రాబోయే మిస్వరల్డ్ పోటీల కోసం సన్నద్ధమవుతున్న మిస్ ఇండియా నికితా పోర్వాల్కు ఘనంగా వీడ్కోలు పలికారు కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విద్యార్థులు. ఏకంగా 40 వేల మంది విద్యార్థులు మానవ సముహాలుగా ఏర్పడి మిస్వరల్డ్గా ప్రదర్శించిన తీరు హైలెట్గా నిలిచింది. ఈ కార్యక్రమం అపూర్వమైన స్థాయిలో జరిగింది. ఈ అందాల పోటీలకు వెల్లువెత్తుత్ను మద్ధతు చూసి నికితా ఆశ్చర్యపోయింది.
ఆశీర్వాదాల సంద్రం..
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను ఏప్రిల్ 13న 'ది పేజెంట్ జర్నీ' ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసుకుంది. వేలాదిమంది విద్యార్థులు ఐక్యతను ప్రదర్శిస్తూ..మైదానంలో ఏకమైన అద్భుతమైన దృశ్యం చూస్తే కళ్లు ఆర్పడం మర్చిపోతాం. గగనతలం నుంచి చూస్తే పచ్చదనంతో కూడిన మైదానంలో 'మిస్ వరల్డ్' అని అక్షరాల ఏరియల్ వ్యూస్లా కనిపించే మానవ నిర్మాణం అత్యంత ఆకర్షణీయంగా నిలిచింది.
ఇక ఈ కార్యక్రమంలో హై-నెక్, స్లీవ్లెస్ సిల్హౌట్తో కూడిన మెరిసే గులాబీ రంగు గౌనులో మిస్ ఇండియాగా కనిపించారు నికితా పోర్వాల్. ఆమె భారీ జనసముహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడూ..ఆ గౌనుపై ఉన్న మెరిసే డిజైన్ కాంతిలో మిస్ ఇండియా కిరిటంతో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా కనిపించింది. అక్కడున్న దాదాపు 40 వేల మంది విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. "భావోద్వేగానికి లోనయ్యారు. ఆమె ఒడిశా ఆధ్యాత్మిక శక్తి గురించి మాట్లాడారు.
ఒడిశాలో నా కిరీటాన్ని ఇచ్చేస్తానేమో అనుకున్నా కానీ ఏమి ఇవ్వడం లేదు..కానీ నాతో ఈ 40 వేల మంది ఆశీస్సులను తీసుకువెళ్తున్నా. ఈ రోజు మనం ముంబై నుంచి బాబా జగన్నాథ్ నగరానికి వచ్చాం. ఇదేమి యాదృచ్ఛికం కాదు. మీరంతా ఈ దేశపు భూమి పుత్రికలు. మీ అందరికి ధన్యావాదాలు". అని తన ప్రసంగాన్ని ముగించారామె. సుమారు 130 దేశాలు పాల్గొంటున్న ఈ చారిత్రాత్మక మిస్ వరల్డ్ పోటీ కోసం నికితా వియత్నాంకు బయలుదేరుతుండటంతో ఆమెపై అంతకంతకు అంచనాలు పెరిగిపోతున్నాయి.
అదీగాక ఈ ఏడాది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ 75వ వార్షికోత్సవం కూడా. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని మునుపెన్నడూ లేనంత భారీ స్థాయిలో చేసేలా ప్లాన్ చేస్తున్నారు నిర్వాహకులు. ఇక మిస్ వరల్డ్ 2026 ఫైనల్ సెప్టెంబర్ 5, 2026న జరగనుంది. వియత్నాంలోని హనోయి, హూచి మిన్ వంటి నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
కాగా, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్కు చెందిన నికితా పోర్వాల్ బలమైన వారసత్వాన్ని కలిగి ఉన్నారు. 60కి పైగా నాటకాలలో నటించిన రంగస్థల కళాకారిణి టీవీ యాంకర్ కూడా ఆమె. అంతేగాదు నికితా అందం తోపాటు అపారమైన తెలివితేటలు ఉన్న వ్యక్తిగా ప్రశంసలు అందుకుంటున్నారామె.
(చదవండి: Asha Bhosle: 'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!)


