‘శిఖర్ సే సాగర్ తక్’ స్ఫూర్తిదాయకం
ఏయూక్యాంపస్: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ, సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ (ఎస్ఐఎస్ఎస్ఓ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘శిఖర్ సే సాగర్ తక్’ స్వచ్ఛత, అవగాహన కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ ఎం.ఎన్.హరేందిర ప్రసాద్ అన్నారు. రెండు రోజుల కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఉదయం బీచ్ రోడ్లోని జోడుగుళ్లపాలెం, కై లాసగిరి రోప్వే వద్ద 5, 10 కిలోమీటర్ల స్వచ్ఛత రన్, 3 కిలోమీటర్ల స్వచ్ఛత వాక్ను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆర్కే బీచ్లో సైకత శిల్పాల తయారీ, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం జీవీఎంసీ అదనపు కమిషనర్లు పి.నల్లనయ్య, డీవీ రమణమూర్తి, సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్, మాజీ ఐఏఎస్ అధికారి పంకజ్ జైన్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆర్.పి.సింగ్ తదితరులతో కలిసి ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్లు మాట్లాడుతూ హిమాలయాల నుంచి సముద్రాల వరకు పరిశుభ్రతపై సులభ్ ఇంటర్నేషనల్ చేపడుతున్న కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా సముద్రాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకుండా ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నాయన్నారు. సులభ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ ఈ కార్యక్రమాలు నాలుగు దశలుగా నిర్వహిస్తామని, విశాఖలో మొదటి దశ విజయవంతంగా ప్రారంభమైందన్నారు. కార్యక్రమం ముగింపులో స్వచ్ఛత రన్, వాక్, సైకత శిల్పాలు, పెయింటింగ్ పోటీల్లో విజేతలకు ప్రశంసా పత్రాలు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు, జీవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈ.ఎన్.వి. నరేష్కుమార్, జోనల్ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.
‘శిఖర్ సే సాగర్ తక్’ స్ఫూర్తిదాయకం


