‘డెయిరీ కంటైనర్ తొలగింపు అన్యాయం’
గొలుగొండ: ఏటిగైరంపేటలో విశాఖ డెయిరీ ఆధ్వర్యంలో పాల ఉత్పత్తుల అమ్మకాలు చేస్తున్న కంటైనర్ను అన్యాయంగా తొలగించడంపై రైతులు ఆవేదన చెందారు. గత ఏడాది అక్టోబర్లో నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్డీడీసీ) గ్రామంలో పాల సంఘం ఆధ్వర్యంలో కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తుల అమ్మకం కోసం చర్యలు తీసుకుంది. గ్రామానికి చెందిన పాము లోకేష్కు వీటి బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ కంటైనర్ ద్వారా పాల ఉత్పత్తులు అమ్మకాలు ఇష్టం లేని కొంతమంది అధికార పార్టీని అడ్డం పెట్టుకుని దానిని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు యత్నించారు. విశాఖ డెయిరీ సంఘంలో పాలు పోస్తున్న రైతులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశం మేరకు కంటైనర్ ఏర్పాటు చేసి పాలు, పాల ఉత్పత్తులు అమ్మకాలు ప్రారంభించారు. ఈ పాల ఉత్పత్తులు అమ్మకాలు చేసే కంటైనర్ ఆర్అండ్బీ స్థలంలో ఉందనే కారణంగా మంగళవారం రైతులకు తెలియకుండా దానిని తొలగించారు. ఏటిగైరంపేట పరిధిలో చాలా వరకు ఆర్అండ్బీ స్థలంలోనే షాపులు ఉండగా రైతుల ద్వారా నడిచే ఈ కంటైనర్ తొలగించడం చాలా దారుణంగా ఆవేదన చెందుతున్నారు. వీటిపై మళ్లీ కోర్టుకు ఆశ్రయిస్తామని విశాఖ డెయిరీ సంఘ కార్యదర్శి పాము అప్పలనాయుడు, రైతులు తెలిపారు.


