లోపూడిలో గ్రామ సభలను అడ్డుకున్న రైతులు
బుచ్చెయ్యపేట: మండలంలో లోపూడి, పొట్టిదొరపాలెం గ్రామాల్లో జరిగిన గ్రామ సభలను రైతులు అడ్డుకున్నారు. లూలూరు, నిమ్మలోవ రెవెన్యూలో ఉన్న భూములను ఏపీఐఐసీకి కేటాయిస్తు న్నట్టు అధికారులు రైతుల అమోదం కోసం రెండు గ్రామాల్లో గ్రామ సభలను ఏర్పాటు చేశారు. లోపూడిలో సోమవారం ఉదయం 10 గంటలకు, పొట్టిదొరపాలెంలో 12 గంటలకు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. రెండు గ్రామాల్లో టెంట్లు వేయడంతో గ్రామ సభలకు రైతులు వచ్చినప్పటికీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు గ్రామ సభలు నిర్వహించాల్సిన అధికారులు రాలేదు. పోలీసులు మాత్రం వచ్చి గ్రామ సభలు వద్ద మోహరించారు. ఒంటి గంట ప్రాంతంలో డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామమూర్తి వచ్చి గ్రామ సభలు పెట్టారు. అయితే పరిశ్రమలకు భూములివ్వబోమని రైతులు తేల్చి చెప్పేశారు. పోలీసులను తీసుకొచ్చి బలవంతంగా భూములు లాక్కోవాలని చూస్తే సహించేది లేదని తెలిపారు. అసలు గ్రామ సభలను పోలీస్ బందోబస్తుతో పెట్టాల్సిన అవసరం ఏమిటో తేల్చి చెప్పాలని నిలదీశారు. దీంతో డిప్యూటీ తహసీల్దార్ జిల్లాలో పలు ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూములు సేకరిస్తుండగా కొన్ని గ్రామాల్లో సభల్లో గొడవలు జరగడంతో ముందస్తు చర్యగా పోలీసులను ఏర్పాటు చేశాం తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు. పరిశ్రమల ఏర్పాటు కోసం కాదని మీ రెండు గ్రామాల్లో భూముల రికార్డులను సరి చేయడానికే వచ్చామని, సర్వే నెంబర్లు, పేర్లు, విస్తీర్ణాలు తప్పులు ఇతర భూ సమస్యలు ఉంటే మా రెవెన్యూ సిబ్బందితో సరి చేయించుకోవాలని డీటీ రైతులకు సూచించారు. రైతు సంఘ నాయకులు దొండా శ్రీను, చిట్టిబాబు, త్రినాఽథ్, నాయుడుబాబు, శేషు, మధు, బాబూరావు పాల్గొన్నారు.
లోపూడిలో వెలవెలబోయిన గ్రామ సభ
సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ తహసీల్దార్
లోపూడిలో గ్రామ సభలను అడ్డుకున్న రైతులు


