మైనింగ్ చెక్పోస్టు వల్లే ఆర్మీ ఉద్యోగి మృతి
అనకాపల్లి: మండలంలో మార్టూరు జంక్షన్లో అక్రమ మైనింగ్ చెక్పోస్టు వద్ద లారీలు నిలుపుదల చేయడంతో బవులవాడకు చెందిన ఆర్మీ ఉద్యోగి రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందాడని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం తెలిపారు. అక్రమ మైనింగ్ చెక్పోస్టులను తక్షణమే తొలగించాలని కోరుతూ మండలంలో మార్టూరు జంక్షన్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో నాయకులు శనివారం ధర్నా చేపట్టారు. ఆయన మాట్లాడుతూ అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ గెలిచిన తర్వాత జిల్లాలో మైనింగ్ మాఫియా పెరిగిపోయిందన్నారు. యజమానులు రెండు నుంచి ఐదెకరాలకు పర్మిషన్ తీసుకుని పది, పదిహేను హెక్టార్ల వరకు అక్రమంగా మైనింగ్్ చేస్తున్నారన్నారు. మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు నిర్లక్ష్యం వల్ల ఈ దందా సాగుతుందన్నారు. కొండలను బ్లాస్టింగ్ చేయడం వల్ల చుట్టుపక్కల ఇళ్లు, పొలాల్లో పంటలు దెబ్బతింటున్నాయని వాపోయారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో రోజుకు రెండు వేల భారీ వాహనాల ద్వారా అక్రమంగా మైనింగ్ తరలిస్తున్నారన్నారు. వీటికి ప్రభుత్వ పే బిల్లులు ఉండటం లేదని, కోట్లాది రూపాయల గ్రామీణ సంపదను రాజకీయ నాయకులు దోచుకోవడం అన్యాయమన్నారు. మండలంలో 115 క్వారీల్లో చాలా వాటికి అనుమతులు లేవన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ గంటా శ్రీరామ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రుత్తల శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, కాళ్ల తలయ్యబాబు, అల్లు రాజు, కె. ఈశ్వరరావు, చలపతి, నాగిరెడ్డి సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


