సరుగుడు జలపాతం వద్ద భక్తుల సందడి
నాతవరం: మహాశివరాత్రి సందర్భంగా సరుగుడు జలపాతంలో స్నానాలు చేసేందుకు భక్తులతో పాటు సందర్శకులు పోటీపడ్డారు. ఉమ్మడి విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల నలుమూలల నుంచి అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో ఈప్రాంతమంతా ఆదివారం సందడి నెలకొంది. సరుగుడు, సుందరకోట పంచాయతీల శివారు 16 గ్రామాల గిరిజనులు శివరాత్రి పండగను ఘనంగా జరుపుకొంటారు. వారంతా సరుగుడు జలపాతంలో స్నానమాచరించి సమీపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకున్నారు. అధిక సంఖ్యలో సందర్శకులు రావడంతో నాతవరం, సరుగుడు మధ్య ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. సందర్శకులు సరుగుడు జలపాతాన్ని సందర్శించిన అనంతరం తాండవ రిజర్వాయర్ను చూసేందుకు రావడంతో ఈ ప్రాంతమంతా కోలాహలంగా మారింది. ట్రాఫిక్ అంతరాయం లేకుండా నాతవరం ఎస్ఐ వై.తారకేశ్వరరావు తగిన చర్యలు తీసుకున్నారు.
సరుగుడు జలపాతం వద్ద భక్తుల సందడి


