డయల్ యువర్ ఈపీడీసీఎల్ సీఎండీకి విశేష స్పందన
సాక్షి, విశాఖపట్నం: విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారానికి ఈపీడీసీఎల్ ప్రారంభించిన డయల్ యువర్ సీఎండీ కార్యక్రమానికి తొలిరోజున విశేష స్పందన లభించిందని సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి తెలిపారు. కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం ఉదయం డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 48 మంది వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను నేరుగా సీఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గులు, రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటులో ఇబ్బందులు, ట్రాన్స్ఫార్మర్ల మార్పిడిలో జాప్యం, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల అంచనాలు, విద్యుత్ లైన్ల మార్పు, బిల్లులు, విద్యుత్ లైన్లు స్తంభాల మార్పిడి, స్తంభాలపై వైర్లు వేలాడుతుండడం, సరఫరాలో అంతరాయాలు, తదితర సమస్యలపై ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా సీఎండీ పృథ్వీతేజ్ మాట్లాడుతూ వినియోగదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమం ద్వారానే కాకుండా వినియోగదారులు విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912 కు కాల్ చేయడం లేదా వాట్సాప్ నంబరు 9493681912కు చాట్ చేయడం ద్వారా కూడా విద్యుత్ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి.వి.సూర్యప్రకాష్, టి.వనజ, ఎస్.హరిబాబు, సీజీఎం వి.విజయలలిత, జీఎం ఎం.ఝాన్సీ పాల్గొన్నారు.


