అక్రమ నిర్బంధాలపై ప్రజాపోరాటానిదే విజయం
డాబాగార్డెన్స్(విశాఖ): అనకాపల్లి జిల్లాలో బల్క్ డ్రగ్ పార్క్, ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టుల కోసం జరుగుతున్న బలవంతపు భూసేకరణను అడ్డుకున్నారన్న నెపంతో, సీపీఎం నేత అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ చెల్లదని తేలిపోయింది. అడ్వైజరీ కమిటీ సమీక్షలో ప్రభుత్వ ఆరోపణలకు సరైన ఆధారాలు లేవని స్పష్టం కావడంతో 45 రోజుల జైలు శిక్ష అనంతరం శుక్రవారం ఆయన విడుదలయ్యారు. ఈ సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎలాంటి నేరం చేయకపోయినా అప్పలరాజును అక్రమంగా నిర్బంధించి చంద్రబాబు ప్రభుత్వం తన నిరంకుశత్వాన్ని చాటుకుందని మండిపడ్డారు. పాత కేసులను సాకుగా చూపి ప్రజా ఉద్యమాలను అణచివేయాలని చూడటం దారుణమని, ప్రజల ఆగ్రహానికి తలొగ్గే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఎద్దేవా చేశారు. మరోవైపు పర్యావరణాన్ని ధ్వంసం చేసే పరిశ్రమల కోసం ప్రభుత్వం పాకులాడుతోందని శ్రీనివాసరావు విమర్శించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిర్వీర్యం చేస్తూ, మిట్టల్ వంటి ప్రైవేటు సంస్థల కోసం కూటమి ప్రభుత్వం ఢిల్లీ చుట్టూ తిరగడం సిగ్గుచేటన్నారు.
తనపై మోపిన అక్రమ కేసుల రికార్డులను ప్రదర్శిస్తూ, న్యాయస్థానాలు కొట్టేసిన కేసులను కూడా పీడీ యాక్ట్లో చేర్చి తనను వేధించారని జైలు నుంచి విడుదలైన అప్పలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. భూసేకరణ బాధితుల పక్షాన తమ పోరాటం ఆగదని, అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని ఈ సందర్భంగా సీపీఎం నేతలు స్పష్టం చేశారు.


