విశాఖ పోర్ట్ను సందర్శించిన ఐఏఎస్ శిక్షణార్థులు
విశాఖసిటీ: సివిల్స్ 2025 బ్యాచ్కు ఐఏఎస్ శిక్షణార్థుల బృందం సోమవారం విశాఖపట్నం పోర్ట్ అథారిటీని (వీపీఏ) సందర్శించింది. వింటర్ స్టడీ టూర్లో భాగంగా వచ్చిన వీరికి పోర్టు అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోర్టులో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం, ఆధునికీకరణ, యాంత్రీకరణ పనుల గురించి అధికారులు సమగ్రంగా వివరించారు. ప్రధానంగా సోలార్ పవర్ ప్లాంట్, మురుగునీటి శుద్ధి ప్లాంట్ మొదలైన పర్యావరణహిత కార్యక్రమాలతోపాటు కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్, ట్రక్ పార్కింగ్ టెర్మినల్ గురించి అధికారులు వారికి వివరించారు. కార్యక్రమంలో వీపీఏ విభాగాధిపతులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


