పశువుల అక్రమ రవాణా పై ప్రభుత్వం స్పందించాలి
నక్కపల్లి: కూటమి పెద్దల ప్రమేయంతోనే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి పశువుల అక్రమ రవాణా జరుగుతోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆరోపించారు. ఆదివారం ఆయన నక్కపల్లిలో విలేకరులతో మాట్లాడారు. పాడి రైతులను, కూలీలను అడ్డం పెట్టుకుని కొంతమంది ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల నుంచి పశువులు కొనుగోలు చేసి హైదరాబాద్, కేరళ తదితర ప్రాంతాల్లో ఉన్న గోవధ శాలలకు తరలిస్తున్నారన్నారు. విజయనగరం జిల్లా కొత్తవలస ప్రాంతానికి చెందిన శేఖర్, రాజమండ్రి కత్తిపూడి ప్రాంతానికి చెందిన శ్రీను తదితరులు నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పాడి రైతులు, కూలీల ఆధార్ కార్డులు సేకరించి పశువులు కొని వారి పేరుతో అక్రమంగా అనుమతులు పొంది కబేళాలకు తరలిస్తూ కోట్లు గడించారన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో పెద్ద నాయకులు, ప్రజా ప్రతినిధులు అండతోనే వీరు పశువులను తరలిస్తున్నారన్నారు. శేఖర్ అనే వ్యక్తి ప్రజా ప్రతినిధులు అధికారులను తన చెప్పు చేతల్లో ఉంచుకుని ఈ దందాలు చేస్తున్నాడని తెలిపారు. పోలీసులు ఇతనికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ముఠా పై చర్యలు తీసుకోవాలనికోరారు. పశు అక్రమ రవాణా పై బీజేపీ, జనసేన పార్టీలు నోరు మెదపకపోవడం సిగ్గు చేటన్నారు. ఈ సమావేశంలో పాడి రైతులు దండు బాలరామ రాజు, వేగేసిన చంటి రాజు, సకిరెడ్డి రమణ, సఖిరెడ్డి వెంకటరావు, రైతుకూలీలు రామ్ ప్రసాద్,దేవర నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మండలంలో పలు గ్రామాలకు చెందిన పాడి రైతులు, కూలీలు వీసం రామకృష్ణ ని కలిసి పశు మాఫియా వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించి, తమకు అండగా నిలవాలని కోరారు.


