అసెంబ్లీలో మా గళం వినిపించండి
రెండో రోజుకు చేరిన ఏయూ అతిథి అధ్యాపకుల ఆందోళన
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అతిథి అధ్యాపకులు చేపట్టిన నిరసన దీక్షలు శనివారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఏయూ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. ఈ దీక్ష శిబిరాన్ని సందర్శించిన ప్రొఫెసర్ సూరప్పడు వారికి సంఘీభావం తెలిపారు. నెలవారీ వేతనాల కోసం అతిథి అధ్యాపకులు చేస్తున్న పోరాటం న్యాయబద్ధమైనదని, వారి పట్టుదల అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.సురేష్ మీనన్ మాట్లాడుతూ.. ఏయూ పూర్వ విద్యార్థులైన ఎమ్మెల్యేలు తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరారు. ప్రస్తుతం ఏయూలో కేవలం 165 మంది మాత్రమే పర్మనెంట్ ఆచార్యులు, 91 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారని, కానీ సుమారు 300 మంది అతిథి అధ్యాపకులే భారాన్ని మోస్తున్నారని సురేష్ మీనన్ వివరించారు. ఏయూకు నాక్ ఏ–ప్లస్ ప్లస్ గ్రేడ్ రావడంలో తమ కృషి ఎంతో ఉందన్నారు. ఇంత చేస్తున్నా తమకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని, దీని వల్ల నాణ్యమైన విద్యను అందించడంలో జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఏయూ అధికారులు స్పందించి తమ కష్టాన్ని గుర్తించి, వెంటనే నెలవారీ వేతనాలు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అతిథి అధ్యాపకులు శేషు, ఫణి, మురళి, పీతాని ప్రసాద్, దుర్గ ప్రసాద్, వీరేంద్ర, విక్రమ్, దేవానంద్, సునీల్, అంబేడ్కర్ సుమంత్, దివ్య, అమృత తదితరులు పాల్గొన్నారు.


