నేడు దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు
అనకాపల్లి : దివ్యాంగ బాలబాలికల కోసం జిల్లా స్థాయి ఆర్ట్ అండ్ కల్చరల్ పోటీలను ఈనెల 6న స్థానిక గాంధీనగరం ఎస్.ఆర్.శంకరన్ మీటింగ్ హాల్లో నిర్వహించడం జరుగుతుందని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. జీవీఎంసీ విలీన గ్రామమైన కె.ఎన్.ఆర్.పేటలో తమ కార్యాలయంలో జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష సహిత విద్య విభాగం ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించడం జరుగుతుందని గురువారం ఆయన చెప్పారు. డ్రాయింగ్, డ్యాన్స్, క్రాఫ్ట్, సింగింగ్, డ్రామా తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి విభాగంలో వయోపరిమితి ఆధారంగా సీనియర్, జూనియర్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామని, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, భవిత కేంద్రాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థులు పాల్గొనాలని ఆయన కోరారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని దివ్యాంగ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


