అభివృద్ధి పనులువేగవంతం చేయండి
● వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ ఆదేశాలు
తుమ్మపాల : జిల్లాలో మంజూరైన అన్ని అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టరు విజయకృష్ణన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి ఎంపీడీవోలు, ఇంజినీరింగు అధికారులు, విద్యుత్ శాఖ, గ్రామీణ నీటి సరఫరా, క్రీడాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, పనులు ప్రస్తుత పరిస్థిని ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పలు దశల్లో ఉన్న నిర్మాణ పనులన్నింటిని వెంటనే పూర్తిచేయాలని, నిధులు మురిగిపోయినట్లచితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి మండలానికి 5 గ్రామాలను ఒడిఎఫ్ ప్లస్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని, ఆ గ్రామాలలో సోక్ పిట్స్, మేజిక్ డ్రెయిన్స్ వంటి నిర్మాణాలన్నింటిని పూర్తిచేయాలన్నారు. పాఠశాలలో, వసతి గృహాలలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అమలు చేయాలని తెలిపారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే వెంటనే పూర్తి చేయాలన్నారు. మార్చి నాటికల్లా జిల్లాలో గల అన్ని వీధికుక్కలకు స్టెరిలైజేషను ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లాలో 65 శాతంగా గల అక్షరాస్యత శాతం పెంచుటకు అక్షర ఆంధ్ర కార్యక్రమం విజయవంతం చేయాలని, వయోజన విద్య సెంటర్లకు వస్తున్న 91 వేల మందిని వచ్చే నెలలో జరిగే పరీక్షలకు హాజరై ఉత్తీర్ణులయ్యేటట్లు వారికి చదువు చెప్పాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ. కుటుంబాలకు అందిస్తున్న ఉచిత సోలారు విద్యుత్ పథకాన్ని, అలాగే పీఎం సూర్యఘర్ పథకాన్ని వినియోగదారుడు వినియోగించుకొనేలా అవగాహన కల్పించాలన్నారు. సైబర్ మోసాలు, మనీ న్యూలింగ్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ విజయ కృష్ణన్ బ్యాంకింగ్ అధికారులను ఆదేశించారు. రిజర్వ్ బ్యాంక్ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా టీవీ కమర్షియల్ యాడ్స్ పోస్టర్లను కలెక్టరేట్లో ఆమె ఆవిష్కరించి ప్రారంభించారు. ఈ నెల 9 నుంచి 13 వరకు జరిగే వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా కేవైసీ, సీకేవైసీ ప్రాముఖ్యతపై ప్రజలకు విస్తృత అవగాహన, ప్రచారం కల్పించాలన్నారు. డీఆర్వో సత్యనారాయణ, అధికారులు పాల్గొన్నారు.


