిగింజలు అందిస్తుంటే.. ఇక్కడ యువత దేశ రక్షణ విభాగాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ వంటి త్రివిధ దళాల్లో ఉద్యోగం చేస్తూ దేశరక్షణలో సైనికులుగా పనిచేస్తున్నారు. అలాంటి పచ్చని బెన్నవోలు గ్రామంపై అధికార పార్టీ నేతలు కన్నేశారు.ఈ గ్రామాన్ని ఆనుకొని విలువైన సుద్దకొండ ఉండడమే ఇందుకు కారణం. చోడవరం: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నదులు, కొండలు, ఇసుక, రాయి, చెట్టు చేమ ఏదీ వదలకుండా యథేచ్ఛగా దోపిడీ జరుగుతోంది. తాజాగా చోడవరం మండలం బెన్నవోలు గ్రామానికి ఆనుకొని ఉన్న సుద్దకొండపై గ్రానైట్ మాఫియా కన్ను పడింది. దీనికి స్థానిక కూటమి ప్రజాప్రతినిధులు కూడా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సిరామిక్స్ తయారీ (ఫ్లోరింగ్ టైల్స్)లో ప్రధాన ముడిసరుకుగా వాడే సుద్ద గనుల కొండ ఇక్కడ ఉంది. ఇక్కడి సుద్దకొండను తవ్వేసుకొని లక్షలాది టన్నులు తరలించుకుపోయేందుకు స్కెచ్ వేశారు. ఈ సుద్దను తవ్వుకొని, అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించాలనే వారి ఆలోచన బెన్నవోలు గ్రామానికి ముప్పు తెచ్చేలా మారింది. వ్యవసాయంతో పచ్చని పొలాల మధ్య పెద్దేరు నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం ఇప్పుడు కొండమట్టి, బుగ్గిలో కాలుష్యం కోరల్లో మగ్గిపోయేలా ఉంది. ఈ గ్రామంలో సుమారు 20 కుటుంబాలు ఈ సుద్దకొండలో బండను చేత్తో తవ్వుకొని దానిని ముగ్గుపిండిగా తయారు చేసి గ్రామాల్లో తిరిగి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. అనేక శతాబ్దాలుగా ఇదే వారికి జీవనాధారం. ఇప్పుడు ఈ సుద్దకొండను గ్రానైట్ మాఫియా యంత్రాలతో తవ్వుకుపోతే ఈ కుటుంబాలకు పూర్తిగా జీవనాధారం పోయి వారంతా రోడ్డున పడే ప్రమాదం ఏర్పడింది. దీంతో గ్రామమంతా ఇప్పుడు ఈ సుద్ద తవ్వకాలకు అనుమతులు ఇవ్వవద్దంటూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. అడ్డగోలుగా అనుమతులు బెన్నవోలు సుద్దకొండను ప్రస్తుతానికి 17 హెక్టార్ల మేర తవ్వకాలు జరిపేందుకు అనుమతి ఇస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లక్ష్మీనర్సింహ మెటల్స్, శాండ్ ఇండస్ట్రీ ప్రైవేటు లిమిటెడ్ అనే గ్రానైట్ సంస్థకు ఈ సుద్ద కొండను తవ్వుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. సుద్దకొండ పై భాగాన ఉన్న గ్రావెల్ మట్టిని 4 లక్షల 60 వేల మెట్రిక్ టన్నులు తొలగించి, దాని కింద ఉన్న తెల్ల సుద్దను 3 లక్షల 60 లక్షల మెట్రిక్ తవ్వుకోవడానికి అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పైన తవ్విన గ్రావెల్ మట్టిని ఊరికి ఆనుకొని ఉన్న అదే కొండ భాగాన వేసేందుకు నిర్ణయించారు. ఈ విధంగా తవ్వకాలు చేస్తే గ్రావెల్ మట్టి భారీ వర్షాలకు కొట్టుకు వచ్చి ఊరిలో ఇళ్లపైకి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మిషనరీతో తొలగించిన తెల్లసుద్ద వేస్ట్ అంతా కొండ గెడ్డల ద్వారా దిగువన ఉన్న పంట పొలాల్లోకి వెళ్లి మేటలు వేస్తే పూర్తిగా పంటభూములు పాడయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా ఈ తవ్వకాల వల్ల పచ్చని వాతావరణంతో ఉన్న ఈ గ్రామమంతా దుమ్ము ధూళితో కాలుష్యమైపోయి ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. గ్రామానికి ఆనుకొని ఈ కొండ ఉండటం వల్ల గాలి, నీరు కూడా కలుషితమైపోతుందంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఇదే విషయాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ గ్రామసభలో ప్రజలు ముక్తకంఠంతో చెప్పారు. అయినా సుద్దకొండ తవ్వకాలు జరిపేందుకు మాత్రం చాపకింద నీరులా అధికారిక పనులన్నీ జరిగిపోతున్నట్టు తెలిసింది. అధికార పార్టీ పెద్ద నాయకుల అండదండలతో టెండరు దక్కించుకున్న క్వారీ సంస్థ రాజకీయ బలంతో ఈ సుద్దకొండను తవ్వి పట్టుకుపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుపోతోంది. ఇదే గాని జరిగితే బెన్నవోలు గ్రామంలో ప్రజలు తిరుగుబాటు చేసేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారు.పోరాటానికి సిద్ధం పచ్చని గ్రామాన్ని నాశనం చేయాలని ప్రభుత్వం చూస్తోంది. గ్రావెల్, సుద్ద తవ్వేయడం వల్ల అదంతా మా ఊరుపైకి వచ్చి పూర్తిగా కలుషితం అవుతుంది. సుద్దకొండకు ఆనుకునే మా ఊరు, పంట పొలాలు ఉన్నాయి. అవన్నీ దెబ్బతిని మా జీవనం అంతా దుర్భరంగా మారుతుంది. ఎంతటి పోరాటానికై నా సిద్ధంగా ఉన్నాం. – కంచిపాటి గంగాధర్, మాజీ సైనికుడు, బెన్నవోలుకాలుష్యం కబళిస్తుంది సుద్ద కొండను క్వారీ చేసి తవ్వుకొని పోయేందుకు ప్రభుత్వం లీజు ఉత్తర్వులు ఇవ్వడాన్ని మేమంతా వ్యతిరేకిస్తున్నాం. దీని వల్ల గ్రామంలో భూగర్భ జలాలు పూర్తిగా కలుషితమైపోయాయి. తవ్విన కొండమట్టి అంతా మా ఊరుపైకి, పొలాల్లోకి వచ్చి మేటలు వేస్తుంది. పంటలు నాశనమై కరువు నెలకొంటుంది. – కంచిపాటి రమేష్, రైతు, బెన్నవోలు పొట్ట కొట్టవద్దు తాతల కాలం నుంచి గ్రామంలో ఉన్న సుద్దకొండే మా జీవనాధారం. కొండ నుంచి సుద్దను తవ్వుకొని ముగ్గుగా తయారు చేసి ముగ్గుపిండిని తట్టలతో ఊర్లంబడి తిరుగుతూ అమ్ముకొని జీవిస్తున్నాం. అలాంటిది ఇప్పుడు ఈ కొండను ఎవరో పెద్దోళ్లు వచ్చి మిషన్లతో తవ్వేసి సుద్ద పట్టుకుపోతే మాకు ఉపాధి ఏముంటుంది? – వి.లక్ష్మి, ముగ్గు పిండి అమ్ముకునే మహిళ, బెన్నవోలు అందమైన కొండను తవ్వేసి ...ప్రజల నెత్తిన బుగ్గి పోసే యత్నం బెన్నవోలు సుద్దకొండకు తూట్లు పొడిచేందుకు పన్నాగం అధికార పార్టీ నాయకుల అండతో తవ్వకాలకు టెండర్ తమ బతుకులు బుగ్గిపాలు చేయవద్దంటున్న బెన్నవోలు గ్రామస్తులు ప్రజాభిప్రాయాన్ని పక్కనపెట్టి గ్రీన్సిగ్నల్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం -
సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరాళాలివ్వాలి
కలెక్టరు విజయ కృష్ణన్తుమ్మపాల: దేశ రక్షణలో అసువులు బాసిన, విధి నిర్వహణలో గాయపడిన మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి ప్రతి ఒక్కరూ ఉదారంగా విరాళాలు అందించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ పిలుపునిచ్చారు. సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉమ్మడి విశాఖ జిల్లా సైనిక సంక్షేమ వింగ్ కమాండర్ చంద్రశేఖర్తో కలిసి జెండాను, వాల్ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పౌరులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఈ మహత్తర కార్యానికి పెద్ద మనసుతో సహకరించాలన్నారు. జిల్లాలో సైనిక్ సంక్షేమ భవన నిర్మాణానికి 70 సెంట్ల భూమి, జిల్లాలో 9 మంది యుద్ధవీరులకు 300 గజాల చొప్పున స్థలం ఇవ్వడానికి చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు పతాక దినోత్సవ నిధికి ఆమె విరాళం అందజేశారు. సూపరింటెండెంట్ జి.కృష్ణారావు, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అగ్గాల హనుమంతరావు పాల్గొన్నారు. పది, ఇంటర్లో శత శాతం ఉత్తీర్ణత లక్ష్యం పదో తరగతి, ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా అధికారులు కృషి చేయాలని కలెక్టరు విజయ కృష్ణన్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గిరిజిన, సాంఘిక, బీసీ సంక్షేమ, రెసిడెన్షియల్ స్కూళ్లు, కేజీబీవీ,, ఇంటర్మీడియెట్, పాఠశాల విద్యాశాఖ అధికారులతో ఆమె మాట్లాడారు. 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను పక్కాగా అమలు చేయాలన్నారు. బాలికల హాస్టళ్లలోకి సిబ్బంది తప్ప ఇతరులను అనుమతించవద్దన్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో జి.అప్పారావు నాయుడు, జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి జి.వినోద్బాబు, జిల్లా బీసీ, సాంఘిక, గిరిజన సంక్షేమ అధికారులు పాల్గొన్నారు. -
మాడుగుల నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాలు
● సంతకాల పత్రాలు పార్టీ జిల్లా కార్యాలయానికి నేడు అందజేత ● మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు దేవరాపల్లి: వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రెవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. ఈ మేరకు తారువలో మంగళవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. మెడికల్ కళాశాలలను ప్రెవేటీకరించడాన్ని వ్యతిరేకిస్తూ మాడుగుల నియోజకవర్గం నుంచి 50 వేల సంతకాల సేకరణ చేపట్టామన్నారు. వీటి పత్రాలను బుధవారం తారువ గ్రామం నుంచి ప్రత్యేక వాహనంలో అనకాపల్లిలో గల పార్టీ జిల్లా కార్యాలయానికి అందజేస్తామన్నా రు. బుధవారం ఉదయం 9.30 గంటలకు సంతకాల పత్రాలతో కూడిన వాహనం తారువ నుంచి బయలుదేరుతుందన్నారు. ఈ కార్యక్రమానికి మాడుగుల నియో జకవర్గంలో గల నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, పార్టీ మండల అధ్యక్షులు, యువజన విభాగం అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, పార్టీ నేతలు, పార్టీ ప్రజా ప్రతినిధులు హాజరు కావాలని ఆయన పిలుపునిచ్చారు. -
14న నేవీ మారథాన్
మహారాణిపేట: నేవీ డే వేడుకల్లో భాగంగా ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన 10వ ఎడిషన్ వైజాగ్ నేవీ మారథాన్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మారథాన్లో 17 దేశాల నుంచి 17,500 మంది ఔత్సాహికులు భాగస్వామ్యం కానున్నారని, ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని పేర్కొన్నారు. వెయ్యి మంది సిబ్బంది, రెండు వేల మంది వాలంటీర్లు సేవల్లో నిమగ్నమవుతారన్నారు. 42 కి.మీ, 21 కి.మీ, 10 కి.మీ, 5 కి.మీ విభాగాల్లో పోటీలు జరగనున్నాయని తెలిపారు. జిల్లా, నేవీ అధికారులు సమన్వయంతో వ్యవహరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. సమావేశంలో కెప్టెన్లు టీఆర్ఎస్ కుమార్, వినోత్ తివారీ, కమాండర్ కిశోర్, లెఫ్టినెంట్ కమాండర్లు పి.మెహంత్ నాయుడు, నరేశ్, ఏడీసీ రమణమూర్తి, ఈపీడీసీఎల్ ఎస్ఈ శ్యాంబాబు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
పెండింగ్ కేసులు వేగంగా పరిష్కరించాలి
ఎస్.రాయవరం: పెండింగ్ కేసులు వేగంగా పరిష్కరించాలని ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మంగళవారం ఎస్.రాయవరం పోలీస్ స్టేషన్ను, అడ్డురోడ్డులో ఉన్న సర్కిల్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేసుల ఫైళ్లను పరిశీలించి లోక్ అదాలత్ ద్వారా పరిష్కారం అయ్యే కేసులను గుర్తించి రాజీ చేయాలన్నారు. పెండింగ్ కేసుల సీడీ ఫైళ్లను పరిశీలించి దర్యాప్తు వేగవంతం చేయాలన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి కోర్టు తీర్పు వచ్చే వరకు పూర్తి వివరాలు నమోదు చేసి పారదర్శకంగా వ్యహరించాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపాలన్నారు. మహిళా భద్రత, విద్యార్ధుల భద్రత కోసం సచివాలయాల్లో పోలీసు చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ తనిఖీల్లో నర్సీపట్నం డీఎస్పీ పి.శ్రీనివాసరావు, నక్కపల్లి సీఐ ఎల్.రామకృష్ణ, ఎస్ఐ ఎ.విభీషణరావు పాల్గొన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ కార్యాలయానికి సంతకాల పత్రాలు
