చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమరం రోజురోజుకూ వేడెక్కుతోంది. 2026, ఏప్రిల్ 23న జరగనున్న ఎన్నికల్లో ఏ విధంగానైనా గెలిచేందుకు రాజకీయ పార్టీలు సరికొత్త ఎత్తుగడలకు తెరతీస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పుడు తమిళనాట అత్యంత హాట్ టాపిక్గా మారిన అంశం ‘డమ్మీ అభ్యర్థుల వ్యూహం’ ముఖ్యంగా టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్, డీఎంకే నేత సెంథిల్ బాలాజీ వంటి ఉద్దండులను టార్గెట్ చేస్తూ పలు పార్టీలు ఒకే పేరుతో పలువురు అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ఇది ఓటర్లను తీవ్ర గందరగోళానికి గురిచేసి, ఓట్లను చీల్చేందుకు ప్రతిపక్షాలు పన్నుతున్న పక్కా మాస్టర్ ప్లాన్ అని విశ్లేషకులు చెబుతున్నారు.
అసలు ఏమిటీ డమ్మీ అభ్యర్థుల వ్యూహం?
ఒక ప్రముఖ నేత పేరుతో మరికొంత మంది డమ్మీ అభ్యర్థులను నిలబెట్టడమే ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం. ఉదాహరణకు టీవీకే పార్టీ నుండి ‘విజయ్’ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో.. ఏ విజయ్, కె విజయ్ కుమార్, ఎం విజయ్, విజయ్ రాజ్ వంటి పేర్లతో అభ్యర్థులు దర్శనమిస్తారు. పార్టీ గుర్తులపై పెద్దగా అవగాహన లేని ఓటర్లు, కంగారులో తమ అభిమాన నేత పేరు చూసి వేరే ‘విజయ్’కి ఓటు వేసే అవకాశం ఉంది.
ఇప్పుడిది ఎందుకు ట్రెండ్ అవుతోంది?
మీడియాకు అందిన నివేదికల ప్రకారం తమిళనాడు వ్యాప్తంగా వందకు పైగా ఇలాంటి ‘ఒకే పేరున్న అభ్యర్థులు’ బరిలో నిలిచారు. ముఖ్యంగా రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ ఇస్తున్న నేతలను టార్గెట్ చేస్తూ పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో ఈ వ్యూహాన్ని ఎక్కువగా అమలు చేస్తున్నారు. కొత్త పార్టీలు బరిలో ఉండటం, ఈసారి పోటీ హోరాహోరీగా సాగుతుండటంతో ఇది ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేసే అంశంగా మారింది.
‘విజయ్’నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్.. తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఒక సంచలనం. యువతలో ఆయనకున్న విపరీతమైన క్రేజ్, సోషల్ మీడియా మద్దతు, ఎన్నికల బరిలో పార్టీ వేగంగా ఎదుగుతున్న తీరు ప్రత్యర్థి వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది. విజయ్కి పడే ఓట్లను చీల్చడం ద్వారా ఆయన గెలుపు అవకాశాలను దెబ్బతీయాలనేదే ఈ డమ్మీ కాండిడేట్ల ప్రణాళిక.
కొత్త ఓటర్లపై ప్రభావం
2026 తమిళనాడు ఎన్నికల్లో దాదాపు 12 లక్షల 50 వేల మంది యువత తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. వీరు పార్టీ గుర్తుల కంటే నాయకుల పేర్లను చూసి ఓటు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తీవ్రమైన పోటీ ఉన్న నియోజకవర్గాల్లో కేవలం ఒకటి లేదా 2 శాతం ఓట్లు చీలిపోయినా తుది ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఇది చట్టబద్ధమేనా?
ఒకే పేరున్న వారు పోటీ చేయడం చట్ట ప్రకారం పూర్తిగా సమ్మతమే. ఏ పౌరుడైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. వారి పేర్లు ఒకేలా ఉన్నాయనే కారణంతో నామినేషన్లను తిరస్కరించడానికి వీల్లేదు. అయితే, ఓటర్లలో ఏర్పడే గందరగోళాన్ని తగ్గించడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈవీఎంల మీద అభ్యర్థుల ఫోటోలు, పార్టీ గుర్తులను స్పష్టంగా ముద్రిస్తుంది. అయినా సరే ఓటర్లు కంగారు పడినప్పుడు కన్ఫ్యూజన్ తప్పదు.
ఎక్కడెక్కడ ఈ ప్రభావం ఉంది?
చెన్నైలోని పట్టణ నియోజకవర్గాలు, దక్షిణ తమిళనాడులోని ప్రధాన ప్రాంతాలు, ముఖ్యంగా పెరంబూర్, తిరునెల్వేలి, మదురై శివార్లలో, కోయంబత్తూర్ అర్బన్ జోన్లలో ఈ డమ్మీ అభ్యర్థుల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ప్రాంతాల్లో అభ్యర్థుల మధ్య గెలుపు మార్జిన్ చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు మెజారిటీ రెండు వేల ఓట్లు ఉన్నప్పుడు, డమ్మీ అభ్యర్థికి 1500 ఓట్లు పడితే అసలు అభ్యర్థి ఓడిపోయే ఛాన్స్ స్పష్టంగా ఉంటుంది.
ఓటర్లు ఏం చేయాలి?
ఈ గందరగోళాన్ని అధిగమించడానికి ఓటర్లు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఓటు వేసేటప్పుడు కంగారు పడకుండా, పార్టీ గుర్తును నిశితంగా పరిశీలించాలి. ఈవీఎంపై ఉన్న అభ్యర్థి ఫోటోను కచ్చితంగా నిర్ధారించుకున్న తర్వాతే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇప్పుడు తమిళనాడు ఎన్నికలు కేవలం మేనిఫెస్టోలు, పొత్తులకే పరిమితం కాలేదు.. బ్యాలెట్ మీద ఎవరున్నారు, వారిని ఓటర్లు ఎలా గుర్తిస్తున్నారు అనేది కీలకం కాబోతోందనడంలో సందేహం లేదు.
ఇది కూడా చదవండి: ‘దీదీ’కి మైండ్ బ్లాంక్.. బెంగాల్ బరిలో బీజేపీ బ్రహ్మాస్త్రం


