డీసీసీబీలో చోరీకి విఫల యత్నం
బ్యాంకు మేనేజర్ గది వెనుక కిటికీ తొలగించి చొరబడిన దుండగులు
దొంగతనానికి అవకాశం లేక పోవడంతో వెనుదిరిగిన దొంగలు
నగదు, బంగారు అభరణాలు చోరీ కాలేదన్న పోలీసులు
సీసీ పుటేజీ దృశ్యాలను పరిశీలిస్తున్న చోడవరం సిఐ పి. అప్పలరాజు తదితర్లు
దుండగులు తొలగించిన కిటికీని పరిశీలిస్తున్న ఎస్ఐ వి. సత్యనారాయణ.
దేవరాపల్లి: మండల కేంద్రం దేవరాపల్లిలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో శుక్రవారం అర్ధరాత్రి గుర్తు తెలియని ఇద్దరు యువకులు చోరీకి విఫలయత్నం చేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్కు ఆనుకుని ఉన్న డీసీసీబీలో బ్యాంకు మేనేజర్ గది వెనుక భాగంలో కిటికీని తొలగించి లోనికి చొరబడి చోరీకి యత్నించారు. వారికి నగదు, బంగారం లభించకపోవడంతో వెనుదిరిగారు. ప్రతీ రోజు మాదిరిగా శనివారం ఉదయం విధులకు హాజరైన సిబ్బంది బ్యాంకు మేనేజర్ గది వెనుక భాగంలో కిటికీ తొలగించి ఉండటాన్ని గుర్తించి తక్షణమే బ్యాంకు మేనేజర్ పూర్ణచంద్రరావు సమాచారం అందించారు. ఆయన తమ ఉన్నతాధికారులతో పాటు స్థానిక ఎస్ఐ వి. సత్యనారాయణకు సమాచారం అందించారు. ఎస్ఐ తన సిబ్బందితో వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విశాఖ నుంచి వచ్చిన క్లూస్ టీమ్ బ్యాంకులో లాకర్, కిటికీ తొలగించిన ప్రదేశాల్లో దుండగుల వేలి ముద్రలు ఇతర ఆధారాలను సేకరించింది. బ్యాంక్లోని సీసీ టీవీ పుటేజీ ఆధారంగా దుండగులు బ్యాంకులోకి చొరబడిన విధానాన్ని చోడవరం సీఐ పి. అప్పలరాజు, ఎస్ఐలు సత్యనారాయణ, లక్ష్మీనారాయణ తదితర్లు పరిశీలించారు.
అనంతరం స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణ మాట్లాడుతూ శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు వెనుక భాగంలోని ఇనుప కిటికీని తొలగించారని చెప్పారు. ఒక వ్యక్తి బ్యాంకులోకి చొరబడగా మరో వ్యక్తి వెనుక వైపు కాపలా ఉన్నట్టు తెలిపారు. లోపల దొంగతనం చేసేందుకు ప్రయత్నించినా ఎక్కడా అవకాశం లేక పోవడంతో వెనుదిరిగాడన్నారు. ఈ చోరీ ఘటనకు సంబంధించి కొందరు అనుమానితులను పోలీసులు విచారణ చేస్తున్నారు. బ్యాంకు వెనుక భాగంలో ఉన్న కిటికీ తుప్పు పట్టి ఉందని, వాటి స్థానంలో కొత్తవి అమర్చాలని, బ్యాంక్లో ఆగిపోయిన అలారం మోగే విధంగా చర్యలు తీసుకోవాలని బ్యాంకు మేనేజర్ పూర్ణచంద్రరావుకు పోలీసులు సూచించారు. బ్యాంకులో నగదు, బంగారు అభరణాలు భద్రంగా ఉన్నాయని, పోలీసు, బ్యాంకు అధికారులు నిర్ధారించారు. సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దుండగుల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం చేసి వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే కేసును చేధిస్తామని పోలీసులు తెలిపారు. దర్యాప్తులో స్థానిక ఎస్ఐ వి.సత్యనారాయణతో పాటు ఎ. కోడూరు ఎస్ఐ డి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
సీసీ టీవీ ద్వారా సేకరించిన దుండగుల ఫొటోలు
డీసీసీబీలో చోరీకి విఫల యత్నం
డీసీసీబీలో చోరీకి విఫల యత్నం
డీసీసీబీలో చోరీకి విఫల యత్నం