అన్ని నియోజకవర్గాల నుంచి ర్యాలీగా బయలుదేరి జిల్లా పార్టీ కార్యాలయంలో అందజేత అనకాపల్లి: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన సంతకాల సేకరణ పత్రాలను బుధవారం అన్ని నియోజకవర్గాల నుంచి ప్రత్యేక వాహనాల్లో జిల్లా పార్టీ కార్యాలయంలో అందజేస్తున్నట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్, పార్టీ అనకాపల్లి పార్లమెంటు సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ తెలిపారు. పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జరుగుతున్న కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా లక్షల మంది నుంచి సంతకాలు సేకరించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో అన్ని నియోజకవర్గాల నుంచి ర్యాలీగా బయలుదేరి ఉదయం 10.30 గంటలకు అనకాపల్లిలోని పార్టీ కార్యాలయంలో వాటిని అందజేస్తారని వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, సీఈసీ, ఎస్ఈసీ సభ్యులు, రాష్ట్ర, జోనల్, జిల్లా అనుబంధ అధ్యక్షులు, కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల, వార్డు అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కమిటీ సభ్యులు, వార్డు కమిటీ, అనుబంధ కమిటీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. సంతకాల పుస్తకాల సేకరణకు వివిధ నియోజకవర్గాలకు 7 వాహనాలు కోటి సంతకాల ప్రతులను అనకాపల్లిలోని పార్టీ జిల్లా కార్యాలయానికి తరలించడానికి 7 వాహనాలను సమకూర్చినట్టు వైఎస్సార్సీపీ పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డేడ ప్రసాద్ చెప్పారు. వాటిని నియోజకవర్గ కేంద్రాలకు మంగళవారం రాత్రి జెండా ఊపి పంపించారు. అంతకుముందు ఈ వాహనాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వాహనాలు జిల్లాలో 7 నియోజకవర్గాల్లో పుస్తకాలను సేకరించి, అనకాపల్లి రింగ్రోడ్డు పార్టీ కార్యాలయానికి సోమవారం సాయంత్రం 4 గంటలకు చేరుకుంటాయని చెప్పారు. ఈనెల 15న నెహ్రూచౌక్ వరకూ పాదయాత్రగా పార్టీ శ్రేణులు వెళ్లి అక్కడ నుంచి విజయవాడకు బయలు దేరుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో 80వ వార్డు ఇన్ఛార్జ్ కె.ఎం.నాయుడు, నూకాంబిక దేవస్థానం మాజీ చైర్మన్ కొణతాల మురళీకృష్ణ, గవర కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ బొడ్డేడ శివ, మాజీ కౌన్సిలర్ దాడి నారాయణరావు పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు. -
శత శాతం ఉత్తీర్ణత సాధించాలి
నక్కపల్లి: శత శాతం ఉత్తీర్ణత సాధించే లక్ష్యంతో విద్యార్ధులకు విద్యాబోధన చేయాలని, ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ సూచించారు. మంగళవారం సాయంత్రం నక్కపల్లి కేజీబీవీ కళాశాలను కలెక్టర్ సందర్శించారు. విద్యార్ధినులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్ధులతో ముచ్చటించారు. అనంతరం వారికి అందిస్తున్న బోధన గూర్చి అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులలో భారీగా వెనుకబడిన విద్యార్ధులను గురించి వారికి ప్రత్యేక శిక్షణ అందించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్ధులు కష్టపడి చదవాలని, మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. విద్యార్ధులకి అవసరం అయిన అన్ని సదుపాయాలు కల్పిస్తామన్నారు. -
నకిలీ పత్రాల తయారీకి పాల్పడిన ఇద్దరి అరెస్ట్
మునగపాక: నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లతో పాటు తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రాలు తయారు చేస్తున్న ఇద్దరిని మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. విశాఖపట్నం ఎండాడకు చెందిన దౌర్ల అనురాధ, తగరపువలసకు చెందిన తూము రాజు, మరో తొమ్మిది మందితో కలిసి నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్లు, మరణ ధ్రువీకరణ పత్రాలు తయారు చేసి ఇటీవల మధురవాడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో రెండు జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్లు రిజిస్ట్రర్ చేసినట్లు అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణలో భాగంగా ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఇద్దరు వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేని ఆస్తిని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు ముందస్తు కుట్రలో భాగంగా నకిలీ పత్రాలు రూపొందించినట్లు తేలిందన్నారు. ఈ కేసులో మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసి మంగళవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. నకిలీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ను మునగపాకలో తయారు చేసినట్టు తెలిసింది. -
స్టీల్ప్లాంట్కు కేటాయించిన భూముల పరిశీలన
నక్కపల్లి: మండలంలో ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ప్లాంట్కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూములను ఆ కంపెనీకి చెందిన జపాన్ బృందం మంగళవారం పరిశీలించింది. చందనాడ అమలాపురం డీఎల్ పురం ప్రాంతాల్లో ఈ బృంద సభ్యులు పరిశీలించారు. కేటాయించిన భూముల్లో కంపెనీ వారు స్వాధీనం చేసుకునేందుకు ఫెన్సింగ్ పనులు ప్రారంభించారు. అలాగే ఏపీఐఐసీ ఏర్పాటు చేస్తున్న కనెక్టివిటీ రోడ్డు పనులు ఈ బృందం పరిశీలించింది. కేటాయించిన మొత్తం భూములు మ్యాప్ ద్వారా పరిశీలించారు. అలాగే ఇదే గ్రామాల్లో కలెక్టర్ విజయ కృష్ణన్ కూడా పరిశీలించారు. మౌలిక సదుపాయాలు కల్పించే పనులు చూశారు. పురోగతి తెలుసుకున్నారు. వీరి వెంట నర్సీపట్నం ఆర్డీవో వి.వి.రమణ, ఏపీఐఐసీ అధికారులు ఉన్నారు. -
