కంపెనీలకు భూములివ్వం
బుచ్చెయ్యపేట: కంపెనీల ఏర్పాటుకు మా భూములిచ్చేదిలేదంటూ మండలంలోని శివారు పంచాయతీలైన ఆర్.భీమవరం, మల్లాం, ఆర్.శివరాంపురం ప్రజలు ఖరాఖండీగా చెబుతూ, అధికారుల తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. గతంలో పరిశ్రమల ఏర్పాటుకు భూములివ్వబోమని రైతులు తేల్చి చెప్పడంతో అప్పట్లో సర్వే ఆగిపోయింది. మళ్లీ పై గ్రామాల్లో పరిశ్రమల ఏర్పాటుకు భూముల సేకరణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఏపీఐఐసీ కోసం భూములు సేకరించేందుకు శనివారం తహసీల్దార్ లక్ష్మి,ఎస్ఐ శ్రీనివాసరావులు పోలీసు బందోబస్తుతో గ్రామ సభలు ఏర్పాటు చేశారు.దీంతో ఆగ్రహించిన ఆయా గ్రామాల ప్రజలు గ్రామ సభలు జరగకుండా అడ్డుకున్నారు. మేం సంతకాలు చేయం,మా భూములివ్వబోమని తేల్చి చెప్పేశారు. అయితే తహసీల్దార్ లక్ష్మి మాత్రం పరిశ్రమల కోసం కాదు మీ భూ సమస్యలు తీర్చడానికి వచ్చాం, అందుకే గ్రామ సభలు పెట్టామని ఆర్.భీమవరం సభలో తెలిపారు. దీంతో అక్కడున్న నాయకులు బల్లిన అమ్మునాయుడు,గొల్లవిల్లి సత్యనారాయణ,సేనాపతి నాయుడు,బల్లిన రమణాజీ,ఈశ్వరరావు,మేడిశెట్టి పడమటయ్య తదితర్లు తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీఐఐసీకీ భూములివ్వడానికి గ్రామ సభ పెడుతున్నట్టు తీర్మానం పుస్తకంలో నమోదు చేసి ఉండగా, రైతుల భూ సమస్యలు తీర్చడానికి గ్రామ సభ పెట్టామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. గ్రామస్తులు సభ నుంచి లేచి ఆందోళన చేయడంతో అధికార్లు వెనుదిరిగారు. మల్లాం,ఆర్.శివరాంపురం సర్పంచ్లు బర్ల శివ,నమ్మి నీరజ అప్పలరాజు, గ్రామస్తులు భూములివ్వబోమని ఆందోళన చేశారు.
కంపెనీలకు భూములివ్వం


