న్యూఢిల్లీ: గ్యాస్ సిలిండర్ ధరలు మండిపోతున్న ప్రస్తుత రోజుల్లో, అసలు సిలిండర్తోనే పనిలేకుండా వంట చేసుకునే సరికొత్త రోజులు రాబోతున్నాయి. మన దేశంలోనే తయారైన ఓ అధునాతన ‘హైడ్రోజన్ స్టవ్’ ఇప్పుడు అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది. ఎల్పీజీ గ్యాస్ తో ఏమాత్రం సంబంధం లేకుండా, పూర్తిగా గ్రీన్ హైడ్రోజన్ ఇంధనంగా పనిచేసే ఈ పొయ్యి భవిష్యత్తులో మన వంటగదుల రూపురేఖలనే పూర్తిగా మార్చేయబోతోంది.
సంప్రదాయ గ్యాస్ పొయ్యిల మాదిరిగా ఇది సిలిండర్పై ఆధారపడదు. కేటలిటిక్ హైడ్రోజన్ బర్నర్ టెక్నాలజీతో పనిచేసే ఈ స్టవ్ నూరు శాతం పర్యావరణ హితమైనది. దీనివల్ల వంట చేసేటప్పుడు ఎలాంటి పొగ రాదు. కార్బన్ మోనాక్సైడ్ లాంటి హానికరమైన విషవాయువులు అసలే వెలువడవు. రెండు బర్నర్లు, ఆకర్షణీయమైన స్టెయిన్లెస్ స్టీల్ బాడీతో వచ్చే ఈ టేబుల్-టాప్ స్టవ్ ఎలాంటి శబ్దం, ప్రకంపనలు లేకుండా చాలా ప్రశాంతంగా పనిచేస్తుంది. అతి తక్కువ మంటతోనే ఇది వంటకు కావాల్సిన వేడిని పాత్రకు సమానంగా అందిస్తుంది.
హైడ్రోజన్ వాయువును వాడుతున్నందున భద్రత విషయంలో కంపెనీ ఎలాంటి రాజీ పడలేదు. ఫ్లేమ్ అరెస్టర్, ప్రెజర్ రెగ్యులేషన్ సిస్టమ్, హైడ్రోజన్ కు అనువైన వాల్వ్స్ లాంటి కట్టుదిట్టమైన సేఫ్టీ ఫీచర్లు ఇందులో పొందుపరిచారు. అయితే, దీని ధర సుమారు రూ. 1,50,000 ఉండటంతో ప్రస్తుతానికి ఇది సామాన్యులకు అందుబాటులో లేదు. కమ్యూనిటీ కిచెన్లు, ప్రభుత్వ క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, డిఫెన్స్ క్యాంటీన్లు, రీసెర్చ్ ల్యాబ్లు, పారిశ్రామిక వంటగదులలో దీనిని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నారు. భవిష్యత్తులో గ్రీన్ హైడ్రోజన్ విరివిగా అందుబాటులోకి వచ్చి, ఉత్పత్తి ఖర్చు తగ్గితే ప్రతి ఇంట్లోనూ ఈ అత్యాధునిక పొయ్యిలు దర్శనమివ్వడం ఖాయం.
ఇది కూడా చదవండి: ‘దళపతి’కి భారీ షాక్.. బరిలో ఇంతమంది ‘విజయ్’లా?


