ఏకోపాధ్యాయలో ... బోధన ఏ దయ ?
సింగిల్ టీచర్లు రాక తరచూ మూతపడుతున్న పాఠశాలలు శిక్షణ కోసం కొన్నాళ్లు, సొంత పనులపై కొన్ని రోజులు రాని ఉపాధ్యాయులు చదువులు సక్రమంగా సాగక విద్యార్థులకు అవస్థలు
నర్సీపట్నం: ఏకోపాధ్యాయ పాఠశాలల్లో చదువులు సక్రమంగా సాగడం లేదు. ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కరే టీచర్ 1 నుంచి 5వ తరగతి వరకూ బోధించవలసి వస్తోంది. ఐదు తరగతులకు కలిపి దాదాపు 15 వరకూ సబ్జెక్టులు ఉంటాయి. ఈ సబ్జెక్టులన్నీ ఒకే ఉపాధ్యాయుడు చెప్పడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. ఏదైనా కారణంతో ఉపాధ్యాయుడు రాకపోతే పాఠశాల మూతపడుతోంది. దీనికి తోడు తరచూ ఉపాధ్యాయులకు ఏదో ఒక పేరుతో శిక్షణలు ఇస్తుండడంతో నెలలో కనీసం మూడు,నాలుగు రోజులు వారు వాటికి హాజరుకావలసి వస్తోంది. ఆ సమయంలో కూడా పాఠశాలలు మూతపడుతున్నాయి. దీంతో పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు.
సీఆర్ఎమ్టీలతో బోధనేతర పనులు
ఉపాధ్యాయుడు సెలవు పెట్టినప్పుడు ఏకోపాధ్యాయ ప్రభుత్వ పాఠశాలు మూతపడకుండా ఉండేందుకు, పేద విద్యార్థులకు నష్టం కలుగకూడదనే దూర దృష్టితో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో క్లస్టర్ రిజ్వర్డ్ మొబైల్ టీచర్(సీఆర్ఎమ్టీ) వ్యవస్థను తీసుకొచ్చింది. సమగ్ర శిక్షలో బీఈడీ, టెట్ విద్యార్హతతో నియామకమైన సీఆర్ఎమ్టీలను బోధనకు ఉపయోగించేవారు. ఏకోపాధ్యాయుడు తన అవసరాల కోసం సెలవు పెట్టినా, మండల, జిల్లాస్థాయిలో శిక్షణ తరగతులకు హాజరైనప్పుడు మూతపడకుండా సీఆర్ఎమ్టీలతో పాఠశాలలు నిర్వహించేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వంలో వారిని ఎక్కువగా బోధనేతర పనులకు వినియోగిస్తున్నారు. పాఠ్యపుస్తకాలు, యూనిఫాం సరఫరా, పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను వారికి అప్పగించారు. జిల్లాలో ఉన్న 106 మంది సీఆర్ఎమ్టీలను కేవలం ఎంఈవో కార్యాలయానికి, పాఠశాలకు అనుసంధాన కర్తలుగా పరిమితి చేశారు. దీనికి తోడు సరైన పర్యవేక్షణ లేక ఎక్కడైనా ఏకోపాధ్యాయుడు సెలవు పెడితే ఆ పాఠశాల మూతపడుతోంది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో బోధన కుంటుపకుండా విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా విద్యాశాఖాధికారి అప్పారావునాయుడును వివరణ కోరగా పాఠశాలలు మూతపడకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఎంఈవోలకు ఆదేశాలు ఇచ్చాను. కొన్ని మండలాల్లో స్కూళ్లు మూతపడినట్టు తనదృష్టికి వచ్చింది. ఇకపై అలా జరగకుండా చర్యలు తీసుకుంటానని డీఈవో తెలిపారు.


