గంజాయి సేవిస్తున్న ముగ్గురి అరెస్టు
అనకాపల్లి: మండలంలోని శంకరం వద్ద గంజాయి సేవిస్తున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసినట్టు రూరల్ ఎస్ఐ జి. రవికుమార్ మంగళవారం తెలిపారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు, గంజాయి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అరెస్టు అయిన వారిలో ఉగ్గిన శేష మణికంట(29), జగ్గుపల్లి జగదీష్ (28), రాజపూడి ఆదిత్యసాయి వెంకటేష్ (29) ఉన్నారన్నారు. వీరు శంకరం గ్రామ పరిధిలోని ఎఫ్సీ గోదాముల వెనుక కొండ ప్రాంతంలో సోమవారం గంజాయి సేవిస్తుండగా ముందుగా అందిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకున్నట్టు చెప్పారు. వారిని విచారించగా విజయరామరాజుపేటకు చెందిన యర్రంశెట్టి దుర్గాప్రసాద్ వద్ద గంజాయి కొనుగోలు చేసినట్లు చెప్పారన్నారు. దుర్గాప్రసాద్ పరారీలో ఉన్నట్టు చెప్పారు. అరెస్టు అయిన నిందితుల్లో శేష మణికంఠపై గతంలో క్రిమినల్ కేసులున్నాయన్నారు. అతని నుంచి 20 గ్రాములు,మిగిలిన ఇద్దరి నుంచి 15 గ్రాముల చొప్పున గంజాయి, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామన్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు.


