భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేడు (ఏప్రిల్ 14, 2026) దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అధికారిక గెజిటెడ్ హాలిడే ప్రకటించింది. దీనితో దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, కీలకమైన ఆర్థిక సంస్థల కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. అయితే ఈ రోజు ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లే ముందు, ఏ సేవలు అందుబాటులో ఉంటాయి? ఏవి మూతపడతాయో తెలుసుకోవడం అత్యంత అవసరం..
విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు
దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఈ రోజు మూతపడతాయి. అలాగే దాదాపు అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలకు సైతం సాధారణ సెలవు వర్తిస్తుంది. దీనివల్ల ప్రభుత్వ పరిపాలనా సేవలకు నేడు అంతరాయం కలగనుంది. ప్రైవేట్ ఆఫీసులు, ఐటీ కంపెనీలు మాత్రం వారి అంతర్గత నిబంధనల మేరకు పనిచేస్తాయి. అలాగే రిటైల్ దుకాణాలు, చిన్న వ్యాపారాలు యధావిధిగా కొనసాగుతాయి.
బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు బంద్
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ ప్రకారం నేడు బ్యాంకులకు సెలవు. బ్రాంచ్లలో నగదు డిపాజిట్లు, చెక్ క్లియరెన్స్ వంటి సేవలు ఉండవు. కానీ మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ , ఏటీఎంలు వంటి డిజిటల్ సేవలు యధావిధిగా పనిచేస్తాయి. మరోవైపు బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE)లలో ట్రేడింగ్ పూర్తిగా నిలిచిపోనున్నది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) ఉదయం పూట మూసివేసి, కేవలం సాయంత్రం సెషన్కు మాత్రమే తెరుచుకుంటుంది.
వీటికి ఎలాంటి ఆటంకం లేదు
ప్రభుత్వ సేవలు, బ్యాంకులు మూతపడినప్పటికీ, సామాన్యులకు ఇబ్బంది కలగకుండా అత్యవసర సేవలైన ఆసుపత్రులు, మందుల దుకాణాలు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎప్పటిలాగే తెరచివుంటాయి. మరోవైపు ఏప్రిల్ 14న తమిళ నూతన సంవత్సరాది, బోహాగ్ బిహు వంటి పలు ప్రాంతీయ పండుగలు కూడా జరుపుకుంటుండటంతో చెన్నై, బెంగళూరు తదితర నగరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. డిజిటల్ ప్లాట్ఫారమ్లు అన్నీ పనిచేస్తుండటంతో, అత్యవసర ఆర్థిక లావాదేవీలకు ఎలాంటి ఆటంకం ఉండదు.
ఇది కూడా చదవండి: ‘బాలెన్’ మార్క్: ప్రధాని మోదీతో దోస్తీ.. నేపాల్ వ్యవస్థకు సర్జరీ!


