కాపులను అంతమొందించడమే చంద్రబాబు అంతిమ లక్ష్యం
రాజకీయంగా ఎదుర్కోలేకే భౌతిక దాడులు
వంగవీటి రంగా, ముద్రగడ నుంచి అంబటి వరకు అదే పద్ధతి
మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
నక్కపల్లి/ పాయకరావుపేట: కాపులను అంతమొందించడమే చంద్రబాబు అంతిమ లక్ష్యమని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. మాజీ మంత్రి కాపునేత అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు గుంటూరు వెళ్తూ పాయకరావుపేట సమీపంలో పి.ఎల్.పురం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయంగా కాపులను అణగదొక్కడం, తనకు ఎదురు తిరిగిన కాపునేతలను అంతమొందించడమే లక్ష్యంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గతంలో కాపు నాయకుడు వంగవీటి మోహన్రంగా నుంచి ముద్రగడ పద్మనాభం, అంబటి రాంబాబులపై జరిగిన దాడులను బట్టి చంద్రబాబు వైఖరి అర్థమవుతోందని చెప్పారు. కాపులు రాజకీయంగా ఎదగడాన్ని చంద్రబాబు నాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీతోపాటు, టీడీపీ,జనసేనల్లో చేరిన కాపునాయకులను సహితం చంద్రబాబు నాయుడు అండ్కో తీవ్ర ఇబ్బందులు పెడుతోందని తెలిపారు. కక్షసాధింపు చర్యలు, భౌతిక దాడులకు పాల్పడటం, అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయించడం వంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. నాడు రంగాను ఎలా అడ్డుతొలగించుకున్నారో అలాగే ముద్రగడ పద్మనాభాన్ని కూడా అడ్డుతొలగించుకోవాలని ప్రయత్నం చేశారన్నారు. తాజాగా మాజీ మంత్రి, కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు అంబటి రాంబాబుపై కూడా ఇదేరకమైన దాడులు చేశారని ఆరోపించారు. అంబటి ఇంటిని తగల బెట్టడంతోపాటు, ఆయనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారన్నారు. కాపులు ఏ పార్టీలో ఉన్నా తనకు ఎప్పటికై నా ప్రమాదమని గ్రహించిన చంద్రబాబు వారిని అంతమొందించే కుట్రలకు పాల్పడుతున్నారని తెలిపారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడలేదని సీబీఐ నిర్ధారిస్తూ సుప్రీంకోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయడాన్ని చంద్రబాబు ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని చెప్పారు. తిరుమల లడ్డూ విషయంలో కూటమినాయకులుచేసింది తప్పుడు ప్రచారమని రుజువైందన్నారు.తిరుమల లడ్డూతో రాజకీయం చేస్తున్నారని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని చెప్పారు. విశాఖలో గీతం విద్యాసంస్థలకు రూ.వేలకోట్ల విలువైన భూములు అప్పనంగా కట్టబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.ఈ రెండు విషయాలనుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అంబటి రాంబాబు, జోగిరమేష్ల ఇళ్లపై దాడులకు పాల్పడి, డైవర్షన్ పాలిటిక్స్కు తెరతీశారని తెలిపారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ప్రశ్నించే వారిపై కక్ష కడుతున్నారన్నారు.అధికారం శాశ్వతం కాదని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. రాజకీయ దాడులకు గురైన అంబటి కుటుంబాన్ని పరామర్శించి వారికి అండగా నిలిచేందుకే ఉమ్మడి విశాఖజిల్లా నుంచి కాపులంతా గుంటూరు తరలి వెళ్తున్నట్టు తెలిపారు. పార్టీ రాష్ట్రకార్యదర్శి చిక్కాల రామారావు మాట్లాడుతూ అంబటి రాంబాబుపై భౌతిక దాడులకు పాల్పడ్డారన్నారు. ముద్రగడ, అంబటి రాంబాబు ఇలా కాపునాయకులందరినీ చంద్రబాబు టార్గెట్ చేశారన్నారు. రాష్ట్రంలో కాపులు బతికే పరిస్థితులు కనిపించడం లేదన్నారు. కాపులను రోడ్డుమీదకు రాకుండా చేయడమే చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. ఈసమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కంబాలజోగులు,చింత లపూడి వెంకటరామయ్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ, అధికారప్రతినిధి దగ్డుపల్లిసాయిబాబా, స్థానిక నాయకులు ధనిశెట్టి బాబూరావు, ధనిశెట్టిబాబి, గెడ్డమూరి శ్రీనివాస్,జగతాశ్రీనివాస్,సూరాకాసుల గోవిందు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరుకు పలువురు నాయకులు
నక్కపల్లి,పాయకరావుపేటల నుంచి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శులు వీసం రామకృష్ణ, చిక్కాల రామారావుల ఆధ్వర్యంలో పలు వాహనాల్లో వైఎస్సార్సీపీ నాయకులు గుంటూరు బయలుదేరారు. వెళ్లిన వారిలో వైస్ ఎంపీపీలు వీసం నానాజీ, వెలగ ఈశ్వరరావు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి సూరాకాసుల గోవింద్, పార్టీ అధికార ప్రతినిధి దగ్డుపల్లిసాయిబాబా, పార్టీ మండల అధ్యక్షుడు గెడ్డమూరి శ్రీనివాసరావు, పట్టణశాఖ అధ్యక్షుడు దనిశెట్టి బా బీ, పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు ఉన్నారు.


