మంత్రులపైనా పీడీయాక్టు ఎందుకు పెట్టలేదు
అనకాపల్లి: హోం మంత్రి అనితపైనా 32 కేసులు, విద్యా శాఖా మంత్రి నారా లోకేష్పైనా 37 కేసులున్నా పీడీ యాక్టు ఎందుకు ప్రయోగించడం లేదని చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు కె.లోకనాథం డిమాండ్ చేశారు. ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తున్న సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. అప్పలరాజుపై 19 కేసులున్నాయని పీడీ యాక్టు ప్రయోగించినా చివరికి ప్రజా పోరాటమే గెలిచిందని విమర్శించారు. శనివారం స్థానిక సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎస్.రాయవరం మండలంలో బల్క్డ్రగ్ పార్కును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న మత్స్యకారులకు మద్దతు పలికినందుకు అప్పలరాజును అన్యాయంగా నిర్బంధించి విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారన్నారు. గత నెల 30న అడ్వైజరీ కమిటీ బోర్డు మీటింగులో పోలీసులు పెట్టిన తప్పుడు కేసులుపై సమీక్షించి పీడీ చట్టాన్ని రద్దు చేసి శుక్రవారం విడుదల చేశారన్నారు. ఎలాంటి నేరానికి పాల్పడకపోయినా పీడీ యాక్టు కింద 43 రోజులు జైలులో నిర్బంధించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. అప్పలరాజును జైలులో పెట్టినా ఉద్యమాలు ఆగలేదన్నారు. ఈ నేపథ్యంలో హోంమంత్రి అనిత ప్రజలకు సమాధానం చెప్పుకోలేమని భావించి విడుదల చేశారన్నారు. గతంలో రసాయన కంపెనీలు పెట్టకూడదని చెప్పిన అనిత అధికారంలోకి వచ్చిన తర్వాత మరోవిధంగా మాట్లాడడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జి.కోటేశ్వరరావు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు డి.వెంకన్న, ఆర్.శంకరరావు, గంటా శ్రీరామ్, గనిశెట్టి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
మంత్రులపైనా పీడీయాక్టు ఎందుకు పెట్టలేదు


