మృత్యుఘంటికలు
హైవేపై
జిల్లాలో 94 కి.మీ జాతీయ రహదారిపై తరుచూ రోడ్డు ప్రమాదాలు
జనవరిలోనే 62 రోడ్డు ప్రమాదాలు.. 34 మంది మృత్యువాత ఉదయం 9 తర్వాత, సాయంత్రం 6 నుంచి 9 లోపు ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్’ 9 హైవే మొబైల్ బృందాలతో ప్రత్యేక డ్రైవ్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే మూడు బ్లాక్ స్పాట్స్ గుర్తింపు హైవే పక్కన ఉన్న దాబాలు, హోటళ్ల వద్ద రోడ్లపై పార్కింగ్ చేస్తే చర్యలు
సాక్షి, అనకాపల్లి: జాతీయ రహదారులు మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 94 కిలోమీటర్ల మేర హైవేపై తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. మర్రిపాలెం, వేంపాడు, లంకెలపాలెం వద్ద ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగడంతో వాటిని బ్లాక్ స్పాట్స్ గుర్తించి అక్కడ ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్’ను పోలీసులు, రవాణా శాఖలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. గతేడాది గణాంకాల ప్రకారం..రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడినవారిలో, ఎక్కువగా 18 నుంచి 60 ఏళ్ల లోపు పురుషులే అధికంగా ఉన్నారు. ఈ ఏడాదిలో ఒక్క జనవరిలోనే మొత్తం 62 ప్రమాదాలు జరగగా వాటిలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 10 మంది కేవలం హెల్మెట్ ధరించకపోవడం కారణంగానే మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. అందుకే జిల్లా వ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో 9 హైవే మొబైల్ బృందాల సిబ్బందితో (సుమారు 40 మంది) ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం కూడా చేశారు.
పనివేళల్లోనే ప్రమాదాలు అధికం
గత ఐదేళ్లుగా రోడ్డు ప్రమాదాలు పరిశీలిస్తే..వీటిలో ఎక్కువగా పనివేళల్లోనే ప్రమాదాలు జరుగుతున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు, అదేవిధంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరిగాయి. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి వరకు, తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల నడుమ ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించారు. అనకాపల్లి జిల్లాలో జాతీయ రహదారిపై పరవాడ పోలీస్స్టేషన్ పరిధిలో లంకెల పాలెం కూడలి, కశింకోట పీఎస్ పరిధిలో తాళ్లపాలెం జంక్షన్, నక్కపల్లి పీఎస్ పరిధిలో ఉద్దండపురం రోడ్డు జంక్షన్, బయ్యవరం జంక్షన్లో, నరిసింగిబిల్లి జంక్షన్, ఎస్.రాయవరం పీఎస్ పరిధిలో పెనుగొల్లు బస్స్టేషన్, కశింకోట జంక్షన్లో, ఆర్ఈసీఎస్ దగ్గర నూకాంబిక ఆలయం జంక్షన్, అనకాపల్లి ట్రాఫిక్ పరిధిలో సుంకరమెట్ట జంక్షన్, ఎస్.రాయవరం గోకుల్పాడు జంక్షన్, అనకాపల్లి రూరల్ పరిధిలో కేఎన్ఆర్ పేట గ్రామం వద్ద, కశింకోట హెరిటేజ్ జంక్షన్లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
కఠినంగా నిబంధనల అమలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను ముందస్తుగా గుర్తించి జాతీయ రహదారిపై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే కూడళ్లను బ్లాక్ స్పాట్లుగా గుర్తించాం. ఆయా చోట్ల ప్రత్యేక నిఘా ఉంచాం. హైవే మొబైల్ బృందాలతో ప్రత్యేక డ్రైవ్లను నిర్వహిస్తున్నాం. విజిబుల్ పోలీసింగ్ను, విస్తృత తనిఖీలను పెంచుతున్నాం. ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న సమయాన్ని డేంజర్ టైమింగ్స్గా పరిగణించాం. కఠినంగానే ట్రాఫిక్ నిబంధనలు అమలుచేస్తున్నాం. రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏ మాత్రం ఉపేక్షించేదిలేదు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గించవచ్చు.
– ఎల్.మోహన్రావు, అదనపు ఎస్పీ
మృత్యుఘంటికలు


