చందనోత్సవం విజయవంతానికి సమష్టి కృషి అవసరం
సింహాచలం: సింహగిరిపై ఏప్రిల్ 20న జరగనున్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం విజయవంతంగా నిర్వహించేందుకు దేవస్థానం ఉద్యోగులందరూ సమష్టిగా కృషి చేయాలని ఈవో జె. వెంకటరావు పిలుపునిచ్చారు. సోమవారం దేవస్థానంలోని పలు విభాగాల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. చందనోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే నేపథ్యంలో తాగునీరు, ప్రసాదం పంపిణీలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుధ్యం, విద్యుద్దీకరణ, భద్రత, రవాణా సదుపాయాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. సింహగిరిపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ఈ నేపథ్యంలో నిర్మాణ పనులపై ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. క్యూలైన్లు, చలువ పందిళ్లు, తాత్కాలిక షెడ్ల నిర్మాణంపై చర్చించారు. భక్తులకు ఎండ, వాన నుంచి రక్షణ కల్పించేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్డీసీ గీతాంజలి, డిప్యూటీ ఈవో రాధ, ఈఈలు రమణ, రాంబాబు, రామకృష్ణ, డీఈ తాతాజీ, ఏఈవోలు తిరుమలేశ్వరరావు, రమణమూర్తి, నరసింహరాజు, పిల్లా శ్రీనివాసరావు, పి. శ్రీనివాస్ పాల్గొన్నారు.


