నోయిడా: ఉత్తరప్రదేశ్లోని పారిశ్రామిక హబ్ నోయిడా ప్రస్తుతం నిప్పుల కొలిమిలా మారింది. గత కొద్ది రోజులుగా వేతనాల పెంపుదల కోసం కార్మికులు చేస్తున్న ఆందోళన సోమవారం నాడు హింసాత్మకంగా మారడంతో దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అందరి కళ్లు ఇప్పుడు గౌతమ్ బుద్ధ్ నగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపమ్ పైనే నిలిచాయి. పరిస్థితిని చక్కదిద్దడంలో యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తున్న వేళ, అసలు ఎవరీ మేధా రూపమ్? ఆమె నేపథ్యం ఏంటి? అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
సివిల్స్లో టాప్ 10 ర్యాంకర్
మేధా రూపమ్ కేవలం ఒక ఉన్నతాధికారిణి మాత్రమే కాదు, అత్యంత ప్రతిభావంతురాలైన విద్యార్థిని కూడా. ఆమె నేపథ్యం పరిశీలిస్తే.. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుండి ఎకనామిక్స్లో పట్టా పొందారు. 2013 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో ఆల్ ఇండియా 10వ ర్యాంకు సాధించి, సంచలనం సృష్టించారు. 2014 బ్యాచ్కు చెందిన యూపీ కేడర్ ఐఏఎస్ అధికారిణిగా విధుల్లో చేరారు. ఆమె తండ్రి జ్ఞానేష్ కుమార్ ప్రస్తుతం దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వివాదాలు.. వరుస సవాళ్లు
2025 జూలై 29న గౌతమ్ బుద్ధ్ నగర్ డీఎంగా బాధ్యతలు చేపట్టిన మేధా రూపమ్నకు వరుస సవాళ్లు ఎదురవుతున్నాయి. గతంలో ఒక ఇంజనీర్ వర్షపు నీటి గుంతలో పడి మరణించిన ఘటనలో ఆమె విమర్శలు ఎదుర్కోగా, ఇప్పుడు కార్మిక లోకం భగ్గుమనడం ఆమె సమర్థతకు పెద్ద పరీక్షగా మారింది. కాగా కార్మికుల ఆందోళన తీవ్రం కావడంతో మేధా రూపమ్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. కార్మికుల డిమాండ్లను దృష్టిలో ఉంచుకుని పారిశ్రామిక వర్గాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అదనపు పని గంటలు (ఓటీ), ఆదివారాలు పనిచేసే వారికి రెట్టింపు జీతం ఇవ్వాలి. ప్రతి నెలా 10వ తేదీలోపు శాలరీ స్లిప్పులతో పాటు పూర్తి జీతం ఖాతాల్లో జమ కావాలి. నవంబర్ 30 లోపు బోనస్ మొత్తాన్ని నేరుగా బ్యాంకు ఖాతాల్లో వేయాలని మేధా రూపమ్ ఆదేశించారు. ప్రతి ఫ్యాక్టరీలో మహిళా నేతృత్వంలో ‘లైంగిక వేధింపుల నివారణ కమిటీ’లను ఏర్పాటు చేయడంతో పాటు ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేయాలని కోరారు.
ప్రస్తుతం నోయిడా వీధుల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: సీనియర్ జర్నలిస్ట్ సంచలన నిర్ణయం.. పోస్ట్మ్యాన్గా మారి..