‘సంతకమే’ సమర శంఖం
యలమంచిలి రూరల్: పేదలకు ఉచిత వైద్యం, విద్యార్థులకు ప్రభుత్వ వైద్య విద్య అవసరం లేదా అంటూ సామాన్యుల గళాలు గర్జిస్తున్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరించడానికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని యలమంచిలి నియోజకవర్గంలో యువతీ, యువకులు, వివిధ వర్గాల ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఇందులో భాగంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా హాజరయ్యారు. పార్టీ పిలుపు మేరకు సమన్వయకర్త కరణం ధర్మశ్రీ సంతకాల సేకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నాలుగు మండలాల్లో కార్యకర్తలు, నాయకులకు సంతకాల సేకరణ కార్యక్రమం ఉద్దేశం, లక్ష్యాన్ని వివరించి వారిలో చైతన్యం నింపారు. దీంతో పార్టీ శ్రేణులు సంతకాల సేకరణను గ్రామాల వారీగా ఉద్యమంలా చేపట్టారు. యలమంచిలి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో 107 పంచాయతీలు, యలమంచిలి మున్సిపాలిటీ 25 వార్డుల్లో సేకరించిన సుమారు 55 వేల సంతకాలతో కూడిన పత్రాలను పుస్తకాలుగా తయారు చేశారు. వీటన్నింటినీ బుధవారం యలమంచిలి వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి అనకాపల్లి జిల్లా పార్టీ కార్యాలయానికి ప్రజా చైతన్య ఉద్యమ రథంపై తరలించనున్నారు. ఇందు కోసం యలమంచిలిలోని పార్టీ కార్యాలయం నుంచి అనకాపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లనున్నట్టు సమన్వయకర్త కరణం ధర్మశ్రీ తెలిపారు. సంతకాల సేకరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసిన నాలుగు మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, పార్టీ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్లు, ముఖ్య నాయకులందరికీ ధర్మశ్రీ ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జరిగే ర్యాలీకి పార్టీ నాయకులంతా హాజరు కావాలని కోరారు. పీపీపీ వద్దంటూ గళం విప్పిన ప్రజలు దేశంలోనే మొట్టమొదటి సారిగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలు మంజూరు చేశారు. అప్పట్లోనే వీటి నిర్మాణం కోసం రూ.8,500 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పటికే ఐదు కళాశాలలు ప్రారంభమయ్యాయి. వందల సంఖ్యలో విద్యార్థులు వైద్య విద్యనభ్యసిస్తున్నారు. మరో 12 వైద్య కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయి. మరికొన్ని పూర్తి కావచ్చాయి. ఈ క్రమంలో చంద్రబాబు సర్కారు వైద్య కళాశాలల్లో భవనాల నిర్మాణాల పూర్తికి నిధులు కేటాయించలేదు. పీపీపీ విధానంతో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగించడానికి పూనుకుంది. ఈ విధానంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా వైద్య సీట్లు వద్దంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ గత అక్టోబర్ 10 నుంచి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు, ర్యాలీలు చేపట్టారు. పోస్టర్ల ఆవిష్కరణ నుంచి తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వడం వరకు ఉద్యమం ఉధృతంగా సాగింది. వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎస్ఎఫ్ఐ, వామపక్ష, కాంగ్రెస్ పార్టీలు సైతం వైఎస్సార్సీపీ ఉద్యమానికి మద్దతునిచ్చాయి. విద్యార్థులు, రైతులు, మహిళలు స్వచ్ఛందంగా ఉద్యమంలో పాల్గొనడంతో పార్టీ నేతలు మరింత రెట్టించిన ఉత్సాహంతో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై సర్వత్రా వ్యతిరేకత యలమంచిలిలో ఉద్యమంలా 55 వేల సంతకాలు పూర్తి స్వచ్ఛందంగా పాల్గొన్న యువతీ, యువకులు నేడు అనకాపల్లి పార్టీ ఆఫీసుకు సంతకాల పుస్తకాల తరలింపు పార్టీ శ్రేణులు తరలిరావాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త ధర్మశ్రీ పిలుపు -
గాడి తప్పుతున్న మండల పరిషత్ సమావేశాలు
నర్సీపట్నం: మండల పరిషత్ అభివృద్ధి అధికారుల అనాలోచిత నిర్ణయాలతో సమావేశాల నిర్వహణ గాడి తప్పుతోంది. నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన సమావేశాలను అధికారులు ఇష్టానుసారంగా నడుపుతున్నారు. మండల పరిషత్ సమావేశాల విధి విధానాలను ఎంపీడీవోలు గాలికి వదిలేస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పార్లమెంట్, శాసనసభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో మండల పరిషత్ సమావేశాలు జరపకూడదు. ఎంపీ, ఎమ్మెల్యే, రాజ్యసభ్యులు, ఎమ్మెల్సీలు మండల పరిషత్ సమావేశాలకు వచ్చే అవకాశం ఉన్నందున ఆ సమయంలో మండల పరిషత్ సమావేశాలు నిర్వహించకూడదు. దీనికి భిన్నంగా నియోజకవర్గంలో ఎంపీడీవోలు వ్యవహరించారు. నాతవరం ఎంపీడీవో సమావేశాన్ని రద్దు చేయగా, గొలుగొండ ఇన్చార్జీ ఎంపీడీవో శ్రీనివాసరావు సమావేశాన్ని నిర్వహించి నిబంధనలను తుంగలో తొక్కారు. ఆఖరు నిమిషంలో హడావుడిగా.. ఒక సమావేశం నిర్వహించిన తరువాత తదుపరి సమావేశాన్ని 90 రోజుల వ్యవధిలో నిర్వహించాలి. సాధారణంగా పార్లమెంట్, శాసనసభల్లో బడ్జెట్, వర్షాకాల, శీతాకాల సమావేశాలు జరుగుతుంటాయి. ఆ సమావేశాల ప్రకటన కూడా ముందుగానే వెలువడుతుంది. ఆ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని మండల పరిషత్ సమావేశాల తేదీలు నిర్ణయించాల్సి ఉంది. అయితే