దివ్యాంగ బాలలను ప్రోత్సహించాలి
అనకాపల్లి: దివ్యాంగ బాలలను ప్రోత్సహించి, వారిలో నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు అన్నారు. స్థానిక గుండాల జంక్షన్ ఎస్ఆర్ శంకరన్ హాల్లో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగ బాలబాలికలకు జిల్లాస్థాయి ఆర్ట్, కల్చరల్ పోటీలను శనివారం నిర్వహించి, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల్లో ప్రత్యేకమైన నైపుణ్యాలు ఉంటాయని, వాటిని గుర్తించి, సరైన దిశలో ప్రొత్సహించినట్టయితే వారిలో ప్రతిభను వెలికితీయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహిత విద్య సమన్వయకర్త బి.రామకృష్ణం నాయుడు, మండల విద్యాశాఖాధికారి కోటేశ్వరరావు, వివిధ మండలాల దివ్యాంగ బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ప్రత్యేక ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


