నూకతాత పండగ చూతము రారండి
● నేటినుంచి మూడు రోజులపాటు జాతర
● రాజయ్యపేటలో ఘనంగా ఏర్పాట్లు
● ఒడిశా నుంచి తరలివస్తున్న మత్స్యకారులు
నక్కపల్లి: మత్స్యకారుల ఆరాధ్య దైవం, ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన రాజయ్యపేట నూకతాత సంబరాలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. రెండో రోజైన మంగళవారం నూకతాత జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఏటా శివరాత్రి నుంచి మూడు రోజుల పాటు మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుతారు. ఉత్సావానికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయాన్ని, విగ్రహాలను రంగులతో తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు.నూకతాత పండగను మత్స్యకారులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. మత్స్యకారులతోపాటు, ఇతర సామాజిక వర్గాలవారు, చుట్టుపక్కల గ్రామాలవారు వేల సంఖ్యలో తరలివస్తారు. పండగలో భాగంగా శివరాత్రి నాడు జాగరణ చేసి తెల్లవారు జామున నూకతాత విగ్రహాలను సముద్రస్నానానికి తీసుకువెళతారు. స్నానం అనంతరం విగ్రహాలను పూజారులు ఆలయానికి తీసుకువస్తున్న సమయంలో రోడ్డు పై వందలాదిమంది మత్స్యకారులు పడుకుంటారు. వారిపై నుంచి పూజారులు దాటుకుంటూవెళతారు. ఈ పండగలో ఇదే విశేషం. కోరిన కోరికలు తీరిన తరువాత ఇలా పడుకుని మొక్కులు చెల్లించుకుంటారు. పండగ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున బాణ సంచా కాల్చడం ఈ పండగలో మరో ప్రత్యేకత. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం సాయంత్రం వరకు గ్రామంలో తిరునాళ్ల సందడి ఉంటుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నక్కపల్లి సీఐ జె.మురళి, ఎస్ఐ సన్నిబాబుల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
విద్యుత్ దీపాలంకరణలో నూకతాత ఆలయం
నూకతాత పండగ చూతము రారండి
నూకతాత పండగ చూతము రారండి


