మెడికల్, ఫార్మా మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలి
అనకాపల్లి: రాష్ట్రంలో మెడికల్ అండ్ ఫార్మా మాఫియా ఆగడాలను అరికట్టడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని, దీనికి నిరసనగా సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 14న జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆపార్టీ జిల్లా కార్యదర్శి రాజాన దొరబాబు తెలిపారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో మెడికల్, ఫార్మా మాఫియా వ్యతిరేక పోస్టర్ను మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగులకు నాసిరకం మందులు పంపిణీ చేయడంతో పాటు వాటిని అధిక ధరలకు అమ్మకాలు చేసి, కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని తెలిపారు. మాఫియాకు చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని ఆయన కోరారు. అద్దె సర్టిఫికెట్లతో ఫార్మేషన్ లేకుండా నిర్వహిస్తున్న మెడికల్ షాపుల పై తనిఖీలు నిర్వహించి తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లాలో డ్రగ్స్ ఇన్స్పెక్టర్, ఉన్నత అఽధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న మెడికల్, ఫార్మా మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి వియ్యపురాజు, పరవాడ మండల కన్వీనర్ కె.త్రినాఽథ్, నాయకులు విత్తనాల పోతురాజు, మూతుర్తి సూరిబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.


