17న చలో విజయవాడ
అనకాపల్లి: వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ), బకాయిపడ్డ కరువు భత్యం (డీఏ) అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టినట్టు యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సంపతి కిషోర్కుమార్ తెలిపారు. శనివారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో యూటీఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పాత పీఆర్సీ గడువు రెండేళ్ల 8 నెలలు పూర్తయిందని, ఈ జాప్యం ఉద్యోగుల, ఉపాధ్యాయుల జీతభత్యాలపై ఎంతో నష్టాన్ని చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు విడతల కరువు భత్యాన్ని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ రూ.30 వేల కోట్ల ఆర్థిక బకాయిలు చెల్లించవలసి ఉందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరి రెండు సంవత్సరాలు కావస్తున్న ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. ఇప్పటికై నా ఎన్నికల హామీ మేరకు మెరుగైన వేతన సవరణ చేయాలని కోరారు. యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బాయ్, సహాధ్యక్షులు రొంగలి అక్కునాయుడు, రొంగలి ఉమాదేవి, జిల్లా కార్యదర్శులు రమేష్ రావు, గుత్తుల సూర్యప్రకాష్, రాష్ట్ర కౌన్సిలర్లు ఎస్.ఎస్. నాగమణి, ఎల్లయ్యబాబు, ఎం.వి అప్పారావు పాల్గొన్నారు.


