కళ్యాణపులోవలో జాతరకు ఏర్పాట్లు పూర్తి
● సదుపాయాలు పరిశీలించిన
ఎస్పీ తుహిన్ సిన్హా
● అధికారులకు సూచనలు
రావికమతం : మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మండలంలో కొత్తకోట పోలీసు స్టేషన్ పరిధిలో గల కళ్యాణపులోవ పోతురాజుబాబు ఆలయ జాతర మహోత్సవాలకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేసిందని ఎస్పీ తుహిన్సిన్హా తెలిపారు. ఆయన బుధవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏర్పాట్లు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 15 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ జాతరకు సుమారు 2 నుంచి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున ఆలయం వద్ద తొక్కిసలాట జరగకుండా, ప్రత్యేక క్యూలైన్లు, ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు ఏర్పాటు చేశారని, దొండపూడి చెక్పోస్టు నుంచి ఆలయం వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుంటామని తెలిపారు. రోడ్డు విస్తరణ కారణంగా ఈ పర్యాయం 70 ఆర్టీసీ బస్సులు నేరుగా ఆలయం వరకు వెళ్లేటట్టు ప్రణాళిక రూపొందించామన్నారు. భక్తులు కళ్యాణలోవ రిజర్వాయర్లో పుణ్యస్నానాలు ఆచరించనున్న దృష్ట్యా స్నానాల కోసం 9 ఘాట్లు సిద్ధం చేశామని, ప్రమాదాల నివారణకు 10 మంది గజ ఈతగాళ్లు, 5 బోట్లు, లైఫ్ జాకెట్లు, తాళ్లతో నిరంతరం పర్యవేక్షణ ఉంటుదన్నారు. జాతర జరిగే ప్రాంగణమంతా సీసీ కెమెరాలు నిఘాలో ఉంటుదని, వీటిని ప్రత్యేక కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి, ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తామన్నారు. చోడవరం ఎమ్మెల్యే కె.ఎస్.ఎన్.ఎస్.రాజు సహకారంతో 48 ఎకరాల స్థలాన్ని భక్తుల కోసం సిద్ధం చేశారు. 28 ఉచిత భోజనశాలలు, మహిళల కోసం ప్రత్యేక మొబైల్ టాయిలెట్లు, మహిళలు దుస్తులు మార్చుకోవడం కోసం ప్రత్యేక రూమ్లు వంటి సదుపాయాలు కల్పిస్తున్నారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ స్వామివారిని శాంతియుతంగా దర్శనం చేసుకోవాలని, ముఖ్యంగా స్నానఘట్టాలు వద్ద మహిళలు, పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దొంగతనాల నివారణకు గట్టి నిఘా పెట్టామన్నారు. భక్తులకు అత్యవసర పరిస్థితుల్లో 100, లేదా 112 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఈ సందర్భంగా ఆయన దేవదాయ, రెవెన్యూ, ఇతర శాఖ అధికారులతో శివరాత్రి ఏర్పాట్లు గురించి సమీక్షించారు. ఎస్పీ వెంట స్పెషల్బ్రాంచి డీఎస్పీ జి.ఆర్.ఆర్.మోహన్, అనకాపల్లి డీఎస్పీ ఎం.శ్రావణి, స్పెషల్ బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎస్. బాలసూర్యారావు, కొత్తకోట సీఐ జి.కోటీశ్వరావు, స్థానిక ఎస్ఐ ఎం.శ్రీనివాస్తో పాటు ఇతర శాఖలకు చెందిన అధికారులు ఆయన వెంట ఉన్నారు.