ఆఖరు నిమిషంలో హడావుడిగా సమావేశాల నిర్వహణకు ఎంపీడీవోలు సిద్ధపడుతున్నారు. దీంతో సమావేశాల నిర్వహణ గందరగోళంగా మారుతోంది. పలుసార్లు పలు మండలాల్లో ఇదే కారణంతో సమావేశాల తేదీలు ప్రకటించడం, మళ్లీ వాయిదాలు వేయటం చేస్తున్నారు. లేదా సెలవు దినాల్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీనివల్ల వివిధ శాఖల అధికారులు కూడా ఇబ్బంది పడుతున్నారు. చట్ట సభల సమావేశాలు జరుగుతున్నప్పుడు, సమావేశాలకు సమయం మించిపోతే ముందుగా మండల పరిషత్ పరిధిలోకి వచ్చే చట్టసభల సభ్యులకు తెలియజేయాలి. వారి అనుమతితో సమావేశాలు జరుపుకునేందుకు అవకాశం ఉంది. చట్ట సభల సభ్యుల అనుమతి తీసుకోవటం చాలా అరుదు. నాతవరం మండల పరిషత్ సమావేశం మంగళవారం నిర్వహించాల్సి ఉండగా పార్లమెంట్ సమావేశాల కారణంగా సెలవు దినమైన ఆదివారానికి వాయిదా వేస్తూ ఎంపీడీవో నిర్ణయం తీసుకున్నారు. గొలుగొండ ఎంపీడీవో శ్రీనివాసరావు మండల పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని ఒకపక్క పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతుండగానే మంగళవారం నిర్వహించారు. ఇలా నిర్వహించటం పూర్తిగా చట్టవిరుద్ధం. ఇప్పటికై నా ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు కౌశిక్
అనకాపల్లి: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఉమ్మడి విశాఖ జిల్లా నుంచి విద్యార్థి కౌశిక్ ఎంపికయ్యాడు. స్థానిక జీవీఎంసీ మెయిన్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న సదరు విద్యార్థిని హెచ్ఎం బ్రహ్మాజీ, ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్లో రాణించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడని, అక్కడా సత్తా చాటాలని ఈ సందర్భంగా హెచ్ఎం ఆకాంక్షించారు. స్కూల్ వ్యాయామ ఉపాధ్యాయుడు ఎస్.వి.నరసింహం పాల్గొన్నారు. -
చిత్రలేఖన విద్యార్థికి అభినందన
మాడుగుల: మాడుగుల గ్రామానికి చెందిన పుట్టా రోహిత్ స్థానిక జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 6 వ తరగతి చదువుతున్నాడు. గత నెలలో ఢిల్లీలో కళాయి కూడమ్ సంస్థ ఏర్పాటు చేసిన చిత్రలేఖనం పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం విదితమే. వైఎస్సార్సీపీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సలహా సంఘం సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు సోమవారం పాఠశాలలోకి వెళ్లి రోహిత్కు దుశ్శాలువా కప్పి ప్రత్యేకంగా అభినందించారు. రానున్నకాలంలో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో హెచ్ఎం బండారు ముత్యాల నాయుడు, సర్పంచ్ కళావతి, ఉపసర్పంచ్ జవ్వాది వరహాలు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు, ఎడ్ల హేమంత్కుమార్, కుక్కర శ్రీధర్ పాల్గొన్నారు. -
పది హాల్ టికెట్పై క్యూఆర్ కోడ్
యలమంచిలిలో టెన్త్ పరీక్ష కేంద్రాన్నిపరిశీలిస్తున్న పరీక్షల సహాయ కంట్రోలర్ యలమంచిలి రూరల్: వచ్చే మార్చిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థుల హాల్టికెట్లపై ఈసారి క్యూఆర్ కోడ్ ముద్రించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల సహాయ నియంత్రణాధికారి ఎ.శ్రీధర్రెడ్డి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా పరీక్ష కేంద్రం ఎక్కడ ఉందో వెతుక్కునే ఇబ్బందులు విద్యార్థులకు ఉండవన్నారు. ఆలస్యం లేకుండా పరీక్ష కేంద్రాలకు చేరుకోవచ్చన్నారు. సోమవారం యలమంచిలి పట్టణంలో నాలుగు టెన్త్ పరీక్ష కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాల, కొత్తపేట జెడ్పీ ఉన్నత పాఠశాల, సెయింట్ మేరీస్ ఇంగ్లీషు మీడియం స్కూల్, శ్రీచైతన్య స్కూళ్లలో వసతులు పరిశీలించారు. ఆయన వెంట ఎంఈవో–1 సుసర్ల సూర్యప్రకాష్, ప్రధానోపాధ్యాయులు వైవీ రమణ, కీర్తి శేఖర్, ఉత్తమ ఉపాధ్యాయుడు మువ్వల రాంబాబు ఉన్నారు. -
నైపుణ్యాలు పెంచుకోవడంతో ఉన్నత శిఖరాలు
అనకాపల్లి: విద్యా రంగంలో పలు విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యతోపాటు నైపుణ్యాలు పెంచుకోవడం వల్ల ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ చాన్సలర్ జీపీ రాజశేఖర్ తెలిపారు. స్థానిక మెయిన్రోడ్డులోని డీవీఎన్ కళాశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ కోర్సులో శిక్షణా(ఫ్యాకల్టీ డెవలప్మెంట్) కార్యక్రమాన్ని సోమవారం ఆయన జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించి మాట్లాడారు. ఏయూ శతాబ్ది ఉత్సవాలు ఏడాదిపాటు నిర్వహించ తలపెట్టినట్లు పేర్కొన్నారు. తాను విశాఖలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని ఏయూకు వీసీ కావడం గొప్పవరంగా భావిస్తున్నానని, నేటి విద్యార్థులు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్కలాం లాంటి మేధావులుగా ఎదిగేందుకు కృషి చేయాలన్నారు. ప్రతి విద్యార్థి ఏదైనా సాధించగలమనే ఆత్మ విశ్వాసంతో ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. ముందుగా ఒక లక్ష్యం నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. సొంత ఆలోచనలతో చదివిన దానికి సరిపోయే విధంగా అవకాశాలను వెతుక్కోవాలన్నారు. తెలుగులో మాట్లాడడం వల్ల ఆంగ్ల ప్రావీణ్యత సాధించలేమని భయాన్ని తొలగించినట్లయితే విజయం సాధిస్తారన్నారు. కార్యక్రమంలో ఏయూ డీన్ అవుట్ రీచ్ డి.లలితా భాస్కరి, డీవీఎన్ కళాశాల ప్రిన్సిపాల్ కోరిబిల్లి రమేష్, వైన్ ప్రిన్సిపాల్ ఎస్.దయామాధురి, కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్, ఫ్యాకల్టీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.ఆంధ్రా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజశేఖర్ -
