అప్పులబాధలు తాళలేక వ్యక్తి ఆత్మహత్య
అచ్యుతాపురం రూరల్ : అప్పులబాధ తాళలేక స్క్రాప్ షాపు యజమాని రాగల ఆదినారాయణ (45) శనివారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. భీమవరానికి చెందిన ఆదినారాయణ అచ్యుతాపురం మండలం వెదురువాడ అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఉంటూ అక్కడే స్క్రాప్ షాపు నడుపుతున్నాడు. అప్పు తీసుకుని ఇనుప సామగ్రి కొనుగోలుకు వ్యాపారపరంగా గాజువాకకు చెందిన ఓ వ్యక్తికి రూ.4లక్షలు ఇచ్చాడు. అయితే ఆ వ్యక్తి ఆ సొమ్మును తిరిగి ఇవ్వకపోవడం వల్ల, అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి రావడంతో మనస్తాపంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఆదినారాయణ ఆత్మహత్యకు యత్నించగా కుటుంబ సభ్యులు అడ్డుకున్నారని పోలీసులు చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చంద్రశేఖర్ రావు తెలిపారు.


