ఇరాన్ వార్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. భారతదేశంలో కూడా ఎల్పీజీ దిగుమతుల్లో కష్టాలు, నష్టాలు, అధిక ఖర్చులు, సరఫరా అంతరాయాలు లాంటి సమస్యలు తప్పడం లేదు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య శాంతి చర్యలు ఇంకా ఒక కొలిక్కి రాని నేపథ్యంలో ప్రపంచవ్యాప్త ఎల్పీజీ సరఫరా పునరుద్ధరణకు ఎంత కాలం పట్టవచ్చు? ఉత్పత్తి తాత్కాలికంగా నిలిచిపోయిందా లేక శాశ్వత నష్టం జరిగిందా? అసలు ఏం జరుగుతోంది?
ప్రపంచవ్యాప్తంగా దెబ్బతిన్న ఎల్పీజీ సరఫరా వ్యవస్థ మళ్లీ సాధారణ స్థితికి రావడానికి మూడు నుండి నాలుగు ఏళ్లు పట్టవచ్చని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. భారతదేశం ఎదుర్కొంటున్న పెరుగుతున్న దిగుమతి నష్టాలు, వ్యయ ఒత్తిళ్లను ప్రస్తావిస్తూ, ప్రభావిత సరఫరాదారుల నుండి అందిన సమాచారం ప్రకారం, పునరుద్ధరణకు కనీసం మూడేళ్లు, లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు అని ఆ అధికారి పేరు వెల్లడించకుండా తెలిపారు.
మరోవైపు దేశంలో ఎల్పీజీ ధరలు పెరుగుతున్నాయి. దొరుకుతుందా లేదా అనే ఆందోళన ప్రజల్లో రోజు రోజుకీ విపరీతంగా పెరుగుతోంది. నిల్వలు కేవలం 15 రోజుల డిమాండ్కు మాత్రమే సరిపోతున్నాయి. ఉత్పత్తి కేంద్రాల్లో నష్టం తాత్కాలికమా లేక శాశ్వతమా అన్నది స్పష్టంగా లేకపోవడమే దీనికి ప్రధాన కారణం.
ఇండియా- సవాళ్లు
భారతదేశం తన ఎల్పీజీ సరఫరాల కోసం పశ్చిమ ఆసియాపై ఎక్కువగా ఆధారపడి ఉంది. తన మొత్తం వినియోగంలో 60 శాతం దిగుమతుల ద్వారానే పొందుతోంది. అయితే, అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యలకు ప్రతిస్పందనగా హోర్ముజ్ జలసంధిపై దిగ్బంధనం, ప్రాంతీయ ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడుల కారణంగా ఆ సరఫరాలు దెబ్బతిన్నాయి.
ఎక్కువగా దిగుమతులపై ఆధారపడటంతో ప్రస్తుత సంక్షోభంతో ఎల్పీజీ సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ద్వారా గతంలో 90 శాతం దిగుమతులు ఈ మార్గం ద్వారానే వచ్చేవి. యుద్ధ వాతావరణం వల్ల మార్చి 24 నాటికి ఇది 55 శాతానికి పడిపోయింది. రూబిక్స్ డేటా సైన్సెస్ , వయానా ట్రేడ్ఎక్స్ఛేంజ్ ఏప్రిల్ నివేదిక ప్రకారం, దారి మళ్లించినా,ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించినప్పటికీ, సరఫరాలో 40-50 శాతం వరకు ఉండవచ్చు.
15 రోజులకు మాత్రమే నిల్వ సామర్థ్యం
దేశంలో సరిపడా ఎల్పీజీని నిల్వ చేసుకునే సామర్థ్యం కేవలం 15 రోజులకు మాత్రమే పరిమితం. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు మొదలైనప్పటినుంచీ 14.2 కేజీల డొమెస్టింగ్ సిలిండర్ ధర రూ. 60 పెరిగింది. అలాగే కమర్షియల్ సిలిండర్ ధర రూ. 115 పెరిగింది. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు మరియు చిన్న తరహా పరిశ్రమలపై భారం తీవ్రంగా పడుతోంది. అలాగే చమురు కంపెనీలపై సబ్సిడీ ఒత్తిడి పెరుగుతోంది.
ప్రభుత్వ చర్యలు
సరఫరా అంతరాయం కలగకుండా ప్రభుత్వం చర్యలపై దృష్టి సారిస్తోంది. కోవిడ్ సమయంలో అనుసరించిన పద్ధతుల్లో ఇతర దేశాల నుండి దిగుమతులు పెంచుకోవడంతోపాటు, స్థానిక ఉత్పత్తిపై దృష్టి సారించింది. రిఫైనరీల ద్వారా వంట గ్యాస్ ఉత్పత్తిని గరిష్ట స్థాయికి పెంచాలని భావిస్తోంది. తద్వారా గృహ అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సరఫరాలో ఇబ్బంది కలగకుండా ఉండాలని భావిస్తోంది.
(ఆప్ ఎంపీ రాఘవ్ చద్దాకు మరో షాక్!)
గల్ఫ్ దేశాలపై ఆధారపడటం
2025 ఆర్థిక సంవత్సరంలో 6 బిలియన్ డాలర్ల విలువైన భారతదేశ ఎల్పీజీ వినియోగానికి 92 శాతాన్ని యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రెయిన్ , ఒమన్ దేశాలు కలిసి సరఫరా చేశాయి. ఇరాన్ దాడుల తీవ్రతను ఎక్కువగా ఎదుర్కొన్న యూఏఈ, దిగుమతులలో 41 శాతం వాటాను కలిగి ఉండగా, ఖతార్ 22 శాతం వాటాను కలిగి ఉంది అక్కడ యుద్ధ పరిస్థితుల వల్ల రవాణా ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి, చివరికి వినియోగదారునిపై భారం పడుతోంది.
ఇదీ చదవండి: ఉదయాన్నే ప్లైన్ దోసె తింటున్నారా? ఈ షాకింగ్ విషయం విన్నారా?