విత్తన, విద్యుత్ బిల్లులను రద్దు చేయాలి
అనకాపల్లి: రైతులను ఇబ్బందులకు గురిచేసే విత్తన, విద్యుత్ చట్టాల బిల్లులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక నెహ్రూచౌక్ వద్ద సంఘం ఆధ్వర్యంలో రైతు నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విత్తన బిల్లును మోడల్ చట్టంగా చేసి రాష్ట్రాలు తమ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా మార్చుకునే అవకాశం కల్పించాలని, నకిలీ విత్తనాలకు జరిమానాతోపాటు ఐదేళ్లు నిషేధం విధించాలని, నష్టపోయిన రైతులకు 60 రోజుల్లో గరిష్ట దిగుబడికి సమానమైన పరిహారం ఇవ్వాలని, ఒప్పందం చేసుకున్న ధరతో విత్తన పంటను పూర్తిగా కొనుగోలు చేయాలని, రైతులు, రైతు సంఘాలు అభిప్రాయాలు స్వీకరించిన తర్వాతే పార్లమెంట్లో ఆమోదానికి పెట్టాలని డిమాండ్ చేశారు. నూతన విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలని, రైతాంగానికి ఉచిత విద్యుత్తు పథకాన్ని కొనసాగించాలని, వ్యవసాయ విద్యుత్ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టే విధానానికి స్వస్తి పలకాలని, తదితర డిమాండ్లతో ధర్నా చేపట్టారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజానా దొరబాబు, వివిధ రైతు సంఘాల నాయకులు గండి నాయనబాబు, తాకాశి వెంకటేశ్వరరావు, వియ్యపు రాజు, వైఎన్ భద్రం, కోరుబిల్లి శంకరరావు, పప్పల ఈశ్వరరావు, నరాలశెట్టి సత్యనారాయణ, కండుబోతుల బుజ్జి పాల్గొన్నారు. సంయుక్త కిసాన్ మోర్చా రైతు నాయకుల ధర్నా -
ఐదేళ్లలోపు చిన్నారుల ఆధార్ నమోదు ప్రక్రియ వేగవంతం
అనకాపల్లి: ఐదేళ్లలోపు చిన్నారులకు ఆధార్ నమోదు ప్రక్రియను వేగవంతం చెయ్యాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆధార్ కార్డుల నమోదు, నవీకరణ ప్రక్రియపై జిల్లా స్థాయి ఆధార్ కమిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాలలో ఐదేళ్ల లోపు చిన్నారులకు ఆధార్ కార్డు నమోదు తక్షణమే చేపట్టాలని సూచించారు. తల్లి బిడ్డకు జన్మనివ్వగానే వైద్యశాలలోనే ఆధార్ నమోదు చేయాలన్నారు. ఏదైనా కారణం చేత నమోదు కాలేకపోతే అంగన్వాడీ కేంద్రం పరిధిలోనే ఆధార్ నమోదు తప్పనిసరిగా జరగాలన్నారు. విద్యార్థుల ఆధార్ నవీకరణ కోసం జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలల్లో చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో 124 ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా, ప్రస్తుతం 63 కేంద్రాలే ఎందుకు పనిచేస్తున్నాయని ప్రశ్నించారు. శాఖల వారీగా లక్ష్యాలు పూర్తి చేయాలి శాఖలవారీగా నిర్దేశించిన లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ విజయ కృష్ణన్ అన్నారు. జిల్లాస్థాయిలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రతి కుటుంబానికి వంద రోజుల పనిదినాల కల్పన, సరాసరి వేతనం గిట్టుబాటు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పారు. నియోజకవర్గానికి ఒక పశువుల వసతిగృహం నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాలన్నారు. సిటిజన్ ఈ కేవైసీ, 05–17 సంవత్సరాల వయస్సు పిల్లలకు ఆధార్ అప్డేట్, ఆధార్ సీడింగ్ ప్రక్రియలను వెంటనే పూర్తి చేయాలని ఆమె కోరారు. బాల్య వివాహ్ ముక్త భారత్లో భాగంగా 100 రోజుల బాల్య వివాహ నిర్మూలన కార్యక్రమం గోడ పత్రికను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. దీనిపై అన్ని వర్గాల వారికీ అవగాహన కల్పిస్తామని, ప్రతి పాఠశాలలో బాల్యవివాహరహిత ప్రతిజ్ఞను చేయిస్తామని చెప్పారు.కలెక్టర్ విజయ కృష్ణన్ -
వసతి గృహ విద్యార్థినులపై కోతుల దాడి
రావికమతం: స్థానిక ఎస్సీ బాలికల వసతి గృహంలో విద్యార్థినులకు రక్షణ కొరవడింది. ఆదివారం రాత్రి హాస్టల్లోకి కోతులు ప్రవేశించి ఇద్దరు విద్యార్థినులను గాయపరిచాయి. రావికమతం మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఎస్సీ, బీసీ హాస్టళ్లు ఉన్నాయి. ఎస్సీ హాస్టల్లో 96 మంది విద్యార్థినులు ఉంటున్నారు. వీరిలో పాల్లికలిక స్నేహ, సేదరి మంగలపై కోతులు దాడి చేయడంతో స్పల్పంగా గాయపడ్డారు. హాస్టల్ సిబ్బంది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి, వారిద్దరికి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక వైద్యం అందించి నర్సీపట్నం తరలించారు. అక్కడ మెరుగైన చికిత్స అనంతరం బాలికలను వారి తల్లిదండ్రులు సోమవారం ఇళ్లకు తీసుకెళ్లారు. అక్టోబర్లో బీసీ హాస్టల్లోకి కుక్కలు ప్రవేశించి రాత్రి సమయంలో 12 మంది బాలికలపై దాడి చేశాయి. ఈ హాస్టల్కు రక్షణ గోడ ఏర్పాటు చేయలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాలకలకు రక్షణ కల్పించాలని ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షుడు గెమిల వాసు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గోవిందరావు, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి సూరిబాబు, డప్పు కళాకారుల సంఘం అధ్యక్షుడు ఎత్తుల రాజు డిమాండ్ చేశారు. కోతుల దాడి విషయమై మేట్రిన్ లలితను వివరణ కోరగా, అటవీ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు.కోతుల దాడిలో గాయపడిన విద్యార్థినులు స్నేహ, మంగ -
పనిచేస్తారు?
మీరెక్కడ దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయం నమూనా సాక్షి, విశాఖపట్నం : దక్షిణ కోస్తా రైల్వే జోన్కు కేంద్రం గెజిట్ ఇవ్వకుండానే సర్దుబాట్లు, దిద్దుబాట్లతో నడిపిస్తోంది. కొత్త జోన్ పరిధిలోని డివిజన్లు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న రాయగడ డివిజన్లో ఎక్కడ పనిచేయాలని కోరుకుంటున్నారో తెలపాలని ఉద్యోగులకు ఈనెల 2వ తేదీన ఆప్షన్లు ఇస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే జోన్ డీపీఆర్ (సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక) ఆమోదం సమయంలో చెప్పిన విధంగానే, ప్రస్తుతం ఉన్న నాన్–గెజిటెడ్ పోస్టులను సర్దుబాటు చేస్తూ బోర్డు ఈనెల 4న మరో సర్క్యులర్ విడుదల చేసింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించిన సవరించిన డీపీఆర్ను రైల్వేబోర్డు ఈ ఏడాది జూలైలో ఆమోదించింది. అయితే రైల్వే బోర్డు కొత్త పోస్టుల నియామకాలు, నిధుల విషయంలో ఆంక్షలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా ప్రకటనలు, వరుస ఉత్తర్వులు జారీ చేస్తోంది. గెజిట్ విడుదల కాకపోవడంతో తాత్కాలిక కార్యకలాపాల ప్రారంభం ఆలస్యమయ్యే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. వీఎంఆర్డీఏ డెక్లో తాత్కాలిక జీఎం కార్యాలయం పనులు పూర్తయినా.. గెజిట్ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఉద్యోగులూ.. ఆప్షన్లు ఎంచుకోండి కొత్తగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా జోన్తో పాటు రాయగడ డివిజన్లో పనిచేసేందుకు ఎవరికి ఎక్కడ ఇష్టం ఉందో ఆప్షన్లు ఎంచుకోవాలంటూ రైల్వే బోర్డు మ్యాన్పవర్ ప్లానింగ్ డైరెక్టర్ ఏఎస్ మెహ్రా ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వేజోన్లో ఉన్న విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు విశాఖ కేంద్రంగా ఏర్పాటవుతున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్లో చేరబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న వాల్తేరు డివిజన్ రెండుగా విభజించి.. కొంత భాగాన్ని విశాఖ డివిజన్గా, మిగిలిన భాగాన్ని రాయగడ డివిజన్లో చేర్చుతూ డీపీఆర్ తయారు చేశారు. కొత్త జోన్ హెడ్క్వార్టర్స్లో పోస్టింగులతో పాటు రాయగడ డివిజన్లో పనిచేసేందుకు పోస్టింగ్లపై ఆప్షన్లు ఎంచుకోవాలని సూచించారు. జోన్ హెడ్క్వార్టర్ కోసం దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్కోస్ట్ రైల్వే హెడ్క్వార్టర్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు మొదటి ప్రాధాన్యమిస్తుండగా.. రెండో ప్రాధాన్యం కింద మిగిలిన డివిజన్లకు సంబంధించిన వారికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాయగడ డివిజన్ ఆప్షన్లు ఎంచుకునేందుకు వాల్తేరు డివిజన్ ఉద్యోగులకు ప్రథమ ప్రాధాన్యమిచ్చారు. రెండో ప్రాధాన్యత కింద ఈస్ట్కోస్ట్ జోన్, తర్వాత ఇతర జోన్లు ఉద్యోగులు ఆప్షన్లు పెట్టుకోవచ్చని సూచించారు. హెచ్ఆర్ఎంఎస్ ద్వారా ఆప్షన్లు నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. దీనికి 4 వారాల సమయం ఇస్తున్నట్లు రైల్వే బోర్డు మ్యాన్పవర్ ప్లానింగ్ డైరెక్టర్ ఏఎస్ మెహ్రా ఆదేశించారు. నాన్ గెజిటెడ్ పోస్టుల విభజన షురూ విశాఖ జోన్, రాయగడ డివిజన్ కోసం వివిధ డివిజన్లు, ఈస్ట్కోస్ట్, సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లలో విధులు నిర్వర్తిస్తున్న నాన్గెజిటెడ్ ఉద్యోగుల విభజనను కేడర్ ప్రకారం కేటాయింపులు చేస్తూ ఈనెల 4న ఉత్తర్వులు జారీ చేశారు. దక్షిణ కోస్తా జోన్ హెడ్క్వార్టర్స్ కోసం 1,100 నాన్గెజిటెడ్ పోస్టుల బదిలీ జరగాలని డీపీఆర్లో స్పష్టం చేశారు. దానికనుగుణంగా కేడర్ల వారీగా బదిలీలకు ఆమోదముద్ర వేశారు. దీని ప్రకారం దక్షిణ మధ్య రైల్వే జోన్ నుంచి 959, వాల్తేరు డివిజన్ నుంచి 129 పోస్టులు, ఈస్ట్కోస్ట్ జోన్ నుంచి 12 పోస్టులు బదిలీ చేయాలని నిర్ణయించారు. అకౌంట్స్ విభాగంలో 298, ఇంజినీరింగ్ 104, కమర్షియల్ విభాగం నుంచి 101 పోస్టులు బదిలీ చేయనున్నారు. అదేవిధంగా రాయగడ డివిజన్ కోసం డీపీఆర్లో 600 నాన్ గెజిటెడ్ పోస్టులు కేటాయించారు. ఈ డివిజన్ కోసం వాల్తేరు డివిజన్ హెడ్క్వార్టర్స్ నుంచి 381 పోస్టులు, ఈస్ట్కోస్ట్ జోన్ హెడ్ క్వార్టర్స్ నుంచి 219 పోస్టులు కేటాయించారు. పర్సనల్ విభాగంలో 110, ఆపరేటింగ్ నుంచి 72, ఎలక్ట్రికల్ విభాగం 66 పోస్టులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోస్టుల నిర్వహణ బోర్డు ఆమోదించిన ప్రామాణిక హోదాల్లో మాత్రమే ఉండాలని స్పష్టం చేశారు. -
పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు ఓ భాగమే
● ఎస్పీ తుహిన్ సిన్హా ● రిటైర్డ్ హోంగార్డు చల్లపల్లికి సాయం అనకాపల్లి: పోలీస్ శాఖలో హోంగార్డుల సేవ లు ఒక భాగమేనని ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. చోడవరం పోలీస్ స్టేషన్లో కమ్యూనికేషన్ హోంగార్డుగా సేవలందించి ఇటీవల ఉద్యోగ విరమణ చేసిన చల్లపల్లి రామకోటేశ్వరరావుకు తోటి హోంగార్డులు తమ ఒక రోజు గౌరవ వేతనం రూ.4.00,530 చెక్కును ఎస్పీ చేతులమీదుగా సోమవారం అందజేశారు. హోంగార్డుగా చల్లపల్లి చూపిన క్రమశిక్షణ, నిబద్ధత, నిజాయితీ ప్రశంసనీయమన్నారు. అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డులు ఒక రోజు గౌరవ వేతనాన్ని స్వచ్ఛందంగా అందజేయడం అభినందనీయమన్నారు. కార్యాలయ పరిపాలన అధికారి తిలక్ బాబు, రిజర్వ్ సీఐ బి.రామకృష్ణారావు, జూ.అసిస్టెంట్ రమేష్ పాల్గొన్నారు. -
ఆటవిడుపుగా వెళ్లి అనంతలోకాలకు..
దేవరాపల్లి: సెలవు రోజే ఆ విద్యార్థికి చివరి రోజైంది. స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకోవడానికి వెళ్లి రామాలయంపై నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఈ విషాదాకర సంఘటన మండలంలోని గరిశింగిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీస్లు, స్థానికుల కథనం మేరకు.. మండలంలోని తెనుగుపూడికి చెందిన కోన దినేష్ (13) స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సెలవు కావడంతో పక్క గ్రామమైన గరిశింగిలో స్నేహితులతో కలిసి సరదాగా గడిపాడు. ఈ నేపథ్యంలో ఆటవిడుపుగా రామాలయంపైకి ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో తలకు బలమైన గాయమై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే స్థానికులు, కుటుంబీకులకు సమాచారం అందించి 108 వాహనంలో కె.కోటపాడు సీహెచ్సీకి తరలించారు. పరిస్థితి విషమించడంతో కేజీహెచ్కు తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ వి. సత్యనారాయణ కేసు నమోదు చేశారు. సోమవారం కేజీహెచ్లో బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. తెనుగుపూడిలో విషాద ఛాయలు... విద్యార్థి మృతితో తెనుగుపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుడు తల్లిదండ్రులు చిననర్సిబాబు, లక్ష్మి కూలి పనులు చేస్తుంటారు. వీరి రెండో కుమారుడు దినేష్ మృతిని తట్టుకోలేక గుండెలవిసేలా రోదించారు. రామాలయంపై నుంచి జారిపడి విద్యార్థి మృతి -
రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి
యలమంచిలి రూరల్: స్థానిక రైల్వేస్టేషన్లో సోమవారం రాత్రి రైలు నుంచి జారి పడి అనకాపల్లి శ్రీరామనగర్కు చెందిన పెలూరి అప్పారావు (55) మృతి చెందాడు. విజయవాడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న రైలు నుంచి జారి పడినట్టు తెలిసింది. 108 వాహనంలో యలమంచిలి రైల్వేస్టేషన్ నుంచి స్థానిక ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. రైళ్లలో అప్పారావు పాప్కార్న్ అమ్ముతుంటాడని ప్రభుత్వాస్పత్రి సిబ్బంది తెలిపారు. అప్పటికే అతడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై తమకు పూర్తి వివరాలు అందలేదని తుని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ ఎస్సై శ్రీనివాసరావు తెలిపారు. -
రేషన్ డిపో డీలర్ అక్రమాలపై విచారణ
పరవాడ: అనకాపల్లి మండలంలోని వెన్నలపాలెం రేషన్ డిపో–19 డీలర్ గొరుపూటి వెంకునాయుడు పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు రెవెన్యూ అధికారులు సోమవారం రాత్రి రేషన్ డిపోలో అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. అనంతరం లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తమకు అందించే బియ్యం, పంచదార పంపిణీలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు లబ్ధిదారులు రాత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. బియ్యంలో 20 కిలోల వద్ద కిలో, 10 కిలోల వద్ద అర కిలో బియ్యం తక్కువగా పంపీణీ చేస్తున్నారని అధికారులకు తెలిపారు. కిలో రూ.17కు అందించాల్సిన పంచదారకు రూ.20 వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి గ్రామంలో నివసిస్తున్న వారికి రేషన్ సరకులు పంపీణీ చేయలేదని, ప్రశ్నిస్తే దిక్కున్న చోట ఫిర్యాదు చేసుకోవాలని చెప్తున్నారని లబ్ధిదారులు ఆర్ఐ రమణకు మొరపెట్టుకున్నారు. దీనిపై తహసీల్దార్ బి.నాగరాజును వివరణ కోరగా రేషన్ డిపో డీలర్ అవకతవకలపై అందిన ఫిర్యాదు మేరకు డిపోను తనిఖీ చేయాలని ఆర్ఐని ఆదేశించినట్లు తెలిపారు. లబ్ధిదారుల ఫిర్యాదుల మేరకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించి, తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎస్టీయూ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు చోడవరం: స్టేట్ టీచర్స్ యూనియన్ (ఎస్టీయూ) అనకాపల్లి జిల్లా అధ్యక్షుడుగా చోడవరం గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఐ.వి.రామిరెడ్డి ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన యూనియన్ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా కె. పరదేశి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడుగా పి.వి.జి.ఎన్ గంగాధర్, గౌరవ అధ్యక్షుడుగా ఆచంట రవి, మహిళా కన్వీనర్గా సిహెచ్ సునీత, కోశాధికారిగా జి. అచ్యుతరావు, ఉపాధ్యక్షుడిగా ఆర్.ఉదయ్భాస్కర్, టి.రాజు, అసోసియేట్ అధ్యక్షుడిగా టి.భాస్కర్, డి.భీమరాజు, డి.ప్రేమ్కుమార్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా కె. సూర్యప్రకాష్, కె.వరహాలదొర, సురేష్కుమార్ ఎన్నికయ్యారు. ఎన్నికల పరిశీలకులుగా వై.అప్పారావు వ్యవహరించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రామిరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, పెండింగ్ డీఏలను మంజూరు చేయాలని, ఉపాధ్యాయులకు యాప్ భారం తగ్గించాలని, ఉన్నత పాఠశాలలకు కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దు చేయాలని, టీఈటీ నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని, పీఎఫ్ లోన్లు, సరెండర్ లీవ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రధాన కార్యదర్శి పరదేశి డిమాండ్ చేశారు. -
కనువిందుగా కొండగుడి పండగ
డాబాగార్డెన్స్: పాతపోస్టాఫీస్ ప్రాంతంలోని రాస్హిల్స్ కొండపై వెలసిన అమలోద్బవి అమ్మవారిని దర్శించుకోవడానికి సోమవారం అశేష భక్తజనం తరలివచ్చింది. భక్తి పారవశ్యంతో మాతను స్మతిస్తూ.. ఆరాధకుల గీతాలాపనలు.. సర్వమానవ సౌభ్రాతృత్వం కోసం అగ్ర పీఠాధిపతుల బోధనలు.. ఇలా అక్కడ అణువణువునా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి, కృష్ణ జిల్లాల నుంచి అమ్మ కరుణ కోసం తరలివచ్చిన ఆరాధకులతో విశాఖ జనపురిగా మారిపోయింది. భక్తిశ్రద్ధలతో దివ్యపూజా బలి కొండగుడిలో వెలసిన అమలోద్బవి మాత(విశాఖ పురి మేరీమాత) ఉత్సవాలు గత నెల 29న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 8 సోమవారంతో ఉత్సవాలు ముగిశాయి. సోమవారం ఉదయం దివ్య పూజ జరిపారు. పూజలో ఎక్కువ మంది కన్యసీ్త్రలు రాష్ట్ర నలుమూలల నుంచి హాజరై ప్రార్థనలు చేశారు. ఉదయం 7.30 గంటలకు గుహవద్ద విశాఖ అగ్రపీఠాధిపతి డాక్టర్ ఉడుముల బాల సమిష్టి దివ్యబలి పూజ ప్రసంగమిచ్చారు. 350 మంది వలంటీర్లు, 50 మంది గురువులే గాక నగరంలోని వివిధ చర్చిలకు చెందిన ఫాదర్లు, బ్రదర్స్ ఈ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో చేపట్టారు. వెల్లువలా ఊరేగింపు మధ్యాహ్నం పాతపోస్టాఫీస్ వద్ద ఉన్న సెయింట్ అలెయిసిస్ పాఠశాల నుంచి ఆరాధకులు ప్రదక్షిణగా కొండపై ఉన్న ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. ఆరాధకులు అమ్మవారికి తమ శక్తి మేరకు బంగారం, వెండి కానుకలు సమర్పించుకున్నారు. కొంత మంది తలనీలాలు సమర్పించి తమ భక్తి తత్పరతను చాటుకున్నారు. లూర్ధుమాత గుహ వద్ద దివ్యపూజ బలితో మహోత్సవం ముగిసింది. జోరుగా వ్యాపారం పాతపోస్టాఫీసు, కోటవీధి, ఫెర్రీరోడ్డు, అంబుసరంగ్ వీధి, కన్వేయర బెల్ట్ తదితర ప్రాంతాల్లో సుమారు కిలోమీటర్ల మేర దుకాణాలు వెలిశాయి. వీటిలో ఆధ్యాత్మిక గ్రంథాలు, కొండగుడి చరిత్ర, ఏసుక్రీస్తు, మేరిమాత బొమ్మలు కొలువుదీరాయి.


